షర్మిలపై దుష్ప్రచారం.. ఇక విమలమ్మ వంతు?

కడపలో వైఎస్ కుటుంబ రాజకీయాలు ఇప్పుడు రచ్చకెక్కాయి. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విషయంలో దోషులు ఎవరు? ఆయన హత్య ఎందుకు జరిగింది? అన్న విషయంలో కోర్టులు ఇంకా నిర్దుష్టమైన తీర్పు వెలువరించలేదు. కేసు విచారణ జరుగుతోంది. సీబీఐ దర్యాప్తు కూడా సాగుతోంది. అయితే ఈ ఐదేళ్లలో వివేకా హత్య ఎవరు ఎందుకు చేశారు? చేయించారు? అన్న ప్రశ్నలకు ప్రజలకు మాత్రం స్పష్టమైన సమాధానం లభించేసింది.  అయితే జగన్ శిబిరం మాత్రం ఇంకా వివేకా హత్య విషయంలో అవినాష్ సుద్దపూసే అంటూ వస్తోంది. అక్కడితో ఆగకుండా వివేకా కుమార్తె సునీతపైనే ఆరోపణలు చేస్తున్నది. ఇప్పుడు సునీతకు మద్దతుగా షర్మిల కూడా అవినాష్ కు వివేహా హంతకుడిగా అభివర్ణిస్తూ హంతకుడికి మద్దతుగా నిలుస్తున్న జగన్ కు ఓటే వేయద్దని, నిజమైన వైఎస్ వారసురాలిగా తనను కడప లోక్ సభ నియోజకవర్గం నుంచి గెలిపించాలని కొంగు జాచి అభ్యర్థిస్తున్నారు. దీంతో జగన్ శిబిరంలో ఆందోళన  మొదలైంది. షర్మిలపైనా వైసీపీ సోషల్ మీడియాలో  ట్రోలింగ్ ఆరంభమైంది. అక్కడితో ఆగకుండా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఏకంగా షర్మిలను పెయిడ్ ఆర్టిస్ట్ అంటూ విమర్శలు గుప్పించారు. జగన్ కు స్వయానా చెల్లెలు అయిన షర్మిలపై వైసీపీ విమర్శలు మర్యాద గడప దాటేస్తున్నాయి. ఆమె వ్యక్తిగత అంశాలను కూడా ప్రస్తావిస్తూ ప్రతిష్ట మసకబార్చడానికి కూడా వెనుకాడటం లేదు. అయితే వాటన్నిటికీ దీటుగా బదులిస్తూ జగన్ పై పదునైన విమర్శనాస్త్రాలు సంధిస్తూ షర్మిల ముందుకు సాగుతున్నారు.  అయితే షర్మిల కడపలో ప్రచారం ఆరంభించగానే త్రాసు ఆమె వైపు మెగ్గినట్లు స్పష్టంగా తెలిసిపోవడంతో జగన్ తన మేనత్త విమలమ్మను రంగంలోకి దింపారు. దీంతో ఇప్పుడు సొంత మేనత్తే షర్మిలపై దుష్ప్రచారానికి నడుంబిగించినట్లు అయ్యింది. దీంతో వైఎస్ కుటుంబ రాజకీయ పోరు కుటుంబంలోని మహిళల మధ్య మాటల యుద్ధానికి దారి తీసినట్లైంది  షర్మిల, సునీత ఒకవైపు.. జగన్, అవినాష్ రెడ్డి మరో వైపుగా గా ఉన్న కుటుంబ యుద్ధంలోకి   విమలమ్మ ఎంట్రీ ఇచ్చారు.  క్రైస్తవ మత ప్రచారానికే పరిమతమైన విమలమ్మ  జగన్ కు, అవినాష్ కు మద్దతుగా రాజకీయ ప్రచారానికి నడుంబిగించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, వివేకానందరెడ్డిల చెల్లెలైన విమలమ్మ వైఎస్ మరణం తరువాత కుటుంబంలో జగన్ పక్షాన నిలిచిన ఏకైక వ్యక్తిగా చెప్పుకోవచ్చు. షర్మిల చెబుతున్నట్లు విమలమ్మ కుమారుడికి సీఎం జగన్ వర్క్స్ ఇవ్వడం వల్లనే ఆమె ఆర్థికంగా స్థిరపడి ఆ కృతజ్ణతతో జగన్ పక్షాన నిలిచి ఉండొచ్చు కానీ ఇక్కడ విషయం అది కాదు..  సొంత అన్న వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ కు మద్దతుగా విమలమ్మ గళం విప్పడమే ఆమె ప్రతిష్టను కడప వాసులలో మసకబారేలా చేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అక్కడితో ఆగకుండా మేనకోడళ్లు షర్మిల, సునీతలను ఆమె నోరు మూసుకోమంటూ గదమాయించేలా మాట్లాడడాన్ని కూడా వైఎస్ కుటుంబాన్ని అభిమానించే వారిలో ఆగ్రహానికి కారణమైందని అంటున్నారు.  అవినాష్ రెడ్డిని ఏమీ తెలియని చిన్న పిల్లాడిగా అభివర్ణిస్తూ ఆమె మీడియా సమావేశంలోఅవినాష్‌రెడ్డిని చిన్నపిల్లాడిగా అభివర్ణించిన విమలమ్మ  షర్మిల, సునీతలు వైఎస్ కుటుంబ ప్రతిష్టను రోడ్డుకీడ్చారు అనడాన్ని తప్పుపడుతున్నారు.   అలాగే షర్మిల, సునీతలు చంద్రబాబు చెప్పినట్లల్లా ఆడుతున్నారంటూ విమర్శించడాన్ని జీర్ణించు కోలేకపోతున్నారు. గత ఎన్నికల సమయంలో అన్న విజయం కోసం కాళ్లరిగేలా తిరిగిన షర్మిలకు అన్న జగన్ ఇచ్చిన మర్యాద, గౌరవం ఏమిటని నిలదీస్తున్నారు.  మేనత్త   వ్యాఖ్యలు,  హెచ్చరికలపై షర్మిల ఘాటు స్పందనను స్వాగతిస్తున్నారు.    ఇప్పుడు జగన్ విమలమ్మను షర్మిల సానుకూల ఓట్లను చీల్చేందుకు ప్రచారానికి ఉపయోగించుకోవాలని భావిస్తున్నట్లు కడప రాజకీయ వర్గాల్లో ప్రచారం అవుతోంది.  షర్మిలకు వ్యతిరేకంగా విమలమ్మ ప్రచారానికి పెద్దగా స్పందన లభించే అవకాశం ఉందని పరిశీలకులు భావించడం లేదు.  

