చంద్రబాబుకు తలనొప్పిగా ఏపీ ఉద్యోగులు.. లాంగ్ లీవ్.. స్వచ్ఛందంగా పదవీ విరమణ

  ఈ ఏడాది జూన్ కల్లా హైదరాబాద్ లో ఉన్న ఏపీ ఉద్యోగులందరూ నవ్యాంధ్రకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే మొదట ఆసక్తి చూపించిన ఉద్యోగులు మాత్రం ఆ తరువాత అంత ఆసక్తి చూపించడంలేదు. అద్దెలు, మౌలిక వసతుల కొరతలను సాకుగా చూపుతూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాదు అక్కడికి రావడానికి వచ్చే ఏడాది మార్చి వరకూ గడువు ఇమ్మని కూడా కోరారు. అయితే విషయాన్ని గమనించిన చంద్రబాబు కూడా.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏపీకి రావాల్సిందే.. కొన్ని త్యాగాలు తప్పవు.. అన్ని శాఖలు ఒక దగ్గర ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని తేల్చి చెప్పేశారు. కానీ చంద్రబాబు ఎంత త్వరగా ఉద్యోగులను ఇక్కడికి తరలించాలని ప్రయత్నిస్తున్నా.. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతూనే ఉన్నాయి.   ఇదిలా ఉండగా ఏపీకి వచ్చే ఉద్యోగులు.. విజయవాడ. గుంటూరు వెళ్లి తమ ప్రభుత్వ కార్యక్రమాలను స్వయంగా వెతుక్కోవాలని ప్రభుత్వం ఆదేశించింది. అంతే అసలే రావడానికి ఇష్టపడని ఉద్యోగులు ఇలాంటి పనులు చేస్తారా.. అందుకే ఏకంగా లాంగ్ లీవ్ పెట్టి ఈ వెతుకులాట సమస్య నుండి బయటపడాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు.. వీలైతే కొంతమంది స్వచ్ఛందంగా పదవీ విరమణ చేసి హైదరాబాద్ లోనే ఉండిపోవాలని కూడా భావిస్తున్నారట. మరోవైపు ఉద్యోగులు ఇక్కడికి రావడానికి సరిగ్గా నెల రోజులు టైం మాత్రమే ఉంది. నవ్యాంధ్రలో చూస్తే ఇప్పటివరకూ ఒక్క భవంతి కూడా నిర్మించలేదు. మరి ఉద్యోగులు వస్తారో.. రారో.. తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

ఇకపై మరింత సులభంగా రైలు టికెట్లు రద్దు..

  భారత రైల్వే శాఖ రైలు టికెట్ల విషయంలో పలు మార్పులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తత్కాల్ టికెట్ల విషయంలో కొన్ని మార్పులు చేసిన రైల్వేశాఖ ఇప్పుడు మరింత సులభంగా రైలు టికెట్లు రద్దు చేసుకునే విధంగా కొన్ని మార్పులు చేయనుంది. దీనిలో భాగంగానే రైల్వేశాఖ మంత్రి సురేష్ ప్రభు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్టు తెలుస్తోంది. గతంలో కూడా టికెట్ క్యాన్సిల్ చేసుకునే సదుపాయం ఉండేది. అయితే అది కేవలం రైలు కదిలే మూడు నాలుగు గంటల ముందులోపే చేసుకోవాలి. అయితే ఇప్పుడు ఇకపై టికెట్ వెయిటింగ్ లిస్టులో ఉన్నా, ఆర్ఏసీ లో ఉన్నా139 నంబరుకు ఫోన్ చేసి.. ఫోన్ ద్వారా లేదా ఆన్ లైన్ ద్వారా రైలు కదిలే అరంగంట ముందు వరకూ టికెట్లను రద్దు చేసుకునేలా మార్పు చేశారు. అంతేకాదు టికెట్ కౌంటర్ లో టికెట్ కొన్నా కానీ  ఫోన్ ద్వారా కూడా తమ టికెట్ ను రద్దు చేసుకోవచ్చు. ఇక టికెట్ రద్దు అయిన తరువాత వివరాలనుబట్టి నగదు చేతికి అందుతుంది.

హైదరాబాదీలపై మళ్లీ "వరుణ" కరుణ..!

