కన్న ప్రేమను చూపించిన లాలూ...!

కట్టుకున్న భార్యకన్నా కొడుకులు, కూతుళ్లు అంటేనే చాలా మంది భర్తలకి  ఇష్టం. సామాన్యుల నుంచి అసామాన్యుల దాకా ఎందరి విషయంలోనో...ఎన్నో సందర్భాల్లోనో ఈ విషయం నిరూపించబడింది. తాజాగా రైల్వేశాఖ మాజీ మంత్రి, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేతి లాలూ ప్రసాద్ యాదవ్ ఈ విషయాన్ని మరోసారి నిరూపించారు. దేశవ్యాప్తంగా ఖాళీ అయిన రాజ్యసభ స్థానాలకు వివిధ పార్టీలు అభ్యర్థులను ప్రకటించాయి. అలాగే ఆర్జేడీ నుంచి లాలూప్రసాద్ యాదవ్ వంతుకు వస్తే. రాజ్యసభ నోటిఫికేషన్ వెలువడటానికి ముందు నుంచే ఆయన భార్య రబ్రీదేవి పేరు ప్రముఖంగా వినిపించింది. అయితే అందరి అంచనాలను తలక్రిందులు చేస్తూ..భార్య రబ్రీదేవిని కాదని కూతురు మీసాభారతికి సీటు ఇచ్చారు. దీనిపై ఉదయం వరకు సస్పెన్స్ నడిచింది. కాని చివరకు కూతురివైపే ఆయన మొగ్గుచూపారు. 

ఆఖరికి పుదుచ్చేరిలో ప్ర‌భుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్..

  ఐదు రాష్ట్రాల్లో ఎన్నికుల జరిగిపోయాయి. ఫలితాలు వచ్చేశాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వం కూడా ఏర్పాటైపోయింది. ఒక్క పుదుచ్చేరిలో తప్ప. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలకు గాను ఎన్నికలు జరుగగా అందులో 17 స్థానాలు కాంగ్రెస్ గెలిచి అధికారం కైవసం చేసుకుంది. అయితే  పార్టీలో అంత‌ర్గ‌త విభేదాలతో ఇప్పటివరకూ ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేయలేదు. అయితే పార్టీ అధిష్ఠానం  సీనియ‌ర్ నేత‌, మాజీ కేంద్ర మంత్రి వీ.నారాయ‌ణస్వామిని ముఖ్య‌మంత్రిగా నియ‌మించ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించింది. దీంతో ఎట్టకేలకు పుదుచ్చేరిలో ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్ కదిలినట్టు తెలుస్తోంది. మరోవైపు పుదుచ్చేరి గ‌వ‌ర్నర్ కిర‌ణ్ బేడీతో వీ.నారాయ‌ణ స్వామి ఈరోజు భేటీ అయ్యారు. పుదుచ్చేరిలో ప్ర‌భుత్వ ఏర్పాటు చేయ‌వల్సిందిగా కోరారు.

తెలంగాణ టీడీపీ, కాంగ్రెస్ కు షాకు.. గులాబీ గూటికి నేతలు..

  తెలంగాణ కాంగ్రెస్ కు మరో ఎదురుదెబ్బ తగలనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే పార్టీనుండి పలువురు నేతలు టీఆర్ఎస్ గూటికి చేరగా ఇప్పుడు కోమటి రెడ్డి బ్రదర్స్ కూడా గులాబీ గూటికి చేరనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నల్గొండ జిల్లా కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డిలు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. జూన్‌ మొదటి వారంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమక్షంలో గులాబీ కండువా వేసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.     ఇక తెలంగాణ టీడీపీ కి కూడా షాక్ తగలనున్నట్టు సమాచారం. ఒక పక్క ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి వైసీపీ నేతలు జంప్ అవుతుంటే.. తెలంగాణలో మాత్రం దానికి వ్యతిరేకంగా టీడీపీ నేతలు టీఆర్ఎస్లోకి చేరుతున్నారు. ఈనేపథ్యంలోనే మల్కాజ్ గిరి ఎంపీ మల్లారెడ్డి టీఆర్ఎస్లో చేరుతున్నట్టు వినిపిస్తోంది. ఇప్పటికే మల్లారెడ్డి, కోమటిరెడ్డి బ్రదర్స్‌ వారివారి అనుచరులతో మంతనాలు జరిపారు. నల్గొండలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో వీరు టీఆర్‌ఎస్‌లో చేరనున్నట్లు సమాచారం.

