రేవంత్‌రెడ్డికి ఎర్రబెల్లి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్!

రాజకీయాలలో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని అంటారు.. అది నిజమే.. ఎందుకంటే, నిన్నటి వరకు నువ్వా నేనా అనుకున్నవాళ్ళు అకస్మాత్తుగా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోతారు. నిన్నటి వరకూ నువ్వే నేను అన్నట్టుగా వున్నవాళ్ళు సడెన్‌గా నువ్వెంతంటే నువ్వెంత అనుకునే స్థాయికి వెళ్ళిపోతారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు ఎర్రబెల్లి దయాకర్ రావు మధ్య వున్న ఫ్రెండ్‌షిప్ అలాంటిదే. వీళ్ళిద్దరూ తెలుగుదేశం పార్టీలో వున్నప్పుడు ఇద్దరి మధ్య స్నేహం వుండేది. అయితే ఓటుకు నోటు కేసు సందర్భంలో తన మీద కుట్ర చేసింది ఎర్రబెల్లి దయాకర్ రావే అనే అభిప్రాయం రేవంత్ రెడ్డిలో కలిగింది. మిత్రుడిలా వుంటూనే మిత్రద్రోహం చేశారన్న అభిప్రాయాలున్నాయి. ఓటుకు నోటు సంఘటనతో రేవంత్, ఎర్రబెల్లి మధ్య పూడ్చలేనంత అగాథం ఏర్పడిందన్నమాట మాత్రం వాస్తవం. కాలం గిర్రున తిరిగింది. ఓటుకు నోటు కేసు సమయంలో రేవంత్ రెడ్డి ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఆయనకు దెబ్బకు దెబ్బతీసే అవకాశం ఫోన్ ట్యాపింగ్ కేసు ద్వారా వచ్చింది. ఈ కేసులో కేసీఆర్ కుటుంబంతోపాటు ఎర్రబెల్లి దయాకర్ రావుకు కూడా భాగస్వామ్యం వుందని పర్వతగిరిలో వార్ రూమ్ ఏర్పాటు చేసి, అక్కడ కూడా ఫోన్ ట్యాపింగ్ కార్యక్రమాలు నిర్వహించడానికి ఎర్రబెల్లి సహకరించారన్నది ప్రస్తుతం వినిపిస్తున్న సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రస్తుతానికి విచారణ దశలోనే వుంది. పోలీసు అధికారుల అరెస్టు దగ్గరే వుంది. ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత పెద్ద పెద్ద పొలిటికల్ తలలే అరెస్టు అయ్యే అవకాశం వున్నట్టు తెలుస్తోంది. ఈ అరెస్టుల లిస్టులో ఎర్రబెల్లి దయాకర్ రావు వున్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రమాదాన్ని అర్థం చేసుకున్న ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎం రేవంత్ రెడ్డికి ఫ్రెండ్‌షిప్ రిక్వెస్ట్ పంపినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ‘మనిద్దరం గతంలో మంచి ఫ్రెండ్స్. ఓటుకు నోటు కేసు సమయంలో జరిగిందేదో జరిగిపోయింది. ఇక మనిద్దరం అవన్నీ మరచిపోదాం. నువ్వు నామీద మనసులో ఏమీ పెట్టుకోకుండా వుంటే చాలు’ అని కామన్ ఫ్రెండ్స్ ద్వారా రేవంత్‌కి ఎర్రబెల్లి స్నేహ సందేశం పంపినట్టు తెలుస్తోంది. ఆ రిక్వెస్ట్ ఇంకా ఓకే కానట్టు సమాచారం. అందితే జుట్టు, అందకపోతే కాళ్ళు అన్నట్టుగా వున్న ఎర్రబెల్లి వ్యవహారం మీద రేవంత్ ఎలా స్పందిస్తారో అంతు చిక్కకుండా వుంది. పాత స్నేహితుడు కదా అని చూసీ చూడనట్టు వ్యవహరిస్తారో... లేక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతుంది అంటారో చూడాలి.

ఏపీలో మొట్టమొదట ఫలితం వెలువడే నియోజకవర్గమేదో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో ఓట్ల లెక్కింపు, ఫలితాల విడుదలకు సంబంధించిన ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, పాతిక లోక్ సభ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లను ఎన్నికల సంఘం పూర్తి చేసింది. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకూ తావులేకుండా గట్టి భద్రతా ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.  అది పక్కన పెడితే జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన జరుగుతుంది. కాగా రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలకు గాను 111 అసెంబ్లీ నియోజకవర్గాలలో కౌంటింగ్ మధ్యాహ్నం రెండు గంటల వరకూ పూర్తి అయిపోతుంది. ఇక మరో 61 నియోజకవర్గాలలో కౌంటింగ్ ముగిసే సరికి సాయంత్రం నాలుగు గంటలు అవుతుంది. ఇక మిగిలిన మూడు నియోజకవర్గాలలో కౌంటింగ్ పూర్తయ్యే సరికి సాయంత్రం గంటలు దాటే అవకాశం ఉంది. ఆ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు ఎన్ని రౌండ్లలో సాగుతుంది అన్నదానిపై ఫలితం కౌంటింగ్ ముగియడానికి పట్టే సమయం ఆధారపడి ఉంటుంది. సరే ఇంతకీ రాష్ట్రంలో మొట్ట మొదట ఫలితం వెలువడే నియోజకవర్గం ఏమిటంటే మాత్రం రెండు నియోజకవర్గాల పేర్లు చెప్పుకోవలసి ఉంటుంది. అవి కొవ్వూరు, నరసాపురం అసెంబ్లీ నియోజకవర్గాలు. ఈ రెండు నియోజకవర్గాలలోనూ కౌంటింగ్ పదమూడు రౌండ్లలో జరుగుతుంది. అంటే రాష్ట్రంలో తొలి ఫలితం కొవ్వూరు లేదా నరసాపురం నియోజకవర్గాల నుంచి వెలువడుతుందన్నమాట. ఇక అన్నిటి కంటే చివరిగా ఫలితం వెలువడే నియోజకవర్గం రంపచోడవరం. రంపచోడవరం నియోజకవర్గంలో మొత్తం 29 రౌండ్లలో కౌంటింగ్ జరుగుతుంది. అందుకే రాష్ట్రం లో అన్ని నియోజకవర్గాల కంటే చివరన ఈ నియోజకవర్గం ఫలితం వెలువడుతుంది.  

ఏబీ వెంకటేశ్వరరావుకు ఒకరోజు పోస్టు?

ఐదేళ్ళుగా జగన్ ప్రభుత్వం ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుని కేసులు పెట్టి, పోస్టింగ్ ఇవ్వకుండా వేధిస్తోంది. ఆ వేధింపులకు ముగింపు వస్తోంది. రేపు ఒక్కరోజుతో ఏబీ వెంకటేశ్వరరావు సర్వీస్ ముగియనుంది. యూనీఫామ్‌లోనే రిటైర్ అవ్వాలని ఆయన పట్టుదలతో వున్నారు. ‘కాట్’ కూడా వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయిస్తే, హైకోర్టు కూడా వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏబీ వెంకటేశ్వరావు గురువారం నాడు చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డిని కలిశారు. తనకు పోస్టింగ్ ఇవ్వాలన్న హైకోర్టు ఆదేశాలను చీఫ్ సెక్రటరీకి అందించారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కార్యాలయానికి కూడా వెంకటేశ్వరరావు హైకోర్టు ఉత్తర్వుల ప్రతిని అందించారు. ఇప్పుడు ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇవ్వక తప్పని పరిస్థితి. వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇచ్చిన పక్షంలో ఆయన ఒక్కరోజు మాత్రమే ఆ పోస్టులో వుండి, ఆ తర్వాత రిటైర్ అవుతారు. యూనీఫామ్‌లో రిటైర్ అయిన గౌరవం ఆయనకు దక్కుతుంది. ఇప్పటి వరకు అయితే ఆయనకు ఒక్కరోజు పోస్టు ఇవ్వాలన్న ఉద్దేశంలో సీఎస్ వున్నట్టు తెలుస్తోంది. అలా ఇవ్వని పక్షంలో ఈ దేశంలో మానవత్వం, చట్టం, ధర్మం, న్యాయం అనేవి ఉన్నాయని అనుకోవడం అనవసరం అనే అభిప్రాయానికి నిస్సందేహంగా రావచ్చు.

