బంగ్లాతో సిరీస్.. తొలి టెస్ట్ లో టీమ్ ఇండియా విన్
posted on Dec 19, 2022 6:15AM
బంగ్లాదేశ్తో జరిగిన తొలి టెస్టులో టీమ్ ఇండియా 188 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 324 పరుగులకు ఆలౌటైంది. దీంతో రెండు టెస్టుల సిరీస్లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది. ఆఖరి రోజైనా ఆదివారం ఓవర్ నైట్ స్కోరు 272/6 తో రెండో ఇన్నింగ్స్ను కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 52 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది.
అక్షర్ పటేల్ నాలుగు, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా ఉమేశ్ యాదవ్, సిరాజ్, అశ్విన్ తలో వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో పుజారా 90, శ్రేయస్ అయ్యర్ 86 పరుగులతో రాణించడంతో 404 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ఆరంభించిన బంగ్లా 150 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్కు 254 పరుగుల ఆధిక్యం లభించింది.
బంగ్లాను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కెప్టెన్ రాహుల్ మరోసారి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు. రెండు ఇన్నింగ్స్ లో శుభ్మన్(110), పుజారా(102 నాటౌట్) శతకాలు బాదారు. భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను 258/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది.
అయితే బంగ్లా 324 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఈ మ్యాచ్ లో రెండు ఇన్నింగ్స్ లో కలిపి కల్దీప్ యాదవ్ ఎనిమిది వికెట్లు తీశాడు. ఇరు జట్ల మధ్య రెండో, చివరి టెస్టు డిసెంబర్ 22 నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు.