వేదాద్రి ఘటన.. ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన తెలుగు రాష్ట్రాల సీఎంలు

కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి ఏపీ సీఎం వైఎస్ ‌జగన్ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. రాష్ట్ర భూభాగంలోనే ప్రమాదం జరిగినందున, ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వారికి కూడా ఎక్స్‌గ్రేషియా వర్తింపచేయాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు.  వేదాద్రి రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారికి తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా‌ ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. ఏపీకి చెందిన ముగ్గురితో పాటు మొత్తం 12 మంది కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం ఆదేశించారు. ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ కి సీఎం కేసీఆర్‌ ఫోన్‌ చేసి ఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించాలని మంత్రి పువ్వాడ అజయ్ కు సీఎం కేసీఆర్ సూచించారు.  కాగా, కృష్ణా జిల్లా వేదాద్రి వద్ద బుధవారం మధ్యాహ్నం భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్‌ను లారీ ఢీ కొట్టిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఏపీకి చెందిన ముగ్గురు, తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 9 మంది మృతి చెందారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ మద్యం మత్తులో లారీని నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.

మణిపూర్ లో‌ బీజేపీ ప్రభుత్వానికి షాక్.. అధికారంలోకి కాంగ్రెస్!!

పలు రాష్ట్రాల్లో విపక్ష పార్టీల నేతృత్వంలో నడుస్తున్న ప్రభుత్వాలను విచ్చిన్నం చేస్తున్న బీజేపీకి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో ఊహించని షాక్ తగిలింది. బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతిస్తున్న నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ).. సీఎం బీరేన్‌ సింగ్‌ నేతృత్వంలోని ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకుంటున్నామని ప్రకటించింది. ఈ మేరకు తమ పార్టీకి చెందిన నలుగురు మంత్రుల చేత రాజీనామా చేయించింది. అలాగే, బీజేపీ సర్కార్‌కు మద్దతు ఇస్తున్న నలుగురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేలు కూడా బీజేపీతో దోస్తీకి గుడ్‌ బై చెప్పారు. ఊహించని విధంగా, అధికార పార్టీ బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు సైతం తమ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి ప్రభుత్వానికి గట్టి షాక్‌ ఇచ్చారు. ఈ ఎమ్మెల్యేలంతా ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికారు. దీంతో బీరేన్ సింగ్‌‌ ప్రభుత్వం మైనార్టీలో పడింది. ఈ క్రమంలో అసెంబ్లీలో బలనిరూపణ చేపట్టాలని కోరుతూ రాష్ట్ర మాజీ సీఎం, కాంగ్రెస్‌ పక్షనేత ఇబోబీ సింగ్‌ గవర్నర్‌తో భేటీ కానున్నారని సమాచారం. విశ్వాసం కోల్పోయిన బీజేపీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని కోరనున్నారని తెలుస్తోంది. అలాగే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు తమకు అవకాశం కల్పించాలని గవర్నర్‌ను కోరే అవకాశం ఉంది. కాగా, రాజ్యసభ ఎన్నికల ముందు జరిగిన ఈ ఊహించని పరిణామం బీజేపీకి నష్టం కలిగించే అవకాశముంది. కాగా, 2017లో జరిగిన మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 60 స్థానాలకు గాను 28 సీట్లలో కాంగ్రెస్‌ విజయం సాధించి.. అతిపెద్ద పార్టీగా అవతరించింది. అయతే 21 సీట్లు గెలిచిన బీజేపీ ఇతర పార్టీల సాయంతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. తాజా పరిణామాలతో బీజేపీ సంఖ్య 19కి పడిపోయింది. ఈ నేపథ్యంలో ఇతరుల మద్దతుతో కాంగ్రెస్ పార్టీ‌ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశముంది.

పెద్దల సభలో బూతులు తిట్టుకోవడం, తన్నుకోవడం.. వీళ్ళా మన నాయకులు?

