డామిట్.. బిడ్ కథ అడ్డం తిరిగింది!

అందరి విషయం పక్కన పెడితే, అన్నీ తెలిసిన జేడీ లక్ష్మినారాయణ సహా మేధావులు అనుకునే మరొకొందరు ఎలా, తప్పులో కాలేశారు? కేంద్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని, ఓ సహాయ మంత్రి అలవోకగా చేసిన ప్రకటన తుడిచేస్తుందని, అంతటి జేడీ ఎలా భావించారు?  అంతే కాదు స్వరాష్ట్రంలో తొమ్మిదేళ్లలో ఒక్క ప్రాజెక్టుకూ జాతీయ హోదా తెచ్చుకోవడంలో విఫలమైన, కనీసం ఒక మెడికల్ కాలేజీ తెచ్చుకోవడం చేతకాని బీఆర్ఎస్  పొరుగు రాష్ట్రంలోని విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను అడ్డుకోగలిగిందని అంతటి జేడీ.. ఎలా భావించారు? ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని పక్కన పెట్టినా, తెలుగు దేశం, జనసేన, ఉభయ కమూనిస్ట్ పార్టీల నాయకులు,ఈ అందరినీ మించి విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులు, వివిధ ప్రజా సంఘాలు చేసిన ఆందోళనలకు తలోంచని, తలొగ్గని కేంద్ర ప్రభుత్వం పొరుగు రాష్ట్రం తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత  ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  నాలుగు రోజులు సాగించిన ‘బిడ్’ రాజకీయానికి  కేంద్ర ప్రభుత్వం భయపడి  ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుందని, తెలంగాణ మంత్రులు అనుకుంటే అనుకోవచ్చు.  కానీ, అన్నీ తెలిసిన జేడీ లక్ష్మీనారాయణ ఎలా అనుకున్నారు?  అనేది చాలా మందికి పజిల్ గా   మారింది. అయితే ఆయన బీఆర్ఎస్ లో చేరే ఆలోచనలో ఉండడమే ఇందుకు కారణమని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జేడీ విషయం పక్కన పెట్టి అసలు విషయంలోకి వస్తే నిజానికి కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగన్‌ సింగ్‌ కులస్థే తాజా ప్రకటనలో కొత్తదనం ఏదీ లేదు. 2021 జనవరి 27న ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ కమిటీ (సిసిఇఎ) వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌లోని వంద శాతం పెట్టుబడుల ఉపసంహరణకు సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకుంది.. అయితే గడచిన రెండేళ్ళలో ప్రేవేటీకరణ సంబందించిన ప్రక్రియ సాగవలసినంత వేగంగా ముందుకు సాగలేదు. అదే విషయాన్ని కేంద్ర మంత్రి కాసింత తీపిగా  ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదు  విభాగాలను బలోపేతం చేస్తాం అంటూ చెప్పుకొచ్చారు.  అయితే  ఆ మాట మీద కూడా మంత్రి నిలబడలేదు. సాయంత్రం అయ్యేసరికి  మాట మార్చారు, తూచ్ ... విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం తన ఒక్కడి చేతుల్లో లేదని చావు కబురు చల్లగా చెప్పారు. నిజానికి  కేంద్ర సహాయ మంత్రికి మంత్రివర్గ నిర్ణయాలలో  ప్రత్యక్ష ప్రమేయం ఉండదు. అయినా,  గురువారం(ఏప్రిల్ 13) విశాఖ పర్యటనకు వచ్చిన ఉక్కు శాఖ సహాయ మంత్రి  చేసిన ఒక అనధికార ప్రకటన ఆధారంగా బీఆర్ఎస్ నాయకులు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను కేసీఆర్  ఒంటి చేత్తో ఆపేశారని సంబురాలు చేసేసుకున్నారు. చేసుకుంటున్నారు. కోటలు దాటే మాటలూ మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా బీఆర్ఎస్ సంబరపడాల్సిందేమీ జరగలేదు.  కేంద్ర ప్రభుత్వం ఎప్పటిలానే, మరోమారు వంచనా శిల్పాన్ని ప్రదర్శించింది. పూటకో మాట.. రోజుకో ప్రకటనతో ప్రజలను, కార్మికులను ఆంధ్రులను కేంద్ర ప్రభుత్వం మరోమారు   అవమానించింది. నిజానికి కేంద్ర మంత్రి ప్రకటన  మరింత ఆందోళనకు గురిచేస్తోంది. ప్రైవేటీకరణ విధానం నుంచి కేంద్రం వెనక్కి రాలేదని తాజాగా మరోసారి స్పష్టమైంది. కేంద్ర మంత్రి ఉదయం వైజాగ్‌ పోర్టు కళావాణిలో జరిగిన రోజ్‌గార్‌ మేళా కార్యక్రమం అనంతరం మీడియాతో మాట్లాడుతూ 'వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణపై ముందుకెళ్లడం లేదు. విభాగాలను బలోపేతం చేస్తాం  అంటూ ప్రకటించారు. దీంతో స్టీల్‌ ప్లాంట్‌ కార్మికవర్గం, రెండు తెలుగు రాష్ట్రాలోకీ ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా వెళ్లింది. కేంద్ర మంత్రి ప్రకటన ఎంతో కొంత ఉపశమనం కలిగించింది అనుకునేలోపే అంతా నా చేతిలో లేదు. కేంద్ర మంత్రి మండలి  చేతిలో ఉంది  అని సహాయ మంత్రిగారు మాట మార్చారు. విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ, స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం, స్టీల్‌ యూనియన్‌ ప్రతినిధులతో జరిగిన సమావేశంలో మంత్రి యూ టర్న్ తీసుకున్నారు. ఈ సమావేశంలో విశాఖపట్నం ఎంపీ ఎంవివి సత్యనారాయణ కూడా ఉన్నారు. ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నేతలు మాట్లాడుతూ.. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను కేంద్రం స్ట్రాటజిక్‌ సేల్‌ కింద పెట్టడాన్ని నిలిపివేయాలని, ఇది వరకే ప్లాంట్‌ను అమ్మివేసే దిశగా వేసిన లీగల్‌ అడ్వైజరీ, ఆస్తుల మదింపు, ట్రాన్జాక్షన్‌ కమిటీలను రద్దు చేయాలని ప్రతిపాదన చేశారు. ఈ విషయమై మంత్రి జోక్యం చేసుకుంటూ 'అంతా నా చేతిలో ఏమీ లేదు. ఢిల్లీలో నేను మాట్లాడతాను. మీరు చేసిన ప్రతిపాదనలు తెలియజేస్తాను' అంటూ చెప్పుకొచ్చారు. ప్రైవేటీకరణ నుంచి కేంద్రం వెనక్కి వెళుతుందన్న మాట ఉక్కు పరిరక్షణ కమిటీ, స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యాలతో జరిగిన చర్చల సందర్భంగా మంత్రి వెల్లడించలేదు. దీంతో కార్మిక సంఘాలు   పోరాటం కొనసాగుతుందని పేర్కొనాయి.  కానీ  ఈలోపే తెలంగాణ మంత్రులు తమ ముఖ్యమంత్రి కేసీఆర్ ని పొగడ్తలతో ముంచెత్తారు. కేసీఆర్‌ దెబ్బ అంటే అలా ఉంటుందని  స్వయంగా మంత్రి కేటీఆర్ జబ్బలు చరుచుకున్నారు. కానీ ఈ చప్పట్లు, సంబురాలు ముగిసే లోగానే కేంద్ర మంత్రి, యూ టర్న్ తీసుకున్నారు. అంటే బీఆర్ఎస్ నేతలు ఒకరితో ఒకరు పోటీ పడి చేసిన తొందరపాటు ప్రకటనలు ఇప్పుడు బీఆర్ఎస్ మెడకే చుట్టుకున్నట్లు అయిందని అంటున్నారు. చిత్రం ఏమిటంటే ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల్లో ఒక వర్గం  కేసీఆర్, కేటీఆర్  రాజకీయ ప్రయోజనాలను ఆశించి తీసుకున్నతొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు ప్రకటనల కారణంగానే కేంద్ర మంత్రి మధ్యాన్నానికి మాట మార్చారని అంటున్నారు. అలాగే ఇప్పడు ‘బిడ్’ విషయంలోనూ బీఆర్ఎస్ సర్కార్ కు తిప్పలు తప్పక పోవచ్చని, అంటున్నారు.

ఔను.. ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఒక్కటయ్యాయి!

ఆంధ్ర ప్రదేశ్ లో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఒక్కటయ్యాయి. కేంద్రంలోని బీజేపీ విద్రోహపూరిత విధానాలపై రాష్ట్రంలో సిపిఎం, సిపిఐ ఉమ్మడి ప్రచార భేరికి శ్రీకారం చుట్టాయి. రాజ్యంగా నిర్మాత బీఆర్ అంబేడ్కర్ జయంతి రోజున రాజ్యాంగ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఒకటిగా గొంతెత్తాయి. రెండు పార్టీల ఉమ్మడి ప్రచార భేరి విజయవాడ నుండి ప్రారంభమయ్యింది. అ దే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సాగుతున్న వైసీపీ అరాచక పాలనను వామపక్షాల నేతలు ఎండగట్టారు.  ఉభయ కమ్యూనిస్టు పార్టీలు ఉమ్మడి పోరాటానికి శ్రీకారం చుట్టండం రాష్ట్ర రాజకేయాల్లో పెను మార్పులకు దరి తీస్తుందని రాజకీయ సమీకరణాలలోనూ మార్పుకు శ్రీకారం అవుతుందని పరిశీలకులు అంటున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకించే పార్టీలన్నీ ఏకమయ్యేందుకు కమ్యూనిస్టుల ఉమ్మడి పోరాటం దోహదం చేస్తుందంటున్నారు.    మతోన్మాద బిజెపిని సాగనంపుదాం ! దేశాన్ని కాపాడుకుందాం! అనే నినాదంతో విజయవాడలో ప్రారంభమైన ఈ ప్రచార భేరి రాష్ట్ర వ్యాప్తంగా 26 జిల్లాల్లో మే 1 వ తేదీ వరకూ కొనసాగుతుందని వామపక్ష పార్టీల నేతలు ఉమ్మడిగా  ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రచార భేరి ప్రారంభోత్సవం సందర్భంగా...  విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కారత్‌, సిపిఐ కేంద్ర కార్యదర్శి వర్గ సభ్యుడు వినరు విశ్వం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, తదితరులు నివాళులర్పించారు.  విజయవాడ ఎంబివికె భవన్‌లో ఏర్పాటు చేసిన సభలో ప్రజా నాట్యమండలి బృందం సంగీతాలాపన చేసింది. నృత్య ప్రదర్శనలతో అలరించింది. ప్రారంభ సభలో సిపిఎం పొలిట్‌ బ్యూరో సభ్యుడు ప్రకాష్‌ కరత్‌ ప్రసంగించారు. బిజెపిని సాగనంపి దేశాన్ని కాపాడుకుందామని సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసరావు, కె.రామకృష్ణ పిలుపునిచ్చారు.  ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి, భావోద్వేగాల ద్వారా మరలా అధికారంలోకి రావాలనే దుష్ట ప్రయత్నం మోడీ, అమిత్‌షా బృందం చేస్తోందని విమర్శించారు. శాంతియుతంగా, సామరస్యంగా, సంతోషంగా ప్రజలు పండుగలు, పబ్బాలు జరుపుకునే పరిస్థితి లేకుండా బీజేపీ ప్రయత్నిస్తోందన్నారు. దేశ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధంగా మతం పేరుతో ప్రజల మధ్య ఘర్షణను సృష్టించి దేశాన్ని బలహీన పరుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ కుంభకోణాన్ని, నరేంద్రమోడీ వైఫల్యాలను పక్కదారి పట్టించేందుకే ఇదంతా చేస్తోందని విమర్శించారు.  దేశవ్యాప్తంగా ఇంత జరుగుతున్నా బిజెపి దుర్మార్గాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌, వైసిపి కనీసం ఖండించడం లేదన్నారు. రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకలాపాలు పాఠశాలల్లో స్వేచ్ఛగా విస్తృతంగా జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పిల్లల  మెదళ్లను మతం పేరుతో కలుషితం చేస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రానికి బిజెపి చేస్తున్న ద్రోహాన్ని ఎండగట్టి, మతసామరస్యాన్ని కాపాడాలని ప్రజలను కోరారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా కాపాడే ఉద్దేశం రాష్ట్రప్రభుత్వానికి లేదని విమర్శించారు. కేంద్రం ముందు నుంచి పొడిస్తే రాష్ట్రప్రభుత్వం వెనక నుంచి పొడుస్తోందన్నారు. ఇది దుర్మార్గమన్నారు. ప్రైవేటీకరణపై సిఎం మౌనంగా ఉంటే మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు మాత్రం ప్రజలను పక్కదారి పట్టించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపితో కుమ్మకై రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టడాన్ని అంగీకరించబోమన్నారు.

