నరకం చూపించే ఫైల్స్ సమస్యకు అసలు కారణాలు ఇవే..!

ఫైల్స్ ను మొలలు అని కూడా అంటారు.  మలద్వారం దగ్గర బొడిపెల్లా  ఏర్పడి మలవిసర్జనకు వెళ్లినప్పుడు ఆటంకం కలిగించే ఈ సమస్య చెప్పడానికి చాలా తేలికగా అనిపిస్తుంది కానీ ఇది అనుభవించే వారికి  నరకం చూపిస్తుంది.  మలవిసర్జన సాఫీగా జరగకపోవడం వల్ల బలవంతంగా ఒత్తిడి కలిగించాల్సి ఉంటుంది. ఈ సమయంలో ఒక్కోసారి  మలంతో పాటు రక్తం పడుతూ ఉంటుంది.  ఫైల్స్ సమస్యకు ప్రాధాన కారణంగా మలబద్దకాన్ని చెబుతారు. మలబద్దకం ఉన్నవారిలో ఫైల్స్ వచ్చే సమస్యలు  ఎక్కువ ఉంటాయని  వైద్యులు కూడా చెబుతారు. అయితే అసలు మలబద్దకం సమస్య ఎందుకు వస్తుంది? దీనికి కారణాలు ఏంటి తెలుసుకుంటే మలబద్దకం, ఫైల్స్ రెండింటికి చెక్ పెట్టవచ్చు. ఎక్కువసేపు కూర్చోవడం.. ఇప్పట్లో చాలావరకు కూర్చుని చేసే పనులే ఉన్నాయి. సిస్టమ్స్ ముందు లేదా షాపులలో కూర్చుని పనిచేయడం అన్నిచోట్లా కనిపిస్తుంది.  గంటల తరబడి ఇలా కూర్చోని పనిచేయడం వల్ల మలబద్దకం, దాని వెంట ఫైల్స్ సమస్య వస్తాయి. అందుకే ఎక్కవసేపు కూర్చోని పనిచేసేవారు కనీసం గంటకు ఒకసారి అయినా కూర్చున్న చోటి నుండి లేచి ఓ 5నిమిషాలు రిలాక్స్ గా నడవాలని  వైద్యులు చెబుతున్నారు. ధూమపానం, మధ్యపానం.. ఆల్కహాల్ అతిగా తీసుకోవడం, అలాగే ధూమపానం చేయడం వల్ల కూడా ఫైల్స్ సమస్య వస్తుంది. ఇవి జీర్ణక్రియను, ప్రేగుల పనితీరును దెబ్బతీస్తాయి. అందుకే ఈ రెండు అలవాట్లకు దూరంగా ఉండాలి. నీరు.. ప్రతి రోజూ మనిషికి మూడు నుండి నాలుగు లీటర్ల నీరు లేదా 8గ్లాసుల నీరు అవసరం అవుతుంది. వైద్యులు కూడా తప్పనిసరిగా 8గ్లాసుల నీరు తీసుకోమని చెబుతుంటారు. అయితే  నీరు తక్కువగా తాగితే జీర్ణాశయం, పేగుల పనితీరు దెబ్బతింటుంది. ఇది మలబద్దకం, పైల్స్ సమస్యకు దారితీస్తుంది. ఒత్తిడి.. ఒత్తిడి వల్ల కూడా ఫైల్స్ సమస్యలు వస్తాయి. శరీరంలో ఒత్తిడి ఫీలవుతుంటే హార్మోన్ల సమస్యల నుండి అవయవాల పనితీరు వరకు అన్ని దెబ్బతింటాయి. గట్టిగా దగ్గడం, ఒత్తిడితో కూడిన పనులు చేయడం వంటివి చేయడం వల్ల మొలల సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. దీన్ని తగ్గించుకునేందుకు యోగా, మెడిటేషన్ చేయాలి. మాంసాహారం.. మాంసాహారం ఎక్కువ తినేవారిలో ఫైల్స్ సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. ముఖ్యంగా చికెన్, మటన్, గుడ్లలో పచ్చసొన తొందరగా ఫైల్స్ సమస్య రావడానికి కారణం అవుతుంది. వీటికి బదులు ఫైబర్ ఎక్కువగా ఉన్న పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు తీసుకోవడం మంచిది. గర్భం దాల్చినప్పుడు.. గర్భం దాల్చినప్పుడు మలద్వారం ప్రాంతం పైన బిడ్డ ఒత్తిడి ఉంటుంది. దీని కారణంగా గర్భవతులలో ఫైల్స్ సమస్య వచ్చే అవకాశం ఉంటుంది.  అయితే ప్రసపం తరువాత ఈ సమస్య తగ్గిపోతుంది. స్పైసీ ఫుడ్.. కారం, మసాలా ఎక్కువ ఉన్న జంక్ ఫుడ్స్, ఇతర ఆహారాల వల్ల కూడా మొలల సమస్య వస్తుంది. చిప్స్, ఫ్రెంచ్ ఫ్రైస్, బర్గర్లు, బిస్కెట్లు, మైదా ఆధారిత ఆహారాల వల్ల మలబద్దకం సమస్య, దాన్నుండి ఫైల్స్ సమస్య కూడా వస్తుంది.                                              *నిశ్శబ్ద.

బెల్లం వాడటం వల్ల కలిగే ప్రయోజనాలు తెలిస్తే డాక్టర్ దగ్గరకు వెళ్లరు..!

ప్రస్తుత కాలంలో సహజ సిద్ధమైనటువంటి బెల్లం వాడకం తగ్గించి.. రసాయనాలు కలిపే పంచదారను ఎక్కువగా వాడుతున్నాము. ఫలితంగా డయాబెటిస్ వంటి వ్యాధులు ఎక్కువవుతున్నాయి. ఈ నేపథ్యంలో మీరు ఆరోగ్యకరంగా జీవించాలి అనుకున్నట్లయితే పంచదార స్థానంలో సహజసిద్ధమైనటువంటి బెల్లం వాడితే మంచిదని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చలికాలంలో బెల్లం ఎక్కువగా వాడాలని చెబుతున్నారు. ఎందుకంటే దీనికి వేడి స్వభావం ఎక్కువగా ఉంటుంది. అందుకే చలికాలంలో దీన్ని తీసుకోవడం మీకు అమృతం లాంటిది. ఇది శరీరాన్ని వెచ్చగా ఉంచుతుంది. పాత కాలంలో మన పెద్దవారు భోజనం తర్వాత బెల్లం తినేవారు. నిజానికి బెల్లం పంచదారలా రసాయనాలతో శుద్ధి చేయరు. ఇందులో కాల్షియం, విటమిన్ బి12, ఐరన్ వంటి పోషకాలు  లభిస్తాయి. బెల్లం బరువు తగ్గడంలో కూడా చాలా సహాయపడుతుంది. ప్రస్తుతం బెల్లం తినడం వల్ల కలిగే ప్రయోజనాలను తెలుసుకుందాం కడుపులో గ్యాస్ సమస్యలు:  గ్యాస్ సమస్యలను ఎదుర్కోవటానికి బెల్లం చాలా సులభమైన పరిష్కారం. కడుపులో గ్యాస్ ఏర్పడకుండా  బెల్లం మీకు బాగా సహాయపడుతుంది.  బెల్లం ఒక సహజ సిద్ధమైన యాంటాసిడ్ లా పనిచేస్తుంది.  ప్రతిరోజు భోజనం చేసిన అనంతరం చిన్న ముక్క బెల్లం తినడం చాలా మంచిది అని ఆయుర్వేదం కూడా చెబుతోంది. జలుబు విషయంలో : చలికాలంలో మీకు జలుబు ఉన్నప్పుడు బెల్లం ఉపయోగిస్తే చాలా మంచింది. దీని వేడి స్వభావం కారణంగా, ఇది మీకు జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కలిగించడంలో సహాయపడుతుంది. బెల్లంను పాలు లేదా టీలో ఉపయోగించవచ్చు, మీరు బెల్లంతో కషాయాలను కూడా తయారు చేసుకోవచ్చు. చర్మానికి:  బెల్లం మీ చర్మ ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది. రోజూ కొద్దిగా బెల్లం తింటే మొటిమలు రాకుండా, చర్మం మెరుస్తుంది. గుండె ఆరోగ్యానికి:  బెల్లంలో ఉండే పొటాషియం గుండె సంబంధిత వ్యాధులను నివారించడంలో మేలు చేస్తుంది. హృద్రోగులకు చక్కెర హానికరం, కాబట్టి బెల్లం తినడం చాలా ప్రయోజనకరం. మలబద్ధకం నుంచి విముక్తి :  మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతుంటే రాత్రి భోజనం చేసిన తర్వాత బెల్లం ముక్క తింటే మలబద్ధకం సమస్య నుంచి బయటపడవచ్చు. గొంతు నొప్పికి మేలు చేస్తుంది: అల్లంతో బెల్లం వేసి వేడి చేసి గోరువెచ్చగా తింటే గొంతు నొప్పి  మరియు  మంట నుండి ఉపశమనం లభిస్తుంది. దీంతో గొంతు కూడా మెరుగ్గా మారుతుంది. కీళ్ల నొప్పుల విషయంలో బెల్లం వాడటం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. రోజూ అల్లం ముక్క బెల్లం కలిపి తింటే కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. బెల్లం ఎంత తినాలి? ఒక వ్యక్తి రోజూ దాదాపు 20 గ్రాముల బెల్లం తినాలి.

ఉదయాన్నే కొద్దిసేపు ఎండలో ఉంటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా?

