ఎక్కడో ఏదో తేడా కొట్టింది.. అందుకే జగన్ ఢిల్లీ యాత్ర!?

వైఎస్ వివేకా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. తనపై సీబీఐ కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశించాలని కోరుతూ వేసిన రిట్ పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అలాగే అవినాష్ రెడ్డి తదుపరి విచారణపై స్టే ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. దీంతో   అవినాష్‌రెడ్డికి ఉన్న ఒకే ఒక్క దారి సైతం మూసుకుపోయినట్లైంది. మరోవైపు ఇదే కేసులో  అవినాష్ రెడ్డి గురువారం సీబీఐ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉన్నా.. ఆయన డుమ్మా కొట్టారు. ఇటువంటి పరిణామం ఏదో చోటు చేసుకొనే అవకాశం ఉందని ముందుగానే ఆయన ఊహించి డుమ్మా కొట్టేశారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో సాగుతోంది. ఈ నేపథ్యలోనే జగన్ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. అదీ కాక మంగళవారం  (మార్చి 14 వైఎస్ వివేకా హత్య కేసులో వైయస్ అవినాష్ రెడ్డి నాలుగో సారి సీబీఐ  విచారణకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈ కేసులో కీలక అధారాలను ముందు పెట్టి మరీ సీబీఐ అధికారులు వరుసగా ప్రశ్నలు సంధించడంతో... కడప ఎంపీ ఒకానొక సందర్భంలో మౌనంగా ఉండిపోయారనే కథనాలు   మీడియాలో వెల్లువెత్తాయి.   అంతేకాకుండా వివేకా హత్య కేసులో ముందు ముందు మరింత మందిని అంటే.. వైఎస్ కుటుంబంలోని కీలక వ్యక్తులను సైతం సీబీఐ పిలిచి విచారించే అవకాశాలు  ఉన్నాయని.... ఇటువంటి పరిస్థితుల్లో మరో గత్యంతరం లేకే సీఎం జగన్ ఆదరా బాదరాగా ఢిల్లీకి ప్రయాణం కట్టారనే టాక్ వినిపిస్తోంది. ఇంకో వైపు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాలు జరుగుతోన్నా కూడా సీఎం జగన్.. ఢిల్లీ వెళ్లక తప్పని పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇక ప్రధాని మోడీతో పాటు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాలతో సీఎం వైయస్ జగన్ అపాయింట్‌మెంట్ కోసం ఫ్యాన్ పార్టీలో కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్రంగా ప్రయత్నించి.. సఫలీకృతులయ్యారనే టాక్ సైతం నడుస్తోంది.  ఇక సీఎం జగన్ ఇంత ఆకస్మికంగా ఢిల్లీ పర్యటనపై అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో విభిన్న కథనాలు వెల్లువెత్తాయి. అవేమంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించడం కోసం..  అలాగే సంక్షేమ పథకాలు కోసం మరింత అప్పు కావాలని విజ్జప్తి చేయడం కోసం...  విశాఖ వేదికగా ఇటీవల జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు వివరాలు వివరించడం కోసం.. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు వివరించడం కోసం.. ఢిల్లీలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటుకు భూమి కేటాయించాలని విజ్జప్తి చేయడం కోసం.... అలాగే కోడి కత్తి కేసులో ఏప్రిల్ 10న విచారణకు హాజరు కావాలంటూ.. వైయస్ జగన్‌తోపాటు ఆయన పీఏ కేఎన్ఆర్‌కి విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు ఆదేశించడం... తదితర అంశాలను మోదీ, అమిత్ షా ద్వయంతో సీఎం వైయస్ జగన్ ప్రస్తావించే అవకాశాలు ఉన్నాయంటూ సదరు కథనాలు వివరిస్తున్నాయి.  అయితే ఈ అంశాలను చర్చించాలంటే.. మరి ఇంత హడావుడిగా సీఎం   జగన్ ఢిల్లీకి వెళ్లాల్సిన అవసరం లేదని  పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ జరుగుతోంది. కానీ మరీ ఇంత హడావుడిగా అప్పటికప్పుడు సీఎం  జగన్ హస్తినకు,  అదీ ప్రత్యేక విమానంలో ప్రయాణం కట్టడం చూస్తుంటే ఎక్కడో... ఏదో... ఏదో తేడా కొడుతోందనే ఓ టాక్   పోలిటికల్ సర్కిల్‌లో రచ్చ రంబోలా చేసి పారేస్తోంది.

వన్ నేషన్.. వన్ ఎలక్షన్ మళ్లీ తెరమీదకు!

దేశంలో జమిలి ఎన్నికల అంశం మరోసారి తెరపైకి వచ్చింది.  అటు లోక్‌సభకూ, ఇటు రాష్ట్రాల్లోని అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరిపిస్తే.. ఎన్నికల నిర్వహణ ఖర్చు బాగా తగ్గుతుందని కేంద్రం చెబుతోంది.  నిన్న పార్లమెంట్‌లో దీనిపై కీలక   ప్రకటన చేసింది. జమిలికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇందుకోసం రాజ్యాంగాన్ని సవరించేందుకు.. రాజకీయ పార్టీలను ఒప్పించేందుకు ప్రయత్నం జరుగుతోందనీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం జమిలి ఎన్నికలు జరిపించే ఆలోచనలో ఉందా అన్న విపక్షాల ప్రశ్నకు కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు   జమిలికి పార్లమెంటరీ కమిటీ సానుకూలంగా ఉందని బదులిచ్చారు. ఈ ఎన్నికల రోడ్ మ్యాప్, ఫ్రేమ్ వర్క్ కోసం... దీన్ని న్యాయ కమిషన్‌కి సిఫార్స్ చేసినట్లు   వివరించారు. ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడం వల్ల ఖర్చు తగ్గడమే కాకుండా.. శాంతి భద్రతల సమస్య కూడా తగ్గుతుందనీ, అలాగే  రాజకీయ పార్టీలు, అభ్యర్థుల ఎన్నికల ప్రచార ఖర్చు కూడా   తగ్గుతుందని అన్నారు. ఈ కారణంగానే జమిలి కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీంతో దేశంలో నెక్స్ట్ జరిగేది జమిలి ఎన్నికలేనా? కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తోందా? అంటే ఔననే అనాల్సి వస్తోంది. నిజానికి, ప్రధాని నరేంద్ర మోడీ సారధ్యంలో బీజేపీ, 2014లో తొలిసారి అధికారంలోకి వచ్చింది మొదలు  కేంద్ర ప్రభుత్వం  జమిలి ఎన్నికలకు సుముఖగానే వుంది. సుముఖంగా ఉండడమే కాదు, అప్పటి నుంచి ఆ దిశగా పావులు కదుపుతూనే వుంది. 2019 బీజేపీ ఎన్నికల మానిఫెస్టోలో కూడా’జమిలి’ అంశాన్ని చేర్చారు. 2019ఎన్నికల తర్వాత, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జమిలి పై చర్చకు .. అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేశారు. జమిలి ఎన్నికల మంచి చెడులను చర్చించారు. కాంగ్రెస్,కమ్యూనిస్ట్ పార్టీలు, ఒకటి రెండు ప్రాతీయ పార్టీలు మినహా,  తెరాస సహా చాలా వరకు పార్టీలు  అప్పట్లో జమిలికి జై కొట్టాయి. నీతీ ఆయోగ్‌ కూడా నివేదిక సిద్ధం చేసింది. లా కమిషన్‌ రాజకీయ పార్టీల అభిప్రయాలను రికార్డు చేసింది.  మరో వంక జమిలి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది. ఏకాభిప్రాయం వ్యక్తం అయితే రాజ్యాంగ సవరణ ద్వారా వన్‌ నేషన్..‌ వన్‌ ఎలక్షన్‌ తో ముందుకు వెళ్లే అవకాశం ఉందని ఎన్నికల సంఘం ఆ దిశగా అడుగులు వేస్తోంది. అంతేకాదు, పార్లమెంట్ ఎప్పుడు ఆమోదం తెలిపినా, నిర్దిష్ట  సమయంలో లోక్ సభ, అసెంబ్లీలలతో పాటుగా స్థానిక సంస్థలు ఒకే సారి, ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్ధంగా వుందని, అధికారులు పలు సందర్భాలలో పేర్కొన్నారు. అంతే కాదు, జమిలి ఎన్నికల అవసరాన్ని, ప్రయోజనాలను వివరిస్తూ నిర్వహించే సెమినార్లు, వర్క్ షాపులలో కేంద్ర ఎన్నికల సంఘం క్రియాశీలక భూమిక  పోషిస్తోంది. జమిలి ఎన్నికలకు సానుకూల వాతావరణం ఏర్పరిచే విషయంలో  కేంద్ర ఎన్నికల సంఘం తన వంతు పాత్రను పోషిస్తోంది.   తాజగా  కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పార్లమెంటులో ఇదే విషయం చెప్పారు. వాస్తవానికి దేశంలో 1951, 1952, 1957, 1962, 1967లో జమిలి ఎన్నికలు జరిగాయి. 1968, 69లో పలు అసెంబ్లీలు నిర్ణీత గడువు కంటే ముందే రద్దు కావడంతో జమిలి ఎన్నికలకు అంతరాయం కలిగింది.  

