నేటి యువత రేపటి సూత్రధారి!

ఈ ప్రపంచంలో రేపు ఎలా ఉంటుంది అనేది యువత మీదనే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే యువతలో ఉత్సాహం, వారి ఆలోచనలు, వారి ప్రణాళికలే రేపటిని గొప్పగా ఉంచాలన్నా, అధఃపాతాళంలోకి నెట్టివేయలన్నా మూలకారణం అవుతాయి.  నేటి బాలలే రేపటి పౌరులు అన్నట్టు, నేటి యువత రేపటిని నడిపించే బాధ్యతాయుత సూత్రధారులు  అవుతారు. ప్రపంచం మొత్తం మీద జనాభాలో యువత శాతం ఎక్కువగా ఉంటుంది. అయితే యువత ఈ ప్రపంచంలో ఎదుర్కొంటున్న సమస్యలు చాలానే ఉన్నాయి. వాటిలో నిరుద్యోగం ఎంతో ముఖ్యమైనది. డిగ్రీ పట్టాలు చేతిలో ఉన్నా, ఉన్నత విద్యలు చదివినా ఉద్యోగ అవకాశాలు సరైనవిధంగా లేక మిగిలిపోతున్న యువత ఎందరో ఉన్నారు. అయితే యువతకు సరైన మార్గం చూపేందుకు ఈ ప్రపంచం కూడా కృషి చేస్తోంది. అంతర్జాతీయ యువ దినోత్సవ కర్తవ్యం అదే. తేడా!! చాలామంది యువ దినోత్సవం అని వినగానే అది వివకానందుడి జన్మదిన సందర్భంగా నిర్వహించుకునే జాతీయ యువజన దినోత్సవం అని అనుకుంటారు. అయితే జాతీయ యువజన దినోత్సవానికి, అంతర్జాతీయ యువ దినోత్సవానికి మధ్య బేధాన్ని గుర్తించడం అవసరం. అంతర్జాతీయ యువ దినోత్సవం!! ఈ ప్రపంచంలో ఉన్న యువతకు సరైన మార్గనిర్దేశకత్వం  అవసరమని, వారికి సరైన సలహాలు, సూచనలు దొరికితే ఈ ప్రపంచాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ప్రపంచదేశాల అభిప్రాయం. దానికి అనుగుణంగానే 1999లో 54/120 అనుసరణ ద్వారా ప్రతి సంవత్సరం ఆగస్టు 12 న అంతర్జాతీయ యువ దినోత్సవం జరుపుకోవాలని తీర్మానించారు. కార్యక్రమాలు!! ప్రతి రోజుకూ ఒక ప్రత్యేకత ఉన్నట్టు, ఆ ప్రత్యేకమైన రోజు కొన్ని ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం సహజం. అంతర్జాతీయ యువ దినోత్సవం రోజున యువతకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించే దిశగా ఆలోచనలు చేయడం, ఆచరణ విషయంలో ఎదురయ్యే సవాళ్లు, సమస్యలు, వాటిని అధిగమించేందుకు పరిష్కారాలు, యువత తమ ఆలోచనలను, నైపుణ్యాలను పెంచుకునేందుకు అవగాహన కల్పించడం. ప్రపంచ అభివృద్ధిలో యువతను భాగస్వామ్యం చేయడం, వర్క్ షాపులు, సాంస్కృతిక కార్యక్రమాలు, సమావేశాలు ఏర్పాటు చేసి యువతలో ఉన్న నైపుణ్యాలు బయటకు తీయడం చేస్తారు. యువత కోసం కొన్ని మాటలు!! స్వేచ్ఛ అనేది అడగాల్సినది కాదు అది ఎవరికి వారు తీసుకునేది అంటారు సుభాష్ చంద్రబోస్. యువతకు లభించే స్వేచ్ఛ వారిని అభివృద్ధి చేసేదిగా ఉండాలి. ఆ అభివృద్ధి దేశాన్ని కూడా ముందుకు నడిపించగలగాలి. యువతలో ఉండే విభిన్న ఆలోచనలను నిరుత్సాహ పరచకుండా వారిని ప్రోత్సహించాలి. యువత గట్టిగా ఏదైనా నమ్మితే దాన్ని సాధించే ఆవేశం, కసి, పట్టుదల వారిలో ఉంటాయి కాబట్టి సాధించగలరు. కావాల్సిందల్లా వారిని ప్రోత్సహించడమే. భారంగా మారిన నాలుగు మేఘాలు ఆకాశంలో పక్కపక్కనే చేరితే కుండపోతగా వర్షం ఎలా కురుస్తుందో, మెండైన ఆలోచనలు కలిగిన యువకులు ఒకచోట చేరితే ఎంతో గొప్ప ఆలోచనలు కలుగుతాయి. ఎన్నో గొప్ప అద్బుతాలు ఈ ప్రపంచానికి పరిచయం అవుతాయి.  చట్టపరంగానూ, సమాజికంగానూ, ఆర్థిక, కుల, మత బేధాలతో ఎన్నో అవకాశాలు అందుకోలేకపోతున్న యువతకు తెలియాల్సిన విషయం ఒకటుంది. తమ ప్రతిభే తమా భవిష్యత్తుకు, తమ జీవితానికి పెట్టుబడి అనే విషయం గ్రహించడం. కాబట్టి యువత తమ జీవితాన్ని దురదృష్టం పేరుతోనో, నమ్మకాల పేరుతోనో, సోమరితనంతోనో, ఇంకా అవకాశాలు లేవని చెబుతూనో చేజార్చుకోకుండా అవకాశాలను సృష్టించుకుంటే అది యువత శక్తి అవుతుంది.                                     ◆ నిశ్శబ్ద.

ఫ్యామిలీ ఫైటింగ్స్ ఇదిగో పరిష్కారం!

గొడవలు అన్ని చోట్లా ఉంటాయి. వృత్తుల్లోనూ, ఉద్యోగాల్లోనూ, బయట ఎన్నో చోట్ల, ముఖ్యంగా పోటీ ప్రపంచంలో అయితే వాటిన్నింటికంటే భిన్నమైన గొడవలు ఏమిటంటే ఫామిలీ గొడవలు. భార్య, భర్త, పిల్లలు ఇట్లక్ వీళ్ళ మధ్య సాగే గొడవల వల్ల ఆ కుటుంబంలో మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఒకరు ఒకటి చెబితే ఇంకొకరు ఇంకొకటి చెబుతారు. తద్వారా భిన్న దృవాల్లా తయారవుతారు. చిన్న చిన్న గొడవలు కూడా చిలికి చిలికి గాలి వానా అయినట్టు అవుతుంటాయి. ఇలాంటి సమస్యలకు అన్నిటికి పరిష్కారం కావాలంటే ఇదే సరైన సమయం మరి.  విషయం! చాలా కుటుంబాల్లో విషయం ఇదీ అనే కారణం లేకుండా ఏదో ఒక గొడవ జరుగుతూ ఉంటుంది. నిజానికి గొడవ పడకపోతే వాళ్లకు తోచదేమో అనిపిస్తుంది చుట్టుపక్కల వాళ్లకు. కానీ ఆ అసంతృప్తులు ఎక్కడి నుండి వచ్చాయి అన్నది ఆయా కుటుంబాల్లో వాళ్ళు ఆలోచన చేసుకోవాలి. ఎంతసేపు నువ్వు అది చేసావు, ఇది చేసావు అలా ఉంటున్నావు, ఇలా ఉంటున్నావు, అది లేదు, ఇది లేదు ఇలాంటి వాటిని గురించే ఇంట్లో మాట్లాడుతూ ఉంటే అది ఆలోచించాల్సిన విషయమేనని గుర్తుపెట్టుకోండి.ఎందుకంటే ప్రతి కుటుంబంలో మనుషుల సంపాదన, ఖర్చులు, బాధ్యతలు, ప్రాముఖ్యతలు వంటివి అన్ని ఆ కుటుంబంలో వాళ్లకు తెలిసే జరుగుతాయి అలాంటప్పుడు అనవసర వాదనలు ఎందుకు అవసరం.  పోలికల తంటా.. శుభలగ్నం సినిమాలో పాట ఉంటుంది. పొరుగింటి మంగళ గౌరీ వేసుకున్న గొలుసు చూడు అని. అది మహిళల గోల అయితే అది  మాత్రమే కాకుండా కుటుంబంలో అందరూ తమకు ఇష్టమైన విషయాలను ఇట్లా పోలికలు చూపెడుతూ ఇంట్లో అందరిని పరస్పరం ఎత్తి చూపుకుంటూ ఉండటం వల్ల ఒరిగేది ఏముంటుంది అని ఆలోచిస్తే కలసికట్టుగా ఉండాల్సిన కుటుంబం తమలో తాము శత్రువులను వెతుక్కున్నట్టే అనిపిస్తుంది కదా!! నాలుగ్గోడలు దాటితే నవ్వులాట! నిజమే కదా!! చాలామంది అనుకుంటూ వుంటారు. చేసే పనులు అలాంటివి మళ్లీ బయటకు తెలిస్తే ఏమి. నిజమే చెబుతున్నాం కదా!! నిజమే మాట్లాడుతున్నాం కదా అని. కానీ కుటుంబం మీది అయినప్పుడు మీ కుటుంబాన్ని అందులో లోటు పాట్లను మీరే  నలుగురికి తెలిసేలా చేసి నలుగురికి ఎంటర్టైన్మెంట్ అయ్యి, నలుగురిలో ఫలానా కుటుంబం ఫూల్ అనుకునేలా చేయడం ఒకటే ఫైనల్ ఔట్ ఫుట్ అవుతుంది. కాబట్టి విషయం ఏదైనా మెల్లిగా చర్చించుకుని మెల్లిగానే పరిష్కరించుకుంటే ఎంత బాగుంటుంది. పిండి కొద్ది రొట్టె తృప్తి కొద్దీ జీవితం లేని దాన్ని ఆలోచిస్తే కలిగేది అసంతృప్తి. అందుకే ఉన్నదానీతో తృప్తి పడాలని పెద్దలు చెబుతారు.  ఆశ పడటం తప్పు కాదు కానీ దాని కోసం కష్టపడాలి అంతే కానీ ఇంట్లో వాళ్ళను సాధించడం మంచి పని కాదు.  ముఖ్యంగా కుటుంబ విషయాలను కుటుంబసభ్యులు మాట్లాడుకుని వాళ్లే అన్నిటినీ చక్కబెట్టుకోవడం మంచిది. బయట వ్యక్తుల ప్రమేయం ఎప్పటికీ మంచిది కాదు. మన కుటుంబం అనే భావన ఎప్పుడూ మనసులో పెట్టుకుని ఉండాలి. కుటుంబం బరువు కాదు బాధ్యత అని అనుకోవాలి. అందరూ ఒకరికోసం ఒకరు అన్నట్టు ఉండాలి. అలా ఉంటే దేవులపల్లి గారు చెప్పినట్టు మేడంటే మేడా కాదు, గూడంటే గూడూ కాదు పదిలంగా అల్లుకున్న పొదరిల్లు మాది అని అందంగా పాడుకోవచ్చు. పాడుకుంటారు కూడా. ◆ వెంకటేష్ పువ్వాడ    