హైదరాబాదీలపై వరుణుడు మళ్లీ కరుణ చూపించాడు. ఉష్ణోగ్రతలు పెరిగి జనం అల్లాడుతున్న ప్రతీసారి వరుణుడు భాగ్యనగరంపై కుంభవృష్టి కురిపిస్తూనే ఉన్నాడు. తాజాగా సాయంత్రం నగరంలో భారీ వర్షం కురిసంది. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. సికింద్రాబాద్, బేగంపేట, బోయిన్‌పల్లి, సనత్‌నగర్, ఎస్‌ఆర్ నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది.  అయితే కొద్ది రోజుల క్రితం ఈదురుగాలులతో విరుచుకుపడినట్టు వరుణుడు మరోసారి కన్నెర్ర చేస్తాడేమోనని ప్రజలు కాస్త భయాందోళనలకు గురయ్యారు. మొత్తం మీద రెండు రోజులుగా ఎండవేడిమిని ఎదుర్కొన్న నగరవాసులు ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.

ముద్రగడ ఓ కీలుబొమ్మ.. స్ర్కిప్టు సాక్షి కార్యాల‌యంలో తయారవుతుంది..

కాపు నేత ముద్రగడ పద్మనాభంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. కాపునేతలకు కట్టే భవనాలకు చంద్రన్న పేరు పెట్టడంపై ముద్రగడ ప్రభుత్వానికి లేఖ రాశారు. దీనిపై స్పందించిన గంటా శ్రీనివాసరావు ముద్రగడపై విరుచుకుపడ్డారు. రాష్ట్రానికి ఎన్ని సమస్యలున్నా కాపు రిజర్వేషన్లపై మంజునాథ కమిటీని వేశాం.. కాపు సమస్యలపై పరిశీలను చేస్తున్నాం.. ఇలాంటి సమయంలో మిగ‌తా వ‌ర్గాల‌ను రెచ్చ‌గొట్టేలా మాట్లాడొద్దని సూచించారు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి కాపుల ఓట్లు భారీగా ప‌డ్డాయని, వారి రుణం తీర్చుకుంటామ‌ని గంటా అన్నారు. ‘మీరొక కీలు బొమ్మ.. మిమ్మ‌ల్ని కొంద‌రు వ్య‌క్తులు ఆడిస్తున్నారు’ అని గంటా ముద్రగడని విమర్శించారు. ‘కాపుల‌కు న‌ష్టం క‌లిగించేలా ముద్ర‌గ‌డ‌ ఇటువంటి లెట‌ర్లు రాయ‌కూడ‌దు’ అని అన్నారు.   ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పందిస్తూ ముద్రగడపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ‌కీయ ఉనికి కోస‌మే ముద్ర‌గ‌డ ప్ర‌య‌త్నం చేస్తున్నారని ఆరోపించారు. ‘మొన్న ఒక లేఖ, ఈరోజు మ‌రో లేఖ రాసి ముద్ర‌గ‌డ రాజ‌కీయాలు చేస్తున్నార‌’ని ఆయ‌న విమ‌ర్శించారు. ముద్ర‌గ‌డ రాసే లేఖ‌ల‌కు స్క్రిప్టు సాక్షి కార్యాల‌యంలో త‌యారవుతోందని చిన‌రాజ‌ప్ప ఆగ్రహం వ్య‌క్తం చేశారు. జ‌గ‌న్ మాట‌ల‌నే ముద్ర‌గ‌డ లేఖ‌ రూపంలో పంపుతున్నారని ఆయన ఆరోపించారు. ‘ముద్ర‌గ‌డ వెన‌కున్నది ఎవరో అంద‌రికీ తెలుసు’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. చంద్రబాబు కాపుల‌కు ఇచ్చిన హామీల‌న్నీ అమ‌లు చేయాల‌ని చూస్తున్నామ‌ని ఆయ‌న తెలిపారు. కాపుల‌కు న్యాయం చేయ‌డం ముద్ర‌గ‌డ‌కు ఇష్టం లేదని ఆయ‌న అన్నారు.

ఉత్తరాఖండ్‌లో తెలుగు యాత్రికుల ఇక్కట్లు..

ఉత్తరాఖండ్‌లో తెలుగు యాత్రికులకు కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ట్రావెల్స్ నిర్వాహకులు మోసం చేయడంతో తెలుగువారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరకాశీ నుంచి కేదార్‌నాథ్‌కు ఒక్కొక్కరి నుంచి హరిద్వార్‌కు చెందిన జీకే ట్రావెల్స్ రూ.8,300 వసూలు చేశారు. నిన్న సాయంత్రమే డబ్బులు చెల్లించినా ఇంతవరకు వారి నుంచి ఎలాంటి స్పందనా లేదని యాత్రికులు ఆరోపిస్తున్నారు. నిర్వాహకులపై రుద్రప్రయాగలోని ఉత్తర కాశీ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యాత్రికుల్లో గుంటూరు జిల్లాకు చెందిన 54 మంది, నిజామాబాద్ జిల్లాకు చెందిన మరో 54 మంది తెలుగువారు ఉన్నారు. వీరంతా ట్రావెల్స్ వారి కోసం రుద్రప్రయాగ పోలీస్ స్టేషన్ వద్ద పడిగాపులు కాస్తున్నారు.

