ఎమ్మెల్యే స్టిక్కర్ కారులో 5 కోట్లకు పైగా నగదు పట్టివేత.. ఏపీలో రాజకీయ దుమారం

ఏపీ బోర్డర్ కు దగ్గరలో తమిళనాడు లోని గుమ్మడిపూండి దగ్గర ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న కారు లో 5.27 కోట్లను తమిళనాడు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి ఆ కారులో ఉన్న ఒంగోలుకు చెందిన ముగ్గ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేసారు. ఆంధ్రప్రదేశ్ నుండి చెన్నై కి గంజాయి అక్రమ రవాణా జరుగుతోందని ఆరంబాక్కం పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందడంతో తెల్లవారుజామున ఎలావురు లోని చెక్ పోస్ట్ వద్ద వాహనాల ను చెక్ చేయడం మొదలు పెట్టారు. అపుడే అటుగా ఎమ్మెల్యే స్టిక్కర్ తో వచ్చిన కారును చెక్ చేయగా వెనుక సీటులో కొన్ని బ్యాగులు కనిపించాయి. వాటిని ఓపెన్ చేసి చూడగా వాటిలో ఏకంగా 5 కోట్లకు పైగా నగదు ఉండడంతో దానిని స్వాధీనం చేసుకుని ఆ వాహనంలో ఉన్న ముగ్గురిని అరెస్ట్ చేసి ఆదాయపు పన్ను శాఖ అధికారులకు అప్పగించారు. వీరిని ఒంగోలుకు చెందిన వసంత్, నాగరాజు, కారు డ్రైవర్ సత్యనారాయణ గా గుర్తించారు. ఐతే నగదు తరలిస్తున్న కారు మాత్రం తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్నట్లు సమాచారం. ఐతే ఈ కారు పై ఒంగోలుకు చెందిన ఎమ్మెల్యే స్టిక్కర్ ఉండడం తో అనేక అనుమానాలు మొదలయ్యాయి. అంతే కాకుండా తనిఖీ జరిగే సమయంలోనే మరో ఇద్దరు తప్పించుకు పారిపోయారని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఒక రాజకీయ నాయకుడి కుమారుడు, మరో బంగారు వ్యాపారి ఉన్నట్లుగా పొలిటికల్ సర్కిల్స్ లో చర్చించుకుంటున్నారు. ఘటన పై లోతైన దర్యాప్తు కోరిన మంత్రి బాలినేని ఈ ఘటన తో ఇపుడు ఏపీలో తీవ్ర దుమారమే రేగుతోంది. ఆ ఘటన పై మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పందిస్తూ చెన్నై వెళుతున్న ఒక కారుపై నా పేరుతొ ఉన్న స్టిక్కర్ ఉన్నట్లుగా మీడియాలో ఈ ఉదయం వార్తలు వచ్చాయి. ఆ స్టిక్కర్ ఫోటో జిరాక్స్ కాపీ. అంతే కాకుండా అరెస్ట్ ఐన వారు ఒంగోలుకు చెందిన వారు కావడంతో తనకు అంటగడుతున్నారని వాపోయారు. తమిళనాడు రిజిస్ట్రేషన్ తో ఉన్న కారులో 5 కోట్లకు పైగా నగదు ఉందని చెపుతున్నారు. దీని పై అన్ని కోణాలలో లోతుగా దర్యాప్తు చేసి దోషులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నానన్నారు.

ట్రంప్ మాస్క్ పెట్టాడు.. మీరు కూడా పెట్టండి సారూ

కొద్ది రోజుల క్రితం ఎపి సీఎం సలహాదారుల బాధ్యతలలో భారీ మార్పులు చేసిన సంగతి తెలిసిందే. ఈ మార్పులతో ముఖ్య సలహాదారులుగా ఉన్న కల్లం అజేయ రెడ్డి, పీవీ రమేష్ కు ఉన్న అధికారాలను కట్ చేసి సీఎం ఓ లోని ప్రవీణ్ ప్రకాష్ తదితర అధికారులకు అప్పగించారు. మళ్ళీ ఏమైందో ఏమో మొన్న ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన ఢిల్లీ పర్యటనలో అజేయ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లుగా వార్తలు వచ్చాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం సలహాదారుగా ఉన్న అజేయ్ అధికారాలలో ఎటువంటి మార్పు లేదని కేవలం పీవీ రమేష్ అధికారులలో మాత్రమే కోత పడిందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉండగా ప్రభుత్వ సలహాదారు పీవీ రమేష్ తాజా ట్వీట్ ఎపి రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఎపుడు మాస్క్ పెట్టని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెండు రోజుల క్రితం మాస్క్ తో దర్సనమిచ్చాడు. దీనిని ఉదాహరణ గా చూపిస్తూ ప్రపంచంలోని నాయకులందరూ మాస్క్ లు ధరించి ప్రజలకు ఆదర్శంగా నిలవాలని రమేష్ ట్వీట్ చేసారు. ఐతే సీఎం జగన్ ను ఉద్దేశించి రమేష్ ఈ ట్వీట్స్ చేసారా అనే చర్చ సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతోంది. ఎందుకంటే ఎపి సీఎం కూడా చాలా తక్కువ సందర్భాలలో మాత్రమే మాస్క్ ధరించి కనిపించారు.  

