English | Telugu

Shambhala Trailer: అదిరిపోయిన 'శంబాల' ట్రైలర్.. ఆది ఖాతాలో హిట్ ఖాయమేనా?

Publish Date:Dec 21, 2025

  ఆది సాయి కుమార్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘శంబాల’. యగంధర్ ముని దర్శకత్వంలో షైనింగ్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీలో అర్చన అయ్యర్, స్వాసిక, రవివర్మ, మధునందన్, శివ కార్తీక్ తదితరులు కీలక పాత్రల్ని పోషించారు. డిసెంబర్ 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో.. తాజాగా రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఆదివారం నాడు నేచురల్ స్టార్ నాని చేతుల మీదుగా ఈ ట్రైలర్ విడుదలైంది. (Shambhala Mystical Trailer)    దాదాపు రెండు నిమిషాల నిడివితో రూపొందిన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఆకాశం నుంచి ఓ ఉల్క పడటంతో ట్రైలర్ మొదలైంది. ‘పంచభూతాల్ని శాసిస్తుందంటే ఇది సాధారణమైనది కాదు’.. అనే డైలాగ్‌తో ఆ ఉల్క శక్తిని చూపించారు. ఇక ఊర్లో అందరూ వింతగా ప్రవర్తిస్తుండటం, ఆ ఉల్కను కట్టడి చేసేందుకు పూజలు చేయడం, మఠాధిపతులను తీసుకు రావడం చూపించారు. (Shambhala Trailer)   ఇక మిస్టరీని ఛేదించేందుకు నాస్తికుడైన హీరో రంగంలోకి దిగడం "మీ కాకమ్మ, కాశీ, మజిలీ కథలు ఊరి జనాలకు చెప్పండి.. నాక్కాదు" అని అనడం చూస్తే అతని పాత్ర ఎలా ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. ఊర్లో వరుసగా హత్యలు, ఆత్మహత్యలు జరుగుతుంటాయి. "ఇప్పటి నుంచి మీ పిచ్చితనానికి ఎవ్వరినీ బలికానివ్వను.. అది ఆవైనా సరే.. చీమైనా సరే" అని హీరో పరిష్కారం కనిపెట్టే దిశగా ప్రయత్నాలు చేస్తుంటాడు. ఊరికి వ్యతిరేకంగా హీరో చేసే పోరుని ట్రైలర్‌లోనే అద్భుతంగా చూపించారు. ఇక ట్రైలర్ లో ప్రవీణ్ కె బంగారి విజువల్స్, శ్రీ చరణ్ పాకాల ఆర్ఆర్ ఆకట్టుకున్నాయి.    ప్రేమ కావాలి, లవ్‌లీ వంటి విజయవంతమైన సినిమాలతో కెరీర్ ప్రారంభించిన ఆది.. ఓ మంచి విజయం కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. తాజా ‘శంబాల’ ట్రైలర్ చూస్తుంటే.. ఆది ఎదురుచూస్తున్న హిట్ రావడం ఖాయమనిపిస్తోంది.   కాగా, ఇప్పటికే ‘శంబాల’ సినిమా మేకర్లకు లాభసాటి ప్రాజెక్ట్‌గా మారింది. థియేట్రికల్, నాన్-థియేట్రికల్ రైట్స్ మంచి ధరకు అమ్ముడయ్యాయి. రిలీజ్‌కు ముందే టేబుల్ ప్రాఫిట్స్‌తో నిర్మాతలు హ్యాపీగా ఉన్నారు. మరి డిసెంబర్ 25న థియేటర్లలో అడుగుపెడుతున్న ఈ సినిమా.. బయ్యర్లకు కూడా లాభాలను తెచ్చి పెడుతుందేమో చూడాలి.  

సూర్యకాంతం మరణం.. పట్టించుకోని టాలీవుడ్‌ ప్రముఖులు.. ఎందుకని?

