వాలంటైన్స్ వీక్ మొదటి రోజే రోజ్ డే జరుపుకుంటారు ఇందుకే..!

ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 7న రోజ్ డే జరుపుకుంటారు. ఇది వాలెంటైన్స్ వీక్ ప్రారంభంలో మొదటి రోజు. ఈ రోజున, ప్రేమికులు, స్నేహితులు,  బంధువులు తమ ఆప్యాయత,  భావాలను వ్యక్తీకరించడానికి గులాబీలను ఇస్తారు. రోజ్ డే కేవలం ప్రేమికులకు మాత్రమే కాదు, స్నేహం, సామరస్యం ,  శాంతికి చిహ్నం కూడా. చిన్న చిన్న సంజ్ఞలతో మన సంబంధాలను బలోపేతం చేసుకోవచ్చని ఈ రోజు మనకు బోధిస్తుంది. రోజ్ డే ఎందుకు జరుపుకుంటాము? రోమన్ రాజు క్లాడియస్ II (3వ శతాబ్దం) పాలనలో ప్రేమ,  వివాహాలను ప్రోత్సహించడానికి సెయింట్ వాలెంటైన్ పోరాడాడని నమ్ముతారు. ఈ కారణంగా అతను శిక్షించబడ్డాడు కూడా.  అతని ప్రేమ,  త్యాగం జ్ఞాపకార్థం వాలెంటైన్స్ వీక్ జరుపుకోవడం ప్రారంభమైంది, దీనిలో మొదటి రోజు రోజ్ డే. రోజ్ డే ప్రాముఖ్యత.. గులాబీని ప్రేమ, స్నేహం,  భావోద్వేగాలకు చిహ్నంగా చూస్తారు. వివిధ రంగుల గులాబీలు వివిధ భావోద్వేగాలను సూచిస్తాయి.  ఉదా.. ఎర్ర గులాబీలు నిజమైన  ప్రేమకు చిహ్నం. పసుపు గులాబీని స్నేహం,  ఆనందానికి చిహ్నంగా భావిస్తారు. తెల్ల గులాబీలను శాంతికి,  నూతన ప్రారంభాలకు చిహ్నంగా పరిగణించవచ్చు. గులాబీ రంగు  గులాబీలు కృతజ్ఞతను,  ప్రశంసలను సూచిస్తాయి. నారింజ రంగు గులాబీలు అభిరుచి, ఉత్సాహం,  ఆకర్షణను సూచిస్తాయి. అర్థమైందా.. రోజ్ డే రోజు గులాబీని ప్రేమికులకు మాత్రమే ఇవ్వాలనే రూల్ లేదు. ప్రియమైన వారికి, ఆత్మీయులకు, మనకు ప్రత్యేకం అనుకున్న ఎవరికైనా పైన చెప్పుకున్న రంగులను అనుసరించి గులాబీలు ఇవ్వవచ్చు.                                                 *రూపశ్రీ.

తియ్యని చాక్లెట్ డే.. ఆరోగ్యానికి ఆరోగ్యం.. ప్రేమకు ప్రేమ..!

  వాలెంటైన్స్ డే హవా సాగుతోంది. దేశ వ్యాప్తంగానే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా కూడా వాలంటైన్స్ వీక్ ను చాలా గొప్పగా జరుపుకుంటారు. నిజం చెప్పాలంటే విదేశాలలోనే వాలంటైన్స్ వీక్ ను బాగా గ్రాండ్ గా జరుపుకుంటారు.  అయితే వాలంటైన్స్ వీక్ లో భాగంగా  మూడవ రోజును టాక్లెట్ డే గా జరుపుకుంటారు. వాలెంటైన్స్ వారంలో మూడవ రోజు అంటే ఫిబ్రవరి 9న చాక్లెట్ డే జరుపుకుంటారు. చాక్లెట్  తీపిని ప్రేమ  మాధుర్యానికి చిహ్నంగా చూస్తారు. ఇది ప్రేమ, అనురాగాన్ని పెంచుతుంది. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే.. మరొక కోణంలో చూస్తే కానీ చాక్లెట్ గుండెకు చాలా మంచిది.  అంతేకాదు మెదడు, చర్మ ఆరోగ్యంపై కూడా  ప్రభావాన్ని చూపుతుంది.  చాక్లెట్ ఆరోగ్యానికి మంచిది, దానిని సరైన పరిమాణంలో, సరైన రకంలో తింటే ఆరోగ్యానికి ఉత్తమమైనది. అయితే అతిగా తియ్యగా  ఉండే చాక్లెట్‌కు దూరంగా ఉండాలి. చాక్లెట్‌ను సమతుల్య పద్ధతిలో తీసుకుంటే, అది గుండె, మెదడు, చర్మం..  ఇలా  మొత్తం ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది. డార్క్ చాక్లెట్ కే ఓటు.. వాలంటైన్స్ వీక్ లో భాగంగా ప్రేమికులు తమ బంధానికి గుర్తుగా చాక్లెట్ లు ఇచ్చి పుచ్చుకుంటారు. అయితే చాక్లెట్ లో కూడా డార్క్ చాక్లెట్ ఏ బెస్టు.. ఎందుకంటే డార్క్ చాక్లెట్ వల్ల ఆరోగ్యం బేషుగా ఉంటుంది.  ఎప్పుడైనా చిరాకుగా అనిపిస్తే ఒక ముక్క డార్క్ చాక్లెట్ తింటే వెంటనే  యాక్టీవ్ అయిపోచ్చట. చాక్లెట్ ఏ ఎందుకు? వాలెంటైన్స్ వీక్ లో చాక్లెట్ డేను ఎందుకు ఏర్పాటు చేసారు?  మన లడ్డు లేదా పాయసం లాంటివి ఎందుకు లేవు అనే డౌట్ కూడా వస్తుంది.  ఇది పూర్తీగా విదేశీయుల వేడుక. విదేశాలలో తీపి అంటే చాక్లెట్ ఏ.. వారి ఆహారంలో కూడా చాలా వరకు చాక్లెట్ ఆధారిత పదార్థాలు ఉంటాయి.  చాక్లెట్ సాస్,  చాక్లెట్ కేక్, చాక్లెట్ పుడ్డింగ్, చాక్లెట్ బ్రెడ్.. ఇలా అన్నివిధాలుగా చాక్లెట్ భాగం. ఇక చాక్లెట్ ఉత్పత్తి కూడా విదేశాలలో ఎక్కువ. దీనికి తగినట్టు చాక్లెట్ తయారీకి ఉపయోగించే కోకో బీన్స్ ఉత్పత్తి కూడా అక్కడే ఎక్కువ. దాన్నే ప్రపంచ మార్కెట్ గా ఇలా మార్చేశారు.  ఇక ఈ చాక్లెట్ లలో డార్క్ చాక్లెట్ తినడం వల్ల బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. డార్క్ చాక్లెట్ లో  ఫ్లేవనాయిడ్లు,  యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. దీనిలో లభించే ఫ్లేవనాల్స్ శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని పెంచడానికి ధమనుల లైనింగ్‌ను ప్రేరేపిస్తాయి. నైట్రిక్ ఆక్సైడ్ ధమనులను సడలించి, రక్త ప్రవాహానికి అడ్డు లేకుండా సాఫీగా జరిగేలా చేస్తుంది.  దీనివల్ల రక్తపోటు ప్రమాదం తగ్గుతుంది.  ఇది కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. కోకో బీన్స్,  డార్క్ చాక్లెట్ రక్త ప్రసరణ,  రక్తపోటు స్థాయిలను మెరుగుపరుస్తాయి. మానసిక స్థితిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.. చాక్లెట్‌లో సెరోటోనిన్,  డోపమైన్‌ను పెంచే అంశాలు ఉంటాయి. ఇవి ఒత్తిడి,  నిరాశను తగ్గిస్తాయి. డార్క్ చాక్లెట్ మెదడు పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది మెదడు పనితీరును పెంచడం ద్వారా ఏకాగ్రత,  జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.   డార్క్ చాక్లెట్‌ను దాదాపు 5 రోజుల పాటు రోజూ ఓ ముక్క అయినా తినడం వల్ల మెదడుకు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అలాగని అతిగా తినకూడదు. రోగనిరోధక శక్తి మరియు జీర్ణక్రియను బలపరుస్తుంది.. చాక్లెట్‌లో ఉండే ఫైబర్,  ఖనిజాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి. చర్మం,  జుట్టుకు మేలు చేస్తుంది.. డార్క్ చాక్లెట్‌లో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని UV కిరణాల నుండి రక్షించి యవ్వనంగా ఉంచుతాయి. చర్మానికి రక్త ప్రసరణను మెరుగుపరచడంలో డార్క్ చాక్లెట్ కూడా ప్రభావవంతంగా ఉంటుంది. ఇందులో లభించే బయోయాక్టివ్ సమ్మేళనాలు చర్మానికి కూడా గొప్పగా సహాయపడతాయి. చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచడంలో డార్క్ చాక్లెట్ కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.   డార్క్ చాక్లెట్ సరైన మొత్తంలో తీసుకోవడం వల్ల  జుట్టుకు పోషణనిచ్చి బలంగా,  మెరిసేలా చేస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది.. డార్క్ చాక్లెట్ తింటే జీవక్రియ మెరుగుపడుతుంది, ఇది కడుపుని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది.  ఆకలిని నియంత్రించడంలో సహాయపడుతుంది. నష్టాలు కూడా.. డార్క్ చాక్లెట్ వల్ల లాభాలే కాదు  నష్టాలు కూడా ఉంటాయి.  సరైన మొత్తంలో డార్క్ చాక్లెట్ తింటే బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. కానీ అదనపు చక్కెరతో కూడిన చాక్లెట్ బరువు పెరగడానికి దారితీస్తుంది. పాలు,  తెల్ల చాక్లెట్లలో ఎక్కువ చక్కెర, కొవ్వు ఉంటాయి, ఇది బరువు పెరగడానికి కారణమవుతుంది. తీపి చాక్లెట్లు ఎక్కువగా తినడం వల్ల రక్తంలో చక్కెర పెరుగుతుంది, ఇది మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. కొంతమందికి చాక్లెట్ తినడం వల్ల తలనొప్పి (మైగ్రేన్లు) రావచ్చు, ముఖ్యంగా  కెఫిన్ లేదా థియోబ్రోమిన్‌కు అంటే శరీరానికి పడని వారికి ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఇస్తుంది. చాక్లెట్ ఎక్కువగా తినడం వల్ల అసిడిటీ,  కడుపులో చికాకు కలుగుతుంది. చిన్న పిల్లలకు అతిగా తీపి చాక్లెట్ ఇవ్వడం వల్ల దంతక్షయం,  హైపర్యాక్టివిటీ ఏర్పడతాయి. చూశారా వాలంటైన్ వీక్ లో ఎంతో హ్యాపీగా తియ్యగా వేడుక చేసుకునే వారు ఆ చాక్లెట్ పర్యవసానాలు  కూడా ఆలోచించుకోవాలి మరి.                                                 *రూపశ్రీ. 

వాలెంటైన్స్ వీక్ లో ప్రపోజ్ డే ఎందుకు జరుపుకుంటారంటే..!

  ఫిబ్రవరి 7 నుండి వాలెంటైన్స్ వీక్ ప్రారంభమవుతుంది. ఈ ప్రేమ వారంలోని రెండవ రోజున ప్రపోజ్ డే జరుపుకుంటారు. తమ ప్రేమికుడికి తమ భావాలను వ్యక్తపరచాలనుకునే వారికి ఈ రోజు ప్రత్యేకమైనది. ప్రేమను వ్యక్తపరచడానికి ఇది ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ప్రేమికులు తమ భాగస్వామిని వివాహం చేసుకోమని అడగడం లేదా తమ మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేయడం కోసం ప్రతిపాదిస్తారు. ఇది వారి సంబంధానికి కొత్త ప్రారంభాన్ని సూచిస్తుంది. ప్రపోజ్ డే అనేది  ప్రేమను బహిరంగంగా వ్యక్తీకరించడానికి ఒక ప్రత్యేక అవకాశం. తమ సంబంధానికి కొత్త పేరు పెట్టాలనుకునే వారికి ఇది ఒక ముఖ్యమైన రోజు. అయితే, ప్రపోజ్ చేసే సంప్రదాయం ఎక్కడి నుండి మొదలైంది?  ఎందుకు, ఎప్పటి నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారో తెలుసుకుంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ప్రపోజ్ డే వాలంటైన్స్ వీక్‌తో నేరుగా ముడిపడి ఉంది. యూరప్,  అమెరికాలో..  18, 19వ శతాబ్దాలలో, పురుషులు అధికారికంగా ఉంగరంతో వివాహాన్ని ప్రతిపాదించారు. 20వ శతాబ్దం చివరలో వాలెంటైన్స్ వీక్  ప్రజాదరణ పెరగడంతో, ప్రపోజ్ డే కూడా ప్రత్యేక ప్రాముఖ్యతను సంతరించుకుంది. పాశ్చాత్య సంస్కృతిలో పాత కాలంలో, పురుషులు మోకాళ్లపై కూర్చుని తాము ఇష్టపడిన అమ్మాయిలకు వివాహం కోసం ప్రపోజ్ చేసేవారు. అయితే ఈ సంప్రదాయం నేటికీ పాటిస్తారు. ఇది జంట మధ్య ప్రేమను పెంచుతుంది. భారతదేశంలో కూడా, గత కొన్ని దశాబ్దాలుగా వాలంటైన్స్ వీక్‌తో పాటు ప్రపోజ్ డే ట్రెండ్ చాలా పెరిగింది.  చాలా కాలంగా ఎవరినైనా ఇష్టపడి, తమ భావాలను వ్యక్తపరచలేని వారికి ఈ రోజు సరైన అవకాశం. ఎందుకంటే ఈ ప్రపోజ్ డే అనేక కొత్త సంబంధాలకు నాంది పలుకుతుంది, ఇక్కడ ఇద్దరు వ్యక్తులు తమ ప్రేమను మనస్ఫూర్తిగా  అంగీకరిస్తారు. ఇప్పటికే సంబంధంలో ఉన్నవారు  తన లైఫ్ పార్ట్నర్ ను స్పెషల్ గా భావించడానికి,   సంబంధాన్ని బలోపేతం చేయడానికి ప్రపోజ్ డే భలే మంచి అవకాశం ఇస్తుంది.  

కాలాన్ని ఆదా చేసే కళ ఇదిగో!

