జియోలో సౌదీ కంపెనీ భారీ పెట్టుబడి.. ప్రపంచ రికార్డు!
రిలయన్స్ జియోలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. సౌదీ అరేబియాకు చెందిన పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ (పీఐఎఫ్) తాజాగా జియో ప్లాట్ఫాంలో రూ. 11,367 కోట్లతో 2.32 శాతం షేర్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది. జియోలో గత 9 వారాల్లో ఇది 11వ పెట్టుబడి కావడం గమనార్హం. ఫేస్బుక్, సిల్వర్ లేక్ పార్ట్నర్స్ (రెండు ఇన్వెస్టిమెంట్లు), విస్టా ఈక్విటీ పార్ట్నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబదాలా, ఏడీఐఏ, టీపీజీ, ఎల్ కేటర్టన్, పీఐఎఫ్ పెట్టుబడుల ద్వారా జియో ఇప్పటి వరకు రూ.1,15,693 కోట్లను సమీకరించింది. పెట్టుబడులను ఆకర్షించడంలో జియో సంస్థ రికార్డు సృష్టించింది. ఈ స్థాయిలో నిధులు సమకూర్చుకున్న కంపెనీ ప్రపంచంలో మరేదీ లేదనే చెప్పాలి. పీఐఎఫ్ తాజా పెట్టుబడితో జియో ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లకు పెరగగా, ఎంటర్ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లకు పెరిగినట్టు జియో తెలిపింది. తమ సాంకేతిక సామర్థ్యంపై విదేశీ కంపెనీలు నమ్మకాన్ని చాటినట్టు జియో ఓ ప్రకటనలో పేర్కొంది.