వివాదాస్పదమౌతున్న బీఆర్ఎస్ ఫేస్ బుక్

హైదరాబాద్ సున్నితమైన ప్రాంతం. ప్రపంచంలో ఎక్కడ మతకలహాలు జరిగినా దాని ప్రభావం హైదరాబాద్ నగరంపై పడుతుంది. భారతీయ జనతాపార్టీ, సంఘ్ పరివార్ హైదరాబాద్ ను భాగ్యనగరం అని సంభోధిస్తుంటాయి. సెక్యులర్ పార్టీలు, సెక్యులర్ వాదులు హైదరాబాద్ ను భాగ్యనగరం అని పిలవడాన్ని ఖండిస్తున్నారు. అయితే ప్ర స్తుతం   భారతీయ జనతా పార్టీ సరసన బీఆర్ ఎస్ చేరినట్టే కనబడుతుంది. హిందూ వోటర్లను ఆకర్షించడానికి బీఆర్ఎస్ హైద్రాబాద్ ను తమ ఫేస్ బుక్ లో  భాగ్యనగరం అని రాసుకొచ్చింది. మజ్లి స్ పార్టీతో చెట్ట పట్టాల్ వేసుకుని తిరిగే బీఆర్ఎస్ భాగ్యనగరం అనే పల్లవి ఎత్తుకోవడాన్ని చాలామంది నిరసిస్తున్నారు. మజ్లిస్  బచావో తహరీక్ నేత అమ్జదుల్లా ఖాన్ ఈ అంశాన్ని తెరమీదకు తెచ్చారు. బీజేపీ బాటలో బీఆర్ఎస్ వెళుతుందని దుయ్యబట్టారు.హిందూ వోటర్లను ఆకర్షించడానికి ఈ విధంగా ప్రచారం చేస్తుందన్నారు.  బీఆర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్బంగా బీఆర్ఎస్ తన సోషల్ మీడియా అకౌంట్లో హైదరాబాద్ ను భాగ్యనగరం అని సంభోధించడం విడ్డూరమన్నారు. హైదరాబాద్ ను భాగ్యనగరం అని చరిత్ర పుటల్లో కూడా లేదని లౌకికవాదులు చెబుతున్నారు. 

వివేకా హత్య కేసు దర్యాప్తు.. తదుపరి అరెస్టు అవినాష్ దేనా?

మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ముందు ముందు మరిన్ని అరెస్టులు తప్పవని తెలుస్తోంది. ఈ కేసులో సీబీఐ శుక్రవారం (ఏప్రిల్ 14) అరెస్టు చేసిన గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టును సీబీఐ శనివారం (ఏప్రిల్ 15)  కోర్టుకు సమర్పించింది. ఆ రిమాండ్ రిపోర్టులో కూడా వైసీపీ ఎంపీ  ఎంపీ అవినాశ్ రెడ్డి పేరును ప్రస్తావించింది. వివేకా హత్య విషయం ఉదయ్ కుమార్ రెడ్డికి ముందే తెలుసని సీబీఐ పేర్కొంది. హత్య   అనంతరం వేకువ జామున ఆయన ఎంపీ అవినాశ్ రెడ్డి నివాసంలో ఉన్నారని పేర్కొంది. దీనికి సంబంధించి లొకేషన్ వివరాలను బయటపెట్టింది. హత్య విషయం తెలిసిన నిముషాల వ్యవధిలో ఉదయ్ కుమార్ రెడ్డి, ఎంపీ అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివ శంకర్ రెడ్డి ఘటనా స్థలానికి చేరుకున్నారని సీబీఐ పూర్కొంది. ఈ నలుగురికి సంబంధించిన గూగుల్ టేక్ అవుట్ ద్వారా సేకరించిన లొకేషన్ వివరాలను రిమాండ్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది.  నలుగురూ కలిసి హత్యా స్థలంలో సాక్ష్యాధారాలను మాయం చేసేయత్నం చేశారనీ, . అలాగే వివేకా గుండెపోటుతో మరణించినట్లు నమ్మించే ప్రయత్నం చేశారని సీబీఐ ఆ నివేదికలో పేర్కొంది. వివేకా హత్య కేసులో ఉదయ్ కుమార్ రెడ్డి ప్రమేయానికి సంబంధించిన అన్ని సైంటిఫిక్ ఆధారాలను సేకరించాకే ఆయనను అరెస్టు చేసినట్లు సీబీఐ కోర్టుకు తెలిపింది. ఉదయ్ కుమార్ రెడ్డి పరారి అవుతాడన్న అనుమానంతోనే అరెస్టు చేశామని తెలిపింది. ఇక ఉదయ్ కుమార్ రెడ్డి విచారణకు సహకరించడం లేదనీ హత్య జరిగిన అనంతరం ఆయన లొకేషన్ వివరాలను ముందు పెట్టి ప్రశ్నించినా ఉదయ్ కుమార్ రెడ్డి నోరు మెదపడంలేదనీ పేర్కొంది. వివేకా హత్య కేసుకు సంబంధించి త్వరలోనే మరి కొందరు కీలక వ్యక్తులను అరెస్టు చేయనున్నట్లు సీబీఐ కోర్టులు నివేదించింది.  దీంతో తరువాత అరెస్టు ఎవరు అన్న చర్చ జోరందుకుంది. సీబీఐ ప్రకటించిన వివరాల ప్రకారం.. ఇహనో ఇప్పుడో అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేసే అవకాశాలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయని న్యాయ నిపుణులు అంటున్నారు. ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో సీబీఐ వెల్లడించిన వివరాలు స్పష్టంగా, సూటిగా హత్య జరిగిన తరువాత ఎవరెవరు ఏం చేశారన్నది వివరంగా ఉండటంతో వివేకా హత్య కేసులో తదుపరి అరెస్టు అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలేనని పలువురు అంటున్నారు. గతంలో కూడా సీబీఐ హైకోర్టుకు అవినాష్ రెడ్డిని అరెస్టు చేయనున్నట్లు తెలిపిన సంగతిని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అయితే అనూహ్య పరిణామాలతో సీబీఐ విచారణాధికార మారడంతో సీబీఐ దర్యాప్తు ఒకింత మందగించినట్లు అనిపించింది. ఇంతలోనే ఉరుములేని పిడుగులా ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేయడంతో ఇప్పుడు అందరి దృష్టీ అవినాష్ అరెస్టు ఎప్పుడున్న దానిపై కేంద్రీకృతమై ఉంది. ఉదయ్ కుమార్ రిమాండ్ రిపోర్టులో సీబీఐ వివేకా హత్య తదననంతరం అవినాష్ రెడ్డి ఘటనాస్థలానికి చేరుకుని సాక్ష్యాల మాయంకు ప్రయత్నించారని పేర్కొనడంతో ఆయన అరెస్టు కూడా అనివార్యమని భావిస్తున్నారు. 

తెలంగాణ రాజకీయాల్లో ఎవరిది పైచేయి ?