ఎండ అంటే చాలామందికి చిరాకు. కానీ చలికాలంలో మాత్రం కాసింత ఎండ ఉంటే బాగుండు అనిపిస్తుంది. వాతావరణం అంతా ముసురుపట్టి చల్లగా ఉన్నప్పుడు వెచ్చని సూర్యకిరణాలు శరీరానికి తగిలితే ఎక్కడలేని హుషారు వస్తుంది. అయితే చాలామంది  ఈ ఎండ వల్ల బద్దకం వదులుతుందని, చలిలో శరీరానికి వెచ్చగా బాగుంటుందని అనుకుంటారు.   అసలు సూర్యకిరణాలు శరీరానికి తగిలితే జరిగేదేంటో పూర్తీగా తెలియదు.  చలికాలం అయినా, వేసవి కాలం అయినా ఉదయాన్నే వెలువడే సూర్యకిరణాల వెలుగులో కొంచెం సేపు గడపడం, వీలైతే ఆ లేత ఎండలో వ్యాయామాలు చెయ్యడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ రోజూ సూర్యుని ఎండలో ఉంటే జరిగేదేంటంటే.. విటమిన్-డి మన శరీరం విటమిన్-డి ని ఎక్కువగా ఉత్పత్తి చేయదు.  అందుకే ప్రతిరోజూ 20-30 నిమిషాలు లేత ఎండలో ఉండాలని   వైద్యులు సిఫార్సు చేస్తున్నారు.  సూర్యరశ్మి నుండి   విటమిన్ డి చాలా లభిస్తుంది.  సూర్యకిరణాలు శరీరానికి అనేక విధాలుగా మేలు చేస్తాయి. ఇది శారీరకంగానే కాకుండా మానసిక వ్యాధులను కూడా నయం చేస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది.. ఉదయాన్నే లేత సూర్యకాంతిలో కూర్చోవడం వల్ల శరీరంలోని మెలటోనిన్‌ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇది ఒత్తిడి స్థాయిని గణనీయంగా తగ్గిస్తుంది. ఒత్తిడి నుంచి బయటపడేందుకు సన్ బాత్ కూడా  మంచి మార్గం.  ఎండలో కూర్చోవడం లేదా నిలబడాల్సిన అవసరం లేదు.  నడవవచ్చు,  ఆడవచ్చు, వ్యాయామాలు చేయవచ్చు.   ఇది  ఒత్తిడిని  తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి.. సూర్యరశ్మి  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.  సూర్యరశ్మిలో ఉండడం ద్వారా  చాలా తక్కువ సమయంలో రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవచ్చు. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థ అనేక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించగలుగుతుంది. ఎముకలకు.. కాల్షియం మాత్రమే కాకుండా బలహీనమైన ఎముకలను బలోపేతం చేయడంలో విటమిన్ డి కూడా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. సూర్యకాంతి విటమిన్ డికి అద్భుతమైన మూలం. సూర్యరశ్మిలో 15 నిమిషాల పాటు వ్యాయామం చేస్తే ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో వీలైనంత ఎక్కువ సూర్యరశ్మిని తీసుకోవాలని వైద్యులు కూడా చెబుతున్నారు. నిద్రకు మంచిది.. నిద్రలేమి సమస్యతో బాధపడేవారు లేత సూర్యరశ్మిలో ఒక గంట సేపు గడిపితే  రాత్రికి మంచి నిద్ర వస్తుంది. దీని వెనుక ఒక కారణం ఉంది. సూర్యరశ్మికి ఎంత ఎక్కువ బహిర్గతం అవుతారో రాత్రి సమయంలో  నిద్రపోతున్నప్పుడు    మెలటోనిన్ ప్రభావితం అవుతుంది. అందుకే మంచి నిద్ర వస్తుంది. బరువు.. సూర్యకాంతికి, వ్యక్తి బరువుకు  మధ్య లోతైన సంబంధం ఉందని అనేక అధ్యయనాలు చూపిస్తున్నాయి. నిజానికి  ఎండలో గడపడం వల్ల శరీరంలో  కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది. ఇది వేగంగా బరువు తగ్గడానికి దారితీస్తుంది. చలికాలంలో దాదాపు 15 నిమిషాల పాటు సన్ బాత్ చేయడం వల్ల కూడా  బరువు తగ్గే అవకాశాలు ఉన్నాయని చెబుతారు.                               *నిశ్శబ్ద.  

ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఈ చిట్కాలు పాటిస్తే సరి!

ఫ్యాటీ లివర్ ఒక తీవ్రమైన సమస్య. ఇందులో కాలేయం సరిగా పనిచేయదు. దీనికి ప్రధాన కారణాలు పేలవమైన ఆహారపు అలవాట్లు,  అనారోగ్యకరమైన జీవనశైలి.తప్పుడు ఆహారపు అలవాట్లు కాలేయంపై చెడు ప్రభావాన్ని చూపుతాయి. కొన్ని సందర్భాల్లో ఊబకాయం, మధుమేహం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. సాధారణంగా మొదట్లో  ఎలాంటి లక్షణాలు కనిపించవు. కానీ దీని గురించి తెలిసే సమయానికి కాలేయానికి చాలా నష్టం జరుగుతుంది. కాలక్రమేణా, ఫ్యాటీ లివర్ సమస్య తీవ్రమవుతుంది. ఇది అధిక రక్తపోటు, కాలేయ క్యాన్సర్, మధుమేహం, మూత్రపిండాలు,  గుండె సంబంధిత సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి ఫ్యాటీ లివర్ సమస్య ఉందని ఏమాత్రం అనిపించినా, ఫ్యాటీ లివర్ సమస్య రాకూడదన్నా ఈ కింది టిప్స్ పాటించాలి. ఆహారం..  ఆహారంలో మంచి మొత్తంలో పండ్లు,  కూరగాయలను చేర్చాలి. ఇది కాకుండా, గోధుమ, మిల్లెట్, జొన్న,  మొక్కజొన్న, రాగి మొదలైన తృణధాన్యాలు తినాలి. లీన్ ప్రోటీన్.. మనకు ప్రోటీన్ ఎంత ముఖ్యమో  బాగా తెలుసు. అయితే ఫ్యాటీ లివర్ రాకూడదంటే  లీన్ ప్రోటీన్‌ను ఎంచుకునేలా జాగ్రత్త వహించాలి. చేపలు, టోఫు, చికెన్ బ్రెస్ట్, పచ్చి బఠానీలు, చిక్‌పీ, సోయాబీన్, వేరుశెనగ మొదలైనవి. ఆరోగ్యకరమైన కొవ్వులు.. ఆరోగ్యకరమైన కొవ్వు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.  అందుకే ఆహారంలో ఆరోగ్యకరమైన కొవ్వులను చేర్చుకోవాలి. దీని కోసం అవోకాడో, నట్స్ లో వాల్నట్, బాదం.  విత్తనాలలో గుమ్మడికాయ గింజలు, అవిసె గింజలు,  పొద్దుతిరుగుడు గింజలు తీసుకోవాలి. నూనెలో  ఆలివ్ నూనెను వాడాలి. ట్రాన్స్ కొవ్వులు అవాయిడ్ చెయ్యాలి.. శరీరంలోని అదనపు సంతృప్త కొవ్వులు,  ట్రాన్స్ కొవ్వులు వాపుకు కారణమవుతాయి. కాబట్టి వీటిని నివారించాలి.  ఇవి సాధారణంగా  మాంసాలు, వేయించిన ఆహారాలు,  ప్రాసెస్ చేసిన ఆహారాలలో కనిపిస్తాయి. ఫ్యాటీ లివర్ ఉన్నవారు దీనిని తీసుకోవడం మానేయడం మంచిది. ఇవి మాత్రమే కాకుండా కృత్రిమ చక్కెరలు, కాపీ, టీ, శీతలపానీయాలు, కెఫిన ఎక్కువ ఉన్న పదార్థాలు మానేయాలి. శరీరాన్ని శుద్ది చేసేందుకు నీరు బాగా తాగాలి. పసుపు, అల్లం, తేనె, మిరియాలు, జీలకర్ర, సొంపు వంటి డిటాక్స్ పదార్థాలు వాడాలి. ఇలా చేస్తే ఫ్యాటీ లివర్ సమస్యను పరిష్కరించుకోవచ్చు.                                         *నిశ్శబ్ద.

చలికాలంలో వెల్లుల్లి ఎందుకు తినాలి? ఈ కారణాలు తెలుసుకోండి!