పులివెందులలో బీటెక్ రవి గెలుపు ధీమా.. కారణమదేనా?

ఎన్నికల ముందు వరకూ ఆకాశానికి నిచ్చెన వేసినట్లుగా వైనాట్ 175 అంటూ ఊదరగొట్టిన జగన్ పోలింగ్ తరువాత కంటే గతం కంటే ఎక్కువ స్థానాలు అంటూ ప్లేటు ఫిరాయించారు. అంటే వైసీపీ మొదటి నుంచీ చెప్పుకు వస్తున్న వైనాట్ 175 వట్టి మైండ్ గేమ్ నినాదమే అని స్వయంగా జగనే తేల్చేశారు. అయితే ఇప్పుడు వైనాట్ పులివెందుల అంటూ ఆ నియోజకవర్గం నుంచి జగన్  కు ప్రత్యర్థి, తెలుగుదేశం అభ్యర్థి అయిన బీటెక్ రవి ధీమాగా చెబుతున్నారు. ఇంత కాలం అక్కడ అంటే పులివెందులలో జగన్ కు ప్రత్యర్థి ఎవరైనా అది నామమాత్రపు పోటీగానే ఉండేది. ఎందుకంటే నియోజకవర్గంలో జగన్ కు లేదా వైఎస్ కుటుంబానికి ఎదురు నిలబడటమంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమేననే భయం అందరిలో ఉండేది. అయితే ఐదేళ్ల జగన్ పాలన పులివెందులలో ఆ భయాన్ని పోగొట్టేసింది.  సొంత మనుషులే ఆయన తీరు పట్ల అయిష్టతతో, అసంతృప్తితో ఉన్నారు. దానికి తోడు వైఎస్ కుటుంబమే నిట్టనిలువుగా చీలిపోయింది. జగన్ తల్లి, చెల్లి కూడా జగన్ శిబిరంలో లేరు. షర్మిల కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా జగన్ పైనే విమర్శల బాణాలు గుప్పించారు. స్వయంగా కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడి.. జగన్ కు సవాల్ విసిరారు. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోని పులివెందుల సెగ్మెంట్ లో కూడా షర్మిల ప్రభావం బలంగా కనబడింది.  వీటన్నిటికీ మించి రాష్ట్రంలో జగన్ ప్రతిష్ట బాగా మసకబారడంతో  పరిశీలకుల నుంచి అందరూ మరోసారి జగన్ అధికారంలోకి రావడం కష్టమనే అభిప్రాయానికి వచ్చేశారు. ఈ నేపథ్యంలోనే పులివెందుల నియోజకవర్గంలో కూడా జగన్ గాలి పోయినట్లు కనిపించింది. సరిగ్గా ఈ విషయాన్నే ఎత్తి చూపుతూ పులివెందుల తెలుగుదేశం అభ్యర్థి బీటెక్ రవి తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించారు. పులివెందులలో పోలింగ్ అనగానే ఇప్పటి వరకూ ఏకపక్షంగా జగన్ కు అనుకూలంగా జరిగేదనీ, కానీ ఈ సారి మాత్రం జగన్ వర్గీయులే తనకు రాయబారాలు పంపారని బీటెక్ రవి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. అనవసరంగా మనం గొడవలకు దిగొద్దు. ఎన్నికలలో దౌర్జన్యాలకు తాము దూరంగా ఉంటాం, మీరు కూడా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా సహకరించాలి అంటూ  రాయబారాలు చేశారని బీటెక్ రవి చెప్పారు. ఎప్పుడూ ఎన్నికలు అనగానే చెలరేగిపోయి దాడులు, దౌర్జన్యాలూ, బూత్ క్యాప్చరింగ్ కు పాల్పడే వైసీపీ మూకలు పులివెందులలో ఈ సారి ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూద్దాం అంటూ కాళ్లబేరానికి వచ్చారంటే రాష్ట్రంలో జగన్ అధకారం కోల్పోవడం ఖాయమన్న నిర్ణయానికి వారు వచ్చేశారని అర్దం అని బీటెక్ రవి వివరించారు. ఎటూ జగన్ అధకారం కోల్పోతారు.. అటువంటి జగన్ కోసం తాము గొడవలకు పడితే వచ్చే ప్రభుత్వం తమను వదలదన్న భావన వారిలో కలిగిందనీ, అందుకే మాచర్లలో పోలింగ్ సందర్భంగా హింస ప్రజ్వరిల్లితే ఎన్నికల హింసకు కేరాఫ్ అడ్రస్ లాంటి పులివెందులలో మాత్రం పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని బీటెక్ రవి ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. నియోజకవర్గంలో భారీ పోలింగ్ జగరడం కూడా జగన్ వ్యతిరేకతకే అద్దం పడుతోందని ఆయన వివరించారు. గతంలో జగన్ భయంతో ఓటు వేయడానికి ముందుకు రాని వారంతా ఇప్పుడు ధైర్యంగా పోలింగ్ బూత్ లకు వచ్చి ఓటేశారని, అందుకే పులివెందులలో తన విజయంపై ధీమాగా ఉన్నానని ఆయన చెప్పారు.  గతంలో ఎన్నడూ తెలుగుదేశం తరఫున ఏజెంట్లుగా పోలింగ్ బూత్ లలో కూర్చోవడానికి ఎవరూ ముందుకు వచ్చే పరిస్థితి ఉండేది కాదనీ, ఈ సారి మాత్రం తెలుగుదేశం తరఫున ఏజెంట్లుగా రావడానికి పోటీలు పడ్డారనీ, అదే పులివెందులలో జగన్ సీన్ అయిపోయిందని చెప్పడానికి తార్కాణంగా రవి ఉదహరించారు.  అంతే కాకుండా పోలింగ్‌ రెండు రోజుల ముందు ఢిల్లీ నుంచి ఎన్నికల కమిషన్ అధికారులు కడపలో పర్యటించి, అల్లర్లకు పాల్పడితే ఉపేక్షించబోమని గట్టిగా హెచ్చరించడం కూడా స్థానిక వైసీపి నేతలను వెనక్కు తగ్గేలా చేసిందన్నారు.  

ఎబి వెంకటేశ్వరరావుకు హైకోర్టులో భారీ ఊరట 

ఏపీలో గత టీడీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ ఛీఫ్ గా పనిచేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ విషయంలో వైసీపీ సర్కార్ కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఓసారి సస్పెండ్ చేయడంతో సుప్రీంకోర్టు వరకూ వెళ్లి ఊరటపొందిన ఆయన్ను రెండోసారి బిజినెస్ రూల్స్ పేరుతో సస్పెండ్ చేశారు. అయితే ఇలా రెండోసారి సస్పెన్షన్ చేయడం చెల్లదంటూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వుల్ను హైకోర్టులో సవాల్ చేసిన ప్రభుత్వానికి అక్కడా ఊరరట దక్కలేదు. ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ కు హైకోర్టులో భారీ ఊరట ల‌భించింది. క్యాట్ (కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్) ఉత్త‌ర్వుల‌ను స‌స్పెండ్ చేసేందుకు ఉన్న‌త న్యాయ‌స్థానం నిరాక‌రించింది. వెంకటేశ్వరరావుపై సస్పెన్ష‌న్‌ను ఎత్తివేస్తూ ఇటీవ‌ల క్యాట్ ఉత్త‌ర్వులు ఇచ్చిన విష‌యం తెలిసిందే. ఆ ఉత్తర్వులను నిలిపివేయాలంటూ రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టులో పిటిష‌న్ వేసింది. దీనిపై విచార‌ణ చేప‌ట్టిన న్యాయ‌స్థానం.. క్యాట్ ఉత్త‌ర్వుల‌ను నిలుపుద‌ల చేసేందుకు నిరాక‌రించింది. అందులో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు స్పష్టం చేసింది.  

ఇండియా కూటమికి కంట్లో నలుసుగా మమతాబెనర్జీ

దేశంలో సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు వచ్చేశాయి. చివరి విడత పోలింగ్ జూన్ 1 అంటే శనివారం  జరుగుతుంది. ఆ తరువాత మూడు రోజులకు అంటే జూన్ 4న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి జరుగుతుంది. ఇప్పటి వరకూ జరిగిన ఆరు విడతల పోలింగ్ సరళిని బట్టి చూస్తూ బీజేపీ ఘనంగా చాటుకుంటున్నట్లు సొంతంగా కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టడానికి అవసరమైన స్థానాలు సాధించే అవకశాలు దాదాపుగా లేవనే అంటున్నారు. దీంతో కేంద్రంలో వచ్చేసి అచ్చమైన సంకీర్ణ ప్రభుత్వమేనన్న అంచనాలు ఉన్నాయి. మోడీ నేతృత్వంలో 2014, 2019 ఎన్నికలలో కూడా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పాటైనా..అప్పుడు బీజేపీకి తిరుగులేని ఆధిక్యత లభించింది. సొంతంగానే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన స్థానాలోలో బీజేపీ విజయం సాధించింది. అయితే ఈ సారి బీజేపీకి ఆ స్థాయి బలం ఉండదన్న అంచనాల నేపథ్యంలో అందరి దృష్టీ కూడా కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమిపై పడింది.  వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే అయితే..అంటే బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మిత్రపక్షాల మీద ఆధారపడే పరిస్థితే వస్తే.. మోడీ బలహీనపడినట్లేననీ, అప్పుడు ఎన్డీయేలోని మిత్రపక్షాలు తమ డిమాండ్ల సాధన కోసం బలంగా గళమెత్తే అవకాశాలుంటాయనీ, అలాంటి పరిస్థితే ఉంటే చాలా వరకూ ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమివైపు చూసే అవకాశాలు మెరుగౌతాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంతటి సానుకూల పరిస్థితుల్లో కూడా ఇండియా కూటమికి తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ తీరు కంట్లో నలుసుగా మారింది. కూటమి విషయంలో ఆమె ధోరణి వింతగా ఉంది. దేశంలో తనంత మోడీ వ్యతిరేకి లేరని చెప్పుకుంటూనే.. మోడీ సర్కార్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన ఇండియా కూటమితోనూ సఖ్యతగా ఉండటం లేదు.   ప్రధాని నరేంద్రమోడీకి వ్యతిరేకంగా ఇండియా కూటమిని ప్రతిపాదించింది తానేనని చెప్పుకుని జబ్బలు చరుచుకునే మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో మాత్రం ఇండియా కూటమి భాగస్వామిగా అంగీకరించరు. అయితే గియితే, అవసరం వస్తే తాను బయట నుంచి ఇండియా కూటమికి మద్దతు ఇస్తానని చెబుతున్నారు. ఆమె ఈ వైఖరే విపక్ష కూటమికి ఒకింత ఇబ్బందిగా మారింది.  అదే సమయంలో ఎన్డీయే కూటమికి బలం చేకూర్చేలా ఉంది.  కూటమి విషయంలో మమతా ద్వంద్వ వైఖరి కారణంగానే నితీష్ కుమార్ బీజేపీ పంచన చేరి ఎన్డీయే గూటికి చేరిపోయారని  రాజకీయ పండితులు చెబుతున్నారు. అసలు మమతా బెనర్జీ అయినా, నితీష్ కుమార్ అయినా ఇండియా కూటమి సారథ్యాన్ని కోరుకున్నారనీ, అయితే కూటమిలో అతిపెద్ద పార్టీ అయిన కాంగ్రెస్ అందుకు అడ్డుపడుతున్నదన్న భావనతోనూ వారీ వైఖరి తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    

తెలంగాణా రాజ‌ముద్ర అమరవీరుల త్యాగాల్ని గుర్తుచేస్తోంది!

తెలంగాణా ఉద్యమ స్ఫూర్తి, అమరుల త్యాగం స్ఫూరించేలా కొత్త చిహ్నం...తెలంగాణా రాజ‌ముద్ర‌ రూపొందించారు.   ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి  కొత్తగా రూపొందించిన రాష్ట్రప్రభుత్వ లోగో, అమరవీరుల త్యాగాలను నిరంతరం అందరికీ గుర్తుచేస్తుంది. అమరవీరుల‌ స్థూపం, దానికి ఇరువైపులా ప్రగతికి, అభివృద్ధికి, సమృద్ధికి, సంపూర్ణతకు చిహ్నమైన రెండు వరి, గోధుమ కంకులతో, పైన మూడు తలల సింహం అశోకుని ధర్మచక్రంతో, క్రింద పద్మంతో చాలా అర్థవంతంగా, ఆకర్షణీయంగా, అద్భుతంగా, అందరినీ, అన్నివర్గాలనూ ఆకట్టుకునే విధంగా ఉంది.  సీఎం రేవంత్ రెడ్డి వ్యూహాత్మ‌కంగానే కొత్త లోగో తీసుకువ‌చ్చారు.  అమరవీరులు, రైతాంగానికి కాంగ్రెస్ మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది అనే సందేశాన్ని జనాల్లోకి తీసుకెళ్లేలా రాష్ట్ర అధికారిక చిహ్నంలో ఈ మార్పులు చేశారు. తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ఆవిష్కరించేందుకు కాంగ్రెస్ సర్కార్ రెడీ అయింది. ఈ రాజముద్రకు సంబంధించి సోషల్ మీడియాలో పలు ఫోటోలు వైరల్ అవుతున్నాయి.  ఈ లోగోలో అమరవీరుల స్థూపం, వరి కంకులతో పాటు దేశానికి గర్వకారణమైన అశోక చక్రం ఉన్నాయి.  గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం ఆవిష్కరించిన రాష్ట్ర చిహ్నంలో రాచరికపు ఆనవాళ్లు ఉన్నాయి, కొత్త లోగోలో అమరవీరుల స్థూపం, వరి కంకులకు రేవంత్ సర్కార్ చోటు కల్పించడం ప్రాధాన్యత సంతరించుకుంది.  తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేసీఆర్ ద్వారానే సాధ్యమైందని పదేళ్లుగా బీఆర్ఎస్ బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది. అయితే  కేసీఆర్ ను చెక్ పెట్ట‌డానికే రేవంత్ ఈ మార్పులు చేస్తున్నారు. కేవ‌లం కేసీఆర్ ఒక్కరితోనే, స్వరాష్ట్రం ఏర్పడలేదు… అనేక మంది అమరుల త్యాగఫలితమే తెలంగాణ అని నిత్యం గుర్తుచేసేలా అమరవీరుల స్థూపానికి ఎంబ్లమ్ లో రేవంత్ చోటు కల్పించారు. అదే సమయంలో రైతాంగం, కేసీఆర్ కంటే కాంగ్రెస్ పార్టీనే అభిమానించేలా లోగోలో చోటు క‌ల్పించారు.  దీంతో కేసీఆర్ ను మించి వ్యవసాయానికి కాంగ్రెస్ ప్ర‌భుత్వం ప్రాధాన్యత ఇస్తుందని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు రేవంత్ రెడ్డి.  తెలంగాణ ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం, ప్రజల జీవనాధారం పాడి పంటలు అయినందున చిహ్నంలో రైతాంగం ప్రతిబింబించేలా ఉండాలని ఈ మార్పులను రేవంత్ చేశారు.   -ఎం.కె. ఫ‌జ‌ల్‌

జగనన్న తిరిగొస్తే అదరగొట్టేద్దాం!