ఒత్తిడిని దూరం చేసే మార్గాలు1

ఈ రోజుల్లో ఒత్తిడి లేనిది ఎవరికి? ఈ పోటీ ప్రపంచంతో పరుగులెత్తే జీవితంలో అందరూ ఒత్తిడికి లోనయ్యేవారే! కొంతవరకూ ఈ ఒత్తిడి అవసరమే కూడా! కానీ తలకెత్తుకున్న ఒత్తిడి ఓ పట్టాన దిగిరాకపోతే మాత్రం కష్టం. మనసుకి భారమైన ఒత్తిడితో శరీరానికి కూడా నష్టం. ఏ జీవితం కోసమైతే మనం ఇంతగా ఒత్తిడికి లోనవుతున్నాయో, ఆ జీవితాన్నే నరకంగా మార్చేసే రోగాలన్నీ ఒత్తిడితో వచ్చేస్తాయి. అందుకే అనవసరమైన ఒత్తిడిని నివారించుకునేందుకు, తరుణోపాయాలను కూడా వెతుక్కోవాల్సి ఉంటుంది. వాటిలో కొన్ని ఇవిగో... రాసుకుని పక్కన పెట్టేయండి! చిత్రంగా అనిపించినా, ఈ చిట్కా తప్పకుండా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. మనం ఏదన్నా సమస్యని ఎదుర్కొన్నప్పుడు దాని గురించి నిరంతరం ఆలోచిస్తూనే ఉంటాము. దాని పరిష్కరించడం కోసమో, దాన్నుంచి బయటపడటం కోసమో మన మెదడు తెగ వేడెక్కిపోతూ ఉంటుంది. అందుకనే ఇక ఈ సమస్య గురించి ఇప్పుడు, ఇంతకుమించి ఆలోచించి ఉపయోగం లేదనుకున్నప్పుడు దాన్ని ఒక చోట రాసుకుని పక్కన పెడితే సరిపోతుంది. ఆ సమస్యను మర్నాడు చూసుకుంటే సరిపోతుంది. అంకెలూ పనిచేస్తాయి అంకెలు లెక్కపెట్టడం అనే ఆలోచన పాతచింతకాయ పచ్చడిలా కనిపించవచ్చు. కానీ ఒకో అంకె లెక్కపెట్టేకొద్దీ మరింత నిదానంగా ఊపిరి తీసుకోవడం అనే ప్రక్రియను జోడిస్తే, ఒత్తిడి ఇట్టే మాయమవుతుందట. అలా నిదానంగా ఊపిరి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల నిండా ప్రాణవాయువు చేరుతుంది. దీని వల్ల రక్తపోటులో అప్పటికప్పుడే మార్పులు గమనించవచ్చునంటున్నారు వైద్యలు. ఇలా పీల్చుకునే ఊపిరిని నోటి ద్వారా వదలడం వల్ల మరింత ఉపయోగం ఉంటుందని అంటున్నారు. ఊహకు రెక్కలివ్వండి ప్రకృతికీ ప్రశాంతతకూ అవినాభావ సంబంధం ఉంది. ప్రకృతి కళ్ల ముందుంటే తల్లి ఒడిలో ఉన్నంత భరోసా ఉంటుంది. అందుకే ఒత్తిడిగా ఉన్నప్పుడు వీలైతే కాస్త పచ్చని వాతావరణంలో తిరిగేందుకు ప్రయత్నించండి. అదీ కాదంటే కిటికీలోంచి బయట ఉన్న ప్రకృతిని గమనించండి. అది కూడా వీలుకాకపోతే, ఒక్క నిమిషం కళ్లు మూసుకొని మీరు ప్రకృతి ఒడిలో ఉన్నట్లు భావించుకోండి. కొండలూ, మబ్బులూ, జలపాతాలూ, పక్షులూ, చెట్లూ... అన్నీ మీ కళ్ల ఎదుటే ఉన్నట్లుగా ఊహించుకోండి. మీలోంచి ఒత్తిడి ఎలా మాయమవుతుందో చూడండి! కండరాలకు విశ్రాంతినివ్వండి! మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు శరీరం కూడా ఒత్తిడికి లోనవుతుంది. కండరాలన్నీ బిగుసుకుంటాయి. తల భారంగా మారిపోతుంది. కండరాలను బిగించి వదలడం, మెడని అటూ ఇటూ తిప్పడం వంటి చిన్నపాటి వ్యాయామాలతో శరీరం కాస్త తేలికపడుతుంది. చేతులకీ, మెడకీ చేసుకునే చిన్నపాటి మసాజ్ వల్ల కూడా ఉపయోగం ఉంటుంది. ఏదన్నా యోగాసనంలో కాసేపు కూర్చునే అలవాటు ఉన్నా ప్రయోజనమే! నీటిలో గడపండి నీటికీ మన శరీరానికీ అవినాభావ సంబంధం ఉంది. నీరు తగలగానే మన శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. అందుకనే స్నానమో, కాళ్లూ చేతులూ కడుక్కోవడమో చేస్తే కాస్త ఉపశమనంగా ఉంటుంది. ఒత్తిడి మరీ ఎక్కువగా ఉన్నప్పుడు మొహం మీద నీళ్లు చల్లుకోవడం, షవర్ కింద కాసేపు నిల్చోవడంతో మనసు తేలికపడుతుంది. ఇంకా మాట్లాడితే ఈత కొట్టే అవకాశం, అలవాటు ఉంటే కనుక ఒత్తిడి ఆ ఈతకొలనులోనే మాయమైపోతుంది. ఒత్తిడి అనేది వ్యక్తిగతమైనది. కాబట్టి ఎవరి అనుభవానికీ, ఆలోచనకూ తగినట్లుగా ఒత్తిడిని నివారించుకునే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కొందరు తమకి ఇష్టమైన సంగీతాన్ని వింటూ ఒత్తిడిని మర్చిపోతే, మరికొందరు కాసేపు స్నేహితుల మధ్య గడిపి ఒత్తిడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నిస్తుంటారు. ఎవరు ఏ పద్ధతిని అనుసరించినా, ఒత్తిడి నుంచి దూరంగా ఉండటం మాత్రం... మనకూ, మన కుటుంబానికీ చాలా అవసరం!    

జీవితం బంగారుమయం కావాలంటే ఈ సూత్రాలు తప్పనిసరి!

భగవద్గీత మనకు జీవిత పాఠాన్ని నేర్పుతుంది. జీవితంలో ఎలా ఉండాలో భగవద్గీత నుండి నేర్చుకోవాలి. మెరుగైన జీవితం కోసం భగవద్గీతలోని ఏ సూత్రాలను మనలో మనం పాటించాలో తెలుసా? భగవద్గీత యొక్క ఈ బోధనలు ఖచ్చితంగా మన జీవితానికి వెలుగును నింపుతాయి. శ్రీమద్ భగవద్గీత శ్రీకృష్ణుడు చేసిన ఉపదేశాలను వివరిస్తుంది. భగవద్గీతలో మహాభారత యుద్ధ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన ఉపదేశాలను మనం చూడవచ్చు. గీతలో ఇవ్వబడిన బోధనలు నేటికీ సమానంగా ఉన్నాయి. ఈ బోధనలు మనిషి జీవించడానికి సరైన మార్గాన్ని చూపుతాయి. గీతా బోధలను జీవితంలో అలవర్చుకుంటే మనిషి ప్రగతి పథంలో పయనిస్తాడు. మనిషి జీవన విధానాన్ని బోధించే ఏకైక గ్రంథం గీత. భగవద్గీత జీవితంలో ధర్మం, కర్మ, ప్రేమ అనే పాఠాన్ని బోధిస్తుంది. శ్రీమద్ భగవద్గీత జ్ఞానం మానవ జీవితానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గీత జీవితం యొక్క మొత్తం తత్వశాస్త్రం, దానిని అనుసరించే వ్యక్తికి ఉత్తమమైనది. గీతలోని అమూల్యమైన బోధనల గురించి తెలుసుకుందాం. మంచిగా ఉండు: ప్రతి వ్యక్తి మంచితో మంచిగా, ఉండాలని భగవద్గీత చెబుతోంది. అయితే, గీతలో చెడ్డవారిలో చెత్తగా ఉండకూదని పేర్కొంది. వజ్రాన్ని వజ్రంతో కోయవచ్చు కానీ మట్టితో మురికిని శుభ్రం చేయలేమని శ్రీ కృష్ణుడు చెప్పాడు. అందుకే నీ నైతికతను, ఆలోచనలను ఎప్పుడూ అలాగే ఉంచుకోవాలి. ఈ 5 లక్షణాలను అలవర్చుకోండి: గీతలో, శ్రీకృష్ణుడు ప్రతి వ్యక్తి కలిగి ఉండవలసిన ఐదు లక్షణాలను పేర్కొన్నాడు. భగవద్గీత ప్రకారం, ప్రతి వ్యక్తి శాంతి, సౌమ్యత, నిశ్శబ్దం, స్వీయ నియంత్రణ, స్వచ్ఛత వంటి వాటిని కలిగి ఉండాలి. ఈ ఐదు విషయాలు జీవితాన్ని క్రమశిక్షణగా ఉంచుతాయి. శ్రీ కృష్ణుడి ప్రకారం, ప్రతి వ్యక్తి ఈ లక్షణాలన్నింటినీ కలిగి ఉండాలి, అప్పుడే అతను సరైన మార్గంలో నడవగలడు. మంచి పని చేయండి: ప్రతి వ్యక్తి  భవిష్యత్తు అతని పూర్వ కర్మల ఫలితమని శ్రీ కృష్ణుడు గీతలో చెప్పాడు. ఈరోజు మనం చేసేదే మన రేపటిని నిర్ణయిస్తుంది. అందుకే సదా సత్కార్యాలు చేయాలి. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: ఒక వ్యక్తి  విధిని ఎవరూ మార్చలేరు, కానీ మంచి స్ఫూర్తిని అందించడం ద్వారా ఒక వ్యక్తికి మార్గనిర్దేశం చేయగలరని గీత పేర్కొంది. శ్రీ కృష్ణుడి ప్రకారం, మీకు జీవితంలో ఎప్పుడైనా అవకాశం వస్తే, రథసారథిగా మారడం స్వార్థం కాదు. గర్వం పక్కన పెట్టాలి: శ్రీ కృష్ణుడి ప్రకారం, అహం మనిషిని అన్ని పనులను చేయిస్తుంది. అది అంతిమంగా అతని నాశనానికి దారి తీస్తుంది. అందుకే మనిషి ఎప్పుడూ అహంకారంతో ఉండకూడదు. సంతోషకరమైన జీవితం కోసం, మీరు వీలైనంత త్వరగా మీ అహాన్ని వదిలివేయడం అవసరం. కర్మను కర్మఫలం: శ్రీ కృష్ణుడి ప్రకారం, కర్మ అనేది ఒక వ్యక్తి ప్రతి పరిస్థితిలో స్వయంగా ఎదగడానికి పొందవలసిన ఫలం. కాబట్టి ఎప్పుడూ మంచి విత్తనాలు వేస్తే పంట బాగా పండుతుందని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఒక వ్యక్తి జీవితంలో ఉన్నతస్థాయిలో ఉండాలంటే పైన పేర్కొన్న విషయాలను తప్పకుండా పాటించాలి. అప్పుడే తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించి విజయపథంలో దూసుకుపోతారు. జీవితం బంగారుమయం అవుతుంది. 

కష్టనష్టాలు చూసి దిగులుపడుతున్నారా?