వెల్లుల్లి వంటింట్లో ఖచ్చితంగా ఉంటుంది. ఏ కొద్దిమందో వెల్లుల్లికి దూరంగా ఉంటారు. ఇది సీజన్ తో సంబంధం లేకుండా వాడుతుంటారు. వెల్లుల్లి లేని వంటను   ఇష్టపడని పరిస్థితితో చాలామంది ఉన్నారు.  ఇది బలమైన రుచి,  ఘాటైన  సువాసన కలిగి ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచడం.  జలుబు,  దగ్గును నయం చేయడంలో వెల్లుల్లి అద్భుతాలు చేస్తుంది. శీతాకాలం అంతటా ప్రతిరోజూ దీన్ని తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్,  యాంటీ ఫంగల్ లక్షణాలు అనేక ప్రయోజనాలు చేకూరుస్తాయి. వెల్లుల్లిలో మాంగనీస్, పొటాషియం, ఐరన్, కాల్షియం,  విటమిన్లు పుష్కలంగా ఉన్నాయి. చలికాలంలో వెల్లుల్లి ఎందుకు తినాలో కింది కారణాల చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. యాంటీఆక్సిడెంట్ & యాంటీ బాక్టీరియల్ లక్షణాలు వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి. ఇవి  ఆరోగ్యంగా ఉంచుతాయి.  జలుబు,  దగ్గు వంటి వ్యాధులను నివారిస్తాయి. వెల్లుల్లిని 'మ్యాజిక్ పదార్ధం'గా పరిగణిస్తారు, ఇది కాలానుగుణ ఆరోగ్య సమస్యలను పరిష్కరించడంలో అద్బుతంగా సహాయపడుతుంది.  తరచుగా జలుబు, దగ్గు వస్తుంటే  వెల్లుల్లిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. గుండె ఆరోగ్యం  గుండె జబ్బులతో బాధపడే వారికి వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లుల్లిని క్రమం తప్పకుండా తీసుకుంటే స్ట్రోక్, గుండెపోటుతో సహా  ఇతర గుండె సంబంధించిన  సమస్యల  ప్రమాదాన్ని పెంచుతుంది. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకున్నా,  రక్తపోటు, కొలెస్ట్రాల్,  రక్తంలో చక్కెరను తగ్గించాలనుకున్నా  ప్రతిరోజూ వెల్లుల్లి తినడం మంచిది. రోగనిరోధక శక్తిని పెంచుతుంది  వెల్లుల్లిలో సల్ఫర్ తో కూడిన  రసాయనాలు,  యాంటీఆక్సిడెంట్లు  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.  ప్రతిరోజూ వెల్లుల్లి తినడం ద్వారా  రోగనిరోధక శక్తిని బలోపేతం చేయవచ్చు.  వైరల్ ఇన్పెక్షన్లను  సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు. వెల్లుల్లిని వివిధ రకాలుగా తినవచ్చు.  పచ్చి వెల్లుల్లినే తినాల్సిన అవసరం లేదు. శరీరాన్ని శుద్ది చేస్తుంది  ఆరోగ్యకరమైన జీవక్రియ వెల్లుల్లి తినడం  ద్వారా సాధ్యమవుతుంది. ఇది శరీరాన్ని శుద్ది చేయడంలో  సహాయపడుతుంది.  తద్వారా  బరువు తగ్గడాన్ని  ప్రోత్సహిస్తుంది. ప్రతిరోజూ వెల్లుల్లి తినడం, ముఖ్యంగా చలికాలంలో తినడం వల్ల సహజంగా  బరువు-నియంత్రణ సాధ్యమవుతుంది. పచ్చి వెల్లుల్లి రసాన్ని,  తేనెను ఉదయాన్నే తీసుకోవడం వల్ల నిస్సందేహంగా బరువు తగ్గుదలలో స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయి. శ్వాసకోశ ఆరోగ్యాన్ని కాపాడుతుంది  వెల్లుల్లిలో ఉండే  యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఊపిరితిత్తుల ఆరోగ్యం,  శ్వాసక్రియకు తోడ్పడతాయి.  ఇవి తరచుగా చల్లని వాతావరణంలో వచ్చే  జ్వరం, శ్వాసనాళాలు, ముక్కుల రద్దీ,  గొంతు నొప్పి ద్వారా కలిగే సమస్యలు. వీటికి వెల్లుల్లి చెక్ పెడుతుంది.  జీర్ణక్రియ మెరుగుపరుస్తంది   ఆహారం మెరుగ్గా  జీర్ణం కావడానికి,  పోషకాలను గ్రహించడానికి,  జీర్ణ రసాలు,  ఎంజైమ్‌ల సంశ్లేషణ చాలా అవసరం. ఈ సంశ్లేషణ పెంచడంలో వెల్లుల్లి సహాయపడుతుంది.  శరీరం ఆహారం నుండి తగినంత పోషకాలను స్వీకరించడంలో కూడా ఇది సహాయపడుతుంది.                                        *నిశ్శబ్ద.  

చలికాలంలో గుమ్మడిగింజలు తింటే అద్భుతమైన ప్రయోజనాలు.!

శీతాకాలం ఆరోగ్యానికి చాలా సున్నితమైనది. ఈ కాలం ఆరోగ్యం విషయంలో కాస్త అజాగ్రత్తగా ఉన్నా వ్యాధులు చుట్టుముడుతుంటాయి. మిగతా కాలాల కంటే శీతాకాలంలో ఆహారం విషయంలో చాగా జాగ్రత్తలు తీసుకోవాలి. చలికాలంలో గుమ్మడిగింజలు తింటే శరీరానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో  ఐరన్, ఫాస్పరస్, మాంగనీస్, మెగ్నీషియం వంటి అనేక లక్షణాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు లభిస్తాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంపొందిండచంతోపాటు అనేక వ్యాధుల నుంచి రక్షిస్తాయి. శీతాకాలంలో గుమ్మడి గింజలు తినడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. షుగర్ పేషంట్లకు: మధుమేహ వ్యాధిగ్రస్తులు రక్తంలో చక్కెరను నియంత్రించడానికి వారి ఆహారంలో గుమ్మడి గింజలను చేర్చుకోవాలి . చలికాలంలో గుమ్మడి గింజలు తినడం వల్ల ఇన్సులిన్ నియంత్రణలో ఉండి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. గుమ్మడికాయ గింజలు చక్కెరను అదుపులో ఉంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంపొందించడానికి: గుమ్మడి గింజల్లో ఉండే లక్షణాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో మేలు చేస్తాయి. చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచడం ద్వారా జలుబు, దగ్గు వంటి సమస్యలకు సులభంగా దూరంగా ఉండవచ్చు. గుండె ఆరోగ్యానికి: గుమ్మడికాయ గింజలు ఆరోగ్యకరమైన కొవ్వులు, అమైనో ఆమ్లాలను కలిగి ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుతాయి. చలికాలంలో రక్తపోటు ఎక్కువగా ఉంటే గుమ్మడి గింజలు తినాలి. బరువు తగ్గాలంటే: చలికాలంలో చాలా మంది బరువు పెరుగుతారు. అలాంటి పరిస్థితుల్లో గుమ్మడి గింజలను తీసుకోవడం ద్వారా బరువు తగ్గవచ్చు. ఇందులో ఫైబర్, ప్రొటీన్లతో పాటు అనేక పోషకాలు ఉన్నాయి. గుమ్మడి గింజలు, ఐరన్, జింక్ మరియు విటమిన్ ఇ సమృద్ధిగా ఉంటాయి. ఇవి చర్మం, జుట్టుకు మేలు చేస్తాయి. వీటిని రోజూ తీసుకోవడం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉండడంతోపాటు జుట్టు పెరుగుదలను కూడా పెంచుతుంది. గుమ్మడికాయ గింజలను ఎలా తీసుకోవాలి? వీటిని నేరుగా తినవచ్చు. అయితే, మీకు కావాలంటే, మీరు ఈ విత్తనాలను సలాగ్ లేదా ఫ్రూట్ చాట్‌లో ఉపయోగించవచ్చు. మీరు గుమ్మడికాయ గింజలను ప్రోటీన్ షేక్‌లో కూడా తినవచ్చు.  

చలికాలంలో ఏ నీటితో స్నానం చేస్తే మంచిది? చల్ల నీరా? వేడి నీరా?

అన్ని ప్రాంతాలలో ప్రజలు చలి కారణంగా బోలెడు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెచ్చని వాతావరణంలో ఉండాలని అనిపించడం, వేడి ఆహారాలు, పానీయాలు తీసుకోవడం, స్నానానికి వేడి నీరు ఉపయోగించడం చేస్తుంటారు. అధికశాతం మందికి ఉదయాన్నే స్నానం చేసి ఉద్యోగాలకు, కాలేజీలకు, స్కూళ్లకు వెళ్లడం అలవాటు. ఇంట్లో మహిళలు కూడా ఉదయాన్నే స్నానం చేసి దేవుడి పూజ గట్రా చేసుకుంటారు. చలి కారణంగా అందరూ వేడి నీటి స్నానం చెయ్యడానికే మొగ్గు చూపుతారు. అయితే  చలికాలంలో చల్లనీరు, వేడి నీరు వీటిలో స్నానాకి ఏది బెస్ట్ అనే  విషయం గురించి ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వారు చెప్పిందేంటంటే.. వేడి నీరు నిపుణుల అభిప్రాయం ప్రకారం చలికాలంలో తలస్నానానికి గోరువెచ్చని నీరు ఉత్తమం. ఇది చాలా వేడిగా లేదా చాలా చల్లగా ఉండకుండా కాసింత వెచ్చదనంతో ఉంటాయి. దీని వల్ల జలుబు, దగ్గు వచ్చే ప్రమాదం ఉండదు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రక్తప్రసరణ పెరిగి చలి అనుభూతిని తగ్గిస్తుంది. అయితే మరీ వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. చల్లటి నీరు ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే జలుబు, దగ్గు వచ్చే అవకాశం ఉన్నవారు చల్లటి నీళ్లలో స్నానం చేయడం మానుకోవాలి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చల్లటి నీటితో స్నానం చేయడం వల్ల జలుబు బారిన పడే ప్రమాదం ఉంది. వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే ప్రమాదాలు.. సోమరితనం  వేడి నీళ్లతో స్నానం చేయడం అలవాటు పడితే ఆ తరువాత  చల్లటి నీటితో స్నానం చేయడం కష్టమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొన్ని కారణాల వల్ల వేడినీరు దొరక్కపోతే స్నానం చేయడంలో సోమరిపోతులు అవుతారు. కేవలం ఇదొక్క కారణంగా వ్యక్తులలో ఒకానొక బద్దకం చోటు చేసుకుంటుంది. స్నానంతో మొదలయ్యే ఈ విషయం ఇతర జీవన కార్యకలాపాలకు కూడా సులువుగా విస్తరిస్తుంది. కాబట్టి అన్ని పరిస్థితులకు తగ్గట్టుగా ఉండాలి. జుట్టుకు నష్టం ఎక్కువ వేడి నీళ్లతో తలస్నానం చేయడం  వల్ల జుట్టు పాడవుతుంది. జుట్టు పొడిగా,  నిర్జీవంగా మారుతుంది. అందుకే ఎక్కువ  వేడి నీటితో తల స్నానం చేయడం మానుకోవాలి.  చర్మం పొడిబారుతుంది ఎక్కువ వేడి నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలో తేమ తగ్గుతుంది. ఇది పొడి చర్మం సమస్యను పెంచుతుంది. ఏదైనా చర్మ సమస్య ఉన్నవారు ఎక్కువ వేడి నీటితో స్నానం చేయకూడదు.  

