కుటుంబం కన్నా పార్టీయే ముఖ్యం: చంద్రబాబు

కుటుంబం కన్నా తనకు పార్టీయే ముఖ్యమన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తిరుపతిలో జరుగుతున్న 35వ మహానాడు సందర్భంగా ఆయన ముగింపు సందేశం ఇస్తూ పార్టీ నేతలు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహానాడులో అందరూ అద్భుతంగా భాగస్వాములయ్యారని అభినందించారు. టీడీపీ కోసం త్యాగాలు చేసిన కార్యకర్తలు, నేతలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.  కార్యకర్తల వల్ల తనకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందన్నారు. స్వచ్ఛందంగా 851 మంది రక్తదానంలో భాగస్వాములయ్యారని, స్మార్ట్ విలేజ్‌లో 300 మంది కార్యకర్తలు భాగస్వాములమవుతామని తెలపారని చెప్పారు. 3 రోజుల్లో మొత్తంగా 380 మంది భారీగా విరాళాలు అందజేశారని, మొత్తం 11 కోట్ల 55 లక్షల 8వేల 59 రూపాయలు విరాళాలుగా అందాయని బాబు ప్రకటించారు.

క్రికెట్ లవర్స్‌కు షాక్..ఐపీఎల్ ఫైనల్‌కు వానగండం..!

క్రికెట్ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ తుది సమరానికి రెడీ అయ్యింది. లీగ్ దశలో అన్ని జట్లను చిత్తు చేసి రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో విజయం ఏ జట్టును వరిస్తుందా అని ఫ్యాన్స్ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇవాళ బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వరుణుడు ఆటంకం కలిగించే సూచనలు కనిపిస్తున్నాయి. గార్డెన్‌సిటీ గత రెండు రోజులుగా వర్షంతో తడిసి ముద్దవుతోంది. ఈ పరిస్థితుల్లో ఈరోజు కూడా వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలపింది. దీనిని బట్టి మ్యాచ్ జరగడంపై అనుమానాలు కలుగుతున్నాయి. వర్షం కారణంగా ఈ రోజు మ్యాచ్ నిర్వహించడానికి సాధ్యంకాకపోతే బీసీసీఐ నిబంధనల ప్రకారం రేపు రిజర్వ్ డే ఉంది.

కర్ణాటకలో ఓలా, ఉబెర్‌లపై నిషేధం...

ఓలా, ఉబెర్‌ సంస్థలకు కర్ణాటకలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ రెండు సంస్థలు మోటారు వాహనాల చట్టంలోని నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపిస్తూ కర్ణాటక ప్రభుత్వం నిషేధం విధించింది. క్యాబ్ డ్రైవర్లు నిబంధనలను అతిక్రమిస్తున్నారని 300కు పైగా ఫిర్యాదులు రావడంతో వారిపై ఉక్కుపాదం మోపగా,డ్రైవర్లు రోడ్డెక్కారు. క్యాబ్‌లను నడుపుతున్న వారిలో ఎంతోమందికి లైసెన్స్‌లు లేవని గుర్తించామని, లైసెన్స్‌లు లేనివారికి తమ సంస్థ బ్రాండ్‌ను ఉబెర్, ఓలాలు ఇచ్చి వ్యాపారం జరుపుకుంటున్నాయని రవాణాశాఖ అధికారులు వ్యాఖ్యానించారు. అందువల్లే మొత్తం సేవలను ఆపివేయాలని ఆదేశించినట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

తప్పిపోయిన పిల్లల కోసం బెల్జియం గొప్ప నిర్ణయం..