జీవితం అనేది సుఖదుఃఖాల కలయిక. మనం సుఖాన్ని ఎలా అనుభవిస్తామో, దుఃఖాన్ని కూడా సహించగలిగి ఉండాలి. జీవితాన్ని అన్ని కోణాలలో పరిశీలిస్తే జీవన సంబంధాల విలువ, ప్రాముఖ్యత మనకు అర్ధమవుతుంది. కానీ ఈ విషయం అర్ధం చేసుకోకుండా చాలామంది సంతోషాలు, సుఖాలు మాత్రమే కావాలని అనుకుంటారు. అది చాలా పొరపాటు అనే విషయం అందరూ అర్థం చేసుకోవాలి.  మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి చీకటి వెలుగులులాంటివి. చీకటి తరువాత వెలుగు, వెలుగు తరువాత చీకటి ఇలా ఒకదాని తరువాత ఒకటి ఎలాగ వస్తూ పోతూ ఉంటాయో అలాగే మనిషి జీవితంలో కష్టాలు, సుఖాలు అనేవి కూడా ఒకదాని తరువాత ఒకటి వస్తూపోతూ ఉంటాయి. వాటి గురించి మనం ఆలోచించ కూడదు. కష్టం వచ్చినప్పుడు బాధపడి, సుఖం వచ్చినప్పుడు ఆనందించకూడదు. కష్టసుఖాలను సమానంగా అనుభవించే గుణాన్ని కలిగి ఉండాలి. ఇలా కష్టసుఖాలను సమానంగా చూసే స్వభావం ఉన్నవారు అన్ని పరిస్థితులను తట్టుకుని నిలబడగలరు.  ముఖ్యంగా ఓటమికి వెనకడుగు వేయడం, కష్టాలు వచ్చినప్పుడు భయపడటం వంటి స్వభావం తగ్గిపోతుంది. రెండింటిని సమానంగా చూడటం నేర్చుకుంటే. అప్పుడే మనిషి తన జీవితంలో ఎదగగలడు. ప్రస్తుత సమాజంలో అందరూ కూడా అశాశ్వతమైన విషయాలపై మోజు పెంచుకొని జీవన సమరంలో అలసిపోతున్నారు. నిరంతరం అశాంతి, ఆందోళనలు, అలజడుల మధ్య మనిషి జీవితం కొనసాగుతుంది. మనిషికి జీవితంలో ఏదీ శాశ్వతం కాదు అయినా సరే వాటికోసమే పోరాటం సాగించి జీవితంలో ఆనందాన్ని కోల్పోతున్నాడు. జీవితంలో పోరాటం అనేది ఉండాలి. ఎందుకంటే జీవితమంటేనే పోరాటం, పోరాటంలోనే ఉంటుంది జయం అన్నారు. అంతేకానీ జీవితాన్నే పోరాటంగా చేసుకోకూడదు. ప్రతి మనిషి జీవితంలో ఎన్నో సంఘటనలు, జ్ఞాపకాలు, అనుభూతులు, సామాజిక బంధాలు జీవితంలో పెనవేసుకు పోతాయి. విజయవంతమైన, ఫలప్రదమైన జీవితం గడపటానికి ఈ బంధాలు, వాటి మధ్య పటిష్టత చాలా అవసరం. ప్రస్తుత సమాజంలో జీవితం వేగవంతం కావటం,  తీరికలేని పరిస్థితి, పట్టణాలలో స్థిరపడటం, ప్రవాస జీవితం మొదలైన కారణాల వల్ల మనుషుల మధ్య బంధాలు బలహీనంగా ఉన్నాయని చెప్పవచ్చు.  పూర్వకాలంలో పండుగలు, పుణ్యకార్యక్రమాలకు కుటుంబ సభ్యులు అందరూ సమావేశమయ్యేవారు. కష్టసుఖాల గురించి చర్చించుకొనేవారు. ఇలాంటి పరిస్థితులు ప్రస్తుత కాలంలో తగ్గిపోతున్నాయి. ఫోనులలో పలకరించటం, తమకు తీరికలేదని చెప్పటం ఎక్కువగా జరుగుతున్నాయి. ఈ రకంగా అనుబంధాలలో స్వచ్ఛత లోపించటం కనిపిస్తుంది. జీవితం అనేది చాలా విలువైనది. మన విలువైన జీవితాన్ని అంతం చేసుకోవటం అనేది సమర్ధనీయం కాదు. ఎందుకంటే చాలామంది యువకులు, గృహస్తులు తాత్కాలిక భావోద్వేగాలకు లోనయి జీవితాన్ని అంతం చేసుకుంటున్నారు. ఇది సమంజసం కాదు. జీవితం విలువ తెలుసుకున్నవారు మాత్రమే జీవితాన్ని అర్ధం చేసుకుంటారు. ఆర్ధిక బాధలు, ప్రేమ విషయాలలో విఫలం కావటం, అవమానం, మానసిక ఒత్తిడి, తీవ్ర అనారోగ్యం, అనుకున్నవి జరగలేదనే తీవ్ర ఆవేదన, డిప్రెషన్లతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇది ఇటీవల కాలంలో ఎక్కువ అయింది. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే జీవితానుభవం ఉన్నవారు ఇతరులకు మార్గదర్శకులుగా ఉండాలి.                                         ◆నిశ్శబ్ద.

బహుమతులు ఇలా ఇవ్వండి!

చుట్టాలు, స్నేహితులు, పరిచయస్తులు, ఆత్మీయులు, పిల్లలు, భాగస్వామి, తోడబుట్టినవాళ్ళు, తల్లిదండ్రులు ఇలా ప్రతి మనిషి జీవితంలో బోల్డు రిలేషన్స్ ఉంటాయి. ఆ రిలేషన్స్ లో కొన్ని ఘాడమైన బంధాలు, మరికొన్ని ఎదో అట్లా తెలిసిన వాళ్ళలా సాగిపోయే బంధాలు. మొత్తానికి ఇట్లా ఎందరితోనో అటాచ్మెంట్ ఉన్నపుడు వారి వారి జీవితాల్లో కొన్ని ప్రత్యేకమైన సందర్భాలు వస్తుంటాయి. ఆయా సందర్భాలలో ఇష్టంగానో, మొహమాటంగానో, బాద్యతగానో బహుమానాలు ఇస్తూ ఉంటారు. అయితే చాలామంది ఈ బహుమతుల విషయంలో ఎంతో ఉదాసీనంగా ఉంటారు. కానీ బహుమతులు ఇవ్వడంలో కాస్త ఆసక్తి ఉండాలే కానీ చిన్న చిన్న బహుమతులు, చిన్న సందర్భాలు కూడా ఎంతో గొప్ప జ్ఞాపకాలు అవుతాయి అవతలి వారి జీవితంలో. అలాగే బహుమతి ఇచ్చిన వారు కూడా ఎంతో బాగా గుర్తుండిపోతారు, ఒకానొక ఆప్యాయతా బీజం మొలకెత్తి అది రానురాను పెరుగుతూ బలపడుతుంది. అయితే అందరికీ కావాల్సింది ఇలా బహుమతులు విషయంలో కాసింత అవగాహన మాత్రమే!!  కాగితాల గోలలు వద్దు! చాలామంది పెళ్లి, పుట్టినరోజులు, గృహప్రవేశాలు మరింకా ఇంకా ఏవైనా శుభసందర్బాలకు పిలిచినపుడు 90% మంది చేసే పని ఒక గిఫ్ట్ కవర్ లో వంద నుండి తమకు తోచినంత డబ్బును పెట్టేసి, దాని మీద పేరు రాసి ప్రెజెంటేషన్ గా ఇచ్చేయడం. అయితే అలా ఇచ్చిన డబ్బు ఆ కవర్ తీసేయగానే గుంపులో గోవిందలాగా కలసిపోతుంది. ఆ డబ్బు స్వరూపమే మారిపోతుంది. దానికంటూ ఒక గుర్తింపు లేకుండా పోతుంది. సాదారణంగా కొందరు అలా ప్రెజెంటేషన్ లు రూపంలో వచ్చిన డబ్బుతో ఇంట్లో వాడుకోవడానికి గుర్తుగా మంచి వస్తువు తీసుకుంటూ ఉంటారు. కానీ మరికొంతమంది వాటిని బీరువాలో పెట్టి ఏదో అలా వాడేస్తారు. అప్పుడు మీరిచ్చిన భజమతి ఏమైంది అంటే ఏమో!! బహుమతి ఇచ్చేసాక ఇక దాని గూర్చి మాకెందుకు అనుకునే అభిరుచి లేనివాళ్లకో మాట. కూసింత కళా పోషణ ఉండాలి కదా!! మనకంటూ ఒక ప్రత్యేకత ఉండాలి కదా!! అందుకే మరి కాగితాల ప్రెజెంటేషన్ లు వద్దు. మరింకెమి ఇవ్వాలి? డబ్బు ఖర్చుపెట్టుకునే సామర్త్యాన్ని బట్టి బహుమతులను కూడా వర్గాలుగా విభజించవచ్చు. అలాగే అవతలి వారి వయసును బట్టి, వారి గురించి కాస్తో కూస్తో ఉన్న అవగాహనను బట్టి ఇవ్వచ్చు. బట్టలు ఇవ్వడం రొటీన్ కానీ అందులోనూ ప్రత్యేకత చూపించచ్చు. అవతలి వాళ్లకి నచ్చిన రంగు తెలుసుకుని వయసులో ఉన్నవాళ్లకు అయితే కాస్త ట్రెండ్ కు తగ్గట్టూ, పెద్దవాళ్లకు అయితే సాంప్రదాయంగా ఉండేలా ఇవ్వచ్చు.  ప్రతి మనిషి జీవితంలో అవసరమైన వస్తువులు కొన్ని ఉంటాయి. వయసును బట్టి వాటి ప్రాధాన్యత ఉంటుంది. అంతే కాదు అవతలి వాళ్ళ అభిరుచులను బట్టి కూడా బహుమతులు ఇవ్వచ్చు.  డాన్స్ బాగా చేసేవాళ్లకు అయితే వాళ్లకు నచ్చిన పాటలున్న cd, మంచి కలెక్షన్ ఉన్న డాన్స్ వీడియోస్, అలాగే వాళ్లకు కంఫర్ట్ గా ఉండే దుస్తులు, రాసే అలవాటు ఉన్నవాళ్లకు పెన్ను, వాళ్ళు రాసేవి అన్ని ఒకచోట పొందిగ్గ రాసుకోడానికి అందమైన పుస్తకం, సినిమాలు అంటే అభిరుచి ఉన్న వాళ్లకు నచ్చిన నటుడి/నటి సినిమా కలెక్షన్ ఉన్న పెండ్రైవ్, లేదా cd. ఇంకా రీడింగ్ లాంప్, వాచ్, మంచి పుస్తకాలు, మంచి కళ్ళజోడు ఫ్రేమ్ లు, షూస్, అమ్మాయిలకు అయితే తెగ నచ్చే కాళ్ళ పట్టీలు(వెండే అక్కర్లేదు. కాస్త ఫాషన్ గా ఉన్నవి బోల్డు అందుబాటులో ఉంటాయి షాప్స్ లో. అవి ఎప్పుడన్నా వేసుకోవడానికి స్టైలిష్ గా ఉంటాయి). ఇంకా ఫ్రెండ్స్ ను ఎంకరేజ్ మరియు ఆరోగ్యంగా ఉంచే ఫిట్నెస్ పరికరాలు. ముఖ్యంగా చూసుకోడానికి వెయిటింగ్ మిషన్ ఇలాంటి….. పెద్దవాళ్లకు హాండ్ స్టిక్, హెల్త్ కిట్స్ లో ఉండే షుగర్, బిపి చెకప్ మీటర్స్, మంచి నడకకోసం మెత్తటి చెప్పులు, అలాగే కూర్చోవడానికి అనుకూలంగా ఉండేలా కుర్చీ, బల్ల, ఆర్థిక స్థాయిని బట్టి పడుకోవడానికి ఏర్పాట్లు. పెద్దల ఆసక్తిని బట్టి ఆధ్యాత్మిక గ్రంధాలు.  ఇక సాధారణ పరిచయస్తులకు అయితే ఇంటి ఉపకరణాలు. కాఫీ కప్, డైనింగ్ కిట్, దేవుడి గదిలో అందంగా ఉంచుకునే వస్తువులు. కిచెన్ లో అవసరమయ్యేవి, ముఖ్యంగా ఇప్పట్లో ఆన్లైన్ స్టోర్ లలో తక్కువ ధరలతో మంచి వస్తువులు దొరుకుతున్నాయి, అవి మాత్రమే కాకుండా చైనా బజార్, సూపర్ మార్కెట్లలో కూడా అందుబాటులో ఉంటాయి. ఇంటి ముఖద్వారంలో తోరణాలు, వాల్ హంగేర్స్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు.  అన్నిగి కంటే ముఖ్యమైనది అవతలి వారు వెతికి ప్రాధాన్యం ఇస్తారు తెలుసుకోవడం. ఇది తెలుసుకోవడానికి పెద్ద కష్టపదక్కర్లేదు సాధారణ మాటల్లో తెలిసిపోతూ ఉంటుంది. కాబట్టి బహుమతులు ఇచ్చేటప్పుడు మీదైన మార్క్ చూపించండి.  ◆ వెంకటేష్ పువ్వాడ

పరీక్ష కాలాన్ని పరుగులు పెట్టించండి ఇలా!

క్లాస్ రూమ్ కురుక్షేత్రంగా మారిపోయే సమయం ఆసన్నమైంది. ఏడాదంతా పడ్డ శ్రమకు ఇది నిజంగా 'పరీక్షా' సమయమే. ఆ రోజు అర్జునుడు బాధతో యుద్ధమంటే విముఖత చూపాడు . అందుకే 'క్షుద్రం హృదయదౌర్బల్యం త్యక్త్వోత్తిష్ఠ పరంతప..” అంటాడు కృష్ణుడు, అర్జునిడితో. ముందు మనసుని దృఢపరచుకోమంటాడు. కాని ఇప్పుడు మనం పరీక్షల భయంతో ఆందోళన పడుతున్నాం. ఇలాంటి సమయంలో మనలోనే కృష్ణుడి లాంటి 'మోటివేటర్' మేల్కొనాలి. ధైర్యంగా పరీక్ష రాయించాలి... పాస్ చేయించాలి. అందుకు మానసికంగా కొంత యోగం... సాధనా యాగం అవసరం. అందుకే నాలుగు అంశాల్ని దృష్టిలో పెట్టుకుంటే మనం విజయం సాధించనట్లే.. అవి నిర్భయం... పఠనం... మననం... లేఖనం  నిర్భయం... ముందు నిర్భయంగా నిలబడండి. కురుక్షేత్రంలో అర్జునుడు వెనకడుగు వేసినప్పుడు కూడా కృష్ణుడు చెప్పిందిదే. 'క్షుద్రం హృదయ దౌర్బల్యం..' అన్నాడు. ఎల్కేజీ నుంచి మనకు పరీక్షలేమీ కొత్తకాదు. గతంలో పరీక్ష ముందు మీరు పడ్డ ఆందోళనను గుర్తుచేసుకోండి. పరీక్ష రాశాక ఆ ఆందోళనకు ఎంత నవ్వుకున్నారో మననం చేసుకోండి. ఆ పరీక్షలకు ఈ పరీక్ష కూడా భిన్నమైందేమీ కాదు. మనం ఎప్పుడైతే భయం వీడి ప్రశాంతంగా ఉంటామో, మన మెదడు నిర్మలంగా పనిచేస్తుంది. కిచెన్లో నుంచి ఏది అడిగితే అది ప్రేమతో ఇచ్చే అమ్మలా మనం చదివి దాచుకున్న జవాబులన్నింటినీ మెదడు సజావుగా పరీక్షగదిలో సరఫరా చేస్తుంది. 'భయమే మరణం... నిర్భయమే జీవితం...'. కాబట్టి ముందు ధైర్యంగా ఉందాం. పఠనం... ముందు పరీక్ష కోసమే పఠనం అన్న భావనను విడనాడాలి. జ్ఞాన సముపార్జనలో పరీక్షలు చిన్న మజిలీయే. పరీక్షాపత్రమే పూర్తి చదువు కాదు కదా. అయితే చదివే విధానం మారాలి. ప్రతీ పాఠాన్ని కంఠోపాఠంలా కాకుండా, విశ్లేషణతో చదవాలి. అంత పెద్ద రామాయణాన్ని కూడా అర్థం చేసుకొని మూడుముక్కల్లో కీ నోట్ రాయచ్చు.  మననం.. ఎంత చదివినా అభ్యాసం(ప్రాక్టీస్) ప్రధానం. 'అభ్యాసేన తు కౌంతేయ..' అంటాడు విజయుడితో వేణుమాధవుడు. అభ్యాసంతో ఎంతటి కఠినమైన అంశంపై కూడా ఆధిపత్యాన్ని సంపాదించవచ్చు. మనలో చాలా మంది ఎంత చదివినా  పరీక్ష దగ్గరకు వచ్చేసరికి మరచిపోవడానికి కారణం, ఈ మననం అంటే రివిజన్ లేకపోవటమే. అందుకే మనం తయారు చేసుకున్న కీనోట్ ని తరచూ రిపీట్ చేసుకుంటూ ఉండాలి. అలా చేయాలి అంటే ముందు మన మనసుని శుభ్రంగా ఉంచుకోవాలి. అనవసర విషయాల్ని ఎప్పటికప్పుడు బయటకి పంపాలి. మనసుని విలువైన వస్తువులు పెట్టుకునే ఆభరణాల పెట్టెలా సిద్ధం చేసుకోవాలి. లేఖనం... మనలో చాలా మందికి అన్నీ తెలిసినా ఎలా చెప్పాలో, ఎలా రాయాలో తెలీదు. ఇక్కడే మనకు సృజనాత్మకత కావాలి. ఆధునిక పరీక్షా విధానమంతా దీనిపైనే ఆధారపడి ఉంది. నీకు తెలిసిన అంశాన్ని ఎంత చెబుతున్నావన్నదే ప్రధానం. ఈ అంశాలతో పాటు అన్నింటికీ మించి మనసును కుదురుగా ఉంచుకుంటే జీవితమనే పరీక్షలోనూ విజయం సాధిస్తాం. ధ్యానం వంటి ఆధ్యాత్మిక సాధనలు ముఖ్యంగా మన ఏకాగ్రతకు పదును పెడతాయి... ఆ తరువాత పరీక్షలే కాదు ఎంతటి అలజడుల్లోనైనా మన విజయం సాధించగలం .                                       ◆నిశ్శబ్ద.  

జీవితంలో ఎదగాలంటే వీటిని కంట్రోల్ పెట్టాలి!

మన జీవితంలో సమయం ఎంతో విలువైనది. మనం సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం అనేదాన్ని బట్టే మన జీవితం ఉంటుంది. అంటే మనం గొప్పగా ఉండాలన్నా, మనకంటూ ప్రత్యేకత సృష్టించుకోవాలన్నా సమయాన్ని కూడా దానికి తగ్గట్టు ఉపయోగించుకోవాలి, మనం పనికిరానివాళ్లుగా మిగిలిపోవాలంటే సమయాన్ని  కూడా అలాగే వృధా చేసుకుంటూ ఉండాలి. మొత్తానికి మన జీవితాన్ని నడిపిస్తున్న అతిగొప్ప వాహకం సమయమే. అయితే పైన చెప్పుకున్నట్టు సమయాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో ఉన్నతంగా ఉండాలని అనుకునేవాళ్లే కానీ పనికిరానివాళ్లుగా మారిపోవాలని ఎవరూ అనుకోరు. అందుకే సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి. ఎక్కడ సమయాన్ని వేస్ట్ చేస్తాం అనే విషయాన్ని టైం ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ వ్యక్తం చేశారు. సోషల్ మీడియా!! సోషల్ మీడియా అనేది చాలా పెద్ద వ్యసనం అయిపోయింది ఈ కాలంలో. ఎక్కడెక్కడో ఉన్న కొత్త వ్యక్తులను స్నేహితులుగా చేసే వేదికగా ఈ సోషల్ మీడియా యాప్స్ ఉంటున్నాయి. వాటిలో పోస్ట్ లు పెట్టడం, వేరే వాళ్ళతో కబుర్లు చెప్పడం, పోస్ట్ లకు లైక్స్ చేయడం, కామెంట్స్ పెట్టడం ఇదంతా ఒక తంతు అయితే ఆ సోషల్ మీడియా లో కొన్నిసార్లు పోస్ట్ ల విషయంలోనూ, కామెంట్స్ విషయంలోనూ మాటమాట అనుకుని అక్కడ ఇగో పెరిగిపోయి జరిగే యుద్ధాలు చాలానే ఉంటాయి. వీటన్నిటి వల్ల సమయం వృధా అవుతుందే తప్ప ఒనగూరే ప్రయోజనం ఏమి ఉండదు.  కొన్నిసార్లు ఈ సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతూ అందరితో సరదాగా చాటింగ్ చేసుకుంటూ కాసేపయ్యక సమయం చూసుకుంటే అమ్మో ఇంత సమయం అయిపోయిందా అనిపిస్తుంది. అంటే అప్పటికి ఈ సోషల్ మీడియా వల్ల ఎంత సమయం వృధా అవుతుందో గుర్తుచేసుకోండి. అదే సమయంలో జీవితాన్ని మెరుగుపరుచుకునే బోలెడు పనులు చేసుకోవచ్చు.  ప్లానింగ్!! ప్లానింగ్ అంటే ఏదేదో చేయడం కాదు. ప్రతిరోజు రాత్రి పడుకునే ముందు రేపు చేయాల్సిన పనులు ఏంటి?? ఏ సమయంలో ఏది చేయడం బాగుంటుంది వంటివి ప్లాన్ చేసుకోవాలి. దీనివల్ల పనులన్నీ పక్కాగా పూర్తయిపోతాయి. అంతేకాదు పనులు పక్కాగా, తొందరగా పూర్తయిపోవడం వల్ల సమయం మిగులుతుంది. ఆ మిగిలే సమయంలో నచ్చిన పనులు, అభిరుచులు, ఇంకా వేరే విధంగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అందుకే ప్లానింగ్ అనేదానికి దూరం ఉండకూడదు.  అదే ప్లానింగ్ చేయకపోతే రోజులో ఎంత పని చేసినా ఇంకా ఏదో మిగిలి చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. నిద్రపోవడం!! నిద్ర మహా బద్దకమైన మనుషుల్ని తయారుచేస్తుంది. అతినిద్ర అనేది రోజులో చాలా సమయాన్ని తినేస్తుంది. నిద్రకు కూడా సరైన టైమింగ్ పెట్టుకోవడం ఎంతో అవసరం. ఉదయం లేవడం నుండి రాత్రి పడుకోవడం వరకు అన్ని పనులను ఎలాగైతే ప్లానింగ్ చేసుకుంటారో రాత్రి పడుకుని ఉదయం లేవడానికి కూడా సమయాన్ని ప్లాన్ చేసుకోవాలి. అలా చేసుకుంటే నిద్ర కూడా హాయిగా పడుతుంది. అంతేకానీ రోజులో ఎప్పుడంటే అప్పుడు పడకమీదకు ఎక్కి వెచ్చగా బజ్జోవడం మంచిది కాదు. అతిగా ఆలోచించడం!! ఏదైనా పని చేయడానికి  ఆలోచన అవసరమే కానీ అతిగా ఆలోచించడం మాత్రం చాలా నష్టాన్ని తెచ్చిపెడుతుంది. తింటూ ఉంటే కొండలు కరిగిపోయినట్టు ఆలోచిస్తూ ఉంటే గంటలు గంటలు అలా దొర్లిపోతాయి. కొంతమంది అలాంటి అతి ఆలోచనల వల్ల రోజులో చేయాల్సిన పనులను కూడా చేయకుండా నిర్లక్ష్యంగా, బద్ధకంగా, నిరాసక్తిగా ఉంటారు. అందుకే అతి ఆలోచనలను దూరం పెట్టాలి. టీవీ చూడటం!! సినిమాలు, సీరియల్స్, కామెడీ షో లు, ఆదివారం వచ్చిందంటే ప్రత్యేక ప్రోగ్రామ్స్, వంటలు, వింతలు, విచిత్రాలు, రాజకీయం, గాసిప్స్ అబ్బో ఇవన్నీ టీవీ లో వస్తున్నప్పుడు ఉదయం నుండి సాయంత్రం వరకు మార్చి మార్చి చూస్తూ వాటికి అతుక్కుపోయేవాళ్ళు ఉన్నారు. అయితే అపుడపుడు చూడచ్చేమో కానీ అతిగా టీవీ చూడటం  రోజుమొత్తాన్ని గంగలో కలిపేస్తుంది. షాపింగ్!! ఆన్లైన్ కావచ్చు, ఆఫ్ లైన్ కావచ్చు షాపింగ్ చేసేటప్పుడు గంటలు గంటలు తిరుగుతూనే ఉంటారు. ఈరకమైన షాపింగ్ అప్పుడప్పుడు అంటే పర్లేదు. కానీ ఎక్కువగా షాపింగ్ చేస్తే సమయం, డబ్బు రేణు ఖర్చైపోతాయి. వాయిదా వేయడం!! పనులను మొదలుపెట్టాక పూర్తిచేయడం ఉత్తమం. దాన్ని వాయిదా వేస్తే ఆ తరువాత ఆసక్తి తగ్గి అది పూర్తి కావడానికి చాలా సమయం తీసుకుంటుంది. ఫోన్ కాల్స్!! అన్ లిమిటెడ్ కాల్స్ ఆఫర్ వచ్చాక ఎవరైనా ఫోన్ చేస్తే గంటలు గంటలు మాట్లాడేస్తుంటారు. అవేమైన చాలా ముఖ్యమైన విషయాలా అంటే ఉహు కాదు పిచ్చాపాటి కబుర్లు అవన్నీ. ఫోన్ లో ఎక్కువ మాట్లాడకుండా విషయం ఒక్కటి చెప్పడం, తెలుసుకోవడం చేసి దాన్ని పక్కన పెట్టాలి. ఇతరుల గురించి మాట్లాడుకోవడానికో, ఇతరుల విషయాలను కథలుగా చెప్పుకోవడానికో సమయాన్ని వృధా చేయకూడదు. ఇలా అన్నీ గమనించి పాటిస్తే మనిషి ఎదుగుదలకు కారణమయ్యే సమయం చాలా విలువైనదిగా కనబడుతుంది, విలువైనదని అర్థమవుతుంది.                              ◆ వెంకటేష్ పువ్వాడ.

దుఃఖాన్ని అంతమొందించే తాళం చెవి ఎక్కడుంది?

మనిషిని కదిలించేవి భావోద్వేగాలు. ప్రేమ, బాధ, దుఃఖం, అసూయ, ద్వేషం ఇవన్నీ విభిన్నమైన భావోద్వేగాలు. అయితే వీటిలో మనిషి ఎక్కువగా ప్రేమకు, దుఃఖానికి, కోపానికి తొందరగా చలించిపోతూ ఉంటాడు. దుఃఖం మనివాహిని ఎప్పుడూ వెంటాడుతూ ఉంటుంది. రోజు మొత్తం సంతోషం ఉన్నా ఒక్క దుఃఖభరితమైన సంఘటన జరిగిందంటే చాలు మనిషి ఇక తనకు సంతోషమే లేదన్నంత బాధపడిపోతూ ఉంటాడు.  మీకు ప్రియమైన వారు ఎవరయినా పోయినప్పుడు మీరు కన్నీళ్లు పెట్టుకుంటారు. అయితే  ఆ కన్నీళ్లు మీ కోసమా లేక చనిపోయిన వారి కోసమా? మీ కోసమే మీరు ఏడుస్తున్నారా? ఇతరుల కోసమా? నిజానికి ఇతరుల కోసం ఎప్పుడయినా ఏడ్చారా? యుద్ధక్షేత్రంలో చనిపోయిన  ఎవరికోసం అయినా ఎప్పుడైనా ఏడ్చారా? ఈ ఏడుపు అంతా మీరు ఏదో కోల్పోయారన్న భావంతోనా లేక ఒక మనిషి చనిపోయినాడే అనే చింతవల్లనా? మీ కోసం మీరు ఏడ్చినట్లయితే దానిలో అర్థం లేదు. మీరు ఆప్యాయత కురిపిస్తున్న ఒక మనిషి పోయినాడు గనుక మీరూ ఏడుస్తున్నారూ అంటే - నిజంగా అలాంటి ఆప్యాయత లేనేలేదు అన్నమాట! చనిపోయిన మీ తమ్ముని కోసం - అతని కోసమే - ఏడవండి. అతను పోయాడు గనుక మీ కోసం మీరు ఏడవడం చాల తేలిక. మీ హృదయం స్పందించింది గనుక మీరు ఏడుస్తున్నారు. కాని, అతని కోసం కాదు ఈ స్పందన. ఈ విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది కదూ… మీ మీద మీకు జాలి, అనుకంప. దీనితో మీరు కరుడు కట్టుకుపోతున్నారు, మూసుకొని పోతున్నారు. దీనివల్లనే మొద్దుబారి మూర్ఖులయిపోతున్నారు. మీ కోసం మీరు విలపిస్తూ వున్నట్లయితే అది ప్రేమ అవుతుందా? మీరు వంటరివారు అయినారు గనుక, అశక్తులయిపోయారు కనుక, మీ పరిస్థితి విచారకరం అయిపోయింది గనుక ఈ విలాపం కొనసాగుతూ వున్నదా? మీకు యీ విషయం అయితే తెలిసివస్తే  ఒక చెట్టునో స్తంభాన్నో ప్రత్యక్షంగా తట్టిచూసినంత స్ఫుటంగా అప్పుడు యీ విచారమంతా స్వయంకృతమయినదే అని అనిపిస్తుంది.  ప్రతి మనిషికి జీవితంలో కలిగే ఎన్నో భావోద్వేగాలకు ఆలోచనలే మూలం. ఈ  ఆలోచన వల్లనే విచారం ఏర్పడుతోంది. దుఃఖం కాలానికి ఫలితం. ఒకరికి కొంత కాలం క్రితం ఒక తమ్ముడు ఉండేవాడు. ఆ తమ్ముడు ఏదో ప్రమాదంలో చనిపోయాడు. అతను చనిపోయిన తరువాత ఇతడు ఒంటరి వాడు అయిపోయాడు. ఆ తమ్ముడు ఉన్నపుడు తిట్టుకోవడానికి కొట్టుకోవడానికి, గొడవ పడటానికి బాగుండేది. కానీ అతడు పోయాక ఒంటరితనం అవరిస్తుంది. ఆ ఒంటరితనం నుండి బాధ పుడుతుంది. ఆ బాధ నుండి ఊరట కలగడం కోసం ఏడుస్తారు.    మీరు గమనించగలిగితే, ఇలాంటివి ఏవైనా మీ హీవితంలో జరిగినప్పుడు ఇదంతా మీ అంతరంగంలో కదలాడడం చూడగలుగుతారు. పూర్తిగా సంపూర్ణంగా చూడగలరు. ఒక్క వీక్షణంలోనే. దానికోసం సమయం విశ్లేషణ వెచ్చించకండి. 'నేను, నా కన్నీళ్లు, నా కుటుంబం, నా జాతి, నా నమ్మకాలు, నా మతం' ఇలాంటి అస్తవ్యస్తమయిన సమాచారం అంతా దాని స్వరూప స్వభావాలు దాని క్షుద్రత్వం.  అన్నీ ఒక్క క్షణంలో, మీ అంతరంగంలో దర్శించుకోగలుగుతారు. మీమనసుతో కాక, హృదయంతో దానిని చూడగలిగినప్పుడు  హృదయపు లోతులలో నుంచి చూడగలిగితే  అప్పుడు మీకు దుఃఖాన్ని, విచారాన్ని  అంతమొందించగల తాళపుచెవి ఖచ్చితంగా దొరుకుతుంది. దుఃఖానికి మూలం అంతరంగంలోనే ఉందనే విషయమూ అర్థమవుతుంది.                                       ◆నిశ్శబ్ద.

కష్టమైతే ఖచ్చితంగా చెప్పేయండి!

మనుషుల మధ్య బంధాలు ఎంతో సహజం  ఈ బంధాలు చాలా దగ్గరివి కావచ్చు, సాధారణమైనవి కావచ్చు. కొన్ని బంధాల విషయంలో పెద్దగా ఎక్స్పెక్టషన్స్ ఉండవు, మరికొన్ని బంధాలను అంతగా పట్టించుకోరు. కానీ ప్రతి విషయాన్ని చెప్పాల్సిన అవసరం, ప్రతి నిమిషం గురించి సంజాయిషీ చెప్పాల్సిన అవసరం వ్యక్తిగత బంధాలకు ఉంది. ఆ వ్యక్తిగత బంధాలలో భార్యాభర్తల బంధం ఎంత గొప్పదో అది సరైన విధంగా లేకుంటే అంతే సున్నితంగా ఉంటుంది.  ఈమధ్య కాలంలో కాబోయే జీవిత భాగస్వాములకు కొన్ని లిస్ట్ ఏర్పడ్డాయి. వాటిలో ఇష్టాలు, అభిరుచులు మాత్రమే కాకుండా అవతలి వ్యక్తి ఇలా అనే కొన్ని నిర్ణయాలు కూడా చోటుచేసుకున్నాయి. అయితే ఆచరణ దగ్గరకు వచ్చేసరికి వాటిలో కొన్ని వెనక్కు తీసుకోవాల్సి రావచ్చు. జీవితభాగస్వాముల దగ్గర కోపాన్ని విషయాల్లో ఏమి పర్లేదులే, అడ్జస్ట్ అయిపోవచ్చు అని తీసుకునే కొన్ని నిర్ణయాలు తరువాత చాలా ఇబ్బంది పెట్టేస్తాయని ఫ్యామిలీ కౌన్సిలర్లు చెబుతున్నారు. స్పష్టత ముఖ్యం! ఏ విషయంలో అయినా స్పష్టత చాలా ముఖ్యం. అది ఒకరికి ఏదైనా చెప్పడం, ఒకరు ఇలా ఉండాలి అని అనుకోవడం మాత్రమే కాదు, ఎదుటి వ్యక్తి నుండి కోరుకుంటున్న విషయం ఎందుకు కోరుకుంటున్నామని, దానివల్ల జీవితానికి చేకూరే ప్రయోజనం, జీవితంలో ఆ నిర్ణయం వల్ల ఏర్పడే పరిస్థితులు, దాని ప్రాముఖ్యత వంటివన్నీ ఆలోచించి ఆ తరువాత నిర్ణయం తీసుకోవాలి. ఒత్తిడికి తలొగ్గద్దు! భార్యాభర్తలు కావడం కోసమైనా, భార్యాభర్తలు అయిన తరువాత అయినా పెద్దవాళ్ళ ఒత్తిడి చాలా ఉంటుంది. ముఖ్యంగా కొన్ని భరించలేమని, చాలా ఇబ్బందిగా ఉందని చెప్పినా పెద్దవాళ్ళు పరువు పోతుందని, చుట్టుపక్కల ఏదో అనుకుంటారని, ఆర్థికపరమైన బెనిఫిట్స్ పోతాయని ఆలోచించి విడిపోవద్దని, బంధం కలుపుకోవాలని ఒత్తిడి చేస్తుంటారు. కానీ సమస్య అనిపించినప్పుడు అసలు ఎవరి ఒత్తిడో భరించలేక ఇరుక్కుపోవద్దు. మొహమాటం వదిలెయ్యాలి! కొందరు కొన్ని విషయాలు జీవిత భాగస్వామితో చెప్పడానికి కూడా మోహమాటపడుతుంటారు. ఇంకా ఆ మొహమాటం స్థానంలో కాసింత భయం కూడా ఉంది ఉండచ్చు, ఏదైనా స్వేచ్ఛగా పంచుకునే చనువు కూడా లేకపోవచ్చు. అలాంటివన్నీ లేకపోతేనే బాగుంటుంది. ఇష్టం లేని విషయాల నుండి అవతలి వాళ్ళ ఆలోచనలకు వ్యతిరేకమైన నిర్ణయాల గురించి మనసులో ఉన్నట్టయితే వాటిని గురించి ఎలాంటి మొహమాటం లేకుండా బయటకు చెప్పేయడం మంచిది.  నిర్ణయాలు వెనక్కు తీసుకోవడం కష్టం! కాబోయే భాగస్వామి లేదా జీవిత భాగస్వామి విషయంలో ఏవైనా విషయాలు మొహమాటం కొద్దీ సరేనని చెప్పడం, ఏవైనా షరతులు ఒప్పుకోవడం, ప్లానింగ్స్, ఆర్థిక, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన విషయాల గురించి ఒప్పుకునేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఇలాంటి విషయాలలో మాట ఇవ్వడం అంటే ఇక అది పూర్తిగా ఒకరి చేతుల నుండి జారిపోయినట్టు. ఇద్దరి నిర్ణయంగా మారిపోయినట్టు. ఆ తరువాత ఏదైనా అసౌకర్యం కలిగి కాదు కూడదు అనలేని పరిస్థితులు ఎదురైతే అది చాలా పెద్ద సమస్యగా కనిపిస్తుంది. పైన చెప్పుకున్నవి మాత్రమే కాకుండా పెళ్ళైన వాళ్ళు కూడా దేన్నీ చాలా కష్టంగా భరించకూడదు. అసలు భరించడం అనే మాటల్లోనే చెప్పలేనంత ఇబ్బంది ఉంది కాబట్టి ఏ విషయంలో అయినా కష్టమనిపిస్తే మొదటగా దాన్ని బయటకు చెప్పేయడం మంచిది.                              ◆ వెంకటేష్ పువ్వాడ.

బిడ్డ తల్లికడుపులో ఉన్నప్పుడే ఈ గుణాలు నేర్పించండి!

ఆచార్య చాణక్య విధానం నేటికీ సంబంధితంగా ఉంది. సామాన్యుడు చాణక్యుడి సూత్రాలను పాటించడం ద్వారా జీవితంలో విజయం సాధించగలడు. చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం, ఆచార్య చాణక్యుడు మౌర్య సామ్రాజ్యానికి సమకాలీనుడు. మౌర్య సామ్రాజ్య స్థాపనలో చాణక్యుడు ముఖ్యమైన పాత్ర పోషించాడు. ఆచార్య చాణక్య ప్రకారం, పిల్లలు తల్లి గర్భంలో 4 శుభ లక్షణాలను నేర్చుకోవడం ప్రారంభిస్తారు. అలాంటి పిల్లలు భవిష్యత్తులో చాలా విజయవంతమైన వ్యక్తులు అవుతారు. వారు అన్ని దిశలలో చర్చించారు. కాబట్టి, ఆ 4 గుణాల గురించి ఇప్పుడు  తెలుసుకుందాం. ఆచార్య చాణక్యుడు పదకొండవ అధ్యాయంలోని మొదటి శ్లోకంలో పిల్లలు తల్లి గర్భంలో దానగుణాన్ని నేర్చుకుంటారని చెప్పారు. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత ఈ లక్షణాలను నేర్చుకోలేడు. తల్లిదండ్రులు దాతలు అయితే పిల్లలు కూడా దానం చేసి దాతలు అవుతారని చాణక్యుడు చెప్పాడు. మధురమైన ప్రసంగం: జ్యోతిష్యుల ప్రకారం, జాతకంలో బుధగ్రహం యొక్క బలమైన ప్రభావం లేదా బుధుడు యొక్క శుభ ప్రభావం కారణంగా, వ్యక్తి మధురంగా మాట్లాడతారు. కానీ చాణక్యుడు ప్రకారం, పిల్లలు వారి తల్లిదండ్రుల విలువలను అభివృద్ధి చేస్తారు. తల్లిదండ్రులు మధురంగా మాట్లాడితే పిల్లలు గుణవంతులు, మధురమైనవారు. ఈ లక్షణాలను పిల్లలు తమ తల్లి కడుపులో నేర్చుకుంటారని చాణక్యుడి తత్వం చెబుతోంది. ధైర్యం: ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లలు తమ తల్లి కడుపులో ధైర్యం నేర్చుకుంటారు. ధైర్యం పిల్లలను జీవితంలో విజయవంతం చేస్తుంది. అలాంటి వ్యక్తులు జీవితంలోని అన్ని కష్టాలను తమ ధైర్యంతో అధిగమిస్తారు. పుట్టిన తర్వాత ఏ వ్యక్తి కూడా ఈ లక్షణాలను నేర్చుకోలేడు.  తప్పొప్పులు: ఆచార్య చాణక్యుడు ప్రకారం, పిల్లలు తల్లి కడుపులో మంచి , తప్పులను నేర్చుకుంటారు. తల్లిదండ్రుల ఈ సంస్కారాలు పిల్లల్లో వస్తాయి. ఒక వ్యక్తి పుట్టిన తర్వాత కూడా ఈ ఆలోచనలను నేర్చుకోలేడు. ఈ నాలుగు గుణాలు ఉన్న వ్యక్తి జీవితంలో ఖచ్చితంగా విజయవంతమైన వ్యక్తి అవుతాడు.  