చలికాలంలో జామ పండ్లు తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసా?

ప్రకృతి ప్రసాదించిన బోలెడు ఆరగ్యకరమైన పండ్లలో జామ పండ్లు కూడా ఒకటి. జామపండ్లను పేదవాడి యాపిల్ అని అంటారు. యాపిల్ పండ్లలో ఉండే పోషకాలలో చాలావరకు జామలోనూ ఉంటాయి. అందుకే దీనికి ఈ పేరు వచ్చింది.  జామ పండ్లు పచ్చిగా ఉన్నప్పుడు వగరుగా, పండే కొద్దీ తియ్యగా ఉంటాయి.  ఈ జామ పండ్లు మధుమేహాం ఉన్నేవారికి అమృత ఫలం అనే పేరు పొందింది. చలికాలంలో జామపండ్లు తినడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుంటే.. రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.. జామపండులో విటమిన్-సి పుష్కలంగా ఉంటుంది. ఇది  రోగనిరోధక వ్యవస్థను బలంగా ఉంచుతుంది. చలికాలంలో జామపండ్లను క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే జలుబు, జ్వరం, తలనొప్పి వంటి సీజనల్ సమస్యలు పరిష్కారం అవుతాయి. జీర్ణశక్తి మెరుగుపరుస్తుంది.. జామపండులో డైటరీ ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. మలబద్దకాన్ని నివారిస్తుంది.  జీర్ణాశయంలో పేగుల కదలికను మెరుగ్గా ఉంచి ఆహారం బాగా జీర్ణమయ్యేలా చేస్తుంది. బరువు తగ్గడానికి మంచిది.. జామకాయలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉంటుంది. అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు, బరువు తగ్గే ప్రయత్నాలు చేస్తున్నవారు జామకాయలు తీసుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి.   ఎముకలకు మంచిది.. కాల్షియం బలమైన ఎముకలు, దంతాలకు చాలా అవసరం. జామకాయలలో కాల్షియం సమృద్దిగా ఉంటుంది. ఇది ఎముకలను బలంగా మార్చడమే కాకుండా బోలు ఎముకల వ్యాధిని, ఇతర ఎముకలకు సంబంధించిన  సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మ ఆరోగ్యానికి.. జామ పండ్లలో విటమిన్-సి సమృద్దిగా ఉంటుందనే విషయం తెలిసిందే. ఇది మాత్రమే కాకుండా యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలోనూ, వృద్దాప్యాన్ని నెమ్మది చేయడంలోనూ సహాయపడతాయి. జామపండ్లు తరచుగా తినేవారు యవ్వనంగా ఉంటారు. మెదడు పనితీరుకు.. జామ పండ్లలో విటమిన్ బి12, బి6 ఉంటాయి. ఇవి మెదడు పనితీరును, జ్ఞాపక శక్తిని మెరుగుపరుస్తాయి. ఆహారంలో జామకాయలను చేర్చుకోవడం వల్ల పై ప్రయోజనాలు పొందవచ్చు. నొప్పులు, మంటలు తగ్గిస్తుంది.. జామకాయలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి శరీరంలో మంటను, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా జామపండ్లు తింటూంటే ఈ సమస్యలు క్రమంగా తగ్గుతాయి. కంటి చూపుకు.. జామపండ్లలో విటమిన్-ఎ పుష్కలంగా ఉంటుంది. ఇది కంటి చూపుకు ఎంతో ముఖ్యమైనది. జామపండు తినడం వల్ల కళ్లలో మచ్చలు, కంటి చూపు బలహీన పడటం, కళ్లు అలసిపోవడం వంటి సమస్యలే కాకుండా ఇతర కంటి సమస్యలు కూడా తగ్గుతాయి.                                        *నిశ్శబ్ద.

అర్థరాత్రివరకు మేల్కొంటున్నారా? అయితే ఇది మీకోసమే!

ఈ రోజుల్లో పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా అందరూ అర్థరాత్రి వరకు మెలకువగా ఉండడం సర్వసాధారణంగా మారింది. చాలా మంది పని కారణంగా అర్థరాత్రి వరకు మేల్కొని ఉంటే, ఇంకొంత మంది టీవీ, మొబైల్‌లో టైం పాస్ చేయడానికి అర్ధరాత్రి వరకు మేల్కొని ఉంటున్నారు. అయితే అర్థరాత్రి వరకు మేల్కొని ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదని తెలుసు. అయినప్పటికీ అలాంటి నియమాలు ఎవరూ ఫాలో అవ్వరు.  మీరు ఉదయం 6 లేదా 7 గంటలకు మేల్కొంటే, పూర్తి నిద్ర పొందడానికి, మీరు రాత్రి 9-10 గంటలలోపు నిద్రపోవాలి. లేకుంటే ఆరోగ్యానికి హాని కలుగుతుంది. చాలా మంది  రాత్రి 12 గంటల వరకు లేదా తరువాత 1-2 గంటల వరకు మేల్కొంటున్నావారు ఎంతో మంది ఉన్నారు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్. అర్థరాత్రి వరకు మెలకువగా ఉంటే ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుంది: కంటి చూపుపై ప్రభావం: ప్రజలు అర్థరాత్రి వరకు మెలకువగా ఉండడానికి అతిపెద్ద కారణం మొబైల్ ఫోన్. అటువంటి పరిస్థితిలో, అర్థరాత్రి వరకు మొబైల్ ఫోన్ ఉపయోగించడం దాని కాంతి కారణంగా కళ్లపై ప్రభావం చూపుతుంది. ఇది కళ్లను బలహీనపరుస్తుంది. ఒత్తిడి పెరుగుతుంది: అర్థరాత్రి వరకు మెలకువగా ఉండే వ్యక్తులు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావడం తరచుగా కనిపిస్తుంది. రాత్రి పూట మేల్కొని ఉండడం వల్ల ఒత్తిడి, ఆందోళన కలుగుతాయి. రాత్రిపూట మెలకువగా ఉండటం వల్ల మనసులో చాలా విషయాలు జరుగుతూనే ఉంటాయి. ఇది మెదడు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. స్థూలకాయం వచ్చే ప్రమాదం: రాత్రి వేళల్లో మేల్కొలపడం వల్ల తరచుగా ఆకలి వేస్తుంది. దీని వల్ల ప్రజలు రాత్రిపూట ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ తినడం వల్ల ఊబకాయం వస్తుంది. మీరు కూడా అలాంటి తప్పు చేస్తే, మీరు దానిని నివారించాలి. నల్లటి వలయాల సమస్య: అర్థరాత్రి వరకు మెలకువగా ఉండటం వల్ల కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడతాయి. డార్క్ సర్కిల్స్ కారణంగా ముఖం చెడుగా కనిపించడం ప్రారంభమవుతుంది. మీరు దీన్ని నివారించాలనుకుంటే, మీరు రాత్రి త్వరగా నిద్రపోవాలి. జీర్ణక్రియలో ఆటంకాలు ఏర్పడతాయి. అర్ధరాత్రి వరకు మెలకువగా ఉండే వ్యక్తికి జీర్ణక్రియకు సంబంధించిన సమస్యలు కూడా ఉంటాయి. అర్థరాత్రి వరకు మెలకువగా ఉండడం వల్ల ఆహారం త్వరగా జీర్ణం కాదు. సరైన వేగవంతమైన జీర్ణక్రియ కోసం, సరైన సమయంలో నిద్రపోవాలి.

బోలెడంత ఆరోగ్యం చేకూర్చే ఈ గింజల గురించి  తెలుసా?