కోవిద్ 19 మూలాలు చెరిపేస్తున్న క్యూబా

చిన్నదేశమే అయినా ప్రపంచానికి సాయం.. మూడు దశల్లో జన జీవితాన్ని పునరుద్ధించే ప్రయత్నం.. హెన్రీ రీవ్ ఇంటర్నేషనల్ మెడికల్ బ్రిగేడ్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్... కోవిద్ 19 వైరస్ వ్యాప్తికి వ్యతిరేకంగా క్యూబా చేసిన ప్రయత్నాలు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి. తమ దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అరవైకి పైగా దేశాల్లో కోవిద్ 19 రోగులకు వైద్యసేవలందిస్తున్నారు. క్యూబా వైద్యసిబ్బంది సేవలను ప్రపంచదేశాలు కీర్తిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ద్వారా శిక్షణ పొందిన ఈ వైద్యసిబ్బంది గతంలోనూ పశ్చిమ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ ను అరికట్టడంలోనూ విశేష సేవలందించారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన హెన్రీ రీవ్ ఇంటర్నేషనల్ మెడికల్ బ్రిగేడ్‌ను నోబెల్ శాంతి బహుమతికి నామినేట్ చేయాలన్న ప్రచారం జరుగుతోంది. కోవిద్ 19ను ఎదుర్కోవడంలో.. కోవిద్ 19ను సమర్థవంతంగా ఎదుర్కొన్న క్యూబాలో ఇప్పటివరకు 2399 కేసులు నమోదు కాగా వారిలో 2,242 మంది పూర్తిగా కోలుకున్నారు. మరికొందరు కోలుకుంటున్నారు. ఇప్పటివరకు మరణించిన వారి సంఖ్య కేవలం 86 మాత్రమే. మరణించిన వారిలో సగం మంది ఆ దేశ రాజధాని  హవానా నగరంలో నివసించేవారే...మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వివిధ దేశాల్లో వైద్యసేవలందిస్తున్న వారిలోనూ కోవిద్ 19 వైరస్ సోకింది. అమెరికా, బ్రెజిల్లో వందలాంది మంది వైద్యసిబ్బంది చనిపోయారు. అయితే క్యూబాకు చెందిన వైద్యసిబ్బందిలో ఏ ఒక్కరిలోనూ కోవిద్ 19 వైరస్ వ్యాప్తించలేదు. ఇందుకు కారణం వారు తీసుకుంటున్న జాగ్రత్తలు. వైద్యసేవలు అందించడంలోనూ ఎంతో కఠిమైన, వైవిధ్యమైన శిక్షణను వారి తీసుకున్నారు. మూడుదశల ప్రక్రియ ద్వారా... క్యూబా ద్వీపాల సముదాయం. ఇక్కడి జనాభా కోటి పది లక్షలకు పైగా ఉంటారు. కోవిద్ వైరస్  ప్రపంచంలోని అన్ని దేశాల మాదిరిగానే క్యూబాలోనూ వ్యాపించింది. అయితే అక్కడి ప్రభుత్వం చాకచక్యంగా రక్షణ చర్యలు తీసుకున్నారు. దశల వారీగా సంపూర్ణ లాక్ డౌన్ అమలు చేస్తూ ప్రజలు వ్యాధి బారిన పడకుండా అవగాహన కల్పించారు. ఈ దేశంలోని 15ప్రావిన్సుల్లో వైరస్ వ్యాప్తిని గుర్తిస్తూ.. ప్రజా జీవనానికి ఆటంకం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. పన్నులు, విద్యుత్, నీరు, గ్యాస్, టెలిఫోన్, ఇంటర్నెట్ బిల్లుల చెల్లింపు వాయిదా వేశారు. ఒంటరిగా నివసించే వృద్ధులకు సామాజిక కార్యకర్తలు ఆహారాన్ని అందించారు. ప్రజలు వీధుల్లోకి రాకుండా నివారించారు. ఎలా సోకింది అరా తీస్తూ.. ప్రజారోగ్య అధికారులు వైరస్ పాజిటివ్ వ్యక్తిని గుర్తించినప్పుడల్లా  వారికి ఎలా సోకింది వివరాలు తెలుసుకుని.. ఆ వ్యక్తితో కంటాక్ట్ ఉన్న ప్రతి ఒక్కరికీ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ విధంగా చేయడం వల్ల లక్షణాలు కనిపించని పాజిటివ్ వ్యక్తులను కూడా గుర్తించి వారిని 14 రోజులు ఇంట్లో ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఇంట్లో ఐసోలేషన్ లో ఉన్నవారిని ప్రతిరోజూ డాక్టర్లు పరీక్షించారు. వారిలో ఎవరికైనా తీవ్ర అనారోగ్యం ఉంటే వెంటనే హాస్పిటల్ కు తరలించేలా సదుపాయాలు ఏర్పాటు చేశారు. ఇంటింటికి వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని కట్టడి చేశారు. ప్రజారోగ్య వ్యవస్థను సన్నద్దం చేశారు. అయితే ఇంటింటికి పరీక్షలు చేయడం ద్వారా వ్యాప్తిని అరికట్టి ఆసుపత్రి సౌకర్యాలు 60శాతం కన్నా తక్కువే వినియోగించారు. ఈ రోజుకు కూడా ప్రతిరోజూ సుమారు 2 వేల పరీక్షలు జరుగుతున్నాయి. ప్రజా జీవనం మెరుగుపడేలా.. ప్రారంభంలోనే  దేశ సరిహద్దులను, విద్యాసంస్థలను మూసివేశారు. ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించుకునేవారి రద్దీని నివారించడానికి బస్సుల్లో, బస్ స్టాప్ ల్లో భౌతిక దూరం పాటించేలా, మాస్క్ తప్పనిసరిగా ధరించేలా అవగాహన కల్పించారు. ట్యాంకర్లు, ట్రక్కులు, పంపుల ద్వారా వీధులను క్లోరిన్‌తో పిచికారీ చేశారు. ప్రతి ఉదయం తొమ్మిది గంటలకు, పబ్లిక్ హెల్త్ బులిటెన్ జాతీయ టీవీలో ప్రసారం చేశారు. కోవిద్ వైరస్ వ్యాప్తి గురించి ప్రజలకు తెలియజేశారు. కచ్ఛితమైన గణాంకాలు చెప్పడం ద్వారా ప్రజలు వాస్తవాలు తెలుసుకునే పరిస్థితి కల్పించారు. పర్యాటకులను అనుమతిస్తూ.. క్యూబా ఆర్థిక వనరులు చాలా తక్కువ. ఆ దేశ ఆర్థిక వ్యవస్థలో 75శాతం వైద్య సేవలను ప్రపంచ దేశాలకు అందించడం ద్వారా వస్తోంది.  మానవ వనరులను ఆర్థిక వనరులుగా మలుచుకోవడంతో విజయవంతమైన దేశం. అక్కడి పర్యాటక ప్రాంతాలు ఆర్థికవనరులు.  కోవిద్ 19 వైరస్ కారణం ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగం స్తంభించి పోయింది. అయితే క్యూబాలో పర్యాటకులను అనుమతిస్తున్నారు.  పూర్తి ఆరోగ్య భద్రత చర్యలు తీసుకుంటూ పర్యాటక ప్రాంతాలను సందర్శకుల కోసం సిద్ధం చేస్తున్నారు. 

