వినాయకుడి విగ్రహం ప్రాముఖ్యత ఏంటి? మనం ఏం నేర్చుకోవచ్చు?

ప్రతి ఇంట్లో ఖచ్చితంగా వినాయకుడి విగ్రహం ఉండనే ఉంటుంది.  మరీ ముఖ్యంగా వినాయక చవితి అంటే తప్పనిసరిగా ఎలాంటి పేదలు అయినా సరే.. తమకున్న స్థోమతలో వినాయక విగ్రహాన్ని ప్రతిష్టించి పూజ చేసుకుని ఆ స్వామి ఆశీర్వాదం పొందుతారు. అయితే వినాయకుడు కేవలం దేవతగానే కాకుండా ఆయన రూపం చాలా విషయాలు చెప్పకనే చెబుతుంది.  ఇంతకీ వినాయకుడి విగ్రహం నుండి మనం ఏం నేర్చుకోవచ్చు? తెలుసుకుంటే.. వినాయకుడికి పెద్ద తల ఉంటుంది.  తల పెద్దగా ఉండటం అంటే పరిమాణం కాదు.. ఆలోచనలు మెరుగ్గా ఉండాలని అర్థం. మెరుగ్గా ఆలోచించే వారు వ్యక్తిత్వ పరంగా మెరుగ్గా ఉంటారు. వినాయకుడి చెవులు చాలా పెద్దగా ఉంటాయి.  ఈ పెద్ద చెవులు శ్రద్ధగా వినమని చెబుతాయి.  ఏది చెప్పినా శ్రద్దగా వినేవారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోరు. వినాయకుడి కళ్లు చాలా చిన్నగా ఉంటాయి. ఈ చిన్న కళ్ళు సూక్ష్మ విషయాలను కూడా చాలా పరిశీలనగా దృష్టి కేంద్రీకరించి చూడాలని చెబుతాయి. వినాయకుడి శరీర పరిమాణానికి తగ్గట్టు చూస్తే  నోరు చిన్నది.  చిన్న నోరు తక్కువ మాట్లాడమవి చెబుతుంది. తక్కువ మాట్లాడేవారు ఎప్పుడూ ఉత్తములు. వినాయకుడికి పెద్ద బొజ్జ ఉంటుంది. మంచి చెడులను జీర్ణించుకోవాలని ఈ పెద్ద బొజ్జ సూచిస్తుంది. పొడవాటి తొండం..  ప్రతికూలతను కూడా అనుకూలతగా మార్చుకోవాలని చెబుతుంది. అదే మనిషి బలాన్ని పెంచుతుందని చెబుతుంది. చేతులు.. ఆశీర్వదించడానికి  రక్షించడానికి ఎప్పుడూ ముందుండాలనే ఉద్దేశ్యాన్ని వినాయకుడి ఆశీర్వాద భంగిమ సూచిస్తుంది. వినాయకుని దంతాలలో ఒకటి విరిగిపోయి ఉంటుంది. విరిగిన దంతానికి ప్రతీక ఏమిటంటే తెలివైన వ్యక్తి ద్వంద్వత్వానికి అతీతంగా ఉంటాడు. అంటే  ఒకే దంతము  ఏక కోణాన్ని సూచిస్తుంది. గణేశుడి నాలుగు భుజాలు నాలుగు గుణాలకు ప్రతీక - అవేంటంటే... మనస్సు, బుద్ధి, అహంకారం,  మనస్సాక్షి. వినాయకుడు  ఒక కాలు పైకి లేపి, మరొకటి నేలపై ఉంచి కూర్చుని ఉంటాడు. ఇది  ఆధ్యాత్మిక,  భౌతిక ప్రపంచాలు రెండింటిలోనూ పాల్గొనాలని సూచిస్తుంది.                                                     *రూపశ్రీ.

జైన మతాన్ని అందించిన తీర్థంకరుడు.. 

  జైన మతంలో అత్యంత ముఖ్యమైన పండుగలలో మహావీర్ జయంతి ఒకటి. ఈ సంవత్సరం మహవీర్ జయంతి 2025 ఏప్రిల్ 10వ తేదీ గురువారం నాడు జరుపుకుంటారు. ఇది జైన మతం  24వ  తీర్థంకరుడు అయిన  మహావీర్ 2623వ జన్మదినం  జైన మతంలో 24వ తీర్థంకరుడు అయిన మహావీరుడే చివరి తీర్థంకరుడు కూడా. మహావీర్ జయంతి  ఏప్రిల్ 9 లేదా ఏప్రిల్ 10 అనే విషయంలో కొంత గందరగోళం ఉంది. జైన క్యాలెండర్,  సాంప్రదాయ పంచాంగం ప్రకారం మహావీర్ జయంతి ఈ సంవత్సరం ఏప్రిల్ 10 న అవుతుంది. వర్ధమానుడు అని కూడా పిలువబడే  మహావీరుడు క్రీ.పూ. 599లో కుండలగ్రామ (ప్రస్తుత బీహార్‌లోని వైశాలి జిల్లా)లో జన్మించాడు. ఆధ్యాత్మిక గురువు అయిన మహావీరుడు జైనమతం  ప్రధాన సూత్రాలైన అహింస , సత్యం,  స్వాధీనత లేకపోవడం (అపరిగ్రహం)లను రూపొందించాడు. ఆయన 72 సంవత్సరాల వయస్సులో క్రీ.పూ 527లో మోక్షం పొందాడు. మహావీరుడి జయంతి సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా భక్తులు దేవాలయాలను సందర్శిస్తారు. ఊరేగింపులలో పాల్గొంటారు, ప్రార్థనలు చేస్తారు,  దానధర్మాలు చేస్తారు. శాంతి, కరుణ,  స్వీయ క్రమశిక్షణ మార్గాన్ని అనుసరించే లక్షలాది మంది భక్తులకు  మహావీరుడు స్ఫూర్తినిస్తాడు. ప్రపంచవ్యాప్తంగా జైన భక్తులు మహావీర జయంతిని ఎంతో ఉత్సాహంగా, భక్తితో జరుపుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ వర్గాలలో ఉత్సవాలు మారుతూ ఉంటాయి. కానీ సాధారణ ఆచారాలలో మహావీరుడి విగ్రహాన్ని రథయాత్ర అని పిలువబడే రథంపై మోసుకెళ్లడం కూడా ఉంటుంది. ఇది ఆయన బోధనల వ్యాప్తికి ప్రతీక. రథయాత్ర అంతటా ఆయన శిష్యులు భక్తి గీతాలు పాడుతూ, జైన మతానికి మహావీరుడు చేసిన కృషిని స్తుతిస్తారు. ఆ తరువాత ఆయన విగ్రహానికి ఆచార స్నానం లేదా అభిషేకం చేస్తారు. ఇది శుద్ధి,  పునరుద్ధరణను సూచిస్తుంది. ఈ ఆచారాలతో పాటు భక్తులు దానధర్మాలు చేయడంలో కూడా ముందుంటారు. ఇది మహావీరుడు తన కరుణను సమాజానికి తిరిగి ఇవ్వడంపై ఆయనకున్న ప్రాధాన్యతను ప్రతిబింబిస్తుంది.   ప్రజలు మహావీరుడి  దేవాలయాలను కూడా సందర్శిస్తారు. ప్రార్థనలలో పాల్గొంటారు.  ఆయన ఆధ్యాత్మిక మార్గదర్శకత్వం కోరుకుంటారు. పూజారులు,  మత  నాయకులు ధర్మం,  స్వీయ-క్రమశిక్షణ మార్గంలో దృష్టి సారించే జైనమత సూత్రాలను ప్రోత్సహించడానికి బహిరంగ సమావేశాలు,  ఉపన్యాసాలను కూడా నిర్వహిస్తారు.                                       *రూపశ్రీ

మీరు శక్తివంతమైన వ్యక్తులుగా మారాలి అనుకుంటున్నారా? ఈ పనులు మానేయండి..!

  శక్తివంతంగా ఉన్న వ్యక్తులు జీవితంలో ఎలాంటి పరిస్థితులను అయినా ఎదుర్కోగలుగుతారు. ప్రతి ఒక్కరు శక్తివంతంగా ఉండాలని, తమ జీవితాన్ని గొప్పగా అభివృద్ది చేసుకోవాలని, ఇతరుల మీద ఆధారపడటం, సొంతంగా ఏ పని చేయలేకపోవడం,  ప్రతి దానికి సందేహించడం వంటి సమస్యలను అధిగమించాలని అనుకుంటూ ఉంటారు.  అయితే వీటిని అధిగమించడం అంత సులువు కాదు.  కానీ కొన్ని పనులను మానేయం ద్వారా జీవితంలో శక్తివంతంగా మారవచ్చు. ఇలా మారితే గనుక జీవితం మరొక స్థాయికి వెళుతుంది.  అందరూ మీరు శక్తివంతమైన వారని,  గొప్పవారని తప్పకుండా ఒప్పేసుకుంటారు.  ఇందుకోసం ఏ పనులు మానేయాలో తెలుసుకుంటే.. ఆలోచన.. ఆలోచన అందరికి ఉంటుంది.  అయితే ఆ ఆలోచనకు కూడా ఒక పరిధి ఉంటుంది.   ఆలోచించాల్సిన విషయాల గురించి ఆలోచిస్తే పర్వాలేదు. కానీ చిన్న చిన్న విషయాలను కూడా కొందరు అతిగా ఆలోచిస్తారు.  ఈ కారణం వల్ల చాలా వరకు ఆందోళన పెరుగుతుంది.  అందుకే చిన్న విషయాలకు ఆలోచించడం,  అతిగా ఆలోచించడం మానేయాలి. ఇతరులు.. ప్రతి వ్యక్తి జీవితంలో ఎవరో ఒకరు ప్రధాన పాత్ర పోషిస్తారు. అయితే ఇతరుల మీద ఎక్కువ ఆశ పెట్టుకోవడం మంచిది కాదు.  ఏ విషయంలో అయినా సరే.. ఇతరుల మీద ఆశ, నమ్మకం పెట్టుకుని ఉంటారో.. అలాంటి వారికి నిరాశ ఎదురవుతుంది. అందుకే ఎవరి మీద ఆశ పెట్టుకోకూడదు. మాట్లాడటం.. మాట్లాడటం ఒక కళ అంటారు.  అయితే అందరితో ఒకే విధంగా మాట్లాడటం సరైనది కాదు.. పరిస్థితి బట్టి,  విషయాన్ని బట్టి మాట్లాడే విధానం వేరుగా ఉండాలి. ఎవరి దగ్గర ఏ విషయాన్ని మాట్లాడాలి? ఏ విషయాన్ని మాట్లాడకూడదు అనేది తెలుసుకోవాలి. అలాగే ఎవరితో అంటే వారితో అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం మానుకోవాలి.  మాటలను చాలా పొదుపుగా వాడాలి. అప్పుడే హుందాగా ఉంటారు. సరదా.. కొందరికి సరదాగా ఉండటం అలవాటుగా ఉంటుంది. అయితే అందరితో ఇలా సరదాగా ఉండటం కుదరదు.  ఎందుకంటే అందరూ ఈ సరదా తనాన్ని ఇష్టపడరు. అంతేకాదు.. ఇలా సరదాగా మాట్లాడటాన్ని కొందరు అవమానంగా చూస్తారు.  అందుకే అందరితో సరదా పనికిరాదు. వస్త్రధారణ.. వేసుకునే దుస్తులు,  తయారయ్యే విధానం కూడా చాలా సార్లు వ్యక్తులను హుందాగా,  గౌరవంగా నించోబెడుతుంది. అందుకే మనిషి వ్యక్తిత్వం ముఖ్యం,  దుస్తులది ఏముందిలే లాంటి డైలాగులు కట్టిపెట్టి చక్కగా రెడీ అవ్వాలి. ప్రాధాన్యత.. ఇతరులకు ప్రాధాన్యత ఇస్తూ ఇతరుల కోసం సమయాన్ని అడ్జెస్ట్ చేసుకునే వారిని చూసి ఉంటారు. కానీ అది తప్పు. ఎప్పుడూ ఇదే అలవాటు మంచిది కాదు.  తమను తాము పట్టించుకుంటూ, తమకు తాము ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఉంటే అప్పుడు ఇతరులు కూడా గౌరవిస్తారు,  మీ ప్రాధాన్యతను ఇతరులు గుర్తిస్తారు. అందుకే ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండకూడదు.  మీ గురించి మీరు కేర్ తీసుకున్న తరువాతే ఇతరుల గురించి ఆలోచించాలి.                                               *రూపశ్రీ

ఫెమినిస్ట్ ల వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అవుతుందా?