హర్యానాలో మళ్లీ రాజుకున్న జాట్ల సెగ..

రిజర్వేషన్లు కల్పించాలంటూ హర్యానాలో రెండు నెలల క్రితం జాట్లు చేసిన ఆందోళనతో దేశం మొత్తం కంపించింది. ఎలాగో అప్పుడు బిల్లు పెడతామని ఉద్యమాన్ని సైలెంట్ చేశారు. దీంతో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ నేతృత్వంలోని ఆ రాష్ట్ర కేబినెట్ జాట్‌లతో పాటు మరో ఐదు కులాలను ఓబీసీలో చేర్చింది. అయితే ఈ చట్టం అమలుపై పంజాబ్, హర్యానా రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు రెండు రోజుల క్రితం స్టే ఇచ్చింది. ఈ నిర్ణయం జాట్‌ కులస్తులకు ఆగ్రహన్ని కలిగించడంతో వారు మరోసారి ఉద్యమానికి పిలుపునిచ్చారు. జూన్ 5 నుంచి హిసార్ జిల్లా మాయర్ గ్రామం నుంచి దీనిని మొదలుపెట్టాలని జాట్ సంఘర్ష్ సమితి నేతలు రొహ్‌తహ్ జిల్లా బసంతపూర్‌లో జరిగన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఇప్పటికే వందల సంఖ్యలో కేంద్ర పారామిలటరీ బలగాలను రంగంలోకి దించాయి. సమస్యాత్మక ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. ఈ నిషేధం మే 28 నుంచి జులై 27 వరకు అమల్లో ఉంటుందని హర్యానా ప్రభుత్వం తెలిపింది.

చైనాలో ట్రంప్ కు పెరుగుతున్న డిమాండ్.. అత్యధికంగా మాస్కులు

  అమెరికా అధ్యక్ష రేసులో ఉన్న డొనాల్డ్ ట్రంప్ చైనాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం కొత్తేమి కాదు. చైనా వాళ్లు తమ ఉద్యోగాలు లాక్కుంటున్నారని.. చైనా తమ దేశాన్ని రేప్ చేసిందంటూ.. తమ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసిందంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అయినా కూడా ట్రంప్ వ్యాఖ్యలను చైనా పొగడ్తలుగానే తీసుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు చైనాలో ట్రంప్ కు ఆదరణ కూడా బాగా పెరిగిపోతుంది. చైనాలోని మాస్కులు తయారు చేసే కంపెనీ యజమాని అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలవడం ఖాయమని ఆయన మాస్కులను తయారు చేయిస్తున్నాడు. ఒక్క ట్రంప్ మాస్కులే కాదు.. హిల్లరీ క్లింటన్, సాండర్స్ మాస్కులు కూడా తయారు చేయిస్తున్నాడు. అయితే ట్రంప్ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆయన మాస్కులు కాస్త ఎక్కువగానే తయారు చేయిస్తున్నాడు.

కేసీఆర్‌కు సూసైడ్ లెటర్ రాసి చనిపోయింది..

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం నోములలో ఆత్మహత్య చేసుకున్న బీటెక్ విద్యార్థిని ఝూన్సీ కేసు కీలక మలుపు తిరిగింది. ఆత్మహత్య చేసుకోవడానికి ముందు సూసైడ్ లెటర్ రాసింది. ఆ లేఖను ఏకంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పంపింది. ఆ లేఖలో తన ఆవేదనను సీఎంకు వివరించింది. తనను వ్యభిచారంలోకి దింపేందుకు భర్తతో పాటు తల్లి ప్రయత్నించారని పేర్కింది. సీఎంతో పాటు డీజీపీ అనురాగ్‌శర్మ, నల్గొండ జిల్లా ఎస్పీ, నకిరేకల్ పోలీసులకు చనిపోయే ముందు ఈ లేటర్‌ను ఝూన్సీ స్పీడ్ పోస్ట్ ద్వారా పంపింది. ఉన్నతాధికారుల ఆదేశంతో ఆమె మృతిపై పోలీసులు విచారణ చేపట్టారు. మరోవైపు ఝూన్సీ భర్త, తల్లి పరారీలో ఉన్నారు. వారి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

బీజేపీ రాజ్యసభ అభ్యర్ధులు.. ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాలు ఇవే..