తెలంగాణ రాజకీయాలలో ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీదే టాప్ పొజిషన్. ఫస్ట్ ప్లేస్. అందులో అనుమానం లేదు.  అయితే, ముందున్న తిరుగులేని ఆధిక్యత అయితే ఇప్పుడు లేదు. అది కూడా అంతే నిజం. మూడు ప్రధాన పార్టీలలో బీఆర్ఎస్ కు కొంత ఎడ్జి మాత్రమే ఉందని పరిశీలకులు అంటున్నారు. అంతే కాదు ఇదే పరిస్థితి, అసెంబ్లీ ఎన్నికల వరకు కొనసాగుతుందా, అంటే, అవునని చెప్పడం సాహసమే అవుతుందని పరిశీలకులు అంటున్నారు. రానున్న ఐదారు నెలల కాలంలో రాష్ట్రంలో దేశంలో చోటుచేసుకునే పరిణామాలు రాష్ట్ర రాజకీయాలపై ఎంతో కొంత ప్రభావం  తప్పక చూపుతాయనీ, ఆ ప్రభావంతో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారిపోయినా ఆశ్చర్య పోనవసరం లేదనీ,  మారుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.అందుకే, ఈ ఐదారు నెలల కాలమే కీలకమని అంటున్నారు.   నిజానికి, 2018 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితితో పోల్చుకుంటే, అధికార బీఆర్ఎస్ అంత పటిష్టంగా లేదు. ఒక్క ఆర్థిక పరిస్థితి మినహా ఎన్నికల విజయానికి అవసరమైన మరే ఇతర ఫాక్టర్ లోనూ బీఆర్ఎస్ ముందున్నంత పటిష్టంగా లేదు.  2014, 2018 ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పటి టీఆర్ఎస్)కు కలిసొచ్చిన సెంటిమెంట్, ఇప్పుడు  ఇసుమంతైనా లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే, బీఆర్ఎస్ గా పేరు మార్చుకుని, జాతీయ రాజకీయాల్లో ప్రవేశం కోసం బీఆర్ఎస్ నాయకత్వం చేస్తున్న ప్రయత్నాలు తెలంగాణ సెంటిమెంట్ బీఆరేస్ వ్యతిరేక సెంటిమెంట్ గా మారుతోందని అంటున్నారు.  అలాగే ప్రభుత్వ వ్యతిరేకత విషయాన్నే తీసుకుంటే 2018లో ఫిఫ్టీ 50 పర్సెంట్ కంటే తక్కువ ఉన్న ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పడు, ఫిఫ్టీ పెర్సెంట్ గీత దాటేసిందని  అంటున్నారు. మరోవంక పార్టీలో పైకి కనిపించే విభేదాలు కొన్నయితే, కనిపించని విభేదాలు అనేకం ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే ఆత్మీయ సమ్మేళనాలు, ఇతరత్రా అనేక రూపాల్లో వ్యక్తమవుతున్న విభేదాలు ఎన్నికల సమయానికి ఒక్కొక్కటికీ బయటకు వచ్చి భగ్గుమన్నా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు. నిజానికి, పార్టీ అంతర్గత విభేదాలు ఎన్నికల సమయానికి పార్టీ నాయకత్వానికి సవాలుగా మారే సంకేతాలు ఇప్పటికే కనిపిస్తున్నాయని పార్టీ అంతర్గత వ్యవహరాల పై అవగాహన ఉన్న పార్టీ పెద్దలు చెపుతున్న మాటగా ప్రచారం జరుగుతోంది.  ముఖ్యంగా  ఢిల్లీ లిక్కర్ కుంభకోణం, టీఎస్పీఎస్సీ ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహరంలో కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో అనే భయం బీఆర్ఎస్ నాయకులూ వ్యక్త పరుస్తున్నారు. మరో వంక సస్పెన్షన్ కు తిరుగుబాటు వంటి అనేక పరిణామాలు బీఆర్ఎస్ నాయకత్వాన్ని కలవరపాటుకు గురి చేస్తున్నాయని అంటున్నారు. నిజానికి  ఇప్పుడు రాష్ట్రంలో మాజీ ఎంపీ పొంగులేటి, మాజీ మంత్రి జూపల్లి కృష్ణా రావు ఎటు వెళతారు, ఏ పార్టీలో చేరతారు అనే విషయం చుట్టూనే తిరుగుతున్నా, ఆ ఇద్దరే కాకుండా  అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు సహా కొందరు కీలక నేతలు పార్టీ మారే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా నిన్న మొన్న కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి మొదలు అనేక మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ ను ఎదుర్కోవడం ఒక్క బీజేపీకి మాత్రమే సాధ్యమని బావిస్తున్న నేపధ్యంలో మరి కొందరు కాంగ్రెస్ నాయకులు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్దమవుతున్నారని తెలుస్తోంది.అదే జరిగితే, బీఆర్ఎస్’ హ్యాట్రిక్’ అనుమానమే అంటున్నారు.

నూర్ జహాన్ ఆరోగ్యం విషమం

  పాకిస్థాన్ కు చెందిన నూర్ జహాన్  అనే ఏనుగు ప్రాణాపాయ స్థితిలో కొట్టు మిట్టాడుతుంది. కరాచీ జూపార్క్ లో ఉన్న ఈ ఏనుగు అక్కడి ఒక లోతైన గుంటలో పడిపోయింది. దీంతో దాని ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. గుంటలో పడిపోయిన ఏనుగును క్రేన్ సాయంతో వెలికి తీశారు. కానీ అప్పటి నుంచి నూర్ జహాన్ లేవలేకపోయింది. గ్లూకోజ్ బాటిల్ ను ఎక్కిస్తున్నారు. నూర్ జహాన్ అప్పటి నుంచి ఏడుస్తూనే ఉంది. అది తన బాధను చెప్పుకోలేకపోతుంది. అప్పుడప్పుడు చెవులు విదిలిస్తుంది. నూర్ జహాన్ తన కాళ్ల మీద తాను నిలబడే ప్రయత్నం చేస్తున్నారు డాక్టర్లు. నూర్ జహాన్ లేవలేకపోతే మరణం సంభవించవచ్చని డాక్టర్లు ఆవేదన చెందుతున్నారు. పాకిస్థాన్ కు చెందిన ఈ ఏనుగును వెలిలి తీయడానికి ఇంటర్ నేషనల్ వెల్పేర్ ఆర్గనైజేషన్ మద్దత్తు తీసుకుంటున్నారు. నూర్ జహాన్ ఆరోగ్యం మీద అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.

వెంట్రుక వాసిలో తప్పించుకున్న జపాన్ ప్రధాని

జపాన్ ప్రధానమంత్రి పుమియా కిషిదా మీద స్మోక్ బాంబ్ దాడి జరిగింది. ఆయన ఒక బహిరంగ సభలో ప్రసంగిస్తుండగా ఈ దాడి జరిగింది. ఈ దాడికి పాల్పడిన వ్యక్తి పోలీసులు అప్పటికప్పుడు అదుపులోకి తీసుకున్నారు. జపాన్ టైమ్స్ కథనం ప్రకారం వాకయామా నగరంలో ప్రధానమంత్రి పుమియో కిషిదా తన ప్రసంగాన్ని ప్రారంభిస్తున్న సమయంలో స్మోక్ బాంబు పేలింది. స్మోక్ బాంబును దూరం నుంచి ఓ వ్యక్తి విసిరేసాడు. దీంతో అక్కడ పొగలు కమ్ముకున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలో దట్టమైన పొగలు కమ్ముకున్నట్లు కనబడుతుంది. ప్రధానమంత్రి వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. అధికారంలో వున్న లెబరల్ డెమాక్రటిక్ పార్టీ అభ్యర్థి తరపున ప్రధాని ప్రచారం చేయడానికి వచ్చారు.  జపాన్ ప్రధానమంత్రి మీద దాడి జరగడం పలువురిని విస్మరించింది. భధ్రతా బలగాలు కూడా ఊహించని విధంగా  ఈ దాడి జరిగింది. కొద్ది రోజుల్లో జపాన్ దేశంలో జీ 7 సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ దాడి జరగడం జపాన్ ప్రధానికి సవాల్ విసిరినట్టయ్యింది.   