   ఫెమినిస్ట్.. ఈ పదం ఎక్కడైనా కనిపించింది అంటే సమాజం దృష్టి మొత్తం అటువైపు సారిస్తుంది.  ప్రపంచంలో ఏ ప్రాంతంలో అయినా సరే.. మహిళల వైపు వకల్తా పుచ్చుకుని మహిళల గురించి మాట్లాడేవారిని ఫెమినిస్ట్ లు అని అంటుంటారు.  ఫెమినిస్ట్ లు ఎక్కువగా మహిళలు మగాళ్ల కంటే ఎందులోనూ తక్కువ కాదు కదా అనే ధోరణిలో మాట్లాడుతూ ఉంటారు.  ఫెమినిస్ట్ ల వల్ల చాలా వరకు మహిళల  జీవితాల్లో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి.  ముఖ్యంగా వివాహ విషయంలో ఫెమినిస్ట్ ల వల్ల మహిళలకు కూడా ప్రాధాన్యత ఏర్పడింది.  ఒకప్పుడు ఆడపిల్ల అభిప్రాయంతో సంబంధం లేకుండా పెళ్లిళ్లు జరిగేవి. కానీ ఇప్పుడు అలా కాదు.. అబ్బాయి ఇష్టా ఇష్టాలను ఏ విధంగా పరిగణలోకి తీసుకుంటారో అమ్మాయి ఇష్టాఇష్టాలను అదే విధంగా పరిగణలోకి తీసుకుంటున్నారు. మహిళల సమానత్వం గురించి మాట్లాడే స్త్రీ వాదుల వల్ల భార్యాభర్తల బంధం విచ్చిన్నం అయ్యే అవకాశాలు ఉన్నాయా అనే విషయం ఇప్పుడు చర్చనీయాంశం గా మారింది  ఎందుకంటే ఇలా సమానత్వం అనే విషయం గురించి మాట్లాడటం వల్ల భార్యాభర్తల మధ్య విడాకులకు దారి తీస్తున్నాయని కొందరు వాపోతున్నారు. దీని  గురించి తెలుసుకుంటే.. స్త్రీ వాదం.. స్త్రీ వాదం అనేది స్పష్టంగా స్త్రీని సమర్థిస్తూ,  స్త్రీ హక్కుల గురించి, స్త్రీ పురుషుల సమానత్వం గురించి మాట్లాడే విషయం.  స్త్రీ వాదంలో పేర్కొనే స్త్రీ పురుష సమానత్వ భావన  స్త్రీ కి సమాజంలోనూ,  ఇంటా,  బయటా గౌరవాన్ని, స్త్రీ గతి శీలతను మార్చి వేసింది అని చెప్పవచ్చు. స్త్రీ వాదం ఎప్పుడూ స్త్రీని వెనుకబడిన వ్యక్తిగా కాకుండా సమాజంతో పాటు అభివృద్ది సాధించే వ్యక్తిగా మారుస్తుంది.  వివాహ మార్పు.. స్త్రీ వాదం వల్ల వివాహ విషయాలలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇప్పటికాలంలో వివాహం చేసుకుంటున్న వారిలో ఎక్కువ శాతం తొందరగా విడాకులకు దారి తీస్తున్నాయి. ఇందులో స్త్రీ వాదుల ప్రమేయమే ఎక్కువ కారణం అని కొందరి వాదన. అయితే భార్యాభర్తలు ఇద్దరూ చదువుకుని, ఉద్యోగాలు చేస్తున్నప్పుడు కేవలం పురుషుడు మాత్రమే అధికుడు అనే భావనతో ఉండటం సమంజసమైన విషయం కాదు.  స్త్రీ,  పురుషులు సమానం అని అంగీకరించినప్పుడు ఆ ఇద్దరి బందం ఎంతో ఆరోగ్యకరంగా సాగుతుంది. లింగ సమానత్వం అనేది బంధాల మీద ప్రబావం చూపినా అది భార్యాభర్తలను ఒక్కటిగా ఉంచేదే. అయితే ఈ లింగ సమానత్వాన్ని అంగీకరించినప్పుడే ఇది సాధ్యమవుతుంది. బాధ్యతలు.. ఇప్పటికాలంలో ఇంటి బాధ్యతల విషయానికి వస్తే ఆర్థిక విషయాలు అయినా ఇతరాలు అయినా మగవాడితో సమానంగా ఆడవారు కూడా బాధ్యతలు మోస్తున్నారు.  లింగ సమానత్వం పరంగా చూస్తే ఆడవారు కూడా బాధ్యతలు పంచుకుంటారు. దీని వల్ల భార్యాభర్తలు ఇద్దరి మీద ఒత్తిడి తక్కువగా ఉంటుంది.  ఇది ఆరోగ్య పరంగా అయినా,  కుటుంబ పరంగా అయినా మంచి మార్పుకు నాందిగా మారుతుంది. స్త్రీ వాదం కారణంగా బంధాల మధ్య బాధ్యతల విషయంలో ఎలాంటి సమస్యలు రావు కానీ భావోద్వేగాల విషయంలో మాత్రం మార్పులు ఉంటాయి. ప్రాధాన్యత.. స్త్రీ వాదులు లింగ సమానత్వాన్ని పేర్కొన్నప్పుడు  కుటుంబంలో మహిళలకు కూడా తమ అభిప్రాయాలు,  ఆలోచనలు వ్యక్త పరిచే అవకాశం ఉంటుంది. దీని వల్ల ఇద్దరి మధ్య కూడా సమ ప్రాధాన్యత ఏర్పడుతుంది.  ఒకరు ఎక్కువ,  ఒకరు తక్కువ అనే భావన లేనంత వరకు ఏ బంధం అయినా ఆరోగ్యకరంగా ఉంటుంది. ఒకరిపై ఒకరు ప్రేమను,  నమ్మకాన్ని,  గౌరవాన్ని కలిగి ఉంటారు. నిర్ణయాలు.. భార్యాభర్తలు ఇద్దరూ కలిసి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ఆ నిర్ణయాల మీద ఇద్దరూ బాధ్యత కలిగి ఉంటారు. అలాగే ఇద్దరూ నిర్ణయాలు తీసుకోవడం వల్ల సంబంధిత విషయంలో ఇద్దరూ సమత్వ భావన కలిగి ఉంటారు. ఇది భార్యాభర్తల మధ్య పరస్పర అవగాహనను పెంచుతుంది. వివాహం,  సక్సెస్ మంత్రం.. వివాహం చేసుకోవడం తేలిక.. కానీ ఆ వివాహ బంధం సక్సెస్ కావడం కష్టం.  ఎందుకంటే భార్యాభర్తలు ఇద్దరూ సమత్వ భావనతో లేనప్పుడు చాలా మనస్పర్థలు, గొడవలు ఏర్పడతాయి. అదే భార్యను కూడా భర్త గౌరవిస్తే.. ఇద్దరూ సమానమే అనే భావనతో ఉంటే ఆ బంధం చాలా వరకు ఆరోగ్యకరంగా ఉంటుంది. కుటుంబ పరంగా అయినా, కెరీర్ పరంగా అయినా,  ఆర్థిక విషయాలు అయినా,  పిల్లల పెంపకం అయినా.. భార్యాభర్తలు ఒకరికి ఒకరు సమ ప్రాధాన్యత ఇచ్చుకోవడం వల్ల వివాహ బంధం సక్సెస్ అవుతుంది. స్త్రీ వాదం అనేది మహిళలకు సమ ప్రాధాన్యత ఇచ్చినా, దాన్ని అంగీకరించినప్పుడు   అది వివాహ బంధాన్ని  సూపర్ సక్సెస్ చేస్తుంది.  అలా కాకుండా స్త్రీ  ని వివక్షతో చూస్తే ఆ బంధం తొందరగా బీటలు వారుతుంది.                                    *రూపశ్రీ.

ఆరోగ్యమే జీవితానికి  రక్ష.. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం..!

జీవితంలోని ప్రతి అంశం ఆరోగ్యం కారణంగా ప్రభావితమవుతుంది, దీర్ఘాయువు ఉన్నప్పుడు  ఆనందం,  సంతోషం కూడా ఉంటాయి. ప్రస్తుత కాలంలో మనిషి ఆరోగ్యం  అనే విషయం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. మంచి ఆరోగ్యానికి మంచి అలవాట్లు కూడా చాలా ముఖ్యం.  వివిధ వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు నేటి కాలంలో చాలా పెరుగుతున్నాయి.  ఈ వ్యాధుల గురించి అవగాహన కల్పిస్తూ,  ఆరోగ్య సమస్యలకు తగిన చర్యలు తీసుకోవడం పట్ల అప్రమత్తంగా ఉండటంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎప్పుడూ కీలకంగా ఉంటుంది.    ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటూ ఉంటారు. ఈ సందర్భంగా ఈ ఆరోగ్య దినోత్సవం ఎలా ఏర్పాటైందో.. దీని ఉద్దేశాలు ఏంటో తెలుసుకుంటే..  1950 లో ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటైంది. అప్పటి నుండి ప్రతి సంవత్సరం ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్నారు. 2025 ప్రపంచ ఆరోగ్య దినోత్సవం రోజు  "ఆరోగ్యకరమైన ప్రారంభం, ఆశాజనక భవిష్యత్తు" అనే థీమ్ ను ఏర్పాటు చేశారు.  మరణాలను అడ్డుకోవడానికి,  తల్లులు,  నవజాత శిశువుల ఆరోగ్యం దీర్ఘకాలికంగా ఆరోగ్యంగా ఉండటానికి,  తల్లి బిడ్జల ఆరోగ్యాన్ని మెరుగు పరిచే కార్యక్రమాలు నిర్వహించడానికి,  దీనికి తగిన నిధుల ఏర్పాటుకు పిలుపునిస్తోంది. ఇదీ చరిత్ర.. 1948లో మొదటి ఆరోగ్య సభలో ప్రారంభమైనప్పటి నుండి,  1950లో అమల్లోకి వచ్చినప్పటి నుండి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేడుకలు ప్రపంచ ఆరోగ్య సంస్థకు సంబంధించిన ప్రాధాన్యతను  ప్రపంచానికి పరిచయం చేయడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నారు.  ప్రభుత్వ జోక్యం లేకుండా స్వయంప్రతిపత్తితో పనిచేయడానికి,  ఆరోగ్య సవాళ్లను ఎదుర్కోవడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏర్పాటు చేయబడింది.   ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపన జ్ఞాపకార్థం ఏప్రిల్ 7వ తేదీని ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించారు.   గత 50 సంవత్సరాలుగా ఇది మానసిక ఆరోగ్యం, తల్లి,  శిశు సంరక్షణ,  వాతావరణ మార్పు వంటి ముఖ్యమైన ఆరోగ్య సమస్యలను వెలుగులోకి తెచ్చింది. ఆరోగ్య సవాళ్లను పరిష్కరించడానికి అందరినీ ఒక్కటి చేయడం,  అవగాహన పెంచడం దీని లక్ష్యాలు. ఇటీవలి కాలంలో మానసిక ఆరోగ్యం,  మాతా శిశు ఆరోగ్యం,  వాతావరణ మార్పులు,  వివిధ ఆరోగ్య పరిస్థితులు,  వ్యాధులు మొదలైన వాటి గురించి కార్యాచరణ పెరిగింది.  ఆరోగ్యమే జీవితానికి రక్ష అని అంటారు.  ఆ ఆరోగ్యం అందరికీ లభించాలని,   ఆరోగ్య సౌకర్యాలు అభివృద్ది చెంది అందరికీ అందుబాటులోకి రావాలని ఈ రోజు కృషి చేస్తుంది.  మనషి తన చేతిలో ఉన్నంత వరకు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం,  ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం మంచిది.                                    *రూపశ్రీ.

 శ్రీరామ వైభవం!