  బీజేపీ తరపున రాజ్యసభకు వెళ్లే అభ్యర్ధులను పార్టీ పెద్దలు ఇప్పటికే ప్రకటించారు. దాదాపు 12 మంది అభ్యర్ధుల పేర్లను బీజేపీ ప్రకటించింది. రేపటితో నామినేషన్ గడువు పూర్తవుతున్న సందర్భంగా మరిన్ని పేర్లు ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. బీజేపీ కి ఉన్న సంఖ్యా బలం దృష్ట్యా ఇంకా 18 నుండి 19 మంది సభ్యులను రాజ్యసభకు పంపే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. కాగా ప్రస్తుతం బీజేపీ ప్రకటించిన అభ్యర్దుల పేర్లు వారు ప్రాతినిధ్యం వహించే రాష్ట్రాల వివరాలు 1. వెంకయ్య నాయుడు - రాజస్థాన్ 2. నిర్మలా సీతారామన్‌ - కర్ణాటక 3. ఓం ప్రకాశ్‌ మాథుర్‌ - రాజస్థాన్ 4. హర్షవర్ధన్ సింగ్ - రాజస్థాన్ 5. రాంకుమార్ వర్మ - రాజస్థాన్ 6. పియూష్‌ గోయెల్‌ - మహారాష్ట్ర 7. ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ - ఝార్ఖండ్ 8. బీరేంద్ర సింగ్ - హరియాణా 9. పురుషోత్తం రూపాల - గుజరాత్ 10. గోపాల్‌ నారాయణ్‌ సింగ్‌ - బీహార్ 11. అనిల్ మాధవ్ దవే - మధ్యప్రదేశ్ 12. రాంవిచార్ నేతం - ఛత్తీస్ గఢ్

కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్ నామినేషన్‌..

  రాజ్యసభ సభ్యురాలిగా కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ పదవికాలం కూడా పూర్తవుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఏపీ కోటా నుండి రాజ్యసభ సభ్యురాలిగా ఉన్న నిర్మలా సీతారామన్ ఈసారి కర్ణాటక నుంచి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పార్టీ ఆదేశాల మేరకే తాను కర్ణాటక నుండి రాజ్యసభకు నామినేషన్‌ దాఖలు చేస్తున్నానని.. తనను ఏపీ నుండి కొనసాగించకపోవడానికి గల కారణాలు ఏంటో తనకు తెలియవని.. పార్టీ నిర్ణయాన్ని శిరసాహించడమే తన కర్తవ్యమని స్పష్టం చేశారు. ఈరోజు కర్ణాటక వెళ్లి రేపు నామినేషన్‌ దాఖలు చేయనున్నట్లు ఆమె తెలిపారు.   కాగా ఏపీ కోటానుండి రాజ్యసభకు నాలుగు సీట్లు ఉండగా.. అందులో మూడు టీడీపీకి దక్కనున్నాయి. ఇక బీజేపీ-టీడీపీ మిత్రపక్షం కాబట్టి అందులో బీజేపీకి ఒక స్థానం దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఏపీ నుండి నిర్మలా సీతారామన్నే రాజ్యసభకు పంపించాలని చూశారు. కానీ పరిస్థితులు అనుకూలించక ఆమెను కర్ణాటక నుండి రాజ్యసభకు పంపిస్తున్నారు. మరోవైపు ఏపీ నుండి రాజ్యసభకు పంపే అభ్యర్ధులపై చర్చ జరుగుతుంది. ఈ రోజు సాయంత్రంలోపు అభ్యర్ధులు ఎవరో తెలిసిపోయే అవకాశం ఉంది. 

ఎన్టీఆర్ విగ్రహానికి నిప్పు... టీడీపీ నేతల ఆగ్రహం..

  టీడీపీ పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు జయంతి రెంజు రోజుల క్రితమే జరిగిన సంగతి తెలిసిందే. అయితే ఆయన జయంతి అలా జరిగిందో లేదో మరుసటి రోజే.. ఆయన విగ్రహానికి  గుర్తు తెలియని వ్యక్తులు నిన్న రాత్రి నిప్పు పెట్టారు. ఈ ఘటన తెలంగాణలోని ఆదిలాబాదు జిల్లా ఖానాపూర్ మండలం సూర్జాపూర్ గ్రామంలో జరిగింది. దీంతో జిల్లా టీడీపీ నేతలు జరిగిన ఘటనపై ఆగ్రహం వ్యక్తే చేస్తున్నారు. ఎన్టీఆర్ కు అవమానం జరిగిందని.. విగ్రహానికి నిప్పు పెట్టిన దుండగులను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ వారు గ్రామంలో ధర్నాకు దిగారు. ఈ ఘటనలో ఎన్టీఆర్ విగ్రహానికి స్వల్పంగా నష్టం వాటిల్లింది.

రాజ్యసభ సభ్యుల పేర్లపై చర్చ.. చంద్రబాబు నివాసానికి నేతల క్యూ..

  రాజ్యసభ అభ్యర్దుల పేర్లను ఖరారు చేసేందుకు గాను రావాలని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు పిలువు నిచ్చారు. దీంతో బాబు నివాసానికి నేతలు క్యూ కట్టారు. ఇప్పటికే కేంద్ర మంత్రులు అశోక గజపతిరాజు, సుజనా చౌదరిలతో పాటు ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, రాష్ట్ర మంత్రులు కాల్వ శ్రీనివాసులు, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణడు, ప్రత్తిపాటి పుల్లారావు తదితరులు వచ్చారు. మరోవైపు పెద్దల సభ రాజ్యసభలో అడుగుపెట్టాలని ఆశిస్తున్న టీడీపీ నేతల సంఖ్య పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి టీజీ వెంకటేశ్ చంద్రబాబును కలిశారు. ఈ సందర్బంగా టీజీ తననూ రాజ్యసభను పంపిచాలని కోరినట్టు సమాచారం. దీంతో రాజ్యసభకు ఎంపిక చేయాల్సిన వారిపై ప్రధానంగా చర్చతో పాటు, ఆశావహుల పేర్లన్నీ ఓసారి పరిశీలించాలని చంద్రబాబు నిర్ణయించినట్టు తెలుస్తోంది. చర్చల అనంతరం నేడు అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.   కాగా ప్రస్తుతం రాజ్యసభకు జరుగుతున్న ఎన్నికల్లో ఏపీ కోటాలో నాలుగు సీట్లున్నాయి. వీటిలో మూడు సీట్లు టీడీపీకి, మరో సీటు వైసీపీకి దక్కనున్నాయి. వైసీపీ నుండి రాజ్యసభకు వెళ్లే అభ్యర్దిని ఇప్పటికే ఖరారు చేశారు. రేపటితో నామినేషన్ల పర్వం ముగుస్తున్నా.. టీడీపీ మాత్రం ఇప్పటివరకూ అభ్యర్దులు ఎవరో తేల్చలేదు.

సోనియాగాంధీ ఇంటి వద్ద ఉద్రిక్తత.. ఇంటిని ముట్టడించిన బీజేపీ కార్యకర్తలు..

  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈ రోజు ఉదయం బీజేపీ నేతలు సోనియా ఇంటిని ముట్టడించడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాట్లా ఎన్‌కౌంటర్‌పై కేంద్ర మాజీ మంత్రి దిగ్విజయ్‌ సింగ్‌ వ్యాఖ్యలకు నిరసనగా ఈ ఆందోళన చేపట్టారు. అయితే ముందుస్తు సమాచారం లేకుండా వందలాది మంది కార్యకర్తలు సోనియా ఇంటిముందు నిరసనకు దిగడంతో పోలీసులు ఖంగుతిన్నారు. అనంతరం.. రంగంలోకి దిగి ఆందోళన కారులపై లాఠీఛార్జ్‌ చేశారు. అంతేకాదు వాటర్ కేనన్లను రంగంలోకి దింపారు. బీజేపీ కార్యకర్తలపై వాటర్ కేనన్లు ప్రయోగించిన పోలీసులు ఎట్టకేలకు వారిని సోనియా నివాసం సమీపంలోకి రాకుండా అడ్డుకోగలిగారు.

తెలంగాణలో ఆయిల్ ట్యాంకర్ల యజమానులు సమ్మె... పెట్రోల్ దొరికేది రెండు రోజులే..

  తమపై విధిస్తున్న 14.5 శాతం విలువ ఆధారిత పన్నును తక్షణం తొలగించాలని తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ట్యాంకర్ల యజమానులు అర్ధ్ర రాత్రి నుండి సమ్మెకు దిగారు. దీంతో రాష్ట్రంలోని వందలాది పెట్రోల్ బంకులకు పెట్రోలు, డీజిల్ సరఫరా నిలిచిపోయింది. ప్రస్తుతం ఉన్న పెట్రోల్ రెండు రోజుల వరకూ సరిపోతుంది.. అప్పటి వరకూ సమ్మె విరమించకుంటే పెట్రోలు కొరత ఏర్పడుతుందని బంకు యజమానులు ఆరోపిస్తున్నారు. ఆయిల్ ట్యాంకర్ల యజమానుల సమ్మె గురించి తెలుసుకున్న వాహనదారులు పెట్రోలు కోసం బంకుల వద్ద క్యూ కడుతున్నారు. మరోవైపు, తెలంగాణలోని ట్యాంకర్ల సమ్మెకు పూర్తి మద్దతు పలుకుతున్నామని ఏపీ ట్యాంకర్ల సంఘం ప్రకటించింది. తెలంగాణ బంకులకు తాము పెట్రోలు సరఫరా చేయబోమని స్పష్టం చేసింది.