తప్పిపోయిన పిల్లల కోసం వారి తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు పడే మానసిక క్షోభకు బెల్జియం ప్రభుత్వం సైతం కరిగిపోయింది. వారి కంటివెలుగులను ఎలాగైనా వారి దగ్గరికి చేర్చాలనే లక్ష్యంతో ఏ దేశ ప్రభుత్వం తీసుకొని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తప్పిపోయిన చిన్నారుల ఫోటోలను అథికారిక కరెన్సీ నాణేలపై ముద్రించేందుకు సిద్ధమవుతోంది. ఆ దేశంలోని చైల్డ్ ఫోకస్ అనే స్వచ్చంధ సంస్థ తప్పిపోయిన చిన్నారులు, లైంగిక వేధింపులకు గురైన చిన్నారులకు మద్ధతుగా నిలుస్తోంది. చిన్నారులను ఎలాగైనా వారి కుటుంబాలతో కలపాలనుకున్న ఈ సంస్థ ప్రభుత్వంతో చర్చించి కాయిన్స్ ఆఫ్ హోప్ కార్యక్రమానికి నాంది పలికింది. ఈ సందర్భంగా ఇరవై ఏళ్ల క్రితం తప్పిపోయిన లియమ్ వాండెన్ అనే చిన్నారి ఫోటో ఉన్న నాణేన్ని విడుదల చేసింది.

ఐపీఎల్‌లో పెందెంగా భార్య...ఓడిపోయాడు..!

ప్రజంట్ దేశం మొత్తం ఐపీఎల్ ఫీవర్‌లో ఊగిపోతోంది..అందరూ మ్యాచ్‌లను చూస్తూ ఎంజాయ్ చేస్తుండగా, అదే స్థాయిలో బెట్టింగ్ కూడా జోరుగా సాగుతోంది. బెట్టింగ్ కోసం డబ్బు, నగలు, భూములు పందెంగా కాయడం మనం చూస్తుంటాం. అయితే ఒక ప్రబుద్ధుడు మహాభారతం నుంచి స్పూర్తి పోందాడో ఏమో ధర్మరాజు జూదంలో ద్రౌపదిని పందెంగా కాసినట్టు, ఇతడు కూడా తన భార్యను పందెంగా కాసాడు. చివరికి బెట్టింగ్‌లో భార్యను ఓడిపోయాడు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా గోవింద్ నగర్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి ఐపీఎల్‌లో బెట్టింగ్ కాయడం అలవాటు. ఈ నేపథ్యంలో చేతిలో డబ్బులు లేకపోవడంతో భార్యను పెట్టి పందెం కాశాడు. అతను ఎంచుకున్న జట్టు ఓడిపోవడంతో భార్యను కోల్పోయాడు. పందెం గెలిచిన జూదరులు ఇంటికి రావడం, ఫోన్ చేసి అతని భార్యను వేధించడం మొదలుపెట్టారు. దీంతో విసిగిపోయిన బాధితురాలు సామాజిక కార్యకర్తల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. 

ట్రంప్ ర్యాలీలో ఆగని ఘర్షణలు..!

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరపున పోటీ చేస్తున్న డోనాల్డ్ ట్రంప్‌కు ఎంత మద్ధతు లభిస్తున్నా..అదే స్థాయిలో నిరసనలు తప్పడం లేదు. ఆయన ప్రచార ర్యాలీల్లో చాలాసార్లు నిరసనకారులు నానా హంగామా సృష్టించారు. తాజాగా కాలిఫోర్నియాలోని శాండియాగోలో ట్రంప్ మద్ధతుదారులు, వ్యతిరేకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఇరువర్గాలు పరస్పరం తిట్టుకుని, నీళ్ల సీసాలు విసురుకున్నారు. పోలీసులు వెంటనే ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపుచేశారు. ఈ సందర్భంగా 35 మందిని అరెస్ట్ చేశారు. ఆందోళనకారులను అరెస్ట్ చేసినందుకు శాండియాగో పోలీసులకు ట్రంప్ ధన్యవాదాలు తెలిపారు. పోలీసులు వెంటనే స్పందించారని ట్వీట్ చేశారు.

ఉగ్రవాదులపై టర్కీ ఉక్కపాదం.. 104 మంది హతం..

  ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాదాలు ప్రంపచ దేశాల్ని గడగడలాడిస్తున్నసంగతి తెలిసిందే. ఇప్పటికే అగ్ర దేశాలు కూడా ఉగ్రవాదులపై ఉక్కపాదం మోపాయి. ఈ నేపథ్యంలోనే ఉగ్ర‌వాదుల ప‌ట్ల ట‌ర్కీ ప్ర‌భుత్వం క‌ఠినంగా వ్య‌వ‌హ‌రిస్తోంది. దీనిలో భాగంగానే.. ఉగ్ర స్థావ‌రాల‌పై దాడులు నిర్వహించగా..104 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ట‌ర్కీ మిల‌ట‌రీ హ‌త‌మార్చిన‌ ఉగ్ర‌వాదుల సంఖ్య 104గా భావిస్తున్నామ‌ని, అయితే వారి సంఖ్యపై క‌చ్చిత‌మైన వివ‌రాలు చెప్ప‌లేమ‌ని, దానిపై త‌మ వ‌ద్ద‌ స్ప‌ష్ట‌త లేద‌ని ట‌ర్కీ తెలిపింది. వైమానికి దాడుల‌తో పాటు ఇత‌ర మార్గాల్లోనూ ఉగ్ర‌వాదుల‌ను అంత‌మొందిస్తున్న‌ట్లు చెప్పింది.

16 ఏళ్ల బాలిక‌పై 33 మంది అత్యాచారం.. కదిలిన బ్రెజిల్ ప్రభుత్వం..

  బ్రెజిల్ లో ఒక యువతిపై ఒకరు కాదు..ఇద్దరు కాదు ఏకంగా 33 మంది అత్యాచారం చేసిన ఘటన ఆ దేశాన్నే కాదు.. యావత్ ప్రంపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇక దీనిపై బ్రెజిల్ ప్రభుత్వం కూడా తీవ్రంగా స్పందించి ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసింది. ఇంకా దోషులను పట్టుకొని వారిని కఠినంగా శిక్షిస్తామని ప్రభుత్వ అధికారులు తెలిపారు.   కాగా బ్రెజిల్ లోని రియో డీజెనీరోలో ఉన్న తన బాయ్ ఫ్రెండ్ ఇంటికి బాధితురాలు వెళ్లింది. అయితే అక్కడ ఏం జరిగిందో ఏమో తెలియదు కాని.. మరుసటి రోజు తాను లేచి చూసేసరికి నగ్నంగా ఉన్నానని.. తన చుట్టూ కొందరు తుపాకులు పట్టుకుని ఉన్నారని పోలీసులకు చెప్పింది. నీరసించిపోయిన బాధితురాలు మగవాళ్ల దుస్తులు ధరించి ఇంటికి తిరిగివచ్చిందని, ఏం జరిగిందన్న విషయాన్ని చెప్పలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రెండు రోజుల తరువాత ఆమెకు సంబంధించి 40 సెకన్ల వీడియో ట్విట్టర్లో పోస్ట్ అయింది. దీంతో అసలు విషయం బయటపడింది. ట్విట్టర్ యాజమాన్యం ఈ ఫొటోలను తొలగించే లోపే 500 లైక్లు వచ్చాయి. ఈ దారుణ ఘటనపై బ్రెజిల్లో దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. మహిళలపై దాడులు, అత్యాచార సంస్కృతి పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 

హెచ్సీయూ కొత్త వివాదం... రోహిత్, అంబేద్కర్ ఫొటోలు తొలగింపు

  వివాదాలకు అడ్డాగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరో వివాదం రేగింది. ఇప్పటికే వర్శిటీ ప్రాంగణంలో మొన్నటికి మొన్న రాత్రే శివుని విగ్రహం, నంది, నాగదేవత విగ్రహాలు పెట్టడంపై పలువురు విద్యార్ధులు నిరసన తెలుపుతుంటే ఇప్పుడు మరో వివాదం మొదలైంది. ఆత్మ‌హ‌త్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వేముల ఫోటోలను ఒక వర్గం విద్యార్థులు కొన్ని రోజుల క్రితం వర్సిటీలో పెట్టారు. అయితే నిన్న రాత్రి ఆ ఫోటోలను వ‌ర్సిటీ సిబ్బంది తొల‌గించారు. రోహిత్ వేముల ఫోటోల‌తో పాటు అక్క‌డి అంబేద్క‌ర్ ఫోటోల‌ను కూడా తీసేశారు. దీంతో విష‌యాన్ని గ‌మ‌నించిన విద్యార్థులు ఈరోజు ఆందోళ‌న‌కు దిగారు. వ‌ర్సిటీ ప్ర‌ధాన గేటు వద్ద నిర‌స‌న వ్య‌క్తం చేస్తున్నారు. ద‌ళిత విద్యార్థుల ప‌ట్ల వివ‌క్ష చూపుతున్నార‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. దీంతో యూనివర్శిటీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

జాతీయగీతం వేళ ఫోన్ మాట్లాడిన మాజీ ముఖ్యమంత్రి.. ఆఖరికి క్షమాపణలు..

  పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ ప్రమాణం స్వీకారం చేసేశారు. ప్రభుత్వం ఏర్పడింది. అయితే ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వచ్చిన ఓ మాజీ ముఖ్యమంత్రిగారు మాత్రం అడ్డంగా బుక్కయ్యారు. అసలు సంగతేంటంటే.. జమ్మూకాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూఖ్ అబ్దుల్లా కూడా దీదీ ప్రమాణ స్వీకారానికి వచ్చారు. ఆసమయంలో జాతీయ గీతాలాపన సమయంలో ఫోన్ లో మాట్లాడారు. అంతే ఇది కాస్త కెమెరా కంటికి చిక్కింది. దీంతో ఆయన వ్యవహరించిన తీరుపై వివాదం రేగుతోంది. ఇక ఆఖరికి అబ్దుల్లా క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది. ఆసమయంలో ఎమర్జెన్సీ కాల్ వచ్చింది అందుకే మాట్లాడానని..  జాతీయ గీతం సమయంలో ఎలా వ్యవహరించాలో తనకు తెలుసని, తాను నిలబడే ఉన్నానని, అయితే తప్పనిసరి పరిస్థితుల్లో మాట్లాడాల్సి వచ్చిందని, తాను అలా చేయడం వల్ల ఎవరి మనోభావాలైనా దెబ్బతిని ఉంటే క్షమించాలని ఆయన కోరారు.

ముద్రగడకు పెరుగుతున్న మద్ధతు.. చిరంజీవి, దాసరి కూడా

  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని ముద్రగడ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నేపథ్యంలో ఈరోజు ముద్రగడ పలు కీలక నేతలతో భేటీ అయ్యారు. నిన్న రాత్రికే హైదరాబాదు చేరుకున్న ముద్రగడ... నేటి ఉదయం పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి, ప్రముఖ నటుడు, కాంగ్రెస్ ఎంపీ చిరంజీవిలను కలిసిన ముద్రగడ... కొద్దిసేపటి క్రితం దర్శకరత్న దాసరి నారాయణరావుతో భేటీ అయ్యారు.   భేటీ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన దాసరి... ముద్రగడ ఉద్యమానికి పూర్తి మద్దతు ప్రకటించారు. కాపులకు రిజర్వేషన్లు కల్పించాల్సిందేనని దాసరి డిమాండ్ చేశారు. ఈ విషయంలో ఎన్నికల సందర్భంగా చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. కాపుల ఉద్యమానికి తాను సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు ఆయన తెలిపారు.   మరోవైపు చిరంజీవి కూడా తమ మద్దతు ముద్రగడ పద్మనాభంకు ఉంటుందని తెలిపారు. కాపు రిజర్వేషన్ కోసం ఉద్యమించిన ముద్రగడ వెనుక తాము నిలబడతామని అన్నారు. కాపులకు రిజర్వేషన్ పై ముద్రగడ చేస్తున్న ఉద్యమం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు. భవిష్యత్ కార్యాచరణను ముద్రగడ తనకు వివరించారని, ఆయనకు తమ పూర్తి మద్దతు ఉంటుందని, ఆయన సాధించాలనుకున్నది సాధిస్తారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కాంగ్రెస్ రాజ్యసభ అభ్యర్దులు వీరే..

రాజ్యసభలో మొత్తం 57 సభ్యులకు పదవీకాలం ముగియడంతో ఖాళీలు ఏర్పడనున్న సంగతి తెలిసిందే. ఈ 57 స్థానాల్లో రెండు స్థానాలు తెలంగాణకు, నాలుగు స్థానాలు ఏపీకి వచ్చాయి. ఇప్పటికే తెలంగాణకు సంబంధించిన అభ్యర్ధులు ఖరారైపోయారు. ఇక ఏపీనుండి మూడు స్థానాలు టీడీపీకి, వైసీపీ ఒక స్థానం దక్కనున్నట్టు తెలుస్తోంది. అయితే అభ్యర్ధులు ఇంకా తెలియాల్సి ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యసభకు తమ అభ్యర్థులుగా కాంగ్రెస్‌ పార్టీ ఆరుగురి పేర్లను ప్రకటించింది. పి. చిదంబరం, ఆస్కార్‌ ఫెర్నాండెజ్‌, జైరాం రమేశ్‌, అంబికా సోనీ, వివేక్‌ టంకా, కపిల్‌ సిబాల్‌, ఛాయావర్మలను తమ పార్టీ తరఫున రాజ్యసభకు అభ్యర్థులుగా కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది.

మరోసారి కోర్టు మెట్లు ఎక్కిన రోజా.. తప్పని కష్టాలు

  వైసీపీ  ఎమ్మెల్యే రోజా ఏదో ఒక కారణంతో కోర్టు మెట్లు మాత్రం ఎక్కాల్సి వస్తుంది. మొన్నటి వరకూ అసెంబ్లీ సస్పెన్షన్ నేపథ్యంలో కోర్టుల చుట్టూ తిరిగిన రోజా ఇప్పుడు ఎన్నిక నేపథ్యంలో మరోసారి కోర్టుకి వెళ్లారు. రోజా ఎన్నికను సవాల్ చేస్తూ, హైకోర్టులో పిటిషన్ దాఖలవడంతో కోర్టు రోజాకి నోటీసులు జారీ చేసింది. అయితే దీనిపై స్పందించిన రోజా పిటిషన్ ను కొట్టివేయాలని మరో పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు ఈ రెండు పిటిషన్లను విచారణకు స్వీకరించింది. అయితే రెండు వాదనలను ఒకేసారి వింటామని ప్రకటించింది. దీంతో రోజా.. రెండు వాదనలు ఒకేసారి ఎలా వింటారని సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టు రోజా పిటిషన్ ను విచారణకు స్వీకరించి వచ్చే నెల చివరి వారంలో దీనిపై విచారణ చేపట్టనుంది.

కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలి..

  టీడీపీ వ్యవస్థాపకుడు, దివంగత సీఎం నందమూరి తారకరామారావు పేరును ఆయన సొంత జిల్లా కృష్ణా జిల్లాకు పెట్టాలని ఆ పార్టీ సీనియర్ నేత, రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యుడు మాగంటి మురళీమోహన్ డిమాండ్ చేశారు. తిరుపతిలోని మహానాడు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పైవిధంగా డిమాండ్ చేశారు. ఆయన డిమాండుకు వేడుకలకు హాజరైన పార్టీ నేతల నుంచి మంచి మద్దతే లభించింది. కృష్ణా జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టాలని మురళీమోహన్ అనగానే పార్టీ నేతలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ మద్దతు పలికారు.     ఇంకా గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్‌ మాట్లాడుతూ ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధే తెలుగుదేశం పార్టీ ప్రధాన ఎజెండా అని అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్‌ తెలుగుదేశం పార్టీని స్థాపించి ఎన్నో సంస్కరణలకు ఆద్యుడిగా నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతీ ఒక్కరూ పాటుపడాలని కోరారు. ఐదున్నర కోట్ల ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాను కేంద్రం ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.

రాహుల్‌గాంధీ కనిపించడం లేదు.. ఆప్ మంత్రి

  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈరోజు ఆప్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఢిల్లీ వాసులు విద్యుత్ కోత‌లు, తాగునీటి స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్నారని.. ఆ సమస్యలను ప‌రిష్కారం చేయాలంటూ కాగ‌డాల ప్ర‌ద‌ర్శ‌న చేప‌ట్ట‌నున్నారు. ఈ ర్యాలీలో పెద్దఎత్తున ఢిల్లీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, కార్యకర్తలు పాల్గొన‌నున్నారు. అయితే ఈ ర్యాలీ సందర్భంగా ఆప్ మంత్రి కపిల్ మిశ్రా రాహుల్ గాంధీపై వ్యంగ్యంగా ట్విట్టర్ లో రీ ట్వీట్ చేశారు. ఢిల్లీ కాంగ్రెస్ నేతలకు రాహుల్‌గాంధీ ఎన్నో రోజుల నుంచి కనిపించడం లేడని, ఈ ర్యాలీ తోనైనా వారు రాహుల్ గాంధీని క‌లుస్తార‌ని ఆయ‌న ఎద్దేవా చేశారు. మరి దీనిపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.