జగన్ విశాఖకు రావద్దు.. ఎన్నిక ఫలితం సారాంశమిదే!

ప్రశాంత వాతావరణము కోరుకునే విశాఖ ప్రజలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ద్వారా రాజధాని వద్దని తేల్చి చెప్పేశారు. ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఫలాతాలు తేల్చేసిన వాస్తవం ఇదే.  అత్యంత ప్రశాంతంగా ఉండే విశాఖ జగన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ పగ్గాలు చేపట్టిన నటి నుంచి అశాంతికి నిలయంగా మారిపోయింది. ఆ విషయాన్ని ఉత్తరాంధ్రప్రజలు గుర్తించారు.   ఆస్తులకు రక్షణ లేకుండా పోయింది, శాంతి భద్రతల పరిస్థితి అధ్వానంగా మారిపోయింది. స్థానికులు భద్రతా లేమితో బాధపడుతున్నారు.  ఏదైనా స్థలంపై అధికార పార్టీ నేతల కన్ను పడితే ఇక ఆ స్థల యజమాని దానిపై ఆశలు వదిలేసుకోవలసిందే అన్న పరిస్థితి ఏర్పడింది. ఇంత కాలం పంటి బిగువున బాధను, ఆగ్రహాన్ని అణచుకున్న జనాగ్రహాన్ని  పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుతో వెళ్లగక్కడారు. ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో తెలుగుదేశం అభ్యర్థి చిరంజీవిని భారీ మెజారిటీతో గెలిపించి వైసీపీకి గ్రాడ్యుయేట్లు తమ సత్తా చూపారు. రేపు అసెంబ్లీ ఎన్నికలలోనూ జనం ఇదే రీతిక స్పందిస్తారని, ఇది ట్రయల్ మాత్రమేనని ఉత్తరాంధ్ర వాసులు అంటున్నారు.  ప్లీజ్ డోంట్ కమ్ టు విశాఖ అని ముఖ్యమంత్రి జగన్ కు పట్టభద్రులు తమ ఓటు ద్వారా విస్పష్టంగా తేల్చి చెప్పేశారు. అదే విధమైన పోస్టర్లను జనం విశాఖ అంతటా ప్రదర్శించారు.  గత రెండేళ్లుగా విశాఖకు వస్తానని ముఖ్యమంత్రి చెబుతున్నారు. వద్దు బాబోయ్ అని గ్రాడ్యుయేట్లు ఒక దణ్ణం పెట్టేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో వైసీపీ అభ్యర్థిని ఓడించి తమ అభిమతమేమిటో చెప్పేశారు. ఇక విశాఖ రాజధాని కాదు..విశాఖలో ఓ క్యాంపు కార్యాలయం పెట్టుకుని ముఖ్యమంత్రి ఇక్కడ కూర్చున్నంత మాత్రాన విశాఖ రాజధాని కాదు, కాలేదు, కాబోదు. ఈ విషయంలో స్పష్టతతో ఉన్న ఉత్తరాంధ్ర ప్రజలు  వచ్చే ఎన్నికలలో పట్టభద్రులు చూపిన బాటలోనే నడుస్తామంటూ చిరంజీవి విజయాన్ని పురస్కరించుకుని చేసుకుంటున్న సంబరాల ద్వారా చాటుతున్నారు.   ఏదో సినిమా డైలాగులా  జీతాలు ఎప్పుడు ఇచ్చామన్నది కాదు… ఇచ్చామా లేదా అన్నదే ముఖ్యమని అహంకారంతో చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ చెంపపెట్టులాంటి ఈ తీర్పుపై ఏమని స్పందిస్తారో చూడాలి.  ఇక గ్యాడ్యుయేట్ ఎమ్మెల్సీ మూడు స్థానాలకు జరిగిన ఎన్నికలలో రెండింట్లో ఓడి.. మూడో స్థానంలో ఓటమి అంచుల్లో ఉంది. ఈ పరిస్థితే  వైసీపీ పట్ల జనంలో ఉన్న వ్యతిరేకతకు అద్దం పడుతోంది. వైనాట్ 175 అంటున్న అధినేత ఇప్పుడు ఏమంటారో చూడాలి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగిన రెండు స్థానాలలోనూ గెలిచాం అన్న ఆనందం కూడా వైసీపీకి దక్కలేదు. ఎందుకంటే ఆ రెండు స్థానాలలోనూ కూడా వైసీపీ వ్యతిరేక ఓటు చీలిక కారణంగానే విజయం సాధించగలిగింది. అయితే వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలే అవకాశం లేదని ఇప్పటికే జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పష్టత ఇచ్చేశారు. దాంతో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలను చూసి సంబరపడే అవకాశం లేకుండా పోయింది వైసీపీకి.    

స్వీయ సంరక్షణార్థమే హస్తిన యానమా?

వైఎస్ వివేకా హత్య కేసులో అవినాష్ ను కాపాడగలనన్న నమ్మకాన్ని జగన్  కోల్పోయారా? ఇక అవినాష్ సంగతి వదిలేసి.. హత్య ఆరోపణలు తన ఇంటి మీదకు రాకుండా ఉండేందుకు అవసరమైన ప్రయత్నాలు చేసుకుంటున్నారా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. అవినాష్ కోసం ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుందని జగన్ భావిస్తున్నారని అంటున్నారు. గుండె పోటు నుంచి మొదలు పెట్టి గొడ్డలి పోటు వరకూ వచ్చి... నారాసుర రక్త చరిత్ర అంటూ ఆరోపణలు గుప్పించిన వైఎస్ జగన్ అసెంబ్లీ వేదికగా ఒక కన్ను రెండో కన్నును ఎందుకు పొడుచుకుంటుంది అంటూ సెంటిమెంట్ కూడా పండించారు. ఇప్పుడు చివరికి బాబాయ్ ని హత్య చేసింది ఆయన కుమార్తె, అల్లుడే అంటూ కొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. అదే వాదనను కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట, కోర్టులోనూ వినిపించారు. అయితే అవేమీ ఫలించలేదు. వివేకా హత్య కేసులో ఇక అవినాష్ అరెస్టే తరువాయి. ఏ క్షణంలోనైనా ఆయనా, ఆయన తండ్రి వైఎస్ భాస్కరరెడ్డిల అరెస్టు తథ్యం అని గట్టిగా వినిపిస్తున్న వేళ.. జగన్ హుటా హుటిన సిరికిం జెప్పడు అన్నట్లుగా హస్తిన ఫ్లైట్ ఎక్కేశారు. హడావుడిగా ప్రధాని అప్పాయింట్ మెంట్ సైతం సంపాదించేశారు. బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న వేళ.. ఆ సమావేశాలకు డుమ్మా కొట్టి మరీ ఆయన ఒక రోజు ఢిల్లీ పర్యటన ఎందుకన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నే. అయితే ఆ ప్రశ్నకు తెలుగుదేశం నాయకుల నుంచి సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డిని కాపాడుకోవడానికే నని సమాధానం వస్తుంటే.. పరిశీలకులు మాత్రం స్వీయ సంరక్షణార్థం అంటున్నారు.  మొత్తం మీద వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారుల పాత్ర బయటకు వచ్చే సమయానికి దర్యాప్తు పురోగతిని అడ్డుకోవడానికి వైఎస్ అవినాష్ రెడ్డి చేసిన అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. సీబీఐ తనను విచారించకుండా ఆదేశాలివ్వాలి, అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వడం అంటూ కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. నాలుగో సారి విచారణలో అవినాష్ రెడ్డి పలు ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించినట్లు తెలుస్తోంది. అన్నిటికీ మించి వివేకా హత్య జరిగిన వెంటనే సాక్ష్యాధారాలను నాశనం చేయడం దగ్గర నుంచి, ఆయన చేసిన ఫోన్ల వరకూ ప్రతి విషయంలోనూ ఆయనను సీబీఐ తన ప్రశ్నల ద్వారా కార్నర్ చేసిందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే  కేసు తుది తీర్పువెలువరించే వరకూ అవినాష్ రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే  సీబీఐ అవినాష్ ను విచారించి పంపించేస్తుంది. కోర్టు ఆదేశాల కారణంగా అరెస్టు చేసే అవకాశం లేదు. అయితే విచారణ సుదీర్ఘంగా సాగే అవకాశం ఉందని అంతా భావించారు. అయితే అవినాష్ పిటిషన్లను తెలంగాణ హైకోర్టు శుక్రవారం తోసి పుచ్చింది. సీబీఐ విచారణలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. దీంతో కడప ఎంపీ అవినాష్ రెడ్డికి అన్ని దార్లూ మూసుకుపోయాయి. దీంతో అవినాష్ తరువాత సీబీఐ ఎవరికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలుస్తుంది? ఈ కేసులో ఇంకా ఎవరెవరు అరెస్టు అయ్యే అవకాశం ఉంది? అన్న చర్చ సర్వత్రా సాగుతోంది. హత్య జరిగిన వెంటనే అవినాష్ ఎవరికి ఫోన్లు చేశారు. అవతల ఫోన్ లో మాట్లాడిన వారెవరు ఇత్యాది అంశాలపై సీబీఐ దృష్టి సారించి అందుకు అనుగుణంగా దర్యాప్తును ముందుకు తీసుకు వెళుతుందని న్యాయనిపుణులు అంటున్నారు. ఆ రకంగా చూస్తే ఈ కేసు ముఖ్యమంత్రి నివాసం తాడెపల్లి ప్యాలెస్ దిశగా సాగే అవకాశాలే ఉన్నాయని కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక తన ‘సోదరుడి’ కోసం కాకుండా తన గురించే ఆలోచించాల్సిన అనివార్య పరిస్థితిని జగన్ వచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ హఠాత్ హస్తిన యానం అని విశ్లేషిస్తున్నారు.  ఏది ఏమైనా వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ తాను చిక్కుల్లో పడకుండా ఉండేందుకే ఇక ప్రాధన్యత ఇస్తారనీ, అవినాష్ అరెస్టు ఖాయమనీ, ఆయన కోసం ఇక ఎలాంటి ప్రయత్నాలూ చేసే అవకాశాలు లేవనీ విశ్లేషకులు అంటున్నారు. 

