క‌రోనా మెడిసిన్ వ‌చ్చేసింది!!

కరోనా కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్న వేళ కాస్త ఉపశమనం కలిగించే వార్త ఒకటి తెలిసింది. కరోనా నుంచి ప్రాణాపాయం తగ్గించే మెడిసిన్ ను యూకే పరిశోధకులు క‌నుగొన్నారు. స్టెరాయిడ్ మెడిసిన్‌గా చెప్పే డెక్సామిథసోన్ ను స్వల్ప పరిమాణంలో.. పది రోజుల పాటు కరోనా బాధితులకు వాడి చూడగా సత్ఫలితాలు వచ్చాయి. డెక్సామిథసోన్ వాడిన వారిలో మరణాల రేటు తగ్గింది. వెంటిలేటర్ పై ఉన్నవారిలో 33 శాతం, ఆక్సిజన్ అవసరమైన కరోనా బాధితుల్లో 20 శాతం మరణాల రేటు తగ్గిందని యూకే పరిశోధకులు తెలిపారు. క‌రోనా బారిన‌ప‌డి రోజుకు వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్న త‌రుణంలో.. ఈ మెడిసిన్ మంచి ఉప‌శ‌మ‌నంగా చెప్పుకోవాలి. 

భారత్- చైనా సరిహద్దు ఘర్షణలో భారీ ప్రాణ నష్టం

భారత్- చైనా సరిహద్దులో ఘర్షణ ఆందోళన కలిగిస్తోంది. గాల్వన్‌ లోయలో చైనా సైనికులు, భారత్ సైనికులపై రాళ్లు విసిరి దాడికి దిగారు. దీంతో, మన సైనికులు వారికి దీటుగా బదులిచ్చారు. అయితే, ఈ హింసాత్మక ఘర్షణలో పదుల సంఖ్యలో ప్రాణ నష్టం జరిగింది. ఈ ఘర్షణలో 20 మంది భారత్ జవాన్లు మరణించారని సమాచారం. చైనా సైనికులు కూడా భారీ సంఖ్యలో మరణించినట్లు తెలుస్తోంది. 43 మంది చైనా సైనికులు మరణించారని సమాచారం. సరిహద్దులో చైనాతో తలెత్తిన ఘర్షణపై భారత ప్రభుత్వం స్పందించింది. తామెప్పుడూ వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ని అతిక్రమించలేదని, తమ కార్యకలాపాలు ఎప్పుడూ దాని పరిధిలోనే జరిగాయని స్పష్టం చేసింది. ఎల్‌ఏసీ ని గౌరవిస్తూ చైనా బలగాలు సాఫీగా వెనక్కు వెళ్తాయని భావించినట్లు తెలిపింది. మరోవైపు ప్రధాని మోడీ, రక్షణ శాఖ మంత్రి రాజనాధ్ సింగ్ ఉన్నతాధికారులతో అత్యున్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసారు. తదుపరి కార్యాచరణ పై సమాలోచనలు జరుపుతున్నారు. 

జగన్ సర్కార్ కి కోర్టులో మరో మొట్టికాయ పడనుందా?.. పాపం సీఎస్!!