ఏపీలో ఒక్కరోజే 2,412 కరోనా కేసులు

ఏపీలో కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో ఏకంగా 2,412 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఏపీలో ఒక్కరోజే ఇంత పెద్ద సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం. గడచిన 24 గంటల్లో నమోదైన కేసుల్లో.. ఒక్క గుంటూరు జిల్లాలోనే అత్యధికంగా 468 నమోదు కావడం గమనార్హం. గుంటూరు తర్వాత ఆ స్థాయిలో కర్నూలు జిల్లాలో 403 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్త కేసులతో కలిపి ఏపీలో ఇప్పటికవరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35,451 కి చేరింది. గడచిన 24 గంటల్లో ఏపీలో 44 మంది కరోనా వల్ల మరణించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా మరణాల సంఖ్య 452 కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 16,621 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

కొత్త జిల్లాల ఏర్పాటుకు కమిటీ.. 26 జిల్లాలు ఏర్పాటు చేసే అవకాశం!!

ఏపీ సీఎం వైఎస్ జగన్‌ అధ్యక్షతన వెలగపూడిలోని సచివాలయంలో జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. కేబినెట్‌ భేటీలో పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుకు అధ్యయన కమిటీ ఏర్పాటుపై కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ కమిటీకి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వం వహిస్తారు. వీలైనంత త్వరలో నివేదిక ఇవ్వాలని సీఎం కమిటీని ఆదేశించారు. వచ్చే ఏడాది మార్చి 31వ తేదీలోగా కొత్త జిల్లాల ఏర్పాటును పూర్తి చేయాలని కేబినెట్ నిర్ణయించింది.  పార్లమెంట్‌ నియోజకవర్గం సరిహద్దుగా కొత్త జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. దీంతో ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలు 25 జిల్లాలకు పెరగనున్నాయి. అయితే 26వ జిల్లా ఏర్పాటుకు సంబంధించి కూడా కేబినెట్‌ భేటీలో చర్చకు వచ్చింది. అరకు జిల్లా భౌగోళికంగా ఎక్కువ విస్తీర్ణం కలిగి ఉందని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.. సీఎం జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఈనేపథ్యంలో అరకును రెండు జిల్లాలు చేసేందుకు అధ్యయనం చేయాలని సీఎం అధికారులకు సూచించారు.

