కిడ్నీ రాకెట్ కలకలం.. ఆరుగురు అరెస్ట్.. ఇద్దరు అపోలో సిబ్బంది..

  దేశ రాజధాని ఢిల్లిలో కిడ్నీ రాకెట్ కలకలం రేపుతోంది. ఈ కిడ్నీ రాకెట్ ముఠాకు సంబంధించిన ఆరుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి తనకు ఉన్న ఆర్ధిక ఇబ్బందుల నిమిత్తం.. కిడ్నీ విక్రయించాడు. అయితే కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బు విషయంలో భార్య భర్తల మధ్య వివాదం రావడంతో అది కాస్త పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లింది. దీంతో అసలు విషయం బయటపడింది. విషయం తెలుసుకున్న పోలీసులు రంగంలోకి దిగి.. కిడ్నీ రాకెట్ ను నిర్వహిస్తున్న ఆరుగురు సభ్యులను అరెస్ట్ చేశారు. వీరిలో ఇద్దరు అపోలో ఆస్పత్రి సిబ్బందిగా పోలీసులు గుర్తించగా.. కిడ్నీ దాతలకు మధ్యవర్తులుగా వ్యవహరించిన ముగ్గురు వ్యక్తులతో పాటు.. కిడ్నీ దాతలను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఇప్పటికే వీరు నాలుగు కిడ్నీలు అమ్మేసినట్టు తెలుస్తోంది.

మహిళా జడ్జిని వేధించిన క్యాబ్ డ్రైవర్ అరెస్ట్..

మహిళా న్యాయమూర్తిని వేధించిన క్యాబ్ డ్రైవర్ ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కోర్టుకు చెందిన మహిళా జడ్జి షాపింగ్‌కు వెళ్లడానికి ఓలా క్యాబ్‌లో ఎక్కగా డ్రైవర్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి వేధించాడు. దీంతో ఆమె తీస్‌హజారీలోని కోర్టు అదనపు సెషన్స్‌ జడ్జి ఫిర్యాదు చేసింది. దీంతో విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడు సందీప్‌ను గుడ్‌గావ్‌లో అరెస్ట్‌ చేశారు.     షాపింగ్‌కు వెళ్లడానికి మే 28న ఓలా క్యాబ్‌ బుక్‌ చేసుకున్నానని.. దారిలో ఓ షాప్‌కు వెళ్లివస్తానని కొంచెంసేపు వేచి ఉండమని డ్రైవర్‌కు చెప్పి లోపలికి వెళ్లానని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే రెండు నిమిషాలు దాటగానే డ్రైవర్‌ చాలా అసభ్యంగా తిడుతూ తన బ్యాగ్‌ రోడ్డుపై పడేశాడని తెలిపారు.

విజయసాయిరెడ్డికి నాన్ బెయిలబుల్ వారెంట్లు..

  ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న కేసులో విజయసాయిరెడ్డి రెండో నిందితుడన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు విజయసాయిరెడ్డిపై సీబీఐ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ కేసుపై ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టు విచారణ చేపడుతున్న నేపథ్యంలో  విజయసాయిరెడ్డి మాత్రం కోర్టుకు హాజరవడం లేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు నేటి విచారణ సందర్భంగా ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది.   విజయసాయిరెడ్డి పరిస్థితిని ముందుగానే గమనించి.. అనారోగ్యం కారణం వల్లనే కోర్టుకు హాజరుకాలేక పోతున్నానని చెప్పి పిటిషన్ దాఖలు చేశారు. అయితే కోర్టు మాత్రం ఆ పిటిషన్ ను కొట్టివేసి.. కేసు విచారణకు హాజరుకు మినహా ఇతర కార్యకలాపాల్లో చురుకుగానే పాలుపంచుకుంటున్నారని మండిపడుతూ నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్లను జారీ చేశారు. తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేశారు.

