English | Telugu
అప్పుడేమో అమ్మలాంటిదన్నాడు.. ఇప్పుడేమో అంతా తూచ్ అంటున్నాడు!
Updated : Jul 11, 2022
ఆర్పీ జబర్దస్త్ షోలో మంచి పేరు తెచ్చుకున్న ఒక కమెడియన్. ఇప్పుడు సోషల్ మీడియాలో జబర్దస్త్ గురించి, మల్లెమాల గురించి ఆర్పీ చేసిన కామెంట్స్ కాక రేపుతున్నాయి. నెల్లూరు యాసలో మాట్లాడుతూ రెండు కాళ్ళు గాల్లో లేపి కొడుతూ మంచిగా ఫేమస్ ఐన ఆర్పీ ఇమేజ్ ఇప్పుడు డామేజ్ అయ్యింది. జబర్దస్త్ షో తమ స్కిట్స్ వల్లనే ఫేమస్ అయ్యిందని, మల్లెమాల ఒక పేరు మాత్రమే అని, ఇదంతా వ్యాపారం అని ఇలా రకరకాల కామెంట్స్ తో ఫైర్ ఐపోతున్న ఆర్పీకి బ్రేక్ వేశారు హైపర్ ఆది, ఆటో రాంప్రసాద్. సుధీర్, శీను జబర్దస్త్ నుంచి వెళ్లిపోయేసరికి ఇప్పుడు ఆటో రాంప్రసాద్ కి, హైపర్ ఆదికి మధ్య మంచి రేపో పెరిగినట్టు కనిపిస్తోంది. ఇద్దరూ కలిసే ఏ పనైనా చేస్తున్నారు. ఇక వీళ్ళు రంగంలోకి దిగి ఆర్పీ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటర్ ఇచ్చి పడేసారు.
ఇప్పుడు వీళ్ళు మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. ఆది మాట్లాడుతూ "శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఒక నిర్మాత, ఆయన మాజీ సీఎంకి అల్లుడు కూడా. అలాంటి ఒక వ్యక్తిని ఆర్పీ ఏకవచనంతో మాట్లాడడం కరెక్ట్ కాదు. జబర్దస్త్ కి లైఫ్ ఇచ్చాం అని, సుధీర్ రష్మీ స్కిట్స్ వల్ల జబర్దస్త్ కి రేటింగ్ వచ్చిందని చెప్పడం అస్సలు కరెక్ట్ కాదు" అన్నాడు ఆది. "రేటింగ్ అనేది కంటెంట్ వల్ల వస్తుంది" అని చెప్పుకొచ్చాడు ఆది. తర్వాత రాంప్రసాద్ తన సెల్ లో ఒక వీడియో బైట్ ప్లే చేసి చూపించాడు.
"గతంలో ఆర్పీ ఒక ఎపిసోడ్ లో జబర్దస్త్ తమకి అమ్మలాంటిది అని చెప్పి ఇప్పుడు జబర్దస్త్ ని వదిలేసి వేరే ఛానల్ కి వెళ్లి అంతా తూచ్ అమ్మ కాదు ఏమీ కాదు అంటూ అబద్దాలు చెప్పడం ఎంతవరకు కరెక్ట్?" అని ప్రశ్నించాడు. ఇక ఆది, రాంప్రసాద్ కౌంటర్స్ తో ఆర్పీ ఇమేజ్ ఒక్కసారిగా డామేజ్ అయ్యింది. ఐతే ఇటీవల గమనిస్తే జబర్దస్త్ నుంచి ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారు. సుధీర్, అనసూయ, శీను.. ఇలా వెళ్లిపోతుండేసరికి దీనికి ఉన్న రేటింగ్ తగ్గిపోయింది. ఐనా సరే మళ్ళీ ఈ షోకి పూర్వ వైభవం తీసుకురావడానికి మల్లెమాల యాజమాన్యం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.