రాముడు రాఘవుడు రవికులుడితడు అనే పాటను వింటుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. చిన్నప్పుడు పుస్తకాల్లో శ్రీరాముడు పితృవాఖ్య పరిపాలకుడు అనే మాటను విని ఉంటాము. ఇంకా చక్కని నడవడిక కలిగిన అబ్బాయిలను చూస్తే రాముడు అనే టాగ్ వేస్తాము. ఇలా మన జీవితాలలో రాముడు ఒక భాగం. అయోధ్యా నగరాన్ని పాలించిన శ్రీరామచంద్రుడు యావత్ భారతదేశానికి కూడా గర్వకారణం అంటారు. కొన్ని విమర్శలు ఉన్నా వాటి వెనుక కూడా సరైన హేతువులతో ఆలోచిస్తే దశావతారాలలో రాముడి అవతారం ప్రజలకు ఏదో చెప్పడానికే ఈ భూమి మీదకు వచ్చిందని ఖచ్చితంగా నమ్ముతారు. నవమి వైభవం!! నవమి రోజు రాముడు పుట్టాడు. అయితే అన్నిచోట్లా శ్రీరామ నవమి రోజు సీతారాముల కల్యాణం జరుపుతారు. భారతదేశంలో ఉన్న ఎన్నో ప్రసిద్ధ గుడులలో ఇంకా చిన్న చిన్న రాముడి కోవెలలో కూడా సీతారాముల కల్యాణం ఎంతో గొప్పగా నిర్వహిస్తారు. తెలంగాణలో భద్రాచలంలోనూ, ఆంధ్రప్రదేశ్ లోని ఒంటిమిట్ట లోనూ రాముడి కల్యాణం, శ్రీరాముడి పట్టాభిషేకం ఎంతో బాగా చేస్తారు.  ఏకపత్నీ వ్రతుడు!! ఒకటే మాట, ఒకటే బాణం అనే క్రమంలో సాగే రాముడు జీవితంలో కూడా ఒక భార్యను మాత్రమే కలిగి ఉండటం చక్కని సందేశం. ఆ కాలానికి ఒకటికి పదిమందిని పెళ్లిళ్లు చేసుకుని వందలకొద్ది పిల్లల్ని కలిగిన రాజుల కాలంలో రాముడు సీతకు మాత్రమే జీవితంలో చోటిచ్చాడు. శివదనస్సును విరిచి మరీ సీతను సొంతం చేసుకున్న ఈ కౌసల్యా కుమారుడు తన జీవితంలో ఏ ఇతర ఆడదాని వైపు కన్నెత్తి చూడలేదంటే ఆశ్చర్యమేస్తుంది.  రామాయణం!! భారతీయ సాహిత్య చరిత్రలో ఇదొక అద్భుత గ్రంధం. ఇరవై నాలుగు వేల శ్లోకాలతో కూడిన ఈ రామాయణం ఏడు కాండలతో ఎంతో అద్భుతంగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నతనం నుండి పిల్లలకు రామాయణాన్ని చెబుతూ ఉండటం వల్ల పిల్లల్లో గొప్ప వ్యక్తిత్వం అలవడుతుందని అంటారు. ఇదే నిజం కూడా.  ఇంకా ఇందులో రాముడు మాత్రమే కాకుండా సీత, లక్ష్మణుడు, రాముడి ప్రయాణంలో ఎదురయ్యే ఎందరో గొప్ప వ్యక్తిత్వాలుగా మనకు కనబడతారు.  హనుమంతుడు, జటాయువు, విభీషణుడు, సుగ్రీవుడు, వానర సైన్యం. ఇలా ఎంతోమంది గొప్పవాళ్ళు రామాయణంలో ఉంటారు.  వీళ్ళు మాత్రమే కాకుండా గుహుడు, శబరి లాంటి గొప్ప రామభక్తులు కూడా కనిపిస్తారు. అందుకే రామాయణం అంత గోపోయా గ్రంథమయ్యింది. కాలంతో పాటు నిలిచే ఉంది. దీని మీద ఎన్ని విమర్శలు వచ్చినా సరే!! అవన్నీ పనిగట్టుకుని పుడుతున్నవి కాబట్టి ఈ రామాయణం ఆ రామ నామం ధర్మబద్ధమైన జీవితం మనిషి మనుగడ ఉన్నంతవరకు ఉంటాయి. రామనామం!! రాముడు గొప్పవాడా రామ నామం గొప్పదా అంటే రామ నామమే గొప్పది అంటారు. ఒక్కసారి రమానామాన్ని జపిస్తే వెయ్యిసార్లు ఇతర దేవుళ్లను జపించినట్టని సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పడం దీనికి మరింత బలాన్ని చేకూరుస్తుంది. వారధి కడుతున్న వానరసైన్యం ప్రతి రాయి మీద రామా అని రాసి సముద్రంలో వేస్తే అవి తేలుతున్నాయి. కానీ స్వయంగా రాముడే వాటిని సముద్రంలో వేస్తే అవి మునిగిపోయాయి. దీనిని బట్టి రాముడి కంటే రామ నామమే ఎంతో గొప్పది అని అర్థమవుతుంది. త్యాగరాజు అంటాడు  నిధి చాల సుఖమా రాముని స న్నిధి సేవ సుఖమా నిజముగ బల్కు మనసా అని రామదాసు అంటాడు ఓ రామ నీనామ శ్రీరామ నీనామ మేమి రుచిరా అని ఎన్ని రకాలుగా చూసినా రాముడి వంటి పురుషుడు, రామ నామమంత సులువైన శక్తివంతమైన అద్భుత మార్గం మరొకటి ఉండదు అని నిక్కచ్చిగా చెప్పచ్చు. ఈ శ్రీరామ నవమి నాడు ఆ రామచంద్రుడిని పలుకే బంగారయాయేనా కోదండపాణి అంటూ లాలనగా ప్రార్థిస్తూ పునీతులవుదాం. ఇంకా గుడిలో వడపప్పు, పానకం వేసవిలో కమ్మగా తినేసొద్దాం.  ◆వెంకటేష్ పువ్వాడ.                           

అంటరాని వారి అభ్యున్నతికి జీవితాన్ని ధారపోసిన బూబు జగ్జీవన్ రామ్..!

  బాబు జగ్జీవన్ రామ్ చాలా తక్కువ మందికి తెలిసిన వ్యక్తి.  విద్యార్థులను,  యువతను ప్రశ్నిస్తే ఈయన గురించి చెప్పేవారు తక్కువ. కానీ ఈయన తన జీవితాన్ని అంటరాని వారి అభ్యున్నతి కోసం అంకితం చేశారు.  అంటరానివారికి సమానత్వం సాధించడానికి అంకితమైన సంస్థ అయిన ఆల్-ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ స్థాపనకు  దోహదపడ్డారు. ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ  తేదీన బాబూ జగ్జీవన్ రామ్ పుట్టినరోజును చాలా గొప్పగా జరుపుకుంటారు.  ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్,  తెలంగాణ రాష్ట్రాలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతిని సెలవు దినంగా కూడా పరిగణిస్తారు.  ఈ సందర్భంగా  బాబు జగ్జీవన్ రామ్ గురించి తెలుసుకుంటే.. జగ్జీవన్ రామ్ ను బాబూజీ అని పిలుచుకుంటారు.  ఈయన  1908 ఏప్రిల్ 5న బీహార్‌లోని 'అంటరాని' కులంలో జన్మించాడు. ఈయన జన్మించినది సామాన్య రైతు కుటుంబంలోనే. ఈయనకు ఒక అన్న,  ముగ్గురు చెల్లెళ్లు ఉండేవారు.   ఈయన తన బాల్యంలో,  విద్యాభ్యాసం కొనసాగిస్తున్న రోజుల్లో  కూడా షెడ్యూల్డ్ కులాలు, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడాలనే తన కోరికను వ్యక్తం చేసేవాడు. బాబూ జగ్జీవన్ రామ్ అడుగడుగునా వివక్షణ ఎదుర్కొన్నాడు.  అయినప్పటికీ ఆ వివక్షలను లెక్క  చేయకుండా చదువులో రాణించాడు.  1931 లో సైన్స్ లో డిగ్రీ పొందాడు.  అయినప్పటికీ ఆయనకు  సామాజిక కార్యకలాపాలపై ఆసక్తి ఉండేది. ఎప్పుడూ అంటరాని వారికి సమానత్వం సాధించే విషయం గురించి ఆలోచించేవాడు.  ఈయనలో ఉన్న ఈ తపనను నేతాజీ సుభాష్ చంద్రబోస్ పరిశీలించాడు.  ఈ కారణంగా బాబు జగ్జీవన్ రామ్  నేతాజీ సుభాష్ చంద్రబోస్ దృష్టిని ఆకర్షించి అతన్ని రాజకీయ జీవితంలోకి ఆకర్షించేలా చేసింది. నిజానికి, బాబు జగ్జీవన్ రామ్ 1936 నుండి 1986 వరకు 50 సంవత్సరాలు నిరంతరాయంగా పార్లమెంటేరియన్‌గా ఉన్నారు.  ఇది ప్రపంచ రికార్డును  నమోదు చేసింది. బాబు జగ్జీవన్ రామ్ జవహర్‌లాల్ నెహ్రూ తాత్కాలిక ప్రభుత్వంలోని మొదటి క్యాబినెట్‌లో సభ్యుడు.  అంతేకాదు ఈ క్యాబినెట్ లో ఆయన  అతి పిన్న వయస్కుడైన మంత్రిగా,   భారత రాజ్యాంగ సభలో సభ్యుడిగా ఉండేవారు. ఆయన ఉన్నత పదవులకు వెళ్లి రక్షణ మంత్రిగా (1970 - 1974),  ఉప ప్రధాన మంత్రిగా (1977 - 1979) కూడా పనిచేశారు. ఆయన 1986లో మరణించారు.  ఆయన మరణించే వరకు పార్లమెంటు సభ్యుడిగా కొనసాగారు.                                   *రూపశ్రీ.

చాణక్యుడు వందల సంవత్సరాల కిందటే స్త్రీల గురించి ఈ నిజాలు చెప్పేశాడు..!

  ఈ సమాజంలో స్త్రీల పాత్ర చాలా కీలకమైనది.  స్త్రీలు జ్ఞానానికి, విజ్ఞాన శాస్త్రానికి ఆధారం అని చెబుతారు. ప్రాచీన గ్రంథాలలో కూడా స్త్రీల పాత్ర,  స్త్రీల గుణగణాలు ఎంతో గొప్పగా ప్రస్తావించబడ్డాయి.  ఆచార్య చాణక్యుడు వందల సంవత్సరాల కిందటే తన నీతి శాస్త్ర గ్రంథంలో  స్త్రీల గురించి కొన్ని నిజాలను స్పష్టంగా చెప్పాడు.  పండితుడు,  దౌత్యవేత్త,  ఆర్థికవేత్త,  రాజకీయ వేత్త,  మంచి  సలహాదారుడు అయిన చాణక్యుడు స్త్రీల గురించి చెప్పిన విషయాలేంటో తెలుసుకుంటే.. ధైర్యానికి ప్రతిరూపం.. చాణక్య నీతి ప్రకారం స్త్రీకి అపారమైన శక్తి ఉంటుంది. సంక్షోభ సమయంలో తన భర్త, పిల్లలు, కుటుంబం,  వంశాన్ని రక్షించే స్త్రీని ఉత్తమురాలు అంటారు. అలాంటి మహిళలు సమాజానికి, దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తారు.  దేశాభివృద్ధికి తమ ప్రత్యేక సహకారాన్ని అందిస్తారు. చాలా మందికి తెలియదు.. కొందరైతే ఒప్పుకోరు.. కానీ స్త్రీలు రెట్టింపు ఆహారం తింటారు.  అలాగే  వారి వినయం నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట.   చైవ కామశ్చాష్టగుణం: స్మృత: ॥ అని చాణక్యుడు అన్నాడు. పురుషుల కంటే స్త్రీలకు రెండు రెట్లు ఎక్కువ ఆకలి ఉంటుందని చాణక్యుడు చెప్పాడు.  సిగ్గు నాలుగు రెట్లు ఎక్కువ ఉంటుందట. ధైర్యం ఆరు రెట్లు ఎక్కువ ఉంటుంది.  కామం ఎనిమిది రెట్లు ఎక్కువ ఉంటుంది. స్త్రీల గురించి ఆచార్య చాణక్యుడు మాట్లాడుతూ..  స్త్రీ ఎప్పుడూ మధురమైన మాటలు మాట్లాడాలని చెబుతాడు. ఆధునిక వాతావరణంలో, మహిళలు మాట్లాడే భాష క్షీణించింది. దీని కారణంగా సమాజం ప్రభావితమవుతోంది. స్త్రీ ఎప్పుడూ దుర్భాషను ఉపయోగించకూడదని చాణక్యుడు అన్నాడు. దుర్భాషలాడే స్త్రీల గురించి చెబుతూ.. ఈ  అలవాటు ఉన్న స్త్రీల జీవితాలు సమస్యలతో నిండి ఉంటాయి అని అన్నాడు. వైవాహిక జీవితంలో ఉత్సాహం  లోపిస్తుందట. అలాంటి స్త్రీలు ఒత్తిడితోనూ,  వ్యాధులతో కూడా ఇబ్బంది పడుతూనే ఉంటారని చాణక్యుడు చెప్పాడు. తప్పుడు భాష మాట్లాడటం వల్ల ఆలోచనలలో స్వచ్ఛత తగ్గిపోతుందట. ఆలోచనలు స్వచ్ఛంగా లేకపోవడం వల్ల అది మనస్సు,  మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. దీని కారణంగా సమయం వచ్చినప్పుడు, ఒక స్త్రీ తన నైపుణ్యాలను,  బలాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేకపోతుంది. ఈ పరిస్థితిలో న్యూనతా భావన,  ఒత్తిడి పెరుగుతుంది. ఇది తరువాత అనేక తీవ్రమైన వ్యాధులకు దారితీస్తుందని చాణక్యుడు చెప్పాడు.                                                   *రూపశ్రీ

పచ్చదనానికి ప్రాణం పోస్తున్నాడు.. 83 ఏళ్ల వయసులో ఓ తాత చేస్తున్నాడంటే..!