గీతంపై జగన్ దాడి!

కోర్టులంటే లెక్క లేదు... భూకబ్జాల యావే తప్ప మరో లక్ష్యం లేదు.  ఎక్క‌డెక్క‌డ ఖాళీ స్థ‌లాలు ఉన్నాయి.. ఎక్క‌డెక్క‌డ ప్ర‌భుత్వ భూములు ఉన్నాయి.. ఎక్క‌డెక్క‌డ టీడీపీ నేత‌ల ఆస్తులున్నాయి.. వాటిని స్వాధీనం చేసుకోవడం ఎలా మొత్తం ప్రభుత్వ యంత్రాంగమంతా ఈ లక్ష్యంతోనే పని చేస్తోందా అనిపించేలా ఏపీలో పరిస్థితులు ఉన్నాయి.   ముఖ్యంగా విశాఖ పట్నంలో తెలుగుదేశం నాయకుల ఆస్తులే టార్గెట్ గా ప్రభుత్వ యంత్రాంగాన్ని యుద్ధ ప్రాతిపదికన నడిపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.  అందులో భాగంగానే గీతం వ‌ర్సిటీ ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మితమైందంటూ చాలా కాలంగా జగన్ సర్కార్ హడావుడి చేస్తోంది. గతంలో ఒక సారి  విశాఖలోని ప్ర‌తిష్టాత్మ‌క విశ్వవిద్యాలయం గీతం యూనివ‌ర్శిటీకి చెందిన ప‌లు క‌ట్ట‌డాల‌ను విశాఖ మున్సిప‌ల్ అధికారులు   కూల్చివేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి కట్టారన్న ఆరోపణలతో.. గీతం వర్సిటీ ప్రధాన ద్వారంతో పాటు, ప్రహరీ గోడలో కొంతభాగం, అలాగే సెక్యూరిటీ రూములను జీవీఎంసీ సిబ్బంది కూల్చివేశారు. ఈ సమయంలో యూనివర్సటీకి దారి తీసే రోడ్లను మూసివేసి మరీ కూల్చివేత కొనసాగయించారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. తాజాగా ఇప్పుడు మరో మారు జగన్ వర్సిటీ అదే పునరావృతం చేసింది.  దీంతో విశాఖపట్నంలోని  గీతం యూనివర్సిటీ వద్ద మరోమారు ఉద్రిక్తత చోటుచేసుకుంది. శుక్రవారం (ఏప్రిల్ 14) తెల్లవారుజామున 2 గంటల నుంచే యూనివర్సిటీకి  నలువైపులా పోలీసులు భారీగా మోహరించి  వర్సిటీకి వెళ్లే మార్గంలో బారికేడ్లను అడ్డుగా ఉంచారు. అటువైపు ఎవ్వరిని రానివ్వకుండా పకడ్బందీ చర్యలు చేపట్టారు. పోలీసు బందోబస్తు మధ్య కంచె నిర్మాణ సామాగ్రితో గీతం యూనివర్సిటీలోకి రెవెన్యూ సిబ్బంది వెళ్లారు. గీతం యూనివర్సిటీ ప్రధాన క్యాంపస్‌లో ప్రభుత్వం స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేశారు. మెుత్తం కిలోమీటర్‌ పొడవునా ప్రభుత్వ యంత్రాంగం కంచె వేసింది.కంచె వేస్తున్న స్థలమంతా ప్రభుత్వానిదేనని అధికారులు చెబుతున్నారు.   ఆక్రమణల కూల్చివేత పేర శుక్రవారం తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి ఆ ప్రాంతాన్ని ఒక యుద్ధ భూమిని తలపించేదిగా మార్చేశారు.  ఎండాడ  ప్రాంతం నుంచి బారికేడ్ లు ఏర్పాటు చేసి వాహనదారులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ఐడి కార్డులు ఉంటేనే ఆ మార్గంలో అనుమతిస్తున్నారు.  

కవిత కు సుఖేశ్ ఫోబియా.. చాటింగ్ పై మౌనం

మనీ ల్యాండరింగ్ కేసులో అరెస్టై తీహార్ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తో చాటింగ్ చేశానంటూ వెల్లడించిన వివరాలు రాజకీయంగా ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణలపై ఎమ్మెల్సీ కవిత రియాక్షన్ తో ఆమెపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సుఖేష్ చంద్రశేఖర్ ఎవరో తనకు తెలియదంటూ ఆమె స్పందించిన తీరును పలువురు తప్పుపడుతున్నారు. సుఖేష్ చంద్రశేఖర్ న్యాయవాది అయితే కవిత స్పందన చిన్ని పిల్లల తీరులో ఉందని ఎద్దేవా చేశారు. సుఖేష్ చంద్రశేఖర్ చేసిన ఆరోపణలపై విచారణను ఎదుర్కొనడానికి కవిత భయపడుతున్నట్లుగా ఉందని అన్నారు. ఒక రాజకీయ నాయకురాలిగా ఆరోపణలపై విచారణను ఎదుర్కొనేందుకు ఆమె ముందుకు రావాలని, అందుకు భిన్నంగా విచారణను ఎదుర్కొనేందుకు జంకుతున్నారంటే తన క్లయంట్ ఆరోపణలు వాస్తవం కావడమే కారణమని పేర్కొన్నారు.  సుఖేశ్  ఆరోపణలు ఆధారరహితమైనవయితే ఆ విషయం దర్యాప్తులోనే వెల్లడవుతుంది కదా అని ప్రశ్నించారు.  సుఖేష్ ఆరోపనలకు కవిత స్పందించిన తీరు  మీడియా, రాజకీయ పార్టీల మీదకు తప్పు తోసేయాలన్న ప్రయత్నంగా కనిపిస్తోందన్నారు.   సుఖేశ్   ఆరోపణలను  నిబంధనల ప్రకారమే వెల్లడించారని తెలిపారు. ఎవిడెన్సు యాక్టులోని సెక్షన్ 65(బీ) ప్రకారం సర్టిఫై చేశారని, ఆయన తన ఆరోపణలను  అఫిడవిట్ రూపంలోనే అందజేశారని, అందువల్లనే డిజిటల్ ఎవిడెన్సుగా పనికొచ్చే స్క్రీన్ షాట్‌లను విడుదల చేశారని సుఖేష్ న్యాయవాది వివరించారు.  సుఖేశ్ చేసిన ఆరోపణలన్నింటినీ రుజువు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని, కేంద్ర దర్యాప్తు సంస్థల పెద్దలను అడ్రస్ చేస్తూ రాసిన లేఖలో కూడా సమగ్రమైన దర్యాప్తును కోరారని ఆయన చెప్పారు.  దర్యాప్తు సంస్థల నుంచి తప్పించుకునేందుకు కవిత ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యేలా సుఖేష్ ఆరోపణలను ఆమె ఖండించిన తీరు ఉందని పేర్కొన్నారు.   మొత్తం మీద సుఖేష్ చంద్రశేఖర్ ఆరోపణల తరువాత ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత ప్రమేయం ఉందన్న అనుమానాలు మరింత బలపడ్డాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

వివేకా హత్య కేసులో అవినాష్ ప్రధాన అనుచరుడి అరెస్ట్

మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో అత్యంత కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులు సంబంధించి వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని సీబీఐ అధికారులు శుక్రవారం (ఏప్రిల్ 14) ఉదయం అరెస్టు చేశారు.  దీంతో ఏపీ సీఎం జగన్ రెడ్డి సొంత చిన్నాన్న వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధమైనట్టేనా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   పులివెందులలో గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డిని అదుపులోనికి తీసుకున్న సీబీఐ అధికారులు ఆయనను అక్కడి నుంచి కడప సెంట్రల్ జైల్లోని గెస్ట్ హౌస్ కు తీసుకెళ్లి విచారణ జరిపారు. అనంతరం ఆయనను  సీబీఐ కోర్టులో హాజరుపరిచేందుకు   హైదరాబాద్ కు తరలించారు. ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్టు చేసినట్లు ఆయన కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు సమాచారం ఇచ్చారు.  ఇలా ఉండగా.. నాలుగేళ్ల కిందట వివేకా హత్య జరిగిన రోజు వైఎస్ అవినాష్ రెడ్డి, శివశంకర్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్ రెడ్డి కూడా సంఘటనా స్థలానికి వెళ్లినట్లు సీబీఐ గుర్తించింది. అంతే కాకుండా ఆ రోజు అంబులెన్స్, ఫ్రీజర్, వైద్యులను అక్కడికి రప్పించడంలో ఉదయ్ కుమార్ రెడ్డి  కీలక పాత్ర పోషించినట్టు సీబీఐ చెబుతోందిం.  వివేకానందరెడ్డి మృతదేహానికి ఉదయ్ తండ్రి జయప్రకాశ్ రెడ్డి కట్లు కట్టారన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే ఉదయ్ కుమార్ రెడ్డిని పలుమార్లు విచారించిన సీబీఐ ఇప్పుడు అరెస్టు చేసింది. హత్య జరిగిన రోజున అవినాశ్ రెడ్డి తండ్రి భాస్కర్‌రెడ్డి ఇంట్లో ఉదయ్ కుమార్ రెడ్డి  ఉన్నట్టు గూగుల్ టేకవుట్ ద్వారా సీబీఐ గుర్తించింది. ఇలా ఉండగా వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు ఇటీవల ఒకింత మందగించినట్లు కనిపించింది. తాజాగా గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి అరెస్టుతో దర్యాప్తులో కీలక ముందడుగు పడినట్లేనని నిపుణులు చెబుతున్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి  అరెస్టుతో తరువాతి వంతు ఎవరిదన్న చర్చ జరుగుతోంది. దర్యాప్తు తీరును, అరెస్టుల పర్వాన్ని గమనిస్తున్న వారు మాత్రం తరువాతి వంతు ఇక వైఎస్ అవినాష్ రెడ్డి, అతని తండ్రి భాస్కరరెడ్డిదేనని అంటున్నారు. 

యోగీ ..అన్నంత పని చేసేశారు!