జగన్ సర్కార్ కు కోర్టులలో వరుసగా అక్షింతలు పడుతున్నా కానీ ప్రభుత్వ తీరు మాత్రం మారడం లేదు. కోర్టు ఉత్తర్వులను అమలు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తుండటం తో రాష్ట్ర ఉన్నతాధికారులు కోర్టు బోనులో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమకు నచ్చిన సలహాదారులు, అధికారుల నియామకం విషయంలో చూపించిన వేగం కోర్టు ఆదేశాలు ఇంప్లిమెంట్ చేసే విషయంలో చూపడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం లో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన ఎబి వెంకటేశ్వరరావు ను జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. దీనికి వ్యతిరేకంగా అయన హైకోర్టు ను ఆశ్రయించగా విచారణ జరిపి సస్పెన్షన్ ను ఎత్తివేసింది. ఎబి కి రావాల్సిన శాలరీని చెల్లించాలని, అలాగే ఆయనకు పోస్టింగ్ కూడా ఇవ్వాలని ఆదేశించింది. ఐతే ఎప్పటిలోగా పోస్టింగ్ ఇవ్వాలనే విషయం మాత్రం స్పష్టం చేయలేదు. ఐతే కోర్టు తీర్పు వచ్చిన తరువాత తనకు పోస్టింగ్ ఇవ్వాలని కోరుతూ ఎబి హైకోర్టు తీర్పు ను కూడా జత చేస్తూ సీఎస్ కు వినతి పత్రం అందచేశారు.  ఐతే కోర్టు తీర్పు వచ్చి 20 రోజుల పైగా గడుస్తున్నా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన లేదని తెలుస్తోంది. దీంతో ఎబి వెంకటేశ్వరరావు అనేక పర్యాయాలు తన పోస్టింగ్ గురించి గుర్తు చేస్తూ సీఎస్ కు లేఖ రాసినా ఇప్పటివరకు అటు నుండి ఎటువంటి రిప్లై లేదని సమాచారం. దీని పై ఎబి మళ్ళీ కోర్టును ఆశ్రయించి కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అదే కనుక జరిగితే ఇప్పటికే ఒకసారి కోర్టు ధిక్కరణ కింద హైకోర్టు కు హాజరైన సీఎస్ మరో సారి అదే పని చేయవల్సిన పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది.  ఇప్పటికే హైకోర్టు సుప్రీం కోర్టుల్లో మొట్టికాయలు తిన్న ఎపి సర్కార్ కు మరోసారి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదుర్కోవలసి రావచ్చు. మరో వైపు రాజకీయ నాయకుల తొందరపాటు నిర్ణయాలతో ఉన్నతాధికారులుగా తాము కోర్టు మెట్లెక్కవలసి రావడం తో అధికారులలో కొంత అసంతృప్తి నెలకొంది. మరి ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కొని ఎబి విషయం లో నిర్ణయం తీసుకుంటుందా లేక కథ మళ్ళీ మొదటికి వస్తుందా వేచి చూడాలి.

భారత్- చైనా సరిహద్దులో ఘర్షణ.. అమరుడైన తెలుగుబిడ్డ

భారత్, చైనా సరిహద్దులోని గాల్వన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య జరిగిన ఘర్షణలో భారత్ కు చెందిన ఓ సైనికాధికారి, ఇద్దరు జవాన్లు అమరులైన విషయం తెలిసిందే. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన సైనికాధికారి కల్నల్ సంతోష్ బాబు తెలుగువాడే. సంతోష్ తెలంగాణలోని సూర్యాపేట వాసి. సంతోష్ మృతిపై ఆయన కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారమిచ్చారు. దీంతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  బీహార్ 16వ బెటాలియన్ కు చెందిన సంతోష్.. ఏడాదిగా చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్నారు. సంతోష్ కు ఇటీవలే హైదరాబాద్ రెజిమెంట్ కు బదిలీ అయింది. కానీ, లాక్‌డౌన్ కారణంగా అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. హైదరాబాద్ వచ్చే లోపే ఆయన అమరుడు కావడం విషాదకరం. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు.

ఎంపీ రఘురామ కృష్ణమరాజు కి అమిత్ షా అపాయింట్మెంట్.. త్వరలో వైసీపీలో చీలిక?

