High Court shifting talk creates flutter in AP

దుమారం రేపుతున్న అమరావతి హై కోర్టు వివాదం...

  ఏపీలో హై కోర్టు వివాదం తీవ్రరూపం దాల్చుతోంది, హైకోర్టు కావాలంటూ సీమలో ఆందోళన ఊపందుకుంది. హై కోర్టుని అమరావతి నుంచి తరలించడానికి వీల్లేదని ఆంధ్రాలో లాయర్ లు ఉద్యమ బాట పట్టారు. దీంతో ఏపీలో హై కోర్టు వివాదం తీవ్రస్థాయికి చేరుతోంది. శ్రీబాగ్ ఒప్పందం గుర్తు చేస్తూ సీమలోని న్యాయవాదులు కదం తొక్కుతున్నారు. రాజధాని విషయంలోనే సీమకు అన్యాయం జరిగిందంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటు గుంటూరులో ఐదు జిల్లాల న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు అయితే, రాయలసీమకు హై కోర్టు కావాల్సిందేనని కర్నూలులో లాయర్లు రిలే, నిరాహార దీక్షలు చేస్తున్నారు. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తున్నారనే ప్రచారం మొదలైన క్షణం నుంచి రాయలసీమలో ఉద్యమాలు మొదలయ్యాయి. శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలులో రాజధానిని ఏర్పాటు చేయాలంటూ ఆందోళనలు ఊపందుకున్నాయి. కర్నూలు, కడప జిల్లా న్యాయవాదులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తున్నారు. విద్యార్థి సంఘాల నేతలు, సామాజికవేత్తలతో కలిసి పోరు బాట పట్టారు. సీమకు మొదట్నుంచీ అన్యాయం జరిగిందని హై కోర్టు విషయంలో వెనక్కి తగ్గేది లేదు అని న్యాయవాదులు అంటున్నారు. హైకోర్టు సీమకు ఇవ్వాలంటూ కడప, కర్నూలు జిల్లాలో ఇప్పటికే రిలే, నిరాహార దీక్షలు నడుస్తుంటే తాజాగా అనంతపురంలో కూడా సీమకు హైకోర్టు నినాదంతో ఆందోళనలు మొదలయ్యాయి. అనంతపురం కోర్టు నుంచి తెలుగు తల్లి విగ్రహం వరకు న్యాయవాదులంతా విధుల బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించరాదని దాన్ని అనుసరించి సీమకు న్యాయం చేయాలని అక్కడి న్యాయవాదులు డిమాండ్ చేస్తున్నారు. హై కోర్టు కోసం ఆంధ్రా లోనూ అలజడి మొదలైంది, అమరావతి నుంచి హైకోర్టును తరలిస్తే ఊరుకునేది లేదంటూ ఆంధ్రాలోని ఆరు జిల్లాల న్యాయవాదులు ఉద్యమ బాట పట్టారు. హై కోర్టు రాజధానిలోనే ఉండాలని అమరావతి నుంచి మరో ప్రాంతానికి ఎలా తరలిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడే గుంటూరులో హై కోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని ఉద్యమించామని, ఇప్పుడు వచ్చిన హైకోర్టును ఎలా వదులుకుంటామని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గుంటూరు, కృష్ణా, నెల్లూరుతో పాటు ఉభయ గోదావరి జిల్లాల న్యాయవాదులు గుంటూరులో భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు.

A question of TDP political survival in Telangana

హుజూర్ ఉప ఎన్నికల్లో టిడిపి పరిస్థితేంటి..?

టిడిపి హుజూర్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయలేదు, అది చాలా తప్పుడు సంకేతం వెళ్లింది, కార్యకర్తలందరూ కూడా చాలా నిరుత్సాహపడిపోయారు కానీ, ఇప్పుడు మరోసారి తెలంగాణలో టీడీపీని బలోపేతం చేసే ప్రయత్నం చేస్తామని చంద్రబాబు చెబుతున్నారు. వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో ఉంటూనే పార్లమెంట్ నియోజక వర్గాల వారీగా కూడా సమీక్షలు చేస్తూ కొంత యువ నాయకులను ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నారు. ఎన్నిక వచ్చిన సందర్భంలో టిడిపి నాయకులు ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించిన మిగిలిన టిడిపి నాయకులు కూడా నర్సిరెడ్డి లాంటి నాయకులకి టికెట్ ఇస్తే కొంత టిడిపికి ఉత్సాహం వచ్చే అవకాశం ఉంది. అయితే, నర్సిరెడ్డి ఇప్పటికే అన్ని కార్యక్రమాల్లో స్టేజ్ పై మాట్లాడుతూ కొంత యాక్టివ్ గా ఉన్నారు. ఇలాంటి నాయకులని ప్రోత్సహిస్తే మరోసారి టిడిపికి కొంత ఊపు వచ్చే అవకాశముంటుంది. కాబట్టి ఈ ఎన్నికను ఉపయోగించుకోవాలని టిడిపి సీనియర్ నాయకులు చెప్తున్నారు. కానీ ఇది అంత సులభంగా జరిగే పని కాదు, ఖర్చు ఒక ఎత్తయితే ఇప్పుడు పోటీ చేస్తే, పోటీలో వచ్చే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి, పోటీ కారణంగా లాభనష్టాలు ఏ విధంగా ఉంటాయి ఇవన్నీ పరిగణనలోకి తీసుకున్న తర్వాతే పోటీకి నిలబడాలి. కాని, నాయకుల చెబుతున్నట్టుగా పోటీ చేసినంత మాత్రాన పార్టీ బలోపేతం అయ్యే పరిస్థితి అయితే కనిపించట్లేదనే చెప్పాలి.కానీ, చంద్రబాబు వ్యూహం ఏ విధంగా ఉంటుందనేది చూడాలి. ఇప్పుడు పోటీ చేస్తే లాభం కన్నా నష్టమే ఎక్కువ జరుగుతుంది అని చంద్రబాబు ఆలోచించే అవకాశాలున్నాయి. దీంతో నర్సిరెడ్డి లాంటి నాయకులు నిరుత్సాహపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే అసెంబ్లీ నియోజక వర్గాల వారీగా నాయకులను గుర్తించి , వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ప్రోత్సహించే ప్రయత్నాలైతే టిడిపి నాయకులు చేస్తున్నారు. ఉప ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడం సరైన నిర్ణయం కాదని టిడిపి సీనియర్ నాయకులు అనుకుంటున్నారు. కాకపోతే భవిష్యత్తులో మాత్రం పట్టు వదలకుండా నియోజకవర్గాల వారీగా నాయకులని ప్రోత్సహించే ప్రయత్నం మాత్రం ఎప్పుడూ జరుగుతూనే ఉంటుందని, తెలంగాణ లో మరొక్కసారి మంచి రోజులొస్తాయనే ఆలోచనలో తెలంగాణ టిడిపి ఉన్నట్టుగా తెలుస్తోంది.

ap cmo office serious on eenadu paper banner story

జగన్‌ను ఇరికించిన కేసీఆర్..! అయినా నిప్పు లేకుండా పొగ రాదు కదా.!

కేంద్రంపైనా, బీజేపీపైనా ఉమ్మడి పోరు చేయాలని కేసీఆర్-జగన్ ఏకాభిప్రాయానికి వచ్చారంటూ వచ్చిన కథనాలతో జగన్ ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంపై ప్రముఖ పత్రికలు ప్రచురించిన కథనాలు జగన్ సర్కారులో గుబులు రేపుతున్నాయి.ప్రభుత్వం భయపడుతోంది. మోడీ గవర్నమెంట్ తోనూ, బీజేపీతోనూ సఖ్యతగా ఉంటూ వస్తోన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి... పేపర్లలో వచ్చిన కథనాలు చూసి కంగుతిన్నట్లు తెలుస్తోంది. దాంతో, కేంద్రం, బీజేపీ తీరుపై కేసీఆర్-జగన్ తీవ్ర అసంతృప్తిగా ఉన్నారంటూ వచ్చిన కథనాలపై ఏపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. సమావేశంలో అసలు, కేంద్రం గురించి గానీ, అలాగే బీజేపీపైనా కానీ అస్సలు చర్చే జరగలేదని, ఇది దురుద్దేశపూరిత కథనం అంటూ ఏపీ సీఎంవో ప్రకటన ఇచ్చింది. అయితే, కేంద్రం తీరుపైనా, బీజేపీ విధానాలపైనా ముఖ్యమంత్రుల మీటింగ్ లో తీవ్ర చర్చ జరిగినట్లు ప్రముఖ ప్రతికలు కథనాలు ఇచ్చాయి. అత్యధిక సర్క్యులేషన్ ఉన్న ప్రముఖ పత్రిక... కేంద్రం చిన్నచూపు-తెలుగు రాష్ట్రాల అసంతృప్తి అంటూ మెయిన్ హెడ్డింగ్ తో ఫ్రంట్ పేజీ వార్త ప్రచురించింది. అలాగే, ఏపీ, తెలంగాణలో బీజేపీ అనుసరిస్తోన్న విధానాలు సరిగా లేవు... తెలుగు రాష్ట్రాల ప్రయోజనాలను ఎన్డీఏ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు... ఏపీ, తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాలను కేంద్రం వ్యతిరేకిస్తోంది... కేంద్రానికి వ్యతిరేకంగా ఉమ్మడి పోరు చేద్దామంటూ... ఇద్దరు ముఖ్యమంత్రులు ఏకాభిప్రాయానికి వచ్చారంటూ కథనం ఇచ్చింది. ఇక మరో పత్రిక... బీజేపీని ఉమ్మడిగా ఎదుర్కొందాం... కనీసం గవర్నర్ల నియామకంపైనా రాష్ట్రాలను సంప్రదించలేదంటూ... కేసీఆర్-జగన్ మీటింగ్ పై కథనం ప్రచురించింది. దాంతో అప్రమత్తమైన జగన్ ప్రభుత్వం వెంటనే వివరణ ఇచ్చింది. కేంద్రం, బీజేపీ గురించి అస్సలు చర్చ జరగలేదని ప్రకటన చేసింది. అయితే, నిజంగానే కేంద్రం, బీజేపీ గురించి చర్చించకపోతే, తెలంగాణ సీఎంవో కూడా స్పందించాల్సి ఉంటుంది. లేకపోతే కథనాలు నిజమేనని భావించాల్సి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. నిప్పు లేకుండా పొగ రాదనే ఎంత సత్యమో... కేంద్రం తీరుపైనా, బీజేపీ విధానాలపైనా కేసీఆర్-జగన్ చర్చించకుండా కథనాలు రావనేది అంతే నిజం. అయితే, కేంద్రంతోనూ, మోడీ-అమిత్ షాతో సఖ్యతనే కోరుకుంటున్న జగన్ కు ఈ కథనాలు ఇబ్బంది కలిగించాయి. దాంతో వెంటనే సీఎంవోతో వివరణ ఇప్పించారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం వైపు నుంచి మాత్రం ఎలాంటి వివరణ రాలేదు. దాంతో కేంద్రంపైనా, బీజేపీపైనా గుర్రుగా ఉన్నది కేసీఆర్ అయితే, అందులోకి జగన్ కి కూడా తెలివిగా లాగారనేది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు బీజేపీ సవాలు విసురుతోంది... అలాగే 2023లో ఎలాగైనా అధికారంలోకి రావాలని వ్యూహరచన చేస్తోంది. దాంతో బీజేపీతో, మోడీతో కేసీఆర్ తీవ్రంగా విభేదిస్తున్నారు. పైగా మోడీ రెండోసారి ప్రధాని పగ్గాలు చేపట్టాక, కేంద్రంలో కేసీఆర్ అస్సలు సత్సంబంధాలు కొనసాగించడం లేదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్రం అండ్ కాషాయ పార్టీతో కేసీఆర్ సై అంటే సై అంటున్నారని, కానీ మోడీ-అమిత్ షాతో తగువు పెట్టుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేని జగన్ ను ఇందులోకి లాగడంతోనే ఏపీ సీఎంవో వివరణ ఇచ్చినట్లు అర్ధమవుతోంది. ప్రముఖ పత్రికల్లో వచ్చిన కథనాలతో కేసీఆర్ కు ఎలాంటి నష్టం లేకపోయినా, జగన్ కు మాత్రం ఇది కచ్చితంగా ఇబ్బందికర పరిణామమే అంటున్నారు విశ్లేషకులు.

