ఆహారాన్ని పదే పదే వేడి చేస్తున్నారా?

సాధారణంగా మిగిలిన ఆహారాన్ని ఫ్రిజ్ లో పెట్టేస్తాం. కూరలు, పప్పులు అయితే తప్పకుండా పెడుతుంటాం. కావాల్సినప్పుడు వాటిని బయటకు తీసుకుని వేడిచేసుకుని తింటుంటాం. ఇలా చేయడం వల్ల ఆహారం వేస్ట్ కాకుండా చేశామని అనుకుంటాం. కానీ అనారోగ్యానికి కోరి తెచ్చున్నట్లు అవుతుందని మీకు తెలుసా? -మాంసాహారం, గుడ్లు, పప్పులు వంటివన్నీ మాంసక్రుత్తులు ఎక్కువగా ఉండే పదార్థాలు. వీటిని మళ్లీ మళ్లీ వేడిచేసినట్లయితే వాటిలో ఉండే మాంసక్రుత్తులు విచ్చిన్నమవుతాయి. ఆమ్లాలు ఉత్పత్తై తిన్న ఆహారం జీర్ణం కాకుండా చేస్తాయి. వీటిని తాజాగానే తినడం మంచిది. అస్సలు నిల్వ చేయకూడదు. -ఆహారాన్ని మళ్లీ మళ్లీ వేడిచేయడం వల్ల అందులోని విటమిన్, సి, బి వంటిపోషకాలు నశించిపోతాయి. ఆ ఆహారం తిన్నాకూడా శరీరానికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. - అన్నం, పాస్తా వంటివాటిని ఎంత కావాలో అంతే వండుకోవాలి. మిగిలిదాన్ని ఫ్రిజ్ లో పెట్టి వేడిచేసి తింటే హానికర బ్యాక్టీరియాని స్వయంగా శరీరంలోకి ఆహ్వానించినట్లవుతుంది. -ఆలుగడ్డ లేదా బ్రెడ్ వంటి పిండిపదార్థాలను మళ్లీ వేడి చేస్తే క్యాన్సర్ కరకాలు ఉత్పన్నమవుతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అందుకే వాటిని తాజాగా ఉన్నప్పుడే తినాలి. ఎక్కువసేపు వండటం, ఫ్రిజ్ లో స్టోర్ చేయడం కంటే కావాల్సినంతే వండుకోవడం వల్ల డబ్బు ఆదా అవుతుంది. ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు జరుగుతుంది.   

మౌత్ వాష్ వాడే అలవాటుందా? ఈ నిజాలు తెలుసుకోవాల్సిందే.!

నలుగురిలో మాట్లాడాలన్నా, నవ్వాలన్నా, అందరి ముందు ఆహారం తినాలన్నా దంత సంరక్షణ, నోటి ఆరోగ్యం బాగుండాలి. అయితే చాలామంది నోటి శుభ్రత, దంతాల రంగు విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. నోరు దుర్వాసన లేకుండా తాజాగా ఉండాలన్నా, దంతాలు తెల్లగా ఉండాలన్నా  మంచి టూత్ పేస్ట్, మౌత్ వాష్ వాడుతూ ఉంటారు. మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు పళ్లు సరిగ్గా తోముకోరనే కారణంతో వారికి మౌత్ వాష్ ఉపయోగిస్తుంటారు. కానీ మౌత్ వాష్ వాడటం ప్రమాదాలతో కూడుకుని ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అసలు మౌత్ వాష్ వాడటం ఎంతవరకు సేఫ్? వీటిని వాడితే జరిగేదేంటి? మౌత్ వాష్ లో ఏముంటుంది? మార్కెట్లో బోలెడు మౌత్ వాష్ లు అందుబాటులో ఉన్నాయి. వీటిలో అధిక మొత్తంలో ఇథనాల్ ఉంటుంది.  మరీ ముఖ్యంగా ఆల్కహాల్ నుండి సేకరించిన ఎసిటాల్డిహైడ్ అనే రసాయం ఉంటుంది. ఇది క్యాన్సర్ కారకం. క్యాన్సర్ రావడానికి ప్రేరేపిస్తుంది.  ఏ మౌత్ వాష్ అయినా సరే.. వాటిలో 25శాతం కంటే ఎక్కువ ఆల్కహాల్ ఉంటుంది. ఎంత వరకు సేఫ్.. మౌత్ వాష్ సేఫా కాదా అనే విషయం గురించి వైద్యులు స్పష్టంగా చెబుతున్నారు. దంత సంరక్షణకు, నోటి శుభ్రతకు ఇది మంచిదే అయినప్పటికీ మౌత్ వాష్ ఎక్కువ వాడితే మాత్రం నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ ఉంటుందని చెబుతున్నారు. మౌత్ వాష్ ను మితంగా వాడితే అది దంతాల మీద మరకలను, దంతాల  మధ్యలో ఉండే మురికిని తొలగిస్తుంది. నోటికి తాజాదన్నాన్ని కూడా ఇస్తుంది. కానీ మౌత్ వాష్ ఎక్కువ  వాడటం వల్ల అది నోటి క్యాన్సర్ కు దారితీస్తుంది. మౌత్ వాష్ వాడితే జరిగేది ఇదే.. మౌత్ వాష్ వాడటం వల్ల కేవలం నోటి క్యాన్సర్ మాత్రమే కాదు.. తల, మెడ, క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుందని అధ్యనాలు చెబుతున్నాయి. వీటిని ఎక్కువగా వాడే వారి నోరు తొందరగా పొడిబారుతుంది. వీటిలో ఉండే ఆల్కహాల్ దీనికి కారణం అవుతుంది.  నోటి లోపలిచర్మం చాలా సున్నితంగా మారి నోటి పూతలు, నోటి పుండ్లు, నోటి క్యాన్సర్ తొందరగా రావడానికి కారణం అవుతుంది. అందుకే మౌత్ వాష్ లను వీలైనంత అవాయిడ్ చేయడం మంచిది. ఆరోగ్యకరమైన అలావాట్లు ఉంటే దంతాలు,నోరు సహజంగానే శుభ్రంగా ఉంటాయి.  ఒకవేళ నోటి ఆరోగ్యం, దంత సంరక్షణ గురించి ఏవైనా సందేహాలు కానీ, ఇబ్బందులు  కానీ ఉంటే దంత వైద్యుడిని కలిసి సమస్య పరిష్కరించుకోవడం మంచిది.                                         *నిశ్శబ్ద.

చలికాలంలో జలుబు,దగ్గుకు చెక్ పెట్టే అమృతసమానమైన కషాయాలు..!

చలికాలంలో విపరీతమైన దగ్గు,జలుబు కారణంగా గొంతులో కఫం ఏర్పడుతుంది.  కొన్నిసార్లు గొంతు లోపల పేలుతుంది. దీనికారణంగా   రక్తస్రావం కూడా సంభవించే అవకాశం ఉంటుంది. దగ్గు నుండి ఉపశమనం పొందడానికి కొన్ని ఆరోగ్యకరమైన కషాయాలను ఉపయోగించడం ద్వారా సమస్యను పరిష్కరించవచ్చు. ఈ కషాయాలలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్, ఇమ్యూన్-బూస్టర్ లక్షణాలు ఉంటాయి. ఉదయాన్నే టీ, కాఫీలకు బదులుగా  వీటిని తాగితే రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అందుకే వీటిని బెస్ట్ మార్నింగ్ డ్రింక్స్ అంటారు. వాటిని ఎలా తయారు చేయాలో, వాటి ప్రయోజనాలేంటో తెలసుకుంటే.. అల్లం, పసుపు.. అల్లం  పసుపు కలపడం వల్ల యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, ఇమ్యూనిటీ బూస్టర్ లక్షణాలు పుష్కలంగా ఉండే ఎఫెక్టివ్ డికాక్షన్ తయారవుతుంది. ఈ డికాషన్ జలుబుతో పోరాడటమే కాకుండా జీర్ణక్రియకు సహాయపడుతుంది. తయారు విధానం.. తురిమిన అల్లం, పసుపు, మిరియాలు,  దాల్చిన చెక్కను నీటిలో 10-15 నిమిషాలు ఉడకబెట్టాలి. వడపోసి త్రాగే ముందు, కొద్దిగా తేనె, నిమ్మకాయ రసం కలిపి తీసుకోవాలి. తులసి తులసిని ఆయుర్వేదంలో శక్తివంతమైన మూలిక అంటారు. తులసి కషాయం అద్భుతమైన డీకాంగెస్టెంట్‌గా పనిచేస్తుంది, కఫాన్ని తొలగించడం ద్వారా దగ్గు నుండి ఉపశమనాన్ని అందిస్తుంది.  యాంటీవైరల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాల వల్ల రోగనిరోధక శక్తిని పెంచుతుంది. తయారు విధానం.. తాజా తులసి ఆకులను తీసుకుని, మిరియాలు, లవంగాలు,  అల్లం ముక్క వేసి  నీటిలో ఉడకబెట్టాలి. కాసేపు మరిగిన తర్వాత రుచికి సరిపడా బెల్లం వేసి తాగాలి. దాల్చిన చెక్క ఒక అధ్యయనం ప్రకారం దాల్చినచెక్కలో పాలీఫెనాల్స్, శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఏలకులు కూడా  ఆక్సీకరణ ఒత్తిడి నుండి కణాలను రక్షిస్తుంది. తయారు విధానం.. దాల్చిన చెక్క,  ఏలకులు, అల్లం ముక్క  కొన్ని లవంగాలను నీటిలో ఉడకబెట్టాలి. కాసేపు మరిగిన తర్వాత వడకట్టి అందులో ఒక చెంచా తేనె వేసి సిప్ బై సిప్ తాగాలి. ఆయుర్వేద త్రిఫల.. ఉసిరి, కరక్కాయ, తానికాయల  మిశ్రమాన్ని త్రిఫల అంటారు. ఆయుర్వేదంలో ఇది శరీరాన్ని శుద్ది చేసి శరీరానికి కొత్త శక్తిని ఇస్తుందని చెబుతారు. రోజూ దీన్ని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తయారు విధానం.. ఒక చెంచా త్రిఫల పొడిని నీటిలో వేసి 5-10 నిమిషాలు తక్కువ మంట మీద మరిగించాలి. మెంతులు,ధనియాలు.. ఈ కషాయాన్ని తాగడం వల్ల రోగనిరోధక శక్తితో పాటు జీర్ణశక్తి పెరుగుతుంది. ఇది శ్వాసకోశ ఆరోగ్యాన్ని, రక్తంలో చక్కెరను కూడా బ్యాలెన్స్ గా ఉంచుతుంది.  టైప్ 2 డయాబెటిక్ రోగులలో రక్తంలో చక్కెర, పొట్ట కొవ్వు,  వేగంగా తగ్గుతుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. తయారు విధానం.. మెంతి గింజలు, దనియాలు, మిరియాలు,  దాల్చిన చెక్కను నీటిలో వేసి మరిగించాలి. దీన్ని కాసేపు ఉడకబెట్టాలి.  తరువాత ఫిల్టర్ చేసి తాగాలి.                                        *నిశ్శబ్ద.  

