English | Telugu

ఓదెల 2 రెండు రోజుల కలెక్షన్స్ ఇవేనా!

ఓదెల 2 రెండు రోజుల కలెక్షన్స్ ఇవేనా!

Publish Date:Apr 19, 2025

శివశక్తిగా బైరవి అనే క్యారక్టర్ లో తమన్నా(Tamannaah)నటించిన చిత్రం ఓదెల 2 (Odela 2). ఈ నెల 17 న విడుదలైన ఈ మూవీకి రామ్ చరణ్(Ram Charan)కి రచ్చ లాంటి హిట్ ని ఇచ్చిన దర్శకుడు సంపత్ నంది(Sampath Nandi)రచనా, దర్శకత్వ పర్యవేక్షణ చేసాడు. హెబ్బాపటేల్, వశిష్ట సింహ, మురళి శర్మ, నాగ మహేష్ శ్రీకాంత్ అయ్యంగార్, పూజారెడ్డి, యువ, వంశీ, శరత్ లోహితష్వ  తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించగా అశోక్ తేజ దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ మూవీ తొలిరోజు 0 .85 కోట్ల రూపాయలని అందుకోగా రెండవ రోజు 0 .59 కోట్ల రూపాయలని సాధించింది. దీంతో మొత్తం రెండు రోజులకి 1 .44 కోట్ల రూపాయల్ని సాధించినట్టుగా ట్రేడ్ వర్గాలు వారు చెప్తున్నారు. ప్రేక్షకుల నుంచి అయితే ఓదెల 2 కి మిక్స్డ్ టాక్ వస్తుంది. ఈ నేపథ్యంలో బ్రేక్ ఈవెన్ అవుతుందో లేదో చూడాలి. ఓదెల' గ్రామంలో తిరుపతి  అనే  రేపిస్టుని  భార్య రాధ చంపేస్తుంది. కానీ గ్రామస్థులు తిరుపతి ఆత్మకి శాంతి లేకుండా చెయ్యాలని శవాన్ని కాల్చకుండా నిలువుగా నుంచో బెట్టి శవశిక్ష వేస్తారు. కానీ మళ్ళీ  తిరుపతి వేరే వాళ్ళ శరీరాల్లోకి ప్రవేశించి శోభనపు పెళ్లి కూతుళ్ళని మానభంగం చేసి చంపుతుంటాడు. పైగా క్షుద్ర విద్యలని కూడా నేర్చుకొని మరింత బలవంతుడుగా మారతాడు. దీంతో ఊరుని కాపాడటానికి శివశక్తి గా మారిన భైరవి ఓదెల వచ్చి తిరుపతి నుంచి ఊరిని ఎలా కాపాడిందనే కథాంశాలతో ఈ చిత్రం తెరకెక్కింది.    
ఆ విషయంలో ఎం.ఎస్‌.నారాయణను మించిన వారు ఇండియాలోనే లేరు!

ఆ విషయంలో ఎం.ఎస్‌.నారాయణను మించిన వారు ఇండియాలోనే లేరు!

