Right Way To drink Tea

టీ తాగే సరైన విధానం మీకు తెలుసా?

  టీ భారతీయులకు ఒక గొప్ప ఎమోషన్. ఇది వేరే దేశం నుండి మన దేశానికి వచ్చిన పానీయమే అయినా భారతీయులు టీ అంటే ప్రాణం ఇస్తారు.  సమయం పాడు లేకుండా టీ తాగే వారు ఉంటారు.  నలుగురు స్నేహితులను అయినా,  ఉద్యోగ చర్చలకు అయినా, పిచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడానికి అయినా ఛాయ్ సిట్టింగ్ ఒక మంచి మార్గం.  అయితే చాలా మందికి టీ తాగే సరైన మార్గం తెలియదు. టీ తాగడానికి కూడా ఒక పద్దతి ఉంది.  టీ కప్పు పట్టుకోవడం దగ్గర నుండి దాన్ని సిప్ చేయడం వరకు టీ వెనుక ఒక సంప్రదాయం,  దానికంటూ ఒక ప్రత్యేక గౌరవం ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద రెస్టారెంట్లు,  ఖరీదైన లైఫ్ గడిపే వ్యక్తుల దగ్గర టీ తాగాల్సి వస్తే ఇష్టమొచ్చినట్టు తాగకూడదు.  టీ తాగేటప్పుడు పాటించాల్సిన టిప్స్ ఏంటి తెలుసుకుంటే.. కొన్ని ప్రాంతాలలో కొన్ని పదార్థాలను ఇష్టమొచ్చినట్టు తినలేం, తాగలేం.  తప్పు పద్దతిలో తినడం, తాగడం చేస్తే ప్రాంతీయత పరంగా వారిని అవమానించినట్టు ఫీలవుతారు.  అందుకే ప్రతి పదార్థం ఎలా తినాలి, ఎలా తాగాలి అనేవి తెలుసుకోవాలి. వాటిలో టీ తాగడం కూడా ఒకటి.  టీ భారతీయుల పానీయం కాదు.. కాబట్టి దాన్ని భారతీయులు వారికి నచ్చిన పద్దతిలో నచ్చినట్టు తాగేస్తారు. టీ తాగేటప్పుడు టీ కప్పు హ్యాండిల్ ను ఎల్లప్పుడూ టీ కప్పు సాసర్ పై ఉంచాలి. అది కూడా టీ కప్పు హ్యాండిల్ గడియారంలో  3 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణంలో ఉండాలి.  ఇక ఎడమ చేతితో టీ తాగేవారు అయితే టీ కప్పు హ్యాండిల్ గడియారంలో 9 సంఖ్య ఎక్కడ ఉంటుందో ఆ కోణం దగ్గర ఉండాలి. ఇలా ఉంటే టీ కప్పు అందుకోవడం సులభంగా ఉంటుంది. టీ కప్పు హ్యాండిల్ పట్టుకోవడానికి ఎప్పుడు చూపుడు వేలు, మధ్యవేలు,  బొటన వేలును ఉపయోగించాలి.  ఉంగరపు వేలు,  చిటికెన వేలును సపోర్ట్ కోసం ఉపయోగించాలి. టీ కప్పుతో పాటు చెంచా ఉంచితే దాన్ని కప్పు వెనుక భాగంలో ఉంచాలి.  కప్పులో ఎప్పుడూ చెంచాను ఉంచకూడదు.  టీలో పాలు లేదా పంచదార వేసుకున్నప్పుడు చెంచాను  కప్పు లో వృత్తాకారం లో తిప్పకూడదు.  అర్థవృత్తాకారంలో మాత్రమే అది కూడా ముందుకు వెనక్కు తిప్పాలి. శబ్దం రాకుండా తిప్పాలి. పంచదారను టీలో వేసుకుని చెంచాతో కలుపుతూ సుడిగుండం సృష్టించినట్టు తిప్పకూడదు.  అలాగే చెంచాను కప్పు మీద గట్టిగా కొట్టడం లాంటివి కూడా చేయకూడదు. టీని కలిపిన తరువాత చెంచాకు అంటుకున్న టీని నాకడం చేయకూడదు.  చెంచాను టీ కప్పు వెనుక భాగంలో పెట్టేయాలి. టీని కప్పులో సొంతంగా పోసుకునే పరిస్థితి ఉన్నప్పుడు కప్పు నిండుగా టీ పోసుకోకూడదు. ఎప్పుడూ కప్పులో 75శాతం మాత్రమే టీతో నింపాలి. 25శాతం ఖాళీగా ఉంచాలి.                                                *రూపశ్రీ.

Driving Mistakes to Avoid

డ్రైవింగ్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి..!

    డ్రైవింగ్ నేర్చుకున్న వారికి చాలా సింపుల్ విషయం. కానీ  డ్రైవింగ్ రాని వారికి అది పెద్ద టాస్క్.  ఈ కాలంలో డ్రైవింగ్ ను చాలా ఈజీగా ప్రతి ఒక్కరూ నేర్చేసుకుంటున్నారు. కార్, బైక్, స్కూటీ ఇతర వాహనాలు ఏవైనా వాటిని ఎలా మెయింటైన్ చేయాలి? అందులో బటన్స్ కానీ,  బ్రేకులు కానీ ఎలాంటి సమయంలో ఎలా ఉపయోగించాలి? ఇవి తెలియడం,  వాహానాల రద్దీలో చాకచక్యంగా వాటిని వినియోగిస్తూ వెహికల్ ను ముందుకు నడపడం  తెలియాలి.  వీటిలో ఏమాత్రం తేడా వచ్చినా   యాక్సిడెంట్లు జరగడం,  ప్రాణాల మీదకు రావడం ఖచ్చితంగా జరుగుతుంది. అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు కొన్ని తప్పులు అస్సలు చేయకూడదు.. ఫోన్.. ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం ప్రమాదం.  ఈ విషయంలో ప్రభుత్వం నిషేధం విధించినా సరే.. చాలామంది ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేస్తుంటారు. ఈ అలవాటు కేవలం డ్రైవింగ్ చేసే వారినే కాకుండా ఇతరుల జీవితాలను కూడా ప్రమాదంలో పడేస్తుంది. వేగం.. వేగంగా ప్రయాణించడం సురక్షితం కాదు.. ఈ హెచ్చరిక బోర్డ్ చాలా చోట్ల రాసి ఉంటుంది. కానీ చాలామంది రాష్ డ్రైవింగ్ చేస్తుంటారు. ఇలా వేగంగా నడపడం వల్ల చాలా మంది ప్రాణాలు ప్రమాదంలో పడతాయి.  ముఖ్యంగా డ్రైవింగ్ చేయడం అనేది తనకే కాదు.. ఎదుటి ప్రాణాలను ప్రమాదంలో నెట్టకుండా ఉండే చర్య అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. సీటు బెల్టు.. ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు పెట్టుకోవడం, బైక్ లో ప్రయాణిస్తున్నట్టైతే హెల్మెట్ వాడకం తప్పనిసరి.  ఇవి చేయనివారు ఎక్కువగా ప్రమాదాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తాగి డ్రైవ్ చేయవద్దు.. మద్యం సేవించి వాహనాలు నడపరాదు అనే హెచ్చరిక అందరికీ తెలిసిందే.  ముఖ్యంగా దీన్ని ప్రభుత్వాలే నిషేధించాయి కూడా.  అయినా సరే చాలామంది  అలాగే డ్రైవ్ చేస్తుంటారు. దీని వల్ల కొన్ని పరిస్థితుతులలో ప్రాణాల మీదకు వచ్చే అవకాశం ఉంటుంది. అలసట.. అలసటగా ఉన్నప్పుడు డ్రైవింగ్ చేయడం కూడా మంచిది కాదు.  అలసిపోయినప్పుడు చాలామంది నిద్ర ఫీల్ అవుతారు.  డ్రైవ్ చేస్తుండగా నిద్రలోకి జారుకునే వారు కూడా ఉంటారు. ఇది చాలాపెద్ద ప్రమాదాలకు కారణం అవుతుంది. ట్రాఫిక్.. ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న సమయంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ను అనుసరించి డ్రైవ్ చేయాలి.  ఈ నియమాలు ఉల్లంఘిస్తే  చట్టపరంగా డ్రైవింగ్ చేసే వారు సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా ఇతరులు కూడా ప్రమాదంలో పడే అవకాశం, ఇతర వాహన చోదకులు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెడ్ లైట్.. హెడ్ లైట్లు ప్రతి వాహనాలకు ఉంటాయి. అయితే వీటిని సమర్థవంతంగా వినియోగించుకునేవారు చాలా తక్కువ.  హెడ్ లైట్ లు కేవలం వాహనానికి దారి చూపడానికే కాదు.. ముందు వెళుతున్న వాహనాలకు,  వెనుక వస్తున్న వాహనాలకు సరైన దిశానిర్దేశం చెయ్యడంలో కూడా సహాయపడతాయి.                                             *రూపశ్రీ.

Interesting Facts About Ratan Tata

రతన్ టాటా జన్మదినం...భారతమాత కీర్తి కిరీటంలో ఒదిగిపోయిన రత్నం.. మన రతన్ టాటా..!

  దేశం నాకేమిచ్చిందని కాదు.. దేశానికి నేనేమిచ్చానని ఆలోచించాలనేది పెద్దలు చెప్పిన మాట.   మన భారతదేశంలో  పుట్టిన మహా పురుషుడు  శ్రీ రతన్ టాటా..  ఈ మాటను నిజం చేశారని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఒక బిజినెస్ మెన్ ఎంత పెద్ద వ్యాపార సామ్రాజ్యం స్థాపించినా సరే జనం అతన్ని ఒక బిజినెస్ మేన్ లాగానే గుర్తించుకుంటారు. కానీ టాటా గారిని అందరూ ఒక గొప్ప బిజినెస్ మెన్లా  కాకుండా గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషిగానే ఎక్కువగా  గుర్తుపెట్టుకుంటారు. టాటా అనేది ఇంటి పేరు అయినప్పటికీ ఆ పేరు కుటుంబంలో అందరికీ ఉన్నప్పటికీ,  టాటా అనగానే ఈ తరానికి గుర్తొచ్చేది  రతన్ టాటా గారి  నవ్వు మొహమే. ఆయన ఆధ్వర్యంలో టాటా గ్రూప్ గ్లోబల్ గా  ఒక శక్తివంతమైన సంస్థగా మారింది. ఆయన  భారత వ్యాపార రంగాన్ని పునః రూపొందించడంలో కూడా కీలక పాత్ర పోషించారు. అలాగే నైతికత, దానగుణం కలిగిన వ్యక్తిగా  అందరి మనసులూ గెలుచుకున్నారాయన. డిసెంబర్ 28 ఆయన జన్మదిన సందర్భంగా ఆయన్ను స్మరించుకుంట..  రతన్ టాటా 1937 డిసెంబర్ 28న బాంబేలో(నేటి ముంబై) జన్మించారు. ఆయనకి 10 సంవత్సరాల వయసున్నప్పుడు తల్లిదండ్రులు విడిపోవటంతో  వాళ్ళ బామ్మ, తాతయ్యలు దత్తత తీసుకుని పెంచారు. ఆయన కార్నెల్ యూనివర్సిటీ నుంచి  ఆర్కిటెక్చర్ అండ్ కనస్ట్రక్షన్ ఇంజనీరింగ్ లో డిగ్రీ పొందారు. ఆపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ లో హయ్యర్ లెవెల్ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం పూర్తి చేశారు. టాటా సంస్థకు వారసుడు అయినా  1962లో టాటా గ్రూపులో ఒక సాధారణ ఉద్యోగిగా  ప్రయాణాన్ని  ప్రారంభించారు. తన ప్రతిభతోనే 1991లో టాటా గ్రూప్ ఛైర్మన్గా నియమించబడ్డారు. టాటా సంస్థకు చైర్మన్ అయ్యాక భారత వ్యాపార వాతావరణం వేగంగా మారిపోంది. టాటా గ్రూపుని  తనదైన ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కించారు. సంస్థ కార్యకలాపాలను విభజించడంలోనూ,  గ్లోబల్ స్థాయిలో  బిజినెస్ను  విస్తరించడంలో, సాహసోపేతమైన  నిర్ణయాలు తీసుకోవడంలోనూ వెనకడుగు వేయక విదేశాలలో వ్యాపారం చేయగల సత్తా భారత్ కు ఉందని నిరూపించారు. టాటా నానో.. టాటాకు మిగిల్చిన నిరాశ.. భారతదేశంలో  అత్యంత చౌకైన కారుగా టాటా నానో సెన్సేషన్ సృష్టించింది.  మధ్యతరగతి  వారు కారులో తిగాలనే కలను చవకగా అందించాలనేది టాటా సంకల్పం.  కానీ డబ్బు ఎక్కువ పెట్టి బ్రతకడమే గొప్ప అనే మెంటాలిటీతో ఉన్న భారతీయులు టాటా సంకల్పం పై నీళ్లు చల్లారు. టాటా నానో కారును నిరుత్సాహపరిచారు.  ఫలితంగా ఆ కారు కనుమరుగైంది.  ఆర్థిక సమస్యలు పెరిగిన నేటి కాలంలో చాలామందికి ఇప్పుడు ఆ కారు విలువ అర్థం అవుతోంది. కానీ ప్రజల చేయి దాటిపోయింది.   రతన్ టాటాగారి  21 సంవత్సరాల నాయకత్వంలో టాటా గ్రూప్ ఆదాయం 40 రెట్లు, లాభం 50 రెట్లు పెరిగింది. టాటా టీ ద్వారా టెట్‌లేను, టాటా మోటార్స్ ద్వారా జాగ్వార్ ల్యాండ్ రోవర్‌ను, టాటా స్టీల్ ద్వారా కోరస్‌ వంటి ఎన్నో పెద్ద కంపెనీలను  సొంతం చేసుకున్నారు. వంటగదిలో ఉండే ఉప్పు నుంచి ప్రతిష్టాత్మక వాహనాల దాకా అన్ని రంగాల్లోనూ తమ వ్యాపారాన్ని విస్తరింపజేసి  ప్రపంచ వ్యాపార సామ్రాజ్యంలో తనదైన ముద్ర వేశారు.   రతన్ టాటా యొక్క నాయకత్వంలో ఉన్న కీలక అంశాలలో ఒకటి... ఆయన వ్యాపారంలో నైతికతపై దృష్టి పెడతారు. వ్యాపారంలో న్యాయం, పారదర్శకత ఉండాలని నమ్ముతారు. ‘కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ యొక్క ప్రాముఖ్యతను ఆయన గట్టిగా నమ్మేవారు.  తాత్కాలిక లాభాల కంటే తన ఉద్యోగుల సంక్షేమాన్ని, సమాజ పటిష్టతలకి ప్రాధాన్యత ఇచ్చేవారు.  2008 లో ముంబయిలోని తాజ్ హోటల్ పై జరిగిన ఉగ్రవాద దాడుల సమయంలో ఆయన టాటా గ్రూపుని సమర్థవంతంగా నడిపించారు. రతన్ టాటా ఇంత పెద్ద వ్యాపార వేత్త అయినా ఆయన ధనవంతుల జాబితాలో పైకి కనిపించరు. దీనికి కారణం  ఆయన చేసే సేవా  కార్యక్రమాలు.  ఆయన నేటికాలపు దానకర్ణుడు అని చెప్పవచ్చు. విద్య, ఆరోగ్యం, గ్రామీణ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు వంటి వివిధ  కార్యకలాపాల కోసం తన వ్యాపార లాభాల రాబడి నుండి సుమారు 60 నుండి 65శాతం విరాళాలకు కేటాయించారు. ప్రపంచానికి గడ్డు కాలం అయిన కరోనా సమయంలో భారతదేశంకోసం 500కోట్లను విరాళంగా ఇచ్చిన మహనీయుడు ఆయన.  కావాలంటే దేశం కోసం నా ఆస్తులు అన్నీ ఇచ్చేస్తానని చెప్పిన దయా హృదయుడు. దేశం కష్టాలలో ఉన్న ప్రతిసారి దేశాన్ని ఆదుకున్న భరతమాత ముద్దు బిడ్డ. రతన్ టాటా ఈ దేశం కోసం మళ్లీ పుట్టాలని కోరుకుందాం.                               *రూపశ్రీ.  