ఎండుద్రాక్ష, అంజీర్, ఆక్రోట్, చెర్రీస్, ఖర్జూరం  మొదలైన ఎండిన పండ్లు చాలా ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి. ఇక వీటితో పాటు చాలామంది తీసుకునే బాదం, జీడిపప్పు, వాల్నట్స్  కూడా ఆరోగ్యానికి చాలా మంచివి. అయితే వీటన్నింటికి మించిన పోషకాలు కలిగిన గింజలు వేరే ఉన్నాయి. చాలామంది వీటిని పెద్దగా పట్టించుకోరు కానీ వీటిని తింటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ లభిస్తాయి. ఏ ఆరోగ్య సమస్య దరిచేరదు. అసలు డాక్టర్ దగ్గరకు వెళదాం అనే ప్రస్తావనే రాదు. ఇంతకీ అంత అద్భుతమైన గింజలు ఏంటో వాటిని ఎలా తినాలో తెలుసుకుంటే.. అవిశె గింజలు.. అవిశె గింజలలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తహీనతను తొలగించడంలో సహాయపడుతుంది. శాఖాహారులలో ఏర్పడే ఒమేగా-3 లోపాన్ని  భర్తీ చేస్తుంది.  శరీర తత్వాన్ని బట్టి ప్రతి రోజూ 1 నుండి రెండు స్పూన్ల అవిశె గింజలు తీసుకోవచ్చు. వీటిని వేయించి తినవచ్చు. పొడి చేసుకుని  చపాతీ పిండి, కూరలలో మిక్స్ చేసుకోవచ్చు. చియా విత్తనాలు.. చియా సీడ్స్ తీసుకుంటే బరువు అదుపులో ఉంటుంది. కేలరీలు తక్కువగానూ, ఫైబర్ ఎక్కువగానూ ఉండటం వల్ల వీటిని తీసుకుంటే కడుపు నిండిన ఫీల్ ఎక్కువసేపు ఉంటుంది. వీటిలో కాల్షియం కూడా మెండుగా ఉంటుంది.  ఎముకనలు బలంగా ఉంచడంలో సహాయపడుతుంది. జీవక్రియ మెరుగుపరచడానికి , గుండె ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. వీటిలో ఉండే ఎంజైమ్ లు హార్మోన్లను చురుగ్గా ఉంచుతాయి. చియా విత్తనాలను నీటిలో నానబెట్టి తినవచ్చు. స్మూతీలు, షేక్స్ లో మిక్స్ చేసుకోవచ్చు. సలాడ్ లలో కూడా కలుపుకోవచ్చు. రోజులో ఒక స్పూన్ విత్తనాలు తినడం మంచిది. గుమ్మడి గింజలు.. గుమ్మడి గింజలలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో ఫ్రీ రాడికల్స్ ను తగ్గించడంలో సహాయపడతాయి. చెడు కొలెస్ట్రాల్ ను, ప్రోస్టేట్ సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ ఒకటి నుండి రెండు స్పూన్ల గుమ్మడి గింజలు తింటే మధుమేహం కూడా నియంత్రణలో ఉంటుంది. వీటిని వేయించుకుని, నానబెట్టుకుని, ఇతర గింజలతో కలిపి తినవచ్చు. నువ్వులు.. నల్లనువ్వులు టెస్టోస్టెరాన్ స్థాయిని నిర్వహించడానికి సహాయపడుతుంది.  షుగర్ రోగులకు ఉపయోగకరంగా ఉంటుంది. కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలకు మంచిది. జుట్టు పెరగడానికి దోహదం చేస్తాయి. పైబర్ బాగా ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడతాయి. కాలేయాన్ని, శరీర రోగనిరోధక శక్తిని బలపేతం చేస్తుంది.  రోజూ 1స్పూన్ వేయించిన నువ్వులను తినాలి. నువ్వులను బెల్లంతో కలిపి లడ్డూలా తయారుచేసుకుని కూడా తినవచ్చు. పొద్దుతిరుగుడు విత్తనాలు.. పొద్దుతిరుగుడు విత్తనాలలో ప్రోటీన్, కాల్షియం, విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. పాలీసాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఇందులో బాగుంటాయి. అందువల్ల గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించడంలో సహాయపడతాయి. రోజూ ఒక స్పూన్ వేయించిన పొద్దుతిరుగుడు విత్తనాలు తినవచ్చు. సారపప్పు.. సారపప్పు గురించి చాలామందికి తెలియదు. వీటిలో ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు బాగుంటాయి. రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సారపప్పు ఉపయోగపడతాయి. రోజులో సగం నుండి ఒక స్పూను మొత్తం సారపప్పు తినవచ్చు. వీటిని ఎక్కువగా తీపి వంటకాలు, పానీయాలలో ఉపయోగించవచ్చు. ఇవి తియ్యగా ఉంటాయి కాబ్టటి మధుమేహం ఉన్నవారు వీటి దగ్గర జాగ్రత్తగా ఉండాలి. మెంతులు.. మెంతులు చాలామంది రాత్రి నానబెట్టి ఉదయాన్నే తింటుంటారు.  మరికొందరు మొలకెత్తించి తింటారు.  ఇవి తినడం వల్ల చర్మ సమస్యలు తగ్గిపోతాయి. రక్తంలో  చక్కెర స్థాయిలు తగ్గించడంలో సహాయపడుతుంది. సెక్స్ హార్మోన్ పెంచడంలో సహాయపడుతుంది. రోజులో ఒక స్పూన్ మెంతులను నానబెట్టి లేదా మొలకలు తెప్పించి తినవచ్చు.                                         *నిశ్శబ్ద.

చలికాలంలో వీటిని తినకండి..కొలెస్ట్రాల్ పెరుగుతుంది.!

కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఆహారం చాలా ముఖ్యపాత్ర పోషిస్తుంది. కానీ చలికాలంలో కొన్ని ఆహారాలు మీ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. ఎలాంటి ఆహారాలు చలికాలంలో తినకూడదో ఇప్పుడు చూద్దాం. కొలెస్ట్రాల్ అనేది ఒక రకమైన కొవ్వు...ఇది మంచి కొలెస్ట్రాల్, కొలెస్ట్రాల్ అని రెండు రకాలుగా వస్తుంది. తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటిన్ , చెడు కొలెస్ట్రాల్ అయితే..అధిక సాంద్రత కలిగిన లిపోప్రోటిన్ మంచి కొలెస్ట్రాల్ . హైర్ కొలెస్టెరోలేమియా అని పిలిచే అధిక కొలెస్ట్రాల్ గుండె జబ్బులు, స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో ఆహారం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కానీ శీతాకాంలో కొన్ని ఆహారాలు మీ కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అవి ఎలాంటి ఆహారా పదార్థాలో ఇప్పుడు తెలుసుకుందాం. 1.నెయ్యి: చలికాలంలో నెయ్యి చాలా ముఖ్యమైంది. మన ఆహారంలో రుచి, వాసనను పెంచేందుకు చేర్చే నెయ్యి మన శరీరంలో కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. వ్యాయామం చేయనివారు నెయ్యి తీసుకోవడం తగ్గించాలి. 2. వెన్న: వెన్ను సాధారణంగా వేడి వంటల్లో ఉపయోగిస్తారు. వెన్నలో సంత్రుప్త కొవ్వులు అధికంగా ఉంటాయి. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. 3. పనీర్: పనీర్ భారతీయ వంటకాల్లో ముఖ్యమైంది. పనీర్ టిక్కా వంటి చలికాలపు వంటకాల్లో ప్రముఖమైంది. అయినప్పటికీ అందులో సంత్రుప్త కొవ్వు అధికంగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుంది. 4. రెడ్ మీట్ : రెడ్ మీట్ చలికాలంలో ఇష్టమైన మాంసాహారం. అయితే ఇందులో సంత్రుప్త కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉండటం వల్ల గుండె సమస్యలకు దారితీస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. 5. ఫ్రైడ్ స్నాక్స్ : శీతాకాలంలో ప్రతిఒక్కరూ వేడిగా ఉండే ఆహారాన్ని తింటుంటారు. సమోసాలు, బాగెట్లు, వడలు వంటివి వేయించిన చిరుతిళ్లను ఇష్టపడతాము. స్నాక్స్ లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచేలా  చేస్తాయి.   

సిగరెట్ వల్ల కాదు వీటితో కూడా క్యాన్సర్ వస్తుంది.!

క్యాన్సర్...ఈ మహమ్మారి బారిన పడి ఎంతో మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారు. క్యాన్సర్ పేరు వినగానే ప్రజలు జంకుతుంటారు. అనేక రకాల క్యాన్సర్లు ఉన్నాయి.   2020 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, క్యాన్సర్ కారణంగా మరణించిన వారిలో ఊపిరితిత్తుల క్యాన్సర్ రోగుల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది.  డేటా ప్రకారం, సుమారు 18 లక్షల మంది ప్రజలు ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్నారు.ఊపిరితిత్తుల క్యాన్సర్ చాలా తీవ్రమైంది. సాధారణంగా ఊపిరితిత్తుల క్యాన్సర్ ధూమపానం వల్ల మాత్రమే వస్తుందని అనుకుంటారు. కానీ అనేక ఇతర కారణాలు ఉన్నాయి. ధూమపానం మాత్రమే దీనికి కారణం కాదు.అవేంటో చూద్దాం. నిష్క్రియ ధూమపానం: ఈ రోజుల్లో చాలా మంది ఊపిరితిత్తుల క్యాన్సర్ కేసులు ధూమపానం చేయనివారిలో వస్తున్నాయి. అంటే జీవితంలో బీడీ, సిగరెట్ ముట్టుకోని వారు కూడా నేడు ఊపిరితిత్తుల క్యాన్సర్ బారిన పడుతున్నారు. దీని వెనుక ఉన్న అతి పెద్ద కారణం పాసివ్ స్మోకింగ్ లేదా సెకండ్ హ్యాండ్ స్మోకింగ్. నిజానికి, చాలా మంది సిగరెట్లు తాగరు. కానీ ఎవరైనా ఇంట్లో, ఆఫీసులో లేదా పరిసరాల్లో ప్రతిరోజూ 10-20 సిగరెట్లు తాగుతూనే ఉంటారు. అటువంటి పరిస్థితిలో, మీరు దానితో ఉండి, దాని పొగను పీల్చుకుంటూ ఉంటే, అది మీకు సమస్యగా మారవచ్చు. అటువంటి పరిస్థితిలో, సిగరెట్ తాగే ముందు మీ ఊపిరితిత్తులు ప్రతి స్పందించవచ్చు. బదులుగా మీకు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. ఇది కాకుండా, ధూమపానం చేస్తున్నప్పుడు ధూమపానం చేసే వ్యక్తి చాలాసార్లు పొగను బయటకు వదులుతారు. చుట్టుపక్కల ఉన్న వ్యక్తి దానిని పీల్చుకుంటాడు.ఇది కూడా ఒక కారణం. కాలుష్యం : కాలుష్యం పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ రోగులు, మరణాలు కూడా పెరుగుతున్నాయి. చెడు గాలి నాణ్యత, వాహనాల పొగ, పరిశ్రమలు, ఫ్యాక్టరీల నుండి వచ్చే కాలుష్యం వంటి బహిరంగ కాలుష్యం మాత్రమే కాకుండా ఇండోర్ కాలుష్యం కూడా కాలుష్యానికి కారణం అవుతుంది. వంట చేయడం, బొగ్గు లేదా ఆవు పేడలపై రొట్టెలను కాల్చడం వల్ల  కలిగే ఇండోర్ కాలుష్యం నుండి వచ్చే పొగను బహిర్గతం చేయడం వల్ల కూడా ఈ వ్యాధి వస్తుంది. జన్యు సంబంధం: ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు మూడవ అతిపెద్ద కారణం వ్యాధికి జన్యుపరమైన బహిర్గతం. నిజానికి, కుటుంబంలో ఎవరికైనా ఊపిరితిత్తుల క్యాన్సర్ ఉంటే, అది మొదటి తరంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 30 ఏళ్ల వ్యక్తికి ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చి, వ్యాధి సమయంలో అతను తండ్రి అయినట్లయితే, క్యాన్సర్ జన్యువులు అతని పిల్లలకు వ్యాపించి వ్యాధిని వ్యాపింపజేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.  

