టీడీపీ మహానాడు.. రుచికరమైన మెనూ రెడీ..
టీడీపీ అత్యంత ఘనంగా జరుపుకునే మహానాడు సభలు ఈనెల 27, 28, 29 తేదీల్లో జరగనున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల పాటు జరిగే ఈ సభల్ని మొదట హైదరాబాద్లో నిర్వహించాలని చూసినా ఆఖరికి ఏపీలోని తిరుపతిలో వేదిక ఖరారైంది. ఈ సభలకి టీడీపీ నేతలు, వేలాది మంది ప్రతినిధులు, కార్యకర్తలు హాజరవుతారు. అయితే ఈ సభలకి సంబంధించిన మెనూ అప్పుడే సిద్దమైపోయిందట. సభకు వచ్చే వారికి రుచికరమైన భోజనం అందించాలన్న నేపథ్యంలో దాదాపు 25 రకాల శాకాహార వంటకాలతో కూడిన మెనూను రెడీ చేశారంట. ఈ మెనూలో రాయలసీమ, కోస్తాంధ్రలతో పాటు తెలంగాణ వంటకాలు కూడా ఉన్నాయట. రాయలసీమ సంగటి ముద్దలు, జొన్న రొట్టెలు, ఐదు రకాల చెట్నీలు, సగ్గుబియ్యంతో కూడిన బెల్లం పాయసం, అలసంద వడలు, కట్ బజ్జీలు, పనసకాయ బిరియానీ, పాలతాళికలు ఇలా పలు రకాల రుచికరమైన వంటకాలు చేయనున్నట్టు సమాచారం.