hard face for tdp in visakhapatnam

తెలుగుదేశం కంచుకోటలకు బీటలు... అప్రమత్తం కాకపోతే కనుమరుగే..!

తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత విశాఖ రాజకీయ ముఖచిత్రాన్ని పరిశీలిస్తే పసుపు జెండాదే హవా కనిపిస్తుంది. వైజాగ్ రాజకీయాల్లో టీడీపీ ఛరిష్మా చారిత్రాత్మకం. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. క్రమంగా వైసీపీ బలపడుతూ వచ్చింది. 2014లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన జగన్ పార్టీ... 2019కి వచ్చేసరికి అనూహ్యంగా పుంజుకుని ఒక్క విశాఖ అర్బన్ మినహా జిల్లా మొత్తం క్లీన్ స్వీప్ చేసింది. అయితే, జగన్ సునామీలో కూడా విశాఖ అర్బన్‌లో నాలుగు స్థానాలను కైవసం చేసుకుని తెలుగుదేశం సత్తా చాటింది. అంతేకాదు ఓడిపోయిన నియోజకవర్గాల్లోనూ గట్టిపోటీనిచ్చి స్వల్ప తేడాలతోనే సీట్లను కోల్పోయింది. సీట్లు రాకపోయినా, ఓటు బ్యాంకు మాత్రం చెక్కు చెదరలేదని, విశాఖ జిల్లాలో తెలుగుదేశం పునాదులు స్ట్రాంగ్ గా ఉన్నాయని రుజువు చేసింది. కానీ ఎన్నికల తర్వాత తెలుగుదేశం గోడలకు బీటలు వారుతున్నాయి. ముఖ్యనేతల మధ్య విభేదాలు, వివాదాలతో ఒక్కో నియోజకవర్గంలో పట్టు కోల్పోతోంది. గంటాతో విభేదాలతో, ఎన్నికలకు ముందే అవంతి శ్రీనివాస్ వైసీపీ గూటికి చేరడంతో భీమిలిలో పట్టుకోల్పోయింది టీడీపీ. ఇక అవంతి బాటలోనే అయ్యన్నపాత్రుడు సొంత తమ్ముడు, తెలుగుదేశాన్ని వీడి... జగన్ గూటికి చేరనుండటంతో నర్సీపట్నం టీడీపీలో చీలికలు మొదలై పార్టీ బలహీనపడిందనే మాట వినిపిస్తోంది. అలాగే, విశాఖ డెయిరీ ఆడారి కుటుంబం వైసీపీలో చేరడంతో దాదాపు గ్రామీణ ప్రాంతంలో తెలుగుదేశం పట్టుకోల్పోందని అంటున్నారు. ఇక, ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌, వైజాగ్ అర్బన్ అధ్యక్షుడు రెహ్మన్ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరి, పార్టీ అధిష్టానం వరకు వెళ్లాయి. ఇలా, ప్రతి నియోజకవర్గంలో, ముఖ్యనేతల మధ్య విభేదాలు బయటపడుతుండటంతో, పార్టీ బలహీనపడుతుందనే మాట వినిపిస్తోంది. అయితే, త్వరలోనే జీవీఎంసీ ఎన్నికలు ఉన్నందున, అధిష్టానం అప్రమత్తమై... లీడర్లను సెట్ రైట్ చేయాలని, లేదంటే పార్టీకి నష్టం తప్పదని తెలుగు తమ్ముళ్లు అంటున్నారు.   మొత్తానికి ఒకపక్క విభేదాలు-వివాదాలు... మరోపక్క వలసలతో విశాఖ టీడీపీ కష్టాల్లో పడింది. అయితే, తెలుగుదేశం ఆవిర్భావం నుంచి వైజాగ్ లో టీడీపీకి మంచి పట్టుండటం, సాగరతీర రాజకీయాలను పసుపు జెండా శాసించిన రికార్డు ఉండటంతో, మళ్లీ ఆ కీర్తికిరీటాన్ని నిలబెట్టుకునేందుకు టీడీపీ అధిష్టానం వేగంగా పావులు కదుపుతోంది.

ap cm ys jagan has agreed to reduce polavaram height

పోలవరం ప్రాజెక్టు రీడిజైనింగ్? కేసీఆర్-జగన్ భేటీ వెనుక సీక్రెట్ ఇదేనా?

  పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు ప్రయత్నం జరుగుతుందనే మాట వినిపిస్తోంది. పోలవరం ప్రాజెక్టుపై ఇటీవల అసెంబ్లీలో కీలక ప్రకటన చేసిన సీఎం కేసీఆర్.... కేవలం ఎత్తు వల్లే తెలంగాణ, ఒడిషాకు అభ్యంతరాలు ఉన్నాయన్నారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం... పోలవరం ఎత్తు తగ్గించేందుకు అంగీకరిస్తే, సమస్యలన్నీ సమసిపోతాయని చెప్పుకొచ్చారు. అయితే, పోలవరం ఎత్తు తగ్గించాలని తాను ఆంధ్రా సీఎం జగన్మోహన్ రెడ్డితో మాట్లాడానని, అందుకు జగన్ అంగీకరించారంటూ స్వయంగా అసెంబ్లీలోనే ప్రకటించి కేసీఆర్ కలకలం రేపారు. ఆ ప్రకటనకు కొనసాగింపుగానే, ముఖ్యమంత్రుల సమావేశం జరిగిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, కేసీఆర్ ప్రకటనపై అటు చంద్రబాబు... ఇటు ప్రజాసంఘాల నేతలు ఆనాడు మండిపడ్డారు. కేసీఆర్, జగన్ ఎవరైనాసరే పోలవరం ప్రాజెక్టు జోలికొస్తే ఊరుకునేది లేదని బాబు హెచ్చరించారు. 71శాతం పూర్తయిన ప్రాజెక్టుపై కుట్రలు చేస్తే ఊరుకునేది లేదంటూ మండిపడ్డారు. పోలవరం ఎత్తు తగ్గించేందుకు ఏపీ సీఎం ఒప్పుకున్నారంటోన్న కేసీఆర్ కి ఆంధ్రా పరిస్థితులు ఏం తెలుసని ప్రశ్నించారు. అసలు ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడానికి కేసీఆర్ ఎవరని చంద్రబాబు నిప్పులు చెరిగారు. 55లక్షల క్యూసెక్యుల నీటిని దృష్టిలో పెట్టుకుని పోలవరం ప్రాజెక్టును డిజైన్ చేశారని, అందువల్ల ప్రాజెక్టు భద్రతతో రాజకీయ ఆటలాడొద్దని సీఎం జగన్మోహన్ రెడ్డికి సూచించారు. ఏదైనా జరగరానిది జరిగితే గోదావరి జిల్లాల్లో ఒక్క గ్రామం కూడా మిగలదని హెచ్చరించారు. అయితే, ఎంతమంది వ్యతిరేకిస్తున్నా, తాను అనుకున్నదే చేసుకుంటూ పోతున్న జగన్మోహన్ రెడ్డి... పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపుపై ఓకే చెప్పారనే మాట వినిపిస్తోంది. కారణాలు ఏమైనా, కేసీఆర్ మాటకు జగన్ అధిక విలువ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవిధంగా జగన్ కు కేసీఆరే ముఖ్యసలహాదారుగా మారారనే గుసగుసలూ వినిపిస్తున్నాయి. కేసీఆర్ ఏం చెబితే దానికి జగన్ ఎస్ అంటున్నారని చెప్పుకుంటున్నారు. అందుకే పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గింపునకు కూడా జగన్ సానుకూలంగా ఉన్నారనే మాట వినిపిస్తోంది. ముఖ్యమంత్రుల మీటింగ్ లో పోలవరం ఎత్తు తగ్గింపు అంశంపైనా చర్చించినట్లు తెలుస్తోంది. రహస్య అజెండాగా పోలవరం ఎత్తు తగ్గింపుపై ఇద్దరి మధ్య చర్చలు సాగాయని అంటున్నారు. ఒకవేళ కేసీఆర్ ప్రకటించినట్లుగా, పోలవరం ఎత్తు తగ్గింపునకు జగన్ ఒప్పుకుంటే, అది ఏపీలో కలకలం రేపే అవకాశం ఉంది. అలాగే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడం ఖాయం. అంతేకాదు కేసీఆర్ చెప్పినట్లుగా పోలవరం ఎత్తు తగ్గిస్తే... 196 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యమున్న ప్రాజెక్టులో 60 టీఎంసీలు తగ్గిపోయి... 130 టీఎంసీలకు పడిపోతుందని, అదే జరిగితే ఆంధ్రప్రదేశ్ కు తీవ్ర నష్టం తప్పదని, ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమకు అన్యాయం జరుగుతుందని నిపుణులు అంటున్నారు. అయితే, కేసీఆర్ మాటలకు తలొగ్గి ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేయాలని చూసినా, ప్రజల మనోభావాలతో ఆడుకున్నా, జగన్ చరిత్రహీనుడుగా మిగిలిపోవడం ఖాయమని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఒకవేళ జగన్ ప్రభుత్వం.... రాష్ట్ర ప్రయోజనాలకు తెలంగాణకు తాకట్టు పెడితే, పెద్దఎత్తున ప్రజాఉద్యమాలు చేపడతామని తెలుగుదేశం లీడర్లు అంటున్నారు.