ఉత్తర ప్రదేశ్ లో మరో ఎన్ కౌంటర్ జరిగింది.  లోక్ సభ మాజీ ఎంపీ, ప్రస్తుతం జైల్లో ఉన్నగ్యాంగ్ స్టర్ అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌ ను యూపీ పోలీసులు ఎన్ కౌంటర్ లో హత మార్చారు. ఈ సంఘటన ఒక్క యూపీలోనే కాదు దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది.  నిజానికి యోగీ ఆదిత్య నాథ్  ఉత్తర ప్రదేశ్  ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి యూపీలో  బాహుబలులు గా చెలామణి అవుతున్న గ్యాంగెస్టర్లను ఏరి పారేయడంలో పాత రికార్డులు అన్నిటినీ తుడిచేశారు. అనేక మంది పేరు మోసిన గ్యాంగెస్టర్లలో సరెండర్ అయిన వాళ్ళు అయ్యారు. కాదంటే  ఎన్ కౌంటర్లలో ఖతం అయ్యారు. ముఖ్యంగా 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ రెండవ సారి అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారు.  ఈ నేపథ్యంలోనే  రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఉమేశ్ పాల్‌ హత్య ఘటన తర్వాత హంతకులను ఉద్దేశించి సాక్షాత్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ హంతకులకు అసెంబ్లీ వేదికగానే గట్టి హెచ్చరిక చేశారు. న్యాయవాది  బీఎస్పీ మాజీ ఎమ్మెల్యే రాజ్ పాల్ హత్యకేసులో ప్రత్యక్ష సాక్షి, ఉమేష్ పాల్ ను ప్రయాగ రాజ్ లో హత్య చేసిన హంతకులను మట్టిలో కలిపేస్తా ( మిట్టీ మే మిలాదేంగా) అనే హెచ్చరించారు.  అంతే కాదు అనట్లుగానే  ఒక్కో నిందితుడిని ఏరిపారేస్తూ యూపీలో మాఫియాను  భూస్థాపితం చేస్తున్నారు.  తాజాగా గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ కుమారుడు అసద్‌ ఎన్‌కౌంటరే అందుకు ఉదాహరణ. ఉమేశ్‌ పాల్‌ హత్య కేసును  సవాల్‌గా తీసుకున్న యూపీ పోలీసులు ప్రధాన నిందితుడైన అసద్‌ కోసం 50 రోజుల పాటు రాష్ట్రమంతా జల్లెడపట్టారు. చివరకు ఝాన్సీలో అతడిని తుదముట్టించారు.  గ్యాంగ్‌స్టర్‌ అతీక్‌ అహ్మద్‌ మూడో కుమారుడు అసద్‌ అహ్మద్‌. తన ఇద్దరు అన్నలు మరో కేసుల్లో పోలీసులకు లొంగిపోవడంతో అతీక్‌ మాఫియా పనులను  చూసుకుంటున్నాడు. మాజీ ఎమ్మెల్యే రాజుపాల్‌ హత్య వ్యవహారంలో సాక్షి ఉమేశ్‌పాల్‌పై అతీక్‌ కుటుంబీకులు ఆగ్రహంగా ఉన్నారు. దీంతో ఉమేశ్‌ను హత్య చేసేందుకు అతీక్‌ జైలు నుంచే పథకం రచించగా.. దాన్ని అసద్‌ అమలు చేసి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎలాంటి క్రిమినల్‌ రికార్డులు లేని అసద్‌.. ఉమేశ్‌ పాల్‌ హత్య నాటి వరకు యూపీ పోలీసుల రాడార్‌లో లేడు. ఆ హత్యకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాల్లో అసద్‌ కనిపించడంతో పోలీసులు అతడిపై దృష్టి సారించారు. ఫిబ్రవరి 24న ప్రయాగ్‌రాజ్‌లో ఉమేశ్ తన ఇంటి ఎదుటే దారుణ హత్యకు గురయ్యారు. ఆ హత్యను అసద్‌ దగ్గరుండి పర్యవేక్షించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఘటన సమయంలో అతడు అక్కడే కారులో ఉండటమే గాక.. ఉమేశ్ ఇంట్లోకి పారిపోతుండగా వెనక నుంచి కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఇదంతా సీసీటీవీ కెమెరాల్లో రికార్డైందని పేర్కొన్నారు. ఆ తర్వాత నుంచి అసద్‌ పరారీలో ఉన్నాడు. అసద్ కోసం దాదాపు 50 రోజులుగా పోలీసులు విస్తృతంగా గాలింపు చేపట్టారు. ఒకానొక సమయంలో అతడు నేపాల్‌ పారిపోయినట్లు సమాచారం రావడంతో ఆ దేశానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. మరోవైపు  అసద్‌ మొబైల్‌ ఫోన్లు ఉపయోగించకపోవడంతో అతడిని పట్టుకోవడం పోలీసులకు కష్టంగా మారింది. హత్య తర్వాత లఖ్‌నవూ పారిపోయిన అసద్‌.. అక్కడ నుంచి కాన్సూర్‌, మీరట్, ఢిల్లీ ఇలా పలు ప్రాంతాల్లో నక్కినట్లు దర్యాప్తులో తెలిసింది. తాజాగా అతడు ఝాన్సీ నుంచి మధ్యప్రదేశ్‌కు పారిపోయేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం అందింది. మరోవైపు, ఉమేశ్ పాల్‌ హత్య కేసులో విచారణ నిమిత్తం అసద్‌ తండ్రి అతీక్‌ను నేడు ప్రయాగ్‌ రాజ్‌ కోర్టుకు తీసుకొచ్చారు. అయితే అతీక్‌ను తరలించే పోలీసు కాన్వాయ్‌పై దాడి చేసి వారిని తప్పించేందుకు అసద్‌ కుట్ర చేస్తున్నట్లు నిఘా వర్గాల నుంచి పోలీసులకు సమాచారం అందింది. దీంతో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ బృందాలు అప్రమత్తమయ్యాయి. ఈ క్రమంలోనే అసద్‌ కోసం ఝాన్సీలో గాలిస్తుండగా.. ఓ బైక్‌పై మరో నిందితుడు గుల్హామ్‌తో కలిసి వెళ్తూ కన్పించాడు. పోలీసులు అతడిని అడ్డుకునేందుకు ప్రయత్నించగా నిందితులు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ఎదురుకాల్పులు జరిపి వారిని మట్టుబెట్టారు. ఇద్దరు డీఎస్పీ ర్యాంక్‌ అధికారుల నేతృత్వంలో 12 మంది బృందం ఈ ఆపరేషన్‌లో పాల్గొంది. ఎన్‌కౌంటర్‌ సమయంలో మొత్తం 42 రౌండ్ల కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. రాష్ట్రంలో యోగి సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత మాఫియా, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపారు. 2017 మార్చి నుంచి ఇప్పటివరకు యూపీ పోలీసులు 178 మంది క్రిమినల్స్‌ను ఎన్‌కౌంటర్‌లో చంపేశారు. అంటే గత ఆరేళ్లలో ప్రతి 13 రోజులకో నేరస్థుడు హతమయ్యాడు. ఇదే కాలంలో 23,069 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. క్రిమినల్స్‌ జరిపిన ఎదురుకాల్పుల్లో 15 మంది పోలీసులు అమరులయ్యారు. నిజానికి, 2022 ఎన్నికల్లో బీజేపీ  అధికారం నిలబెట్టుకోవడంలో మాఫియా, గ్యాంగ్‌స్టర్లపై ఉక్కుపాదం మోపాడం కూడా ఒక కీలక అంశం.

కాషాయం కట్టిన కాంగ్రెస్ నేత !

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రత్యర్ధి వర్గానికి చెందిన మరో సీనియర్ నాయకుడు, ఏఐసీసీ కార్యక్రమాల కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. గత కొద్ది రోజులుగా ఆయన పార్టీ వీడుతారని జరుగతున్న ప్రచారాన్ని ఏలేటి నిజం చేశారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసి. .ఆ వెంటనే బీజేపీలో చేరిపోయారు. తనకు పీసీసీ నుంచి వచ్చిన షోకాజ్ నోటీసుపై కాంగ్రెస్ అధిష్టానంతో తేల్చుకునేందుకు ఢిల్లీకి వెళ్లిన ఆయన.. బీజేపీ నేతలతో మంతానాలు సాగించారు. ఆ తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అయ్యారు. అంతకు ముందే అయన తన రాజీనామా లేఖను కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేకు పంపించారు.  గత రెండు రోజులుగా ఢిల్లీలో మకాం చేసిన బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చిన వెంటనే మహేశ్వర రెడ్డి  బీజేపీ జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా సమక్షంలో బీపీపీ తీర్థం పుచ్చుకున్నారు. అంతకు ముందు.. మహేశ్వర్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ తో సమావేశం అయ్యారు. ఆయన వెంట బీజేపీ రాష్ట్ర  అధ్యక్షుడు బండి సంజయ్  ఇతర నేతలు ఉన్నారు. ఈ సందర్భంగా తరుణ్ చుగ్  తెలంగాణ ముఖ్యమంత్రి  కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ అరాచక పాలన అంతం.. ప్రధాని నరేంద్ర మోడీ వల్లే సాధ్యమన్నారు. మహేశ్వర్ రెడ్డి చేరికతో బీజేపీ మరింత బలోపేతం అవుతుందన్నారు.  మరో వంక ఏలేటి కూడా భారాస అరాచక పాలనను అంతమొందించే శక్తి బీజేపీతోనే సాధ్యమనీ, అందుకే బీజేపీ లో చేరుతున్నట్లు చెప్పారు. ప్రధాని నరేంద్ర మోడీ వల్ల తెలంగాణలో అరాచక పాలనకు అంతమవుతుందని  మహేశ్వరరెడ్డి చెప్పారు. మోడీ నాయకత్వంలో బీజేపీ బలోపేతం కోసం పని చేస్తానని తెలిపారు.  కొంతకాలం నుంచి కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి అడుగులు వేస్తున్నాయని, రెండు పార్టీలూ కూడా కలిసి కట్టుగా పని చేస్తున్నాయన్నారు. అవినీతిపై పోరాటం చేయాల్సిన కాంగ్రెస్ పార్టీ.. నిస్తేజంగా ఉందన్నారు. బీఆర్ఎస్ తో కాంగ్రెస్ పొత్తు ఉంటుందని కొందరు సీనియర్లే అంటే..  పొత్తు లేదని మరికొందరు కామెంట్స్ చేస్తున్నారని..  క్లారిటీ, నిబద్దత లేదని.. అంతా గందరగోళంగా ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీలో కోవర్టులు ఉన్నారని.. పార్టీ వాళ్లు వ్యాఖ్యలు చేస్తూ.. కార్యకర్తలను అయోమయానికి గురి చేస్తున్నారని అన్నారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ కోసం కష్టపడి పని చేశారని బండి సంజయ్ చెప్పారు. జేపీ నడ్డా సమక్షంలో మహేశ్వర్ రెడ్డి పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. బీజేపీలో ఆయనకు సరైన ప్రాధాన్యత ఇస్తామన్నారు. తెలంగాణలో నియంతపాలన పోవాలని, పేదల రాజ్యం, రామ రాజ్యం రావాలన్నారు. మోడీ నాయకత్వంలో కేసీఆర్ అవినీతి పాలన అంతం అవుతుందన్నారు. అందరం కలిసి బీజేపీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. నిర్మల్ లోనే కాకుండా.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ప్రాంతాలను మహేశ్వర్ రెడ్డి ప్రభావితం చేయగలరని తెలిపారు. ఇదలా ఉంటే, ఇటీవల బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన మాజీ ఎంపీ మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎటు వెడతారనేది ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ ఆ ఇద్దరిని తమ వైపు తిప్పుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా వీరిద్దరి  ప్రభావం ఉమ్మడి మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాల   మీద ఎక్కువగా ఉన్నందున, అక్కడి నుంచి భారీగా వలసలు ఉండే అవకాశముందంటున్నారు.

విశాఖ ఉక్కు బీఆర్ఎస్ విజయమేనా?