కోవిడ్-19 కొత్త వేరియంట్ JN.1 లక్షణాలివే..!

ప్రపంచాన్ని వణికించిన మహా భూతం మళ్లీ ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేయడానికి తయారైంది. కరోనా ప్రపంచ దేశాలలో ఎంత మృత్యు తాండవం చేసిందో అందరికీ తెలిసిందే. దేశాలకు దేశాలు కరోనా కారణంగా ఆర్థిక, ప్రాణ నష్టాన్ని దారుణంగా చవి చూశాయి. 2020, 2021 సంవత్సరాలలో కరోనా వల్ల ఎదురైన సంక్షోభం అందరూ మర్చిపోకముందే మళ్లీ మళ్లీ కొత్త రూపాలలో ఇది ప్రపంచం మీద దండ యాత్ర చేస్తూనే ఉంది.  2023 ముగియడానికి ముందు ఇప్పుడు మళ్లీ ప్రాణాలను బలిగొనడానికి కరోనా సిద్దమైంది.  కోవిడ్ కొత్త వెరియంట్ JN.1 ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో యూఎస్ లో నమోదైంది.  అప్పటినుండి ఈ కేసులు పెరుగుతూ వస్తన్నాయి. అయితే ఇప్పుడు భారతదేశంలో కూడా కరోనా కేసు వెలుగులోకి వచ్చింది. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో  కరోనా కొత్త వేరియంట్ వెలుగులోకి వచ్చింది. గోవా నుండి వచ్చిన నమూనాలో 15కరోనా కేసులు కొనుగొన్నారు. చివరిసారిగా వచ్చిన కరోనా వేరియంట్ కంటే ఈసారి వచ్చిన వేరియంట్ ప్రమాదం ఉన్నట్టు చెబుతున్నారు. దీని కారణంగా ప్రభుత్వం కూడా కరోనా వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. కరోనా కొత్త వేరియంట్ JN.1 లక్షణాలు..  సంకేతాలు.. తీసుకోవలసిన జాగ్రత్తల గురించి తెలుసుకుంటే.. COVID-19 మహమ్మారి ప్రపంచానికి పరిచమైన నాలుగేళ్లు గడుస్తోంది. ఈ నాలుగేళ్లలో ఇది బలితీసుకున్న ప్రాణాలు ఎన్నో..  దీని గురించి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా ఇది రూపం మార్చుకుని  వ్యాప్తి చెందుతూనే ఉంది. భారతదేశంలోని కొన్ని ప్రాంతాలలో  తాజాగా బయటపడిన   JN.1 వేరియంట్ ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.Omicron XBB సబ్‌వేరియంట్ నుండి  JN.1 వేరియంట్ పుట్టిందని అంటున్నారు. ఈ వేరియంట్ సోకిన వారిలో  ముక్కు కారటం, గొంతు నొప్పి ,  పొడి దగ్గు వంటి చిన్న లక్షణాలు కనిపిస్తాయట. కానీ దీన్ని గుర్తించకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం  ముప్పు తప్పదని అంటున్నారు. JN.1  ప్రధాన సంకేతాలు,  లక్షణాలు.. కొత్తగా వచ్చిన JN.1 వేరియంట్  లక్షణాలు జ్వరం, దగ్గు, ముక్కు కారటం, గొంతు నొప్పి, ఒళ్లు నొప్పులు, అలసట. ఈ లక్షణాలు ఫ్లూ,  ఇతర శ్వాసకోశ వ్యాధుల నుండి వేరు చేయలేవు. రోగికి ఈ లక్షణాలు ఉంటే  అవి తేలికపాటివి అయితే కేవలం  ఈ జబ్బులకు చికిత్స తీసుకుంటే సరిపోతుంది. కానీ ఈ కొత్త వేరియంట్ పరిస్థితి విషమించితే మాత్రం  శ్వాస ఆడకపోవడం అనే ప్రమాదకర సమస్య ఎదురవుతుంది. కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకర లక్షణాలు తెలుసుకుంటే.. దగ్గు:  నిరంతరం  దగ్గు రావడం కొత్త వేరియంట్ లో సాధారణ లక్షణం. జలుబు :  ముక్కు కారడం, ముక్కులు మూసుకుపోవడం వంటి సాధారణ లక్షణాలు ఉంటాయి.   గొంతు నొప్పి: గొంతు నొప్పి లేదా గొంతులో అసౌకర్యం ఉంటుంది. తలనొప్పి: JN1 వేరియంట్‌తో బాధపడుతున్న వ్యక్తులు తలనొప్పి సమస్యను ఎదుర్కొంటారు. జీర్ణాశయ సమస్యలు.. అతిసారం, ఆహారం సహించలేకపోవడం, ఆకలి లేకవోవడం జీర్ణశయాంతర లక్షణాలు సంభవించవచ్చు. తేలికపాటి శ్వాస ఆడకపోవడం: కొంతమంది వ్యక్తులు అప్పుడప్పుడు తేలికగా శ్వాస ఆడకపోవడం గమనించవచ్చు.   గతంలో కరోనా కారణంగా జరిగిన నష్టాలను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుతం జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. పై లక్షణాలలో ఏవైనా ఉంటే వ్యాధి వ్యాప్తి చెందకుండా క్వారంటైన్ లో ఉండటం ముఖ్యం. ఇప్పుడు కరోనా గురించి భయాందోళనలు పుడుతున్న పరిస్థితులలో  జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వాటిని  విస్మరించడం వల్ల ఆ వ్యక్తికే  కాదు, కుంటుంబ సభ్యులకు చుట్టుప్రకక్ల వారికి కూడా తీవ్రమైన హాని కలిగించే ప్రమాదం ఉంటుంది.   అంతేకాకుండా, రద్దీగా ఉండే ప్రదేశాలలో తిరగడం మానుకోవడం,  భౌతిక దూరాన్ని పాటించడం, బయటకు వెళ్లినప్పుడు మాస్క్ ధరించడం వంటి స్వీయ రక్షణ చర్యలు పాటించాలి. ఎవరిని వారు కాపాడుకోవడానికి ఉన్న శక్తివంతమైన మార్గం ఇదే.. అదే విధంగా కరోనా వ్యాక్సిన్ తీసుకోని వారు కూడా దాన్ని తీసుకోవడం ద్వారా కరోనా ప్రమాదాన్ని అరికట్టడానికి ఉపయోగపడుతుంది.                         *నిశ్శబ్ద.

మద్యపానం చేసే అలవాటుందా? ఈ దారుణ నిజాలు తెలుసుకోవాల్సిందే..!

శరీరానికి మత్తును ఇచ్చేవాటిలో మద్యపానం ఒకటి.  ధూమపానం, మధ్యపానం ప్రజలను ఎంతో వేధిస్తున్న అలవాట్లు. వీటి కారణంగా వైవాహిక బంధాలు, కుటుంబాలు కూడా విచ్చిన్నం అవుతున్నాయి. అయినా కూడా మద్యపానం మీద ఆసక్తి ఉన్నవారు దీన్ని తీసుకోవడంలో ఏమాత్రం కాంప్రమైజ్ కారు. పైపెచ్చు  అన్నింటికంటే తాగడమే ముఖ్యం అనుకుంటారు. వీరు మత్తుకు బానిసలైపోయి ఉంటారు. అయితే మధ్యపానం సేవించడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన జబ్బులు కూడా వస్తాయని తెలిసిందే.  అయితే ఇవి మాత్రమే కాకుండా ఇప్పుడు మద్యపానం గురించి మరిన్ని కొత్త విషయాలు బయటపడ్డాయి. ఈ విషయాల గురించి తెలుసుకుంటే షాకవడం పక్కా.. మద్యపానం సేవించేవారు తమకు మత్తు వస్తుందని, దాని వల్ల ఎంతో సంతోషం కలుగుతుందని చెబుతారు. అయితే మద్యపానం తీసుకోవడం వల్ల మెదడు పరిమాణం తగ్గుతుందనే షాకింగ్ విషయం బయటపడింది. ఇది మాత్రమే కాకుండా మద్యపానం సేవించడం వల్ల ఆహారం ద్వారా శరీరంలో చేరే ప్రోటీన్, కాల్షియం, ఫైబర్, విటమిన్-బి12, ఒమేగా కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం మొదలైన విటమిన్లు, ఖనిజాలు శరీరానికి అందవు.  ఆహారం ద్వారా శరీరానికి లభించే మినరల్స్  మెదడు పరిమాణాన్ని పెంచి హానికరమైన తెల్ల పదార్థాన్ని తగ్గిస్తాయి. కానీ మద్యపానం తీసుకోవడం వల్ల ఈ ప్రక్రియ కుంటుపడుతుంది.  దీని వల్ల శరీరం బ్యాలెన్స్ కోల్పోవడం, బలహీనంగా మారడం జరుగుతుంది. మద్యపానం ఎక్కువగా తీసుకునేవారిలో ఎక్కువగా మెగ్నీషియం లోపం ఏర్పడుతుంది. మెగ్నీషియం లోపాన్ని ఎలా నివారించాలంటే.. మెగ్నీషియం లోపాన్ని నివారించాలంటే ప్రతిరోజు సుమారు 450mg మెగ్నీషియం తీసుకోవాలి.  రోజూ 550 mg మెగ్నీషియం తీసుకునే వారి మెదడు 350 mg తీసుకునే వారి కంటే ఎక్కువ తెలివి తేటలతోనూ,  పదునుగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.   చిన్నప్పటి నుంచి పుష్కలంగా ఆహారం తీసుకోవడం వల్ల జ్ఞాపకశక్తి కోల్పోవడం, మతిమరుపు వంటి సమస్యలుండవు. ముఖ్యంగా చిన్నవయసు నుండే మెగ్నీషియం పుష్కలంగా తీసుకునేవారికి  40ఏళ్ళ  తర్వాత త్వరగా  మతిమరుపు రావడం అనే సమస్య అసలే ఉండదు.                                              *నిశ్శబ్ద.  