Effects Of Psychological And Emotional Manipulation

మానిప్యులేటివ్ గా ఉంటే నష్టాలు తప్పవు..!

  ప్రపంచంలో మనిషి ఎప్పుడూ ఎదుటివారి మీద అజమాయిషీ చెలాయించాలని చూస్తుంటాడు.  అది తన కంటే తక్కువ వర్గానికి చెందిన జాతుల మీద అయినా,  వేరే వర్గానికి చెందిన జంతువుల  మీద అయినా..  తన కింద కొందరు ఆటబొమ్మలుగా ఉంటే తృప్తి పడుతూ ఉంటారు. కొందరు వ్యక్తులు చాలా తెలివిగా ఉంటారు.  వారి మాటలతో ఇతరుల్ని చాలా ఈజీగా నమ్మిస్తారు.  సులభంగా వారి మీద  తమ మాటలతో  ఆధిపత్యం తెచ్చుకుంటారు.  ఇతరులను నియంత్రిస్తారు.  ఇలాంటి వారిని మానిప్యులేటివ్ వ్యక్తులని చెబుతారు. ఇలా మానిప్యులేటివ్ వ్యక్తులుగా ఉండటం వల్ల తాము చాలా గొప్పవారిమని, తెలివైన వారిమని అనుకుంటారు. ఇతరులు ఎప్పుడూ తమ చెప్పుచేతలలో ఉంటారనే ఆలోచనతో కూడా ఉంటారు. కానీ మానిప్యులేటివ్ వ్యక్తులుగా ఉండటం ఇతరులకే కాదు.. మానిప్యులేటివ్ వ్యక్తులకు కూడా మంచిది కాదని చెబుతున్నారు. మానిప్యులేటివ్ గా ఉండే వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితాన్ని, కెరీర్ ను కూడా నాశనం చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.  మానిప్యులేటివ్ వ్యక్తుల ప్రవర్తన వారి వ్యక్తిగత రిలేషన్స్ విచ్చిన్నం కావడానికి దారి తీస్తుందట.  వారి ప్రవర్తన వ్యక్తిగత బంధాలలో విభేదాలు సృష్టిస్తుంది.  ఇది వ్యక్తులకు బంధం మీద,  పరిస్థితుల మీద నమ్మకం కోల్పోయేలా చేస్తుంది. అన్నింటి కంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే.. మానిప్యులేటివ్ వ్యక్తులు తమ మాటలతో ఇతరులను ఎలా ఆకట్టుకుంటారో.. ఇతరులను ఎలా బోల్తా కొట్టిస్తారో..ఇతరులు తనతో అలాగే ఉంటారేమో అనే భ్రమలో ఉంటారు.  ఈ కారణంగా వ్యక్తిగత జీవితంలో భాగస్వామి, స్నేహితులు,  కుటుంబ సభ్యుల మాటలను కూడా అంత తేలికగా నమ్మరు.  వారిని విశ్వసించరు. ఈ కారణం వల్ల ఇద్దరు వ్యక్తుల మధ్య అపనమ్మకం చాలా ఎక్కువగా తొంగిచూస్తుంది. మానిప్యులేటర్ వ్యక్తులు ఇతరులకు దూరంగా ఉండటానికి ఇష్టపడతారు.  ఎందుకంటే ఇలాంటి వ్యక్తులతో ఉండటానికి, వారితో మాట్లాడటానికి ప్రజలు ఇష్టపడరు.  మానిప్యులేటివ్ వ్యక్తులు ఎక్కడ ఉంటే అక్కడ నెగిటివ్ విషయాలను వ్యాప్తి చేస్తుంటారు. ఇంకా చెప్పాలంటే మానిప్యులేటివ్ వ్యక్తులు తమ సొంత ఇష్టాలను,  వారి సొంత అవసరాలను కూడా వారే అర్థం చేసుకోలేరు. ఇలాంటి వ్యక్తులు జీవితంలో గందరగోళంగా ఉంటారు.  ఎందుకంటే వారి దృష్టి ఎప్పుడూ ఎక్కువగా ఇతరులపైనే ఉంటుంది.  సింపుల్ గా చెప్పాలంటే మానిప్యులేటర్లు ఎక్కువగా ఇతరుల జీవితాలను చూస్తూ.. ఇతరుల జీవితాలను తమ చెప్పుచేతలలో ఉంచుకోవడంలోనే కాలం గడిపేస్తుంటారు. మానిప్యులేటివ్ వ్యక్తుల ప్రవర్తన ఆఫీసులలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ఈ ప్రవర్తన కారణంగా సహోద్యోగుల నుండి,  పై అధికారుల నుండి   చాలా ఇబ్బందులు ఎదుర్కుంటారు. అందరి నుండి దూరం అయ్యే అవకాశం ఉంటుంది. ఇతరులను తమ చెప్పుచేతలలో పెట్టుకోవాలనే ఆలోచనల కారణంగా ఒత్తిడి, ఆందోళన ఏర్పడతాయి.  వీటి కారణంగా మానసిక,  శారీరక ఆరోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. క్రమంగా ఒకరిని నియంత్రించాలని ప్రయత్నించడమనే అలవాటు.. ఆ నియంత్రించే వ్యక్తుల మానసిక ఆరోగ్యం దెబ్బతినడానికి కారణం అవుతుంది.                                              *రూపశ్రీ.  

Parenting Tips

పిల్లలు గుణవంతులుగా ఉండాలంటే ఇలా పెంచాలి..!

ప్రతి తల్లిదండ్రి తమ పిల్లలు గుణవంతులుగా,  తెలివిగా,  మంచి నడవడికతో ఉండాలని కోరుకుంటారు.  ఇందుకోసం తల్లిదండ్రులు పిల్లలకు మంచి విద్యను అందించడం నుండి వారిని క్రమశిక్షణతో ఉంచడానికి ప్రయత్నించడం వరకు అన్నీ చేస్తారు.  అయితే నేటి కాలం పిల్లలు చాలా పెంకిగా ఉంటారు. అయితే అతి గారాబం,  లేదంటే అతి క్రమశిక్షణ అన్నట్టు ఉంటుంది పిల్లల పెంపకం.  కానీ పిల్లలు బుద్దిగా, గుణవంతులుగా, తెలివిగా ఉండాలన్నా..  పిల్లల ప్రవర్తన చూసి నలుగురు మెచ్చుకోవాలన్నా పిల్లలను పెంచడంలో ఆ కింది చిట్కాలు పాటించాలి. బ్రెయిన్ ఎక్సర్సైజ్.. పిల్లల మనస్సు, మెదడు అన్నింటినీ పీల్చుకునే స్పాంజ్ లాంటిది. పిల్లల వయస్సుకి అనుగుణంగా కొన్ని మెదడు వ్యాయామ ఆటలను ఆడించాలి.  వాటిని పిల్లల రోజువారీ పనులలో భాగం చేయాలి.  బోర్డ్ గేమ్‌లు, బిల్డింగ్ బ్లాక్‌లు, పజిల్స్, చెకర్స్,  చెస్ వంటివి బోలెడు ఆటలు ఆడించాలి. ఇవి పిల్లల స్మార్ట్‌నెస్‌ని పెంచుతాయి.  ఆటలు..  పిల్లలను స్మార్ట్‌గా,  తెలివైన వారిగా మార్చడానికి ఇండోర్,  అవుట్‌డోర్ గేమ్‌లు ఆడటంపై  దృష్టి పెట్టాలి. దీంతో పిల్లల శారీరక, మానసిక ఎదుగుదల మెరుగుపడుతుంది. వారి ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం స్థాయి పెరుగుతుంది. సంగీతం..  కొన్ని అధ్యయనాలలో సంగీతాన్ని అభ్యసించిన పిల్లలు పెద్దల కంటే ఎక్కువ IQ స్థాయిని  కలిగి ఉంటారని తేలింది. పాటలు,  సంగీతం పిల్లల ఊహా శక్తిని, ఆలోచనను మెరుగుపరుస్తాయి. వీడియో గేమ్..  పిల్లల అభ్యాస నైపుణ్యాలను అభివృద్ధి చేయడానికి రూపొందించబడిన అనేక గేమ్‌లు ఇప్పుడు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని ఒక పరిమితిలో మాత్రమే ఆడుకునేలా పిల్లలకు ఒక టైమింగ్ పెట్టాలి తప్ప ఎప్పుడూ వాటికి అతుక్కుపోయేలా చేయకూడదు. పోషణ..  పిల్లలకు పౌష్టికాహారం ఇవ్వడం చాలా ముఖ్యం. పిల్లలకు జంగ్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. అయితే  జంక్ ఫుడ్ ఎక్కువగా  తీసుకోవడం వల్ల పిల్లలు అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జంగ్ ఫుడ్,  ఫాస్ట్ ఫుడ్,  బయటి ఆహారాలకు బదులుగా ఇంట్లోనే వండిన తాజా, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలకు ఇవ్వాలి. సమతుల ఆహారం అందించాలి.  పుస్తక పఠనం..  పిల్లలు నేర్చుకునే సామర్థ్యాన్ని పెంపొందించడానికి మంచి  మార్గం పుస్తక పఠనాన్ని ప్రోత్సహించడం.  ఇంట్లో పిల్లలకు తగిన  పుస్తకాలు ఉంచాలి.  పిల్లలు మంచి పుస్తకాలు కొనే అలవాటును ప్రోత్సహించాలి.   తల్లిదండ్రులు కూడా పుస్తక పఠనాన్ని అలవాటు చేసుకోవాలి. తల్లిదండ్రులను చూసి పిల్లలు కూడా పుస్తక పఠనం పట్ల ఆకర్షితులవుతారు.                                                    *రూపశ్రీ.

Christmas celebrations

యేసుక్రీస్తు జన్మ దినం.. ప్రేమ, ఆనందం, శాంతి మార్గం.. క్రిస్మస్ వేడుక..!

  ప్రపంచవ్యాప్తంగా ప్రతీ రోజూ ఏదో మూలన  ఏదో పండగనో, ఉత్సవమో జరుగుతూనే ఉంటుంది.  భిన్నత్వంలో ఏకత్వం అని చెప్పుకునే మన భారతదేశంలో అయితే వీటికి అస్సలు లోటు ఉండదు.  ఒక వైపు హిందూ దేవుళ్ల పూజలు,  ముస్లిం సోదరుల నమాజ్ లు,  క్రిస్టియన్ సోదరుల ప్రార్థనలతో దేశం బోలెడు సంస్కృతులు,  సంప్రదాయాలతో అలరారుతుంది. అయితే హిందువులకు ఉన్నన్ని పండుగలు ముస్లిం లకు,  క్రిస్టియన్స్ కు ఉండవనే విషయం అందరికీ తెలిసిందే.. క్రిస్టియన్స్ ఎంతో గొప్పగా జరుపుకునే పండుగలలో క్రిస్మస్ ప్రధానమైనది. ప్రతి పండుగ ఏదో ఒక సందేశాన్ని ప్రజలకు అందించినట్టే క్రిస్మస్ కూడా ప్రపంచానికి సందేశాన్ని ఇస్తుంది. యేసు క్రీస్తు జననంమే క్రిస్మస్ పండుగకు ఆధారం. క్రీస్తు జన్మించిన తేదీని ఖచ్చితంగా గుర్తించలేకపోయినప్పటికీ డిసెంబర్ 25న క్రిస్మస్ జరపడం 4వ శతాబ్దం నుండి ప్రారంభమైంది. రోమన్ సామ్రాజ్యంలో పాగన్ పండుగ అయిన "సోలిస్ ఇన్విక్టి" (అజేయ సూర్యుడు జన్మదినం)ని క్రైస్తవ పండుగగా మార్చినట్టు చరిత్రకారులు భావిస్తారు.  యేసు క్రీస్తు పుట్టుకను శాంతి, ప్రేమకు సంకేతంగా భావిస్తారు. ఆయన తన బోధనల ద్వారా  మానవత్వం, సద్గుణాలు, సమానత్వం బోధించారు. క్రిస్మస్ సంప్రదాయాలు.. ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ పండుగకు ప్రత్యేకమైన  ఆచారాలు ఉన్నాయి. ఇవి ప్రాంతీయ సంస్కృతులతో ముడిపడినప్పటికీ, కొన్ని సాధారణ సంప్రదాయాలు అన్ని చోట్లా కనిపిస్తాయి. క్రిస్మస్ ట్రీని అలంకరిస్తారు. ఫిర్ చెట్లు క్రిస్మస్ ట్రీగా పాపులర్ అయ్యాయి.  మొదటిసారిగా 16వ శతాబ్దంలో జర్మనీలో ఈ సంప్రదాయం ప్రారంభమైంది. చెట్లను నక్షత్రాలు, బొమ్మలు, మిఠాయిలతో అలంకరిస్తారు.  క్రిస్మస్ పాటలు లేదా క్యారల్స్ పాడడం సంప్రదాయమైంది. “సైలెంట్ నైట్,” “ఓ హోలీ నైట్,” “జింగిల్ బెల్స్” వంటి పాటలు ప్రసిద్ధి చెందాయి. యేసు జన్మదినం సందర్భంగా మేఘదూతలు ఆయనకు ఇచ్చిన కానులని ఆధారంగా చేసుకుని ఈ రోజున గిఫ్ట్‌లు ఇచ్చే సంప్రదాయం మొదలైంది.   పిల్లలు  బాగా ఇష్టపడే శాంటాక్లాజ్  గిఫ్ట్‌లను అందజేస్తూ, పిల్లల్ని హ్యాపీగా ఫీలయ్యేలా చేస్తాడు. క్రిస్మస్ వేడుకలో చేసే   ప్లమ్ కేక్ చాలా ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ప్రతి కుటుంబం తమకు తగిన వంటకాలు తయారు చేస్తూ పండుగ సంబరాలు జరుపుకుంటుంది. కాగితం నక్షత్రాలు, క్రిస్మస్ లైట్స్, క్రిబ్ సెట్స్ తో ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు. ఇండియాలోని   క్రైస్తవులు క్రిస్మస్ ట్రీకి బదులుగా మామిడి లేదా వెదురు చెట్లను ఉపయోగిస్తారు. రంగురంగుల లైట్లు, కాగితం నక్షత్రాలతో  ఇళ్లను అందంగా అలంకరించుకుంటారు.                                     *రూపశ్రీ.

People Pleaser habits

ఎదుటివారిని సంతోషపెట్టడమనే అలవాటుందా? ఈ నిజాలు తెలిస్తే

సంతోషం సగం బలం అని అంటారు. మనం సంతోషంగా ఉంటే సరిపోదు, మనవాళ్లన,  ఇతరులను కూడా సంతోషపెట్టాలి. అప్పుడే మన జీవితానికి సార్థకత అని చాలామంది చెబుతుంటారు. నిజానికి ఇది మంచి విషయమే అయినా ఇలాంటి అలవాటు క్రమంగా మనిషి దుఃఖానికి కూడా కారణం అవుతుందంటున్నారు రిలేషన్ షిప్ కౌన్సిలర్లు. దీనికి కారణం ఎప్పుడూ ఇతరుల సంతోషం కోసం తాపత్రయపడేవాళ్ల గురించి పట్టించుకునేవారు బహుశా తక్కువే ఉంటారు. మరికొందరు ఇలాంటివారి సంతోషాన్ని కూడా అణిచివేయాలని, చిదిమేయాలని చూస్తారు. దీనికి కారణం తమను పట్టించుకోకుండా వ్యక్తిగత సంతోషం గురించి ఆలోచిస్తారేమో అనే అనుమానంతో కూడిన స్వార్థం. ఇతరుల సంతోషంలో తమ సంతోషాన్ని వెతుక్కునేవారు భవిష్యత్తులో మానసిక సమస్యల బారిన పడతారు. తమకంటూ ఎలాంటి వ్యక్తిగత ఆనందాలు ఏర్పరచుకోలేరు. ఇతరుల సంతోషం కోసం ఆరాటపడే అలవాటు మార్చుకోవడం ఎంతో ముఖ్యం. ఎందుకంటే  ప్రతి ఒక్కరికి వ్యక్తిగత సంతోషం అవసరం. ఈ అలవాటు ఎలా మార్చుకోవాలంటే.. కాదని చెప్పడం నేర్చుకోవాలి.. ఎవరైనా ఏదైనా అడిగితే కాదని చెబితే వారు బాధపడతారేమోననే ఫీలింగ్ చాలామందిలో ఉంటుంది. ఎంతో సున్నితమైన వ్యక్తిత్వం కలిగిన ఇలాంటి వారు తమకు నష్టం కలిగినా, తమకు ఇబ్బంది ఉన్నా ఇతరులకు కాదని చెప్పకుండా అనవస ప్రయాసలు పడుతుంటారు. చిన్న విషయాలలో ఇలా ఉన్నా పర్లేదు.. కానీ పెద్ద పెద్ద విషయాలలో మాత్రం ఇలాంటి మొహమాటపు బరువు మీద వేసుకోకూడదు. ఏ పని అయినా చేసే ఉద్దేశ్యం లేకపోయినా, వీలు లేకపోయినా, తెలియకపోయినా నావల్ల కాదు అని స్పష్టంగా చెప్పడం మంచిది. అంత్య నిష్టూరం కంటే ఆది నిష్టూరం మంచిదని పెద్దలు చెప్పిన మాట మరవకూడదు. సరిహద్దు గీతలుండాలి.. ఇతరులు అతి చనువుగా దగ్గర చేరి స్వార్థంతో పనులు చేయించుకుంటారు. మీ సమయాన్ని చాలా ఈజీగా లాక్కుంటారు. ఆ పనులన్నీ అయ్యాక కోల్పోయిన సమయం గుర్తొచ్చినప్పుడు, వ్యక్తిగతంగా నష్టపోయనప్పుడు తప్ప  తాము చేసిన పని పర్యావసానం అర్థం కాదు చాలామందికి. కొందరైతే తమ అవసరాలు ఖచ్చితంగా తీరాల్సిందేనని బలవంతం చేస్తారు. ఎమోషన్ బ్లాక్మెయిల్ కు కూడా వెనుకాడరు. అందుకే ప్రతి ఒక్కరినీ ఒక్క సరిహద్దు గీత వద్దే ఉంచాలి. మార్పు సాధ్యమే.. ఇతరులను సంతోషపెట్టడమనే అలవాటు వల్ల నష్టాలు ఎదుర్కొన్నా సరే కొందరు అంత ఈజీగా మారలేరు. మారాలని అనుకుని  తరువాత మళ్లీ మామూలైపోయేవారు ఉంటారు. కానీ ఈ అలవాటు మార్చుకోవడం చాలా ముఖ్యం. ఎప్పుడూ ఏదో ఒక వ్యాపకం పెట్టుకుంటూ వాటిలో లీనమైపోవడం మంచిది. దీనివల్ల ఇతరులు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు పనులున్నాయని చెప్పడానికి వీలవుతుంది. పైపెచ్చు మీ జీవితంలో అభివృద్ది కూడా మొదలవుతుంది. ఇంకొక విషయం ఏమిటంటే ఎవరితో అయినా ఏదైనా మాట్లాడుతున్నా మరీ మెతకగా మాట్లాడకూడదు. "నో" అనే మాట చెప్పడానికి సంకోచించకూడదు. చాలా ధృడంగా ఆ మాట చెప్పాలి. లేదంటే స్వార్థపరులు ఆ మాటను కూడా చాలా సిల్లీగా కొట్టిపడేసి తమ అవసరాలు తీర్చమని ఫోర్స్ చేస్తారు. వ్యక్తిగత జీవితాన్ని, సంతోషాన్ని గుర్తించాలి.. ఇతరుల కోసం బ్రతుకుతూ ఇతరులను సంతోషపెట్టేవారు ఎక్కువగా తమ ఇష్టాలను, వ్యక్తిగత జీవితాన్ని మిస్ అవుతారు. ఇంకా చెప్పాలంటే తమకంటూ ఇష్టాలు, వ్యక్తిగత జీవితం ఉన్నాయనే విషయాన్ని గుర్చించరు. కానీ వాటిని గుర్తించాల్సిన అవసరం ఎంతో ఉంది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఆఫీస్ లో కొలీగ్స్, బంధువులు ఇలా అన్నిచోట్లా మీకు ఇష్టాఇస్టాలను వ్యక్తపరచడం, నచ్చని వాటిని నచ్చలేదని చెప్పడం అలవాటు చేసుకోవాలి. మీకంటూ స్వంత అభిప్రాయాలు, నిర్ణయాలు ఉన్నాయని ఇతరులు గుర్తించేలా మీరే చేయాలి.                                                      *నిశ్శబ్ద

Good Governance Day

ఓ గొప్ప నాయకుని ఆకాంక్ష.. గుడ్ గవర్నెన్స్ డే 2024..!

  స్వతంత్ర భారతదేశాన్ని ప్రగతిపథం వైపు నడిపించటానికి ఎంతో మంది నాయకులు కృషి చేశారు. ఒక్కో నాయకునిదీ ఒక్కో ప్రత్యేకత. కానీ  ఒక కాంగ్రేసేతర  ప్రధానిగా పదవీకాలం పూర్తిచేసిన తొలి నాయకునిగా, వ్యక్తిగతంగా రాజకీయ వర్గాల్లో  చాలామంది ఇష్టపడే వ్యక్తిగా, మన దేశ భవిష్యత్తు కోసం సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్న నాయకునిగా ఇప్పటికీ మంచి పేరున్న గొప్ప నాయకుడు ఒకరున్నారు. ఆయనే  అటల్ బిహారి వాజపేయి. డిసెంబర్ 25, 1924న మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జన్మించిన అటల్ బిహారి వాజపేయి ఒక గొప్ప రాజకీయ నాయకుడు, కవి, వక్త కూడా.. ఆయన మూడు సార్లు భారతదేశ ప్రధానమంత్రిగా సేవలందించి, దేశ అభివృద్ధిలో  తనదైన ముద్ర వేశారు. ఆయన పాలనా  సమయంలో గోల్డెన్ క్వాడ్రిలాటరల్ వంటి ప్రాజెక్టులతో పాటు,  అనేక ఆర్థిక సంస్కరణలు, గ్లోబల్గా మన దేశ పరిస్థితి మెరుగుపరచడానికి ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ప్రజాస్వామ్య విలువల పట్ల వాజపేయికున్న  నిబద్ధత వల్ల ఆయన నాయకత్వం ప్రత్యేకంగా నిలిచింది. అందుకే ఆయన జయంతినే  ప్రతీ సంవత్సరం గుడ్ గవర్నెన్స్ డేగా జరుపుకుంటున్నాం. గుడ్ గవర్నెన్స్ డే ఎప్పుడు మొదలైంది.. ఈ దినోత్సవం జరుపుకోవటం మొదట 2014లో ప్రారంభమైంది. డిసెంబర్ 23, 2014న అటల్ బిహారి వాజపేయిగారికి  భారతరత్న పురస్కారాన్ని ప్రకటించారు. ఆ సమయంలోనే కొత్తగా ఎన్నికైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబర్ 25న గుడ్ గవర్నెన్స్ డేగా ప్రకటించారు. ఈ దినోత్సవం వాజపేయి వారసత్వాన్ని స్మరించడమే కాకుండా.. పారదర్శక, బాధ్యతాయుత, సమగ్ర పాలనను ప్రోత్సహించడానికి పౌరులు, అధికారులు కట్టుబడి ఉండాలని తెలియజేస్తుంది. గుడ్ గవర్నెన్స్ వల్లనే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుంది.   2024 థీమ్.. డిసెంబర్ 25, 2024న అటల్ బిహారి వాజపేయి 100వ జయంతి కావటం వల్ల ఈ సారి జరగబోయే గుడ్ గవర్నెన్స్ డే ఎంతో ప్రత్యేకమైనది.  ఈ  సంధర్భంగా ‘పరిపాలనా సంస్కరణలు, ప్రజా ఫిర్యాదుల విభాగం (DARPG)’ మొదలుపెట్టారు.  డిసెంబర్ 19 నుండి 24 వరకు ‘గ్రామాల వైపు పరిపాలన’ అనే క్యాంపెయిన్‌ను ప్రకటించింది. ఈ కార్యక్రమం గ్రామీణ స్థాయి దాకా  పాలనను చేరవేయడం.  అలాగే గ్రామీణ ప్రజల అవసరాలకు,  పాలన సేవలను అందుబాటులోకి తేవడం లక్ష్యంగా పెట్టుకుంది. గుడ్ గవర్నెన్స్ డే వల్ల ఇవన్నీ సాధ్యం అయ్యాయని తెలుసా..? డిజిటల్ ఇండియా ద్వారా  సులభంగా ప్రభుత్వ సేవలను పొందడానికి ఉపయోగపడింది. నేడు అందరూ లావాదేవీలు కూడా డిజిటల్ గానే చేయగలుగుతున్నామంటే ప్రభుత్వం తీసుకున్న ఈ చర్యనే కారణం. స్వచ్ఛ భారత్ అభియాన్ ద్వారా  దేశ పౌరుల్లో పరిశుభ్రత పట్ల అవగాహనని పెంపొందించడానికి  మొదలుపెట్టిన ఈ కార్యక్రమం ద్వారా దేశంలో ఎంతో మార్పు సాధ్యమైంది.   ప్రభుత్వ ప్రణాళికల్లో ప్రజల అభిప్రాయాలు సేకరించడం వల్ల కూడా ప్రజలకి సరైన పాలన అందించటం సాధ్యమౌతుంది. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) అమలు చేయటం వల్ల  డబ్బు మధ్యలో  ఉండే అవినీతిపరుల చేతికి చిక్కకుండా నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలకు సబ్సిడీలు చేరుతున్నాయి. పాలనా లోపం లేకుండా ప్రతీ నాయకుడు చిత్తశుద్ధితో పనిచేసినప్పుడు, మన  దేశ స్థితి గతులు ఎంతో మెరుగుపడతాయి. మన దేశ ప్రగతి కోసం పాటుపడిన గొప్ప నాయకులని తలచుకుంటూనే, తమ  బాధ్యతని సరిగా నిర్వర్తించని నాయకులని  ప్రజలు ప్రశ్నించగలగాలి. అలా ప్రశ్నించే చట్టాలు కూడా రావాలి. నాయకులుగా, అధికారులుగా, పౌరులుగా మనమంతా కలిసి పనిచేసినప్పుడు మన భారత దేశాన్ని ‘అభివృద్ధి చెందుతూ ఉన్న దేశం’ నుంచి ‘అభివృద్ధి చెందిన దేశంగా’ మార్చవచ్చు.                      *రూపశ్రీ.

special story of chistmas tree

క్రిస్మస్ ఎందుకు జరుపుకుంటారు.. క్రిస్మస్ రోజు క్రిస్మస్ చెట్టు ఎందుకు ఏర్పాటుచేస్తారంటే..!