తెలంగాణ ప్రభుత్వం, ‘విశాఖ ఉక్కు’ ప్రైవేటు పరం కాకుండా చూసేందుకు, నడుం బిగించింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం, విశాఖ ఉక్కుని ప్రైవేటు పరం చేసేందుకు సిద్దమై, పావులు కదుపుతుంటే, తెలంగాణ ప్రభుత్వం ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు, ముందు కొచ్చింది. ఆంధ్రులకు జరుగుతున్న అన్యాయానికి మనసు చెదిరిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  సాహసోపేతమైన సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రుల హక్కుగా కొట్లాడి తెచ్చుకున్న విశాఖ ఉక్కును  ప్రధాని మోదీ ప్రభుత్వం ఏ ఆదానీకో, అంబానీకో ధారాదత్తం చేయకుండా అడ్డుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం విశాఖ ఉక్కు  ‘బిడ్’  ప్రకియలో పాల్గొనాలని నిర్ణయించింది.   కొద్ది రోజుల క్రితం తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ .ఈ ప్రకటన చేసినప్పటి నుంచి  బీఆర్ఎస్ మంత్రులు, నాయకులు ఇదే పాట పాడుతున్నారు .రాజకీయ, మీడియా వర్గాల్లోనూ ఇదే చర్చ జరుగుతోంది. అంతే కాదు లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా  తెలంగాణ ప్రభుత్వం సింగరేణి కార్పొరేషన్ అధికారులను విశాఖకు పంపింది. అక్కడి పరిస్థితులను పరిశీలించడంతో పాటుగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ  అధికారులతో చర్చలు జరుపుతోంది. మరో వంక విశాఖ ఉక్కును  తెలంగాణ ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నట్లే బీఆర్ఎస్ వర్గాలు ప్రచారం చేసేస్తున్నాయి. ముఖ్యమంత్రి దొడ్డ మనసును ..ఆహా ఓహో అంటూ కీర్తిస్తున్నారు. మరో వంక విపక్షాలు తాదూర కంత లేదు మెడకో డోలు  అని ఎగతాళి చేస్తున్నారు.  బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏమైందని ప్రశ్నిస్తున్నాయి. రాష్త్రంలో మూత పడిన సిర్పూర్ పేపర్ మిల్లు, ఆజంజాహి మిల్లు, రేయాన్ ఫ్యాక్టరీలను తెరిపిస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయడం చేతగాని కేసీఆర్ ప్రభుత్వం విశాఖ ఉక్కు  ప్రైవేట్ పరం కాకుండా బిడ్డింగ్ దాఖలు చేస్తాననడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందని విపక్షాలు విరుచుకు పడుతున్నాయి.  అయితే అసలు విషయం ఏమంటే, విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సిద్దం గాలేదు.  విశాఖ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కొత్తగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇదే విషయాన్ని   గురువారం(ఏప్రిల్ 13) విశాఖలో పర్యటించిన కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే మరో మారు స్పష్టం చేశారు. వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ను ఇప్పటికిప్పుడు ప్రైవేటుపరం చేయాలని భావించడం లేదని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌సింగ్‌ కులస్తే స్పష్తం చేశారు. అయితే, ఈ ప్రకటనకు తెలంగానా ప్రభుత్వం చూపిన చొరవకు సంబంధం ఉండలేదా అనే విషయం పక్కన పెడితే  తెలంగాణ మంత్రులు మాత్రం క్రెడిట్ ను తమ ఖాతాలో వేసుకున్నారు. కేంద్ర మంత్రి చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై  గట్టిగా మాట్లాడింది ముఖ్యమంత్రి కేసీఆరేనని తెలిపారు. తెగించి కొట్లాడాం కాబట్టే కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గిందన్నారు.  కేసీఆర్‌ దెబ్బ అంటే అలా ఉంటుందని వ్యాఖ్యానించారు.అయితే  నిజానికి కేంద్ర ఇంతవరకు తీసుకున నిర్ణయంలో వెనక్కి పోయిందా అంటే లేదు. ఇంతవరకు కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకోలేదు.  నిజానికి, ఇటీవల కేంద్ర ప్రభుత్వం కేవలం ముడి పదార్థాలు లేదా మూలధనం సమకూర్చేందుకు ఆసక్తి వ్యక్తీకరణ (ఈవోఐ) ప్రకటన మాత్రమే చేసింది. వివరాలోకి వెళితే.. విశాఖ ఉక్కులో ‘కావేరి’ పేరుతో ఉన్న బ్లాస్ట్‌ ఫర్నేస్‌-3 ఏడాదిన్నర కాలంగా మూతపడి ఉంది. ముడి పదార్థాలకు అవసరమైన నిధులు లేక దానిని మూసేశారు. ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారింది. మిగిలిన రెండు బ్లాస్ట్‌ ఫర్నే్‌సలు నడిపేందుకు అవసరమైన ముడిపదార్థాలూ సమీకరించలేని దుస్థితి ఏర్పడింది. అన్ని దారులూ మూసుకుపోవడంతో విశాఖ ఉక్కు యాజమాన్యం కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చింది. ఎవరైనా ముడి పదార్థాలు సరఫరా చేస్తే… దానికి బదులుగా తయారుచేసిన స్టీల్‌ని ఇస్తాం  అంటూ గత నెలలో ఈవోఐ జారీ చేసింది. తనకు అవసరమైన వనరులను సొంతంగా సమకూర్చుకునే క్రమంలో విశాఖ ఉక్కు యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. ఇప్పడు కూడా ఆ ప్రక్రియ కొనసాగుతుందనే కేంద్ర మంత్రి  స్పష్టం చేశారు. అంటే  కేంద్రం వెనకడుగు వేసిందనే వాదనలో వాస్తవం లేదని అంటున్నారు.  నిజానికి  ఈ బీడ్ లో తెలంగాణ ప్రభుత్వం పాల్గొన్నా స్టీల్ ప్లాంట్ యాజమాన్యం తెలంగణ ప్రభుత్వానికి దక్కే ఆస్కారం లేదు.  కేవలం కేంద్ర ప్రభుత్వంపై బురదజల్లి రాజకీయ లబ్ది పొందే ప్రయత్నంలో భాగంగానే బీఆర్ఎస్ డ్రామా ఆడుతోందని బీజేపీ, ఇతర ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. అంతే కాదు, ప్రతి నెలా ఉద్యోగుల జీతాలు ఇవ్వలేని దుస్థితిలో ఉన్న  కేసీఆర్ ప్రభుత్వానికి విశాఖ స్టీల్ ప్లాంట్  కొనుగోలు చేసే స్థోమత గాని, ఆర్ధిక వెసులుబాటుగాని లేదని విపక్షాలు, ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. వీటన్నటికీ మించి  కేసీఆర్ ప్రభుత్వమే కాదు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థా కూడా పెట్టుబడుల ఉపసంహరణలో పాల్గొనే అవకాశం లేదు. 2022 ఏప్రిల్ 19న ఈ మేరకు కేంద్ర ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేసింది. వ్యూహాత్మక రంగాలలోని ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడుల ఉపసంహరణతో కేంద్ర, రాష్ట్ర, ఉమ్మడి రంగాలలోని ప్రభుత్వ రంగ సంస్థలు ఏవి కూడా పాల్గొనరాదని ఈ ఉత్తరువు స్పష్టం చేసింది. సో.. భవిష్యత్ సంగతి ఏమో కానీ  ప్రస్తుతానికి అయితే  తెలంగాణ ప్రభుత్వం కానీ, తెలంగాణ ప్రభుత్వం తరపున సింగరేణి కానీ, బిడ్ లో పాల్గొనే అవకాశమే లేదు.  భవిష్యత్ లో కేంద్రంలో భారాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చి  కేసేఆర్ ప్రధాన మంత్రి అయిన తర్వాత చట్టాన్ని  సవరిస్తే ఏమో కానీ  ప్రస్తుత చట్టాల ప్రకారం విశాఖ స్టీల్ ప్లాంట్ క్రయ విక్రయాల్లో తెలంగాణ  ప్రభుత్వమే కాదు, కేంద్ర ప్రభుత్వం కూడా వేలు పెట్టే అవకాశం లేదు. అయితే ఇవ్వన్నీ  సుమారు నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న కేసేఆర్ కు తెలియదా? ఎనిమిదేళ్ళుగా మంత్రిగా ఉన్న కేటీఆర్ కు తెలియదా అంటే తెలుసు.  అందరికీ అన్నీ తెలుసు. అందుకే  కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, రాష్టంలో తమ ఇమేజ్ పెంచుకునేందుకు, తండ్రీ కొడుకులు సంయుక్తంగా ఆడుతున్న రాజకీయ డ్రామా గా విపక్షాలు ముఖ్యంగా బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు.  అంతేకాదు  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కిరణ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విశాఖ ఉక్కుకు సొంత గనులు లేవని, బయ్యారం గనులు కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. అప్పుడు ఎంపీగా ఉన్న కేసీఆర్‌ ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించారు.   తెలంగాణ బొగ్గును ఆంధ్రకు దోచి పెడతారా? బయ్యారం గనులు ఇచ్చేందుకు ఒప్పుకోం  అని తేల్చి చెప్పారు. ఇప్పుడు అదే కేసీఆర్‌ ప్రభుత్వం సింగరేణి ద్వారా విశాఖ ఉక్కును కాపాడతామని చెబుతుండటం చూస్తే..ఒకదాని వెంట ఒకటిగా చుట్టుముడుతున్న సమస్యల సుడిగుండం నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు చేసే ప్రయత్నంగానే విపక్షాలే కాదు, విజ్ఞత ఉన్న ప్రతి ఒక్కరు భావిస్తున్నారు.

సుఖేష్’ సంచలనం.. ఇక కవిత అరెస్టేనా?

 ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు హాలీవుడ్, బాలీవుడ్; సస్పెన్సు థ్రిల్లర్  సినిమాలను మరిపించే ట్విస్టులతో నడుస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కుంటున్న ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా  సహా రాజకీయ సంబందాలున్న ఓ ఆరడజను మందికి పైగా ప్రముఖులు  అరెస్ట్ అయ్యారు. ఇదే క్రమంలో అనుమనితురాలుగా ఇప్పటికే మూడు సార్లు ఈడీ విచారణకు హాజరైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత కూడా రేపో మాపో అరెస్ట్ అవుతారన్న ప్రచారం జరుగుతోంది.  అదలా ఉంటే తాజాగా  మనీలాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఈ కేసుకు సంబంధించి వరుస లేఖలతో సంచలనాలకు తెర తీస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా మరోసారి జైలు నుంచి సుఖేష్ లేఖను విడుదల చేశారు. అయితే ఈసారి లేఖతో పాటు వాట్సప్ చాటింగ్ ను బయటపెట్టాడు.  కవితక్క..టీఆర్ఎస్ అనే నంబర్ తో సుఖేష్ చాట్ చేయడం కలకలం రేపుతోంది. ఈ లేఖలో కవితతో చాట్ చేసిన విషయాలు అంటూ సుఖేష్ పేర్కొనడం గమనార్హం. ఇక తాజాగా సుఖేష్ తో పరిచయం, చాటింగ్ పై సీఎం కేసీఆర్ కూతురు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు.  బీఆర్ఎస్ పార్టీపై కావాలనే ఉద్దేశపూర్వకంగా దుష్ప్రచారం చేస్తున్నారు. సుఖేష్ తో తనకు ఎలాంటి పరిచయం లేదన్న కవిత..కేసీఆర్ ను ఎదుర్కొలేకే తనపై దాడి చేస్తున్నారన్నారు. ఫేక్ చాట్ లతో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తమ కుటుంబాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్నారని కవిత అన్నారు. తీహార్ జైల్లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ ఇటీవల వరుస లేఖలతో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.  కాగా సుఖేష్ ఇలా లేఖ రిలీజ్ చేయడం కొత్తేమి కాదు. గతంలో కూడా తన న్యాయవాది ద్వారా సుఖేష్ పలు లేఖలను రిలీజ్ చేశారు. తాను ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో వాట్సప్ , టెలిగ్రామ్ లో చాట్ చేసిన 700 పేజీల లేఖను రిలీజ్ చేశాడు. అందులో సీఎం కేజ్రీవాల్ చెప్పినట్టు రూ.75 కోట్లను హైదరాబాద్ బీఆర్ఎస్ కార్యాలయం వద్ద  రేంజ్ రోవర్ కారులో ఉన్న ఏకే అనే వ్యక్తికి డబ్బులు ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు. ఆ రేంజ్ రోవర్ కారు నెంబర్ 6060 అని లేఖలో సుఖేష్ పేర్కొన్నాడు. అయితే సుఖేష్ కేజ్రీవాల్ చాట్ ను బయటపెట్టిన కొన్నిరోజులకు ఎమ్మెల్సీ కవితతో చాట్ అంటూ సుఖేష్ లేఖతో పాటు చాట్ స్క్రీన్ షాట్స్ రిలీజ్ చేయడం ప్రకంపనలు సృష్టిస్తుంది.కాగా, ఈలేఖ పై బీజేపీ ఎమ్మెల్యే ఈడీ, కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఢిల్లీ లిక్కర్ కుంభకోణం మరో మలుపు తిరిగింది. మరింత సంచలనంగా మారింది.