ఆగ‌ష్ట్ వరకూ డెడ్‌లైన్.. మరో ఉద్యమానికి ముద్రగడ

  కాపులకు రిజర్వేషన్లు కల్పించాలని కాపు నేత ముద్రగడ పద్మనాభం డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. గతంలో ఈ విషయంలో ఉద్యమం చేసిన సంగతి తెలిసిందే. అది అయిపోయిన తరువాత మళ్లీ ఇటీవల.. ప్రభుత్వం ఇచ్చిన హామీలను మరిచిపోయింది అంటూ మరోసారి దీక్ష చేస్తామని ప్రకటించారు. కానీ ఆ తరువాత చేయలేదు. అయితే ఇప్పుడు మరోసారి  ఉద్య‌మానికి సిద్ధ‌మ‌వుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు ఉద‌యం హైద‌రాబాద్‌లో ఏపీసీసీ అధ‌్యక్షుడు ర‌ఘువీరా రెడ్డితో ఆయ‌న భేటీ అయ్యారు. ఇంకా కాంగ్రెస్ నేత, సినీన‌టుడు చిరంజీవిని కూడా ఆయ‌న క‌లిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చంద్ర‌బాబు నాయుడు ఆగ‌స్టులోగా మంజునాథ క‌మిష‌న్ నివేదికను తెప్పిస్తామ‌ని హామీ ఇచ్చార‌ని, ఇచ్చిన హామీకి కట్టుబడి ఆగ‌స్టులోపు కాపుల‌ను బీసీల్లో చేర్చాల‌ని డెడ్‌లైన్ విధించారు. లేకపోతే ఉద్య‌మానికి సిద్ధ‌మేన‌ని ప్ర‌క‌టించారు. కాగా ఆయన దాసరి నారాయణరావును, బొత్స సత్యనారాయణను కూడా విడివిడిగా క‌ల‌వ‌నున్న‌ట్లు స‌మాచారం.

ఎన్టీఆర్ న‌టించ‌లేదు.. భారత రత్న ఇవ్వాలి..

  తిరుపతిలో టీడీపీ మహానాడు కార్యక్రమం రెండో రోజు ప్రారంభమైంది. ఈ సందర్బంగా ఏపీ ముఖ్యమంత్రి.. ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ప్రసంగం ప్రారంభించారు. ఆంధ్రుల ఆరాధ్య దైవంగా తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కొనియాడారు. ఉన్నతమైన ఆశయాల కోసం జీవించిన వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో ముందుకు వెళ్తే సాధించలేనిది ఏది లేదని.. ఎన్టీఆర్ కు భారత రత్న అవార్డ్ ఇవ్వాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. ఈ ఏడాది అన్న క్యాంటీన్లను ప్రారంభిచనున్నామని తెలిపారు. సినిమాల్లో ఎంత‌గా గౌర‌వం సంపాదిస్తారో మ‌ళ్లీ అంత‌గా రాజ‌కీయాల్లో సంపాదించే అవ‌కాశం ఉండ‌దు.. కానీ, ఆ ఘ‌న‌త‌ను ఎన్టీఆర్ సాధించార‌’ని అన్నారు. ‘ఎన్టీఆర్ సినిమా పాత్ర‌ల్లో న‌టించ‌లేదు జీవించారు’ అని చంద్ర‌బాబు అన్నారు. ఏ వేష‌మేసినా ఆ పాత్ర‌కి న్యాయం చేశారని ఆయ‌న అన్నారు. శ్రీ కృష్ణుడ్ని మ‌న క‌ళ్ల‌కు చూపించారని వ్యాఖ్యానించారు.   ఈ సందర్బంగా చంద్రబాబు మరో కీలక ప్రకటన చేశారు. నవ్యాంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో 115.5 అడుగుల ఎన్టీఆర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆయన ప్రకటించారు.