Publish Date:Dec 18, 2025

(డిసెంబర్‌ 18 నటి సూర్యకాంతం వర్థంతి సందర్భంగా..) కొందరు నటీనటులు కొన్ని పాత్రలకే పరిమితం కాకుండా రకరకాల క్యారెక్టర్స్‌ చేసేందుకు ఇష్టపడతారు. చేసిన పాత్రలే మళ్లీ మళ్లీ చెయ్యాలని ఎవరూ అనుకోరు. ఎందుకంటే అలా చేస్తే రొటీన్‌ అయిపోతుందనే విషయం అందరికీ తెలుసు. కానీ, ఒకే తరహా పాత్రను మళ్లీ మళ్లీ చేసి మెప్పించడం సూర్యకాంతం వల్లే సాధ్యమైంది. గయ్యాళి పాత్రలకు కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన సూర్యకాంతం.. 200 సినిమాల్లో ఆ పాత్రను పోషించి ప్రేక్షకులకు బోర్‌ కొట్టకుండా చెయ్యగలిగారు.   సాధారణంగా సినిమాల్లో గయ్యాళి పాత్ర రాగానే ఆ పాత్ర పట్ల ప్రేక్షకులకు కోపం వస్తుంది. అయితే సూర్యకాంతం చేసే పాత్రలపై వారికి కోపం ఉంటూనే జాలి కూడా కలుగుతుంది. అలా ఆ పాత్రను సూర్యకాంతం తనదైన శైలిలో పోషించి మెప్పించారు. ఆమె చేసిన పాత్రల ప్రభావం ఎంతలా ఉండేదంటే.. తల్లిదండ్రులు తమ పిల్లలకు సూర్యకాంతం అనే పేరు పెట్టుకోవడం కూడా మానేసే అంతగా. అంతకుముందు సూర్యకాంతం పేరు చాలా మందికి ఉండేది. ఆమె సినిమాల్లోకి వచ్చిన తర్వాత తెలుగు వారెవరూ తమ పిల్లలకు ఆ పేరు పెట్టే సాహసం చెయ్యలేదు.    సినిమాల్లో అంత గయ్యాళిగా కనిపించే సూర్యకాంతం ప్రవర్తన నిజజీవితంలో దానికి పూర్తి విరుద్ధంగా ఉండేది. ఎంతో సౌమ్యం, మరెందో దయ, దానగుణంతో అందరికీ ప్రేమను పంచేవారు. అప్పటి హీరోలకు, మిగతా నటీనటులకు సూర్యకాంతం అంటే ఎంతో అభిమానం. ఆమె షూటింగ్‌లో ఉన్నారంటే యూనిట్‌ సభ్యులకు పండగే. ఎందుకంటే.. తను షూటింగ్‌కి వచ్చేటప్పుడు 20 మందికి సరిపడా భోజనాలు, పిండి వంటలు ఆమె వెంట వచ్చేవి. అందరితో కలిసి కూర్చొని ఆమె భోజనం చేసేవారు. అందరికీ కొసరి కొసరి వడ్డించేవారు.    సినిమాల ద్వారానే కాకుండా రకరకాల వ్యాపారాలు కూడా చేసి డబ్బు సంపాదించేవారు సూర్యకాంతం. అప్పట్లోనే పాత కార్లను కొని వాటికి మరమ్మతులు చేయించి తిరిగి అమ్మే వ్యాపారం చేసేవారు. నటీనటులకు వాడే మేకప్‌ సామాగ్రి వల్ల స్కిన్‌ ఎలర్జీ వస్తోందని గ్రహించిన ఆమె.. విదేశాల నుంచి మేకప్‌ కిట్స్‌ తెప్పించి, వాటిని హీరోయిన్లకు అమ్మేవారు. ఇవి కాకుండా ఫైనాన్స్‌ కూడా చేసేవారు. ఎంతో మంది నిర్మాతలు తమ సినిమాల కోసం సూర్యకాంతం దగ్గర ఫైనాన్స్‌ తీసుకునేవారు. ఇక బాపు, రమణ చేసిన సినిమాలన్నింటికీ ఆమే ఫైనాన్సియర్‌. అది కూడా ఎంతో న్యాయబద్ధంగా చేసేవారు. దానికి ఉదాహరణగా ఒక సంఘటనను చెప్పుకోవచ్చు.   ఒక సినిమాకి సంబంధించి ముళ్లపూడి వెంకటరమణ ఆమె దగ్గర కొంత అప్పు తీసుకున్నారు. దాన్ని నెలనెలా చెల్లించేవారు. అలా ఒక నెల తమ మేనేజర్‌తో డబ్బు పంపించారు రమణ. అయితే ఆమె ఆ డబ్బు తీసుకోలేదు. అంతకుముందు నెలతోనే ఇన్‌స్టాల్‌మెంట్స్‌ అయిపోయాయని చెప్పారు. వడ్డీ ఎక్కువ చెబితే ఆ భయంతో డబ్బు  కరెక్ట్‌గా కడతారని భావించి డబ్బు ఇచ్చే ముందు ఎక్కువ వడ్డీ చెప్పానని, దానికి సాధారణ వడ్డీ మాత్రమే వేశానని అన్నారు. అలా లెక్కేస్తే మిగిలిన డబ్బు చెల్లించక్కర్లేదు అని చెప్పి ఆ డబ్బును వెనక్కి పంపించేశారు సూర్యకాంతం.   