ఉద్యోగాలిస్తామంటూ ఫ్లిప్‌కార్ట్ మోసం..!

ప్రముఖ ఈ- కామర్స్  దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌పై పెను వివాదం రేగుతోంది. ఫ్లిప్‌కార్ట్ ఐఐఎం అహ్మదాబాద్‌కు చెందిన విద్యార్దులను క్యాంపస్ ప్లేస్‌మెంట్ల ద్వారా ఎంపిక చేసుకుంది. అయితే నెలలు గడుస్తున్నా ఇంతవరకు దీనిపై కంపెనీ స్పందిచడం లేదు. దీనిపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్‌లో విధుల్లో చేరాల్సిన తేదీని జూన్‌కు వాయిదా వేశారంటూ మండిపడుతున్నారు. ఫ్లిప్‌కార్ట్‌కు ఎంపికయ్యామనే కారణంతో ఇతర కంపెనీల మంచి ఉద్యోగావకాశాలను వదులుకున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉద్యోగాల పట్ల హామీ ఇవ్వాలని కోరుతూ విద్యార్ధుల తరపున ఫ్లిప్‌కార్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ నితిన్ సేథ్, ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ సచిన్ బన్సల్ తదితరులకు మెయిల్ కూడా చేశారు.

టీడీపీ కొత్త రగడ.. భూమా ఆఖిల ప్రియ వర్సెస్ గంగుల

  మొన్నటి వరకూ టీడీపీ నేతలు భూమా నాగిరెడ్డికి, శిల్పా సోదరులకు మద్య విబేధాలు ఉండేవి. ఎలాగొలా వారిద్దరి మధ్య విబేధాలు ముగిసిపోయాయి అనుకునేలోపు.. మరో రగడ మొదలైంది అప్పుడే. అయితే ఈసారి భూమా ఆఖిల ప్రియ, గంగుల వంతు వచ్చింది. చాగలమర్రి మండలం గొడిగనూరులో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో అధికారులు ఆక్రమణల తొలగింపు చేపట్టిన వేళ, గంగుల ప్రతాపరెడ్డి వర్గీయులు వాటిని అడ్డుకున్నారు. ఎమ్మెల్యే వర్గీయుల ఆక్రమణలను కాదని, తమ వారి కట్టడాలను మాత్రమే కూల్చుతున్నారని గంగుల వర్గీయులు ఆరోపిస్తున్నారు. దీంతో ఇద్దరి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కబెట్టి ఆ ప్రాంతంలో బందోబస్తు ఏర్పాటు చేశారు.

బస్సులో మహిళల కోసం పానిక్ బటన్ లు...

  బస్సుల్లో ప్రయాణించే మహిళలకు రక్షణగా కొన్ని సరికొత్త మార్పులు చేయాలని కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిశ్ గడ్కరీ ప్రతిపాదించడం జరిగింది. ఇక నుండి బస్సుల్లో సీసీటీవీ, పానిక్ బటన్, వెహికల్ ట్రాకింగ్ డివైన్ లు ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అంతేకాదు ఇరవై మూడు మంది కంటే ఎక్కువ ప్రయాణికులు ఉన్న బస్సులో ఈ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని.. ఆపదలో ఉన్న సమయంలో మహిళలు పానిక్ బటన్ నొక్కగానే, జీపీఎస్ సిస్టమ్ ద్వారా స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారం వెళ్తుందని.. బస్సులో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరా ద్వారా అక్కడ జరిగిన సంఘటనంతా పోలీసు కంట్రోల్ రూంలో ప్రత్యక్షప్రసారమవుతుందని మంత్రి తెలిపారు. దీంతో, పోలీసులు అప్రమత్తమై మహిళలను రక్షించేందుకు అవకాశముంటుందని నితిన్ గడ్కరీ వివరించారు. ఈ నింబంధనలకు సంబంధించిన నోటిఫికేషన్ జూన్ 2న జారీ అవుతుందని తెలిపారు. ఢిల్లీలో నిర్బయ ఘటన జరిగిన విధంగా ఇక భవిష్యత్ లో అలాంటి ఘటనలు ఇంక జరగకుండా చూడాలని అన్నారు.

అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదు.. మూడు వేల భవనాలు

తెలంగాణ పాలేరు ఉపఎన్నికలో తుమ్మల ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన తెలంగాణలో అంగన్‌వాడీ కేంద్రాలకు మూడు వేల శాశ్వత భవనాలను నిర్మిస్తామని.. భవనాల నిర్మాణం కోసం కేంద్రంనుంచి నిధులు అందకపోయినా, రాష్ట్రమే పూర్తిగా భరిస్తోందని ఆయన అన్నారు. స్త్రీ శిశు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో నిధులను ఖర్చు చేస్తూ అంగన్‌వాడీ కేంద్రాలకు శాశ్వత భవనాలను నిర్మిస్తోందని ఆయన చెప్పారు. అంతేకాదు రాష్ట్రంలోని అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. అంగన్‌వాడీ కేంద్రాల పర్యవేక్షణకు ట్రాకింగ్ విధానం అమలు చేస్తామని తెలిపారు. అంగన్‌వాడీ కార్యకర్తలకు ల్యాప్‌టాప్‌లు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నామని చెప్పారు.

నెహ్రు-గాంధీ వారసుల విగ్రహాలపై నితీశ్ కుమార్.. ఉమ్మేసే పరిస్థితి వస్తుంది.

  ఇప్పటికే పలు కట్టడాలకు, రోడ్లకు గాంధీ-నెహ్రూ కుటుంబాల పేర్లు పెట్టడంపై రిషీ కపూర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనికి ప్రతీకారంగా కాంగ్రెస్ కార్యకర్తలు మరుగుదొడ్డికి ఆయన పేరు పెట్టి పగ తీర్చుకున్నారు. ఇప్పుడు నితీశ్ కుమార్ కూడా రిషీ కపూర్ జాబితాలో చేరిపోయారు. నెహ్రు-గాంధీ వారసుల విగ్రహాలు పెట్టడం మానుకోవాలని.. విగ్రహాలు పెట్టుకుంటూ పోతే వాటిపై ప్రజలు ఉమ్మేసే పరిస్థితి వస్తుందని ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలో రెండేళ్లుగా అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం చేసిందేమి లేదని, వచ్చే మూడేళ్ల పాలనలోనూ పెద్దగా ఒరిగేదేం ఉండబోదని అన్నారు.

అమ్మపై అభిమానంతో.. 134 సీట్లకు 134 మంది గుండ్లు

  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఘన విజయం సాధించి.. ఆ పార్టీ అధినేత జయలలిత రికార్డులు తిరగరాసి మరోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఇక్కడి వరకూ బాగానే ఉన్న అమ్మ గెలిచినందుకు తమళి తంబీలు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. పార్టీ గెలిచినందుకు ఒక ఆటో డ్రైవర్ రూపాయికే తన సర్వీసును అందించగా.. ఇప్పుడు కొంత మంది ఏకంగా గుండ్లు కొట్టించేసుకున్నారు. ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ 134 సీట్లు కైవసం చేసుకొని విజయ ఢంకా మోగించగా.. ఈ నేపథ్యంలోనే 134 సీట్లకు గాను 134 మంది గుండు చేయించుకొని అమ్మపై తన ప్రేమను చూపించారు. మొత్తానికి అమ్మలాగే ఆమె కార్యకర్తలు కూడా ఏం చేసినా కొత్తగానే చేస్తారుని మరోసారి నిదర్శనమైంది.

చనిపోయిన టెక్కీ.. సిపిఎం నేత మేనల్లుడు.. డబ్బుల కోసమే..

  హైదరాబాద్ నగరం లింగంపల్లిలో హష్మీ అనే సాఫ్ట్ వేర్ ఉద్యోగి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసులో పలు ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇప్పటికే హష్మీని హత్య చేసింది.. స్నేహితుడు నరేష్ కుమార్ రెడ్డి అనే విషయం పోలీసులు తెలిపారు. అంతేకాదు.. హష్మీ.. సిపిఎం ఎపి శాఖ కార్యదర్శి మధు మేనల్లుడు అనే విషయం బయటపడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. హష్మీ గత వారం రోజుల క్రితమే టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగిగా జాయిన్ అయ్యాడు. అయితే హష్మీ స్నేహితుడైన నరేష్ కుమార్ రెడ్డి అతనిని పదివేలు కావాలని అడిగాడు. హష్మీ తన వద్ద లేవని చెప్పడంతో.. అతని వద్ద ఉన్న డబ్బును లాక్కునేందుకు ప్రయత్నించగా.. ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో నరేష్ కుమార్ రెడ్డి బండరాయితో హష్మీని కొట్టి చంపేసి.. తన వద్ద ఉన్న డబ్బు, బంగారం, సెల్ ఫోన్ తీసుకొని వెళ్లిపోయాడు. ఆ మరుసటి రోజు వచ్చి.. మోటరు బైక్ ఇవ్వడానికి వచ్చానని హష్మీ తల్లిదండ్రులతో కట్టు కథ అల్లినట్టు పోలీసులు తెలిపారు.

