ప్రపంచ ప్రతిభకు పట్టం కట్టే ఆల్ఫ్రెడ్ నోబెల్ జయంతి..!

  నోబెల్ బహుమతి.. ప్రపంచం మొత్తం మీద ఎంతో గొప్పగా పేర్కొనే గుర్తింపు. ఎంతో మంది శాస్త్రవేత్తలు, పరిశోధకులు నోబెల్ బహుమతి సాధించాలనే తపనతో ప్రయోగాలు చేస్తూనే ఉంటారు.  ఒక గొప్ప ఆవిష్కరణ సాధ్యం చేసిన వారికి నోబెల్ బహుమతి ప్రధానం చేయబడుతుంది. ఇది కూడా కొన్ని వర్గాల వారికే ఇవ్వబడుతుంది.  భారతదేశానికి భారత రత్న ఎలాంటిదో ప్రపంచానికి నోబెల్ బహుమతి అలాంటిది. అసలు నోబెల్ బహుమతి ఎలా పుట్టింది? నోబెల్ బహుమతి ఎందుకు ఇస్తారు? దీని విలువ ఎంత? తెలుసుకుంటే.. స్వీడన్‌కు చెందిన ఆవిష్కర్త,  పండితుడు అల్ఫ్రెడ్ బెర్నార్డ్ నోబెల్ 1833 అక్టోబర్ 21న స్వీడన్‌లోని స్టాక్‌హోమ్‌లో ఇమ్మాన్యుయేల్ నోబెల్,  కరోలినా ఆండ్రియేట్ నోబెల్ దంపతులకు జన్మించాడు. చిన్న వయస్సులోనే ఇంజనీరింగ్, ముఖ్యంగా పేలుడు పదార్థాలపై ఆసక్తి చూపించారు. తన తండ్రి నుండి మౌలిక ఆవిష్కరణ సూత్రాలను నేర్చుకున్నారు. ఆయన   కెరీర్ లో  355 పేటెంట్లను సొంతం చేసుకున్నాడు.  ఇందులో డైనమైట్  అత్యంత ప్రసిద్ధ ఆవిష్కరణగా నిలిచింది. తరువాత సింథటిక్ మూలకం "నోబెలియం" ఆయన గౌరవార్థం పేరు పెట్టబడింది. నోబెల్ వారసత్వం.. నోబెల్  ఆవిష్కరణలకంటే ఆయన  వారసత్వం ఎక్కువగా కొనసాగింది. డైనమైట్ నుండి మంచి సంపద సొంతం చేసుకుని,  నోబెల్ బహుమతుల స్థాపనను ఏర్పరిచాడు.  1901లో ప్రారంభమైన ఈ బహుమతులు  ఆర్థిక శాస్త్రం, సాహిత్యం, రసాయన శాస్త్రం,  శాంతి రంగాలలో  కృషి చేసిన వారిని గౌరవిస్తాయి.  ఈ బహుమతులు నోబెల్  మానవత్వాన్ని ముందుకు తీసుకెళ్లే దృక్కోణాన్ని ప్రతిబింబిస్తాయి. 1884లో రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ నోబెల్‌ను సభ్యునిగా ఎన్నుకుంది. 1893లో ఆయన ఉప్సాలా యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ పొందాడు. ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న స్టాక్‌హోమ్‌లో నిర్వహించే నోబెల్ బహుమతి కార్యక్రమం అల్ఫ్రెడ్ నోబెల్ మరణాన్ని గుర్తు చేస్తూ జరుపుకుంటారు. నోబెల్ బహుమతుల ప్రకటన  అక్టోబరులో జరుగుతుంది.   అల్ఫ్రెడ్ నోబెల్  కవిగా కూడా రాణించాడు. నోబెల్‌  రాసిన  ఉత్తరాలలో ఆయన యవ్వన దశలో రాసిన కవితలను ధ్వంసం చేశారని తెలిసింది. "ఎ రిడిల్" అనే కవితా రచనని ఆయన మొదటి కవితగా రచించాడు. నోబెల్ బహుమతి.. 1895 నవంబర్ 27న, పారిస్‌లో అల్ఫ్రెడ్ నోబెల్ తన చివరి సంతకం చేశాడు. ఇందులో తన సంపదను ఐదు భాగాలుగా విభజించి, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం లేదా ఫిజియాలజీ, సాహిత్యం,  శాంతి రంగాలలో  కృషి చేసిన వారికి బహుమతులు ఇవ్వాలని పేర్కొన్నాడు. బహుమతులు ఇవ్వడంలో అభ్యర్థుల జాతి,  పుట్టుపూర్వకతను పరిగణనలోకి తీసుకోకుండా, ప్రతిభ ఉన్నవారికి బహుమతి ఇవ్వాలని నా స్వంత కల అని నోబెల్ ప్రస్తావించాడు. నోబెల్ యొక్క ఆవిష్కరణలు,  కృషి.. నైట్రోగ్లిసరిన్ ఫ్యాక్టరీ (1862): నోబెల్ పేలుడు పదార్థాల పరిశ్రమకు పునాది వేసాడు. డైనమైట్ (1867): డైనమైట్‌ను ఆవిష్కరించడానికి నోబెల్ నైట్రోగ్లిసరిన్‌తో కీసెల్గుర్‌ను కలిపి ఒక సురక్షితమైన ఉత్పత్తిని తయారుచేసారు. బ్లాస్టింగ్ జెలటిన్ (1875): 1875లో ఆయన బ్లాస్టింగ్ జెలటిన్‌ను ఆవిష్కరించారు. నోబెల్  ఆవిష్కరణలు,  విశ్వనాగరిక శ్రేయస్సుకు చేసిన కృషి ఆయనను చరిత్రలో చిరస్థాయిగా నిలిపాయి. నోబెల్‌   వారసత్వం, ఆయన చేపట్టిన పనులు  మానవాళి మీద అమూల్యమైన ప్రభావాన్ని చూపిస్తాయి.                                           *రూపశ్రీ.

జీవితంలో విజయం వరించాలంటే ఇవే కీ పాయింట్స్..!

  విజయం.. ప్రతి వ్యక్తి కల. ముఖ్యంగా యువత విజయం అనే ఒక లక్ష్యం కోసం చాలా శ్రమిస్తూ ఉంటారు. జీవితంలో విజయం సాధించాలంటే దానికంటూ కొన్ని కమిట్‌మెంట్స్ ఉండాలి. కొన్ని త్యాగాలు చేయాలి,  మరికొన్ని ఇష్టంగా మార్చుకోవాలి.  జీవితంలో సంతోషంగా గడిచిపోయే దారిలో విజయం ఎప్పటికీ లభించదు.  కష్టమైన దారిని దాటితేనే విజయాన్ని అందుకోగలుగుతారు.  కొందరికి ఈ విషయం తెలిసినా దాన్ని చేరుకునే మార్గం, జీవితంలో చేసుకోవాల్సిన మార్పులు,  మార్చుకోవాల్సిన ఆలోచనా విధానం మొదలైనవి మాత్రం తెలియకుండా ఉంటాయి.  అయితే విజేతలు కావాలంటే కొన్ని విషయాలు తప్పక తెలుసుకుని పాటించాలి. రోజును ఎలా ప్రారంభించినా సరే.. సాయంత్రం ఉండే అలవాట్లలో కొన్ని జీవితం మీద చాలా ప్రభావం చూపిస్తాయట.  ఈ అలవాట్లే జీవితంలో విజయాన్ని,  విజయ శిఖరాల వైపు వ్యక్తులను తీసుకెళ్తాయి.  అందుకే ప్రతిరోజూ సాయంత్రం కొన్ని పనులు తప్పక చేయాలి. ప్రతిరోజూ సాయంత్రం 10 నుండి 15 నిమిషాలు ధ్యానం చేయాలి.  ధ్యానం చేయడం ద్వారా మనస్సును శాంతంగా ఉంచుకోవచ్చు.  మనస్సును సంతోషంగా ఉంచుకోవచ్చు.  దీని వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. రోజంతా అనుభవించిన ఒత్తిడి కూడా సాయంత్రం ధ్యానం చేయడం వల్ల మాయమవుతుంది. ధ్యానం చేయడంతో పాటు యోగ కూడా చేయాలి.  తేలికపాటి యోగ చేయడం వల్ల శరీరానికి విశ్రాంతి లభిస్తుంది.  శరీరం ఫిట్ గా కూడా ఉంటుంది.  ఒక వ్యక్తి జీవితంలో విజయం సాధించాలంటే శారీరకంగా ఫిట్ గా ఉండటం చాలా ముఖ్యం. ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు లక్ష్యాలు సాధించడంలో ముందుంటారు. ప్రతిరోజూ సాయంత్రం సమయంలో కాసింత వాకింగ్,  యోగ,  ధ్యానం చేయగానే వెచ్చని నీటితో స్నానం చేయాలి.  ఇది శరీరానికి చాలా రిలాక్సింగ్ ను ఇస్తుంది. మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగ్గా ఉంచుతుంది.  మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. రాత్రి సమయంలో హాయిగా నిద్రపోవడానికి కారణమవుతుంది. ప్రణాళిక ఒక వ్యక్తి కార్యాచరణను సులభతరం చేస్తుంది. రేపటి రోజు చేయాల్సిన కార్యాచరణను ముందు రోజే రెఢీ చేసి పెట్టుకోవడం వల్ల పనులకు తగ్గట్టు సన్నద్ధం కావచ్చు. ఇది సమయాన్ని కూడా పర్పెక్ట్ గా వినియోగించుకునేలా చేస్తుంది. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు ఏదైనా మంచి పుస్తకంలో కొన్ని పేజీలను తప్పక చదవాలి. దీని వల్ల రాత్రి పడుకునే ముందు మానసికంగా ప్రశాంతత లభిస్తుంది.  ఇది మంచి నిద్రకు దారితీస్తుంది. సాయంత్రం సమయంలో కొన్ని నిమిషాలు రోజును రివిజన్ చేసుకోవడం ఎంతో సహాయపడుతుంది.  ఆ రోజు ఉదయం లేచిన నుండి సాయంత్రం ఏ పనులు చేయగలిగాం,  ఏవి చేయలేకపోయాం అనే విషయం గమనించుకోవచ్చు.  ఒక వేళ ఏదైనా పని చేయలేకపోతే అలా పనులు మిగుల్చకుండా ఎలా పూర్తీ చేయాలో కూడా తెలుస్తుంది. రాత్రి సమయంలో తీసుకునే భోజనం చాలా తేలికగా ఉండాలి.  ఆహారం చాలా భారీగా తీసుకుంటే అది నిద్రకు ఆటంకం కలిగిస్తుంది.  అదే తేలికగా ఉన్న ఆహారం తీసుకుంటే హాయిగా నిద్ర పడుతుంది. అలాగని అస్సలు తినకుండా ఉండటం కూడా మంచిది కాదు.. ముఖ్యంగా నిద్రపోవడానికి కనీసం రెండు నుండి మూడు గంటల ముందే భోజనం ముగించాలి. ఫోన్ కు వ్యసనపరులుగా ఉండటం అంటే లక్ష్యాలను లైట్ గా తీసుకున్నట్టే.. ఫోన్ ను కూడా లక్ష్యాలను చేరుకోవడానికి సహాయపడే వస్తువుగా వినియోగించడం మంచిది.  టీవీ, ల్యాప్టాప్, స్మార్ట్ ఫోన్.. ఇతర గ్యాడ్జెట్స్ ను లక్ష్యాల కోసం,  కమ్యూనికేషన్ కోసం మాత్రమే వినియోగించాలి.  అనవసరమైన కాలయాపన కోసం వినియోగించకూడదు. నిద్రపోవడానికి ఒక ఖచ్చితమైన సమయాన్ని నిర్ణయించుకోవాలి.  ప్రతిరోజూ ఎన్నిపనులు ఉన్నా ఒకే సమయానికి నిద్రపోవాలి. దీని వల్ల మరుసటి రోజు ఉదయం కూడా ఖచ్చితమైన సమయానికి నిద్ర లేవడం పనులను క్రమశిక్షణగా పూర్తీ చేసుకోవడం సాధ్యమవుతుంది.                                                  *రూపశ్రీ.

“ఒకరి హక్కుల్ని కాల రాయటమంటే, వారి అస్తిత్వాన్ని కాల్చివేయటమే” -మానవ హక్కుల దినోత్సవం 2024 !

  మనమంతా ఒప్పుకోవాల్సిన, గుర్తించాల్సిన విషయం ఏమంటే, ఈ భూమి మీద ఉండే ప్రతీ జీవికి కొన్ని హక్కులు ఉంటాయి.  జీవించే హక్కు, స్వేచ్చ సమానంగానే ఉంటాయి. ఈ విశాల ప్రపంచంలో ప్రతీ జీవికి దానికంటూ ఓ గుర్తింపు, ప్రత్యేకత కూడా ఉంటాయి. ఈ భూమి మీదున్న జీవజాలమంతా ఒకటి ఇంకోదానిపై ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆధారపడి ఉంటుంది. ఈ ప్రకృతిలో దేని విలువ దానికి ఉంటుంది. మనుషుల విషయంలో కూడా అంతే.   నేటి ప్రపంచం లింగం, జాతి, వర్గం, మతం వంటి విభాగాలుగా, వివక్షలతో విభజించబడింది. ఇది చాలా సాధారణం అనిపించవచ్చు కానీ అలా విభజించబడిన వారికి మాత్రం నరకప్రాయంగా ఉంటుంది. ఈ క్రూరత్వానికి  బలవుతున్న వారిలో అమాయక పిల్లలు కూడా ప్రధానంగా ఉన్నారు. ప్రతి పిల్లవాడు, ప్రతి వ్యక్తి  కులం, మతం,  రంగు,  ఆర్థిక స్థితి  వంటి విషయాలు పరిగణలోకి తీసుకోబడకుండా అందరిలో సమానంగా   ఉండే ప్రపంచం కనిపించడం లేదు. ఈ వివక్ష ప్రజలను వేరు చేస్తోంది.  ఈ బేధాలతో సంబంధం లేకుండా ప్రతి వ్యక్తికి వారికున్న మౌలిక హక్కుల్ని,  స్వేచ్ఛను ప్రపంచానికి గుర్తు చేయడానికి డిసెంబర్ 10వ తేదీన ప్రతీ సంవత్సరం మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటారు. 1948లో యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్(UDHR) ని  ఆమోదించిన జ్ఞాపకార్థంగా జరుపుకునే ఈ రోజున  సమాజంలోని వ్యక్తులు, సంస్థలు,  ప్రభుత్వాలన్నీ   కలిసి ఈ హక్కులను కాపాడేందుకు, హక్కుల పరిరక్షణని ప్రోత్సహించేందుకు కృషి చేయాలని పిలుపునిస్తుంది. యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR): మానవ హక్కులపై కీలక పత్రమైన  యూనివర్సల్ డిక్లరేషన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ (UDHR) అనేది 1948లో ఆమోదించబడింది. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ప్రపంచవ్యాప్తంగా ప్రజల హక్కులు,  స్వేచ్ఛలను రక్షించడమే  ప్రధాన కారణంగా  ఐక్యరాజ్యసమితి స్థాపన జరిగింది.  అన్ని దేశాల ప్రజల హక్కుల సాధనకు ఒక "సామాన్య ప్రమాణం"గా  ఇది  రూపొందించబడింది. ఈ ప్రామాణిక పత్రం 500కి పైగా భాషలలోకి అనువాదమైంది. ఇది గౌరవం, స్వేచ్చ, సమానత్వం, సోదరతత్వం అనే నాలుగు స్థంబాల మీద  నిర్మితమైంది. ఇందులో 30 కీలకమైన అంశాలు ఉన్నాయి. సాధాలణంగా ప్రజలకు ఉన్న హక్కులలో  స్వేచ్ఛగా జీవించే హక్కు,  భద్రత, వివక్ష లేకుండా సమానత్వం సాధించటం.  సమ న్యాయం. ఆలోచన, మత స్వేచ్ఛ.  విద్య,  పనికి సంబంధించిన హక్కులు.. మొదలైనవి ప్రధానంగా ఉంటాయి. మానవ హక్కుల దినోత్సవం 2024 : థీమ్ సంవత్సరానికి ఒక ముఖ్య అంశాన్ని ఏర్పాటు చేసుకుని దాన్ని సాధించే దిశగా ప్రభుత్వాలు కార్యాచరణ చేపడతాయి. 2024కు గానూ.. "మన  హక్కులు, మన  భవిష్యత్తు, తక్షణమే". అనే థీమ్ రూపొందించబడింది.  దీనికి తగినట్టే..  మానవ హక్కులనేవి ప్రతీరోజూ, ప్రతీ చోటా ప్రజలని ఎంతలా  ప్రభావితం చేస్తాయో చూపిస్తుంది. మానవ హక్కుల్ని  కాపాడుకోవటం వల్ల సమాజం మీద స్పష్టమైన సానుకూల ప్రభావాన్ని చూపిస్తాయనే విషయం చెప్తుంది. మానవ హక్కుల దినోత్సవం ఎందుకు జరుపుకోవాలంటే..  మానవ హక్కుల దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా  హక్కుల సాధన కోసం ఉద్యమాలు చేసిన,  పోరాడిన వ్యక్తులను, వారి కృషిని గుర్తుచేస్తుంది. వారు చేపట్టిన  ఉద్యమాల స్ఫూర్తిని ప్రజలలో కూడా రగిలించి న్యాయపరంగా మన హక్కుల సాధన సాధ్యమేననే నమ్మకాన్ని కలిగిస్తుంది. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా  సమానత్వం, స్వేచ్ఛ,  వ్యక్తిగత గౌరవం యొక్క ప్రాముఖ్యతను పౌరులందరికీ  గుర్తుచేస్తుంది. ప్రతి ఒక్కరు సురక్షితంగా, వివక్షకు గురి కాకుండా ఉండే   ప్రపంచాన్ని సృష్టించడానికి ప్రజలందరూ  కలిసి పనిచేసే దిశగా ప్రజలను  ప్రోత్సహిస్తుంది. రోజువారీ జీవితాల్లో మానవ హక్కుల కోసం నిలబడటంలో,  న్యాయం జరిగే సమాజాన్ని నిర్మించడంలో సహకరించడానికి ప్రజల  పాత్రన ఎంత అవసరమో గుర్తుచేస్తుంది. మానవ హక్కుల పరిరక్షణ కోసం ఏం చేయాలి? మానవ హక్కుల దినోత్సవంలో ప్రజలు  భాగమై వాటి పరిరక్షణ కోసం తమ  వంతు ప్రయత్నం   చేయాలనుకుంటే   మానవ హక్కులని ప్రోత్సహిస్తూ, అవగాహన పెంపొందిస్తూ, సామాజిక న్యాయం కోసం కృషి చేసే సంస్థలకు మద్దతు ఇవ్వవచ్చు.  మానవ హక్కుల గురించి ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా చెప్పాలి. మానవ హక్కుల ప్రాధాన్యత, వాటి వల్ల ప్రజలకు చేకూరే మేలు,  సమాజంలో ఏర్పడే మార్పుల గురించి చెప్పాలి.  వివక్ష,  అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడాలి.  మానవ హక్కుల సాధన, సమాజిక న్యాయం అనేది  ప్రతి వ్యక్తి తనతోనే మొదలవ్వాలనే విషయాన్ని గుర్తు చేసుకోవాలి. సమానత్వం, స్వేచ్ఛ కోసం జరుపుతున్న సమాజ  పోరాటంలో ఎవరూ వెనుకబడకుండా చూసుకోవడం అందరి బాధ్యత. అందుకు తగిన విధానాలను, విలువలని పాటించడం ద్వారా మానవ హక్కుల పరిరక్షణలో ప్రతి వ్యక్తి తన పాత్రను తాను సమర్థవంతంగా  నెరవేర్చవచ్చు.  వ్యక్తిగత హక్కులు కాపాడుకుంటూ, ఇతర హక్కుల్ని గౌరవిస్తూ ముందుకెళ్తే, ఒక మెరుగైన భవిష్యత్తును సృష్టించగలమనీ, సానుకూల మార్పును తీసుకురాగలమని స్పష్టంగా చెప్పవచ్చు.                                                *రూపశ్రీ.  