వైసీపీ రెబల్ ఎంపీగా మారిన ఎంపీ రఘురామ కృష్ణమరాజు అటు మాటలతోనూ, ఇటు చేతలతోనూ వైసీపీని తెగ ఇబ్బందిపెడుతున్నారు. తాజాగా, ఆయనకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ ఖరారు అయ్యింది అనే అంశం వైసీపీ నేతలను షాక్ కి గురిచేసింది. సీఎం జగన్ కి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ఇష్టపడని అమిత్ షా ఒక వైసీపీ ఎంపీకి అవకాశం ఇవ్వడం ఆ పార్టీ నాయకులకు మింగుడుపడటం లేదు. మొదటి నుంచి బీజేపీ తో సత్సంబంధాలు కొనసాగిస్తున్న ఎంపీ రఘురామ కృష్ణమరాజు మరో సారి తన సత్తా ఏంటో వైసీపీ కి తెలియజేయాలి అనుకుంటున్నారని తెలుస్తోంది. తాజాగా జగన్ ఏడాది పాలనలో స్యాండ్, ల్యాండ్, వైన్ మాఫియా తో సహా కుల రాజకీయాలను ఎండగట్టిన ఆయన ఈ సారి పార్టీకి భారీ షాక్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం. దీనికి ప్రధాన కారణం సొంత కులానికి చెందిన నేతతో వైసీపీ పొమ్మన లేక పొగబెడుతుంది అనే ఆలోచనకు రఘురామ కృష్ణమరాజు వచ్చారని ఆయన సన్నిహితులు అంటున్నారు. వైసీపీ నేతలు చేస్తున్న రాజకీయానికి ధీటైన జవాబు ఇవ్వాలని రఘురామ కృష్ణమరాజు భావిస్తున్నారట.  రఘురామ కృష్ణమరాజు దెబ్బకి త్వరలో ఏపీ రాజకీయాలు ఊహించని మలుపు తిరగబోతున్నాయని, ఆయన వైసీపీకి గట్టి షాక్ ఇవ్వడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. వైసీపీలో అసంతృప్తి జ్వాలలు రగులుతున్నాయి. వైసీపీ పేరుకుపోయిన ఒకే సామాజిక వర్గ కోటరీ దెబ్బకి పదుల సంఖ్యలో నాయకులు తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. వారందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి రఘురామ కృష్ణమరాజు తిరుగుబాటు చేస్తారని, అందుకు ఆయన కార్యాచరణ కూడా మొదలుపెట్టారని అంటున్నారు. సౌత్ ఇండియా లో అందులోనూ ముఖ్యంగా ఏపీలో బలపడాలనేది బీజేపీ ఆశ. అందుకే, ప్రస్తుతం వైసీపీలో జరుగుతున్న పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకొని, త్వరలోనే ఏపీ లో బీజీపీ జెండా ఎగిరేలా చెయ్యాలనే ఆలోచన తో ఎంపీ రఘురామ కృష్ణమరాజు కి ఆగమేఘాల పై అపాయింట్మెంట్ ఇచ్చారని తెలుస్తోంది.

వూహాన్ వదిలి బీజింగ్ పై పడ్డ కరోనా

కరోనా పుట్టిన చైనాలోని వూహాన్ లో సాధారణ పరిస్థితులు ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా చైనా రాజధాని బీజింగ్ లో కరోనా విలయ తాండవం చేస్తోంది. నగరంలోని అతిపెద్ద హోల్ సెల్ మార్కెట్ ప్లేస్ ఐన షిన్ పడి కరోనా వైరస్ కు హాట్ స్పాట్ గా మారిందని అధికారులు గుర్తించారు. ప్రతి రోజు వేలాది మంది సందర్శించే ఈ మార్కెట్ నుండి ప్రతి రోజు పదుల సంఖ్యలో కేసులు నమోదవుతుండటంతో బీజింగ్ నగర అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో సిటీలోని 30 ప్రాంతాలలో లాక్ డౌన్ ప్రకిటించి లక్షల సంఖ్యలో కరోనా పరీక్షలు చేయడానికి అధికారులు సిద్ధమయ్యారు. అవసరాన్ని బట్టి రానున్న రోజుల్లో కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్యను పెంచుతామని అధికారులు తెలిపారు. కరోనా ఉధృతి ఎక్కువగా ఉండటం తో బీజింగ్ నుండి ఇతర నగరాలకు రాకపోకలను నిషేధించారు.