పచ్చదనం అంటే ఆ  తాతకు ప్రాణం.. ఇంతకీ ఎవరు ఈ తాత అంటే.. ఆయన పేరు సూర్యనారాయణ్..  తన చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం ఆయనకు చాలా ఇష్టం.  ఆ ఇష్టమే ఆయనను ఒక సంకల్పానికి సిద్దం చేసింది. బెంగళూరు నివాసి అయిన ఈ పచ్చదనపు ప్రేమికుడు తనకు ఉన్న పరిశుభ్రతను చాలా సీరియస్ గా తీసుకున్నారు.  ఎంతగా అంటే తను నివసించే పరిసర ప్రాంతాలను చీపురు పట్టుకుని మరీ శుభ్రం చేసే అంత.  పచ్చదనానికి ప్రాణం పోస్తున్న ఆ తాత గురించి తెలుసుకుంటే.. ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరూ 60 ఏళ్లు నుండి 62 ఏళ్లకు రిటైర్ అయిపోతారు.  65 ఏళ్లు దాటాయంటే ఇంటి పట్టున ఉంటూ భార్యా లేదా కోడలు వండిపెడుతుంటే తింటూ కృష్ణా, రామ అంటూ కాలక్షేపం చేస్తుంటారు.  మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ  సంతోషాన్ని,  జ్ఞాపకాలను పోగేసుకుంటూ ఉంటారు.  కానీ  బెంగళూరుకు చెందిన 83ఏళ్ల సూర్యనారాయణ్ మాత్రం అందుకు భిన్నం.  ఈయన మేనేజర్ గా చేసి రిటైర్ అయ్యారు. 60ఏళ్ల వయసులో రిటైర్ అయిన ఈయన 24ఏళ్ల నుండి తనకు ఎంతో ఇష్టమైన పరిశుభ్రతను తను నివసించే ప్రాంతాలకు  అంతా వ్యాప్తం చేస్తున్నాడు. ఈయన దగ్గరుండి ఎవరితోనూ పనులు చేయించట్లేదు.  స్వయంగా తానే చీపురు పట్టి వీధులు ఊడుస్తున్నాడు.  ప్రతి ఉదయం వీధులు ఊడ్చి శుభ్రం చేస్తాడు.  శుభ్రమైన మురుగు కాలువలు,  పచ్చదనం,  చెత్త ప్రదేశాలను మచ్చలేని ప్రదేశాలుగా శుభ్రంగా మార్చేస్తుంటాడు. సూర్యనారాయణ్ గారు  రైతు కుటుంబంలో జన్మించారు.  ఆయనకు చెట్లు నాటడం అంటే చెప్పలేనంత ఇష్టం.  వాటిని సంరక్షించడం ఆయన బాధ్యతగా భావించేవాడు. చాలామంది విశ్రాంతి తీసుకోవడానికి,  ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడే వయస్సులో, సూర్యనారాయణ్ ప్రతిరోజూ చేతిలో చీపురు పట్టుకుని తన పనిని కొనసాగిస్తూ కనిపిస్తాడు. ఇక వర్షాకాలం వచ్చిందంటే ఈ తాత కృషి మరింత పెరుగుతుంది. 2001 నుండి వర్షాకాలంలో కూడా అవిశ్రాంతంగా వీధులు ఊడ్చడం, మురుగు కాలువలను శుభ్రం చేయడం,  ఎండిన ఆకులను కంపోస్ట్ చేయడం చేస్తున్నాడు. వర్షాకాలంలో పేరుకుపోయిన బురదను తొలగించడానికి, డ్రైనేజీ పొంగిపోకుండా నిరోధించడానికి  అదనపు కృషి చేస్తున్నాడు. తను చేసే పనిని చాలా అంకిత భావంతో చేస్తాడు.  సంవత్సరాల నుండి  తను చేస్తున్న పని మధ్యలో గాయాలు అయినా సరే వెనకడుగు వేయడం లేదు.  తన భార్య మద్దతు ఉండటంతో తాను చేసే పని చిన్నది పెద్దది అనే తేడా లేకుండా మనసు పెట్టి చేయగలుగుతున్నానని, తనకు ఆ పని చేయడం ఇష్టం కాబట్టే చేస్తున్నానని ఎంతో సంతోషంగా అంటున్నాడు.   ఈ స్వచ్చంద సేవకుడికి లాల్ సలాం చెప్పాల్సిందే..!                          *రూపశ్రీ.

ఛత్రపతి శివాజీ మహరాజ్ ను భారత నావికాదళ పితామహుడు అని ఎందుకు అంటారంటే..!

  శత్రువుల మనస్సుల్లో భయాన్ని రేకెత్తించిన నిష్ణాతుడైన వ్యూహకర్త, ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని,  మరాఠా నావికాదళాన్ని స్థాపించిన దార్శనిక నాయకుడు. యూరోపియన్ శక్తులు సముద్రాలను నియంత్రించే సమయంలో, శివాజీ స్వావలంబన నావికా దళానికి ఒక మార్గాన్ని రూపొందించాడు, 'భారత నావికాదళ పితామహుడు' అనే బిరుదును పొందాడు. డిసెంబర్ 4న నేవీ దినోత్సవం సందర్భంగా, శివాజీని భారత నావికాదళ మార్గదర్శకుడిగా కూడా గౌరవిస్తారు. భారతదేశంలో నేవీ ఇంత దృఢంగా రూపుదిద్దుకొన్నది అన్నా.. భారత నావికాదళ విభాగంలో ఓ గుర్తింపును తెచ్చుకోగలిగి దేశానికి రక్షణ కల్పిస్తోందన్నా అదంతా ఛత్రపతి శివాజీ మహారాజ్ చలువే.. భారత నావికాదళ పితామహుడు అని ఛత్రపతి శివాజీ మహారాజ్ ను ఎందుకు గౌరవిస్తారో తెలుసుకుంటే.. దూరదృష్టి గల నాయకత్వం,  నావికా వ్యూహం రాబోయే కాలంలో యుద్దాల  ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చూపిన గొప్ప దార్శనికత విప్లవాత్మకమైనది. భవిష్యత్తులో యుద్ధం తీరప్రాంతాలు,  అరేబియా సముద్రాల వెంబడి ఉంటుందని శివాజీ అర్థం చేసుకున్నాడు. ఈ కారణంగా పోర్చుగీస్ కు  తన రాజ్యానికి ఉమ్మడిగా ఉన్న సిద్ధిల నుండి వచ్చే సాధారణ ముప్పుల నుండి భారతదేశ పశ్చిమ సముద్ర తీరాన్ని కాపాడటం కోసం కసరత్తులు చేశాడు. శివాజీ నావికా దళాల వ్యవస్థీకరణ సర్వతోముఖంగా,  పూర్తిగా ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. నావికాదళం వేగవంతమైన,  బలమైన నౌకాదళాన్ని సృష్టించడం, నావికాదళానికి సురక్షితమైన లంగరులను అందించడం, వాటిని సరఫరా చేయడం, రక్షించడం, మొదలైనవి  దాడి జరిగినప్పుడు ఎదుర్కోవడంలో  శిక్షణ పొందిన నావికాదళాన్ని రూపొందించగలిగింది. ఇక్కడి నుండే శివాజీ వ్యూహాత్మక దృష్టి భారత నావికాదళం   ను అభివృద్ధి చేయడమే అంతిమం లక్ష్యం అయ్యింది.   బలమైన నావికా దళాన్ని నిర్మించడం శివాజీ మహారాజ్ సాధించిన అత్యంత ముఖ్యమైన విజయం శక్తివంతమైన నావికా దళాన్ని నిర్మించడం. చాలా  రకాల యుద్ధనౌకలను నిర్మించడానికి, వాటిని సమర్థవంతంగా  నిలబెట్టుకోవడానికి చాలా ఖర్చులు చేశాడు. ఈ నౌకాదళంలో వివిధ రకాల నౌకలు ఉన్నాయి.  వాటిలో ముఖ్యమైనవి.. గల్లివాట్స్: వేగవంతమైన దాడులు చేయడానికి,  నిఘా సమాచారాన్ని సేకరించడానికి ఉపయోగించే ఓడలు.  ఇవి సాధారణంగా చాలా భారీగా నిర్మించబడతాయి గురాబ్స్: సముద్రంలో పెద్ద యుద్ధాలలో ఉపయోగించే తుపాకీతో కూడిన రెండవ పెద్ద ఓడలు. శివాజీ తన నౌకాదళానికి బలమైన ఓడల ప్రాముఖ్యతను సరిగ్గా అర్థం చేసుకున్నాడు.  అందువల్ల అతను తన దగ్గర ఉన్న నైపుణ్యం గల శిల్పులతో అధిక నాణ్యత గల కలపతో ఓడలను నిర్మించమని ఆదేశించాడు.  పదిహేడవ శతాబ్దంలో ఓడల తయారీకి అత్యంత సమకాలీన పద్ధతులను అనుసరించాడు.  దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రొఫెషనల్ షిప్‌బిల్డర్లను,  సిద్దీలు,  పోర్చుగీసులను ఉపయోగించి  ఉత్తమ నౌకాదళాన్ని అందించాడు. శివాజీ ఆధ్వర్యంలో స్థాపించబడిన కేంద్రీకృత నావికా దళం ప్రపంచంలోని ఆధిపత్య యూరోపియన్ శక్తులతో సమర్థవంతంగా పోటీపడేది. కీలకమైన నావికా స్థావరాలను ఏర్పాటు చేయడం సురక్షితమైన,  బాగా ప్రణాళికాబద్ధమైన నావికా నౌకాశ్రయాల అవసరాన్ని గ్రహించిన శివాజీ కొంకణ్ తీరంలో అనేక కోటలు,  ఓడరేవులను అభివృద్ధి చేశాడు . వీటిలో సింధుదుర్గ్, విజయదుర్గ్ & కొలాబా నావికా కోటలు దేశవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ఈ కోటలు బాగా నిర్మించబడ్డాయి,  సరఫరా, మరమ్మతు దుకాణాలు,  సిద్ధంగా ఉన్న రక్షణ యంత్రాలు కలిగి ఉండేలా ఏర్పాటు అయ్యాయి. మాల్వన్ గ్రామానికి సమీపంలో ఉన్న ఒక ద్వీపంలో నిర్మించిన సింధుదుర్గ్ కోట, శివాజీ నావికా దళం బలానికి నిదర్శనం. కోట ఉన్న ప్రదేశం ద్వారా, మరాఠా నావికాదళం పశ్చిమ తీరం వెంబడి సముద్రంలో ఇతర కార్యకలాపాలను తనిఖీ చేయడానికి,  నియంత్రించడానికి మంచి స్థితిలో ఉండేది. ఈ నావికా స్థావరాలు మరాఠా నావికాదళం  నిరంతర పనితీరుకు మద్దతు ఇచ్చినందున అవి ముఖ్యమైన సరఫరా డిపోలు,  స్టేజింగ్ పాయింట్లుగా ఉండేవి. శిక్షణ,  ఆవిష్కరణలు.. శివాజీ మహారాజ్ తన నావికా దళాల కసరత్తులు,  విన్యాసాల గురించి చాలా శ్రద్ధ వహించాడు. తన నావికులు,  నావికా అధికారులు సముద్ర పోరాటం, నావికా ధోరణి,  ఓడ సంరక్షణను అర్థం చేసుకునేలా ఆయన కఠినమైన వృత్తి శిక్షణను ఏర్పాటు చేశాడు. శిక్షణ,  నైపుణ్య అభివృద్ధిపై ఈ దృష్టి వృత్తిపరమైన,  సమర్థవంతమైన నావికాదళాన్ని నిర్మించడంలో పాత్ర పోషించింది. శివాజీ నావికా కార్యకలాపాలలో అతనికి ప్రత్యేక స్థానాన్ని సంపాదించిపెట్టిన మరో అంశం ఆవిష్కరణ. సముద్రంలో మారుతున్న యుద్ధ స్వభావానికి అనుగుణంగా అధునాతన సాధనాలను అభివృద్ధి చేయాలని,  వ్యూహాత్మక ఆలోచనలను ఉపయోగించాలని ఆయన కోరారు. ఛత్రపతి శివాజీ మహారాజ్.. పూణేలోని జాగీర్‌ను మొదటిసారిగా చేపట్టి స్వతంత్ర మరాఠా పాలనను స్థాపించే ప్రయత్నం ప్రారంభించినప్పుడు శివాజీ వయసు కేవలం పదహారు సంవత్సరాలు . శివాజీకి వేగం, ఆశ్చర్యం వంటి గెరిల్లా యుద్ధ వ్యూహాలు ఉన్నాయి , అందుకే శివాజీని " పర్వత ఎలుక" అని పిలుస్తారు. అతని వ్యూహాలు అతను తన స్థానాన్ని నిలబెట్టుకుని, మొఘల్ సామ్రాజ్యం మరియు ఇతర ప్రత్యర్థులతో సహా వారి సంఖ్య,  సైన్యంతో సంబంధం లేకుండా శత్రువులను ఓడించగలిగాడు. శివాజీ నావికా దళంలో ఆ కాలానికే ఇంత కృషి చేసినందుకే.. ఈయనను భారతీయ నావికాదళ పితామహుడు అని అంటారు.                                               *రూపశ్రీ.  