సంబంధంలేని విషయాల్లో కాలు, వేలు ఎందుకు పెడతావు బాబు: విజయ్ సాయి రెడ్డి

విజయనగరం సంస్థానానికి సంబంధించిన మాన్సస్ ట్రస్ట్ విషయమై వైసిపి, టీడీపీ మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది. కొద్దీ రోజుల క్రితం వరకు ట్రస్ట్ చైర్మన్ గా మాజీ కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు ఉండగా వైసిపి ప్రభుత్వం అయనను తప్పించి ఆనంద్ గజపతి రాజు కుమార్తె సంచయిత ను చైర్మన్ గా చేసింది. దీంతో అటు టీడీపీ ఇటు వైసిపి నాయకులు మీరు ఆస్తులు దోచేశారంటే కాదు మీరే దోచేశారంటూ విమర్శించుకుంటున్నారు. తాజాగా వైసిపి ఎంపీ విజయ్ సాయి రెడ్డి ఇదే విషయమై నిన్న వైసిపి ప్రభుత్వం పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు ట్విట్టర్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. "విజయనగరం గజపతుల కుటుంబ వ్యవహారాలు, ట్రస్టులో జగన్ ప్రభుత్వం జోక్యం చేసుకోవడం లేదని చెప్పారు. ఇన్నాళ్లు జోక్యం చేసుకుని దోచేసింది నువ్వే " అని చంద్రబాబు పై ఆరోపణలు చేశారు. అంతే కాకుండా "సంబంధం లేని విషయాల్లో కాలు, వేలు పెట్టి ఎందుకు తిట్టించుకుంటావ్ చంద్రబాబూ" అని ప్రశ్నించారు. "సంచైత గజపతుల కుటుంబ సభ్యురాలు కాదా? లేదా మహిళలంటే నీకు చిన్న చూపా?" అని ప్రశ్నించారు. ఇదే సందర్భంలో టీడీపీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనవాసరావుపై కూడా ఆరోపణలు చేశారు. "తుప్పు సైకిళ్ళపై గంటా శీను గణగణా..! 12 కోట్ల కొనుగోళ్ళలో 5 కోట్ల అవినీతి! ఎస్ కే బైక్స్ నుంచి కొనవద్దని బ్లాక్ లిస్టు చేసినా.. బ్లాక్ మనీ కోసం తెగ తొక్కేశాడని ఫిర్యాదుల వెల్లువ..!' అని అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో విద్యార్థులకు సైకిళ్ళు ఇచ్చిన ప్రోగ్రాం లో అవినీతి చోటుచేసుకుందని విరుచుకు పడ్డారు.

తెలంగాణలో కరోనాకు ఉచిత చికిత్స

తెలంగాణలో కరోనా వైరస్ విజ్రుంభిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేటు మెడికల్ కాలేజీలలో క‌రోనా టెస్ట్‌లు, క‌రోనా ట్రీట్‌మెంట్ ఉచితంగా అందించాల‌ని నిర్ణ‌యిం తీసుకుంది. ఇందులో భాగంగా మొదట మూడు ప్రైవేట్‌ మెడిక‌ల్ కాలేజీల‌ను ఎంపిక చేసింది. మొద‌ట మల్లారెడ్డి, మమత, కామినేని మెడికల్ కాలేజీల్లో కరోనా టెస్టులు, క‌రోనా ట్రీట్‌మెంట్ ఉచితంగా అందించ‌నున్నారు. ఆ త‌ర్వాత ఈ సేవ‌ల‌ను మ‌రిన్ని ప్రైవేట్ మెడిక‌ల్ కాలేజీల‌కు విస్త‌రించే అవ‌కాశం ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది.

కరోనా కు చైనా వ్యాక్సిన్ రెడీ.. ముందుగా వారికేనట

ప్రపంచం మొత్తం కరోనా తో విలవిలలాడుతోంది. ఐతే ఈ కరోనా ను ప్రపంచం పైకి వదిలిన చైనా మీద ప్రపంచ దేశాలన్నీ గుర్రుగా ఉన్నాయి. ఇది ఇలా ఉంటే కరోనా కు పుట్టినిల్లైన చైనా లో కరోనా కు వ్యాక్సిన్ సిద్దమైందని వార్తలు వస్తున్నాయి. చైనా డ్రగ్ మేకర్ కాన్సీనో బయోలాజిక్స్ యొక్క Ad5-nCoV వ్యాక్సిన్ ట్రయల్స్ అన్ని పూర్తి చేసుకుని సిద్ధంగా ఉంది. ఐతే ఈ వ్యాక్సిన్ ను ఒక సంవత్సరం పాటు పూర్తిగా తన దేశ సైనికులకు మాత్రమే ఇవ్వాలని చైనా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరో పక్క ప్రపంచం మొత్తం ఎదురు చూస్తున్న మరో వ్యాక్సిన్.. అయిన అమెరికన్ వ్యాక్సిన్ మోడెర్నా మూడో పేజ్ ట్రయల్స్ వాయిదా పడ్డాయి. మొన్న జులై 9న ప్రారంభం కావాల్సిన మూడో దశ ట్రయల్స్ ట్రయల్ ప్రొటొకాల్స్ లో మార్పుల వల్ల వాయిదా పడినట్లుగా తెలుస్తోంది.

బీజేపీలో చేరికపై సచిన్ సంచలన వ్యాఖ్యలు

సచిన్‌ పైలట్‌ ను డిప్యూటీ సీఎం, రాజస్థాన్ పీసీసీ చీఫ్ పదవుల నుంచి తొలగిస్తూ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన బీజేపీలో చేరతారని జోరుగా ప్రచారం సాగుతోంది. మరోవైపు కొందరు బీజేపీ నేతలు కూడా సచిన్‌ పైలట్‌ కు తమ పార్టీ తలపులు తెరిచే ఉన్నాయని వ్యాఖ్యానించారు. కాగా, దీనిపై తాజాగా స్పందించిన సచిన్‌ పైలట్.. తాను బీజేపీలో చేరబోనని స్పష్టం చేశారు. తాను అటువంటి ప్రణాళికలు ఏమీ వేసుకోలేదని తెలిపారు. గత ఆరు నెలలుగా తాను జ్యోతిరాదిత్య సింధియాను కానీ బీజేపీ నేతలను కానీ కలవలేదన్నారు. తాను బీజేపీలో చేరుతున్నానంటూ కొందరు చేస్తోన్న వ్యాఖ్యలు తనను అవమానించడానికేనని సచిన్‌ పైలట్ చెప్పారు. తాను బీజేపీని ఓడించడానికి పని చేశానని, అలాంటప్పుడు ఆ పార్టీలో ఎందుకు చేరతానని ప్రశ్నించారు. తాను ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్లు చెప్పారు. సచిన్‌ పైలట్ వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి. మరోవైపు, సచిన్‌ పైలట్ కొత్త పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది.