క్రిస్మస్ ప్రతి సంవత్సరం డిసెంబర్ 25న జరుపుకుంటారు. ఇది క్రైస్తవ మతస్తులు చాలా ఇష్టంగా  జరుపుకునే అత్యంత పవిత్రమైన పండుగ. దీనిని  యేసుక్రీస్తు జన్మదినంగా జరుపుకుంటారు. ఈ పండుగ వెనుక మతపరమైన ప్రాముఖ్యత మాత్రమే కాకుండా శాంతి, ప్రేమ,  ఐక్యత వంటి చాలా విషయాలు నిగూఢంగా దాగున్నాయి. క్రిస్మస్ సందర్భంగా క్రిస్మస్ చెట్టును అలంకరించే సంప్రదాయం ఉంది. చాలా మంది లైట్లతో కూడిన నక్షత్రాలను ఇంటి గుమ్మాలకు,  ఇళ్ళలో వేలాడదీస్తారు.  ఇంకా ఇళ్లలో క్రిస్మస్ ట్రీ కూడా ఏర్పాటు చేస్తారు. అయితే క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేయడం వెనుక కారణం ఏంటి? తెలుసుకుంటే.. క్రిస్మస్.. మానవాళిని పాపాల నుండి విముక్తి చేయడానికి.  ప్రేమ, దయ,  సహనం ప్రాముఖ్యతను.. వాటి సందేశాన్ని అందించడానికి యేసుక్రీస్తు జన్మించాడు. యేసుక్రీస్తు ఒక గుహలో జన్మించాడని నమ్ముతారు. అక్కడ గొర్రెల కాపరులు అతని పుట్టుక గురించి అందరికీ తెలియజేసారు. క్రైస్తవ విశ్వాసాల ప్రకారం, యేసుక్రీస్తు దేవుని కుమారుడు.  ఆయన జీవితం మానవాళి సంక్షేమానికి అంకితమైంది. యైసుక్రీస్తు బోధనలను గుర్తుంచుకోవడం,  వాటిని  జీవితంలో అమలు చేయడం క్రిస్మస్ ముఖ్య ఉద్దేశ్యంగా పరిగణిస్తారు. ముఖ్యంగా  యేసుక్రీస్తు చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటారు. క్రిస్మస్ చెట్టు.. క్రిస్మస్ చెట్టును అలంకరించే సంప్రదాయం  చరిత్రలో  16వ శతాబ్దం కాలం నుండి ఉంది. ఈ సంప్రదాయం జర్మనీలో ప్రారంభమైంది. ఇక్కడ ప్రజలు శీతాకాలంలో తమ ఇళ్లను సతత హరిత చెట్లతో అలంకరిస్తారు. ఈ చెట్టు శీతాకాలంలో కూడా పచ్చగా ఉంటుంది.  ఇది జీవితంలో ఆశ..  దేవుని పట్ల శాశ్వతమైన ప్రేమకు చిహ్నం. చలికాలంలో ఈ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. చలికాలంలోనే క్రిస్మస్ జరుపుకునే సందర్భంగా క్రిస్మస్ చెట్లను అన్ని చోట్ల ఏర్పాటు చేస్తుంటారు. క్రిస్మస్ చెట్టు సింబాలిక్ వెనుక కారణాలు.. క్రిస్మస్ నాడు ఏర్పాటు చేసే క్రిస్మస్ ట్రీ లో వివిధ వస్తువులు ఏర్పాటు చేస్తారు. ఇందులో   కనిపించే నక్షత్రాలు కాంతికి  చిహ్నాలుగా పరిగణించబడతాయి. ఇవి  జీవితం నుండి చీకటిని తొలగిస్తాయి,  జీవితంలో ఉత్సాహాన్ని..  ఆనందాన్ని నింపుతాయి. చెట్టుపై ఉంచిన దీపాలు దేవుని కాంతిని సూచిస్తాయి. ఇది ప్రతి కష్టంలో మార్గనిర్దేశం చేస్తుంది. అలంకరణ.. క్రిస్మస్ చెట్టును రంగురంగుల బంతులు, రిబ్బన్లు,  గంటలతో అలంకరిస్తారు. ఈ అలంకరణలు ఆనందాన్ని,వ వేడుకలను సూచిస్తాయి. బహుమతులు.. చెట్టు కింద ఉంచిన బహుమతులు ప్రేమ, దాతృత్వం,  పరస్పర ప్రేమను సూచిస్తాయి. ఈ సంప్రదాయం పిల్లలు, కుటుంబ సభ్యులలో ప్రత్యేక ఆనందాన్ని తెస్తుంది. క్రిస్మస్ చెట్టును అలంకరించడం వెనుక  లోతైన మతపరమైన,  సాంస్కృతిక ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఇది యేసుక్రీస్తు జననాన్ని స్మరించుకోవడమే కాకుండా సంఘీభావం,  వేడుకల జరుపుకోవడానికి ఒక మార్గంగా  కూడా భావిస్తారు. కుటుంబం,  స్నేహితులు కలిసి క్రిస్మస్  జరుపుకుంటారు. క్రిస్మస్ కేవలం పండుగ మాత్రమే కాదు.. జీవితంలో మంచితనాన్ని, ప్రేమను,  కరుణను కలిగి ఉండాలనే స్ఫూర్తినిస్తుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, మనలో ప్రేమ,  దయ అనే లక్షణాలను కాపాడుకోవాలని  బోధిస్తుంది. క్రిస్మస్ చెట్టు,  దాని అలంకరణలు జీవితంలో ఆశ, శాంతి,  ఆనందాన్ని సూచిస్తాయి.                                             *రూపశ్రీ.

How do I make children cultured since childhood

చిన్నతనంలోనే పిల్లలు సంస్కారవంతులు కావాలంటే. ఈ 5 అలవాట్లు నేర్పాలి..!

ప్రతి తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నవయస్సులోనే మంచి విలువలను అందించాలని, తమ పిల్లలు సంస్కార వంతులుగా ఉండాలని అనుకుంటారు. దీనికి తగినట్టుగానే తమ పిల్లలను బాగా పెంచి, ఎన్నో విషయాలు నేర్పాలని.. నలుగురు తమ పిల్లల ప్రవర్తన గురించి గొప్పగా చెప్పుకునేలా తమ పిల్లలను  తీర్చిదిద్దాలనేది లక్ష్యంగా పెట్టుకుంటారు. ఇలా ఉండటం కోసం  కొందరు తల్లిదండ్రులు  తమ పిల్లలకు మొదటి నుండి ధార్మిక విద్యను అందిస్తారు.  తద్వారా వారి పిల్లలు తమ పెద్దలను గౌరవిస్తారు.  నాగరిక జీవితం గడుపుతారు. కానీ ఇప్పటి కాలంలో పిల్లలకు విలువలు నేర్పడం సవాల్ తో కూడుకున్నది.  చిన్న పిల్లలు కూడా పెద్ద మాటలు మాట్లాడతారు,  ప్రశ్నిస్తారు,  వ్యతిరేకిస్తారు. ముఖ్యంగా ఏదైనా ఒక మంచి విషయా్న్ని పిల్లలకు చెప్పాలని అనుకున్నప్పుడు ఎగతాళి చేయడం,  చాదస్తంగా చూడటం ఇప్పటి తరం పిల్లల అలవాటు.  అయితే చిన్నతనంలోనే సంస్కారవంతులు కావాలంటే కింద చెప్పుకునే 5 అలవాట్లు పిల్లలకు నేర్పాలి. కృతజ్ఞత.. మీ పిల్లలను కృతజ్ఞత కలిగి ఉండేలా పెంచాలి. ఇది ఇతరుల మనసులలో పిల్లల పట్ల, తల్లిదండ్రుల పట్ల ప్రేమ,  గౌరవం రెండింటినీ పెంచే అలవాటు.  కృతజ్ఞతలు తెలియజేయడం ద్వారా  అవతలి వ్యక్తులు చాలా సాటిసిఫై అవుతారు.  దీనివల్ల సంబంధాలు బాగుంటాయి. నలుగురు పిల్లల నడవడికను మెచ్చుకుంటారు.    పిల్లలకు ఎవరైనా మంచి చేస్తే, చాక్లెట్, బొమ్మలు లేదా బహుమతి ఇచ్చినా, పిల్లలకు ఏదైనా సహాయం చేసినా వారు వెంటనే సహాయం చేసిన వ్యక్తికి థ్యాంక్యూ చెప్పేలా అలవాటు చేయాలి. దయ.. పిల్లలు చాలా అమాయక హృదయులు.  పిల్లలలో ఉన్న ఈ అమాయకత్వాన్ని కాపాడుకోవాలి. దీనికోసం వారికి దయా గుణాన్ని అలవాటు చేయాలి. ఇది పిల్లలను చాలా సరళంగా ఉండేలా చేస్తుంది. పిల్లలకు దయతో కూడిన చిన్న పాఠాలు, నీతి కథలు,  సంఘటనలు చెబుతూ ఉండాలి. జంతువులు,  పక్షులపై దయ చూపడం వంటివి చేయాలి. చిన్న మొక్క నుండి పెద్ద జంతువులు, మనుషుల వరకు ప్రతి దాని పట్ల దయ కలిగి ఉండేలా అలవాటు చెయ్యాలి. బుద్దిగా.. ఈ ప్రపంచంలో చాలా వరకు ఏ విషయం పట్ల బుద్దిగా ఉండటం అనేది కనబడటం లేదు.  మనస్ఫూర్తిగా ఉండటం,  ప్రతి క్షణం అవగాహనతో  ఉండటం చాలా మందికి తెలియదు. నిజానికి ఇలా అటెన్షన్  గా ఉండటం అనేది ఒక కళ అని అంటారు.   ఈ కళ అందరికీ తెలియదు.  పిల్లలు బుద్ధిపూర్వకంగా ఉండటానికి చాలా  మార్గాలను నేర్పించవచ్చు. లోతైన శ్వాస తీసుకోవడం, ఎవరైనా మాట్లాడేటప్పుడు శ్రద్ధగా వినడం,  కళ్ళు మూసుకుని కాసేపు చుట్టూ ఉన్న వాతావరణాన్ని అనుభూతి చెందడం వంటివి ఇందులో ఉన్నాయి.  క్షమాపణ.. ఎనపైనా ఒర వ్యక్తి తప్పు చేశాడని తెలిసినా క్షమించడం అంత సులభం కాదు. కానీ  మనస్సును ఒకసారి నియంత్రించుకుంటే, క్షమించడం అనేది చాలా సులభం. క్షమాపణ కళను పిల్లలకు నేర్పాలి.  ప్రతీకారం తీర్చుకునే వ్యక్తి కంటే క్షమించేవాడు గొప్పవాడు. దయగల వ్యక్తులు మాత్రమే క్షమించగలరని పిల్లలకు చెప్పాలి. ఆధ్యాత్మికత.. ప్రతి బిడ్డ మనసులో ప్రపంచం గురించి ఎన్నో ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నలను ఆధ్యాత్మికతతో అనుసంధానించాలి. ఉదాహరణకు, ఈ ప్రపంచం చాలా అందంగా ఉందని మీరు ఎందుకు అనుకుంటున్నారు అని పిల్లలను అడగండి? ప్రజలు ఒకరికొకరు సహాయం చేసుకుంటారని మీరు ఎందుకు అనుకుంటున్నారని పిల్లలను అడగండి? పిల్లలకు ఆధ్యాత్మికతకు సంబంధించిన కొత్త విషయాలను కూడా చెప్పాలి.  తద్వారా వారు మరింత తెలుసుకునే అవకాశం లభిస్తుంది.                                                *రూపశ్రీ.

national mathematics day

లెక్కలు లేకపోతే చిక్కులే.... జాతీయ గణిత దినోత్సవం2024..!