భారత్ చైనా సరిహద్దులో ఘర్షణ.. ముగ్గురు భారత్ జవాన్ల మృతి

కొంత కాలంగా చైనా భారత భూభగంలోకి చొచ్చుకు వచ్చే ప్రయత్నం చేస్తూ కయ్యానికి కాలు దువ్వుతూన్న విషయం తెలిసిందే. తాజాగా సరిహద్దులోని గాల్వాన్ లోయ ప్రాంతం లో సోమవారం రాత్రి చైనా సైనికుల దాడిలో ఒక కల్నల్ తో పాటు ఇద్దరు జవాన్లు వీర మరణం పొందారు. ఒక పక్క రెండు దేశాల సైనికాధికారుల మధ్య చర్చలు జరుగుతుండగా ఈ పరిణామాలు ఎటు దారి తీస్తాయోనని ఆందోళన వ్యక్తం అవుతోంది. వాస్తవాధీన రేఖ వద్ద ఇరు దేశాల సైన్యాల మధ్య తోపులాట జరిగిన సందర్భాలు ఉన్నాయి కానీ గత 45 ఏళ్ల లో హింస జరగడం మాత్రం ఇదే మొదటి సారి. గల్వాన్ లోయలో ఒక ప్రాంతాన్ని విడిచి వెళ్లేందుకు చైనా సైనికులు నిరాకరించడం తో ఈ ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. మరణించిన వారిలో 16 బీహార్ రెజిమెంట్ కు చెందిన ఒక కమాండింగ్ ఆఫీసర్, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. 1962 లో భారత్ చైనా మధ్య యుద్ధం జరిగిన ప్రాంతాల్లో గుల్వాన్ లోయ కూడా ఉంది. ఐతే ఇక్కడ తాజాగా భారత్ రోడ్ నిర్మాణం చేపట్టింది. ప్రస్తుతం మన బలగాలు గాల్వన్ లోయకు చేరాలంటే 8 గంటలకు పైగా సమయం పడుతుంది ఐతే ఈ రోడ్ పూర్తయితే మన బలగాలు బోర్డర్ కు కేవలం అర గంటలోనే చేరుకుంటాయి. దీంతో ఈ రోడ్ నిర్మాణాన్నీ చైనా సైన్యం ఇండైరెక్ట్ గా అడ్డుకుంటోంది.

గోకుల్ చాట్ యజమానికి కరోనా.. క‌స్ట‌మ‌ర్ల‌లో ఆందోళన

హైదరాబాద్‌లోని కోఠిలో కరోనా కలకలం రేగింది. గోకుల్ చాట్ యజమానికి కరోనా సోకింది. ఈ వయస్సు 70 సంవత్సరాలు. ఇటీవల ఆయన అనారోగ్యం బారిన పడ్డారు. దీంతో ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు గోకుల్ చాట్ దుకాణాన్ని మూసివేశారు. అంతేకాదు, యజమాని కుటుంబ సభ్యులతో పాటు 20 మంది గోకుల్ చాట్ సిబ్బందిని క్వారంటైన్ చేశారు. గత రెండు మూడు రోజులుగా షాప్‌కు ఎవరెవరు వచ్చారన్న దానిపై ఆరా తీస్తున్నారు.  కాగా, హైదరాబాద్‌లో గోకుల్ చాలా ఫేమస్. నిత్యం క‌స్ట‌మ‌ర్ల‌తో కిట‌కిట‌లాడుతుంటుంది. ఇక, సాయంత్రమైతే రద్దీ మామూలుగా ఉండదు. లాక్ డౌన్ తర్వాత హైదరాబాద్‌లో హోటల్స్, రెస్టారెంట్లు నిర్వహించుకోవడానికి పర్మిషన్లు ఇవ్వడంతో గోకుల్ చాట్ కూడా ఓపెన్ చేశారు. అయితే, గోకుల్ చాట్ యజమానికి కరోనా పాజిటివ్ అని తేలడంతో క‌స్ట‌మ‌ర్ల‌లో ఆందోళన మొదలైంది.

అచ్చెన్న గాయం తిరగబెట్టింది.. ఇప్పుడు ఏం చేయబోతున్నారో..?