చలికాలంలో వాము ఆకులు తప్పక తినాలి.. బెనిఫిట్స్ ఇవే..!

వాము ఆకుల గురించి చాలామందికి తెలిసే ఉంటుంది. మందంగా ఆకుల చివర కత్తిరించినట్టుగా  కనిపించే వాము ఆకులు చాలామంది ఇళ్లలోనే పెంచుకుంటారు.దీని వాసన ఘాటుగా ఉంటుంది. దగ్గు, జలుబు చేయగానే చాలామంది  ఈ ఆకులను తినమని సలహా ఇస్తుంటారు కూడా. అయితే ఈ వాము ఆకులు చలికాలంలో చాలా ఉపయోగపడతాయి. చలికాలంలో జలుబు, గొంతు సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. కేవలం వీటికే కాకుండా వాము ఆకు మరిన్ని సమస్యలకు అద్బుతమైన ఔషదంగా పనిచేస్తుంది. వాము ఆకుల వల్ల కలిగే ఇతర ప్రయోజనాలేంటో పూర్తీగా తెలుసుకుంటే.. వాము ఆకులలో కాసింత ఉప్పు పెట్టి తాంబూలంలా చుట్టి నమిలి తినాలి. ఆ తరువాత గోరువెచ్చని నీరు తాగాలి. ఇలా చేస్తే కడుపునొప్పి సమస్య మంత్రించినట్టు మాయం అవుతుంది. వాము ఆకులలో విటమిన్-ఎ,సి, సెలీనియం, జింక్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కారణంగా ఇవి హార్మోన్స్ ను బ్యాలెన్స్ గా ఉంచడంలో సహాయపడతాయి. యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మెండుగా ఉన్న కారణం వల్ల వాము ఆకులను తిన్నప్పుడు కడుపులో మంట తగ్గుతుంది. కడుపులో యాసిడ్లకు ఇది చికిత్స చేస్తుంది. వాము ఆకుల్లో యాంటీ బాక్టీరియల్  లక్షణాలు ఉంటాయి. వీటిని బాగా నమిలి తినడం వల్ల నోటిలోని బాక్టీరియా మాత్రమే కాకుండా నోటి దుర్వాసన కూడా తగ్గిపోతుంది. వాము  ఆకులలో థైమోల్ అనే యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి శ్వాసకోశ ఆరోగ్యాన్ని పెంచడంలో సహాయపడుతాయి. ఆయుర్వేదం మహిళలకు వాము ఆకులతో గొప్ప ఆరోగ్య చిట్కా సూచించింది. ఈ ఆకులను క్రమం తప్పకుండా తింటూ ఉంటే నెలసరి సమస్య వచ్చినప్పుడు అస్సలు నెలసరి నొప్పి సమస్యే ఉండదు. వాము ఆకులలో ఎక్స్ పెక్టరెంట్ లక్షణాలు ఉంటాయి. ఇవి దగ్గు, జలుబు లక్షణాల నుండి ఉపశమనం కలిగిస్తాయి. ఇవి గొంతు, ముక్కులలో రద్దీని క్లియర్ చేయడంలో సహయపడతాయి. అరచెంచా వాము ఆకులు, అరచెంచా మారేడు ఆకులను కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి. ఇలా చేస్తే మధుమేహం ఉన్నవారిలో పాలీయూరియా పై ప్రభావం చూపిస్తుంది. దానివల్ల కలిగే నష్టాలను నియంత్రిస్తుంది. వాము ఆకులు, తెనె, కాసింత వెనిగర్ మూడూ కలిపి తీసుకుంటే మూత్రపిండాల్లో రాళ్ల సమస్య తగ్గుతుంది. విటమిన్-ఎ మెండుగా ఉన్న కారణంగా వాము ఆకులు తినే వారిలో కంటి చూపు ఆరోగ్యంగా ఉంటుంది. ఆ తరువాత కంటి సమస్యలు అస్సలు రాకుండా చేస్తుంది.                                                    *నిశ్శబ్ద.  

ఉదయం బ్రేక్ ఫాస్టులో వీటిని తినకండి..ఈ సమస్యలు తప్పవు.!

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఉదయం అల్పాహారం ఆరోగ్యకరమైనదిగా ఉండాలి. దీని వల్ల రోజంతా శరీరంలో శక్తి ఉంటుంది.కానీ చాలా మంది అల్పాహారంలో అనారోగ్యకరమైన ఆహారాలను తీసుకుంటారు. వీటి వల్ల ఆరోగ్యానికి తీవ్రమైన హాని కలిగిస్తుంది.అంతేకాదు అనేక వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది. ఇవి శరీరాన్ని లోపల నుండి బోలుగా చేసి, వ్యాధులతో పోరాడే శక్తిని శరీరానికి అందించవు. కాబట్టి, పొరపాటున కూడా బ్రేక్‌ఫాస్ట్‌లో వీటిని తినకూడదు. అల్పాహారంలో తీసుకోకూడని కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బ్రెడ్, జామ్: చాలా మంది ఉదయం అల్పాహారంగా బ్రెడ్, జామ్ తినడానికి ఇష్టపడతారు. అంతే కాదు చాలా మంది పిల్లల టిఫిన్‌లో బ్రెడ్, జామ్ కూడా ప్యాక్ చేస్తారు. కానీ, బ్రెడ్, జామ్‌లో కొవ్వు, చక్కెర అధికంగా ఉంటుంది.  ఇది భవిష్యత్తులో ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. అందువల్ల, మీరు ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకుంటే, బ్రెడ్, జామ్ తినకండి. టీ, కాఫీలు తాగకూడదు :  ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల శరీరంలో యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దీని కారణంగా మీకు గ్యాస్, బర్నింగ్ సెన్సేషన్, వాపు సమస్యలు ఉండవచ్చు. కాఫీలో పెద్ద మొత్తంలో కెఫీన్ ఉంటుంది. కెఫిన్ వినియోగం ఆరోగ్యానికి చాలా హానికరం. పాన్‌కేక్‌లు, స్వీట్లు: మీరు ఉదయం పూట పాన్‌కేక్‌లను అస్సలు తినకూడదు. నిజానికి అల్పాహారం కోసం తీపి పదార్థాలు తినకూడదు. ఎందుకంటే ఉదయం పూట తీపి పదార్థాలు తినడం వల్ల మీ షుగర్ లెవెల్ పెరుగుతుంది. భవిష్యత్తులో మీరు డయాబెటిస్‌తో బాధపడవచ్చు. క్యాన్డ్ జ్యూస్‌లు, ఎనర్జీ డ్రింక్స్‌:  ఉదయం అల్పాహారంలో ఎప్పుడూ క్యాన్డ్ జ్యూస్ లేదా ఎనర్జీ డ్రింక్స్ తాగకండి. నిజానికి, క్యాన్డ్ జ్యూస్‌లో చాలా చక్కెర ఉంటుంది. దీన్ని రోజూ తాగడం వల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంది. ఇది కాకుండా, ఈ ఎనర్జీ డ్రింక్ రక్తంలో చక్కెరను కూడా పెంచుతుంది.

ఒకసారి వండిన ఆహారాన్ని మళ్లీ వేడి చేసి తినచ్చా? చలికాలంలో ఈ నిజాలు తెలుసుకుని తీరాలి!