అవినీతి ముల్లులు చేసే అన్యాయానికి అడ్డుకట్ట వేయాల్సిన బాధ్యత యువతదే..!

  బాధ్యతగా చేయమని అప్పగించిన అధికారాన్ని, వ్యక్తిగత ప్రయోజనాల కోసం దుర్వినియోగం చేయడాన్నే అవినీతి అంటారు. ‘అవినీతి తిమింగలాలు’ అనే  మాట చాలా సార్లు పేపర్లలో రావటం చదువుతూనే ఉంటాము. మన సమాజంలో చాప కింద నీరులా అల్లుకుపోయిన అవినీతిని నిర్మూలించటానికి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దాన్ని అరికట్టటం వీలు పడట్లేదు. ఎందుకంటే ఈ అవినీతి అనేది  వ్యవస్థలో కింది నుంచి పై స్థాయివరకూ ఉంది. ఒక సాధారణ క్రింది స్థాయి ఉద్యోగి మొదలుకుని ఉన్నత స్థాయి ఉద్యోగులు, నాయకులు,  సంస్థల వరకూ చాలా మటుకు ఈ అవినీతిలో భాగమైపోతున్నారు. "దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు" అన్న చందాన తయారయింది నేటి సమాజం. ఇది ఎంత స్థాయివరకూ ఉందంటే, ఏదైనా వ్యవస్థలో మన పని జరగటానికి, అవినీతిలో మనమూ భాగమైతేనే సాధ్యమవుతుందనే  ఆలోచనా విధానానికి ప్రజలు వచ్చేశారు. అంతలా అవినీతి వ్యవస్థలోకి చొరబడిపోయి  ఇది సర్వసాధారణమే అన్నట్టు మారిపోయింది.   అవినీతి జరగటం వల్ల అర్హులైనవాళ్లు అన్నీ కోల్పోతారు, అనర్హులైనవాళ్లు అవినీతి సాయంతో  అందలమెక్కుతారు. ఇలా అవినీతి  ఎంతోమంది జీవితాలని ఛిన్నాభిన్నం చేసింది, చేస్తుంది, చేస్తూనే ఉంటుంది. ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న అవినీతిని అరికట్టాలనే ఉద్దేశ్యంతో అవినీతి వ్యతిరేక దినోత్సవాన్ని ప్రతి ఏడాది డిసెంబర్ 9వ తేదీన జరుపుకుంటున్నారు.  దీని గురించి మరికాస్త విస్తృతంగా తెలుసుకుంటే.. అవినీతి వల్ల కలిగే దుష్ప్రభావాలు.. ప్రజలకి  వ్యవస్థలపై నమ్మకం తగ్గిపోతుంది. న్యాయపాలనను దెబ్బతీసి, పౌరుల స్వేచ్ఛను పరిమితం చేస్తుంది. ఆర్థిక ప్రగతికి ఆటంకంగా మారుతుంది. సమాజంలో అసమానతలను పెంచుతుంది. ప్రజాస్వామ్యాన్ని, పర్యావరణాన్ని దెబ్బతీస్తుంది. మానవ హక్కుల రక్షణలో ఆటంకం ఏర్పడుతుంది,  పేదలకు అవసరమైన సేవలు అందకుండా పోతాయి. ఆరోగ్యం, విద్యా ప్రమాణాలు తగ్గి, జీవనంలో నాణ్యత తగ్గిపోతుంది. అవినీతికి వ్యతిరేకంగా ఎదురు తిరిగిన సందర్భాలు అరకొర ఉన్నప్పటికీ, అవి సమాజం నుంచి అవినీతిని దూరం చేయలేకపోతున్నాయి. వేళ్లూనుకుపోయిన అవినీతిని మూలాల నుంచి పెకిలిస్తే తప్ప దాన్ని నాశనం చేయలేము. అవినీతి అనేది సాధారణంగా తీసుకోవాల్సిన విషయం కాదని, దాని వల్ల సమాజానికి ఎంత నష్టమో, నైతికత, న్యాయం ద్వారా చట్టబద్దంగా అవినీతిపై పోరాడటం ఎలాగానే  విషయాన్ని  ప్రజలకి అర్ధమయ్యేలా చెప్పాలి. అందుకే ప్రపంచవ్యాప్తంగా అవినీతి గురించి అవగాహన పెంచడం, నిజాయితీ, బాధ్యత అనే నైతిక విలువలను ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించి, అవినీతి రహిత సమాజాన్ని నిర్మించే  లక్ష్యంగా  ఐక్యరాజ్యసమితి సాధారణ సభ  రిజల్యూషన్ 58/4 ద్వారా,  2003వ సంవత్సరం నుంచి డిసెంబర్ 9వ తేదీని ‘అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినంగా’ ప్రకటించింది. ఈ దినోత్సవం, అవినీతి సమస్యలపై అవగాహన పెంచడంలో, అంతర్జాతీయ సహకారాన్ని బలోపేతం చేయడంలో ముఖ్య పాత్ర పోషిస్తోంది. 2024.. థీమ్.. 2024వ సంవత్సరానికిగానూ  "అవినీతి వ్యతిరేక పోరాటంలో  యువతతో ఐక్యం కావటం,  రేపటి నైతికతను నిర్మించడం".అనే థీమ్ లక్ష్యంగా ఉంది.  అవినీతి వల్ల జరిగే చెడు  ప్రభావాల గురించి యువతకు అవగాహన కల్పించి, వారిని  అవినీతి వ్యతిరేక ఉద్యమంలో భాగస్వామ్యం చేస్తారు.  యువతను నిర్ణయాలు తీసుకునే అధికారులతో చర్చలు జరిపేలా ప్రోత్సహిస్తారు. యువత భాగస్వామ్యంతో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో జరిగే అవినీతిని నిర్మూలించే లక్ష్యంగా పనిచేస్తారు. భారతదేశంలో అవినీతి వ్యతిరేక చర్యలు: భారతదేశంలో అవినీతి నియంత్రణ కోసం వివిధ చట్టాలు, సంస్థలు అమల్లో ఉన్నాయి.  ఉదాహరణకు లోక్‌పాల్, సి‌వి‌సి,  సీబీఐ వంటి సంస్థలు అవినీతికి పాల్పడినవారికి తగిన శిక్ష పడేలా చేస్తాయి.  అవినీతి వ్యతిరేక ప్రచారాలు, అవగాహన కార్యక్రమాలు కూడా  దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. భారతదేశంలో ప్రస్తుతమున్న అవినీతి వ్యతిరేక చట్టాలు, విధానాలు: అవినీతి నిరోధక చట్టం, 1988: అవినీతి నిర్వచనాలు, దోషులకు శిక్షలు ఇందులో ఉంటాయి. భారతీయ న్యాయ సంహిత, 2023: అవినీతి,  లంచాలపై నూతన నిబంధనలు ఉన్న చట్టమిది. లోక్‌పాల్, లోకాయుక్త చట్టం, 2013: అవినీతి నిర్మూలనపై ప్రజా బాధ్యతను పెంచటానికి చేసిన చట్టం. విశిల్ బ్లోవర్స్ ప్రొటెక్షన్ చట్టం, 2014: అవినీతి విషయాలను బట్టబయలు చేసిన వారిని రక్షించే చట్టం.   ఇతర చట్టాలు: మనీలాండరింగ్ నిరోధక చట్టం,2002,  బెనామీ లావాదేవీలు చట్టం,1988,  బ్లాక్ మనీ, పన్ను విధానం చట్టం,2015. చట్టాలు అమలు చేసే సంస్థలు: * కేంద్ర విజిలెన్స్ కమిషన్: ప్రభుత్వ విభాగాల్లో అవినీతి నివారణ,  పర్యవేక్షణ బాధ్యతలు చూసుకుంటుంది. * సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్: అవినీతి సంబంధించిన ప్రధాన కేసులు విచారణ చేస్తాయి. * స్టేట్ ఏంటీ కరప్షన్ బ్యూరోలు: రాష్ట్ర స్థాయి కేసుల పరిశీలన చేస్తాయి. అవినీతి అవగాహన సూచిక:  ‘ట్రాన్సపరెన్సీ ఇంటర్నేషనల్’ అనే అంతర్జాతీయ సంస్థ, ప్రతి సంవత్సరం అవినీతి అవగాహన సూచికను ప్రచురిస్తుంది.  ఇందులో ఒక  సూచీ ప్రకారం ఒక దేశానికి సున్నా నుండి వంద  వరకు కొన్ని పాయింట్లను ఇస్తారు. వాటి ఆధారంగా ఒక దేశ స్థానం నిర్ణయిస్తారు. [సున్న(అతి ఎక్కువ అవినీతి), వంద(అతి తక్కువ అవినీతి)]  2023లో భారతదేశానికి  మొత్తం 180 దేశాలలో 93వ స్థానం లభించింది.   మన దేశానికి దక్కిన ఈ స్థానం, మన దేశంలో  అవినీతి నిర్మూలనకి మరింత బలమైన చట్టాలు, విధానాలను అమలు చేయాల్సిన అవసరం ఉందని  సూచిస్తోంది. అవినీతి నిర్మూలన కోసం ఏం చేయాలి? యువత ప్రోత్సాహం:  అవినీతి రహిత భవిష్యత్తును నిర్మించడంలో యువత పాత్రను గుర్తించాలి. గ్లోబల్ ఐక్యత:  అంతర్జాతీయంగా దేశాల మధ్య అవినీతి నిర్మూలనలో సహకారాన్ని పెంపొందించాలి. చట్టపరమైన సంస్కరణలు: అవినీతి అవగాహనా సూచికలో వెనుకబడిన దేశాలన్నీ  మరింత కఠినమైన చట్టాలను ఆమోదించేలా కృషి చేయాలి. పాలనా వ్యవస్థ మెరుగుదల:  ప్రభుత్వ ఆచరణాత్మకతను పెంపొందించాలి. ప్రజలకి వ్యవస్థలపై నమ్మకం కలగాలన్నా, శాంతి, భద్రతలకి ఆటంకం కలగకుండా,   సమాజ అభివృద్ధి లక్ష్యాలు నెరవేరాలన్నా, అవినీతి రహిత సమాజం కోసం అందరం కలసికట్టుగా  పని చేయాలి.  అప్పుడే అది సాధ్యమవుతుంది. ప్రతీ పౌరుడు తన అవసరం కోసమో, స్వార్ధ, వ్యక్తిగత ప్రయోజనాల కోసమో అవినీతికి పాల్పడకుండా ఉంటూ, అలా పాల్పడేవారిని నివారించటం చేస్తే మనం కలలు కంటున్న అవినీతి రహిత సమాజాన్ని తొందరలోనే చూడగలమని ఆశిద్దాం. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత ఆశ చూపించినా నైతికతని  కోల్పోకుండా, అధికార దుర్వినియోగం చేయకుండా, తమ బాధ్యతని సక్రమంగా నిర్వహిస్తూ,  సమాజ శ్రేయస్సు కోసం తన శక్తికి మించి శ్రమిస్తున్న ప్రతీ వ్యక్తిని ఈ సమాజం గౌరవించి, ప్రేరణగా తీసుకుని ముందుకు వెళ్లాలి. అప్పుడే అవినీతిని అంతం చేయడం సాధ్యమవుతుంది.                                                  *రూపశ్రీ.

విదురుడు చెప్పిన ఈ విషయాలు పాటిస్తే తలపెట్టిన కార్యాలలో విజయం తథ్యం..!

  విదురుడు ధృతరాష్ట్రునికి తమ్ముడు.  ఈయన దాసికి జన్మించిన వాడు కావడంతో రాజు కాలేకపోయాడు. అయితేనేం ధృతరాష్ట్రుని వద్ద మంత్రిగా ఉండేవాడు. విదురుడు న్యాయశాస్త్రాలు అవపోశన పట్టాడు. నీతి శాస్త్రాన్ని క్షుణ్ణంగా తెలుసుకున్నాడు.  మహారాజు ధృతరాష్ట్రుడికి,  విదురుడికి మహా భారత యుద్దం ముందు కొన్ని చర్చలు సాగాయి.అందులో భాగంగా విదురుడు చెప్పిన కొన్ని నీతి వాక్యాలు, విషయాలు విదుర నీతి పేరుతో ప్రసిద్ధి కాంచాయి.  చాణక్య నీతి లాగా విదుర నీతిని పాటించిన వారు జీవితంలో ఉత్తములుగా ఉంటారట. విదురుడు చెప్పిన కొన్ని విషయాలు పాటిస్తే  విజేతలు కావడం తథ్యం అంటున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుంటే.. జ్ఞానం.. నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తి ఎవరు అనే విషయం చాలామందికి తెలియదు. తన సామర్థ్యం ఏంటి అనేది క్షుణ్ణంగా తెలుసుకుని తన జ్ఞానాన్ని గుర్తించి దాన్ని సరైన సమయంలో సరైన స్థలంలో  ఉపయోగించుకునే వాడే నిజమైన జ్ఞాని అని విదురుడు చెప్పుకొచ్చాడు. కాబట్టి ఇలాంటి వ్యక్తి తను ఏర్పరుచుకున్న లక్ష్యాన్ని చేరుకుని కచ్చితంగా విజేత అవుతాడట. మూర్ఖుడు.. నిజమైన జ్ఞానం ఉన్న వ్యక్తితో పాటు మూర్ఖులు కూడా ఉంటారు.  అసలు మూర్ఖుడు అనే విషయాన్ని నిజమైన మూర్ఖుడు కూడా ఒప్పుకోడు.  ప్రతి ఒక్కరూ తాము చాలా జ్ఞానవంతులం అనే అంటారు.  కానీ విదురుడు చెప్పాడు నిజమైన మూర్ఖుడు అంటే ఎవరో.. పిలవకుండానే లోపలికి వచ్చేవాడు.. అడగకుండానే మాట్లాడేవాడు  మూర్ఖుడు అని విదురుడు అన్నాడు. ఇలాంటి వ్యక్తులకు దూరంగా ఉండాలట. పనులు.. ఏ పనులు చెయ్యాలి.. ఏ పనులు చెయ్యకూడదు అనే విషయంలో కొంత స్పష్టత ఉండటం అవసరం. వ్యక్తి చేసే పనే ఆ వ్యక్తిని ఉత్తముడిగా నిలబెడుతుంది.  మనసుకు, శరీరానికి బాధ కలిగించే డబ్బు సంపాదన,  లేదా మతాన్ని ఉల్లంఘించే పని చేయడం ఎప్పుడూ తప్పు పని కిందే లెక్క వస్తుందట.  అంతే కాదు.. ఏదైనా బెనిఫిట్ కలుగుతుంది అంటే శుత్రువు ముందు అయినా సరే..  తల వంచే పనులు ఎప్పటికీ చేయకూడదు అని విదురుడు చెప్పాడు.   తెలివి.. తెలివైన వ్యక్తులు ఎవరు అంటే అందరూ మేమంటే మేము అని అనుకుంటారు. కానీ తెలివైన వ్యక్తులు అంటే జ్ఞానం కలిగిన వారు.. ఇలాంటి వ్యక్తులు ఏ పనిని అయినా, ఏ విషయాన్ని అయినా తొందరగా అర్థం చేసుకుంటారు. అవతలి వ్యక్తి మాటలను ఎంతో శ్రద్దతో,  ఓర్పుతో వెంటాడు.  ఏ ఉద్దేశ్యం లేకుండా మాట్లాడని వారు తెలివైన వారు.  ముఖ్యంగా తమ సమయాన్ని వృధా చేసే విషయాల పట్ల దూరంగా ఉండేవాడు నిజమైన తెలివిగల వాడు అని విదురుడు చెప్పాడు.  ప్రతి వ్యక్తి ఈ పనులన్నీ అలవాటు చేసుకుని పైన చెప్పుకున్నట్టు ఉంటే.. ఆ వ్యక్తులు జీవితంలో    తలపెట్టిన ఏ పనిలో అయినా విజయం సాధించడం ఖాయం అంట.                                              *రూపశ్రీ.  