బిజేపీని ఓడించాలంటే ప్రతి పక్షాలు ఐక్యమవ్వాలి: ఓవైసీ

ప్రతి పక్ష పార్టీలు బిజేపీ సిద్దాంతాలతో రాజీ పడటం వల్లే ముస్లింల మీద దాడులు పెరిగిపోతున్నాయని మజ్లిస్ పార్టీ ప్రెసిడెంట్ ఆరోపించారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అజీజా మదర్సాకు వెళ్లకపోవడం విచారకరమన్నారు. 4,500 మనుస్క్రిప్ట్ లు ఇదే మదర్సాలో తగలపడ్డాయన్నారు. ఇందులో ఖురాన్ కూడా ఉందని ఆయన మండిపడ్డారు. ముస్లింపిల్లలు దేశంలో నిరక్షరాస్యతకు గురవుతున్నారని, ముస్లిం జనాభా వున్న ప్రాంతాల్లో స్కూల్ జోన్స్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ముస్లింలు వున్న ప్రాంతాల్లో స్కూల్స్ తెరవడం లేదని, ఫలితంగా ముస్లిం పిల్లలు మదర్సాలలో విద్య నభ్యసిస్తున్నారని అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించడం బడుగు, బలహీన వర్గాలకు పాజిటివ్ సంకేతం ఇవ్వడమేనన్నారు. రాజ్యాంగంలో ఈ వర్గాలకు పెద్ద పీటవేసిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ ముదావహమన్నారు. బీజేపీ సిద్దాంతాలను అపోజిషన్ పార్టీలు ముక్త కంఠంతో నినదించాలని, అప్పుడే 2024 ఎన్నికల్లో ఆ పార్టీని అధికారంలో రాదు అని ఆయన అభిప్రాయపడ్డారు. మోడీ ప్రభుత్వం అందరికీ విద్యాహక్కు చట్టం అమలు చేయడంలో విస్మరించిందన్నారు. యుపీఏ ప్రభుత్వం హాయంలో ప్రీ మెట్రిక్ స్కాలర్ షిప్ వచ్చేదని మోడీ అధికారంలో వున్న 8 ఏళ్లలో ఈ స్కాలర్ షిప్ విస్మరించిందన్నారు. హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఓవైసీ బిజేపీ ప్రభుత్వ పనితీరును తూర్పారబట్టారు. మజ్లిస్ పార్టీ దేశవ్యాప్తంగా బిజేపీయేతర పార్టీలతో జతకడుతున్నారు. తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తున్న ఓవైసీ కాంగ్రేస్ లేదా బీజేపీయేతర పార్టీలను అధికారంలో తీసుకురావడానికి ఇప్పటికే దేశ వ్యాప్త ప్రచారాన్ని మొదలెట్టారు. బీజేపీని ఓడించడమే పరిష్కారమన్నారు. బీజేపీ సిద్దాంతాలతో అపోజిషన్ పార్టీలు రాజీ పడుతున్నాయన్నారు.

అమ్మ ఇంటికే రాహుల్.. ఇక అక్కడే మకాం

కాంగ్రెస్  మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ,  తుగ్లక్ లేన్‌-12లోని తన అధికార నివాసం ఖాళీ చేసి,  తల్లి సోనియా గాంధీ అధికార నివాసం 10 జనపథ్ కు మకాం మార్చేస్తున్నారు. 2004లో రాహుల్ గాంధీ తొలిసారిగా, అమేథీ నుంచి లోక్ సభకు ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఎంపీగా ఆయనకు ప్రభుత్వం కేటాయించిన తుగ్లక్ లేన్‌-12బంగ్లాలోనే ఉంటున్నారు. అయితే ఇటీవల, ఆయన పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన నేపధ్యంలో, ఆయన అధికార నివాసం ఖాళీ చేయక తప్పని పరిస్థితి తలెత్తింది. దీంతో రాహుల్ గాంధీ తన సామాన్లను 10 జనపథ్’కు షిఫ్ట్ చేశారు. ఇహనో ఇప్పుుడో  ఆయన కూడా షిఫ్ట్ అవుతారు. ఇక నుంచి ఆయన తన తల్లి వద్దే ఉంటారు.  మరోవంక రాహుల్ గాంధీ 2019లో ఎన్నికల ర్యాలీలో చేసిన దొంగలందరికీ మోడీ అనే సాధారణ ఇంటిపేరు ఎలా వచ్చింది  అన్నందుకు ఆయన్ని దోషిగా నిర్ధారిస్తూ మార్చి 23న సూరత్‌లోని మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఈ నేపథ్యంలో అమలులో ఉన్న  నిబంధనల ప్రకారం  పార్లమెంటు సెక్రటెరియట్ రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసింది. మరో వంక ఈ తీర్పుపై స్టే విధించాలని కోరుతూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టులో అప్పీల్ చేశారు. అయితే,   కేసును విచారించిన న్యాయస్థానం తుది తీర్పును ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.   మరోవంక  రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వం రద్దయిన నేపధ్యంలో ఏప్రిల్ 22లోగా అధికార నివాసాన్ని  ఖాళీ చేయాలని లోక్‌సభ సెక్రటేరియట్   ఆయనకు మార్చి 27న నోటీసులు పంపింది. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీ అధికార నివాసాన్ని ఖాళీ చేసి సోనియా నివాసానికి మారారు. అయితే రాహుల్ గాంధీకి ఇప్పడు  ఖాళీ చేస్తున్న బంగ్లాతో సుదీర్ఘ అనుబంధం వుంది.   2004 ఎన్నికల్లో రాహుల్‌ గాంధీ తొలిసారిగా అమెథీ నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. వరసగా మరో రెండు మార్లు అదే నియోజక వర్గం నుంచి గెలిచారు.  2019 ఎన్నికల్లో మాత్రం, అమేధీతో పాటుగా కేరళలోని వాయనాడ్ లోక్ సభ స్థానం నుంచి కూడా పోటీ చేసిన రాహుల్ గాంధీ అమేధీలో ఓడి పోయినా, వాయనాడ్ లో గెలిచి వరసగా నాల్గవ పర్యాయం  (ఎంపీగా  అనర్హత వేటు పడేంత వరకు) ఎంపీ కొనసారు.   అంటే ఇంచుమించుగా 18 సంవత్సరాలకు పైగా రాహుల్ అదే తుహ్లాక్ లైన్ 12 బంగ్లాలో ఉంటున్నారు. ఆయన ఆ బంగ్లాతో  తనకున్న అనుబంధాన్ని, అనుభూతులను పంచుకున్నారు. మరోవంక రాహుల్ గాంధీ తమ నివాసాన్ని ఖాళీ చేయవలసివస్తే, తమ నివాసంలో ఉండవచ్చని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఆఫర్ ఇచ్చారు. అయితే రాహుల్, అమ్మతో ఉండేందుకే నిర్ణయించుకున్నారు.