కేజ్రీవాల్ ను పరామర్శించిన  పంజాబ్ సిఎం 

తీహార్ జైలులో ఉన్న ఢిల్లీ మాజీ సిఎంను పంజాబ్ సిఎం  ఇవ్వాళ పరామర్శించారు.  ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ కేసులో అరెస్ట‌యి తీహార్ జైలులో ఉన్న ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సోమ‌వారం పంజాబ్ ముఖ్య‌మంత్రి భ‌గ‌వంత్‌సింగ్‌ మాన్ క‌లిశారు. అనంతరం పంజాబ్ సీఎం మీడియాతో మాట్లాడుతూ.. "కరడుగట్టిన నేరగాళ్లకు కూడా అందుబాటులో ఉండే సౌకర్యాలు ఆయనకు అందకపోవడం బాధాకరం. ఆయ‌న తప్పు ఏమిటి? దేశంలోనే అతిపెద్ద టెర్రరిస్టుల్లో ఒకరిని పట్టుకున్నట్లుగా మీరు ఆయ‌న‌తో వ్యవహరిస్తున్న తీరు ఎంతో బాధ‌క‌రం. ప్రధాని మోదీకి ఏం కావాలి? పారదర్శకత రాజకీయాలకు శ్రీకారం చుట్టి, బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలకు ముగింపు పలికిన కేజ్రీవాల్‌తో ఇలా వ్యవహరించ‌డంప‌ట్ల బాధ‌గా ఉంది. ఆయ‌న‌ను ఎలా ఉన్నారు అని నేను అడిగితే.. నా విష‌యం వ‌దిలేయ్‌, పంజాబ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పు అని అన్నారు. ఆప్ క్రమశిక్షణ కలిగిన పార్టీ, అందరం సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు అండగా ఉంటాం. జూన్ 4న వ‌చ్చే ఫలితాల త‌ర్వాత‌ ఆప్ పెద్ద రాజకీయ శక్తిగా ఎదుగుతుంది" అని భ‌గ‌వంత్ మాన్ చెప్పుకొచ్చారు.

జగన్ కు భధ్రత పెంపు 

ఎపిలో అధికారపార్టీ ప్రజల భద్రత కన్నా పాలకుల భద్రత మీద దృష్టి కేంద్రీకరించింది. . ఏపీ సీఎం జగన్ పై రాయి దాడి జరిగిన నేపథ్యంలో ఆయనకు భద్రతను భారీగా పెంచారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని పెంచారు. బస్సు యాత్ర మార్గాల్లో డీఎస్పీ స్థాయి అధికారులతో భద్రతను కల్పించనున్నారు. సీఎం ప్రయాణించే రోడ్డు మార్గాన్ని సెక్టార్లుగా విభజించారు. ఒక్కో సెక్టార్ లో ఒక డీఎస్పీ, ఇద్దరు సీఐలు, నలుగురు ఎస్సైలతో సెక్యూరిటీ కల్పించారు. ఇక నుంచి నిర్దేశించిన మార్గాల్లోనే సీఎం రోడ్ షోలు, సభలు ఉంటాయి. పువ్వులు విసరడం, గజమాలల విషయంలో ఆంక్షలు విధించారు. మరోవైపు జగన్ మేమంతా సిద్ధం యాత్ర గన్నవరం నియోజకవర్గం నుంచి గుడివాడ నియోజకవర్గంలోని ప్రవేశించింది. ఈ సాయంత్రం గుడివాడలో నిర్వహించే బహిరంగ సభలో జగన్ ప్రసంగించనున్నారు. గాయం కారణంగా వైద్యుల సలహాతో జగన్ ఒక రోజు విశ్రాంతి తీసుకున్నారు. గాయం నుంచి జగన్ త్వరగా కోలుకోవాలని వైసీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కోరుకుంటున్నారు.  

ఫోన్ ట్యాపింగ్ ఉచ్చులో సినీ నిర్మాత

ఫోన్ ట్యాపింగ్ కేసు ఎవ్వరినీ వదలడం లేదు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన బడా నిర్మాత ఈ ఉచ్చులో చిక్కుకున్నారు.  తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రముఖ నిర్మాత పేరు బయటకొచ్చింది. ఈ వ్యవహారంలో బాధితుడి ఫిర్యాదు మేరకు మైత్రీ మూవీస్ నిర్మాత నవీన్ యర్నేని పేరును పోలీసులు ఈ కేసులో చేర్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చాక బాధితులు ఒక్కొక్కరుగా పోలీసులను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రముఖ వ్యాపారవేత్త, ఎన్ఆర్ఐ చెన్నుపాటి వేణుమాధవ్ పోలీసులను కలిశారు. ఫోన్ ట్యాపింగ్ నిందితులు గతంలో తనను కిడ్నాప్ చేసి బెదిరించారని ఆరోపించారు. తన దగ్గర ఉన్న షేర్లను బలవంతంగా రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. ఇందులో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నవీన్ యర్నేని కూడా ఉన్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు నవీన్ పై కేసు నమోదు చేశారు.  గతంలో తాను ప్రారంభించిన క్రియా హెల్త్ కేర్ కంపెనీ వాటాలను బలవంతంగా మార్పించుకున్నారని వేణుమాధవ్ ఆరోపించారు. ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు, ఇన్ స్పెక్టర్ గట్టు మల్లు, ఎస్సై మల్లికార్జునరావుతోపాటు తన సంస్థలోని నలుగురు డైరక్టర్లు కూడా లబ్ది పొందారని చెప్పారు. కాగా, వేణుమాధవ్ ఫిర్యాదుతో సంస్థ ఎండీ రాజశేఖర్ తలశిల, డైరక్టర్లు.. గోపాలకృష్ణ సూరెడ్డి, నిర్మాత నవీన్ యర్నేని, రవికుమార్ మందలపు, వీరమాచనేని పూర్ణచంద్రరావులను ఈ కేసులో నిందితులుగా చేర్చినట్లు పోలీసులు తెలిపారు.

వైసీపీ వాళ్ళకి షార్ప్ షూటర్లు భలే దొరుకుతారు

వైఎస్ ఫ్యామిలీకి ఎక్కడ దొరుకుతారోగానీ షార్ప్ షూటర్లు భలే దొరుకుతారు. గతంలో పరిటాల రవిని అంతం చేయడానికి మొద్దు శ్రీను లాంటి టాలెంటెడ్ షార్ప్ షూటర్ని ఎంకరేజ్ చేశారు. ఆ షార్ప్ షూటర్ తాను అనుకున్నది సాధించాడు. కోడి కత్తి డ్రామా సందర్భంలో కూడా ప్రాణం పోయే ప్రదేశాల్లో కాకుండా ఉత్తుత్తి చోట కాస్తంత కత్తి దిగబడేలా లాఘవంగా ఆపరేట్ చేయగలిగిన వ్యక్తి దొరికాడు. ఇప్పుడు తనమీద తాను గులకరాయి దాడి చేయించుకోవడానికి కూడా ఎవరో ప్రతిభావంతుడైన షార్ప్ షూటర్ ఎవరో దొరికాడు. ‘షార్ప్ షూటర్’ అని ఎందుకు అనాల్సి వస్తోందంటే, ఎవరో రాయి చేత్తో విసరలేదు.. ఎయిర్ గన్ లాంటి దానితో షూట్ చేశారని వైసీపీ వాళ్ళే అంతా తెలిసినట్టు చెబుతున్నారు కదా. ఏది ఏమైనా వైసీపీ వాళ్ళు నియమించుకున్న ఆ షార్ప్ షూటర్‌కి కమిట్ అయిన దానికంటే ఎక్కువ పారితోషికం ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా వుంది. ఎందుకంటే, అంతమంది మధ్యలో నిల్చుని వున్న జగన్‌కి మాత్రమే తగిలేలా, అది కూడా కంటికి కాకుండా కంటి పైన తగిలేలా, ఆ తగలడం కూడా పెద్ద గాయం లాంటిదేమీ కాకుండా చిన్న గాయం తగిలేలా షూట్ చేశాడు కదా. ఆ రాయి కణతకి తగిలి వుంటే జగనన్న పైకి టపా కట్టేసి వుండేవాడని డాక్టర్లు చెప్పారని అంటున్నారు. రాయి కణతకు తగలకుండా జాగ్రత్తపడ్డ సదరు షార్ప్ షూటర్‌కి వైసీపీ వాళ్ళంతా రుణపడి వుండాలి. కాకపోతే, పరిటాలను చంపేసిన షార్ప్ షూటర్ మొద్దు శ్రీను ఆ తర్వాత జైల్లో మర్డరైపోయాడు. కోడికత్తి శ్రీను మొన్నటి వరకూ జైలుకే అంకితం అయిపోయాడు. ఇప్పుడు ఈ షార్ప్ షూటర్ భవిష్యత్తు ఏమిటో!