Publish Date:Apr 16, 2025

(ఏప్రిల్ 16 ఎం.ఎస్.నారాయణ జయంతి సందర్భంగా..) తెలుగు చిత్ర పరిశ్రమలోని హాస్యనటుల్లో ఎం.ఎస్‌.నారాయణకి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎవరినీ అనుకరించకుండా.. డైలాగ్‌ డెలివరీలోగానీ, బాడీ లాంగ్వేజ్‌లోగానీ తనకంటూ ఓ స్పెషాలిటీని క్రియేట్‌ చేసుకున్న కమెడియన్‌ ఎం.ఎస్‌.నారాయణ. నటుడిగా 1994లో కెరీర్‌ ప్రారంభించినప్పటికీ ఆయనకు బ్రేక్‌ వచ్చింది 1997లో. అప్పటి నుంచి 17 సంవత్సరాల్లో దాదాపు 700 సినిమాల్లో నటించడం అనేది ఒక అరుదైన రికార్డుగానే చెప్పాలి. అందులో 200 సినిమాల్లో తాగుబోతు పాత్రలు పోషించి మెప్పించడం ఆయన వల్లే సాధ్యమైంది. ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో తాగుబోతు క్యారెక్టర్స్‌ చేసిన నటుడు ఇండియాలోనే లేరంటే అతిశయోక్తి కాదు. వాస్తవానికి రచయిత కావాలని ఇండస్ట్రీకి వచ్చిన ఎం.ఎస్‌.నారాయణ.. ఒక అద్భుతమైన హాస్యనటుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయన ఇండస్ట్రీకి ఎలా వచ్చారు, నేపథ్యం ఏమిటి? ఆయన సినీ, వ్యక్తిగత జీవిత విశేషాలు ఏమిటనేది తెలుసుకుందాం. 1951 ఏప్రిల్‌ 16న పశ్చిమ గోదావరి జిల్లా నిడమర్రు గ్రామంలో మైలవరపు బాపిరాజు, వెంకట సుబ్బమ్మ దంపతులకు జన్మించారు మైలవరపు సూర్యనారాయణ. వీరిది రైతు కుటుంబం అయినప్పటికీ పది మంది సంతానం కావడంతో ఆర్థికంగా బాగా చితికిపోయారు. దాంతో కుటుంబంలోని అందరూ పొలం పనులకు వెళ్లేవారు. కానీ, ఎం.ఎస్‌.నారాయణ మాత్రం తాను చదువుకుంటానని పట్టుపట్టారు. అలా తండ్రికి ఇష్టం లేకపోయినా పదో తరగతి వరకు ఇల్లందులో చదువుకున్నారు. ఆ తర్వాత ఫత్తేపురంలోని ప్రాచ్య కళాశాలలో భాషా ప్రవీణ కోర్సు చేశారు. అదే సమయంలో మూర్తిరాజు కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న పరుచూరి గోపాలకృష్ణ దగ్గర శిష్యరికం చేశారు. ఎం.ఎస్‌. రచయితగా ఎదిగేందుకు అది దోహదమైంది. భాషా ప్రవీణ కోర్సు పూర్తయిన తర్వాత భీమవరంలోని కెజిఆర్‌ఎల్‌ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేశారు. ఆ సమయంలోనే సినీ రచయితగా మంచి పేరు తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో మద్రాస్‌ రైలెక్కారు.  అర్జున్‌, భానుచందర్‌ హీరోలుగా సత్యారెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన ‘వేగుచుక్క పగటిచుక్క’ చిత్రం కథా రచనలో సహాయకుడిగా పనిచేశారు. ఎం.ఎస్‌.నారాయణ పేరు స్క్రీన్‌పై తొలిసారి కనిపించింది ఈ సినిమాకే. ఆ తర్వాత ప్రయత్నం, హలోగురు, హలో నీకునాకు పెళ్లంట, అలెగ్జాండర్‌, శివనాగ వంటి సినిమాలకు మాటలు రాశారు. 1993లో రాజేంద్రప్రసాద్‌ హీరోగా వచ్చిన ‘పేకాట పాపారావు’ చిత్రానికి జనార్థన మహర్షితో కలిసి కథ అందించారు. ఈ సినిమా ఎం.ఎస్‌.కి చాలా మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత మోహన్‌బాబు హీరోగా రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో రూపొందిన ‘ఎం.ధర్మరాజు ఎం.ఎ.’ చిత్రానికి కామెడీ ట్రాక్‌ను రాశారు. అలాగే ఈ సినిమా ద్వారానే నటుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత ‘పెదరాయుడు’, ‘రుక్మిణి’ చిత్రాల్లో కూడా ఎం.ఎస్‌.కి మంచి క్యారెక్టర్స్‌ ఇచ్చారు రవిరాజా. అలా ఓ పది సినిమాల్లో నటించిన తర్వాత ‘మా నాన్నకు పెళ్లి’ చిత్రంలో ఒక తాగుబోతు క్యారెక్టర్‌ ఇచ్చారు ఇ.వి.వి.సత్యనారాయణ. 1997లో విడుదలైన ‘మా నాన్నకి పెళ్లి’ చిత్రంలో ఎం.ఎస్‌.నారాయణ చేసిన క్యారెక్టర్‌.. ఒక అద్భుతమైన కెరీర్‌కి పునాది వేసింది. నటుడిగా ఫుల్‌ బిజీ అయిపోయారు. దాంతో సినిమా రచన పక్కన పెట్టి నటనపైనే దృష్టి కేంద్రీకరించారు. అప్పుడు మొదలు సంవత్సరానికి 15 నుంచి 20 సినిమాల్లో నటిస్తూ వచ్చారు. 2001లో ఏకంగా 50 సినిమాల్లో నటించి రికార్డు సృష్టించారు. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 30 సినిమాలకు తక్కువ కాకుండా నటించేవారు. ఒక దశలో ఎం.ఎస్‌.నారాయణ లేని సినిమా రిలీజ్‌ అయ్యేది కాదు. 1997 నుంచి 2015 వరకు 700 సినిమాల్లో నటించారు ఎం.ఎస్‌.నారాయణ. అందులో ఆయన చేసిన సినిమాల గురించి, క్యారెక్టర్ల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాల్సిన అవసరం లేదు. తాగుబోతు క్యారెక్టర్లే కాదు, పేరడీ క్యారెక్టర్స్‌లోనూ ఎం.ఎస్‌.దే పైచేయిగా ఉండేది. దుబాయ్‌ శీను, దూకుడు, డిస్కో వంటి సినిమాల్లో ఆయన చేసిన పేరడీ క్యారెక్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. తన నటనతో ప్రేక్షకుల అభిమానాన్ని పొందడమే కాదు, 5 నంది అవార్డులు, 1 ఫిలింఫేర్‌ అవార్డు కూడా అందుకున్నారు ఎం.ఎస్‌.నారాయణ. ఎం.ఎస్‌.నారాయణ వ్యక్తిగత జీవిత విషయాల గురించి చెప్పాలంటే.. ఆయన కాలేజీలో చదువుకునే రోజుల్లోనే తన క్లాస్‌మేట్‌ కళాప్రపూర్ణను ప్రేమించారు. వీరికి పరుచూరి గోపాలకృష్ణ దగ్గరుండి వివాహం జరిపించారు. ఎం.ఎస్‌., కళాప్రపూర్ణలది కులాంతర వివాహం. వీరికి కుమార్తె శశికిరణ్‌, కుమారుడు విక్రమ్‌ ఉన్నారు. వీరిద్దరికీ సినిమా రంగంలో రాణించాలని ఉంది. శశికిరణ్‌ తన దర్శకత్వంలో ‘సాహెబ్‌ సుబ్రహ్మణ్యం’ చిత్రాన్ని రూపొందించారు. అలాగే విక్రమ్‌ను హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో ‘కొడుకు’ చిత్రాన్ని నిర్మించారు ఎం.ఎస్‌.నారాయణ. అయితే ఇది పరాజయాన్ని చవిచూసి ఆయనకు భారీ నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఆ తర్వాత ‘భజంత్రీలు’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది కూడా విజయం సాధించలేదు. తను పుట్టి పెరిగిన నిడమర్రు గ్రామాన్ని అభివృద్ధి చెయ్యాలనుకున్నారు ఎం.ఎస్‌. దాని కోసం అప్పుడప్పుడు ఆ ఊరు వెళ్లి అక్కడి పెద్దలతో చర్చించేవారు. అలా 2015 సంక్రాంతికి నిడమర్రు వెళ్లిన ఎం.ఎస్‌. అక్కడ అస్వస్థతకు గురయ్యారు. భీమవరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్‌లో ఆయనకు ప్రాథమిక చికిత్స చేసి వెంటనే హైదరాబాద్‌లోని కిమ్స్‌కి తరలించారు. కొన్నిరోజులపాటు చికిత్స పొందిన తర్వాత పరిస్థితి విషమించడంతో జనవరి 23న 63 సంవత్సరాల వయసులో తుదిశ్వాస విడిచారు ఎం.ఎస్‌.నారాయణ. 