పుల్వామా దాడి మోడీ సర్కార్ వైఫల్యమే.. సత్యాపాల్ మాలిక్

ప్రధాని నరేంద్ర మోడీ జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా తీసేసి పెద్ద తప్పు చేశారు. ఇప్పటికైనా ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకుని తప్పు సరిదిద్దుకోవాలి. విపక్షాలన్నీ ఐక్యంగా నిలిస్తే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ విజయం అనుమానమే. ఈ మాటలన్నది ఎవరో కాదు జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ఆఖరి గవర్నర్ గా పని చేసిన సత్యపాల్ మాలిక్. ఆయన గవర్నర్ గా ఉన్న సమయంలోనే పుల్వామాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ దాడి పూర్తిగా మోడీ సర్కార్ వైఫల్యమేనని సత్యపాల్ మాలిక్ ఒక ఇంటర్వ్యూలో కుండబద్దలు కొట్టారు.   కేంద్ర ప్రభుత్వం కాళ్ల కింద భూమి కదిలిపోయే విషయాలను వెల్లడించారు.   పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై దాడిని మోడీ సర్కార్ ఎన్నికల లబ్ధికి ఉపయోగించుకుందన్నారు.   ఆ సమయంలో కేంద్ర హోం మంత్రిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ ఉన్నారనీ,  తమ జవాన్లను తరలించడానికి ఎయిర్‌క్రాఫ్ట్‌ కావాలని సీఆర్పీఎఫ్‌ కోరగా, హోం శాఖ తిరస్కరించిందని చెప్పారు. రక్షణపరంగా సీఆర్పీఎప్ జవాన్లు ప్రయాణించిన మార్గం ఎంత మాత్రం సురక్షితం కాదని తెలిసినా రాజ్ నాథ్ సింగ్ పట్టించుకోలేదన్నారు.  పుల్వామా దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్‌ జవాన్లు అమరులైన తర్వాత  తనకు మోడీ ఫోన్‌ చేసి ఈ విషయంలో నోరెత్తవద్దన్నారన్నారు. ఆ వెంటనే జాతీయ భద్రతా సలహాదారు కూడా తనకు ఫోన్ చేసి మౌనంగా, నిశ్శబ్ధంగా ఉండాలన్నారనీ,  అప్పటి కానీ తనకు ఈ దాడి ద్వారా బీజేపీ ప్రభుత్వం ఎన్నికలలో లబ్ధిని ఆశిస్తోందని తెలియలేదన్నారు.  పుల్వామా దాడి ఇంటెలిజెన్స్‌ ఘోర వైఫల్యం అని సత్యాపాల్ మాలిక్ చెప్పారు. పాకిస్థాన్‌ నుంచి 300 కిలోల ఆర్డీఎక్స్‌తో వచ్చిన ఒక వాహనం దాదాపు పది రోజుల పాటు  జమ్ముకశ్మీర్‌ రోడ్లపై యథేచ్ఛగా తిరిగినా గుర్తించలేకపోవడం కంటే ఇంటెలిజెన్స్ వైఫల్యం ఏముంటుందని సత్యాపాల్ మాలిక్ అన్నారు.  దేశంలోని ముస్లింలపై ప్రధాని మోదీ, ఆయన మంత్రులు వ్యవహరిస్తున్న తీరు ఎంతమాత్రం సమర్థనీయం కాదని సత్యాపాల్ మాలిక్ ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. ముస్లింలపై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేసే మంత్రులను కట్టడి చేయడానికి మోడీ ఇసుమంతైనా ప్రయత్నం చేయడం లేదని సత్యపాల్ మాలిక్ చెప్పారు. ఇంకా ఆదానీ వ్యాపార అక్రమాలపై నోరెత్తిన రాహుల్ గాంధీ విషయంలో మోడీ సర్కార్ అత్యంత దారుణంగా వ్యవహరించిందన్నారు. అదానీ  వ్యవహారంలో  దేశ వ్యాప్తంగా క్షేత్ర స్థాయిలో మోడీ ర్కార్ ప్రతిష్ట దిగజారిందన్న సత్యపాల్ మాలిక్  వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాలు ఐక్యంగా నిలబడితే  బీజేపీకి విజయం సులభ సాధ్యం కాదని చెప్పారు. ఇక అదానీ అక్రమాలపై కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం మోడీ సర్కార్ చేసిన తప్పుని అభిప్రాయపడ్డారు.  అదానీ విషయంలో  రాహుల్‌ సంధించిన ప్రశ్నలకు మోడీ వద్ద సమాధానం లేకపోవడం వల్లనే రాహుల్ ను మాట్లాడనీయలేదని ఆరోపించారు.  రాష్ట్రాలలో గవర్నర్లుగా ఏ మాత్రం స్థాయి, ప్రమాణాలు లేని వ్యక్తులను మోడీ సర్కార్ నియమిస్తోందని తీవ్ర స్థాయిలో విమర్శించారు.  అవినీతి విషయంలో మోడీకి ఇసుమంతైనా పట్టింపు లేదన్న సత్యపాల్ మాలిక్ తన అనుయాయులకు ప్రయోజనం చేకూర్చడానికి ఎంతకైనా తెగిస్తారన్నారు. తాను జమ్మూ కాశ్మీర్ గవర్నర్ గా ఉన్న సమయంలో రాష్ట్రంలో రిలయెన్స్ ఇన్సూరెన్స్, హైడ్రో ఎలక్ట్రిక్ పథకాలను అనుమతి ఇవ్వాలని కోరారనీ, అందుకు తాను నిర్ద్వంద్వంగా తిరస్కరించాననీ వెల్లడించారు. దీంతో అప్పటికి బీజేపీలో, ఆర్ఎస్ఎస్ లో కీలకంగా వ్యవహరిస్తున్న రామ్ మాధవ్ ఓ రోజు ఉదయమే తన వద్దకు వచ్చి వాటిని అనుమతి ఇవ్వాల్సిందిగా ఒత్తిడి తెచ్చినట్లు వివరించారు. అయితే తాను అందుకు అంగీకరించలేదనీ, తప్పు చేయడానికి తాను సిద్ధంగా లేనని స్పష్టం చేశాననీ చెప్పారు.  ఆ పథకాలకు అనుమతి ఇస్తే రూ.300 కోట్లు ఇస్తామని కొందరి నుంచి ఆఫర్‌ వచ్చిందన్నారు.   జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను రద్దు చేసి ప్రధాని మోడీ పెద్ద తప్పు చేశారని, ఈ విషయంలో ఆయనను కొందరు తప్పుదోవ పట్టించారన్న సత్యపాల్ మాలిక్ ఇప్పటికైనా ఆ తప్పు దిద్దుకోవాలని మోడీకి సూచించారు. 

కాంగ్రెస్ కు పవార్ బిగ్ షాక్

ఓ వంక జాతీయ స్థాయిలో బీజేపీని వ్యతిరేకించే ప్రతిపక్ష పార్టీలన్నిటినీ ఏకం  చేసేందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లి కార్జున ఖర్గే, ఆ పార్టీ  మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అలాగే జేడీయు అధినేత, బీహార్ ముఖ్యమత్రి నితీష్ కుమార్, ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధ్యక్షుడు తేజస్వీ యాదవ్... ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్న సమయంలో ఎన్సీపీ అధినేత శరద పవార్  విపక్ష పార్టీలకు  ముఖ్య్మగా కాంగ్రెస్ పార్టీకి సర్ప్రైజ్ షాక్ ఇచ్చారు.  జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యత గురించి ఖర్గే, రాహుల్ గాంధీతో చర్చించిన పవార్, 24 గంటలు తిరక్కుండానే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్సీపీ 45 అసెంబ్లీ నియోజక వర్గాల్లో పోటీ చేస్తుందని ప్రకటించారు.  నిజానికి  ఇటీవల ఒకటి రెండు సందర్భాలలో శరద్ పవార్  పార్టీ ఎన్సీపీ విపక్షాల ఉమ్మడి నిర్ణయాలకు దూరంగా ఉంటోందనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే  అధికార బీజేపీ దగ్గరవుతున్న సంకేతాలు స్పష్ట మవుతున్నాయని అంటున్నారు. ముఖ్యంగా  అదానీ వ్యవహారంలో జేపీసీ కోసం విపక్ష పార్టీలన్నీ ముఖ్యంగా కాంగ్రెస్ అనుకూల విపక్షాలన్నీ పట్టు పట్టిన సందర్భంలో పవార్  అందుకు భిన్నమైన  స్టాండ్ తీసుకున్నారు. అలాగే రాహుల్ గాంధీ సావార్కర్ ను చులక చేస్తూ చేసిన వ్యాఖ్యల విషయంలోనూ  పవార్ రాహుల్ గాంధీని నోరు అదుపులో పెట్టుకునేలా కట్టడి చేయాలని సోనియా గాంధీ, మల్లికార్జున ఖర్గేకు సూచించినట్లు వార్త లొచ్చాయి. మరోవంక  పవర్ బంధువు, మహారాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ బీజేపీలో చేరుతున్నట్లు మహారాష్ట్ర మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మరాఠా యోధుడు శరద్ పవార్ అడుగులు అటుగా పడుతున్నాయా అనే అనుమానాలకు బలం చేకూరుతోంది. సరే  ఆ పరిణామాలకు ఎన్సీపీ తీసుకున్న తాజా నిర్ణయానికి ప్రత్యక్ష సంబంధం ఉన్న లేకున్నా  కర్ణాటక బరిలో ఎన్సీపీ  అది కుడా ఏకంగా 45 స్థానల్లో బరిలో దిగితే  ప్రభుత్వ వ్యతిరేక ఓటు మరింతగా చీలి  బీజేపీ లబ్ధి పొందుతుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్, జేడియూ మధ్య  ముక్కోణపు పోటీ నెలకొంది. మరోవంక ఎంఐఎం కూడా పోటీకి రెడీ అవుతోంది. ఆ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తుందని ఇప్పటికే ప్రకటించారు.  అలాగే సిపిఎం కుడా పరిమితంగా నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుందని ప్రకటించింది. అలాగే, భారత రాష్ట్ర సమితి ఇప్పటికి ఇంకా నిర్ణయం తీసుకోలేదు కానీ పోటీ చేసే అవకాశాలను కొట్టివేయలేమని ఆ పార్టీ నాయకులు అంటున్నారు.   ఈ  తరుణంలో ఎన్సీపీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్నామని చేసిన ప్రకటన సహజంగానే విపక్ష కూటమిలో ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే ఇటీవలే జాతీయ హోదా కోల్పోవడంతో ఆ హోదా తిరిగి పొందేందుకు అనివార్య పరిస్థితుల్లో కర్ణాటక ఎన్నికల బరిలోకి దిగాల్సి వస్తోందని ఎన్సీపీ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దుల్లో మరాఠీ ప్రజలు ఎక్కువగా ఉన్న చోట ఎన్సీపీ పోటీ చేయాలని అనుకుంటోంది. మహారాష్ట్ర ఏకీకరణ్ సమితితో కలిసి ఎన్సీపీ ఎన్నికల్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. అయితే చివరకు కాంగ్రెస్ పార్టీ పొత్తుతో ఎన్సీపీ పరిమిత స్థానాల్లో పోటీ చేసేందుకు అంగీకరించవచ్చని ఇందుకు సంబంధించిన బేరసారాల కోసమే పవార్  బాంబు పేల్చారని కొందరు భావిస్తున్నా.. ఈ దశలో అది అయ్యేపని కాదని అంటున్నారు. అదీగాక  గోవా ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తుకు ప్రయత్నించి అభాసు పాలైన నేపథ్యంలో పవార్ మరోమారు ఆలాంటి తప్పు చేయరని, అంటున్నారు. అయితే   కారాణాలు ఏవైనా కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల బరిలో ఎన్సీపీ ఎంట్రీ ఇవ్వడం  కాంగ్రెస్ కు బిగ్ షాక్ అనడంలో సందేహం లేదు.  జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు కూడా  కర్ణాటక పరిణామాలు లిట్మస్ టెస్ట్ గా నిలుస్థాయని భావిస్తున్న తరుణంలో ఎన్సీపీ పోటీ నిర్ణయం జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు భంగమేనన్న అభిప్రాయం వ్యక్త మౌతోంది. 