భారత్ లో ఒక రోజు అత్యధిక కేసుల రికార్డు

భారత్‌లో కరోనా మహమ్మారి వ్యాప్తి తీవ్రమవుతోంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం ప్రకటించిన వివరాల ప్రకారం నిన్న ఒక్క రోజులో 29,429 మందికి కొత్తగా కరోనా సోకింది. మరో పక్క 582 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 9,36,181కి చేరగా, మృతుల సంఖ్య మొత్తం 24,309కి చేరింది. ప్రస్తుతం 3,19,840 మందికి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటివరకు దేశంలో కరోనా నుండి 5,92,032 మంది కోలుకున్నారు. ఇక మనదేశంలో కరోనా నుంచి కోలుకుంటున్న వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రికవరీ రేటు 63శాతం ఉందని ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ తెలిపింది.

ప్రతి హిందువు భగవద్గీతను చదవాలి

ప్రతి హిందువు భగవద్గీతను చదవాలి.. అహింస, నైతికత తోనే హిందుత్వం.. హిందుత్వం పైనే అన్ని మతాల దాడులు.. ఇంటలెక్చువల్ ఫిట్నెస్ సాధించాలి :మాజీ డీజీపీ అరవిందరావు "అర్చక పురోహితులు లేని గ్రామాలు నేడు మనకు దర్శనమిస్తున్నాయి. ఇది చాలా బాధాకరం. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం కూడా మత మార్పిడి మాఫియా చెలరేగి పోతుంది. సామ, దాన, బేద, దండోపాయాలతో మత మార్పిడి చేస్తున్నారు" అని ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ మాజీ డిజిపి అరవింద్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి హిందువు భగవద్గీతను చదవాలని, ఒకసారి భగవద్గీతను చదివి అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితిలో మతం మారే అవకాశం లేదన్నారు.   హైందవ జీవన విధానాన్ని అణువణువునా వ్యతిరేకిస్తూ కొన్ని శక్తులు భావితరాల మెదళ్ళలో విషం నింపుతున్నాయి అని చెప్పారు. హిందుత్వంలో ఎక్కడ కూడా కులాల మధ్య తారతమ్యాలు కనిపించవని, కానీ ఒక్కటిగా ఉన్న హిందువులను విభజించేందుకు కులాల ప్రస్తావన తీసుకు వచ్చి చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. అదేవిధంగా అవకాశం ఉన్న ప్రతి దగ్గర హిందూ అమ్మాయిలను ప్రేమ పేరుతో మోసం చేసి, వలలో వేసుకొని దారుణాలకు పాల్పడుతున్నారని  ఆవేదన వ్యక్తం చేశారు. అహింస, నైతికత తోనే హిందుత్వం హింస, అనైతికం ఆధారంగా ఇతర మతాలు పనిచేస్తున్నాయని.. అహింస, నైతికత పేరుతోనే హిందుత్వం పనిచేస్తుందని అరవింద రావు చెప్పారు. ఒక మతాన్ని నాశనం చేసి, తమ మతమే గొప్పది అని చెప్పుకునే వాళ్లే దాడులకు తెగబడుతున్నారు అని వివరించారు. శాంతి, అహింస, నీతి, విశ్వాసం అనేవి హిందుత్వానికి మూలాధారాలు అన్నారు. హిందువులలో ఎందరో దేవుళ్ళు ఉన్నా కూడా, అందరినీ సమన్వయపరుస్తూ వారి వారి పద్ధతులతో, ఆరాధిస్తూ పూజించడం గొప్ప విషయమన్నారు. ఇంటలెక్చువల్ ఫిట్నెస్ సాధించాలి ప్రతి హిందువు  భగవద్గీత, రామాయణం తో పాటు చరిత్రను ఇతర విషయాలను తప్పకుండా అవగాహన పరుచుకోవాలి, అందుకు అధ్యయనం తప్పనిసరి అని మాజీ డిజిపి సూచించారు. వ్యక్తికి శారీరక దృఢత్వం ఎంత అవసరమో, అంతకుమించి మానసిక శక్తి.. బుద్ధిబలం కూడా అవసరమేనన్నారు. సమాజంలో జరిగే అన్ని విషయాలపై శ్రద్ధగా అధ్యయనం చేయాలని, తద్వారా ఇంటలెక్చువల్ ఫిట్నెస్ సాధించాలని సూచించారు. యథేచ్ఛగా చరిత్ర వక్రీకరణ నేడు పాఠ్యాంశాల్లో ఔరంగజేబు గొప్పతనం గురించి రాస్తున్నారని, టిప్పు సుల్తాన్ ను కీర్తిస్తూ పాఠ్యాంశాలు ముద్రిస్తున్నారని అరవింద రావు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా 1590 లోనే గోవాలో హిందువులపై ఊచకోత ప్రారంభమైందని, కేరళలో బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయర్ల ను కనుమరుగు చేశారని చెప్పారు. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ  హిందుత్వాన్ని నాశనం చేసేందుకు రక్తపాతం సృష్టించిన చరిత్ర కొన్ని మతాలదని పేర్కొన్నారు. కానీ నేడు వాస్తవాన్ని వక్రీకరించి అదే టిప్పుసుల్తాన్ ను, ఔరంగజేబును కీర్తిస్తూ పాఠ్యాంశాలు రావడం వల్ల భావితరాలు వాస్తవాన్ని తెలుసుకొని లేక పోతున్నాయని పేర్కొన్నారు. కమ్యూనిస్టుల ఎజెండా "ఎడిట్- ప్రాప్ " ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ సాధించలేకపోతే "ఎడిట్ - ప్రప్" సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని అరవింద్ రావు చెప్పారు. ఎడిట్ ప్రాపు అంటే కమ్యూనిస్టులు అవలంబించే సిద్ధాంతమని.. ఒక విషయాన్ని శ్రద్ధగా చదివి  దానిపై అవగాహన పెంచుకోవడం. అదేవిధంగా వాస్తవాన్ని అవాస్తవంగా ప్రాపగాండా చేయడం కమ్యూనిస్టుల ముఖ్యలక్షణం అని చెప్పారు.(Education & Propaganda). భవిష్యత్తులో హిందుత్వంపై విపరీతమైన దాడులు జరిగే ప్రమాదం పొంచి ఉందని, అందుకు దాడులను ఎదుర్కొని నిలబడే శక్తి సామర్థ్యాలు హిందూ సమాజం సంపాదించాలని ఆయన కోరారు.