ఇఎస్ఐ స్కామ్ లో ఎసిబి అరెస్టైన టీడీపీ నేత అచ్చెన్నాయుడు ప్రస్తుతం జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అరెస్ట్ కు ఒక రోజు ముందు ఆయనకు పైల్స్ ఆపరేషన్ జరిగి ఉండటం తో పాటు ఎసిబి అరెస్ట్ తరువాత సుదీర్ఘ ప్రయాణం చేయడం తరువాత విచారణ పేరుతొ మరి కొన్ని గంటలు కూర్చోబెట్టిన విషయం తెలిసిందే. ఐతే తాజాగా ఆపరేషన్ గాయం తిరగ పెట్టినట్లు గా తెలుస్తోంది. ఇన్ఫెక్షన్ కూడా కావడం తో రక్తస్రావం ఆగడం లేదని తెలుస్తోంది. ఆయనకు బీపీ, షుగర్‌ ఉండటంతో గాయం మానడానికి పదిహేను రోజుల సమయం పట్టవచ్చని సమాచారం అందుతోంది. అచ్చెన్న జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న నేపథ్యంలో అయన ఆరోగ్యం పై జీజీహెచ్ డాక్టర్లు అధికారికంగా ఎటువంటి ప్రకటనలు చేయడం లేదు. ఐతే అయన ఆరోగ్య పరిస్థితి పై డాక్టర్లు ఎప్పటికప్పుడు కోర్టుకు తెలియ చేస్తున్నట్లుగా సమాచారం. ఇది ఇలా ఉండగా అచ్చెన్న తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నందువల్ల విడుదల చేయాలని లాయర్లు ఎసిబి కోర్టులో నిన్న బెయిల్ పిటిషన్ దాఖలు చేసారు. కొద్ది రోజుల్లో ఈ పిటిషన్ సీబీఐ కోర్టులో విచారణకు రావచ్చని తెలుస్తోంది.

ఏపీ బడ్జెట్‌ ముఖ్యాంశాలు

ఏపీ అసెంబ్లీలో 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టారు. రెండోసారి ఆయన అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. బడ్జెట్ అంచనా వ్యయం రూ.2,24,789 కోట్లుగా, రెవెన్యూ అంచనా రూ.1,80,392 కోట్లు, మూలధన వ్యయం రూ.44,396 కోట్లుగా మంత్రి తెలియజేశారు. పేదల కష్టాలను తీర్చేందుకు నవరత్నాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కరోనా మహమ్మారి సమయంలో కూడా సంక్షేమంపై వెనకడుగు వేయలేదని మంత్రి అన్నారు.     బడ్జెట్‌లో ముఖ్యాంశాలు: వ్యవసాయ రంగానికి రూ.11,891 కోట్లు వైఎస్‌ఆర్‌ రైతు భరోసాకు రూ.3,615 కోట్లు వడ్డీ లేని రుణాల కోసం రూ.1,100 కోట్లు విద్యశాఖకు రూ.22,604 కోట్లు వైద్య రంగానికి రూ.11,419 కోట్లు ఆరోగ్యశ్రీకి రూ.2100 కోట్లు మైనార్టీ సంక్షేమానికి రూ.1,998 కోట్లు ఎస్టీల సంక్షేమానికి రూ.1,840 కోట్లు ఎస్సీల సంక్షేమానికి రూ.7,525 కోట్లు కాపుల సంక్షేమానికి రూ.2,845 కోట్లు బీసీల సంక్షేమానికి రూ.23,406 కోట్లు వైఎస్‌ఆర్‌ గృహవసతికి రూ.3వేల కోట్లు పీఎం ఆవాజ్‌ యోజన అర్బన్‌కు రూ.2540 కోట్లు పీఎం ఆవాజ్‌ యోజన (గ్రామీణం) రూ.500 కోట్లు బలహీనవర్గాల గృహ నిర్మాణానికి రూ. 150 కోట్లు డ్వాక్రా సంఘాలకు రూ.975 కోట్లు రేషన్‌ బియ్యానికి రూ.3వేల కోట్లు వైఎస్‌ఆర్‌ పెన్షన్‌ కానుకకు రూ.16వేల కోట్లు వైఎస్‌ఆర్‌ ఆసరాకు రూ.6,300 కోట్లు అమ్మ ఒడికి రూ.6 వేల కోట్లు జగనన్న విద్యాదీవెనకు రూ.3,009 కోట్లు వైఎస్‌ఆర్‌ చేయూత పథకానికి రూ.3వేల కోట్లు జగనన్న వసతి దీవెనకు రూ.2 వేల కోట్లు వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకానికి రూ.350 కోట్లు వైఎస్‌ఆర్‌ వాహన మిత్రకు రూ.275 కోట్లు జగనన్న చేదోడుకు రూ.247 కోట్లు నేతన్న నేస్తం రూ.200 కోట్లు మత్స్యకార భరోసాకు రూ.109 కోట్లు హోం శాఖకు రూ. 5,988.72 కోట్లు ఐటీ రంగానికి రూ. 197.37 కోట్లు కార్మిక సంక్షేమ రంగానికి రూ. 601.37 కోట్లు

కరోనా పై అమెరికా ఎఫ్ డీఏ అలా.. హెల్త్ సెక్రటరీ ఇలా...