  గణితం…. పుస్తక భాషలో చెప్పుకుంటే లెక్కల శాస్త్రం అనొచ్చు. అసలు ఈ లెక్కలు లేకుండా మన జీవితాన్ని ఊహించగలమా? మనం పుట్టినప్పటి నుంచి, చనిపోయేదాక లెక్కలు మన జీవితంలో భాగంగా ఉన్నాయి.  చిన్న పిల్లల చాక్లెట్ల లెక్క నుంచి సైంటిస్టుల రాకెట్  లాంచింగ్ దాకా ఈ లెక్కలు అన్ని చోట్లా ఉపయోగపడుతున్నాయి. డబ్బు మీద నడిచే ఈ కాలంలో లెక్కలు, గణాంకాలు లేకుండా ఏదీ జరగదు. మరి అలాంటి గణితమంటే మనలో చాలామందికి  అదేదో పెద్ద అర్ధం కానీ మిస్టరీలా అనిపించి, వింటేనే వణుకు పెట్టేసుకుంటూ ఉంటాం. కానీ ఇష్టపడితే దీనంత ఇంటరెస్టింగ్ సబ్జెక్ట్ ఇంకోటి లేదు అంటారు గణిత ప్రియులు. ప్రపంచ నడకకి అడుగడుగునా అవసరమయ్యే ఈ గణిత శాస్త్రం మీద ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది శాస్త్రజ్ఞులు కృషి చేశారు. గణిత శాస్త్ర చరిత్రలో భారత గణిత శాస్త్రజ్ఞులు చేసిన కృషి ఎంతో ప్రత్యేకమైనది. అందులో శ్రీనివాస రామానుజన్ గారిది ప్రత్యేక స్థానం. అందుకే  గణిత శాస్త్రజ్ఞుడైన శ్రీనివాస రామానుజన్ గారి జ్ఞాపకార్ధం ఆయన పుట్టినరోజయిన  డిసెంబర్ 22వ తేదీని ప్రత్యేక దినంగా  గుర్తించారు. రామానుజన్ గారి  125వ జయంతి సందర్భంగా 2012, డిసెంబర్22వ తేదీన,  భారత ప్రభుత్వం  అధికారికంగా జాతీయ గణిత దినోత్సవాన్ని ప్రకటించింది. గణిత శాస్త్రానికి ఆయన చేసిన కృషి, ముఖ్యంగా నంబర్ థియరీ, పార్టిషన్ ఫంక్షన్ లు  ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు పొందాయి.  ప్రత్యేకమైన ఈ రోజున శ్రీనివాస రామానుజన్ గారు గణితానికి చేసిన సేవ, ఆయన జీవితంలో కొన్ని ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకుంటే.. గణిత శాస్త్రంలో శ్రీనివాస రామానుజన్ .. శ్రీనివాస రామానుజన్  1887 లో,  తమిళనాడులోని ఈరోడ్‌లో ఒక అయ్యంగార్ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. నాణ్యమైన విద్య అందకపోయినా  తన  12 వ ఏటనే త్రికోణమితిలో తన ప్రావీణ్యాన్ని చూపారు. రామానుజన్  14 వ ఏట మద్రాసులోని పచాయప్ప కాలేజీలో చేరి ఇతర సబ్జెక్టులలో ఫెయిలైనా కూడా, గణితంపై మాత్రం  స్వతంత్ర పరిశోధన చేశారు. 1912 లో మద్రాస్ పోర్ట్ ట్రస్టులో ఉద్యోగం పొందేందుకు రామస్వామి అయ్యర్ సాయం చేశారు. అలా అక్కడ పని చేసుకుంటూనే ఆయన రకరకాల గణిత సిద్ధాంతాలు నోట్సుల్లో  రాసుకునేవారు. 1913 లో ఆయన సిద్ధాంతాలని చూసి ఆశ్చర్యపోయిన కేంబ్రిడ్జ్ గణిత శాస్త్రవేత్త  GH హార్డీ, రామానుజన్‌ను లండన్‌కు ఆహ్వానించారు. అలా అక్కడ  రామానుజన్ గణితం మీద మరింత కృషి చేశారు.  1918 లో రాయల్ సొసైటీ ఫెలోగా ఎంపికైన అతితక్కువ వయస్కుల్లో రామానుజన్ ఒకరు. ఆయన రాసిన చాలా గణిత సిద్ధాంతాల  మీద ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికీ ఎంతోమంది పరిశోధన చేస్తున్నారు. శ్రీనివాస రామానుజన్ గణితశాస్త్రంలో  చేసిన కృషి దేశీయంగా, అంతర్జాతీయంగా గొప్ప  ప్రభావం చూపింది.  నేటి తరానికి గణిత దినోత్సవం.. జాతీయ గణిత దినోత్సవం రామానుజన్ కృషిని స్మరించుకోవటానికి మాత్రమే కాకుండా, గణితంపై నేటి తరం వారికి ఆసక్తిని పెంచడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. రామానుజన్ రూపొందించిన త్రికోణమితి సిద్ధాంతాలు, మన డైలీ లైఫ్ లో వాటి ఉపయోగాలు గురించి తెలుసుకున్నప్పుడు త్రికోణమితి మీద ఆసక్తి పెరగడం ఖాయం. రామానుజన్ జీవితం ఆధారంగా రూపొందించిన చిత్రాలు  "ది మేన్ హూ న్యూ ఇన్ఫినిటీ"  లాంటివి చూడడం వల్ల పిల్లలకి   గణితం పట్ల ప్రేమ పెరుగుతుంది.  ప్రతి విద్యార్థిలో కొన్ని బలాలు,  బలహీనతలు ఉంటాయి. వారిలో బలహీనతలని ఎత్తి చూపించకుండా వారికి నచ్చిన దానిలో ప్రోత్సహిస్తే ఎంత మంచి జరుగుతుందో  రామానుజన్ జీవితం సమాజానికి ఒక ఉదాహరణగా, పిల్లలకి ప్రేరణగా నిలుస్తుంది. 2024 థీమ్.. జాతీయ గణిత దినోత్సవం 2024 కు  "గణితం: ఆవిష్కరణ, పురోగతికి వంతెన" అనే థీమ్ ఎంచుకోబడింది. నానాటికీ పెరుగుతున్న సాంకేతికత,  సైన్స్ ద్వారా చేస్తున్న ఆవిష్కరణల డెవలప్మెంటుకి   గణిత సూత్రాలు ఎలా ఆధారం అవుతున్నాయనే విషయాన్ని ఈ థీమ్ హైలైట్ చేస్తుంది.  గణితంపై ప్రేమను, గౌరవాన్ని వ్యక్తం చేస్తూ  రామానుజన్ జీవితాన్ని కృషిని స్మరించుకుంటూ.. రామానుజన్ లాంటి గణిత శాస్త్రవేత్తలుగా మారేవైపు నేటి తరం అడుగులు వెయ్యాలి.                         *రూపశ్రీ. 

World Saree Day

ఆరు గజాల నిండుదనం.. భరతజాతి నిండు గౌరవం.. ! ప్రపంచ చీర దినోత్సవం 2024..

   ‘చీరలోని గొప్పతనం తెలుసుకో, చీర కట్టి ఆడతనం పెంచుకో’ అంటూ పాటలు రాసి మరీ నేటి తరానికి చీర గొప్పతనం గుర్తు చేయాల్సిన పరిస్థితి వచ్చిందేమో కానీ, అందరూ ఒకసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే మనలో ప్రతీ ఒక్కరం అమ్మ చీర కొంగు నీడలో పెరిగినవాళ్ళమే అన్న విషయం గుర్తొస్తుంది. అమ్మ చీర కొంగు చెమట పడితే మొహం తుడిచేది, ఎండకో వానకో గొడుగయ్యేది. ఇంకా చెప్పాలంటే  సగటు భారతీయ కుటుంబంలో ప్రతీ శిశువు చీరతో కట్టిన ఉయ్యాలలోనే జోలపాటలు వింటూ పడుకుంది. మరి భారతీయ సమాజంలో, సంస్కృతిలో లోతుగా ఇమిడిపోయిన చీర గురించి  చెప్పుకోవాల్సింది ఏముంది అనిపిస్తుందేమో..  అయితే పెద్దలు చెప్పింది పిల్లలు పాటించటం వల్లనే  ఒక తరం నుంచి ఇంకో  తరానికి ఆచారాలు, విలువలు కొనసాగుతాయి.  అలాగే  మన సంస్కృతిలో భాగమై ఉన్న చీర గొప్పతనాన్ని తెలియజేస్తూ,  వెస్టర్న్ కల్చర్ వైపు ఆసక్తి చూపుతున్న నేటి తరం ఆలోచనా విధానం మార్చాలని, తర్వాత వచ్చే   తరాలు చీరని  మర్చిపోకుండా చేయాలనే ప్రయత్నమే  ప్రపంచ చీర దినోత్సవం. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశానికి గుర్తింపు తెచ్చిన వాటిలో చీర కూడా ఒకటి.  ప్రతీ సంవత్సరం డిసెంబర్ 21 వ తేదీన  వరల్డ్ శారీ డే జరుపుకుంటారు.   చీర ఎప్పటినుంచి ఉంది.. చీర చరిత్ర గురించి చూస్తే దీని ఆనవాళ్ళు ఒకానొకప్పుడు మన భారతదేశంలోనే గొప్ప నాగరికతగా చెప్పబడిన సింధు నాగరికత(2800-1800బి‌సి‌) కాలంలో దొరికాయి. అప్పుడిది మామూలు పొడవైన వస్త్రంలా ఉండేది. కానీ కొన్ని వందల సంవత్సరాలుగా ఇది ఒక ఆర్ట్ ఫార్మ్ గా మారుతూ వచ్చింది.. చీరలు  నేసే నేతన్నలకి, చీరల్లో ఉండే  ప్రత్యేక కళకీ  గౌరవం తెలపడానికిగానూ  2020, డిసెంబర్21వ తేదీన  ప్రపంచ చీర దినోత్సవం జరుపుకోవడం మొదలపెట్టారు.  స్థానికంగా మొదలై త్వరలోనే జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ఉద్యోమమే స్పూర్తి.. సోషల్ యాక్టివిస్టులైన శ్రీమతి సింధూర కవిటి, శ్రీ నిస్టులా హెబ్బార్..  ఈ ఉద్యమానికి నాంది పలికారు. అయితే ఈ ఉత్సవానికి తొలి అడుగు మాత్రం 2009లో పడింది. చీరల వారసత్వాన్ని పునరుద్ధరించాలన్న లక్ష్యంతో సోషల్ యాక్టివిస్ట్  శ్రీమతి నళిని శేఖర్  దీన్ని ప్రారంభించారు.   శారీ డేని ఎందుకు జరుపుకోవాలి.. భారతీయుల మూలాలను గుర్తు చేస్తూ మన వారసత్వాన్ని గుర్తుచేసుకోవడం ఈ రోజు ఉద్దేశ్యం. చీర కేవలం ఏదో  ఒంటికి చుట్టుకునే వస్త్రం మాత్రమే కాదు, తరాలుగా అందించబడుతున్న భారతీయ వారసత్వమని ప్రపంచానికి చాటి చెప్పడమే శారీ డే లో ఉన్న గొప్పతనం.  చీరలు తయారు చేసే కళను కాపాడి, చేతి వృత్తుల పరిశ్రమని ప్రోత్సహించడమనే మరక ఉద్దేశ్యం కూడా ఇందులో ఉంది. చీరలు వివిధ డిజైన్లలో అభివృద్ది చెంది, స్త్రీల వ్యక్తిత్వాన్ని, అందాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టట్టంలో కీలక పాత్ర పోషిస్తుంది. భారతీయ సాంస్కృతిక సంపదను   ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలతో అనుసంధానం చేయటం ద్వారా  మన సంస్కృతిలోని గొప్పతనాన్ని తెలియచేస్తుంది. చీరలో వైవిధ్యం.. ఫ్యాషన్ పరిశ్రమపై చూపిస్తున్న ప్రభావం.. భారతదేశంలోని ప్రతి ప్రాంతం దాని ప్రత్యేక శైలిని చీర ద్వారా పరిచయం చేస్తుంది. ఉత్తర ప్రదేశ్  విలాసవంతమైన బనారసీ పట్టు చీర నుండి తమిళనాడులో చేతితో నేసిన కాంచీపురం చీర వరకు. రాజస్థాన్  రంగురంగుల బంధనీ చీర నుంచి తూర్పు భారతంలోని జామ్‌దాని, ఖాదీ చీరల వరకూ ఎంతో వైవిధ్యం కలిగి ఉన్నాయి. చీర కట్టే స్టైల్లో కూడా  ప్రతీ ప్రాంతానికి తమదైన ప్రత్యేకత ఉంది.  మహారాష్ట్రలో నౌవారి స్టైల్, గుజరాత్‌లో ముందుకు పల్లు కట్టడం, బెంగాల్ చీర కట్టు... ఇలా  చాలా వైవిధ్యం ఉంది. చరిత్రలో రాణి లక్ష్మీ బాయి లాంటి వీరనారిలు, ఇందిరా  గాంధీ వంటి మహిళలు చీరలను విభిన్న శైలుల్లో ధరించారు. సాంప్రదాయ దుస్తులు కూడా శక్తికి చిహ్నంగా నిలవగలవని నిరూపించారు.   చీర ఇప్పుడు తన సాంప్రదాయ హద్దులని దాటి అంతర్జాతీయ ఫ్యాషన్ రంగంలో కూడా తన స్థానాన్ని సంపాదించుకుంది. ప్రముఖ డిజైనర్లు సబ్యసాచీ, మనీష్ మల్హోత్రా, గౌరవ్ గుప్తా వంటి మోడర్న్ డిజైనర్స్ కూడా  చీరను డిఫరెంట్ స్టైల్సులో డిజైన్ చేసి ఔరా అనిపిస్తున్నారు.   చీర ఆరు నుండి తొమ్మిది గజాల అన్‌స్టిచ్డ్ వస్త్రం కాదని, భారతదేశ  కళా నైపుణ్యం,  సంప్రదాయానికి ప్రత్యక్ష సాక్ష్యం అని గుర్తించాలి.  ఆడపిల్ల ఇంటికి వస్తే చీర పెట్టి, వారి సౌభాగ్యం కలకాలం నిలబడాలని కోరుకునే మన భారతీయ సంప్రదాయం అంతరించిపోకుండా ఉండాలన్నా, మన భారతీయ సంస్కృతి వైభవాన్ని ప్రపంచ దేశాలకి గుర్తు చేయాలనుకున్నా, ముందు మనం మన మూలాలనుంచి  దూరం అవ్వకుండా ఉండాలి.  భారత సంప్రదాయాన్ని,  చీర వైవిధ్యాన్ని పునరుద్ధరించేందుకు ప్రతి ఒక్కరూ వరల్డ్ శారీ డే ను జపురుకోవాలి.                                        *రూపశ్రీ.