రాహుల్ గాంధీ హెలికాప్టర్‌లో ఈసీ తనిఖీ

దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ఎన్నికల వేళ అభ్యర్థులు కట్టుతప్పకుండా ఎలక్షన్ కమిషన్ (ఈసీ) పటిష్ఠ చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీ హెలికాఫ్టర్‌పై ఈసీ ఫ్లైయింగ్ స్క్వాడ్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా రాహుల్ గాంధీ మైసూర్ నుంచి హెలికాఫ్టర్‌లో తమిళనాడులోని నీలగిరి జిల్లాకు వచ్చారు. రాహుల్ నీలగిరిలో దిగిన వెంటనే ఈసీ బృందం హెలికాఫ్టర్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాయి. మరోవైపు, కేరళలో రాహుల్ గాంధీ తన ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. సుల్తాన్ బాథెరీలో ఓ భారీ రోడ్ షోలో పాల్గొన్నారు. అంతకుమునుపు నీలగిరిలోని స్థానిక కాలేజీ విద్యార్థులతో ముచ్చటించారు. ఇక సుల్తాన్ బాథెరీలో రాహుల్ గాంధీ కారులో ప్రయాణిస్తూ ప్రచారం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో కార్యకర్తలు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆయనను అనుసరించారు. నేటి పర్యటనలో భాగంగా రాహుల్ గాంధీ మనంథవాడి, వెల్లమండ, పదిన్‌జరతార ప్రాంతాల్లో రోడ్ షోల్లో పాల్గొంటారు. నేటి సాయంత్రం, కోజీకోడ్ జిల్లాలో కాంగ్రెస్-యూడీఎఫ్ కూటమి ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొంటారు. వయనాడ్ నుంచి మరోసారి గెలుపు కోసం ప్రయత్నిస్తున్న రాహుల్‌కు అక్కడ ఇది రెండో పర్యటన. 2019 ఎన్నికల్లో రాహుల్ వయనాడ్ నుంచి రికార్డు స్థాయిలో 4,31,770 ఓట్ల మెజారిటీతో గెలిచారు. రాష్ట్రంలోని 20 లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 26న ఒకేసారి ఎన్నికల జరగనున్న నేపథ్యంలో రాహుల్ తన ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు.

కవితపై కోర్టు సీరియస్.. మీడియాతో మాట్లాడవద్దంటూ మందలింపు!

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుమార్తె.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు ఇప్పట్లో తీరేలా లేవు. మద్యం కుంభకోణంలో ఆమె కీలకమని సీబీఐ, ఈడీలు గట్టిగా చెబుతున్నాయి. ఆమె సక్ష్యాల టాంపరింగ్ కు సంబంధించి ఆధారాలను కోర్టుకు సమర్పించాయి. దీంతో కోర్టు ఆమెకు బెయిలు నిరాకరించింది.  తాజాగా కోర్టు కవితపై ఆగ్రహం వ్యక్తం చేసింది. కవిత జ్యూడీషియల్ కస్టడీ సోమవారంతో ముగియడంతో  ఆమెను సీబీఐ కోర్టులో హాజరు పరిచింది. కోర్టు ఆమె జ్యుడీషియల్  కస్టడీ  ఏప్రిల్ ల్ 23 వరకు పొడిగించింది.  అయితే కవిత కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటంపై కోర్టు సీరియస్ అయ్యింది.  కోర్టు ఆవరణలో తాను ఉన్నది సీబీఐ కస్టడీలో కాదనీ, బీజేపీ కస్టడీలో ఉన్నాననీ చెప్పడాన్ని కోర్టు తప్పుపట్టింది.  కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడటం సరికాదని విస్పష్టంగా చెబుతూ మరో సారి అలా మాట్లాడేందుకు వీలులేదని గట్టిగా హెచ్చరించింది. కవిత కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ బీజేపీ నేతలు బయట ఏం మాట్లాడుతున్నారో అవే విషయాలపై సీబీఐ అధికారులు తనను ప్రశ్నిస్తున్నారని చెప్పారు. ఇప్పడనే కాకుండా కవిత అరెస్టైనప్పటి నుంచీ దర్యాప్తు సంస్థలు కోర్టుకు హాజరు పరిచిన ప్రతిసారీ మీడియా ముందు మాట్లాడుతున్నారు. కోర్టు తాజా హెచ్చరికతో ఇకపై ఆమె కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడే అవకాశం లేదు. ఇలా ఉండగా సీబీఐ కస్టడీలో ఉన్న ఆమెను మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, స్వయానా కవితకు అన్న అయిన కేటీఆర్ కలిశారు. ఆ సందర్భంగా జైల్లో ఆమెకు అందుతున్న సదుపాయాలు, సౌకర్యాలపై ఆరా తీశారు. త్వరలోనే బెయిలు వస్తుందనీ, అధైర్య పడవద్దనీ భరోసా ఇస్తూ ధైర్యం చెప్పారు.  

అది గాయమా? మోడ్రన్ మేకప్పా?

జగన్న మీద హత్యాయత్నం జరిగింది, ఎయిర్‌గన్‌తో గులకరాయితో షూట్ చేశారు అని వైసీపీ వర్గాలు నానా రచ్చ చేస్తున్నాయి. కోడికత్తి-2 డ్రామాని రక్తి కట్టించడానికి నానా తంటాలు పడుతున్నాయి. అయితే ప్రజలు వైసీపీ అండ్ కంపెనీని నమ్మడం లేదు. ఎన్నికల సమయంలో ఇలాంటి డ్రామాలు ఆడటం వీళ్ళకు అలవాటు అయిపోయిందని విసుక్కుంటున్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే, నిజంగానే ఎవరైనా ఆకతాయి రాయి విసిరాడని విచారణలో తేలినా జనం నమ్మేట్టు లేరు. ఇదంతా వైసీపీ డ్రామానే అని జనం ఫిక్సయిపోయారు. ఇదిలా వుంటే, ఈ విషయం మీద జనంలో కూడా భారీ స్థాయిలో చర్చ జరుగుతున్న నేపథ్యంలో కొత్త వాదన బయటకి వచ్చింది. జగన్ కంటి పైన రెండు కుట్లు పడేంత గాయం కనిపిస్తోందిగానీ, ఒక్క రక్తపు చుక్క కూడా కారడం కనిపించలేదు. జగన్ కంటి పైన వున్నది నిజం గాయం కాదని, అది మేకప్ అనే అనుమానాలు జనం వ్యక్తం చేస్తున్నారు. చిన్న సూదితో గుచ్చితేనే రక్తం కారిపోతుందే, అలాంటిది రెండు కుట్లు వేసేంత గాయం తగిలినా చుక్క రక్తం కూడా కారకపోవడమేంటనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కోడికత్తి డ్రామా సందర్భంలో కూడా జగనన్న చొక్కా మీద ఒక రక్తపు చుక్క కనిపించింది తప్ప, అసలు ఆ గాయం ఎంత అయిందనేది హైదరాబాద్ డాక్టర్లకు మినహా మరెవరికీ తెలియదు. ఇప్పుడు ఈ విషయం మీద దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు జగన్ గాయాన్ని కూడా పరిశీలించాల్సిన అవసరం వుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు కోడికత్తి-2 డ్రామా సందర్భంగా జగన్‌కి ట్రీట్‌మెంట్ జరిగిన విధానం పెద్ద కామెడీ ఇష్యూగా మారింది. తగిలింది చిటికెడు గాయం. దానికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగినంత రేంజ్‌లో బోలెడంతమంది డాక్టర్లు అటెండ్ కావడం.. వాళ్ళందరూ జగన్‌తో ఫొటోలు దిగడం.. ఇదంతా చూసి జనం నవ్వుకుంటున్నారు.