ఇంగువతో బోలెడు ప్రయోజనాలు!

ఇంగువను మన వంటగదిలో ఆహారం రుచిని పెంచేందుకు వాడుతుంటాం.టెంపరింగ్ నుండి ఊరగాయల వరకు ఇంగువ వాడకం రుచిని పెంచడమే కాకుండా  మీ ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న ఇంగువను తీసుకోవడం ద్వారా అనేక వ్యాధుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు.ఇందులో మనం ఇంగువను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. పొట్ట సంబంధిత సమస్యలు దూరమవుతాయి:  కేవలం చిటికెడు ఇంగువను ఖాళీ కడుపుతో తీసుకోవడం ద్వారా, మీరు అనేక కడుపు సంబంధిత సమస్యల నుండి బయటపడవచ్చు.ఉదయం సేవించడం వల్ల మీ జీర్ణక్రియ మెరుగుపడుతుంది.అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుండి మిమ్మల్ని దూరం చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల మీ జీర్ణవ్యవస్థ మెరుగ్గా పని చేస్తుంది. మీరు కడుపులో ఉబ్బరం లేదా గ్యాస్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే, ఖచ్చితంగా ఇంగువ తినండి. ఇంగువను ఖాళీ కడుపుతో తీసుకోవడం వల్ల ఉబ్బరం, గ్యాస్ సమస్యల నుండి ఉపశమనం లభిస్తుంది. రక్తపోటులో ఉపశమనం: మీరు అధిక రక్తపోటుతో బాధపడుతుంటే.. ఇంగువ తీసుకోవడం మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఖాళీ కడుపుతో ఇంగువ నీరు త్రాగవచ్చు. ఇలా తీసుకుంటే రక్తపోటును తగ్గిస్తుంది. తలనొప్పి మాయమవుతుంది: మీకు తీవ్రమైన తలనొప్పి మొదలైతే ఇంగువ మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉండే ఇంగువ తీసుకోవడం వల్ల తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది.మీరు తరచుగా మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతుంటే, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో ఇంగువ తినండి. దగ్గు పోతుంది: యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఇంగువలో ఉంటాయి. ఇది దగ్గు, ఆస్తమా, బ్రోన్కైటిస్ సమస్య నుండి మిమ్మల్ని దూరంగా ఉంచుతుంది. బరువు తగ్గడం: మీరు అధిక బరువుతో బాధపడుతుంటే. ఉదయాన్నే ఇంగువ నీటిని తాగండి. కొలెస్ట్రాల్ ను కరిగించడంలో ఎంతో మేలు చేస్తుంది. ఇలా నిరంతరం తీసుకున్నట్లయితే మీ బరువు అదుపులో ఉంటుంది.

షార్ట్ సైట్ కారణంగా దృష్టి సమస్యా...అయితే సిల్క్ సర్జరీ గురించి తెలుసుకోండి.!

ఈ మధ్యకాలంలో షార్ట్ సైట్ దృష్టి సమస్య చాలా మందిలో వేగంగా పెరుగుతోంది. ఈ సమస్యను వైద్య భాషలో మయోపియా అంటారు. చాలా సార్లు ఈ సమస్య పుట్టుకతోనే అభివృద్ధి అవుతుంది. అటువంటి పరిస్థితిలో, జీవితాంతం లెన్స్‌లపై ఆధారపడవలసి ఉంటుంది. మయోపియా సకాలంలో చికిత్స చేయకపోతే, ఇది కంటిశుక్లం, గ్లాకోమా, రెటీనా డిటాచ్‌మెంట్ వంటి తీవ్రమైన కంటి సమస్యలకు దారితీస్తుంది. ఈ సమస్యకు అసలు కారణం, చికిత్స విధానాలు  ఏంటో తెలుసుకుందాం. ఈ కారణాల వల్ల సమస్యలు తలెత్తుతాయి: వైద్య నిపుణుల అంచనా ప్రకారం, మయోపియాకు అసలు కారణం జన్యు పరివర్తన కూడా  కావచ్చని చెబుతున్నారు. లాప్ టాప్ స్క్రీన్‌పై ఎక్కువ సమయం గడపడం, ఔట్‌డోర్‌ యాక్టివిటీస్‌ సరిగా చేయకపోవడం, ఆహారపు అలవాట్లు సరిగా లేకపోవడం వంటివి కూడా ఇందుకు కారణం అయ్యే వీలుంది. మయోపియా చికిత్సలు ఇవే: మయోపియా సమస్యను అధిగమించడానికి అనేక దృష్టి దిద్దుబాటు ప్రక్రియలు ఉద్భవించాయి. అద్దాలు  కాంటాక్ట్ లెన్సులు పాత ఫ్యాషన్‌గా మారాయి, అవి తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే అందిస్తాయి. ఈ రోజుల్లో చాలా మంది ఈ సమస్యను అధిగమించడానికి శాశ్వత  అవాంతరాలు లేని ఎంపికను ఎంచుకోవడానికి ఇష్టపడుతున్నారు. అటువంటి పరిస్థితిలో, లేజర్ ట్రీట్ మెంట్ డిమాండ్ వేగంగా పెరిగింది. లేజర్-అసిస్టెడ్ ఇన్ సిటు కెరాటోమిలియూసిస్ (LASIK)  ఫోటోరేఫ్రాక్టివ్ కెరాటెక్టమీ (PRK) వంటి సాంప్రదాయ పద్ధతులు మయోపియా  ఆస్టిగ్మాటిజమ్‌ను సమర్థవంతంగా చికిత్స అందించవచ్చు. అయితే ప్రస్తుతం సిల్క్ లేదా స్మూత్ ఇన్సిషన్ లెంటిక్యూల్ కెరాటోమైల్యూసిస్ పేరిట నూతన విధానం అందుబాటులోకి వచ్చంది. మయోపియాను సరిచేయడానికి సిల్క్‌ టెక్నాలజీ చక్కటి ఫలితాలు ఇస్తోందని నిపుణులు చెబుతున్నారు. సిల్క్ ప్రక్రియకు సంబంధించిన ప్రయోజనాలు: 1. లాసిక్‌ సర్జరీతో  పోలిస్తే, ఆపరేషన్ తర్వాత సిల్క్ ప్రభావంతంగా పనిచేస్తుంది. దీని కారణంగా కార్నియల్ నరాలు ప్రభావితం కావు. దీని కారణంగా, తక్కువ అసౌకర్యం అనుభూతి చెందవచ్చు. 2. సాధారణంగా, ఈ ప్రక్రియ తర్వాత రోగి ఒకటి లేదా రెండు రోజులలో తన మెరుగైన దృష్టి ప్రయోజనాలను పొందడం ప్రారంభిస్తాడు. లెంటిక్యులర్ డిసెక్షన్ త్వరగా కోలుకోవడానికి అనుమతిస్తుంది. 3. ఈ ప్రక్రియలో, సాధారణంగా 3 మిల్లీమీటర్ల పరిమాణంలో లేజర్‌తో కార్నియాపై చిన్న కోత చేస్తారు. ఇది కార్నియా  రక్షణ  బలాన్ని నిర్ధారిస్తుంది. 4. సాంప్రదాయ లాసిక్‌కి సురక్షితమైన  ప్రభావవంతమైన ప్రత్యామ్నాయంగా సిల్క్ ప్రక్రియ చక్కటి పురోగతిని సాధించింది.

చలికాలంలో వచ్చే నాలుగు ప్రమాదకర జబ్బులు ఇవే!