తన చివరి శ్వాస వరకూ నటించాలనుకునేవారు సూర్యకాంతం. ఆమె నటించిన చివరి సినిమా 1994లో చిరంజీవి, రవిరాజా పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ఎస్‌.పి.పరశురాం. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం క్షీణించడంతో అదే సంవత్సరం డిసెంబర్‌ 18న తుదిశ్వాస విడిచారు. అదే సమయంలో తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత.. చెన్నయ్‌లో జరుగుతున్న ఫారిన్‌ డెలిగేట్స్‌తో సమావేశంలో ఉన్నారు. విషయం తెలుసుకొని ఆ మీటింగ్‌ను గంటపాటు వాయిదా వేసి సూర్యకాంతం ఇంటికి వచ్చి ఆమెకు నివాళులర్పించి తిరిగి వెళ్లి మీటింగ్‌ను కొనసాగించారు. ఒక నటి కోసం ఎంతో ముఖ్యమైన ఆ మీటింగ్‌ నుంచి ఒక ముఖ్యమంత్రి హడావిడిగా వెళ్ళిపోవడం ఆమె పి.ఎ.కి ఆశ్చర్యాన్ని కలిగించింది. అదే విషయాన్ని ఆమె దగ్గర ప్రస్తావించినపుడు ఆమె చెప్పిన సమాధానం విని షాక్‌ అయ్యారు.   ‘షూటింగ్‌లో ఎంతో మందికి అన్నం పెట్టిన అన్నపూర్ణ సూర్యకాంతంగారు. ఆమె పెట్టిన భోజనం ఎన్నోసార్లు తిన్నాను. కొన్నిసార్లు ఆమె ఏ షూటింగ్‌లో ఉందో తెలుసుకొని లంచ్‌ టైమ్‌కి అక్కడికి వెళ్లేదాన్ని. ఆమె వంటలంటే నాకు అంత ఇష్టం. ఆమె చేతి వంట తిన్న విశ్వాసం ఉండాలి కదా. ఈ మీటింగ్‌ కంటే సూర్యకాంతంగారిని కడసారి చూసి నివాళులు అర్పించడమే నాకు ముఖ్యం’ అన్నారు జయలలిత.   ఇదిలా ఉంటే.. సూర్యకాంతం మరణ వార్త తెలిసిన వెంటనే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు ఆమె నివాసానికి వచ్చి నివాళులు అర్పించారు. కానీ, తెలుగు ఇండస్ట్రీ నుంచి ఎంతో నామమాత్రంగా హాజరయ్యారు. అక్కినేని నాగేశ్వరరావు, గుమ్మడి వంటి వారు హాజరు కాలేదు. అర్థరాత్రి చనిపోయారు కాబట్టి మరుసటి రోజు అందరూ వస్తారని మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులు ఎదురుచూశారు. కానీ, ఎవరూ రాకపోవడంతో అంత్యక్రియలు జరిపించారు. ఒక మహానటికి కడసారి వీడ్కోలు తెలిపేందుకు తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి చాలా తక్కువ మంది వెళ్ళడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.    సూర్యకాంతం చనిపోవడానికి ఆరు నెలల ముందు ప్రముఖ దర్శకనిర్మాత ఎల్‌.వి.ప్రసాద్‌ కన్నుమూశారు. ఆయనకు నివాళులు అర్పించేందుకు భారతదేశం నలుమూలల నుంచి ఎంతో మంది ప్రముఖులు హాజరయ్యారు. దానిలో చాలా తక్కువ శాతం మంది సూర్యకాంతం చనిపోయినపుడు ఆమెను చూసేందుకు వెళ్లారు. సూర్యకాంతం అంటే ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం కలిగిన నటీమణి. ఆమె జీవించి ఉన్నప్పుడు ఎంతో మంది ఆమె నుంచి సాయం అందుకున్నారు. మరెంతో మందికి అన్నపూర్ణలా ఆమె అన్నం పెట్టారు. కానీ, ఆమె చనిపోయిన తర్వాత వీడ్కోలు పలికేందుకు మాత్రం మనుషులు కరువయ్యారు. 