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా వుంది వైసీపీ నాయకుల వ్యవహారం. పోలింగ్ తర్వాత వైసీపీ ఓటమి కన్ఫమ్ అయిపోయినప్పటి నుంచి వీళ్ళ బుర్రలు తిరిగిపోయాయి. అందుకే అప్పట్నుంచి ఏం చేయాలో అర్థంకాక గెలుపు బాటలోవున్న టీడీపీని ఫాలో అయిపోతే సరిపోతుంది కదా అని ఫిక్సయినట్టున్నారు. అందుకే, టీడీపీ గెలవబోతోందని చాలా సర్వేలు చెబుతూ వుంటే, ఆ తర్వాత వైసీపీ వాళ్ళు కూడా తమ స్పాన్సర్డ్ సొంత సర్వేలు రిలీజ్ చేసి మాదే విజయం అని గంతులు వేశారు. పోలింగ్ ముగిసిన తర్వాత తెలుగుదేశం నాయకులు విజయోత్సాహంతో మాట్లాడారు. ఓటమి అర్థమైన వైసీపీ నాయకులు ఎప్పటికో తేరుకుని, మీడియా ముందుకు వచ్చి మేమే గెలుస్తాం అంటూ వాడిపోయిన ముఖాలతో చెప్పారు. ఇప్పుడు మరోసారి టీడీపీని అనుకరించడానికి వైసీపీ నాయకులు సన్నాహాలు చేసుకుంటున్నారు. తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పోలింగ్ ముగిసిన తర్వాత ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్ళొచ్చారు. హైదరాబాద్ విమానాశ్రయంలో చంద్రబాబు నాయుడికి తెలుగుదేశం నాయకులు భారీ స్థాయిలో స్వాగతం పలికారు. విజయోత్సాహంతో సీఎం సీఎం అని నినాదాలు చేశారు. ఇప్పుడు జగన్ పార్టీ వాళ్ళకి కూడా ఒక పాయింట్ దొరికినట్టు అయింది. చంద్రబాబు నాయుడికి విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది కాబట్టి, లండన్  వెళ్ళిన జగనన్న తిరిగి వస్తే కనుక భారీ స్థాయిలో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. జగనన్న ఎలాగూ లాండ్ అయ్యేది గన్నవరం ఎయిర్‌పోర్టులోనే కాబట్టి అక్కడ వేలాదిమందితో స్వాగత కార్యక్రమాలు ఏర్పాటు చేసి అదరగొట్టేయాలని వైసీపీ నాయకులు ప్లాన్ చేస్తున్నారు. జగనన్న తిరిగి వచ్చిన సందర్భంగా చేసే సందడి చూసి ‘ఇక విజయం వీళ్ళదే’ అని దేశమంతా అనుకోవాలని భావిస్తున్నారు. వీళ్ళు ఇలాగే భ్రమల్లో బతకాలని కోరుకుందాం.

చంద్రబాబుకు రాష్ట్ర ప్రగతే శ్వాస.. పార్టీ పురోగతిపైనే ధ్యాస

పనిలోనే ఆయన విశ్రాంతి. ప్రజా జీవితాన్ని మెరుగుపరచడం ఎలా, పేదలను సంపన్నులు చేయడం ఎలా అన్న ఆలోచనలే ఆయనకు విరామం. ఆయన తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.  నాలుగున్నర దశాబ్దాలుగా నిత్యం ప్రజల మధ్య నిత్య చైతన్య శీలిగా ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు మాత్రమే. ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు పూర్తయ్యాయి. నెలల తరబడి ఎన్నికల ప్రచారం కోసం నిత్యం పర్యటనలలో గడిపిన చంద్రబాబు పోలింగ్ పూర్తయిన తరువాత  కొద్ది విరామం తీసుకున్నారు. ఆ విరామం తీసుకోవడానికి ముందు కూడా అంటే పోలంగ్ పూర్తియన తరువాత, ఆయన విదేశీ పర్యటనకు వెళ్లడానికి మధ్య ఉన్న కొద్ది రోజులలో కూడా ఆయన నిత్యం రాష్ట్రంలో పరిస్థితులపైనే దృష్టి పెట్టారు. పోలింగ్ రోజు, పోలింగ్ అనంతరం రాష్ట్రంలో చెలరేగిన హింసా కాండ, నెలకొన్న ఉద్రిక్తతలపై నిరంతర సమీక్షలతో ఆయన బిజీగా గడిపారు. రాష్ట్రంలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తీసుకోవలసిన చర్యలపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖలు రాశారు. సంయమనం పాటించాలని ప్రజలకు పిలుపు నిచ్చారు. అదే సమయంలో ఇలా పోలింగ్ పూర్తి కాగానే, కోర్టు అనుమతి తీసుకుని అలా విదేశీ పర్యటనకు చెక్కేసిన జగన్ మాత్రం ఇప్పటి వరకూ రాష్ట్రంలో పరిస్థితులపై ఒక్క సమీక్ష నిర్వహించలేదు. ఒక్క ప్రకటన చేయలేదు.  ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్థిదారులకు చెల్లించాల్సిన నిధులను దారి మళ్లించి అస్మదీయ  కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు సర్కార్ చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకోవాలంటూ  చంద్రబాబు గవర్నర్ కు రాసిన లేఖతో  అదే విధంగా  ఈ-ఆఫీస్‌ అప్‌గ్రేడేషన్‌  కూడా చంద్రబాబు ఫిర్యాదుతోనే ఆగింది. వైసీపీ తీసుకొచ్చిన తప్పుడు జీవోలను మాయం చేసేందుకు వైసీపీ సర్కార్ చేసిన ప్రయత్నానికి అడ్డుకట్ట పడింది. రాష్ట్ర బాగోగుల విషయంలో చంద్రబాబు రాజీప డరనడానికి వీటిని ఉదాహరణలుగా పరిశీలకులు చూపుతున్నారు.    సరే ఆయన విదేశీ పర్యటనకు వెళ్లారు. అదీ వైద్య పరీక్షల నిమిత్తం. కానీ అక్కడ నుంచీ కూడా ఆయన నిత్యం రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులపై నిత్యం స్పందిస్తూనే ఉన్నారు. ఎక్కడ ఉన్నా, ఏం చేస్తున్నా తన ధ్యాస, శ్వాస అంతా ఏపీ ప్రయోజనాలేనని చాటకనే చాటారు. అటువంటి చంద్రబాబు బుధవారం (మే 29) విదేశీ పర్యటన ముగించుకుని స్వదేశానికి వచ్చారు. హైదరాబాద్ చేరుకున్న ఆయన వెంటనే  పార్టీ నాయకులతో టెలీకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి వారికి కీలక సూచనలు చేశారు.  పోస్టల్ బ్యాలెట్  ల లెక్కింపు సందర్భంగా జాగరూకతతో ఉండాల్సిందిగా సూచించారు. గురువారం (మే30)న అమరావతి చేరుకున్నారు. శుక్రవారం (మే31)ఆయన రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, పాతిక పార్లమెంట్ నియోజకవర్గాల పార్టీ చీఫ్ ఎలక్షన్ ఏజెంట్లతో సమావేశం కానున్నారు.  ఈ సమావేశంలో కౌంటింగ్ సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలపై చర్చిస్తారు. ఇక జూన్ 1వ తేదీన అంటే శనివారం జోన్ల వారీగా పార్టీ పోలింగ్ ఎజెంట్లకు శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.  అలాగే చంద్రబాబు  శుక్రవారం (మే30) జనసేనాని పవన్ కల్యాణ్ తో భేటీ కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ జరిగిన తీరు, పోలింగ్ అనంతర పరిణామాలపై చర్చిస్తారు. అదే రోజు ఆయన బీజేపీ నేతలతో కూడా భేటీ అవుతారు.    

రక్తం దానం చేయడానికి ఏకంగా 440 కిలో మీటర్ల ప్రయాణం... షిర్డీ నుంచి ఇండోర్ కు చేరుకున్న దాత

రక్త దానం  అనేది దరిదాపుగా ప్రాణ దానం లాంటిది. ఒకరి రక్తం మరొకరికి ఇచ్చే పద్ధతిని రక్త దానం అంటారు.  చేసిన దానం సవ్యంగా వెచ్చించబడుతోందా, దుర్వినియోగం పాలవుతోందా అనే అనుమానం ఉండటం సహజం. దుర్వినియోగం అంటే మనం దానం చేసిన రక్తాన్ని కుళ్ళబెట్టి పారెయ్యడమయినా కావచ్చు లేదా నల్ల బజారులో అమ్మకానికి పెట్టినా పెట్టొచ్చు. మరి మహరాష్ట్రకు చెందిన ఓ వ్యక్తి అరుదైన బ్లడ్ గ్రూప్ ను దానం చేయడం అందరినీ ఆకట్టుకుంది. రక్తాన్ని దానం చేయడమంటే ప్రాణాన్ని దానం చేసినట్టే. ఆ విషయం తెలుసు కాబట్టే ఓ వ్యక్తి ఏకంగా 400 కిలోమీటర్లు ప్రయాణించి చావుబతుకుల్లో ఉన్న ఓ మహిళ ప్రాణాలు నిలబెట్టాడు. ఇంతకీ ఆయన దానం చేసిన బ్లడ్ గ్రూప్ ఏంటో తెలుసా? అత్యంత అరుదైన ‘బాంబే’ బ్లడ్ గ్రూప్. మహారాష్ట్రలోని షిర్డీకి చెందిన రవీంద్ర అష్తేకర్ (36) హోల్‌సేల్ పూల వ్యాపారి. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన మహిళ (30) ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. ఆమెకు అత్యవసరంగా బాంబే బ్లడ్ గ్రూప్ అవసరమని వాట్సాప్‌లో సందేశం చూశాడు. అది చూసిన రవీంద్ర వెంటనే స్నేహితుడి కారులో షిర్డీ నుంచి బయలుదేరాడు. 440 కిలోమీటర్లు ప్రయాణించి ఈ నెల 25న ఇండోర్ చేరుకుని రక్తదానం చేసి ఆమె ప్రాణాలు కాపాడాడు. ఆమె ప్రాణాలను కాపాడేందుకు తనవైపు నుంచి కొంతసాయం చేసినందుకు సంతోషంగా ఉందని రవీంద్ర పేర్కొన్నారు. రవీంద్ర గత పదేళ్లలో 8సార్లు రక్తాన్ని దానం చేశారు. ఒక్క మహారాష్ట్రలోనే కాదు, గుజరాత్, ఉత్తరప్రదేశ్, ఇప్పుడు మధ్యప్రదేశ్‌లో రక్తదానం చేశారు.  అత్యంత అరుదైన బాంబే బ్లడ్ గ్రూప్‌ను 1952లో కనుగొన్నారు. ఈ గ్రూపు రక్తంలో ‘హెచ్’ యాంటీజెన్‌లు ఉండవు. బదులుగా యాంటీ హెచ్ యాంటీబాడీలు ఉంటాయి. ఈ గ్రూపు రక్తం కలిగినవారికి అటువంటి గ్రూపు కలిగిన వారు మాత్రమే రక్తం ఇవ్వాల్సి ఉంటుంది.