జీవితం చెక్కిన మానవతామూర్తి అంబేడ్కర్

ఏప్రిల్ 14.. స్వతంత్ర భారత చరిత్రలో ఇదొక మరపురాని రోజు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బీమ్ రావ్ అంబేడ్కర్ జయంతి. ప్రతి ఏటా ఈ రోజున దేశ వ్యాప్తంగా అంబేడ్కర్  జయంతి వేడుకలు ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అంబేడ్కర్ జయంతి వేడుకలను దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు.  ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఈఏడాది వేడుకలకు మంరింత ప్రత్యేకత తోడైంది. గత సంవత్సరం అంబేడ్కర్ 125 జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, దేశంలో ఎక్కడ లేని విధంగా హైదరాబాద్  లో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. అంబేద్కర్ పేరున నూతనంగా నిర్మించిన సెక్రటేరియట్ సమీపంలో ఏర్పాటు చేసిన ఈ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఈ రోజు ( ఏప్రిల్ 14) న ఆవిష్కరిస్తున్నారు.  అయితే విగ్రహాన్ని అవిష్కరించడం ఒకటైతే, అంబేడ్కర్’ ఆశయాలను ముందుకు తీసుకుపోవడం మరొక విషయం. ముఖ్యంగా అంబేడ్కర్  రాజ్యాంగానికి కాలం చెల్లిందనే భావన వ్యక్తమవుతున్న నేపధ్యంలో,ఈ జయంతి వేడుకలను కేవలం వేడుకలుగానే కాకుండా అంబేడ్కర్  ఆశలు, ఆశయాలతో పాటుగా, రాజ్యాంగం మంచి చెడులపై వివేచనతో కూడిన చర్చజరిగితే అది మంచిందనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తపరుస్తున్నారు. నిజానికి అంబేడ్కర్  రాజ్యాంగాన్ని సమీక్షించ వలసిన సమయం వచ్చిందని, ఎవరో కాదు,తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గతంలో చాలా దృఢమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంతే కాదు  దేశంలో అతి పెద్ద మార్పు రావలసిన అవసరం ఉందని, అందుకు అంబేడ్కర్  రాజ్యాంగం స్థానంలో కొత్త రాజ్యాంగం రావలసిన అవసరం ఉందని కూడా అన్నారు. అప్పట్లో  ముఖ్యమంత్రి కేసేఅర్ చేసిన ఈ వ్యాఖ్యలు తీవ్ర విమర్శకు గురయ్యాయి.  అయితే అప్పట్లో  కేసేఆర్, అంబేడ్కర్  పై వ్యాఖ్యలు చేసిన సమయ సందర్భాలను పక్కన  పెట్టి,  స్వయంగా అంబేడ్కర్  రాజ్యాంగాన్నితగల బెట్టాలని అన్నారని తమ వాదనను గట్టిగా సమర్ధించుకున్నారు. అయితే,అదే కేసీఆర్  ఈరోజు అంబేద్కర్ జయంతి సందేశంలో మాత్రం రాజ్యాంగ ప్రస్తావన చేయలేదు. వివాదాల జోలికి వెళ్ళలేదు. సందర్భోచితంగా, అంబేడ్కర్  గోప్పతాన్ని మెచ్చుకున్నారు.   దేశ భవిష్యత్ కు సంబంధించి గొప్ప ఆలోచనలు చేస్తూ గెలుపు శిఖరాలకు చేరుకున్న విశ్వ మానవుడు అంబేద్కర్  అని కొనియాడారు.  సమాజంలో అజ్ఞానాంధకారాలను చీల్చి జ్ఞానపు వెలుగులు అందించిన మేధావి  అంబేడ్కర్ అని అన్నారు.  అలాగే, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా  ఇచ్చిన సందేశంలో  కేసీఆర్, గతానికి భిన్నంగా  సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చటంలో ఆయన పోషించిన పాత్ర చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఎంతటి కష్టమైన పనైనా చిత్తశుద్ధితో … పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని అంబేడ్కర్ జీవితం నేర్పిస్తుంది. అడ్డంకులను ఆత్మవిశ్వాసంతో ఆయన ఎదుర్కొని జీవించిన విధానం ఎంతోమందికి మార్గదర్శకం.  అని పేర్కొన్నారు.  ఆయన రచనలు, ప్రసంగాలు   ఆలోచింపజేస్తాయి.దేశంలో సమాన హక్కుల కోసం జీవితాంతం పరితపించి ప్రపంచంలోనే అతి పెద్ద లిఖిత రాజ్యాంగాన్ని రూపొందించారు.నేడు అణగారిన వర్గాలు అనుభవిస్తున్న ఫలాలు అంబేద్కర్ సమకూర్చినవే అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ కొనియాడారు.అయితే కేసీఆర్ ఎప్పుడు ఏమన్నారు అనే విషయాన్ని పక్కన పెడితే, రాజ్యాంగ నిర్మాతగానే కాకుండా, అంబేడ్కర్ ఒక మనిషిగా, మానవతా వాదీగా చరిత్ర పుటల్లోనే  కాదు, భారతీయుల హుదయాల్లో చిరస్మరణీయంగా నిలిచి పోతారు.  ప్రధాని నరేంద్ర మోడీ అన్నట్లుగా జీవితం చెక్కిన సంపూర్ణ మానవతామూర్తి అంబేడ్కర్. అవును, 1891 ఏప్రిల్ 14న మది ప్రదేశ్ లో జన్మించిన అంబేద్కర్,జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నారు. దళితుడైన కారణంగా అంబేడ్కర్ ను అంటరానివాడిగా చూశారు. స్కూల్కు వెళ్లినా వేరేగా కూర్చోవల్సిన పరిస్థితి. ఒక్కోసారి క్లాసులో కూర్చోనిచ్చేవారు కాదు.ఇన్ని కష్టాల మధ్య అంచెలంచెలుగా ఎదిగిన అంబేడ్కర్.. ఒక గొప్ప ఆర్థిక వేత్తగా, న్యాయకోవిదునిగా, సామాజిక కార్యకర్తగా, రాజకీయ నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీకి నాయకత్వం వహించిన ఘనత అంబేడ్కర్ సొంతం. అందుకే, ఎవరు ఏమన్నా ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం. అంబేడ్కర్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం 

బీఆర్ఎస్‌లోకి జేడీ!

సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ వి.వి.లక్ష్మీనారాయణ భారత రాష్ట్ర సమితిలో చేరనున్నారా? ఆ దిశగా ఆయన అడుగులు పడుతున్నాయా? అంటే తాజా పరిణామాల నేపథ్యంలో అవుననే ఓ చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో ఊపందుకొందని తెలుస్తోంది.  తాజాగా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వెనక్కి తగ్గింది. ఇది తెలంగాణ సీఎం కేసీఆర్ చేపట్టిన చర్యల వల్లేనంటూ  జేడీ లక్ష్మీనారాయణ ట్విట్టర్ వేదికగా గులాబీ బాస్‌కు ధన్యవాదాలు తెలిపారు. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ బిడ్‌లో పాల్గొనాలంటూ సీఎం కేసీఆర్‌కు ఆయన సూచించారు. ఈ నేపథ్యంలో జేడీ లక్ష్మీనారాయణ.. కారు పార్టీలో చేరనున్నారనే కథనాలు అయితే పోలిటికల్ సర్కిల్‌లో తెగ షికారు చేస్తున్నాయి. మరోవైపు ఆంధ్ర్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ పార్టీని నడిపించేందుకు కాపు సామాజికవర్గాన్ని లక్ష్యంగా చేసుకొని ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఇప్పటికే అదే సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్ మాజీ అధికారి తోట చంద్రశేఖర్‌కి ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా నియమించారీ కేసీఆర్. ఇక వివి లక్ష్మీనారాయణ సైతం అదే సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో.. ఆయన కూడా బీఆర్ఎస్‌ పార్టీలో చేరే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గతంలో ఏపీ బీజేపీ చీఫ్‌గా కన్నా లక్ష్మీనారాయణ ఉన్న సమయంలో జేడీ లక్ష్మీనారాయణ కమలం పార్టీలో చేరేందుకు ప్రయత్నించారు. కానీ నాటి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని అగ్రనేతలు.. దేశ రాజధాని హస్తినలోని కమలం పార్టీ నేతలపై తీవ్ర ఒత్తిడి తీసుకు వచ్చి.. జేడీ లక్ష్మీనారాయణ చేరికను అడ్డుకున్నారు.  కానీ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో చేరతారని భావిస్తున్న జేడీ లక్ష్మీనారాయణకు... బీఆర్ఎస్ పార్టీ నేతలు స్వాగతం పలుకుతారా? ఓ వేళ.. ఆయనకు స్వాగతం పలికేందుకు వారు సిద్దంగా ఉన్నా.. ఏపీలోని అధికార జగన్ పార్టీలోని అగ్రనేతలు మళ్లీ రంగంలోకి దిగి టీఆర్ఎస్ పార్టీ అధినేతపై తీవ్ర ఒత్తిడి తీసుకు రావడం ద్వారా జేడీ లక్ష్మీనారాయణ రాకను అడ్డుకుంటారా? అంటే మాత్రం వేచి చూడాల్సిందే అనే అభిప్రాయం అయితే పోలిటికల్ సర్కిల్‌లో వ్యక్తమవుతోంది.