మనిషి జీవితంలో విజయం అనేది స్థాయిని పెంచుతుంది.  సమాజంలో పేరు, ప్రతిష్టలు, గౌరవం మొదలైనవి సంపాదించి పెడుతుంది. విజయం గురించి అందరికీ తెలిసిన విషయాలు ఇవి. అయితే విజయం సాధించిన వ్యక్తికి మాత్రం కష్టం అంటే ఏమిటి?? కష్టం ఎలా ఉంటుంది?? కష్టం తరువాత విజయం ఎలాంటి అనుభూతిని ఇస్తుంది?? విజయ సూత్రం ఏంటి?? ఇలాంటి విషయాలు తెలిసి ఉంటాయి.  ఒక విజేతను "మీ విజయరహస్యం ఏమిటి?" అని ప్రశ్నించినప్పుడు  "నేను జీవితంలో  విజయాలు సాధించడానికి కారణం నిర్ణీత సమయానికి పావుగంట ముందుగానే హాజరు కావటమే” అని అన్నాడట! మనిషి ఎన్నో ఏర్పాట్లు చేసుకున్నా, ఎంత కష్టపడేతత్వం ఉన్నా చేసే పని ఇంకా మిగిలుందే అని కాలాన్ని పట్టుకుని ఆపలేడు. నిరంతర ప్రవాహిని లాగా కాలం అలా సాగిపోతూ ఉంటుంది. అయితే చేసే పనిపట్ల అవగాహన పెంచుకుంటే కాలాన్ని ఆదా చేయవచ్చు. నిర్ణీత సమయంలో పని పూర్తి కావాలంటే ఆ పనిని వేగంగా, సమర్థవంతంగా చేయడం ఒకటే మార్గం. చేసే పని గురించి అవగాహన పెంచుకుంటే సమయాన్ని ఆదా చేసే కళ తెలుస్తుంది. సమయాన్ని ఆదా చేయడం కూడా ఒక కళనా అని అనిపిస్తుందేమో!!  కాలాన్ని ఆదా చేయడమనే కళ!! మనం నిత్యం చేయవలసిన పనులను అన్నిటినీ ఒక క్రమపద్ధతిలో రూపొందించుకోవాలి. ఈ ప్రక్రియనే కాలాన్ని ఆదాచేసే కళ అంటారు. క్రమపద్ధతిలో రూపొందించుకోవడం అంటే ప్రతిరోజూ చెయ్యాల్సిన పనులను సమయ ప్రణాళిక వేసుకుని ఒక పట్టిక రూపొందించుకోవడం. అయితే ఇలా రూపాందించుకోవటంతోనే సమేక్మ్ ఆదా అయిపోదు. రూపొందించుకున్న ప్రణాళికను ఆచరణలో పెట్టాలి. ఆచరించినప్పుడే సరైన ఫలితం. దక్కుతుంది.   “నిన్న జరిగిన దానిని గురించి అదేపనిగా ఆలోచిస్తూ ఈ రోజు కూడా వృధా చేసుకోవటం నిరర్ధకం. నిన్నటికంటే ఈరోజు మనిషిలో ఆలోచనాపరంగా బుద్ధి వికాసం కలగాలి. అలా కలగకపోతే  మన జీవితంలో మరొక రోజు వ్యర్ధమవుతుంది అనే విషయం తెలుసుకోవాలి. ఈరోజు మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. దాన్ని ఎంత గొప్పగా, ఎంత సమర్థవంతంగా వినియోగించుకుంటాం అనేది మన ఆలోచనపైనే ఆధారపడి ఉంటుంది.  గడిచి పోయిన క్షణాలు తిరిగిరావు, అలాంటప్పుడు గడిచిపోయిన కాలంలో ఎలాంటి బాధపెట్టే విషయాలు ఉన్నా వాటిని తలచుకుంటూ బాధపడకూడదు.  ఏపుగా పెరిగిన పైరుని కోయకపోతే దాని పరమార్ధం దెబ్బ తింటుంది. అలాగే వికసించిన పూలను కోసుకోకపోతే వాటి ప్రయోజనమే దెబ్బ తింటుంది. అదే విధంగా వయస్సులో ఉన్నప్పుడే కష్టపడాలి. ఎందుకంటే ఆలస్యమయితే కాలం మన చేతిలో ఉండదు. గడిచిపోయే ప్రతి నిమిషం తన విలువను గుర్తుచేసే సందర్భాలు భవిష్యత్తులో అప్పుడప్పుడూ ఎదురవుతాయి. ఆ సందర్భాలలో " అయ్యో!! అప్పుడు ఆ కాలాన్ని అలా వృధా చేయకపోతే ఇప్పుడు ఇలా కలలను కోల్పోయి ఉండను కదా!!" అనుకునేలా ఉంటుంది మనసు పరిస్థితి. ఈ సెకను, ఈ నిమిషం, ఈ రోజు నాది. నేను ఏ పనినైనా చేయగలను అనుకునేవాడిదే ఈ ప్రపంచం. కాలానికి ఎదురుపడి ప్రయాణం చేసేవాడే విజేత. ఎదురు గాలిలోనే గాలిపటం పైకి లేస్తుంది అనే విషయం మర్చిపోకూడదు. కాలాన్ని సరిగా అర్ధం చేసుకున్నవాడే జీవితాన్ని సద్వినియోగం చేసుకోగలడు.  మనం నిమిషాల గురించి జాగ్రత్త పడితే గంటలు అవే జాగ్రత్త పడతాయి. రూపాయలను పొదుపుచేస్తే వేలు అయినట్టు, కాలం ఆ విధంగానే పొదుపు అవుతుంది. కాలాన్ని దుర్వినియోగం చేసుకునే వారు ఎప్పుడూ పరాజితులుగా మిగిలిపోతారు. మరికొందరు పరాజయానికి, కాలం వృధా అవ్వడానికి సాకులు వెతికి వాటిని చూపిస్తుంటారు. వాటివల్ల ఇతరులను నమ్మించగలరేమో కానీ అలా తనని తాను మభ్యపెట్టుకోవడం తనని తాను మోసం చేసుకోవడం అవుతుంది. దానివల్ల ఇతరులకంటే అలా సాకులు చెప్పేవారికే నష్టం. అందుకే   ప్రతి ఒక్కరూ కూడా కాలాన్ని ఆదా చేసే కళ నేర్చుకుంటే జీవితంలో విజేతలుగా గుర్తించబడతారు.                                        ◆నిశ్శబ్ద.

పాత తరపు విలువల పాఠశాల, ఈ బుర్ర కథ వేదిక.....

  ఇప్పటి రోజుల్లో టీ.వీ, సినిమాలు, సోషల్ మీడియా, రికార్డింగ్ డ్యాన్సుల మైకంలో పడిన జనాలకి   ప్రాచీన జానపద కళారూపమైన బుర్రకథ విలువ తెలియట్లేదేమో కానీ, ఒకప్పుడు ఊరిలో బుర్రకథ ఉందంటే చాలు  పిల్లా పిచ్చుకతో సహా ఊరు ఊరంతా ఆ స్టేజి ముందే వాలిపోయేవారు. అప్పట్లో బుర్ర కథని మించిన వినోదం లేదనే చెప్పాలి. అలాంటి బుర్రకథకు కొత్త జీవం పోసి, మెరుగులు దిద్ది, ప్రత్యేక ఆహార్యంతో తగిన హావ భావలతో ఎన్నో ప్రదర్శనలిచ్చి బుర్రకథా ప్రక్రియకు విస్తృత ప్రచారం కల్పించిన  షేక్ నాజర్ ఒక గొప్ప నటుడు, ప్రజారచయిత, గాయకుడు.   బుర్రకథ కోసం ఆయన  చేసిన కృషివల్ల  బుర్రకథా పితామహుడయ్యాడు.  “ఈ గండపెండేరాలూ, ఊరేగింపులూ,సన్మానాలూ, పద్మశ్రీలూ అన్నీ కలిపి, నాకు జనం వేసే ఒక్క ఈలతో సాటి కాదు" అని తన కళను ప్రజా ప్రయోజనానికే అంకితం చేసిన ప్రజా కళాకారుడాయన.. ఈ రోజు ఆయన జన్మదిన సంధర్భంగా ఆయన గురించి తెలుసుకుంటే.....  షేక్ నాజర్ జీవిత విశేషాలు..... ఆయన గుంటూరు జిల్లా పొన్నెకల్లు గ్రామంలో ఓ పేద  ముస్లిం కుటుంబంలో, 1920, ఫిబ్రవరి 5 వ తేదీన జన్మించారు. నాజరు పూర్తి పేరు "షేక్ నాజరు వలి". అతను కృష్ణలీలలో దేవకి, శ్రీ కృష్ణ తులాభారంలో రుక్మిణి, భక్త రామదాసులో ఛాందిని వంటి ఆడవేషాలు వేసి మెప్పించారు. హార్మోనిస్టు ఖాదర్ అతనిని "మురుగుళ్ళ" వద్ద సంగీతం నేర్చుకోవాలని అప్పగించాడు. కానీ పేదరికం వల్ల నాజర్ అక్కడ  ఉండలేకపోయాడు. తరువాత అతను బాలమహ్మదీయ సభ పేరిట మళ్ళీ నాటకాలాడి మంచిపేరు తెచ్చుకున్నాడు. టైలరుగా కూడా పని చేశాడు.  ఆర్యమత సిద్ధాంతం నచ్చటంతో మాంసాహారం తినటం మానేసాడు. పాదుకా పట్టాభిషేకంలో కైకేయి, ఖిల్జీ రాజ్యపతనంలో కమలారాణి పాత్రలు పోషించాడు. కొమ్మినేని బసవయ్య గారి పిల్లలకు సంగీతం నేర్పటం, నాటకాలు ఆడించడం ద్వారా సంగీత గురువయ్యాడు. తెనాలిలోని బాలరత్న నాటక సమాజంలో ప్రారంభమైన నాజర్ కథాకథన ప్రస్థానం నాలుగు దశాబ్దాలు సాగింది. కమ్యూనిస్టు పార్టీలోచేరి ప్రజానాట్యమండలి వేదిక ద్వారా పార్టీ సిద్ధాంతాలను, కార్యక్రమాలను బుర్రకథల ద్వారా ప్రచారం చేశాడు.  పల్నాటి యుద్ధం, వీరాభిమన్యు, బొబ్బిలి యుద్ధం, అల్లూరి సీతారామరాజు, ప్రహ్లాద, క్రీస్తు, బెంగాల్ కరువు మొదలగు చారిత్రక కథలకి  సమకాలీన రాజకీయాలు జోడించి బుర్రకథలు రూపొందించాడు.   నాజర్‌ ఆత్మకథ  ‘పింజారి’ చిన్న పుస్తకమే అయినప్పటికీ తన పుట్టుపూర్వోత్తరాలు, కుటుంబం, బంధువర్గం, వాతావరణం తాను అక్షరం ముక్క కోసం ఎన్ని కష్టాలు పడిందీ, ఆటపాట నేర్చుకోవటానికి  ఎన్ని గడపలు తొక్కిందీ, అన్నం ముద్ద కోసం ఎన్ని తిప్పలు పడిందీ, చివరికి కమ్యూనిస్టు పార్టీ తన దిశ ఎలా మార్చింది అనే విషయాలన్నీ వివరంగా చెప్పాడు.  తనను చేరదీసి, అన్నం పెట్టిన, విద్య నేర్పిన  మహా పండితుల నుండి విద్యలో  తనకంటే  చిన్నవారి  నుంచి కూడా తానేం నేర్చుకున్నానో పేరు పేరునా సవినయంగా చెప్పుకున్నాడు. చివరికి నలబై సంవత్సరాల నాటక ప్రస్థానం ముగిస్తూ, 1997లో  ఫిబ్రవరి 22 న అంగలూరులో మరణించారు.  కళకే ‘కళ’ తెచ్చిన ఆయన ప్రతిభ ...... షేక్‌ నాజర్‌ తన హావభావాలతో, ఆటపాటలతో  జాతిని మేల్కొలిపి ఉత్తేజపరిచిన మహనీయుడు. ప్రజా కళాకారుడుగా, బుర్రకథ పితామహుడుగా ఎదిగినవాడు. అగ్గిరాముడు, బలేబావ, నిలువు దోపిడీ, పెత్తందార్లు, మనుషులంతా ఒక్కటే  అనే పాత  సినిమాల్లో నాజర్‌ బుర్రకథలు కన్పిస్తాయి.  తెలుగు చిత్ర పరిశ్రమలో  గొప్ప నటుల్లో ఒకరైన అక్కినేని నాగేశ్వరరావు గారికి పూలరంగడు సినిమా కోసం ఈ  విద్యని నేర్పించాడు. అతని గళ గాంభీర్యానికి , మాధుర్యానికి మంత్రముగ్ధులైన సినీ ప్రముఖులు సినీ రంగంలో స్థిరపడమని చెప్పినా కూడా ఆ లోకం తన లోకం కాదని సవినయంగా చెప్పి, జనపదమే తన పథమని బుర్రకథలు చెప్పుకుంటూ జనంతో మమేకమై, జీవితాంతం ప్రజా కళాకారుడిగా తన ప్రయాణం సాగించాడు. ఆయన రాసిన ఆసామీ  నాటకానికి 18వ ఆంధ్రనాటక కళాపరిషత్తు పోటీల్లో ఫస్ట్ ప్రైజ్ లభించింది.  ప్రశంసలు- సత్కారాలు..... తెలుగు సినీ నటకిరీటుల్లో ఒకరైన ఎన్‌టిఆర్ గుంటూరుకు వచ్చినప్పుడు నేను మీ అభిమానినని నాజర్ చెప్పిన మాటకి  ‘నేను... మీ అభిమానినని’ చెప్పి అందరినీ ఆనందపరిచారు. ప్రముఖ రచయిత  శివప్రసాద్ "నాజర్ కథ చెప్పుతుంటే శృంగారం రసరంజకంగా గిలిగింతలు పెడుతుంది. హాస్యం నవ్వుల పువ్వులను పూయిస్తుంది. వీరం మహోద్రేకంగా పరవళ్ళు తొక్కుతుంది. కరుణం కన్నీళ్లను ధారగా కురిపిస్తుంది. హరికథకు ఆదిభట్ల ఎలాంటివాడో బుర్రకథకు నాజర్ అలాంటివాడు" అని అన్నారు. ఆంధ్రనాటక అకాడమీ 1981లో ఉత్తమ కళా కారుడు అవార్డుతో సత్కరించింది. 1986 లో భారతప్రభుత్వం పద్మశ్రీ బిరుదుతో నాజరును సత్కరించింది. నేటి తరం మన జాతి కోసం కృషి చేసిన ఇలాంటి మహానుభావులెవరినీ మరవకూడదు. మన ప్రాచీన సంస్కృతిని, జానపద కలలని అసలే  మర్చిపోకూడదు. అలా మర్చిపోయామంటే మన ఉనికిని మనం మర్చిపోతున్నట్టే.                                        *రూపశ్రీ

నీ ఆత్మ బలం నీ  మరణాన్ని కూడా వెనక్కి నెడుతుంది...

