review meetings also the reason for tdp defeat

ఒక పరాజయం 100 తప్పులు.. బాబు కొంప ముంచిన గంటలకొద్దీ సమీక్షలు

  అధికారులు.. ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉండాలి. కానీ చంద్రబాబు.. సమీక్షల పేరుతో అధికారులను గంటల కొద్దీ బందీ చేసి.. ప్రజలకు అందుబాటులో లేకుండా చేసారు. చివరకు ఈ ప్రభుత్వం అసలు ప్రజలకు అందుబాటులో లేదనే అభిప్రాయాన్ని ప్రజల్లో కలిగించి ప్రజలకు దూరమయ్యారు. పాలన తీరు గురించి, ప్రజల బాగు గురించి సమీక్షలు నిర్వహించడం మంచిదే. కానీ అదే పనిగా సమీక్షలు చేస్తూ.. అధికారులను ప్రజలకు అందుబాటులో లేకుండా చేయకూడదు. బాబు అమరావతిలో ఉంటే చాలు.. సమీక్షలు అంటూ, టెలీకాన్ఫెరెన్స్ లు అంటూ పొద్దున నుండి సాయంత్రం వరకు అధికారులను గదులకు పరిమితం చేసేవారు. దీంతో ఈ గంటల గంటలు సమీక్షలు ఏంట్రా బాబు అంటూ అటు అధికారుల్లో అసహనం పెరిగింది, అలాగే ఇటు ప్రజల్లోనూ అధికారులు అందుబాటులో లేకుండా పోయారన్న అసంతృప్తి వ్యక్తమైంది. ఇలా బాబు సమీక్షల చాదస్తం టీడీపీకి పెద్ద నష్టం చేసింది.

is the system responsible for siddhartha suicide

సిద్ధార్ధను దేశమే చంపేసిందా?

  దేశీయ కాఫీ రుచిని విశ్వ వ్యాప్తం చేసిన కాఫీ బ్రాండ్ అంబాసిడర్ 'కేఫ్ కాఫీ డే' ఫౌండర్ దుర్మరణం ఒక వ్యవస్థీకృత హత్య అనేందుకు పలు కారణాలు ఉన్నాయి. ఆయన వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇంత తీవ్ర చర్యకు నెట్టివేయబడడానికి కారణాలు ఏమిటి ? ఇంకా నిర్ధారణ కానప్పటికీ ఆయన రాసినట్టుగా భావించబడుతున్న లేఖ అనేక అనుమానాలను లేవనెత్తుతోంది. దేశ వ్యాప్తంగా అనంతమైన ఆవేదనను అంతులేని ప్రశ్నలను మిగిల్చిన సిద్దార్ధ మరణం దేశ ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల అనేక సమాధానం దొరకని జీవన్మరణ ప్రశ్నలను లేవనెత్తుతోంది. ప్రధానంగా ఈ లేఖలో ప్రైవేట్ పెట్టుబడి ప్రదాతలు మరియు ఆదాయ పన్ను అధికారుల వేధింపులు కారణాలుగా కనబడుతున్నాయి. ఈ ప్రైవేటు పెట్టుబడి ప్రదాతలు వారికిచ్చిన వాటాలను తిరిగి కొనుగోలు చేయమని ఒత్తిడి చేయడం ఒక వ్యవస్థీకృత సమస్య. భారత దేశ కార్పొరేట్ రుణ మార్కెట్ ఒక పనికి మాలిన, పనికి రాని పేలవమైన వ్యవస్థ. షేరు విలువ అప్పు తనఖా కంటే తగ్గిపోయినప్పుడు పారిశ్రామికవేత్తలను అకాల మరణానికి నెట్టివేసే మన దేశం యొక్క చట్టపరమైన రుణ మార్కెట్ ఇన్ఫరాస్ట్రక్చర్ ఒక దివాళాకోరు స్థితిలో ఉంది.  కాఫీ డే మన దేశంలో ఒక సుప్రసిద్దమైన విజయవంతమైన బ్రాండ్. కాఫీ డే అనే పదం నవ భారత పాప్ సంస్కృతిలో, అలాగే యువత జీవన శైలిలో భాగం అయ్యింది. భారత నగరాలూ, పట్టణాలలో యువత హ్యాంగౌట్ స్పాట్ గా స్టార్ట్అప్స్ కి, సమావేశాలకు ఎన్నో ప్రణయ ప్రేమ బంధాలకు వేదికయ్యింది. ఈ బ్రాండ్ నిర్మాత అయిన సిద్దార్ధ.. ఏ అమెరికా లాంటి ఫంక్షనల్ రుణ మార్కెట్ ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉండి ఉంటే.. అతనికి డబ్బు కానీ ఋణం కానీ సమకూరడంలో ఎటువంటి ఇబ్బందీ ఉండేది కాదు. కానీ మన దేశంలో సిద్దార్థ లాంటి పారిశ్రామిక వేత్తలు.. బంధువులు నుండో, మిత్రుల నుండో పీఈ ప్రొవైడర్స్ నుండో డబ్బు తీసుకోవాల్సి వస్తుంది. పీఈ నిధుల కోసం అయ్యే ఫైనాన్సింగ్ ఖర్చు చాలా ఆధికం. వివిధ కార్పోరేట్ ఆస్తులను తనఖాగా ఇవ్వడానికి తగిన న్యాయపరమైన ఆమోదం లేక పోవడం వలన పీఈ నిధులు ఖరీదు గానూ, ప్రమాదంగానూ మారుతున్నాయి.  చాలా సందర్భాల్లో పీఈ పెట్టుబడులను దోపిడీగానే అనుకోవాలి. ఈ సందర్భంలో పీఈ సంస్థలను నిందించి ప్రయోజనం లేదు. మన దేశంలో ఒక శక్తివంతమైన రుణ మార్కెట్ ని అధివృద్ది చేయాల్సిన అవసరాన్ని సిద్దార్ధ మరణం ముందుకు తెస్తోంది. మంచి పరపతి గల కంపెనీలకి, ట్రిపుల్ ఏ రేటెడ్ పేపర్లతో జంక్ బాండ్ లను జారీ చేయగల రుణ మార్కెట్ ని భారత్ అభివృద్ధి చేయాలి. ఋణం, వడ్డీ, కరెన్సీ వంటి అన్ని రకాల రిస్కులను నిరోధించడంతో పాటు సమర్ధవంతమైన, వేగవంతమైన, చట్టపరమైన రుణ మార్కెట్ కల్పన నేటి తక్షణ అవసరం. అలాగే అధికారులు పన్ను చెల్లింపు దారుల మధ్య సహృద్భావమైన సంప్రదింపులు, సంబంధాలు మరింత మెరుగుపడాలి. పారిశ్రామిక వేత్తలు దోపిడీ దారులు అనే వామపక్ష దురభిప్రాయ సంస్కృతి నుండి దూరం కావాలి. వామపక్ష భావజాలంతో ప్రభావమైన మీడియా.. పారిశ్రామికవేత్తలను దొంగలుగా చిత్రీకరించే ఒక దురలవాటును వదులుకోవాలి. దేశ ఆర్ధిక అభివృద్ధిలో కీలక భూమిక పోషించే వ్యాపారవేత్తలు దేశ నిర్మాతలనే స్పృహతో వ్యవహరించాలి. ఎన్నో ఆర్ధిక, కుటుంబ, సామాజిక ఒత్తిడులను, రిస్కులను తీసుకుంటూ పెళ్ళాం పుస్తెలు, మిత్రుల నుండి అప్పులు చేసి పలువురికి ఉపాధి కలిపిస్తూ.. ప్రత్యక్ష-పరోక్ష పన్నులు చెల్లిస్తూ మరింత మందికి పరోక్ష ఉపాధిని కల్పిస్తూ.. ఇతర అనుబంధ పరిశ్రమలకి వ్యాపారాన్ని ఇస్తూ, సంపద సృష్టిస్తూ, చందాలు, సామజిక కార్యక్రమాలకి నిధులు ఇస్తూ సమాజం యొక్క నిర్దయకు నిష్టూరానికి, నష్టానికి, కష్టాలకి గురి అవుతూ అంతర్ధానం అయ్యే ఎందరో పారిశ్రామిక వేత్తలకు సిద్దార్ధ ప్రాయోపవేశం ఒక ఉదాహరణ.

Polavaram re tendering issue

రివర్స్ టెండరింగ్ అంటే ఏంటి ? పోలవరానికి లాభమా ? నష్టమా ?