అమరవీరుల జెండా వందనం.. సాయుధ దళాల జెండా దినోత్సవం -2024..

సాయుధ దళాల జెండా దినోత్సవం 2024 మనం రోజూ అనుభవించే ఎన్నో సౌకర్యాలు, సుఖాలు  ఉండకపోయినా,  రాత్రనక, పగలనక  గడ్డ కట్టించే మంచుపర్వతాలలో, మండించే ఎడారిలో పనిచేస్తున్న ఆర్మీ,  తీరప్రాంతానికి ఏ ప్రమాదం చేరకుండా సముద్రం  మద్యలో అడ్డుగోడలా నిలబడి రక్షిస్తున్న నేవీ,  దేశ రక్షణ కోసం గగన మార్గంలో కూడా డేగ కళ్ళతో తిరుగుతూ ఏ ప్రమాదమూ మన దేశపునెత్తి మీద పడకుండా రక్షిస్తున్న ఎయిర్ఫోర్సుల్లో  ప్రతీ  సైనికుడు నిస్వార్ధంగా పనిచేస్తున్నాడు అంటే దానికి కారణం, వాళ్ళు ఈ దేశాన్ని ఒక తల్లిగా,  దేశంలోని పౌరులందరినీ  తమ కుటుంబంగా  భావించి,  మనల్ని  ఇంట్లో సుఖంగా పడుకోనిస్తూ,  వాళ్ళుమాత్రం  ఇంటి బయట అహర్నిశలు కాపు కాస్తున్నారు.      అలా నిస్వార్ధంగా, నిర్భయంగా  మనందరి కోసం ప్రతీ సైనికుడు అక్కడ పనిచేస్తున్నారు అంటే, వారి వెనుక త్యాగం చేసే ఒక కుటుంబం కూడా ఉంటుంది. ఎందుకంటే ఆ కుటుంబం దేశం కోసం తన బిడ్డని సమర్పించింది. మరి అలాంటప్పుడు ఆ సైనికుడి మీదైనా, అతని కుటుంబం మీదైనా బాధ్యత  మనందరికీ  ఉంటుంది. ఒక సైనికుడికి  కష్టం వస్తే దేశమంతా ఏకమై కుటుంబంలా నిలబడుతుందన్న నమ్మకాన్ని  సైనికుల్లో కలిగించటానికి, వారి త్యాగాలను గుర్తు చేసుకుంటూ,  ఒక కుటుంబంగా వారికి అండగా నిలబడటానికి ఈ సాయుధ దళ దినోత్సవం జరుపుకోవటం మొదలుపెట్టారు.  సాయుధ దళాల జెండా దినోత్సవం: చరిత్ర భారత సాయుధ దళాలయిన   ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సులో చేరి,  మన దేశ రక్షణ కోసం వీరోచితంగా పోరాడుతున్న, పోరాడి అమరులయిన  సైనికులను  గౌరవించడానికి సాయుధ దళాల జెండా దినోత్సవం జరుపుకుంటారు. సైనిక సిబ్బంది, వారి కుటుంబ  సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి సాయుధ దళాల జెండా దినోత్సవం జరపటమనేది డిసెంబర్ 7, 1949 నుంచి మొదలైంది. ఈ రోజున  దేశంలోని శాంతి, స్వేచ్ఛ,  భద్రతను కాపాడడంలో సైనికులు చేసిన  త్యాగాలను, దేశ రక్షణలో  వారికున్న అంకితభావాన్ని గుర్తించి, గౌరవిస్తారు.  అదనంగా, వారి  సంక్షేమానికి నిధులను సమీకరించడం జరుగుతుంది.  సాయుధ దళాల జెండా దినోత్సవం ప్రాముఖ్యత:  ప్రత్యేకమైన ఈరోజున  పౌరులంతా,   రక్షణ దళాలు, వారి కుటుంబాల పట్ల తమకున్న  కృతజ్ఞతను వ్యక్తపరిచే అవకాశం పొందుతారు. ఈ రోజున అందించే దేశ పౌరులు వివిధ రూపాల్లో  అందించే విరాళాలను  మాజీ  సైనికులు, యుద్ధ వితంతువులు, వికలాంగులైన సైనికుల  పరిస్థితిని మెరుగుపర్చటానికి ఉపయోగిస్తారు. ఇలాంటి ఒక దినోత్సవం జరుపుకోవటం వల్ల  సైనిక సిబ్బందికి,  పౌరులకి  మధ్య ఉన్న బంధం  బలోపేతం అవుతుంది.   పౌరులందరిలోనూ  ఐక్యత, దేశభక్తి భావనలను ప్రోత్సహిస్తుంది.   సాయుధ దళాల జెండా దినోత్సవాన్ని ఎలా జరుపుకుంటారు? భారత సైనిక సిబ్బంది సాంప్రదాయ, సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాలు, ఉత్సవాలు, ఇతర వినోద కార్యక్రమాలను నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా రెడ్, బ్లూ, లైట్ బ్లూ  రంగులతో కూడిన త్రివర్ణ జెండాలు (భారత సైన్యం యొక్క మూడు విభాగాలను సూచిస్తూ) పంపిణీ చేస్తారు. పౌరులంతా  ఈ జెండాలను ధరించడం వీరులను గౌరవించడానికి ఒక  ప్రతీక అవుతుంది.  ప్రధాన లక్ష్యాలు: 1.    భారత సాయుధ దళాల అంకితభావం,  త్యాగాలను గుర్తించి, గౌరవించటం.  2.    అమరవీరుల కుటుంబాలు, మాజీ సైనికులు,  దివ్యాంగ సైనికుల సంక్షేమం కోసం నిధులను సమీకరించడం. 3.    దేశ రక్షణలో పాల్గొనే వారికి మద్దతు అందించడంలో పౌరుల బాధ్యతను ప్రేరేపించడం. సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి :   రక్షణ మంత్రిత్వ శాఖ కమిటీ,  1949లో సాయుధ దళాల జెండా దినోత్సవ నిధిని సృష్టించింది. 1993లో, యుద్ధ బలిదాన దాతల నిధి, కేంద్ర సైనిక్ బోర్డ్ నిధి, మాజీ సైనికుల సంక్షేమ నిధి, ఇతర విభాగాలకు సంబంధించిన నిధులన్నింటినీ కలిపి ఒకే నిధిగా, ‘సాయుధ దళాల జెండా దినోత్సవ నిధి’గా మార్చింది.   నిధి ఉపయోగాలు: •    అమరవీరుల కుటుంబాలకి, యుద్ధంలో గాయపడి  వికలాంగులైన   సైనికులకు మద్దతు ఇస్తారు.  •    మాజీ సైనికుల జీవన పరిస్థితి మెరుగుపర్చటానికి  ఆర్థిక సహాయం అందిస్తారు. •    సైనికుల పిల్లల విద్యకు అవసరమైన ఆర్థిక సహాయం చేసి, వారి భవిష్యత్తుకి భరోసా ఇస్తారు.    అయితే ఈ ‘సాయుధ దళాల జెండా దినోత్సవం’ అనేది కేవలం ఆర్థిక మద్దతు ఇవ్వడానికి మాత్రమే కాదు,   ఇది ఐక్యత, గౌరవం, జాతీయ గర్వానికి ప్రతీక. ఈ రోజున పౌరులు సైనికుల సంక్షేమంలో అందరూ చురుకుగా పాల్గొని, దేశం కోసం  త్యాగాలు చేసిన వీరుల పట్ల తమ కృతజ్ఞతను వ్యక్తం చేయటం గొప్ప విషయం. మనల్ని తమ కుటుంబంగా భావించి కాపాడుతున్న ప్రతీ వీర సైనికుడిని, మనం కూడా  మన ఇంటి బిడ్డగా భావించి వారి కష్ట, నష్టాల్లో పాలుపంచుకుని, అందరం ఐకమత్యంగా ఉందాం. అప్పుడే మన భారతదేశానికున్న   వసుదైక కుటుంబ భావనని నిలబెట్టినవాళ్ళమవుతాం.                                           *రూపశ్రీ .  

అంటరానితనం అంతం కోసం పోరాడిన  మహావ్యక్తి – డా. భీంరావ్ రాంజీ అంబేద్కర్..!

సామాజిక  వివక్ష బలంగా ఉన్న రోజుల్లో ఒక వెనుకబడిన వర్గంలో పుట్టి, పెరిగిన ఒక సాధారణ వ్యక్తి  అప్పటికే    మహావృక్షపు వేర్లలా  సమాజమంతా  అల్లుకుపోయిన అంటరానితనం, కుల వివక్షల మీద పోరాటం మొదలుపెట్టి, అందులో విజయం సాధించటం అంత సులువయిన విషయమేమీ కాదు. ఆ విజయం వెనుక ఎన్నో అవమానాలున్నాయి, ఎన్నో ఆటంకాలు ఉన్నాయి, మరెన్నో విమర్శలున్నాయి. కానీ అవన్నీ దాటుకుని  వెనుకబడిన వర్గాల జీవితాలు బాగుపడటానికి అవకాశం కల్పించిన ఆ మహానుబావుడి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఆయన ఇంకెవరో కాదు…. ఒక దళితునిగా పుట్టి, పెరగటంలో ఒక మనిషి ఎదుర్కొనే కష్ట నష్టాలన్నీ స్వయంగా అనుభవించి, వాటిపై న్యాయ పోరాటం చేసి, దళితుల పాలిట దేవుడిగా పేరు పొందిన  డా.భీంరావ్ రాంజీ అంబేద్కర్ గారు.  అంబేద్కర్ గారి జీవితం ప్రతీ ఒక్కరికీ ప్రేరణ కలిగించే కథ.  అంబేద్కర్ గారు సామాజిక-రాజకీయ సంస్కరణలు  చేసిన వ్యక్తిగా తన ముద్రను భారతదేశ చరిత్రపై విడిచారు.  ఆయన అనేక సామాజిక వివక్షలు, అణచివేతలను ఎదుర్కొన్నప్పటికీ, విద్య ద్వారా విజయం సాధించారు.  సమానత్వం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడారు. అందుకే ఆయన మరణించిన డిశంబర్ 6వ తేదీన, అంబేద్కర్ వర్ధంతిగా దేశమంతా జరుపుకుని, ఆయనకి నివాళులర్పిస్తారు.  ఆయన పశ్చిమ భారతదేశంలో దళిత మహార్ కుటుంబంలో జన్మించారు.  ఆయన తండ్రి  భారత సైన్యంలో అధికారి. అంబేద్కర్ గారు చిన్నప్పటి నుంచే పాఠశాలలోని  ఉన్నత కులానికి చెందిన తోటి విధ్యార్ధుల చేత అవమానించబడేవారు. అప్పట్లో స్కూల్లో వెనకబడిన వర్గాలవారిని గది బయటనే కూర్చోబెట్టేవారు, అలాగే వారికి నీళ్లు కూడా నేరుగా తీసుకునే హక్కు ఉండేది కాదు. ప్యూన్ లాంటి వారెవరొకరు పైనుంచి పోస్తే కిందనుంచి తాగాల్సిన పరిస్థితి. ఈ విషయం గురించే ప్రస్తావిస్తూ ఆయన రాసిన పుస్తకంలో “నో ప్యూన్, నో వాటర్” అని రాశారు. అంటే ప్యూన్ రానిరోజున నీళ్ళు కూడా తాగకుండా వుండేవారని రాశారు.    ఆయన బరోడా గాయకవార్(రాజు) అందించిన స్కాలర్‌షిప్ సహాయంతో  అమెరికా, బ్రిటన్, జర్మనీలోని విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు. గాయకవార్ అభ్యర్థన మేరకు బరోడా పబ్లిక్ సర్వీస్‌లో చేరినప్పటికీ, అక్కడ కూడా వెనుకబడిన వర్గం నుంచి వచ్చినవాడిగా, ఉన్నత కులానికి చెందిన  సహచరుల చేత అవమానాలు ఎదుర్కొనటంతో,  తన దృష్టిని న్యాయవాద వృత్తి, బోధనవైపు మళ్లించారు. అంటరానితనం మీద పోరాటం మొదలుపెట్టారు.    దళితులలో ప్రముఖ నాయకుడిగా ఎదిగి, వారి హక్కుల కోసం పత్రికలను స్థాపించి, ప్రభుత్వ శాసన మండలిలో ప్రత్యేక ప్రాతినిధ్యం పొందడంలో విజయం సాధించారు. విద్య అనే ఆయుధంతో,  న్యాయమనే నిప్పుతో ఆయన పోరాటం సాగింది. 1947వ సంవత్సరంలో  అంబేద్కర్ స్వతంత్ర భారతదేశ తొలి న్యాయశాఖ మంత్రిగా నియమితులయ్యారు.   రాజ్యాంగ రూపకల్పన కమిటీ అధ్యక్షునిగా నియమితులయ్యారు.  అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రూపకల్పన చేయడంలో ప్రధాన పాత్ర పోషించారు. ఆయన సమాజంలో అణచివేతకు గురైన వర్గాల హక్కులను కాపాడటానికి న్యాయబద్ధమైన మార్గాలను ప్రవేశపెట్టారు. అలాగే, కుల వివక్ష నిర్మూలన, అగ్రవర్ణాల ఆధిపత్యానికి వ్యతిరేకంగా ఆయన నిరంతరం పని చేశారు. జనవరి 26, 1950న రాజ్యాంగం స్వీకరించటంలో  ప్రముఖ పాత్ర పోషించారు. ఈ జనవరి 26నే గణతంత్ర దినోత్సవం దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ప్రభుత్వ విధానాల మీద  నిరాశ చెందడంతో,  1951లో ఆయన మంత్రి పదవి నుంచి రాజీనామా చేశారు. ఆయన తన జీవితంలో ఎన్నో పుస్తకాలు చదివారు, ఎన్నో పుస్తకాలు రాశారు. ఆయన  వ్యక్తిగత స్వేచ్ఛపై ధృఢమైన నమ్మకాన్ని కలిగి ఉండేవారు. కుల వ్యవస్థని  తీవ్రంగా విమర్శించారు. కులవ్యవస్థకు హిందూ ధర్మం ఆధారంగా ఉందని ఆయన చేసిన ఆరోపణలు వివాదాస్పదంగా మారి, హిందువులలో ఆగ్రహం కలిగించాయి.  హిందూ సిద్ధాంతంలో తాననుకుంటున్న స్పష్టమైన మార్పులు  లేవని భావించి, 1956లో ఆయన హిందూ మతాన్ని విడిచిపెట్టి బౌద్ధమతాన్ని స్వీకరించారు. నాగ్‌పూర్‌లో జరిగిన ఈ వేడుకలో ఆయనతో పాటు 2 లక్షలమందికిపైగా దళితులు కూడా బౌద్ధమతంలో చేరారు. ఈ రోజు అతడి సేవలు, ఆలోచనలు, ఈ   సమాజానికి ఆయన అందించిన మార్గదర్శకత్వాన్ని స్మరించుకునే రోజుగా నిలుస్తుంది. ప్రత్యేకంగా దళితుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటం,  సామాజిక సమానత్వాన్ని సాధించేందుకు ఆయన చేసిన కృషి  చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తుంది. అంబేద్కర్‌ గారి మరణానంతరం 1990వ సంవత్సరంలో  భారతదేశ అత్యున్నత పౌర పురస్కారమైన  భారతరత్నను ప్రదానం చేశారు. ఆయనని  గౌరవిస్తూ అనుచరులు  జై భీమ్ అనే నినాదం పలుకుతారు. ఆయన  గౌరవప్రదంగా  బాబాసాహెబ్ అని  కూడా పిలవబడ్డారు    దీని అర్థం "గౌరవనీయమైన తండ్రి". అని. ఆ మహానుభావుడు సమాజం కోసం చేసిన కృషికి నేడు ఆయన విగ్రహం లేని ఊరు ఉండదనటం  అతిశయోక్తి కాదేమో...అలాగే  'స్టాచ్యూ  ఆఫ్ సోషల్ జస్టిస్' పేరుతో విజయవాడలో  కాంస్య విగ్రహం నిర్మించారు. ఇది దేశంలోనే రెండో ఎత్తయిన విగ్రహం కావటం విశేషం.అలాగే తెలంగాణలో కూడా  నిర్మించారు. అంబేద్కర్ గారి గురించి తెలుసుకుని మనమేం చేయాలి?  డా. అంబేద్కర్ గారు  ఆశించిన సమానత్వం, సామాజిక న్యాయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఆయన జీవితం మనకు సంఘర్షణ, ధైర్యం, సేవాస్ఫూర్తికి ప్రతీక. ఈ రోజున ఆయన ఆశయాలను గౌరవిస్తూ, సామాజిక విభేదాలను తొలగించేందుకు కృషి చేయడం మన బాధ్యత. డా. అంబేద్కర్ గారి మరణ దినం మనకు ఆయన ఆశయాలను గుర్తుచేసే రోజు మాత్రమే కాకుండా, ఈ రోజుకీ పూర్తిగా మన సమాజాన్ని విడిచిపెట్టకుండా పట్టి పీడిస్తున్న కుల వివక్ష, అంటరానితనం రూపుమాపటానికి మనం చేయాల్సిన కృషిని గుర్తు చేయాలి.  సామాజిక సమానత్వం కోసం మనందరం కలిసి పని చేయాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెబుతుంది.                                   *రూపశ్రీ 

నేలతల్లికి నీరాజనం –  ప్రపంచ నేల  దినోత్సవం 2024.. ! 

  మనం మట్టిని  భూమాత, నేలతల్లి అని పిలవటం దాని లక్షణానికి అచ్చంగా సరిపోతుంది. ఎందుకంటే ఒక అమ్మ ఎలా అయితే తన పిల్లల్ని పెంచి, పోషించటానికి తనలోని శక్తి సన్నగిళ్లేవరకూ పాటుపడుతుందో, అలాగే ఈ నేల తనలోని సారమంతా సన్నగిళ్లేవరకూ మొక్కల్ని పెంచి, పోషించి ఈ భూమి మీద ఉన్న జీవజాల  మనుగడకి ఆధారమవుతుంది. అయితే శక్తి సన్నగిల్లిన తల్లిని చూసుకోవాల్సిన బాధ్యత ఎలా అయితే పిల్లలకి ఉంటుందో, అలాగే నేలతల్లి  అందించిన ఆహారం తింటున్న మనకి దాని గొప్పదనాన్ని గుర్తించి, దాని బాగోగులు కూడా చూసుకోవాల్సిన  బాధ్యత ఉందనటంలో ఎలాంటి సందేహం లేదు.  ప్రపంచ నేల  దినోత్సవం మన ఆహారంలో 95%కి పైగా నేలలోనుంచే ఉత్పత్తి అవుతోంది. కాబట్టి, ఈ సహజ వనరు ఆరోగ్యంగా ఉండటమనేది మనుషులకే కాదు, భూమి మీద ఉన్న  జీవజాలమంతటి  మనుగడకీ  అవసరమే. అందుకే భూమి మీద హాయిగా జీవించాలంటే   నేలకున్న  ప్రాముఖ్యతను తెలియజేస్తూ,  ప్రపంచ నేల దినోత్సవం ఆవిష్కరణను 2002లో ‘ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ సాయిల్ సైన్సెస్’ ప్రతిపాదించింది. దీన్ని 2013లో ‘ఆహార, వ్యవసాయ సంస్థ’ అధికారికంగా ఆమోదించింది. ఆ తర్వాత, ‘సంయుక్త జాతుల సాధారణ అసెంబ్లీ’ ఈ దినోత్సవాన్ని 2013 డిసెంబర్‌లో ఆమోదించింది. కానీ ఈ దినోత్సవానికి డిసెంబర్ 5ని ఎంచుకోవడమన్నది   థాయ్‌లాండ్‌కు చెందిన భూమిబోల్ ఆదుల్యదేజ్ అనే రాజు గౌరవార్ధం జరిగింది. 2024కి గానూ ప్రపంచ నేల దినోత్సవ థీమ్: “నేలని సంరక్షించండి - కొలవడం, పర్యవేక్షించడం, నిర్వహించడం” ఈ సంవత్సరం ఎంచుకున్న థీమ్ అనేది  నేల ఆరోగ్యం, ఆహార భద్రత, పర్యావరణ స్ధిరత్వం మధ్య అనుబంధాన్ని బలంగా చూపిస్తుంది. ఆహార భద్రతను, వాతావరణ మార్పులను ఎదుర్కోవడాన్ని, పర్యావరణ వ్యవస్థల స్ధిరత్వాన్ని అందించడంలో నేలకి సంబంధించిన  ఖచ్చితమైన డేటా అవసరమని చెప్తుంది.   భారత భౌగోళిక, వాతావరణ పరిస్థితుల కారణంగా ఒండ్రుమట్టి, నల్లరేగడి, బంకమట్టి, ఎర్రమట్టి నేలలు, ఎడారి నేలలు, కొండప్రాంతపు నేలలని వివిధ రకాల మట్టి పుడుతుంది. అయితే  ఒక్కో రకపు మట్టి కొన్నికొన్ని    ప్రత్యేక లక్షణాలు కలిగి ఉండి, రకరకాల   పంటలకు అనుకులంగా ఉంటుంది.  వ్యవసాయ పద్ధతులను మెరుగుపరచడంలో, ఆహార భద్రతను కల్పించడంలో మట్టి మీద  అవగాహన ఉండటం చాలా ముఖ్యమైనది.  నేలకున్న సమస్యలు.. సవాళ్లు, ముప్పులు:  నేలకి  సహజ ప్రక్రియలవల్ల,  మానవ చర్యల ద్వారా కూడా అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. ఈ సమస్యలు మట్టి ఆరోగ్యం, జీవవైవిధ్యం, ఆహార భద్రతపై ప్రభావం చూపుతున్నాయి. ఇక్కడ నేలని ముప్పులోకి నెట్టే ప్రధాన సవాళ్లుగా కొన్నింటిని చెప్పవచ్చు.    నేల దెబ్బతినడం:   నీరు, గాలి ద్వారా మట్టి కొట్టుకుపోతుంటుంది. అలాగే  అడవులని నరికేయటం, పంటల మార్పిడి లేకపోవడం, ఇంకా  మారుతున్న వ్యవసాయ పద్ధతులు మట్టిని త్వరగా దెబ్బతినేలా చేస్తాయి. పంటలకి  పోషక లోపం:   భారతదేశంలో ప్రాంతాలను బట్టి  చాలా భాగం నేలలు నత్రజని, ఫాస్ఫరస్ లోపంతో ఉన్నాయి.  అందువల్ల ఎరువు ఎంత వేయాలో అనే అవగాహన కూడా లేని రైతులు, సబ్సిడీలో తీసుకున్న రసాయన ఎరువులని  విపరీతంగా ఉపయోగించటం వల్ల నేల సారం మారిపోయి పంటలకి పోషణ అందట్లేదు.  ఎడారీకరణ:   పెరుగుతున్న జనాభా ఒత్తిడి కారణంగా అడవులని కొట్టేయటం వల్ల, పశువుల అధిక మేత వలన సారవంతమైన నేలలు సారం కోల్పోయి ఎడారిగా మారుతున్నాయి.   నీరు నిల్వ ఉండిపోవటం:   నీటిపారుదల సరైన విధంగా లేకపోవడం, నేలలో వాటర్ చానల్స్‌ నుంచి నీరు లీకేజీ అవ్వటం వల్ల లక్షల ఎకరాల భూములు నీటితో నిండిపోతున్నాయి. దీనివల్ల మట్టి నిర్మాణం దెబ్బతిని, ఉత్పాదకత తగ్గిపోతుంది.  ఉప్పదనం,  క్షారతనం:   నీటిపారుదల అధికంగా ఉండే ప్రదేశాల్లో   మట్టిలో ఉప్పు పేరుకు పోవడం వల్ల కూడా అక్కడ నేల పంటకి అనుకూలం కాకుండా పోతుంది.  పట్టణీకరణ,  పాడుబడిన భూములు:   పట్టణాలకి వలసలు పెరుగుతున్న నేపథ్యంలో అక్కడ స్థలానికి డిమాండ్ పెరిగి చుట్టుపక్కల మంచి పొలాలు కూడా లే-అవుట్లగా మార్చేస్తున్నారు. అలాగే  రసాయనాలు,  లోహాలతో  పరిశ్రమల వ్యర్థాలు నేలని కాలుష్యం చేస్తాయి.  పారిశ్రామీకరణ:   నేలని నాశనం చేసే ఓపెన్-కాస్ట్ మైనింగ్, పరిశ్రమల కోసం వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాలని ఆక్రమించుకోవటం.  ప్రపంచ నేల దినోత్సవాన్ని ఎలా జరుపుకోవాలి?  నేల సారాన్ని కాపాడటం: నేలలోని పైపొరల్లో  ఖనిజాలు, సేంద్రీయ పదార్థాలు, నీరు, గాలి ఉంటాయి.  ఇది మొక్కల పెరుగుదలకు బలంగా ఉండి, భూమిపై జీవం మద్దతు కోసం అవసరమైనది.  అందుకే ఈ నేల సారం కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సుస్థిర వ్యవసాయాన్ని ప్రోత్సహించడం:  ఆరోగ్యవంతమైన నేల  ఆహార భద్రతకు కీలకం. కాబట్టి నేల పాడవకుండా వ్యవసాయ విధానాలు పాటించేలా ప్రోత్సహించాలి.  జీవ వైవిధ్యాన్ని కాపాడటం: నేడు రకరకాల రసాయనాల వినియోగం వల్ల సహజంగా నేల సారాన్ని పెంచటంలో సాయపడుతున్న జీవులు చనిపోతున్నాయి. అందుకే న్యూట్రియంట్ సైక్లింగ్,  కార్బన్ నిల్వల్లో  కీలక పాత్ర పోషించే జీవులను రక్షించాలి.  అవగాహన కలిగించడం:  భవిష్యత్ తరాలకు నేల  సంరక్షణ అనేది ఈ భూమి మీద మానవ మనుగడకి చాలా అవసరమనే  అవగాహన కలిగించాలి.  నేలని కాపాడుకోవటానికి ఏం చేయాలి?    మొక్కలు నాటటం:    మట్టి కొట్టుకుపోయే ప్రాంతాల్లో వృక్షాలు నాటడం దారా  మట్టిని దెబ్బతినకుండా కాపాడవచ్చు.  వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్:    ఇంటిగ్రేటెడ్ వాటర్‌షెడ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (IWDP) వంటి కార్యక్రమాలు ద్వారా నీటి పారుదలని సమర్ధవంతంగా  నిర్వహించాలి.  టెర్రేస్ వ్యవసాయం:  పర్వత ప్రాంతాల్లో నేలను మెట్లు లాగా  పైనుంచి కిందవరకూ చెక్కి ఉంచే విధానంలో  మట్టి నీటితో పాటూ కిందకి కొట్టుకుపోకుండా కాపాడుతుంది.   ఆర్గానిక్ వ్యవసాయం:  రసాయన ఎరువులు వినియోగం తగ్గించి ఆర్గానిక్  ఎరువులు ఉపయోగిస్తూ వ్యవసాయం చేస్తే నేల సారం పెరుగుతుంది.  నేలను  కాపాడటానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. ఇలా చేస్తే మనవంతు మన నేల తల్లికి సేవ చేసిన వాళ్ళమవుతాం. అందుకే  మట్టిని సంరక్షించడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలి. "ఆరోగ్యకరమైన నేల, ఆరోగ్యకరమైన గ్రహం!" “ ఆరోగ్యకరమైన గ్రహం, ఆహ్లాదకరమైన జీవితం”అనే విషయాన్ని మర్చిపోకూడదు.                                  *రూపశ్రీ.

భారత నేవీ డే 2024 - విదేశీ శక్తుల మీద ఉక్కుపాదం.. భారత నౌకాదళం.. !

  ఏ దేశానికయినా అన్నివైపుల నుంచి రక్షణ కల్పించటానికి భద్రతా దళాల పాత్ర చాలా ఉంటుంది. అయితే మారుతున్న ప్రపంచ దేశాల స్థితిగతులు, విధివిధానాల వల్ల  మన దేశ భద్రత పరంగా, ఆర్ధికపరంగా  భారత నేవీ పాత్ర ముఖ్యమైనదిగా  మారింది. దేశ ఆర్ధిక వ్యవస్థ పుంజుకోవటంలో సముద్రమార్గాల ద్వారా  జరిగే వాణిజ్య రవాణా  కీలకమవుతుంది. ఒక పక్క రవాణా  సజావుగా సాగేలా చేస్తూ,  ఇంకో పక్క విదేశీ శక్తులనుంచి మన దేశాన్ని కాపాడుతున్న మన  నేవీ ఎంతో గొప్పది.      1971లో భారతదేశానికి, పాకిస్థానుకి  మధ్య  జరిగిన యుద్ధంలో  డిసెంబర్ నాలుగో తేదీన   ట్రైడెంట్ ఆపరేషన్లో  వీరోచితంగా పొరాడి, భారత నేవీ గొప్ప విజయాన్ని  సాదించింది. ఆ యుద్ధంలో  భారత నేవీ  పాకిస్థాన్ ప్రధాన పోర్ట్ నగరమైన  కరాచీపై ధైర్యంగా దాడి చేసింది. ఇది ఒక ప్రధాన సైనిక విజయమే కాకుండా, భారత నేవీకి ఉన్న  శక్తిని ప్రపంచానికి తెలియజేసింది. అందుకే దేశ రక్షణలో వారి పాత్రను, త్యాగాలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న భారత నౌకాదళ దినోత్సవం నిర్వహిస్తారు. మన దేశ  భద్రత కోసం ప్రాణత్యాగాలు చేసి, దేశ రక్షణ కోసం  సముద్ర సరిహద్దులను అహర్నిశలు కాపుకాసి మన నౌకాదళం చేస్తున్న కృషిని, వారు సాధించిన విజయాలను గుర్తుచేసుకోవటానికి జరుపుకునే  నేవీ డే చాలా ప్రత్యేకమైనది.  నౌకాదళ ప్రాముఖ్యత -పాత్ర: భారత దేశం  విస్తృతమైన తీరప్రాంతం కలిగి ఉంది. ఇంత పొడవైన  తీరప్రాంతాన్ని రక్షించటంలోనూ,   మన దేశానికి చెందిన సముద్ర ప్రాంతంలో  శాంతిని  కాపాడడంలోనూ,  సముద్ర మార్గాలను పర్యవేక్షించి,   వాణిజ్య  మార్గాలకి  భద్రత కల్పించటంలోనూ,  ప్రకృతి పరంగా సంభవించే విపత్తుల సమయంలో సహాయం అందించడంలోనూ, అంతర్జాతీయ సముద్ర సహకారాన్ని ప్రోత్సహించడంలోనూ  భారత నౌకాదళం కీలక పాత్ర పోషిస్తుంది.  ప్రతి సంవత్సరం, భారత నౌకాదళం తన వ్యూహాత్మక లక్ష్యాలను ప్రతిబింబించేలా ఓ థీమ్‌ను ఎంచుకుంటుంది. వీటిలో.. రక్షణ, సాంకేతిక అభివృద్ధి, సముద్ర భద్రత వంటి అంశాలపై అవి కేంద్రీకృతమవుతాయి. 2024 సంవత్సరానికి "ఆవిష్కరణ, స్వదేశీకరణ ద్వారా  నౌకాదళ శక్తిని, బలాన్ని పెంచుకోవటం." అనే థీమ్‌ను ఎంచుకోబడింది.  ఇప్పటి నౌకాదళం అత్యాధునిక సాంకేతికతను కలిగిన మిస్సైల్స్, ఫైటర్ జెట్లు, యుద్ధనౌకలను కలిగి ఉంది. భారత నావికాదళంలో INS విక్రాంత్, INS అరిహంత్ వంటి సమర్థవంతమైన  యుద్ధ నౌకలు ఉన్నాయి. ఇవి మన దేశ భద్రతలో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి నేవీ డే వేడుకలు:  నేవీ డే సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు జరుగుతాయి.  వేడుకల్లో భాగంగా సీనియర్ అధికారులు నౌకాదళానికి నివాళులు అర్పిస్తారు.  గౌరవనీయులంతా  జెండా ఎగరవేసే కార్యక్రమాల్లో పాల్గొంటారు. సముద్రతీర రక్షణలో  కీలకమైన నౌకాదళ అధికారులను గౌరవించడమే కాకుండా, దేశ భద్రత కోసం సముద్రంలో  ఎన్నో కష్టాలకోర్చి పని చేసిన, పనిచేస్తున్న వీర  సైనికులని గుర్తించి, గౌరవిస్తారు. మాజీ నావికుల సేవలను గౌరవించే ప్రత్యేక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. భారత నౌకాదళ  సైనికుల త్యాగాలను, నిబద్ధతను గుర్తించే ప్రత్యేక కార్యక్రమాలతో  నేవీ డే ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ రోజు నౌకాదళానికి చెందిన యుద్ధనౌకలు ప్రజలకు ప్రదర్శనకు అందుబాటులో ఉంటాయి. నేటి విద్యార్థులు, యువతకి భారత నౌకాదళ గొప్పతనం గురించి, దేశ రక్షణలో దాని ప్రాముఖ్యత గురించి  అవగాహన కల్పించటం ద్వారా  నేవీ పట్ల ఆసక్తి కలిగేలా చేయటానికి ఇదొక అవకాశం.  భారత నౌకాదళానికి లాల్ సలామ్..!!                                         *రూపశ్రీ.  

ప్రపంచ అభివృద్ధి పై వికలాంగుల సంతకాలు! 

  “నన్ను నా సామర్ధ్యం నుంచి తెలుసుకో, నా  వైకల్యం నుంచి కాదు”  -  అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం ఈ లోకంలో ప్రతీ తల్లీతండ్రీ తమకి  పుట్టే  బిడ్డ అందంగా, ఆరోగ్యంగా పుట్టాలనే ఆశపడతారు. అలా ఇవ్వమనే  భగవంతుణ్ణి ప్రార్దిస్తారు. కానీ చాలా కారణాల వల్ల కొన్నిసార్లు పిల్లలు రకరకాల వైకల్యాలతో పుడుతూ ఉంటారు. అలాంటి పిల్లలు చాలామటుకు ఈ లోకంలోకొచ్చిన మొదటి క్షణం నుంచే కుటుంబం నుంచి, సమాజం నుంచి ఎంతో వివక్షని ఎదుర్కొంటారు. పెద్దయ్యేవరకూ ఇదే వివక్ష కొనసాగిన సందర్భాలే ఎక్కువ ఉంటాయి. కానీ వాళ్ళు కూడా మన సమాజంలో భాగమేనని, వారికీ సామర్ధ్యాలు ఉంటాయని  గుర్తించి, వాళ్లపై వివక్ష చూపించకుండా వారి అభివృద్ధికి పాటుపడాల్సిన అవసరం అందరికీ ఉంది.  అందుకే వికలాంగుల హక్కులపై అవగాహన పెంచి, వారి సంక్షేమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరాన్ని గుర్తించిన   ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ ద్వారా, 1992 నుంచి డిశంబర్3వ తేదీని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవంగా  జరపటం మొదలుపెట్టింది. ఈ రోజు, సమాన అవకాశాలు, అందుబాటు, సమగ్రత యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తూ, వికలాంగుల విజయాలు గురించి, సమాజానికి వారు చేసిన  సేవలని గురించి ప్రశంసిస్తుంది. ప్రతి సంవత్సరం డిసెంబరు3న జరుపుకునే వికలాంగుల అంతర్జాతీయ దినోత్సవం ఒకో ఏడాది ఒక ప్రత్యేకమైన అంశాన్ని ప్రవేశపెడుతుంది. "వికలాంగుల నాయకత్వాన్ని పెంపొందించి, సమగ్రత,  స్థిరమైన భవిష్యత్తుకు దారితీయడం." ఇది ఈ ఏడాది థీమ్.  ప్రపంచవ్యాప్తంగా వికలాంగుల విలువైన పాత్రను,  నాయకత్వాన్ని ఇది గుర్తిస్తుంది. అలాగే, వారి జీవితాలను ప్రభావితం చేసే నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో వారిని  చేర్చుకోవడం ఎంత ముఖ్యమో గుర్తుచేస్తుంది. ఈ రోజు, వికలాంగులు ఎదుర్కొంటున్న సవాళ్లను గురించి అవగాహన కలిగించడం,  సమాజంలోని అన్ని రంగాల్లో సమానంగా, సంపూర్ణంగా పాల్గొనేలా వారిని  కూడా  ప్రోత్సహించడం కోసం ఒక  వేదికగా పనిచేస్తుంది. వికలాంగుల జీవితాలను మెరుగుపరిచి, వారికి తగిన గౌరవం ఇవ్వటంలో  ప్రభుత్వాలు, సంస్థలు,  సమాజానికి అవకాశాన్ని అందిస్తుంది. వికలాంగుల హక్కులు, సంక్షేమానికి  మద్దతు ఇవ్వడం సాటి మనిషిగా మన బాధ్యత.  వివిధ మార్గాల్లో ప్రతీ ఒక్కరూ ఈ బాధ్యత తీసుకుని వారి అభివృద్ధికి సాయపడవచ్చు.  అందులో కొన్ని తెలుసుకుంటే..  అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం:  వికలాంగులకు సంబంధించిన సమస్యలపై చర్చలు, వర్కుషాపులు నిర్వహించటం ద్వారా ప్రజలకి వారి సమస్యలపై అవగాహన తెప్పించవచ్చు. వైకల్యం అనేది కేవలం  బయటకి కనిపించేది మాత్రమే కాదు, బయటకి కనిపించని (ఆటిజం, డిస్లెక్సియా, డిస్కాల్కులియా) వైకల్యాలు కూడా ఉంటాయని పాఠశాల స్థాయినుంచే గుర్తించి, అటువంటివారి అభివృద్ధి కోసం మనం అందించగలిగే సహకారం ఏమిటనేది అందరికీ అవగాహన కల్పించాలి.   విజయాలను గుర్తించటం:   పుట్టినప్పటి నుంచో లేక ప్రమాదం వల్లనో వైకల్యం వచ్చినప్పటికీ, కఠిన పరిస్థితులకి తలొగ్గకుండా, ఏ వైకల్యం  మమ్మల్ని ఆపలేదని నిరూపిస్తూ,  విజయాలు సాధించిన ఎంతో మంది వికలాంగుల విజయాలను గుర్తించి ప్రశంసించాలి. అప్పుడే అలాంటివారిని చూసి మిగిలిన వారికి ప్రేరణ కలుగుతుంది.  జీవిత అనుభవాలు చెప్పించటం:   ఈ వివక్ష చూపించే సమాజంలో తాము ఎదుర్కొన్న, ఎదుర్కొంటున్న సమస్యలు గురించి ,  వికలాంగుల అనుభవాలను పంచుకుని అవగాహన పెంచవచ్చు. టెక్నాలజీ,  విధానాలలో మార్పులు తీసుకురావటం:  వికలాంగులు కూడా మనలాగే  రోజువారీ జీవితాన్ని గడపగలగాలంటే,   వికలాంగులకి తగిన మౌలిక సదుపాయాలు, రవాణా,  డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లను ప్రోత్సహించటం ద్వారా వారు కూడా మనలాగే  అవకాశాలని అందిపుచ్చుకునే అవకాశం ఉంటుంది. సమాజంలోని  వైద్య, విద్య, రవాణా సంస్థల్లోనూ,  వారు పని చేసే సంస్థల్లోనూ కొన్ని విధానాల్లో మార్పులు తీసుకురావటం, వారికి ఉపయోగపడే సాంకేతికతని అందుబాటులోకి తీసుకురావటం వంటివి చేయాలి.  అప్పుడే ఉద్యోగుల వృత్తిపరమైన అవసరాలు తీరి వారు కూడా సమాజ అభివృద్ధిలో భాగమవుతారు.  వికలాంగుల సంస్థలకు మద్దతు ఇవ్వటం:  వికలాంగుల సంక్షేమానికి పనిచేసే సంస్థలకు స్వచ్ఛందంగా సేవ చేయండి లేదా సహాయం చేయండి. ఈ అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం, గ్లోబల్ నుండి లోకల్ వరకు అన్నిరంగాల్లో, అన్ని విధాలుగా  మనం సులభతరం చేసే మార్గాలు గురించి మాత్రమే కాకుండా, వికలాంగులు కూడా తమ గొంతును వినిపించి, సమాజంలో వారి  భాగస్వామ్యాన్ని కూడా గుర్తించడానికి ఒక అవకాశం ఇస్తుంది. వికలాంగుల మేలు కోసం దీర్ఘకాలిక మార్పులను అమలు చేయడం ప్రారంభించి, వారికి ప్రాముఖ్యతని ఇవ్వటం ద్వారా మరింత సమర్థవంతమైన భవిష్యత్తును రూపొందించవచ్చు.  మనలో ఉన్న వైకల్యాన్ని ఒప్పుకొని క్రుంగిపోవటమే అసలు వైకల్యమని,  మానసికంగా  దృఢంగా నిలబడి,  వైకల్యాన్ని కూడా విజయపధం వైపు నడిచే ప్రేరణగా, బలంగా  మార్చుకున్న గొప్ప వ్యక్తులు ప్రపంచంలో అన్ని రంగాల్లోనూ ఉన్నారు. అటువంటివారు మిగిలిన అందరికీ ఆదర్శంగా నిలిచి ఈ సమాజంలో వారి పాత్ర కూడా ఉందన్న నిజాన్ని ప్రపంచమంతా  అర్ధం చేసుకుని, వారిపై ఎటువంటి వివక్షా లేని సమాజం వైపు అడుగువేయాలని కోరుకుందాం…                                             *రూపశ్రీ 

బిడ్డ కడుపు నింపటానికి ఓ తల్లి చేసిన ప్రయత్నం ... కోటి రూపాయల వ్యాపారానికి దారి తీసింది...! 

  హరిత విప్లవం, శ్వేత విప్లవం అని అనేక  నూతన విధానాలు వచ్చి, చాలా మంది ఆకలి తీర్చినప్పటికీ, ఇప్పుడు పరిస్థితి ఎలా మారిందంటే, మనం రోజువారీ తినే తిండి స్వచ్ఛమైనదని చెప్పలేకపోతున్నాము. ఇప్పుడున్న రసాయన వినియోగానికి, కాలుష్యానికి, మన జీవన విధానంలో వచ్చిన మార్పుకి   మనం రోజూ ఆహారం తింటున్నామో, మందులు తింటున్నామో తెలియట్లేదు. ఎప్పుడు ఎవరికి ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తున్నాయో తెలియట్లేదు.  ఉత్తరప్రదేశ్, లక్నో నివాసి అయిన  ఒక తల్లి, జ్యోతిపద్మ  బాధ కూడా ఇలాంటిదే...  ఏ పిల్లలకయినా పాలు ప్రధమ, ప్రధాన ఆహారంగా ఉంటాయి. కానీ తన కూతురు విషయంలో ఆ ఆకలి తీర్చే పాలు తాగటమే శాపంగా మారిందనే విషయం జ్యోతి పద్మ బాధకి కారణమైంది. జ్యోతి పద్మ కూతురుకు పాలు తాగిస్తే జీర్ణించుకునేది కాదు.  అయితే  తన కూతురుకి ఎందుకు ఇలా జరుగుతుందో, మిగతా పిల్లల్లా ఎందుకు పాలని సహించుకోలేకపోతుందనే  విషయం అర్ధం చేసుకోలేక, పాలు తాగితే చాలు మంచం పడుతున్న  తన కూతురు పరిస్థితిని చూడలేక ఆ తల్లి తల్లడిల్లిపోయింది. చివరికి డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి పరీక్షలు చేయిస్తే, తన కూతురుకి ‘ లాక్టోజ్ ఇన్ టోలరెన్స్’ అనే లోపం ఉందని తెలుసుకుంది. తన కూతురు పాలుగానీ, పాల ఉత్పత్తులు కానీ ఎందుకు జీర్ణించుకోలేకపోతుందన్న నిజం తెలుసుకున్న ఆమె ఆశ్చర్యానికి గురయింది.   తన కుటుంబంలో కానీ, తన భర్తవైపు కుటుంబంలో కానీ ఎవరికీ లేని  సమస్య తన కుమార్తెకి వచ్చేసరికి ఆమెకి ఏం చేయాలో అర్ధం కాలేదు.   తన కుమార్తెకి  వచ్చిన ఈ సమస్యని ఆమె సులువుగా వదల్లేకపోయింది. ఈ సమస్యకి  పరిష్కారం కోసం, తన కుమార్తెకి తగిన పోషకాలు అందించాలనే తపనతో  ఆమె తన ప్రయత్నాలు చేయటం మొదలు పెట్టింది. ఏ కంపెనీ పాలయినా తన కూతురు జీర్ణించుకోగలుగుతుందేమో అనే ఆశతో  మార్కెట్లో దొరికే రకరకాల  కంపెనీల  ప్యాకేజ్డ్ పాలు ఇచ్చేది. కానీ అవేవీ పడకపోవటంతో,   ఈసారి  స్థానిక డైరీల నుంచి పాలు తెచ్చి అవి ఇవ్వటం మొదలుపెట్టింది. కానీ ఆ పాల ఉత్పత్తిలో కూడా అపరిశుభ్రత, రసాయన ఆహారాల వినియోగం వంటివి ఉండటంవల్ల వాటిని కూడా ఆమె కుమార్తె శరీరం జీర్ణించుకోలేక తిప్పికొట్టింది. అయితే మన ప్రయత్నం బలంగా ఉంటే భగవంతుడు  కూడా సాయం చేస్తాడన్న మాటని నిజం చేస్తూ.. 2018లో, ఆమె సోదరి వాళ్ళ ఇంటి ఆవు  నుంచి తీసి, పంపించిన  పాలు జ్యోతి పద్మకి  పరిష్కారాన్ని చూపించాయి. ఆశ్చర్యకరంగా ఆ పాలను ఆమె కుమార్తె తేలికగా జీర్ణం చేసుకోగలిగింది.  మరలా అవే పాలని ప్రయత్నించి, తమ కుమార్తె జీర్ణం చేసుకోగలుగుతుందని ఒక నిర్ధారణకొచ్చాక జ్యోతి ఆనందానికి అవధులు లేవు.   అప్పుడే  ఆమె మనసులో ఒక ఆలోచన మెదిలింది. నేనెందుకు అటువంటి స్వచ్చమైన  పాలని ఉత్పత్తి చేసే డైరీ పెట్టకూడదు? తమ పిల్లలకి  స్వచ్చమైన పాలు అందించాలన్న నాలాంటి తల్లుల ఆవేదనకి ఎందుకు సమాధానం కాకూడదు? అనుకుంది. అయితే శుభ్రతని పాటించకపోవటం, సరైన పోషకాహారం ఆవులకి అందించలేకపోవటం వంటి కారణాల వల్ల నాణ్యత తగ్గి, వ్యాపారం చేయలేక   స్థానిక డైరీలు మూత పడుతున్నాయి. అలాంటి సమయంలో జ్యోతి మొదటిగా 15 సంకరజాతి ఆవులతో చిన్న డైరీ ఏర్పాటు చేసుకుంది. తాను రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి కానప్పటికీ ప్రయత్నిస్తూ, తప్పులు సరిచేసుకుంటు ఆమె సంపాదించిన కొద్దిపాటి జ్ఞానం ఆవు పాల నాణ్యతని మెరుగుపర్చింది. ఆ తరవాత ఆమె మహారాష్ట్రలోని థానేకి షిఫ్టయ్యాక నగరాల్లో స్వచ్చమైన పాల అవసరాన్ని గుర్తించింది.  నగరాల్లో  స్వచ్ఛమైన పాలు దొరకని ఈ కాలంలో స్వచ్చమైన పాలు అందించే ఉద్దేశంతో, 2019లో  నగర శివార్లలో  లీజు తీసుకున్న  రెండెకరాల  భూమిలో,  ‘శ్రీ బాలకృష్ణ డైరీ ఫార్మ్’ (బికేడి మిల్క్)ను ప్రారంభించారు.  అక్కడ జ్యోతి,  ఆమె భర్త ఆవులని స్వేచ్ఛగా తిరగనిచ్చి, నేపియార్ గడ్డి,  గోధుమ గడ్డి,  మిల్లెట్స్ వంటి ఆర్గానిక్ మేతతో పోషించారు.    ఎటువంటి రసాయనాలు లేకుండా స్వచ్ఛమైన A2 పాలను అందించటమే లక్ష్యంగా పెట్టుకుని పని చేశారు.  రసాయన, యంత్ర వినియోగం కూడా లేకుండా సాంప్రదాయ పద్దతుల్లో పాలని తీసి స్వచ్ఛంగా నగరవాసులకి అందించారు. వీరి పాల నాణ్యత బాగుండటంతో అందరూ వీళ్ళ   దగ్గర పాలు తీసుకోవటం మొదలుపెట్టారు. ఈ రోజు బెకేడి మిల్క్ సుమారు 200 మంది కస్టమర్సుని సంపాదించుకుని, సంవత్సరానికి కోటి రూపాయల ఆదాయం పొందగలిగే డైరీగా ఎదిగింది. ఈ ప్రయాణంలో స్వచ్చమైన పాలని స్థిరంగా ఇవ్వటంలోనూ, నైతికతని కాపాడుకోవటంలోనూ ఆమెకున్న నిబద్ధతకి కొత్తతరపు రైతులని, కస్టమర్లని ప్రేరణ కలిగిస్తుంది.  అయితే ఆమె ప్రయాణం అక్కడితోనే ఆపేయకుండా, ఆధునిక రైతు  పరీక్షిత్ తో కలిసి,   ‘కౌ కరెన్సీ’ అనే వినూత్న మోడల్ తో  స్వచ్ఛమైన పాలను కోరుకుంటూ, ఆవుల పెంపకపు భారాన్ని మోయలేని నగర వాసులకు ఒకపరిష్కారం చూపించింది. నగర నివాసులకు పాలు, నెయ్యి అందించే ఈ వినూత్న పథకం ద్వారా గోవును స్వంతం చేసుకునే అవకాశం కల్పించారు. రూ.1,08,000 ప్రారంభ పెట్టుబడితో, మూడు సంవత్సరాల పాటు గోవును ఫార్మ్ నిర్వహిస్తుంది.  వీటితో రోజుకు రెండు లీటర్లు పాలు,  నెలకు రెండు కిలోల నెయ్యి అందజేస్తుంది. ఈ ప్రాజెక్టు దశల వారీగా విస్తరిస్తూ, జ్యోతి ఈ మోడల్‌ను మరింత మెరుగ్గా రూపొందించారు. వ్యవసాయం పట్ల ఆసక్తి ఉన్న పరిక్షిత్, టెక్నాలజీ ద్వారా వ్యవసాయాన్ని సుస్థిరంగా చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈ విధంగా స్వచ్ఛమైన పాల అవసరం నుండి ప్రారంభమైన ఓ తల్లి ప్రయత్నం  వ్యాపారంలా విస్తరించి, దాంతోపాటు  నైతిక వ్యవసాయ విధానాలతో లక్షలాది మంది జీవితాలను ప్రభావితం చేసింది.                                       *రూపశ్రీ 

మన భూమికి మనమే పొగపెడుతున్నామా?