ఆహారం శరీరానికి శక్తిని ఇస్తుంది. మనిషి ఆయుష్షు చాలా వరకు  ఆరోగ్యకరమైన ఆహారం మీదనే ఆధారపడి ఉంటుంది. ఆహారం తరువాత వ్యాయామం, అలవాట్లు ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. అయితే చలికాలంలో చాలామంది ఆహారం దగ్గరే పెద్ద తప్పు చేస్తారు. ఉదయం అయినా మధ్యాహ్నం అయినా వండిన ఆహారం అంతో ఇంతో మిగులుతూనే ఉంటుంది. చలికాలంలో ఆహారాన్ని చల్లగా తినలేక దాన్ని మళ్లీ వేడి చేస్తుంటారు. అయితే ఇలా వేడి చేయడం అస్సలు మంచిది కాదని ఆహార నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా కింది ఆహారాలు అయితే పొరవాటున కూడా వేడి చేయకూడదని చెబుతున్నారు. ఈ ఆహారాల గోల ఏంటో తెలుసుకుంటే.. చలికాలంలో పొరపాటున కూడా మళ్లీ వేడి చేసి తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. వాటిలో పాలకూర, క్యారెట్లు, ఆకుకూరలు, బీట్రూట్ వంటి నైట్రేట్ అధికంగా ఉండే కూరగాయలు ముఖ్యమైనవి. పాలకూరను చాలామంది పప్పుగానే వండుతారు. కొందర పనీర్ తో కూర చేస్తారు. వీటిని మధ్యాహ్నం వండితే చాలావరకు మిగులుతాయి. చూస్తూ వీటిని పడెయ్యలేరు. అలాగని చలికాలంలో వీటిని చల్లగానూ తినలేరు. అలాంటప్పుడు మళ్లీ వేడి చేసి వేడిగా తింటారు. మిగిలిన కూరగాయలు, ఆకుకూరలు కూడా ఇంతే.. రుచికరమైన, పోషకాలు కలిగిన ఆహారం కాబట్టి ముందు వెనుక ఆలోచించరు. కానీ ఇలా ఒకసారి వండిన ఆహారన్ని మళ్లీ వేడి చేస్తే వాటిలోని నైట్రేట్ లు వేడి వల్ల నైట్రోజినేస్ గా మారుతాయి. ఇవి శరీర కణాలకు హాని కలిగిస్తాయి. అన్నం గురించి అన్ని ఇళ్లలో కనిపించే సీన్ ఒకటే.. అన్నం మిగిలితే ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్, కలర్ రైస్ ఇలా చాలా రకాలు చేస్తారు. అయితే అన్నం ఒక్కసారి వండిన తరువాత మళ్లీ దాన్ని వేడి చేయకూడదు. ఫుడ్ స్టాండర్ ఏజెన్సీ ప్రకారం అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల పుడ్ పాయిజన్ జరిగే ప్రమాదం ఉంటుంది. ఎందుకంటే అన్నాన్ని మళ్లీ వేడి చేయడం వల్ల అన్నంలో బాసిల్లస్ సెరియస్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది ఫుడ్ పాయిజన్ కు కారణం అవుతుంది. మాంసాహారం పడెయ్యాలంటే ఎవ్వరికీ మనసొప్పదు. పైగా ఖరీదైన ఆహారం కూడా. మధ్యాహ్నం మిగిలితే రాత్రి, రాత్రి మిగిలితే దాన్ని ఫ్రిజ్ లో పెట్టి మళ్లీ మరుసటిరోజు కూడా తింటారు. అయితే చలికాలంలో మాంసాహారాన్ని వేడిగా తినాలనే జిహ్వ చాపల్యంతో  తిన్న ప్రతీ సారి వేడి చేసుకుని తింటారు. కానీ వండిన మాంసాన్ని మళ్ళీ వేడి చేస్తే చాలా ఈజీగా ఫుడ్ పాయిజన్ అయ్యే ప్రమాదం ఉంది. పైపెచ్చు జీర్ణసమస్యలు కూడా పెరుగుతాయి. ఆహార నిపుణుల ప్రకారం అధిక ప్రోటీన్ ఉన్న ఆహారంలో నైట్రోజన్ ఉంటుంది. అది శరీరానికి హాని చేస్తుంది. చాలా మంది ఇష్టంగా తినే ఆహారాలలో బంగాళాదుంపలు ఒకటి. బంగాళాదుంపలను ఒకసారి ఉడికించాక మళ్లీ వేడి చేయకూడదు. అలా చేస్తే బంగాళా దుంపల్లో క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇది బంగాళాదుంపల్లో ఉండే విటమిన్-బి6, పొటాషియం, విటమిన్-సి వంటి పోషకాలను అన్నింటిని నాశనం చేసి శరీరానికి హాని కలిగిస్తుంది. పుట్టగొడుగులు మంచి పోషకాహారం. ముఖ్యంగా చలికాలంలో విటమిన్-డి కావాలంటే పుట్టగొడుగులు తినాల్సిందే. దీంతో చలికాలంలో పుట్టగొడుగులు బాగా తింటుంటారు. అయితే పుట్టగొడుగులను ఒకసారి వండిన తరువాత మళ్లీ వేడి చేయడం అస్సలు మంచిది కాదు. వీటిని ఒకసారి వండి మళ్లీ వేడి చేస్తే వాటిలో ఉన్న ప్రోటీన్, ఖనిజాలు విచ్చిన్నం అవుతాయి. అవి టాక్సిన్లను విడుదల చేసి శరీరానికి హాని కలిగిస్తాయి. జీర్ణవ్యవస్థను దారుణంగా దెబ్బతీస్తాయి.                                               *నిశ్శబ్ద.  

ఆహారంలో మునగాకు చేర్చుకుంటే ఎన్ని లాభాలో తెలుసా?

ఆరోగ్యంగా ఉండటానికి ఆహారాలు ఎంతగానో తోడ్పడతాయి. సరైన ఆహారం తీసుకుంటే అసలు జబ్బుల గోల ఉండదు, అంతకు మించి మందుల తలనొప్పి అసలే ఉండదు. కానీ ఆహారాల మోజులో పడి కొందరు అనారోగ్యాలను తెచ్చుకుంటున్నారు. మన చుట్టూ ఎంతో సులువుగా లభించే ఆహారాలతోనే బోలెడు ఆరోగ్యం పొందవచ్చు. చాలాచోట్ల మునగ చెట్లు బాగా పెరిగి ఉంటాయి. వీటి కాయలు అయితే డబ్బు పెట్టి కొనాల్సి వస్తోంది. కానీ మునగాకు మాత్రం డబ్బు వెచ్చించకుండానే కోసుకోవచ్చు.  ఒకవేళ మునగ చెట్లు అందుబాటులో ఉంటే మాత్రం తరచుగా మునగాకును మిస్ కాకుండా తినండి.  కేవలం మునగాకే కాదు మునగ పువ్వులను కూడా  ఆహారంలో భాగంగా తీసుకుంటారు. మునగాకును పప్పు, కారప్పొడి, టీ వంటి వంటకాలుగానూ, మునగ పువ్వులను కూడా ఇదే విధంగానే వండుకుంటారు. చాలా మంది మునగాకును, మునగ పువ్వులను ఎండబెట్టి పొడి చేసుకుని వాటిని ఉపయోగించుకుంటారు. మార్కెట్లో కూడా మునగాకు పొడి డబ్బులు పోసి కొనాల్సి వస్తోంది. కాబ్టటి మునగాకును ఆహారంలో భాగం చేసుకోవాలి. దీనిలో పోషకాలేంటో.. దీనివల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. మునగాకులో ప్రోటీన్, విటమిన్-బి6, విటమిన్-సి, విటమిన్-ఎ, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం వంటి మూలకాలు సమృద్దిగా ఉంటాయి. మునగాకు తరచుగా తీసుకుంటే ఎముకలు బలపడతాయి.  కాల్షియం తక్కువ ఉందని కాల్షియం ఆధారిత ఆహారం తీసుకున్నా ఎముకలు బలంగా మారకపోతే మునగాకును ఆహారంలో చేర్చుకోవచ్చు. మునగాకు అల్సర్లను తగ్గించంలో అద్బుతం చేస్తుంది. ఇందులో యాంటీ అల్సర్ గుణాలు ఉన్నాయి. అల్సర్ సమస్యతో ఇబ్బంది పడుతున్నవారు మునగాకును తింటూ ఉంటే సమస్య తొందరలోనే తగ్గిపోతుంది. అధికబరువు సమస్య ఇప్పట్లో పెద్ద తలనొప్పిగా మారింది. కానీ బరువు తగ్గించడంలో మునగాకు సమర్థవంతంగా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఆహారంలో తీసుకుంటూ ఉంటే బరువు తగ్గుతారు. ఇందులో ఉండే పైబర్  జీర్ణాశయ పనితీరు మెరుగుపరుస్తుంది. మునగాకులో ఉండే పైబర్ అధిక బరువు నియంత్రణకు సహాయపడుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ ను అదుపు చేస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శరీరానికి శక్తి అందించడంలో మునగాకుది అందె వేసిన చెయ్యి. దీన్ని తింటూ ఉంటే శరీరం బలంగా మారుతుంది. రోగనిరోధక శక్తి కూడా బలపడుతుంది. అన్నింటి కంటే ముఖ్యంగా మునాకును మధుమేహం ఉన్నవారిని తినమని సిఫారసు చేస్తారు. కాస్త వైద్యం మీద అవగాహన ఉన్నవారి నుండి నైపుణ్యం ఉన్న వైద్యుల వరకు అందరూ మునగాకును తీసుకోమని సమర్థిస్తారు. మునగాకు ఆహారం ద్వారా విడుదలయ్యే చక్కెరలను నెమ్మది చేస్తుంది. దీనివల్ల రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. ఐరన్ లోపం ఉన్నవారు కూడా మునగాకు తినాలి. ఐరన్ లోపం దీర్ఘకాలం పాటూ కొనసాగితే అది రక్తహీనత సమస్యకు దారితీస్తుంది. ఐరన్ భర్తీ అయితే హిమోగ్లోబిన్ లెవల్స్ పెరిగి రక్తహీనత సమస్య తగ్గిపోతుంది. మునగాకు తింటే కలిగే మరో అధ్బుతమైన లాభం.. జుట్టు పెరుగుదల. చాలామంది జుట్టు పెరుగుదల కోసం తలకు హెయిర్ ప్యాక్ లు, షాంపూలు, నూనెలు ఉపయోగిస్తుంటారు. కానీ మునగాకును ఆహారంలో భాగం చేసుకుంటూ ఉంటే చాలు. కేవలం నెల రోజుల్లోపే జుట్టు పెరుగుదల లోనూ, జుట్టు రంగు లోనూ, జుట్టు మందంగానూ మారుతుంది.                                                     *నిశ్శబ్ద.  