నాయకుడి మాటలు, చేతలు పది మంది ఆచరించేలా ఉండాలి.. పది మంది ఛీ కొట్టేలా కాదు. కానీ, ఏపీలో కొందరు రాజకీయ నాయకుల తీరు మాత్రం ఛీ కొట్టేలా ఉంది. వీళ్ళా మన నాయకులు అని సిగ్గుతో తలదించుకునేలా ఉంది. మండలిలో కొందరు మంత్రులు, ఎమ్మెల్సీల ప్రవర్తన వీధి రౌడీలను గుర్తు చేసింది. నన్నేం పీకలేరు అంటూ మంత్రి తొడ కొట్టడం, ఏరా అంటూ సభ్యుడిపైకి దూసుకెళ్లడం, మంత్రి-ఎమ్మెల్సీ తన్నుకోవడం.. ఇవి ఏపీ శాసన మండలిలో కనిపించిన దృశ్యాలు.  ఇటీవల మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు, గతంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై బెట్టింగ్ ఆరోపణలు.. వంటి అంశాలపై టీడీపీ సభ్యుడు బుద్దా నాగజగదీశ్వరరావు, మంత్రి అనిల్ కుమార్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఒకానొక సమయంలో సహనం కోల్పోయిన మంత్రి అనిల్ కుమార్.. ‘‘నన్నేమీ పీకలేరు. చాలెంజ్‌ చేస్తున్నా’’ అంటూ తొడగొట్టారు. దీంతో, సభ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇక మంత్రి అనిల్‌ కుమార్ కి టీడీపీ ఎమ్మెల్సీ బాబూ రాజేంద్ర ప్రసాద్‌ తో కూడా వాగ్వాదం నడిచింది. మీ ఏడాది పాలన గురించి ఎంపీ రఘురామ కృష్ణంరాజు, ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి చెబుతారంటూ రాజేంద్ర ప్రసాద్‌ చేసిన వ్యాఖ్యలపై.. మంత్రి అనిల్‌ ఒక్కసారిగా మండిపడ్డారు. "ఏరా" అని సంభోదిస్తూ ముందుకు దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో మిగతా సభ్యులు అడ్డుకున్నారు. ఇంతటితో అయిపోలేదు.. ఓ మంత్రి, ఎమ్మెల్సీ మండలిలోనే తన్నుకున్నారు. అధికార విపక్షాల మధ్య మాటల యుద్దాలు, మంత్రులు స్పీకర్‌ పోడియంను చుట్టుముట్టడాలు.. ఈ నేపథ్యంలో, శాసన మండలిని నిరవధికంగా వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం ప్రకటించారు. అదే సమయంలో నారా లోకేష్‌ రెండు చేతులు పైకెత్తి పోడియంవైపు చూస్తుండగా.. ఆయన సెల్‌ఫోన్‌లో ఫొటో లు తీస్తున్నారనుకుని, ఫొటోలు తీయవద్దని రెడ్డి సుబ్రమణ్యం మైక్‌లో చెప్పారు. దీంతో, పోడియంను చుట్టిముట్టిన తమ ఫొటోలు తీస్తున్నారనే ఉద్దేశంతో.. మంత్రి వెలంపల్లి ఆగ్రహంతో ఊగిపోతూ లోకేష్‌ వైపు దూసుకొచ్చారు. ఆ సమయంలో ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మంత్రిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పట్టుతప్పిన మంత్రి వెలంపల్లి కిందపడిపోయారు. తనను కిందికి తోశారనే ఉద్దేశంతో.. ఆయన ఆవేశంగా బీద రవిచంద్రను తన్నారు. దీంతో బీద రవిచంద్ర కూడా మంత్రిని తన్నారు. వెంటనే, మిగతా సభ్యులు అడ్డుకొని వీరిద్దరినీ వెనక్కి తీసుకెళ్లారు. ఈ సమయంలో ఇరుపక్షాల సభ్యులు కాస్త గట్టిగానే బూతులు తిట్టుకున్నారని సమాచారం. ఇవి మండలిలో మన నాయకుల సిత్రాలు. అధికార విపక్షాల మధ్య చర్చలు, విమర్శలు సహజం. కానీ, ఇలా బూతులు తిట్టుకోవడాలు, కొట్టుకోవడాలు ఏంటి?. వీళ్ళా మన నాయకులు? వీళ్ళా మనల్ని పాలించేది?. పది మందికి ఆదర్శంగా నిలవాల్సిన వారు, ఇలా ప్రవర్తించడం దేనికి సంకేతం?. అసలు ఇలా ప్రవర్తించేవారిని నాయకులు అనాలా?. అది వారి విజ్ఞతకే వదిలేయాలి.

ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రికి కరోనా.. రెండురోజుల ముందు అమిత్ షా మీటింగ్ కు..

ఢిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేంద్రజైన్ తీవ్ర జ్వరం, ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటంతో ఆయనకు ఢిల్లీలోని రాజీవ్ గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు కరోనా పరీక్ష చేయగా పాజిటివ్ గా తేలింది. ప్రస్తుతం ఆయనకు అక్కడే చికిత్స చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఢిల్లీలో కరోనా వైరస్ పరిస్థితుల తీవ్రత పై చర్చించేందుకు కేంద్రం ఆధ్వర్యం లో సోమవారం జరిగిన అఖిలపక్ష సమావేశానికి మంత్రి సత్యేంద్ర జైన్ హాజరయ్యారు. ఈ సమావేశంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మొదలైనవారు హాజరయ్యారు. ఈ పరిస్థితులలో సత్యేంద్ర జైన్‌ కరోనా పాజిటివ్ తేలడం తో కొంత ఆందోళన వ్యక్తమవుతోంది. కల్కాజీకి చెందిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అతిషి కి జలుబు, దగ్గు లక్షణాలు బయటపడటంతో పరీక్షలు చేయగా పాజిటివ్ నిర్ధారణ అయింది. మరో పక్క ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా జ్వరం, గొంతు నొప్పితో బాధపడుతుండటం తో ఆయనకు కరోనా పరీక్ష చేయగా నెగిటివ్ అని తేలింది.