ఇడుపుల పాయలో ట్రిపుల్ ఐటీ విద్యార్థిని  బలవన్మరణం 

ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలోని ఇడుపుల పాయలో ఒక విద్యార్ధిని విషాదకర పరిస్థితుల్లో ఆత్మహత్యకు పాల్పడింది. ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో ఇంజినీరింగ్ చ‌దువుతున్న కుర్రి రేఖ అనే విద్యార్థిని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డింది. ఆదివారం రాత్రి వ‌స‌తి భ‌వ‌నంపై నుంచి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ప్ర‌కాశం జిల్లా కంభం మండ‌లం జంగంగుట్ల గ్రామానికి చెందిన రేఖ ఇడుపులపాయ ట్రిపుల్ఐటీలో మెకానిక‌ల్‌ ఇంజినీరింగ్ చివ‌రి సంవ‌త్స‌రం చ‌దువుతోంది.  ఆదివారం రాత్రి ఏడున్నర గంట‌ల స‌మ‌యంలో ఆమె వ‌స‌తి భ‌వ‌నంపై నుంచి దూకడంతో తీవ్రంగా గాయ‌ప‌డింది. ఇది గ‌మ‌నించిన తోటి విద్యార్థులు, అక్క‌డి సిబ్బంది ప్రాథ‌మిక చికిత్స కోసం ట్రిపుల్ఐటీలోని ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డి నుంచి మెరుగైన వైద్యం కోసం క‌డ‌ప స‌ర్వ‌జ‌న ఆసుప‌త్రికి తీసుకెళ్లారు. అక్క‌డ చికిత్స పొందుతూ రాత్రి పదిన్నర గంట‌ల ప్రాంతంలో రేఖ మృతిచెందింది.  ఇంజినీరింగ్ కోర్సు పూర్త‌య్యింది. మ‌రో 10 రోజుల్లో ఇంటికి వెళ్లాల్సిన ఉండ‌గా సూసైడ్ చేసుకుంది. ఈ విష‌యం తెలుసుకున్న ట్రిపుల్ఐటీ డైరెక్ట‌ర్ కుమార‌స్వామిగుప్త‌, హాస్ట‌ల్ సంక్షేమ అధికారి ఇమ్రాన్ ష‌రీఫ్ విద్యార్థిని మృత‌దేహాన్ని ప‌రిశీలించారు. మృతురాలు రేఖ మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆమె బ‌ల‌వన్మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాలు తెలియాల్సి ఉంది.

సుత్తి కబుర్లు ఆపవయ్యా సజ్జల

గంతకు తగ్గ బొంత అన్నట్టు గంత లాంటి వైసీపీకి బొంతలాంటి అధికార ప్రతినిధి సజ్జల రామకృష్ణారెడ్డి దొరికాడు. గులకరాయి దాడి ఘటన (సోషల్ మీడియాలో అందరూ ‘కోడికత్తి-2’ అంటున్నారు) మీద ఆయన స్పందించిన తీరు వైసీపీ దిక్కుమాలిన సిద్ధాంతాలకు అద్దం పట్టేలానే వుంది. ఆయన నోట్లోంచి జాలువారిన ముత్యాల్లాంటి మాట ఏంటంటే, ‘‘ఇది సాధారణంగా జరిగిన ఘటన కాదు.. పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్. ఎయిర్‌గన్ లాంటి దానితో దాడి చేసినట్లు అనుమానంగా వుంది. చేతితో విసిరి వుంటే ఇంత బలంగా తగలదు’’ అని. నాయనా సజ్జలా, పక్కా ప్లాన్ మర్డర్ అటెంప్ట్ అయితే ఎయిర్‌గన్‌తో గులకరాయి ఎందుకు విసురుతారు. మిషన్ గన్‌తో బుల్లెట్టే విసురుతారు. నీ సహచరుడు కొడాలి నాని కూసినట్టు గులకరాయితో చావడానికి జగన్ ఏ పిట్టో కాదు కదా. ఈ ఘటన విషయంలో మీ పార్టీవాళ్ళు, మీ పార్టీ మీడియా, మీ పార్టీ సోషల్ మీడియా పిశాచాలు చేస్తున్న విష ప్రచారాన్ని చూసి జనం నవ్వుకుంటున్నారు. నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్టు నీలాంటివాళ్ళు మీడియా ముందుకు వచ్చి ఇలా తలాతోకా లేని మాటలు మాట్లాడుతూ వున్నారు. మీరు మారరు.

గులకరాయి దాడి డ్రామా రక్తి కట్టలేదు!

జగన్ పై గులకరాయి దాడి హత్యాయత్నం సంఘటన ఉద్దేశపూర్వకంగా జగన్ కు ప్రజల సానుభూతి కలిగేలా చేయడానికి వ్యూహాత్మకంగా చేసిన ప్రయత్నమా అన్న విషయంలో ఇప్పటి వరకూ ఉన్న అనుమానాలు బలపడుతున్నాయి. బలపడటమే కాదు... దాడి  వైసీపీ డ్రామాయే అన్నది వాస్తవమేనన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. దాడి జరిగిన తీరు, జరిగిన పది నిముషాల వ్యవధిలోనే  వైసీపీ నేతలు జగన్ నుదిటిన గాయంతో  ఉన్న పోస్టర్లు పట్టుకుని రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడం చూస్తుంటే.. ఈ దాడి జరుగుతుందని వారికి చాలా ముందుగానే తెలుసా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.  తెలుగుదేశం అధికార ప్రతినిథి పఠాభి అయితే తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా ఈ దాడికి స్క్రిప్ట్ ఎప్పుడో రెడీ చేశారని ఆరోపించారు. జగన్ కు గాయం అయినా ఆయనకు బస్సులోనే ఫస్ట్ ఎయిడ్ చేయడాన్ని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ లో అంబులెన్స్ అందుబాటులో ఉన్నా ఎందుకు ఉపయోగించుకోలేదని ప్రశ్నించారు.  గులకరాయి దాడి జరిగిన వెంటనే జరిగిన సంఘటనలను గమనిస్తే ఎవరికైనా సరే  గత ఎన్నికలకు ముందు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో జగన్ పై జరిగిందని చెబుతున్న కోడి కత్తి దాడి గుర్తుకు రాకమానదు. ఎందుకంటే అప్పుడు కూడా దాడి విశాఖ విమానాశ్రయంలో జరిగింది. అక్కడ అవసరమైన ఆధునిక వైద్య సదుపాయాలన్నీ ఉంటాయి. కానీ కనీసం ఫస్ట్ ఎయిడ్ కూడా చేయించుకోకుండా అలా రక్తగాయంతో  విమానంలో హైదరాబాద్ కు వచ్చి ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు కాన్వాయ్ లో అంబులెన్స్ అందుబాటులో ఉన్నా జగన్ వైద్యుల సేవలు అవసరం లేదంటూ తాను యాత్ర చేస్తున్న బస్సులోనే గాయానికి ప్లాస్టర్ వేయించుకుని అందుకు సంబంధించిన విజువల్స్ ను బయటకు లీక్ చేశారు.  దీనిని బట్టి చూస్తుంటే తీవ్ర ప్రజా వ్యతిరేకతను తగ్గించుకుని, మరో సారి ఎన్నికల సమరంలో గెలవాలంటే ప్రజల సానుభూతి పొందడం వినా మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చేసిన జగన్ గత ఎన్నికలలో కలిసి  వచ్చిన దాడి డ్రామాను మరో సారి కొన్ని మార్పులు చేర్పులూ చేసి ప్రదర్శించారని అవగతమౌతోందని పఠాభి అంటున్నారు.  గత ఐదేళ్ల జగన్ పాలన ప్రజలలో ఆగ్రహం అవధులు దాటుతున్నదనడంలో సందేహం లేదని ఆయన అంటున్నారు. ఆ విషయం వైసీపీ అధినేత, సీఎం జగన్ సహా ఆయన పార్టీ నేతలూ, క్యాడర్ కు కూడా అర్ధమైపోయిందనీ అందుకే కనీసం సానుభూతితోనైనా గట్టెకుదామన్న దింపుడు కళ్లెం ఆశతో కోడికత్తి తరహా డ్రామాకు తెరలేపారని విమర్శించారు.    అయితే కోడికత్తి డ్రామా రక్తికట్టినట్లుగా గులకరాయి దాడి డ్రామా రక్తికట్టలేదు సరికదా.. జనంలో వ్యతిరేకత మరింత పెరిగేందుకు దోహదపడిందని పఠాభి అంటున్నారు. 