జాట్-2 అనౌన్స్ మెంట్ వచ్చేసింది.. ఈసారి డబుల్ మాస్ ఫీస్ట్!

Publish Date:Apr 17, 2025

  బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన హిందీ చిత్రం 'జాట్' (Jaat). మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మించిన ఈ యాక్షన్ ఫిల్మ్, ఏప్రిల్ 10న థియేటర్లలో అడుగుపెట్టింది. మాస్ ప్రేక్షకులను మెప్పిస్తున్న ఈ చిత్రం, మంచి వసూళ్లు రాబడుతూ రూ.100 కోట్ల గ్రాస్ దిశగా దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో తాజాగా సీక్వెల్ ని ప్రకటించి సర్ ప్రైజ్ చేశారు మేకర్స్. (Jaat 2)   సినిమా చివరిలో పార్ట్-2 ఉందని లీడ్ ఇవ్వడం లేదా సినిమా విడుదలై సక్సెస్ అయిన తర్వాత కొంతకాలానికి సీక్వెల్ ను అనౌన్స్ చేయడం కామన్ గా జరుగుతుంది. కానీ, 'జాట్' విషయంలో భిన్నంగా జరిగింది. సినిమా విడుదలైన వారం రోజులకే సీక్వెల్ ను అనౌన్స్ చేశారు. సన్నీ డియోల్, మలినేని కాంబోలో రానున్న 'జాట్-2'లో మాస్ ఫీస్ట్ మరింత పెద్దదిగా, వైల్డ్‌ గా ఉంటుందని మేకర్స్ పేర్కొన్నారు. (Jaat Sequel)   ఇప్పటికే బాలీవుడ్ లో గోపీచంద్ మలినేని పేరు మారుమోగిపోతోంది. హిందీ ప్రేక్షకులు చాలాకాలంగా మిస్ అవుతున్న అసలుసిసలైన మాస్ ఫీస్ట్ ను 'జాట్'తో అందించాడు అంటూ అక్కడి క్రిటిక్స్, ఆడియన్స్ మలినేనిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక 'జాట్-2'తో ఏ రేంజ్ సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. ఈ సీక్వెల్ హిట్ అయితే.. ఒక్కసారిగా బాలీవుడ్ స్టార్స్ చూపు మలినేనిపై పడే అవకాశముంది.    