ఉదయం లేవగానే మెంతుల నీళ్లు తాగుతే అధిక బరువుకు చెక్ పెట్టొచ్చు..!

మెంతుల్లో చాలా పోషకాలు ఉంటాయి. ఐరన్, మాంగనీస్‌తో సహా మంచి మొత్తంలో ఫైబర్, ఖనిజాలను కలిగి ఉంటుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగడం మరింత ప్రయోజనకరంగా ఉంటుంది. దీని కోసం, రాత్రిపూట ఒక గ్లాసు శుభ్రమైన నీటిలో మెంతులు వేసి నానపెట్టండి. ఉదయాన్నే ఆ నీటిని బాగా ఫిల్టర్ చేసి ఖాళీ కడుపుతో త్రాగాలి. కావాలంటే మెంతి గింజలు కూడా తినొచ్చు. దీంతో శరీరంలో ఉండే టాక్సిన్స్ తొలగిపోతాయి. మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది:  ఖాళీ కడుపుతో మెంతుల గింజల నీరు తాగితే  షుగర్ అదుపులో ఉంటుంది. మెంతులు రక్తంలో గ్లూకోజ్ స్థాయిని తగ్గిస్తుంది. ఇది డయాబెటిస్‌లో చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మధుమేహంతో బాధపడేవారు రోజూ ఉదయాన్నే మెంతి గింజల నీటిని తాగవచ్చు. గుండెకు మేలు చేస్తుంది: మెంతి నీరు గుండెకు చాలా మేలు చేస్తుంది. ఇది కొలెస్ట్రాల్‌ను నియంత్రించే హైపోకొలెస్టెరోలెమిక్ మూలకాలను కలిగి ఉంటుంది.  తద్వారా గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీని వినియోగం వల్ల రక్త ప్రసరణ కూడా మెరుగుపడుతుంది. ఆరోగ్యంగా ఉండటానికి, మీరు రోజూ మెంతి నీటిని కూడా తీసుకోవచ్చు. బరువు తగ్గుతుంది: మెంతి గింజల్లో ఫైబర్ ఉంటుంది.  ఇది ఆహారాన్ని జీర్ణం చేయడంలో సహాయపడుతుంది. రోజూ ఉదయాన్నే మెంతుల నీళ్లు  తాగడం వల్ల ఆకలి తగ్గుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల బరువు తగ్గుతారు. జీర్ణవ్యవస్థను బలపరుస్తుంది: మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అజీర్ణం లేదా మలబద్ధకంతో సమస్యలు ఉన్నవారికి మెంతి నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మెంతిలో ఉండే డైజెస్టివ్ ఎంజైమ్‌లు ప్యాంక్రియాస్‌ను మరింత యాక్టివ్‌గా చేస్తాయి. ఇది జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపరుస్తుంది. కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది:  మీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో మెంతి గింజల నీటిని తాగుతే, మీ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ సమస్యను నయం చేయవచ్చు. మెంతి గింజల నీటిని ఒక నెలపాటు క్రమం తప్పకుండా తాగితే, హెచ్‌డిఎల్ అంటే శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుందని భావిస్తున్నారు.

చలికాలంలో ఆరోగ్య సమస్యలా.. నీటిలో ఒక్క చెంచా దీన్ని కలిపి వాడితే సెట్!

చలికాలంలో ముక్కు, చెవి,  గొంతుకు సంబంధించిన సమస్యలు చాలా వస్తాయి. వాటిలో జలుబు, గొంతు కింద వాపు ముఖ్యమైనవి. ఇవి టాన్సిల్స్ సమస్యకు దారితీస్తాయి. టాన్సిల్స్ కారణంగా ఆహారం తిన్నాలన్నా, తాగాలన్నా ఇబ్బందిగా ఉంటుంది. దీనికి చాలా సింపుల్ గా చెక్ పెట్టవచ్చు. కేవలం ఒక్క చెంచా వంటింట్లో ఉండే పదార్థాన్ని నీళ్లలో  కలిపి ఉపయోగించడం వల్ల టాన్సిల్ సమస్య తగ్గుముఖం పడుతుంది. అసలు జలుబు, టాన్సిల్స్ సమస్య ఎందుకొస్తుంది? దీనికి కారణాలు ఏంటి? తెలుసుకుంటే.. చలికాలంలో చల్లని, పొడిగాలులు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళలల్లో ఈ గాలులు ఎక్కువ. ఇలాంటి వాతావరణంలో ఉండటం వల్ల గాలుల ప్రభావం గొంతులో కణజాలాన్ని పొడిగా మారుస్తుంది. దీనికారణంగా గొంతులో చికాకును, వాపును కలిగిస్తుంది. ఇదే క్రమంగా గొంతు నొప్పి, జలుబు, సైనస్, శ్వాసకోశ సమస్యలకు దారితీస్తుంది.  ఈ సమస్య ఏర్పడిన తరువాత తొందరగా సమస్యను గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే టాన్సిల్స్ కు దారితీస్తుంది. జలుబు వస్తే.. చలికాలంలోనే కాదు జలుబు చేస్తే ముక్కులు బ్లాక్ అయిపోతాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడుతుంది. దీనికారణంగా రోజంతా డిస్టర్బ్ అవుతారు. జలుబును లైట్ తీసుకుంటే శ్లేష్మం పెరుగుతుంది. గొంతులో వాపు కూడా వస్తుంది. దీన్నుండి ఉపశమనం పొందాలంటే గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. దీనివల్ల శ్లేష్మం తొలగిపోతుంది. ముక్కులు కాస్త రిలాక్స్ అవుతాయి. టాన్సిల్స్ వస్తే.. టాన్సిల్స్ వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఆహారం తినాలన్నా, తాగాలన్నా కూడా ఇబ్బందే. దీన్ని పరిష్కరించాలంటే ఇంట్లో ఉన్న ఒక్క స్పూన్ ఉప్పు చాలు. లీటరు నీటిలో ఒక స్పూను ఉప్పు వేసి బాగా పుక్కిలించాలి. రోజులో ఇలా నాలుగైదు సార్లు చేస్తుంటే చాలు గొంతు నొప్పి, గొంతులో శ్లేష్మం తగ్గుతుంది. బ్లాక్ అయిపోయిన ముక్కులు రిలాక్స్ అవుతాయి. జలుబు, టాన్సిల్స్ కు కారణమయ్యే బ్యాక్టీరియా, వైరస్ లను కూడా ఇది తొలగిస్తుంది. దగ్గు సమస్య ఉంటే అది కూడా తగ్గిపోతుంది. ఉప్పు నీరుతో పుక్కిలిస్తేనే ఉపశమనం ఎందుకుంటుందంటే.. నీటిలో ఉప్పు కలిపినప్పుడు నీటి పిహెచ్ స్థాయి సమతుల్యంగా ఉంటుంది. దీని కారణంగా బ్యాక్టీరియా అభివృద్ది చెందదు. ఎందుకంటే ఆల్కలీన్ వాతావరణంలో బ్యాక్టీరియా ఎక్కువకాలం మనుగడ సాగించలేదు.                                                 *నిశ్శబ్ద.  

జీడిపప్పు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందా.. ఈ  గింజలు గుండె జబ్బులను పెంచుతాయా!