ఒక రాయి మూడు గాయాలు! అప్పుడు బాబాయి, ఇప్పుడు ఎవ‌రు?

ఒక రాయితో ఇద్ద‌రి కళ్లకు, ఒక‌రి కాలికి గాయం అయింది.  ‘ఒక రాయి జగన్‌రెడ్డి కంటి పైన తగిలి, పక్కనే ఉన్న ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు కంటి దగ్గర కూడా తగిలింది. అక్కడ నుంచి కిందకు వెళ్లి జగన్‌ కాలినీ గాయపర్చింది. సీఎం కార్యాలయం విడుదల చేసిన ఫొటోల్లో ఆయన కంటిపైన, కాలికి కూడా బ్యాండేజీలు కనిపిస్తున్నాయి. రాష్ట్రం మొత్తం ప్రజలు దీని గురించి చర్చిస్తున్నారు. జగన్‌పై దాడి జరిగిన ఐదు నిమిషా ల్లో వలంటీర్లు ఇంటింటికి తిరిగి జగన్‌పై హత్యాయత్నం జరిగిందని ప్రచారం చేశారు. సీఎం సతీమణి భారతి సాధారణంగా బయట కనిపించరు. కాని ఈ దాడి ఘటనకు కొద్ది గంటల ముందు తాడేపల్లి వద్ద రోడ్డు మీదకు వచ్చి బస్సు యాత్రలో ఉన్న జగన్‌కు చేయి ఊపారు. ఆ వెంటనే ఈ సంఘటన జరగడం... ఇదంతా ముందస్తు ప్రణాళిక అని అనుమానాలు కలగడానికి ఆస్కారం ఇస్తోందని ప్ర‌తిప‌క్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ డ్రామాలో జగన్‌ మీడియా తన వంతు పాత్ర పోషించింది. ఒక చిన్న రాయితో జగన్‌ పై ఏకంగా హత్యాయత్నం జరిగిందని పెద్ద శీర్షిక, ఫొటోలు పెట్టి వండి వార్చింది.  ప్రజల్లో సానుభూతి పుట్టించడం కోసం ఐ ప్యాక్‌ సహకారంతో తాడేపల్లి ప్యాలెస్‌ ఈ నాటకాన్ని రచించిందని ప్ర‌తిప‌క్షం విమ‌ర్శిస్తోంది. అప్పుడు కోడి క‌త్తి త‌రువాత బాబాయి హ‌త్య జ‌రిగింది. ఇప్పుడు గుల‌క‌రాయి దాడి త‌రువాత గొడ్డ‌లి వేటు మ‌రెవ‌రిపై ప‌డుతుందోన‌ని టీడీపీ నేత‌లు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. ‘వైఎస్‌ షర్మిల, వైఎస్‌ సునీత, వైఎస్‌ అవినాశ్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డికి ప్రమాదం పొంచి ఉంది. వారిపై దాడి చేయించి దానిని చంద్రబాబుపై నెట్టే అవకాశం ఉందని  టీడీపీ నేత‌లు చెబుతున్నారు.  సి.ఎం. జ‌గ‌న్‌పై జ‌రిగిన రాయి దాడికి బాధ్య‌త ఎవ‌రిది? ఇదే చ‌ర్చ ఏపీలో జ‌రుగుతోంది. ఎందుకంటే నిరంత‌ర నిఘా, ప్ర‌త్యేక బృందంతో భ‌ద్ర‌త‌… అయినా, సీఎం జ‌గ‌న్ పై  దాడి ఎలా జ‌రిగింది. రాష్ట్రంలో అత్యున్న‌త ప్రోటోకాల్ ఉండే సీఎం వ‌స్తున్నారంటే అన్ని విభాగాలు అల‌ర్ట్ గా ఉంటాయి. అలాంటిది సీఎం ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా విద్యుత్ లేక‌పోవ‌టం, దాడి జ‌రిగాక పోలీసులు దుండ‌గుల‌ను ప‌ట్టుకునేందుకు వేగంగా స్పందించ‌క‌పోవ‌టం ప‌లు అనుమానాల‌కు తావిస్తోంది. పైగా విద్యుత్ స‌ర‌ఫ‌రా లేని స‌మ‌యంలో చిమ్మ చీక‌ట్ల‌లో సీఎంను బ‌స్సుపైకి ఎలా అనుమ‌తిచ్చార‌ని సెక్యూరిటీ విభాగంలో అనుభ‌వం ఉన్న వారు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు. రాళ్ల దాడి జరిగిన వేళలో.. అక్కడ కరెంట్ లేకపోవటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రోడ్ షో చేస్తున్న వేళలో విద్యుత్ సరఫరాను ఎందుకు ఆపేశారు? అన్నది ప్రాథమిక ప్రశ్నగా మారింది. జగన్ భద్రతను పర్యవేక్షించే విభాగం.. ఈ రూట్ లో రోడ్ షో చేయటానికి ఎలా అనుమతించారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. రోడ్ షో రూట్ మ్యాప్ ను సిద్ధం చేసిన వైసీపీ నేతల అత్యుత్సాహమే దాడికి కారణంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సాధారణంగా వీవీఐపీలు వెళ్లే మార్గాన్ని పోలీసులు ముందుగానే పరిశీలిస్తారు. ఆ మాటకు వస్తే.. ముఖ్యమంత్రి ఎక్కడైనా పాల్గొంటున్నా.. రోడ్ షో చేస్తున్నా.. ముందు రోజునే ట్రయల్ రన్ నిర్వహిస్తారు. దానికి రెండు రోజుల ముందు అడ్వాన్స్ డ్ సెక్యూరిటీ లైజాన్ నిర్వహిస్తారు. అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదన్న తర్వాతే రూట్ మ్యాప్ ఖరారు చేస్తారు. ఒకవేళ ఏమైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే.. వాటిని సరి చేస్తుంటారు. తాజాగా దాడి జరిగిన ప్రాంతాన్నిపరిశీలిస్తే.. రోడ్ షో జరిగిన సింగ్ నగర్ డాబా కొట్ల రోడ్ లో 33 కేవీ లైన్లు న్నాయి. అలాంటి దారిలో రోడ్ చేసేటప్పుడు.. అది బస్సు మీద నిలబడి వెళ్లటం ప్రమాదకరం. దీంతో ముందస్తుచర్యల్లో భాగంగానే అక్కడ విద్యుత్ సరఫరాను నిలివేసినట్లుగా తెలుస్తోంది. చిమ్మచీకటిగా ఉన్న వేళ.. దుండగులు రాళ్ల దాడికి పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ఈ వాదన ఇలా ఉంటే.. వైసీపీ ఎమ్మెల్సీ రుహుల్లా ఆఫీసు ఘటనాస్థలానికి దగ్గర్లో ఉండటం.. ఆ ప్రాంతంలో ఆయనకు విపరీతమైన పట్టు ఉండడటంతో.. తన సత్తా చాటేందుకు వీలుగా 33 కేవీ లైన్ ఉన్నప్పటికీ రోడ్ షోను ఖరారు చేసినట్లుగా చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. భద్రతా పరమైన చర్యలకు భిన్నంగా చీకట్లో సీఎం చేత రోడ్ షో ఎలా చేయిస్తారని ప్రశ్నిస్తున్నారు. విద్యుత్ తీగలు ప్రమాదకరంగా ఉన్నాయన్న అంశం చర్చకు వచ్చినప్పుడు.. అసలు ఆ రూట్లోనే రోడ్ షో చేయకూడదని.. అందుకు రూట్ మ్యాప్ ను ఖరారు చేయకూడదన్నది నిపుణుల మాటగా చెబుతున్నారు. సీఎం భద్రత ప్రశ్నార్థకంగా ఉండేలా రూట్ మ్యాప్ ను నేతలు ఖరారు చేస్తే.. పోలీసు అధికారులు.. నిఘా వర్గాలు ఎందుకు అనుమతించాయన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఈ వైఫల్యానికి.. ఈ ఘటనకు ఏ విభాగం బాధ్యత వహిస్తుందన్నది ఇప్పుడు చర్చగా మారింది.