బీఆర్ఎస్ వ్యూహం బెడిసి కొడుతోందా?

ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మొదలు వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు  రాఘవ రెడ్డి వరకు ఇప్పటికే  12 మంది అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ కు ముందు సీబీఐ, ఈడీ ప్రతి ఒక్కరినీ అనేక మార్లు విచారించాయి. అవసరం అనుకున్న సందర్భాలో  వారు సాక్షులు  అయినా అనుమానితులు అయినా, చార్జి షీట్లో పేరున్నా లేకున్నా విచారణ తేదీలను మార్చి వారికి అనుకూలమైన తేదీలలో విచారణ జరిపారు. అయినా, సిసోడియా సహా ఎవరు కూడా ఈడీ సమన్లను ధిక్కరించలేదు. విచారణ సంస్థలకు వ్యతిరేకంగా వీధి పోరాటాలు చేయలేదు.  కానీ ఇదే కేసులో అనుమనితురాలిగా విచారణ ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, కల్వకుట్ల కవిత విషయంలో బీఆర్ఎస్ నాయకత్వం భిన్నంగా వ్యవహరిస్తోంది. ఎవరి సూచనలు, సలహా మేరకు బీఆర్ఎస్  నాయకత్వం ఈ  దోరణి  ఎంచుకుందో కానీ ఇది ఒక విధంగా చిక్కులు కొని తెచ్చుకోవడమే అవుతుందని చట్టాల లోతులు తెలిసిన న్యాయ కోవిదులు, మాజీ పోలీసు,సివిల్ అధికారులు హెచ్చరిస్తున్నారు.మరో వంక కవితను బలి పశువును చేసి రాజకీయ లబ్ధి పొందే కుట్ర జరుగుతోందనే అనుమానాలు పార్టీ వర్గాల్లోనే వ్యక్తమవుతున్నాయి.  ఇదే కుంభకోణం కేసులో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి (ప్రస్తుత మాజీ) మనీష్ సిసోడియాను సీబీఐ ఫిబ్రవరి 27న అరెస్ట్ చేసింది. సీబీఐ అరెస్టు చేసిన తర్వాత బెయిల్ మంజూరు కాకముందే మనీ లాండరింగ్‌ కేసులో ఈడీ కూడా ఆయన్ని అరెస్టు చేసింది. తీహార్ జైలులో ఉన్న సిసోడియాను జైల్లోనే అరెస్టు చేశారు. ఆ తర్వాత సీబీఐ కేసులో బెయిల్ వచ్చినా ఈడీ కేసులో రౌస్ అవెన్యూ కోర్టు మార్చి 4 తేదీ వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. ఆ తర్వాత ఈడీ అభ్యర్ధన మేరకు సీబీఐ కోర్టు ఆయన కస్టడీని పొడిగిస్తూ వస్తోంది. తాజాగా శుక్రవారం (మార్చి 17) ఆయన కస్టడీని మరో ఐదు రోజులపాటు పొడిగించింది. సిసోడియా అరెస్ట్కు ముందు నెలల తరబడి సీబీఐ, ఈడీ ఇతర కేంద్ర దర్యాప్తు సంస్థలు ఆయన్ని అనేక మార్లు  విచారించాయి. ఒక దశలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్ కేసును ఎందుకు సాగదీస్తున్నారు. ఈ నాటకాలు ఎందుకు  ఇటో అటో తెల్చేయండి, తప్పు చేస్తే, సిసోడియాను, నన్నూ జైలుకు పంపడని, ఏజెన్సీలను డిమాండ్ చేశారు. అలాగే, అరెస్ట్ కు ముందు సిసోడియా,  నేను ఈ రోజు సీబీఐ విచారణకు ఇంకోసారి వెళ్తున్నాను. విచారణకు పూర్తిగా సహకరిస్తాను. అయితే.. ఈ విచారణ తర్వతా కొన్ని నెలలు జైలులో ఉండాల్సి వచ్చినా.. రావచ్చును. లెక్కచేయను. నేను  భగత్‌సింగ్‌   ఆశయాలను అనుసరించే వ్యక్తిని  అంటూ ట్విటర్‌లో పేర్కొన్నారు.  నిజానికి ఒక్క సిసోడియానే కాదు ఈ కేసులో మొత్తం 12 మంది అరెస్టయ్యారు. అందులో రాజకీయ నాయకులున్నారు. ఇతర రంగాల ప్రముఖులున్నారు. వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాస రెడ్డి కుమారుడు రాఘవ రెడ్డి ఉన్నారు.  శ్రీనివాస రెడ్డికి కూడా శనివారం (మార్చి 18) వ్యక్తిగతంగా తమ ముందు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. ఎవరి  దాకానో ఎందుకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రివాల్  కుడా ఈడీ పిలిస్తే, విచారణకు హాజరయ్యేందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టమైన సంకేతాలే ఇస్తున్నారు.  అలాగని  వీరంతా నేరాన్ని అంగీకరిస్తున్నారా? అంటే లేదు. ఇదే కేసులో అనుమానితురాలుగా ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ  కల్వకుట్ల కవిత చేస్తున్న వాదననే వారు చేస్తున్నారు. ఈ కేసును రాజకీయ కుట్రగానే ఆరోపిస్తున్నారు.  రాజకీయంగానే ఎదుర్కుంటామని అంటున్నారు.  కానీ  కవిత, ఆమె తరపున రంగంలోకి దిగిన రాష్ట్ర మంత్రులు, ఇతర పెద్దలు అందుకు  విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని  బీజేపీని  రాజకీయంగా విమర్శిస్తున్నారు. అంతవరకూ ఓకే కానీ, చట్టాన్ని రాజ్యాంగ  సంస్థ ( ఈడీ)ని ధిక్కరించే సాహసం చేస్తున్నారు.  నిజానికి మార్చి 11న ఈడీ కవితను ప్రశ్నించింది. అయితే తిరిగి మార్చి 16 మరోమారు విచారణకు హాజరు కావాలని ఈడీ సమన్లు జారీ చేసింది. అయినా కవిత మర్చి 16న విచారణకు హాజరు కాలేదు. గైర్హాజరయ్యారు. దీంతో మార్చి 20వ తేదీన హాజరుకావాలంటూ తాజా సమన్లను ఈడీ జారీ చేసింది. తాను మహిళను అయినందున నిబంధనల ప్రకారం ఈడీ కార్యాలయంలో ప్రశ్నించేందుకు సమన్లు పంపరాదని తన నివాసంలో విచారణ జరవచ్చునని ఆమె పేర్కొంటూ తక్షణం దీనిపై విచారణ జరపాలని సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించారు. ఆ కేసు మార్చి 24 న విచారణకు వస్తుంది. అంతవరకు, ఈడీ విచారణ జరపరాదని  అవసరం అనుకుంటే తమ న్యాయవాదిని లేదా తనను ఈ మెయిల్ ద్వారా  సంప్రదించ వచ్చని తమ న్యాయవాది ద్వారా ఈడీకి లేఖను పంపారు. దీంతో మార్చి 20వ తేదీన ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరవడంపై ఉత్కంఠ కొనసాగుతోంది.  అయితే  ఈ మొత్తం వ్యవహారంలో కవిత వ్యహరిస్తున్నతీరు పలు అనుమానాలకు దారి తీస్తోందని అంటున్నారు. ఆమె అనవసరంగా చిక్కులు కొని తెచ్చుకుంటున్నారు అనే అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. అలాగే, ఈడీ విచారణ విషయంలో బీఆర్ఎస్ వ్యూహకర్తలు తీసుకుంటున్న నిర్ణయాలు కవిత మెడకు చుట్టుకునే ప్రమాదముందని అంటున్నారు. నిజానికి సీబీఐ విచారణ సమయంలో  చివరకు ఈడీ సమన్లు అందుకుని ఆమె ఢిల్లీ చేరే వరకు కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ మొదలు బీఆర్ఎస్ మంత్రులు  పార్టీ ముఖ్యనాయకులు ఎవరూ కేసు విషయంలో ప్రత్యక్ష జోక్యం చేసుకోలేదు. ఆమె ఢిల్లీ వెళ్ళిన తర్వాత, ముందు కేటీఆర్ ఆయన వెంట హరీష్ రావు ఇతర మంత్రులు, నాయకులు  ఢిల్లీ చేరారు. మార్చి 11 న ఆమె విచారణ సమయంలో ఢిల్లీలో ఒక విధంగా హల్ చల్ సృష్టించారు.  అలాగే మళ్ళీ మార్చి 16 న కేటీఆర్, హరీష్ సహా అరడజను మందికి పైగా మంత్రులు ఇతర నేతలు ఢిల్లీ వెళ్ళారు. మళ్ళీ రేపు మార్చి 20 న కూడా అదే, సీన్  రిపీట్ అయ్యే అవకాసం లేక పోలేదని  బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి. అయితే  బీఆర్ఎస్ వ్యూహం మారడం వెనక ‘ఎదో’ ఉందని అంటున్నారు. అలాగే, కవితను బాలి పశువును చేసి, సానుభూతి రాజకీయం చేసే కుట్ర జరుగుతోందా అనే సందేహాలు కూడా వినవస్తున్నాయి.ఒక విధంగా కవిత కేసు, పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్నట్లుగా మారిందని అంటున్నారు.