  హాస్పిటల్లో పరీక్షలు చేయించుకున్నాక  క్యాన్సర్  ఉందని  నిర్ధారిస్తే లేనివాడయినా, ఉన్నవాడయినా వాళ్ళ కాళ్ళ క్రింద భూమి కదిలినట్టే ఫీలవుతారు.  ఏటా లక్షలమంది ప్రాణాలని పిండేస్తూ, అత్యంత తీవ్రమైన ఆరోగ్య సమస్యగా కొనసాగుతోన్న ఆ మాయదారి రోగం క్యాన్సర్... ప్రపంచమంతటా ఇది చాపకింద నీరులా అల్లుకుంటుంది.  ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల వెలువరించిన డేటా ప్రకారం, 2022లో క్యాన్సర్ దాదాపు కోటిమంది  ప్రాణాలను బలిగొంది. కాలక్రమేణా క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి.  ఇంతటి ప్రాణాంతక వ్యాధి గురించి అవగాహన పెంచడానికి, తగిన  చర్యలకు ప్రేరేపించడానికి, క్యాన్సర్ భూతాన్ని నిర్మూలించడానికి  ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం జరుపుతారు. ఈ సందర్భంగా క్యాన్సర్ గురించి మరింత తెలుసుకుంటే..  ఎప్పుడు మొదలైంది.. 2000, ఫిబ్రవరి 4న పారిస్‌లో జరిగిన ప్రపంచ క్యాన్సర్ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం ప్రకటించారు. యూనియన్ ఫర్ ఇంటర్నేషనల్ క్యాన్సర్ కంట్రోల్ నిర్వహించిన ఈ కార్యక్రమం, క్యాన్సర్ ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా వెలుగులోకి తెచ్చేందుకు, దీని నివారణకు చర్యలు తీసుకోవడానికి ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. 2025 థీమ్.. ఈ సంవత్సరానికిగానూ,  "యునైటెడ్ బై యూనిక్"  అనే థీమ్ ఎంచుకున్నారు. ఇది 2025-2027 మూడేళ్ల ప్రచారానికి శ్రీకారం చుడుతుంది. ఈసారి జరిగే  ప్రచారంలో  క్యాన్సర్ చికిత్సలో వ్యక్తిగత అనుభవానికి ప్రాముఖ్యతనిస్తారు.  ప్రతి క్యాన్సర్ రోగి ప్రయాణం భిన్నమైనదని గుర్తించడమే దీని ముఖ్య ఉద్దేశ్యం. అవగాహన చాలా ముఖ్యం.. క్యాన్సర్  వచ్చిందంటే ఇంకేమీ చేయలేము అనే అపోహ చాలామందిలో ఉంటుంది. కానీ ముందుగా గుర్తించగలిగితే చాలా మటుకు క్యాన్సర్లని  తగ్గించే వైద్యం అందుబాటులో ఉంటుంది. అందుకే దీనిపట్ల అవగాహన ఉండాలి. అప్పుడే అప్రమత్తంగా ఉండి తొలిదశలోనే గుర్తించగలుగుతారు.  తక్కువ, మద్య ఆదాయ దేశాలు దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా క్యాన్సర్ ముప్పును ఎదుర్కోవడంలో ప్రత్యేకమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. అలాగే, నిరక్షరాస్యత, క్యాన్సర్ నిర్ధారణ ఆలస్యం కావడం, ఖర్చుతో కూడుకున్న చికిత్స కారణంగా క్యాన్సర్‌ కు వైద్యం అందరికీ అందడం లేదు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో క్యాన్సర్ గురించి అవగాహన లేకపోవడం నిర్ధారణను ఆలస్యం చేస్తుంది. 2020లో భారతదేశంలోని నాలుగు ప్రధాన కేంద్రాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, క్యాన్సర్ రోగులలో చాలామంది ముందుగా చికిత్స పొందటానికి వచ్చే సమయానికి అప్పటికే వారి వ్యాధి తీవ్ర స్థితికి చేరుకున్నట్లు గుర్తించారు. అందుకే శరీరంలో మార్పులని గమనించటంలో,  క్యాన్సర్ లక్షణాలు గుర్తించటంలో కాస్త అవగాహన అందరిలోనూ ఉండాలి. క్యాన్సర్ కేవలం పెద్దవాళ్లలోనే వస్తుంది తప్ప పిల్లలకి రాదు అని, షుగర్  వల్ల  క్యాన్సర్ పెరుగుతుందని, క్యాన్సర్ వైరస్ ద్వారా వస్తుందని.. ఇలా ఎన్నో అపోహలు, భయాలు సామాన్య జనంలో ఉంటుంటాయి. క్యాన్సర్ పట్ల తగిన అవగాహన లేకపోవటమే దీనికి కారణం. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా, ముఖ్యంగా తక్కువ,  మధ్య ఆదాయ దేశాల్లో, క్యాన్సర్ స్క్రీనింగ్, నిరోధక చర్యలు, చికిత్సల గురించి అవగాహన తక్కువగా ఉంది. ఇది క్యాన్సర్ వ్యాప్తిని పెంచే అవకాశం కల్పిస్తుంది. కాబట్టి ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం క్యాన్సర్ నివారణ, ముందుగా గుర్తించడం, చికిత్స చేయడంలో ఉన్న ప్రాముఖ్యతను అందరికీ గుర్తు చేస్తుంది.  మంచి అలవాట్లు.. సిగరెట్, బీడీలు కాల్చే అలవాటున్నవాళ్ళు, మందు తాగేవాళ్లు, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు తీసుకునేవారు  అవన్నీ తక్షణమే మానుకోవాలి. టీవీల్లో ,సినిమాల్లో బయట ఇలా ఎన్నిచోట్ల ప్రచారం చేసినా వీటిని మానడం లేదు.  వీటిని మానేస్తే నోరు, గొంతు, కాలేయం వంటి భాగాలకి వచ్చే క్యాన్సర్ రాకుండా ఆపొచ్చు.  క్రమం తప్పకుండ వ్యాయామం చేయటం వల్ల బ్రెస్ట్, కోలన్ క్యాన్సర్ ముప్పునుంచి తప్పించికోవచ్చు.  హెచ్‌పి‌వి, హెపటైటిస్ బి వంటి వ్యాక్సిన్లు తీసుకోవటంవల్ల గర్భాశయ, కాలేయ క్యాన్సర్లను నిరోదించవచ్చు. మంచి పోషకాహారం తీసుకోవటం, శరీరంతో పాటూ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చి ఒత్తిడిని తగ్గించుకోవటం, క్రమం తప్పకుండ వైద్య పరీక్షలు చేసుకోవటం వంటి అలవాట్ల వల్ల మనం ప్రాణాంతక క్యాన్సర్ బారిన పడకుండా తప్పించుకోవచ్చు. క్యాన్సర్ రోగులకి అండగా నిలవాలి..  క్యాన్సర్  దినోత్సవం సాక్షిగా నైతిక భాద్యతతో ప్రజలంతా క్యాన్సర్ రోగులకి మానసికంగా, ఆర్ధికంగా  అండగా నిలబడాలి.  క్యాన్సర్ రాకుండా ఉండేలా ఎలా జాగ్రత్తపడాలి, ఏం చర్యలు తీసుకోవాలి వంటివాటి గురించి అవగాహన కల్పించాలి. అందరూ మంచి జీవన శైలిని అలవర్చుకునేలా ప్రోత్సహించాలి.  ఆధునిక సమాజంలో క్యాన్సర్ కారకాలుగా మారుతున్న విషయాల మీద కలిసి పోరాడాలి.                                         *రూపశ్రీ.   గమనిక: ఇది సోషల్ సమాచారం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, సంబంధిత నిపుణుల ప్రకారం ఈ వివరాలు అందించాం. వ్యక్తుల ఆరోగ్యాన్ని బట్టి ఫలితాలుంటాయి. వీటిని పాటించేముందు.. సంబంధిత నిపుణుడిని సంప్రదించడం శ్రేయస్కరం. అలాగే, హెల్తీ లైఫ్ స్టైల్, సరైన ఆహారం కూడా తీసుకోవడం మీ ఆరోగ్యానికి ఎంతో మేలు...

పెళ్లి సంబంధాల కోసం మ్యాట్రిమోని మీద ఆధారపడుతున్నారా? అయితే ఇది మీకోసమే..

అబ్బాయిలు అయినా అమ్మాయిలు అయినా  జీవితాల్లో అతిపెద్ద మలుపు తీసుకునేది పెళ్లితోనే. సింపుల్ గా పెళ్లికి ముందు, పెళ్ళి తరువాత అనే  వ్యత్యాసాన్ని చెప్పేయచ్చు. ఉమ్మడి కుటుంబాలు, బంధువులు, స్నేహితుల సర్కిల్ ఎక్కువగా  ఉంటే ఆటోమేటిక్ గా పెళ్లి వయసొచ్చిన యువతీయువకుల కోసం పెళ్లి సంబంధాలు అంటూ కబుర్లు వస్తూనే ఉంటాయి. కానీ యెవరికి ఎవరే యమునాతీరే అనేట్టు ఉన్న నేటికాలం జీవితాలల్లో సంబంధాల కోసం ముందుకొచ్చి సహాయం చేసే చుట్టారు, స్నేహితులు తక్కువే. పైపెచ్చు మంచి సంబంధాలు కావాలనే కారణంతో చాలామంది  దగ్గరలో ఉన్నవాటిని పట్టించుకోరు. మంచి సంబంధాల కోసం మ్యాట్రిమోనిలో వెతుకుతుంటారు. అయితే మ్యాట్రిమోనిలో సంబంధాలు వెతికేవారు ఈ కింది విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ప్రోపైల్ గూర్చి అవగాహన ఉందా? పెళ్లి సబంధాల కోసం మ్యాట్రిమోనిలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. వీటిలో వరుడు లేదా వధువు ప్రోపైల్ విషయంలో అవగాహన ఉండాలి. వధువు లేదా వరుడి ఫ్రోపైల్స్ రెండు రకాలుంటాయి. ఒకటి ప్రీ ఫ్రోపైల్, రెండు పెయిడ్ ఫ్రోపైల్. ఫ్రీ ప్రోఫైల్ అనేది ముందునుండే ఉన్నది. పెయిడ్ ఫ్రోపైల్ అనేది మ్యాట్రిమోనికి డబ్బు కట్టి క్రియేట్ చేయించుకునేది. దీంట్లో చాలావరకు పేక్ ఉంటాయి. అధికశాతం మంది ఇక్కడే మోసపోతారు. సామాజిక మాద్యమంతో జాగ్రత్త.. సోషల్ మీడియా ఇప్పుడు చాలా భీభత్సంగా  మారింది.  కాస్త మాటలు మొదలైతే చాలు  ఎంతో సులువుగా దగ్గరైపోయేవారు ఉన్నారు. సన్నిహింతంగా మాట్లాడగానే వ్యక్తిగత సమాచారం షేర్ చేసేవారున్నారు. వీటి వల్ల  భవిష్యత్తులో చాలా సమస్యలు వస్తాయి. కాబట్టి పొరపాటున కూడా వివరాలు ఎవరికీ ఇవ్వకండి. దూరమే శ్రేయస్కరం.. పెళ్ళి ఖాయం అయినా పెళ్ళి పూర్తయ్యే వరకు కాబోయే భార్యాభర్తలను అస్సలు కలవనిచ్చేవారు కాదు ఒకప్పుటి పెద్దలు. కానీ ఇప్పుడు అలా కాదు. పెళ్లి పిక్స్ అనే మాట వినగానే పెళ్లి జరగడానకి ముందు బోలెడు సార్లు కలుస్తారు. షాపింగ్ చేస్తారు. టూర్లకు కూడా వెళతారు. కానీ ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండటం మంచిది. పెళ్లి జరిగే వరకు అమ్మాయిలు తమను తాము సేప్టీగా ఉంచుకోవడం మంచిది. అదే విదంగా సోషల్ మీడియా పరిచయాలు ప్రేమ, పెళ్లికి దారితీస్తే పెద్దల నిర్ణయం తరువాతే వాటి విషయంలో ప్రోసీడ్ అవ్వడం మేలు. మనీ మాటర్స్.. పెళ్లి ఓకే అనగానే కొందరు, పెళ్లి వలలోకి లాగడానికి కొందరు, పెళ్లి పేరుతో మోసం చెయ్యడానికి మరికొందరు డబ్బును, బహుమతులను ఇవ్వడం, ఆశించడం చేస్తారు. అయిచే పెళ్లి  జరిగే వరకు ఇలాంటి పనులు చేయకపోవడమే మంచిది.  

తీరమైనా, సముద్రమైనా  మీ రక్షణకి మేమున్నాం....

ప్రపంచ ఆర్ధిక వ్యవస్థలని పరిశీలిస్తే అవన్నీ  ఎగుమతులు, దిగుమతులు మీదనే ఆధారపడ్డాయని తెలుస్తుంది. మరి ఈ ఎగుమతులు, దిగుమతులు దేని మీద ఎక్కువ ఆధారపడ్డాయంటే దానికి  సమాధానం తీరప్రాంత ఓడరేవులు, సముద్ర మార్గాలనే  చెప్పాలి. మరి ఇంత ముఖ్యమైన తీరప్రాంతాన్ని, సముద్రాన్ని కాపాడటానికి రక్షకుల అవసరం ఖచ్చితంగా ఉంటుంది. పొడవైన తీరప్రాంతం కలిగిన దేశాల్లో ఒకటైన  మన దేశ తీరాన్ని, మన సముద్ర సరిహద్దుని ఎల్లవేళలా కాపాడటానికి  మనకీ ఒక రక్షణ దళం ఉంది. అదే ఇండియన్ కోస్ట్ గార్డ్(ఐసిజి)....  ఈ ఐసిజి  స్థాపనను గౌరవిస్తూ,  వీరు సముద్ర భద్రత కోసం చేపట్టిన కీలక బాధ్యతలను గుర్తు చేసుకుంటూనే…  దేశం కోసం, దేశ పౌరుల ప్రాణాలను రక్షించటం కోసం ఎన్నో  సాహసోపేతమైన పనులు చేస్తున్న కోస్ట్ గార్డుల  కృషిని గౌరవించేందుకు ప్రతీ సంవత్సరం  ఇండియన్ కోస్టుగార్డ్ డే జరుపుకుంటాము. 2025లో  ఐసిజి తన 49వ స్థాపన దినోత్సవాన్ని జరుపుకోనుంది. ఈ  సంధర్భంగా మన కోస్ట్ గార్డ్ ప్రయాణం గురించి తెలుసుకుంటే….  ఇండియన్ కోస్టుగార్డ్(ఐసిజి)  ఎప్పుడు మొదలైంది....   ఫిబ్రవరి 1, 1977న తీర సంరక్షణ దళ చట్టం  చేయటంతో ఇండియన్ కోస్ట్ గార్డ్ స్టాపించబడింది. అయితే 1978లో  భారత పార్లమెంట్  దీన్ని ఆమోదించటంతో  అధికారిక గుర్తింపు లభించింది.  అప్పటి ప్రధానమంత్రి మోరార్జీ దేశాయ్ సారథ్యంలో ఇండియన్ కోస్టుగార్డ్ ఏడు నౌకలతో అధికారికంగా స్థాపించబడింది. ఐసిజి  ఒక రక్షణ దళమే తప్ప మిలిటరీ విభాగం కాదు.  ఇది భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. దీని ప్రధాన కార్యలయం ఢిల్లీలో ఉంది.  ఐతే మొదట కేవలం ఏడు నౌకలతోనే  మొదలైన దీని ప్రయాణం ఇప్పుడు 158 నౌకలు, 78 విమానాలతో, సాంకేతిక పరికరాలతో శక్తివంతంగా మారి, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద కోస్ట్ గార్డుగా నిలిచింది. ఇది 2030 నాటికి 200 నౌకలు, 80 విమానాల లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేస్తుంది. ఇండియన్ కోస్టుగార్డ్  ఏం చేస్తుంది..... ఈ దళం  నినాదం: “వయం రక్షామహ”,  అంటే దీనర్ధం “మేము రక్షిస్తాము” అని. ఈ మాట నిజం చేస్తూనే దాదాపు అర్ధ శతాబ్ధం నుంచి ఐసిజి మన తీరాన్ని, మనల్ని రక్షిస్తూ వస్తుంది.  సముద్ర ప్రాంతాల్లో కృత్రిమ ద్వీపాలు, ఆఫ్‌షోర్ టెర్మినల్స్, ఇతర నిర్మాణాల రక్షణ & భద్రతను చూసుకుంటుంది.  ఎల్లప్పుడూ భారత తీర రేఖను గస్తీ కాస్తూ, అక్రమ కార్యకలాపాలైన    స్మగ్లింగ్, సముద్ర దొంగతనాలు, ఇతర నేరాలను అరికడుతుంది. . తుఫాన్లు, సహజ విపత్తుల సమయంలో  సముద్రంలో చిక్కుకుపోయిన మత్స్యకారులకు సహాయం అందించి రక్షిస్తుంది. సముద్ర  కాలుష్యం జరగకుండా  నియంత్రణ, నివారణ చర్యలు తీసుకుంటూ,   సముద్ర పర్యావరణాన్ని, జీవవైవిధ్యాన్ని కాపాడుతుంది. అరుదైన సముద్ర జీవులను రక్షిస్తుంది. ఇది ఇండియన్ నేవీ,  మత్స్య శాఖ, కస్టమ్స్,  కేంద్ర-రాష్ట్ర పోలీసు విభాగాలతో సమన్వయం చేస్తూ  అక్రమ రవాణా జరగకుండా ఆపుతుంది. భారత సముద్ర పరిధుల చట్టం  అమలు జరిగేలా చూస్తుంది. మన సముద్ర పరిధిలోకి ఇతర దేశాలవారు  అక్రమంగా రాకుండా నివారిస్తుంది. సముద్రంలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటుంది. సైంటిఫిక్  డేటాను సేకరించి, యుద్ధ  సమయాల్లో నౌకాదళానికి మద్దతు అందిస్తుంది. భారత సముద్ర జలాల్లో చమురు లీకేజీ జరిగితే, దాన్ని తొలగించడానికి మొదటగా ఇండియన్ కోస్టుగార్డ్ స్పందిస్తుంది. ఇండియన్ కోస్టుగార్డ్ చేస్తున్న కృషిని గుర్తించాలి...... సముద్రంలో ఒక షిప్పులో ప్రయాణించటం అందరూ అనుకున్నంత సరదాగా ఏమీ ఉండదు. అదీ కాక దేశ రక్షణ కోసం పనిచేస్తున్న కోస్టల్ గార్డ్ షిప్పులో ఉన్నవారికి  అది ఎన్నో సవాళ్ళతో కూడుకున్న ప్రయాణం. ప్రతీరోజు కొత్తగా, సాహసోపేతంగా ఉంటుంది. ఈ విశాల నీలి సముద్రంలో  పగలు, రాత్రి అని చూడకుండా అహర్నిశలు మన దేశ సముద్ర సరిహద్దులని గస్తీ కాస్తున్న కోస్ట్ గార్డుల జీవితం అంత సులభంగా ఉండదు.  సముద్రంలో చిన్న చిన్న దారి దోపిడీలు చేసే దొంగల చేతికి కూడా ఆధునిక మారణాయుధాలు  అందుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో  ఒక కోస్టల్ గార్డ్  తన కర్తవ్యం నెరవేర్చటం ఎంత కఠినమో, ఎంత సాహసమో ఆలోచించాలి.  భారతదేశ తీరప్రాంతంలో 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలున్నాయి.  సుమారు 7516 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది కొత్త ఆధునిక సాంకేతిక లెక్కల ప్రకారం సుమారు 11000 కిలోమీటర్ల తీరప్రాంతం ఉంది. పైగా మన భారతదేశం అనేక దేశాలకి దగ్గరగా ఉండటంతో పాటూ, ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే సంప్రదాయ సముద్ర వాణిజ్య మార్గం దగ్గరగా కూడా ఉంటుంది. మరి ఇటువంటి బౌగోళిక పరిస్థితులున్న  మన దేశ తీరాన్ని, సముద్ర సరిహద్దులని కాపాడటంలో మన కోస్టుగార్డులు  ఎంతలా కృషి చేస్తున్నారో అర్ధం చేసుకోవాలి.  ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే సంధర్భంగా  ఎంతో సేవ చేసిన, చేస్తున్న మన రక్షకులకి సలాం!                              *రూపశ్రీ.