ఏఆర్‌ రెహ‌మాన్‌కు, కీరవాణికి తేడా ఏంటి? అప్పుడు లేని అభ్యంత‌రం ఇప్పుడెందుకు?

కీరవాణి స్వరాలా అని గుండెలు బాదుకుంటున్నవారు గ‌తాన్ని ఓ సారి గుర్తు చేసుకోవాలి. 2021లో అనుకుంట‌,  కల్వకుంట కవిత ఆస్కార్ అవార్డు విజేత రెహమాన్‌తో బతుకమ్మ పాట కంపోజ్ చేయించారు.  అంతా అరవ సినిమాల స్టయిల్… దీనికి గౌతమ్ మేనన్ దర్శకత్వం వ‌హించారు.  మరి కీరవాణి కూడా అదే ఆస్కార్ విజేత… కానీ తెలుగుదనం తెలిసినవాడు… అన్నమయ్య పాటల్ని అమృతధారలా చెవుల్లోకి ఒంపినవాడు.  కీరవాణిని ఈ పాట‌కు స్వరాలు కూరిస్తే తప్పేమిటి..? స్వరాలకు, రాగాలకు తెలంగాణతనం, ఆంధ్రాతనం వేరే ఉంటుందా..? కంటెంటుకు ఉంటుంది… అంతే… ఎవరు పాడితేనేం..? ఎవరు కూరిస్తేనేం..? కావల్సింది తరతరాలు జాతి పాడుకునే ఓ మంచి బాణీ… ఆ పదాలు సగౌరవంగా ఆ బాణీలో ఇమడాలి. అయితే మన నేత‌ల‌కు ప్ర‌తిదీ రాజ‌కీయం చేయ‌డం అల‌వాటైపోయింది.  అనవసరంగా రచ్చ చేస్తున్నారు.  తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత  జయజయహే తెలంగాణ పాటను రాష్ట్ర గీతంగా ప్రకటిస్తాం అన్నారు. కానీ దొర‌కు న‌చ్చ లేదు కాబ‌ట్టి అది జరగలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్ర‌భుత్వం ‘జయ జయహే తెలంగాణ’ పాటని  తెలంగాణ రాష్ట్ర గీతంగా  ప్రకటించింది. అప్ప‌ట్లో దొర‌కు ఎందుకు న‌చ్చ‌లేదంటే అందెశ్రీ ద‌ళితుడు కాబ‌ట్టి.  జనగామ జిల్లా, రేవర్తికి చెందిన అందెశ్రీ నిరుపేద కుటుంబంలో పుట్టారు. అనాథ. పశువుల కాపరి. తాపీమేస్త్రీగా పనిచేశారు. 21 సంవత్సరాలపాటు అదే పని. అయితేనేం.. కవిత్వం ఆయనకు సహజంగా అబ్బింది. రాయడం నేర్చుకున్నాడు.. విద్యావంతుడయ్యాడు. ఏ డిగ్రీ లేదు కానీ అనేక యూనివర్సిటీల నుంచి డాక్టరేట్లను అందుకున్నాడు. నదులమీద కవిత్వం రాస్తూ ప్రపంచవ్యాప్త పర్యటన చేశారు. మిసిసిపి, మిజోరి, అమేజాన్, నైలు వంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ.. నదుల మీద పెద్ద కావ్యాన్ని రాసే పనిలో ఉన్నారు.   జయజయహే తెలంగాణ.. పాట ఎలా రాశారో చెబుతూ.. తెలంగాణ సాధన సమయంలో 2003, 2 మార్చిలో కామారెడ్డిలో జరిగిన తెలంగాణ ధూం ధాం కార్యక్రమంలో.. మనకంటూ ఒక గీతం ఉండకూడదా అనిపించిందట. ఆ సమయంలోనే  తనకు ఈ పాట తట్టిందట.  ఆ ఆలోచన వచ్చిన కొద్దికాలంలోనే నాలుగు చరణాలు రాశారు. ముందు నాలుగు చరణాలే. వీటిని ఆ తరువాత 2003, నవంబర్ 11న ఆదిలాబాద్‌లో జరిగిన తెలంగాణ రచయితల వేదిక జెండా వందనానికి పాడారు. అది విన్న అందరిలోనూ ఓ తెలియని మైమరుపు.. అలా ఆ పాట అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆ గీతాన్ని పాడుతూనే ఉన్నడు. రాస్తూనే ఉన్నడు. మొత్తం 12 చరణాలు. నిజానికి ఈ పాట తెలంగాణ ప్రకటన వచ్చిన 9 డిసెంబర్ 2009 తర్వాత కోటానుకోట్ల ప్రజల దగ్గరకు చేరింది. కానీ, అంతకు ముందే అది ముఖ్యసభల్లో కవులు, కళాకారులు, మేధావులు, కార్యకర్తల వద్దకు చేరిపోయింది.  జయ జయహే తెలంగాణ... జననీ జయకేతనం ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరితగల తల్లీ నీరాజనం పది జిల్లల నీ పిల్లలు ప్రణమిల్లిన శుభ తరుణం జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ!! పంపనకు జన్మనిచ్చి బద్దెనకు పద్యమిచ్చి భీమకవికి చనుబాల బీజాక్షరమైన తల్లి హాలుని గాథాసప్తశతికి ఆయువులూదిన నేల బహత్ కథల తెలంగాణ కోటిలింగాల కోణ జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ! ప్రజల భాషలో కావ్య ప్రమాణాలు ప్రకటించిన తెలుగులో తొలి ప్రజాకవి పాల్కురికి సోమన రాజ్యాన్నే ధిక్కరించి రాములోరి గుడిని గట్టి కవిరాజై వెలిగె దిశల కంచర్ల గోపన్న జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ! కాళిదాస కావ్యాలకు భాష్యాలను రాసినట్టి మల్లినాథసూరి మా మెతుకుసీమ కన్నబిడ్డ ధూళికట్ట నేలినట్టి బౌద్ధానికి బంధువతడు ధిజ్ఞాగుని కన్న నేల ధిక్కారమె జన్మహక్కు జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ! పోతనదీ పురిటిగడ్డ.. రుద్రమదీ వీరగడ్డ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినారు జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ! జానపదా జనజీవన జావళీలు జాలువార జాతిని జాగృత పరచే గీతాల జనజాతర వేలకొలదిగా వీరులు నేల ఒరిగి పోతేనేమి తరగనిదీ నీ త్యాగం మరువనిదీ శ్రమయాగం జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ! రాచకొండ ఏలుబడిగ రంజిల్లిన రేచర్ల సర్వజ్ఞ సింగభూపాలుని బంగరు భూమి వాణీ నా రాణీ అంటు నినదించిన కవికుల రవి పిల్లలమఱ్ణి పినవీరభద్రుడు మాలో రుద్రుడు జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ! సమ్మక్కలు సారక్కలు సర్వాయిపాపన్నలు సబ్బండ వర్ణాల సాహసాలు కొనియాడుతు ఊరూర పాటలైన మీరసాబు వీరగాథ దండు నడిపే పాలమూరు పండుగోల్ల సాయన్న జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ! కవిగాయక వైతాళిక కళలా మంజీరాలు డప్పూ ఢమరుకము, డక్కి, శారద స్వరనాదాలు పల్లవులా చిరుజల్లుల ప్రతి ఉల్లము రంజిల్లగ అనునిత్యము నీ గానం అమ్మ నీవే మా ప్రాణం జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ! బడుల గుడులతో పల్లెల ఒడలు పులకరించాలి విరిసే జనవిజ్ఞానం నీ కీర్తిని పెంచాలి తడబడకుండా జగాన తల ఎత్తుకొని బ్రతుక ఒక జాతిగ నీ సంతతి ఓయమ్మా వెలగాలి జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ! సిరి వెలుగులు విరజిమ్మే సింగరేణి బంగారం అణువణువున ఖనిజాలే నీ తనువున సింగారం సహజమైన వనసంపద సక్కనైన పువ్వులపొద సిరులు పండె సారమున్న మాగాణమె కదా! నీ యెద జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ! గోదావరి క్రిష్ణమ్మలు మా బీళ్లకు తరలాలి..  పచ్చని మా నేలల్లో పసిడిసిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా వుండాలి సకల జనుల తెలంగాణ స్వర్ణయుగం కావాలి జై తెలంగాణ! జై జై తెలంగాణ!! జై తెలంగాణ! జైజై తెలంగాణ! - ఎం.కె. ఫ‌జ‌ల్‌