కొలెస్ట్రాల్ అనేది ఒక ప్రధాన  సమస్యగా మారుతోంది.  దీనికి సరైన ఆహారం, దిగజారుతున్న జీవనశైలి, ఒత్తిడి. కారణం అవుతున్నాయి. అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారిలో రక్తపోటు, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ విషయంలో ఆహారపు అలవాట్లు కూడా చాలా బాధ్యత వహిస్తాయి. అయితే డ్రై ఫ్రూట్స్ తినడం ద్వారా గుండె  ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు జీడిపప్పు వంటి డ్రై ఫ్రూట్‌లను తినకూడదని కొందరు హెచ్చరిస్తుంటారు. ఈ వాదనలో నిజమెంతో తెలుసుకుందాం.  జీడిపప్పులో ఉండే పోషకాల గురించి మాట్లాడితే, ఆరోగ్యానికి అవసరమైన 44 శాతం కొవ్వు, 30 శాతం కార్బోహైడ్రేట్స్, 18 శాతం ప్రోటీన్లను కలిగి ఉంటుంది. జీడిపప్పు పోషకాల పవర్ హౌస్‌గా పరిగణిస్తారు. పోషకాలు అధికంగా ఉండే జీడిపప్పు వినియోగం కొలెస్ట్రాల్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంతో తెలుసుకుందాం.  జీడిపప్పు తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ పెరుగుతుందా? జీడిపప్పు అనేది డ్రై ఫ్రూట్, ఇది కొలెస్ట్రాల్‌ను పెంచని ఆహారం. సాధారణంగా జంతు ఆధారిత ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయి పెరిగే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే జీడిపప్పులో మాత్రం జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. జీడిపప్పు చెడు కొలెస్ట్రాల్ లేదా ఎల్‌డిఎల్‌ను తగ్గించడమే కాకుండా, మెగ్నీషియం అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులను కూడా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.  నిపుణుల అభిప్రాయం ప్రకారం, జీడిపప్పు మొక్కల ఆధారిత ఆహారం. జీడిపప్పులో ఉండే కొవ్వులో ఎక్కువ భాగం స్టెరిక్ యాసిడ్ నుండి వస్తుందని, ఇది రక్తంలో ఉన్న కొలెస్ట్రాల్‌పై ఎటువంటి ప్రభావం చూపదని అనేక పరిశోధనలలో నిరూపించారు. రోజుకు గుప్పెడు జీడిపప్పులు తినడం వల్ల గుండెకు చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.  జీడిపప్పు గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది జీడిపప్పు తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పు ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను నియంత్రిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం గుండె జబ్బులను నయం చేయడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఆహారంలో తగినంత మొత్తంలో మెగ్నీషియం తీసుకోవడం గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.    బ్రెడ్ గులాబ్ జామూన్ తయారీ విధానం.. గులాబ్ జామున్ అనేది మన సాంప్రదాయ స్వీట్, భారతదేశంలో చాలా మంది అత్యంత ఇష్టపడే స్వీట్‌లలో గులాబ్ జామూన్ ఒకటి. ఈ ఇంట్లో తయారుచేసుకునే ఈ గులాబ్ జామూన్ ను మనం ఇప్పుడు బ్రెడ్, క్రీమ్, పాల పౌడర్‌తో తయారు చేయవచ్చు. ఇది రుచికరం మాత్రమే కాదు, తయారు చేయడం కూడా చాలా సులభం.   

స్వీట్ల మీద సిల్వర్  కోటింగ్ ఎందుకు వేస్తారో తెలుసా!

స్వీట్లంటే ఇష్టపడని వారు ఉండరు. ఇళ్లలో మహా అయితే రెండు మూడు రకాల స్వీట్లు రిపీట్ అవుతూ ఉంటాయి. కానీ బయట షాపులలో బోలెడు రకాల స్వీట్లు ఉంటాయి. ఇవి వివిధ రంగులలో, వివిధ ఆకారాలలో చూడగానే తినేయాలనిపించేలా ఆకర్షిస్తాయి. కొన్ని ఖరీదైన స్వీట్లను గమనిస్తే వాటి మీద సిల్వర్ కోటింగ్ ఉంటుంది. ఇలా వెండి పూత కలిగిన స్వీట్లు పెద్ద పెద్ద షాపులలో ఎక్కువ ఖరీదులో ఉంటాయి. ఈ వెండి పూతను వరాక్ అని పిలుస్తారు. చాలామంది అలంకరణ కోసం ఈ పూత వేస్తారని అనుకుంటారు. కానీ ఇలా స్వీట్ల మీద వెండి పూత వేయడానికి వెనుక వేరే కారణాలు కూడా ఉన్నాయి. మోతీచూర్ లడ్డూ, కాజూ కట్లీ, కాజూ పిస్తా రోల్స్ వంటి స్వీట్ల మీద వెండి పూత ఉంటుంది. పాలతో మాత్రమే చేసే వివిధ స్వీట్లకు కూడా ఈ వెండి పూత అప్లై చేస్తారు. స్వీట్ల మీద అప్లై చేసే వెండి పొరలో నిజంగానే శుద్దమైన వెండి ఉపయోగిస్తారు. శుద్దమైన వెండితో తయారైన వెండిపూత ఉన్న స్వీట్లు చాలా ఆరోగ్యం. వెండిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు సమృద్దిగా ఉంటాయి. అలాగే యాంటీ మైక్రోబయల్ లక్షణాలు కూడా ఉంటాయి. ఈ కారణంగా స్వీట్ల మీద వెండి పూత వేస్తే స్వీట్లు ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి. లేకపోతే పాలతోనూ, నెయ్యితోనూ చేసిన స్వీట్లు    తొందరగా ముక్కిపోయిన వాసన వస్తాయి. మొట్టమొదట స్వీట్ల మీద వెండి పూత వేయడం మొదలైంది కూడా ఈ కారణంతోనే. అయితే వెండి అనేది ఖరీదైన లోహంగా మారడం వల్ల స్వీట్ల మీద వెండి పూత వేయగానే సాధారణ స్వీట్లు కూడా ధర కొండెక్కి కూర్చుంటున్నాయి. మరీ ముఖ్యంగా పెద్ద పెద్ద షాపులు స్వీట్లు చాలా అట్రాక్షన్ గా కనిపించడం కోసం వెండి పూతను ఎంచుకుంటారు. .                                                   *నిశ్శబ్ద.

చలికాలం పిల్లలకు న్యుమోనియా ప్రమాదం ఎక్కువ..సమస్యకు చెక్ పెట్టే చిట్కాలు..!!

వాతావరణం ఒక సీజన్ నుంచి మరో సీజన్ కు మారుతున్న సమయంలో మన శరీరం ఒక రకమైన ఒత్తిడిని ఎదుర్కొంటుంది. క్రమంగా వాతావరణానికి అలవాటు పడుతుంది. అయితే ఈ సమయంలోనే కొన్ని రకాల సీజనల్ వ్యాధుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుతం చలికాలం ప్రారంభ దశలో చాలా మంది జలుబు, దగ్గు, ఫ్లూ, న్యుమోనియా వంటి వ్యాధుల బారిన పడుతుంటారు. పెద్దవాళ్లు ఈ సమస్యల నుంచి సులభంగా కొలుకున్నప్పటికీ పిల్లల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఈమధ్య చైనాలో పెద్ద సంఖ్యలో పిల్లలు న్యుమోనియాతో ఆసుపత్రుల పాలవుతున్నారు. ఇది సాధారణ సీజనల్ ఇన్ఫెక్షన్ అని అక్కడి వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ ప్రమాదం ఎక్కడైనా ఉండొచ్చని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా ఐదేళ్ల కంటే తక్కువ వయస్సున పిల్లల్లో న్యుమోనియా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. చలికి వాయు కాలుష్యం కూడా తోడవ్వడంతో పిల్లలు ఊపిరితిత్తుల సమస్యలను ఎదుర్కొంటారు. అందుకే పిల్లల్లో న్యుమోనియా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య సహాయం అందించాలి. దగ్గు, వేగంగా శ్వాసతీసుకోవడం, జ్వరం వంటి లక్షణాలను నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే పరీక్షలు చేయించుకోవాలి. అలాగే న్యుమోనియాతో పోరాడే శక్తిని పొందేందుకు ఊపిరిత్తుల ఆరోగ్యం కోసం కొన్ని చిట్కాలు పాటించాలి. అవేంటంటే... జలుబు: సాధారణ జలుబు లక్షణాలే న్యుమోనియా లక్షణాలుగా ఉంటాయి. జలుబు క్రమంగా న్యుమోనియాకు దారితీసే ఛాన్స్ ఉంటుంది. అందుకే జలుబు చేసినప్పుడు, మరింత తీవ్రమైన న్యుమోనియాగా మారకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే చికిత్స తీసుకుని మందులు వాడాలి. పరిశుభ్రత: న్యుమోనియా అనేది బ్యాక్టీరియా, వైరస్ లు , శిలీంధ్రాలు వంటి అనేక రకాల సూక్ష్మజీవులతో వస్తుంది. సాధారణంగా న్యుమోనియా అంటువ్యాధి కాదు..కానీ వేగంగా వ్యాప్తిచెందుతే అంటువ్యాధిగానే గుర్తించాలి. అందుకే బయటకు వెళ్లినప్పుడు మాస్కులు ధరించడం తప్పనిసరి. ఇంట్లోకి రాగానే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. వ్యాధి ప్రాబల్యం ఉన్న ప్రాంతాలకు వెళ్లినప్పుడు ముక్కు, నోరును ఎక్కువగా తాకకూడదు. దగ్గు: దగ్గు న్యుమోనియా సాధారణ లక్షణంగా చెబుతారు. బాధితులు దగ్గినప్పుడు రోగి నుంచి ఆరోగ్యకరమైన వ్యక్తికి వ్యాధి కారకాలు వ్యాపించే మార్గం ఇది. అందుకే దగ్గు వచ్చినప్పుడు నోటికి గుడ్డ అడ్డుగా పెట్టుకోవాలి. దీంతో ఇతరులకు వ్యాపించకుండా అడ్డుకోవచ్చు. వ్యాక్సిన్: న్యుమోనియాకు కారణమయ్యే సాధారణ బ్యాక్టీరియా, వైరస్ లను నిరోధించేందుకు వ్యాక్సిన్ తీసుకుంటే సమస్య ప్రభావం ఎక్కువగా ఉండదు. ఆసుపత్రిలో చేరేంత తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదాన్ని వ్యాక్సిన్ తగ్గించేస్తుంది. ఇమ్యునిటీ లేనివారు న్యుమోనియా వ్యాక్సిన్ తీసుకోవడం మంచిది. లైఫ్ స్టైల్: సీజనల్ ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి శరీరానికి ఉండాలంటే ఇమ్యునిటీ బలంగా ఉండాలి. దీనికి ఆరోగ్యకరమైన జీవనశైలి పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి. వ్యాయాయం చేయాలి. విశ్రాంతి తీసుకోవాలి. స్మోకింగ్, డ్రింకింగ్ వంటి అలవాట్లను మానేయాలి.   