  ఆంద్రరాష్ట్ర జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ ప్రస్తావన వచ్చినప్పుడల్లా వినవచ్చే మొదటి మాట రివర్స్ టెండరింగ్. ఏపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ప్రధాన కాంట్రాక్టర్ అయిన నవయుగ సంస్థను తొలగించడంతో ఈ చర్చ మరింత ముందుకువచ్చింది. ప్రధాన ఇరిగేషన్ ప్రాజెక్ట్ లు ప్రభుత్వ ప్రాజెక్ట్ లను రివర్స్ టెండరింగ్ ద్వారా పారదర్శకంగా చేపడతామని కొత్త ప్రభుత్వం చెబుతోంది. జ్యుడీషియల్ కమిషన్ యొక్క పర్యవేక్షణలో న్యాయమూర్తులు నిర్ణయించిన నిబంధనలకు అనుగుణంగా పోలవరం ప్రాజెక్ట్ ని ఆంద్రప్రదేష్ లో మొదటి రివర్స్ టెండరింగ్ ప్రాజెక్ట్ గా పోలవరం ప్రాజెక్ట్ నిలుస్తోంది.  బాబు పాలనలో జరిగిన అవకతవకలను అవినీతిని సమీక్షించడానికి ఏర్పాటు చేసిన నిపుణుల ప్యానెల్ పోలవరం ప్రాజెక్ట్ ని తోలి రివర్స్ టెండరింగ్ ప్రాజెక్ట్ గా సూచిస్తూ  తన రిపోర్ట్ ని గత వారం అందించింది. కావాలనే నిర్మాణంలో తాత్సారం చేసినప్పటికీ ఎటువంటి జరిమానా లేకుండా అప్పటి ప్రభుత్వ అనేక సార్లు  వారికి సమయాన్ని పొడిగించినట్టుగా ప్యానెల్ కనుగొంది. అప్పటి అధికార యంత్రాంగం ఈ తాత్సారానికి జరిగిన నష్టానికి ఎటువంటి జరిమానా కానీ పరిహారం కానీ విధించక పోవడం ప్రభుత్వ యంత్రాంగంలోని సామర్ధ్య లోపంగా ప్యానెల్ పేర్కొంది. కాంట్రాక్ట్ నిభందనలకు అనుగుణంగా ఒప్పందకాల పరిమితులలో కాంట్రాక్టర్ లకి కేటాయించిన పనులను వారు పూర్తి చేయలేదని నిపుణుల ప్యానెల్ అభిప్రాయపడింది. అంతేకాకుండా వారు కావాలనే పనిని తాత్సారం చేసి అధిక రేట్ల సవరణను డిమాండ్ చేసినట్టు పేర్కొంది.   మొత్తం ఎనిమిది మంది కాంట్రాక్టర్లు  ఒప్పంద తేదీ నుండి ఇరవై నాలుగు నెలలలో నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది, కానీ నిర్మాణాలు పూర్తి కాక పోయినా ప్రభుత్వాన్ని నిర్మాణ వ్యయాన్ని పెంచమని కోరడం ప్రభుత్వం అంగీకరించడం ఆ విధంగా కాంట్రాక్టర్ లకి దాదాపు 3800కోట్ల మేర రేట్లు పెంచడం జరిగింది. ఈ నేపథ్యంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం, తిరిగి టెండర్ చేయడానికి ఒక బిల్లును ఆమోదించింది.  వంద కోట్ల పైగా వ్యయం అయ్యే ఏవైనా పెద్ద ప్రాజెక్టులలో అవినీతి అవకతవకలు  ధర పెరుగుదల కనిపిస్తే వాటిని తాజా బిడ్డింగ్ ద్వారా రివర్స్  టెండరింగ్ నిర్వహించాలని భావిస్తూ పోలవరం ప్రాజెక్టు పనులను నిలిపివేసింది. ప్రభుత్వం  రివర్స్ టెండరింగ్ ద్వారా మరొక్కసారి బిడ్డింగ్ కి వెళ్లి ప్రస్తుతం ఉన్న ధరల కంటే తక్కువ కోట్ చేసిన వారికి ఈ నిర్మాణ పనులని ఇవ్వాలని నవంబర్ పదకొండు నుండి ప్రాజెక్ట్ పనులు మళ్ళీ ప్రారంభించాలని భావిస్తోంది. రివర్స్ టెండరింగ్ అంటే ఏమిటి ? అనే విషయంలోకి వెళితే, ఈ రివర్స్ టెండరింగ్ అనేది ఒక విధమైన మారు వేలం, దీనిలో కాంట్రాక్టర్ లు ప్రభుత్వాల పాత్రలు తారుమారు అవుతాయి. దీనిలో ప్రభుత్వం ఒక వైపు కాంట్రాక్టార్ లు అందరూ మరో వైపు పాల్గొంటారు. మామూలు వేలంలో కొనుగోలు దారులు తమకు కావాల్సిన వస్తువు అధిక ధరతో పొందడానికి పోటీ పడతారు.  దీనికి విరుద్ధంగా రివర్స్ టెండరింగ్ లో ప్రభుత్వం కాంట్రాకర్ ల వద్ద నుండి అధిక మొత్తంలో నిర్మాణ వ్యయాన్ని ఆదా చేసుకోడానికి వారి మధ్య పోటీ పెంచుతుంది. కాంట్రాక్టర్ లు ఒకరి మీద ఒకరు పోటీగా తాము తక్కువ ధరకు చేస్తామంటే తాము తక్కువ ధరకు చేస్తామని నిర్మాణ వ్యయాన్ని తగ్గిస్తారు. రివర్స్ టెండరింగ్ వేలం పాట లాగే ఉంటుంది. కానీ ఈ రివర్స్ టెండరింగ్ విధానం సాఫ్ట్వేర్ ఆధారంగా నడిచే ఆన్ లైన్ లో జరిగే ఆక్షన్ వ్యవస్థ. ఈ ఆన్ లైన్ వేలంలో ఒకరి ధర మరొకరు చూసుకుని తమ కోట్ ను తెలియచేస్తారు.  ఇది అత్యంత పారదర్శకంగా వేగవంతంగా నూతన సాంకేతిక విధానంలో జరగడం వలన ప్రాజెక్ట్ వ్యయంలో గణనీయమైన ఆదా చేయడం సాధ్యం అవుతుంది. అభివృద్ధి చెందిన పలు దేశాల్లో ప్రభుత్వ సంస్థల కొనుగోళ్లు ఈ విధానంలో నిర్వహిస్తున్నారు. ఏపీలో పోలవరం ప్రాజెక్టు రివర్స్ టెండరింగ్ విధానానికి నాంది పలుకుతోంది. ఇక్కడొక కొసమెరుపు ఏంటంటే దేశంలో ఆన్ లైన్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్ల కోసం ఈ ప్రొక్యూర్మెంట్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభుత్వ కార్యాచరణలో ఆవిష్కరించిన ఘనత మాత్రం చంద్రబాబు నాయుడికి చెందుతుంది.   

Sand issue troubling many people in ap

అడ్డా కూలీల కడుపు కొడుతున్న ఇసుక కొరత !

  భవన నిర్మాణంలో ముడి సరుకయిన ఇసుక మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విధించిన నియంత్రణ, దాదాపు నలభై లక్షల పైగానే ఉన్న భవన నిర్మాణ రంగ కార్మికులు, ఆ రంగం పై ఆధార పడ్డ ఉపాధి వర్గాలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. ఇసుక నిషేదం, నిరోధము, నియంత్రణ అన్నీ కలగలిసి గందరగోళం ఏర్పడుతోంది. భవన నిర్మాణంలో ఇసుక కేవలం ఒక ముడి పదార్దమే కాదు ఇంకా ఎక్కువనే చెప్పాలి.  నిజానికి ఇసుక సరఫరా ఆగిపోవడం తో రాష్ట్రము లోని పలు ప్రధాన నగరాల్లో నిర్మాణ రంగ పరిశ్రమలో తీవ్ర ప్రభావం పడింది. భవన నిర్మాణ కార్మికులు, సిమెంట్ డీలర్లు, ఐరన్, చిప్స్ వ్యాపారస్తులు, రవాణా రంగానికి చెందిన రిక్షా, ఆటో కార్మికులు, తాపీ మేస్త్రీలు, కూలీలు, వడ్రంగి మేస్త్రీలు, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ తదితర వృత్తుల వారు గత కొన్నాళ్లుగా ఉపాధి లేక విలవిలల్లాడుతున్నారు.  రాష్ట్ర ప్రభుత్వం కొత్త ఇసుక విధానం ప్రకటించడంతో తెలుగుదేశం ప్రభుత్వం ఉచిత ఇసుక విధానం రద్దయినట్టయ్యింది. అక్రమ ఇసుక తవ్వకాలు, ఇసుక దొంగ వ్యాపారం, స్మగ్లింగ్ వంటి సమస్యల వలన ఈ కొత్త విధానం అవసరం అయ్యిందని జగన్ ప్రభుత్వం చెబుతోంది. పదిహేను రోజుల్లోనే ఈ విధానం అమలులోకి వస్తుందని ప్రకటించిన ప్రభుత్వం దాదాపుగా నెలా పదిహేను రోజులు అయినప్పటికీ ఇంకా ఈ నిషేదం కొనసాగించడం భవన నిర్మాణ రంగం మీద ఆధార పడ్డవారికి తీవ్ర ఇబ్బందులు కలగ చేస్తోంది.  ప్రభుత్వ చర్యలు ప్రజల సమస్యలను పరిష్కరించే దిశగా ఉండాల్సినవి పోయి లేని కొత్త సమస్యలను సృష్టించేవి కావడం శోచనీయం. దీంతో ఇసుక ధర ఆకాశాన్ని అంటుతోంది, అధికార యంత్రాంగం ఇతర జిల్లాల నుంచి ఇసుక సరఫరాకు ప్రయత్నాలు చేస్తోంది.  ఒక్క గుంటూరు జిల్లాలోనే దాదాపుగా ఐదు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం ఉండడంతో అధికారులు ఈ కొరతను తీర్చడానికి గోదావరి జిల్లాల నుండి ఇసుకని తెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు.  ఈ కొరత వలన బ్లాక్ మార్కెట్ వ్యాపారులు ఇసుక ధరను అమాంతం ఆకాశానికి ఎత్తేసారు. సాధారణంగా నాలుగువేల రూపాయలుగా ఉండే ట్రక్ లోడు ఇసుక ధర అమాంతంగా ఇరవై వేలకి చేరింది. ఈ కొత్త ఇసుక విధానంలో ఇసుక రీచ్ లలో జిల్లా కలెక్టర్ అధీనంలో ఉంటాయి, ఇసుకను ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన సరఫరా చేస్తారు, స్థానిక ఎమ్మార్వో కార్యాలయంలో కావాల్సిన ఇసుక కోసం అప్ప్లై చేసుకుని రసీదు తీసుకుని సంబంధిత ఇసుక రీచ్ నుండి ఇసుకను పొందాల్సి ఉంటుంది.  ప్రభుత్వం నిర్మిస్తున్న గృహనిర్మాణ  ప్రాజెక్ట్ లకి తోలి ప్రాధాన్యత గానూ, వ్యక్తిగత గృహ నిర్మాణాలకు ఇతర ప్రభుత్వ ప్రాజెక్ట్ లకి రెండవ ప్రాధాన్యతగానూ, అపార్ట్మెంట్ లకి మూడవ ప్రాధాన్యతగానూ ఈ విధానం రూపొందించబడింది. ప్రస్తుత ధర ప్రకారం ట్రక్ ఇసుక రేటు మూడు వందలగానూ ముప్పై రూపాయల లోడింగ్ ఛార్జ్ గాను ఉన్నది. ఈ ఇసుక కొరత వలన సొంత ఇంటి నిర్మాణం చేసుకుంటున్న మధ్యతరగతి ప్రజల స్వగృహ స్వప్నం ఆలస్యం అవుతోంది.   ప్రభుత్వ విధానాలు గతంలో జరిగిన తప్పులను సమీక్షిస్తూనే నిర్మాణ కార్మికుల జీవనోపాధిని దృష్టిలో ఉంచుకోకుండా తీసుకున్న ఇటువంటి అనాలోచిత చర్య వలన రెక్కాడితే కానీ డొక్కాడని అసంఘటిత కార్మిక వర్గం రోడ్డున పడింది. రాష్ట్రంలో ప్రధాన పట్టణాలు అయిన విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్టణాల్లో నిర్మాణ పనులన్నీ నిలిచి పోయాయి. కొనసాగుతున్న నిర్మాణాలకు ఆటకం లేకుండా, గత ప్రభుత్వం అవలంభించిన అవకతవక విధానాలను సమీక్షిస్తూనే నిర్మాణ రంగ కార్మికుల ఉపాధి పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరించాల్సి ఉంది .

Stephen ravindra history

ఎన్‌కౌంటర్ స్పెషలిస్టు స్టీఫెన్ రవీంద్ర...ఏపీ సీఎం సెక్యూరిటీ కోసమా ?