  “ధూమపానం ఆరోగ్యానికి హానికరం” అనే మాట నేడు “గాలి   పీల్చుకోవటం ఆరోగ్యానికి హానికరం” అనేలా మారిపోయిందా?.. అలాగే అనిపిస్తోంది నేటి సమాజంలో ఏర్పడిన పరిస్థితులు, జరుగుతున్న సంఘటనలు చూస్తే అదే నిజమనిపిస్తోంది. డిసెంబర్ 2, 1984న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో యూనియన్ కార్బైడ్ ప్లాంట్ నుండి విషపూరితమైన మిథైల్ ఐసోసయనేట్ గ్యాస్ లీక్ అయింది. ఈ సంఘటన వేల మంది ప్రాణాలు కోల్పోయేలా చేసి, బ్రతికున్న  లక్షలమంది ఆరోగ్యంపై  దీర్ఘకాలిక  ప్రభావాన్ని  కలిగించింది. ఇది ప్రపంచంలోనే అత్యంత దారుణమైన పరిశ్రమ వైపరీత్యాలలో ఒకటిగా గుర్తించబడింది. ఈ సంఘటనలో మృతుల జ్ఞాపకార్థంగానూ, పరిశ్రమల భద్రత గురించి అవగాహన పెంపొందించడంలోనూ,  ఇంకా మున్ముందు అటువంటి విషాదాలు జరగకుండా నివారించేందుకు కాలుష్య నియంత్రణ చాలా అవసరం. ఈ కాలుష్య నియంత్రణ చర్యల ప్రాముఖ్యతను గుర్తు చేయడమే ఉద్దేశ్యంగా ప్రతీ సంవత్సరం జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటాము. 2024 సంవత్సరానికి జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ థీమ్: "శుభ్రమైన గాలి, పచ్చని  భూమి: స్థిరమైన జీవన దిశగా ఒక అడుగు". ఇది పర్యావరణ సమస్యలను ఎదుర్కొనేందుకు శుభ్రమైన గాలి, అందుకోసం తీసుకోవాల్సిన  చర్యల అవసరాన్ని చూపుతుంది. కాలుష్య నియత్రణ  దినోత్సవం సంద్భంగా భోపాల్ గ్యాస్ లీక్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరించుకుని, మరలా అటువంటి విషాదంలో ఏ ఒక్కరి ప్రాణం బలికాకుండా ఉండటానికి ఏమేమి చెయ్యాలో చర్చించుకోవాలి.   ప్రస్తుతం  ఢిల్లీ వంటి ప్రధాన నగరాల పరిస్థితి ఎలా ఉందంటే, బ్రతకటం కోసం పీల్చే గాలే స్లో పాయిజన్లా  నెమ్మదిగా ప్రాణాలు తీసేస్తుంది. అందుకే కాలుష్యం అనేది మన ఆరోగ్యంపై, పర్యావరణంపై, ఆర్థిక వ్యవస్థపై చూపించే  ప్రభావాలను చర్చించి, దానిమీద  అవగాహన పెంపొందించటానికి ప్రయత్నించాలి.  ఏం చేయాలంటే. వ్యర్థ పదార్ధాల  నిర్వహణ, ఉద్గారాల తగ్గింపు, పునరుత్పత్తి శక్తుల వినియోగం వంటి పర్యావరణానికి మేలు చేసే  చర్యలను ప్రోత్సహించాలి.  పరిశ్రమలన్నీ  భద్రతా ప్రమాణాలను పాటించడం ద్వారా భోపాల్ గ్యాస్  వంటి దుర్ఘటనలు మళ్ళీ జరగకుండా నివారించాలి. పచ్చటి భూమి పది కాలాలపాటూ కొనసాగాలంటే ఏ ఒక్కరో ముందుకి వస్తే సరిపోదు, అందరూ కలిసి ఒక సైన్యంగా పనిచేస్తేనే, కాలుష్యపు కోరల్లో చిక్కుకున్న మన భూమాతని కాపాడుకోగలము. భవిష్యత్తు తరాలకి కాలుష్య రహిత గాలినీ, నెలనీ, నీటినీ అందించగలం. దానికోసం మనం చేయాల్సిందల్లా,  కాలుష్యం అనేది కేవలం పర్యావరణ సమస్యే కాదు,  ఇది మొత్తం మానవాళికే సమస్య అన్న నిజాన్ని గ్రహించి అది తగ్గించటానికి మనం ఏం చేయగలమో అటువైపు అడుగులు వేయాలి.  కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా  స్థిరమైన జీవన విధానాలను స్వీకరించడానికి, పర్యావరణాన్ని రక్షించడానికి  ప్రేరణ ఇచ్చే దిశగా నిర్ణయాలు తీసుకుని అటువైపు దృష్టి సారించాలి.  చిన్న మార్పులు పెద్ద తేడాలను తీసుకువస్తాయి. ఈ భూ గ్రహం కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించలి.  కాలుష్యంతో పోరాటం నాతోనే ప్రారంభమవ్వాలని,  ఆ మార్పు నాతోనే మొదలవ్వాలని ప్రతీ ఒక్కరు అనుకుని  ముందడుగు వేయాలి.  స్వచ్ఛమైన గాలి అందరి హక్కు. ఈ కాలుష్య నియంత్రణ ద్వారానే అది సాధ్యమవుతుంది. అందుకే కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా పచ్చటి భూమాత కోసం పనిచేయడం లక్ష్యంగా పెట్టుకోవాల జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం సందర్భంగా, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే  వివిధ కార్యక్రమాల్లో ప్రజలని భాగస్వామ్యం చేయడం ఉత్తమ మార్గం. ఇక్కడ కొన్ని ప్రయోజనకరమైన కార్యక్రమాలు ఉన్నాయి.. చెట్లు నాటే కార్యక్రమాలు: ప్రజలని  చెట్లు నాటటానికి ప్రోత్సహించడం వల్ల గాలి నాణ్యతను మెరుగుపరచడంలో, కార్బన్ డై  ఆక్సైడ్ ను తగ్గించడంలో  సహాయపడతాయి.  శుభ్రతా కార్యక్రమాలు: పార్కులు, నదులు లేదా బీచ్‌ల వంటి ప్రాంతాల్లో శుభ్రతా కార్యక్రమాలు  నిర్వహించి, పరిసరాల శుభ్రత ద్వారా కాలుష్యాన్ని ఎలా తగ్గించవచ్చో తెలియచేయాలి.  అవగాహన కార్యాక్రమాలు: గాలి, నీటి కాలుష్యానికి గల  కారణాలు,  కాలుష్యం వల్ల కలిగే ప్రభావాలు, దాన్ని తగ్గించే మార్గాలను వివరిస్తూ ప్రజలను చైతన్యవంతం చేయడానికి సెమినార్లు, వర్క్ షాప్‌లను నిర్వహించటం.   పర్యావరణ హిత ఉత్పత్తులు పంపిణీ: వ్యాపార సంస్థలు,  వ్యక్తులను రీయూసబుల్ బ్యాగులు, బాటిళ్లు,  స్ట్రాల వంటి ప్లాస్టిక్ రహిత ఉత్పత్తులను అందించి,  స్థిరమైన ఉత్పత్తులను ఉపయోగించడానికి ప్రోత్సహించడం.  చిత్రకళల పోటీలు నిర్వహణ: విద్యార్థులను పర్యావరణ అవగాహనపై పోస్టర్లు లేదా బొమ్మలు రూపొందించేందుకు ప్రోత్సహించాలి.  వర్షపు నీటి సేకరణ :  వర్షపు నీటిని సేకరించి భద్రపరిచే విధానం ద్వారా నీటి పరిరక్షణను ప్రోత్సహించండి. కాంపోస్టింగ్ యూనిట్లను నిర్మించండి: కమ్యూనిటీలకు సేంద్రీయ వ్యర్థాలను సమర్థవంతంగా కాంపోస్ట్ చేయడం వల్ల రసాయన ఎరువుల ద్వారా భూమి కాలుష్యం కాకుండా నివారించవచ్చు. జీరో-వేస్ట్ వర్కుషాప్‌లు నిర్వహణ: వ్యర్థాలను తగ్గించడానికి,  పదార్థాలను పునర్వినియోగం చేసేందుకు ప్రజలను ప్రేరేపించండి. ప్రజా రవాణాను ప్రోత్సహించడం: వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు, కార్బన్  ఉద్గారాలను తగ్గించేందుకు ప్రజలను ప్రేరేపించండి. గ్రీన్ రూఫ్ ప్రాజెక్టులు: భవనాలపై గ్రీన్ రూఫ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా గాలి నాణ్యతను మెరుగుపరచవచ్చు. స్విచ్ ఆఫ్ క్యాంపెయిన్లు: అవసరం లేని లైట్లు, పరికరాలు ఆఫ్ చేయడం ద్వారా శక్తిని ఆదా చేయొచ్చని, ఆదా చేయటం కూడా ఒక రకంగా సృష్టించటమేననే అవగాహన పిల్లలు,పెద్దల్లో కల్పించాలి.    సైకిల్ వినియోగాన్ని ప్రోత్సహించండి: మోటారు వాహనాలపై ఆధారపడకుండా ఉండేందుకు సైక్లింగ్ కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మోటార్ సైకిల్ పొగ ద్వారా జరిగే కాలుష్యం ను తగ్గించవచ్చు. కమ్యూనిటీ గార్డెనింగ్: నగర ప్రాంతాల్లో హరిత ప్రాంతాలను సృష్టించడానికి కమ్యూనిటీ గార్డెన్లను ప్రారంభించడం. సోషల్ మీడియా ప్రచారాలు: సోషల్ మీడియా వేదికలపై ప్రత్యేక హాష్‌ట్యాగ్‌లు సృష్టించి అవగాహన కార్యక్రమాలను విస్తృతంగా వ్యాప్తి చేయడం.  పర్యావరణాన్ని కాపాడటానికి,  కాలుష్యాన్ని తగ్గించటానికి  ప్రజలకు ఉండే బాధ్యతను కాలుష్య నియంత్రణ దినోత్సవం  గుర్తుచేస్తుంది. స్థిరమైన జీవన శైలిని ఆచరించడం, అవగాహన పెంచడం,  సమిష్టిగా పని చేయడం ద్వారా భవిష్యత్ తరాల కోసం మరింత పచ్చదనం,  ఆరోగ్యకరమైన భూమిని అందించవచ్చు.  భూమిని సంరక్షించడంలో  సరైన అడుగులు వేయడానికి మనకి  ఈ రోజు ప్రేరణనివ్వాలి. ప్రకృతి మన బాధ్యత.. మన చర్యలే మన భవిష్యత్తు! అనే విషయం మర్చిపోకండి.                                     *రూపశ్రీ 

ఎయిడ్స్ వస్తే జీవితం అంతే.. కాదు.. బ్రతకడానికి ఇంకా ఎంతో ఉంటుంది..!

  హెచ్ఐవీ ప్రపంచ దేశాలను ఉలిక్కిపడేలా చేసిన ప్రమాదకరమైన జబ్బు.  ఈ జబ్బు నయం కావడానికి మందు లేకపోవడం దీన్ని మరింత ప్రమాదకరమైన జబ్బుల జాబితాలో చేర్చింది.  1990, 2000, 2010 వరకు ఎయిడ్స్ పేరు వెంటే ప్రజలు చాలా గందరగోళానికి గురయ్యేవారు. కానీ కాలక్రమేణా ప్రమాదకరమైన జబ్బులతో సావాసం చేయడం ప్రజలకు అలవాటైపోయింది.  ఎయిడ్స్ గురించి చాలా విస్తృతంగా అవగాహన కల్పించడంలో ప్రభుత్వాలు, స్వచ్చంద సంస్థలు యుద్ద ప్రాతిపదికన పనిచేస్తూ వచ్చాయి. ఫలితంగా ఎయిడ్స్ జబ్బుల గురించి,  ఆ జబ్బు కేసుల గురించి చాలా తగ్గుదల కనిపిస్తోంది.  కానీ ఇంతకాలం గడిచినా ఎయిడ్స్ జబ్బుకు ఎలాంటి మందు కనిపెట్టలేకపోవడం అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం.  ముఖ్యంగా ఎయిడ్స్ అనేది లైంగిక సంబంధాల వల్ల వచ్చే జబ్బు కావడంతో.. నేటి కాలంలో ప్రజలు లైంగిక సంబంధాలు విస్తృతంగా కొనసాగిస్తుండటంతో ఎయిడ్స్ గురించి చాలా అవగాహన, జాగ్రత్త పెరగాల్సిన అవసరం ఉంది.   ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి ఏడూ డిసెంబర్ 1 వ తేదీన జరుపుకుంటారు.  ఈ రోజు ఉద్దేశ్యాలు,  ప్రజలు చేయవలసిన పనులు,  ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలు, స్వచ్చంద సంస్థల లక్ష్యాలు వంటివి తెలుసుకుంటే.. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం ప్రతి సంవత్సరం డిసెంబర్ 1 న జరుగుతుంది. మొదటి ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం 1988 లో జరిగింది. ప్రతి సంవత్సరానికి ఒక థీమ్ ఏర్పాటు చేస్తారు. దీనికి తగినట్టు కార్యక్రమాలు చేపడతారు.  2024 థీమ్.. "సంఘటిత చర్య: హెచ్ఐవీ ప్రగతిని నిలుపుకోవడం మరియు వేగవంతం చేయడం."  2007 నుండి వైట్ హౌస్ నార్త్ పోర్టికో మీద 28 అడుగుల ఎయిడ్స్ రిబ్బన్ ప్రదర్శించబడుతోంది. 1993 నుండి అమెరికా అధ్యక్షులు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంపై అధికార ప్రకటనలు విడుదల చేయడం జరుగుతోంది. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా చేసే కార్యకలాపాలు: హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు,  వ్యాధి వ్యాప్తిని నివారించేందుకు. ప్రజలను చైతన్య పరచడం, ప్రజలలో అవగాహన పెంపొందించడం చాలా ముఖ్యం.  ముఖ్యంగా ఎయిడ్స్ జబ్బు కారణంగా మరణించిన వారిని గౌరవించాలి.  ఇది లైంగిక సంబంధాల వల్ల,  ఎయిడ్స్ ఉన్న వ్యక్తులకు వేసిన ఇంజెక్షన్లు ఆరోగ్యవంతమైన వ్యక్తికి వేయడం వల్ల,  వివిధ రకాల పరీక్షల వల్ల ఒకరి నుండి మరొకరికి సంక్రమిస్తాయి.  అంతే కానీ ఎయిడ్స్ జబ్బు ఉన్న వారి పక్కన కూర్చొన్న,  వారితో మాట్లాడినా వచ్చే జబ్బు కాదు.  కాబట్టి ఈ విషయం తెలుసుకుని ఎయిడ్స్ రోగులను అంటరాని వారుగా చూడటం మానేయాలి.  వారిని సామాజికంగా బహిష్కరణ చేయడం చాలా తప్పని అర్థం చేసుకోవాలి.  ఆరోగ్యకరమైన పరిసరాలలో వారిని ఉంచి సరైన వైద్యం తీసుకుంటూ వారి జీవితం వారు సంతోషంగా గడపడంలో సహాయం చెయ్యాలి. ఎయిడ్స్ జబ్బు వచ్చిన వ్యక్తులు చాలా తొందరగా మరణించడానికి కారణం వారికి సరైన వైద్యం అందకపోవడం.  వారికి సరైన ఆహారం, మందులు అందకపోవడం,  ముఖ్యంగా వారు నివసించే పరిసరాలు,  వారికి సామాజిక తోడ్పాటు లేకపోవడం.  వైద్యం తీసుకోవడంలో ఆర్థిక స్థోమత లేకపోవడం. ఇవన్నీ ఎయిడ్స్ సోకిన వ్యక్తులు తొందరగా మరణించడానికి కారణం అవుతాయి.  అలా కాకుండా ఇవన్నీ వారికి సరైన విధంగా అందితే వారు కూడా ఎక్కువ కాలం సంతోషంగా గడిపే అవకాశం ఉంటుంది. కొత్త హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లను నివారించేందుకు,  హెచ్ఐవీతో జీవిస్తున్న వారికి సేవలను అందించేందుకు  సగటు పౌరుడిగా తమ వంతు బాధ్యత, చేయూత అందించాలి.  కేవలం ఎయిడ్స్ దినోత్సవం రోజునే కాకుండా సాధారణ రోజుల్లోనూ ఇలాంటి జబ్బులున్న వారికి సగటు మనుషులుగా సహాయం చేయాలి.  ఎయిడ్స్ జబ్బు గురించి తెలియని వారికి అవగాహన కల్పించాలి.  ప్రతి ఒక్కరూ ఎయిడ్స్ సోకిన వారిని అంటరానివారుగా చూసే లక్షణం మార్చుకునే దిశగా వారికి హిత బోధ చేయాలి. ప్రాణాలు చాలా విలువైనవి. ప్రాణంతో ఉంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఎంతో సాధించవచ్చు.  ప్రపంచవ్యాప్తంగా 38 మిలియన్ మంది హెచ్ఐవీ వైరస్‌తో జీవిస్తున్నారు. గత 40 ఏళ్లలో హెచ్ఐవీ లేదా ఎయిడ్స్ సంబంధిత వ్యాధుల వల్ల 35 మిలియన్ల మందికి పైగా మరణించారు. తాజా వైద్య పరిజ్ఞానం వల్ల హెచ్ఐవీ ఉన్న వ్యక్తులు దీర్ఘకాల ఆరోగ్య జీవితం గడపవచ్చనే విషయాన్ని వైద్యులు వెల్లడిస్తున్నారు.  హెచ్ఐవీ ఉన్నా సరే.. అందరిలాగే బ్రతకవచ్చని భరోసా ఇస్తున్నారు. ఇలాంటి వ్యక్తులు ముఖ్యంగా మానసికంగా దృఢంగా ఉండాలని చెబుతున్నారు. కాబట్టి ఈ హెచ్ఐవీ దినోత్సవం సందర్భంగా హెచ్ఐవీ మీద అవగాహన,  మానసికంగా దృఢత్వాన్ని పెంచడం,  సమాజంగా వివక్ష లేకుండా చేయడం వంటి కార్యకలాపాలు ప్రోత్సహిస్తే.. ఎయిడ్స్ రోగులు కూడా సమాజంలో బలంగా వారి జీవితాన్ని వారు ఆత్మవిశ్వాసంతో కొనసాగించగలుగుతారు. ఇప్పటికే ఇలా సమస్యతో పోరాడుతూ జీవితాన్ని ఆశాభావంగా గడుపుతున్న వ్యక్తుల గురించి కూడా ఎయిడ్స్ రోగులకు వివరించి చెప్పాలి. దీని వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితం మీద కొత్త ఆశ చిగురిస్తుంది. ఇందుకు ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేయాలి.                            *రూపశ్రీ.