వేసవి కదా అని ఫ్రిజ్ లో నీళ్లు తాగుతున్నారా? జరిగేది ఇదే..!

వేసవికాలం మొదలవగానే చాలా ఇళ్లలో ఫ్రిజ్ లో వాటర్ బాటిల్స్ నింపి పెట్టేస్తారు.  ఇంట్లో ఉన్నప్పుడే కాదు.. బయటి నుండి రాగానే చల్లని నీరు తనివితీరా తాగితే తప్ప శరీరానికి ఉపశమనం, మనసుకు హాయి అనిపించవు. అయితే చాలామంది ఫ్రిజ్ నీరు తాగడం వల్ల ఆరోగ్యం పాడవుతుందని అనుకుంటారు. అందుకే మేం ఫ్రిజ్ వాటర్ తాగము అని చెబుతూ ఉంటారు. నిజంగా ఫ్రిజ్ వాటర్ తాగితే ఆరోగ్యం పాడవుతుందా? వేసవి కాలంలో సాధారణ నీరు ఎంత తాగినా దాహం తీరినట్టు అనిపించదు.  అలాంటప్పుడు ఫ్రిజ్ నీరు తాగడమే బెటర్ అనుకుంటారు చాలా మంది.  మరి ఫ్రిజ్ లో చల్లని నీరు చేసే చేటు ఏంటి? ఆరోగ్య నిపుణులు దీని గురించి ఏం చెబుతున్నారు? తెలుసుకుంటే.. ఫ్రిజ్ నుండి చల్లని నీరు తాగితే ఈ వేసవి వేడికి దాహం తీరినట్టు అనిపిస్తుంది. కానీ చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. ఈ చల్లని నీరు తాగడం వల్ల జీవక్రియ మందగిస్తుంది.  ఇది జీర్ణక్రియపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. గోరు వెచ్చని నీరు, సాధారణ నీరు,ఫ్రిజ్ లోని చల్లని నీరు.. ఈ మూడింటిని పరిశీలిస్తే.. గోరు వెచ్చని నీరు చాలా తొందరగా జీర్ణం అవుతుంది.  అదే సాధారణ నీరు జీర్ణం కావడానికి సగటు సమయం పడుతుంది. కానీ ఫ్రిజ్ లోని చల్లని నీరు తాగితే మాత్రం అవి జీర్ణం కావడం చాలా ఆలస్యం. ఫ్రిజ్ నీళ్ళు తాగే వారిలో జీవక్రియ చాలా నెమ్మదిగా జరుగుతుంది. ఈ కారణంగా బరువు తగ్గడం కష్టమవుతుంది.  బరువు తగ్గాలని అనుకునే వారు ఫ్రిజ్ లో నీరు తాగడం వల్ల బరువు తగ్గే ప్రక్రియ నెమ్మదిస్తుంది. దీని వల్ల శరీరంలో మలబద్దకం రావచ్చు.   ఫ్రిజ్ లో చల్లని నీరు తాగడం వల్ల మైగ్రైన్ వచ్చేప్రమాదం పెరుగుతుంది.  ఇది తలనొప్పి సమస్యను పెంచుతుంది.  ఇప్పటికే మైగ్రేషన్ సమస్యతో ఇబ్బంది పడేవారు చల్లని నీరుకు దూరంగా ఉండాలి. ఒక వేళ ఈ వేసవిలో చల్లని నీరు తాగాలి అనిపిస్తే ఫ్రిజ్ లో నీటికి బదులుగా కుండలో నీరు తాగవచ్చు.                                  *రూపశ్రీ.

మరాఠా యోధుడు.. ఛత్రపతి శివాజీ వర్థంతి..!

    ఛత్రపతి అనే పేరు వెంటే చాలు.. శివాజీ మహారాజ్ గుర్తుకు వస్తాడు. మరాఠా సామ్రాజ్యానికి వన్నె తెచ్చిన వాడు ఛత్రపతి శివాజీ మహారాజ్. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు కూడా ఈయనే. 17వ శతాబ్దపు భారతీయ యోధులలో ఛత్రపతి శివాజీ మహారాజ్ చాలా ప్రముఖమైన వారు.  శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించిన ఛత్రపతి మహారాజ్ 1680 సంవత్సరం,  ఏప్రిల్ 3వ తేదీన మరణించారు.  2025 ఏప్రిల్ 3వ తేదీ అయిన ఈ రోజు గురువారం నాడు ఛత్రపతి శివాజీ మహారాజ్ 345వ వర్థంతి జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి ఆసక్తికరమైన విషయాలు,  ఆయన మరణానికి దారి తీసిన సంఘటనల గురించి తెలుసుకుంటే.. శివాజీ భోంస్లే (1630-1680 CE) గా జన్మించిన ఆయన ఈ సంవత్సరం  ఫిబ్రవరి 18న ఆయన 395వ జయంతిని జరుపుకున్నారు  ఈరోజు ఆయన 345వ వర్ధంతిని జరుపుకుంటున్నాము.  1680, ఏప్రిల్ 3న, శివాజీ మహారాజ్ అనారోగ్య సమస్యల కారణంగా, తీవ్రమైన జ్వరం,  విరేచనాలతో బాధపడుతూ రాయ్‌గడ్ కోటలో మరణించారని చరిత్ర చెబుతోంది. ఈ రోజున, మహారాష్ట్రతో పాటు  ఇతర ప్రాంతాలలో సాంస్కృతిక కార్యక్రమాలు, ఊరేగింపులు,  నివాళుల ద్వారా శివాజీ మహారాజ్  వారసత్వాన్ని గౌరవిస్తున్నాయి.   శివాజీ మహారాజ్ గురించి చాలా మందికి తెలియని నిజాలు.. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఫిబ్రవరి 19, 1630న పూణే జిల్లాలోని జున్నార్ సమీపంలోని శివనేరి కోటలో జన్మించారు. కొంతమంది శివుడి ప్రేరణగా ఈయనకు శివాజీ అని పెట్టారని చెబితే కొందరుపండితులు అతనికి స్థానిక దేవత అయిన శివాయ్ పేరు పెట్టారని చెబుతారు. శివాజీ మహారాజ్ స్వరాజ్యాన్ని స్థాపించడం ప్రారంభించాడు.  అతని లక్ష్యం సంస్కృతంలో ఉన్న తన రాజ  ముద్రలో స్పష్టంగా పేర్కొనబడింది. షాహాజీ కుమారుడు శివాజీ రాజ్యం చంద్రవంకలా పెరుగుతూనే ఉంటుందని,  ఎల్లప్పుడూ ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తుందని ఆ ముద్ర హామీ ఇచ్చింది. స్వరాజ్యానికి పునాది వేయడానికి శివాజీ మహారాజ్  రాజ్‌గడ్, తోర్నా, కొండనా,  పురందర్ వంటి కోటలను స్వాధీనం చేసుకున్నాడు. 1656లో శివాజీ మహారాజ్ సతారా జిల్లాలోని జావాలిని స్వాధీనం చేసుకున్నాడు, ఇది వ్యూహాత్మక కారణాల వల్ల చాలా ముఖ్యమైన అంశంగా ఉంది. తరువాత  రైరీని తన ఆధీనంలోకి తీసుకున్నాడు, తరువాత దీనిని రాయ్‌గడ్ అని పేరు మార్చారు. దీన్ని శివాజీ మహారాజ్ తన   రాజధానిగా మార్చుకున్నాడు. కొంకణ్ ప్రాంతంలోని మహులి, లోహగడ్, తుంగా, టికోనా, విసాపూర్, సోంగడ్, కర్నాల, తాలా,  ఘోసాల వంటి కోటలను కూడా ఆయన స్వాధీనం చేసుకున్నారు. శివాజీ మహారాజ్ అష్ట ప్రధాన మండల్‌ను ఏర్పాటు చేశాడు, ఇది ఎనిమిది మంది సలహాదారుల మండలి. వారు రాజకీయ,  ఇతర ముఖ్యమైన విషయాలలో శివాజీ మహారాజ్ కు  సహాయం చేసేవారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఓడరేవులు,  వ్యాపార నౌకలను రక్షించడానికి,  వాణిజ్యం,  కస్టమ్స్ నుండి డబ్బు సంపాదించడానికి ఒక నావికాదళాన్ని నిర్మించాడు. అతను 1665 లో తన మొదటి నావికా దండయాత్రను చేపట్టాడు. శివాజీ మహారాజ్ విద్యకు ఒక చిన్న బృందం బాధ్యత వహించింది. ఆ బృందం అతనికి చదవడం, రాయడం, గుర్రపు స్వారీ, యుద్ధ కళలు,  మతపరమైన అధ్యయనాలను నేర్పింది. సైనిక శిక్షణ కోసం అతనికి ప్రత్యేక బోధకుడు కూడా ఉండేవారు. జూన్ 6, 1674న, గగాభట్ అనే గౌరవనీయ పండితుడు అతనికి రాయ్‌గఢ్‌లో ఛత్రపతిగా పట్టాభిషేకం చేశాడు. ప్రత్యేక నాణేలు తయారు చేయబడ్డాయి - హోన్ అనే బంగారు నాణెం,  శివరాయ్ అనే రాగి నాణెం - పురాణగాథ శ్రీ రాజా శివఛత్రపతి అని చెక్కబడి ఉన్నాయట.                                        *రూపశ్రీ.

భార్యాభర్తల బంధం విషపూరితంగా మారిందా... ఈ 5 లక్షణాలతో తెలుసుకోవచ్చు..!