రూ.5 కోట్లిస్తే ఓటేస్తాం.. అడ్డంగా బుక్కయిన ఎమ్మెల్యేలు

  రాజ్యసభ ఎన్నికలు ప్రశాంతంగా ముగుస్తున్నాయి అనుకున్న నేపథ్యంలో ఇప్పుడొక ఆసక్తికర అంశం చోటుచేసుకుంది. ఎన్నికల్లో ఓటర్లను కొనడానికి నేతలు డబ్బులతో వల విసురుతుంటారు.. అయితే ఇప్పుడు కర్ణాటక ఎమ్మెల్యేలు మాత్రం ఓటు వేయాలంటే తమకు డబ్బులివ్వాలని తేల్చిచెబుతున్నారు. అలా ఓ నలుగురు ఎమ్మెల్యేలు అడ్డంగాబుక్కయ్యారు. అసలు సంగతేంటంటే.. కర్ణాటక రాజ్యసభ స్థానాలకు ఎక్కువ మంది నామినేషన్లు దాఖలు చేసిన నేపథ్యంలో అక్కడ పోలింగ్ తప్పని పరిస్థితి నెలకొంది. దీంతో ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్ధులు విపక్షాల నేతలను తమవైపు తిప్పుకునేందుకు ముడుపులు చెల్లించడానికి సిద్దపడుతున్నారు. ఇక దీన్ని అవకాశంగా తీసుకున్న విపక్ష నేతలు ‘రూ.5 కోట్లిస్తామంటే చెప్పండి, మా ఓటు మీకే’’ అంటూ ఆయా పార్టీల తరఫున బరిలోకి దిగిన రాజ్యసభ అభ్యర్థులకు తేల్చిచెబుతున్నారు. ఈ క్రమంలోనే ఓ ఛానెల్ స్టింగ్ ఆపరేషన్ నిర్వహించగా.. రూ.5 కోట్లిస్తే పార్టీలతో సంబంధం లేకుండా ఓటేయడానికి తాము సిద్ధమేనంటూ కామెరా కంటికి చిక్కారు. ఈ నలుగురు ఎమ్మెల్యేల్లో ఇద్దరు జేడీఎస్  కు చెందిన వారు కాగా, కేజీపీకి చెందిన మరో ఎమ్మెల్యే, స్వతంత్ర శాసనసభ్యుడు ఉన్నారు.

జగన్ ను చెప్పులతో కొట్టిస్తానన్న జేసీ ప్రభాకర్ రెడ్డి..

  అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఈరోజు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనంతపురంలో రైతు భరోసా యాత్ర చేపట్టారు. జగన్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై నిన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో జగన్ రైతు భరోసా యాత్రను అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి 50 కార్లతో బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నేను అనుకుంటే ఈ క్షణమే నిన్ను చెప్పులతో కొట్టించి తాడిపత్రి నుంచి తరిమేయగలనని, తాడిపత్రిలో రైతు భరోసా యాత్ర పేరిట పర్యటిస్తున్న నిన్ను పది నిమిషాల్లోనే ప్రజల చేత చెప్పులతో కొట్టిస్తే ఏం చేస్తావని, ముఖ్యమంత్రిని కాదు ప్రజలు నిన్ను చెప్పులతో కొట్టి ఊరేగించే కాలం ఆసన్నమైందని ధ్వజమెత్తారు. చంద్రబాబును విమర్శిస్తే ఊరుకునేది లేదని అన్నారు. దీంతో ఓ వైపు వైసీపీ కార్యకర్తలు... టీడీపీ శ్రేణులు... మధ్యలో భారీ సంఖ్యలో పోలీసులతో అక్కడ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. కాగా వడుగూరులో నిన్న మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని చెప్పులతో కొట్టాలని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

జగన్ కు దెబ్బ మీద దెబ్బ.. మరో వైసీపీ ఎమ్మెల్యే జంప్

  వైసీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. రెండు రోజుల క్రితమే గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తముల అశోక్ రెడ్డి టీడీపీలో చేరారు. ఇప్పుడు మరో ఎమ్మెల్యే కూడా జగన్ కు షాకిచ్చాడు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పోతుల రామారావు కూడా టీడీపీ లో చేరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో పోతుల రామారావు, ఆయన అనుచరులు టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోతుల రామారావు మాట్లాడుతూ.. నవ నిర్మాణ దీక్ష రోజునే టిడిపిలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నందునే తెలుగుదేశం పార్టీలో చేరానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు శిద్ధా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కాగా ఇప్పటికి 18 మంది ఎమ్మెల్యేలు టీడీపీ లో చేరారు.