ఈఫుడ్స్ తో నెలసరి ఇబ్బందులకు చెక్!

ప్రతి ఆడపిల్లకూ నెలసరి తప్పనిసరి. ఒత్తిడి, హార్మోన్ల మార్పులు, పోషకాహారలోపం వంటి కారణాలతో అధిక రక్తస్రావం, కడుపునొప్పి, తీవ్ర భావోద్వేగాలు వంటికి కనిపిస్తుంటాయి. ఈ సమస్యను అధిగమించేందుకు సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి. అవేంటో చూద్దామా. ఆకు కూరలు: ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, జింక్ వంటి ఖనిజాలు ఆకుకూరల్లో పుష్కలంగా ఉంటాయి. వీటిని ఈ సమయంలో తింటే నొప్పులు తగ్గుతాయి. రక్తహీనత సమస్య అదుపులో ఉంటుంది. ఇందులోని మెగ్నీషియం మెదడుకి ఉపశమనం కలిగిస్తుంది. అరటిపండ్లు: ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తాయి. ఇందులోని పొటాషియం ఒంట్లోని నీటిని నిల్వల్ను కోల్పోకుండా చేయడంతో డీహైడ్రేషన్ సమస్య ఎదురుకాదు. అంతేకాదు అరటిలో ఉండే ట్రిప్టోఫాన్ సెరటోనిన్ విడుదల చేస్తుంది. ఇది మెదడుకు ఉపశమనం అందిస్తుంది. డార్క్ చాక్లెట్ : నెలసరి సమయంలో ఒంట్లోని ప్రొజెస్టెరాన్ హార్మోన్ తగ్గడంతో ఈస్ట్రోజన్ పెరుగుతుంది. దీంతో ఒంట్లో చక్కెర స్థాయిలు తగ్గి నీరసం పెరుగుతుంది. దీంతో తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. ఇలాంటి సమయంలో డార్క్ చాక్లెట్ తినండి. పెరుగు: చాలామంది నెలసరి సమయంలో పెరుగు తినకూడదని చెబుతుంటారు. కానీ ఇది ఆ సమయంలో మంచి ఆహారమని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. ఇందులో ఉండే కాల్షియం, పొత్తికడుపు నొప్పిని తగ్గించి, మూడ్ స్వింగ్స్ కి దూరంగా ఉంచుతుంది.

నిద్రలో ఈ లక్షణాలు కనిపిస్తే గుండెపోటుకు సంకేతమా..?

మన శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాలలో గుండె ఒకటి. గుండె పనితీరు సజావుగా సాగితేనే మన ఆరోగ్యం బాగుంటుంది. మనకు ఎదురయ్యే కొన్ని సంకేతాలు గుండెకు సంబంధించి ఏదో సమస్య ఉందని ముందే చెబుతాయి. ఇటీవలి కాలంలో గుండెపోటు కేసులు పెరుగుతున్నాయి. నేపథ్యంలో ముందే గుండె పోటును ఎలా గుర్తించాలో తెలుసుకుందాం. గుండెపోటు ఎందుకు వస్తుందో మనం గమనిస్తే, గుండె కండరాలకు ఆక్సిజన్ అందని సమయంలో గుండె పోటు వస్తుంది. ప్రధానంగా మనం తినే కొవ్వు పదార్థాల ప్రభావం వల్ల రక్తనాళాలు కొలెస్ట్రాల్ రూపంలో మూసుకుపోతాయి. దీని వల్ల గుండెకు రక్తం, ఆక్సిజన్ అందడం లేదు. ఇలా అరగంటలోనే గుండె పనిచేయడం ఆగిపోతుంది. లక్షణాలు ఇవే… శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉంటుంది: రాత్రిపూట ఊపిరి ఆడకపోవడం కూడా గుండె సమస్యలను సూచిస్తుంది. ఊపిరితిత్తుల్లో నీరు చేరడమే దీనికి మూలకారణమని చెబుతున్నారు. దీంతో గుండెకు కూడా సమస్యలు వస్తాయి. రాత్రి చెమటలు: కొందరికి రాత్రి నిద్రిస్తున్నప్పుడు అకస్మాత్తుగా చెమటలు పట్టడం మొదలవుతుంది. బయట వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కూడా ఇది జరుగుతుంది. ఇలా పదే పదే జరిగితే, అది క్రమంగా గుండె పోటుగా గమనించవచ్చు. విపరీతమైన దగ్గు: దగ్గు అనేక కారణాల వల్ల సంభవించవచ్చు. కానీ నిద్రపోతున్నప్పుడు అకస్మాత్తుగా దగ్గు రావడం కూడా గుండె సమస్యలను సూచిస్తుంది. ఎందుకంటే శ్వాస నాళంలో నీరు నిండి దగ్గు చికాకు కలిగించే అవకాశం ఉంది. విపరీతమైన గురక: కొంతమంది రాత్రి నిద్రలో ఎక్కువగా గురక పెడుతుంటారు. దీనివల్ల నిద్రలేమి సమస్య వస్తుంది.అంతే కాదు గురకకు ప్రధాన కారణం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. గుండె లోపల ఏదైనా సమస్య వచ్చినా, గాయమైనా ఇలా గురక పెడతారని నిపుణులు అంటున్నారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. - గుండెపోటుకు సంబంధించినంతవరకు, దానిని నివారించడానికి జీవనశైలిలో కొన్ని మార్పులను అనుసరించడం అవసరం. - ధూమపానం, మద్యపానం మానేయాలి -  ఆహారంలో ఉప్పు వాడకం తగ్గించాలి.   - మీ వైద్యునిచే మీ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి. ఎలా నియంత్రించాలి? -శరీరానికి రోజువారీ వ్యాయామం అందించడం - డాక్టర్ సలహా మేరకు రక్తనాళాలు అడ్డుపడే అవకాశం ఉండకుండా ఉండేందుకు తక్కువ మోతాదులో ఆస్పిరిన్ మాత్రలు తీసుకోవడం. - మెనోపాజ్‌కు చేరుకునే స్త్రీలు ఈస్ట్రోజెన్ రీప్లేస్‌మెంట్ థెరపీ గురించి వారి వైద్యుని నుండి సమాచారాన్ని పొందాలి.

ఏం తిన్నా నీరు తాగే అలవాటుందా.. ఈ పండ్లు తిన్నాక మాత్రం తాగొద్దండీ బాబూ!

ఆహారం శరీరానికి శక్తిని అందిస్తుంది. సాధారణంగా ఆహారం తింటున్నప్పుడు, తిన్న తరువాత నీరు తాగుతుంటారు. ఘనాహారం తినేటప్పుడు కొంచెం అయినా నీరు తాగాల్సిన అవసరం ఏర్పడుతుంది. కానీ నిజానికి ఆహారం బాగా నమిలి తింటే అస్సలు నీరు తాగాల్సిన అవసరమే లేదని వైద్యుల నుండి పోషకాహార నిపుణుల వరకు అందరూ చెబుతారు. కానీ కొందరికి మాత్రం ఏం తిన్నా నీరు తాగే అలవాటు ఉంటుంది. టిఫిన్, స్నాక్స్, పండ్లు, భోజనం ఇలా ఏం తిన్నా నీరు తాగుతుంటారు. కానీ కొన్ని పండ్లు తిన్న తరువాత నీరు అస్సలు తాగకూడదని వైద్యులు చెబుతున్నారు. ఇంతకూ ఆ పండ్లేంటో తెలుసుకుంటే.. బొప్పాయి.. బొప్పాయిలో చాలా మంచి పోషకాలు ఉంటాయి. వీటి ఆకులు, గింజలు, పండు అన్ని తింటారు. అయితే బొప్పాయి పండు తిన్నతరువాత  నీరు తాగకూడదు. ఎందుకంటే బొప్పాయిలో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చాలా ఆలస్యంగా జీర్ణం అవుతుంది. బొప్పాయి తిన్నాక నీరు తాగితే జీర్ణాశయంలో ఇబ్బంది ఏర్పడుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. మామిడి పండ్లు.. నోరూరించే మామిడి పండ్లు తినడం అందరికీ మహా ఇష్టం. కానీ మామిడి పండ్లు తినగానే మామిడి పీచు పండ్లలో ఇరుక్కుందని కొందరు, అలవాటులో మరికొందరు నీరు పుక్కిలిస్తూ తాగుతుంటారు. కానీ మామిడి పండ్లు తిన్నాక నీరు తాగితే నష్టాలుంటాయి. మామిడి పండ్లలో ఉండే విటమిన్-సి, పోషకాలు శరీరానికి అస్సలు అందవు. పైపెచ్చు అజీర్ణానికి కారణమవుతుంది. పుచ్చకాయ.. అధికశాతం నీరు కలిగిన పుచ్చ పండు తిన్నాక కూడా చాలామంది నీరు తాగుతారు. అదొక అలవాటు. పుచ్చకాయలో 90శాతం నీరు ఉంటుంది, మిగిలిన 10శాతం ఫైబర్, విటమిన్లు గట్రా ఉంటాయి.  అయితే పుచ్చకాయ తిన్న వెంటనే నీరు తాగితే కడుపు ఉబ్బరం, అజీర్తీ చేస్తుంది. పైనాపిల్.. తియ్యగా, పుల్లగా ఉండే పైనాపిల్ సిట్రస్ పండు కోవకే చెందుతుంది. దీన్ని తిన్న తరువాత నీరు తాగినప్పుడు  గమనిస్తే నాలుక మండినట్టు ఉంటుంది.  దీనికి కారణం పైనాపిల్ లో బ్రోమెలనిన్ ఎంజైమ్ లు ఉంటాయి. ఇవి నాలుక మండటానికి కారణం అవుతాయి. కేవలం నాలుకే కాదు.. కడుపులో కూడా అసౌర్యం ఏర్పడుతుంది. పైనాపిల్ తినగానే నీరు తాగితే విరేచనాలు, కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అరటిపండు.. అరటిపండు పౌష్టికాహారంలో ఒక భాగం. వ్యాయామం చేసిన తరువాత, ప్రతిరోజూ పిల్లలు, పెద్దలు ఒక అరటిపండు తింటే మంచిదని చెబుతారు. అరటిపండులో కేలరీలు, పోషకాలు, చక్కెర శాతం ఎక్కువగానే ఉంటాయి. ఇక అరటిపండులో ఉండే పొటాషియం, మాంగనీస్ శరీరానికి ఎంతో అవసరం. కానీ అరటిపండు తిన్న తరువాత  నీరు తాగితే పండులో పోషకాలు శరీరానికి అందవు. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే పండ్లలో ఆల్రెడీ నీరు ఉంటుంది. అది శరీరాన్ని హైడ్రేట్ గా మారుస్తుంది. పండ్లలో ఉండే గుణాల కారణంగా పండ్లు తిన్న వెంటనే కొందరికి జలుబు కూడా చేస్తుంది. పండ్లను కూడా పూర్తీగా నమిలి తింటే అసలు నీరు తాగాల్సిన అవసరం ఉండదు.                                                     *నిశ్శబ్ద.  