వాడు చెప్పేది నేను వినడం ఏంటి? అనే ఆలోచనలో మీరూ ఉన్నారా? అయితే ఇది చదవండి!

ఎదుటివారు చెప్పేది శ్రద్ధగా వినడమనేది ఎప్పుడో పోయింది. పరుగులు పెట్టే జీవితంలో ఎవరికీ పక్కవాళ్లు చెప్పేది ఎంతటి విషయమైనా సరే ఏకాగ్రతతో వినే తీరిక, ఓపిక - రెండూ లేవు. వాళ్ళ దోవన వాళ్ళు చెప్పుకుపోతుంటే మన దోవన మనం ఏదో ఆలోచిస్తుంటాం. కాలక్షేపం బాతాఖానీలు, కబుర్లూ అయితే మనస్సుపెట్టి వినకపోయినా ఫరవాలేదు కానీ ఇతరత్రా ఏ మంచి విషయమైనా శ్రద్ధగా వినాలి. 'శ్రద్ధావాన్ లభతే జ్ఞానమ్' అని భగవద్గీతలో కృష్ణుడు అంటాడు. అధికారంలో ఉన్నవాళ్ళు, కింద వాళ్ళ పట్ల శ్రద్ధ కనబరిచి వాళ్ళు చెప్పేది సహనంతో వింటే ఉత్తమ పాలకులూ, ఉత్తమ అధికారులూ అవుతారు. నవ విధ భక్తిమార్గాలలో కూడా శ్రవణానికే మొదటి స్థానం కల్పించారు. శ్రవణం సరిగ్గా ఉంటే, మిగిలినవన్నీ తేలిగ్గా సిద్ధిస్తాయి. శ్రవణం అంటే వినడం. ఆ వినడమేదో శ్రద్ధగా వినాలి. భావప్రసారమంటే వ్రాయడం, మాట్లాడడం, సంభాషించడమే కాదు, వినడం కూడా! ఇతరులు చెప్పింది సరిగ్గా వినక పోవడం వల్ల మనఃస్పర్థలు వస్తాయి. 'శ్రద్ధయా శ్రవణం కుర్యాత్. శ్రద్ధతో వినాలని శాస్త్రం చెబుతోంది. శ్రవణమే జ్ఞానానికి తొలి మెట్టు. అది లేకుంటే జ్ఞానం ఉదయించదు. విషయాన్ని కూలంకషంగా తెలుసు కోవాలంటే ఓపిగ్గా వినాలి. ప్రహ్లాదుడి కథ మనందరికీ తెలుసు. తల్లి గర్భంలో ఉన్నప్పుడే నారాయణ మంత్రాన్ని తల్లి లీలావతికి నారదమహర్షి ఉపదేశిస్తుండగా శ్రద్ధగా విన్నాడు కాబట్టే విష్ణుభక్తుల్లో అగ్రగణ్యుడయ్యాడు. వినదగు నెవ్వరు చెప్పిన  వినినంతనె వేగపడక వివరింపదగుస్ కని కల్ల నిజము దెలిసిన  మనుజుడెపో నీతిపరుడు మహిలో సుమతీ! ఎవరు చెప్పినా వినాలి. వినగానే తొందరపడకుండా ముందు వెనుకలు ఆలోచించి, మంచిచెడ్డలు విచారించి, నిజానిజాలు తెలుసుకొని, తెలివిగా వ్యవహరించాలి. అలాంటి వాడే నిజమైన వివేకవంతుడని సుమతీ శతకకారుడు బద్దెన చెప్పాడు. అందరూ అలవరచు కోవలసిన మంచి గుణమిది. ఎవరు ఏం చెప్పి ఉద్రేకాలకు, ఉద్వేగాలకు లోను కాకుండా శాంతంగా వినాలి. వాస్తవ దృక్పథంతో వినాలి. ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో ఏదీ వినకూడదు. అలాగే చెప్పేది పూర్తిగా వినకుండా ఏ నిర్ణయానికీ రాకూడదు. ఎవరైనా ఏదైనా చెబుతున్నప్పుడు మధ్యలో అడ్డుపడడం మంచిది కాదు. అలా చేయడం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ముఖ్యమైన విషయమేదో వినకుండా పోయే ప్రమాదం ఉంటుంది. మనం ఎదుటివారికి ఏదైనా చెబుతున్నప్పుడు వాళ్ళ నుంచి సానుకూల స్పందన కోరుకుంటాం. అలాగే ఎవరైనా! నచ్చితే మెచ్చుకోలు మాట ఏదైనా అనండి. కనీసం తల ఆడించండి. ఓ చిరునవ్వు నవ్వండి. నచ్చకపోతే మాత్రం మెత్తగా, అన్యాపదేశంగా చెప్పండి. కటువుగా చెప్పకండి. దీనిని పాటించడం వల్ల మనకూ చెప్పేవారికీ మధ్య  సదవగాహన, సద్భావన పెరుగుతాయి. అన్నిటికన్నా ముఖ్యం.. వినేవాడికి చెప్పేవాడు లోకువ కాదని తెలుసుకోండి. పక్కవాడు చెప్పేది శ్రద్ధగా వింటేనే మనకు గ్రహణశక్తీ, సహనమూ పెరిగేది. *నిశ్శబ్ద.

కథలు చెప్పడం వల్ల పిల్లలకు నేర్పే దేమిటి??

ప్రస్తుతం ఎదిగే పిల్లలు ఏదైనా చేయాలంటే పెద్దలు చెప్పిన మాట గుర్తు తెచ్చుకుంటారు. కానీ వరించుట్టూ ఉండే స్నేహితులు వారిని వివిధ రకాలుగా మాటలతో మనస్తత్వం మారిపోయేలా చేస్తారు. ఉదాహరణకు… ఓ అబ్బాయి కాలేజీలో చేరాడు. అతడి మిత్రులంతా కలసి సినిమాకు వెళ్ళాలని పథకం వేశారు. అయితే క్లాసులు ఎగ్గొట్టి, పెద్దల అనుమతి లేకుండా సినిమా చూడటం తప్పు అని తల్లిదండ్రులు నేర్పారు ఆ పిల్లవాడికి. కానీ సినిమా చూసినంత మాత్రాన ఏమీ కాదని మిత్రులు ప్రోత్సహిస్తూంటారు. ఎందరో సినిమాలు చూస్తున్నారు. అందరూ పాడైపోతున్నారా? అని వాదిస్తారు. ఇటువంటి పరిస్థితిలో పిల్లవాడు విచక్షణను ఉపయోగించి నిర్ణయం తీసుకోవాలి.  "సినిమాకు వెళ్ళకపోవటం" అంటే పేరెంట్ గెలిచినట్టు "వాళ్ళొద్దంటే మానెయ్యాలా?" అనో "వెళ్ళకపోతే మిత్రులు హేళన చేస్తారనో" సినిమాకు వెళ్తే "చైల్డ్" గెలిచినట్టు. అలా కాక "ఇప్పుడు ఆ సినిమా చూడాల్సిన అవసరం అంతగా లేదు. సినిమా కన్న క్లాసు ప్రాముఖ్యం అధికం" అని విశ్లేషించి నిర్ణయం తీసుకున్నా, "క్లాసులో చెప్పేది చదువుకోవచ్చు, నష్టం కూడదీసుకోగలిగిందే కాబట్టి ఇప్పుడు సినిమా చూసినంత మాత్రాన పెద్దగా నష్టం లేదు" అని తర్కించి నిర్ణయం తీసుకున్నా, "అడల్ట్" పని చేస్తున్నట్టు. ఇలా మానవమనస్తత్వం పని తీరును ఆధునిక మానసికశాస్త్రవేత్తలు వివరిస్తారు. అంటే, ఊహ తెలియని దశ నుంచీ ప్రతీదీ పిల్లవాడిపై ప్రభావం చూపిస్తాయన్నమాట. అటువంటప్పుడు ఉయ్యాలలో నిద్రిస్తున్న పిల్లవాడి కోసం పాడే పాటల ప్రభావం అతడిపై చూపటంలో ఆశ్చర్యం ఉందా! అది అబద్ధం అవుతుందా? పాకే వయసు రాగానే 'చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ' అంటూ నేర్పేవి పనికి రాకుండా పోతాయా? ఆ తరువాత చెప్పే పురాణకథలు, ప్రభావరహితం అవుతాయా? బాల్యంలో కృష్ణుడి అల్లరి చేష్టలు పిల్లవాడి ఊహాప్రపంచానికి రెక్కలనిస్తాయి. తానూ కృష్ణుడిలా సాహసకార్యాలు, అవీ లోకకల్యాణకారకాలైన సాహసకార్యాలు చేయాలన్న తపన పిల్లవాడిలో కలుగుతుంది. ఆ వెంటనే చెప్పే ధ్రువుడి కథ, అష్టావక్రుడి కథ, సత్యహరిశ్చంద్రుడు, హనుమంతుడు, రాముడు, లవకుశుల కథలు పిల్లలకు స్ఫూర్తినిస్తాయి. ముఖ్యంగా హనుమంతుడి కథలు, సాహసాలు సూపర్ మేన్, బ్యాట్ మేన్ లను మరపిస్తాయి. వాటి కన్నా ఆరోగ్యకరమైన వినోదాన్నిచ్చి, ఉన్నతమైన ఆదర్శాన్ని నిలుపుతాయి. పిల్లలను అమితంగా ఆకర్షించే అనేకాంశాలు హనుమంతుడి కథల్లో ఉన్నాయి. అంటే నీతులు చెప్పకుండా, ఉపన్యాసాలు ఇవ్వకుండా కేవలం కథలు చెప్పటం ద్వారా. పిల్లల వ్యక్తిత్వవికాసానికి బీజాలు వేసే వ్యవస్థ అన్నమాట మనది. ఇళ్ళల్లో తల్లికి సమయం లేకపోతే, తాతయ్యనో, నాయనమ్మనో, బాబాయిలో, అత్తయ్యలో, ఎవరో ఒకరు సాయంత్రం కాగానే పిల్లలను పోగేసి కథలు చెప్పేవారు. పురాణకథలతో పాటు జానపదకథలూ వినిపించేవారు. చారిత్రకగాథలు చెప్పేవారు ఆయా కథలు పిల్లలను ఎంతగా ఆకట్టుకునేవంటే మళ్ళీ సాయంత్రం కోసం పిల్లలు ఎదురుచూసేవారు. నెమ్మదిగా ఈ కథలు దేశభక్తుల కథలుగా రూపాంతరం చెందేవి. రాణా ప్రతాప్ త్యాగం, శివాజీ సాహసం, భగత్ సింగ్ బలిదానం, ఝాన్సీలక్ష్మి వీరత్వం..... ఇలా ప్రారంభం నుంచీ పిల్లల ముందు ఉత్తమాలోచనలు, ఉత్తమ ఆదర్శాలు నిలపటం జరిగేది. పిల్లలు పాఠశాలలకు వెళ్ళి కొత్త ప్రపంచద్వారాలు తెరుచుకునేసరికి, ఆ ప్రపంచపు తాకిడిని తట్టుకుని విచక్షణతో నిర్ణయాలు తీసుకునే విజ్ఞానం వారికి అందేది. దాంతో ప్రలోభాలను తట్టుకుని సరైన మార్గం ఎంచుకోగలుగుతాడు పిల్లవాడు. ఇదీ పిల్లలకు కథల వల్ల పెద్దలు నేర్పే మంచి. ఇలాంటి వాటిలో పిల్లలు విలువలు సులువుగా గ్రహిస్తారు. తద్వారా వారిలో స్నేహితులు రెచ్చగొట్టినా అది నాకు అవసరం లేదు, చదువుకోవాలి అనే మాటను ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా చెప్పగలుగుతారు.                                            ◆నిశ్శబ్ద.  

చాణక్యుడు చెప్పిన మాట.. ఇలాంటి వ్యక్తులను ఎప్పుడూ సమస్యలు చుట్టుముడతాయట..!

చాణక్యుడు చంద్రగుప్త చక్రవర్తికి దిశానిర్దేశం చేసిన వ్యక్తిగా అందరికీ సుపరిచితుడు. ఈయన రాజనీతిలో మాత్రమే కాకుండా తాత్విక విషయాలను కూడా చాలా స్పష్టంగా, క్షుణ్ణంగా తన చాణక్య నీతి గ్రంథాలలో వివరించాడు.  ముఖ్యంగా మనిషి అలవాట్లను, మనిషి ప్రవర్తనను చాణక్యుడు చెప్పిన విధానం తెలుసుకుంటే మనుషుల జీవితాలు చాలా మారిపోతాయి.  జీవితంలో ఎప్పుడూ  సమస్యలతో చుట్టు ముట్టే వ్యక్తుల గురించి,  వ్యక్తి ప్రవర్తన గురించి ఆయన కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు.. చాణక్యుడు చెప్పిన కొన్ని పద్యాలు, వాటి భావాలు తెలుసుకుంటే ఆయన చెప్పిన విషయాలు బాగా అర్థమవుతాయి. వ్యవయనర్గతమాకారః శుచయతి| ఒక వ్యక్తి మనసులో ఏముందో అది ఆ వ్యక్తి ముఖంలో స్పష్టంగా వ్యక్తమవుతుందట. అబద్దాలు చెప్పే వ్యక్తుల ముఖంలో కూడా అలాగే ఆ ఉద్దేశాలు వ్యక్తమవుతాయి.  అలాంటి వ్యక్తులు ఏదైనా దాచి పెట్టాలని చూసినా అందులో అర్థం లేదు.. అందరికీ అవి అలా అర్థమైపోతూ ఉంటాయి.  అబద్దం చెప్పే వ్యక్తులు తమ జీవితంలో ఇతరులను మోసం చేస్తున్నామని, ఇతరుల నుండి లాభపడుతున్నామని, కొన్ని సమస్యల నుండి తప్పించుకుంటున్నామని అనుకుంటారు. కానీ అందులో అర్థం లేదు.. ఇలాంటివి చేయడం వల్ల వారికి సమస్యలు ఇంకా పెరుగుతాయే తప్ప తగ్గవు. దాచిన పాపానాం సాక్షిణో మహాభూతాని| రహస్యంగా చేసిన పాపాలకు ఇతరులు ఎవరూ సాక్షులు లేరని చాలామంది సంతోషపడుతుంటారు.  తమకు ఎలాంటి నష్టం జరగదని తమను ప్రశ్నించేవారు ఎవరూ ఉండరని అనుకుంటూ ఉంటారు.  కానీ అలా రహస్యంగా చేసిన పాపాలకు పంచభూతాలే సాక్ష్యాలు.. పంచభూతాలైన భూమి, నీరు,  కాంతి,  వాయువు,  ఆకాశం ఇవన్నీ ప్రతి వ్యక్తి కదలికకు, చేసే తప్పులకు, చేసే మంచి పనులకు కూడా సాక్ష్యులుగా ఉంటాయి. ఆత్మః పాపాత్మైవ ప్రకాశయతి పాపం చేసే వ్యక్తి మనసులో ఎప్పుడూ అశాంతి నెలకొని ఉంటుందట. తను చేసిన తప్పు ఎవరూ చూడకపోయినా, ఎవరికీ తెలియక పోయినా తప్పు చేశాను కదా అనే భావన మనసులో ఉంటుంది.  ఈ భావన అనేది ఎప్పుడూ మనసులో గుర్తుకువస్తూ మనశాంతి లేకుండా చేస్తుంది.  దీని వల్ల మనసు కూడా నిలకడగా ఉండదు. ఎవరైనా తప్పుగా సాక్ష్యం చెబితే.. తప్పుగా సాక్ష్యం చెప్పేవారు ఉంటారు కొందరు. దానివల్ల వారికి కాస్తో కూస్తో లాభం చేకూరుతుందని అలా చేస్తారు. లేదా కొన్ని సార్లు తప్పు సాక్ష్యం చెప్పడం వల్ల తనకు కావలసిన వారు సమస్యల నుండి బయటపడతారని అనుకుంటారు.  కానీ ఇలా తప్పుడు సాక్ష్యాలు చెప్పేవారు నరకానికి వెళతారని ఆచార్య చాణక్యుడు చెప్పుకొచ్చాడు.  అలాంటి వ్యక్తులు అశాంతితో రగిలి పోవడమే కాకుండా.. వారిని ఎప్పుడూ సమస్యలు చుట్టు ముడతాయట. కాబట్టి అబద్దాలు చెప్పడం, తప్పుడు సాక్ష్యాలు చెప్పడం జీవితంలో వ్యక్తిని పతనానికి తీసుకెళుతుందని.                                               *రూపశ్రీ.  