వెన‌క్కి త‌గ్గిన ట్రంప్ సర్కార్

ఆన్ లైన్ క్లాసులను ఎంచుకున్న విదేశీ విద్యార్థులు అమెరికాని విడిచి స్వదేశాలకు వెళ్లిపోవాల్సిందేనంటూ ఇటీవల ట్రంప్ సర్కార్ వివాదాస్పద నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే, యూనివర్శిటీలు, టెక్నాలజీ దిగ్గజాలు తీసుకువచ్చిన ఒత్తిడి, పెట్టిన కేసులతో ట్రంప్ సర్కార్ దిగి వచ్చింది. అకాడమిక్ కోర్సులను పూర్తిగా ఆన్‌లైన్‌లో అభ్యసిస్తున్న విదేశీ విద్యార్థుల వీసాలన్నింటినీ రద్దు చేయాలని ట్రంప్ సర్కారు నిర్ణ‌యం తీసుకుంది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకించిన హార్వార్డ్, మసాచుసెట్స్ ఆఫ్ టెక్నాలజీస్, ఐటీ సంస్థలైన గూగుల్, ఫేస్ బుక్, మైక్రోసాఫ్ట్, అలాగే 18 రాష్ట్రాలకు చెందిన అటార్నీ జనరల్స్ కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కోర్టు జోక్యంతో వీసాల రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటూ.. గ‌తంలో రద్దు చేస్తున్నట్లు జారీ చేసిన ఆదేశాలను ఉపసంహరించుకుంది అమెరికా ఇమ్మిగ్రేషన్ విభాగం. ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ఫెడరల్ న్యాయమూర్తి అల్లీసన్ బురోగ్స్ వెల్లడించారు.

కరోనా హాస్పిటల్ లో 101 వ బర్త్ డే జరుపుకున్న పెద్దాయన.. 

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విలయతాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లో కూడా రోజురోజుకు కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఐతే వైద్య నిపుణుల సమాచారం ప్రకారం 60 ఏళ్ల పై బడిన వృద్ధుల కు కరోనా సోకితే కోలుకోవడం కొంతవరకు కష్టం. ఐతే తాజాగా మహారాష్ట్ర లోని ముంబై లో వంద సంవత్సరాల పెద్దాయన కరోనా పై విజయం సాధించడమే కాకుండా తన 101వ జన్మదినాన్ని తనకు చికిత్స చేస్తున్న అదే హాస్పిటల్ లో జరుపుకున్నారు. ముంబైకి చెందిన 100 సంవత్సరాల వయసున్న రిటైర్డ్ ప్రభుత్వ పాఠశాల హెడ్ మాస్టర్ అర్జున్ గోవింద్ నారింగ్రేకర్ కొద్దీ రోజుల క్రితం కరోనా బారిన పడ్డారు. జ్వరం, దగ్గు లక్షణాలు కనిపించడంతో పరీక్షలు చేయగా జులై 1న కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో ఆయన ముంబైలోని బాలాసాహెబ్ థాక్రే ట్రామా కేర్ హాస్పిటల్ లో చేరారు. 12 రోజుల చికిత్స తర్వాత అయన పూర్తిగా కోలుకున్నారు. అంతే కాకుండా బుధవారం ఆయన పుట్టిన రోజు అని అయన కుటుంబ సభ్యులు తెలపడంతో అక్కడి వైద్యులు, సిబ్బంది ఎంతో ఉత్సాహంతో ఒక చాకొలేట్ కేక్ తెప్పించి నారింగ్రేకర్‌తో కట్ చేయించి ఆయనకు తినిపించారు. ఇలా అయన తన 101వ జన్మదినాన్ని తనను కాపాడిన హాస్పిటల్ లోనే జరుపుకుని తరువాత నిన్ననే డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం హాస్పిటల్ లో జరిగిన అయన బర్త్ డే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

జీ బ్లాక్ కింద నిజాం ఖజానా.. కేసీఆర్ ఆ 11 రోజులు ఎక్కడికి పోయారు?