How to Control Anger

కోపం చల్లారడానికి ఉత్తమమైన మార్గం.. రవిశంకర్ గురూజీ చెప్పిన ట్రిక్ ఇదిగో..!

తన కోపమే తన శత్రువు.. తన శాంతమే తనకు రక్ష అని పెద్దలు ఎప్పుడో చెప్పారు.  కోపం  అనేది ప్రతి ఒక్కరిలో ఉండే సహజమైన గుణమే అయినా కొందరిలో ఇది చాలా ఎక్కువగా ఉంటుంది. కోపం ఎక్కువగా ఉన్నవారు చాలా విషయాలలో నష్టాలు ఎదురుచూడాల్సి వస్తుంది. ముఖ్యంగా బయటి వాళ్ల దగ్గర కోపం చూపించినా మహా అయితే మాట్లాడకుండా పోతారు. కొందరైతే చెడ్డవారనే ముద్ర వేస్తారు.. కానీ కుటుంబ సభ్యులు,  అన్నింటి కంటే ముఖ్యంగా జీవిత భాగస్వాములు కోపం వల్ల జీవితంలో కోలుకోలేని,  తిరిగి పూడ్చలేని నష్టాలను చవిచూసే అవకాశం ఉంటుంది.  అందుకే కోపాన్ని నియంత్రించుకోవాలని అంటారు.  అయితే కోపాన్ని నియంత్రించుకోవాలి అని అనుకున్నంత సులువగా దాన్ని కంట్రోల్ చేసుకోకపోవడమే పెద్ద సమస్య.  ప్రముఖ ఆధ్యాత్మిక గురువు.. లైఫ్ కోచ్ అయిన రవిశంకర్ గురూజీ కోపాన్ని జయించడానికి, కోపంతో ఉన్న వ్యక్తులతో ఎలా ప్రవర్తించాలనే విషయాలను స్పష్టంగా తెలిపారు. సైలెంట్ అయితే కోపం పెరుగుతుందా..? వివాహ బంధంలో సరైన భాగస్వామి దొరకకపోతే కోపం విషయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి. ఏదైనా గొడవ జరిగినప్పుడు మీరు సైలెంట్ గా ఉండిపోతే అవతలి వారి కోపం కంట్రోల్ కాదు.. ఫలితంగా . కోపం పెరుగుతుంది. కోపం ఉన్నప్పుడు సైలెంట్ అయిపోయి సమయాన్ని వృథా చేయకూడదు. అవతలి ఏదైనా మాట్లాడుతుంటే సైలెంట్ గా అవాయిడ్ చేయకూడదు. ఇది చాలా తప్పు. కోపం ఇలా కంట్రోల్.. మీరు ఎంత చెప్పినా సరే.. ఎదుటి వ్యక్తి కోపం తగ్గకపోతే దీనికోసం చేయవలసిన పని కోపంగా ఉన్న వ్యక్తికి అర్థం అయ్యేలా.. ఆ వ్యక్తితో సన్నిహితంగా ఉండే వ్యక్తిని సంప్రదించడం.మూడవ వ్యక్తి సహాయంతో కోపాన్ని తగ్గించే ప్రయత్నం చేయవచ్చు. ఎందుకంటే రిలేషన్షిప్ సక్రమంగా సాగకపోతే  కోపగించుకునే అవకాశం ఉంది.  కానీ అర్థమయ్యేలా ఎవరో ఒకరు వివరిస్తే అర్థం చేసుకునే అవకాశాలు ఉంటాయి. మూడో వ్యక్తి ప్రమేయం మంచిదేనా? సాధారణంగా భార్యాభర్తలు కానీ.. కుటుంబ సభ్యులు కానీ వారి మధ్య ఏదైనా గొడవ జరిగినప్పుడు మూడవ  మనిషి ప్రమేయం ఉంటే ఇష్టపడరు. కానీ భాగస్వామి కానీ, కుటుంబంలో వ్యక్తి కానీ ఏదైనా చెప్పాలని చూసినప్పుడు అవతలి వ్యక్తి వినకుంటే.. మీరు చెప్పేది మంచి విషయమే అయినా అప్పటికే మీ మీద ఉన్న కోపం వల్ల  మీరు చెప్పే మంచి కూడా విని అర్థం చేసుకునే ప్రయత్నం చేయకపోతే అలాంటి సందర్బంలో మూడవ వ్యకి సహాయం తీసుకోవడమే మంచిదట. అయితే భార్యాభర్తలు ఎప్పుడూ ఇలా మూడవ వ్యక్తి ద్వారా సంప్రదింపులు జరుపుకోకూడదు. ఇద్దరి మధ్య గొడవలు వచ్చినా ఇద్దరూ కలసి ఓపెన్ గా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకోవడమే మంచిది. ఇది కూడా ట్రై చేయవచ్చు.. ఎవరైనా చాలా కోపంగా ఉంటే వారు నిశ్శబ్దంగా ఉంటే..  వారిని గౌరవించి మీరు కూడా  నిశ్శబ్దంగా ఉండాలి. అలా ప్రశాంతంగా ఉంటే కోపంగా ఉన్న వ్యక్తి తనను తాను అర్థం చేసుకోవడానికి సమయం లభిస్తుంది.   అతను తనంతట తానుగా కోపం తగ్గిపోయి నార్మల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే కోపంగా ఉన్న సమయంలో  ఎటువంటి తప్పు అడుగు వేయకుండా జాగ్రత్త పడాలి.  ఇకపోతే.. ప్రతి విషయంలోనూ కోపం తెచ్చుకోవడం బంధాలకు..  ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అందువల్ల గొడవలు జరిగినప్పుడు.. కోపంగా ఉన్నప్పుడు  ప్రశాంతంగా ఉండటం,  ఎదుటివారి కోపాన్ని తగ్గించడానికి ట్రై చేయడం మంచిది.                                              *రూపశ్రీ.  

previous probelms slove tips

గతంలో జరిగిన గాయాలు ఏవైనా సరే ? ఆ గాయాల నుండి ఇలా బయటపడండి..!

  ప్రజలు చాలావరకు మానసిక సమస్యలతోనే  ఎక్కువగా డిస్టర్బ్ అవుతారు.   చాలామందిని గమనిస్తే కాలంతో పాటు అలా సాగుతుంటారు.. కానీ వారిలో మానసిక సమస్యలు అలాగే ఉంటాయి.  అవన్నీ గతంలో జరిగిన గాయాల తాలూకు బాధాకర పరిస్థితులు.  కాలం అయితే గడుస్తోంది కానీ.. మానసికంగా ఒకచోటే చిక్కుబడిపోయి ఉంటారు. ఆ గాయపడిన పరిస్ఖితుల నుండి బయటకు రాలేకపోవడం వల్లనే చాలా వరకు డిప్రెషన్ వంటి సమస్యలకు లోనవుతుంటారు.  అయితే గతం చేసిన గాయాలు తగ్గంచలేనివే అయినా వాటి నుండి బయటపడం చాలా అవసరం. లేకపోతే జీవితంలో ఎదుగుదల అంతగా ఉండదు.  మానసికంగా బలహీనంగా ఉన్నవారు దాన్ని అధిగమించాలంటే ఈ గతం తాలూకు గాయాల నుండి బయటపడాలి. గతంలో జరిగిన గాయాలు ఏవైనా సరే.. వాటి నుండి బయటపడటం చాలా ముఖ్యం.  ఈ మానసిక గాయాలు మనిషిని లోపలి నుండి చాలా బలహీనంగా మారుస్తాయి.  దీని కారణంగా వ్యక్తులు ఎప్పుడూ నిరాశ,  ఆందోళన, మనుషుల మీద నమ్మకం లేకపోవడం వంటి సమస్యలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. గతం తాలూకు గాయాలతో ఇబ్బంది పడుతున్నవారిలో ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి.  ఇవి వ్యకులలో తొందరగా కోపం, విచారం,  భయం వంటివి కలిగిస్తుంటాయి.  ఈ ఎమోషన్స్ ను బయట పెట్టలేక,  మనసులోనే అణుచుకోలేక చాలామంది ఇబ్బంది పడుతుంటారు. అయితే ఎమోషన్స్ ను అణుచుకోవడానికి ప్రయత్నించకూడదు.  వీటిని బయటకు వ్యక్తం చేయడం వల్ల మనసులో భారం ఏర్పడదు. కౌన్సెలింగ్.. కౌన్సెలింగ్ తీసుకోవడం వల్ల మనసులో మానసిక బాధను, గాయాల తాలూకు పరిస్థితులను అధిగమించడం సులువు అవుతుంది.  గాయం తాలూకు ప్రభావాన్ని తగ్గించుకోవచ్చు. సహకారం.. కుటుంబ సభ్యులు, స్నేహితులు,  ఆప్తుల సహాయంతో  మానసిక గాయాల నుండి బయట పడేందుకు ప్రయత్నించాలి.  చుట్టూ ఉన్నవారి సపోర్ట్ ఉంటే వీటి నుండి బయటపడటం తేలిక. వాతావరణాన్ని చాలా ఆహ్లాదంగా ఉంచడంలో అందరూ సహాయపడతారు. నిద్ర.. మానసిక సమస్యలకు మంచి ఔషదంగా నిద్రను చెప్పవచ్చు.  రోజూ కంటినిండా నిద్రపోవడం,  సమతుల ఆహారం తీసుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది.  మానసిక సమస్యలు ఏర్పడినా అవన్నీ తర్కంగా,  ఆలోతనాత్మకంగా పరిష్కరించుకోగలుగుతారు.  శరీరంలో ఒత్తిడి తగ్గించుకోవడం చాలా ముఖ్యం. సెల్ఫ్ నోట్.. మనసులో ఉన్న భావాలను,  మనసు పడే బాధను అక్షరరూపంలో రాస్తుంటే మనసు భారం చాలా వరకు తగ్గుతుంది.  వీటిని ఇలా రాస్తూ ఉంటే ఆ తరువాత ఎప్పుడైనా పునఃపరిశీలన చేసుకున్నప్పుడు ఆలోచనల పరంగా మారడానికి చాలా ఉపయోగపడతాయి.  అప్పట్లో నేను ఇలా ఉన్నాను, ఇప్పుడెందుకు ఇలా అయ్యాను.. అప్పట్లో ఇంత బాధలో ఉన్నాను.. ఇప్పుడు ధైర్యంగా ఉన్నాను.. ఇలాంటి మాటలు మనసుకు చాలా ఊరట ఇస్తాయి. హాబీ.. మానసిక సమస్యల నుండి, గతం గాయాల నుండి బయట పడాలంటే దానికి చక్కని మార్గం మనసుకు, మెదడుకు ఆలోచించే అంత సమయం ఇవ్వకపోవడం.  ఇందుకోసం  కొత్త పనులు, హాబీలు,  కొత్త విషయాలు నేర్చుకోవాలి.  దీని వల్ల రెండు లాభాలున్నాయి.  ఒకటి గతం గాయాలు మర్చిపోవడం, రెండవది కొత్త నైపుణ్యాలు సాధించడం ద్వారా జీవితంలో  ఆర్థిక భద్రతవైపు అడుగేయడం.                                       *రూపశ్రీ.

Kitchen Tips

శనగపిండి ఎక్కువ కాలం పురుగు పట్టకుండా ఉండాలంటే ఇలా చెయ్యండి..!

శనగపిండి భారతీయులు ఉపయోగించే పిండులలో ఒకటి.  శనగపిండిని పిండి వంటల నుండి,  కూరలు,  స్నాక్స్ వంటివి తయారు చేయడంలో కూడా ఉపయోగిస్తారు.  ముఖ్యంగా పకోడీలు, బజ్జీలు చేయడానికి శనగపిండి కావాల్సిందే. అయితే శనగపిండికి తొందరగా పురుగులు పడతాయి. పురుగులు పట్టిన పిండిని వాడుకోవడం అంటే ఎవరికీ నచ్చదు. ఎంత జల్లించి వాడుకోవాలని చూసినా అది  అంత ఆరోగ్యం కూడా కాదు. అలా కాకుండా శనగపిండి ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. అదే విధంగా శనగపిండి ఉపయోగాలు కూడా తెలుసుకుంటే. శనగ పిండి ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా పరిగణించబడుతుంది. ప్రోటీన్, ఫైబర్, మెగ్నీషియం, ఐరన్,  విటమిన్ B6 వంటి అనేక పోషకాలు శనగపిండిలో ఉంటాయి. దీని కారణంగా ఇది రుచిగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుంది, ముఖ్యంగా కండరాలను బలోపేతం చేయడంలో,  జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది. టైట్ కంటైనర్.. గాలి చొరబడని డబ్బాలో గాలి,  తేమ తగలకుండా ఉండేలా శనగపిండిని నిల్వచేయాలి. ఇది శనగపిండి తాజాదనాన్ని,  రుచిని తగ్గకుండా చేస్తుంది. చల్లని, పొడి ప్రదేశం.. శనగ పిండిని చల్లని,  పొడి ప్రదేశంలో నిల్వ చేయాలి. తేమతో కూడిన ప్రదేశంలో ఉంచడం వల్ల దానిలో ఫంగస్ లేదా కీటకాలు పెరుగుతాయి. దాని కారణంగా అది చెడిపోతుంది. ఫ్రిడ్జ్ లో.. శనగ పిండిని ఎక్కువ కాలం నిల్వ చేయవలసి వస్తే, దానిని రిఫ్రిజిరేటర్‌లో ఉంచాలి. ఇది పురుగు పట్టకుండా చేస్తుంది. సిలికా జెల్ ప్యాక్.. కంటైనర్‌కు సిలికా జెల్ ప్యాక్‌లను జోడించావి. ఇది తేమను గ్రహిస్తుంది. శనగ పిండిని పొడిగా ఉంచుతుంది. దీని వల్ల శనగపిండి త్వరగా పాడవదు. సూర్యకాంతి.. శనగ పిండికి డైరెక్ట్ సన్ లైట్ తగలకుండా చూసుకోవాలి. నేరుగా  ఎండలో ఉంచడం వల్ల అందులో తేమ పేరుకుపోయి శనగ పిండి త్వరగా పాడవుతుంది. స్పూన్.. శనగపిండిని బయటకు తీయడానికి ఎల్లప్పుడూ శుభ్రమైన  పొడి చెంచాను ఉపయోగించాలి. ఇలా చేస్తే అందులో తేమ తగలదు.  పిండి కూడా శుభ్రంగా ఉంటుంది. కొనుగోలు.. కొత్త శనగ పిండిని కొనుగోలు చేసే ముందు దాని తాజాదనాన్ని,  ప్యాకేజింగ్‌ను తనిఖీ చేయాలి.  అందులో తేమ లేదా కీటకాలు లేవని నిర్ధారించుకోండి.                                          *రూపశ్రీ.