అవును.. గాంధీజీ పాపులర్ కాదు...!

‘‘ఈ అంశంలో నన్ను క్షమించండి..! 1982 సంవత్సరంలో రిచర్డ్‌ అటెన్‌బరో రూపొందించిన చలనచిత్రం ‘గాంధీ’ విడుదలయ్యే వరకు కూడా ప్రపంచానికి మహాత్మా గాంధీ గురించి తెలియదు. మహాత్మా గాంధీజీ ఒక గొప్ప వ్యక్తి. మార్టిన్‌ లూథర్‌కింగ్‌, నెల్సన్‌ మండేలా వంటి మహానుభావుల కంటే గాంధీజీ తక్కువేం కాదు. 75 ఏళ్లుగా అలాంటి వ్యక్తిని ప్రపంచం గుర్తించేలా చేయడం మనందరి బాధ్యత కాదా?’’ అని ప్రధాని నరేంద్ర మోదీ తన అమూల్యమైన అభిప్రాయం వ్యక్తం చేశారు. జనరల్ ఎలక్షన్స్ చివరి దశకు చేరుకున్న నేపథ్యంలో ప్రధాని మోడీ ఏబీపీ న్యూస్‌ నెట్‌వర్క్‌ ప్రతినిధులకు ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. మోడీ గారు చెప్పింది కరెక్టే... గాంధీ సినిమా వచ్చే వరకు మోడీ పాపులర్ కాదు.. ప్రపంచానికి తెలియదు.. ఎందుకంటే, ఆయన జనం సొమ్ముతో పని లేకపోయినా ప్రపంచ యాత్రలు చేయలేదు. ఆయన జనం సొమ్ముతో మీడియా క్రూలను ఏర్పాటు చేసుకోలేదు. ఆయన జనం సొమ్ముతో మీడియా మేనేజ్‌మెంట్ చేయలేదు. జనం సొమ్ముతో సోషల్ మీడియాలో తనను తాను ప్రమోట్ చేసుకోలేదు.. పైగా అప్పుడు సోషల్ మీడియా కూడా లేదు. ప్రపంచంలో ఏ సంఘటన జరిగినా నేనున్నాను అంటూ దూరిపోలేదు. దేశాలుపట్టి తిరిగి, ఏ దేశం వెళ్ళినా ఆ దేశ నాయకులను నవ్వుకుంటూ కౌగిలించుకునే తెలివితేటలు ప్రదర్శించలేకపోయారు. తన వెంట ఫొటోగ్రాఫర్లను ఏర్పాటు చేసుకుని తన గొప్పతనాన్ని వాళ్ళు క్యాప్చర్ చేసేలా చేసుకోలేదు. ఇరుగు పొరుగు దేశాలతో శత్రుత్వం పెరిగేలా చేసి, తద్వారా తాను లాభపడే అవకాశం ఆయనకు లేదు. ఇతర పార్టీలన్నిటినీ అణగదొక్కేసి తానే ఈ దేశానికి దిక్కు అని ప్రచారం చేసుకోలేదు.... ఇంకా ఇలాంటి ఎన్నో అతి తెలివితేటలు ప్రదర్శించలేదు కాబట్టే.. మోడీ గారు చెబుతున్నట్టు 1982కి ముందు గాంధీజీ ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ కాలేదు. అంతే కదా విశ్వగురు గారూ!

రేవంత్ టీజింగ్ మామూలుగా లేదుగా?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిర్ణయాలతో బీఆర్ఎస్ ను విపరీతంగా టీజ్ చేస్తున్నారు. ఉక్రోషంతో వారు అవాకులూ, చవాకులూ మాట్లాడి ప్రజలలో మరింత చులకన కావడానికి రేవంత్ తీరు దోహదం చేస్తోందనడంలో సందేహం లేదు. తెలంగాణ ఆవిర్భావ పదో వార్షికోత్సవాన్ని ఘనంగా, అత్యంత వైభవంగా నిర్వహించేందుకు రేవంత్ సర్కార్   అన్ని ఏర్పాట్లూ చేసింది. ఆ దశాబ్ది ఆవిష్కరణోత్సవాల సందర్భంగానే రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నం ఆవిష్కరించాలనీ నిర్ణయించింది. అక్కడే రేవంత్ బీఆర్ఎస్ ను ఇరుకున పడేశారు. అందేశ్రీ రాసిన జయజయహే గీతాన్ని ప్రసిద్ధ సంగీత దర్శకుడు, ఆస్కార్ పురస్కార గ్రహీత ఎంఎం కీరవాణి చేత ట్యూన్ కట్టించారు.  దీంతో బీఆర్ఎస్ ఒక్కసారిగా  తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆంధ్రప్రదేశ్ కు చెందిన వ్యక్తి బాణీ కట్టడమేంటి? ఇది తెంగాణ ద్రోహం, తెలంగాణ ఆత్మగౌరవానికి భంగం అంటూ గగ్గోలు పెట్టడం మొదలెట్టింది. దీనికి ఏ మాత్రం ఖాతరు చేయని రేవంత్.. తెలంగాణ రాష్ట్ర గీత రచయత అందెశ్రీ స్వయంగా ఆ గీతానికి కీరవాణి మాత్రమే ట్యూన్ చేయగలరని స్వయంగా తనను కోరారని గీత రచయత మాటకు గౌరవం ఇవ్వాల్సిన అవసరం లేదా అని ప్రశ్నించారు. దీంతో ఈ విషయాన్ని తెలంగాణ సెంటిమెంట్ రగిల్చేందుకు ఉపయోగించుకుని రేవంత్ ను ఇరుకున పెట్టాలని భావించిన బీఆర్ఎస్ వ్యూహం బూమరాంగ్ అయ్యింది. ఎదురు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా.. కాళేశ్వరం, యాదాద్రి..ఇలా ఎన్నో ప్రతిష్ఠాత్మక  నిర్మాణ కాంట్రాక్టులన్నీ ఆంధ్రావారికే కట్టబెట్టారు కదా? అన్న చర్చ తెరపైకి వచ్చి బీఆర్ఎస్ ప్రతిష్ట మరింత మసకబారింది. ఇక రాష్ట్ర చిహ్నం విషయంలో కూడా బీఆర్ఎస్ గగ్గోలు పెట్టింది. కాకతీయ కళాతోరణాన్ని తీసేయడమేంటంటూ ఊరూవాడా ఏకమయ్యేలా గోడవగొడవ చేసింది. అయితే  రాష్ట్ర చిహ్నంలో రాచరికపు గుర్తులను తొలగించాలని రేవంత్ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యంతరాలను సర్కార్ పట్టించుకోదని తేటతెల్లమైపోయింది. అయితే రాచరికపు గుర్తులను తొలగించాలన్న సర్కార్ నిర్ణయాన్ని బీఆర్ఎస్ వినా మరే రాజకీయ పార్టీ వ్యతిరేకించడం లేదు. అంటే తెలంగాణ రాష్ట్ర గీతంపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరం లాగే రాష్ట్ర చిహ్నం విషయంలో అభ్యంతరాలు కూడా కేవలం బీఆర్ఎస్ కు మాత్రమే పరిమితం అయిపోయాయి. ఇప్పుడు బీఆర్ఎస్ ను మరింత ఇరుకున పెట్టేలా రేవంత్ కీలక  నిర్ణయం తీసుకున్నారు. గురువారం (మే30) సాయంత్రం రాజకీయనేతలతో భేటీ కానున్నారు. ఈ భేటీకి రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీల నేతలనూ ఆహ్వానించారు. రాష్ట్ర గీతం, రాష్ట్ర చిహ్నాల ఈ భేటీలో వివరించి వారి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. దీంతో ఈ భేటీకి బీఆర్ఎస్ హాజరౌతుందా?  గైర్హాజరౌతుందా అన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. ఒక వేళ హాజరైతే ప్రభుత్వ నిర్ణయంపై బీఆర్ఎస్ లేవనెత్తిన అభ్యంతరాలకు ఇతర పార్టీల నుంచి మద్దతు వచ్చే అవకాశం ఉండదు. దీంతో అఖిలపక్ష భేటీలో ఆమోదం పొందిన నిర్ణయంపై ఆ తరువాత గళమెత్తడానికి బీఆర్ఎస్ కు అవకాశం ఉండదు. గైర్హాజరైతే బీఆర్ఎస్ అభ్యంతరాలు రిజిస్టర్ కావు.  దీంతో రేవంత్ నిర్ణయం బీఆర్ఎస్ కు ముందు గొయ్యి, వెనుక నుయ్యిలా మారిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