  ఏపీ ఇంటలిజెన్స్ ఛీఫ్ గా స్టీఫెన్ రవీంద్ర నియామకానికి లైన్ క్లీయర్ అయ్యింది. ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్‌కు కేంద్ర హోంశాఖ అనుమతించింది. దీంతో రెండు మూడు రోజుల్లో స్టీఫెన్ రవీంద్ర ఇంటర్ స్టేట్ డిప్యుటేషన్ లెటర్‌ను  తెలంగాణా ప్రభుత్వానికి కేంద్రం పంపనుంది. ఆ తర్వాత స్టీఫెన్ ను ఆంధ్రప్రదేశ్ కు డిప్యుటేషన్ కింద తెలంగాణ ప్రభుత్వం పంపనుంది. ప్రస్తుతం స్టీఫెన్ రవీంద్ర రెండు నెలలుగా లీవ్‌లో ఉన్నారు.  నిజానికి స్టీఫెన్ రవీంద్ర తెలుగు రాష్ట్రాల్లో నిజాయితీ గల ఆఫీసర్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. 1999లో మొదటగా వరంగల్ జిల్లా పరకాల ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆయన 2004లో ఆడిషనల్ ఎస్పీగా అదిలాబాద్ జిల్లా బెల్లంపల్లిలో పని చేశారు. తర్వాత, వరంగల్ జిల్లా ఎస్పీగా పని చేశారు. ఆ సమయంలో మావోయిస్టులపై ఉక్కుపాదం మోపారు. వరంగల్ నుంచి అనంతపురం జిల్లా ఎస్పీగా బదిలీ అయిన తర్వాత అక్కడి ఫ్యాక్షన్ ను కంట్రోల్ చేసి మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు.  తరువాత అప్పటి గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డికి చీఫ్ సెక్యురిటీ ఆఫీసర్‌‌గా పని చేయడంతో పాటు  వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా కూడా ఆయన మారారు. వైఎస్ మరణానంతరం 2009లో కరీంనగర్ ఎస్పీగా ఆయన భాద్యతలు చేపట్టారు. కొద్ది రోజుల్లోనే అక్కడి నుంచి హైదరాబాద్ లోని ఈస్ట్ జోన్ డీసీపీగా భాద్యతలు చేపట్టారు. తెలంగాణా ఉద్యమ సమయంలో ఓయూలో శాంతి భద్రతలు విఘాతం కలగకుండా కట్టడి చేయగలిగారు. ఇక ఇటీవల తెలంగాణలో చోటు చేసుకున్న ఐటీ గ్రిడ్ చోరీకి సంబంధించి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ఇంఛార్జ్‌కు కూడా స్టీఫెన్ రవీంద్ర వ్యవహరించారు. రెండు నెలల కిందటే ఆంధ్రప్రదేశ్‌ కొత్త ఇంటిలిజెన్స్‌ చీఫ్‌గా కుమార్‌ విశ్వజిత్‌ నియమితులయ్యారు ఇప్పుడు ఆయన ప్లేస్ లోనే ఈయన ఛార్జ్ తీసుకోనున్నారని అంటున్నారు. నిజానికి గతంలో ఈ పదవిలో ఏబీ వెంకటేశ్వరరావు ఉండేవారు. చంద్రబాబుకు ఏబీ వెంకటేశ్వరరావు అత్యంత సన్నిహితుడని వైసీపీ వర్గాలు ఆరోపిస్తుండేవి.  పోలీసు అధికారిగా కాకుండా తెలుగుదేశం పార్టీలో ఎవరికి టికెట్‌ కేటాయించాలో ఎవరెవరికి ఏయే పదవుల్లో నియమించాలో ఏబీ వెంకటేశ్వరరావు చెబితేనే సీఎం అమలు చేస్తాడని వైసీపీ ఆరోపించింది. అంతే కాక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలతో బేరసారాలు జరిపి తెలుగుదేశం పార్టీలో చేర్పించేందుకు ఏబీ కీలక పాత్ర పోషించారని కూడా విమర్శలున్నాయి. పోలీస్‌ అధికారిగా కాకుండా బాబు పార్టీ కార్యకర్తగా ఆయన పని చేశారని తీవ్ర విమర్శలు చేశారు. మరి అలాంటి కీలక పదవిలో తమకి అనుకూలంగా సీఎం కుటుంబానికి సన్నిహితుడిగా పేరున్న స్టీఫెన్ రవీంద్రని తెచ్చి పదవిని కట్టబెట్టడం ఎంతవరకు లాభిస్తుందో చూడాలి మరి.

TDP strategy on bonda uma party change

వంగవీటి రాధాకు లైన్ క్లియర్ చేసిన బొండా ఉమా!

  మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కాపు నేత బోండా ఉమ వైసీపీలో చేరుతారని జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న బోండా ఉమ ఆగస్ట్‌ 4 లేదా 5న విజయవాడ వస్తున్నారు. వచ్చిన వెంటంటే ఆయన టీడీపీకి గుడ్‌బై చెప్పి వైసీపీ కండువా కప్పుకోనున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి గత ఎన్నికల్లో ఆయన మల్లాది విష్ణు చేతిలో ఓటమి పాలయ్యారు. దీంతో  మల్లాది విష్ణు విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యేగా ఉండడంతో పార్టీలోకి వస్తే తూర్పు బాధ్యతలను అప్పగిస్తామని బోండా వద్ద వైసీపీ ప్రతిపాదన తెచ్చినట్టు తెలుస్తోంది.  అయితే వైసీపీ ప్రతిపాదనకు బోండా అంత ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు. ఎందుకంటే ఇటీవల జరిగిన ఎన్నికల్లో తూర్పు నియోజకవర్గం నుంచి పనిచేసిన బొప్పన భవకుమార్, ఎన్నికలకు ముందు ఇదే నియోజకవర్గానికి ఇన్‌చార్జ్‌గా వ్యవహరించిన యలమంచిలి రవి తదితరులు సీనియర్లు కావడంతో తనకు వారి నుంచి సహకారం ఉండకపోవచ్చని బోండా ఉమ భావిస్తున్నట్టు సమాచారం.  అదీ కాక ఆ నియోజకవర్గం అయితే గద్దె రామ్మోహన్ కి మంచి పట్టున్న స్థానం కావడంతో పార్టీ మారినా అది పెద్దగా లాభించదని ఆయన భావిస్తున్నట్టు చెబుతున్నారు. నిజానికి బొండా ఉమామహేశ్వరరావు తెలుగుదేశం పార్టీలో కీలక నేతగా వ్యవహరిస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రి పదవి ఆశించి భంగపడి పదవి దక్కకపోవడంతో అలకబూనారు.  ఆ సమయంలో జనసేన పార్టీలో చేరతారంటూ కూడా ప్రచారం జరిగింది. అయితే అప్పట్లో చంద్రబాబు నేరుగా రంగంలోకి దిగి బుజ్జగించడంతో ఆయన స్తబ్ధుగా ఉండిపోయారు. ఆ తర్వాత మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణను పార్టీలోకి తీసుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అలా ఉంచితే ఎన్నికల్లో ఓటమి అనంతరం కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సమావేశం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించారు బొండా ఉమామహేశ్వరరావు.  కాకినాడలో కాపు సామాజిక వర్గం నేతలు సమావేశం అనంతరం విజయవాడలో బొండా ఉమా మహేశ్వరరావు నివాసంలో మరోసారి భేటీ అయ్యారు. ఈ క్రమంలో ఆయన పార్టీ వీడితేనే మంచిదనే యోచనలో తెలుగు దేశం ఉందని చెబుతున్నారు. ఎందుకంటే ఆయన కాపు నేతల సమావేశాలు పెట్టినప్పుడే విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నేత కోసం తెలుగుదేశం పార్టీ ఆన్వేషణ ప్రారంభించి ఆ నియోజకవర్గ పార్టీ నేతల నుంచి అభిప్రాయసేకరణ కూడా చేసింది.  అలా చేయడంతో బొండా ఉమ పార్టీ వైఖరి మీద అసంతృప్తి వ్యక్తం చేసి అలక బూనారు. తర్వాత చంద్రబాబు జోక్యం చేసుకోవడంతో పార్టీలోనే ఉండడానికి ఒప్పుకున్నారు. దీంతో ఆయన పార్టీ మారితే మారనివ్వాలని మరో సారి బుజ్జగింపుల ప్రక్రియలు ఏవీ చేపట్టద్దని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఎందుకంటే బొండా ఉమ పార్టీ మారితే టీడీపీలో ఉన్న వంగవీటి రాధాకృష్ణకు లైన్ క్లియర్ అవుతుందని, ఆయన మారిన స్థానంలో కాస్త కాపుల్లో ఫాలోయింగ్ ఉన్న రాధాకి బాద్యతాలు ఇవ్వచ్చని టీడీపీ నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు.    

chandrababu getting close to bjp again

బీజేపీకి దగరవుతున్న బాబు....దూరమవుతున్న జగన్ !

  ఏపీ రాజకీయాల్లో సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయి. నిన్న రాజ్యసభలో ట్రిపుల్ తలాక్ పై రాజ్యసభలో చోటు చేసుకున్న నాటకీయ పరిణామాలు ఆ విషయాన్ని ఇప్పుడు హైలైట్ చేస్తున్నాయి. గత టర్మ్ లో కలిసి పని చేసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారాన్ని పంచుకున్న టీడీపీ బీజేపీలు ఇంకా ఎన్నికలకి ఏడాదిన్నర ఉందనంగా విడిపోయారు. ఆనాటి నుండి తిట్టుకోని తిట్టు లేదు, అవమానించుకోని రోజు లేదు. ఈ క్రమంలో బీజేపీకి వైసీపీ దగ్గరకి జరిగినట్టు అనిపించింది.  అసలు ఏమాత్రం అంచనాలు లేని వైసీపీ బ్రహ్మాండం బద్దలు కొట్టేలాగా విజయం సాధించడంతో ఇదేదో మోడీ ఈవీఎం మాయాజాలమే అని భావించారు అందరూ. కానీ అదేంటో కానీ ఆనాటి నుండి వైసీపీ బీజేపీకి దూరం జరుగుతూ వస్తోండగా టీడీపీ మాత్రం దగ్గరవ్వాలని చూస్తోంది. తాజాగా నిన్న రాజ్య సభలో పాస్ అయిన ట్రిపుల్ తలాక్ బిల్లు విషయంలో ఈ అధినేతలు తీసుకున్న స్టాండ్ లను బట్టి ఈ విషయం స్పష్టం అవుతోంది.  చంద్రబాబుకు అత్యంత సన్నిహితులైన నలుగురు రాజ్యసభ సభ్యులు బిజెపిలో చేరారు, అయితే అది బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా అని కొందరు అంటే లేదు, బాబు ఆపరేషన్ సేఫ్ లో భాగంగా అని కొందరు అన్నారు. ఈ క్రమంలో ట్రిపుల్ తలాక్ బిల్లుపై రాజ్యసభలో ఎవరి వైపూ స్టాండ్ తీసుకోకూడదని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఇద్దరు రాజ్యసభ సభ్యులు కూడా ట్రిపుల్ తలాక్ కు అనుకూలంగా గానీ, వ్యతిరేకంగా గానీ ఓటు చేయలేదు.  ట్రిపుల్ తలాక్ బిల్లును రాజ్యసభలో నెగ్గించుకోవడానికి బిజెపికి ఒక్కరు కలిసి వచ్చినా ప్రయోజనమే చేకూరుతుంది. ఈ స్థితిలో ఇద్దరు టీడీపీ సభ్యులు తటస్థంగా ఉండడం ద్వారా బిజెపికి పరోక్షంగా సహకరించారనే విషయాన్ని విశ్లేషకులు హైలైట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే బీజేపీతో చాలా క్లోజ్ అని ఆరోపణలు వస్తున్న వైసీపీ మాత్రం ట్రిపుల్ తలాక్ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసింది.  అల వ్యతిరేకంగా వేయాలని వైఎస్ జగన్ తన రాజ్యసభ సభ్యులకు సూచించారని ఆ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి పార్లమెంట్ లో ప్రకటించారు. నిజానికి చెప్పాలంటే ఇది బిజెపికి అస్సలు మింగుడు పడని విషయమనే చెప్పాలి. టీడీపీ ,టీఆర్ఎస్ మాదిరిగా తటస్థంగా ఉన్నా, జెడియు, అన్నాడియంకె వంటి పార్టీల మాదిరిగా వాకౌట్ చేసినా బిజెపికి మేలు జరిగి ఉండేది. కానీ వైసీపీ సభ్యులు బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడాన్ని గమనిస్తే ఆ పార్టీ కచ్చితంగా బిజెపి ఆపోజిట్ స్టాండ్ తీసుకున్నట్టు చెప్పవచ్చు.  నిజానికి అధికారం చేపట్టి రెండు నెలలు కూడా గడవక ముందే జగన్ బీజేపీకి ఎదురు తిరగడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. అమరావతి, విశాఖ మెట్రో రైలు వంటి ప్రాజెక్టుల నుంచి అంతర్జాతీయ బ్యాంకులు అప్పులు రాకుండా చేయడం, చంద్రబాబు మీద విచారణ చేయాలంటే ఎక్కడికక్కడ బ్రేకులు వేయడం దాకా బిజెపి తనకు తనకు వ్యతిరేకంగా పనిచేస్తుందని జగన్ భావన అని అంటున్నారు.  నిజానికి ఏపీలో కూడా బీజేపీ నేతలు వైసీపీని చీల్చి చెండాడుతున్నారు. జగన్ కంటే చంద్రబాబు పాలనే బాగుందని బీజేపీ నేతలు అంటున్నారు అంటే ఏ మేరకు జగన్ ని టార్గెట్ చేశారు అనే విషయం మీద క్లారిటీ వస్తుంది. రాష్ట్రంలో తామే ప్రతిపక్షం అని చెప్పుకుంటున్న బీజేపీ చంద్రబాబుతో మళ్ళీ కలిసి జగన్ ని టార్గెట్ చేయచ్చనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఏమో గుర్రం ఎగరావచ్చు, బీజేపీ బాబుతో కలవావచ్చు, ఎందుకంటే ఇది రాజాకీయం కదా ! 

chandrababu makes big mistake by following kcr

ఒక పరాజయం 100 తప్పులు.. కేసీఆర్ బాటలో నడవబోయి బోర్లాపడ్డ బాబు

  ప్రస్తుతం దేశంలో ఉన్న నాయకుల్లో తానే సీనియర్ ని అని.. మిగతా రాష్ట్రాల సీఎంలు, ప్రధాని మోడీ కూడా తన జూనియర్లేనని చెప్పుకునే చంద్రబాబు.. సాటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఫాలో అయి ఫెయిల్ అయ్యారా అంటే అవునని చెప్పక తప్పదు. ఎంతో అనుభవం ఉన్న బాబు.. అభివృద్ధిలో పోటీ పడాల్సింది పోయి, కేసీఆర్ ని అనుకరించి ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. కేసీఆర్ ఇతర పార్టీల నేతలను చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టారు. కేసీఆర్ సంతలో పశువుల్ని కొన్నట్లు నాయకులను కొంటున్నారని తెలంగాణలో కేసీఆర్ తీరుని తప్పుబట్టిన టీడీపీ.. తీరా ఏపీలో ఆయన్నే ఫాలో అయింది. బాబు వైసీపీ నేతలను తమ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు కట్టబెట్టారు. ఇక కేసీఆర్ తన తనయుడు కేటీఆర్ కి ఏ మంత్రిత్వ శాఖను కట్టబెట్టారో.. ఏపీలో అదే శాఖను బాబు తన తనయుడు లోకేష్ కి కట్టబెట్టారు. అయితే కేటీఆర్ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. కానీ లోకేష్ ఎమ్మెల్సీ అయి మంత్రి పదవి కొట్టేసారు. దీంతో బాబు, లోకేష్ లపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. ఇవే కాదు పథకాల విషయంలోనూ బాబు కేసీఆర్ ను అనుకరించారు. కేసీఆర్ 'రైతు బంధు' పథకాన్ని తెలంగాణలో తీసుకొస్తే.. ఏపీలో బాబు 'అన్నదాత సుఖీభవ' పథకాన్ని తీసుకొచ్చారు. కేసీఆర్ ముందస్తు ఎన్నికల్లో రైతుబంధు వల్లే గెలిచారు. తాను కూడా ఏపీలో అలాగే గెలుస్తానని బాబు భావించారు. కానీ ఓడిపోయారు. కేసీఆర్ ఎన్నికల సమయంలో ప్రాంతీయ సెంటిమెంట్ రగిలిస్తే.. బాబు కూడా ఏపీలో అదే ఫాలో అయ్యారు. టీఆర్ఎస్ తెలంగాణకు చెందిన పార్టీ కాబట్టి ప్రాంతీయ సెంటిమెంట్ కేసీఆర్ కు వర్కౌట్ అయింది. కానీ తెలుగు ప్రజల పార్టీ అని చెప్పుకొనే టీడీపీ.. ప్రాంతీయ సెంటిమెంట్ ని తీసుకురావడాన్ని ప్రజలు రిసీవ్ చేసుకోలేకపోయారు. ఇలా పలు విషయాల్లో కేసీఆర్ ని ఫాలో అయిన బాబు.. తాను కూడా కేసీఆర్ లాగా రెండోసారి సీఎం అవుతాను అనుకున్నారు. కానీ ప్రతిపక్షానికి పరిమితమయ్యారు.

attack on unnao rape victim is fishy

ఈ అరాచకం గురించి ఆ నేతలు ఏమంటారో ?

  ఆమెని మానభంగం చేశారు , ఆమె తండ్రిని జైలులో పెట్టి లాకప్ డెత్ చేశారని ఆరోపణ, ఆమె పిన్నిని, అత్తని దుండగులే నిర్దాక్షిణ్యంగా చంపేశారు , ప్రస్తుతానికి ఆమె తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో ఉన్నది, బతుకుతుందో లేదో కూడా తెలీదు.   ఆమె కోసం ముందుకు వచ్చిన రక్తసంబంధీకులందరిని వేధిస్తున్నారు, వాళ్ళ ఉనికే లేకుండా చేయటానికి ప్రయత్నిస్తున్నారు, ఇదంతా ఏదో సినిమా స్టోరీ అనుకుంటున్నారా? కాదు మన దేశంలో ఉత్తర్ ప్రదేశ్ లో జరుగుతున్న సజీవ మారణ కాండ. ఉత్తరప్రదేశ్‌ లోని ఒక బీజేపీ ఎమ్మెల్యే ఓ అత్యాచార, హత్యాయత్నం కేసులో నిందితుడు. తనపై ఫిర్యాదు చేసిన బాధితురాలిని, ఆమె తరపు వాదిస్తున్న న్యాయవాదిని, సాక్ష్యులను తెలుగు సినిమా తరహాలో అంతం చేయటానికి స్కెచ్ వేశాడు.  అత్యాచార ఘటనకు సంబంధించి కుల్‌దీప్‌ సెంగార్‌ గత ఏడాది ఏప్రిల్‌ 13 నుంచి జైలులో ఉన్నారు. జైలు నుంచే ఆయన రేప్‌ బాధితురాలిని కారు ప్రమాదంలో కడతేర్చడానికి కుట్ర పన్నారన్నది తాజాగా వస్తున్న ఆరోపణ. తాజా కేసులో ఆయననే మొదటి నిందితుడిగా పేర్కొన్నారు. బాధితురాలు, ఆమె తల్లి, ఇద్దరు మేనత్తలు, వారి లాయరు అంతా కలిసి ఆదివారం నాడు ఫతేపూర్‌ నుంచి ఓ కారులో వెళ్తుండగా రాయ్‌బరేలీ శివార్ల లో ఎదురుగా వేగంగా వస్తున్న లారీ ఢీకొట్టింది.  ఆ ధాటికి ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. అందులో ఒకామె నాటి అత్యాచార ఘటనకు ప్రత్యక్ష సాక్షి. లాయర్‌కు, బాధితురాలికి తీవ్రగాయాలవడంతో ఆసుపత్రికి తరలించారు. వారిద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో వెంటిలేటర్‌పై చికిత్సను అందిస్తున్నారు. కాస్త తక్కువగా గాయపడినది బాధితురాలి తల్లి మాత్రమే! లారీ నెంబరు కనపడకుండా నల్లటి పెయింటు వేసి చెరిపేయడం, దాని డ్రైవింగ్‌ పత్రాలు నకిలీవి కావడంతో ఈ ప్రమాదంపై అనుమానాలు నెలకొన్నాయి.  ఇది తన కుటుంబాన్ని కడతేర్చడానికి ఉన్నావ్‌ ఎమ్మెల్యే చేసిన కుట్ర అని బాధితురాలి తల్లి ఆరోపించారు. కాగా, 13 ఏళ్ల అమ్మాయిపై దారుణంగా అత్యాచారం చేయడమే కాకుండా ఆమెను, ఆమె కుటుంబాన్ని నామరూపాల్లేకుండా చేయడానికి బీజేపీ ఎమ్మెల్యే ప్రయత్నించారని లోక్‌సభలో ఎస్పీ సభ్యుడు గోపాల్‌ యాదవ్‌ ఆరోపించారు. ఘటనపై నిష్పాక్షిక సీబీఐ దర్యాప్తు జరపాలని విపక్షాలు కోరాయి. విపక్షాల ఒత్తిడికి బీజేపీ ప్రభుత్వం తలొగ్గింది.  ఉన్నావ్‌ రేప్‌ బాధితురాలి రోడ్డు ప్రమాదం కేసులో బీజేపీ ఎమ్మెల్యే కుల్‌దీప్‌ సెంగార్‌పై హత్యాయత్నం కేసు నమోదయ్యింది. ఎమ్మెల్యే మనుషులే ఈ దారుణానికి పాల్పడి ఉంటారన్న అనుమానాలు పెరిగాయి. ఈ వ్యవహారంపై సీబీఐ విచారణను జరిపించాలంటూ ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని తీసుకోవటానికి ముందు ఆసుపత్రిలో తీవ్ర గాయాలతో ఉన్న బాధితురాలు ఈ కేసును సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.  దీనికి తగ్గట్లే తాజాగా నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఈ కేసులో ఆమె ఓడిపోతే ఓడిపోయేది ఆమె మాత్రమే కాదు మనం గొప్పగా చెప్పుకునే ప్రజాస్వామ్యం - హక్కులు -స్వేచ్ఛ -చట్టాలు -న్యాయం కూడా !. అసలు ఇంత జరిగినా కనీసం ఆ ఎమ్మెల్యే భాజపా సభ్యత్వం కూడా అలానే ఉంది, మరి ప్రతి విషయంలో నీతి వాక్యాలు చెప్పే బీజేపీ నేతలు ఈ విషయం మీద ఏమంటారో ? 