అంతటా ఉన్నదే.. ప్రశ్న పత్రాల లీకేజీ పై కేటీఆర్..

నిజమే  పోటీ పరీక్షల ప్రశ్న పత్రాల లీకేజి ఒక్క తెలంగాణలోనే కాదు. దేశం అంతటా ఉన్నదే... ఏదో ఒక సందర్భంలో అన్ని రాష్ట్రాలలో జరుగుతున్నదే. అయితే, అంత మాత్రం చేత  ఇక్కడ తెలంగాణలో జరిగిన తప్పు తప్పు కాకుండా పోతుందా?  ఔను పోతుందనే అంటున్నారు, తెలంగాణ మంత్రి, బీఆర్ఎస్ ‘ముఖ్య’ నేత కల్వకుట్ల తారక రామారావు.  అంతే కాదు, లక్షల మంది నిరుద్యోగ యువత రాజకీయ పార్టీల కుట్రల్లో భాగం కావద్దని,  ఉద్యోగాల సాధనపైనే యువత దృష్టి పెట్టాలని హితబోధ చేశారు.   అంతే కాదు  ప్రధాని నరేంద్ర మోడీ స్వరాష్ట్రం గుజరాత్‌లో 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయి కాబట్టి  ప్రధాని మోడీ రాజీనామా చేయాలని, అడిగే దమ్ము బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు ఉందా అని ప్రశ్నించారు. టీఎస్పీఎస్సీ   పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. బండి సంజయ్ రాజకీయ అజ్ఙాని అని తేల్చేశారు.  ప్రభుత్వ వ్యవస్థల పనితీరుపై అవగాహన లేని వ్యక్తి బండి సంజయ్ అని ఆరోపించారు. టీఎస్‌పీఎస్‌సీ ప్రభుత్వ శాఖ కాదని..  స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన సంస్థ అని అన్నారు. దీనిపై బండి సంజయ్‌‌కు కనీస అవగాహన లేదని విమర్శించారు. ఓ వ్యక్తి చేసిన నేరాన్ని వ్యవస్థకు ఆపాదించి గందరగోళం సృష్టిస్తున్నారని వ్యాఖ్యానించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి బండి సంజయ్ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ రాష్ట్రాల్లో ఇప్పటికే వంద సార్లకు పైగా ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని ఆరోపించారు.  గుజరాత్‌లో 13 సార్లు ప్రశ్నాపత్రాలు లీక్ అయ్యాయని అన్నారు. ప్రధాని మోదీని రాజీనామా అడిగే దమ్ము బండి సంజయ్‌కు ఉందా అని ప్రశ్నించారు. అంతకుముందు ఈ వ్యవహారానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ కుటుంబ డబ్బు పిచ్చి కారణంగా లక్షలాది మంది అభ్యర్థుల జీవితాలు ఆగమయ్యాయని విమర్శించారు. పేపర్ లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారించడంతో పాటు కేటీఆర్‌ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ కార్ఖాన పోలీస్ స్టేషన్ నుండి విడుదలైన బండి సంజయ్.. విద్యార్థుల జీవితాల గురించి ఆలోచించకుండా లిక్కర్ స్కామ్ లో కవితను కాపాడుకోవడానికి మంత్రివర్గం మొత్తం ఢిల్లీకి వెళ్లిందని విమర్శించారు. కేటీఆర్‌ను భర్తరఫ్ చేసి విద్యార్థులకు న్యాయం చేసే వరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని బండి సంజయ్ అన్నారు. పేపర్ లీక్ లో పార్టీ కార్యకర్తలను కాపాడుకోవడానికి లక్షల మంది విద్యార్థుల జీవితాలను బలి చేశారని ఆరోపించారు. పేపర్ లీక్‌పై ఆందోళన చేసిన విద్యార్థులను, కార్యకర్తలను అరెస్ట్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇక నుంచి కేసీఆర్ కు చుక్కలు చూపెడ్తామని హెచ్చరించారు బండి సంజయ్. అంతకుముందు పేపర్ లీక్ ఘటనను సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ మార్చి 17న ఉదయం గన్ పార్క్ దగ్గర దీక్ష దిగిన బండి సంజయ్ ను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చెల్లని కమలం !

ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అద్వాన స్థితి ఏమిటో మరో సారి రుజువైంది. సాధారణ ఎన్నికలలో బీజేపీ బలమెంతో ఎప్పటి కప్పుడు తేలి పోతూనే వుంది.  2019 ఎన్నికల్లో ఒంటిగా పోటీ  చేసిన కమల దళం నిండా ఒక శాతం ఓటు కూడా తెచ్చుకోలేక పోయింది. బీజేపీ కంటే ‘నోటా’ కే ఎక్కువ ఓట్లు వచ్చాయి.  అయినా, బీజేపీ రాష్ట్ర నాయకులు, అసెంబ్లీ ఎన్నికలు ఎప్పడు వచ్చినా అధికారం తమదే అంటారు.  అదేమంటే, ఈశాన్య రాష్ట్రాలలో వెలిగి పోవడం లేదా  అంటారు.   సాధారణ ఎన్నికలను పక్కన పెడితే ఒకప్పుడు మండలి ఎన్నికల్లో, ముఖ్యంగా పట్ట భద్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాల్లో బీజేపీకి కొంత బలం ఉన్నమాట వాస్తవం.  వి.రామా రావు,  పీవీ చలపతి రావు,  జూపూడి యజ్ఞ నారాయణ, మన్నవ గిరిధర రావు,  డీఎస్పీ రెడ్డి  ఇలా బీజేపీ నేతలు పెద్దల సభకు ఎన్నికయ్యారు. అలాగే టీడీపీతో పొత్తులో ప్రస్త్తుత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు,  పీవీ మాధవ్  ఎమ్మెల్సీ అనిపించుకున్నారు. పొత్తు వద్దనుకుని మాజీలుగా మిగిలారు.  అవును తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఉత్తరాంధ్ర సిట్టింగ్ సీటు సహా పోటీ చేసిన అన్ని స్థానాల్లో  చెల్లని ఓట్లతో పోటీ పడి చిత్తుగా ఓడి పోయింది.  ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గానికి ఆరేళ్ళ క్రితం జరిగిన ఎన్నికల్లో, బీజేపీ, టీడీపీ, ఉమ్మడి అభ్యర్ధిగా తాజా మాజీ ఎమ్మెల్సీ పీవీ మాధవ్ గెలిచారు. నిజానికి  ఆయన గెలవలేదు.  మిత్ర ధర్మానికి కట్టుబడి టీడీపీ ఆయన్ని గెలిపించింది. ఈ సారి టీడీపీతో పొత్తు లేకపోవడం వలన  ఆయన ఓడి పోయారు. ఓడిపోవడం అంటే అలా ఇలా కాదు.. చెల్లని ఓట్ల మందం ఓట్లు కూడా తెచ్చుకోలేనంత ఘోరంగా పరాజయం పాలయ్యారు. పోలైన ఓట్లలో పన్నెండు వేలకుపైగా చెల్లని ఓట్లు ఉంటే.. మాధవ్ కు పదకొండు వేల ఓట్లు కూడా రాలేదు.  అంటే  ఒకప్పుడు  ఉత్తరాంధ్ర పట్ట భద్రులలో ఉన్న కొద్దిపాటి పట్టు కూడా కమల దళం కోల్పోయిందని మండలి తాజా ఎన్నికల ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. నిజానికి  ఇదే నియోజక్ వర్గం నుంచి గతంలో, పార్టీ సీనియర్ నాయకుడు, ఇటీవల కన్ను మూసిన పీవీ చలపతి రావు ( తాజా మాజీ ఎమ్మెల్సీ మాధవ్ తండ్రి)మూడు పర్యాయాలు ఎమ్మెల్సీగా విజయం సాధించారు. మాధవ్  ఆ వారసత్వాన్ని నిలుపుకోలేక పోయారు. రాయలసీమ జిల్లాల్లోనూ అదే పరిస్థితి. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే   మరింత అధ్వాన స్థితి.  తూర్పు రాయలసీమలో పదిహేడు వేల వరకూ చెల్లని ఓట్లు వచ్చాయి. బీజేపీకి వచ్చిన ఓట్ల సంఖ్య ఆరు వేల కంటే తక్కువే.  పశ్చిమ రాయలసీమలోనూ అంతే. అక్కడ బీజేపీకి ఐదు వేల ఓట్లకు మించి రాలేదు.  కానీ చెల్లని ఓట్లు పన్నెండు వేలకుపైగానే ఉన్నాయి. అంటే  రాయల సీమలోనూ బీజేపీ చెల్లని  నో(ఓ)టు గానే మిగిలి పోయింది.  అయినా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, సోము వీర్రాజు రోజుకోసారి లేస్తే మనిషిని కాదని అంటారని, బీజేపీ కార్యకర్తలు, అభిమానులు వాపోతున్నారు. చివరికి మిత్రపక్షంగా ఉన్నప్పటికీ ఎన్నికల్లో పోటీ చేయని జనసేన మద్దతును కూడా బీజేపీ అడగలేదు. పవన్ తో ఓ ప్రకటన కూడా చేయించుకోలేకపోయారని అంటున్నారు.  బీజీపే రాష్ట్ర నాయకత్వం ఆత్మహత్యా సదృశ్య పోకడలు పోతోందని అంటున్నారు. వైసీపీ అరాచక పాలనను అంతమొందించేందుకు టీడీపీ, జనసేన కూటమితో కలిసి రావాలని, జనం కోరుతున్నా, ఫ్యాన్ నీడన సేద తీర్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు ససేమిరా అంటున్నారు . అడ్డుపుల్ల వేస్తున్నారు. అయితే  టీడీపీ, జనసేనతో  కలిసి రాక పోవడం వలన నష్ట పోయేది ఎవరో  ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేల్చి చెప్పాయి.  బీజేపే కలిసోచ్చినా రాకున్నా, ప్రజలు టీడీపీ, జనసేన కూటమి వైపు ఉన్నారనేది ఎమ్మెల్సీ ఫలితాలు తేల్చి చెప్పాయి.

కేసీఆర్ పై హత్యా నేరం కింద కేసు నమోదు చేయాలి.. రేవంత్

తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ రాక్షస పాలనకు మరో యువకుడు బలయ్యాడని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. సిరిసిల్లకు చెందిన నవీన్ అనే యువకుడు గత కొంత కాలంగా గ్రూప్స్‌కు ప్రిపేర్ అవుతున్నాడు. కాగా ఇటీవల TSPSC పేపర్ లీక్ కారణంగా పలు పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. అలాగే గ్రూప్-1 పరీక్షను రద్దు చేశారు. దీంతో మనస్థాపానికి గురైన నవీన్ ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. యువకుడి ఆత్మహత్యకు తెలంగాణ ప్రభుత్వమే కారణమని రేవంత్ తన ఇన్స్టా లో  పేర్కొన్నారు. కేసీఆర్‌పై హత్యా నేరం కింద కేసు పెట్టాలని డిమాండ్ చేశారు. నవీన్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. రూ.కోటి పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువత ఆత్మస్థైర్యం కోల్పోవద్దని   కాంగ్రెస్ అండగా ఉంటుందని రేవంత్ భరోసా ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటం చేద్దామని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు.

భారీ బడ్జెట్ సరే మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు సంగతేంటి?!

భారీ బడ్జెట్ ప్రవేశపెట్టామంటూ మురిసి పోతున్న ఏపీ సీఎం జగన్ మునిసిపల్ ఉద్యోగాల వేతనాల పెంపు గురించి ఎందుకు పట్టించుకోరని కార్మికులు నిలదీస్తున్నారు.  విజయవాడలో సీఐటీయూ ఆధ్వర్యంలో మునిసిపల్ కర్యాలయం వద్ద జరిగిన ధర్నా కార్యక్రమంలో  సీఐటీయూ నేతలు జగన్ సర్కార్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.  కాంట్రాక్ట్ కార్మికుల  రెగ్యులరైజేషన్ పై ముఖ్యమంత్రి మాట తప్పి మడమ తిప్పారని ఆరోపించారు. అలాగే కాంట్రాక్ట్ కార్మికులకు సంక్షేమ పథకాలు తొలగించారని విమర్శించారు.   భారీ అంకెలతో బడ్జెట్ ప్రవేశ పెట్టి మునిసిపల్ కార్మికుల వేతనాల పెంపునకు సొమ్ము లేదనడం విడ్డూరంగా ఉందని విమర్శించారు. సమానపనికి సమాన వేతనం అంటూ కోర్టు తీర్పులు ఇచ్చినా కాంట్రాక్ట్ కార్మికుల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ నామమాత్రపు వేతనాలిస్తున్నారని ఆరోపించారు.   ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే కార్మికుల రెగ్యులరైజేషన్ పై స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  

ముగిసిన జగన్ ఢిల్లీ పర్యటన.. మోడీ, అమిదత్ షాలతో భేటీ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ హస్తిన పర్యటన ముగిసింది. ఆయన అక్కడ నుంచి తిరుగుప్రయాణమయ్యారు. తన ఒక రోజు ఢిల్లీ పర్యటనలో జగన్ ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో భేటీ అయ్యారు.  వీరిరువురితో రాష్ట్రానికి సంబంధించి అంశాలపై చర్చించారని చెబుతున్నారు.  విభజన చట్టంలోని అంశాలు, పెండింగ్ వ్యవహారాలపై ప్రధానికి, హోంమంత్రికి వినతి పత్రాలు సమర్పించారు.  కాగా ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో జగన్ హడావుడిగా హస్తిన వెళ్లి ప్రధాని, హోంమంత్రులతో భేటీ కావడానికి కారణాలేమిటన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వివేకా హత్య కేసు దర్యాప్తులో చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో జగన్ హస్తిన పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.

మనీష్ సిసోడియా ఈడీ కస్టడీ పొడగింపు

ఢిల్లీ మద్యం కుంభకోణంలో అరెస్టయిన ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా కస్టడీని కోర్టు మరో ఐదు రోజుల పాటు పొడిగించింది. మనీష్ సిసోడియా ఈడీ కస్టడీ శుక్రవారంతో ముగియనుండగా ఈడీ ఆయనను కోర్టులో హాజరు పరిచింది. కస్టడీ పొడిగించాల్సిందిగా కోరింది. కోర్టు ఆయనను మరో ఐదు రోజుల పాటు ఈడీ కస్టడీకి అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 22న కోర్టు కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఈడీని ఆదేశించింది. మద్యం కుంభకోణంలో సిసోడియాను ఈడీ ఈ నెల 9న ఈడీ అరెస్టు చేసిన సంగతి విదితమే. కాగా ఇదే కేసులో సీబీఐ మనీష్ సిసోడియాను గత నెల 26న అరెస్టు చేసింది.  అప్పటి నుంచి ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మార్చి 6 వరకు ఆయన సీబీఐ కస్టడీలో ఉండగా, ఆ తర్వాత ఆయనకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు.  ఇటీవల ఈడీ అరెస్ట్ నేపథ్యంలో, మార్చి 10న ఈడీ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.  