TTD takes slew of decisions in the first meet

కీలక నిర్ణయాలు తీసుకున్న టిటిడి బోర్డ్...

తిరుమలలో టిటిడి బోర్డ్ కీలక నిర్ణయాలు తీసుకుంది, తాగునీటి కొరత నివారణకు శ్రీకారం చుట్టింది. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టేందుకు బోర్డు నిర్ణయం తీసుకుంది. టీటీడీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన పాలక మండలి తొలి సమావేశం జరిగింది. పెండింగ్ లో ఉన్న పలు అంశాల పై సమావేశంలో చర్చించారు. బాలాజీ రిజర్వాయర్ నిర్మాణంతో తిరుమల కొండపై తాగు నీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమవుతుందని బోర్డు సభ్యులు అభిప్రాయపడ్డారు. అమరావతిలో శ్రీ వారి ఆలయ నిర్మాణ పరిధిని తగ్గిస్తూ బోర్డు నిర్ణయం తీసుకుంది. ముప్పై ఆరు కోట్లతో నిర్మాణాన్ని జరపాలని తీర్మానించింది. తిరుమలలో కాలుష్యం పెరిగి పోతుండడంతో దానిని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ బస్సులు, కార్లను ప్రవేశ పెట్టాలని నిర్ణయం తీసుకుంది. తిరుపతిలో అవిలాల చెరువు అభివృద్ధికి కేటాయించిన నిధులను బాలాజీ రిజర్వాయర్ నిర్మాణానికి మళ్లించేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. తిరుపతిలో గరుడ వారది నిర్మాణానికి నిధుల కేటాయింపుపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. టీటీడీలో పని చేస్తున్న కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి సబ్ కమిటీని ఏర్పాటు చేయనుంది. భక్తుల సౌకర్యానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించామన్నారు టిటిడి ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డి. పెండింగ్ లో ఉన్న అన్ని సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు.  టీటీడీ బోర్డు సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం ముగిసింది. బోర్డు సభ్యుడిగా మైహోమ్ గ్రూప్స్ అధినేత జూపల్లి రామేశ్వర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ బోర్డులో తనకు స్థానం కల్పించినందుకు జూపల్లి రామేశ్వరరావు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చినజీయర్ అనుగ్రహంతోనే తను టీటీడీ సభ్యుడను అయ్యారని చెప్పారు. సామాన్య భక్తులకు సేవ చేసేందుకు కావలసిన శక్తిని ప్రసాదించాలని ఆయన శ్రీవారిని వేడుకున్నారు.

Polavaram Reverse Tendering is a Big Failure

పోలవరం ప్రాజెక్టుపై పెట్టిన రివర్స్ టెండరింగ్ రివర్స్ అవనుందా..?

పోలవరం ప్రాజెక్టుపై జగన్ ప్రభుత్వం తల పెట్టిన టెండర్లు రివర్స్ కొట్టే అవకాశముందని జల వనరుల నిపుణులు అంటున్నారు. పోలవరం సాగునీటి ప్రాజెక్టు హెడ్ వర్క్స్ లోని మిగిలిన కాంక్రీటు పనులు, జలవిద్యుత్ కేంద్రం నిర్మాణానికి ఒక ప్యాకేజి కింద 4987.55 కోట్లతో పిలిచిన రివర్స్ టెండర్లకు ఒకటే టెండరు రావడం దీనికి తార్కాణం అని చెబుతున్నారు. సాగునీటి ప్రాజెక్టు లోని అరవై ఐదు ప్యాకేజీ పనులకు పిలిచిన రివర్స్ టెండర్లను ఆరు సంస్థలు పాల్గొని బిడ్ లు దాఖలు చేయటం, 15.6 శాతం తక్కువకు టెండర్ వేయటంతో రివర్స్ టెండరింగ్ విజయవంతమైందని మంత్రులు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు ప్రకటనలు గుప్పించారు. దేశంలోనే తొలి సారిగా ఈ విధానానికి వెళ్లే యాభై ఎనిమిది కోట్లు ఆదా చేస్తామన్నారు. కానీ ఆ సంతోషం ఇరవై నాలుగు గంటలు గడవక ముందే ఆవిరైంది. పోలవరంలో రెండు పనులకు కలిపి పిలిచిన రివర్స్ టెండర్లలో ఒకే ఒక్క బిడ్ దాఖలైంది. మెఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ ఫ్రా లిమిటెడ్ ఒకటే బిడ్ వేసింది. జలవనరుల శాఖ ఇచ్చిన జీవో 67 ప్రకారం రివర్స్ టెండరింగ్ లో కనీసం రెండు సంస్థలైనా పాల్గొనాలి, కాని ఒక్క సంస్థే టెండర్ వేయడంతో ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఆ శాఖ మల్లగుల్లాలు పడుతోంది. పోలవరం కాంక్రీట్, జల విద్యుత్ కేంద్రం పటంలో ఒకే ప్యాకేజీగా గత నెల పదిహేడవ తేదిన రివర్స్ టెండర్ విధానంలో జల వనరుల శాఖ టెండర్లను ఆహ్వానించింది. దానికి ముందు రోజే రివర్స్ టెండరింగ్ లో అనుసరించాల్సిన మార్గ దర్శకాలను వివరిస్తూ ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాధ్ దాస్ జీవో 67 జారీ చేశారు, ఇప్పుడు ఆ మార్గదర్శకాలే ప్రతిబంధకంగా మారాయి. ఈ ఉత్తర్వును గత ప్రభుత్వం విడుదల చేసుంటే అందులోని లోపాలు సరిచేసేందుకే రివర్స్ బిడ్డింగ్ లో ముందుకు వెళుతున్నామని జగన్ సర్కార్ చెప్పేది. కానీ, గత నెల పదహారున తానిచ్చిన ఉత్తర్వు తాజాగా ప్రధాన సమస్యగా మారింది. అందులో పేర్కొన్న ప్రకారం రివర్స్ టెండర్ కు వెళ్లాలంటే ఖచ్చితంగా రెండు సంస్థలైనా బిడ్ లు దాఖలు చేయాలి అలాగైతేనే ఒక సంస్థ ఎల్ వన్ గా నిలిస్తే మరో సంస్థతో సంప్రదింపులకు వీలుంటుందని ఉత్తర్వు స్పష్టం చేస్తోంది. పోనీ దీన్ని రివర్స్ టెండర్ అని కాకుండా రీటెండర్ గా భావిద్దాం అన్న నిబంధనలు అంగీకరించవని నిపుణులు కూడా చెబుతున్నారు. జల విద్యుత్ కేంద్ర పనుల నుంచి తమను తప్పించడాన్ని వ్యతిరేకిస్తూ నవయుగ సంస్థ హైకోర్టులో గతంలోనే వ్యాజ్యం వేసింది. ఏపీజెన్కో తీసుకున్న ప్రీ క్లోజరు నిర్ణయంపై కోర్టు స్టే విధించింది. స్టేను ఎత్తి వేయాలని జెన్ కో వేసిన పిటిషన్ పై సోమవారం న్యాయస్థానంలో విచారణ జరగనుంది. మరోవైపు సోమవారం ఉదయం పదకొండు గంటలకు రివర్స్ టెండర్ లో ఫైనాన్షియల్ బిడ్ ను జల వనరుల శాఖ తెరవనుంది.

cm kcr new strategy for huzurnagar by election

ఉత్తమ్ కంచుకోటలో ఈసారి గులాబీ జెండా ఎగురుతుందా? కేసీఆర్ వ్యూహం అదేనా?