సీఎం కేసీఆర్ అడిగారు.. పీఎం మోడీ క్లారిటీ ఇచ్చారు

ప్రధాని మోడీ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ రాష్ట్రంలో కరోనా వ్యాప్తి నివారణకు చేపడుతున్న చర్యలను ప్రధానికి వివరించారు. ప్రస్తుతం తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని, మరణాల రేటు కూడా తక్కువగానే ఉందని కేసీఆర్‌ అన్నారు. కరోనా‌ వ్యాప్తిని నివారించేందుకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో మాత్రమే కరోనా‌ కేసులు నమోదవుతున్నాయని, ఇక్కడ కూడా వైరస్ వ్యాప్తి కొద్ది రోజుల్లో అదుపులోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా సాగిస్తున్న పోరుతో కరోనా మహమ్మారిపై తప్పక విజయం సాధిస్తామనే విశ్వాసం ఉందని కేసీఆర్ అన్నారు. దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ విధిస్తారనే వదంతులు వస్తున్నాయని, దీనిపై ప్రధాని స్పష్టత ఇవ్వాలని కేసీఆర్ కోరారు. దీనిపై స్పందించిన ప్రధాని.. దేశంలో మళ్లీ లాక్‌డౌన్‌ ఉండదని తేల్చి చెప్పారు. ప్రస్తుతం అన్‌లాక్‌ 1.0 నడుస్తోంది. అన్‌లాక్‌ 2.0 ఎలా అమలు చేయాలనే విషయంపై చర్చించుకోవాలి అని ప్రధాని స్పష్టం చేశారు. ఓ వైపు కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి.. మరోవైపు ప్రధానేమో లాక్ డౌన్ ఉండదని స్పష్టం చేశారు. దీన్ని బట్టి చూస్తుంటే.. ప్రభుత్వ తీసుకోవాల్సిన చర్యలు తీసుకుంటది. కానీ, చివరికి ప్రజలే జాగ్రత్తగా ఉంటూ.. ఎవరి ఆరోగ్యం వారు కాపాడుకోవాలని అర్థమవుతోంది.

తొడకొట్టి, జిప్ తీసిన మంత్రి... టీడీపీ తీవ్ర ఆరోపణలు

నిన్న శాసన మండలిలో బిల్లుల ఆమోదం విషయంలో అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. ఈ సందర్భంగా వైసిపి మంత్రులు వీధి రౌడీల్లా ప్రవర్తించారని టీడీపీ ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, అశోక్ బాబు ఆరోపించారు. పెద్దల సభ అయిన శాసన మండలిలో మంత్రి అనిల్ కుమార్ తొడ కొట్టారని అలాగే జిప్ తీసి తీవ్ర దూషణలకు దిగారని వారు ఆరోపించారు. మహిళా ఉద్యోగులు, సభ్యులు ఉన్న సభలో మంత్రి ఇలా ప్రవర్తించడంతో మిగిలిన సభ్యులు హతాశులయ్యారు. మరో మంత్రి టీడీపీ సభ్యుల పై దాడికి పాల్పడ్డారని ప్రజలకు వాస్తవాలు తెలియాలంటే జరిగిన ఘటన వీడియోలను ఎడిట్ చేయకుండా బయట పెట్టాలని వారు డిమాండ్ చేశారు. సభలో మంత్రులు వాడిన భాష చూస్తే ఈ మంత్రులను ప్రజలు గ్రామాల్లోకి కూడా రానివ్వరని అన్నారు. మంత్రుల పై టీడీపీ సభ్యులు దాడి చేసారని ఆరోపిస్తున్న అధికార పక్షం వీడియో ఫుటేజ్ ను బయట పెట్టాలని ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి డిమాండ్ చేశారు.

కరోనా వైరస్ ను ప్రభుత్వం ఎగదోస్తున్నట్లుగా ఉంది.. హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు

తెలంగాణ ప్రభుత్వం కరోనా వైరస్ తీవ్రత ను కట్టడి చేసే విషయంలో తీసుకుంటున్న చర్యలను హైకోర్టు తరచూ తప్పు పడుతున్న విషయం తెలిసిందే. గత కొద్ది రోజులుగా ప్రభుత్వం ప్రతి రోజు చేస్తున్న కరోనా పరీక్షల సంఖ్య పైన కోర్టు సీరియస్ గా స్పందిస్తోంది. తాజాగా ఇప్పుడు కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్య సిబ్బందికి ఇస్తున్న పీపీఈ కిట్లు, గ్లౌజులు, ఎన్‌-95 మాస్కులు, ఇతర పరికరాల లభ్యత పై ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇదే అంశాల పై వివరణ ఇవ్వడానికి గాంధీ హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ రావు స్వయం గా కోర్టు ముందు ఈ రోజు హాజరై పూర్తి వివరాలు ఇవ్వాలని హైకోర్టు సీజే ఆదేశించారు. కరోనా ట్రీట్ మెంట్ కోసం బాధితులంతా గాంధీకే ఎందుకు వెళ్తున్నారు.. నిమ్స్ కు అలాగే ఇతర హాస్పిటల్స్ కు ఎందుకు వెళ్లడం లేదు. తమకు రక్షణ లేదని, పీపీఈ కిట్లు ఇతర మౌలిక వసతులు అందడం లేదని జూనియర్ డాక్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 70 మంది వైద్యులకు కరోనా సోకింది, 400 మంది వైద్య సిబ్బంది క్వారంటైన్ అయ్యారు. గాంధీ ఆసుపత్రిలో గత 15 రోజులుగా కొనసాగుతున్న జూనియర్‌ డాక్టర్ల సమ్మె, వారి డిమాండ్లు ఏమిటో తెలపాలని హైకోర్టు సీజే రాఘవేంద్రసింగ్‌ చౌహాన్‌ నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం ఆదేశాలు జారీచేసింది. కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి పీపీఈ కిట్లు, మాస్కులు అందించడం లేదంటూ న్యాయవాది సమీర్‌ అహ్మద్‌ హైకోర్టు కు రాసిన లేఖను ధర్మాసనం సుమోటో పిల్ ‌గా విచారణకు స్వీకరించింది. కరోనా పరీక్షా కేంద్రాల్లోని అధికారులు పరీక్షల సంఖ్య చాలా తక్కువగా ఉందని చెబుతున్నారని, పొరుగున ఉన్న రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలు చాలా తక్కువగా జరుగుతున్నట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయని ధర్మాసనం తెలిపింది. కరోనా చికిత్స అందిస్తున్న వైద్యులకు, సిబ్బందికి ఇచ్చే పీపీఈ కిట్లు, మాస్కుల నిల్వలు ఏమేరకు ఉన్నాయన్నది అప్రస్తుతమని, చికిత్స అందించే సిబ్బందికి ఎన్ని ఇస్తున్నారన్నదే ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తెలంగాణలో పరిస్థితి రోజురోజుకు దారుణంగా మారుతోందని, ఇటువంటి పరిస్థితుల్లో కరోనాను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సరిపోవని స్పష్టం చేసింది. ఈ సందర్బంగా అడ్వొకేట్ జనరల్ ప్రసాద తన వాదనలు వినిపిస్తూ కరోనా నియంత్రణకు ప్రభుత్వం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని చెపుతూ వచ్చే 10 రోజులలో 50 వేల పరీక్షలు చేయబోతున్న విషయం తెలిపారు. ఐతే ధర్మాసనం జోక్యం చేసుకుంటూ ప్రతి రోజు 200 కు పైగా కేసులు నమోదు దేనికి సంకేతం అని ప్రశ్నించింది. జిల్లాకో కోవిడ్ హాస్పిటల్ ఏర్పాటు ఏమైందని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

అగ్రిగోల్డ్ బాధితులకు ఏపీ సర్కార్ ఝలక్

అగ్రిగోల్డ్ బాధితుల విషయంలో ఏపీ సర్కార్ వ్యవహరిస్తున్న తీరు సందేహాలకు తావిస్తోంది. 2019 ఎన్నికల సమయం లో అగ్రిగోల్డ్ బాధితులతో ప్రత్యేకంగా సమావేశాలు పెట్టి.. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి బడ్జెట్‌లో రూ. 1150 కోట్లు కేటాయించి అందరికీ పంపిణీ చేస్తామని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. ఐతే మొదటి బడ్జెట్ వచ్చింది అందులో 1150 కోట్ల కేటాయింపులు కుడా చేసారు కానీ 264 కోట్లు మాత్రమే పంచారు. ఈ సొమ్ము కూడా గత టీడీపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ ఆస్తుల వేలం వేసి సిద్ధం చేసిన సొమ్ము. ఈ నిధులకు అదనంగా ప్రభుత్వం ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఇపుడు తాజాగా రెండో బడ్జెట్ లో 200 కోట్లు కేటాయించారు. ఐతే ఈ మొత్తాన్ని ఎప్పుడు పంపిణి చేస్తారో తెలియని పరిస్థితి. దీంతో అగ్రిగోల్డ్ బాధితులు చలో అసెంబ్లీ పేరుతొ మరోసారి ఉద్యమానికి సిద్ధం కాగా వారిని పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. కోర్టు పరిధిలో ఉన్న అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మివేసి బాధితులందరికి పంచాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. దీనికి కోర్టు కూడా అనుమతులు ఇచ్చింది. కానీ ఆస్తుల అమ్మకం మాత్రం జరగడం లేదు. మరి ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితుల కష్టాలు ఎప్పటికి తీరుస్తుందో వేచి చూడాలి.