బండి సంజయ్ దీక్ష భగ్నం

టీఎస్ పీఎస్సీ ప్రశ్నా పత్రాల లీకేజి వ్యవహారంలో సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ హైదరాబాద్ గన్ పార్క్ వద్ద చేపట్టిన నిరసనను పోలీసులు భగ్నం చేశారు.  టీఎస్ పీఎస్సీ కార్యాలయానికి ర్యాలీగా బయల్దేరుతున్న సంజయ్ ని అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు  బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంజయ్ అరెస్ట్ సందర్భంగా పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అలాగే అసెంబ్లీ ఎదుట బీజేపీ కార్యకర్తలు బైఠాయింపు కార్యక్రమం కూడా ఉద్రిక్తతకు దారితీసింది. కార్యకర్లను అక్కడ నుంచి తొలగించే సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ వ్యక్తి సృహతప్పి పడిపోయాడు. 

ఎమ్మెల్సీ ఎన్నికల్లో జగన్ కు భూతద్దంలో భవిష్యత్ చిత్రం!

ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల ఫలితం ముఖ్యమంత్రి జగన్ కు భవిష్యత్ చిత్రాన్ని భూతద్దంలో చూపించేసిందా? అంటే ఔననే అంటున్నారు పరిశీలకులు. ఇంత కాలం ఒక్క ఉత్తరాంధ్రలోనే వైసీపీకి అదీ మంత్రులకు ఎదురుగాలి వీస్తోందన్న అభిప్రాయం ఉండేది. కానీ పట్టభద్రుల ఎన్నికల ఫలితాల సరళి చూస్తుంటే.. ఒక్క ఉత్తరాంధ్ర అనే కాదు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలోనూ వైసీపీ ఎదురీదుతోందని పక్కాగా అర్థమైపోయిందని చెబుతున్నారు.   రాయలసీమ, కోస్తా, పల్నాడు ప్రాంతాలు ఏవైనా అధికార వైసీపీ ప్రజాగ్రహాన్ని ఎదుర్కుంటోంది. ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత తీవ్రాతి తీవ్రంగా ఉంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎక్కడికక్కడ జగన్ పార్టీకి ఎదురీతే గతి అని తేటతెల్లమైపోయిందని చెబుతున్నారు. ఈ పరిస్థితి ఎమ్మెల్యేలు, మంత్రులు అనే తేడా లేకుండా అందరి  గుండెల్లోనూ ఓటమి భయాన్ని పరుగులు తీయిస్తోంది.  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  వై నాట్ 175’ అని ఒక వైపు డాంబికంగా చెబుతుంటే.. వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్న పరిస్థితి కళ్లకు కడుతోంది.  సర్కార్ వారి ఐప్యాక్ సహా ఒకటికి మూడు సర్వేలు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత పీక్స్ లో ఉందన్న నివేదికలు ఇచ్చేశాయి. తాజాగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఆ నివేదికలు అక్షర సత్యాలన్న సంగతిని నిర్ద్వంద్వంగా తేటతెల్లం చేసేశాయి.  ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు ప్రభుత్వంపై ఎంత ఆగ్రహంతో ఉన్నారో ఫలితాల సరళిని బట్టి అవగతమౌతోంది. మూడు రాజధానులు.. విశాఖ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ పేరుతో హడావుడి చేసినా..  చివరికి కానుకలు పందేరం చేసినా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో ఉత్తరాంధ్ర లో  టీడీపీ అభ్యర్థి వేపాడ చిరంజీవి హవాను నిలువరించలేకపోయారు. రౌండు రౌండుకూ ఆయన ఆధిక్యత పెరుగుతూ వస్తోంది. వైసీపీ అభ్యర్థి ఆయన దరిదాపులకు కూడా రాలేని పరిస్థితి ఎదుర్కొంటున్నారు.  ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గంలో విజయం సాధించి తీరాలన్న పట్టుదలతో ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ప్రలోభాల పర్వానికి తెరతీసిన వైసీపీ..  పెద్ద ఎత్తున నేతల్ని మోహరించింది. విశాఖే రాజధాని, అక్కడి నుంచే పాలన అంటూ ఊరూవాడా ఏకం చేసింది. అయితే అక్కడి ప్రజలు మాత్రం స్పష్టతతో ఉన్నారు.   అక్కడ తెలుగుదేశం అభ్యర్థి భారీ మెజారిటీతో గెలుపు దిశగా పరుగులు తీస్తున్నారు. ఈ పరిస్థితి అధికార వైసీపీకి కచ్చితంగా ఇబ్బందికరమే.  అదే విధంగా తూర్పు రాలయసీమలోనూ వైసీపీకి శృంగభంగం తప్పని పరిస్థితే కనిపిస్తోంది. అక్కడా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో వైసీపీ అభ్యర్థి పరాజయం దిశగా పయనిస్తున్నారు. ఇక్కడ విజయం కోసం దొంగనోట్లపై ఆధారపడి.. సకల విలువలకూ తిలోదకాలిచ్చేసినా వైసీపీకి గడ్డు పరిస్థితే ఎదురు కావడం రాష్ట్రంలో ఈ ప్రాంతం, ఆ ప్రాంతం అన్న తేడా లేకుండా ప్రజలలో ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ఆగ్రహ జ్వాలలకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇక  పశ్చిమ రాయలసీమలో కూడా తెలుగుదేశం గట్టిపోటీ ఇస్తోంది. ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీగా వైసీపీ గెలుపు సునాయాసమన్న అంచనాలు తొలి నుంచీ ఉన్నాయి. వైసీపీకి పెట్టని కోటలాంటి ఈ ప్రాంతంలో కూడా పోటీ నువ్వా నేనా అన్న స్థాయిలో జరుగుతుండటం చూస్తే వైసీపీ కోటలు బీటలు వారిపోతున్న దృశ్యమే ఆవిష్కృతమౌతోంది.  ఈ ఎన్నికలతో సంబంధం లేకుండానే జగన్ ఇప్పటికే చేయించుకున్న సర్వేలు రాష్ట్రంలో వైసీపీ మరో సారి అధికారంలోకి వచ్చే అవకాశాలు అంతంత మాత్రమేనని స్పష్టం చేసేశాయి. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళి చూస్తే.. వైసీపీకి మళ్లీ అధికారం అన్న మాటే లేదని తేటతెల్లం చేసేశాయని పరిశీలకులు అంటున్నారు.  మంత్రుల విజయావకాశాలపై ఐప్యాక్ నిర్వహించిన సర్వేలో పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, అంజాద్ పాష, నారాయణ స్వామి, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా మినహా మిగిలిన ఎవరికీ విజయావకాశాలు లేవని తేలింది. వాస్తవానికి విజయావకాశాలు ఉన్నాయని సర్వే లో పేర్కొన్న మంత్రులు కూడా కచ్చితంగా విజయం సాధిస్తారన్న నమ్మకం లేదన్నదే ఆ సర్వే సారాంశం. అయితే మిగిలిన మంత్రుల కంటే వీరి పరిస్థితి ఓ రవ్వ మెరుగ్గా ఉందని సర్వే పేర్కొంది. అయితే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నిక ఫలితాలను బట్టి చూస్తే.. వీరి పరిస్థితీ దయనీయంగానే ఉందని తేటతెల్లమైపోయిందని రాజకీయ వర్గాలు అంటున్నాయి.   అదలా ఉంచితే.. ఉత్తరాంధ్ర మంత్రులలో ఒకరు కూడా గెలిచే అవకాశమే లేదని ఐప్యాక్ సర్వే ఇప్పటికే పేర్కొనగా, తాజాగా ఉత్తరాంధ్రపట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం.. ఆ సర్వే నే బలపరిచింది. పరాజయం ఖరారు అని సర్వే పేర్కొన్న మంత్రులలో ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, సిదిరి అప్పలరాజు వంటివారు కూడా ఉన్నారు.  ఇక సిదిరి అప్పలరాజు భూ కబ్జాలు, అక్రమాలపై ప్రజాగ్రహం ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలో మరింత ప్రస్ఫుటమైంది. ఓటర్లు అవినీతిపై స్లిప్పుల రూపంలో ఓటుతో  పాటు బ్యాలెట్ బాక్కులో వేశారు. సిదిరి అప్పలరాజు అవినీతి పరుడు ఆయన మాకు వద్దు అంటూ ఆ స్లిప్లుల ద్వారా ముఖ్యమంత్రికి తెలియజేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయినా అధికారులు దీనిని రహస్యంగా ఉంచేందుకు తమ శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. 