నన్ను బెదిరించిన వారికి సిఎం రేవంత్ నెంబర్ ఇచ్చా: రాజాసింగ్ 

గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విలక్షణ స్వభావం. హిందుత్వ నినాదం మీద ఆయన దేశ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు.  దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బిజెపి స్టార్ క్యాంపెయినర్లలో రాజాసింగ్ ఒకరు.మజ్లిస్ పార్టీ మీద కయ్యానికి కాలు దువ్వే రాజా సింగ్ కు ఇస్లామిక్ ఉగ్రవాదులు అనేక మార్లు బెదిరింపులకు పాల్పడ్డారు. వీరితో తాను వేగలేననుకున్నారో ఏమో రాజాసింగ్ క్రియేటివ్ గా ఆలోచించారు. తనకు బెదిరింపు కాల్స్ వస్తే ముఖ్యమంత్రికి కంప్లయెంట్ చేసే బదులు ఏకంగా ముఖ్యమంత్రి నెంబర్ ఇచ్చేశారు. ఇది నా సెకండ్ నెంబర్ అంటూ తనను బెదిరించిన వారికి బుకాయించారు.  తనకు బెదిరింపు కాల్స్ చేసిన వారికి తాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్ ఇచ్చానని గోషామహల్ ఎమ్మెల్యే, బీజేపీ నేత రాజాసింగ్ అన్నారు. ముఖ్యమంత్రి నెంబర్ ఇవ్వడానికి గల కారణాలను కూడా ఆయన వెల్లడించారు. రేవంత్ రెడ్డికి బెదిరింపు కాల్స్ వెళితే... బెదిరింపులకు పాల్పడిన వారిపై ఆయన చర్యలు తీసుకుంటారనే ఉద్దేశ్యంతో ఆ నెంబర్ ఇచ్చానన్నారు. తనకు ఫోన్ చేసి బెదిరించినవాళ్లు తన వద్ద ఎన్ని నెంబర్లు ఉన్నాయని అడిగారని... అప్పుడే తాను ఇంకో నెంబర్ ఉందని చెప్పి ముఖ్యమంత్రిది ఇచ్చినట్లు చెప్పారు.  ధర్మం కోసం పని చేస్తే తనను, తన కుటుంబాన్ని చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు వచ్చిన బెదిరింపు కాల్స్‌పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు, డీజీపీకి లేఖ రాసినట్లు తెలిపారు.

‘అవినీతి చక్రవర్తి నరేంద్ర మోడీ’

తమ్ముడు తనవాడైనా ధర్మం చెప్పమన్నారు. ఇప్పుడు ఇద్దరు ప్రముఖులు పరకాల ప్రభాకర్, వడ్డే శోభనాద్రీశ్వరరావు ఆ బాటలోనే పయనిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రముఖ నాయకుడు వడ్డే శోభనాద్రీశ్వరరావు, ప్రముఖ రాజనీతి కోవిదుడు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ భర్త పరకాల ప్రభాకర్ ఇప్పుడు ఈ నీతి సూత్రాన్నే అనుసరిస్తున్నారు. ఆ సూత్రానికి అనుగుణంగా వడ్డే శోభనాద్రీశ్వరరావు ప్రధాని నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా ‘అవినీతి చక్రవర్తి నరేంద్ర మోడీ - ఎలక్టోరల్ బాండ్స్ స్కామ్ అందులో కొద్ది భాగమే’ అనే పుస్తకాన్ని రచించారు. ఈ పుస్తకాన్ని పరకాల ప్రభాకర్ ఆవిష్కరించనున్నారు. జూన్ 2, 2024వ తేదీ ఆదివారం నాడు విజయవాడ గాంధీనగర్‌లో వున్న ప్రెస్‌క్లబ్‌లో ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరగనుంది. భారత రాజ్యాంగ హక్కుల పరిరక్షణ వేదిక, ఆంధ్రప్రదేశ్ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగనుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పార్టీకి, బీజేపీకి మధ్య ఎన్నికల పొత్తు వుంది. తెలుగుదేశం నాయకుడు అయిన వడ్డే శోభనాద్రీశ్వరరావు మన పార్టీతో బీజేపీకి ఫ్రెండ్‌షిప్ వుంది కాబట్టి మోడీని అవినీతిపరుడు అనకూడదు కదా అని ఈ పుస్తకం రాయకుండా ఆగలేదు. అదేవిధంగా, పరకాల ప్రభాకర్ భార్య నిర్మలా సీతారామన్ మోడీ మంత్రివర్గంలో టాప్ మంత్రుల్లో ఒకరు. నా భార్య మోడీ మంత్రివర్గంలో వుంది కాబట్టి నేను ఈ పుస్తకాన్ని ఆవిష్కరించకూడదు కదా అని పరకాల ప్రభాకర్ ఆగలేదు. దీనినే తమ్ముడు మనవాడైనా న్యాయం చెప్పడం అంటారు. తమ వెనుక ఎలాంటి నేపథ్యం వున్నా, ఆ నేపథ్యానికి వ్యతిరేకంగా వుండే పని చేయడానికి వెనుకాడని వీరిద్దరూ అభినందనీయుడు. వీరి ఆలోచన కరెక్ట్ కావచ్చు.. కాకపోవచ్చు.. కానీ తమ ఆలోచనని సమాజానికి తెలియజేసే విషయంలో ఎలాంటి ప్రభావాలకూ లొంగకుండా ముందుకు వెళ్ళడం అందరీకి స్ఫూర్తిదాయకమే.

ఆ ఐదు నియోజకవర్గాలపైనే అందరి దృష్టీ!