లోకేశ్ చెప్పింది నిజమే.. చంద్రబాబు

  ఏపీ కోటాలో రాజ్యసభకు నాలుగు సీట్లు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ నాలుగు సీట్లలో మూడు టీడీపీకి.. ఒకటి వైసీపీకి దక్కే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. మరోవైపు బీజేపీ-టీడీపీ మిత్రపక్షం కావడంతో ఒక స్థానం బీజేపీకి వెళ్తుందా అనే సందేహాలు కూడా లేకపోలేదు. అయితే ఈ విషయంలో బీజేపీ నేతలు తమను సంప్రదించలేదని ఇప్పటికే టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్సి నారా లోకశ్ చెప్పారు. కానీ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా మాత్రం ఏపీ కోటాలోని ఓ సీటును ఇవ్వాలని తాము టీడీపీని అడిగామని, ఈ దిశగా ఇరుపార్టీల మధ్య చర్చలు జరుగుతున్నాయని విరుద్దంగా ప్రకటించారు. ఇక దీనిపై ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించి.. తన కుమారుడు నారా లోకేశ్ చెప్పింది నిజమేనని.. సీటివ్వాలని బీజేపీ నుంచి తమకు ఎలాంటి అభ్యర్థన రాలేదని చెప్పారు. దీంతో అమిత్ షా ప్రకటన తప్పని తేల్చేశారు. మరి దీనిపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే.. తెలంగాణ డిప్యూటీ సీఎం

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ.. ఏపీ నేతలు, ప్రజలందరూ ముక్త కంఠంతో కోరుతున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏపీ ప్రజలే కాదు తెలంగాణకు సంబంధించిన వారు కూడా ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నారు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ నెల్లూరు జిల్లా ఏఎస్ పేటలోని ఖాజా నాయబ్ రసూల్ దర్గాను దర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏపీ తెలంగాణకు పెద్దన్నయ్య లాంటిది.. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే అని అన్నారు. అంతేకాదు ఏపీతో పాటు తెలంగాణకు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని అన్నారు. తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో పయనించాలని ప్రార్థించినట్టు తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించి ఏఎస్ పేట దర్గా అభివృద్ధికి కొన్ని నిధులను మంజూరు చేయిస్తామని వివరించారు.

వెంకయ్య ప్లేస్ మారింది.. కర్ణాటక నుంచి కాదు...!

కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు రాజ్యసభ పదవీ కాలం ముగియడంతో ఆయనను తిరిగి ఏ రాష్ట్రం నుంచి రాజ్యసభకు పంపుతారా.? అంటూ దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. ఏపీ నుంచి పంపుతారని..కాదు కాదు కర్ణాటక నుంచే మళ్లీ ఆయన రాజ్యసభకు వెళతారు అంటూ ప్రచారం జరిగింది. అయితే వీటన్నింటికి తెరదించింది బీజేపీ అధినాయకత్వం. రాజ్యసభ స్థానాలకు పార్టీ అభ్యర్థుల జాబితాను బీజేపీ ప్రకటించింది. దీనిలో రాజస్థాన్ నుంచి వెంకయ్యనాయుడు, ఓం ప్రకాశ్ మాథుర్, హర్షవర్థన్ సింగ్, రాంకుమార్ వర్మ, కర్ణాటక నుంచి నిర్మలా సీతారామన్, హర్యానా నుంచి చౌదరి బీరేంద్ర సింగ్, మహారాష్ట్ర నుంచి పీయూష్ గోయెల్, జార్ఖండ్ నుంచి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, గుజరాత్ నుంచి పురుషోత్తం రూపాలా, మధ్యప్రదేశ్ నుంచి అనిల్ మాధవ్ దవే, బీహార్ నుంచి గోపాల్ నారాయణ్ సింగ్, ఛత్తీస్‌గఢ్ నుంచి రాం విచార్ నేతంలను రాజ్యసభకు ఖరారు చేసింది.