  జీవితంలో చాలా ముఖ్యమైన విషయం, చాలా అందమైన బంధం భార్యాభర్తల బంధం.  ఇది మధ్యలో ఇద్దరు వ్యక్తులను ఒకటి చేసి జీవితాన్ని నడిపించే బంధం.  బాగస్వామిని ఎన్నుకునే అవకాశం ఇచ్చే బంధం ఇది. ఈ బంధం ప్రేమ,  గౌరవం,  నమ్మకం,  అవగాహన పైన ఆధారపడి ఉంటుంది. చాలా వరకు ప్రతి జంట తమ వైవాహిక జీవితం చాలా సంతోషంగా ఉండాలని అనుకుంటుంది. కానీ తెలిసో తెలియకో ఆ బంధంలో కొన్ని సంఘటనలు జరుగుతాయి.  అవి కాస్తా బంధాన్ని విషపూరితంగా మారుస్తాయి. భార్యాభర్తల బందంలో సంతోషం ఉండాలి, ప్రేమ ఉండాలి,  ఒకరికి ఒకరు గౌరవం ఇచ్చి పుచ్చుకోవాలి.  కానీ ఇవి లేకుండా ఆ బంధంలో ఒత్తిడి మాత్రమే ఉంటున్నట్టు అయితే ఆ బంధం విషపూరితమైన లేదా అనారోగ్యకరమైన వ్యక్తితో బంధంలో ఉన్నట్టు అర్థం. తమ బంధం విషపూరితంగా మారిందా లేదా అనే విషయాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చని రిలెషన్షిప్ నిపుణులు అంటున్నారు.  అవేంటో తెలుసుకుంటే.. అసౌకర్యం.. మీరు మీ భాగస్వామితో మాట్లాడే ప్రతిసారీ అసౌకర్యంగా భావిస్తున్నారా? మీరు తరచుగా చిన్న విషయాలకే వాదించుకుంటారా?  మీ భాగస్వామి ప్రతి వాదనలోనూ మిమ్మల్ని ఎగతాళి చేస్తారా? అలా అయితే, ఇది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. ఆరోగ్యకరమైన సంబంధంలో, సంభాషణ తర్వాత  రిలాక్స్‌గా ఉంటారు. కానీ విషపూరిత సంబంధంలో, ప్రతి విషయం మిమ్మల్ని బాధపెడుతుంది.  మిమ్మల్ని బలహీనంగా ఫీలయ్యేలా చేస్తుంది. నియంత్రణ.. మీ భాగస్వామి  ప్రతి చిన్న లేదా పెద్ద విషయంలో జోక్యం చేసుకుంటారా? నువ్వు ఏం వేసుకున్నావు, ఎవరిని కలిశావు, ఎక్కడికి వెళ్ళినా అన్నీ అతను తన నియంత్రణలో ఉంచుకోవాలనుకుంటాడు. ఈ ప్రవర్తన సంబంధంలో సమానత్వాన్ని నాశనం చేస్తుంది. దీని కారణంగా, ఇద్దరి మధ్య గౌరవం తగ్గడం ప్రారంభమవుతుంది. ఆరోగ్యకరమైన సంబంధానికి స్వేచ్ఛ,  గౌరవం రెండూ ఉంటాయి. కానీ మీరు అడుగడుగునా ఆంక్షలను ఎదుర్కొంటుంటే, అది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. ఒత్తిడి.. మీరు సంబంధంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ ఆందోళన, భయం లేదా ఒత్తిడికి గురవుతుంటే, ఇది సాధారణంగా తీసి పారేసే విషయం  కాదు. విష సంబంధాలలో ప్రజలు తమ భాగస్వామిని సంతోషపెట్టే ప్రయత్నంలో తరచుగా తమను తాము మరచిపోతారు.  మానసికంగా అలసిపోయారని  ప్రశాంతత అదృశ్యమైందని మీరు భావిస్తే, అది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. ఎగతాళి.. ప్రతి వ్యక్తికి తన సొంత అవసరాలు ఉంటాయి. సాధారణంగా ప్రజలు ఈ విషయాల గురించి మొదట తమ భాగస్వాములతో మాట్లాడుతారు. కానీ మీ భాగస్వామి మీ  అవసరాలను విస్మరిస్తే లేదా ప్రతిసారీ  ఎగతాళి చేస్తే, అది విషపూరిత సంబంధానికి సంకేతం కావచ్చు. విమర్శ.. మీ భాగస్వామి మీ స్నేహితుల ముందు మిమ్మల్ని ఎగతాళి చేస్తే,  ప్రతిదానినీ విమర్శిస్తే, అది విషపూరిత సంబంధానికి సంకేతం. ఆరోగ్యకరమైన సంబంధంలో, మీ భాగస్వామి ఎల్లప్పుడూ స్నేహితులు, కుటుంబం లేదా బంధువుల ముందు మిమ్మల్ని సంతోషంగా  ఉంచుతారు.                                    *రూపశ్రీ

ఏసీ లేకుండానే ఇల్లు చల్లగా ఉండాలంటే.. ఇలా చేయండి..!

  ఈ వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న కొద్దీ ఇంటిని చల్లగా ఉంచుకోవడం రోజువారీ యుద్ధంలా అనిపిస్తుంది.  ముఖ్యంగా ఇంట్లో ఫ్యాన్, కూలర్, ఏసీ పెట్టుకోవాలంటే  విద్యుత్ బిల్లులను  చూసి భయపడుతుంటారు.  కానీ ఈ విద్యుత్ బిల్లులు తగ్గించుకుని పర్యావరణ అనుకూలంగా ఉండటానికి ప్రయత్నించాలని చాలా మంది అనుకుంటారు.  కానీ ఇల్లు చల్లగా ఉండటానికి ఏం చేయాలి?  అనే విషయం చాలా మందికి తెలియదు. ఎయిర్ కండిషనర్లు అప్పటికప్పుడు  వేడి నుండి  ఉపశమనాన్ని అందిస్తున్నప్పటికీ, అవి రోజు మొత్తం చల్లగా ఉండటంలో అస్సలు ఉపయోగపడవు.  అయితే ఇంట్లో ఏసీ లేకుండానే చల్లగా ఉంచుకునే మార్గాలు కొన్ని ఉన్నాయి.  వీటిని ఫాలో అయితే వేసవి అంతా చల్లగా హాయిగా గడిచిపోతుంది.   వెదురు కర్టెన్లు లేదా  వట్టివేరు మ్యాట్లకు మారాలి.. ఎక్కువ వేడిని తట్టుకుని వేడిని లోపలి పోకుండా చేసేందుకు సాధారణ కర్టెన్లు తొలగించి వెదురు బ్లైండ్లు లేదా వట్టివేరు చాపలను ఎంచుకోవాలి.   ఈ చాపలను కర్టెన్ లాగా ఉపయోగించుకోవచ్చు.  వట్టివేర్ చాపల మీద నీటిని చల్లితే   ఇంట్లోకి ప్రవేశించే గాలిని సహజంగా చల్లబరుస్తూ, రిఫ్రెషింగ్ మట్టి సువాసనను విడుదల చేస్తాయి. ఇది వేసవి వేడి నుండి చాలా గొప్ప ఉపశమనం ఇచ్చే చిట్కా. మట్టి కుండలతో నేచురల్ కూలర్లు.. ఇంట్లో మట్టి కుండ పెట్టుకుని అందులో చల్లని నీరు తాగడం అందరికి తెలిసే ఉంటుంది.  అయితే చాలా మందికి తెలియని చిట్కా ఏంటంటే.. ఇంట్లో వేడి బాగా ఉన్న ప్రాంతాలలో మట్టి కుండలు ఉంచి ఆ మట్టి కుండలలో నీరు పోయాలి.  కుండలలో నీరు ఆవిరి అవుతూ ఉంటే కుండ చుట్టు పక్కల వాతావరణం చల్గగా ఉంటుంది.  మట్టి కుండలను ఇలా ఉంచడం వల్ల సహజంగా ఇల్లు ఎయిర్ కూలర్లు పెట్టినట్టు ఉంటుంది. క్రాస్ వెంటిలేషన్.. ప్రకృతి ప్రసాదించిన శీతలీకరణ వ్యవస్థను సద్వినియోగం చేసుకోవాలి.  ఉదయం,  సాయంత్రం వేళల్లో  కిటికీలను తెరిచి ఉంచాలి. తద్వారా తాజా గాలి లోపలికి ప్రవహిస్తుంది. ఎండలు ఎక్కువగా ఉన్న సమయంలో వేడి గాలి లోపలికి రాకుండా వాటిని మూసి ఉంచండి. ముఖ్యంగా క్రాస్ వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. ఇది చల్లని గాలిని లోపలికి,  వేడి గాలిని బయటకు వెళ్లేలా చేస్తుంది.  ఈ సులభమైన ఉపాయం చాలా తేడాను కలిగిస్తుంది. రంగులు.. నలుపు రంగు క్లాసీగా ఉన్నప్పటికీ, లేత రంగు కాటన్ బెడ్‌షీట్లు, కుషన్ కవర్లు,  కర్టెన్లు వంటివి తక్కువ వేడిని శోషిస్తాయి. అందుకే ఇంట్లో లేత రంగు ఉండే కర్టెన్లు, దిండు కవర్లు, కార్పెట్లు వంటివి ఎంచుకోవాలి.  ఇవి వేడిని బంధించడానికి బదులుగా ప్రతిబింబిస్తాయి, మీ ఇంటిని తాజాగా,  చల్లని  గాలిలితో  ఉంచుతాయి. ఇండోర్ మొక్కలు.. కలబంద, అరెకా పామ్స్, స్నేక్ ప్లాంట్స్,  మనీ ప్లాంట్స్ గాలిని శుద్ధి చేయడమే కాకుండా  అవి ఇండోర్ ఉష్ణోగ్రతలను తగ్గించడంలో కూడా సహాయపడతాయి. కిటికీలు,  సీటింగ్ ప్రదేశాల దగ్గర వాటిని  ఉంచడం వల్ల సహజంగా చల్లటి వాతావరణం ఉండేలా చేస్తాయి.                          *రూపశ్రీ

జీవితం మొత్తం ఫూల్స్ కావొద్దు.. 

  ఏప్రిల్ నెల వచ్చిందంటే చాలు.. చాలామందికి చిన్నతనంలో  ఏప్రిల్ ఫూల్ అంటూ చేసిన సందడి గుర్తొస్తుంది.  చిన్నతనంలో ఏదో ఒక తుంటరి సాకు చెప్పడం,  ఎదుటివారిని భయపెట్టడం వారు భయపడటం లేదా అప్రమత్తం కావడం జరగగానే ఏప్రిల్ ఫూల్ అనడం చాలామంది ఎంజాయ్ చేసిన సంఘటనలే.. ఈ ఏప్రిల్ ఫూల్ అనేది ఒక సరదా రోజుగా  అందరికి తెలుసు.. కానీ ఏప్రిల్ ఫూల్ రోజు జరిగే తమాషా సంఘటనలలో పూల్స్ అయినా పర్లేదు కానీ నిజ జీవితంలో ఫూల్స్ కాకండి అంటున్నారు లైఫ్ స్టైల్ నిపుణులు.  జీవితంలో చాలామంది తమకు తెలియకుండానే అమాయకంగా ఫూల్స్ అయిపోతుంటారు.  నిన్న కాక మొన్నే తెలుగు సంవత్సరం వచ్చింది.   ఈ కొత్త ఏడాదిలో అయినా ఎవరైనా ఫూల్స్ కాకుండా సంతోషంగా ఉండాలంటే ఈ కింద చెప్పుకున్న విషయాలు గుర్తుంచుకోవాలి. జీవితం, తమాషా.. రోజువారీ జీవితంలో సంతోషం,  తమాషా అనేవి ఉండటం మంచిదే.. కానీ జీవితమే తమాషా కాకూడదు.  ఇలా జీవితమే తమాషా అయితే ఆ తరువాత ఇతరులకు మన జీవితం ఒక ఆట వస్తువుగా లేక విలువ లేని చిత్తు కాగితంలా అనిపిస్తుంది. అందుకే జీవితంలో తమాషా ఉన్నా జీవితాన్ని తమాషా కానివ్వకూడదు.  జీవితంలో లక్ష్యాల  పట్ల,చేస్తున్న పని పట్ల స్పష్టత ఉండాలి.  చెయ్యాల్సిన పనిని ఇతరుల కారణంగా ఎప్పుడూ వాయిదా వేయడం,  చేయకుండా ఆపేయడం వంటివి చేయకూడదు. చేసే పని మంచిది అయినప్పుడు,  ఉపయోగకరమైనది అయినప్పుడు ఏ విధంగానూ కాంప్రమైజ్ అయ్యి దాన్ని వదలకూడదు. ఎందుకంటే చేసే పని,  పని  చేసే విధానం ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని వ్యక్తం చేస్తుంది. మంచి, చెడు.. ప్రతి ఒక్కరిలో మంచి, చెడు అనేవి ఉంటాయి.  కానీ మనిషి తన జీవితంలో జరిగే మంచి అయినా చెడు అయినా తాను కరెక్ట్ అనే ఆలోచనలో ఉంటాడు. ఇది చాలా వరకు తప్పు. అయితే మంచి, చెడు అనేవి వ్యక్తి ఆలోచనా  విధానం మీద ఆధారపడి ఉంటుంది.   ఒకరికి మంచి అనిపించేది మరొకరికి చెడు అనిపించే అవకాశం ఉంది. దీని వల్ల మంచి చెడుల విషయం తేల్చుకునే అవకాశం చాలా మందికి ఉండదు. అయితే ఏ పని అయినా  ఇతరులకు అపకారం చేయకుండా నష్టం కలిగించకుండా మనకు మేలు చేసే విధంగా ఉన్నంత వరకు ఆ పని చేయడం ఎప్పుడూ తప్పు కాదు. విలువలే.. వ్యక్తిత్వం.. ప్రతి మనిషి విలువలు కలిగి ఉండాలి.  ఇలా విలువలు కలిగి ఉండటమే మనిషి జీవితానికి గొప్ప ఆస్తి.  మనిషిలో ఉన్న విలువలు  మనిషి వ్యక్తిత్వాన్ని  వ్యక్తం చేస్తాయి. అందుకే విలువలను ఎప్పటికీ వదలకూడదు.  ఇతరుల పట్ల మంచిగా ఉండటం,  ఇతరులను గౌరవించడం,  ఇతరులకు సహాయం చేయడం,  ప్రేమ,  జాలి, కరుణ, దయ వంటివి ఉండటం.. ఇవన్నీ కూడా తన వ్యక్తిత్వాన్ని,  సెల్ఫ్ రెస్పెక్ట్ ను పోగొట్టుకోకుండా పాటించినప్పుడు ఆ వ్యక్తి ఎంతో హుందాగా,  గొప్పగా అనిపిస్తాడు. ఇతరులకు ఇచ్చే గౌరవం, మర్యాద మన గౌరవాన్ని పెంచుతాయి. నమ్మకం, అపనమ్మకం.. మనిషి జీవితం నమ్మకానికి, అపనమ్మకానికి మధ్య ఊగిసలాడుతూ ఉంటుంది.  తరువాత నిమిషం ఖచ్చితంగా ఏం జరుగుతుందనేది కూడా చాలామందికి స్పష్టంగా తెలియదు. అలాంటప్పుడు మనుషులను,   పరిస్థితులను నమ్మకం అనే ఒక తాడులో బంధించి ఆ తరువాత దాన్ని పట్టుకుని వేలాడుతూ ఎప్పుడు తెగిపోయినా దానిదే తప్పని, ఇతరులదే తప్పని అనడం ఆ వ్యక్తిదే నిజమైన తప్పు. కాబట్టి ఎప్పుడు ఏం జరిగినా దానిని ఎదుర్కోవడానికి సంసిద్దంగా ఉండాలి. అంతేకానీ నమ్మకాలు పెట్టుకుని అనవసరంగా బాధలలోకి జారిపోకూడదు.                                         *రూపశ్రీ.  