రేవంత్ రెడ్డిపై కేసు నమోదు..

  తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిపై కేసు నమోదైంది. ఓయూ జన జాతరలో పాల్గొన్న ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి ఆర్ట్స్ కళాశాల వద్ద నిర్వహించిన జన జాతర కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన కుటుంబ సభ్యులకు గంటల్లో రాజకీయ ఉద్యోగాలు కల్పించిన కేసీఆర్ విద్యార్థులకు ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేసేందుకు మాత్రం కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. తక్షణమే లక్ష ఉద్యోగాలకు నోటీఫికేషన్లు జారీ చేయాలన్నారు. ఎన్నికల సమయంలో ఓయుకు హెలికాప్టర్లో వచ్చిన కేసీఆర్‌కు విద్యార్థులు చెప్పులు చూపినందుకు కక్ష కట్టారన్నారు. ఓ వైపు ఉద్యోగాల నోటిఫికేషన్లు జారీ చేయకుండా, మరోవైపు వర్సిటీకి వైస్ ఛాన్సులర్‌ను నియమించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారన్నారు.   ఈ నేపథ్యంలో రాజకీయ సభలకు హాజరుకాకూడదని కోర్టు ఆదేశించినా... హైకోర్టు ఆదేశాల ధిక్కరణ కింద రేవంత్‌రెడ్డిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. ఇంకా సభలో పాల్గొనేందుకు వస్తున్న తెలంగాణ పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టివిక్రమార్క, మాజీ మంత్రి శ్రీధర్ బాబు, యువజన కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు అనిల్ యాదవ్‌లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

ఎంపీ కోసం స్పెషల్ ట్రైన్..ప్రయాణీకుల పాట్లు..!

సాధారణ ప్రయాణీకులు చాలి చాలని రైళ్లతో నానా అవస్థలు పడుతూ మాకు రైళ్లు పెంచండి బాబూ అని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని రైల్వేశాఖ ఒకరి కోసం ప్రత్యేకంగా రైలునే నడిపింది. మహారాష్ట్రకు చెందిన బీజేపీ ఎంపీ పూనమ్ మహాజన్ కేంద్ర రైల్వేశాఖ సహాయమంత్రి మనోజ్ సిన్హాకు సంబంధించిన ఓ కార్యక్రమానికి హాజరుకావాల్సి ఉంది. ముంబైలో జరిగే ఈ కార్యక్రమానికి మధ్యప్రదేశ్‌లోని బినా జిల్లాలో ఉన్న పూనమ్ భోపాల్ చేరుకుని అక్కడి నుంచి విమానంలో వెళ్లాల్సి ఉంది. పూనమ్ ఆలస్యంగా రావడంతో ఆమె భోపాల్ వెళ్లాల్సిన రైలు వెళ్లిపోయింది. దీంతో రైల్వేశాఖ అధికారులు ఆమె కోసం ప్రత్యేకంగా రెండు బోగీలతో స్పెషల్ రైలును ఏర్పాటు చేశారు. అంతేనా ఆ రైలు భోపాల్ చేరేంత వరకు మార్గమధ్యంలో వెళుతున్న రైళ్లను నిలిపివేశారు. ఆమె భోపాల్ చేరుకుని వెంటనే విమానాశ్రయానికి వెళ్లి ముంబయి విమానాన్ని అందుకున్నారు. కేవలం ఒక ఎంపీ సరైన సమయానికి విమానం అందుకోవడం కోసం సాధారణ ప్రయాణికుల రైళ్లను నిలిపివేయడంతో జనం నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈ విషయం వివాదాస్పదంగా మారింది. 