కవిత జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జ్యుడీషియల్‌ కస్టడీని ఈ నెల 23 వరకూ పొడిగించింది.   కవితకు గత నెల 26న కోర్టు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. ఆ గడువు ముగియడంతో ఈడీ అధికారులు సోమవారం (ఏప్రిల్ 15) ఆమెను కోర్టులో హాజరు పరిచారు. ఈ సందర్భంగా ఈడీ తరఫున అడ్వొకేట్‌ జోహెబ్‌ హుస్సేన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వాదనలు వినిపించారు. కవిత బయట ఉంటే కేసు దర్యాప్తు ప్రభావితమవుతుందని ఆయన పేర్కొన్నారు.  కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఆమె  కస్టడీని  పొడిగించాలని కోరారు. కవిత తరఫున అడ్వొకేట్‌ నితీశ్‌ రాణా వాదనలు వినిపించారు. కవిత జ్యుడీషియల్‌ కస్టడీని పొడిగించాలని కోరడానికి ఈడీ వద్ద కొత్త కారణాలేమీ లేవన్నారు. 2022 నుంచి కేసు దర్యాప్తు సాగుతున్నదని, అప్పటి నుంచి కవిత దర్యాప్తును ప్రభావితం చేసే వ్యక్తి అని ఈడీ ఆరోపిస్తూనే ఉందనీ అయితే  ఇప్పటి వరకు ఆమె దర్యాప్తును ప్రభావితం చేశారనడాకి ఎటువంటి ఆధారాలూ లేవన్నారు. ఇరు వైపుల వాదనా విన్న అనంతరం న్యాయమూర్తి జస్టిస్ కావేరి బవేజా  తీర్పును కొద్ది సేపు రిజర్వ్‌ చేసి అనంతరం కవిత జ్యుడీషియల్ కస్టడీని ఈ నెల 23 వరకూ పొడిగిస్తూ తీర్పు ఇచ్చారు.  

కవిత జైలు కెళ్లి సరిగ్గా  నెలరోజులు.. అయినా పరామర్శించని తండ్రి కెసీఆర్ 

ఒక్క నెల. కేవలం ఒక్క నెల ఆమె జీవితాన్ని పూర్తిగా మార్చేసింది.  తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు రాజభోగాలు అనుభవించిన మాజీ ముఖ్యమంత్రి కెసీఆర్ తనయ కవిత పూర్తిగా మారిపోయింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయి నేటికి సరిగ్గా నెల రోజులు. జైలులో ఉన్న ఆమెను సోదరుడు కేటీఆర్, ఆమె భర్త, తల్లి శోభ కలిసినా, తండ్రి కేసీఆర్ మాత్రం ఇప్పటి వరకు ఆమెను పరామర్శించకపోవడమే కాకుండా ఆ విషయాన్ని కూడా ఎక్కడా ప్రస్తావించకపోవడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.  కవితలో ఉన్న మునుపటి కాన్పిడెన్స్ కనిపించడం లేదు. పీక్కుపోయిన ముఖం, జైల్లో హెయిర్ డై వేసుకోకపోవడంతో నెరసిన జుట్టు కనిపిస్తోంది. మానసికంగా ఎంతో స్ట్రాంగ్ అయిన కవిత అరెస్ట్ అయినప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ నెల రోజుల తర్వాత సిబిఐ అధికారులు  కస్టడీలో ఉన్నప్పుడు మాత్రం బేలగా కనిపించారు.  తాను అధికారంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి హోదాలో కెసీఆర్ ఢిల్లీ పెద్దలను కలిసినప్పటికీ ఈ నెల రోజుల్లో ఏ ఒక్కరినీ కలవలేదు. పైగా అరెస్ట్ వ్యవహారాన్ని కుటుంబసభ్యులు తీహార్ జైలులో పలుమార్లు కలిసినప్పటికీ కెసీఆర్ ఇంతవరకు కలవకపోవడం గమనార్హం. కనీసం అరెస్ట్ వ్యవహారాన్ని ఖండించకపోవడం రాజకీయ ఎత్తుగడ అని పరిశీలకులు భావిస్తున్నారు.  లిక్కర్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవితను గత నెల 15న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. అంతకుముందు ఆమె ఇంట్లో సోదాలు నిర్వహించారు. అప్పటి నుంచి ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకుని విచారించారు. గత 20 రోజులుగా తీహార్ జైలులోనే ఉన్న కవితను ఇటీవల సీబీఐ అరెస్ట్ చేసి మూడు రోజులు విచారించింది. నేటితో ఆమె కస్టడీ ముగియనుండడంతో తిరిగి ఆమెను తీహార్ జైలుకు పంపనున్నారు.  ఉదయం 10 గంటలకు ఆమెను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టులో అధికారులు హాజరుపరుస్తారు. ఈ సందర్భంగా కస్టడీ పొడిగించాలని సీబీఐ కోరే అవకాశం ఉంది. ఒకవేళ సీబీఐ కనుక కస్టడీ పిటిషన్ వేయకుంటే కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేసే ఆలోచనలో ఉన్నట్టు సమాచారం.  

వైసీపీ ఎన్నికల వ్యూహం దౌర్జన్యమేనా?