సీఎం కేసీఆర్ 11 రోజులు కనిపించకుండా పోవడంపై అనుమానాలు ఉన్నాయని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. జూన్ 29న సచివాలయాన్ని కూల్చొద్దని తాము కోర్టుకు వెళ్లామని, అయితే ప్రభుత్వ క్యాబినెట్ నిర్ణయాలపై తాము జోక్యం చేసుకోలేమంటూ హైకోర్టు తీర్పునిచ్చిందని పేర్కొన్నారు. ఆ రోజు నుంచి కేసీఆర్ కనిపించకుండా పోయారని, మళ్లీ జులై 10న సచివాలయం కూల్చివేతపై హైకోర్టు స్టే ఇవ్వగా.. ఆ మరుసటి రోజే కేసీఆర్ ప్రత్యక్షమయ్యారని రేవంత్ చెప్పుకొచ్చారు. ఈ 11 రోజులు కేసీఆర్ ఎక్కడికి పోయారో చెప్పాలని ప్రశ్నించారు. దీనిపై తమకు అనుమానాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి అన్నారు.  ఇక సచివాలయం చుట్టూ 3 కిలోమీటర్లు రాకపోకలు బంద్ చేసి కూల్చివేతలు చేశారని రేవంత్ రెడ్డి అన్నారు. దీనిపై అనుమానం రావడంతో ఎంక్వైరీ చేయగా.. నిధి అన్వేషణ జరుగుతుందనే విషయాలు తెలిశాయన్నారు. జీ బ్లాక్ కింద నిజాం ఖజానా ఉందనే వార్తలను గతంలో పత్రికలు ప్రచురించాయని, అక్కడ అన్వేషణ కోసం అవకాశం ఇవ్వాలని గతంలో పురావస్తు శాఖ జీహెచ్ఎంసీకి లేఖ కూడా రాసిందని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు అక్కడే తవ్వకాలు జరపడంపై అనేక అనుమానాలు ఉన్నాయని తెలిపారు. మంచి కార్యక్రమాలు ఎప్పుడైనా పగలే చేస్తారని, గుప్త నిధుల తవ్వకాలు మాత్రమే అర్థరాత్రి చేస్తారని ఆరోపించారు. కూల్చివేతకు ముందు జి బ్లాక్ కింద పురావస్తు శాఖ చేత పరిశోధన జరిపించాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హైకోర్టు దీన్ని సుమోటోగా స్వీకరించి ఒక కమిటీ వేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.

కుయ్ కుయ్ అన్నారు.. అవి కుయ్యో మొర్రో అంటున్నాయి

ఇటీవల 108 వాహనాలను ఏపీ సీఎం వైఎస్ జగన్ ఘనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే ఇవి సరైన సమయానికి రావడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని వాహనాలు మొరాయిస్తున్నాయి అంటూ రోడ్డుపై ఆగిపోయిన 108 వాహనాల ఫోటోలు సైతం సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ 108 వాహనాల వ్యవహారంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన టీడీపీ నేత నారా లోకేష్ వైసీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. "కుయ్,కుయ్,కుయ్ అన్నారు. కానీ అవి కుయ్యో,మొర్రో అంటున్నాయి.కాల్ చెయ్యగానే 108 ఎక్కడ వైఎస్ జగన్ గారు. స్కామ్ కోసం అనుభవం లేని సంస్థని రంగంలోకి తీసుకొస్తే ఇలాంటి దారుణాలే జరుగుతాయి." అని లోకేష్ విమర్శించారు. "అనంతపురం జిల్లా ఓబులదేవర చెరువు సమీపంలో హెడ్ మాస్టర్ నారాయణ స్వామి అస్వస్థత కి గురై నడి రోడ్డుపై పడిపోయారు. స్థానికులు 108 కి కాల్ చేసినా అంబులెన్స్ రాక ప్రైవేట్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు. జగన్ రెడ్డి గారికి ప్రచార ఆర్బాటం పై ఉన్న శ్రద్ద ప్రజల ప్రాణాల పట్ల లేకపోవడం దారుణం." అంటూ లోకేష్ మండిపడ్డారు.