  పీసీసీ చీఫ్, నల్గొండ ఎంపీ ఉత్తమ్ కంచుకోట హుజుర్ నగర్ ఉపఎన్నిక టీఆర్ఎస్ కు అగ్నిపరీక్షగా మారింది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లోనే ఎలాగైనా ఉత్తమ్ కు చెక్ పెట్టాలని గులాబీ బాస్ తీవ్రంగా ప్రయత్నించినా, టీఆర్ఎస్ వ్యూహం బెడిసికొట్టింది. 2009నుంచి హూజుర్ నగర్ నుంచి చేజిక్కించుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నిస్తోంది. 2009లో ప్రస్తుత మంత్రి జగదీశ్ రెడ్డి... టీఆర్ఎస్ నుంచి పోటీకి దిగి ఓటమిపాలయ్యారు. ఇక 2014లో అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మకు టికెట్ ఇచ్చినా, ఆమె కూడా ఉత్తమ్ పై గెలవలేకపోయింది. దాంతో 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జగదీశ్ రెడ్డి వర్గీయుడు సైదిరెడ్డిని బరిలోకి దింపారు. అయితే, సైదిరెడ్డి గట్టిపోటీ ఇచ్చినప్పటికీ, చివరికి ఉత్తమ్ చేతిలో పరాజయం పాలవ్వక తప్పలేదు. వరుసగా మూడోసారి టీఆర్ఎస్ కు భంగపాటు కలిగినా, సైదిరెడ్డి... గట్టిపోటీనివ్వడంతో... మళ్లీ అతనికే టికెట్ ఇచ్చి, బరిలోకి దింపింది గులాబీ పార్టీ. అయితే, మొన్నటి ఎన్నికల్లో ఆలస్యంగా అభ్యర్ధిని ప్రకటించడంతోనే నష్టం జరిగిందని గుర్తించిన టీఆర్ఎస్ అధిష్టానం.... ఈసారి ముందుజాగ్రత్తపడింది. నోటిఫికేషన్ రాకముందే అభ్యర్ధిని ప్రకటించి కదనరంగంలోకి దింపింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ మొత్తం దాదాపు క్లీన్ స్వీప్ చేసిన గులాబీ పార్టీ.... రెండు నెలలకే జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం నల్గొండ ఎంపీ స్థానాన్ని కోల్పోయింది. హుజూర్ నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి... నల్గొండ బరిలో నిలిచి సూపర్ విక్టరీ కొట్టారు. అయితే, నల్గొండ ఎంపీ సీటును కోల్పోయి పరాభవంలో ఉన్న టీఆర్ఎస్.... ఎలాగైనాసరే హుజుర్ నగర్ ఉపఎన్నికలో గెలిచి తీరాలని కంకణం కట్టుకుంది. అందుకోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది. మంత్రులు, ఎమ్మెల్యేలను... గ్రామ-మండల ఇన్ ఛార్జులుగా నియమించి విజయానికి వ్యూహం పన్నింది. అయితే, ఈసారి హుజూర్ నగర్ నుంచి ఉత్తమ్ భార్య పద్మావతి బరిలో దిగుతుండగా, బీజేపీ నుంచి అమరవీరుడు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ రంగంలోకి దింపనున్నట్లు తెలుస్తోంది. ఇక, టీడీపీ కూడా తన అభ్యర్ధిని పోటీకి దింపే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఎంతమంది పోటీలో ఉన్నా, ఈసారి మాత్రం హుజూర్ నగర్ లో ఎగిరేది గులాబీ జెండానే అంటున్నారు టీఆర్ఎస్ నేతలు. దాంతో, హుజూర్ నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది.

Revanth Reddy may quit Congress

కాంగ్రెస్ తో కష్టం.. బీజేపీలోకి రేవంత్ రెడ్డి!!

  పరిస్థితిని బట్టి పద్దతి మార్చుకోవాలని మన పెద్దలు చెప్తుంటారు. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం.. అబ్బే పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నా మా తీరు మార్చుకునేది లేదని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి అంత గొప్పగా ఏం లేదు. తెలంగాణ ఇచ్చిన పార్టీగా 2014 ఎన్నికల్లో దూసుకెళ్తుంది అనుకుంటే టీఆర్ఎస్ దూకుడు ముందు కాంగ్రెస్ నిలబడలేకపోయింది. పోనీ 2018 ఎన్నికల్లో అయినా మిగతా పార్టీల మద్దతుతో సత్తా చాటుతుంది అనుకుంటే.. మహాకూటమి రూపంలో మునిగిపోయింది. దానికి తోడు గెలిచిన ఎమ్మెల్యేలు కూడా దాదాపు పార్టీని వీడారు. మొత్తానికి కాంగ్రెస్ పరిస్థితి దారుణంగా ఉంది. మరి ఇలాంటి సమయంలో నేతలంతా కలిసి పార్టీని పుంజుకునేలా చేయాలి. కానీ తెలంగాణ కాంగ్రెస్ నేతలు మాత్రం బహిరంగంగా విమర్శలు చేసుకుంటూ.. పార్టీ పరిస్థితిని మరింత దిగజారుస్తున్నారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి వర్సెస్ సీనియర్ నేతల పోరు తెలంగాణ కాంగ్రెస్ కు పెద్ద తలనొప్పిలా మారింది. కాంగ్రెస్ లో గ్రూప్ రాజకీయాలు కొత్తేమి కాదు. దశాబ్దాలుగా ఆ ఆనవాయితీ కొనసాగుతూనే ఉంది. తెలంగాణ కాంగ్రెస్ లో పీసీసీ కుర్చీ కోసం వర్గ పోరు ఎప్పటి నుంచో కొనసాగుతూనే ఉంది. ఉత్తమ్ ని పీసీసీ చీఫ్ గా తప్పించి.. తమకి అవకాశం ఇవ్వాలని పలువురు సీనియర్లు డిమాండ్ చేసారు. ముఖ్యంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి వారు ఉత్తమ్ ని వ్యతిరేకిస్తూ బహిరంగంగానే విమర్శలు చేసారు. కోమటిరెడ్డి మాత్రమే కాదు.. పలువురు సీనియర్లు పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ ని వ్యతిరేకించారు. పీసీసీ కుర్చీపై కన్నేశారు. కానీ ఇప్పుడు ఉన్నట్టుండి ఆ సీనియర్ నేతలంతా కలిసిపోయారు. వారి కలయికకు కారణం రేవంత్ రెడ్డి అనే చెప్పాలి. రేవంత్ కి టీడీపీలో ఉన్న సమయంలోనే మాస్ లీడర్ గా మంచి గుర్తింపు ఉంది. కాంగ్రెస్ లో చేరాక కూడా ఆ క్రేజ్ అలాగే కొనసాగింది. అయితే రేవంత్ తో ఇన్నాళ్లు సీనియర్లకు అంతగా ప్రాబ్లమ్ రాలేదు. కానీ ఇటీవల రేవంత్.. కుటుంబ సమేతంగా వెళ్లి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిశారు. దీంతో పీసీసీ చీఫ్ గా త్వరలోనే రేవంత్ బాధ్యతలు చేపట్టనున్నారు అంటూ ప్రచారం మొదలైంది. దాంతోపాటే సీనియర్ నేతల్లో గుబులు మొదలైంది. ఇన్నాళ్లు మనలో మనం పోటీ పడ్డాం, ఇప్పుడు కొత్తగా వచ్చిన రేవంత్ కి ఇస్తానంటే ఎలా ఊరుకుంటాం అనుకున్నారేమో.. అందరూ ఏకమయ్యారు. రేవంత్ ని టార్గెట్ చేస్తున్నారు. దానికి తగ్గట్టే రేవంత్ తన వ్యాఖ్యలతో సీనియర్లకు అవకాశం ఇస్తున్నారు. హుజుర్ నగర్ ఉప ఎన్నిక అభ్యర్థి, యురేనియం అంశాలలో.. రేవంత్ చేసిన వ్యాఖ్యలతో సీనియర్లంతా ఏకమై రేవంత్ ని కార్నర్ చేస్తున్నారు. మరోవైపు కోమటిరెడ్డి, విహెచ్, సంపత్ వంటి వారు పీసీసీ చీఫ్ గా తామే కరెక్ట్ అని చెప్పుకుంటున్నారు. ఓ రకంగా రేవంత్ పేరుకి కాంగ్రెస్ లో ఉన్నా ఒంటరిగానే ఉన్నారని చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఆయన కాంగ్రెస్ లో కొనసాగుతారా అన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. సీనియర్లంతా ఏకమవ్వడం, రేవంత్ ఒంటరవ్వడంతో అధిష్టానం కూడా ఏం చేయలేని పరిస్థితి. ఒక్కడి కోసం అందర్నీ వదులుకోలేదు, అలా అని రేవంత్ ని కూడా వదులుకోవడానికి ఇష్టపడకపోవొచ్చు. మరి అధిష్టానం అందరికి సర్ది చెప్పి గొడవ సద్దు మణిగేలా చేస్తుందో లేక ఇలాగే మౌనంగా ఉండి పార్టీకి నష్టం చేసుకుంటుందో చూడాలి. ఏది ఏమైనా పరిస్థితి ఇలాగే కొనసాగితే రేవంత్ బీజేపీ వైపు చూసే అవకాశముందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కొంతకాలంగా బీజేపీ తెలంగాణలో బలపడే దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అన్నట్టుగా దూసుకెళ్తోంది. ఇలాంటి సమయంలో రేవంత్ లాంటి నేతను కళ్ళకద్దుకొని తీసుకునే అవకాశం ఉంది. మరి రేవంత్ కాంగ్రెస్ లో వర్గ పోరు పడలేక బీజేపీలోకి చేరి తన సత్తా చూపుతారేమో చూడాలి.

truth behind kodela assembly furniture issue

కోడెలను కాపాడుకోలేకపోయిన టీడీపీ.. నెక్స్ట్ స్టెప్ ఏంటి?