ఢిల్లీ మద్యం కుంభకోణంలో మరో సంచలనం

ఢిల్లీ మద్యం కుంభకోణంలోలో మరో సంచలనానికి తెరలేచింది.  ఇప్పటికే తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుట్ల కవిత సహా  అనేక మంది విచారించి,  ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సహా మరికొందరు కీలక వ్యక్తులను ఆరెస్ట్ చేసిన కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ తాజగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు నోటీసులు జారీ చేసింది.  ఆదివారం (ఏప్రిల్ 16)  ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని కేజ్రీవాల్  కు సీబీఐ సమన్లు జారీ చేసింది. కొత్త మద్యం పాలసీ విషయంలో ప్రశ్నించాలని సీబీఐ ఆ నోటీసుల్లో పేర్కొంది.  మార్చిలో డిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేసింది. మనీష్ సిసోడియా చార్జ్ షీట్ లో అరవింద్ కేజ్రీవాల్ పేరు ఉండటంతో ఇప్పుడు ఆయన్ను విచారించాలని నిర్ణయించింది. మనీష్ సిసోడియా ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా ఈ నోటీసులు జారీ అయినట్లు వార్తలు వస్తున్నాయి.  అయితే  ఆదివారం (ఏప్రిల్ 16)  ఆయన విచారణకు హాజరవుతారా లేదా  అనేది చూడావలసి వుందని అంటున్నారు. గతంలో కవిత సహా ఈ కేసులో విచారణ ఎదుర్కొంటున్న రాజకీయ ప్రముఖులకు, వారి బిజీ షెడ్యూల్  ఇతరత్రా కారణాలతో,  సీబీఐ, ఈడీ విచారణ తేదీలలో  వారు కోరుకున్న విధంగా మార్పులు చేసుకునే  వెసులుబాటు కల్పించింది. అదే విధంగా అరవింద్ కేజ్రివాల్ కోరితే విచారణ మరో రోజుకు వాయిదా పడే అవకాశం ఉంటుందని అంటున్నారు.  కాగా  ఇదే ఢిల్లీ మద్యం కుంభకోణం విషయంలో జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఇటీవల దేశంలోని అన్ని దర్యాప్తు సంస్థలకు లేఖలు రాశారు. అందులో ఏకే.. అంటే అరవింద్ కేజ్రీవాల్ అని.. ఆయన ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో 15 కోట్ల రూపాయలు ఇచ్చినట్లు కూడా తన లేఖలో వివరించారు.  అదలా ఉంటే  ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు మద్యం కుంభకోణంలో  నోటీసులు జారీ చేయటం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని రూ.100 కోట్ల రూపాయల లావాదేవీలకు సంబంధించి విచారించటం కలకలం రేపుతోంది. ప్రస్తుతం ఢిల్లీలో పాత మద్యం విధానమే అమలు అవుతోంది. మరో ఆరు నెలలు పాత పాలసీని కొనసాగిస్తూ.. ఇటీవలే కేజ్రీవాల్ నిర్ణయం తీసుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే కేజ్రీవాల్ కు సీబీఐ నోటీసులు జారీ చేయటం దేశ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. అయితే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు సీబీఐ  సమన్లు పంపడం పట్ల ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ, కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతున్నారు.  సీబీఐ సమన్లతో అరవింద్ కేజ్రీవాల్ పోరాటం ఆగదని ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అన్నారు. గౌతమ్ అదానీతో ఉన్న సంబంధాలపై ప్రధాని మోడీని ప్రశ్నించినందుకే ఢిల్లీ ముఖ్యమంత్రిని కేంద్ర ప్రభుత్వం టార్గెట్ చేస్తోందని  సంజయ్ సింగ్ అన్నారు.  సీబీఐ  విచారణకు కేజ్రీవాల్ ఆదివారం (ఏప్రిల్ 16)వెళ్తారని  సంజయ్ సింగ్ తెలిపారు.

ఏపీలో బీజేపీ అటో ఇటో సీఎం రమేష్ తేల్చేసినట్లేనా?

బీజేపీ అటా.. ఇటా అన్న అనుమానాలు పటాపంచలైపోతున్నాయి. సీఎం రమేష్,  సుజనా చౌదరి వంటి తెలుగుదేశం పార్టీ నుంచి బీజేపీ గూటికి చేరిన నాయకులు అన్యాపదేశంగానైనా ఏపీలో తెలుగుదేశం తో బీజేపీ పొత్తు ఖాయమన్న సంకేతాలు ఇస్తున్నారు. తాజాగా పీఎం రమేష్ చేసిన వ్యాఖ్యలు ఏపీలో బీజేపీ తెలుగుదేశం, జనసేనలు కూటమిగా ఏర్పాటు అనివార్యమన్న సంకేతాలు ఇచ్చారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే వచ్చే ఏడాది ఏపీ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీ కూటమే అని. అంటే ప్రస్తుతం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య  ఉన్న బంధం కారణంగా బీజేపీ, వైసీపీల కూటమి  అని జనం పొరపడతారన్న అనుమానం ఆయనకే వచ్చిందో ఏమో.. వెంటనే రాష్ట్రంలో జగన్ పాలనపై విమర్శలు గుప్పించారు. అదే సమయంలో రాష్ట్రంలో జనసేన, బీజేపీ మిత్ర పక్షాలన్న సంగతినీ గుర్తు చేశారు. అంటే బీజేపీ జనసేనతోనే ఉంటుందన్నది ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. అయితే ఆ జనసేన ఇప్పటికింకా అధికారికంగా ప్రకటించకపోయినా.. తెలుగుదేశం పార్టీతో జట్టు కట్టడం ఖాయమన్న సంకేతాలను విస్పష్టంగా ఇచ్చింది. ఇస్తోంది కూడా. పొత్తు, సీట్ల సర్దుబాటు వంటి విషయాలపై జనసేనాని పవన్ కల్యాణ్ అధికారికంగా ఎటువంటి ప్రకటనా చేయకపోయినా.. గౌరవానికి భంగం కలగని రీతిలో పొత్తులు ఉంటాయని పదే పదే చెప్పడం, అలాగే రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఎట్టి పరిస్థితుల్లోనూ చీలనివ్వను అంటూ పదే పదే చెప్పడం వెనుక ఆయన ఉద్దేశం తెలుగుదేశంతో పొత్తు ఉంటుందనే అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా సీఎం రమేష్ బీజేపీ కూటమిదే ఏపీలో అధికారం అనడం అంటే తెలుగుదేశం, జనసేనతో కలిసే బీజేపీ నడుస్తుందని చెప్పడమేనని విశ్లేషిస్తున్నారు. అంతే కాకుండా రాష్ట్రంలో జగన్ పాలన అత్యంత దారుణంగా ఉందని విమర్శలు గుప్పించారు. మొత్తం మీద ఏపీలో బీజేపీ తెలుగుదేశంతో జట్టు కడుతుందా.. కట్టదా అన్నది పక్కన పెడితే.. ఆ పార్టీతో యుద్ధం చేయాలన్న ఉద్దేశం ఎంత మాత్రమూ లేదని, ఇటీవలి కాలంలో ఆ పార్టీ రాష్ట్ర నేతల స్వరంలో వచ్చిన మార్పును బట్టి ప్రస్ఫుటంగా అర్ధమౌతోంది. మొన్న మొన్నటి వరకూ తెలుగుదేశంపై విమర్శలతో విరుచుకుపడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ఇటీవలి కాలంలో ఆ విమర్శల బాణాలను అధికార వైసీపీపై ఎక్కుపెట్టడం, ఇటీవల జనసేనాని హస్తిన పర్యటన అనంతరం అక్కడ మీడియాతో మాట్లాడుతూ తన వాణిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగానే వినిపించడం వంటి వాటిని గమనిస్తే ఏపీలో రాజకీయ సమీకరణాలలో గుణాత్మక మార్పు గోచరించక మానదు.సీఎం రమేష్ మాటలు, వ్యాఖ్యలు కూడా రానున్న రోజులలో కమలం ప్రభుత్వ వ్యతిరేక స్టాండ్ ను మరింత గట్టిగా వినిపించే అవకాశాలే ప్రస్ఫుటంగా ఉన్నాయన్న సంగతిని తేటతెల్లం చేస్తున్నాయి.  