కుటుంబం సంతోషంగా ఉండాలంటే ఇంట్లో ఈ నియమాలు పాటించండి..!

  ఈ సమాజంలో ప్రతి వ్యక్తిగత బలాలు, బలహీనతలు ఎన్ని ఉన్నా.. లేకపోయినా కుటుంబం అనే అతి పెద్ద ధైర్యం ప్రతి ఒక్కరికి ఉంటుంది.  ఒక దశ వరకు కుటుంబం అనేది చాలా కీలక పాత్ర పోషిస్తుంది.  తల్లిదండ్రులు, పిల్లలు.. వారి పిల్లలు ఇలా అందరూ కలిస్తే కుటుంబం అవుతుంది. ఇంటిల్లిపాది సంతోషంగా ఉండాలని ప్రతి ఇంటి పెద్ద కోరుకుంటాడు.  ముఖ్యంగా ఇంటి సభ్యులు  అన్యోన్యంగా ఉంటూ.. ఇల్లు ప్రశాంతంగా సంతోషాలతో ఉంటే ఆ ఇల్లు నందనవనంలా అనిపిస్తుంది.  ఇంటి వాతావరణం బాగుంటే కుటుంబ సభ్యులు బయటి వ్యక్తుల ప్రభావంలో అస్సలు పడరు కూడా.  కానీ కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత ఉండటం లేదు  ఈ కాలంలో.. చీటికి మాటికి గొడవలు, అపార్థాలు, ఒకరిని ఒకరు నిందించుకోవడాలు వంటివి ఎదురవుతూ ఉంటాయి. పిల్లలు చిన్నతనంలో ఉండగానే కొన్ని నియమాలు పాటిస్తూ ఉంటే ఆ ఇల్లు చాలా సంతోషంగా ఉంటుంది.  ఇంతకీ  ఆ నియమాలు ఏంటో తెలుసుకుంటే.. సమయం కావాలి.. కుటుంబ సభ్యుల మధ్య మంచి వాతావారణం,  బలమైన  బంధాలు ఏర్పాడాలంటే ఒకరికి మరొకరు సమయం కేటాయిస్తూ ఉండాలి. దురదృష్టవశాత్తు ఇప్పటి కాలంలో ఇలా సమయం కేటాయించడం సమయం దొరకడం కష్టం అవుతోంది.  అందుకే సమయం కేటాయించుకోవాలి. కనీసం కలిసి తినడం,  రోజులో ఏదో ఒక సమయంలో కలిసి మాట్లాడటం,  ఏదైనా సరదాగా ఆడటం,  సమయం గడపడం.. ఇలా ఏదో ఒక విధంగా కుటుంబ సభ్యులు అందరూ కనెక్ట్ అయ్యి ఉండాలి. మాట్లాడటమే కాదు.. వినాలి.. మాట్లాడటం అందరూ చేస్తారు. తమ అభిప్రాయాలు, ఆలోచనలు,  నిర్ణయాలు అందరికీ చెప్పడమే కాదు.. కుటుంబ సభ్యులు చెప్పే విషయాలు కూడా వినాలి.  కుటుంబ సభ్యుల స్పందన, వారి ఆలోచనలు,  అభిప్రాయాలు అన్నీ వినాలి.  దాన్ని బట్టి తదుపరి నిర్ణయాలు తీసుకోవచ్చు. ఇలా ఉన్నప్పుడు కుటుంబ సభ్యుల మధ్య అనుబంధం కూడా బాగా బలంగా మారుతుంది. సాయానికి సిద్దంగా ఉండాలి.. కుటుంబ సభ్యుల ఐక్యతను నిలబెట్టేవి కష్ట సమయాలే.. ఎల్లప్పుడూ ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి,  ఒకరికొకరు తోడు ఉండటానికి సిద్దంగా ఉండాలి. ఇలా ఉంటే తమ వెనుక కుటుంబ బలం ఉందనే ధైర్యంతో ఉంటారు. ఇది కుటుంబ సభ్యులను ఎప్పటికీ కలిపి ఉంచుతుంది. వేడుకలు.. వేడుకలు కుటుంబ సభ్యులను కలిపి ఉంచడం కోసం, వారు సంతోషంగా సమయాన్ని గడపడం కోసం ఏర్పాటు చేశారేమో అనిపిస్తుంది.  సందర్భం ఏదైనా వేడుక ఎంత చిన్నది అయినా కుటుంబ సభ్యులు అందరూ కలిపి సెలబ్రేట్ చేసుకుంటే అది వారికి చాలా స్పెషల్ గా మారుతుంది. మెప్పు.. కుటుంబ సభ్యులు ఎప్పుడూ ఒకరిని మరొకరు విమర్శించుకోకూడదు.  ఒకరిని ఒకరు మెచ్చుకుంటూ ఉండాలి.  ఎవరు మంచి పని చేసినా,  ఎవరు కుటుంబానికి సంతోషం కలిగించే పని చేసినా,  వ్యక్తిగతంగా అభివృద్ది చెందుతున్నా, బాగా చదువుతున్నా.. మంచి పేరు తెచ్చుకుంటున్నా.. ఇలా ప్రతి విషయాన్ని అందరూ మెచ్చుకుంటూ ఉండాలి. ఇలా చేస్తే ఆ కుటుంబంలో పిల్లల భవిష్యత్తు చాలా గొప్పగా మారుతుంది.                           *రూపశ్రీ.

ఆ వీరుల  త్యాగాలే మన జాతికి  అందిన గొప్ప   ఫలాలు..... 

  ఎక్కడ అణచివేతకి గురి కాబడతారో,  అక్కడ.. ఆ అణచివేతని అంతం చేయటానికి  వీరులు ఉద్భవిస్తారు.  జాతి గౌరవం కోసం వారి ప్రాణాలు కూడా త్యాగం చేస్తారు అన్నది మనకి చరిత్ర చెబుతున్న నిజం. వందల సంవత్సరాలు విదేశీయులు మన భరతమాత గుండెల మీద గుద్దుతుంటే రక్తం మరిగి ఎదురుతిరిగిన బిడ్డలెందరో  పోరాడి అమరులయ్యారు. అలా మన దేశ స్వాతంత్ర్యం కోసం, దేశ ప్రజల క్షేమం కోసం ప్రాణాలర్పించిన   అమరవీరుల త్యాగాలను మనం ఎప్పటికీ మరవకూడదు.  దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరుల త్యాగాలను గౌరవిస్తూ.. గుర్తుచేసుకుంటూ ముందు తరాలు కూడా త్యాగం విలువను గుర్తుపెట్టుకోవాలనే ఉద్దేశ్యంతో    అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటాం. అమరవీరుల దినోత్సవం.. భారతదేశ స్వాతంత్ర్య పోరాట సమయంలో యువకులైన  భగత్ సింగ్, రాజ్ గురు, సుఖదేవ్ లు  1931లో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా విప్లవ కార్యక్రమాలు నిర్వహించినందుకు ఉరిశిక్షకి గురయ్యారు. అప్పుడు వాళ్ళు బ్రిటీష్ వారికి  లొంగిపోకుండా భారత జాతికి పోరాట స్ఫూర్తిని రగిలించి మరీ  అమరులయ్యారు. వీరు ధైర్యం, ప్రతిఘటనకు ప్రతీకలుగా మారి, భవిష్యత్ తరాల కోసం ప్రేరణగా నిలిచారు. అందుకే వారు ఉరివేయబడ్డ ఆ దినమే అమరవీరుల దినంగా మన దేశం జరుపుకుంటోంది.  అమరవీరుల దినోత్సవం చారిత్రాత్మకంగా ఎప్పుడు  ప్రాముఖ్యత పొందిందంటే.. మనం జాతిపితగా పిలుచుకునే  మహాత్మా గాంధీ గారు మన దేశానికి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత 1948, జనవరి 30న హత్యకి గురి కాబడి అమరులయ్యారు. అప్పటినుంచి గాంధీగారు అహింసా విధానంలో భరతమాత కోసం చేసిన ఉద్యమాలు,  త్యాగాలని స్మరించుకోవటానికిగానూ, అలాగే మన దేశం కోసం ప్రాణాలర్పించిన ఎంతోమంది వీరులని స్మరించుకోవటానికిగానూ ప్రతీ సంవత్సరం జనవరి 30న అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నాము. మహాత్మా గాంధీ .. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్‌లో జన్మించారు. భారత స్వాతంత్ర్య పోరాటంలో అహింసా, సత్యాగ్రహాలను ప్రవేశపెట్టి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్నారు. 1915లో దక్షిణాఫ్రికా నుండి తిరిగి వచ్చిన తరువాత  ఖేదా, చంపారన్ ఉద్యమాలు నడిపి బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటాన్ని కొనసాగించారు. 1920లో సహాయ నిరాకరణోద్యమం, 1930లో దండీ ఉప్పు సత్యాగ్రహం, 1942లో క్విట్ ఇండియా ఉద్యమం నడిపారు. గాంధీజీ శాంతి, సమానత్వం, సామరస్యానికి మార్గదర్శకుడిగా నిలిచారు. గాంధీజీ యొక్క అహింసా, సివిల్ నిరసన తత్త్వాలు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భారత స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించాయి. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందింది. 1948 జనవరి 30న నాథూరామ్ గాడ్సే చేతిలో హత్యకు గురయ్యారు. ఆయన "జాతిపిత", "బాపూజీ" గా ప్రసిద్ధి చెందారు. ప్రపంచవ్యాప్తంగా అహింస, శాంతికి ప్రతీకగా నిలిచారు. భారత స్వాతంత్ర్యం కోసం ఎంతోమంది వీరులు చేసిన త్యాగాలను గుర్తుచేసుకోవటం కోసం, వారు దేశం పట్ల చూపిన  దేశభక్తి, ధైర్యం, వారు చూపిన  అంకిత భావం, దేశానికి దేశ స్వేచ్ఛకు ఇచ్చిన  విలువలను గుర్తు చేసుకునే సందర్భంగా ఈ రోజు నిలుస్తుంది. భారత స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా ప్రాణాలు అర్పించిన అమర వీరులకు దేశం నివాళులు అర్పించేది ఈరోజే. ఈ దినోత్సవం  జాతీయ ఐక్యతకు పిలుపునిస్తుంది. ఇది ప్రజలను ఒకతాటిపైకి తెచ్చి, పోరాటాల చరిత్రను గౌరవించేలా చేస్తుంది.  అమర వీరుల కథలు భవిష్యత్తు తరాలకు న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ వంటి విలువలను కాపాడేందుకు ప్రేరణగా నిలుస్తాయి.  దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు, వేడుకలు నిర్వహిస్తారు. సంస్మరణ కార్యక్రమాలు, విద్యాపరమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయి.  ఢిల్లీలోని రాజ్ ఘాట్ వద్ద రాష్ట్రపతి, ప్రధానమంత్రి,  ఇతర ప్రముఖులు మహాత్మా గాంధీకి నివాళులర్పిస్తారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను గుర్తు చేసుకుంటారు. వివిధ రాష్ట్రాల్లో, నగరాల్లో, స్వాతంత్ర్య సమరయోధుల విగ్రహాల వద్ద నివాళులు అర్పిస్తారు. పాఠశాలలు, కళాశాలల్లో  ప్రత్యేక అసెంబ్లీలు నిర్వహిస్తారు. విద్యార్థులు నాటకాలు, కవితలు, ప్రసంగాలు ద్వారా అమర వీరుల జీవితాలను గుర్తుచేసుకుంటారు.  సాంస్కృతిక,  విద్యా కార్యక్రమాలు ఏర్పాటుచేస్తారు.  మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కలిగించే కధనాలు, చిత్రాలను ప్రసారం చేస్తారు.   రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, ఇతర సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించి అమర వీరులకు ఘనంగా నివాళులర్పిస్తారు. ఈ కార్యక్రమాలు సమాజంలో బాధ్యతాయుతమైన వ్యవస్థను నిర్మించడానికి ప్రేరణగా నిలుస్తాయి. దేశం భవిష్యత్తు, దేశ రక్షణ,  దేశ అభివృద్ది ప్రతి పౌరుడి బాధ్యత అనే విషయాన్ని కూడా ఈరోజు అందరికీ గుర్తు చేస్తుంది.                                         *రూపశ్రీ  

మనిషి ధర్మం ఎలా ఉండాలో తెలుసా?

మనిషి ఎలా ఉండాలి?? అతడి ధర్మం ఎలా ఉండాలి?? అతడు ఎలా నడుచుకోవాలి?? అనే విషయం గురించి ఓ ఉదాహరణా కథనం ఉంది.  పూర్వం జపాన్లో కైచూ అనే గొప్ప జెన్ మాస్టర్ క్యోటో ప్రాంతంలో ఒక ఆలయానికి అధిపతిగా ఉంటుండేవాడు. ఒకసారి క్యోటో గవర్నర్ ఆ ఆలయానికి మొదటిసారి వచ్చాడు. జెన్ మాస్టర్ సహాయకుడు, గవర్నర్ గారి విజిటింగ్ కార్డు పట్టుకెళ్ళి మాస్టర్కు ఇచ్చాడు. ఆ కార్డు మీద "కిటగానీ, క్యోటో గవర్నర్" అని ఉంది. "నాకు ఇతగాడితో ఏమీ పనిలేదు. వెళ్లిపొమ్మను” అన్నాడు కైచూ. సహాయకుడు గవర్నర్ వద్దకు వచ్చి 'మన్నించండి' అంటూ జరిగిన విషయం చెప్పాడు.  “పొరపాటు నాదే సుమా” అంటూ గవర్నర్ కలం చేత బుచ్చుకొని, తన పేరు మాత్రమే ఆ కార్డు మీద ఉంచి, 'క్యోటో గవర్నర్' అనే పదాలు కొట్టేసి కార్డును సహాయకుడి చేతుల్లో పెడుతూ “మళ్ళీ ఒకసారి మీ మాస్టర్ వద్దకు వెళ్ళి అడిగిచూడు” అన్నాడు. అది చూసిన జెన్ మాస్టర్ "ఓహో! వచ్చింది కిటగానీయా? అయితే అతణ్ణి నేను చూడాలనే అనుకుంటున్నాను రమ్మను” అన్నాడు ఈసారి.  మనిషి తన హోదాతో ఒకటైపోతాడు. పిల్లవాడు పుట్టినప్పటి నుంచీ ఇతడు జీవితంలో ఏమవుతాడో అనే చింత తల్లిదండ్రులకు దాదాపు ఆనాటినుంచే ప్రారంభం అవుతుంది. జాతకచక్రం వేయించి చూస్తారు. గొప్ప కంప్యూటర్ ఇంజనీరో, లేక ఏదో పెద్ద సంస్థకు అధిపతిగా ఉంటాడనో, గొప్ప డాక్టరో, సైంటిస్టో అవుతాడని చెప్పించుకొని సంతోషపడతారు. పిల్లవాడు చేతులు, కాళ్ళు ఆడించి కాస్త పాకే సమయానికల్లా అతడి ముందు ఒక కలమూ, కాస్త ఎడంగా ఒక ఉంగరమూ, అలాంటివే మరేవో అక్కడ పెట్టి ఏది పట్టుకుంటాడో అని వేచి చూస్తుంటారు. అంటే సరస్వతీదేవికి అంకితమవుతాడా లేక లక్ష్మీకటాక్షం అనుభవించనున్నాడా అనే విషయం కనుగొంటారన్నమాట. అయినా కాకపోయినా అప్పటికి అదే పెద్ద సంతృప్తి. ఏవో బంగారు కలలు కంటూ కాలం గడుపుతుంటారు.  కానీ ఆకాశమంత అవకాశంతో పుట్టిన ఆ శిశువు ఈ కాస్తతోనే సంతృప్తి పడాలా? గొప్ప ఇంజనీర్ కావడంతో అతడి జన్మ సఫలీకృతమైనట్లేనా? ఫలానా కీర్తిగడించిన ఇంజనీర్ మావాడే, నాకొడుకే, మామేనల్లుడే, మాఊరి వాడేనండోయ్ అని చెప్పుకోడానికేనా? జీవితం అంత పరిమితమైనదా? ఈ జీవితానికి అంతకన్నా విస్తృత అవకాశాలు లేవా? సాక్షాత్తూ జీవితాన్నే దర్శించి అంబరమంత ఎత్తు ఎదిగిన మహనీయులు, అంత ఎలా సాధించారు? వారు కూడా ఈ కాస్తతోనే సరిపెట్టుకొని ఉంటే, ఇంతటితోనే సంతృప్తి చెంది ఉంటే, మనిషిగా ఎదిగి ఉండేవారా?  మరి పిల్లవాడు అలా ఎదగడానికి మనం దోహదం చేసే బదులు, ఇంజనీర్ అవమనో, వృత్తిపరంగా మరేదో సాధించమనో, మనమెందుకు అతడి జీవితాన్ని సంకుచితం చేస్తున్నాం? అంటే మనకీ స్వయంగా అపరిమిత, విశాల జీవితమంటే ఏమిటో సరియైన అవగాహన లేనందువల్లనే కదా?  జన్మించేటప్పుడు ప్రతిశిశువూ అనంతమైన స్థితిలోనే పుడతాడు. అతడు ఎంతైనా ఎదగగలడు. ఒకప్పుడు రాముడనే దేవుడు, కృష్ణుడనే దేవుడు కూడా ఇలానే తల్లి గర్భాన పుట్టారు. దేవుణ్ణి మీరు నమ్మితే ఈ పిల్లవాడు కూడా ఆ  ''పొటెన్షియాలిటీ' తోనే పుట్టాడు. మనం ఈ పిల్లజీవితాలను సంకుచితపరచకుండా, పరిమితం చేయకుండా స్వేచ్ఛగా  అంటే విచ్చలవిడిగా కాదు, సంతోషంగా, కోమలమైన స్పృహతో ఎదగనిస్తే వీరు కూడా ఆ పురాణపురుషులంతటి వారవుతారేమో?  'అందరూ అంతంతటి వారెలా అవుతారు?' అనే వేళాకోళం అటువుంచి, అరుణాచల రమణుడూ,  జిడ్డు కృష్ణమూర్తి, అంత ఎత్తుకు ఎలా ఎదగగలిగారు? వారిని గురించి కూడా తల్లిదండ్రులు అలానే అనుకొని ఉండవచ్చు కదా? “వెర్రి వేషాలు వేయకు. కుదురుగా చదువుకొని పెద్ద ఆఫీసరన్నా అవు, లేదా నీ కర్మ అదేనైతే, ఎక్కడో గుమాస్తాగా నీ బతుకు ఈడ్చెయ్" అని వారి రెక్కలు కత్తిరించేసినట్లయితే ఏమయ్యేది? అందువల్ల పిల్లవాణ్ణి సాధారణ చదువులు చదివిస్తూ, వాటిలో ప్రావీణ్యత గడిస్తూ ఉన్న సమయంలో కూడా స్వేచ్ఛగా ఎదగనివ్వాలి. . ఎత్తుకున్నప్పటినుంచి మీ అభిప్రాయాలను గురించి మీరు స్వయంగా ఎరగని మతసిద్ధాంతాలతో అతణ్ణి 'కండీషన్' చేయకూడదు. అతడు కోరుకున్న వృత్తిని స్వీకరించనివ్వాలి. అతడి భవిష్యత్తును మీ అభిమతానుసారంగా మలచడానికి ప్రయత్నించకూడదు. తాను ప్రేమించని వృత్తిని చేపట్టిన సదరు పిల్లవాడు ఆ వృత్తిలో ధనం ఎంతైనా సంపాదించ వచ్చు. తల్లిదండ్రుల్ని తూగుటుయ్యాలలో ఊగించవచ్చు. కానీ అతడికి మాత్రం సంతోషముండదు. అలా దిగులుగా తిరుగుతూనే ఉంటాడు.అంటే ఇష్టం లేని పనిలో డబ్బు వస్తుందేమో కానీ తృప్తి మాత్రం రాదు.                                  ◆నిశ్శబ్ద.

 భారత రాజ్యాంగంలో జరిగిన అతి ముఖ్యమైన సవరణల గురించి తెలుసా?

  ఒక మతానికి పవిత్ర గంథం ఎలాంటిదో ఒక దేశానికి రాజ్యాంగం కూడా అలాంటిదే.  భారత రాజ్యాంగం విషయానికి వస్తే  భారతీయులకు అది చాలా  సౌకర్యాలు, చాలా షరతులు, మరెంతో సౌకర్యవంతమైన జీవితాన్ని అందిస్తుంది.  రాజ్యాంగాన్ని 1950 జనవరి 26 వ తేదీన ఆమోందించారు అనే విషయం తెలిసిందే. అందుకే గణతంత్ర్య దినోత్సవాన్ని కూడా జరుపుకుంటున్నారు. అయితే రాజ్యాంగాన్ని రచించి ఆమోదం పొందిన తరువాత అవసరాన్ని బట్టి దాన్ని సవరణ చేస్తుంటారు.   ఇప్పటి వరకు భారత రాజ్యాంగంలో చాలా ముఖ్యమైన సవరణలు జరిగాయి అవేంటంటే.. 7వ సవరణ.. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమీషన్ సిఫారసు మేరకు భాష ప్రాతిపదికన రాష్ట్రాలు పునర్వ్యవస్థీకరించబడ్డాయి.  ఈ సవరణ దేశానికి మెరుగైన పాలన నిర్మాణాన్ని అందిచంలో  ఒక పెద్ద ముందడుగు అని చెప్పవచ్చు. 42వ సవరణ.. ఇందిరా గాంధీ హయాంలో ఎమర్జెన్సీ సమయంలో రాజ్యాంగంలో 42వ సవరణ జరిగింది. ఇందులో ప్రభుత్వం న్యాయవ్యవస్థ అధికారాలను పరిమితం చేసి కేంద్రానికి మరిన్ని అధికారాలు ఇచ్చింది. 44వ సవరణ.. ఆస్తి హక్కు అనేది మొదట ప్రాథమిక హక్కులలో బాగంగా ఉండేది. అయితే ఈ 42వ సవరణ ద్వారా ఆస్తి హక్కును ప్రాథమిక హక్కు జాబితా నుండి తొలగించారు. అలాగే దీన్ని చట్టబద్దమైన హక్కుగా మార్చారు. ప్రజాస్వామ్యంలో ప్రజల హక్కులను సమతుల్యం చేసేందుకు ఈ సవరణ అవసరమైనట్టు పేర్కొన్నారు. 61వ సవరణ.. రాజకీయంలో యువత కీలకంగా ఉండాలని, ప్రభుత్వాల ఏర్పాటులో యువత ఆలోచనలు కీలకంగా ఉండాలని, యువశక్తిని చైతన్యం చేసేందుకు ఓటింగ్ వయస్సును కూడా సవరించారు. 61వ సవరణలో  ఓటు హక్కు వయసును 21 ఏళ్ళ నుండి 18 ఏళ్లకు తగ్గించింది. 73  వ సవరణ.. గ్రామ పంచాయితీలను బలోపేతం చేసేందుకు, మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, తెగలకు రిజర్వేషన్లు కల్పించడంలో ఒక ముఖ్యమైన ముందడుగు వేసింది. 86వ సవరణ.. రాజ్యాంగంలో పిల్లల చదువు కోసం జరిగి మార్పు దేశ భవిష్యత్తును,  పిల్లల జీవితాలను ఎంతగానో మార్పు దిశగా తీసుకెళ్లిందని చెప్పవచ్చు. 6 నుండి 14 సంవత్సరాల పిల్లలకు ఉచిత నిర్భంద విద్యను ప్రాథమిక హక్కుగా మార్చింది. ఇది పిల్లల ప్రాథమిక హక్కులలో భాగంగా ఉంది. 101వ సవరణ.. 101వ సవరణలో జియస్టి ని ప్రవేశపెట్టారు.  వస్తువులు సేవల పన్నును అమలు చేశారు. దీని వల్ల దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను వ్యవస్థను ప్రవేశపెట్టారు. 102 వ సవరణ.. 102వ సవరణ జాతీయంగా వెనుకబడిన తరగతుల కమిషన్ కు రాజ్యాంగ హోదా కల్పించింది. 103వ సవరణ.. సాధారణ వర్గానికి చెందిన,  ఆర్థికంగా వెనుకబడిన ప్రజలకు ఉద్యోగాలు,  విద్యలో 10శాతం రిజర్వేషన్లు ఇచ్చింది.  ఈ రిజర్వేషన్ ఇప్పటికే రిజర్వేషన్ పొందుతున్న SC, St< OBC కేటగిరీ వారికి వర్తించదు. 104వ సవరణ.. లోక్ సభ, రాష్ట్రాల అసెంబ్లీలలో ఆంగ్లో-ఇండియన్ కమ్యూనిటీకి రిజర్వు చేయబడిన సీట్లను రద్దు చేసింది.                               * రూపశ్రీ.

ఉద్యమాన్ని నిప్పురవ్వలా రగిలించిన గాయం.. 

 "నా శరీరంపై కొట్టిన  దెబ్బలు భారతదేశంలో  బ్రిటీష్ సామ్రాజ్యపు  శవపేటికకి  కొట్టే చివరి మేకులుగా మారుతాయి” అన్న ఆయన మాటలు  నిజంగానే  ఎంతో మంది స్వాతంత్ర సమరయోధుల రక్తాన్ని మరిగించి, ఉద్యమానికి స్పూర్తినిచ్చి బ్రిటీష్ పిడికిలిలో బిగుసుకున్న దేశ స్వాతంత్ర్య సాధన వైపు అడుగులు వేయించింది.   ‘పంజాబ్ కేసరి’ అనే బిరుదుని పొందిన  లాలా లజపతిరాయ్  విప్లవకారుడు, నాయకుడు, రచయిత, హిందూ ప్రధాన ఉద్యమ నేత, శక్తివంతమైన ప్రసంగాలివ్వటంలో దిట్ట. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో బిపిన్ చంద్రపాల్, తిలక్ లతో కలిసి ‘లాల్ బాల్ పాల్’ త్రయంగా  పేరు పొందారు. ఆయన భారత స్వాతంత్ర్య సంగ్రామానికి చేసిన సేవలు అమోఘమైనవి. ఆయన జయంతి సందర్భంగా ఆయన జీవితం గురించి,  దేశభక్తి, రాజకీయ ప్రయాణం గురించి తెలుసుకుంటే.. లాలా లజపతి రాయ్.. లాలా లజపతి రాయ్  1865 జనవరి 28న పంజాబ్లో ఉన్న ధూదికే అనే గ్రామంలో జన్మించారు. ఆయన తల్లి గొప్ప గృహిణి. తన పిల్లలలో గాఢ నైతిక విలువలను నాటింది ఆమెనే. ఆయన లా రీసెర్చి చేయడానికి లాహోర్‌లోని ప్రభుత్వ కళాశాలలో చేరాడు. అక్కడే  ఆయన భవిష్యత్ స్వాతంత్ర్య సమరయోధులైన లాలా హన్స్ రాజ్, పండిట్ గురు దత్ వంటి వారిని కలుసుకున్నారు. లా పూర్తి చేసిన తర్వాత  హర్యానాలోని హిస్సార్‌లో న్యాయవాదిగా ప్రాక్టీస్ ప్రారంభించారు.  1892లో లాహోర్ హైకోర్టులో న్యాయవాదిగా పనిచేశారు. చైతన్యోద్యమాలకు ప్రసిద్ధి చెందిన ఆయన అనేక సమావేశాలను నిర్వహించి, అనాథాశ్రమాలను స్థాపించారు. ఆయన ప్రజాసేవా కమిటీలను ఏర్పాటు చేసి ప్రజలకు స్ఫూర్తినిచ్చారు. భారత స్వాతంత్య్రానికి కట్టుబడిన  ఆయన దృఢసంకల్ప స్వభావం చాలా గొప్పది.  ఆయన ఆర్యసమాజానికి మంచి సేవకుడు. దయానంద వేదిక్ పాఠశాలను జాతీయ స్థాయిలో స్థాపించి,  హిందూ సమాజంలో ఆర్య సమాజాన్ని పునరుద్ధరించిన దయానంద సరస్వతిని  గౌరవించారు. జాతీయత భావన.. రాజకీయ ప్రయాణం..! లాలా లజపత్ రాయ్ కి పుస్తకాలు  చదవడం అంటే చాలా ఇష్టపడేవారు. ఇటలీ విప్లవ నేత గ్యూసెప్పె మజ్జిని నిర్దేశించిన దేశభక్తి, జాతీయతా స్ఫూర్తి ఆయనను ఎంతో ప్రభావితం చేసినట్లు చెప్పబడింది.  బ్రిటిష్ పాలన నుండి దేశాన్ని విడిపించటం కోసం ఆయన తన  లాయర్ వృత్తిని వదిలేసారు. పంజాబ్‌లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి అనేక రాజకీయ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 1888, 1889లలో జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశాలలో ప్రతినిధిగా పాల్గొన్నారు. బిపిన్ చంద్ర పాల్, అరవిందో ఘోష్, బాల గంగాధర్ తిలక్ వంటి ప్రముఖ అతివాద నాయకులతో కలిసి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో కొందరు నాయకులు ప్రచారం చేసే మితవాద రాజకీయాల వల్ల కలిగే  దుష్పలితాలను ఆయన చాటి చెప్పారు. 'పూర్ణ స్వరాజ్' కోసం ఆయన డొమినియన్ స్టేటస్ డిమాండ్‌ను విసిరి, తాము ఎదుర్కొన్న వ్యతిరేకతని  బలంగా చెప్పగలిగారు.  భారతదేశంలో బ్రిటిష్ పాలన ఎంత క్రూరంగా ఉందో  ప్రపంచానికి తెలియజేయాల్సిన అవసరం ఉందని భావించారు. భారత స్వాతంత్ర్య సంగ్రామంలోని పరిస్థితులను ప్రపంచానికి వివరించాల్సిన అవసరాన్ని గుర్తించారు. 1917లో న్యూయార్కులో ఇండియన్ హోంరూల్ లీగ్ ఆఫ్ అమెరికాను స్థాపించి 1920 వరకూ అక్కడే ఉన్నారు. ఆయన స్వదేశీ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. పాశ్చాత్య దేశాల నుండి దిగుమతి చేసుకునే వస్తువుల వాడకాన్ని  తీవ్రంగా వ్యతిరేకించి, స్థానిక ఆర్థిక వ్యవస్థకు సాయం అందించేందుకు, స్వయం సమర్థత పెంపొందించేందుకు స్వదేశీ ఉత్పత్తులనే  వాడమన్న  సందేశం బాగా వ్యాప్తి చేశారు. ఆయన్ని 1920లో కోల్‌కతాలో జరిగిన ప్రత్యేక కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించమని ఆహ్వానించారు. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రారంభించగా ఆ ఉద్యమాన్ని ఈయన పంజాబ్‌లో నడిపించారు.  చౌరీ-చౌరా ఘటన కారణంగా గాంధీజీ సహాయ నిరాకరణోద్యమాన్ని ఆపేశారు. ఈ నిర్ణయాన్ని లజపత్ రాయ్ తీవ్రంగా  విమర్శించి,  కాంగ్రెస్ ఇండిపెండెన్స్ పార్టీని ఏర్పాటు చేయాలనుకున్నారు.  1921 నుండి 1923 వరకు ఆయన జైలులోనే ఉన్నారు.  విడుదలైన తర్వాత ఆయనను శాసనసభకు ఎన్నికయ్యారు. 1928లో, బ్రిటిష్ సైమన్ కమిషన్‌ను బహిష్కరించాలని శాసనసభ తీర్మానాన్ని  ప్రవేశపెట్టారు. ఆ సమయంలోనే లాహోర్‌లో జరిగిన నిరసన సమయంలో, పోలీసుల లాఠీ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఈ గాయాలు ఉద్ధం సింగ్, భగత్ సింగ్ వంటి యువతకు స్ఫూర్తినిచ్చాయి.  వారి కృషే మనకి  స్వాతంత్ర్యం అందించింది. ఈ దాడి తర్వాత 17 రోజులకే, 1928 నవంబర్ 17న లాలాజీ తన చివరి శ్వాస విడిచారు.  మనకి స్పూర్తి కావాలి..  లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప నాయకుని  గురించి  ప్రతి పౌరుడూ తెలుసుకోవాలి. వారు మన దేశం కోసం చేసిన నిస్వార్ధ సేవలకి కృతజ్ఞతను తెలపాలి. అణచివేయబడుతున్నప్పుడల్లా  వారి ఉద్యమ స్పూర్తి మనకి గుర్తురావాలి. వారిలోని ధైర్యం మన గుండెల్లో నిండాలి. వారి పట్టుదల, కృషి మన భారత దేశ సంకెళ్లని ఎలా ఐతే తెంచగలిగిందో, వారు మనకోసం కలలు కన్న భారత నిర్మాణం కోసం  మన కృషి, పట్టుదల కూడా అలాగే ఉండాలి. ఆయన గాయం నుండి మనమూ ఒక పాఠం నేర్చుకోవాలి.                                                        *రూపశ్రీ.

నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందంటారు ఇందుకే….

మాట్లాడటం కూడా ఒక కళ అంటారు కొందరు. అంతి తడబాటు లేకుండా, విషయాన్ని సూటిగా, స్పష్టంగా, అది ఎదుటి వారికి నచ్చని విషయమైనా వారు నొచ్చుకోకుండా ఉండేలా చెప్పడానికి మనిషిలో ఎంతో చతురత, అంతకు మించి సమయస్ఫూర్తి ఉండాలని చెబుతారు. దీనికి ఉదాహరణగా రామాయణంలో హనుమంతుడిని చూపించేవారు ఎంతోమంది ఉన్నారు. ఎదుటివారిని మెప్పించేలా మాట్లాడటం, తనది కాని చోటుకు వెళ్లి అక్కడి నుండి క్షేమంగా తిరిగి రావడం హనుమ కార్యసాధనలో ఆయన మాటతీరే ఆయనకు బోలెడు సహాయం చేసిందని చెప్పవచ్చు.  అందుకే మన మాట తీరు అనేది చాలా ముఖ్యమని పెద్దలు చెబుతారు. మనం ఎవరితో మాట్లాడినా ఎదుటివారు మన మాట తీరుని బట్టి మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తారు. వ్యక్తిత్వం అనేది చాలా ముఖ్యం. మన మాట తీరుపైనే మన ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మన మాట తీరులోనే మనలో ఉండే సభ్యత, సంస్కారం బయటపడతాయి. మనం మాటల ద్వారానే ఎదుటివారి యొక్క ప్రశంసలను పొందవచ్చు. మనం ఎప్పుడైనా సరే ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఎదుటి వాళ్ళ ఆసక్తిని కనిపెట్టి దానికి తగ్గట్టుగా విషయాన్ని మార్చి మాట్లాడాలి. అంతేకానీ మనం మాట్లాడుతున్నది ఇక ఆపకూడదు మొత్తం చెప్పేయాలి అనే ఆలోచనలో ఎదుటివారి పరిస్థితి అసలు గమనించకుండా మాట్లాడకూడదు. మనం ఎప్పుడూ కూడా ఏదైనా ఒక విషయం గురించి చర్చించేటప్పుడు స్పష్టంగా మాట్లాడాలి. ఎందుకంటే సనుగుకుంటూ మాట్లాడితే మన మాటలు ఎదుటివారికి అర్ధం కావు. అట్లాగే వారు మనం చెప్పే దానిపట్ల ఆసక్తి చూపరు. ఎప్పుడూ మన గురించి, మన గొప్పలు గురించి గానీ, మన కుటుంబ సభ్యుల గురించిన ఎటువంటి గొప్పలను కూడా చెప్పుకోకూడదు. అట్లాంటి విషయాలు వినడానికి ఎదుటివారు ఆసక్తి చూపరు. మన దగ్గర నుంచి ఎప్పుడు తప్పించుకుందామా అన్నట్లుగా చూస్తూ ఉంటారు. అట్లాంటి పరిస్థితి ఎదుటివారికి రానివ్వకూడదు.  కొంతమంది మాట్లాడేటప్పుడు నోటిలో నుంచి తుంపర ఎదుటివాళ్ళ మీద పడుతుంది. అది మంచి పద్ధతి కాదు. మనకు అట్లాంటిది ఉంటే గనుక ఎదుటివారు మనతో మాట్లాడటానికి సంకోచిస్తారు. మన ప్రక్కన కూర్చోవాలన్నా, మనతో భోజనం చేయాలన్నా, మనతో మాట్లాడాలన్నా వారు ఇష్టపడరు. మనల్ని ఎప్పుడూ దూరంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అట్లాంటి అలవాటు ఎవరికైనా ఉంటే అది మానుకోవటం చాలా మంచిది. ఎదుటి వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడాలి. అనవసరంగా ఏ విషయం గురించీ మాట్లాడకూడదు. అట్లాగే అవసరానికి మించి ఎక్కువగా కూడా మాట్లాడకూడదు. అధిక ప్రసంగం అనర్ధాలకు మూలం. Speech is silver but silence gold అని ఒక వాక్యం ఉంది. అది అక్షరాల నిజం. అంటే దీని అర్ధం అన్ని వేళలా మౌనంగా ఉండమని కాదు. అవసరమైన చోట ఇది పాటిస్తే చాలు జీవిత గమనాన్ని మార్చుకుని మంచివైపుకు పయనం చేయగలుగుతాము.                                        ◆నిశ్శబ్ద.

రిపబ్లిక్ డే  పరేడ్ గురించి ఈ నిజాలు తెలుసా?

  రిపబ్లిక్ డే.. భారతీయులు ఎంతో గొప్పగా జరుపుకునే జెండా పండుగ. గణతంత్య్ర దినోత్సవాన్ని భారతదేశం చాలా ఘనంగా జరుపుకుంటుంది. గణతంత్ర్య దినోత్సవంలో భాగంగా చాలా రకాల ఈవెంట్లు జరుగుతాయి.  త్రివర్ణ పతాకం రెపరెపలాడుతూ ఎగురుతూ ఉంటే దేశ పౌరుల గుండెలు దేశభక్తితో  ఉప్పొంగుతూ ఉంటాయి. 2025, జనవరి 26 వ తేదీన గణతంత్ర్య దినోత్సవ వేడుకకు భారతదేశం ఇప్పటికే చాలా సన్నద్ధం అయ్యింది. ముఖ్యంగా గణతంత్ర్య దినోత్సవం సందర్భంగా జరిగే పరేడ్ కు చాలా ప్రాముఖ్యత ఉంది.  గణతంత్ర్య దినోత్సవం వెనుక కారణం.. గణతంత్ర్య పరేడ్ గురించి చాలా మందికి తెలియని విషయాలు తెలుసుకుంటే.. 1950, జనవరి 26 వ తేదీన రాజ్యాంగాన్ని అమోదించారు.  భారత ప్రజల జీవితాన్ని, వారి స్థితి గతులను మార్చేసే రాజ్యాంగం అమోదించబడిన సందర్భంలా దేశం ఒక గణతంత్ర్య రాజ్యంగా ప్రకటించబడింది.  ఇది భారతదేశంలో జాతీయ సెలవు దినం కూడా.  ఈరోజు దేశ ప్రజలు దేశం పట్ల బాధ్యత కలిగి  ఉండాలని, దేశం కోసం త్యాగాలు చేసిన వీరులను గుర్తు చేసుకోవడమే కాకుండా..  రాజ్యాంగ ప్రాముఖ్యతను అందరికీ అర్థమయ్యేలా చేయడం కూడా ముఖ్య అంశమే. గణతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని  గణతంత్ర్య దినోత్సవ పరేడ్ ను న్యూ ఢిల్లీ లోని కర్తవ్య మార్క్ లో జరుపుతారు.   76వ  గణతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోబోతున్న సందర్భంగా .. కర్తవ్య మార్క్ లో జరిగే పరేడ్ గురించి చాలామందికి తెలియని విషయాలు ఉన్నాయి.  1930లో భారత జాతీయ కాంగ్రెస్ చేసిన పూర్ణ స్వరాజ్ ప్రకటన జ్ఞాపకార్థం జనవరి 26న రిపబ్లిక్ డే జరుపుకుంటారు. ఈ ప్రకటన బ్రిటిష్ పాలన నుండి సంపూర్ణ స్వాతంత్ర్యం లభించినట్టు దేశ పౌరులకు పిలుపు ఇచ్చింది. అందరికీ రిపబ్లిక్ డే రోజు జరిగే పరేడ్ గురించి మాత్రమే తెలుసు. కానీ రిపబ్లిక్ డే పరేడ్ కోసం సన్నద్ధత ఒక సంవత్సరం ముందు జూలైలో ప్రారంభమవుతుంది. పాల్గొనేవారు తమ భాగస్వామ్యాన్ని అధికారికంగా తెలియజేస్తారు.  కవాతు రోజున వారు తెల్లవారుజామున 3 గంటలకు వేదిక వద్దకు చేరుకుంటారు. అప్పటికి దాదాపు 600 గంటల పాటు సాధన చేసి ఉంటారు. ప్రతి సంవత్సరం, రిపబ్లిక్ డే పరేడ్‌కు ముఖ్య అతిథిగా ఒక దేశ ప్రధాని లేదా రాష్ట్రపతి లేదా పాలకులను ఆహ్వానిస్తారు. ఈ ఏడాది అంటే 2025 రిపబ్లిక్ డే కి అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో విచ్చేయనున్నారు. గన్ సెల్యూట్ ఫైరింగ్ జాతీయ గీతం సాగే  సమయానికి సరిపోతుంది. గీతం ప్రారంభంలో మొదటి గన్‌షాట్ పేలుతుంది.  తరువాత  52 సెకన్ల తర్వాత కాల్చబడుతుంది. షాట్లు తయారు చేయబడిన ఫిరంగులు 1941లో తయారు చేయబడ్డాయట.  సైన్యం  అన్ని అధికారిక కార్యక్రమాలలో పాల్గొంటాయి. ప్రతి సంవత్సరం, రిపబ్లిక్ డే కోసం ఒక థీమ్ నిర్ణయించబడుతుంది. ఈ థీమ్ లో పేర్కొన్న లక్ష్యాలను చేరుకునే దిశగా..  దాన్ని సాధించే దిశగా దీనిని వివిధ రాష్ట్రాలు,  ప్రభుత్వ శాఖలు పనిచేస్తాయి. గణతంత్ర దినోత్సవ పరేడ్ 2025లో టేబుల్‌యాక్స్ థీమ్‌ను స్వర్ణిమ్ భారత్ – విరాసత్ ఔర్ వికాస్ (బంగారు భారతదేశం – వారసత్వం,  అభివృద్ధి)గా నిర్ణయించారు. సాంకేతికత, మౌలిక సదుపాయాలు,  సాంస్కృతిక వారసత్వం వంటి వివిధ రంగాలలో భారతదేశ పురోగతిని వారు ప్రదర్శిస్తారు.  రిపబ్లిక్ డే  కవాతు రాష్ట్రపతి భవన్ (ప్రెసిడెంట్ హౌస్) సమీపంలోని రైసినా హిల్ నుండి కర్తవ్య మార్గం వెంట, ఇండియా గేట్ దాటి, చారిత్రాత్మక ఎర్రకోట మీదుగా ప్రారంభమవుతుంది. భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ మైలురాయి పత్రాన్ని రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు, ఇది భారత ప్రభుత్వ చట్టం 1935 స్థానంలో ఉంది. 1950లో న్యూ ఢిల్లీలోని ఇర్విన్ స్టేడియం (ప్రస్తుతం మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియం)లో మొదటి గణతంత్ర దినోత్సవ వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో భారత సైన్యానికి చెందిన 100 కంటే ఎక్కువ విమానాలు మరియు 3,000 మంది సిబ్బంది పాల్గొన్నారు. గణతంత్ర దినోత్సవం నాడు, ప్రాణాలను కాపాడటంలో లేదా అన్యాయాలకు వ్యతిరేకంగా నిలబడటంలో అసాధారణమైన ధైర్యాన్ని ప్రదర్శించిన పిల్లలను గౌరవించటానికి జాతీయ శౌర్య పురస్కారాలు ప్రకటించబడతాయి. పద్మ అవార్డులు - భారతదేశ అత్యున్నత పౌర గౌరవాలలో ఒకటి.  దేశంపై గణనీయమైన ప్రభావాన్ని చూపిన వారిని గుర్తించి భారత రాష్ట్రపతి ఒక గొప్ప వేడుకలో పద్మ అవార్డులు అందజేస్తారు.                                                *రూపశ్రీ.  

అసమర్ధ నాయకత్వాన్ని వధించే నేటికాలపు బ్రహ్మాస్త్రం ఓటు .. 

  ఓటూ...ఓటూ నువ్వేం చేయగలవని దాన్నడిగితే,  “నేను మీరంతా ఆరాటపడే డబ్బు నోట్లని రాత్రికి రాత్రే వరదలా పారించగలను... రాజుల్లా బ్రతుకుతున్న రాజకీయ నాయకులని కూడా కూలివాడి ఇంటి ముందు  నిలబెట్టించగలను.. మీరు బాధ్యతగా ఉంటే మీ చేతుల్లో ఆయుధమై దేశ భవిష్యత్తుని, మీ భవిష్యత్తుని  మార్చేయగలను” అని అంటుందేమో.. అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశంలో ఉన్న ప్రజలకి  ఓటు విలువ గురించి బాగా తెలిసుండాలి. మనల్ని మనమే బాగుపర్చుకోవటానికి  రాజ్యాంగం మన చేతిలో పెట్టిన బ్రహ్మాస్త్రం లాంటిది ఈ ఓటు. దేశ పౌరులందరూ  ఓటుకున్న నిజమైన విలువ తెలుసుకుని, నామమాత్రపు ప్రలోభాలకి లొంగిపోకుండా దాన్ని సక్రమంగా ఉపయోగించుకున్నప్పుడు దేశ అభివృద్ధి సాధ్యమవుతుంది. అందుకే  ప్రజాస్వామ్యంలో ఓటుకున్న ప్రాముఖ్యత, బలాన్ని ప్రజలకి తెలియజేసే ఉద్దేశంతో ప్రతీ సంవత్సరం జనవరి 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము.   ఎప్పుడు మొదలైంది.... 1950, జనవరి 25న భారత ఎన్నికల సంఘం(ECI) స్థాపనకు  గుర్తింపుగా   2011 నుంచి  జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని   జరుపుకోవటం మొదలుపెట్టారు. ఈ రోజు  ఓటర్లందరూ ఎన్నికల్లో పాల్గొనేలా  ప్రోత్సహించడానికి, అర్హత కలిగిన ప్రతీ పౌరుడు ఓటరుగా నమోదు కావాలనే అవగాహన కలిగించడానికి ప్రారంభమైంది. కాలక్రమేణా ఇది ఓటు హక్కు ప్రాముఖ్యత గురించి ప్రజలకి  అవగాహన కలిగించడం, ప్రజాస్వామ్య విలువలను ప్రోత్సహించడంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఏడాది జరిగే 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం నాటికి  భారత ఎన్నికల సంఘం  స్థాపన జరిగి 75 ఏళ్లు పూర్తవుతుంది.   ఓటు  విలువ.. మందుకో, నోటుకో లేక ఇతర ప్రలోభాలకో  అమ్ముడుపోయి  రాజ్యాంగం మనకిచ్చిన  విలువైన ఓటు  హక్కుని  వృధా చేసుకోవద్దనీ, సరిగా వినియోగిస్తే  దేశ భవిష్యత్తును రూపుదిద్దడంలో  ఓటుదే ప్రధాన పాత్ర అనే విషయాల గురించి ప్రజల్లో అవగాహన కలిగాలి.  ఓటు హక్కు వయస్సుని 21 నుంచి 18కి కుదించారు కనుక అధిక యువ జనాభా ఉన్న భారత దేశ భవిష్యత్తుని మార్చగల శక్తి యువ ఓటర్లలో ఉంటుంది. అందుకే బాధ్యతగా ఉండి సరైన నాయకుణ్ణి ఎన్నుకోవటంలోనే తమ భవిష్యత్తు, దేశ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్న నిజాన్ని యువ ఓటర్లు గ్రహించేలా చేయటానికి,  నిష్పక్షపాతంగా  ఎన్నికలు జరిగేందుకు  కృషి చేసిన అధికారులు, భాగస్వాములు, సంస్థలను "ఉత్తమ ఎన్నిక పద్ధతుల పురస్కారాలు" ఇచ్చి గుర్తించడానికి గానూ  ఈరోజు  ఒక వేదికవుతుంది. ప్రజాస్వామ్యంలో ఓటుహక్కు .. ఓటుహక్కు అనేది పౌరులకు తమ నాయకులను తామే  ఎంపిక చేసుకుని ప్రజాస్వామ్యాన్ని బలపర్చే అవకాశం ఇస్తుంది.  జవాబుదారీగా ఉండే అవకాశం ఇస్తుంది. ఎన్నికల సమయంలో ఓటర్లు  తీసుకున్న నిర్ణయాలే దేశ విధానాలు, అభివృద్ధిపై ప్రభావం చూపుతాయి. ఓటు హక్కు అన్ని వర్గాల వారు ఉపయోగించటం వల్ల  అన్ని కమ్యూనిటీల నుండి విభిన్న ప్రతినిధులు ఎన్నికై  వారి భావాలని, బాధలని  దేశానికి  వినిపించేందుకు అవకాశం దొరుకుతుంది.  99.1 కోట్ల ఓటర్లను నమోదు చేసి భారతదేశం ఒక సరికొత్త రికార్డు నెలకొల్పింది. అందులో యువ ఓటర్లు  21.7 కోట్లు మంది ఉన్నారని గణాంకాలు చెప్తున్నాయి. ఓటు హక్కు విలువ ఎంత అంటే.. భారతదేశంలో ఉన్న వందకోట్ల ప్రజానీకం విలువంత..   కాబట్టి ఎవరూ ఓటు హక్కును తృణ ప్రాయంగా త్యజించడం లేదా అవగాహన లేకుండా ఓటు వేయడం చేయకూడదు. ఓటింగులో ఉన్న సవాళ్లు.. ఇప్పటి ఎన్నికల్లో ఎక్కువగా ఓటు వేయటానికి ఆసక్తి చూపించనిది ఎవరని తెలిస్తే ఆశ్చర్యపోక మానరు.. ఎందుకంటే  విధ్యాబుద్ధులు లేని ఎక్కడో మారుమూల ప్రాంతాల్లో ఉండే  గిరిజన తెగవారు కూడా ఓటుహక్కు వినియోగించుకుంటుంటే, ఎంతో చదువుకుని నగరాల్లో స్థిరపడి నాగరికత గురించి లెక్చర్లు ఇచ్చేవారు మాత్రం ఓటు వేయకుండా ఎన్నికల రోజుని ఒక సెలవురోజులా చూస్తున్నారు.  ఇది ప్రజాస్వామ్యానికి ఎంత ప్రమాదమో ఎన్నికల సంఘం ఎప్పటికప్పుడు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెడుతూనే ఉంది.  ఓటు హక్కు, ఎన్నికల  ప్రక్రియల గురించి సరైన అవగాహన లేకపోవడం వల్ల కూడా చాలా మంది ఓటు వేయకుండా ఉండిపోతున్నారు. అలాగే జీవనోపాధి కోసం  దూర ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు వచ్చే వీలు లేక, తగిన సౌకర్యాలు కల్పించలేకపోవటం వల్ల కూడా  ఓటింగ్ తగ్గుతుందని చెప్పాలి. ఓటు..  ప్రతి పౌరుడి బాధ్యత.. మన ఒకరి ఓటుతో   పెద్దగా ఒరిగేదెముందిలే? అని ఆలోచించే ప్రతీ ఒక్కరు మరో సారి పునరాలోచించాలి ఎందుకంటే ఒక ఇంటి పెద్ద సరిగా లేకుంటే కుటుంబం ఎలా నాశనమవుతుందో, ప్రజలు ఎన్నుకునే నాయకుడు అవినీతిపరుడో, అసమర్ధుడో అయితే సమాజం, దేశం నాశనమవుతాయన్న నిజాన్ని గ్రహించాలి. అన్నీ తెలిసినవాళ్ళు చదువుకున్న మూర్ఖుల్లా మిగిలిపోకుండా బాధ్యతగా వ్యవహరించాలి. ప్రజాస్వామ్యాన్ని బలపరచడంలో ఓటు హక్కు విలువను నలుగురికీ తెలియజేయాలి.  ప్రజాస్వామ్య వారసత్వాన్ని గౌరవించడమే కాకుండా, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడంలో పౌరులంతా భాగస్వాములు కావాలి. అప్పుడే ఓటు విలువ,ఓటు వేసే మనిషి విలువ కూడా పదిలంగా ఉంటుంది.                                    *రూపశ్రీ.

తెలియని తాళం వేసిన అన్ని తలుపులని విద్య తెరవగలదు!

  ‘’విద్య లేనివాడు వింత పశువు” అనే పాత తెలుగు సామెత వినటానికి కొంచెం కఠినంగా అనిపించినప్పటికీ,   మనిషికి విద్య  ఎంత ముఖ్యమో మొట్టికాయ పెట్టి  మరీ చెప్పినట్టు ఉంటుంది. జ్ఞానం అనేది  ఒక శక్తి. అది విద్య నుంచే మొదలవుతుంది.  ఇప్పుడు విద్య అనేది కేవలం ఒక మానవ హక్కు మాత్రమే కాదు ఒక కనీస అవసరం.  ఇది వ్యక్తిగత అభివృద్ధి, ఆర్థిక వృద్ధి, సామాజిక పురోగతికి మూలస్తంభం. ఈ రోజుల్లో సమాజంలో మనగలగలగాలంటే  డబ్బు ఎంత ముఖ్యమో, విద్య అంత కన్నా ముఖ్యం. ఒక మనిషిలో ధైర్యం, ఆత్మవిశ్వాసం నింపగలిగే శక్తి విద్యకుంది. అందుకే  దీని ప్రాముఖ్యతని, అవసరాన్ని గుర్తించిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ  2018లో  విద్య దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించింది. అప్పటినుంచి ప్రతి ఏడాది జనవరి 24న  ప్రపంచమంతటా అంతర్జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి  విద్య ప్రాముఖ్యత  గురించి, అందరికీ విద్య అందించటంలో ఎదురవుతున్న సవాళ్ళ గురించి, వాటిని పరిష్కరించడానికి  కొత్త పరిష్కారాల  గురించి తెలుసుకుంటే..... అందరికీ విద్య  అవసరమే..... విద్య ఒక వ్యక్తి వ్యక్తిత్వ వికాసానికి మాత్రమే కాకుండా, సమాజం అభివృద్ధికి కూడా కీలకంగా ఉంటుంది. నిరక్షరాస్యతను తగ్గించడం, ఆర్థిక స్థితిని మెరుగుపరచడం వంటి అంశాల్లో విద్య ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఇది మెరుగైన ఆర్థిక అవకాశాలను అందించి ప్రజలను పేదరికం నుంచి బయటకు తీసుకువస్తుంది. మన దేశ జనాభాలో సంపన్నులకంటే దరిద్రంలో బ్రతికేవారి సంఖ్యే ఎక్కువ కనుక  ఆ దారిద్ర్యం నుంచి బయటపడాలంటే విద్య అనే ఆయుధం చేపట్టాలి. అందుకే ఒక చిన్న కూలిపని చేసుకునే వ్యక్తి కూడా తన కష్టం తమ పిల్లలకి రాకూడదని పిల్లలను  చదివించి వారి  భవిష్యత్తుని తీర్చిదిద్దాలనుకుంటున్నారు.  విద్య  ద్వారానే సమానత్వం సాధ్యమవుతుంది.  అంబేద్కర్ వంటి గొప్ప వ్యక్తులు కూడా ఎంతో వివక్ష, అవమానాలను ఎదుర్కొన్నప్పటికీ విద్యనే ఆయుధంగా మలచుకుని గొప్పవాళ్లయ్యారు. దేశ చరిత్రలోనే నిలిచిపోయారు.. ‘విద్య అనేది పులిపాల వంటిది, దాన్ని తాగినవారు గర్జించకుండా ఉండలేరు” అనేది ఆయన మాట. అలాగే లింగ సమానత్వం, సామాజిక అసమానతలను తగ్గించడం వంటి ఇతర  లక్ష్యాలను సాధించడంలో  కూడా  విద్య సాయపడుతుంది. అంతర్జాతీయ విద్యా దినోత్సవం 2025 థీమ్.... "ఏఐ మరియు విద్య- ఆటోమేషన్ ప్రపంచంలో మానవ ఏజెన్సీని సంరక్షించడం" అనే థీమ్ ను 2025 అంతర్జాతీయ విద్య దినోత్సవం సందర్భంగా ఎంచుకున్నారు. ఈ థీమ్ అంతర్జాతీయ విద్యా సవాళ్లపై ఏ‌ఐ ప్రభావమేంటో తెలుసుకోవటంపైన,  అలాగే సాంకేతిక పరిజ్ఞానం వేగంగా అభివృద్ధి చెందుతున్న సమయంలో మానవ స్వేచ్ఛను ఎలా పరిరక్షించాలి, నిర్వహించాలి,  పెంపొందించాలి అనే దానిపై కేంద్రీకృతమవుతుంది. సాంకేతిక అభివృద్ధిని అర్థం చేసుకుని, దానిని సమర్థంగా ఆవిష్కరించడానికి వ్యక్తులు, సముదాయాలను సన్నద్ధం చేయడంలో విద్య  శక్తిని గ్రహింపజేస్తుంది. అందరికీ విద్య అందించటంలో ఎదురవుతున్న  సవాళ్లు…… విద్యను ప్రాథమిక హక్కుగా గుర్తించినప్పటికీ,  ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది పిల్లలు, యువత విద్యను పొందడంలో లేదా మొదటిపెట్టిన చదువు  పూర్తిచేయడంలో అడ్డంకులను ఎదుర్కొంటున్నారు. చాలా కుటుంబాలు మౌలిక అవసరాలను తీర్చాటానికే  ఇబ్బంది పడుతూ, పాఠశాల ఫీజులు, యూనిఫాంలు, పుస్తకాలను కొనలేకపోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, సంక్షోభాలు లక్షలాది మంది విద్యను అడ్డుకుంటూ, పిల్లలను పాఠశాలల నుండి దూరం చేస్తున్నాయి.  చాలా ప్రాంతాల్లో సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక కారణాల వల్ల అమ్మాయిలను విద్య నుండి దూరం చేస్తున్నారు.   ముఖ్యంగా  కుటుంబాల నుండి విడిపోయిన పిల్లలు లేదా చాలా పేదరికంలో ఉన్న పిల్లల విద్యావకాశాలని  చాలా ప్రభావితం చేస్తున్నాయి.   అందరికీ విద్య  చేరేలా ఏం చేయగలం..... 244 మిలియన్లకు పైగా పిల్లలు, యువతులు ప్రపంచవ్యాప్తంగా పాఠశాల విద్యకు దూరంగా ఉన్నారు. పాఠశాలకు వెళ్లే 600 మిలియన్లకు పైగా పిల్లలు ప్రాథమిక అక్షర, సంఖ్యాజ్ఞానం సాధించలేకపోతున్నారు. ఎందుకంటే విద్యపట్ల అవగాహన లేకపోవటం, నాణ్యమైన విద్య అందకపోవటం జరుగుతోంది.  అప్పట్లో మన ఊళ్లలోనే చదువుకోవటం ఎంత ముఖ్యమో చెప్పటానికి ‘అన్నాదమ్ముల నాటకం’ వేసి అందరికీ అవగాహన కలిగించే ప్రయత్నం చేసేవారు గుర్తుందా.... మరి అలాంటిది సోషల్ మీడియా యుగంలో ఉన్న మనకి విద్య పట్ల అవగాహన వ్యాప్తి చేసే మార్గాలు చాలా ఉన్నాయి. విద్యకి  గ్లోబల్గా ఉన్న సవాళ్ళని గుర్తించి సోషల్ మీడియాలో అందరి దృష్టికీ తీసుకురావాలి. #అందరికీ విద్య, #నాణ్యమైన విద్య  వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగించి గణాంకాలు, కథనాలు, విశ్లేషణలను సోషల్ మీడియా ద్వారా పంచుకోవాలి. ఎదురవుతున్న సవాళ్ళకి పరిష్కారాలు చూపించే  ఆన్‌లైన్ లేదా స్థానిక ఈవెంట్‌లలో పాల్గొనాలి.  విద్యలో సమానత్వం, అందుబాటులో ఉన్న విద్యను ప్రోత్సహించటం వంటి  విద్యా సంస్కరణలను సమర్థించాలి. విద్య కేవలం పాఠశాల స్థాయిలోనే కాకుండా నైపుణ్యాలను అభివృద్ధి చేసే విధంగా ఉండేలా నూతన విద్యా విధానాల అమలు కోసం పిలుపునివ్వాలి.  పర్యావరణ సంరక్షణ, సాంకేతికత, ఆర్థిక సుస్థిరత వంటి అంశాలను విద్య ద్వారా నేర్పించాలి. చదువుకోవాలనే తపన ఉన్న పేదపిల్లలకి  ఆర్ధిక సాయం అందించే మార్గాలు చూపాలి. పనులకి వెళ్ళి చదువుకి దూరమైపోతున్న పిల్లల్ని గుర్తించి వారికి తగిన సౌకర్యాలు కల్పించి, చదువుకి దగ్గర చేయాలి.  ‘అందరికీ విద్య- మనందరి భాద్యత’ అన్న మాటని అందరం నిలబెట్టుకోవాలి.                             *రూపశ్రీ.

ఆమె కనే కలలకి రెక్కలనివ్వు.. అంతరిక్షపు అంచులని కూడా  తాకగలదు.. 