సీఎంవో అధికారిని బలి తీసుకున్న కరోనా

మన దేశంలో కరోనా కేసులు సంఖ్య దాదాపుగా మూడున్నర లక్షలకు చేరుకొంది. ఈ మొత్తం కేసులలో సగం పైగా మహారాష్ట్ర, తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల నుండి నమోదయ్యాయి. దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే కేసులు వేగంగా పెరుగుతున్నాయి. దీంతో ఆ రాష్ట్రప్రభుత్వం మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లుగా తాజాగా ఆదేశాలు జారీ చేసింది.  తాజాగా తమిళనాడు ముఖ్యమంత్రి పళని స్వామి కార్యాలయ కార్యదర్శి కరోనాతో మృతి చెందడం రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఆయన వయసు 51 సంవత్సరాలు. చెన్నైలోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన కన్ను ముసినట్లు వార్తలు వస్తున్నాయి. రాష్ట్రం లోని అత్యున్నత స్థాయి అధికారి కరోనాతో చనిపోవడంతో తమిళనాడులో కలవరానికి దారితీసింది. సీనియర్ వ్యక్తిగత కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్న ఆయన వారం రోజులుగా రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుప్రతిలో చికిత్సపొందుతున్నారు. కుటుంబ సభ్యులు సైదాపేటలోని ప్రభుత్వ క్వార్టర్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన మరణంతో సెక్రటేరియట్ ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  ఇప్పటి వరకు తమిళనాడు సెక్రటేరియట్‌లో 200 మంది వరకు ఉద్యోగులు కరోనా బారిన పడినట్టు సమాచారం అందుతోంది. వీరిలో పలువురు ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఉన్నారని వార్తలు వస్తున్నాయి. కేసులు పెరుగుతున్న దృష్ట్యా సెక్రటేరియట్‌ను మూసివేయాలని సెక్రటేరియట్‌ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే కనీసం గర్భిణీలు, 50 ఏళ్లు పైబడినవారు, దీర్ఘకాళిక వ్యాధులతో, శ్వాసకోస ఇబ్బందులతో బాధపడేవారిని విధుల నుంచి మినహాయించాలని వారు కోరుతున్నారు.

కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 10 మంది మృతి చెందగా, 14 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం గోపవరం నుంచి దాదాపు 30 మంది ట్రాక్టర్‌లో దైవదర్శ నానికి వేదాద్రి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. కృష్ణా జిల్లాలో జిరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఖమ్మం జిల్లా వాసులు దుర్మరణం చెందడం పట్ల తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు, గాయపడిన వారికి అవసరమైన సహాయం అందించాల్సిందిగా అధికారులను సీఎం ఆదేశించారు.

చైనా సైన్యం భారత భూభాగాన్ని ఎలా ఆక్రమించింది?

భారత్, చైనా సరిహద్దు ఘర్షణపై కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ స్పందించారు. చైనా సైన్యం భారత భూభాగాన్ని ఎలా ఆక్రమించిందో ప్రధాని మోడీ వెల్లడించాలని సోనియా డిమాండ్ చేశారు. 20 మంది భారత జవాన్లు తమ ప్రాణాలను ఎలా కోల్పోయారో మోడీ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత్, చైనా సరిహద్దు ఉద్రిక్తతలపై దేశం మొత్తం తీవ్ర ఆందోళనలో ఉందని పేర్కొన్నారు. సరిహద్దుల్లో ప్రస్తుత పరిస్థితి గురించి మోడీ దేశ ప్రజలకు చెప్పాలని సోనియా కోరారు. చైనాతో హింసాత్మక ఘర్షణలో ఎంత మంది జవాన్లు, అధికారులు మిస్ అయ్యారు? ఎంత మంది గాయపడ్డారు? చైనాతో ఇక ముందు ప్రభుత్వం వ్యవహరించే తీరు ఎలా ఉంటుంది? ఈ అంశాల గురించి ప్రధాని మోడీ దేశ ప్రజలకు వివరించాలని సోనియా డిమాండ్ చేశారు.