టీనేజ్ అబ్బాయిలు ఒంటరితనం ఫీలవుతారా? అసలు నిజాలు చెప్పిన మాజీ ఐఏఎస్...! 

  సాంకేతికతతో బాగా అనుసంధానమయ్యి, చుట్టూరా స్నేహితులు ఉండే తరం అయినప్పటికీ, ఇప్పటి యువత ఎక్కువగా ఒంటరితనం ఫీలవుతున్నారు. వినోద కార్యక్రమాల్లో  పాల్గొనటంలోనూ, సరదా సందళ్లలోనూ ముందున్నప్పటికీ  టీనేజ్ అబ్బాయిలకి   ఒంటరిననే భావన   ఎందుకు వస్తుంది? అని మీరు   అనుకుంటున్నారా..!   అయితే దీనికి ఎన్నో కారణాలు ఉండవచ్చు, కానీ మాజీ ఐఏఎస్ అధికారయిన వికాస్ దివ్యకీర్తి  వాటిలో కొన్ని ముఖ్యమైన కారణాలను ప్రస్తావించారు.  అందులో ఒకటి ‘కుటుంబ ఒత్తిడి’.. మీరు ఓ టీనేజ్ కొడుకు తల్లిదండ్రులైతే, అతను  ఒంటరితనం ఫీలవ్వటానికి గల  కారణాలను అర్థం చేసుకోవడం చాలా అవసరం. అసలు ఈ టీనేజ్ అబ్బాయిల్లో ఒంటరితనం ఎందుకు పెరుగుతోందో తెలుసుకుందాం.. తల్లిదండ్రుల కలలను నెరవేర్చడానికి ఒత్తిడి: వికాస్ దివ్యకీర్తి  చెప్పినట్లు,  ‘కుటుంబానికి  మద్దతుగా నిలబడాల్సింది అబ్బాయిలే అన్న మాటని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, బయటవాళ్లు అందరూ కలిసి,  ప్రతీ మగపిల్లాడికి  చిన్న వయస్సు నుంచే నూరిపోస్తారు.  తల్లిదండ్రులు వారికి ఇదే విషయాన్ని పదేపదే గుర్తు చేస్తుంటారు కూడా.  తల్లిదండ్రుల రిటైర్మెంట్ తర్వాత ఆర్థికంగా కుటుంబాన్ని నిర్వహించాలనే బాధ్యత అబ్బాయిలకే ఉంటుంది. ఈ ఆలోచనలతో వచ్చే  తీవ్రమైన ఒత్తిడి వల్ల చదువులో వెనకబడితే వారి  జీవితం ఏమైపోతుందోనన్న మానసిక ఆందోళన ముందునుంచే  పట్టుకుంటుంది. తాము చదవలేకపోతున్నామనే విషయాన్ని కూడా వాళ్ళు బయటకి చెప్పుకోలేరు.  దీనివల్ల వారికి మానసిక ఒత్తిడి, ఒంటరిననే భావన  పెరిగిపోతాయి.' 13-19 వయస్సులో పిల్లలు ఎందుకు ఒత్తిడిని అనుభవిస్తారు? వికాస్ దివ్యకీర్తి ప్రకారం, 13-19 వయస్సు గల పిల్లలు ఎక్కువ ఒత్తిడిలో ఉంటారు. ఎందుకంటే ఈ వయసులోనే వాళ్ళు  భవిష్యత్తు కోసం పెద్ద చదువుల వైపు వెళ్ళటమో లేదా  పనిచేయడం ప్రారంభించటమో చేస్తూ ఉంటారు.  కుటుంబ బాధ్యతల ఒత్తిడి కూడా వారికి ఉంటుంది.  తాము పడుతున్న ఈ ఆందోళనలన్నీ తరచుగా ఎవరికీ చెప్పుకోలేరు.  అందువల్ల వారు ఒంటరితనాన్ని అనుభవిస్తారు. టీనేజ్ పిల్లలలో తిరుగుబాటు స్వభావం: 13-19 వయస్సు గల టీనేజ్ అబ్బాయిలు సహజంగా తిరుగుబాటు స్వభావం కలిగి ఉంటారు. మానసికంగా ఎదిగీ ఎదగని వయసు కావటంతో ఈ సమయంలో వారి మనస్సులో అనేక ప్రశ్నలు ఉంటాయి.  కానీ వాటికి సమాధానాలు ఏవీ దొరకవు. అందుకే ప్రతి తల్లిదండ్రులు ఈ దశలో తమ పిల్లల భావాలను అర్థం చేసుకొని మద్దతు ఇవ్వడం చాలా ముఖ్యం. అక్కచెల్లెలు ఉన్న వారే అదృష్టవంతులు: వికాస్ దివ్యకీర్తి ప్రకారం, తమ వయస్సుకి ఇంచుమించు  సమాన వయస్సున్న  అక్క లేదా చెల్లెలు ఉన్న అబ్బాయిలు అదృష్టవంతులు. అలా సమవయస్కులైన అక్కచెల్లెళ్లు అత్యంత సన్నిహితమైన స్నేహితుల్లా ఉండే అవకాశం ఉంటుంది. అప్పుడు అబ్బాయి నిర్మొహమాటంగా, నిస్సంకోచంగా  తమ భావాలను, భయాలని వాళ్ళతో చెప్పుకోవచ్చు.  అక్కచెల్లెలు శ్రద్ధగా వినడమే కాకుండా నిజాయితీగల సలహా కూడా ఇస్తారు. ఇలా అక్కచెల్లెలుతో మాట్లాడటం అబ్బాయి మనసు భారాన్ని తగ్గించి, ఒంటరితనాన్ని తగ్గించగలదు.  టీనేజ్ పిల్లల ఒంటరితనాన్ని ఎలా తగ్గించాలి? అనే విషయంలో నిపుణులు తెలియచేసిన కొన్ని సూచనలు:  1.మీ పిల్లలు ఎటువంటి  భయం లేకుండా తమ భావాలను చెప్పుకునేలా తల్లిదండ్రులు ఒక స్నేహపూర్వక వాతావరణం కల్పించి, పిల్లలతో మంచి సంబంధాలు ఏర్పర్చుకోవాలి.  2.మీ పిల్లలు మీ దగ్గరకు ఏదైనా చెప్పుకోవటానికి రాకముందే, వారి సామాజిక జీవితాన్ని  గమనించండి. వాళ్ళ చుట్టూ ఉన్న పరిస్థితులని అర్ధం చేసుకునే ప్రయత్నం చేయండి.  3.సోషల్ మీడియాని వాళ్ళు ఉపయోగిస్తున్న విధానం మీద ఒక కన్ను వేసి ఉంచి, ఆరోగ్యకరమైన సాంకేతికత వినియోగాన్ని ప్రోత్సహించండి.  స్క్రీన్ టైమ్‌ను తగినట్టు సర్దుబాటు చేసి,  వారి ఆరోగ్యం మీద ప్రభావం పడకుండా  చూడడి.  4.పిల్లలకు చెడు సావాసాలకి దూరంగా ఉంటూ, మంచి సంబంధాలను ఏర్పర్చుకోవటం నేర్పించండి. అలాగే  ఒంటరిగా ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు, పరిస్థితులకి క్రుంగిపోకుండా  ఎలా నిలబడాలో నేర్పించండి.                                                *రూపశ్రీ.

ఈ  పనులు చేస్తే చాలా తొందరగా విజయం మీ సొంతం అవుతుంది..!

విజయం ఒక మనిషిని మరొక మెట్టు పైకి తీసుకెళుతుంది.  ప్రతి వ్యక్తి తాము ఎంచుకున్న రంగంలో, చేసే పనిలో  విజేత కావాలనే కలలు కంటారు.  అయితే కలలు కన్నంత సులువుగా అవి నిజం కావు.. వాటిని సాకారం చేసుకోవడం అనేది కొందరికే సాధ్యం అవుతుంది.  అయితే కేవలం 5 పనులు చేస్తే చాలు.. ప్రతి వ్యక్తి తను అనుకున్న పనులలో విజయాన్ని చాలా తొందరగా అందుకుంటాడని అంటున్నారు. ఇంతకీ ఆ పనులు ఏమిటంటే.. కష్టం.. విజయం సాధించాలన్నా, అనుకున్న లక్ష్యాలు నెరవేరాలన్నా కష్టపడి పని చేయాలని అందరూ అంటారు.  చాలామంది విజయం కోసం కష్టపడతారు.  అయినా సరే  వారికి కూడా విజయం దక్కదు. ఎందుకని వారికి వారే ప్రశ్నించుకుని సతమతం అవుతారు. కాన ఈ 5 పనులు చేస్తే  విజయం సులువుగా తథ్యం అవుతుంది. లక్ష్యాలు.. విజయం సాధించాలంటే లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.  ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకోకుండా ఏ పని చేసినా అది స్పష్టత లేకుండా ఉంటుంది.  అందుకే లక్ష్యాన్ని నిర్థేశించుకున్న తరువాత చేసే పని తొందరగా పూర్తీ చేయవచ్చు. ప్లానింగ్.. పనిలో విజయం సాధించాలంటే లక్ష్యం ఏర్పాటు చేసుకున్న తరువాత దాన్ని చేరుకోవడానికి సరైన ప్రణాళిక అవసరం.  ప్రణాళిక ఉంటే పనిని ఒక క్రమ పద్దతిలో  పూర్తీ చేయవచ్చు. దీని వల్ల సమస్యలు కూడా పెద్దగా అడ్డు రావు. యాక్షన్.. పనిని మొదలు పెట్టాలి అనుకున్న తరువాత ప్రణాళిక తయారు చేసుకున్న తరువాత  దాన్ని వెంటనే మొదలు పెట్టాలి.  రేపు,  ఎల్లుండి అని దాన్ని వాయిదా వేస్తూ కాలయాపన చేయకూడదు. దీని వల్ల పని భారం పెరగదు. సమయం.. విజయం సాధించడంలో సమయం కీలక పాత్ర పోషిస్తుంది.  సమయానికి విలువ ఇచ్చే వ్యక్తి  విజయం సాధిస్తారు.  పనిని ప్రణాళిక పరంగా పూర్తీ చేయగలరు. యాక్టివిటీ.. చురుగ్గా ఉండటం వల్ల పనులు సులువుగా చేయగలుగుతారు. పనులలో విజయాన్ని సాధించడానికి వ్యక్తులు చురుగ్గా ఉండటం చాలా అవసరం.   ఇందుకోసం మానసికంగా, శారీరకంగా ఫిట్ గా ఉండాలి. ఇవన్నీ చాలా సింపుల్ విషయాలు. వీటిని చేసే పనిలో అమలు చేస్తే విజయం సాధించడం సులభం.                                       *రూపశ్రీ.

పేరెంట్స్ జాగ్రత్త.. తండ్రిని చూసి పిల్లలు నేర్చుకునే అలవాట్లు ఇవీ.. !

పిల్లలకు తమ తండ్రే మొదటి హీరో.. సాధారణంగానే పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు.  తల్లిదండ్రులు చేసే పనులను తాము కూడా  అలవాటు చేసుకుంటారు. అందుకే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల ప్రవర్తన కీలకపాత్ర పోషిస్తుందని చెబుతారు.  కానీ కొన్ని పనులు తండ్రులు మాత్రమే చేసేవి ఉంటాయి.  వాటిని పిల్లలు కూడా నేర్చుకుంటారు.  చిన్నతనంలో నేర్చుకునే కొన్ని విషయాలు పిల్లలు జీవితాంతం పాటించేవిగా ఉంటాయి.  అలాంటి కొన్ని అలవాట్లు తల్లిదండ్రుల నుండి కూడా నేర్చుకుంటారు.  ఇంతకీ పిల్లలు తండ్రి నుండి నేర్చుకునే అలవాట్లు ఏమిటి? పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే తల్లిదండ్రుల ప్రవర్తన ఎలా ఉండాలి? ప్రతి తండ్రి తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు ఇక్కడున్నాయి. గౌరవం.. ఇతరులను గౌరవించడం అనేది పిల్లలు తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు.  ముఖ్యంగా తండ్రి ప్రవర్తన ద్వారా ఇది పిల్లలకు ఎక్కువగా అలవడుతుంది. ఎందుకంటే ఇంటి పెద్దగా తండ్రిని భావిస్తారు.  బయటి వారి నుండి పెద్దలు,  కుటుంబ సభ్యులు,  చివరకు భార్య,  పిల్లలను గౌరవించడం అనేది కూడా అతను చేయాల్సిందే.. ఒక మగవాడు ఇలా అందరినీ గౌరవిస్తూ ఉంటే అతని పిల్లలు కూడా గౌరవించడాన్ని నేర్చుకుంటారు.  కానీ కొందరు మగవారు పురుషాహంకారంతో అసభ్యంగా, కఠినంగా,   అవమానకరంగా మాట్లాడితే పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు. ఆత్మవిశ్వాసం.. కుటుంబాన్ని తన భుజాల మీద మోసేది తండ్రి.  తన భాద్యతగా భార్య, పిల్లలు,  తల్లిదండ్రులను చూసుకోవాల్సిన వ్యక్తి అతనే.. కష్ట సమయాలలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పడం నుండి సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవడం వరకు అతని ఆత్మవిశ్వాసమే పిల్లలకు ప్రేరణ అవుతుంది.  పిల్లలు కూడా తమ జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని ప్రోగు చేసుకుంటారు. ఇతరుల మాట వినడం.. తను మగవాడు.. పైగా ఇంటికి పెద్ద.. ఇంటి బరువు భాద్యతలు మోస్తున్నవాడు.. అలాంటి వాడు ఇతరుల మాట వెంటే చిన్నతనమైపోతాడు అనే ఫీలింగ్ చాలా మంది మగవారికి ఉంటుంది. కానీ ఇది చాలా తప్పు.. మొదట భార్య మాట,  తల్లిదండ్రుల మాట తరువాత మంచి చెప్పే ఎవరి మాట అయినా వినాలి.  ఇలా వినే స్వభావం అతనికి ఉంటే అతన్ని చూసి పిల్లలు కూడా నేర్చుకుంటారు. అతను ఎవ్వరిమాట లెక్క చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటే పిల్లలు కూడా ఎవరి మాట వినకుండా నిర్లక్ష్యంగా తయారవుతారు. శారీరక శ్రద్ద.. ఇప్పటి జీవనశైలిని అనుసరించి ప్రతి ఒక్కరికి శారీరక శ్రమ అవసరం. ముఖ్యంగా వయసు పెరిగే కొద్ది శారీక కార్యకలాపాలలో భాగం కావాలి.  ఇప్పట్లో శారీరక శ్రమ తక్కువ,  మానసిక శ్రమ ఎక్కువ. కాబట్టి వీలు చూసుకుని శారీరక వ్యాయామం, నడక,  ఫిట్ నెస్ కార్యాచరణలో నిమగ్నం అవ్వాలి. దీన్నిచూసి పిల్లలు కూడా శారీరక ఫిట్ నెస్ మీద శ్రద్ద చూపిస్తారు. కుదిరితే పిల్లలతో కలసి ఫిట్‌నెస్ కార్యకలాపాలు కొనసాగించాలి. ఇంటి పనులు.. కొంతమంది మగవారు ఈ పనులు ఆడవారే చెయ్యాలి..  ఈ పనులు మగవారే చెయ్యాలి అనే గీత గీసుకుని ఉంటారు. ఇంతకు ముందుకాలంలో ఉద్యోగం చేసే మహిళలు తక్కువ. కానీ ఇప్పటి కాలం మహిళలు ఉద్యోగాలు చేస్తూ  ఇంటి పనులు చక్కబెడుతుంటారు.  మహిళలకు చేదోడుగా మగవారు కూడా పనులలో భాగస్వామ్యం అవుతుంటే దాన్ని చూసి పిల్లలు కూడా తల్లికి సహాయపడటం, ఇంటి పనులు చేయడం నేర్చుకుంటారు. భర్త పిల్లలు ఇంటి పనులలో సహాయపడితే ఏ భార్య అయినా తృప్తిగా, సంతోషంగా ఉంటుంది. అలాంటి ఇల్లు కూడా ఎప్పుడూ సంతోషంతో కళకళలాడుతూ ఉంటుంది. పైగా పనులు కూడా చాలా తొందరగా పూర్తవుతాయి. దీని వల్ల ఇంటిల్లిపాది కలసి సంతోషంగా గడపడానికి సమయం కూడా దొరుకుతుంది.                                                  *రూపశ్రీ.