తెలుగువారి ఉక్కు సంకల్పం.. విశాఖ ఉక్కు

విశాఖ ఉక్కు.. ఆంధ్రుల హక్కు అనే నినాదం పుట్టి ఇప్పటికి 50 ఏళ్లు. ప్రస్తుత పరిణామాలు అందరికీ తెలిసినా 50 ఏళ్ల కిందటి విషయాలు కొందరికే తెలుసు. అసలు విశాఖ ఉక్కు వెనుక కథ ఎన్ని మలుపులు తిరిగిందో తెలిస్తే ఆశ్చర్యం కలుగుతుంది.  అది 1963 సంవత్సరం సంగతి.  అంగ్లో అమెరికన్ కన్సార్టియమ్ విశాఖలో ఓ భారీ పరిశ్రమకు అవకాశాలు మెండుగా ఉన్నాయని నివేదిక తయారు చేసి కేంద్రం ముందు ఉంచింది.  విశాఖలో నైకా కేంద్రం ఉండటం ఒక కారణమైతే.. ఉత్తరాంధ్ర వెనుకబాటు ఇంకో కారణం. ఇక్కడ ఉపాధి అవకాశాలు పెంచడం ఆ నివేదిక ఉద్దేశం.  అనేక సమావేశాల తరువాత విశాఖలో ఉక్కు కర్మాగారం స్థాపనకు కన్సార్టియం మొగ్గు చూపింది.  ఈ ప్రతిపాదనపై 1965 జులై 3న భారత పార్లమెంటులో చర్చ జరిగింది.  1966 జులై నెలలో కాసు బ్రహ్మానందరెడ్డి ప్రభుత్వం విశాఖ ఉక్కు ప్రతిపాదనపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. అయితే అసెంబ్లీతీర్మానంపై తిరిగి పార్లమెంటులో జరిగిన చర్చలో అప్పటి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ప్లాంట్ స్థాపన సాధ్యం కాదని ప్రధాని ఇందిగా గాంధీ ప్రకటించారు.  ప్రధాని ప్రకటనతో ఆంధ్రప్రదేశ్ భగ్గుమంది. రాష్ట్రం నలుమూలలా ఆందోళనలు ప్రారంభం అయ్యాయి.  తెన్నేటి విశ్వనాథం, పుచ్చలపల్లి సుందరయ్య, గౌతు లచ్చన్న, చండ్ర రాజేశ్వరరావు, నల్లమల గిరిప్రసాద్, తరిమెల నాగిరెడ్డి, వావిలాల గోపాలకృష్ణయ్య లాంటి మహామహులు ఆందోళనలకు నాయకత్వం వహించారు. ప్రజలు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ నినదించారు. ఆందోళనకారులపై తుపాకులు గర్జించాయి. పోలీసుల తూటాలకు 32 ప్రాణాలు నేలకొరిగాయి. విజయవాడ, గుంటూరులలో ఐదుగురు చొప్పున మరణించగా, విజయనగరంలో ఇద్దరు, కాకినాడ, వరంగల్, రాజమండ్రి, సీలేరు, పలాస, జగిత్యాలల్లో ఒక్కొక్కరు చొప్పున మొత్తం 32 మంది ప్రాణాలు వదిలారు. అక్టోబర్ 15, 1966న అమృతరావు ఆమరణ నిరాహార దీక్ తో ఆందోళనలు తారస్థాయికి చేరాయి. దీంతో ఇందిరాగాంధీ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.  21 రోజుల దీక్ష తరువాత విశాఖ ఉక్కుకు ఇందిర ఆమోదించారు.  దీంతో తెలుగు ప్రజలు కలలు గన్న విశాఖ ఉక్కుకు 1971 జనవరి20న ఇందిరా గాంధీ శంకుస్థాపన చేశారు.  ప్లాంట్ నిర్మాణంలో అప్పటి రష్యా సాంకేతికతను వినియోగించారు. ఇంత చరిత్రకలిగిన విశాఖ ప్లాంట్ కు కురుపాం రాజవంశీయులు ఆరువేల ఎకరాల స్థలాన్ని విరాళంగా ఇవ్వడం అప్పటి పాలక వర్గాల పెద్ద మనసుకు నిదర్శనం.  తదనంతర పరిణామాలలో 1992లో విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రధాని పీవీ నరసింహరావు జాతియిక అంకితం చేశారు.

కోడి కత్తి కేసులో కుట్ర లేదు.. కోర్టుకు చెప్పిన ఎన్ఐఏ

కోడికత్తి దాడి కేసులో కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు బృందం (ఎన్ఐఏ) స్పష్టం చేసింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటే జగన్ ఎన్ఐఏ కోర్టులో దాకలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదనీ.. ఇదంతా సమయం వృధా వ్యవహారమనీ ఎన్ఐఏ కుండ బద్దలు కొట్టింది. ఈ కేసులో నిందితుడిగా గత నాలుగేళ్లుగా జైల్లో ఉన్న జనపల్లి శ్రీను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కాదని పేర్కొంది. దీంతో తన హత్యకు కుట్ర అంటూ విపక్ష నేతగా పట్టుబట్టి సాధించుకున్న ఎన్ఐఏ దర్యాప్తు జగన్ నాడు చెప్పిన దాంట్లో వాస్తవం లేదని తేల్చింది.  కోడికత్తి కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలంటే జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ కు ఎన్ఐఏ కౌంటర్ వేసింది.  ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్‌కు   ఈ ఘటనతో సంబంధం లేదని స్పష్టం చేశారు. గత వాయిదాలో సీఎం జగన్ తరపు న్యాయవాది రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. విచారణకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే కోడి కత్తి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీయడంలో ఎన్ఐఏ విఫలమైందనీ, మరింత లోతైన విచారణ చేపట్టేలా ఎన్ ఐ ఏ ను ఆదేశించాలని ఆ  పిటిషన్లలో కోరారు. అయితే కుట్ర లేదని ఎన్ఐఏ తేల్చేసింది. అయితే విపక్షాలు మాత్రం కోడి కత్తి కేసు ఒక కుట్ర అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నాయి. వాస్తవానికి నాడు విశాఖ విమానాశ్రయంలో అప్పటి విపక్ష నేత జగన్ పై ఎలాంటి దాడీ జరగలేదనీ, కేవలం సానుభూతి కోసం ఆడిన నాటకమని ఆరోపిస్తున్నాయి.  సానుభూతి కోసం కుట్ర పూరితంగా జరిగిన ఉత్తుత్తి దాడి అంటున్నాయి.  ఇలా ఉండగా ఎన్ఐఏ కోర్టు కోడికత్తి కేసు తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది. 

రాహుల్ సారథ్యంలో విపక్షాల ఐక్యత సాధ్యమేనా?

రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రతో  ‘హస్త’ రేఖలు మారి పోయాయి. కాంగ్రెస్ పార్టీకి  మళ్ళీ మంచి రోజులు వస్తాయనే ఆశలు ఊపిరి  పోసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో, పార్టీ అభిమానుల్లో జోష్ పెరిగింది. ముఖ్యంగా, కాంగ్రెస్ పట్ల ప్రేమ కంటే, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ పట్ల వ్యతిరేకత కోణంలో  రాజకీయాలను విశ్లేషించే రాజకీయ పండితులు ఆ ఆశలను సజీవంగా ఉంచే విధంగా విశ్లేషణలు వినిపించారు.    అదే సమయంలో కాంగ్రెస్ అధ్యక్షుడిగా  కాంగ్రెస్ ఫస్ట్ ఫ్యామిలీ బయటి వ్యక్తి, మల్లికార్జున ఖర్గే ఎన్నిక  కావడం అంతవరకు పార్టీ భవిష్యత్ పట్ల ఆశలు వదులుకున్న జీ 23 నేతలు సహా, అంతవరకు స్తబ్దుగా ఉన్న నాయకులు, కార్యకర్తలు కూడా కొంత క్రియాశీలంగా మారారు. అదే క్రమంలో హిమచల్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడంతో కాంగ్రెస్ పార్టీలో నిజంగానే కొత్త ఉత్సాహం కనిపించింది. అయితే  భారత్ జోడో యాత్ర పూర్తిచేసుకుని విదేశీ యాత్రలకు వెళ్ళిన రాహుల్ గాంధీ, బ్రిటన్ లో చేసిన  వ్యాఖ్యలు దేశంలో దుమారం లేపాయి. ముఖ్యంగా భారత దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, అయినా అమెరికా,  యూరప్ దేశాలు  పట్టించుకోవడం లేదని చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్నే రేపాయి. భారతీయ జనతా పార్టీ ( బీజేపీ) రాహుల్ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పు పట్టింది. భారత అంతర్గత వ్యవహారాల్లోకి విదేశాల జోక్యాన్ని రాహుల్ గాంధీ ఆహ్వానించారని ఆరోపించింది. అందుకు ఆయన దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని పార్లమెంట్ లోపల వెలుపల కూడా డిమాండ్ చేసింది. అదే సమయంలో కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీలు అదానీ- హిడెన్ బర్గ్ వివాదంపై జేపీసీకి డిమాండ్ చేయడంతో పార్లమెంట్ రెండవ విడత బడ్జెట్ సమావేశాలు, పూర్తిగా తుడిచి పెట్టుకు పోయాయి. రూ.45లక్షల కోట్ల బడ్జెట్  ఒక్క నిముషం చర్చ లేకుండానే ‘సభ’ ఆమోదం పొందింది.  అదలా ఉంటే.. అదే సమయంలో  ప్రధాని మోడీ ఇంటి పేరుకు  నేర చరితులకు సంబంధం అంటకడుతూ, ‘అందరు దొంగల ఇంటి పేరు మోడీనే ఎందుకుంటుందంటూ రాహుల్ గాంధీ ఎప్పుడో 2019లో చేసిన వ్యాఖ్యలు రాహుల్ గాంధీ మెడకు ఉచ్చు బిగించాయి.  ఈ వ్యాఖ్యల పై దాఖలైన కేసులో గుజరాత్ లోని సూరత్ కోర్టు రాహుల్ గాంధీని దోషిగా నిర్దారిస్తూ తీర్పు నిచ్చింది.  రెండేళ్ల  జైలుశిక్ష విధించింది. రాహుల్ గాంధీ దోషిగా తేలిన పర్యవసానంగా, అయనపై అనర్హత వేటు పడింది. లోక్ సభ సభ్యత్వం రద్దయింది. ఇప్పడు ఇందుకు సంబందించి సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది. సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా రాహుల గాంధీ వ్యక్తిగత, రాజకీయ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. సూరత్ కోర్టు విధించిన రెండేళ్ళ జైలు శిక్షను సుప్రీం కోర్టు థృవీకరిస్తే, రాహుల్ గాంధీ ప్రస్తుత సభ్యతం కోల్పోవడమే కాకుండా మరో ఎనిమిదేళ్ళ పాటు ఎన్నికల్లో పోటీ చేసే అర్హతను కూడా కోల్పోతారు. సుప్రీం కోర్టు సూరత్ కోర్టు విధించన శిక్షను రెండు సంవత్సరాల కంటే  తక్కువ కాలానికి తగ్గిస్తే, అనర్హత వేటు తొలిగి పోతుంది. ఆయన వాయనాడ్ ఎంపీగా కొనసాగుతారు. ఎన్నికల్లోనూ పోటీ చేసందుకు అర్హత పొందుతారు. అయితే, రాహుల్ గాంధీ, కాంగ్రెస్ కష్టాలు అక్కడితో తీరి పోతాయా అంటే అలాంటి సంకేతాలు కనిపించడం లేదు. రాహుల్ గాంధి పాదయాత్ర ‘సక్సెస్’ తర్వాత కూడా ఆయన నాయకత్వానికి ఇంటా బయట ఎక్కడా సంపూర్ణ  ఆమోదం లభించడం లేదు. రాహుల్ నాయకత్వం పై ప్రజల విశ్వాసం సంగతి పక్కన పెట్టినా, కాంగ్రెస్ నాయకులకు, మిత్ర పక్షాలకు సైతం రాహుల్ నాయకత్వం పై పూర్తి భరోసా విశ్వాసం ఏర్పడలేదు.  నరనరాల్లో కాంగ్రెస్ రక్తం నింపుకున్నా కేంద్ర మాజీ మంత్రి ఏకే అంటోనీ కుమారుడు అనిల్ కె అంటోనీ, కాంగ్రెస్ పార్టీలో పుట్టి, కాంగ్రెస్ పార్టీలో ఎదిగిన  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, స్వాతంత సమర యోధుడు,రాజాజీగా పేరొందిన, స్వాతంత్ర్య సమరయోధుడు, రాజకీయవేత్త. స్వతంత్ర భారతదేశపు మొదటి, చివరి గవర్నర్ జనరల్. చక్రవర్తి రాజగోపాలాచారి మనవడు సి ఆర్ కేశవన్ ఒకే వారంలో రోజుల తేడాలో కాంగ్రెస్ ను వదిలి బీజేపీలో చేరారు.  నిజానికి ఇక్కడ కాంగ్రెస్ నాయకులు బీజేపీలో చేరటం విశేషం కాదు. బీజేపీ సిద్ధాంతాలు నచ్చి లేదా మోదీ పాలన బ్రహ్మాండం అనుకుని వారు బీజేపీలో చేరితే అది వేరే విషయం. అయితే, ఇక్కడ ఆ ముగ్గురిలో ఏ ఒక్కరు కూడా బీజేపీ నచ్చి బీజేపీలో చేరలేదు. కాంగ్రెస్ నచ్చక, రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చక, ఇక కాంగ్రెస్ పార్టీని బతికించడం అయ్యే పని కాదని మరో గత్యంతరం లేక బీజేపీలో చేరారు. నిజానికి ఈ ముగ్గురు మాత్రమే కాదు, కపిల్ సిబల్, గులాన్ నబీ ఆజాద్, చౌదరి  బీరేంద్ర సింగ్,కెప్టెన్ అమరీందర్ సింగ్, రావ్ ఇంద్రజిత్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా, జితిన్ ప్రసాద, ఆర్పీఎన్ సింగ్, హార్దిక్ పటేల్  ఇలా చెప్పుకుంటూ పోతే, ఈ స్కోర్ సెంచరీ దాటేస్తుంది. ఇంతమందిలో ఏ ఒక్కరూ కూడా కాంగ్రెస్ సిద్ధాంతాలు లేదా విధానాలు నచ్చక పార్టీని వదిలి పోలేదు. రాహుల్ గాంధీ నాయకత్వం నచ్చక, అయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవం సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చి  మనసు  రాయి చేసుకుని మరీ  కాంగ్రెస్ ను వదిలి పెట్టి పోయారు.   అలాగే, అదానీ వ్యవహారంలో రాహుల్ గాంధీ తీసుకున్న స్టాండ్ తో విభేదించి ఎన్సీపీ అధినేత శరద్ పవార్, తృణమూల్ అధినాయకురాలు మమతా బెనర్జీ కాంగ్రెస్ కు దూరంగా అడుగులు వేస్తున్నారు. అలాగే, సావర్కార్’ ను అవమానిస్తూ రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై శివసేన ( ఉద్దవ్ థాక్రే) భగ్గు మంది. ఇలా మిత్ర పక్షాలు రాహుల్ కారణంగా కాంగ్రెస్ కు దురమవుతున్నాయి. అందుకే, మళ్ళీ సోనియా గాంధీ తెరమీదకు వచ్చి, బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష్లాలు కలసిరావాలని పిలుపు నిచ్చారు. కానీ, రాహుల్ గాంధీ నాయకత్వంలో పని చేసేందుకు ప్రతిపక్షాలు సిద్ధంగా లేవు. అందుకే, విపక్షాల ఐక్యతకు రాహుల్ గాంధీనే అవరోధం అనే అభిప్రాయం బలపడుతోందని పరిశీలకులు అంటున్నారు.