హైకోర్టు వేసిన ప్రశ్నకు ఆర్డినెన్స్ తో జవాబు చెప్పిన కేసీఆర్ సర్కార్

కరోనా దెబ్బకు తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలలో, పెన్షనర్లకు ఇచ్చే పెన్షన్లలో కోత విధించిన విషయం తెలిసిందే. ఐతే కొంత మంది పెన్షనర్లు తమ పెన్షన్లలో కోతకు వ్యతిరేకంగా హైకోర్టును ఆశ్రయించారు. దీని పై స్పందించిన హైకోర్టు పెన్షన్లలో కోత పెట్టడానికి ప్రభుత్వానికి ఉన్న అధికారాలేమిటో తెలపాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఇచ్చిన మరుసటి రోజుకే తమ నిర్ణయాన్ని ఎవరు ప్రశ్నించకుండా తెలంగాణ ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. కేసీఆర్ సర్కార్ తాజాగా తీసుకు వచ్చిన ఆర్డినెన్స్ ప్రకారం.. విపత్తుల సమయంలో జీతాలు, పెన్షన్లు తగ్గించి ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని అందులో స్పష్టం చేసింది. దీంతో న్యాయస్థానాలతో సహా ఎవరూ ఈ నిర్ణయాన్ని ప్రశ్నించలేని పరిస్థితి. గడిచిన మూడు నెలలుగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు సగం జీతమే ఇస్తూ వస్తోంది. ఐతే వైద్య సిబ్బంది, పోలీసులకు మాత్రం పూర్తి జీతాలు ఇస్తోంది. మిగిలిన వారందరికీ మాత్రం కోతలు పెడుతోంది. ఐతే పక్కనే ఉన్న ఏపీ ప్రభుత్వం తన ఉద్యోగులకు రెండు నెలల పాటు సగం జీతాలే ఇచ్చినా...ఈ నెల నుండి పూర్తి జీతాలు ఇస్తోంది. కానీ తెలంగాణ ప్రభుత్వం మాత్రం.. కోతలను మరికొంత కాలం కొనసాగించాలని డిసైడ్ అయింది. ఐతే దీనిని ఎవరూ ప్రశ్నించకుండా ఉండడానికి నేరుగా చట్టం తీసుకొచ్చింది. ప్రస్తుతం ఆర్థిక కార్యకలాపాలన్నీ దాదాపుగా మెరుగుపడడం తో పాటు మద్యం అమ్మకాలు కూడా ప్రారంభం కావడంతో ప్రభుత్వం శాలరీలు పూర్తిగా ఇస్తుందేమోనని ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగుల ఆశల పై ఈ ఆర్డినెన్స్ నీళ్లు చల్లింది.

సీఆర్డీఏ రద్దుకు అసెంబ్లీ ఆమోదం.. అన్యాయం చేస్తున్నారన్న స్పీకర్ తమ్మినేని! 

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో పలు బిల్లులు శాసన సభలో ప్రవేశపెట్టగా సభ్యులు ఆమోదం తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ బిల్లుతో పాటుగా అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి, దేవాదాయ చట్టంలో రెండు సవరణ బిల్లులకు కూడా శాసనసభ ఆమోదం తెలిపింది. సీఆర్‌డీఏ రద్దు బిల్లును మంత్రి బొత్స సత్యనారాయణ అసెంబ్లీలో పునఃప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు శాసన సభ ఆమోదం తెలిపింది. సీఆర్డీఏ రద్దు బిల్లును మరోసారి ఆమోదిస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కాగా, బిల్లు పాస్ అయ్యాక స్పీకర్ తమ్మినేని తనలో తాను మాట్లాడుకున్న మాటలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. బిల్ పాస్ అయ్యాక చిన్నగా తనలో తాను 'అన్యాయం చేస్తున్నారు, తప్పు చేస్తున్నారాయ్యా.' అని స్పీకర్ అన్న మాటలు మైక్ ద్వారా చిన్నగా వినిపించాయి. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నిమ్మగడ్డ‌కు రాష్ట్ర ప్రభుత్వం నరకం చూపిస్తోంది

నిమ్మగడ్డ రమేష్ కుమార్ అంశంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్‌కు లేఖ రాశారు. రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టకుండా నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం నరకం చూపిస్తోందన్నారు. రమేష్ కుమార్ తన కార్యాలయంలోకి అడుగుపెట్టకుండా నిలువరించేందుకు పోలీసు బలగాలను మోహరించారని పేర్కొన్నారు. రాజ్యాంగాన్ని  పరిరక్షించడంలో రాష్ట్ర అధిపతిగా మీరు జోక్యం చేసుకుని విషయాలను సరిదిద్దాలని కోరుతున్నామన్నారు. రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పునరుద్ధరించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించిందని తెలిపారు. రమేష్ కుమార్‌ను రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టేలా ‌చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను కన్నా కోరారు. స్వయం ప్రతిపత్తి కలిగిన రాజ్యాంగ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం పనితీరులో రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్న తీరు సరి కాదని కన్నా లేఖలో పేర్కొన్నారు. అన్ని ప్రజాస్వామ్య నిబంధనలను ఉల్లంఘిస్తూ స్థానిక ఎన్నికలలో అక్రమాలకు తెగబడిందన్నారు. పలువురు అధికారులను ఎన్నికల సంఘం సస్పెండ్ చేస్తే.. ప్రభుత్వం ఆ ఉత్తర్వులను అమలు చేయకుండా పోస్టింగుల్లో ‌ఉంచిందన్నారు.