సీపీఎస్ రద్దు అంటే ఇదా జగన్ రెడ్డీ!

వైసీపీ అధిపూత జగన్ రెడ్డి.. ప్రతిపక్ష నేతగా ఉండగా చేసిన పాదయాత్రలో  సీపీఎస్ రద్దు చేస్తానని ప్రభుత్వ ఉద్యోగులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. అదీ కూడా తమ పార్టీ అధికారంలోకి వచ్చిన జస్ట్ వారం రోజుల్లోనే ఈ నిర్ణయం తీసుకొంటామని విస్పష్టంగా చెప్పారు.  ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో వైసీపీ  ఘన విజయం సాధించింది. దీంతో   జగన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు.  నాటి నుంచి నేటి వరకు.. అంటే  ఈ నాలుగేళ్లలో.. సీపీఎస్‌ రద్దుపై ముఖ్యమంత్రి  జగన్ స్పందించ లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆగ్రహం నెలకొంది. ఆ క్రమంలో ఉద్యోగులు.. నిరసనలు, ఆందోళనలతో రోడ్డు ఎక్కడమే కాదు.. ఉద్యమాలు సైతం చేపట్టారు. అలాగే నిరసన దీక్షలూ చేశారు.   అలాంటి వేళ.. ఈ అంశంపై జగన్ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సీపీఎస్ రద్దు చేయలేమని ప్రకటించారు.   సీపీఎస్ రద్దు విషయంలో సీఎం వైయస్ జగన్ అవగాహన లేకుండా హామీ ఇచ్చారని కుండబద్దలు కొట్టేశారు. ఓ వేళ  సీపీఎస్ రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలంటే...   రాష్ట్ర బడ్జెట్ కూడా సరిపోదని సజ్జల రామకృష్ణారెడ్డి ఏ మాత్రం నాన్చుడు బేరం లేకుండా లెక్క తేల్చేశారు.   దీంతో సీపీఎస్ రద్దుపై జగన్ సర్కార్ వైఖరి ఏమిటో ఉద్యోగులకు అర్థమైపోయింది. అయితే తాజాగా సీపీఎస్ రద్దు అంటే..  కొత్త అర్ధాన్ని.. పరమార్ధాన్ని వివరిస్తూ..  ఓ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది. అందులో సీ అంటే క్యాపిటల్... (రాజధాని అమరావతి)... పీ అంటే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్..  ఎస్ అంటే స్పెషల్ స్టేటస్.. (ప్రత్యేక హోదా) రద్దు చేస్తానని నాటి పాదయత్రలో వైయస్ జగన్ చెప్పారని.. కానీ తామే అర్థం చేసుకోలేకపోయామని నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.   తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తాం.. ఏ యే పథకాలు ఎలా అమలు చేస్తామో వివరిస్తూ.. నాటి ప్రతిపక్ష నేతజగన్..  తన పాదయాత్రలో ప్రజలకు హామీ ఇచ్చారు. అలాగే తమ పార్టీకి పూర్తి మెజార్టీ కట్టబెడితే.. ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ పెద్దల మెడలు వంచి.. రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకు వస్తామని..  అలాగే ఆంధ్రుల జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణాన్ని పూర్తి చేసి... ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేస్తామని..  అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అమరావతి అభివృద్ధికి బాటలు   వేస్తామని ఆయన ప్రకటించారు. అందుకే తాడేపల్లిలో ఇల్లు కూడా నిర్మించిన్నట్లు అప్పట్లో చెప్పుకొచ్చారు.   ఈ నేపథ్యంలో 2019 ఎన్నికల్లో అటు ప్రభుత్వ ఉద్యోగులు.. ఇటు అన్ని వర్గాల ప్రజలు గంపగుత్తగా జగన్ కు జై కొట్టారు. వైసీపీకి   ఓట్లు గుద్దేశారు. దాంతో ముఖ్యమంత్రిగా వైయస్ జగన్ గద్దెనెక్కారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన హామీ సీపీఎస్ విధానాన్ని రద్దు చేయలేదు సరికదా...  రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్ట పోయిన.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కూడా లేదు..  ప్యాకేజీ ఇస్తామని అప్పటికే కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో...  అలాగే ఓకే అంటూ సీఎం జగన్ మరో మాట మాట్లాడడం లేదు. ఇక పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు.   ఇక ఆంధ్రప్రదేశ్‌కు ఏకైక రాజధాని అమరావతి కాదని.. మూడు రాజధానులు అంటూ ముఖ్యమంత్రిగా  జగన్ బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకు కొత్త పల్లవి అందుకోవడంతో.. రాజధానికి భూములు ఇచ్చిన ఆ ప్రాంత రైతులు ఆందోళనలు, నిరసనలు, దీక్షలు, పాదయాత్రలు చేస్తున్నారు.  మరోవైపు రాజధాని అమరావతికి ఇచ్చిన భూములు నిరూపయోగంగా మారిపోయాయి. అలాంటి వేళ.. తాను అధికారంలోకి వస్తే..  సీపీఎస్ రద్దు చేస్తానంటే..  కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అని అంతా అనుకున్నామని...  కానీ అది కాదని.. సీపీఎస్ రద్దు అంటే కేపిటల్, పోలవరం, స్పెషల్ స్టేటస్ రద్దుఅని తెలుసుకోలేకపోయామనీ  నెటిజన్లు  అంటున్నారు. అందుకు సంబంధించిన  ఫొటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కరీంనగర్ లో తెలుగుదేశం ఆవిర్బావ సభ

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం మార్చి 29వ తేదీ. ఈ నేపథ్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. తెలంగాణలోని కరీంనగర్‌లో నిర్వహించాలని తెలుగుదేశం   ఆధిష్టానం నిర్ణయించింది. అందులో భాగంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆ క్రమంలో స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాల మైదానంతోపాటు ఆంబేద్కర్ మైదానాన్ని సైతం పార్టీ నేతలు ఇప్పటికే పరిశీలించి... వాటిలో ఒకటి ఖరారు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ భారీ బహిరంగ సభకు పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సహా పార్టీలోని పలువురు కీలక నేతలు కూడా హాజరుకానున్నారని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.  ఈ ఏడాది చివరిలో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. అయితే ముచ్చటగా మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు  బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ తనదైన శైలిలో ప్రణాళికలు సిద్దం చేసుకొని ముందుకు దూసుకుపోతున్నారు. ఇంకో వైపు తెలంగాణలో ఎలాగైనా గద్దెనెక్కి.. గులాబీ బాస్ కేసీఆర్‌కు ఝలక్ ఇచ్చేందుకు...  మోదీ, అమిత్ షా ద్వయం సారథ్యంలో తెలంగాణలో  బీజేపీ నేతలకు స్పష్టమైన సూచనలు.. సలహాలు అందిస్తూ ముందుకు సాగుతోంది. అలాంటి పరిస్థితుల నడుమ రాష్ట్రంలో సైకిల్ పార్టీని సవారీ చేయించేందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు.  ఆ క్రమంలో తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిగా కాసాని జ్జానేశ్వర్‌ను చంద్రబాబు నియమించారు. అనంతరం గత ఏడాది ఖమ్మం నగరంలో తెలంగాణ నిర్వహించిన శంఖారావ సభ సూపర్... డూపర్...  సక్సెస్ అయ్యింది. దీంతో పసుపు పార్టీ శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపించింది. అలాగే ఇంటింటికీ తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని   పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇటీవల హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ప్రారంభించారు. ఈ కార్యక్రమం కూడా దిగ్విజయంగా కొనసాగుతోంది. ఇక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో టీడీపీ   హయాంలో తీసుకు వచ్చిన సంక్షేమ పథకాలతోపాటు శాంతి భద్రతలు, హైదరాబాద్ నగరాభివృద్ధి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధి తదితర అంశాలను సైతం ప్రజల్లోకి పార్టీ నేతలు చాలా బలంగా తీసుకు వెళ్తున్నారు.        అసలు అయితే ఈ ఏడాది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ వేడుకలు... సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించాలని పార్టీ ముందుగా నిర్ణయించింది. కానీ కంటోన్మెంట్ ఎన్నికలకు నోటిఫికేషన్ మార్చిలో విడుదల కానుందని..  ఈ నేపథ్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కరీంనగర్‌ వేదికగా జరపాలని పార్టీ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం.   కరీంనగర్ సభ తర్వాత ఇటువంటి సభలు మరిన్ని సభలు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించడానికి ప్రణాళికలు  సిద్ధం చేసే పనిలో తెలుగుదేశం అగ్రనాయకత్వం నిమగ్నమైనట్లు చెబుతున్నారు.  