Dhurandhar OTT: కళ్ళు చెదిరేలా 'ధురంధర్' ఓటీటీ డీల్.. పుష్ప-2 రికార్డ్ అవుట్!

Publish Date:Dec 18, 2025

  బాలీవుడ్ ఫిల్మ్ 'ధురంధర్'(Dhurandhar) బాక్సాఫీస్ ని షేక్ చేస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ రూపొందిన ఈ మూవీ డిసెంబర్ 5న థియేటర్లలో అడుగుపెట్టి, ఇప్పటికే వరల్డ్ వైడ్ గా దాదాపు రూ.700 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఫుల్ రన్ లో రూ.1000 కోట్ల గ్రాస్ రాబట్టినా ఆశ్చర్యంలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే, ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ డీల్ ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.   'ధురంధర్' ఓటీటీ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ ఏకంగా రూ.285 కోట్లకు సొంతం చేసుకున్నట్లు బాలీవుడ్ మీడియాలో న్యూస్ వినిపిస్తోంది. గతంలో 'ధురంధర్' ఓటీటీ రైట్స్ రూ.130 కోట్లకు అమ్ముడైనట్లు వార్తలొచ్చాయి. అలాంటిది ఇప్పుడు ఏకంగా రూ.285 కోట్ల డీల్ తెరపైకి రావడం సంచలనంగా మారింది. ఈ వార్త నిజమైతే.. ఇండియన్ సినీ హిస్టరీలో ఇదే బిగ్ ఓటీటీ డీల్ అవుతుంది. గతంలో 'పుష్ప-2' రైట్స్ ని రూ.275 కోట్లకు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆ రికార్డుని 'ధురంధర్' బ్రేక్ చేసినట్లు అయింది. (Dhurandhar OTT)   ఓటీటీ రిలీజ్ విషయానికొస్తే.. థియేటర్లలో విడుదలైన ఎనిమిది వారాల తరువాతే 'ధురంధర్' స్ట్రీమింగ్ కి వచ్చే అవకాశముంది. జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి మొదటి వారంలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది అంటున్నారు.   Also Read: తెలుగునాట అవతార్-3 ప్రభావం.. వంద కోట్లు కష్టమేనా..?   కాగా, 'ధురంధర్'కి సీక్వెల్ కూడా ఉంది. రెండో భాగం 2026 మార్చి 19న విడుదల కానుంది. మరి ఈ రెండు భాగాలకు కలిపి ఓటీటీ డీల్ జరిగిందా? లేక ఒక్క భాగానికే రూ.285 కోట్లు చెల్లించడానికి నెట్ ఫ్లిక్స్ సిద్ధపడిందా? అనేది తెలియాల్సి ఉంది.  

Jayam serial: ప్రాణాపాయ స్థితిలో గంగ.. మినిస్టర్ మాటలతో రుద్ర ఎమోషనల్!