విశాఖ స్టీల్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనకడుగు

కేంద్రం బీఆర్ఎస్ కు ఝలక్ ఇచ్చిందో.. లేక టీఆర్ఎస్ దెబ్బకు వెనకడుగు వేసిందో కానీ మొత్తనికి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను తాత్కాలికంగానైనా సరే పక్కన పెట్టేసింది. నిన్న మొన్నటి వరకూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అనివార్యం అంటూ.. పార్లమెంటు వేదికగా సైతం ప్రకటనలు గుప్పించిన కేంద్రంలోని మోడీ సర్కార్ ఇప్పుడు ఆ విషయాన్ని పక్కన పెట్టడానికి కారణం మాత్రం బీఆర్ఎస్ బిడ్డింగ్ అంటూ చేసిన హడావుడే అనడంలో సందేహం లేదు. బీఆర్ఎస్ ఏపీలో అడుగుపెట్టడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఒక అస్త్రంగా మారకూడదన్న ఉద్దేశమే కేంద్రం వెనక్కు తగ్గడానికి కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మొత్తం మీద విశాఖ స్టీల్ ను అడ్డంగా అమ్మేస్తున్నా కదలిక లేని జగన్ సర్కార్ అంటూ హరీష్ చేసిన విమర్శలకు కేంద్రం నిర్ణయం చెక్ పెట్టింది. బిడ్డింగ్ కోసం పరిశీలన అంటూ బీఆర్ఎస్ అధినేత చేసిన హడావుడి కూడా కేంద్రం నిర్ణయంతో చప్పబడిపోయేలా చేసింది. ప్రస్తుతానికి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో ముందుకు వెళ్లే ఉద్దేశం లేదంటూ కేంద్ర మంత్రి ఫగన్ సింగ్ కులస్తే విశాఖ వేదికగా విస్పష్ట ప్రకటన చేశారు.  ఇప్పటికిప్పుడు విశాఖ స్టీల్ ను ప్రైవేటు సంస్థలకు అమ్మే ప్రక్రియ చేయడం లేదనీ,   ఆర్ఐఎన్ఎల్‌ను బలోపేతం చేస్తున్నామని చెప్పారు.  విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రస్తుతానికి ముడి సరకు పెంపొందించే ప్రక్రియపై ఫోకస్ చేసినట్లు వివరించారు . ఆ వివరణతో ఊరుకోకుండా పనిలో పనిగా తెలంగాణ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. విశాఖ స్టీల్ కొనుగోలుకు బిడ్డింగ్ అంటూ తెలంగాణ సర్కార్ చేస్తున్న హడావుడి అంతా బూటకమని ఎద్దేవా చేశారు.   

హు కిల్డ్ బాబాయ్? ఎప్పటికైనా తేలేనా?

వైఎస్ వివేకా హత్య కేసు..ఎన్ని ట్విస్టులు, ఎన్ని మలుపులు.. ఇవన్నీ కూడా హత్య కేసు ఎప్పటికీ తేలకూడదన్న ఉద్దేశంతో ఒక ప్రణాళిక ప్రకారం రచించిన వ్యూహంలో భాగమేనన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమౌతున్నాయి. ఒక నేరం ఎప్పటికీ రుజువు కాకుండా చేయడం ఎలా అంటే వైఎస్ వివేకా హత్య కేసులో ఇప్పటికీ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు న్యాయస్థానాలను ఉపయోగించుకుంటున్న తీరును ఉదాహరణగా చూపవచ్చు.   వంద మంది నేరస్థులు  తప్పించుకున్నా ఫరవాలేదు ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అంటారు. అయితే ఆ మాటకు అర్ధం మాత్రం నేరస్థులెవరైనా తప్పించుకు పోవచ్చు అని మాత్రం కాదు.  అయితే ఈ నాలుగేళ్ల కాలంలో వైఎస్ వివేకా హత్యకు మోటివ్ ఎమిటి? లబ్ధి పొందింది ఎవరు? వెనుక ఉన్న రాజకీయం ఏమిటి? అన్నది దాదాపుగా జనానికి అవగతమైపోయింది. నాలుగేళ్లనాడు వివేకా హత్య జరిగిన మరుక్షణం ఆయన గుండెపోటుతో మరణించారంటూ.. అప్పటి విపక్ష నాయకులు (ఇప్పుడు వారు అధికారంలో ఉన్నారు) ఊరూవాడా ఏకమయ్యేలా ప్రచారం చేశారు. అలా ప్రచారం చేస్తున్న గంటల వ్యవధిలోనే వివేకా మరణానికి గుండెపోటు కారణం కాదు గొడ్డలి పోటన్నది వెల్లడైంది. అంటే గుండెపోటు ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. అప్పటి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడిపై ఆరోపణలు గుప్పించారు. నారాసుర రక్త చరిత్ర అంటూ గగ్గోలు పెట్టారు. మొత్తం మీద అప్పటి ఎన్నికలలో ఈ ప్రచారం ప్లస్ అయ్యింది.  2019 ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి వరకూ సొంత బాబాయ్ ను అత్యంత దారుణంగా, కిరాతకంగా హత్య చేశారు. ఈ హత్య కేసు విచారణ రాష్ట్ర పోలీసులతో కాదు, సీబీఐతో చేయించాలని డిమాండ్ చేసిన వారు.. అధికారం చేపట్టగానే సీబీఐ విచారణ అవసరం లేదంటూ ప్లేటు ఫిరాయించారు.  జగన్ సీఎం అయిన తరువాత వివేకా హత్య కేసు దర్యాప్తు వేగం పుంజుకుంటుందని అంతా భావించారు. అయితే అందుకు భిన్నంగా కేసు దర్యాప్తు సాగింది. దీనితో తన తండ్రి హంతకులు ఎవరన్నది తేలాల్సిందే అంటూ వివేకా కుమార్తె సునీత్ న్యాయస్థానాలను ఆశ్రయించి సీబీఐ దర్యాప్తును సాధించుకున్నారు. దీంతో వివేకా హత్య కేసు దర్యాప్తు సవ్యంగా సాగడం ఆరంభమైంది. అంతే వెంటనే గతంలో తాము చేసిన నారాసుర రక్త చరిత్ర ఆరోపణలను పూర్తిగా మరిచిపోయిన వైసీపీ అగ్రనాయకత్వం ఆరోపణాస్త్రాలను వివేకా అల్లుడు అంటు కుమార్తె డాక్టర్ సునీత భర్తపై ఎక్కు పెట్టారు. అలాగే కేసు దర్యాప్తు చేస్తున్న సీబీఐ అధికారులకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. బెదరించారు. కేసులు పెట్టారు. దీంతో ఏపీలో అయితే కేసు దర్యాప్తు సవ్యంగా జరగదని భావించిన డాక్టర్ సునీత మరోమారు సుప్రీంను ఆశ్రయించి కేసు దర్యాప్తును పొరుగు రాష్ట్రానికి బదలాయించేలా  ఉత్తర్వలు సాధించారు.  అంతే వెంటనే  వైఎస్ వివేకా రెండో పెళ్లి అంటూ మరో ప్రచారం తెరపైకి తెచ్చారు. కేసు తెలంగాణకు మారిన తరువాత దర్యాప్తు వేగం పుంజుకుంది. తీగ లాగి డొంక వద్దకు వచ్చేసింది.  వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్ర ధారులు ఎవరన్నది ఇహనో ఇప్పుడో వెల్లడి కావడం ఖాయమన్న భావన అందరిలోనూ నెలకొంది.   ఆ దశలో అప్పటి వరకూ కేసు దర్యాప్తు అధికారిగా ఉన్న రాం సింగ్ ను తొలగించారు. దీని వెనుక ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన మర్మం ఏదో ఉందన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. సరే అదలా ఉంటే ఇప్పుడు తాజాగా వివేకా క్యారక్టర్ ను అశాసినేట్ చేసేలా మరో కథనం బయటకు వచ్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన సునీల్ యాదవ్ తల్లిని వివేకా లైంగిక వేధింపులకు గురి చేయడంతో ఆగ్రహించి సునీల్ యాదవే వివేకాను గొడ్డలి పోటుతో హత్య చేశారని మరో కథనాన్ని బయటకు తెచ్చారు. నారాసుర రక్త చరిత్ర, వివేకా రెండో పెళ్లి, ఆస్తి కోసం అల్లుడే ఈ హత్య చేశాడు వంటి వన్నీ వెనక్కు నెట్టి ఇప్పుడు వివేకా లైంగిక వేథింపుల కారణంగానే హత్యకు గురయ్యాడంటే కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు.  ముందు ముందు మరెన్ని వాదనలు తెరమీదకు వస్తాయో అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అసలింతకీ హుకిల్డ్ బాబాయ్ అన్న ప్రశ్నకు ఎప్పటికైనా సమాధానం దొరుకుతుందా అంటే ఏమీ చెప్పలేని పరిస్థితి. అసలు వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారుల గుట్టు బయటకు వస్తుందా? అంటే ఏమో అన్న సమాధానమే వస్తోంది. 

కర్నాటకలో హంగే.. ప్రభుత్వ ఏర్పాటులో జేడీఎస్ కీలకం?