మైనారిటీల హక్కుల దినోత్సవం 2024…వెనుకబడిన ప్రజలకు అపురూప వరం మైనారిటీ హక్కులు..!

  ప్రపంచంలో ప్రతీ దేశంలోనూ వేర్వేరు జాతులవారు, వేర్వేరు భాషలవారు,  వేర్వేరు మతపరమైన విశ్వాసాలు కలిగినవారు ఉంటారు. ఇందులో కొన్ని వర్గాల వారు సంఖ్యాపరంగా చాలా ఎక్కువగా ఉంటారు.  కొన్ని వర్గాలవారి సంఖ్య  తక్కువ లేదా చాలా తక్కువగా ఉంటుంది. అలాంటి వారిని మైనారిటీలగా గుర్తిస్తారు. ఇక భారతదేశం గురించి మాట్లాడుకుంటే, మన దేశంలో ఉన్నంత  భిన్నత్వం ఏ దేశంలోనూ  ఉండదు. అయినా సరే భిన్నత్వంలో ఏకత్వానికి మంచి ఉదాహరణగా ఇప్పటికీ నిలుస్తుంది. దీనికి కారణం మన భారత రాజ్యాంగం దేశ పౌరులందరికీ  సమాన హక్కులను అందించడమే కాకుండా భాష, జాతి, సాంస్కృతిక, మతపరమైన మైనారిటీల  హక్కులను రక్షించడానికి పలు చర్యలను అమలు చేసింది. మైనారిటీల హక్కులు, భద్రత, అభివృద్ధి గురించి అవగాహన కల్పించడం,  మైనారిటీల సమస్యలను గుర్తించి, వారి రక్షణ కోసం చర్యలు తీసుకోవటానికి భారతదేశంలో ప్రతి సంవత్సరం డిసెంబర్ 18న మైనారిటీల హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మైనారిటీ హక్కుల దినోత్సవం  ఎప్పుడు మొదలైంది.. మొదటి మైనారిటీ హక్కుల దినోత్సవం 2013లో ప్రారంభమైంది. ఐక్యరాజ్య సమితి ప్రతిపాదించిన  మైనారిటీల హక్కుల ప్రకటనపై  సంతకం చేసిన తరువాత మనదేశం ఈ దినోత్సవాన్ని జరపడం ప్రారంభించింది. భారత ప్రభుత్వం 1992లో స్థాపించిన ‘జాతీయ మైనారిటీ కమిషన్ (NCM)’, ఈ  మైనారిటీల హక్కులని కాపాడటంలో ముఖ్యపాత్ర పోషిస్తోంది. 2024 థీమ్... ప్రతి సంవత్సరం ప్రత్యేకమైన థీమ్‌ను ఎంపిక చేస్తారు.  2024 సంవత్సరానికి “వైవిధ్యాన్ని ప్రోత్సహించటం, హక్కులను కాపాడటం” అనే థీమ్ ప్రకటించారు.  మన దేశంలో మత, భాష, సాంస్కృతిక, సామాజిక పరంగా ఉన్న వైవిధ్యాన్ని గుర్తించి  మైనారిటీల హక్కులను కాపాడాల్సిన  అవసరాన్ని ఈ  థీమ్ తెలియజేస్తుంది. మైనారిటీ హక్కుల దినోత్సవం  ఎందుకు అవసరం.. మైనారిటీలకు సమాన హక్కులు, సామాజిక న్యాయం అందించడంతో పాటు వారి అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది.  రాజ్యాంగపరంగా, చట్టపరంగా మైనారిటీలకి ఉన్న  హక్కుల గురించి అవగాహన కల్పిస్తుంది. సామాజిక, ఆర్థిక, విద్యా లోటుపాట్లను తొలగించటానికి కృషి చేస్తుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 క్రింద మైనారిటీలకు హక్కులు కల్పిస్తుంది. ప్రభుత్వాలు, ఎన్జీవోలు, ప్రజలు అందరూ కలిసి మైనారిటీల సంక్షేమం కోసం  పనిచేయాలని పిలుపునిస్తుంది. భారతదేశంలో ఎవరు మైనారిటీలు? భారతదేశంలో మైనారిటీలను మతం, భాష, సంస్కృతిపై ఆధారపడి నిర్వచిస్తారు. జాతీయ మైనారిటీ కమిషన్ ప్రకారం, 6 మత సమూహాలు అధికారికంగా మైనారిటీగా గుర్తించబడ్డాయి. మొదట ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు, బౌద్ధులు, పార్సీలు(జొరాష్ట్రియన్లు) మైనారిటీలుగా గుర్తించబడ్డారు. ఆ తర్వాత 2014లో జైనులను కూడా మైనారిటీలో భాగం చేశారు.  2011 జనాభా లెక్కల ప్రకారం మన దేశంలోని మైనారిటీల్లో మొదటి స్థానంలో ముస్లింలు, చివరి స్థానంలో పార్శీలు ఉన్నారు. కేవలం మతం ఆధారంగానే కాకుండా  భాష, జాతి ఆధారంగా  కూడా మైనారిటీ వర్గాలు భారతదేశంలో ఉన్నాయి. మైనారిటీలందరికీ భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29, 30..  సాంస్కృతిక, విద్యా హక్కులను రక్షిస్తాయి. నేషనల్  మైనారిటీ కమిషన్ పాత్ర.... జాతీయ మైనారిటీ కమిషన్ 1992లో స్థాపించబడింది. ఇది మైనారిటీల హక్కులను రక్షించి, వారి సామాజిక, ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తుంది. మైనారిటీల రాజ్యాంగ హక్కుల అమలును పర్యవేక్షించటం, హక్కులకి భంగం కలిగినప్పుడు ఫిర్యాదులను స్వీకరించి పరిష్కరించడం, మైనారిటీల అభివృద్ధికి పాలసీలను సిఫార్సు చేయటం,  వారి  ఆర్థిక, సామాజిక పురోగతిని సమీక్షించటం ఈ కమిషన్ ముఖ్య విధులుగా ఉన్నాయి. మైనారిటీల హక్కులని కాపాడటానికి,  చాలా రాష్ట్రాల్లో కూడా  స్టేట్ మైనారిటీ కమీషన్లు ఏర్పాటు చేయబడ్డాయి. ఇవి కూడా మన రాజ్యాంగానికి అనుగుణంగానే  మైనారిటీల హక్కుల్ని కాపాడి, వారి అభివృద్ధికి కృషి చేస్తాయి.  మైనారిటీ హక్కుల దినోత్సవం ద్వారా ప్రభుత్వం, సమాజం, ప్రజలు  కలిసికట్టుగా మన దేశంలో సమానత్వం, న్యాయం కోసం పని చేయాలి. మన దేశ అభివృద్ధిలో మైనారిటీల పాత్రని కూడా గుర్తించాలి. సమాజంలో ఏ ఒక్కరూ వివక్షకి గురి కావటమో లేక హక్కులకి, అభివృద్ధికి దూరం కాబడటమో అనేది  వారితోపాటూ ఆ సమాజానికే మంచిది కాదు.  కాబట్టి  మైనారిటీల హక్కులను పరిరక్షించే సమాజాన్ని నిర్మించేందుకు అందరం కృషి చేయాల్సిన అవసరం ఉందని గ్రహించి, ఆ దిశగా పని చేయాలి. ఇలా ఉన్నప్పుడు  మన భారతదేశం ఎప్పటికీ భిన్నత్వంలో ఏకత్వానికి  ఉత్తమ ఉదాహరణగా నిలిచిపోతుంది.                                          *రూపశ్రీ.  

ఎవరైనా మిమ్మల్ని పదే పదే అవమానిస్తే ఇలా చేయండి.. అవతలి వారు నోరు మూసుకుంటారు..!

  సరదా.. చాలా సహజంగా అనిపించే విషయం. చాలామంది సాధారణంగా మాట్లాడే సమయంలో సరదా పేరుతో కొన్ని జోక్స్ వేయడం లేదా కొన్ని మాటలు అనడం చేస్తుంటారు. ఆ సందర్భానికి అది పెద్దగా తప్పని అనిపించకపోయినా మరుసటి రోజు లేదా కొన్ని రోజుల తరువాత ఆలోచిస్తే అది చాలా అవమానంగా అనిపించవచ్చు. ముఖ్యంగా సరదా పేరుతో అనే కొన్ని మాటలు ఒకసారి అయితే సరదాగానే ఉంటుంది. కానీ పదే పదే ఆ మాటను అనడం లేదా పదే పదే అదే విధంగా ప్రవర్తించడం చేస్తుంటే అది అవమానించడం అవుతుంది.  ఇలా సరదా మాటున జరిగే అవమానాన్ని చాలామంది పంటి బిగువున భరిస్తుంటారు.  కొందరు అదే పనిగా సరదా అనే ఒక తెరను అడ్డు పెట్టుకుని మరీ మనుషుల్ని నొప్పిస్తుంటారు. ఈ పరిస్థితిని అధిగమించాలన్నా.. సరదా పేరుతో మిమ్మల్ని ఇతరులు పదే పదే అవమానించకూడదు అన్నా కింద చెప్పుకునే విధంగా మీ ప్రవర్తనను మార్చుకోవాలి. ఎవరైనా మిమ్మల్ని వెక్కిరిస్తుంటే లేదా ఏదైనా వ్యక్తిగత వ్యాఖ్య చేస్తే, మీరు ఆ స్థలంలో ప్రశాంతంగా ఉండాలి . వెంటనే రియాక్ట్ కాకుండా ఉండాలి. ఎదుటి వ్యక్తి  ఏమి చెబుతున్నాడో,  ఎందుకు చెబుతున్నాడో  పూర్తిగా అర్థం చేసుకోవాలి. సరైన సమయం వచ్చినప్పుడు, ఆ ప్రశ్నకు మర్యాదగా, ముక్కుసూటిగా  సమాధానం ఇవ్వాలి. తాము అనే మాటలకు సమాధానం వస్తుంటే ఇంకోసారి అలా అనే సాహసం చెయ్యరు చాలావరకు.  కాబట్టి ఎవరైనా ఏదైనా అన్నప్పుడు సున్నితంగానే చెప్పు దెబ్బ కొట్టినట్టు సమాధానం ఇవ్వాలి. చాలా సార్లు ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడినప్పుడు,  మిమ్మల్ని దూషించినప్పుడు. ఎవరైనా మిమ్మల్ని ఇతరుల ముందు అవమానించిన ప్రతిసారీ  రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు ప్రశాంతంగా ఉండడం వల్ల పరిస్థితి మెరుగుపడుతుంది. సమాధానం ఇవ్వడం కరెక్ట్ అనుకుంటారు కానీ.. ఎదుటి వారు అన్న మాటలకు అప్పటికే మనసులో కోపం పుట్టి ఉంటుంది. ఇలాంటి పరిస్థితిలో గట్టిగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఇది వక్తి  మానసిక స్థితిని కూడా పాడు చేస్తుంది. కోపంలో ఉన్నప్పుడు తర్కం,   ఆలోచనాత్మకత మరచిపోతుంటారు.  కాబట్టి వెంటనే రియాక్ట్ కాగండి. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే వెంటనే ఫీలైపోనక్కర్లేదు.  ఫీలవుతూ కోపంగా రియాక్ట్ అవ్వడం కంటే  నవ్వుతూనే చురకలు అంటించడం మంచిది. ఇలా చేస్తే ఇంకోసారి మీ జోలికి రాకుండా ఉంటారు.. ఇతరులు ఎలాగైతే సరదా పేరుతో మిమ్మల్ని  అంటున్నారో మీరు అదే సరదా మార్గాన్ని ఎంచుకోవాలి. ఆ సరదాకు కాస్త చిరునవ్వు కూడా జోడించాలి. ఎవరైనా మిమ్మల్ని అవమానించడానికి ట్రై చేస్తున్నా,  పదే పదే అవే సంఘటనలు ఎదురవుతున్నా  ముందుగా మిమ్మల్ని మీరు ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆ తరువాత ఇతరులు అన్న విషయాన్ని చెడ్డ పదజలాంతో కాకుండా మర్యాదపూర్వకంగా ఉండే మాటలతోనే గట్టి సమాధానం చెప్పాలి. ఇలాచేస్తే మీరు చెప్పేది తప్పని ఎవరూ అనరు.  మర్యాదగానే మాట్లాడారనే మార్క్ మీకు ఉంటుంది.  మిమ్మల్ని అవమానించిన వారికి సమాధానం చెప్పామనే తృప్తి మీకూ ఉంటుంది. ఎవరైనా మిమ్మల్ని అవమానించినా, అర్థం చేసుకోకున్నా అది మీ తప్పు కాదు, ఎదుటివారి తప్పు. ఎవరో ఏదో అనగానే మీరు తప్పేమో అని మిమ్మల్ని మీరు తక్కువ చేసుకుని ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు.  మనం ముందుకు సాగుతూనే ఉండాలి. ప్రపంచంలోని ఎంకరేజ్ చేసేవారికంటే.. ఎగతాళి చేసి వెనక్కు లాగడానికి ట్రై చేసే వారే ఎక్కువ మంది ఉంటారని, మనుషుల్ని బాధపెట్టడానికే ముందుకు వస్తారని గుర్తుంచుకోవాలి. అలాంటివారి మాటలను వదిలిపెట్టి  ముందుకు వెళ్లడమే అందరూ చేయాల్సిన పని.                                             *రూపశ్రీ.