గుడివాడలో వైసీపీ గూబ గుయ్యిమంది!

ఇదేం ఖర్మ రాష్ట్రానికి అంటే రాష్ట్ర ప్రజల ముందుకు వెళ్లిన తెలుగుదేశం పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో లోకేష్ దూసుకుపోతుంటే, వరుస సమావేశాలతో చంద్రబాబు వైసీపీ వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అంతటా పర్యటనలు దాదాపు పూర్తి చేసుకున్న చంద్రబాబు కృష్ణా జిల్లా పర్యటనలో బిజీగా ఉన్నారు.   చంద్రబాబు కార్యక్రమాలను అడ్డుకోవడానికి జగన్ ప్రభుత్వం తొక్కని అడ్డదారి లేదు.  చేయని కుతంత్రమూ లేదని తెలుగుదేశం నేతలు బాహాటంగానే విమర్శిస్తున్నాయి. తాజాగా మచిలీపట్నం, గుడివాడ, నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గాలలో జరిగిన సభలు వైసీపీ నేతలకు నిద్ర లేకుండా చేస్తున్నాయి. గుడివాడలో బాబు సమావేశాలను అడ్డుకునేందుకునేరుగా మాజీ మంత్రి నాని రంగంలోకి దిగాల్సి వచ్చింది.   చివరకు రోడ్డుపై లారీలను అడ్డుగా ఉంచి సభలను అడ్డుకోవాలన్న ప్రయత్నం కూడా ఫలించకపోవడంతో తెలుగుదేశం నేతలను శాపనార్ధాలు పెట్టేందుకు కూడా వైసీపీ  నేతలు  సిద్ధమయ్యారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. కొడాలి నాని దౌర్జన్యాలపై ముందే అవగాహన ఉన్న టీడీపీ ప్రతి పరిణామానికి సిద్ధపడి కార్యక్రమాన్ని రూపొందించుకుంది.  నాని రౌడీఇజాన్ని ఇంత కాలం భరించిన గుడివాడ ప్రజలు చందరబాబు సభలకు రెట్టించిన ఉత్సాహంతో హాజరయ్యారని టీడీపీ శ్రేణులు అంటున్నాయి. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలలో ఓటమి చవి చూసిన తరువాత వైసీపీ నేతల దౌర్జన్యాలను మరింత పెంచారన్నది టీడీపీ చెబుతున్న మరో కోణం.  దీంతో సహజంగానే జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్న ప్రజలు తమ సభలకు హారౌతున్నారని తెలుగుదేశం భావిస్తోంది.  ఇదిలా ఉంటే.. రాష్ట్రంలో సభలు, సమావేశాలు జరపకూడదంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెచ్చిన Go No1 ను న్యాయస్థానాలు అడ్డుకోవడంతో బాబు పర్యటనలలో మరింత ఊపు వచ్చింది.  బాబు సభలను అడ్డుకోవడం కోసం లారీలు, ట్రాక్టర్లు అడ్డుగాపెట్టడాన్ని గుడివాడప్రజలు గమనిస్తున్నారు. జడ్ ప్లస్ కేటగిరి బద్రత ఉన్న చంద్రబాబు పరిస్థితే ఇలా ఉంటే సామాన్యుల  పరిస్థితి ఏమిటని ఆంధ్రప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. గురువారం (ఏప్రిల్ 13) గుడివాడ సభలో చంద్రబాబు ప్రసంగం హైలైట్ కాగా, శుక్రవారం (ఏప్రిల్ 14) నాని ప్రెస్ మీట్ లో చేసిన వ్యాఖ్యలుఅతని స్థాయిని మరింత దిగజార్చాయని ఓటర్లు చెబుతున్నారు. 

కేంద్రం ఎన్నికల కుతంత్రం.. బీఆర్ఎస్ పై జమిలి బాణం

తెలంగాణాలో అధికారం చేజిక్కించుకోడమే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ అధిష్టానం బీఆర్ఎస్ పై జమిలి బాణం సంధించేందుకు సమాయత్తమౌతోంది.  జమిలి ఎన్నికల వ్యూహంతో బీఆర్‌ఎస్‌ను రాజకీయంగా దెబ్బ కొట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది. సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్న నేపథ్యంలో.. ఆ లోగా  'ఒకే దేశం.. ఒకే ఎన్నికల విధానం పై చట్టాన్ని తీసుకొచ్చి జమిలితో బీఆర్ఎస్ ను దెబ్బకొట్టాలన్న వ్యూహంతో అడుగులు వేస్తోంది.  లోక్‌సభ ఎన్నికలతోనే తెలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేందుకు బీజేపీ అధిష్టానం పెద్దలు పావులు కదుపుతున్నట్లు రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఇటీవల  హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోడీ కేసీఆర్‌ సర్కారుపై పరోక్షంగా హెచ్చరికలు చేయడం ఈ చర్చకు తావిచ్చింది. బీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య విభేదాలు సృష్టించి భాజపాలోకి లాక్కునేందుకు ఢిల్లి స్థాయిలో వ్యూహం, రాష్ట్ర స్థాయిలో అమలుకు కార్యాచరణ గోప్యంగా చేస్తోందని చర్చ సాగుతోంది. అందుకోసమే ఇటీవల చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కమలం హైకమాండ్ హస్తినకు పిలిపించుకుని చర్చలు జరిపిందంటున్నారు. రాష్ట్రంలో ఇటీవల అధికార పార్టీని వీడి బీజేపీలో చేరిన కొంతమంది బడా నాయకులు ఇందుకు పూర్తిగా దోహదం చేస్తున్నట్టు చెబుతున్నారు. తాజాగా తెలంగాణ రాజకీయ పరిణామాలపై ఢిల్లి స్థాయిలో జోరుగా చర్చ జరుగుతోంది. దేశంలో నరేంద్రమోడీపై నేరుగా తిరగబడిన  కేసీఆర్‌ తేలిగ్గా తీసుకుని వదిలేస్తే జాతీయస్థాయిలో ప్రాంతీయ పార్టీలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకువచ్చే ప్రమాదంఉందన్న భావనతో మోడీ, అమిత్‌షా సహా కొందరు కేంద్ర ప్రభుత్వ పెద్దలు కేసీఆర్‌ను గద్దె దించడమే లక్ష్యంగా పెట్టుకుని పనిచేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలోనే జమిలి ఆయుధాన్ని రెడీ చేయాలన్న వ్యూహం రచించిందంటున్నారు.  పలు సందర్భాల్లో జమిలి ఎన్నికల గురించి ప్రధాని నరేంద్రమోడీ ప్రస్తావించిన విషయం తెలిసిందే. బలమైన పోటీ-దారులు అయిన మమతా బెనర్జీ, కేసీఆర్‌, కేజ్రీవాల్‌ లాంటి వారిని ఒంటరిగా ఎదుర్కోలేమని, సార్వత్రిక ఎన్నికలతోపాటే కొట్టాలని బీజేపీ భావిస్తోంది.  బీజేపీకి అసెంబ్లీకి పార్లమెంట్‌కు ఒకటే ఓటు- పడడం ఖాయమని ఇలా చేస్తే రాష్ట్రాల్లోనూ అధికారం దక్కుతుందన్న విశ్వాసం బీజేపీలో కనిపిస్తోంది. అందుకే ఈసారి డిసెంబర్‌లో తెలంగాణ ఎన్నికల కాలపరిమితి ముగియగానే ఎన్నికలకు వెళ్లకుండా రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.  