వ్యాయామం చేస్తూ ఇలా తినాల్సిందే..!!

ఆరోగ్యంగా ఉండాలన్నా..ఫిట్ గా ఉండాలన్నా..కేవలం వ్యాయామం చేస్తే సరిపోదు. వ్యాయామంతోపాటు కచ్చితమైన ఆహార నియమాలు పాటించడం తప్పనిసరి. - వ్యాయామాలు చేసేవారు ఏదొక తేలికపాటి భోజనంతో సరిపెట్టుకోకూడదు. ఆహారంలో తగినన్ని ప్రొటీన్లు, కార్బొహైడ్రేట్లు ఉండేలా చూడాలి. అది కూడా ఒకేరకం పదార్థాల నుంచి కాకుండా ఇతర రకాల ఆహారాల నుంచి అందేలా చూసుకోవాలి. దీనికోసం అప్పటికప్పుడు ఆలోచించకుండా వారానికి సరిపడా డైట్ ప్లాన్ చేసుకుంటే మంచిది . - వ్యాయామం అయినా, ఆహారమైనా ఎంత అవసరమో అంతే తీసుకోవడం తప్పనిసరి. ఎలాగు కసరత్తులు చేస్తున్నామంటూ అతిగా తినడం సరికాదు. సన్నబడాలన్న తపనతో అసలు తినకుండా ఉండట కూడా మంచిది కాదు. వర్కవుట్స్ చేయడానికి ముందు తినే స్నాక్స్ లో కార్బొహైడ్రేట్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అప్పడే తగినంత ఉత్సాహంతో వ్యాయాయం చేస్తాం. - కార్డియో ట్రైనింగ్ కు వెళ్లేవారు పొట్టను ఎంత వీలైతే అంత ఖాళీగా ఉంచుకోవడం మంచిది. ఒక కప్పు గ్రీన్ టీ తోపాటుగా ఏదైనా పండు తీసుకుంటే సరిపోతుంది. వర్కవుట్స్ తర్వాత త్రుణధాన్యాలతో చేసిన ఉప్మా, దోసె, కొవ్వు తక్కువగా ఉండే పాలు పండ్ల రసాలు, పెరుగు వంటివి తింటే కండరాలకు సాంత్వన లభిస్తుంది. -భోజనం తర్వాత వ్యాయామం చేయాలనుకుంటే కచ్చితంగా మూడు నుంచి నాలుగు గంటల విరామం తర్వాత జిమ్ కు వెళ్లాలి.  

చామంతి పువ్వుల టీ ఎప్పుడైనా తాగారా? దీంతో ఎన్ని లాభాలంటే...

విదేశాల నుండి భారతదేశానికి వ్యాప్తి చెందినా భారతీయులు టీ, కాఫీలను గుండెల్లో పెట్టుకున్నారు.  అర్థరాత్రి, ఆపరాత్రి అనే తేడా లేకుండా కాఫీ, టీ లకోసం అర్రులు చాచేవారున్నారు. అయితే వీటిలో కెఫిన్ ఆరోగ్యానికి హానికరం. కానీ ఆయుర్వేదం సూచించే హెర్బల్ టీలు ఆరోగ్యానికి ది బెస్ట్ అని చెప్పవచ్చు. పువ్వులతోనూ, ఆకులతోనూ టీలు చేసుకుని వేడివేడిగా సిప్ చేస్తుంటే కలిగే అనుభూతి, ఆ తరువాత శరీరానికి చేకూరే ఓదార్పు మాటల్లో చెప్పలేనిది. పైపెచ్చు వైద్యుల దగ్గలకు వెళ్లి వేలు పోసి ఖర్చుపెట్టి తగ్గించుకునే ఎన్నో జబ్బులు ఈ టీలతో తగ్గుతాయి. ఇలాంటి పువ్వుల టీలలో ప్రసిద్ది చెందినది చమోమిలే టీ. చామంతి పూల టీ నే చమోమిలె టీ అని అంటారు. అసలు టీ వల్ల కలిగే లాభాలేంటి? ఈ టీ కోసం ఉపయోగించే చామంతులేవి? ఈ టీ ఎప్పుడు తాగితే బెస్ట్ ఫలితాలు ఉంటాయి?పూర్తీగా తెలుసుకుంటే.. చామంతి టీ.. చామంతి టీని చామంతి పువ్వులతో తయారుచేస్తారు. బాగా మరిగించిన నీటిని ఒక కప్పులో వేసి అందులో ఎండబెట్టిన చామంతి పువ్వులను వేస్తారు. దానిమీద మూత పెట్టి 3 నుండి 5 నిమిషాలు అలాగే వదిలేస్తారు. ఇలా చేయడం వల్ల ఎండిన పువ్వులలో సారం నీటిలోకి చేరుతుంది. చామంతి పువ్వుల టీ సిద్దమవుతుంది. ఇది అచ్చం గ్రీన్ టీ తయారు విధంలానే ఉంటుంది కాబట్టి దీన్ని చేసుకోవడం సులభం.అయితే దీనికి సాధారణ చామంతులు పనికిరావు.  రెండు ప్రత్యేక రకాల చామంతులు ఈ టీ కోసం వినియోగిస్తారు. జర్మన్ జాతికి చెందిన చామంతి పూలు, రోమన్ జాతికి చెందిన చామంతులు మాత్రమే టీకి పనికొస్తాయి.. ఎప్పుడు తాగాలి?   చామంతి పువ్వుల టీ తాగడానికి సరైన సమయం రాత్రి. అన్ని టీలు ఉదయం, సాయంత్రం తాగితే ఈ టీ మాత్రం రాత్రి తాగితే మంచి ఫలితాలు ఇస్తుంది. చామంతి పువ్వుల టీ తాగితే కలిగే ఫలితాలు.. రాత్రి పూట చామంతి పువ్వుల టీ తాగితే నిద్ర చక్కగా పడుతుంది. నిద్రలేమి సమస్య ఎక్కువ రోజులు కొనసాగితే అది మానసిక ఒత్తిడి, ఆందోళన, హార్మోన్ల అసమతుల్యత, జ్ఞాపకశక్తి మందగించడం వంటి సమస్యలు ఎదురవుతాయి. గుండె సంబంధ సమస్యలు, హైపర్ టెన్షన్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. వీటన్నింటికి చామంతి పూల టీ చెక్ పెడుతుంది. రాత్రి పడుకునే ముందు ఈ టీ తాగితే మంచిగా నిద్ర పట్టేలా చేస్తుంది. చామంతి టీలో యాంటీస్పాస్మోడిక్ లక్షణాలు ఉంటాయి. ఇది నొప్పులు తగ్గించడంలో బాగా సహాయపడుతుంది. నొప్పిని ప్రేరేపించే కారకాలు ఉత్పత్తి కాకుండా చేసి నొప్పులలో ఉపశమనం ఇస్తుంది. కడుపునొప్పి, మహిళలలో నెలసరి నొప్పులు, ఆహారం జీర్ణం కాకపోవడం వల్ల వచ్చే కడుపు నొప్పి వంటి సమస్యలను కూడా పరిష్కరిస్తుంది. చామంతి టీ కేవలం టీ మాత్రమే కాదు. ఒక మంచి ఔషదం కూడా. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనాయిడ్లు, ట్రైగ్లిజరైడ్స్ ఉంటాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. తద్వారా గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. ఈ టీని క్రమం తప్పకుండా తాగుతుంటే హైపర్ టెన్షన్ కాస్తా బలాదూర్ అవుతుంది. రక్తనాళాలు, ధమనులు  పనితీరు సరిగా ఉండేలా చేస్తుంది. చామంతిలో క్వెర్సెటిన్ లు ఉంటాయి. ఇవి పాలీఫెనాల్ లు. వీటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ మైక్రోబయల్ గుణాలు  ఉంటాయి. ఇవి ఇమ్యునిటీ పవర్ ను పెంచుతాయి. యాంటీ క్యాన్సర్ ఏజెంట్ గా కూడా పనిచేస్తాయి. ఇందులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కడుపులో మంట, గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం, పొత్తి కడుపు నొప్పి                                                  *నిశ్శబ్ద.  