నీ జీవిత రహస్యాలు ఎవరికీ చెప్పకూడదు.!

కొన్ని ఆలోచనలను ఎవరితోనూ పంచుకోకూడదని ఆచార్య చాణక్యుడు అన్నారు. మనం ఏ ఆలోచనలను ఇతరులతో పంచుకోకూడదు? మన రహస్యాలను ఇతరులతో పంచుకుంటే ఏమవుతుంది..? ఆచార్య చాణక్యుడు తన చాణక్య నీతిలో కొన్ని విషయాలు ఎవరికీ తెలియకుండా దాచిపెట్టాలని చెప్పాడు. ఈ విషయాలను ఇతరులతో పంచుకుంటే తర్వాత పశ్చాత్తాపపడతారని అన్నారు. అంతే కాదు, ఇది మిమ్మల్ని తీవ్రమైన సమస్యలకు కూడా గురి చేస్తుంది. చాణక్యుడి ప్రకారం మనం ఇతరులతో పంచుకోకూడని ఆలోచనలు ఏంటో తెలుసా..? ఈ విషయాలు ఎవరికీ చెప్పకూడదు. వివాహ రహస్యం: మీ వైవాహిక జీవితం, కుటుంబ విషయాలను ఎల్లప్పుడూ గోప్యంగా ఉంచండి. ఈ విషయాలను స్నేహితులకు, సన్నిహితులకు, బంధువులకు చెబితే ఇంటి సభ్యుల మధ్య పరస్పర శత్రుత్వం, అపనమ్మకం పెరిగి కుటుంబంలో అస్థిరత ఏర్పడుతుంది. అవమానం: ఎవరైనా మిమ్మల్ని పబ్లిక్‌గా లేదా ప్రైవేట్‌గా అవమానిస్తే, దానిని ఇతరులతో పంచుకోకండి. మీరు మీ అవమానాన్ని ప్రచారం చేస్తే, ఇతరులు మిమ్మల్ని అవమానించడం ప్రారంభిస్తారు. ఎందుకంటే ప్రజలు మీ పట్ల సానుభూతి చూపరు. ఒకరి సానుభూతి పొందాలనుకునే వారు తమ అవమానాల గురించి ఎవరితోనూ చర్చించకూడదు. ఆర్థిక పరిస్థితి: మీ కుటుంబ ఆర్థిక పరిస్థితిని ఎవరితోనూ చర్చించకండి. డబ్బు రహస్యంగా ఉంచండి. మీరు ఎంత సంపాదిస్తారో తెలుసుకోవాలని చాలామంది అనుకుంటారు. మీరు నేరుగా చెప్పకపోతే, ఈ వ్యక్తులు ఇతర మార్గాల్లో అడగడం ద్వారా దాని గురించి సమాచారాన్ని పొందడానికి ప్రయత్నిస్తారు. మీరు సంపాదించిన లేదా పొదుపు చేసిన డబ్బు గురించి ఎవరికీ చెప్పకండి. గురు మంత్రం, సాధన, తపస్సు: మీరు యోగ్యత గల గురువు ద్వారా దీక్ష పొందినట్లయితే, ఆయన ఇచ్చిన గురు మంత్రాన్ని గోప్యంగా ఉంచండి. ఇది కాకుండా, మీరు ఏదైనా ధ్యానం, తపస్సు లేదా మంత్రాలను అభ్యసిస్తే, దానిని రహస్యంగా ఉంచాలి. లేకుంటే విజయం సాధించదు. వీటిని రహస్యంగా ఉంచడం వల్ల మీరు కూడా లాభాలను పొందుతారు. మీ వైకల్యం లేదా బలహీనత: మీరు మీ అనర్హత లేదా బలహీనతలను ఎవరితోనూ పంచుకోకూడదు. మీరు దానిని ఇతరులతో పంచుకుంటే, వారు దానిని దుర్వినియోగం చేయవచ్చు. మీకు సమస్యలను కలిగించవచ్చు. మీ అనర్హత, బలహీనత తెలిసిన తర్వాత వారు మీతో తప్పుగా ప్రవర్తించవచ్చు. దాతృత్వం: మనం ఎవరికైనా చేసే దానాన్ని గోప్యంగా ఉంచితేనే దాని పూర్తి ఫలం దక్కుతుంది. రహస్యంగా చేసే ధర్మం దేవుని దృష్టిలో ఉంటుంది.  అది ఫలవంతంగా ఉంటుంది. మీరు ఆలయానికి విరాళం ఇచ్చారని, పేదవారికి భోజనం పెట్టారని లేదా ఏదైనా మంచి పని చేశారని ఎవరికీ చెప్పకండి.

అనంతమైన ప్రేమకు నీరాజనం!

◆వాలెంటైన్స్ డే◆  ఫిబ్రవరి నెల పేరు చెబితే ప్రేమికులందరికీ గుర్తొచ్చేది వాలెంటైన్స్ డే నే.. ఎల్లలు లేని ప్రేమను చాటి చెబుతూ ప్రేమికులందరూ ఒకరి ఎదుట మరొకరు ఆరాధకులు అయిపోతారు. ప్రేమ పిపాసులు ప్రేమిస్తారు, ప్రేమను స్వీకరిస్తారు ఈ ప్రపంచాన్ని ప్రేమ మయం చేస్తారు. అయితే అక్కడక్కడా వినబడే కొన్ని వార్తలు మనసును కలచివేస్తుంటాయ్.  ప్రేమను కాదంటే దారుణాలు జరుగుతున్నాయి. ఎంతోమంది అమ్మాయిలు ప్రేమ క్రతువుల్లో కాలిపోతున్నారు. మరెందరో యువకులు ఆత్మర్పణ చేసుకుంటున్నారు. ఇలా చూస్తే ప్రేమకు అర్థం ఇదేనా అని కాస్త ఆశ్చర్యం వేస్తుంది. ప్రేమంటే.. ప్రేమంటే బాధను పరిచయం చేస్తుందని ఎంతోమంది చెబుతారు. ప్రేమ మనిషికి ఇచ్చేది ఏంటి?? ధైర్యం, ఆప్యాయత, అనురాగం, నమ్మకం ఇవన్నీ ప్రేమ ఇస్తుంది. కానీ.. అవన్నీ విరిగిపోయి వీగిపోతే.. ప్రేమ కూడా వెలసిపోతుంది. ప్రేమ గురించి ఎన్ని సినిమాలు వచ్చాయి, ఎన్ని కావ్యాలు వెలువడ్డాయి. కానీ అవన్నీ ప్రేమను బాధగా పరిచయం చేసి తరువాత సంతోషంతో ముగింపు ఇస్తాయి. కానీ నిజజీవితంలో సుఖమైన ముగింపు ఎక్కడో కొన్ని చోట్ల మాత్రమే.. అందుకే ప్రేమ అంటే బాధ అనే అభిప్రాయం చాలామందిలో ఏర్పడిపోయింది. ఇస్తున్నారా?? తీసుకుంటున్నారా?? ప్రేమను తీసుకోవడమే ఈ ప్రపంచంలో చాలా మందికి ఇష్టం. ఒకరికి ప్రేమను పంచడం కూడా ఇష్టమే.. కానీ ఆ పంచడం అనేది కూడా తమకు నచ్చినట్టు ఉంటుంది కానీ ఎదుటివారికి కావలసింది ఇవ్వడం, దాన్ని అర్థం చేసుకోవడం తక్కువ. కొందరు అయితే తాము ప్రేమను ఇస్తున్నాం కాబట్టి ఎదుటివారు తమకు ప్రేమను ఇవ్వాలి అనే ఆలోచనతో ఉంటారు. ఇలా ప్రేమను కూడా డిమాండ్ చేయడం ఎంతవరకు సమంజసం??  ప్రేమ మీద ఒట్టేసి.. ప్రేమించేవాళ్ళందరూ ఒకటే మాట చెబుతారు. జీవితాంతం నీతోనే ఉంటాను అని, నువ్వే కావాలి అని, నిన్ను ఎప్పటికీ వదులుకోనని. కానీ ఈ మాట నీటి రాతలు అయిపోతాయి. ప్రేమ మత్తులో ఎన్నో చెప్పిస్తుంది. ఎన్నెన్నో బాసలు చేయిస్తుంది. కానీ.. నిజంగా ప్రేమ మీద ఒట్టేసి మీ ప్రేమను ఎప్పటికీ వధులుకోమని మీకు మీరు ఓసారి మాట ఇచ్చుకోండి.. ప్రేమ గురించి కవులు, సినిమాలు, కథలు, ఎన్నెన్నో జీవితాలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయి. ఇక మనం ప్రత్యేకంగా ఏమని చెప్పుకోగలం. ప్రేమను ప్రేమగా మనలోకి ఒంపుకోవడం, ప్రేమను మౌనంగా ఆరాధించడం.. ప్రేమను ఇవ్వడమే కానీ తిరిగి ఆశించకుండా ఒకానొక నిశ్చల సంద్రంలో నిశ్శబ్దంగా ప్రయాణించడం. ఇవి మాత్రమే మనం చేయగలం. మీ ప్రపంచంలో  ఉన్న ప్రేమకు ప్రేమికుల దినోత్సవ శుభాకాంక్షలు.. ప్రేమతో.. ఆరాధనతో..                                        ◆నిశ్శబ్ద. 

మీ వయసు 20-30 ఏళ్ళ మద్యనుందా? పొరపాటున  కూడా ఈ తప్పులు చేయకండి!