‘సారంగపాణి జాతకం’మూవీ హీరోయిన్  రూపా కొడువాయుర్.. పట్టిందల్లా బంగారం

Publish Date:Apr 19, 2025

  సారంగపాణి మూవీ టీమ్ లో హీరోయిన్ రూపకి మంచి కితాబిచ్చాడు ప్రియదర్శి. డాన్స్ ఐకాన్ సీజన్ 2 ఈ వారం ఎపిసోడ్ ఈ మూవీ నుంచి డైరెక్టర్ ఇంద్రగంటి మోహనకృష్ణ, ప్రియదర్శి, రూప వచ్చారు. వీళ్ళు రాగానే స్టేజి మీద ముమైత్ ఖాన్ కంటెస్టెంట్ అన్షికా వచ్చి "అహ నా పెళ్ళంటా" అంటూ మాయాబజార్ మూవీలోని ఓల్డ్ క్లాసికల్ సాంగ్ కి డాన్స్ చేసింది. ఆ డాన్స్ చూసాక అసలు ఇలాంటి డాన్స్ ని తన లైఫ్ లో చూడలేదు అంటూ ఓంకార్, ప్రియదర్శి, ఇంద్రగంటి మోహనకృష్ణ చెప్పుకొచ్చారు. తర్వాత సారంగపాణి మూవీ హీరోయిన్ రూపతో ఈ సాంగ్ కి డాన్స్ వేయాలని ఓంకార్ అడిగేసరికి దర్శి ఐతే ఆమెకు ధైర్యం చెప్పి వెళ్లి డాన్స్ చేసేసి రా అని చెప్పాడు. దాంతో ఆమె వెళ్లి డాన్స్ ఇరగదీసింది. దాంతో ఇంద్రగంటి మోహనకృష్ణ చూసి చాలా ఫీలయ్యాడు. "ఇప్పుడు నేను చాలా బాధపడుతున్నా. సారంగపాణి మూవీ ముందు ఈ షోకి వచ్చి ఉంటె...ఇలాంటి ఒక డాన్స్ చేయగలదు రూప అని తెలిసి ఉంటె ఇలాంటి ఒక సాంగ్ ని పెట్టేసేవాడినేమో..నాలుగు పాటలున్న ఆల్బం ఐదు పాటలున్న ఆల్బం అయ్యేది. ఈ సినిమాలో రూప మాకు చేసిన అన్యాయం ఇదొక్కటే.. జోక్స్ పక్కన పెడితే రూప చాలా బాగా డాన్స్ చేసావ్ " అని మెచ్చుకున్నారు. దాంతో రూప "నెక్స్ట్ ఫిలింలో చేస్తా సర్" అంది. వెంటనే ప్రియదర్శి "చెప్పా కదా తెలుగు సాయి పల్లవిలాగా బాగా చేసినవ్..బాగా డాన్స్ వేసినవ్" అన్నాడు.  సారంగపాణి మూవీ హీరోయిన్ రూప కొడువాయుర్ ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య మూవీలో ఆ తర్వాత మిస్టర్ ప్రెగ్నెంట్ మూవీలో నటించింది. ఈమె క్లాసికల్ డాన్సర్ కూడా కావడంతో ఏ డాన్స్ ని ఐనా అవలీలగా వేసేస్తుంది. టాలీవుడ్ లో తెలుగు అమ్మాయిలే లేరు అన్న మాటను పక్కన పెడితే రూప లాంటి తెలుగమ్మాయిలు డైరెక్టర్స్ కి బెస్ట్ ఆప్షన్ గా ఉన్నారిప్పుడు . వీళ్ళను చూసి ఇంకొంతమంది తెలుగమ్మాయిలు కూడా ఇండస్ట్రీలోకి నెమ్మది నెమ్మదిగా వస్తున్నారు.

అన్ని భాషల స్టార్‌ హీరోలను ఇబ్బంది పెడుతున్న మోహన్‌లాల్‌!