లైట్ వేసుకుని నిద్రపోవచ్చా... అసలు నిద్ర గురించి ఈ నిజాలు తెలుసా?

ఆహారం,  వ్యాయామం, విశ్రాంతి మనిషికి చాలా ముఖ్యం. కానీ చాలామంది ఈ మూడింటిలోనే తప్పులు చేస్తుంటారు. వీటికి తగిన కారణాలు చూపించి సమర్థించుకుంటారు కూడా. ఉదయం లేచింది మొదలు రాత్రి వరకు ఉరుకుల పరుగులతో సాగిన శరీరానికి రాత్రి మాత్రమే విశ్రాంతి లభిస్తుంది. కానీ కొందరి అవగాహనా లోపం వల్ల కనీసం ఈ రాత్రి కూడా సరైన విశ్రాంతి ఉండదు. నిద్రపోయే సమయం నుండి నిద్రించే పరిస్థితులు, ఎంత సేపు నిద్రపోతారనే విషయాల వరకు అస్సలు పట్టించుకోనే పట్టించుకోరు. నామ్ కే వాస్తి అన్నట్టుగా  నిద్రను కూడా సరిపెట్టేస్తుంటారు. అయితే నిద్ర గొప్ప ఔషదం. అది సక్రమంగా ఉంటే శరీర ఆరోగ్యం చాలావరకు బాగుంటుంది. మెదడు రిలాక్స్ అవుతుంది. ఆలోచనా సామర్థ్యం పెరుగుతుంది. మానసిక ఆరోగ్యం బాగుంటుంది. నిద్ర గురించి ఉన్న అపోహలు.. సందేహాలు పటాపంచలు చేయాలంటే ఈ కింది విషయాలు చదివితే సరోపోతుంది.  రాత్రి నిద్ర.. రాత్రిళ్లే నిద్రపోవాలనే రూల్ ఉండటం వెనుక బోలెడు బయటి కారణాలు అయితే ఉండొచ్చు కానీ అసలైన కారణం వాతావరణమే. రాత్రి ప్రకృతి కూడా నిశ్శబ్దమైపోతుంది. ఆ సమయంలో నిద్రే  అందరికీ మంచిది. ఉద్యోగాల పేరుతోనూ, సరదాల పేరుతోనూ కోల్పోయే నిద్రకు భవిష్యత్తులో తప్పకుండా మూల్యం చెల్లించుకుంటారు. వాటి పుణ్యమే మానసిక సమస్యలు, మధుమేహం, రక్తపోటు నియంత్రణలో లేకపోవడం, అకాల వృద్దాప్యం మొదలైనవి. కాబ్టటి రాత్రి నిద్రే బెస్టు.  ఎంతసేపు..  ప్రతి ఒక్కరూ రోజుకు 6నుండి 8 గంటలు నిద్రపోవాలని చెబుతుంటారు. కానీ చాలామంది రాత్రి సమయంలో ఇంతసేపు నిద్రపోరు. ఎప్పుడో ఒంటి గంటకు పడుకుని ఉదయమే లేచి ఉద్యోగానికి పరిగెత్తుతారు.మరికొందరు అయితే ఇలా కోల్పోయిన నిద్రను సెలవు రోజుల్లో భర్తీ చేద్దాం అనుకుంటారు. అయితే ఇవన్నీ పిచ్చి చర్యలే.. రాత్రిళ్లు ఏకధాటిగా నిద్రపోతేనే శరీరం తగినవిధంగా రిలాక్స్ అవుతుంది. కునుకుపాట్లు.. చాలామంది కళ్లుమూసుకుని అలా కునుకుపాట్లు పడి నిమిషాల వ్యవధిలో మళ్లీ లేస్తారు. తాము నిద్రపోయామని అంటారు. కానీ అదసలు నిద్రే కాదు. నిద్రలో ఉన్నప్పుడు అసలు శరీర అవయవాల గురించి స్పృహే ఉండదు చాలామందికి. అందులోనూ ఇలాంటి కునికిపాట్లవల్ల మెదడు మీద ఒత్తిడి పెరిగి తలనొప్పి వస్తుంది. లైట్ వెలుతురులో నిద్ర.. అదేంటోగానీ రాత్రిపూట గదిలో చిన్న జీరో లైటో లేదా బెడ్ లైటో వేసుకోవడం మంచిదని అనుకుంటార. కానీ వెలుతురు కారణంగా నిద్రలో పదే పదే మెలకువ రావడం జరుగుతుంది. ముఖ్యంగా నిద్రలో ఇబ్బందులున్నవారు గదిలో బెడ్ లైట్ లేదా జీరో లైట్ వేసుకోకుండా నిద్రపోవడమే మంచిది. ప్రశాంతమైన నిద్ర కావాలంటే చీకటి గదిలో పడుకోవడం బెస్ట్.                                                *నిశ్శబ్ద.

21రోజులు ఎర్ర అరటిపండ్లు కంటిన్యూగా తింటే జరిగేదిదే!

అరటిపండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. సమతుల్య ఆహారంలో పౌష్టికర ఆహారంలో అరటిపండుకు తప్పనిసరిగా చోటు ఉంటుంది.  ఇది అందరికీ అందుబాటు ధరలోనే అన్ని సీజన్లలో లభిస్తుంది. అయితే అరటిపండ్లలో రకాలున్నాయి.  వీటిలో ఎర్ర అరటి పండు ఒకటి. తొక్క ఎర్రగా, పరిమాణంలో సాధారణ అరటిపండ్లకంటే పెద్దగా ఉండే ఈ అరటిపండ్లు   సాధారణ అరటి పండ్లకంటే తియ్యగా ఉంటాయి. వీటిలో కేలరీలు కూడా ఎక్కువగానే ఉంటాయి.  ఈ ఎర్ర అరటిపండ్లు ప్రతిరోజూ క్రమం తప్పకుండా 21రోజుల పాటు తింటే చాలా షాకింగ్ ఫలితాలు ఉంటాయి. ఎర్ర అరటిపండ్లు 21రోజుల పాటు తింటే వేధిచే చర్మ  సమస్యలు తగ్గుతాయి. పొడి చర్మం,  దద్దుర్లు, చర్మం ఎర్రగా మారిపోవడం, సోరియాసిస్,  వంటి చర్మసమస్యలకు ఎర్ర అరటిపండు అద్భుత ఔషదం.  వీటిని  తినడమే కాదు, చర్మ సమస్యలున్న చోట పూతగా కూడా అప్లై చేయవచ్చు.  దీని వల్ల సొరియాసిస్ లాంటి దారుణమైన చర్మ సమస్యలే తగ్గుతాయి. ప్రస్తుతకాలంలో సంతానలేమి సమస్యతో ఇబ్బంది పడుతన్న జంటలు చాలా ఉన్నాయి. పిల్లల కోసం వైద్యుల చుట్టూ, గుడుల చుట్టూ తిరుగుతుంటారు.  అయితే ఎర్ర అరటిపండు క్రమం తప్పకుండా తీసుకుంటే పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా, ధృడంగా మారుతుంది.  సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. మగవారిలో అంగస్థంభన సమస్య దూరం అవుతుంది. ఎర్ర అరటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు  ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో నాడీ వ్యవస్థను బలంగా చేసి ట్యాక్సిన్లను డిటాక్సిపై చేస్తాయి.  నరాల సంబంధ సమస్యలతో ఇబ్బంది పడేవారు, పక్షవాతం, మూర్చలు వంటి సమస్యలున్నవారు రెగ్యులర్ గా ఎర్ర అరటి పండ్లు తింటూ ఉంటే నాడీ బలం పుంజుకుంటుంది. . ఎర్ర అరటిపండ్లలో సాధారణ అరటిపండ్లకంటే ఎక్కువగా పొటాషియం ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తింటూ ఉంటే మూత్రపిండాలలో  రాళ్ల సమస్య నుండి  బయటపడవచ్చు. ఎర్ర అరటిపండ్లలో విటమిన్స్, పొటాషియం, కాల్షియం సమృద్దిగా ఉంటాయి.  వీటిని రోజూ తింటే పంటికి సంబంధించిన సమస్యలు దూరం అవుతాయి.  21రోజులు ఎర్ర అరటిపండ్లు తింటే  నోటి దుర్వాసన, చిగుళ్ల బలహీనతతో పాటు అన్ని రకాల పంటి సమస్యలు దూరమవుతాయి.                               *నిశ్శబ్ద.