పనిపిల్లపై కరుణ లేని రేణుకా చౌదరి..

కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ మంత్రి రేణుకా చౌదరీ చిక్కుల్లో పడ్డారు. తన కుటుంబంతో కలిసి ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన రేణుకా చౌదరీ తన ఇంట్లోని ఓ చిన్నపాపను చూసుకునే అమ్మాయికి కనీసం విలువ ఇవ్వకుండా భోజనం చేశారు. ఆ అమ్మాయిని కుర్చీలో కూర్చోమని కూడా చెప్పకుండా అలాగే నిలబెట్టారు. రిషి బగ్రీ అనే వ్యక్తి ఆ ఫోటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేయడంతో నెటిజన్లు రేణుకపై విరుచుకుపడుతున్నారు. ప్రియమైన రేణుకా చౌదరీ గారూ..మీ చిన్నారిని చూసుకునే అమ్మాయికి భోజనం పెట్టించలేనప్పుడు ఆ అమ్మాయిని అసలు రెస్టారెంట్‌కు ఎందుకు తీసుకువెళ్లారని..పెద్ద వాళ్ల ఇళ్లలో వెలి ఇంకా కొనసాగుతుందని చెప్పడానికి రేణుకా గారి చర్యలే ప్రత్యక్ష ఉదాహరణ అని కొంతమంది ట్వీట్ చేశారు. గతంలో మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రిగా పనిచేసిన వ్యక్తి అయ్యి ఉండి మహిళ పట్ల ఇలా చేస్తారా అని మరికొందరు ప్రశ్నించారు.

భావితరాలకోసం బలమైన పునాది-కేసీఆర్

కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి బలమైన పునాది వేస్తేనే భావితరాలు బాగుంటాయన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ ముఖ్యఅతిధిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసు బలగాల నుంచి గౌరవవందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి మాట్లాడిన సీఎం..నిధులు, నీళ్లు, నియామకాల కోసమే ప్రత్యేక రాష్ట్రం సాధించుకున్నామని..ప్రత్యేక రాష్ట్రం వల్లే మన నిధులు మరో ప్రాంతానికి తరలింపు కాలేదని గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా రెండేళ్ల పాలన సాగిందని ఆయన అన్నారు. పేదింటి యువతుల కోసం కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు అమలు చేస్తున్నట్టు చెప్పారు. త్వరలో బీసీలకూ కళ్యాణ లక్ష్మీ పథకం అమలు చేయనున్నట్లు చెప్పారు. కళాశాలల్లోనూ సన్నబియ్యం పథకం అమలు చేస్తామని తెలిపారు. 598 మంది అమరవీరుల కుటుంబీకులకు నియామక పత్రాలు అందజేశామని పేర్కొన్నారు.  

పెట్రోల్ పోయను అన్నందుకు చంపేశారు...!

హైదరాబాద్ కూకట్‌పల్లిలో దారుణం జరిగింది. పెట్రోల్ పోయను అన్నందుకు ఒక వ్యక్తిని హత్య చేశారు. కూకట్‌పల్లి సుమిత్రానగర్‌లోని హెచ్‌పీ పెట్రోల్ బంక్‌కు నిన్న అర్థరాత్రి సమయంలో ఆరుగురు వ్యక్తులు బైకులపై వచ్చారు. పెట్రోల్ పోయమని అడిగారు..అయితే సమయం మించిపోయిందని ఇప్పుడు పోయడం కుదరదని అక్కడి సిబ్బంది చెప్పారు. దీంతో వారు సిబ్బందితో గొడవకు దిగారు. అనంతరం పెట్రోల్ బంక్ నుంచి  తిరిగి వెళ్లి మళ్లీ వచ్చి కర్రలతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రగాయాలపాలైన మూసాపేట జింకలవాడకు చెందిన క్యాషియర్ సంగమేశ్వర్ అక్కడికక్కడే మరణించగా..మరో ముగ్గురు సిబ్బంది గాయపడ్డారు. బాధితులను కేపీహెచ్‌బీలోని ఓ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఏపీని బజారుకిడ్చారు