ఏకంగా సభలోనే తొడ గొట్టిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్

టీడీపీ నేతల పై మాటల తూటాలతో దాడి చేసే ఇరిగేషన్ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తాజాగా శాసన మండలిలో టీడీపీ నేతల పై మరోసారి విరుచుకు పడ్డారు. ఈ రోజు మంత్రి అనిల్, టీడీపీ ఎమ్మెల్సీ నాగ జగదీశ్వర్ రావు ల మధ్య శాసనమండలిలో కొద్దిసేపు వాగ్వివాదం జరిగింది. దీంతో ఆవేశానికి లోనైన మంత్రి అనిల్ ఏకంగా సభలోనే తొడగొట్టారు. ఈ రోజు చర్చలో భాగంగా మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టు విషయాన్ని టీడీపీ సభ్యుడు నాగ జగదీశ్వర్ రావు సభలో లేవనెత్తారు. బీసీ నాయకులను ప్రభుత్వం అణగదొక్కుతోందని ఆయన ఆరోపించారు. అదే సమయం లో ఆయన వ్యాఖ్యలను మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తప్పుబట్టారు. మాజీ మంత్రి అచ్చెన్నాయుడు దొంగతనం చేశాడు కాబట్టే జైలుకు వెళ్లాడని సుభాష్ చంద్రబోస్ వ్యాఖ్యానించారు.  ఈ చర్చలో జోక్యం కల్పించుకున్న మంత్రి అనిల్ ముద్రగడ పద్మనాభం అరెస్ట్ విషయాన్ని ప్రస్తావించారు. కాపు ఉద్యమ సమయంలో మూడువేల మంది పోలీసులతో టీడీపీ ప్రభుత్వం ఆయన్ను అరెస్ట్ చేయడాన్ని ఎలా భావించాలని అయన ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రతిపక్ష టీడీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. దీంతో మంత్రి అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఏకంగా సభలోనే తొడగొట్టారు. నెల్లూరు లో తనను ఓడించడానికి ఎన్నికల్లో టీడీపీ నాయకులు కోట్లు ఖర్చు చేసారని.. అయినా తాను గెలిచి శాసన సభకు వచ్చానని అనిల్ అన్నారు. ఐతే అధికార విపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో మండలి చైర్మన్ షరీఫ్ సభను కొద్దీ సేపు వాయిదా వేశారు.

ఏపీలో బీజేపీ ఆట మొదలైంది.. వైసీపీకి అధికారం దూరం కానుందా?