టీఎస్పీఎస్సీ లీకేజీ.. ఈడీ వర్సెస్‌ సిట్‌!

టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు విచారణలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి.  ఈ కేసును సిట్‌ (ప్రత్యేక దర్యాప్తు సంస్థ) ఇప్పటికే దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ప్రశ్నపత్రాల లీకేజీలో    మనీల్యాండరింగ్‌ ద్వారా భారీగా సొమ్ములు చేతులు మారినట్లు అనుమానాలు వ్యక్తం అవ్వడంతో కేసు దర్యాప్తును  కూడా  చేపట్టింది. దీంతో ఈడీ వర్సెస్‌ సిట్‌గా అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది. తెలంగాణ ముఖ్యమంత్రి గతంలో చెప్పినట్లు కేంద్రం చేతిలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఉంటే.. రాష్ట్రం చేతిలో సిట్ ఉంది అన్నట్లుగానే ఈ దర్యాప్తు సంస్థల తీరు కూడా ఉంది. తాజాగా  తమ దర్యాప్తునకు సిట్‌ సహకరించడంలేదని ఈడీ ఆరోపిస్తోంది. తమకు విచారణకు సంబంధించి సిట్  ఎటువంటి సమాచారం ఇవ్వడంలేదని ఈడీ చెబుతోంది. ఈ క్రమంలోనే ఈ రెండు దర్యాప్తు సంస్థల పంచాయతీ కోర్టుకు చేరింది. టీఎస్పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసులో రంగంలోకి దిగిన ఈడీ..  వివరాలు ఇవ్వాల్సిందిగా మార్చి 23న సిట్ కు లేఖ రాసింది. ముందు నుంచి సిట్‌ ఈ కేసును దర్యాప్తు చేస్తుండటంతో పేపర్‌ లీకేజీకు సంబంధించిన 8 డాక్యుమెంట్లను ఇవ్వాలని ఆ లేఖలో కోరింది. అయితే ఇప్పటి వరకూ కూడా ఈడీ లేఖకు సిట్‌ అధికారులు  స్పందించకపోవడంతో నాంపల్లి కోర్టును ఈడీ ఆశ్రయించింది. టీఎస్సీఎస్పీ పేపర్‌ లీకేజీ కేసులో అడిగిన సమాచారాన్ని తమకు ఇవ్వడంలేదంటూ ఈడీ   పిటిషన్  దాఖలు చేసింది. ఈ కేసులో మనీలాండరింగ్‌ కోణంలో దర్యాప్తు చేపట్టిన ఈడీ  అందుకు సిట్‌ ఇచ్చే సమాచారం తమకు ఉపయోగపడుతుందని అంటోంది. అందుకే కేసు వివరాలు ఇచ్చేలా సిట్‌కు ఆదేశాలు ఇవ్వాలని ఈడీ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో కోరింది. ఇదిలా ఉంటే ఈడీ పిటిషన్‌పై సిట్‌ కూడా కౌంటర్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. పేపర్‌ లీక్‌ కేసు దర్యాప్తు కీలక దశలో ఉండడంతో వివరాలు ఇవ్వడం కుదరదని సిట్ తన కౌంటర్ లో పేర్కొంది.ఈ పిటిషన్లపై  విచారణ జరగనుంది. పేపర్‌ లీక్‌ కేసులో ఈడీ ప్రధానంగా ఆర్థిక లావాదేవీలపైనే దృష్టి పెట్టింది. పబ్లిక్‌ డొమైన్‌ ద్వారా ఇప్పటికే వివరాలు సేకరించి ఈసీఐఆర్‌ నమోదు చేసింది. భారీ మొత్తంలో డబ్బులు చేతులు మారాయని ఈడీ గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్‌, రాజశేఖర్‌ల కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో ఇప్పటికే పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే దీనిపై నిందితుల తరపు న్యాయవాది స్పందనను తెలియజేయాల్సిందిగా   నోటీసులు జారీ చేసినట్లు తెలిసింది. టీఎస్సీఎస్పీ నిందితుల నుంచి సిట్‌ ఏడు లక్షలు సేకరించింది. రూ.40 లక్షలు లావాదేవీలు జరిగినట్లు ఇటీవల హైకోర్టుకు సమర్పించిన నివేదికలో సిట్‌ పేర్కొన్నది. కేసు వ్యవహారం రానున్ను రోజుల్లో మరెన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిందే. 

టీడీపీతో పొత్తుకు కమలనాథుల ప్లాన్!

దక్షిణాదిలో మరో  కీలక పరిణామం చోటు చేసుకుంది. AP, తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల మీద  బీజేపీ నిఘా పెట్టింది.  వచ్చే యేడాది లో పు సౌత్ లో బలం పెంచుకోవడానికి ప్లాన్ చేస్తోంది. వైయస్సార్ కాంగ్రేస్ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలు  సన్నగిల్లాయి. యిటీవలి అక్కడ మూడు పట్ట భధ్రుల రిజల్ట్ లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి చేదు అనుభవం మిగిల్చింది. అక్కడ టీడీపీ విజయకేతనం అన్ని పార్టీల్లో గుబులు పుట్టించింది.  వచ్చే యేడాది రెండు రాష్ట్రాల్లో ELECTIONS నేపథ్యంలో తెలంగాణ, APలో తన బలం పెంచుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. రెండు రాష్ట్రాల్లో బలమైన అపోజిషన్ పార్టీగా యెదిగిన తెలుగు దేశంతో పొత్తు  పెట్టుకోవాలని  చూస్తోంది. సౌత్ లో తన బలం పెంచుకోవాలని చూస్తోంది. సౌత్ లో కీలకమైన తెలంగాణలో BRS వరుసగా రెండు సార్లు అధికారంలో వచ్చింది. కానీ వచ్చే యేడాది జరగనున్న ELECTONSలో BRS గెలిచే అవకాశాలు సన్నగిల్లాయి. అవినీతి పెరిగిపోయిందని  అపోజిషన్ పార్టీలు నిరసిస్తున్నాయి. బీజేపీ రెండు రాష్ట్రాల్లో బలంగా అవతరించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని తహతహలాడుతుంది. యింటిటికి టీడీపీ కార్యక్రమం నిర్వహిస్తున్న టీడీపీ ప్రజల్లో అభిమానాన్ని  చూరగొంటుంది. కాంగ్రేస్ రెండు రాష్ట్రాల్లో మూడో స్థానానికి దిగజారిపోవడంతో  రెండు రాష్ట్రాల్లో బలమైన పార్టీగా అవతరించిన టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని కమలనాథుల యెత్తుగడ. తెలంగాణలో టీడీపీ ప్రెసిడెంట్ గా కాసాని నియామకం అయిన తర్వాత టీడీపీ జవసత్వాలు పెరిగాయి. వచ్చే నెల హైదరాబాద్లో నిర్వహించ తల పెట్టిన మహనాడులో పొత్తుల విషయమై చర్చకు రానున్నట్టు తెలుస్తోంది. APలో వంటరిగా పోటీ చేసినా అధికారంలో రావడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో పొత్తు పెట్టుకోవడం ద్వారా గెలుపు వోటములను నిర్ణయించే శక్తి టీడీపీకి వచ్చేసిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. కాకపోతే బీజేపీతో పొత్తు వల్ల టీడీపీకి నష్టం వాటిల్లుతుందా అనే అంశం మీద మహనాడులో చర్చించనున్నారు. గ్రేటర్లో 14 స్థానాలను గెలిచే సత్తా టీడీపీకి వుంది.  యునైటెడ్ రాష్ట్రంలో టీడీపీ తెలంగాణ ప్రజల అభిమానాన్ని చూరగొన్న సంగతి తెలిసిందే 

అధ్యక్షా ..చదువు కున్నారా?.. కొన్నారా?