మాల్యా చెక్ బౌన్స్ కేసులో ట్విస్ట్.. మాల్యా ఎక్కడున్నాడో కనుక్కోండి..

విజయ్ మాల్యాను చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరు కావాలంటూ ఎర్రమంజిల్ కోర్టు వారెంట్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. కోర్టు పంపిన వారెంట్లు మళ్లీ తిరిగి ఎర్రమంజిల్ కోర్టుకే తిరిగి వచ్చేశాయి. కోర్టు పంపించిన అడ్రస్ కు వారెంట్లు వెళ్లినా.. అక్కడ ఎవరూ లేకపోవడంతో.. తిరిగి ఆ వారెంట్లను కోర్టుకే పంపించేశారు. అంతేకాదు ఇంటిని బ్యాంకు అధికారులు సీజ్ చేశారని.. అందులో ఏ ఒక్క వ్యక్తి లేరని కోర్టుకు తెలిపారు.   ఈ నేపథ్యంలో చెక్ బౌన్స్ కేసు విచారణను వచ్చే నెల 6 కు వాయిదా వేసిన కోర్టు... అసలు మాల్యా ఎక్కడున్నాడో కనుక్కోవాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. తాను జారీ చేసిన సమన్లు వెనక్కు రావడంతో కొత్తగా మరోమారు సమన్లు జారీ చేయాలని కోర్టు నిర్ణయించింది. అయితే ఆ సమన్లను ఏ అడ్రెస్ కు పంపాలన్న విషయాన్ని పోలీసులే చెప్పాలని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి విచారణ (జూన్ 6వ తేదీ)లోగా మాల్యా ఉంటున్న అడ్రెస్ ను తమకు అందజేయాలని కోర్టు పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.

బీజేపీ,టీడీపీ మిత్రపక్షంగా.. ఇప్పుడే చెప్పలేం..

  గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ మిత్రపక్షంగా ఉండి ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే మారిన పరిస్థితులను బట్టి ఇప్పుడు రెండు పార్టీల మధ్య ఉన్న సంబంధాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ముందునుండి బీజేపీ నేతలు, టీడీపీ నేతల ఒకరి మీద ఒకరు విమర్సలు గుప్పించుకున్నా.. ఆ తరువాత పెద్దలు కలుగజేసుకోవడంతో పరిస్థితులు చక్కబడేవి. ఒకానొక సందర్భంలో రెండు పార్టీలు విడిపోతాయి అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఇప్పుడు మాత్రం నిజంగానే రెండు పార్టీలు విడిపోతాయేమో అన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. అసలే అంతంతమాత్రంగా ఉండే పార్టీలు.. ఇప్పుడు ప్రత్యేక హోదా విషయం పై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడంతో మిత్రపక్షంగా కొనసాగే అవకాశాలు లేవని అర్ధమవుతోంది.   అంతేకాదు దీనిపై భార‌తీయ జ‌న‌తా పార్టీ ఆంధ్ర‌ప్ర‌దేశ్ నాయ‌కురాలు పురందేశ్వ‌రి మాట్లాడుతూ.. అలాంటి అవకాశం లేదని చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది. రాష్ట్రానికి కేంద్ర మంత్రులు రానున్న సంద‌ర్భంగా విజ‌య‌వాడ‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీతో మిత్రపక్షంగానే కొన‌సాగుతూ త‌దుప‌రి ఎన్నిక‌ల్లో పోటీ చేసే అంశంపై నిర్ణ‌యాన్ని తాము ఇప్పుడే చెప్ప‌లేమని..  ప్ర‌స్తుతం రాష్ట్రంలో త‌మ పార్టీని బ‌ల‌ప‌ర్చే దిశగానే దృష్టి పెట్టామ‌ని, టీడీపీతో పొత్తు అంశాన్ని గురించి ఎటువంటి నిర్ణ‌యాన్ని తెలప‌లేమ‌ని ఆమె అన్నారు. ఇంకా ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ బీజేపీ నేతలపై ఆరోపణలు చేస్తున్న నేపథ్యంలో.. ఆమె స్పందిస్తూ.. తమ పార్టీ అధిష్టానం రాష్ట్రానికి రావాల్సిన అన్ని ప్రయోజనాలపై దృష్టి పెడుతుందని.. అనవసరంగా టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారని ఖండించారు.