కడప ఎంపీకి దారులు మూసుకుపోయాయా?

కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి దారులు మూసుకు పోయాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఆయన అరెస్టు ఇక అనివార్యం అన్న భావనే సర్వత్రా వ్యక్తమౌతోంది. వైఎస్ వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ వివేకానందరెడ్డికి తెలంగాణ హై కోర్టులో చుక్కెదురైంది.  సీబీఐ విచారణకు సంబంధించి ఆయన హైకోర్టులో దాఖలు చేసిన రెండు పిటిషన్లనూ కోర్టు కొట్టేసింది. కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ అరెస్టు చేయకుండా ఆదేశించాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను విచారించిన తెలంగాణ హైకోర్టు ఆ మేరకు సీబీఐను ఆదేశించలేమని స్పష్టం చేసింది. సీబీఐ చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలనీ, విచారణపై స్టే ఇవ్వాలనీ అవినాష్ రెడ్డి కోర్టును ఆశ్రయించిన సంగతి విదితమే. అయితే ఆ రెండు అంశాలలోనూ కూడా కోర్టులో అవినాష్ కు ఎలాంటి ఊరటా లభించలేదు. విచారణ సందర్భంగా న్యాయవాది హాజరుకు అనుమతించినా, విచారణలో ఎటువంటి జోక్యం కలుగ జేసుకోకూడదని స్పష్టంగా కోర్టు ఆదేశించింది. దీంతో ఈ కేసులో అరెస్టు కాకుండా అవినాష్ రెడ్డికి ఉన్న దారులన్నీ మూసుకుపోయినట్లేనని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.   దీంతో ఇప్పటి వరకూ నాలుగు సార్లు సీబీఐ విచారణను ఎదుర్కొన్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఐదోసారి కూడా విచారణకు హాజరు కాకతప్పని పరిస్థితి ఏర్పడింది. గతంలో సీబీఐ విచారణకు అవినాష్ రెడ్డి హాజరైన ప్రతి సారీ ఆయన అరెస్టు తప్పదన్న ప్రచారం జరిగింది. ఇప్పుడు కోర్టులో అవినాష్ రెడ్డికి చుక్కెదురైన నేపథ్యంలో ఆయన అరెస్టుకు ఇక ఎలాంటి అడ్డంకులూ లేవన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.  

వివేకా హత్య కేసు దర్యాప్తు జాప్యం ఎవరికి లాభం? జనంలో చర్చ!

వివేకా హత్య కేసు దర్యాప్తు జగుతున్న తీరు..చేరుకుంటున్న ముగింపు దిశ చూస్తే.. ఈ కేసులో సూత్ర ధారులు, పాత్రధారుల పాత్ర అతి తొందరలోనే వెల్లడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయనే ఎవరైనా భావిస్తారు. ఈ పరిస్థితుల్లో కేసు దర్యాప్తును అడ్డుకోవడానికి ఎవరు ఏ విధంగా ప్రయత్నించినా.. వారిపై అనుమానాలు వెల్లువెత్తడం ఖాయం. సరిగ్గా అదే జరుగుతోంది ఇప్పుడు వివేకా హత్య కేసు విషయంలో.. ఈ కేసు దర్యాప్తు సజావుగా సాగకుండా  సాధ్యమైనంత వరకూ జాప్యం జరిగేలా చూడటమే లక్ష్యంగా జరుగుతున్న ప్రయత్నాలు అటువంటి అనుమానాలకే ఆస్కారం కలిగిస్తున్నాయి. అలా ప్రయత్నిస్తున్నవారే ఈ కేసులో దోషులు అన్న నిర్ధారణకు జనం వచ్చేందుకు ఆ ప్రయత్నాలే ఆస్కారం కలిగిస్తున్నాయి. టెక్నికల్ గా కేసులు, పిటిషన్లతో దర్యాప్తు ముందుకు సాగకుండా అడ్డుకుంటూ.. జనం దృష్టిలో పలుచన అవ్వడమే కాకుండా..  నేరం చేసినట్లుగా ప్రజలు నమ్మడానికి వారి ప్రయత్నాలు ఆస్కారం కలిగిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసు దర్యాప్తు ముందుకు సాగకుండా ప్రస్తుతం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్న కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్లు చాలవా అన్నట్లు.. హతుడు వైఎస్ వివేకా వద్ద పిఏగా పని చేసిన కృష్ణారెడ్డి కూడా హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తన పిటిషన్ లో వైఎస్ వివేకా హత్య ఆస్తుల కోసమే జరిగి ఉంటుందన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యూహమే జగన్ అక్రమాస్తుల కేసు విషయంలోనూ అసుసరించిన విషయాన్ని ఈ సందర్భంగా పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. ఒకరి తరువాత ఒకరు అన్నట్లుగా పెద్ద సంఖ్యలో కోర్టుల్లో పిటిషన్లు దాఖలు చేస్తూ కేసు దర్యాప్తు, విచారణ ముందుకు సాగకుండా అడ్డుకోవడమే లక్ష్యం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు.    

జనసేనాని కుండ బద్దలు కొట్టేశారు.. జగన్ కు ఇక చుక్కలే!

వచ్చే ఎన్నికలలో అధికార పార్టీని గద్దె దించేందుకు తెలుగుదేశం పార్టీతో కలిసి పోటీ చేయనున్నట్లు నేరుగా కాకపోయినా జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. అక్కడితో ఆగలేదు.. ఆయన బీజేపీని కూడా కలుపుకు పోవడానికే తన ప్రయత్నం అని కూడా బిట్వీన్ ది లైన్స్ సంకేతాలు ఇచ్చారు. తన అసంతృప్తి అంతా బీజేపీ రాష్ట్ర నాయకత్వంపైనే కానీ ఆ పార్టీ హై కమాండ్ మీద కాదని విస్పష్టంగా తేల్చేశారు. తనకు బీజేపీ జాతీయ నాయకులతోనూ, కేంద్రం పెద్దలతోనూ సత్సంబంధాలూ, సఖ్యతా ఉన్నాయని ఆయన చెప్పారు. అంటే తనకు ఉన్న పేచీ అంతా ఆ పార్టీ రాష్ట్ర నాయకులతోనేనని తేటతెల్లం చేశారు.   ఏపీకి  ఏకైక రాజధాని అమరావతేనని  కేంద్ర పెద్దలను, బీజేపీ నాయకులను ఒప్పించినప్పటికీ.. అమరావతే రాజధాని అంటూ ర్యాలీ చేయడానికి రాష్ట్ర బీజేపీ నాయకులు మాత్రం ఎందుకో సుముఖంగా లేరని పవన్ అభిప్రాయంగా కనిపిస్తోంది.  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమర్ధుడైన నాయకుడని పవన్ కళ్యాణ్ కితాబు నివ్వడం, వైసీపీ పార్టీని ఓడిస్తాం, ఆ పార్టీ నాయకుల కోటలు బద్దలు కొడతాం అంటూ పవన్ క ల్యాణ్ పార్టీ వార్షికోత్సవ సభ వేదికగా చేసిన ప్రకటనే రాష్ట్రంలో పొత్తుల విషయాన్ని ఖరారు చేసినట్లేనని పరిశీలకుల విశ్లేషిస్తున్నారు. కాగా పవన్ కల్యాణ్ ప్రసంగంపై తనదైన శైలిలో భాష్యం చెప్పారు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణం రాజు.   గతంలో కంటే పవన్ కల్యాణ్ బందర్ సభలో ఎంతో పరిణితితో మాట్లాడారనీ, రాష్ట్రంలో జనసేన బలోపేతం ఒక్కటే లక్ష్యం కాదనీ, దానితో పాటు రాష్ట్రంలో దుర్మార్గ పాలన అంతం కూడా తన ధ్యేయమనీ చెప్పారు. అందుకే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను అని పునరుద్ఘాటించారు. వైసీపీ ఎంతగా రెచ్చగొట్టి లబ్ధి పొందాలని చూసినా పవన్ కల్యాణ్ సంయమనం కోల్పోకపోవడాన్ని రఘురామకృష్ణం రాజు ప్రత్యేకంగా ప్రస్తావించి.. వచ్చే ఎన్నికలలో తెలుగుదేశం, జనసేనలు కలిసి పోటీ చేయడం ఖాయమన్న భావన వ్యక్తం చేశారు. తన అంచనా ప్రకారం ముందు ముందు బీజేపీ కూడా తెలుగుదేశం, జనసేన కూటమితో జట్టు కట్టక తప్పదని రఘురామరాజు విశ్లేషించారు.