కరోనా తాకిడికి ప్రపంచం మొత్తం విలవిలాడుతోంది. ఈ సమయం లో అమెరికా భారత్ నుండి హైడ్రాక్సీ క్లోరోక్విన్ టాబ్లెట్లను పెద్ద మొత్తం లో ఇంపోర్ట్ చేసుకుంది. ఐతే ఈ మందుల వాడకం పై అమెరికా లోనే భిన్న వాదనలు ఉన్నాయి. తాజాగా అమెరికా ఆహార ఔషధ నియంత్రణ సంస్థ (ఎఫ్ డి ఏ) ఈ మందులను ప్రిస్క్రైబ్ చేయొద్దంటూ ఆదేశాలు ఇచ్చింది. ఐతే ట్విస్ట్ ఏంటంటే మలేరియా మందులు కరోనా ట్రీట్ మెంట్ లో ఉపయోగించ వద్దని ఎఫ్ డి ఏ ఆదేశాలు ఇచ్చిన కొద్ది గంటల్లోనే అమెరికా హెల్త్ సెక్రెటరీ అలెక్స్ అజర్ ఆ మందులను డాక్టర్లు భేషుగ్గా కరోనా బాధితులకు సూచించవచ్చని తేల్చి చెప్పారు. ఐతే తాజా ఎఫ్ డి ఏ నిర్ణయం తో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను రోగులు వైద్యుల పర్యవేక్షణ లోనే వాడాలని భావించే అవకాశం ఉన్నందున తాను క్లారిటీ ఇస్తున్నట్లు అయన తెలిపారు. ఎఫ్ డి ఏ తాజా నిర్ణయం పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ తన అసంతృప్తి వ్యక్తం చేసారు. కరోనా పై పోరాటంలో హెచ్ సి క్యూ సమర్ధంగా పని చేస్తోందని ఇతర దేశాలు నివేదికలు ఇస్తుంటే ఒక్క అమెరికా ఏజన్సీలు మాత్రమే దానిని గుర్తించలేక పోతున్నాయని ఆయన అన్నారు.

మూడు రాజధానులపై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు!!

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఉభయసభలనుద్దేశించి గవర్నర్‌ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. ఈ సందర్భంగా గవర్నర్ మూడు రాజధానుల అంశం గురించి మాట్లాడారు. పరిపాలన వికేంద్రీకరణ అనేది కీలక అంశమని వ్యాఖ్యానించారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల ఏర్పాటు బిల్లు శాసన ప్రక్రియలో ఉందన్నారు. మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు. శాసన రాజధానిగా అమరావతి, కార్యానిర్వాహక రాజధానిగా విశాఖపట్నం, న్యాయ రాజధానిగా కర్నూలు ఉంటాయన్నారు. భవిష్యత్తులో తమ ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని, ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని గవర్నర్ పేర్కొన్నారు. కాగా, మూడు రాజధానుల అంశంలో జగన్ సర్కార్ ఏమాత్రం వెనక్కి తగ్గేలా కనిపించడం లేదని గవర్నర్ ప్రసంగం ద్వారా తెలుస్తోంది. ఈ బిల్లును తమకు బలం ఉన్న అసెంబ్లీలో ఆమోదించుకున్న జగన్ సర్కారు.. మండలిలో మాత్రం నెగ్గించుకోలేక పోయిందన్న సంగతి తెలిసిందే. అయితే, మరికొన్ని నెలల్లో మండలిలో సైతం వైసీపీకి బలం పెరుగుతుందని, అప్పుడు ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు.. దేశంలో ఇదే మొదటి సారి