ఇటలీ స్వాతంత్ర్య దినోత్సవం నాడు ఆంధ్రప్రదేశ్‌ను రోడ్డున పడేశారన్నారు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు. విజయవాడ బెంజిసర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నవ నిర్మాణ దీక్షలో ఆయన పాల్గొని ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ సమైక్యాంధ్ర కోసం ఉద్యోగులు, విద్యార్థులు, రైతులు రోడ్లపైకి వచ్చి ఉద్యమించారని కాని విభజనా మాత్రం ఆపలేకపోయామన్నారు. విభజన చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని కోరా..రెండు ప్రాంతాలకు న్యాయం చేసి ముందుకెళ్లాలంటే నాటి పాలకులు లెక్కచేయలేదన్నారు. జనాభా ప్రకారం అప్పులు పంచారు, ఆదాయం మాత్రం ఎక్కడిది అక్కడే అన్నారు. విభజన తర్వాత ఆస్తులు రాలేదు..అప్పులు మాత్రమే మిగిలాయన్నారు. నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు ఎన్ని కష్టాలొచ్చినా భయపడేది లేదని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో స్పీకర్ కోడెల, సీఎస్ టక్కర్, మంత్రులు దేవినేని, కామినేని, కొల్లు రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.

మూడు కెమెరాలతో స్మార్ట్ ఫోన్..

  రోజుకో సరికొత్త మొబైల్ మార్కెట్లోకి వస్తుంది. ఇప్పుడు ఎల్జీ కూడా ఓ సరికొత్త మొబైల్ ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. సాధారణంగా స్మార్ట్ ఫోన్లకి ఫ్రంట్ కెమెరా.. బ్యాక్ కెమెరా ఉంటాయి. అయితే మూడు కెమెరాలతో ఉండే సరికొత్త హైఎండ్ స్మార్ట్ ఫోన్ ను ఎల్జీ భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ. 52,990 అని, ఫ్లిప్ కార్ట్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంటుందని ఎల్జీ వివరించింది. ఫోన్ ఫీచర్లు.. * 5.3 అంగుళాల హెచ్డీ ఐపీఎస్ క్వాంటమ్ డిస్ ప్లే * ఆండ్రాయిడ్ 6.0 మార్ష్ మాలో ఆపరేటింగ్ సిస్టమ్ * 4 జీబీ ర్యామ్, * 32 జీబీ ఇంటర్నల్ మెమొరీ, 2 టెర్రాబైట్ల వరకూ విస్తరించుకునే సామర్థ్యం ఉన్నాయి. * బ్యాంక్ 16, 8 ఎంపీ కెమెరాలుండగా, ఫ్రంట్ 8 ఎంపీ కెమెరా ముందు భాగంలో ఉంది. * 2,800 ఎంఏహెచ్ బ్యాటరీ

'చంద్రన్న బీమా' ప్రారంభం.. వివరాలు ఇవే..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు 'చంద్రన్న బీమా' పథకాన్ని ప్రారంభించారు. ఏపీ ప్రభుత్వం ఈ పథకానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలను మంత్రి పల్లె రఘునాథరెడ్డి వివరించారు. ఆ వివరాలు...   * ఈ పథకం ద్వారా ప్రమాదంలో మరణించినా, అంగవైకల్యం ఏర్పడినా రూ. 5 లక్షల వరకూ డబ్బు అందుతుంది. * సహజ మరణం సంభవిస్తే రూ. 30 వేలు * 18 నుంచి 70 సంవత్సరాలున్న వారికి, నెలకు రూ. 15 వేల కన్నా తక్కువగా ఆదాయం పొందుతున్న వారికి ఇది వర్తిస్తుందని ఆయన అన్నారు. * ఏడాదికి రూ. 170 బీమా ప్రీమియంగా చెల్లించాల్సి వుంటుందని, అందులో రూ. 150 ప్రభుత్వమే భరిస్తుందని, లబ్దిదారు నుంచి నామమాత్రపు రుసుమునే వసూలు చేస్తామని పల్లె వివరించారు.