  భవనం నిర్మించాలంటే నెలల సమయం పడుతుంది. కానీ కూల్చివేయాలంటే నిమిషాలు చాలు. అలాగే మనిషి మంచి పేరు సంపాదించాలంటే ఎన్నో ఏళ్లు పడుతుంది. కానీ ఆ పేరు పోవాలంటే కొన్ని క్షణాలు చాలు. తెలిసో తెలియకో కోడెల శివ ప్రసాద్ విషయంలో కూడా అలాగే జరిగింది. వైద్యుడిగా, రాజకీయ నాయకుడిగా ఎన్నో ఏళ్లు సేవ చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఆయన.. కొంతకాలంగా ఆరోపణలు, అవమానాలు చుట్టుముట్టడంతో.. తీవ్ర మనస్తాపానికి గురై.. ఆత్మహత్య చేసుకొని మరణించారు. 2019 ఎన్నికల్లో ఆయన ఓడిపోవడం, టీడీపీ ప్రతిపక్షానికి పరిమితం కావడంతో.. కోడెలకు కష్టాలు మొదలయ్యాయి. అధికార పార్టీ వైసీపీ కోడెలను బాగా టార్గెట్ చేసింది. ముఖ్యంగా అసెంబ్లీ ఫర్నీచర్ అంశాన్ని బాగా హైలైట్ చేసి కోడెల ప్రతిష్టను మసకబారేలా చేసింది. నిజంగా తప్పు చేసుంటే ఎంతవారినైనా శిక్షించాల్సిందే. కానీ కోడెల చేయని తప్పుకి ఎక్కువ అవమానాలు ఎదుర్కొన్నారని చెప్పక తప్పదు. ప్రభుత్వం ఇచ్చిన క్వార్టర్స్ లో ఉండి, పదవీకాలం ముగిసి ఖాళీ చేసేటప్పుడు.. ఫర్నీచర్ అప్పజెప్పడం, పాడైన వాటికి ఖరీదు చెల్లించడం ఆనాయితీ. అసలు సరిగా అప్పజెప్పకపోవడం కూడా ఆనాయితీనే. అంతెందుకు కొత్త మంత్రులు, గవర్నర్లు, కొత్త సీఎంలు వచ్జ్చినప్పుడు కొత్త ఫర్నీచర్, ఇతర సామాగ్రి కొనడం.. పాతవి పక్కనెయ్యడం లేదా సిబ్బంది ఇళ్ళకు తరలిపోవడం కూడా ఆనవాయితీనే. కానీ కోడెల విషయంలో ఈ ఆనవాయితేనే అవినీతి అన్నారు. అసెంబ్లీ, స్పీకర్ కార్యాలయం హైద్రాబాద్ నుండి అమరావతికి వచ్చినప్పుడు.. కొత్త భవనాలు ఫర్నీచర్ తో సహా అమర్చి ఇవ్వడంతో.. పాత ఫర్నీచర్ ను ఆయన తన క్యాంప్ ఆఫీసుల్లో అధికారులకు చెప్పి ఏర్పాటు చేసుకున్నారు. నిజానికి అదేం కోట్ల విలువైన సొత్తు కాదు. రెండు మూడు లక్షల విలువైన పాత ఫర్నీచర్ మాత్రమే. అది కూడా కోడెల అప్పనంగా కొట్టేయాలి అనుకోలేదు. ఎందరో నాయకులు కోట్లు దోచుకున్నారు. కానీ కోడెల మాత్రం.. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ఆ ఫర్నీచర్ తీసుకెళ్లండని బాధ్యతగా లేఖ రాసారు. కొత్త స్పీకర్ జూన్ 12 లేదా 13 న ఛార్జ్ తీసుకొని ఉండొచ్చు. కానీ జూన్ 7 నే కోడెల పాత సామాగ్రి అప్పగిస్తాను లేదా వెల కట్టండి డబ్బులు చెల్లిస్తాను అని లేఖ రాసారు. కానీ అధికారుల నుంచి సమాధానం లేదు. దీంతో కోడెల మళ్ళీ ఆగస్ట్ 20 న మొదటి లేఖను ప్రస్తావిస్తూ మరో లేఖ రాసారు. అయినా సమాధానం లేదు. నిజానికి ఆ లేఖలకు స్పందించి ఫర్నీచర్ ని పట్టుకొని పోవచ్చు. కానీ ఉద్దేశ్య పూర్వకంగా రాద్దాంతం చేసి, కక్ష సాధింపు తరహాలో ఆగష్టు 24న కేసులు పెట్టి ఆయన్ని అవమానించారు. మరోవైపు అధికార పార్టీ నేతలు ఆయన మీద తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా అంబటి రాంబాబు, విజయసాయి రెడ్డి వంటి వారు కోడెలపై దొంగ అనే ముద్ర వేశారు. విజయ సాయి రెడ్డి అయితే కోడెల దూడలు అంటూ వెటకారాలు చేస్తూ ట్విట్టర్ వేదికగా పదేపదే విమర్శలు గుప్పించారు. ఇలాంటి విమర్శలు కోడెలను బాగా కృంగదీశాయి. అసలు నా తప్పులేదు, నేను ముందే లేఖలు రాసాను.. కక్ష సాధింపుతో నా మీద నిందలు వేస్తున్నారని.. కోడెల పదేపదే ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన అవివివేకం కానీ.. ఈ సోషల్ మీడియాలో యుగంలో ఆయన ఆవేదన ఎవరికి పడుతుంది?. 'ఫర్నీచర్ కోసం కోడెల కక్కుర్తి' అంటూ అటు మీడియా, సోషల్ మీడియాలో పదేపదే వార్తలు రావడంతో.. దానిలోని నిజానిజాలు తెలుసుకోకుండా అందరూ ఆయన మీద విమర్శలు గుప్పించారు. వీటిని కోడెల డిఫెండ్ చేసుకోలేకపోయారు. మరోవైపు పార్టీ నుండి కూడా ఆయనకు మద్దతు కరువైంది. ఆయనకు మద్దతిస్తే ఎక్కడ తమ మీద విమర్శలు వస్తాయనుకున్నారో ఏమో.. టీడీపీ నేతలు ఎవరూ మీడియా ముందుకొచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, కోడెలకు మద్దతుగా మాట్లాడలేదు. ఒకవైపు అధికార పార్టీ నేతల విమర్శలు, వేధింపులు ఎక్కువవ్వడం.. మరోవైపు సొంత పార్టీ నేతల నుంచి మద్దతు కరువవ్వడంతో కోడెల మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారు. తరువాత టీడీపీ నేతలకు వైసీపీ ప్రభుత్వం మీద ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ప్రభుత్వ వేధింపుల వల్లే ఆయన మరణించారని టీడీపీ నేతలు జగన్ సర్కార్ మీద మండిపడ్డారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా జగన్ సర్కార్ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్న చిన్న కేసులు అడ్డుపెట్టుకొని కోడెలను తీవ్రంగా వేధించారని మండిపడ్డారు. ఇలాంటి మద్దతే కోడెల కోరుకున్నారు. కానీ పాపం ఆయన మరణించాక లభించింది. ఏమీలేని అంశంలో ఆయనను అంతలా ఇబ్బంది పెడుతుంటే.. ఒక్కడే ఎలా ఎదుర్కోవాలో తెలియక కోడెల మరణానికి తలవంచారు. కోడెల విషయంలో టీడీపీ నేతలు చేసిన తప్పు.. మిగతా నేతల విషయంలో చేయవద్దని కార్యకర్తలు కోరుకుంటున్నారు. మిగతా నాయకులు కూడా ఇలా వేధింపులకు గురైతే.. ముందే వారికి అండగా నిలబడి, వారికి రక్షించుకోవాలని సూచిస్తున్నారు. మరి టీడీపీ నాయకులు, అధినాయకత్వం.. కోడెలలాంటి పరిస్థితి ఎవరికైనా ఎదురైతే వారికి అండగా ఉండి వారిని కాపాడుకునే ప్రయత్నం చేస్తారేమో చూడాలి. అంతేకాదు.. కోడెల మరణంతో టీడీపీకి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. వైసీపీ మీద విరుచుకుపడింది. కేంద్రానికి, గవర్నర్ కి ఫిర్యాదు చేసింది. సీబీఐ ఎంక్వయిరీ కోరుతోంది. మరి ఈ పోరాటం టీడీపీ ఇలానే కొనసాగిస్తుందా?. అసలు కోడెల విషయంలో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతుందో చూడాలి. మొత్తానికి ఎలాంటి స్టెప్ తీసుకున్నా.. కార్యకర్తలు మాత్రం వేధింపులకు గురవుతున్న నాయకులను కాపాడుకోవాల్సిన బాధ్యత అధిష్టానం మీదే ఉందని అంటున్నారు.

controversy over new ttd trust board

టీటీడీ బోర్డులో ఎస్సీ ఎస్టీల కోటా ఎక్కడ? జగన్ వి ఉత్తి మాటలేనా?

  తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలిపై వివాదం రాజుకుంటోంది. సుమారు వందేళ్ల టీటీడీ చరిత్రలో ఎన్నడూలేనివిధంగా 29మందితో జంబో బోర్డును నియమించిన జగన్ ప్రభుత్వం... ఇప్పుడు మరో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. ఇప్పుడున్న 29మందికి అదనంగా మరో ఏడుగురికి టీటీడీ బోర్డులో చోటు కల్పిస్తూ జీవో జారీ చేసింది. ఇప్పటికే టీటీడీ బోర్డులో సభ్యులు ఎక్కువయ్యారని, తిరుమల తిరుపతి దేవస్థానాన్ని రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చేశారంటూ విమర్శలు చెలరేగుతుండగా, ఇఫ్పుడు అదనంగా మరో ఏడుగురికి చోటు కల్పించడంపై ఆధ్యాత్మికవేత్తలు, భక్తులు మండిపడుతున్నారు. 29మందితో జంబో బోర్డు ఏర్పాటుచేసిన జగన్ ప్రభుత్వం.... తాజాగా భూమన కరుణాకర్ రెడ్డి, రాకేష్‌సింహా, శేఖర్‌, కుపేందర్‌రెడ్డి, గోవింద హరి, దుష్మంత్ కుమార్‌, అమోల్ కాలేను ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రకటిస్తూ జీవో ఇచ్చింది. మిగతా సభ్యుల్లాగే వీళ్లకూ టీటీడీ ప్రోటోకాల్ వర్తిస్తుందని ప్రకటించింది. అయితే, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డికి చోటు కల్పించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. నోట్ల రద్దు సమయంలో శేఖర్ రెడ్డి నివాసం నుంచి వందల కోట్ల రూపాయల నోట్ల కట్టలను స్వాధీనం చేసుకోవడం అప్పట్లో పెనుసంచలనమైంది. అప్పుడు శేఖర్ రెడ్డి టీటీడీ పాలక మండలి సభ్యుడిగా ఉండటంతో అప్పటి ప్రభుత్వం అతడిని బోర్డు నుంచి తొలగించింది. అంతేకాదు శేఖర్ రెడ్డిని తొలగించాలంటూ అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ కూడా డిమాండ్ చేసింది. అయితే, అదే శేఖర్ రెడ్డికి ఇఫ్పుడు టీటీడీ బోర్డులో వైసీపీ సర్కార్ చోటు కల్పించడం ఆశ్చర్యంగా మారింది. ఇక, టీటీడీలో మితిమీరిన రాజకీయ జోక్యం పెరుగుతోందన్న విమర్శలు రేగుతున్నాయి. అసలే 29మందితో జంబో టీమ్ ప్రకటించిన జగన్ ప్రభుత్వం.... అది చాలదన్నట్లు ప్రత్యేక ఆహ్వానితుల పేరుతో బోర్డులో మరికొందరికి చోటు కల్పించడంపై భక్తుల్లో ఆగ్రహం పెరుగుతోంది. ఈసారి ప్రకటించిన పాలక మండలిలో రాష్ట్రేతరులకే పెద్ద పీట వేశారు. అలాగే అన్ని దేవాలయాల్లో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామన్న జగన్.... తిరుమల తిరుపతి దేవస్థానంలో మాత్రం ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నిస్తున్నారు.

reasons behind kodela siva prasad rao suicide

ఆత్మహత్యకు ఒక్కరోజు ముందు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టుంటే కోడెల బతికేవారా? 

  కోడెల గురించి తెలిసినవాళ్లు... ఆయనది చాలా సున్నిత మనస్తత్వం అంటారు. రూపాయి డాక్టర్ గా పేదల ప్రజలకు సేవలందించిన కోడెల ...రాజకీయాల్లోకి వచ్చాకే రాటుదేలారని చెబుతారు. స్వయంగా ఎన్టీఆర్ కోరడంతో చిన్న వయసులోనే రాజకీయాల్లో వచ్చిన కోడెల... అప్పటికే పల్నాడులో తిరుగులేని ఆధిపత్యం చెలాయిస్తోన్న కాసు కుటుంబానికి ఎదురెళ్లి నర్సరావుపేట నుంచి ఎమ్మెల్యేగా ఘనవిజయం సాధించారు. అయితే, 1983లో కోడెల ఎమ్మెల్యేగా గెలిచాక, కాసు కుటుంబం దాడికి ప్రయత్నించింది. దాంతో కోడెలకు ప్రజలే అండగా నిలబడ్డారు. కోడెలను వాటర్ ట్యాంక్ లో పెట్టి, ఆయనకు రక్షణగా నిలిచారు. ఆ సంఘటనే కోడెలలో పట్టుదల రగిల్చింది. దాంతో ప్రజల అండదండలతో పల్నాడులో పట్టుసాధించిన కోడెల... తర్వాతి కాలంలో రాజకీయంగా రాటుదేలారు. కాసు కుటుంబం అరాచకాలకు ఎదురెళ్లి ప్రజలకు రక్షణగా నిలబడ్డారు. ఆ తెగువే కోడెలను అతికొద్దికాలంలోనే ప్రజానాయకుడిగా చేసింది. దాంతో ఒక్క పల్నాడులోనే కాదు... మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే కోడెల పేరు మోరుమోగిపోయింది. తన వ్యక్తిత్వంతో తలదించని నేతగా ఎదిగారు. పల్నాడు పులిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశంలో ఫైర్‌బ్రాండ్‌గా మారారు. అలాంటి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నారు ఆయన గురించి తెలిసినవాళ్లు.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో హోంమంత్రిగా పనిచేసిన కోడెలకు రాజకీయ వేధింపులు, కక్ష సాధింపు చర్యలు, కేసుల గురించి తెలియకుండా ఉండదు. రాజకీయాల్లో ఇది సహజమే అయినా, జగన్ ప్రభుత్వం మాత్రం... ఎన్నో అడుగులు ముందుకేసి కోడెలకు ఊపిరిసలపనీయకుండా చేసింది. కేసు మీద కేసు పెడుతూ, 3నెలల కాలంలోనే కుటుంబం మొత్తంపై దాదాపు 30 కేసులను పెట్టించి వేధించింది. దాంతో కోడెల కుమిలిపోయారు. మానసికంగా కుంగిపోయారు. 70ఏళ్ల పైబడిన వయసులో ధైర్యం సడలింది. మానసిక-ఆత్మస్థైర్యం దెబ్బతింది. ఆ సమయంలో పార్టీ అండ కోసం కోడెల ఎదురుచూశారు. కానీ అసెంబ్లీ ఫర్నిచర్ దొంగతనం అభియోగాల నేపథ్యంలో... కోడెలకు అండగా నిలిచేందుకు చంద్రబాబు వెనుకంజ వేశారు. కోడెలపై ఎంతో అభిమానమున్నా, అత్యంత సన్నిహితుడైనా, వెనకేసుకొస్తే ఎక్కడ పార్టీకి చెడ్డపేరు వస్తుందోనని బాబు భయపడ్డారు. కోడెలపై, కోడెల కుటుంబంపై జగన్ సర్కార్ ... వరుస కేసులు పెడుతుంటే చంద్రబాబు ఒక్క మాట కూడా మాట్లాడలేదు... పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇవ్వలేదు... కనీసం కోడెలను పరామర్శంచలేదు... ఇదే కోడెలను మరింత కుంగదీసింది. ఒకవైపు జగన్ ప్రభుత్వ వేధింపులు.... మరోవైపు బాబు నుంచి అండ లేకపోవడంతో మానసికంగా కుంగిపోయిన కోడెల... ఎటూపాలుపోక విధిలేని పరిస్థితుల్లోనే ఆత్మహత్యకు ఒడిగట్టారని అంటున్నారు. కోడెల ఆత్మహత్య తర్వాత చంద్రబాబు .... జగన్ ప్రభుత్వంపై ఒక్కసారిగా విరుచుకుపడ్డారు. కోడెల మరణాన్ని తలచుకుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి గుంటూరు వరకు కోడెల భౌతికకాయం వెంటే చంద్రబాబు కూడా వచ్చారు. అయితే, ఇదంతా కోడెల బతికుండగా, ఆయనకు అండగా నిలిచి ఉంటే కోడెల బతికుండేవారని అనుకుంటున్నారు. కనీసం కోడెలను జగన్ ప్రభుత్వం వేధిస్తోందంటూ నిన్న పెట్టినట్లు ...కనీసం మూడ్రోజులు ముందు చంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టుంటే ఆయన బతికేవారని, ఆత్మహత్య నిర్ణయం తీసుకుని ఉండేవారు కాదని అంటున్నారు.

congress leader sampath kumar fires on revanth reddy

తెలంగాణ కాంగ్రెస్ లో పవన్ చిచ్చు.. రేవంత్ ని టార్గెట్ చేశారు!!

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెట్టినట్లు తెలుస్తోంది. యూరేనియం తవ్వకాలకు వ్యతిరేకంగా ఆయన ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ ముఖ్యనేతలు వెళ్లడం.. కొంత మంది కాంగ్రెస్ నేతలకు నచ్చలేదు. ఈ విషయాన్ని హైలెట్ చేస్తూ.. పవన్ సమావేశానికి వెళ్లిన రేవంత్ రెడ్డి సహా పార్టీ నేతల్ని టార్గెట్ చేస్తూ.. హైకమాండ్ కు ఫిర్యాదుల పరంపర ప్రారంభమైంది. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ కుంతియా సమక్షంలో.. దీనిపై పెద్ద రచ్చే జరిగింది. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్.. రేవంత్ రెడ్డిపై విమర్శలకు..ఈ అఖిలపక్ష సమావేశాన్ని ఉపయోగించుకున్నట్లుగా తెలుస్తోంది. యురేనియం అంశాన్ని తెర మీదకు తెచ్చింది కాంగ్రెస్ అని, పవన్ కు సంబంధం ఏంటని సంపత్ ప్రశ్నించారు. కాంగ్రెస్ లాంటి జాతీయ పార్టీ వెళ్లి జనసేన ఫ్లాగ్ కింద కూర్చోవడం ద్వారా.. ఎలాంటి సంకేతాలు పంపించాలని అనుకుంటున్నారంటూ నేతలను నిలదీశారు. మన పార్టీ పిలిచినప్పుడు పవన్ రాలేదని గుర్తు చేశారు. సీనియర్ నేతలంతా వెళ్లి పవన్ దగ్గర కూర్చోవడం ఏంటని సంపత్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. సంపత్ అభిప్రాయంతో కుంతియా కూడా ఏకీభవించడంతో.. జనసేన అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పేనని సీనియర్ నేతలు అంగీకరించినట్టు తెలుస్తోంది. మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ హామీ ఇచ్చేశారు. కొన్ని అంశాలలో విపక్షాలు కలిసి పోరాడటం సహజం. ముఖ్యంగా ప్రస్తుత పరిస్థితుల్లో అందర్నీ కలుపుకొని పోవడం కాంగ్రెస్ కి అవసరం. కానీ కొందరు నేతలు మాత్రం పవన్ సమావేశానికి వెళ్లిన నేతలను తప్పుపడుతున్నారు. అయితే దీని వెనుక మరో కారణం ఉందని తెలుస్తోంది. టీపీసీసీ చీఫ్ రేసులో రేవంత్ రెడ్డి ముందున్నారని ప్రచారం జరుగుతోంది. హైకమాండ్ కూడా రేవంత్ కి తెలంగాణలో పార్టీ పగ్గాలు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో రేవంత్ రెడ్డిని కట్టడి చేసేందుకు కొందరు కాంగ్రెస్ సీనియర్ నేతలు.. ఆయన పార్టీని చిన్న బుచ్చుతున్నారన్న ప్రచారం నిర్వహించి.. అఖిలపక్ష సమావేశానికి వెళ్లడం తప్పన్నట్లుగా మాట్లాడారని తెలుస్తోంది.