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. అసెంబ్లీ సమావేశాలకు ముందు గవర్నర్ ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించడం సంప్రదాయం. అయితే ఈ సారి కరోనా మహమ్మారి నేపథ్యంలో గవర్నర్ రాజ్‌భవన్ నుంచే వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగిస్తున్నారు. ఇలా ఒక గవర్నర్ ఆన్‌లైన్ ద్వారా అసెంబ్లీని ఉద్దేశించి ప్రసంగించడం దేశంలో ఇదే మొదటి సారి అని చెబుతున్నారు.  గవర్నర్ తన ప్రసంగంలో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశంసించారు. ఎన్నో సంక్షేమ పథకాలను ప్రభుత్వం విజయవంతంగా అమలు చేస్తూ, ఏడాది వ్యవధిలోనే అన్ని వర్గాల ప్రజలకూ దగ్గరైందని తెలిపారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 8.16శాతం వృద్ధి రేటు సాధించినందుకు సంతోషంగా ఉందన్నారు. వ్యవసాయ, అనుబంధం రంగాల్లో 8శాతం వృద్ధి రేటు సాధించామని తెలిపారు. పారిశ్రామిక రంగంలో 5శాతం వృద్ధిరేటు నమోదయ్యిందని చెప్పారు. పిల్లల చదువు, తల్లుల సంక్షేమం కోసం అమ్మఒడి పథకాన్ని ప్రారంభించాం. నాడు-నేడు మనబడి కార్యక్రమం కింద.. మూడేళ్లలో 48వేల పాఠశాలలను ఆధునికీకరిస్తాం. ఆరోగ్యశ్రీ పథకం కింద 6.25 లక్షల మందికి లబ్ధి చేకూరిందని గవర్నర్ పేర్కొన్నారు. కాగా, గవర్నర్ ప్రసంగం తరువాత మధ్యాహ్నం ఒంటి గంటకు ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు, ఈ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్యేలు నల్ల చొక్కాలతో హాజరయ్యారు.

ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరు కాలేను: సీఎం జగన్

ఈ రోజు, రేపు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు 21 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్లతో ప్రధాని మోడీ మాట్లాడనున్నారు. రేపు మధ్యాహ్నం కొందరు ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు.  అయితే, ఈ వీడియో కాన్ఫరెన్స్ కి తాను హాజరు కాలేనని ఏపీ సీఎం వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయానికి ఆయన సమాచారం పంపారు. తమ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయని, కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఈ సమావేశాలను సాధ్యమైనంత త్వరగా ముగించాల్సి వుందని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాను సభలో ఉండటం తప్పనిసరైన నేపథ్యంలో ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొనలేనని సీఎం జగన్ తెలిపినట్లు సమాచారం.

వారం రోజుల్లో రైతుబంధు: సీఎం కేసీఆర్

నియంత్రిత పంటల సాగు విధానం అమలు, రైతుబంధు పథకాలపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాల వారీగా వ్యవసాయ అధికారులు సమర్పించిన నివేదికలను సీఎం పరిశీలించారు. ప్రభుత్వం సూచించిన విధంగానే అన్ని జిల్లాల్లో రైతుల పంటలు సాగు చేస్తున్నారని, ఇప్పటి వరకు 11 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు.  ప్రభుత్వం ఇచ్చిన పిలుపునందుకొని నియంత్రిత పద్థతిలో పంటల సాగుకు సిద్థపడిన రైతులను సీఎం కేసీఆర్ అభినందించారు. మార్కెట్లో డిమాండ్‌ కలిగిన పంటలనే వేయడం ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడమే లక్ష్యంగా ప్రభుత్వం నియంత్రిత సాగు విధానం ప్రతిపాదించిందని, దీనికి రైతుల నుంచి వందకు వంద శాతం మద్దతు లభించిందని సీఎం తెలిపారు. పెట్టుబడి డబ్బుల కోసం రైతులు ఇబ్బంది పడొద్దని, ఒక్క ఎకరం కూడా మిగలకుండా, ఒక్క రైతునూ వదలకుండా అందరికీ వారం, పది రోజుల్లోగా రైతుబంధు సాయాన్ని బ్యాంకు అకౌంట్లలో జమ చేయాలని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ‘‘ఈ వర్షాకాలంలో రైతులందరికీ ఎకరానికి ఐదు వేల చొప్పున ఇవ్వడానికి మొత్తం ఏడు వేల కోట్లు కావాలి. ఇప్పటికే రూ. 5,500 కోట్లను వ్యవసాయశాఖకు ప్రభుత్వం బదిలీ చేసింది. మరో రూ. 1,500 కోట్లను కూడా వారం రోజుల్లో జమ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించాం. తక్షణం రైతులకు రైతుబంధు డబ్బులను బ్యాంకుల్లో జమ చేసే పని ప్రారంభమవుతుంది’’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు.