కర్నాటకకర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వే  రాష్ట్రంలో హంగ్ ఏర్పడుతుందన్న సంకేతాలను ఇచ్చింది. రాష్ట్రంలో ఏ పార్టీకీ మేజిక్ ఫిగర్ సాధించి అధికార పగ్గాలు చేపట్టే అవకాశాలు లేవని పేర్కొంది. వచ్చె నెల 3వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అదే నెల 10న ఓట్ల లెక్కింపు.. ఫలితాల విడుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో ఏ పార్టీ అధికారం చేపడుతుంది? ఏపార్టీ ప్రతిపక్షానికే పరిమితమౌతుంది అంటే.. ఇప్పటికిప్పుడు జనం నాడిని బట్టి హంగ్ వినా మరో అవకాశం లేదన్న మాటా వినపడుతోంది. పీపుల్స్ పల్స్ ప్రీ పోల్ సర్వే కూడా అదే చెప్పింది. రాష్ట్రంలో అధికార   బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అనే విధంగా ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ స్వల్ప ఆధిక్యత సాధించినా.. అది అధికార పగ్గాలను అందుకునేందుకు అవసరమైన సంఖ్యా బలం సాధించడానికి కూతవేటు దూరంలోనే నిలిచిపోతుందని సర్వే పేర్కొంది. ఈ పరిస్థితుల్లో కింగ్ మేకర్ పాత్ర పోషించే జేడీఎస్ కీలకమౌతుందని సర్వే పేర్కొంది.  ఔను రాష్ట్రంలో జరిగేది ముఖాముఖీ పోరే అయినా.. ఏవో కొన్ని స్థానాలను ఖాతాలో వేసుకోగలిగే పాటి బలం ఉన్న జేడీఎస్ ఏ పార్టీ వైపు మొగ్గు చూపితే ఆ పార్టీకే రాష్ట్రంలో అధికార పగ్గాలు అందుకునే అవకాశాలు మెరుగ్గా ఉంటాయని పీపుల్స్ పల్స్ సర్వే పేర్కొంది.   వాస్తవానికి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ, సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు. అలాగే, అలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారీ జేడీఎస్  కీలకంగా మారుతోంది.  2018 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 224 మంది సభ్యులున్న సభలో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ మేజిక్ ఫిగర్ (113) చేరుకోలేక పోయింది. దీంతో  78 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకు పోయింది.   కుమార స్వామి ముఖ్యమంత్రిగా, జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తరువాత సంకీర్ణంలో చిచ్చు కారణంగా కుమార స్వామి సర్కార్ కూలిపోయింది.  15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ విధంగా సంవత్సరం తిరక్కముందే బీజేపీ పూర్తి మెజారిటీతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది,  ఆతర్వాత యడ్యూద్యూరప్ప స్థానంలో బ‌స‌వ‌రాజు బొమ్మై ముఖ్యమంత్రిగా వచ్చారు. సరే, ఆ చరిత్రను అలా ఉంచితే, వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.  ఇక పీపుల్స్ పల్స్ తాజా సర్వే ప్రకారం కాంగ్రెస్ పార్టీత రాష్ట్రంలో 95 నుంచి 105 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ 90 నుంచి 100 స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. జేడీఎస్ పాతిక నుంచి ముఫ్ఫై స్థానాలలో గెలుపొందుతుందని సర్వే పేర్కొంది. బీజేపీపై ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రంగా ఉన్నా దానిని పూర్తి స్థాయిలో అందిపుచ్చుకోవడంలో కాంగ్రెస్ విఫలమైందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతాన్ని రానున్న ఎన్నికలలో గణనీయంగా పెంచుకోగలిగినా.. ఆ మేరకు సీట్ల సంఖ్య పెరిగే అవకాశాలు లేవన్నది సర్వే చెబుతోంది. దీంతో ఎన్నికల అనంతరం జీడీఎస్ మళ్లీ కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి.  

మార్చేస్తారా? మందలించి సరిపెడతారా?

తెలంగాణ గవర్నర్ తమిళి సై  గురువారం (ఏప్రిల్ 13) హస్తినలో పర్యటించనున్నారు.  పెండింగ్ బిల్లుల వివాదం సుప్రీం కోర్టులో ఉన్న తరుణంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలో నెలకొన్న తాజా రాజకీయ పరిస్థితులు, రిపబ్లిక్ డే వేడుకల వివాదం, ఆ తర్వాత బడ్జెట్  ఆమోదం విషంయలో కేసీఆర్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించటం, అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తదితర విషయాలను ఆమె ఈ పర్యటనలో కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించే అవకాశాలు ఉన్నాయి. గత వారం రోజుల్లో తెలంగాణలో చోటు చేసుకున్న కీలక రాజకీయ పరిణామాల  ఆమె ఢిల్లీ పర్యటనపై రాజకీయ వర్గాలలో ఆసక్తి వ్యక్తమౌతోంది. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులపై గవర్నర్ కేంద్రానికి నివేదిక ఇవ్వనున్నారు. అన్నిటికీ మించి  గత కొన్నేళ్లుగా  ప్రగతి భవన్ వర్సెస్ రాజ్ భవన్ అన్నట్లుగా ఉన్న పరిస్థితులు మారినట్లుగా అనిపించినా, ఆ గ్యాప్ అలాగే ఉందనడానికి   7 కీలక బిల్లులకు  గవర్నర్ ఇంకా ఆమోదం తెలపకుండా పెండింగ్ లో ఉంచడం, తాజాగా మంత్రి కేటీఆర్ గవర్నర్ వ్యవస్థ అవసరమా అంటూ కొత్త చర్చకు తెరలేపడం నేపథ్యంలో గవర్నర్ హస్తిన పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో భేటీ తర్వాత పెండింగ్ లో ఉంచిన బిల్లులపై  గవర్నర్ ఏ నిర్ణయం తీసుకుంటారో అన్న ఉత్కంఠ రాజకీయ వర్గాలలో నెలకొంది.   ఇదలా ఉంటే ఏడాది కిందట తెలంగాణ గవర్నర్ గా తమిళిసై మార్పు తప్పదన్న వార్తలు జోరుగా వినిపించాయి. చీటికీ మాటికీ గవర్నర్ తమిళిసై రాష్ట్ర  ప్రభుత్వంతో తగవుల కారణంగా కేంద్రంలోని మోడీ సర్కార్ ప్రతిష్ట మసకబారుతోందన్న భావన కు వచ్చిన కేంద్రం ఆమెను తెలంగాణ గవర్నర్ గా తప్పించడమే మేలన్న భావనకు వచ్చిందని పరిశీలకులు అప్పట్లో విశ్లేషణలు చేశారు. ఇక ఇప్పుడు పెండింగ్ బిల్లుల విషయంలో తెలంగాణ సర్కార్ సుప్రీం కోర్టుకు వెళ్లడం.. సుప్రీం కోర్టు కేంద్రానికి నోటీసులు ఇవ్వడానికి సిద్ధపడటం నేపథ్యంలో ఆ కేసు కోర్టులో విచారణకు వచ్చే రోజున గవర్నర్ ఒక మెట్టు దిగి మూడు బిల్లులకు ఆమోదం తెలిపినా మిగిలిన వాటిని పెండింగ్ లోనే ఉంచడం వంటి పరిణామాల నేపథ్యంలో గవర్నర్ తమిళిసై తాజా హస్తిన పర్యటన రాజకీయంగా కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. బిల్లుల విషయంలో అనవసర రగడ వద్దన్న మందలింపుతో సరిపెడతారా లేక ఆమెను మార్చే నిర్ణయం తీసుకుంటారా అన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది.

పులివెందుల వైసీపీలో అసమ్మతి భగ్గు!

వైసీపీలో ఇంత కాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి, అసమ్మతి ఇప్పుడు ఆ నివురు తొలగించుకుని బయటపడుతోంది. ఇంత కాలంగా అంతర్గతంగా రగులుతున్న అసంతృప్తి జ్వాలలు ఇప్పుడు పెను మంటలుగా ప్రజ్వరిల్లుతున్నాయి. తాజాగా జగన్ సొంత నియోజకవర్గం పులివెందులకు చెందిన వైసీపీ నేత, శ్రీ వృషభలేశ్వర స్వామి దేవస్థానం మాజీ చైర్మన్ వైసీపీకి రాజీనామా చేసి.. పార్టీ తరుపట్ల తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. పార్టీలో కొనసాగి ఏం ప్రయోజనం లేదని, కార్యకర్తలకు న్యాయం చేయలేని పార్టీలో ఉండి ప్రయోజనం ఏముందని రాజీనామా చేసినట్లుఆయన ప్రకటించారు.  అసలు పార్టీలో అసమ్మతి, అసంతృప్తి రగులుతోందన్న విషయం ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సమయంలోనే వెల్లడైంది. బహిరంగంగా, బాహాటంగా సీఎంకు వ్యతిరేకంగా నేతలూ, కార్యకర్తలూ అప్పట్లోనే రోడ్డెక్కారు. అప్పటి దాకా జగన్ మాటే శాసనం అన్నట్లుగా వైసీపీ పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ వ్యవహారాలు నడిచేవి. కానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అనంతరం ఆ పరిస్థితి మారింది. జగన్ నిర్ణయాలను అప్పట్లో పలువురు నేతలు సూటిగానే ప్రశ్నించారు. సరే ఆ తరవాత బతిమాలో, బామాలో.. కొన్ని నిర్ణయాలను వెనక్కు తీసుకోవడం ద్వారాలో పరిస్థితిని చక్కదిద్దుకున్నారు. అసంతృప్తి అగ్నిని తాత్కాలికంగా చల్లార్చారు. అప్పటి నుంచీ పార్టీలో అంతర్గతంగా అసంతృప్తి జ్వాలలు రగులుతూనే ఉన్నాయి. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేల భాగస్వామ్యంపై సమీక్షల పేరుతో జగన్ చేసిన వ్యాఖ్యలు, హెచ్చరికలు వాటికి అజ్యం పోశాయి. ఆ ఎఫెక్ట్ గ్యాడ్యుయేట్, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో ప్రస్ఫుటంగా కనిపించింది. మూడుకు మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలనూ కోల్పోయిన వైసీపీకి, ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా పరాభవం తప్పలేదు. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలలో జగన్ కు కంచుకోట లాంటి పులివెందులలో.. వైసీపీకి తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లలో సగం కూడా రాలేదంటే అధికార పార్టీ పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధం చేసుకోవచ్చు. స్థానిక ఎన్నికలలో కుప్పంలో తెలుగుదేశం పరాజయం తరువాత జగన్ ఇప్పుడు చంద్రబాబు ముఖం చూడాలని ఉందని అని వ్యాఖ్యానించారు. అయితే సొంత నియోజకవర్గం పులివెందులలో జగన్ కు ఇంత గట్టి ఎదురు దెబ్బ తగిలిన పేపథ్యంలో ఆయన, ఆయన సలహాదారు అసలు వాళ్లు మా ఓటర్లే కాదని చేతులు దులిపేసుకున్నారు. సరే అదలా ఉంటే.. ఇప్పుడు తాజాగా అదే పులివెందుల నియోజకవర్గం నుంచి జగన్ కు ఆయన కుటుంబానికి సన్నిహితుడైన జయ చంద్రారెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయనేమీ నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన నాయకుడు కాదు.. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం నుంచీ ఆయన కుటుంబానికి సన్నిహితంగా మెలిగిన వ్యక్తి. ఆయన రాజీనామా చేసి ఊరుకోలేదు.. పార్టీ మీదా, పార్టీ అధినేత మీదా విమర్శలు చేశారు. పులివెందుల నుంచి వైసీసీకి రాజీనామాల పర్వం తనతోనే ప్రారంభం అవుతుందని అన్నారు. ఇప్పటికే పలువురు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ఎవరికి ఏ పని కావాలన్నా వాలంటీర్ ఉషాలక్ష్మి ఇంటికి వెళ్లాల్సిందేననీ, కానీ ఆమె ఒక్క పని కూడా చేయరనీ జయచంద్రారెడ్డి అన్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రి జగన్ చెప్పిన పనులే పులివెందులలో జరిగే పరిస్థితి లేదన్నారు. ముందు ముందు పులివెందుల వైసీపీ నుంచి మరిన్ని రాజీనామాలు తధ్యమని జోస్యం చెప్పారు. అధికార పార్టీ నేతలకు భయపడి కొందరు బయటపడటం లేదు కానీ, పార్టీ కార్యకర్తలందరూ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని జయచంద్రారెడ్డి కుండబద్దలు కొట్టారు.