గోప్యత ఏమీ లేదు.. అంతా బరితెగింపే. వైసీపీ దృష్టిలో ఎన్నికల రణం అంటే భౌతిక దాడులతో పై చేయి సాధించడమే!  ఈ యుద్ధంలో శాంతి భద్రతల గురించిన పట్టింపే ఉండదు. తమ అరాచకాలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే  పీఎస్ లపైనా దాడులే. ఏపీలో పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఆనవాలే కనిపించడం లేదని అనిపించక మానదు.  బందరులో మాజీ మంత్రి పేర్ని నాని, ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి, సత్తెనపల్లిలో అంబటి రాంబాబుల తీరు చూస్తే వైసీపీ మూడ్ ఏమిటన్నది ఇట్టే అవగతమైపోతుంది. మచిలీపట్నంలో వైసీపీ మూకలు పోలీస్ స్టేషన్ పై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇది స్వయంగా మాజీ మంత్రి పేర్ని నాని సమక్షంలో జరిగింది. దాడికి పాల్పడ్డ వారిపై కేసులు నమోదయ్యాయనుకోండి అది వేరే సంగతి.  ఇంత కాలం తమ అడుగులకు మడుగులొత్తిన పోలీసులు.. ఎన్నికల కోడ్ అమలులోకి రాగానే సిన్సియర్ గా డ్యూటీలు ఎలా చేస్తారు. అలా చేస్తే మేం ఎందుకు సహిస్తాం అంటున్నట్లు ఉంది మచిలీపట్నంలో పోలీసు స్టేషన్ పై జరిగిన దాడి. నిజమే నిన్నటి దాకా జీహుజూర్ అన్న వాళ్లు ఇవ్వాళ తలెగరేస్తే ఎలా? కాస్త చూసీ చూడనట్లు వదిలేయండి అని ఎదురు పోలీసులకే వారి పై అధికారుల నుంచి ఆదేశాలు వచ్చాయా అన్న అనుమానాలు విపక్షాలు వ్యక్తం చేస్తున్నాయి.  మొన్నటికి మొన్న ఒంగోలు ఎంపీ బాలినేని శ్రీనివాసరెడ్డి సమక్షంలోనే వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారు. ఆ దాడిలో గాయపడిన తెలుగుదేశం నాయకుడు మేడికొండ మోహనరావు, కార్యకర్తలు ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతుంటే బాలినేని తన కుమారుడు ప్రణీత్ రెడ్డి అనుచరులను వెంటపెట్టుకుని వెళ్లి మరీ ఆస్పత్రిలో బీభత్సం సృష్టించారు. బెదిరింపులకు పాల్పడ్డారు. దీనిపై తెలుగుదేశం తరఫున ఒంగోలు లోక్ సభ స్థానంలో పోటీ చేస్తున్న మాగుంట శ్రీనివాసులు రెడ్డి, తెలుగుదేశం ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి దామచర్ల జనార్ధన్ లు ఈ ఘటనపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కానీ ఆయన ఏ మాత్రం పట్టించుకోలేదు. అదే బాలినేని చేసిన ఫిర్యాదుపై తక్షణం స్పందించిన పోలీసులు తెలుగుదేశం నాయకులపై కేసులు నమోదు చేశారు. నిజంగానే ఏపీలో ఎన్నికల కోడ్ అమలౌతోందా అన్న అనుమానాలు కలగడానికి ఇటువంటి  ఘటనలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ రెండు సంఘటనలూ మచ్చుకు మాత్రమే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ అరాచకాలకు పోలీసులు కొమ్ము కాస్తూనే ఉన్నారు.  ఇక సత్తెన పల్లి వైసీపీ అభ్యర్థి అంబటిరాంబాబు  అక్రమంగా మద్యం బాటిళ్లు తరలిస్తున్న ఇద్దరు యువకులను విడిపించుకోవడానికి చేసిన హంగామా మరో ఎత్తుకు చేరింది. యువకులను వదిలేయడమే కాదు.. మద్యం బాటిళ్లను కూడా తిరిగి ఇచ్చేయాలంటూ ఆయన పట్టుబట్టారు. అందుకు అధికారులు నిరాకరించడంతో మళ్లీ అధికారంలోకి వచ్చేది మేమే. అప్పుడు మీ అంతు చూస్తామంటూ బహిరంగంగా బెదరింపులకు దిగారు.   ఈ సంఘటనలన్నీ బహిరంగంగా జనం చూస్తుండగా జరిగినవే. అయినా ఎన్నికల సంఘం దృష్టికి వెళ్ల లేదంటే నమ్మలేం. ఎన్నికల సంఘం వేగంగా స్పందించకుంటే ఆ వ్యవస్థపై జనంలో  అంతో ఇంతో ఇంకా ఉన్న నమ్మకం కూడా పోతుందని పరిశీలకులు అంటున్నారు. 

ఓసి నీ రేటు బంగారంగానూ!

ఏవమ్మా బంగారమ్మా... ఏంటి నీ వరస? రోజురోజుకీ రేటు  పెంచేసుకుని ఎక్కడికో వెళ్ళిపోతున్నావు. రెండో దశ కరోనా  సంక్షోభానికి ముందు నీ రేటు దగ్గర దగ్గరగా తులం 40 వేలు.  జస్ట్ మూడేళ్ళ గ్యాప్‌లో నీ రేటుని తులానికి 75 వేలకు  పెంచేసుకున్నావ్. గతంలో భారతీయులకు నగల మీద మోజు  ఎక్కువ కాబట్టి, వాళ్ళ వల్ల బంగారానికి డిమాండ్ క్రియేట్  అయ్యేది. తద్వారా రేటు పెరిగింది. ఈ మధ్యకాలంలో  భారతీయుల కొనుగోలు శక్తి ఏమంత పెరగలేదే? అయినా  నువ్వెందుకు ఈ రేంజ్‌లో పెరిగిపోతున్నావేంటా అని ఆలోచిస్తే  కొన్ని విషయాలు అర్థమవుతున్నాయి. అంతర్జాతీయంగా  బంగారానికి డిమాండ్ పెరగడం, బంగారం గనుల్లో సమ్మె  జరుగుతూ వుండటం వల్ల అవసరమైనంత బంగారం ఉత్పత్తి  జరగడం లేదు. దాంతో డిమాండ్ క్రియేటయింది. ఫలితం.. నీ  రేటు పెరిగిపోతోంది. అంతర్జాతీయంగా ఎప్పటికప్పుడు  మారుతున్న పరిణామాలు నీ ధరని భారీ స్థాయిలో  పెంచేస్తున్నాయి. తాజాగా పశ్చిమాసియాలో నెలకున్న  పరిస్థితులు కూడా నీ రేటు పెంచేశాయి. సిరియాలోని తమ   రాయబారి కార్యాలయంపై దాడికి ప్రతీకారంగా ఇజ్రాయిల్ మీద  ఇరాన్ ఏ క్షణంలో అయినా దాడి చేయొచ్చని వినిపిస్తున్న  వార్తల కారణంగా నువ్వు నెత్తికెక్కి కూర్చుంటున్నావ్. ప్రపంచ  వ్యాప్తంగా బ్యాంకులు కూడా తమ దగ్గర  డబ్బుని బంగారం  రూపంలో మార్చుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రపంచ  వ్యాప్తంగా వున్న పెద్దపెద్ద బ్యాంకులు కిలోలు రెండు కిలోలు  కాకుండా వేల కిలోల బంగారాన్ని కొనుగోలు చేస్తూ  వుండటంతో నీ రేటు కొండెక్కి కూర్చింది. ఒకవైపు నీ రేటు  పెరిగి, బడుగు జనం బంగారాన్ని కొనలేకపోతుంటే, నిన్ను  చూసి మరోవైపు నీ ఫ్రెండ్ వెండి రేటుని కూడా పెంచేస్తున్నారు.  మొన్నటి వరకు 75 వేల రూపాయలున్న వెండి కిలో ఇప్పుడు  88 వేల రూపాయలకు చేరుకుంది. మీరెప్పుడు దిగొస్తారో ఏంటో!

సోంత చెల్లెలే నమ్మడం లేదు.. జనం ఎలా నమ్ముతారు జగన్?