అచ్చెన్నాయుడికి జగన్ ప్రభుత్వ సలహాదారు సంచలన ఆఫర్..!

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ని మూడు రోజుల క్రితం ఎసిబి అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఐతే ఈ అరెస్ట్ పై పలువురు టీడీపీ నేతలు జగన్ ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారు. తాజాగా టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ జగన్ ప్రభుత్వం పై తీవ్ర ఆరోపణలతో విరుచుకు పడ్డారు. అచ్చెన్న కుటుంబం మొత్తం వైసిపిలో చేరితే 50 కోట్లు ఇస్తామని సాక్షాత్తు ప్రభుత్వ సలహాదారు ఆఫర్ చేసింది నిజం కాదా అని లోకేష్ వైసిపిని సూటిగా ప్రశ్నించారు. ఆ ఆఫర్ కు లొంగకపోవడంతో కక్ష కట్టి అచ్చెన్నాయుడు ని ఆధారాలు లేని కేసులో అరెస్ట్ చేసి వేధిస్తున్నారని మండి పడ్డారు. లోకేష్ ఈ రోజు తాడిపత్రిలో జేసీ ప్రభాకర్ రెడ్డి కుటుంబాన్నిపరామర్శించారు. ఈ సందర్భంగా లోకేష్ విలేకరులతో మాట్లాడుతూ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తాము అన్నీ రాసుకుంటున్నామని.. బదులు తీర్చుకుంటామని అయన వైసిపిని హెచ్చరించారు. దొంగ కేసులు పెడితే తాము భయపడబోమని.. జగన్ తమను ఏమీ చేయలేరని అయన స్పష్టం చేశారు. వ్యాపార రంగం లో ఉన్న టీడీపీ నేతలను అధికారం అడ్డుపెట్టుకుని ఇబ్బంది పెట్టి.. బెదిరించి పార్టీలో చేర్చుకుంటున్నారని, ఏ వ్యాపారాలు లేని వారిని డబ్బు ఆశ చూపి పార్టీలో చేర్చుకుంటున్నారని అయన విమర్శించారు. తాజాగా సిద్దా రాఘవరావు విషయం లో ఇదే జరిగింది. పార్టీలో చేరేవరకు గ్రానైట్ ఎక్స్ పోర్ట్ అనుమతి నిలిపి వేసిన జగన్ ప్రభుత్వం అయన పార్టీ తీర్థం పుచ్చుకున్న మరు క్షణం అనుమతులు ఇచ్చేసారు. మాకేం కాలేదులే అని ప్రజలు చూస్తూ ఊరుకుంటే త్వరలో గజదొంగలు ప్రజలపై పడతారని లోకేష్ హెచ్చరించారు. పదహారు నెలలు జైల్లో ఉన్న జగన్ తనలాగా అందర్నీ జైలుకు పంపించాలనుకుంటున్నారని అయన మండిపడ్డారు. జగన్ తప్పు చేశారు కాబట్టి బెయిల్ కూడా రాక పదహారు నెలలు జైల్లో ఉన్నారని లోకేష్ విమర్శించారు. వైసిపి ఎన్నిఅరాచకాలు చేసినా తమ మనో స్థైర్యాన్ని దెబ్బతీయలేరని ఆయన స్పష్టం చేశారు. తాజాగా అచ్చెన్నాయుడు కుటుంబానికి ప్రభుత్వ సలహాదారు యాభై కోట్ల ఆఫర్ ఇచ్చారనే విషయం బయటకు రావడం రాజకీయంగా కలకలం రేపే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.