శత్రువు ఇబ్బంది పెడితే ఏం చేయాలి? చాణక్యుడు ఏం చెప్పాడంటే..!

  ఆచార్య చాణక్యుడు గొప్ప నీతి శాస్త్రజ్ఞుడు.  ఆయన చెప్పిన నీతి శాస్త్ర విషయాలు ఇప్పటికీ ఆచరించదగినవి. నీతి శాస్త్రంలో జీవితంలో అన్ని విషయాలకు పరిష్కారాన్ని అందించడం ఆచార్య చాణక్యుడికే చెల్లింది. చాణక్యుడు విష్ణుగుప్తుడు లేదా కౌటిల్యుడు అనే పేరుతో కూడా ప్రసిద్ధి చెందాడు.  ఆచార్య చాణక్యుడు రాసిన చాణక్య నీతిని ఇప్పటికీ ఒక ముఖ్యమైన గ్రంథంగా పరిగణిస్తారు.    చాలావరకు శత్రువులు వివిధ రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటారు.  ఇలా ఇబ్బంది పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవాలని ఉన్నా ఎలా తప్పించుకోవాలో చాలా మందికి తెలియదు. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలకు ప్రధాన కారణం శత్రువు. ముఖ్యంగా సంతోషంగా ఉంటూ జీవితంలో ఎదుగుతున్నారు అంటే ఖచ్చితంగా వారి జీవితంలో వారిని ఇబ్బంది పెట్టడానికి శత్రువు ప్రవేశిస్తాడు. ఎంతలా  ఎన్ని కారణాలుగా ఇబ్బంది పెట్టాలో అంతగా ఇబ్బంది పెడతాడు కూడా. అయితే ఇలా ఇబ్బందులు పెట్టే శత్రువుల నుండి తప్పించుకోవడానికి ఆచార్య చాణక్యుడి నీతిని పాటించడం సరైన పరిష్కారంగా పనిచేస్తుంది. శత్రువు వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటే మొదట చేయాల్సిన పని శత్రువు గురించి తెలుసుకోవాలని ఆచార్య చాణక్యుడు చెబుతున్నాడు.  శత్రువు ఎవరైనా సరే.. ఆ శత్రువు బలవంతుడా లేదా బలహీనుడా అనే విషయం తెలుసుకోవాలి.  ఆ శత్రువు బలం,  బలహీనత ఆధారంగా ఒక వ్యూహం  రచించాలి.  ఆ వ్యూహాన్ని అనుసరించే ముందడుగు వేయాలి.  అలా చేస్తే శత్రువు మీద విజయం సాధించగలుగుతారు.  అయితే శత్రువు మీద విజయం సాధించాలంటే కొన్ని లక్షణాలు కూడా అలవర్చుకోవాలి.  అవేంటో తెలుసుకుంటే. సహనం,  సంయమనం.. చాలా సార్లు ప్రజలు కోపంగా ఉండి తమ శత్రువుపై నేరుగా దాడి చేస్తారు. కానీ చాణక్యుడి ప్రకారం శత్రువును ఓడించడానికి సంయమనం,  సహనం అవసరం. పరిస్థితి ఏమైనప్పటికీ,  ఓర్పు,  సంయమనం పాటించాలి.  సరైన సమయంలో  తదుపరి అడుగును ఆలోచనాత్మకంగా తీసుకోవాలి. శత్రువును అయోమయంలో ఉంచాలి.. శత్రువును ఎప్పుడూ అయోమయంలో ఉంచాలి అని చాణక్యుడు చెప్పాడు. ఎందుకంటే శత్రువుకు మీ ప్రణాళికలు,  ఉద్దేశాల గురించి తెలిస్తే వారు  మిమ్మల్ని మరింత ఇబ్బంది పెడతారు. కాబట్టి వారికి తగిన  బుద్ధి చెప్తూనే  ప్రణాళికలను రహస్యంగా ఉంచాలి.                                          *రూపశ్రీ.

పోర్చు గీసు పాలనను సవాల్ చేసిన వీర మహిళ.. పద్మశ్రీ పురస్కార గ్రహీత..!

  మహిళలు అంటే వంటింటి కుందేళ్లు అని అనుకుంటారు. కానీ ఇంటి గడప దాటి ఉద్యోగాలు చేయడం నుండి వివిధ పోరాటాలలో పాల్గొనడం వరకు మహిళలు ఎందులోనూ తీసిపోరు. తాజాగా సునితా విలియమ్స్ అంతరిక్షాన్నే జయించి సురక్షితంగా భూమి మీదకు తిరిగి వచ్చారు. అయితే ప్రపంచం అభివృద్ది చెందుతున్న ఈ కాలంలో కాదు.. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో జరిగిన  మహిళల పోరాటం చాలా మందికి తెలియదు.   1947 సంవత్సరం దేశం మొత్తం స్వాతంత్ర్యం పొందింది. అయితే, దానిలో ఒక చిన్న భాగం అయిన గోవా మాత్రం  మరో 14 సంవత్సరాలు పోర్చుగీస్ నియంత్రణలో ఉంది. 1961లో మాత్రమే గోవా  విముక్తి పొందింది. 400 సంవత్సరాల వలస పాలనకు ముగింపు పలికింది. ఆ సంవత్సరాల్లో నిరంతర ఆక్రమణలో ఒక నిశ్శబ్ద విప్లవం పుట్టుకొచ్చింది. స్వేచ్ఛను కోరుతూ వినిపించిన లెక్కలేనన్ని స్వరాలలో, లొంగిపోవడానికి నిరాకరించిన ధైర్యవంతులైన మహిళలు ఉన్నారు . గోవా విముక్తి కోసం అచంచలమైన సంకల్పంతో పోరాడారు. ఈ నిర్భయ మహిళలలో కొంతమంది వారి అద్భుతమైన ధిక్కార చర్యల గురించి తెలిస్తే రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1955 ప్రాంతంలో గోవా వాసులు నమ్మే ఏకైక వార్త 'వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్' ద్వారా వ్యాప్తి చేయబడిన వార్త. నిజం కోసం రేడియో ప్రసారాన్ని నమ్మవచ్చు. సమయం కఠినంగా ఉంది. గోవా తనను తాను విడిపించుకోవడానికి తాను చేయగలిగినదంతా చేస్తోంది. ఆ సంవత్సరాల్లో చాలా మంది మహిళలు సామాజిక ప్రతీకారం లేదా విమర్శలకు భయపడకుండా తిరుగుబాటులో ముందుకు వచ్చారు. వారిలో ఒకరు లిబియా లోబో సర్దేశాయ్. ఆమె తన భర్త వామన్ సర్దేశాయ్‌తో కలిసి ఎవరూ  గుర్తుపట్టకుండా ఉండటానికి ఒక అడవి నుండి 'వాయిస్ ఆఫ్ ఫ్రీడమ్'ను ప్రారంభించారు. వారి వార్తా ప్రసారం రాష్ట్రవ్యాప్తంగా వ్యాపించి. జాతీయవాద మనస్తత్వాన్ని పెంచింది.   జనవరి 2025లో లిబియా తన ధైర్యసాహసాలకు పద్మశ్రీ పురస్కారాన్ని అందుకుంది. విమోచన దినోత్సవం  19 డిసెంబర్ 1961 గోవా స్వేచ్ఛను రుచి చూసిన రోజు ఆమె మనస్సులో చెక్కుచెదరకుండా ఉంది. “గోవా విముక్తి పొందినప్పుడు, జనరల్ జెఎన్ చౌధురి [అప్పటి భారత సైన్యం  సైన్యాధ్యక్షుడు] మా వద్దకు వచ్చి స్వయంగా వార్తలను అందించారు. నాకు ఎలా స్పందించాలో తెలియలేదు. నేను తోట నుండి ఒక పువ్వును తీసుకొని అతనికి ఇచ్చాను. అతను నన్ను అడిగాడు, 'నువ్వు ఏమి చేయాలనుకుంటున్నావు?' అని. నేను 'నేను దానిని ఆకాశం నుండి ప్రకటించాలనుకుంటున్నాను' అని అన్నాను. మరుసటి రోజు గోవా విముక్తిని ప్రకటించే కరపత్రాలతో రాష్ట్రం నిండిపోయింది. మూలం ఆకాశం నుండి  లిబియా  సర్దేశాయ్ కూర్చున్న విమానం నుండి కరపత్రాలను రాష్ట్రం లో కుమ్మరించారు. ఈ  విధంగా రాష్ట్రానికి స్వేచ్ఛ అందిన వార్త విని రాష్ట్రం ఎంతగానో సొంతోషించింది.                                               *రూపశ్రీ

పుత్రులు ఉదయించే సూర్యులు కావాలంటే...