  భారతీయ సమాజంలో ఇప్పటికీ ఒక మచ్చలా ఉండిపోయిన అంశం.. ఆడపిల్లని ఒక పెద్ద భారంగా చూడటం లేదా అప్రయోజకురాలని ముందే నిర్ణయించేయటం. కాలం ఎంతలా మారినా ఇప్పటికీ ఎక్కడో ఒకచోట  తల్లిదండ్రుల నోటి నుంచో, ఏ బంధువుల నోటి నుంచో ‘ఆ...డపిల్ల పుట్టిందా..!’ అన్న పెదవి విరుపు మాట వినాల్సి వస్తుంది.  ఇన్నేళ్ల తర్వాత కూడా ఇది జరుగుతోందంటే అది నిజంగా మన సమాజపు దౌర్భాగ్యమనే చెప్పాలి. ఊరికో అమ్మవారిని కొలిచే సాంప్రదాయం ఉన్న భారతీయులు తమ ఇంట్లో ఆడపిల్ల పుడితే అపురూపంగా చూడలేకపోతున్నారు. వీర వనితల గురించి, సమాజం మీద వారు చూపించిన ప్రభావం గురించి పురాణాలు, గత చరిత్రలు సాక్ష్యాలుగా నిలుస్తున్నా కూడా ఆడపిల్ల జీవితం అమ్మ కడుపులోనో, రోడ్డు పక్కన చెత్తబుట్టలోనో అంతమవుతూనే ఉంది. ఇప్పుడిప్పుడు కొంత మార్పు మొదలైనా కూడా అదంతా పైపై మెరుగులా స్త్రీ జాతికి ఏదో మేలు జరిగిపోతోందనే మాటలు మాత్రం ఎక్కువ ఉంటాయి. సమాజంలో మహిళల ప్రాధాన్యతపై అవగాహన పెంచడానికి,  భారత యువ జనాభాలో కీలక భాగమైన బాలికల ప్రాముఖ్యతను ప్రజలకు చాటి చెప్పడానికి, వారి విద్య గురించి అవగాహన కల్పించడానికి 2008 నుంచి  ప్రతీ సంవత్సరం జనవరి 24న జాతీయ బాలికా దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. బాలికలకూ బంగారు జీవితం.. ఆపిడ్డలలు  తమ కుటుంబంలోనూ, సమాజంలోనూ చాలా వివక్షను ఎదుర్కొంటున్నారు. అందుకే ఈ వివక్షని నిర్మూలించటానికి, సమాజంలో ఆడపిల్లల  పట్ల ఉన్న అభిప్రాయాన్ని మార్చటానికి, మన నాగరికత మనుగడకి బాలికలు కూడా ముఖ్యమేనన్న  విషయం అర్ధమయ్యేలా వివరించటానికి జాతీయ బాలికా దినోత్సవం మంచి వేదిక అవుతుంది. ఆడపిల్లలు ఎంతో వివక్ష ఎదుర్కొంటున్న రోజుల్లోనే వారి  విద్య కోసం ఎన్నో కష్టాలని, అవమానాలని ఎదుర్కొని మరీ తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా మారిన  సావిత్రిబాయి ఫూలే, తొలి మహిళా వైద్యురాలిగా మారిన చంద్రపభా సైకియాని,  ఫాతిమా షేక్ లాంటి పలువురు సంఘ సంస్కర్తల   త్యాగాలను, పోరాటాన్ని ఈ రోజు మనకి  గుర్తు చేస్తుంది. ఆడపిల్లల భ్రూణ హత్యలని నిరోధించటం, బాలికల విద్యను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలను గుర్తుచేస్తుంది. బాలికల హక్కులు, సమాజంలో వారి పాత్రపై అవగాహన పెంచడమే దీని ప్రధాన లక్ష్యం. భారతదేశ భవిష్యత్తుకు బాలికలు కూడా కీలకమైన భాగమనీ, వారిని రక్షించడం, విద్యను అందించడం, సమాన అవకాశాలు కల్పించడం ఎంత ముఖ్యమో గుర్తు చేస్తుంది. 2025 థీమ్..... భారత ప్రభుత్వం జాతీయ బాలిక దినోత్సవం 2025కి గానూ, “ఉజ్వల భవిష్యత్తు కోసం బాలికలకి సాధికారత కల్పించటం” అనే అంశాన్ని ఎంచుకుంది.  ఈ థీమ్ మన దేశ భవిష్యత్తు బాగుండాలంటే దాని నిర్మాణంలో బాలికలకి కూడా సమ ప్రాధాన్యమిచ్చి, సాధికారత కల్పించాలన్న విషయాన్ని తెలియజేస్తుంది. సమాజ అభివృద్ధిలో  వారి పాత్రను హైలైట్ చేస్తుంది. సాధించాల్సిన లక్ష్యాలు.... బాలికల హక్కుల గురించి ప్రజలకు అవగాహన కల్పించి,  సమాజంలో మగవారితోపాటూ సమానావకాశం ఇవ్వాలి.  వారికి  నాణ్యమైన విద్యావకాశాలు కల్పించి, వారి కలలను సాధించడంలో సహాయం చేయాలి.  బాలికలు ఆత్మవిశ్వాసంతో ఉండేందుకు, స్వయం సమర్థతను పొందేందుకు,  స్వంతంగా చురుకైన  నిర్ణయాలు తీసుకోగలిగేలా  ప్రోత్సహించాలి.  భారతదేశంలో బాలికల అభ్యున్నతికి, సంక్షేమానికి  మద్దతు ఇచ్చేలా చర్యలు తీసుకోవటం,  విధానాలను రూపొందించటం చేయాలి. బాలికల పట్ల అడుగడుగునా జరిగే అత్యాచారాలు, దౌర్జన్యాలని అరికట్టి సురక్షితమైన వాతావరణాన్ని అందించడానికి సమాజాన్ని  ప్రోత్సహింఛాలి.     బాలికల అభివృద్ధితోనే  మన దేశ అభివృద్ధి..... ప్రతీ బాలికకు తగిన గౌరవం, అవకాశాలు లభించేవరకు ఈ దినోత్సవ లక్ష్యం నెరవేరనట్టే అర్ధం. ప్రతి ఒక్కరూ బాలికలను రక్షించి,  వారికి భవిష్యత్తు అందించడానికి కృషి చేయాలి.  బాలికలను శక్తివంతం చేసి, సమాజపు మూస ధోరణిలను పగలగొట్టాలి.  ప్రతీ  బాలికలోనూ  అపారమైన సామర్థ్యం ఉందని గుర్తుచేస్తూ, వారి ప్రతిభను గుర్తించి, ప్రశంసించడం  ద్వారా మనం మరింత గొప్ప సమాజాన్ని నిర్మించగలుగుతాం. లింగ సమానత్వం ఒక కల కాదు నిజమేనని నిరూపించేలా అడుగులు వేస్తూ,  అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తే దేశ అభివృద్ధి సాధ్యమవుతుందని అందరూ అర్ధం చేసుకోవాలి. వారు అనుకుంటే అంతరిక్షం కూడా చేరుకోగలరన్న నమ్మకాన్ని మన ఇంటి ఆడపిల్లకి ఇచ్చిననాడు, భారతదేశంలోని ఆడబిడ్డలంతా వారి శక్తి సామర్ధ్యాలతో సమాజపు రూపురేఖలనే మార్చగలుగుతారు. ఆడపిల్లే కదా అని అలుసుగా చూడకు... ఆమె లేకపోతే సమాజం ఒంటెద్దు బండిలా కుంటుతూ నడుస్తుందన్న నిజాన్ని గ్రహించు.                                               *రూపశ్రీ.

నేతాజీ సుభాస్ చంద్రబోస్.. పరాక్రమ్ దివస్2025..!

  “నాకు నీ రక్తమివ్వు, నేను నీకు స్వేచ్చనిస్తాను” అనే  నినాదం ఈ దేశ భవిష్యత్తును మరో మలుపుకు తీసుకెళ్లింది.   బానిస సంకెళ్లలో నలిగిపోతున్న ఈ దేశం   అడుక్కోవటం వల్లనో లేక బ్రతిమిలాడడటం వల్లనో స్వేచ్ఛ సంపాదించలేదని, పోరాటం చేసి ఆ  సంకెళ్లని ఈ దేశ ప్రజలే  తెంచుకోవాలన్న సందేశాన్ని భారత పౌరులకి సూటిగా అందజేయగలిగింది ఈ నినాదమే..  స్వాతంత్ర్యం కోసం మనం అమరులమయినా పర్వాలేదు, మన సమాధులే మెట్లుగా స్వతంత్ర సాధనవైపు అడుగులు పడితే చాలు అనుకున్న గొప్ప దేశ భక్తుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయనకున్న అపారమైన దేశభక్తి స్వాతంత్ర్య పోరాటంలో అనేకమందికి స్ఫూర్తిగా నిలిచింది. సివిల్ సర్వీసెస్ కూడా వదిలేసి భారతదేశానికి సేవ చేయాలనే తపనతో స్వాతంత్ర్య పోరాటంలో భాగమైన మహనీయుడాయన. స్వాతంత్య్ర పోరాటంలో తన అపూర్వమైన నాయకత్వం, ధైర్యం, త్యాగంతో లక్షలాదిమందికి స్ఫూర్తిగా నిలిచి, భారతీయుల హృదయాల్లో ఒక శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప నాయకుడు నేతాజీ సుబాష్ చంద్రబోస్..  ఆయన త్యాగాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం ఆయన జయంతి దినమైన జనవరి 23ను ‘పరాక్రమ దినోత్సవం’గా గుర్తించి ప్రతీ సంవత్సరం జరుపుకుంటుంది. ఈ రోజు  గురించి, నేతాజీ  పోరాటం గురించి,  ఆయన నాయకత్వం గురించి తెలుసుకుంటే. నేతాజీ సుభాష్ చంద్రబోస్.. నేతాజీ 1897,జనవరి 23న  ఒడిషాలోని కటక్‌లో జన్మించారు. ఆయనలో చిన్ననాటి నుంచే దేశభక్తి భావనలు గాఢంగా పెరిగాయి.  ఆయన తల్లిదండ్రుల సూచనతో ఇంగ్లాండ్‌లోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఇండియన్ సివిల్ సర్వీస్(ఐసి ‌ఎస్) కోసం సిద్ధమయ్యారు. 1920లో సివిల్ సర్వీస్ పరీక్షలో పాసయ్యారు. కానీ 1921 ఏప్రిల్‌లో భారతదేశంలో జరుగుతున్న జాతీయవాద ఉద్యమాల గురించి తెలుసుకుని అక్కడ రాజీనామా చేసి భారతదేశానికి తిరిగి వచ్చారు. గాంధీజీ అనుచరుడిగా, చిత్తరంజన్ దాస్ రాజకీయ శిష్యుడిగా రాజకీయ జీవితం మొదలుపెట్టిన నేతాజీ తర్వాత యువజన నాయకుడిగా, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శిగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అధ్యక్ష పదవిని కూడా చేపట్టారు. తర్వాత నేతాజీ  విధానాలు నచ్చకపోవటంతో   గాంధీగారి మద్దతు దొరకలేదు.  అయినా సరే భారత స్వాతంత్రోద్యమంలో కీలకపాత్ర పోషించిన ఒక దూరదృష్టి కలిగిన నాయకుడు సుబాష్ చంద్రబోస్. ఆయన నాయకత్వం భారత స్వాతంత్ర్య పోరాటానికి కొత్త దిశను అందించింది. “స్వాతంత్ర్యం ఎవరూ ఇవ్వరు,  దాన్ని మనమే సంపాదించుకోవాలి” వంటి నినాదాలు కోట్లాది మందికి స్ఫూర్తి నిచ్చాయి. స్వాతంత్య్రాన్ని  సాధించడానికి ఆయన ప్రదర్శించిన పట్టుదల, అనుసరించిన తెలివైన విధానాలు ఆయనను జాతీయ నాయకుడిగా నిలిపాయి.  స్వాతంత్ర ఉద్యమానికి చేసిన కృషి.. రాజకీయంలో అంచెలంచెలుగా ఎదిగి, 1938-39లలో  ఐ‌ఎన్‌సి  అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు నేతాజీ. మహాత్మా గాంధీ సిద్ధాంతాలతో ఈయన విభేధించారు.  ఈ  కారణంగా రాజీనామా చేసి స్వతంత్ర మార్గంలో స్వాతంత్ర్యం సాధించాలన్న తన విధానాన్ని అమలు చేశారు. 1939లో ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించి, వామపక్ష భావజాలాన్ని వ్యాప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీలో ఆక్టివ్గా ఉన్న ప్రతీ వర్గాన్ని ఒక తాటిపైకి తీసుకువచ్చి,  స్వాతంత్ర్య ఉద్యమానికి మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా పనిచేశారు. ఆయన 1941లో భారతదేశం నుండి జర్మనీ వెళ్ళి కూడా భారత స్వాతంత్ర్యం కోసం పనిచేశారు. రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో జపాన్, జర్మనీతో స్నేహం చేయటం ద్వారా, వలస పాలనకు వ్యతిరేకంగా భారత్ పోరాటాన్ని బలపరిచారు.  1943లో ఆయన సింగపూర్‌కు వచ్చి ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్‌కు నాయకత్వం వహిస్తూ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను(ఇండియన్ నేషనల్ ఆర్మీ) పునర్నిర్మించారు. భారతీయ యుద్ధ ఖైదీలు, ఆగ్నేయాసియాలోని వివిధ దేశాల్లో స్థిరపడిన భారతీయులని కలిపి  దాదాపు 45,000 మంది సైనికులతో ఈ ఐ‌ఎన్‌సి ఏర్పాటు చేశారు. ఇది భారత స్వాతంత్య్రానికి సమర్థవంతమైన సాధనంగా మారింది. ఈ ఆజాద్ హింద్ ఫౌజ్ భారతదేశాన్ని బ్రిటీష్ పాలననుంచి విముక్తి చేయడంలో విఫలమైనప్పటికీ,   స్వాతంత్ర్య ఉద్యమానికి  స్పూర్తినివ్వటంలో కీలక పాత్ర పోషించింది. "ఢిల్లీ చలో", "జై హింద్" వంటి ఆజాద్ హింద్ ఫౌజ్ నినాదాలు  భారతీయుల ఐక్యతను, ధైర్యాన్ని పెంచాయి. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో రాణి ఝాన్సీ రెజిమెంట్‌ను ఏర్పాటు చేయడం స్వతంత్ర పోరాటంలో మహిళల పాత్రను ప్రోత్సహించింది. నేతాజీ అనుసరించిన విధానాలు, సైనిక చర్యలవల్ల మున్ముందు భారత సైన్యం తమకి విశ్వాసంగా ఉంటుందన్న నమ్మకం లేదన్న విషయం   బ్రిటిషు వారికి అర్ధమైంది. తద్వారా భారత స్వాతంత్ర్య ప్రక్రియ వేగవంతమైంది.   ఆయనే త్యాగమే మనకు స్పూర్తి..  మన దేశానికి స్వాతంత్ర్యం అందించడంలో జీవితాన్ని త్యాగం చేసిన  గొప్ప నాయకుడు నేతాజీ..  ఆయనను గౌరవించడానికి ఒక అద్భుత అవకాశం ఆయన జన్మదినం. ఆయన 128వ జయంతి సందర్భంగా ఆయన చూపిన  ధైర్యం, పట్టుదల, త్యాగం, ఆయన పోరాటం, ఆయన నాయకత్వం వంటివన్నీ అందరికీ స్పూర్తిగా నిలవాలి. ఆయన చేసిన కృషిని, దేశ నిర్మాణానికి ఇచ్చిన సహకారాన్ని గుర్తు చేసుకుంటూ స్వేచ్ఛ, అభివృద్ది కలిగిన భారతదేశ నిర్మాణానికి అందరూ కలిసి పనిచేయాలి. ప్రతీ పౌరుడు ఐకమత్యం, ధైర్యం, దేశం పట్ల అంకితభావం అనే ఉన్నత లక్షణాలని అలవర్చుకోవాలి. నేతాజీ హిమాలయాలకు వెళ్ళిపోయాడని,  ఆయన అక్కడే ఉంటాడని చాలా వార్తలు వ్యాపించాయి.  హిమశిఖరాలలో తానూ ఒక శిఖరంగా మారి ఈ దేశానికి ఆయన ఎప్పుడూ కాపు కాస్తుంటాడని భారతీయ దేశభక్తులు,  నేతాజీ త్యాగాన్ని అర్థం చేసుకున్న వారి విశ్వాసం. నేటి కాలం యువత దేశం తల ఎత్తుకునేలా చేయడమే ఆయనకు ఇచ్చే గొప్ప బహుమానం అవుతుంది.                                          *రూపశ్రీ.