Publish Date:Dec 21, 2025

  జీ తెలుగులో ప్రసారమవుతున్న సీరియల్ 'జయం'(Jayam). ఈ సీరియల్ శనివారం నాటి ఎపిసోడ్-147 లో.. రుద్ర చేస్తున్న ఫుడ్ ఫెస్టివల్ కి గెస్ట్ గా మినిస్టర్ వస్తాడు. ఫుడ్ టేస్ట్ చెయ్యాలని అనుకుంటాడు. అప్పుడే గంగ వచ్చి అందులో విషం ఉందని చెప్తుంది. ఎవరే నువ్వు అని పారు ముసుగు తీస్తుంది. గంగని చూసి అందరు షాక్ అవుతారు. నువ్వేంటి ఇక్కడ అని రుద్ర అడుగుతాడు. ఇలా వేషం మార్చుకొని మాయ చెయ్యడం నీకు అలవాటే కదా అని శకుంతల కోప్పడుతుంది.   ఆ తర్వాత ఇందులో విషం ఉందని గంగ అంటుంటే నీకెలా తెలుసు అని ఇంట్లో వాళ్ళు అడుగుతారు. ఒక రౌడీ ఫోన్ మాట్లాడుతుంటే విన్నానని గంగ చెప్తుంది. ఆపు ఇక అని రుద్ర కోప్పడతాడు. మీరు నమ్మాలంటే ఏం చెయ్యాలని ఆ విషం ఉన్న ఫుడ్ ని గంగ తీసుకుంటుంది. కాసేపటికి కింద పడిపోతుంది వెంటనే గంగని రుద్ర హాస్పిటల్ కి తీసుకొని వెళ్తాడు.    మరొకవైపు ఇషిక, పారు, వీరు డిజప్పాయింట్ అవుతారు. గంగని హాస్పిటల్ కీ తీసుకొని వెళ్ళాక తనకి ఏం కాకూడదని డాక్టర్ కి చెప్తాడు రుద్ర. గంగని ఆ సిచువేషన్ లో చూసి రుద్ర రిగ్రెట్ ఫీల్ అవుతాడు. గంగ మాటలు నమ్మాల్సింది, తప్పు చేశానని రుద్ర బాధపడతాడు. మరొకవైపు ఫుడ్ ఫెస్టివల్ లో ఫుడ్ లో పాయిజన్ గురించి మీడియా వాళ్ళు శకుంతలని అడుగుతారు. ఈ విషయం వదిలేయండి అని వీరు కవర్ చేస్తాడు.   ఆ తర్వాత గంగ బానే ఉంది కానీ విషం బాడీ లో స్ప్రెడ్ అయింది. తను మినీ కోమాలో ఉందని డాక్టర్ చెప్పగానే రుద్ర షాక్ అవుతాడు. గంగని చూసి రుద్ర బాధపడుతుంటే.. అప్పుడే మినిస్టర్ సూర్య ప్రతాప్ వస్తాడు. మీ పెద్దనాన్న అంతా చెప్పాడు. గంగ నీ భార్య అవ్వడం నీ అదృష్టం.. నమ్మకం కలిగించడానికి తన ప్రాణం పణంగా పెట్టింది. అలాంటి వాళ్ళని మిస్ చేసుకోవద్దు.. నేను మళ్ళీ వచ్చినప్పుడు మీరు కలిసి ఉండాలని, అతను చెప్పి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.  

ఎన్టీఆర్ సినిమాలో రజనీకాంత్.. స్క్రీన్స్ తగలబడతాయి!

Publish Date:Dec 21, 2025

  సూపర్ స్టార్ రజనీకాంత్(Rajinikanth), మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్(Jr NTR) కలిసి స్క్రీన్ మీద కనిపిస్తే.. చూడటానికి రెండు కళ్ళు సరిపోవు. త్వరలో ఈ అద్భుతాన్ని చూసే అవకాశం అభిమానులకు కలగనుందని ఇండస్ట్రీ వర్గాల్లో న్యూస్ చక్కర్లు కొడుతోంది.   ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ భారీ యాక్షన్ ఫిల్మ్ చేస్తున్న సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి 'డ్రాగన్'(Dragon) అనే టైటిల్ పరిశీలనలో ఉంది.    Also Read: టెంపర్ బ్యూటీకి రోడ్డు ప్రమాదం.. మద్యం మత్తులో..!   డ్రాగన్ లో రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుండగా.. టోవినో థామస్, బిజు మీనన్ వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక అతిథి పాత్ర కోసం రజనీకాంత్ రంగంలోకి దిగే ఛాన్స్ ఉంది అంటున్నారు. (NTR Neel)   డ్రాగన్ లో కథకి కీలకమైన ఒక స్పెషల్ రోల్ లో రజనీకాంత్ నటిస్తే బాగుంటుందనే ఉద్దేశంతో మూవీ టీమ్ ఆయనను సంప్రదించిందట. రజనీ కూడా సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే.. ఎన్టీఆర్ సినిమాలో రజనీని చూడొచ్చు. చూద్దాం మరి ఏం జరుగుతుందో.  

మోగ్లీ

Publish Date:Dec 31, 1969

అఖండ 2

Publish Date:Dec 31, 1969