'పెరుగుట విరుగుట కొరకే' అనే సామెత ప్రస్తుతం ఏపీ అధికార పార్టీకి సరిగ్గా సరిపోతుంది అనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ సీట్లతో ఘన విజయం సాధించిన వైసీపీలో ఒక్క ఏడాదిలోనే అలజడి మొదలైంది. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు రూపంలో ఆ పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయి. ఇప్పటికే జగన్ సర్కార్ తీరుని పలుసార్లు తప్పుబట్టిన ఆయన.. తాజాగా ఆయన స్వరాన్ని మరింత పెంచారు. నరసాపురంలో జగన్ బొమ్మ చెల్లకే తనని పార్టీలోకి రమ్మన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై కూడా అదే స్థాయిలో వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇక, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ పై అయితే.. ఓ టీవీ డిబేట్ లో బూతులతోనే విరుచుకుపడ్డారు. ఏకంగా పార్టీ అధినేత, సీఎం పైనే తీవ్ర వ్యాఖ్యలు చేయడం.. రాష్ట్రంలో బలమైన పార్టీని ఢీ కొట్టడానికి సిద్దమవ్వడం.. అసలు ఓ ఎంపీకి ధైర్యం ఇంత ఎక్కడిది?. ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్ గా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అండదండలతోనే, ఎంపీ రఘురామకృష్ణంరాజు రెచ్చిపోతున్నారని, బలమైన వైసీపీని ఢీ కొట్టడానికి సిద్ధమయ్యారని ప్రచారం జరుగుతోంది. వరుసగా రెండు సార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ.. దక్షిణ భారత దేశంలో మాత్రం ఆశించిన స్థాయిలో బలపడలేదనే చెప్పాలి. ప్రస్తుతం బీజేపీ కన్ను దక్షిణ భారతదేశంపై ఉంది. ప్రాంతీయ పార్టీలను ఢీకొట్టి దక్షిణంలో తిరుగులేని శక్తిగా ఎదగాలని చూస్తోంది. అందులో భాగంగానే ముందుగా ఏపీలో పావులు కదపడం మొదలు పెట్టింది అంటున్నారు. ఎంపీ రఘురామకృష్ణంరాజు ద్వారా వైసీపీలో పెను ప్రకంపనలు సృష్టించి ఏపీ రాజకీయాల్లో ఊహించని మలుపు తీసుకురాబోతుందని ప్రచారం జరుగుతోంది. ఎంపీ రఘురామకృష్ణంరాజుకి బీజేపీతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సీఎం జగన్ కే కేంద్ర హోంమంత్రి అమిత్ షా అపాయింట్మెంట్ దొరకడం కష్టమవుతుంటే.. ఎంపీ రఘురామకృష్ణంరాజుకి తేలికగా అపాయింట్మెంట్ ఇవ్వడాన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు.. ఆయనికి బీజేపీతో ఎంత సన్నిహిత సంబంధాలు ఉన్నాయో. ఆ బంధమే ఇప్పుడు వైసీపీ పాలిట గుదిబండలా మారిందని అంటున్నారు. టీడీపీ నేతలు పది పదిహేను మంది తమ పార్టీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ వైసీపీ నేతలు వ్యాఖ్యలు చేస్తుంటారు. నిజానికి అసలు వైసీపీ నేతలే పదుల సంఖ్యలో బీజేపీలోకి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని, ఏ క్షణంలోనైనా ఇది జరగొచ్చని తెలుస్తోంది. పైకి జగన్ సర్కార్ పై వ్యతిరేక స్వరం వినిపిస్తూ ఎంపీ రఘురామకృష్ణంరాజు కనిపిస్తున్నా.. ఆయన వెనక మాత్రం ప్రస్తుత రాజకీయ పార్టీలలో బాహుబలి అయిన బీజేపీ ఉందని తెలుస్తోంది. ఇదంతా తెర ముందు ఎంపీ రఘురామకృష్ణంరాజుని పెట్టి తెర వెనుక బీజేపీ ఆడిస్తోన్న ఆటట. బీజేపీ ఒక్క చిటిక వేస్తే చాలు.. ఎంపీ రఘురామకృష్ణంరాజుతో పాటు చాలామంది ఎంపీలు, ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి జంప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారట. ఇప్పటికే ఏలూరు, నర్సరావుపేట, ఒంగోలు, నెల్లూరు నేతలు వైసీపీకి అందుబాటులో లేకుండా పోయారని ప్రచారం జరుగుతోంది. ప్రస్తుత పరిణామాలు చూస్తుంటే.. ఓ సందర్భంలో సీనియర్ రాజకీయ నేత ఉండవల్లి అరుణ్ కుమార్ అన్న వ్యాఖ్యలు గుర్తుకొస్తున్నాయి. 50 శాతానికి పైగా ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ కూడా ఎక్కువ కాలం నిలబడలేదని చెప్పారు. ఎక్కువ సీట్లు గెలిచి సీఎం అయిన నాయకులు.. సొంత పార్టీ నుంచే తిరుగుబాటు ఎదుర్కొన్నట్టు చరిత్ర చెబుతుందని ఉండవల్లి అన్నారు. ఇప్పుడు వైసీపీలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే.. ఉండవల్లి మాటలు నిజమవుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరి, ఎంపీ రఘురామకృష్ణంరాజు తిరుగుబాటుతో మొదలైన ఈ అలజడి ఏ స్థాయికి చేరుతుందో ఏంటో?. ఏపీలో జెండా పాతాలని చూస్తోన్న బీజేపీ.. వైసీపీకి ఊహించని షాకిచ్చి జెండా పాతుతుందేమో చూడాలి.

టీడీపీ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు పై నిర్భయ కేసు

టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి పై నిర్భయ కేసు ఫైల్ ఐంది. కొద్ది రోజుల క్రితం జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో పాల్గొన్న అయ్యన్న నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసారని అభియోగం. దీని పై నర్సీపట్నం మున్సిపల్ కమిషనర్ స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం తో నిర్భయ కేసు నమోదైనట్లు తెలుస్తోంది. కాగా ఒక మాజీ మంత్రి పై నిర్భయ కేసు పెట్టడం ఇదే మొదటి సారి. ఇప్పటికే మరో మాజీ మంత్రి అచ్చెన్నను ఎసిబి, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, అయన కుమారుడు అస్మిత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన నేపధ్యం లో టీడీపీ కి ఇది కొంత ఇబ్బందికరమైన పరిస్థితి.