చలికాలం వాతావరంలో మార్పులతో పాటు ఎన్నోరకాల ఆరోగ్య సమస్యలను వెంటబెట్టుకువస్తుంది. ప్రతి ఏడాది ఇది  మామూలే కదా అని సులువుగా తీసుకోలేం.  ఎందుకంటే రాను రాను వేసవిలో ఎండలు, చలికాలంలో చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. వీటిని భరించడం చాలా మంది వల్ల కావట్లేదు. వృద్దులు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్న వ్యక్తులు, చిన్న పిల్లలు చలికారణంగా ప్రమాదకరమైన జబ్బుల బారిన పడతారు. తగ్గిపోతాయని సాధారణ మందులు వాడేలోపే ఇవి చాలా ప్రమాదకర స్థాయికి చేరుకునే అవకాశం ఉంటుంది.  చలికాలంలో చాలా మామూలుగా వచ్చి ప్రాణాలకు ముప్పు కలిగించే నాలుగు జబ్బుల గురించి తెలుసుకుంటే.. ఇన్ఫ్లుఎంజా.. ఇన్ఫ్లుఎంజాను ఫ్లూ అని కూడా పిలుస్తారు. ఇది  వైరస్ వల్ల కలిగే అంటు వ్యాధి. ఇది ముక్కు  గొంతును ప్రభావితం చేస్తుంది. చలికాలంలో ఫ్లూ ప్రమాదం పెరుగుతుంది.   జ్వరం, గొంతు నొప్పి, ముక్కు కారటం, తలనొప్పి, అలసట,  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది మొదలైనవి దీని లక్షణాలు. పొడి దగ్గు  కఫం కూడా ఫ్లూ లక్షణాలలో ఉంటాయి. చలికాలంలో ముక్కు కారడం, తరచుగా తుమ్ములు,  దగ్గు చాలా సాధారణం. ఇది తేలికగానూ ఉండవచ్చు,  తీవ్రమైన సమస్యగానూ ఉండచ్చు. ఇది ఒకటి నుండి రెండు వారాల్లో నయమవుతుంది. అయితే  చాలా కాలం పాటు కొనసాగితే అది న్యుమోనియాకు దారితీస్తుంది. శ్వాసకోశ సమస్యలు.. జలుబు చలికాలంలో వచ్చే సాధారణ సమస్య.  ఇది శ్వాసకోశ సమస్యలకు మూలం. ముక్కు కారడం, తరచుగా తుమ్ములు, దగ్గు,  కఫం వంటి సాధారణ లక్షణాలన్నీ శ్వాసకోశ సమస్యలలో ఉంటాయి.  ఇవి మూడు నుండి నాలుగు రోజుల్లో నయమవుతాయి. కొందరిలో ఇది వచ్చినప్పుడు అన్ని లక్షణాలతోపాటు గొంతునొప్పి, తలనొప్పి కూడా కనిపిస్తాయి. కొందరికి జ్వరం కూడా రావచ్చు. బ్రోన్కైటిస్.. చలికాలంలో చల్లని  వాతావరణం బ్రోన్కైటిస్ ప్రమాదాన్ని మరింత పెంచుతుంది. ఇది సాధారణ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్. దీని కారణంగా ఊపిరితిత్తులలో వాపు ఏర్పడుతుంది. బ్రోన్కైటిస్ కారణంగా దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది,  ఛాతీ నొప్పి వంటి లక్షణాలు  కనిపిస్తాయి. ఈ లక్షణాలే కాకుండా, కొంతమందికి ముక్కు దిబ్బడ,  జ్వరం మొదలైనవి కూడా ఉండవచ్చు. గొంతునొప్పి.. స్ట్రెప్ థ్రోట్.. స్ట్రెప్ థ్రోట్ అనేది పిల్లలలో సర్వసాధారణంగా కనిపించే ఒక రకమైన గొంతు సమస్య. ఇది స్ట్రెప్టోకోకల్ బ్యాక్టీరియా వల్ల వచ్చే బాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ ఇన్ఫెక్షన్ వల్ల గొంతులో మంట,  వాపు వస్తుంది. కొంతమందికి జ్వరంతో పాటు గొంతులో నొప్పి కూడా ఉండవచ్చు. కానీ కొందరు  స్ట్రెప్ థ్రోట్,  గొంతు నొప్పి మధ్య గందరగోళానికి గురవుతారు. కానీ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంటుంది.  దానిని సరిగ్గా గుర్తించి చికిత్స చేయడం చాలా ముఖ్యం. స్ట్రెప్ థ్రోట్ అనేది బాక్టీరియల్ ఇన్ఫెక్షన్.  గొంతు నొప్పి సాధారణం సంక్రమణ. స్ట్రెప్ థ్రోట్  యాంటీబయాటిక్స్‌తో చికిత్స చేస్తారు.  అయితే గొంతు నొప్పి కాలక్రమేణా నయమవుతుంది.                                               *నిశ్శబ్ద.  

చలికాలంలో ఫిట్ గా ఉండాలంటే  ఈ 5 రకాల కూరగాయలు తినాలంతే.!

చలికాలంను జబ్బుల కాలం అని కూడా అంటారు. వాతావరణంలో మార్పుల కారణంగా శరీరం ఇబ్బందులకు లోనవుతుంది. ఇదే కాకుండా చలికాలంలో బ్యాక్టీరియా, వైరస్ ల వ్యాప్తి ఎక్కువ జరగడం వల్ల అంటువ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు చలికాలంలో చాలా బాధపడాల్సి ఉంటుంది. అయితే శరీరానికి మంచి రోగనిరోధక శక్తిని అందించి వ్యాధులు దరిచేరకుండా ఉండటానికి, శరీరం ఫిట్ గా ఉండటానికి ఈ 5 రకాల కూరగాయలను తప్పనిసరిగా తినాలి. అవేంటో తెలుసుకుంటే.. ముల్లంగి.. చలికాలంలో ముల్లంగి తినడం ఆరోగ్యానికి చాలా మంచిది.  దీంతో పుష్కలంగా ఫైబర్, నీరు ఉంటుంది. ఇది శరీరాన్ని ఫిట్ గా ఉంచడంలో సహాయపడుతుంది. క్యారెట్.. చలికాలంలో క్యారెట్ కు డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. క్యారెట్ లో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.   ఇది వ్యాధుల నుండి దూరంగా ఉంచడంలో సహాయపడుతుంది. పాలకూర.. చలికాలంలో తప్పనిసరిగా తినాల్సిన ఆకుకూరలలో పాలకూర మొదటిస్థానంలో ఉంటుంది. ఇందులో ఐరన్ సమృద్దిగా ఉంటుంది.  జీవక్రియను మెరుగ్గా ఉంచడంలో కూడా పాలకూర సహాయపడుతుంది. బీట్ రూట్.. చలికాలంలో రోజూ బీట్ రూట్ తినడం వల్ల శరీరానికి చెప్పలేనంత ప్రయోజనం కలుగుతుంది. బీట్ రూట్ రక్తాన్ని మెరుగ్గా ఉంచడంలో సహాయపడుతుంది. బీట్ రూట్ జ్యూస్ ను ప్రతిరోజూ తాగుతుంటే స్టామినా పెరుగుతుంది. సొరకాయ.. సొరకాయ గురించి చాలామందికి సరిగా తెలియదు. ఆరోగ్యం మీద స్పృహ ఉన్నవారు సొరకాయను వంటల్లో వినియోగించడం కంటే  జ్యూస్ చేసుకుని తాగడానికి ఎక్కువ ఉపోగిస్తారు. ఇది బరువు తగ్గించడం నుండి శరీరాన్ని డిటాక్స్ చేయడం వరకు ఎన్నో రకాలుగా సహాయపడుతుంది. దీన్ని వంటల్లోనూ, జ్యూస్ గానూ తప్పకుండా చలికాలంలో తినాలి.                    *నిశ్శబ్ద.

షుగర్ కు ఇలా చెక్..!

జీవనశైలి సరిగ్గా లేకపోవడం, పోషకాల లోపం, ఒత్తిడి, వ్యాయామం లేకపోవడం వల్ల మధుమేహం సమస్య వస్తుంది. డయాబెటిస్‌లో షుగర్ లెవల్స్ అదుపులో లేకుంటే గుండె జబ్బులు, చర్మవ్యాధులు, యూటీఐ, కిడ్నీ ఫెయిల్యూర్, దంత సమస్యలు వంటి అనేక వ్యాధులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవడానికి ఈ పద్ధతులను అనుసరించవచ్చు. 1. మెంతి నీరు త్రాగాలి: ప్రతిరోజూ ఉదయం మెంతి నీరు తాగడం వల్ల డయాబెటిస్‌ను దూరం చేయవచ్చు. ఎందుకంటే మెంతి నీరు తాగడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ల శోషణ మందగిస్తుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ పెరుగుతుంది. మెంతి నీరు ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగవచ్చు. 2. దాల్చిన చెక్క నీరు త్రాగాలి: దాల్చిన చెక్క ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచడం.. భోజనం తర్వాత రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడం.. మధుమేహం-సంబంధిత సమస్యల ప్రమాదాన్ని తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర నిర్వహణకు తోడ్పడుతుంది. 3. ఆహారం విషయంలో జాగ్రత్త వహించండి: మధుమేహం ప్రమాదాన్ని తగ్గించడానికి, ఒకరు తీసుకునే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. మీ ఆహారంలో ముందుగా ఫైబర్, ప్రొటీన్లు,  కొవ్వులను తినండి. ఇలా చేయడం వల్ల శరీరంలో చక్కెర శాతం పెరగకుండా, మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. 4. కొద్దికొద్దిగా తినండి: డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గించడానికి, ఒకేసారి పూర్తి భోజనం తినడానికి బదులుగా చిన్న భోజనం 4 నుండి 5 సార్లు తినండి. ఇలా చేయడం వల్ల కడుపు నిండుతుంది. రక్తంలో చక్కెర స్థాయి పెరగదు. 5. చియా సీడ్స్ డిటాక్స్: అల్పాహారం తర్వాత చియా సీడ్స్ డిటాక్స్ వాటర్ తీసుకోవడం వల్ల చక్కెర శోషణ మందగిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది. చియా సీడ్స్ డిటాక్స్ నీటిలో ఒమేగా 3 పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. 6. గోధుమలకు బదులుగా మిల్లెట్ తినండి: భోజనం, రాత్రి భోజనంలో గోధుమలకు బదులుగా రాగులతో చేసిన రోటీని మీ ఆహారంలో చేర్చుకోండి. మిల్లెట్ తక్కువ గ్లైసెమిక్ సూచికను కలిగి ఉంటుంది.ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది.