English | Telugu
ఇంద్రజ టీలో ఈగ ఉంటే, నా రేంజ్కి నా టీలో ఏనుగు ఉండాలిగా.. నాలిక కరుచుకున్న రోజా!
Updated : Oct 31, 2021
'జబర్దస్త్' జడ్జిగా రోజా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. గతంతో పోలిస్తే ఇటీవల ఆమె కాస్త లావయ్యారు. ఆ విషయాన్ని ఆమె ఒప్పేసుకున్నారు. అదీ.. తనను ఏనుగుతో పోల్చుకుంటూ! అదెప్పుడు జరిగిందంటారా? వచ్చే దీపావళి సందర్భంగా 4వ తేదీ ఈటీవీలో 'తగ్గేదేలే' అనే స్పెషల్ ప్రోగ్రాం ప్రసారం కాబోతోంది. అందులో అన్నమాట! ఈ షోలో రోజా, ఇంద్రజ, ప్రియమణి, పూర్ణ, మన్నారా చోప్రా తమ గ్లామర్తో అలరించారు, ఆకట్టుకున్నారు.
ఇంద్రజ "కన్నులతో చూసేదీ గురువా కనులకు సొంతము" పాటకు చేసిన పర్ఫార్మెన్స్ అదుర్స్ అనిపించేలా ఉంది. ప్రియమణి "మగాళ్లు ఒట్టి మాయగాళ్లే" పాటను పాడి అలరించింది. చలాకీ చంటి "ఓహో లైలా ఓ చారుశీల" పాటను హుషారుగా ఆలపించి ఆశ్చర్యపరిచాడు.
సినిమా డైరెక్టర్గా హైపర్ ఆది ఐదుగురు హీరోయిన్లతో షూటింగ్ను ప్లాన్ చేశాడు. వారిలో నలుగురు.. రోజా, ఇంద్రజ, ప్రియమణి, మన్నారా వచ్చి కుర్చీల్లో కూర్చున్నారు. ప్రియమణి వచ్చి నమస్కారం చేయగానే, "డైరెక్టర్ గారికి ఒక హగ్ ఇచ్చి, ఆ రెస్పెక్ట్ తెలీదా మీకు?" అని అడిగాడు ఆది. ప్రియమణికి ఏమనాలో తెలీక నవ్వుతూ అతడి వంక అలాగే చూసింది.
"మీరు కాఫీలో, టీలో ఏదో ఒకటి ఆర్డర్ చేసుకోండి" అనడిగాడు ఆది. రోజా గ్రీన్ టీ, ఇండ్రజ ఎల్లో టీ, ప్రియమణి బ్లాక్ టీ, మన్నారా బ్లూ టీ ఆర్డర్ చేశారు. "ఇవన్నీ మా దగ్గర లేవు. గ్రీన్ టీ ఒక్కటే ఉంది" అని అది సర్వ్ చేయించాడు ఆది. "ఏంటిది? నా టీలో ఈగ ఉంది!" అని ఆశ్చర్యపోయింది ఇంద్రజ. "ఈమె టీలోనే ఈగ ఉంటే నా రేంజ్కి నా టీలో ఏనుగుండాలిగా" అని చెప్పి, వెంటనే తానేమన్నదో గ్రహించి నాలుక కరుచుకొని, చేత్తో కళ్లు మూసుకుంది రోజా. అందరూ పడీ పడీ నవ్వారు. అలా మొత్తానికి రోజా తన ఆకారం ఎలా ఉందో తనే చెప్పేసుకుందని అందరూ అంటున్నారు.