TRS to contest Assembly polls in Maharashtra

జాతీయ పార్టీగా టీఆర్ఎస్.! ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో పోటీకి సన్నాహాలు.!

  నేషనల్ ఫ్రంట్ తో కేంద్రంలోనూ చక్రం తిప్పుతామంటూ సార్వత్రిక ఎన్నికలకు ముందు హడావిడి చేసిన గులాబీ బాస్ కేసీఆర్.... టీఆర్ఎస్ కు జాతీయ పార్టీ గుర్తింపు తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలతో దేశానికే ఆదర్శంగా నిలుస్తూ, పలు రాష్ట్రాల ప్రజల సైతం ఆకట్టుకున్న కేసీఆర్... తన పథకాలకు లభిస్తోన్న ఆదరణ, గుర్తింపుతో, రెండు మూడు రాష్ట్రాలకు పార్టీని విస్తరించాలని వ్యూహరచన చేస్తున్నారట. ముఖ్యంగా తనకు ఎక్కువగా గుర్తింపు ఉన్న... ఆంధ్రప్రదేశ్, అలాగే కర్నాటక, మహారాష్ట్రల్లో పోటీకి కేసీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఎలాగూ కేసీఆర్ ఎవరో తెలుసు... టీఆర్ఎస్ గురించి... కేసీఆర్ పరిపాలన గురించి తెలుసు. అయితే, కర్నాటక, మహారాష్ట్ర వాసులకు ఎలా తెలుస్తుందనుకుంటున్నారా? ఇక్కడే కేసీఆర్ తెలివిగా, పావులు కదుపుతున్నారు. కర్నాటక, మహారాష్ట్రల్లో తెలుగువాళ్లు ఉండే ప్రాంతాల్లో పోటీకి ప్లాన్ చేస్తున్నారు. ముఖ్యంగా కర్నాటకలోని బళ్లారి, మహారాష్ట్రలోని నాందేడ్ లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఎందుకంటే, నిజాం హయాంలో ఈ రెండు ప్రాంతాలూ తెలంగాణలోనే ఉండటమే కాకుండా, ఇఫ్పటికీ అక్కడ అధిక సంఖ్యలో తెలుగు ప్రజలు ఉండటంతో, వాటిని ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కేసీఆర్ ను కలిసిన పలువురు మహారాష్ట్ర నేతలు... తెలంగాణలో అమలవుతోన్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని, మహారాష్ట్ర ప్రజలను కూడా ఆకట్టుకుంటున్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు మహారాష్ట్రలోనూ టీఆర్ఎస్ పోటీచేస్తే మంచి ఆదరణ లభిస్తుందని వివరించారు. దాంతో మహారాష్ట్ర స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీచేయడానికి కేసీఆర్ సూత్రప్రాయంగా అంగీకరించారని చెబుతున్నారు. ముఖ్యంగా నాందేడ్ జిల్లాలోని దెగ్లూర్, నాయిగాం, భోకర్, హిమాయత్ నగర్, కిన్ వట్ నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పోటీకి దిగనున్నట్లు తెలుస్తోంది. అలాగే, కర్నాటక బళ్లారిలోనూ పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారట. ఇకపోతే మరో తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లోనూ బరిలోకి దిగాలని డిసైడ్ చేశారట. త్వరలో జరగనున్న ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగాలని ఆలోచిస్తున్నారట. మొత్తానికి జాతీయ హోదాపై కన్నేసిన టీఆర్ఎస్.... ఏపీ, మహారాష్ట్ర, కర్నాటకలో పోటీకి దిగబోతోంది. మరి, తెలంగాణలో తిరుగులేని పట్టుసాధించిన గులాబీ పార్టీ, పక్క రాష్ట్రాల్లో పాగా వేయాలన్న వ్యూహం ఏ మేరకు ఫలిస్తుందో... జాతీయ పార్టీగా అవతరించాలన్న కల నెరవేరుతుందో లేదో చూడాలి.

Modi expresses grief at traumatic boat capsize in Godavari

బోటు ప్రమాదంపై మోడీ ఒకలా... ఏపీ, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు మరోలా..!

  తూర్పుగోదావరి బోటు ప్రమాదంపై ప్రధాని మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఇది చాలా బాధాకరమైన దుర్ఘటన అంటూ ట్వీట్ చేశారు. అయితే, బోటు ప్రమాదంపై ఏపీ అండ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షులు లక్ష్మణ్‌, కన్నా ఘాటుగా స్పందించారు. బోటు ప్రమాదంపై పూర్తిస్థాయి విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. అనుమతి లేకుండా బోట్లు నడుపుతున్నా, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం దురదృష్ణకరమన్నారు. ఇక ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా కూడా తీవ్రంగా స్పందించారు.  గోదావరిలో తరచూ ప్రమాదాలు జరుగుతున్నా, అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, ఎవరో ఒకరి స్వలాభానికి ప్రజల ప్రాణాలు పోతూనే ఉన్నాయని మండిపడ్డారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం శాశ్వత ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు, బోటు ప్రమాదంపై అటు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి... ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్... తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ఏపీ ప్రభుత్వం 10లక్షల చొప్పున ఎక్స్‌ గ్రేషియా ప్రకటించగా, అలాగే తెలంగాణ బాధిత కుటుంబాలకు... కేసీఆర్‌ ప్రభుత్వం అదనంగా మరో 5లక్షలు పరిహారంగా అందజేయనుంది. తూర్పుగోదావరి బోటు ప్రమాదంలో ఎక్కువమంది తెలంగాణవాసులు ఉండటంతో సహాయక చర్యలపై ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరా తీశారు. మరోవైపు సీఎం కేసీఆర్ ఆదేశాలతో ఏపీ చేరుకున్న తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌... బాధితులను పరామర్శించడంతోపాటు రెస్క్యూ ఆపరేషన్స్ ‌ను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

అధికారుల అలసత్వమా? బోటు సిబ్బంది నిర్లక్ష్యమా? బోటు ప్రమాదానికి కారణమెవరు?

  బోటు ప్రమాదానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా గోదావరిలో అధిక నీటి ప్రవాహమే బోటు బోల్తాకి ప్రధాన కారణమని అంటున్నా, అధికారుల అలసత్వం, బోటు సిబ్బంది నిర్లక్ష్యమే కొంపముంచినట్లు తెలుస్తోంది. గోదావరిలో ప్రవాహం అధికంగా ఉన్న సమయంలో పాపికొండలకు బయల్దేరడం అదిపెద్ద తప్పు అయితే, ప్రయాణికులు అందరికీ లైఫ్ జాకెట్లు ఇవ్వకపోవడంతో మరో ఘోర తప్పిదంగా కనిపిస్తోంది. అలాగే అనుభవం లేని డ్రైవర్లు, బోటు సిబ్బంది కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రవాహ ఉధృతిని అంచనా వేయలేకపోవడం... మలుపు దగ్గర చాకచక్యంగా వ్యవహరించలేకపోవడంతో... సుడిగుండాలకు బోటు బోల్తా కొట్టిందని ప్రమాదం నుంచి బయటపడిన ప్రయాణికులు అంటున్నారు. అయితే, బోటు మొదటి అంతస్తులో ఉన్నవాళ్లు... రెండో అంతస్తులోకి వెళ్లడంతోనే ఈ ప్రమాదం జరిగిందనే మాట కూడా వినిపిస్తోంది. ప్రయాణికులు ఒక్కసారిగా కింది అంతస్తు నుంచి పై అంతస్తుకు వెళ్లడంతో బోటు బ్యాలెన్స్ తప్పి, బోల్తాపడిందని అంటున్నారు. ఇదిలాఉంటే, ప్రమాదానికి గురైన బోటుకు ఎలాంటి అనుమతులు లేవని అధికారుల పరిశీలనలో తేలింది. పర్యాటకశాఖ నుంచి అనుమతులు తీసుకోకుండానే, రాయల్ వశిష్ట ప్రైవేట్ బోటును నడుపుతున్నట్లు గుర్తించారు. పైగా ఐదు లక్షలు పైగా ఇన్‌ ఫ్లో ఉండగా, పాపికొండలకు బోటు బయల్దేరడం అతిపెద్ద తప్పిదంగా అధికారులు తేల్చారు.

డెత్ జర్నీలుగా మారుతోన్న జల జర్నీలు... గోదావరిలోనే ఎందుకిలా?