రాజకీయాల్లో రాణించడానికి చదువు అవసరం లేదు. పంచాయతీ  బోర్డు మెంబెర్ మొదలు ప్రధాని పదవి వరకు, ఏ పదవికీ విద్యార్హతలు అక్కర లేదు. ఓటు హక్కున్న ప్రతి ఒక్కరు ఎన్నికల్లో పోటీ చేయవచ్చును. ప్రజలు గెలిపిస్తే చాలు,  ఎమ్మెల్ల్యే, ఎంపీ , మంత్రి,  ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రధాన మంత్రి  ఏదైనా కావచ్చును. ఏ పదవికీ చదవు సంధ్యలు అవసరం లేదు, డిగ్రీలు అక్కరలేదు. అయినా,  రాజకీయ నాయకుల విద్యార్హతలు, డిగ్రీలు తరచూ వివాదం అవుతూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలోనే ప్రధాని నరేంద్ర మోడీ డిగ్రీలపై వివాదం నడిచింది. మోడీ విద్యార్హతలు, డిగ్రీలకు సంబంధించిన సమాచారం కోసం సమాచార హక్కు చట్టం కింద తెలుసుకునేందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ చేసిన ప్రయత్నాలు ఫలిచలేదు.  చివరకు ఆ వివాదం ఆయన మెడకే చుట్టుకుంది. పబ్లిక్ డొమైన్ లో ఉన్న సమాచారాన్ని పదే పదే అడిగి సమాచార కమిషన్ సమయాన్ని వృధా చేస్తున్నారని భావించిన న్యాయస్థానం అరవింద్ కేజ్రీవాల్‌ కు రూ. 25,000 జరిమానా విధించింది. అలాగే కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ మరి కొందరు ముఖ్య నేతలకు సంబందించిన ‘డిగ్రీ’ విషయంలోనూ వివాదాలు, విచారణలు జరిగాయి. జరుగుతున్నాయి. ఇప్పడు ఆ జాబితాలో  ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని  సీతారాం పేరు కూడా చేరింది.   తమ్మినేని సీతారాం నకిలీ డిగ్రి సర్టిఫికెట్ కొనుగోలు చేసినట్లుగా తెలంగాణ తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. తెలంగాణ తెలుగుదేశం నేతలు బయట పెట్టిన ఆధారాలు ఏపీ పాలిటిక్స్ లో సంచలనంగా మారాయి. ఏపీ స్పీకర్ డిగ్రీ చదవలేదు. కానీ ఆయన హైదరాబాద్‌లోని ఒక న్యాయ కళాశాలలో నకిలీ డిగ్రీ సర్టిఫికేట్ తో న్యాయశాస్త్రం విద్యార్ధిగా  చేరారు. ఈ అంశంపై ఆర్టీఐ చట్టం ద్వారా తెలంగాణ టీడీపీ నేత నర్సిరెడ్డి వివరాలు సేకరించారు.  తీగ లాగితే డొంకంతా కదిలింది అన్నట్లుగా, తమ్మినేని సీతారాం  విద్యార్హతలు ఏమిటన్న వివరాలు తెలుసుకుంటే అసలు విషయం బయట పడిందని తెలంగాణ టీడీపీ నేతలు పేర్కొంటున్నారు. తమ్మినేని డిగ్రీ చదవలేదు, కానీ, చదివినట్లుగా ఒక నకిలీ సర్టిఫికేట్ సంపాదించారు. ఆ నకిలీ సర్టిఫికేట్ అర్హతగా  లా కాలేజీలో ప్రవేశం పొందారు. ప్రవేశ దరఖాస్తుకు  ఆ నకిలీ సర్టిఫికేట్ జతచేసి  లా కళాశాలలో ప్రవేశం పొందారు. ఆయన ఏ స్టడీ సెంటర్లలో అయితే డిగ్రీ చేసినట్లు చూపించారో, ఆ స్టడీ సర్కిల్లో ఆయన  చదవ లేదని వెరిఫికేషన్ లో తేలిందని..  డిగ్రీ సర్టిఫికెట్‌లో చెప్పిన హాల్ టిక్కెట్ నెంబర్ కూడా లేదని నర్సిరెడ్డి చెబుతున్నారు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని… నకిలీ డిగ్రీ సృష్టించి ఉంటే.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నిజానికి  తమ్మినేని నకిలీ డిగ్రీ అంశం పై ఇప్పుడే కాదు ఇంతకూ ముందు  దుమారం రేగింది. అయినా ఆయన నోరు విప్పడం లేదు. డిగ్రీ గురించి మీడియా ప్రశ్నించినా, చిరునవ్వే అయన సమాధానం అవుతోందని అంటున్నారు. ఈ అంశం ఇప్పటికైతే పెద్దగా రచ్చ కెక్కలేదు కానీ, భవిష్యత్ లో  రాజకీయ దుమారం రేపే అవకాశం ఉందని అంటున్నారు. నిజానికి డిగ్రీ లేకున్నా పదవులు పొందవచ్చును, కానీ ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇస్తే మాత్రం ఉన్న పదవి ఊడి పోవడంతో పాటుగా, ఆరేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హత కూడా కోల్పోతారు. అయితే తమ్మినేని ఎన్నికల అఫిడవిట్ లో లో డిగ్రీ చదివినట్లు పేర్కొన్నారా లేదా అనేది తెలియవాల్సి వుంది. అది తెలిస్తే, అప్పడు కథ మరో మలుపు తిరుగుతుంది, లేదంటే ..అంతే సంగతులు.

జగన్ స్టిక్కర్లంటే వాటికీ కోపమే!

ఏపీ సీఎం జగన్ స్టిక్కర్ల ను ప్రజలే కాదు.. కుక్కలు, కోతులూ కూడా చీదరించుకుంటున్నాయి. జగన్ స్టిక్కర్ కనిపిస్తే చాలు పీకి, చింపి పారేస్తున్నాయి. జగన్ స్టిక్కర్ ను ఎవరైనా తొలగిస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరికలు చేస్తున్న సర్కార్.. మరి కోతులు, కుక్కలపై కూడా చర్యలు తీసుకుంటారా అని జనం ప్రశ్నిస్తున్నారు. ఒక అడుగు ముందుకు వేసి ఏపీ సీఎం జగన్ రెడ్డి చిత్రం ఉన్న స్టిక్కర్ ను చింపిన కుక్కపై వెంటనే చర్యలు తీసుకోవాలని, ఆ కుక్క స్టిక్కర్ ను చింపడం వెనుక ఉన్న కుట్ర కోణాన్ని పోలీసులు దర్యాప్తు చేసి ఛేదించాలని డిమాండ్ కూడా చేస్తున్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు ఉదయశ్రీ  జగన్ రెడ్డి స్టిక్కర్ ను చింపిన కుక్కపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును తీసుకోవడానికి ముందు వెనుకలాడిన పోలీసులు ఎట్టకేలకు స్వీకరించారనుకోండి అది వేరే విషయం.  నువ్వే మా నమ్మకం జగనన్న కార్యక్ర మంలో భాగంగా ఓ ఇంటికి అంటించిన స్టిక్కర్ ను కుక్క చించేయడానికి సంబంధించిన వీడియో  గత రెండు రోజుల నుంచి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ముఖ్యమంత్రికి తీవ్ర అవ మానం జరిగిందని, దీనిని రాష్ట్ర ప్రజలందరికీ జరిగినట్లుగా భావించి ఆ  కుక్కపై చర్యలు తీసుకోవాలని విజయవాడ నున్న పోలీసు స్టేషన్లో ను  ఉదయశ్రీ తెదేపా నేతలతో కలిసి ఫిర్యాదు చేశారు. దీన్ని పోలీసులు స్వీకరించి నెంబరు కూడా ఇచ్చారు. అధికార పార్టీ నేతలకు అవమానం జరిగితే ఆఘ మేఘాలపై కేసులు నమోదు చేసే పోలీసులు.. సీఎంకు జరిగిన అవమానంపై ఫిర్యాదు చేసినా ఎందుకు వేగంగా స్పందించడం లేదని జనం నిలదీస్తున్నారు. అలాగే ఓ ఇంటిపై అంటించి ఉన్న జగన్ పోస్టర్ ను ఓ కోతి పీకి పాడేయడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ కోతిపై కూడా చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ లు వెల్లువెత్తుతున్నాయి. చూడాలి మరి పోలీసులు ఎంత వేగంగా స్పందిస్తారో?