మనిషి జీవితం ఎన్నో దశలతో కూడుకుని ఉంటుంది. బాల్యం, కౌమారం, యవ్వనం, మధ్యవయసు, వృద్దాప్యం ఇలా ప్రతి ఒక్కటీ అధిగమిస్తూ వెళ్తారు. అయితే ఈ అన్ని దశలలోకి చాలా సున్నితమైనది, కీలకమైనది యవ్వనదశ. 20-30 ఏళ్ల మధ్యనున్నవారు  తప్పులు చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ దశలో ఆవేశం, సంతోషం, ఆరాటం, కోపం, మరీ ముఖ్యంగా శారీరక స్పందనలు కూడా ఎక్కువగా ఉంటాయి. అందుకే యవ్వన దశను చాలామంది ఉరకలు వేసే వయసు అంటూ ఉంటారు. ఈ వయసులో చేసే కొన్ని తప్పులు జీవితాన్ని చాలా నష్టానికి గురి చేస్తాయి. భవిష్యత్తును వ్యక్తి చేతుల నుండి చేజారేలా చేస్తాయి.  యవ్వనంలో ఉన్నవారు పొరపాటున కూడా చేయకూడని పనులేంటో తెలుసుకుంటే.. మూర్ఖంగా ఉండకూడదు.. వయసు పెరిగేకొద్దీ విషయావగాహన కూడా పెంచుకోవాలి. 20ఏళ్లు దాటిన తరువాత  వ్యక్తిలో చాలా ప్రపంచ జ్ఞానం పోగై ఉండాలి. జీవితంలో 20-30 ఏళ్ళ మధ్యనే వృత్తి, ఉద్యోగం, వివాహం వంటి విషయాలలో నిర్ణయాలు జరుగుతాయి.  కాబట్టి ఈ కీలకమైన దశను సక్సెస్ గా డీల్ చేయాలంటే మూర్థత్వాన్ని వదిలించుకుని జ్ఞానవంతులుగా ఉండాలి. విషయాలను అన్ని కోణాలలో అలోచించుకునే వైఖరి అలవడాలి. లేకపోతే ఏ నిర్ణయాలు సరిగా తీసుకోలేక యవ్వనాన్ని, దీని కారణంగా జీవితాన్ని కూడా చేజేతులా నాశనం చేసుకుంటారు. ఈ దశ దాటితే జీవితాన్ని చక్కదిద్దుకునే అవకాశాలు మెండుగా దొరక్కపోవచ్చు. లైంగిక వాంఛలతో జాగ్రత్త.. లైంగిక వాంఛలు సర్పం లాంటివి. అవి నిరంతరం మనిషిని ఉద్రేకానికి లోను చేస్తాయి. 20-30ఏళ్ళ మధ్య ఈ లైంగిక వాంఛల ప్రభావం కారణంగా ఎన్నో తప్పులు కూడా జరుగుతాయి. వీటిని తీర్చుకోవడం ఎంత అవసరమో.. వాటిని తీర్చుకోవడానికి ఎంచుకునే మార్గాలు అంత కీలకం. లైంగిక వాంఛలు వ్యక్తిని ఎప్పుడూ అసంతృప్తికి గురిచేస్తాయి. ఈ కారణంగా జీవితంలో గొప్పగా ఎదుగుతున్నా సరే సంతోషంగా ఉండలేరు. లైంగిక కోరికలు తీర్చుకోవడానికి తప్పు చేస్తే మాత్రం దాని ఫలితాన్ని జీవితాంతం భరించాల్సి ఉంటుంది. ఇతరుల పంచన ఉండకండి ఇతరుల ఇంట్లో ఉండటమంటే స్వేచ్చను కోల్పోవడమే. దీని కారణంగా జీవితంలో ధైర్యంగా ఎదగలేరు. మంచి నిర్ణయాలు తీసుకోలేరు. అన్నింటికి ఇతరుల దయపై ఆధారపడతారు. ఇతరుల వద్ద ఆశ్రయం పొందుతున్నప్పుడు ఎక్కువశాతం మంది బానిస లాంటి జీవితాన్ని గడుపుతారు. జీవితం గురించి ఎన్ని కలలున్నా, ఎదగాలనే తపన ఉన్నా దాన్ని నెరవేర్చుకోవడం చాలా కష్టంతో కూడుకుని ఉంటుంది. అందుకే 20-30 ఏళ్ల వయసు మధ్యన ఉన్నవారు కష్టమైనా సరే స్వశక్తితో బ్రతకడానికి ప్రయత్నించాలి.                                                         *నిశ్శబ్ద.  

టెడ్డీ బేర్స్ తోనే మీలో ఉన్న  రొమాంటిక్ యాంగిల్ ను బయట పెట్టొచ్చు..!

టెడ్డీ బేర్స్ చిన్నపిల్లల నుండి  అమ్మాయిల వరకు అందరూ ఇష్టపడతారు. మరీ ముఖ్యంగా ఈ వాలెంటైన్ వీక్ లో టెడ్డీ బేర్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది. అంతేనా  ప్రతి ప్రియుడు  తన  ప్రియురాలికి  వాలెంటైన్ వీక్ లో టెడ్డీ బేర్ గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటారు. అయితే  ఇలా  టెడ్డీ బేర్స్ ఇవ్వడంలోనూ కొన్ని ప్రత్యేక రంగులు ఎంపిక చేసుకుని ఇవ్వడం వల్ల టెడ్డీ బేర్ డే కాస్తా చాలా రొమాంటిక్ గా మారిపోతుంది. ఆ రంగులు ఏంటో తెలుసుకుంటే.. నలుపు.. నలుపు రంగు టెడ్డీ బేర్ లు చాలా అరుదుగానే దొరుకుతాయి. అయితే  ఇవి స్పెషల్ గా అనిపిస్తాయట. చాలావరకు యూత్ కానీ, అమ్మాయిలు కానీ నలుపు రంగు  వేసుకోవడానికి ఇష్టపడతారు. అలాగే అబ్బాయిలు అమ్మాయిలకు నలుపు రంగు టెడ్డీ బేర్ ఇస్తే చాలా హ్యాపీగా ఫీలవుతారు. అంతేకాదు.. ఈ రంగు టెడ్డీ బేర్ ఇవ్వడం వల్ల రిలేషన్ లో ఎలాంటి నెగిటివ్ సమస్యలున్నా అన్నీ పోతాయంట. పింక్, గ్రీన్.. పింక్ కలర్ అంటే అమ్మాయిలకు ప్రాణం. టెడ్డీల నుండి డ్రస్సులు, చీరలు,  చెప్పులు, లిప్స్టిక్ ఇలా అన్ని అదే రంగు కావాలన్నా వేసేసుకుంటారు. సో పింక్ కలర్ టెడ్డీ బేర్ ఇస్తే అమ్మాయిలు చాలా హ్యాపీ అవుతారు. అలాగే ఇది రొమాంటిక్ గా కూడా ఉంటుంది.  ఇక గ్రీన్ కలర్ టెడ్డీ కూడా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఇది ప్రకృతికి దగ్గరగా ఉండే రంగు. ప్రశాంతతను చేకూర్చడం ద్వారా ఇది మనిషిని రొమాంటిక్ మూడ్ వైపు మళ్లిస్తుంది.  పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ప్రకృతిని ఇష్టపడేవారు వీటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. క్రీమ్ అండ్ వైట్.. క్రీమ్ అండ్ వైట్ టెడ్డీ బేర్లు ప్రశాంతతకు చిహ్నంగా ఉంటాయి.  అమాయకత్వం, ప్రేమ, శాంతి, స్వచ్చత కోరుకునేవారు, వాటి ద్వారా  మనసును ప్రశాంతంగా ఉంచుకుంటారు.  ఇవి రిలేషన్ ను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ఎరుపు, పర్పుల్.. ఎరుపు అంటే ప్రేమకు పెద్ద నిర్వచనం. ఇక పర్పుల్ రంగు మనిషిలో ఉండే ఉత్సాహాన్ని సూచిస్తుంది. అంతేకాదు.. ఈ రంగు టెడ్డీ బేర్ లను గిఫ్ట్ గా ఇస్తే రాయల్ లుక్ ఉంటుంది. అలాగే లగ్జరీ మూమెంట్స్ ను ఇవి ప్రతిబింబిస్తాయి. ఇవి అమ్మాయిలకు చాలా బాగా నచ్చుతాయి.                                                       *నిశ్శబ్ద.

ప్రేమికుల పండుగలో తియ్యని వేడుక..చాక్లెట్ డే కు భలే ఐడియాలు ఇవి..!

వాలెంటైన్స్  డే అంటే యువతకు చాలా ప్రత్యేకం. ఈ వారాంతం మొత్తం బోలెడు చాక్లెట్లు, గులాబీలు, గిఫ్టులు అమ్ముడుపోతాయి. కోట్లమీద వ్యాపారం కేవలం చాక్లెట్ల ద్వారా జరుగుతుందంటే అతిశయోక్తి లేదు. వాలెంటైన్స్ డే వీక్ లో అందరికీ ఇష్టమైన చాక్లెట్ డే రోజు ఊరికే అంగట్లో  చాక్లెట్ లు తెచ్చివ్వడం కాకుండా కాస్త వెరైటీగా.. మరింత నోరూరేలా ఈ కింది విధంగా మీ భాగస్వామిని సంతోషపెట్టవచ్చు. ఇంతకీ భాగస్వాములను ఆకట్టుకునే ఆ చాక్లెట్ రుచులు ఏంటో తెలుసుకుంటే.. చాక్లెట్ డిప్డ్ స్ట్రాబెర్రీస్.. ఇవి బయటెక్కడో కొనక్కర్లేదు. ఇంట్లోనే ఈజీగా చేసేయచ్చు. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. నోరూరించే స్ట్రాబెర్రీస్ ను కరిగించిన చాక్లెట్ లో ముంచి వాటిని ఫ్రిజ్ లో ఉంచాలి. స్ట్రాబెర్రీస్ పైన చాక్లెట్ లేయర్ లా కోట్ అవుతుంది. ఇవి చూడటానికి భలే అట్రాక్షన్ గా ఉంటాయి. అలాగే రుచిలోకూడా భలే ఉంటాయి. వీటిని కాస్త ఆకర్షణీయంగా డెకరేట్ చేస్తే బయట గిప్టు షాపులలో కొనే గిప్టులకంటే ఇవే చాలా అట్రాక్షన్ గా ఉంటాయి. ఎందుకంటే స్ట్రాబెర్రీస్ సాధారణంగానే హృదయం ఆకారంలో ఉంటాయి. ఇది కూడా వీటి ఎంపికకు కారణం. చాక్లెట్ స్పా సెట్.. అమ్మాయిలకు అందం మీద చాలా ఆసక్తి. ఎప్పుడూ అందంగా కనిపించాలని అనుకుంటారు. దానికి తగినట్టే చాలా సౌందర్య ఉత్పత్తులను, బ్యూటీ టిప్స్ ను ఫాలో అవుతారు. కానీ అమ్మాయిలకు చాక్లెట్ స్పా చాలా బాగా నచ్చుతుంది. ఇందులో చాక్లెట్ ఫ్లేవర్ తో చేసిన సోప్ లు, బాడీ స్క్రబ్, లోషన్లు, మాయిశ్చరైజర్లు ఉంటాయి. చాక్లెట్ ఫ్లేవర్ తో ఘుమఘుమలాడే వీటిని ఎంతో ఇష్టంగా వాడతారు. కస్టమైజ్డ్ చాక్లెట్స్.. సాధారణంగా అంగట్లో తెచ్చిన చాక్లెట్స్ ఎప్పుడూ ఇచ్చేవే. అందుకే ఈ చాక్లెట్ డే రోజున స్పెషల్ ఉండేలా చూసుకోవాలి. చాక్లెట్లమీద భాగస్వామి పేరు ఉండేలానూ, భాగస్వామికి ఏదైనా ప్రత్యేకంగా చెప్పాలనుకున్న విషయాలన్ని చాక్లెట్ కవర్ లోపల చిన్న కాగితంలో ఉంచి ఇవ్వవచ్చు. చాక్లెట్ మేకింగ్ కిట్.. అమ్మాయిలకు అసలే చాక్లెట్లంటే బోలెడు ఇష్టం. ఎన్ని చాక్లెట్లు ఇచ్చినా, ఎంత ఖరీదైన చాక్లెట్లు ఇచ్చినా తృప్తి పడరు. ఆ తరువాత వెంటనే ఇంకా ఉంటే బాగుండు అనే ఫీలింగ్ పక్కాగా వస్తుంది. అందుకే చాక్లెట్ తయారుచేసే కిట్ వారికి గిప్ట్ గా ఇవ్వొచ్చు. ఈ కిట్ లో కోకో పౌడర్, మౌల్డ్స్ తో సహా చాక్లెట్స్  తయారీకి అవసరమైన ఇతర వస్తువులు కూడా ఉంటాయి. కేవలం ఇవి మాత్రమే కాకుండా చాక్లెట్ డే రోజు భాగస్వామితో రెస్టారెంట్ కు వెళ్లి నచ్చిన చాక్లెట్ కేక్స్, ఫుడ్డింగ్, చాక్లెట్ లో ఉన్న బోలెడు వెరైటీలను ఆస్వాదించవచ్చు.                                            *నిశ్శబ్ద.

మీ  ప్రపోజ్ కు ఎదుటివారు నో చెప్పకూడదంటే ఈ 5 తప్పులు చెయ్యకండి!