నీటిపై ప్రయాణమంటే చిన్న పిల్లవాడి మొదలు వృద్ధుల వరకు అందరిలోనూ ఉత్సాహం ఉరకలేస్తోంది. ఆ ఆనంద క్షణాలను మనసులో మధురమైన గుర్తులుగా మార్చుకుందామని పర్యాటకులు ఆశిస్తారు. కానీ, అలలపై ఆహ్లాదంగా సాగిపోవాల్సిన బోటు ప్రయాణాలు విషాదాంతమవుతున్నాయి. యాత్రికుల రక్షణ గాల్లో దీపంలా మారుతున్నాయి. ముఖ్యంగా పాపికొండల్లో జల విహారం ప్రాణ సంకటంగా మారుతోంది. ప్రకృతి అందాలను తనివితీర తిలకిస్తూ ఉరకలెత్తే ఉత్సాహంతో గోదావరి అలల సయ్యాటతో మునిగి తేలాలన్న సరదాల మాటున విషాదం పొంచి ఉందనే భయంకర నిజాన్ని పర్యాటకులు ఊహించలేకపోతున్నారు. దాంతో జల అందాలను ఆస్వాదిస్తూ చేసిన ప్రయాణం క్షణాల్లోనే ఆవిరైపోతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం దగ్గర జరిగిన బోటు ప్రమాదంలోనూ ఇదే జరిగింది. అప్పటివరకు గోదావరి అందాలను చూసి పర్యాటకులు పరవశించిపోయారు. పాపికొండలను చూస్తున్నామన్న ఆనందంలో కేరింతలు కొట్టారు. గోదావరి చుట్టూ అల్లుకున్న ప్రకృతి అందాలకు ఫిదా అయిపోయారు. లోకాన్ని మరిచి...పరిసరాలను మైమరిచి నదీ సోయగాలను చూస్తూ ఉత్సాహంగా ముందుకుసాగారు. సహచర టూరిస్టులు, బంధువులు, కుటుంబ సభ్యులతో జాలీగా  గడుపుతూ ఫొటోలకు పోజులిచ్చారు. మరోవైపు బోటులో సాంస్కృతిక కార్యక్రమాలను ఆస్వాదించారు. అయితే, ఆ అందమైన ప్రకృతే వికృతంగా మారుతుందని ఊహించలేకపోయారు. గోదారమ్మ అమాంతం తమను మింగేస్తుందని అనుకోలేదు. అలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు ఊహించలేదు. దాంతో ఒక్కసారిగా పడవ పక్కకు ఒరిగి గోదావరిలో మునిగిపోతుంటే... పర్యాటకులు చేసిన హాహాకారాలు, ఆర్తనాదాలు... ఆ గోదారమ్మ వినిపించుకోలేదు. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ఆత్మీయులు జలసమాధి అయిపోయారు. దాంతో విహరయాత్ర కాస్త విషాదయాత్రగా మారిపోయింది. అయితే, బోటు పైఅంతస్తులో ఉన్నవారు మాత్రమే, ఈ ప్రమాదం నుంచి బయటపడినట్లు తెలుస్తోంది. కింది అంతస్తులో అద్దాల మధ్య ఉన్నవారతా జలసమాధి అయ్యారని భావిస్తున్నారు. బోటు దాదాపు 300 అడుగుల లోతులోకి దిగిపోవడంతో... వాళ్లంతా బోటులోనే చిక్కుకుని మరణించారని అంచనా వేస్తున్నారు. బోటును బయటికి తీస్తేనే, మృతుల సంఖ్యపై క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

తెలుగు రాష్ట్రాలపై సోనియా ఫోకస్... పీసీసీ చీఫ్ ల ఎంపికపై కసరత్తు

  దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పునురుజ్జీవం కోసం ప్రయత్నిస్తోన్న ఏఐసీసీ తాత్కాలిక ప్రెసిడెంట్ సోనియాగాంధీ.... తెలుగు రాష్ట్రాలపైనా ఫోకస్ పెట్టారు. రాష్ట్ర విభజనతో రెండు చోట్లా దెబ్బతిన్న కాంగ్రెస్ పార్టీని ఏదోవిధంగా బతికించుకోవాలని వ్యూహరచన చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పార్టీ ఇప్పట్లో పుంజుకునే అవకాశం లేనప్పటికీ, గట్టి ప్రయత్నాలైతే చేయాలని సోనియా నిర్ణయించారు. అందుకే కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక కోసం కసరత్తు మొదలుపెట్టారు. అయితే ఏపీసీసీ రేసులో పలువురు పేర్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా శైలజానాథ్, పల్లంరాజు, జేడీశీలం, చింతా మోహన్, గిడుగు రుద్రరాజు పేర్లను సోనియా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.  ఇక, తెలంగాణ విషయంలో పీసీసీ చీఫ్ ఎంపిక ఇప్పట్లో లేనట్లు తెలుస్తోంది. తెలంగాణ పీసీసీ కోసం పోటీ ఎక్కువగా ఉండటం, మరోవైపు ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోవడం, అలాగే అధిష్టానం పరిశీలనలో ఉన్న వ్యక్తులపై సీనియర్లు గుర్రుగా ఉండటంతో, పీసీసీ నియామకాన్ని తాత్కాలికంగా వాయిదా వేసినట్లు ఏఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. రేవంత్ రెడ్డికి తెలంగాణ పీసీసీ పగ్గాలు అప్పగించనున్నారనే ప్రచారంతో ఒక్కసారిగా కలకలం రేగడం, ఢిల్లీకి ఫిర్యాదులు వెల్లువెత్తడంతో, హైకమాండ్ ఆచితూచి వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే, మున్సిపల్ ఎన్నికలు, అలాగే హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక, అదేవిధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాలు ముగిసిన తర్వాత... తెలంగాణ పీసీసీ మార్పుపై అధిష్టానం నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏఐసీసీ తాత్కాలిక అధ్యక్ష బాధ్యతలు తీసుకున్నాక తొలిసారి వార్ రూమ్ చర్చలు జరుపుతోన్న సోనియా... తెలుగు రాష్ట్రాలపై సీరియస్ గా ఫోకస్ పెట్టినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా తెలంగాణలో ఇప్పట్నుంచే పార్టీని బలోపేతంచేసి, 2024లో అధికారం కైవసం చేసుకునేలా రోడ్ మ్యాప్ రెడీ చేస్తున్నారట. అందుకే తెలంగాణలో ప్రజాసమస్యలపై నివేదిక ఇవ్వాలని సోనియా ఆదేశించారు.

బీజేపీలోకి జార్ఖండ్ డైనమైట్..! ధోనీ రిటైర్మెంట్ పై ఊహాగానాలు

  టీమిండియా క్రికెటర్‌, మాజీ కెప్టెన్‌ మహేంద్రసింగ్‌ ధోనీ... క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నారనే ఊహాగానాలు హల్ చల్ చేస్తున్నాయి. సౌతాఫ్రికా టూర్‌కి ధోనీని ఎంపిక చేయకపోవడంతో... ఇక ఇంటర్నేషనల్ క్రికెట్ గుడ్‌బై చెప్పాలని ధోనీ డిసైడయ్యాడని, త్వరలో ప్రకటిస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అంతేకాదు రిటైర్మెంట్ తర్వాత మహేంద్రసింగ్‌ ధోనీ... పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ధోనీ ...బీజేపీలో చేరబోతున్నారని అంటున్నారు. సొంత రాష్ట్రం జార్ఖండ్‌కు‌ అతిత్వరలో ఎన్నికలు జరగనుండటంతో... అసెంబ్లీ బరిలో ధోనీ దిగుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అందుకే ఈమధ్య ఎక్కువగా జాతీయవాదం వినిపించడంతోపాటు ఇటీవల 2నెలలపాటు ఆర్మీలో పనిచేశారని అంటున్నారు. ఇక, టీమిండియా క్రికెటర్ గా, కెప్టెన్‌గా మహేంద్రసింగ్‌ ధోనీ... పలు రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. మూడు ఫార్మాట్లలోనూ భారత్‌ను నెంబర్‌వన్‌గా నిలిపాడు. అంతేకాదు భారత్ కు వన్డే, టీ20 వరల్డ్, ఆసియా కప్ లను అందించి సంచలనం సృష్టంచాడు. కెప్టెన్ గా ఎన్నో సంచలన విజయాలను సాధించడమే కాకుండా, గ్రేట్ మ్యాచ్ ఫినిషర్ గా పేరు తెచ్చుకున్నాడు. 90కి పైగా టెస్టు మ్యాచులాడి సుమారు 5వేల పరుగులు చేసిన ధోనీ... 340కి పైగా వన్డేల్లో 10వేల 500 రన్స్ చేశాడు. వన్డేల్లో 10వేల పరుగులు చేసిన అతికొద్దిమంది క్రికెటర్లలో ధోనీ ఒకడు. ఇలా ఎన్నో రికార్డులు ధోనీ ఖాతాలో ఉన్నాయి. అయితే, తన రిటైర్మెంట్ పై జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నా, ధోనీ స్పందించకపోవడంతో నిజమేనని అంతా భావించారు. అయితే, ధోనీ అర్ధాంగి సాక్షి ఆ సందిగ్దతకు సింగిల్ లైన్ తో తెరిదించింది. డైరెక్టుగా ఖండించకపోయినా, మరి వీటినే వదంతులు అంటారు అంటూ ట్వీట్ చేసి, రిటైర్మెంట్ వార్తలకు తెరదించారు. సాక్షి చేసిన ఆ ట్వీట్ కు క్షణాల్లోనే వేలకొలది లైకులు, రీట్వీట్లు  వచ్చాయి. మరోవైపు బీసీసీఐ కూడా ధోనీ రిటైర్మెంట్ వార్తలపై డిఫరెంట్ గా స్పందించింది. తమకు సమాచారం లేదంటూ తెలివిగా రియాక్టయ్యింది. మరి ధోనీ నిజంగానే క్రికెట్ కు గుడ్ బై చెప్పి పొలికల్ ఎంట్రీ ఇస్తారో లేదో..!