Publish Date:Apr 18, 2025

ఒక భాషలో సూపర్‌హిట్‌ అయిన సినిమా భారతదేశంలోని వివిధ భాషల్లో రీమేక్‌ అయి ప్రతి చోటా అదే స్థాయి విజయాన్ని అందుకోవడం అనేది సామాన్యమైన విషయం కాదు. అది మోహన్‌లాల్‌ హీరోగా మలయాళంలో రూపొందిన ‘దృశ్యం’ చిత్రం వల్లే సాధ్యమైంది. 2013లో విడుదలైన ఈ సినిమాను తెలుగులో వెంకటేష్‌, తమిళ్‌లో కమల్‌హాసన్‌,  కన్నడలో రవిచంద్రన్‌, హిందీలో అజయ్‌ దేవ్‌గన్‌ రీమేక్‌ చేసి సాలిడ్‌ హిట్‌ సాధించారు. ఇండియాలోనే కాదు, శ్రీలంక, ఇండోనేషియా, చైనా, కొరియా భాషల్లో రీమేక్‌ అయింది. అలాగే ఇంగ్లీష్‌ భాషలో అమెరికాలో రీమేక్‌ అయింది. ఇలా ఒక ఇండియన్‌ సినిమా ఇన్ని భాషల్లో రీమేక్‌ అవ్వడం అనేది అరుదైన విషయం.  ఆ తర్వాత ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా 2021లో ‘దృశ్యం2’ పేరుతో నిర్మించారు. ఇది కూడా ఘనవిజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో కూడా రీమేక్‌ అయి సూపర్‌హిట్‌గా నిలిచింది. గత కొంత కాలంగా ‘దృశ్యం3’కి సంబంధించిన వార్తలు మీడియాలో, సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ పూర్తయింది. మేలో షూటింగ్‌ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని యధావిధిగా వివిధ భాషల్లో రీమేక్‌ చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. కానీ, దానికి భిన్నంగా ‘దృశ్యం3’ చిత్రాన్ని పాన్‌ ఇండియా లెవల్‌లో రిలీజ్‌ చెయ్యాలని మేకర్స్‌ ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. మోహన్‌లాల్‌ కూడా పార్ట్‌ 3ని ఇండియాలోని వివిధ భాషల్లో విడుదల చేస్తే బాగుంటుందని నిర్మాతలకు చెప్పినట్టు సమాచారం. దర్శకుడు జీతు జోసఫ్‌, నిర్మాత ఆంటోని పెరువంబూర్‌ దీనిపై కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. ‘దృశ్యం3 ది కంక్లుజన్‌’ పేరుతో మూడో భాగాన్ని రూపొందిస్తారట.  మోహన్‌లాల్‌తోపాటు దర్శకనిర్మాతలు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల ఎక్కువ ఎఫెక్ట్‌ అయ్యేది వెంకటేష్‌, అజయ్‌ దేవ్‌గణ్‌. ఎందుకంటే ఈ రెండు భాషల్లో దృశ్యం చిత్రానికి ఎక్కువ అప్లాజ్‌ వచ్చింది. ముఖ్యంగా వెంకటేష్‌ పోషించిన రాంబాబు తెలుగు వారికి బాగా కనెక్ట్‌ అయింది. రెండు భాగాల్లోనూ వెంకటేష్‌ని చూసిన తెలుగు ప్రేక్షకులు అదే క్యారెక్టర్‌లో మోహన్‌లాల్‌ కనిపిస్తే యాక్సెప్ట్‌ చేస్తారా అనేది పెద్ద సందేహంగా మారింది. పార్ట్‌ 3 వెంకటేష్‌ చేస్తే బిజినెస్‌ పరంగా కూడా బాగా ప్లస్‌ అవుతుంది. మోహన్‌లాల్‌ నటించిన వెర్షన్‌నే తెలుగులో రిలీజ్‌ చేస్తే దాన్ని డబ్బింగ్‌ సినిమాగానే చూస్తారు ప్రేక్షకులు. ఇదిలా ఉంటే.. ‘దృశ్యం3’ పేరుతో అజయ్‌ దేవ్‌గణ్‌ తన సొంత బేనర్‌లో ఒక సినిమా ప్లాన్‌ చేస్తున్నారని తెలుస్తోంది. అయితే దీన్ని దృశ్యం సిరీస్‌లో భాగంగా కాకుండా వేరే కథతో చేసే ఆలోచనలో ఉన్నారట. దర్శకుడు ఎవరు అనేది ఇంకా డిసైడ్‌ అవ్వలేదు. అయితే ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. తెలుగులో రీమేక్‌ అయిన ‘దృశ్యం2’కి కూడా జీతు జోసెఫ్‌ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఆ సందర్భంలో పార్ట్‌ 3కి సంబంధించి వెంకటేష్‌, జీతుల మధ్య ఎలాంటి డిస్కషన్‌ జరగలేదని తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ వంటి భారీ హిట్‌ తర్వాత చేయబోయే సినిమాల విషయంలో వెంకటేష్‌ స్పెషల్‌ కేర్‌ తీసుకుంటున్నారు. అందుకే ‘దృశ్యం3’ చిత్రాన్ని అన్ని భాషల్లో రిలీజ్‌ చేసినా, మలయాళంలో రిలీజ్‌ చేసి అన్ని భాషల్లో రీమేక్‌ చేసుకునే అవకాశం ఇచ్చినా ఫర్వాలేదు అనే ధోరణిలోనే వెంకటేష్‌ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం మోహన్‌లాల్‌ ఆలోచన ప్రకారం ప్రస్తుతం పార్ట్‌ 3ని పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్‌ చెయ్యాలనుకుంటున్నారు. అలా చెయ్యడం వల్ల వివిధ భాషల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే దానిపై కూడా మేకర్స్‌ చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే పార్ట్‌ 3 తెలుగులో రీమేక్‌ అయ్యే అవకాశం ఉంది. ఏది ఏమైనా ‘దృశ్యం’ పార్ట్‌ 3 విషయంలో త్వరలోనే క్లారిటీ వస్తుందని సమాచారం.

ఓదెల 2

Publish Date:Apr 17, 2025

జాక్

Publish Date:Apr 10, 2025