డబ్బు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవలకు ఇలా చెక్ పెట్టవచ్చు..!

డబ్బు.. ఈ ప్రపంచాన్ని నడిపిస్తోంది.  సిల్లీ విషయం ఏంటంటే.. ఈ డబ్బును మనిషే కనిపెట్టాడు.  డబ్బు సంపాదించేది కూడా మనిషే.. కానీ మనిషి చేతిలోకి రాగానే ఆ డబ్బు మనిషిని కిందా పైనా చేస్తుంది.   ఈ డబ్బు కేవలం బయటి వాళ్ల మధ్యనే కాదు.. ఒకే ఇంట్లో ఉన్న వ్యక్తుల మధ్య విభేదాలు సృష్టిస్తుంది.  ఆఖరికి జీవితాంతం కలిసి బ్రతకాలని ఒక్కటిగా మారిన భార్యాభర్తల మధ్య కూడా గొడవలు వచ్చేలా చేస్తుంది. కానీ ముందే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం,  కొన్ని చిట్కాలు పాటించడం వల్ల డబ్బు కారణంగా ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. భార్యాభర్తల జీవితం ఎంతో హ్యాపీగా ఉంటుంది కూడా. మీకోసం డబ్బు కావాలి.. డబ్బు కోసం మీరు కాదు.. డబ్బు అనేది మనుషుల మధ్య ఎంత విభేదాలు సృష్టిస్తుందో అందరికీ తెలిసిందే.. ఇద్దరు వ్యక్తులు ఒక బంధంగా ఏర్పడిన తరువాత ఆ ఇద్దరు ఒకరికి ఒకరు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి.  బయటి వ్యక్తుల కోసమో.. డబ్బు కోసమో.. భాగస్వామిని తక్కువ చేయడం డబ్బే ఎక్కువ అనుకోవడం చేయకూడదు.  దీని వల్ల డబ్బు కోసమే బంధం కలుపుకున్నారని అనుకుంటారు. అందుకే డబ్బును అవసరమైన వస్తువుగా చూడాలి. మాట్లాడుకోవాలి.. భార్యాభర్తులు ఇద్దరూ సంపాదించేవారు అయినా,  కేవలం భర్త మాత్రమే సంపాదిస్తున్నా ఇద్దరూ కలిసి ఆర్థిక విషయాలు చర్చించుకోవడం ముఖ్యం.  భార్యలకు ఆర్థిక విషయాలు చెప్పాల్సిన అవసరం లేదు అనుకునే మగవాళ్లు ఆర్థికంగా ఎదగడం లేదనే విషయాన్ని సాక్షాత్తూ సర్వేలు వెల్లడిస్తున్నాయి.  ఆర్థికంగా బలపడాలి, ఎదగాలి అనే ఇప్పటి తరం అమ్మాయిలు అనుకుంటారు.  ఇంకా చెప్పాలంటే ఆర్థిక విషయాలలో అమ్మాయిలే ఒక అడుగు ముందుంటారు. భార్యకు చెప్పకుండా ఏ ఆర్థిక కార్యకలాపం చేయకూడదు. అలాగే భర్తకు చెప్పకుండా భార్య కూడా ఆర్థిక విషయాలలో సొంత నిర్ణయాలు తీసుకోకూడదు. ఆర్థిక నిర్ణయాలు ఉమ్మడిగా ఉండాలి. సంపాదన.. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేస్తున్న జంటలు ఎక్కువగా ఉంటున్నాయి.  ఇద్దరికీ కలిపి ఎంత శాలరీ వస్తుంది అనే విషయాన్ని స్పష్టంగా మాట్లాడుకోవడం ముఖ్యం.  అంతేకాదు.. ఒకవేళ భార్యకు ఉద్యోగం లేకపోయినా సరే... భార్త భార్యకు తన సంపాదన గురించి స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది.  సంపాదన గురించి స్పష్టంగా చెప్పినప్పుడే ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోగలుగుతారు. బడ్జెట్.. బడ్జెట్ ప్లానింగ్ అనేది ప్రతి కుటుంబానికి చాలా అవసరం.  దీని వల్ల ఆర్థిక విషయాలు ఎలాంటి గోల లేకుండా సాఫీగా సాగుతాయి.  భార్యాభర్తలు ఇద్దరూ సంపాదనాపరులైతే.. ఇద్దరి శాలరీ నుండి ఇంటి బడ్జెట్ ను ప్లాన్ చేసుకోవాలి.  దీని వల్ల ఇద్దరికీ ఇంటికోసం ఎంత ఖర్చు చేస్తున్నాం అనే అవగాహన వస్తుంది. సేవింగ్స్.. బడ్జెట్ ప్లాన్ చేసుకున్న తరువాత ఇద్దరూ కలిసి సేవింగ్స్ పైన దృష్టి పెట్టాలి.  ఇద్దరూ కలసి చేసుకునే సేవింగ్స్ లో ఎవరు ఎవరినీ నొప్పించేలా ఉండకూడదు.  ఏ విధమైన సేవింగ్స్ చేస్తే ఇద్దరి భవిష్యత్తుకు మంచిదని చూడాలి తప్ప నా పేరుతో సేవ్ చేయాలి అంటే నా పేరుతోనే అనే వాదనలు వద్దు. ఒకవేళ డబ్బంతా అకౌంట్ లో పెట్టాలి అనుకుంటే ఇద్దరూ కలిసి ఒక జాయింట్ అకౌంట్ క్రియేట్ చేసుకుని అందులో వేసుకోవాలి.  ఇద్దరికీ సంబంధించి కనీసం ఆరు నెలల నుండి ఏడాది జీవనం గడిచేలా డబ్బును ఆర్థిక భద్రతగా ఉంచుకోవాలి.  ఏదైనా పరిస్థితి ఎదురై ఇద్దరూ చాలా కాలం పాటు ఉద్యోగం చేయలేకపోయినా ఈ డబ్బే భరోసా ఇస్తుంది. సెల్ఫ్ గా.. భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగస్తులు అయితే వారిద్దరి శాలరీలో ఇద్దరూ తమకంటూ సెల్ఫ్ గా కొద్దిగా ఫండ్ ను క్రియేట్ చేసుకోవాలి. దీని గురించి ఎవరూ ఎదుటివారిని ప్రశ్నించకూడదు.  ఏనైనా ఇష్టాలు,  కొనాలనుకునే ప్లానింగ్స్ ఉంటే అవి కూడా ఈ సెల్ఫ్ మనీలో భాగం చేసుకోవాలి. ఇలా చేస్తే బడ్జెట్ మీద భారం ఉండదు.   భవిష్యత్తు.. వాస్తవ జీవితంలో సంతోషంగా ఉన్నామా లేదా అని ఆలోచించేవారే ఎక్కువ. కానీ భవిష్యత్తు ప్లానింగ్స్ కూడా ఫర్పెక్ట్ గా ఉండాలి. ఇలా చేస్తే రేపటి రోజున కూడా ఎలాంటి సమస్య లేకుండా హాయిగా ఉండగలుగుతారు.  ఆర్థిక విషయాలలో ఒక స్పష్టమైన ప్రణాళికతో ఉండి.. దాన్ని భాగస్వామికి అర్థమయ్యేలా వివరించగలిగితే చాలా వరకు డబ్బు కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు రావు.                                 *రూపశ్రీ.

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉండాలి? ఎంత ఉంటే గొడవలు జరగకుండా ఉంటాయంటే..!

  పెళ్లి ప్రతి వ్యక్తి జీవితంలో చాలా ముఖ్యమైన దశ.  పెళ్లి సంబంధం చూసేది,  వివాహం జరిపించేది పెద్దలే అయినా ఆ బంధంలో కలిసి ఉండేది మాత్రం పెళ్లి చేసుకునే అమ్మాయి, అబ్బాయి ఇద్దరే. జీవితాంతం ఈ బందాన్ని వాళ్లిద్దరే నడిపించుకుంటూ వాళ్లు ఒక కుంటుంబంలా ఏర్పడతారు. అయితే కాబోయే భార్యాభర్తల మధ్య వయసు తేడా అనేది ఆ బంధంలో కీలక పాత్ర పోషిస్తుందట. ఒకప్పుడు వధూవరుల వయసు దాదాపు 10 నుండి 15 ఏళ్లు ఉంటుండేది.  ఆ తరువాత వయసు తేడా తగ్గింది. ఇప్పటి జనరేషన్ లో అయితే సమ వయస్కులను పెళ్ళి చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇలా చేయడం సరైనదేనా?  చాలా బంధాలలో గొడవలు ఎందుకు వస్తున్నాయి? వయసు కారణంగా గొడవలు జరుగుతున్నాయనే మాటల్లో వాస్తవం ఎంత? అబ్బాయి లేదా అమ్మాయి మధ్య సంబంధం ప్రస్తావనకు వచ్చినప్పుడల్లా  మొదట ఇద్దరి వయస్సును అడుగుతారు. భారతీయ సమాజంలో అమ్మాయి పెళ్లి వయస్సు అబ్బాయి కంటే తక్కువగా పరిగణించబడుతుంది. అంటే అమ్మాయి కంటే అబ్బాయి పెద్దవాడై ఉండాలి, ఒక సంవత్సరం పెద్దవాడా, 10 ఏళ్లు పెద్దవాడా అనే విషయంపై పెద్దగా చర్చ జరగదు.  లైఫ్ సెటిల్ అయిపోతుందని అనిపిస్తే వయసుతో సంబందం లేకుండా పెళ్లిళ్లు చేసేస్తారు. విజయవంతమైన వివాహ బంధాలను గమనిస్తే.. భార్యాభర్తల మధ్య వయస్సు వ్యత్యాసం తక్కువగా ఉండాలి. 3 నుండి 5 సంవత్సరాల గ్యాప్ ఉండటం ఉత్తమంగా పరిగణించబడుతుంది. తక్కువ వయసు గ్యాప్ ఉంటే.. తక్కువ వయస్సు తేడా కారణంగా, భార్యాభర్తలు ఒకరినొకరు బాగా అర్థం చేసుకోగలుగుతారు. ఇలాంటి వారి ఆలోచనా విధానం వల్ల వైవాహిక జీవితం కూడా ఆనందంగా గడిచిపోతుంది. కాబట్టి, వివాహానికి వయస్సు తేడా విషయంలో చాలా ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండకూడదు అని  అంటున్నారు. 3 నుండి 5 సంవత్సరాల వయసు తేడా ఉంటే అమ్మాయిలు ఆ భాగస్వామితో అన్ని విధాలా సఖ్యతగా ఉండగలుగుతారట.  సైకాలజీ ప్రకారం.. అమ్మాయిలు అబ్బాయితో పోలిస్తే  సాధారణ భౌతిక వయసు కంటే 5ఏళ్లు ఎక్కువ మెచ్యూరిటీతో ఉంటారట.  దీని ప్రకారం 3 నుండి 5 ఏళ్ల వయసు గ్యాప్ ఉంటే ఇద్దరి ఆలోచనా విధానాలు, ఇద్దరి మెచ్యూరిటీ దరిదాపుల్లో ఉంటుంది. ఒకరినొకరు అర్థం చేసుకోగలరు.   చాలా తక్కువ గ్యాప్ ఉంటే.. ఇప్పటి జనరేషన్ లో తక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నవారిని చేసుకోవడానికి ఇష్టపడుతున్నారు.  దీనికి కారణం విద్య, ఉద్యోగం.  అయితే సమ వయస్కులు,  కేవలం నెలల గ్యాప్ ఉన్నవారి మధ్య అహానికి తావు ఎక్కువ ఉంటుంది. ఏదైనా వాదన వచ్చినప్పుడు నువ్వేమైనా పెద్దవాడివాఅనే ప్రశ్న.. నువ్వేమైనా చిన్న దానివా అనే ప్రశ్న అమ్మాయి అబ్బాయిల ఇద్దరి నుండి వస్తుంది.  దీని వల్ల ఇద్దరికి గొడవలు ఎక్కువ ఉంటాయి. కెరీర్ గురించి,  భవిష్యత్తు గురించి సరైన ఆలోచన, ఏకీభావం లేకపోతే తక్కువ ఏజ్ గ్యాప్ ఉన్నవారి మధ్య గొడవలు ఎక్కువ,  విడిపోయే అవకాశాలు ఎక్కువే.. ఎక్కువ ఏజ్ గ్యాప్.. కొంతమందిని గమనిస్తే..  అమ్మాయి అబ్బాయి మధ్య ఏజ్ గ్యాప్ 10 నుండి 15 ఏళ్ల వరకు ఉంటుంది.  ఈ గ్యాప్ వల్ల అబ్బాయి పెద్దవాడిగానూ, అమ్మాయి చాలా చిన్నగానూ ఉంటుంది.  వారిద్దరికి పిల్లలు అయ్యి వారి పెళ్లి వయసు వచ్చేసరికి తండ్రి పూర్తీ వృద్ధుడిగా మారతాడు. పిల్లలకు పెళ్లిళ్లు అయ్యాక.. భర్త మరణిస్తే.. ఆ తల్లి ఒంటరిగా ఎక్కువ కాలం బ్రతకాల్సి ఉంటుంది. అంతే కాకుండా జనరేషన్ అలోచనల దగ్గర కూడా గొడవలు వస్తాయి.  ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అమ్మాయి, అబ్బాయి మధ్య వ్యత్యాసం 3 నుండి 5 ఏళ్ళు ఉండేలా చూసుకోవడం శ్రేయస్కరం.                                                     *రూపశ్రీ.