ఓట్ల లెక్కింపునకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. జూన్ 4న రాత్రి 8 నుంచి 9 గంటల మధ్య అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు ప్రకటిస్తామని చెప్పారు. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను 111 నియోజకవర్గాలలో ఓట్ల లెక్కింపు మధ్యాహ్నం రెండు గంటలకల్లా పూర్తవుతుందన్న మీనా  61 నియోజకవర్గాల్లో సాయంత్రం 4 గంటలకు, మిగిలిన మూడు నియోజకవర్గాల్లో సాయంత్రం 6 గంటల్లోపు లెక్కింపు ప్రక్రియ పూర్తి  అయ్యే అవకాశాలున్నాయన్నారు. ఇలా ఉండగా  ఢిల్లీలోని నిర్వాచన్ సదన్ నుంచి సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నితీశ్ వ్యాస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ఒట్ల లెక్కింపు ఏర్పాట్లను సమీక్షించారు. అదలా ఉంటే ఆంధ్రప్రదేశ్ లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి రికార్డు స్థాయిలో దాదాపు 82శాతం ఓటింగ్ జరిగింది. ఇది 2019 ఎన్నికల కంటే రెండు శాతం కంటే ఎక్కువ. జూన్ 4న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. ఫలితాలు వెల్లడౌతాయి.  కుప్పం, పులివెందుల, పిఠాపురం, మంగళగిరి నియోజకవర్గాలలో అయితే రాష్ట్ర సగటు కంటే ఎక్కువ పోలింగ్ నమోదైంది. ఈ నియోజకవర్గాలలో పోటీలో ఉన్న వారందరూ సెలబ్రిటీలే కావడం గమనార్హం. కుప్పం నుంచి తెలుగుదేశం అధినేత చంద్రబాబు పోటీ చేశారు. అలాగే పులివెందుల నుంచి వైసీపీ అధినేత జగన్, పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కల్యాణ్ పోటీ చేయగా, మంగళగిరి నియోజకవర్గం నుంచి తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పోటీ చేశారు. ఈ అన్ని నియోజకవర్గాల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే ఈ నియోజకవర్గాలలో గెలుపు ఓటముల కంటే ఆయా స్థానాలలో అభ్యర్థుల మెజారిటీ ఎంత అన్నదానిపైనే ఆ ఉత్కంఠ ఉంది. అయితే ఆశ్చర్యకరంగా నందమూరి బాలకృష్ణ పోటీ చేసిన హిందూపురం నియోజకవర్గంలో మాత్రం ఈ సారి ఓటింగ్ గతంతో పొలిస్తే తగ్గింది. అది పక్కన పెడితే ఈ సెలబ్రిటీల నియోజకవర్గాలలో అన్నిటి కంటే ముందుగా కుప్పం, లేదా పిఠాపురం  నియోజకవర్గ ఫలితం వెలువడే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ రెండు నియోజకవర్గాలలో కౌంటింగ్ 18 రౌండ్లలో పూర్తి అవతుంది.  ఈ రెండింటి తరువాత హిందుపురం ఫలితం వెలువడే అవకాశాలున్నాయి. ఎందుకంటే హిందూపురంలో 19 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి అవుతుంది. ఇక నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి నియోజకవర్గంలో కౌంటింగ్ 22 రౌండ్లు ఉంటుంది. అదే విధంగా జగన్ పోటీ చేసిన పులివెందులలో కూడా 22 రౌండ్ల కౌంటింగ్ ఉంటుంది. దీంతో ఈ సెలబ్రిటీలు పోటీ చేసిన నియోజకవర్గాల ఫలితాలు అదే వరుసలో వెలువడే అవకాశం ఉంది. అంటే ఈ నియోజకవర్గాలలో మొదట కుప్పం లేదా పిఠాపురం ఫలితం వెలువడుతుందన్న మాట.  అయితే కౌంటింగ్ ఎన్ని రౌండ్లలో పూర్తి అవుతుంది అన్నది పెద్ద విషయం కాదు. ఎందుకంటే ఈ అన్ని నియోజకవర్గాలలోనూ  ఓట్ల లెక్కింపు ఆరంభంతోనే   ట్రెండ్ ను బట్టి విజేత ఎవరన్నది తేలిపోతుంది.   పోటీ హోరాహోరీగా జరిగితే  తప్ప గెలుపు ఓటముల విషయం తెలియడానికి పెద్ద సమయం పట్టదు. కానీ కచ్చితమైన మెజారిటీ ఎంత అన్నది తేలడానికి మాత్రం కౌంటింగ్ పూర్తయ్యే వరకూ ఆగాల్సి ఉంటుంది. ఈ సెలబ్రిటీలు పోటీ చేసిన నియోజకవర్గాలలో ఒక్క పులివెందులలోనే పోటీ హోరాహోరీగా జరిగిందని పరిశీలకులు అంటున్నారు. అది వినా కుప్పం, పిఠాపురం, మంగళగిరి, హిందూపురంలలో కూటమి అభ్యర్థుల విజయం నల్లేరు మీద బండినడకేనని పోలింగ్ సరళిని ఉటం కిస్తూ సెఫాలజిస్టులు చెబుతున్నారు.  పులివెందులలో షర్మిల ఫ్యాక్టర్ జగన్ మెజారిటీని గణనీయంగా తగ్గించే అవకాశాలున్నాయంటున్నారు. కడప లోక్ సభ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే ఈ నియో జకవర్గంలో జగన్ మెజారిటీ తగ్గడం అంటే కడప లోక్ సభ నియోజకవర్గంలో  వైసీపీ అభ్యర్థి అవినాష్ రెడ్డి విజయంపై తీవ్ర ప్రభావం పడటమేనని అంటున్నారు.  

ప్రజ్వల్ రేవణ్ణకు కోర్టులో చుక్కెదురు

మహిళలపై లైంగిక వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న హాసన ఎంపీ ప్రజ్వల్‌ రేవణ్ణ కు బెంగళూరు కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ను ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు తిరస్కరించింది.  ప్రజ్వల్‌ తరఫు న్యాయవాది అరుణ్‌ కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ వేయగా.. న్యాయస్థానం దానిని కొట్టివేసింది. మరోవైపు, మ్యూనిచ్‌ నుంచి  ప్రజ్వల్‌  గురువారం (మే 30) బెంగళూరుకు రానున్నారు. శుక్రవారం (మే 31) ఆయన బెంగళూరులో సిట్ విచారణకు హాజరుకానున్నారు. దీంతో అందరి దృష్టీ కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంపైనే ఉంది.   విమానాశ్రయంలో దిగిన వెంటనే సిట్‌ అధికారులు ఆయన్ను అరెస్టు చేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.  అశ్లీల వీడియోల కేసులో ప్రధాన నిందితుడైన ప్రజ్వల్‌ రేవణ్ణను స్వదేశానికి రప్పించేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో వెంటనే పోలీసులకు లొంగిపోవాలంటూ మాజీ ప్రధాని దేవెగౌడకూడా తన మనవడిని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక ప్రకారమే తాను విదేశీ పర్యటనకు వెళ్లానని.. గురువారం (మే 31) సిట్‌ ఎదుట హాజరవుతానని ఆయన ప్రకటించారు. ఈ కేసులో దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తానంటూ   ఆయన ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.   మరోవైపు,  కిడ్నాప్‌ కేసులో అరెస్టు చేస్తారనే భయంతో ప్రజ్వల్‌ తల్లి భవానీ రేవణ్ణ ప్రత్యేక కోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం (మే29) కోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సిట్‌ తరఫు న్యాయవాది ఆమెకు ముందస్తు బెయిల్‌పై అభ్యంతరం తెలిపారు. ఇదే కేసులో ఆమె భర్త హెచ్‌.డి.రేవణ్ణ మధ్యంతర బెయిల్‌ను సైతం రద్దు చేయాలని కోర్టును కోరారు. ఇరువర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. భవానీకి ముందస్తు బెయిల్‌పై తీర్పును   రిజర్వు చేసింది.

కృష్ణా జిల్లా కౌంటింగ్ కేంద్రాన్ని సందర్శించనున్న సీఈవో

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా  కృష్ణా జిల్లాలోని ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని గురువారం (మే 30) సందర్శించనున్నారు.  ఈ  నేపథ్యంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ  బుధవారం (మే29)  ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన కృష్ణా యూనివర్సిటీలోని ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద మీడియా సెంటర్ ను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు.  ఓట్ల లెక్కింపు రోజున ఎలాంటి గందరగోళం లేకుండా రౌండ్ ల వారీగా మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు ఏడు నియోజకవర్గాల ఎన్నికల ఫలితాలను మీడియా వారికి చేరవేసే విధంగా తగిన ఏర్పాట్లు చేయాలని అదేశించారు. కౌంటింగ్ రోజున  తాగునీరు, భోజన వసతి ఏర్పాటు చేసి వచ్చిన వారికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చూడాలన్నారు. స్ట్రాంగ్ రూముల సీసీటీవీలను పరిశీలించి, నిత్యం అప్రమత్తంగా ఉండాలని సెక్యూరిటీ సిబ్బందిని ఆదేశించారు.  మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గంతో పాటు ఏడు నియోజకవర్గాల పోస్టల్ బ్యాలెట్, ఈవీఎం కౌంటింగ్ హాళ్లను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి వెంట జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ డిఆర్ఓ కె చంద్రశేఖర రావు, అదనపు ఎస్పీలు జి వెంకటేశ్వరరావు, ఎస్వీడీ ప్రసాద్, రిటర్నింగ్ అధికారులు, నోడల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.