Pawan Kalyan Comments Janasena alliance

బీజేపీతో జనసేన పొత్తు....పవన్ మాటలకి అర్ధం అదేనా ?

  ఏపీ రాజ‌కీయాల్లో పెను సంచలనం లాంటి భారీ సమీకరణాలు జరగబోతున్నాయా ? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. దానికి కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలే. గత నెలలో అమెరికాలో పర్యటించిన ఆయన బీజేపీ నేత రామ్ మాధవ్ తో చర్చలు జరిపారు. ఆ సమయంలో జనసేనను బీజేపీలో కలిపేస్తారని ప్రచారం జరగగా జనసేన పార్టీని బీజేపీలో విలీనం చేసే ఆలోచనేది లేదని అప్పుడు పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.  గతంలో బీజేపీతో కలిసి పనిచేసిన విషయం గుర్తుచేసి  ‘ప్రత్యేక హోదా, ఇతర అంశాలపై స్పష్టత ఇవ్వాలని బీజేపీని కోరుతున్నానే తప్ప.. వ్యక్తిగతంగా ఆ పార్టీతో సమస్య లేదు. ఏపీ ప్రజల్లో ప్రత్యేక హోదా కావాలని బలమైన కోరిక ఉంటే.. నేనే కాదు, ప్రస్తుత ప్రభుత్వం సహా ఎవరైనా సరే దాని కోసం పోరాడాల్సిందే’ అని పవన్ అపట్లో చెప్పుకోచ్చారు.  సొంత ప్రయోజనాలు చూసుకుంటే టీడీపీ, బీజేపీలతో ఎందుకు గొడవ పడతానని, గెలిచే సీట్లు తీసుకొని వారితో కలిసేవాడిని కదా అని ఆయన చేసిన వ్యాక్యాలు అప్పట్లోనే చర్చనీయాంశం అయ్యాయి.  తాజాగా పవన్ పొలిటికల్ అఫైర్స్ కమిటీలతో పాటు.. మరికొన్ని కమిటీలను నియమించారు. పీఏసీ మీటింగ్‌లో.. ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా మందిని ఆశ్చర్య పరిచాయి. పార్టీ పొలిటి క‌ల్ ఎఫైర్స్ క‌మిటీ స‌మావేశంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ప‌ష్ట‌మైన సంకేతాలు ఇచ్చారు. కొన్ని జాతీయ పార్టీలు త‌మ‌తో క‌లిసి ప్ర‌యాణం చేయాల‌ని కోరుతున్నాయ‌ని వివ‌రించారు. ఎవ‌రితో ప్ర‌యాణం చేసినా లౌకిక పంథాను వీడబోమ‌ని ప‌వ‌న్ ప్ర‌క‌టించారు. జ‌న‌సేన అధినేత వ్యాఖ్య‌ల‌ను లోతుగా ప‌రిశీలిస్తే ఈ మ‌ధ్య కాలంలో బీజేపీ నేత‌లు మాత్ర‌మే ప‌వ‌న్‌తో మంత‌నాలు సాగించారు. లౌకిక పంథా అని చెప్పుకునేది బీజేపీ మాత్రమే కావడంతో బీజేపీతో పవన్ పొత్తు పెట్టుకుంటున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. విలీనం ఉండ‌దు కానీ ఎవరితో ప్ర‌యాణం చేసినా రాష్ట్రం కోసమే అంటూ ముక్తాయింపు ఇవ్వ‌టంతో జ‌న‌సేన ఇక బీజేపీతో క‌లిసి న‌డ‌వ‌టానికి సిద్దం అవుతున్న విష‌యం స్ప‌ష్టం అవుతోంది.  నిజానికి భాజపా ఎప్పుడూ జనసేన పార్టీని విలీనం చేసుకోవాలనే పట్టుదలతో ఉంది. 2014 ఎన్నికల్లో బీజేపీ – టీడీపీ – జనసేన కూటమి మంచి ఫలితాలను సాధించిన క్రమంలో అమిత్ షా నుంచే ఈ విలీనం ఆఫర్ పవన్ కల్యాణ్‌కు వచ్చింది. దేశంలో ప్రాంతీయ పార్టీలకు మనుగడ ఉండదని జనసేనను తమ పార్టీలో విలీనం చేయాలని ఆఆయన అప్పట్లో ఆఫర్ చేశారు.  పవన్ కల్యాణ్ ప్రచారంలో చాలా సార్లు ఈ మాట చెప్పారు.  అయితే పవన్ మాత్రం పార్టీ నడపాలనే ఉద్దేశంతోనే ఉన్నారు, ఎందుకంటే తన అన్న చిరంజీవి ఉదాహరణ లైవ్ గా కనిపిస్తూ ఉండి ఉండవచ్చు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఒక్క శాతం లోపే ఓట్లు రాగా జనసేన పార్టీకి ఆరు శాతం ఓట్లు వచ్చాయి. ఒకరకంగా తాజా ఎన్నిక‌ల్లో ప‌రాజ‌యం త‌రువాత సుదీర్ఘ రాజ‌కీయ అనుభ‌వం ఉన్న టీడీపీ కంటే ముందుగానే ప‌వ‌న్ కోలుకున్నారు.  ఆ వెంట‌నే పార్టీ శ్రేణుల్లో భ‌రోసా క‌ల్పించే ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టారు. స‌డ‌న్‌గా జ‌న‌సేన పొలిటిక‌ల్ ఎఫైర్స్ క‌మిటీ..పొలిట్ బ్యూరో ప్ర‌క‌టించారు. బీజేపీ మాత్రం టీడీపీ ప్రతిపక్ష స్థానాన్ని కూడా కైవసం చేసుకోవడానికి ప్లాన్ చేస్తింది. అందు కోసం వలసలను ప్రొత్సహించి గేట్లు ఎత్తినా ఏపీలో మోడీ మానియా పని చేసే పరిస్థితి లేకపోవడంతో పవన్ తో పొత్తుకి సైతం సిద్దం కావచ్చని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. బీజేపీతో కలిసి నడిచే విషయంలో పవన్ సానుకూలంగా ఉన్నట్లుగా ఆయన వ్యాఖ్యలను బట్టి స్పష్టమవుతోంది. చూద్దాం మరి ఏమవుతుందో ?    

anna canteens to be closed permanently

ఒక్కొక్కటిగా మూతపడుతున్న అన్నా క్యాంటీన్లు...మొత్తానికి మూసేస్తారా ?

గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ప్రవేశపెట్టిన ప్రజాకర్షక పథకాల్లో అన్నా క్యాంటిన్లు ఒకటి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూ.5కే పేదల ఆకలి తీర్చేందుకు చంద్రబాబు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన్ అన్న క్యాంటీన్లు మూతపడబోతున్నాయి. అన్న క్యాంటీన్ల నిర్వహణకు సంబంధించి ఏడాది కాంట్రాక్టు అక్షయపాత్ర ఫౌండేషన్‌తో ప్రభుత్వం కుదుర్చుకుంది. అయితే ఆ గడువు జులై 31వ తేదీతో ముగుస్తుంది.  అయితే ఈ కాంట్రాక్ట్ పొడిగింపుపై ప్రస్తుత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో అన్న క్యాంటీన్లు మూతపడటం ఖాయమని ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 210అన్న క్యాంటీన్లు ఉన్నాయి. వీటిలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రివేళల్లో భోజనం రూ.5చొప్పున అందిస్తుండేది ప్రభుత్వం. అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్లు రాజన్న క్యాంటీన్లుగా నడుపుతారని భావించినప్పటికీ అవి ఇప్పుడు ఒక్కక్కటిగా పూర్తిగా మూసివేస్తున్నారు.   ముందుగా మూత బడిన క్యాంటీన్ ఉండవల్లిలోని చంద్రబాబు నివాసం సమీపంలో ఉన్నదే కాగా అది మొదలు రాష్ట్రవ్యాప్తంగా చాలా క్యాంటీన్లు మూతబడుతున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, అద్దంకి, కనిగిరి, గిద్దలూరులలోని క్యాంటీన్లు, కర్నూలు జిల్లా ఆదోనితో పాటు మరో రెండు క్యాంటీన్లు, నెల్లూరులో రెండు క్యాంటీన్లు మూతబడినట్లు సమాచారం. క్యాంటీన్లన్నీ అక్షయపాత్ర పథకంతోనే నడుస్తుండగా హరే కృష్ణ ఫౌండేషన్ కి ప్రభుత్వం కోట్లలో బకాయి ఉంది. అవి చెల్లించకపోవడంతో నెల రోజుల నుంచి క్యాంటీన్లలో పెరుగు, మజ్జిగ ఏమీ లేకుండా? కేవలం సాంబారు, ఓ కూరతో రూ.5 కే భోజనం అందిస్తున్నారు.  అయితే బిల్లులను చెల్లించకపోవడంతోనే మూతబడుతున్నాయని చెబుతున్నారు. ముందుగా గత ప్రభుత్వ తాలూకూ గుర్తులు తొలగించి కాంటీన్లను కంటిన్యూ చేయాలనే అనుకున్నా రంగులు మార్చినా ఫోటోలు మారినా అన్నా క్యాంటీన్లగా గుర్తింపు ఉంటుందన్న భావనలోనే ఈ ప్రభుత్వం మనసు మార్చుకున్నట్లుగా విశ్లేషణలు వినవస్తున్నాయి. ఒక్కో క్యాంటీన్‌లో రోజుకు దాదాపు వెయ్యిమంది వరకూ భోజనాలు చేస్తున్నారు. ప్రభుత్వం మారిన తర్వాత ఈ సంఖ్యను క్రమంగా తగ్గిస్తూ వచ్చింది. తొలుత రోజుకు 800మందికి, ఆ తర్వాత 600మందికి మాత్రమే ఆహారం అందజేశారు.

No Special Quota For Kapu Community In Economically Weaker Section 10% Reservations

కాపు రిజర్వేషన్లకి బ్రేకులు వేసిన జగన్...ప్లస్సా... మైనస్సా ?

  ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు విద్యాసంస్ధల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు ఇచ్చింది. గతంలో కేంద్రం తీసుకొచ్చిన 10 శాతం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేసే ప్రక్రియలో భాగంగా జగన్ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. అయితే అక్కడితో ఎటువంటి ఇబ్బందీ లేదు కానీ గత టీడీపీ ప్రభుత్వం కాపులకు ఈ కోటాలో భాగంగా ఇచ్చిన ఐదుశాతం రిజర్వేషన్ల అమలును నిలిపివేస్తున్నట్టు జగన్ సర్కార్ క్లారిటీ ఇచ్చింది.  అగ్రవర్ణాలకు కేంద్రం కల్పించిన 10శాతం రిజర్వేషన్లను యథాతథంగా అమలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. అందుకు బదులుగా ఓసీ జాబితాలో ఉన్న ఆర్ధికంగా వెనుకబడిన కాపులకు మాత్రం పదిశాతం రిజర్వేషన్ వర్తిస్తుంది. గత టీడీపీ ప్రభుత్వ హాయంలో ఇచ్చిన ఎన్నిక మ్యానిఫెస్టో హామీని అమలు చేసేందుకు గాను  ఆర్ధికంగా వెనుకబడిన వర్గాలకు పదిశాతం కోటాలో సగం కాపులకి కేటాయించింది.  అయితే తాజాగా జగన్ సర్కార్ దానిని తొలగించింది. తాజా చట్టం ప్రకారం ఇప్పటివరకూ ఏ రిజర్వేషన్ల పరిధిలోకి రాకుండా ఉన్నవారికి ఇవి వర్తిస్తాయి. దీంతో పాటు ఐదెకరాల వ్యవసాయ భూమి ఉన్నవారు, వెయ్యి చదరపు అడుగుల స్ధలంలో ఇల్లు లేదా పట్టణ ప్రాంతాల్లో 100చదరపు గజాల స్ధలం, గ్రామీణ ప్రాంతాల్లో 200 గజాల ఇంటి స్ధలం కలిగిన వారిని ఈ రిజర్వేషన్ల పరిధి నుంచి మినహాయించారు.  ఆయా నిబంధనల ప్రకారం విద్యాసంస్ధల్లో ఈబీసీ రిజర్వేషన్లను అమలు చేస్తూ బీసీ సంక్షేమశాఖ జీవో జారీ చేసింది.వాస్తవానికి గతంలో మోదీ సర్కారు విద్యా సంస్థల్లో ఆర్థికంగా వెనకబడ్డ వారికి 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చేలా చట్టం చేసింది..ఆ చట్టం ప్రకారం విద్యా సంస్థల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు అదనంగా మరో 10 శాతం పెంచి అందులో ఆర్ధికంగా వెనకబడ్డ వారికి కేటాయించాల్సి ఉంటుంది.  గతంలో చంద్రబాబు ప్రభుత్వం ఈబీసీ కోటాలో కాపులకు ఐదుశాతం ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కొందరు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై స్పందించిన హైకోర్టు కేంద్రం చేసిన 103వ రాజ్యాంగ సవరణ ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని సూచించింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఉన్నత విద్యామండలి సూచనతో ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ ఇప్పటికే సూపర్ న్యూమరరీ విధానంలో సీట్లను పెంచి రిజర్వేషన్ల అమలుకు సిద్ధమైంది.  ప్రభుత్వ జీవోతో దీని అమలుకు మార్గం సుగమమైంది. కేంద్రం తీసుకొచ్చిన పదిశాతం ఈబీసీ కోటాను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా పేదలకు భారీగా లబ్ది చేకూరనుంది. ఐదుశాతం కాపు రిజర్వేషన్లు అమలు కాకపోవడంతో రాష్ట్రంలో రాజకీయంగా మరో సారి దుమారం రేపే సూచనలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయం మీద కాపులు మాత్రమే ఆసక్తితో ఉన్నా మిగతా సామజిక వర్గాలు అన్నీ వ్యతిరేకంగా ఉన్నాయి. నిజానికి చంద్రబాబుని సొంత సామాజిక్ వర్గం వారు కూడా ఈ విషయంలో విభేదించారు, సో ఈ రిజర్వేషన్లు నిలిపివేత ఒకరకంగా జగన్ కి ప్లస్సే అని అంటున్నారు.

Govt officers gives shock to AP Minister adimupalu suresh

జగన్ ఇచ్చిన స్వేఛ్చ...మంత్రులను అభాసుపాలు చేస్తోందా ?

  ఏపీలో కొత్తగా ఏర్పడిన వైసీపీ ప్రభుత్వంలో రకరకాల పరిణామాలు అటు ప్రజలకు, ఇటు నేతలకు రకరకాల షాక్ లు ఇస్తున్నాయి. ఎవరూ ఊహించనివారందరూ మంత్రులయ్యారు. అయితే అధికారులు మాత్రం అందరి మంత్రుల మాటా వినడం లేదనే వాదన వినిపిస్తోంది. పరిపాలన అంశాల్లో ఎవరూ అనవసర జోక్యం చేసుకోవద్దంటూ పార్టీ శ్రేణులకు హెచ్చరికలు చేస్తూనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులందరికీ పూర్తిగా స్వేచ్ఛ నివ్వడంతో ఇప్పుడు ఎవరూ మంత్రులను లెక్కచేసే పరిస్థితుల్లో కనిపించడంలేదనేది ఇన్సైడ్ టాక్.  అధికారుల తీరుతో కొంతమంది మంత్రులు అవమానాలే కాక అభాసుపాలవుతున్నారట. తాజాగా ఇటువంటి అనుభవమే ఏపీ విద్యాశాఖా మంత్రి ఆదిమూలపు సురేష్ కు ఎదురయ్యింది. ఆయనతో భేటీ అయ్యేందుకు ఆస్ట్రేలియా ప్రతినిధి బృందం వచ్చింది. విద్యారంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రతినిధి బృందం రాజధానికి వచ్చింది. ఈ బృందం రాష్ట్రంలో ప్రవేట్‌ విశ్వవిద్యాలయాల స్థాపిస్తామని ముందుకు వచ్చిందట. ఈ బృందం రాష్ట్ర మానవ వనరులశాఖ మంత్రి 'ఆదిమూలపు సురేష్‌'తో సమావేశమైందని, తాము పెట్టబోయే సంస్థల గురించి, ఇతర విషయాల గురించి మంత్రితో ఆ బృందం చర్చించిందట.  అయితే ఈ సమావేశానికి మానవ వనరులశాఖకు సంబంధించిన అధికారులు వస్తారని, రాష్ట్రంలో విద్యాపరిస్థితుల గురించి వారికి వివరిస్తారని మంత్రి భావించారట. కానీ ఈ సమావేశానికి సంబంధిత శాఖకు చెందిన సీనియర్‌ అధికారులెవరూ రాలేదట. సమావేశం ముగిసే వరకు మంత్రి సురేష్‌ వారి కోసం ఎదురు చూసినా వారెవరూ రాలేదని తెలుస్తోంది. దీంతో ఎజెండా ఏమిటి ? ప్రతినిధి బృందానికి ఏం చెప్పాలి అన్న విషయంలో మంత్రిగారికి క్లారిటీ మిస్ అయ్యింది. అసలు ఎందుకు వచ్చారో కనీస సమాచారం లేకుండా మీటింగ్ ఎలా పెడతారంటూ ఆయన తన ఓఎస్డీపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ మంత్రి ఉన్నత విద్యావంతుడు కావడంతో సమయస్ఫూర్తితో వారితో మామూలుగా మాట్లాడి పంపించేశారు కానీ మరొకరు అయితే వారి ముందు అభాసుపాలయ్యేవారేనని అంటున్నారు.  

Karnataka politics bjp trying to control speaker

కన్నడ స్పీకర్ ని టార్గెట్ చేసిన బీజేపీ...ముందరి కాళ్ళకి బంధం !

  కర్ణాటకలో విజయవంతంగా భాజాపా సీఎం ప్రమాణ స్వీకారం చేయడంతో ఇప్పుడు తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు ఆ పార్టీ మేధావులు. ఇప్పటికే ముఖ్యమంత్రి కుమారస్వామి కథ ముగియడంతో తమకి భవిష్యత్తులో ఇబ్బందిగా మారే అవకాశం ఉన్న స్పీకర్‌ రమేష్‌కుమార్‌పై దృష్టి సారించారు కమల దండు. ఆయనపై ఆర్టికల్‌ 179 (సీ) ప్రయోగించి ముందరి కాళ్ళకి బంధం వేయాలని ఆ తర్వాత సభలో విశ్వాసం పొందాక ఏకంగా సాగనంపే ఉద్దేశంతో ఉంది.   దాదాపుగా ఏడాది క్రితం ఒకసారి సీఎంగా ప్రమాణం చేసి అది కుదరక మళ్ళీ తప్పుకుని ఆనాటి అధికారం కోసం ఎదురు చూస్తున్న కాషాయదళం కోరిక నెరవేరింది. కానీ సభలో బలనిరూపణ చేసుకోవాల్సిన పెద్ద గండం ముందుంది. ఇటువంటి సమయంలో స్పీకర్‌ వ్యవహారశైలి చాలా కీలకం. ఇప్పటికే రాజీనామా చేసిన ముగ్గురు ఎమ్మెల్యేలపై స్పీకర్‌ అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. మిగిలిన వారి రాజీనామాలను ఆయన పరిశీలిస్తున్నారు.  ఇదే జరిగితే బీజేపీ గట్టెక్కడం కష్టమే. జేడీఎస్‌-కాంగ్రెస్‌ అనుకూలవాదిగా ముద్రపడిన కాంగ్రెస్ పార్టీకి చెందిన స్పీకర్‌ రమేష్‌కుమార్‌ను సాగనంపకుంటే విశ్వాస పరీక్షలో గట్టెక్కడం కష్టమని బీజేపీ భావిస్తోంది. అందుకే కొత్త వ్యూహానికి తెరతీస్తున్నట్లు సమాచారం. నిజానికి రాబోయే సోమవారం యడ్యూరప్ప సీఏమ్గా తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంది. రెబెల్‌ ఎమ్మెల్యేలంతా బీజేపీకి మద్దతు ఇస్తామని చెబుతున్నారు కానీ అలా అని వారి నుండి ఎటువంటి లిఖిత పూర్వక హామీ లేదు.  అది స్పీకర్ చేతికి వచ్చిన వెంటనే ఆయన అసమ్మతి ఎమ్మెల్యేలపై వేటు వేసే విశ్వాస పరీక్షలో గట్టెక్కడం యడ్యూరప్పకు కష్టమవుతుంది. అందుకే ఆయనను వీలైనంత త్వరగా సాగనంపే ఏర్పాట్లను చేస్తున్నారని అంటున్నారు. సభలో మెజార్టీ ఉన్న పార్టీకి స్పీకర్‌ను తొలగించే అధికారం ఉన్నప్పటికీ బలనిరూపణ చేసుకోక ముందే ఇది సాధ్యం కాదు. ఈలోగా ఆయనను కంట్రోల్ లో పెట్టాలంటే ఆర్టికల్‌ 179 (సీ) ప్రయోగం ఉత్తమమని కమలనాథులు భావిస్తున్నారు.  స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్లను తొలగించేందుకు ఉద్దేశించిన ఈ చట్టంతో ఆయన్ని తొలగిస్తూ నోటీసు ఇస్తే, ఇప్పటికిప్పుడు తొలగించలేక పోయినా ఆయన అధికారాలకు మాత్రం బ్రేక్‌ పడుతుంది. 14 రోజుల నోటీసు పీరియడ్‌లో స్పీకర్‌కు కొన్ని అధికారాలు మాత్రమే ఉంటాయి. ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకునేందుకు వీలుండదు. ముఖ్యంగా రెబల్‌ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించే అవకాశం ఉండదు. కాబట్టి ఈ దిశగా అధికార బీజేపీ పావులు కదుపుతోంది. ఏది ఏమయినా దక్కక దక్కక దక్కిన పదవిని కాపాడుకోవడానికి బీజేపీ అన్ని రకాల ప్రయత్నాలూ చేస్తోంది. 