ఆర్వో ప్యూరిఫైయర్లను బ్యాన్ చేయండి.. ఎన్ జి టి కీలక ఆదేశాలు

మనం బయటికి ఎక్కడికి వెళ్లినా ముందుగా వెదికేది ఆర్వో ప్యూరిఫైడ్ మినరల్ వాటర్ కోసమే. ఐతే తాజాగా జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్ జి టి) ఆర్వో ప్యూరిఫైయర్లను ఈ సంవత్సరం చివరిలోగా పూర్తిగా బ్యాన్ చేసేలా నోటీసులు ఇవ్వాలని కేంద్ర పర్యావరణ మరియు అటవీ శాఖను మంగళవారం ఆదేశించింది. దీనికి కారణం మనం తాగే లీటర్ నీటిలో టోటల్ డిజాల్వాడ్ సాలీడ్స్ (TDS) 500 మిల్లీగ్రాముల కంటే తక్కువ ఉండకూడదు. ఐతే ఆర్వో ప్యూరిఫైయర్లు నీటిలో సహజంగా ఉన్న ఖనిజాల్ని పూర్తిగా తీసి వేసి మళ్లీ ఖనిజాల్ని కలుపుతున్నాయనీ ఐతే దీని వల్ల ప్రజలకు నీటి ద్వారా దక్కాల్సిన సహజమైన ఖనిజాలు దక్కట్లేదని ఎన్ జి టి  అభ్యంతరం తెలిపింది. ఆర్వో ప్యూరిఫైయర్ల పనితీరును ముందుగా ఒక నిపుణుల కమిటీ పరిశీలించింది. అవి నిబంధనల ప్రకారం లేవనీ, వాటి ద్వారా ప్యూరిఫై అయిన నీటిలో మినరల్స్ ఉండట్లేదని ఆ బృందం తేల్చింది. దీంతో మినరల్స్ లేని నీటిని తాగితే ప్రజలు అనారోగ్యాల బారిన పడతారని ఆ కమిటీ స్పష్టం చేసింది. ఒక లీటర్ నీటిలో TDS 500 మిల్లి గ్రాముల కంటే తక్కువ ఉండకూడదని కూడా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు ఎన్ జి టి కేంద్రానికి డిసెంబర్ 31 వరకూ టైమ్ ఇవ్వడంతో అప్పటిలోగా ఆర్వో ప్యూరిఫైయర్ల పై బ్యాన్ అమల్లోకి తేవాల్సి ఉంటుంది.

కరోనా కు వ్యాక్సిన్ రెడీ.. కానీ డబ్ల్యూహెచ్ఓ నే అడ్డు..!

కరోనా వైరస్ మొత్తం ప్రపంచాన్ని కుదిపేస్తోంది. కరోనా పాజిటివ్ కేసులతో పాటు మరణాలు కూడా రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో రష్యా నుండి ఒక చల్లని వార్త అందింది. రష్యాలోని సెచెనోవ్ యూనివర్శిటీ కరోనా వ్యాక్సిన్ సిద్ధం చేసిందని దాని పై క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని ఆ వార్త సారాంశం. ఆ వ్యాక్సిన్ ప్రభుత్వ అజమాయిషీలోని గమలాయి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియోలజీ అండ్ మైక్రోబయాలజీలో తయారవుతోంది. ప్రపంచంలోనే మొట్టమొదటిదైన ఈ కరోనా వ్యాక్సిన్‌ను ఈ ఆగస్ట్ మధ్య నాటికి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి. ఐతే ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చి పడింది. ఒక కొత్త మందును విడుదల చేయాలంటే దానికి కావాల్సిన ముఖ్య పదార్ధాలు సమకూర్చుకుంటే సరిపోతుంది. కానీ అదే ఒక కొత్త వ్యాక్సిన్ ఐతే అందులో అటు సూక్ష్మ క్రిములు కానీ వాటి జన్యువులు కానీ ఉంటాయి. ఐతే అవి స్వయంగా ఉత్పత్తి కావడానికి ఒక ప్రత్యేక వాతావరణం తో పాటు కొంత సమయం కూడా అవసరమే. దీంతో ఒక పక్క వ్యాక్సిన్ తో క్లినికల్ ట్రయల్స్ చేస్తూనే మరో పక్క దీని ఉత్పత్తి పైన దృష్టి పెట్టారు. ఐతే ఇప్పటివరకూ తమ పరిశోధనలో తాము రెడీ చేసిన వ్యాక్సిన్ చాలా సేఫ్‌ అని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవనీ గమలాయి ఇన్‌స్టిట్యూట్ డైరెక్టర్ అలెగ్జాండర్ గింట్స్‌బర్గ్ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ను ఆగస్ట్ 12 నుంచి 14 మధ్య తొలి వ్యాక్సిన్ ప్రజల చేతిలోకి వెళ్తుందనే అయన కాన్ఫిడెంట్ గా తెలిపారు ఐతే ప్రపంచ ఆరోగ్య సంస్థ రూల్స్ ప్రకారం ఏ వ్యాక్సిన్‌కైనా మూడు దశల్లో ట్రయల్స్ జరపవలసి ఉంటుంది. కానీ రష్యా శాస్త్రవేత్తలు ఒక దశ ట్రయల్స్ మాత్రమే చేశారని డబ్ల్యూహెచ్ఓ అంటోంది. ప్రపంచం మొత్తం వాడే వ్యాక్సిన్‌కి కనీసం మూడుసార్లైనా ట్రయల్స్ జరపకపోతే ఎలా అని ఈ వ్యాక్సిన్ కు అభ్యంతరం చెబుతోంది. సెచెనోవ్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు మాత్రం 18 నుండి 65 ఏళ్ల మధ్య వయసు వారిని 28 రోజులపాటూ ఐసోలేషన్‌లో ఉంచి ఇప్పటికే రెండు ట్రయల్స్ జరిపామంటున్నారు. ఈ వాలంటీర్లను జులై 15, జులై 20న డిశ్చార్ చేస్తున్నట్లుగా ప్రకటించింది. అంతే కాకుండా వారిని ఆ తర్వాత కూడా మరో 6 నెలల పాటు పరిశీలిస్తామని తెలియ చేసింది. ఏది ఏమైనా ఒక వేళ డబ్ల్యూహెచ్ఓ కనుక ఆమోదించకపోతే మాత్రం ఆగస్టులో వ్యాక్సిన్ వచ్చే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.