  ప్రేమ ఈ ప్రపంచంలో చాలా శక్తివంతమైన ఆయుధం. ఫిబ్రవరి అనగానే చాలామందికి ప్రేమికుల రోజే గుర్తుకొస్తుంది. ఈ ప్రేమికుల దినోత్సవం కేవలం ఒకరోజుతో కాకుండా వాలెంటైన్స్ వీక్ గా జరుపుకోబడతుంది. మొదటిరోజు  రోజ్ డే  తరువాత రెండవరోజును ప్రపోజ్ డే గా జరుపుకుంటారు.  ప్రపోజ్ డే రోజు నచ్చిన వారికి ప్రపోజ్ చేయడం ద్వారా కొత్త బంధానికి పునాది పడుతుంది. అయితే కొందరు ఈ ప్రపోజ్ ను తిరస్కరించే అవకాశం కూడా ఉంది. సో.. నచ్చినవాళ్లకు ప్రపోజ్ చేసినప్పుడు వారు నో చెప్పకూడదంటే ప్రపోజ్ చేసేటప్పుడు ఈ కింది తప్పులు అస్సలు చేయకూడదు.. ప్రిపరేషన్ లేకపోవడం.. ప్రపోజ్ చేసేటప్పుడు చాలామంది నేరుగా పువ్వు లేదా ఉంగరం, లేదా బహుమతులు ఇచ్చి ప్రపోజ్ చేస్తుంటారు. కానీ ప్రేమను వ్యక్తం చేయడానికి  ముందుగా ప్రిపేర్  అవ్వడం చాలాముఖ్యం. ఇది సానుకూల ఫలితాలను ఇస్తుంది.  ప్రపోజ్ అనేది తేలికగా తీసుకోవలసిన లేదా ఇష్టానుసారంగా అమలు చేయవలసిన విషయం కాదు. వివరాలను ప్లాన్ చేయడానికి సమయాన్ని వెచ్చించాలి.  భాగస్వామి  ప్రాధాన్యతలను పరిగణలో ఉంచుకోవాలి.  ప్రపోజ్ చేయడానికి మంచి ప్లేస్ ను ఎన్నుకోవాలి. ముఖ్యంగా చాలా పాజిటివ్ గా ఉండాలి. పార్ట్నర్ ఇష్టాఇష్టాలు.. భాగస్వామి ఇష్టాఇష్టాల గురించి అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరం. ఇది వారికి ప్రాధాన్యత ఉంది అనే విషయాన్ని వారికి అర్థమయ్యేలా చేస్తాయి. వారికి అసౌకర్యం కలిగించే ఏ పనిని, ఏ పరిస్థితిని తీసుకురాకుండా చూసుకోవాలి. ప్రేమను వ్యక్తం చేయడం, ఎమోషన్స్ ను బయటపెట్టడమే కాదు.. భాగస్వామి మనసును అర్థం చేసుకుంటేనే వారి మనసులో స్థానం ఉంటుంది.   ఓవర్ గా ఏదీ వద్దు.. సినిమాలలో చూపించినట్టు నలుగురి మధ్య ప్రపోజ్ చేయడం, గట్టిగా అరిచి చెప్పడం, సర్పైజ్ పేరుతో అతిగా ప్రవర్తించడం, ప్రేమను వ్యక్తం చేయడమనే పేరుతో భాగస్వాములకు ఇబ్బంది కలిగే చర్యలు చేయడం, పబ్లిక్ లోనే భాగస్వామిని ముట్టుకోవడం వంటివి చేయకూడదు. ఏ చిన్న తప్పు జరిగినా భాగస్వామి సింపుల్ గా నో చెప్పి వెళ్లిపోవచ్చు. అందుకే ప్రపోజ్ ను కూడా ఆచి తూచి సందర్భం చూసి చేయాలి సహజత్వం కోల్పోవద్దు.. సర్ప్రైజ్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో చాలామంది కృత్రిమంగా మారిపోతారు. అలాగే పరిస్థితులను కూడా క్రియేట్ చేస్తారు. ఇవన్నీ ఊహించుకోవడానికి, చూడటానికి బాగుంటాయి కానీ అనుభూతి చెందే విషయంలో మాత్రం అంత తృప్తిని ఇవ్వవు. ఏదైనా సరే మనసులో నుండి వచ్చేదే స్పష్టంగా, సహజంగా ఉంటుంది. కాబట్టి అసవసరపు డాంభికాలకు పోకుండా సహజంగా ప్రపోజ్ చేయాలి. అదే విధంగా గుర్తుంచుకోవలసిన మరొక విషయం ఫీలింగ్స్.. ఏదో సరదాకు నచ్చేశారు అనే భావనతో కాకుండా జీవితాంతం వారితో కలిసి ఉండాలని, పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశ్యంతోనే ప్రపోజ్ చేయడం మంచిది.  ఇదే విషయాన్ని భాగస్వామితో కూడా చర్చించాలి. భాగస్వామి వైపు పరిస్థితులను, వారి నిర్ణయాలను గౌరవించాలి. నిజాయితీ.. ప్రేమించడంలోనూ, ప్రపోజ్ చేయడంలోనూ నిజాయితీగా ఉండటం ఎంతో అవసరం. లేని ఫీలింగ్స్ ను ఎక్ప్రెస్ చేసి  ఎదుటివారి ఫీలింగ్స్ తో ఆడుకోకూడదు. ప్రేమ విషయంలోనూ, భవిష్యత్తు విషయంలోనూ నిజాయితీగా, జీవితం మీద ఒక భరోసా ఇవ్వగలిగేలా ఉండాలి. మీరు ఉత్తమ భాగస్వామి కాగలరనే నమ్మకాన్ని మీ భాగస్వామికి అనిపించేలా చేస్తే మీ ప్రపోజల్ కు నో చెప్పడం అంటూ జరగదు.                                   *నిశ్శబ్ద.  

పొరపాటున కూడా ఈ ముగ్గురిని నమ్మకండి..ఎందుకంటే!

ఆచార్య చాణక్యుడు గొప్ప రాజకీయవేత్త, దౌత్యవేత్త, ఆర్థికవేత్త, ప్రసిద్ధ పండితుడు. మౌర్య సామ్రాజ్యానికి సమకాలీనుడైన ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రాన్ని రచించడంలో ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు. ఆయన విధానాలు నేటికీ సంబంధించినవి. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఏ వ్యక్తి అయినా నైతికతను అనుసరించడం ద్వారా తక్కువ సమయంలో విజయం సాధించవచ్చు. నీతి శాస్త్రంలో ముగ్గురిని నమ్మవద్దని ఆచార్య చాణక్యుడు సలహా ఇచ్చాడు. మీరు కూడా మీ జీవితంలో విజయవంతమైన వ్యక్తిగా మారాలనుకుంటే, పొరపాటున కూడా ఈ ముగ్గురిని నమ్మకండి. ఈ వ్యక్తులను విశ్వసించడం జీవితంలో అన్ని సమయాలలో ద్రోహానికి దారితీస్తుంది. చెడు స్నేహం: ఆచార్య చాణక్యుడి ప్రకారం, స్నేహం కూడా ఆలోచనాత్మకంగా చేయాలి. ముఖ్యంగా, చెడు సమయాల్లో సహాయం చేయని, క్లిష్ట పరిస్థితుల్లో సాకులు చెప్పే వ్యక్తికి దూరంగా ఉండాలి. దుఃఖంలో అబద్ధాలు చెప్పే స్నేహితుడిని పొరపాటున కూడా నమ్మకూడదు. ఇలాంటి స్నేహితుల వల్ల జీవితంలో ఎప్పుడూ మోసపోతూనే ఉంటాడు. ద్రోహి: ఆచార్య చాణక్యుడు చెపుతున్నాడు ద్రోహి... ఎప్పుడూ యజమాని మంచిని కోరుకోడు. అలాంటి వ్యక్తులు ద్రోహులు. ఎప్పుడూ తమ సంక్షేమం గురించే ఆలోచిస్తారు. ఇలాంటి వాళ్ల యజమాని ఇబ్బందులు ఎదుర్కొంటాడు. అలాంటివారిని అస్సలు నమ్మకూడదు అంటాడు చాణక్యుడు. సంస్కారం లేని భార్య: ఆచార్య చాణక్యుడు ఆజ్ఞలను పాటించే అమ్మాయిని వివాహం చేసుకుంటే , మరణానంతరం స్వర్గం వంటి సుఖం లభిస్తుందని చెప్పారు . అదే సమయంలో, విధేయత, సంస్కారవంతమైన భార్య దొరకకపోతే, ఆ వ్యక్తి జీవితం నరకంలా మారుతుంది. అలాంటి స్త్రీ తన భర్త లేదా కుటుంబ సంక్షేమం గురించి ఎప్పుడూ ఆలోచించదు. దుష్ట భార్యను పొరపాటున కూడా నమ్మకూడదు. చెడ్డ భార్యను నమ్మి పొరపాటు చేస్తే దాని పర్యవసానాలను ఖచ్చితంగా అనుభవించాల్సి వస్తుంది. కావున చెడు స్నేహం, ద్రోహులకు,దుష్ట భార్యలకు దూరంగా ఉండాలని చాణక్యుడు పేర్కొన్నారు.

ఇవి నేర్పిస్తే చాలు.. పిల్లలలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది!

పిల్లలు ఆత్మవిశ్వాసంతో ఉండటం ఎంతో అవసరం. వేగవంతమైన ప్రపంచంలో సక్సెన్ ను అందుకోవాలంటే ఆత్మవిశ్వాసంతో ఉండటం తప్పనిసరి. కానీ కొందరు పిల్లలు లక్ష్యాలను చేరుకోవడంలోనూ, చదువులోనూ, ఇతర కార్యకలాపాలలోనూ వెనుకబడి ఉంటారు. ఆత్మవిశ్వాసం లేకపోతేనే ఇలా జరుగుతుంది. అందుకే తల్లిదండ్రులే పిల్లలో ఆత్మవిశ్వాసం పెంచాలి. పిల్లలో ఆత్మవిశ్వాసం పెరిగితే వారి భవిష్యత్తు కూడా చాలా గొప్పగా ఉంటుంది. అందుకోసం ఈ కీంది విషయాలు పిల్లలకు నేర్పించాలి. పిల్లలు ఏదైనా ప్రయత్నం చేసి ఓడిపోతే ఓటమి గురించి వారిని తిట్టకండి. ఓడిపోవడం సాధారణ విషయమని, ఓటమి నుండి  పాఠాలు నేర్చుకుని తరువాత మళ్లీ ప్రయత్నం చెయ్యాలని పిల్లలకు చెప్పాలి. దీంతో ఓటమితో అంతా ముగిసిపోలేదు అనే భావన, తరువాత ప్రయత్నాలకోసం తగినంత ఆత్మవిశ్వాసం వారిలో పెరుగుతుంది. సంకల్పబలం గురించి పిల్లలకు వివరించాలి. ఏదైనా పని మొదలుపెడితే దాన్ని సాధించేవరకు వెనకడుగు వేయకూడదని, పనిని మధ్యలో వదిలేయడం లాంటివి చెయ్యకూడదని వారికి చెప్పాలి. ఇలా చేస్తే ప్రతి పనిని వారు పూర్తీ నిబద్దతతో పూర్తీ చేస్తారు. ఏకాగ్రత లేకపోతే ఏ పనీ చెయ్యలేరు. పిల్లలకు అదే విషయాన్ని అర్థమయ్యేలా చెప్పాలి. ఏకాగ్రత పెంచడానికి ధ్యానం,  యోగా  వంటివి అలవాటు చెయ్యాలి. ఏ పని చేసినా అందులో తాము గెలిచితీరాలని పెద్దల నుండ పిల్లల వరకు అందరూ కోరుకుంటారు. పిల్లలు అయితే చాలా డిజప్పాయింట్ అవుతారు. కానీ గెలుపు ఎలాగో ఓటమి కూడా అలాగే వస్తుందని వారికి అర్థమయ్యేలా చెప్పాలి. దీంతో గెలుపోటములను సమానంగా యాక్సెప్ట్ చేస్తారు. పిల్లలు పెద్దయ్యే కొద్దీ తాము స్పెషల్ అనే ఫీలింగ్ కు లోనవుతారు. వారు తమకు గౌరవం కావాలని, అందరూ తమను గౌరవించాలని అనుకుంటారు. ఈ విషయాలను కూడా పిల్లలకు అర్థమయ్యేలా వివరించాలి. గౌరవం లభించాలంటే వారు కూడా ఇతరుల పట్ల గౌరవంగా ఉండటం ఎంత ముఖ్యమో వారికి వివరించాలి. పిల్లలు బేలగా ముఖం పెట్టగానే తల్లిదండ్రులు కగిరిపోయి పిల్లల పనిని తాము చేసేస్తారు. దీని వల్ల పిల్లలు నేర్చుకునే సామర్ద్యం కోల్పోతున్నారు. అందుకే ప్రతి పనిని పిల్లలు స్వయంగా చేసేటట్టు చూడాలి. అవసరమైతేనే తల్లిదండ్రులు సహాయం చెయ్యాలి.                                         *నిశ్శబ్ద.