పుత్రోత్సాహము తండ్రికి  పుత్రుడు జన్మించినపుడె పుట్టదు. జనులా పుత్రుని గనుగొని పొగడగ  బుత్రోత్సాహంబునాడు పుట్టును సుమతీ!! అంటాడు సుమతీ శతకకర్త.  ఓ సుమతీ ! కొడుకు పుట్టగానే తండ్రికి సంతోషము కలుగదు. కాని ఆ కొడుకు గొప్పవాడై ప్రజలు అతనిని పొగుడుతున్నప్పుడు ఆ తండ్రికి నిజమైన సంతోషము కలుగును. అని వె పద్య భావం.  సమాజంలో ముఖ్యంగా భారతీయులలో మగపిల్లాడు అంటే వంశాకురమని, వారసత్వం ఉండాలంటే మగపిల్లలే మూలమని భావిస్తారు. దానికి అనుగుణంగా భారతీయ మనస్తత్వాలు కూడా ఉంటాయి. పుత్రుడు పున్నామ నరకం నుండి తప్పించేవాడు అనేది భారతీయులు విశ్వసించే మాట. అయితే మగపిల్లాడు పుట్టగానే ఏ తండ్రి సంతోషపడడు. ఆ కొడుకు ప్రయోజకుడై సమాజం ఆ కొడుకును పొగిడినప్పుడే ఆ తండ్రి సంతోషిస్తాడు. ఇప్పుడు కొడుకుల గురించి ఎందుకు వచ్చింది ప్రస్తావన అనిపిస్తుంది.  ప్రతి సంవత్సరం మార్చి 4 వ తేదీన ఇంటర్నేషనల్ సన్స్ డే జరుపుకుంటారు. ఈ international sons day ని మార్చ్ 4వ తేదీన మాత్రమే కాకుండా.. సెప్టెంబర్ 28వ తేదీ కూడా జరుపుకుంటారు.  పుత్రుల దినోత్సవం ఎందుకు??  ఇప్పటి కాలంలో మగపిల్లలను కలిగున్న తల్లిదండ్రుల పరిస్థితి ఎలా ఉంది?? మగపిల్లలు తల్లిదండ్రులను పట్టించుకోకుండా వారిని వృద్ధాశ్రమాలలో వదిలేస్తున్న సంఘటనలు చాలా ఉంటున్నాయి. వీటిని పరిగణలోకి తీసుకుంటే.. సమాజంలో తల్లిదండ్రులు ఎంతో ప్రాధాన్యత ఇస్తున్న మగపిల్లలు వారి తల్లిదండ్రుల బాధకు, కష్టాలకు కారణం అవుతున్నారు. తల్లిదండ్రుల స్థితిగతులు తెలుసుకోలేని నిర్లక్ష్యంలో ఎంతోమంది సుపుత్రులు ఉన్నారు.  మగపిల్లల ప్రవర్తన ఏదైనా సరే అది తల్లిదండ్రుల ఆలోచనలు, వారి పెంపకం, వారు మగపిల్లలకు ఇస్తున్న స్వేచ్ఛ మీదనే ఆధారపడి ఉంటుంది. చిన్నతనంలోనూ, కుర్రాళ్లుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు కొడుకులకు ఇచ్చే స్వేచ్చనే వారిని పెద్దయ్యాక నిర్లక్ష్య వ్యక్తిత్వం కలవారిగా మారుస్తుంది.  మగాడికేంటి పుట్టగోచి పెట్టుకుని బయటకు వెళ్లగలడు నువ్వు అలాగ వెళ్తావా అనేది చాలామంది ఆడ, మగపిల్లలు ఉన్న ఇళ్లలో ఆడపిల్లలను ఉద్దేశించి తల్లులు చెప్పే మాట. కొడుకుల మీద తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఉంటుందో అంతకు మించి బాధ్యత కూడా ఉంటుంది. అలాంటి బాధ్యతను వదిలిపెట్టి మగజాతి అంటేనే ఏదో బాధ్యతలు మోసుకుతిరిగే వర్గమని, వారికి ఏ విషయం చెప్పక్కర్లేదులే అని అనుకుంటే బాధ్యత లేని కొడుకులను తయారుచేసినట్టే.. ఎవరితో మాట్లాడుతున్నావ్, ఎంత ఖర్చు చేశావ్, దేనికోసం ఖర్చు చేశావ్?? ఎందుకింత లేటుగా వచ్చావ్?? మగపిల్లలతో మాటలేంటి?? పద్దతిగా, బుద్దిగా ఉండు. వంటి మాటలు మీ కూతుళ్లకు చెప్పేముందు కొడుకులకు కూడా ఇంకొంచెం గట్టిగా, అంతకు మించి బాధ్యతగా చెప్పండి. అడిగిందల్లా చేతిలో పెడుతూ ఆడపిల్లలకు ఎందుకులే డబ్బు వంటి మాటలు కట్టి పెట్టి మగపిల్లలకు కూడా డబ్బు విషయంలో కట్టడి చేయండి. ఇలా చేస్తే డబ్బు కోసం తల్లిదండ్రులు పడుతున్న కష్టం వారికి కూడా అర్థమైతుంది. సులువుగా చేతిలోకి డబ్బు వస్తుంటే ఎవరికి అయితే విలువ అర్థం కాదు.విలువ అర్థం కానప్పుడు మనుషుల కష్టం, మనుషుల విలువ కూడా వారికి తెలియదు.  ప్రస్తుత కాలంలో కొడుకులు ఉండీ వృద్ధాశ్రమాలలో బ్రతుకు వెళ్లదీస్తున్న పెద్దలను గుర్తు చేసుకొని అయినా మగపిల్లలకు విలువలు, బాధ్యతల గురించి చెప్పండి. మీ కొడుకులు పెడదోవ పడితే వారిని అందరూ నిందిస్తుంటే బాధపడేది మీరే.. కాబట్టి అబ్బాయిలకూ మంచి నడవడిక నేర్పించండి. అప్పుడే వారు ఉదయించే సూర్యుడిలా తల్లిదండ్రుల కళ్ళకు వెలుగు పంచగలడు.                                    ◆నిశ్శబ్ద.

రంగురంగుల రంగస్థలం.. ప్రపంచ రంగస్థల దినోత్సవం..!

  రంగస్థలం.. పేరు వినగానే రామ్ చరణ్ గుర్తొస్తాడు. ఆ సినిమా స్టోరీ మొత్తం కళ్ల ముందు కదులుతుంది. కానీ ఇప్పుడు చెప్పుకుంటున్నది రంగస్థలం సినిమా గురించి కాదు.  అసలైన రంగస్థలం గురించి. ప్రజలకు కనువిందు చేసే థియేటర్ ప్రాముఖ్యత గురించి,ఈ థియేటర్ అనేది కేవలం సినిమానే కాదు.. నాటకరంగాన్ని,  ఎన్నో రకాల షో లను కూడా ప్రజలకు పరిచయం చేసింది. ప్రతి సంవత్సరం మార్చి 27వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా రంగస్థల దినోత్సవం జరుపుకుంటున్నారు.  ఈ సందర్భంగా రంగస్థలం గురించి,  దీని చరిత్ర గురించి,  రంగస్థలం అభివృద్ది చెందిన విధానం గురించి తెలుసుకుంటే.. రంగస్థలం అనేది  మానవ స్వభావాన్ని వ్యక్తీకరించే సాధనంగా పనిచేస్తుంది.  మానవ అనుభవాలు,  భావోద్వేగాలలో ఉండే వైవిధ్యాలు, భావోద్వేగాలలో దాగిన విషాదం, సంతోషం,  ఈర్ష్య,  అసూయ,  జాలి, దయ.. ఇలాంటివన్నీ  లోతుగా పరిశీలించి, ప్రత్యక్షంగా వీక్షించే వెసులుబాటు రంగస్థలం కల్పిస్తుంది.  ఇది కేవలం వినోదం మాత్రమే కాదు..  విద్య,  సామాజిక మార్పుకు కూడా శక్తివంతమైన ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ప్రాముఖ్యత.. ఇంటర్నేషనల్ థియేటర్ ఇన్స్టిట్యూట్ (ITI) 1961లో ప్రపంచ థియేటర్ దినోత్సవాన్ని ప్రారంభించింది. మార్చి 27న పారిస్‌లో 1962లో "థియేటర్ ఆఫ్ నేషన్స్ సీజన్"  నిర్వహించబడటంతో ఇది ప్రారంభం అయింది. అప్పటి నుండి  ప్రతి ఏటా ఇదే తేదీన ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. రంగస్థల ప్రదర్శన కూడా గొప్ప కళారూపం. ఈ కళారూపాన్ని ప్రోత్సహించడం,  ప్రభుత్వాలు, వ్యక్తులు,  సంస్థలు నాటక సమాజానికి మద్దతు ఇవ్వడానికి,  ప్రోత్సహించడానికి కృషి చేయడం. ఈ రోజున ప్రజలు అనేక కార్యక్రమాలు, ప్రదర్శనలు, ప్రసంగాలు,  నాటక సమాజాలు కార్యక్రమాలు, అవార్డు వేడుకలు,  ప్రత్యక్ష ప్రదర్శనలను నిర్వహించడం ద్వారా రంగస్థల దినోత్సవాన్ని గుర్తు చేసుకుంటారు. రోజువారీ హడావిడి జీవితాలలో థియేటర్ అనేది ప్రజలకు కొద్దిసేపు అన్ని గోలలు మరచిపోయి కాస్త వినోదాన్ని,  మరికొంద ప్రశాంతతను పంచే వేదిక. సాధారణ పౌరుడి నుండి విలాసవంతమైన జీవితం గడిపే వారి వరకు ప్రతి ఒక్కరి జీవితం ఏదో ఒక దశలో,  సందర్భంలో ఈ థియేటర్ తో ముడి పడి ఉంటుంది. ప్రపంచ రంగస్థల దినోత్సవం రోజు జరిగే కొన్ని కార్యకలాపాలు.. ప్రత్యేక థియేటర్ ప్రదర్శనలు.. చాలా థియేటర్లు ప్రత్యేక నాటకాలు ,  రంగస్థల ప్రదర్శనలను నిర్వహిస్తాయి. కొన్ని ప్రొడక్షన్స్ ప్రేక్షకులను థియేటర్‌తో నిమగ్నం అయ్యేలా ప్రోత్సహించడానికి ఉచిత లేదా తగ్గింపు టిక్కెట్లను అందిస్తాయి.  అంతర్జాతీయ సందేశం.. ప్రతి సంవత్సరం, ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన నాటక రంగం ప్రముఖుడు ప్రపంచ నాటక దినోత్సవ సందేశాన్ని వ్రాసి అందజేస్తాడు.  ఇది ప్రపంచవ్యాప్తంగా పంచుకోబడుతుంది. ఈ సందేశం ప్రజలను ఏకతాటిపైకి తీసుకురావడంలో నాటక రంగానికి ఉన్న శక్తిని తెలియజేస్తుంది. కళకు తమను తాము అంకితం చేసుకున్న వారు ఈ సందర్భంగా గుర్తించబడతారు.  తగిన గౌరవం పొందుతారు.  ఇది వ్యక్తి కళను ప్రపంచానికి మరింత విస్తృతం చేయడానికి సరైన మార్గం అవుతుంది. థియేటర్ వర్క్‌షాప్‌లు,  ప్యానెల్ చర్చలు.. థియేటర్ గ్రూపులు,  సాంస్కృతిక సంస్థలు నటన, నాటక రచన,  రంగస్థల కళపై వర్క్‌షాప్‌లు, చర్చలు,  మాస్టర్‌క్లాస్‌లను నిర్వహిస్తాయి. నిపుణులు థియేటర్  పరిణామం చెందిన విధానం,   ప్రాముఖ్యతపై తమ తమ అభిప్రాయాలు,  నాటి రాలపు సంఘటనలు  పంచుకుంటారు. వీధి నాటకాలు,  బహిరంగ ప్రదర్శనలు.. సామాజిక, సాంస్కృతిక సమస్యల గురించి అవగాహన పెంచడానికి వీధి నాటక బృందాలు బహిరంగ ప్రదేశాలలో ప్రదర్శనలు ఇస్తాయి. విశ్వవిద్యాలయాలు,  నాటక పాఠశాలలు తరచుగా బహిరంగ ప్రదర్శనలను నిర్వహిస్తాయి. నాటక కళాకారుల గుర్తింపు.. అత్యుత్తమ నాటక కళాకారులు, నాటక రచయితలు,  ప్రదర్శకులకు కళారూపానికి చేసిన కృషికి అవార్డులు , గౌరవాలు ఇవ్వబడతాయి. సోషల్ మీడియా , ఆన్‌లైన్ ప్రచారాలు.. థియేటర్ ను ఇష్టపడేవారు,  సంస్థలు,  కథలు, కోట్స్,  మరచిపోలేని ప్రదర్శనలను పంచుకోవడానికి వరల్డ్ థియేటర్ డే వంటి హ్యాష్‌ట్యాగ్‌లను ఉపయోగిస్తాయి. వర్చువల్ ప్రదర్శనలు,  ప్రత్యక్ష ప్రసారం చేయబడిన థియేటర్ ఈవెంట్‌లు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను పాల్గొనడానికి అనుమతిస్తాయి.                                       *రూపశ్రీ.