Sand Issue Troubuling Jagan government

ఇసుక వ్యవహారం జగన్ కొంప ముంచుతుందా ?

  ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు ఇసుక పెద్ద చర్చనీయాంశంగా మారింది. సిమెంట్ బస్తా కంటే అదే బస్తాలో వేసి ఇసుకని ఎక్కువ రేటుకు అమ్ముతున్నారని ప్రచారం జరుగుతోంది. వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్నా లారీ ఇసుక రూ. 25 నుంచి 30వేల వరకూ పలుకుతోంది. టీడీపీ నేతలు ఇసుకతో కోట్లు సంపాదిస్తున్నారని వైసీపీ ఉద్యమాలు చేసిన రోజుల్లో లారీ ఇసుక రూ. పదివేల లోపే ఉంది.  నిజానికి చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల్లో ఓడడానికి ఒక కారణం ఇసుక మాఫియా అనే అంటారు. పేరుకు ఉచితం అన్నా డ్వాక్రా మహిళల పేరిట కార్యకర్తలు అక్రమంగా సంపాదిస్తున్నా మిన్నకుండిపోయింది. దాని ఎఫెక్ట్ సార్వత్రిక ఎన్నికల్లో టిడిపి ని చావుదెబ్బే కొట్టింది. ఇసుక మాఫియా గురించి ప్రతిపక్షంలో వున్నన్ని రోజులు ఉద్యమాలు చేసి ఊదరగొట్టిన వైసీపీ అధికారం చేపట్టి రెండు నెలలు అవుతున్నా ఎటువంటి పాలసీ తేకపోవడం చాలా ఇబ్బంది కర పరిస్థితులకి దారి తీస్తోంది.  వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలో ఇసుక ర్యాంప్ లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ తరువాత కలెక్టర్ ఇతర అధికారుల పర్యవేక్షణలో ఇసుకను విక్రయిస్తూ ఉండటంతో మళ్ళీ మాఫియా సీన్ లోకి దిగిపోయింది. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల ఎమ్యెల్యే, ఎంపీలు తమ పరిధిలో వున్న కొద్దిపాటి రీచ్ లపై అనధికార పెత్తనం మొదలు పెట్టేశారని తెలుస్తూనే ఉంది.  ఇవి ఎంతో పారదర్శకంగా ప్రభుత్వాన్ని నడుపుదామనుకుంటున్న వైఎస్ జగన్ కి ఇసుక వ్యవహారం లేని పోని తలవంపులు తెచ్చిపెడుతోంది. ఇసుక సప్లై నిలిచిపోయిన కారణంగా భవన నిర్మాణ కార్మికులు మాత్రమే కాదు చాలా రంగాల్లో స్థబ్ధత నెలకొంది. సిమెంట్, ఐరన్, ఇటుక పరిశ్రమ, ఇతర భవన నిర్మాణ సామాగ్రి విభాగాలన్నీ పూర్తిగా డల్ అయిపోయాయి. నెలలు తరబడి నిర్మాణాలు వాయిదా పడితే బ్యాంక్ రుణాలతో గృహాలు నిర్మించుకునే వారికి వడ్డీల భారం అధికమౌతుంది.  లక్షలాదిమంది ఆధారపడే భవన నిర్మాణ రంగంలో ఏర్పడ్డ సంక్షోభం మరింత ముదరకముందే వైసిపి సర్కార్ ఏదో ఒక విధానం ప్రవేశపెట్టి కాపాడాలని మొత్తుకుంటున్నారు. నిజానికి గతంలో చంద్రబాబు ఇసుక విషయంలో ఎన్ని కట్టడులు చేసినా మాఫియా చెలరేగిపోతూండటంతోనే ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. రవాణా ఖర్చులు భరించి ఎవరైనా ఇసుకను తీసుకెళ్లే విధానాన్ని తీసుకొచ్చారు.  అయితే ఫ్రీ ఇసుక మాకే అన్నట్టుగా కొందరు ఆ పార్టీ నేతలు ఇసుక మాఫియాతో చేతులు కలిపి.. ఇసుక నుంచి భారీగా సంపాదించుకోవడం మొదలు పెట్టారు. ఎంత టీడీపీ నేతలు మాఫియాగా మారినట్లు ఆరోపణలు ఉన్నా అప్పట్లో లారీ ఇసుక రూ. పదివేల కన్నా తక్కువే ఉండేది. మరిప్పుడు వైసీపీ ప్రభుత్వం ఆ విషయంలో కట్టడి చేయకుంటే మరింత చెడ్డ పేరు రావడం ఖాయం.     

ఒక పరాజయం 100 తప్పులు.. బాబు కొంపముంచిన అక్రమ కొంప!!

  ఏపీ రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దుతానని చెప్పిన చంద్రబాబు.. రాజధాని ప్రాంతంలో కనీసం సొంతిల్లు నిర్మించుకోకపోవడం ఆయన చేసిన పెద్ద తప్పని చెప్పక తప్పదు. ఒకవైపు కొందరు టీడీపీ నేతలేమో.. అప్పుడు ప్రతిపక్ష నేత జగన్ కి అమరావతిలో ఇల్లు లేదని, ఆయన హైదరాబాద్ లోనే ఉంటారని విమర్శలు చేసేవారు. అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా హైదరాబాద్ లోనే ఉంటారని, అప్పుడప్పుడే ఏపీకి వస్తారు అంటూ విమర్శించారు. కానీ జగన్, పవన్ ఇద్దరూ అమరావతికి దగ్గరలో సొంతిల్లులు నిర్మించుకున్నారు. కానీ బాబు మాత్రం ఐదేళ్లు అక్రమ కట్టడంలో ఉండి విమర్శలు ఎదుర్కొన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నదీ పరివాహక ప్రాంతాల్లో అక్రమంగా నిర్మించారంటూ.. కరకట్ట దగ్గర ఉన్న పలు నిర్మాణాలకు నోటీసులు ఇచ్చింది టీడీపీ సర్కార్. అందులో లింగమనేని గెస్ట్ హౌస్ కూడా ఉంది. కట్ చేస్తే కొద్ది రోజులకు అదే ఇంట్లో బాబు నివాసం ఉన్నారు. అక్రమ కట్టడంలో సీఎం నివసించడం ఏంటని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. కానీ బాబు పట్టించుకోకుండా అదే అక్రమ ఇంట్లో ఉన్నారు. దీంతో ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయి. ఒకవైపు జగన్, పవన్ లు సొంతిల్లు నిర్మించుకుంటే.. రాజధానిని నిర్మిస్తానన్న బాబు సొంతిల్లు కూడా నిర్మించుకోకుండా అక్రమ కొంపలో నివాసమున్నారు. ఇది బాబు మీద బాగా ప్రభావం చూపింది. వీటికి తోడు ఏపీకి పెద్ద పెద్ద కంపెనీలు తీసుకొస్తానని చెప్పిన బాబు.. తన కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ లోనే కొనసాగించారు. అంతేకాదు అమరావతి ప్రాంతంలో సొంతిల్లు కట్టుకోని బాబు.. హైదరాబాద్ లో మాత్రం అధునాతన ఇంటిని నిర్మించుకున్నారు. ఇవన్నీ బాబుని విమర్శలపాలు చేసాయి.

జగన్ ఆ అధికారిణి విషయంలో ఎందుకు అంత శ్రద్ద తీసుకుంటున్నట్టు ?

  ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలని పరిశీలిస్తే ఆయనలోని అనుభవరాహిత్యం, ఎవరి మాటా  లెక్కచేయని తనం రెండూ ముఖ్యంగా కనిపిస్తున్నాయి. పాలనా పరమైన విషయాలలో ఎన్ని తప్పులు చేసినా ఏదో ఒక రకంగా వాటిని సరిదిద్దుకుని మళ్ళీ గాడిలో పడే అవకాశం ఉంటుంది, కానీ అధికారుల నియామకాల విషయంలో ఏమాత్రం పక్షపాతం చూపినా అది ప్రతిపక్షాలకు పెద్ద స్కోప్ ఇచ్చినట్టు అవుతుంది.  కానీ జగన్ తెలిసో తెలీకో, లేదో ఎవరేం చేస్తారన్న ధీమా వలనో కానీ జగన్ అదే తప్పు చేస్తున్నాడు.సీనియర్ సివిల్ సర్వీసెస్ అధికారిణి శ్రీలక్ష్మి ని ఏపీ సర్వీస్ లోకి తీసుకోని రావటానికి జగన్ ఎందుకు అంత ఆసక్తి చూపిస్తున్నారో ప్రభుత్వ అధికారులకి అర్ధం కావటం లేదట. ఏకంగా విజయసాయి రెడ్డితో కలిసి ఢిల్లీ వెళ్లిన అమిత్ షా, మోడీలతో మాట్లాడి మరీ ఏపీకి రావటానికి ప్రయత్నిచడం హాట్ టాపిక్ గా మారింది.  ఆమె విషయంలో విజయసాయితో పంపి మరీ ఎందుకు ఇంత శ్రద్ధ తీసుకుంటున్నారనేది పెద్ద క్వస్చన్ మార్క్ గా మారింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో మైనింగ్ శాఖ కార్యదర్శిగా పనిచేసిన శ్రీ లక్ష్మి అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. వైయస్ మరణం తర్వాత జగన్ మీద నమోదైన అక్రమాస్తుల కేసులలో శ్రీ లక్ష్మీ పై ఓబులాపురం గనుల అవినీతి కేసు సిబిఐ నమోదు చేసింది.  ఇక ఈ కేసులో శ్రీలక్ష్మి రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించింది. ఆ సమయంలో ఆమె ఆరోగ్యం సైతం క్షీణించి అనారోగ్యం పాలైంది. ఆ తర్వాత ఆమెకు క్లీన్ చిట్ లభించగా రాష్ట్ర విభజన అనంతరం తెలంగాణ రాష్ట్రానికి కేటాయించారు. ఆ తర్వాత సైలెంట్ అయిన ఆమె ఏపీలో జగన్ ప్రభుత్వం ఏర్పాటయిన తర్వాత కలిసి పనిచేస్తానని జగన్ ను కలిశారు. ఆమె విషయంలో సానుకూలంగా స్పందించిన జగన్ ఏపీ ప్రభుత్వంలో అవకాశం కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నారు.  అయితే అవినీతి ఆరోపణలు ఎదుర్కొని రెండేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించిన అధికారిణికి అది కూడా జగన్ కేసులలోనే జైలుకు వెళ్ళిన అధికారిణికి అవకాశం ఇవ్వడం, పట్ల ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని కార్నర్ చేసే అవకాశం ఉంది. అవినీతి అధికారులను ప్రోత్సహించే జగన్ అవినీతి నిర్మూలన అంటూ ప్రకటనలు ఇవ్వడం రెండిటికీ సింక్ కాదని అంటున్నారు. మరి జగన్ ఈ రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారో ఆయనకే తెలియాలి.    

నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష....బీజేపీ మీద కాంగ్రెస్ రివర్స్ ఎటాక్ ?

  నీవు నేర్పిన విద్యయే నీరజాక్ష,  ఎవరికీ చెడు విద్యలు నేర్పించకు. అవతలి వాడు ఆ విద్యలు నీ మీద కూడా ప్రయోగించగలడు. నీటిలో నీ ముఖం ప్రతిబింబించినట్టుగా నీవు ఇతరులకి నేర్పిన విద్య నీ మీద కూడా ప్రతిఫలించ గలదని చెప్పారు మహానుభావులు. ఇప్పుడు అదే బీజేపీ విషయంలో నిజమయ్యింది. తాజాగా మధ్యప్రదేశ్‌లో కమల్‌నాథ్ ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీజేపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది.  బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నిన్న కాంగ్రెస్ పార్టీలో చేరారు. బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠీ, శరద్ కౌల్ కాంగ్రెస్ గూటికి చేరారు. దాంతో కమల్‌నాథ్ ప్రభుత్వాన్ని కూలుస్తామని బెదిరించిన బీజేపీకి ఇద్దరు ఎమ్మెల్యేల మద్దతు తగ్గినట్లైంది. నిజానికి కర్ణాటకలో ఆపరేషన్ కమలం పూర్తవ్వడంతో బీజేపీ తదుపరి లక్ష్యం మధ్యప్రదేశ్ అని చర్చ జరిగింది.  దానికి ఊతం ఇచ్చేలాగా మోదీ, అమిత్ షా కనుసైగ చేస్తే చాలు 24 గంటల్లోనే మీ ప్రభుత్వం కూలిపోతుందని అసెంబ్లీలోనే బీజేపీ నేత ఒకరు వ్యాఖ్యానించారు. దీంతో ఆపరేషన్ కమలం మధ్యప్రదేశ్‌లో మొదలైనట్టేనని భావించారు. కానీ కర్ణాటకను చేజార్చుకున్న కాంగ్రెస్ ఇక్కడ ముందుకు ముందే జాగ్రత్త ఒఅడింది. శాసనసభలో నీ ప్రభుత్వం కూల్చేస్తాం జాగ్రత్త అని పరోక్షంగా తనకే వార్నింగ్ ఇచ్చిన కమలనాథులకు సీఎం కమల్‌నాథ్ ఎదురు దాడి చేశారు.  నిన్న మధ్యప్రదేశ్ అసెంబ్లీలో క్రిమినల్ లా చట్ట సవరణకు ఓటింగ్ ప్రక్రియ నిర్వహించారు. ఈ ఓటింగ్ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కౌల్‌లు ప్రభుత్వానికి అనుకూలంగా ఓటేశారు. అంతేకాదు బుధవారం రాత్రి సీఎం కమల్‌నాథ్ ఇచ్చిన విందులో వీరు పాల్గొన్నారు.  దీంతో మధ్యప్రదేశ్‌లో ప్రభుత్వాన్ని త్వరలో గద్దె దించుతామన్న ఆ పార్టీకి షాక్ తగిలింది.  క్రిమినల్ లా సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సమయంలో బీఎస్పీ ఎమ్మెల్యే సంజీవ్ సింగ్ దీనిపై ఓటింగ్ జరగాలని డిమాండ్ చేశారు. దాంతో స్పీకర్ ఓటింగ్ నిర్వహించారు. ప్రభుత్వానికి అనుకూలంగా 122 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్‌కు 121 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. కానీ దానికి 122 ఓట్లు వచ్చాయి. ఒక ఓటు స్పీకర్‌ది. విపక్షాలకు ఒక్క ఓటు కూడా రాలేదు. ఎందుకంటే ఓటింగ్‌లో బీజేపీ పాల్గొనలేదు.  అయితే, బీజేపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఓటు వేశారు. మధ్యప్రదేశ్‌లోనూ కర్ణాటక పరిణామాలు రిపీట్ ఆయె అవకాశాలు ఉన్న నేపథ్యంలో.. ఆపరేషన్ కమలానికి చెక్ పెట్టేలా ద్వారా కాంగ్రెస్ పార్టీ ముందుగా మేల్కొని ఆపరేషన్ కమల్‌నాథ్ చేపట్టింది.  మధ్యప్రదేశ్ లో శాసనసభ్యుల సంఖ్య 230 కాగా సాధారణ మెజారిటీ 116 సీట్లు, అయితే కూటమి పార్టీలతో కలిసి కాంగ్రెస్‌ బలం 121 సీట్లు, అందులో కాంగ్రెస్‌ (114), బీఎస్పీ (2), ఎస్పీ(1), స్వతంత్రులు (4) ఉండగా, బీజేపీ బలం 109 సీట్లు.  కమల్ నాథ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లుకు మద్దతుగా ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలు నారాయణ్ త్రిపాఠి, శరద్ కౌల్ ఓటు వేశారు. ఆ ఇద్దరు బీజేపీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ తన హస్తాల్లో పెట్టుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తమకు అనుకూలంగా ఓటేసిన బీజేపీ ఎమ్మెల్యేలిద్దరిని కాంగ్రెస్ ఎవరికి తెలియని ప్రదేశంలో రహస్యంగా ఉంచింది.    

ఒక పరాజయం 100 తప్పులు.. బాబు పవన్ మధ్య చిచ్చు పెట్టిన లోకేష్!

  2014 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మద్దతు తీసుకున్న టీడీపీ.. తరువాత ఆయనను దూరం చేసుకొని తప్పు చేసిందా అంటే అవుననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. 2014 ఎన్నికలు టీడీపీ, వైసీపీల మధ్య నువ్వానేనా అన్నట్టుగా జరిగాయి. చాలా తక్కువ తేడా ఓటు శాతంతో టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల్లో టీడీపీకి బీజేపీ,జనసేనలు మద్దతిచ్చాయి. బీజేపీ వల్ల టీడీపీకి ఎంత ప్లస్ అయిందో చెప్పలేం కానీ జనసేన వల్ల మాత్రం టీడీపీకి కచ్చితంగా ప్లస్ అయిందనే చెప్పాలి. పవన్ కి యూత్ లో ఉన్న క్రేజ్ టీడీపీకి ప్లస్ అయింది. అలాగే మెజారిటీ కాపు సామాజికవర్గ ఓట్లు కూడా టీడీపీకి పడ్డాయి అంటారు. అంటే 2014 లో టీడీపీ అధికారంలోకి రావడానికి పవన్ కూడా కారణమని చెప్పవచ్చు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల తరువాత.. టీడీపీ, జనసేనల మధ్య గ్యాప్ మొదలైంది. పవన్ టీడీపీకి దూరమై టీడీపీని ప్రశ్నించడం మొదలు పెట్టారు. అది నచ్చని టీడీపీ నేతలు ఆయన్ని విమర్శించడం మొదలుపెట్టారు. అలా పవన్ ని, పవన్ అభిమానుల్ని టీడీపీ దూరం చేసుకుంది. అయితే పవన్ టీడీపీకి దూరమవ్వడానికి కారణం లోకేష్ అని పార్టీ వర్గాల్లో ప్రచారం కూడా జరిగింది. టీడీపీ గెలవడానికి పవన్ కారణం కాదు, పవన్ లేకపోయినా టీడీపీ గెలుస్తోంది అంటూ కొందరు లోకేష్ ని రెచ్చగొట్టడంతో.. లోకేష్ పవన్ పై చులకన వ్యాఖ్యలు చేశారట. ఈ విషయం పవన్ కి తెలియడంతో.. ఆయన హర్ట్ అయి టీడీపీకి దూరంగా జరిగారట. అందుకే పవన్ టీడీపీకి దూరమయ్యాక లోకేష్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేసారు అని అంటుంటారు. ఈ విషయంలో మరో వాదన కూడా వినిపిస్తూ ఉంటుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదన్న ఉద్దేశంతో చంద్రబాబే.. పవన్ ని దూరం పెట్టి డైరెక్ట్ చేసారని ఆరోపణలు వినిపించాయి. ఇదే విషయాన్నీ ఎన్నికలకు ముందు వైసీపీ పదేపదే ప్రస్తావిస్తూ జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. మరోవైపు టీడీపీ ప్రభుత్వ పనితీరుపైన, అవినీతి పైన ప్రతిపక్ష వైసీపీ కంటే.. పవన్ వేసిన వ్యాఖ్యలే జనంలోకి బలంగా వెళ్లాయని, అది టీడీపీకి తీవ్ర నష్టం చేసిందని అంటారు. అదేవిధంగా పవన్ దూరమవడంతో యూత్ ఓట్లు కూడా టీడీపీ దూరమయ్యాయి. మెజారిటీ యూత్ పవన్ కి, జగన్ కి జై కొట్టారు. మొత్తానికి తెలిసో తెలియకో పవన్ ని దూరం చేసుకొని టీడీపీ తప్పు చేసిందని చెప్పక తప్పదు.