జగన్ పై జరిగిన గులకరాయి దాడి ఒక్క సారిగా యావత్ రాష్ట్రంలో సంచలన వార్త అయిపోయింది. ఎలాంటి శషబిషలూ లేకుండా ఈ దాడిని తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులకు ఆస్కారం ఉండకూడదని నిర్ద్వంద్వంగా చెప్పేశారు. సీఎంపైనే దాడి అంటే భద్రతా వైఫల్యం ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవాలని, భద్రతా వైఫల్యానికి కారకులైన పోలీసు అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో పరిస్థితులపై ఎన్నికల సంఘం వెంటనే జోక్యం చేసుకోవాలని కోరారు.  కానీ ఈ మొత్తం వ్యవహారంలో వైసీపీ తీరే అనుమానాస్పదంగా కనిపించింది. దాడి విషయంలో విపక్ష నేత చంద్రబాబు ప్రమేయం ఉందని చెప్పడానికి వైసీపీ తెగ తహతహలాడిపోతోంది. ఈ ఉత్సాహంలో జగన్ పై దాడి విషయంలో భద్రతా లోపం ఇసుమంతైనా లేదనీ, పోలీసులు వారి విధినిర్వహణలో బ్రహ్మాండంగా పని చేస్తున్నారని కితాబు కూడా ఇచ్చేసింది. స్వయంగా ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి మరీ  పోలీసులను వెనకేసుకు వచ్చారు. దీంతో ఈ దాడి జగన్ కోసం జగన్ చేత జగనే చేయించుకుని సింపతీ కోసం పాకులాడుతున్నారన్న అనుమానాలు అన్ని వర్గాల నుంచీ వ్యక్తం అయ్యాయి. పరిశీలకుల విశ్లేషణలు సైతం ఆ దిశగానే ఉన్నాయి.  ఇవన్నీ పక్కన పెడితే ఈ దాడి విషయంలో జగన్ స్వంత చెల్లెలు షర్మిల స్పందన చూస్తూ తన అన్నపై దాడి జరిగిందని ఆమె ఏ మాత్రం నమ్మడం లేదని స్పష్టమౌతున్నది. మాజీ ముఖ్యమంత్రి స్వంత జిల్లా చిత్తూరులో ఆమె ఆదివారం (ఏప్రిల్ 14) ప్రచారం నిర్వహించారు. ఆ ప్రచారంలో ఆమె జగన్ పై దాడి అంశాన్ని ఏ మాత్రం ప్రస్తావించలేదు. జగన్ ఐదేళ్ల పాలనా వైఫల్యాలపై విమర్శలు గుప్పించారు. ఆయన వాగ్దానాల వైఫల్యాలపై నిలదీశారు.   అంటే జగన్ జనం సానుభూతి పొందాలన్న ఉద్దేశంతోనే ఉద్దేశపూర్వకంగా తనపై తానే దాడి చేయించుకున్నారని షర్మిల భావిస్తున్నారా అన్న చర్చ మొదలైంది. ఈ సందర్భంగా నెటిజనులు మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమాను గుర్తు చేస్తున్నారు. ఆ సినిమాలో కూడా విజయం కోసం ప్రజల సానుభూతి పొందేందుకు రాజకీయ నాయకుడు తన మీద దాడికి తానే సుపారీ ఇచ్చుకుంటాడు. తూటా పేలాలి.. తనకు తగలాలి కానీ ప్రాణాపాయం ఉండకూడదు అని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఇప్పడుు గులకరాయి దాడితో జగన్ పై జరిగిన హత్యాయత్నం సంఘటన ఆ సినిమాను స్ఫురింప చేస్తోందని నెటిజనులు అంటున్నారు. 

సెల్ఫ్ అటాక్ వ్యూహం బూమరాంగ్..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐదేళ్ల పాలనలో చేసిందేమిటన్నది చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు. ఆయన సర్కార్ పట్ల ప్రజా వ్యతిరేకత పీక్స్ చేరింది. ఆయన మనమంతా సిద్ధం బస్సు యాత్రలలోనైతేనేమి, ఆయన పార్టీ అభ్యర్థుల ప్రచారం కోసం జనం వద్దకు వెళ్లిన సందర్భాలలో అయితేనేమి.. వస్తున్న ప్రజా స్పందన చూస్తే ఆ విషయం స్పష్టంగా అవగతమైపోతోంది. ప్రజలకు, పరిశీలకులకే కాదు.. స్వయంగా జగన్ కు ఆయన పార్టీ నేతలకూ కూడా విషయం విస్పష్టంగా బోధపడింది. దీంతో ఓటమి దెబ్బ నుంచి తప్పించుకోవాలంటే.. ప్రజలలో ఎమోషన్లు పెచ్చరిల్లేలా చేయడమొక్కటే మార్గమని నిర్ధారణకు వచ్చేశారు. గత ఎన్నికలలో జనంలో సెంటిమెంట్ ఎమోషన్ ను రగిల్చి విజయం సాధించిన అనుభవం ఎలాగూ ఉండనే ఉంది. మరో సారి దానిమీదే అధారపడి సెకండ్ చాన్స్ కొట్టేద్దామని వైసీపీ అధినేత పక్కా ప్రణాళిక రచించారు.  దీంతో గత ఎన్నికల ముందు సక్సెస్ అయిన కోడి కత్తి డ్రామానే మళ్లీ నమ్ముకున్నారు. ఈ సారి కోడికత్తికి బదులు గులకరాయి దాడి డ్రామాకు తెరతీశారు. జగన్ పై గులకరాయి దాడి, ఆ వెంటనే వైసీపీ సామాజిక మాధ్యమం వింగ్, ఆ పార్టీ నేతలు, చివరాఖరికి మెయిన్ స్ట్రీమ్ లోని కొన్ని ఆయన అనుకూల మీడియా సంస్థలు.. గులకరాయి దాడిని హత్యయత్నంగా అభివర్ణిస్తూ విస్తృత ప్రచారం చేసేశారు. ఆ పార్టీ నేతలు మైకుల ముందుకు, మీడియా ముందుకు వచ్చి దాడిని ఖండఖండాలుగా చీల్చి చెండాడేశారు. ఈ సారి కావలసినంత మైలేజి వచ్చేస్తుంది, మరో సారి అధికారం ఖాయమన్న భావనకు వచ్చేశారు. అయితే ఈ సారి ఆయన దాడి డ్రామా బూమరాంగ్ అయ్యే పరిస్థితి కనిపిస్తున్నది.  గతంలో  అంటే గత ఎన్నికలకు ముందు విశాఖ విమానాశ్రయంలో తన మీద జరిగిందని జనగ్ చెప్పుకున్న దాడి సమయంలో అధికారంలో ఉన్నది తెలుగుదేశం. అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు. దీంతో చంద్రబాబు అధికారంలో ఉండి, ఓటమి భయంతో తనపై హత్యయత్నం చేశారు అంటే జనం నమ్మారు. కానీ ఇప్పుడు జరిగిన గులకరాయి హత్యయత్నం సమయంలో అధికారంలో ఉన్నది స్వయంగా జగన్. ఆయనే ముఖ్యమంత్రి. అటువంటి జగన్ తన పై చంద్రబాబు గులకరాయితో హత్యయత్నం చేయించారని ఆరోపణలు చేస్తుంటే జనం నవ్వుకుంటున్నారు. ఆయనకు భద్రతగా నిలవాల్సిన సెక్యూరిటీ సిబ్బంది సరిగ్గా దాడి సమయానికే కింద కూర్చుండి పోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి రోడ్ షో నిర్వహిస్తున్న సమయంలో కరెంటు పోవడమేమిటని ప్రశ్నిస్తున్నారు. కరెంటు పోయింది సరే కనీసం ఫ్లడ్ లైట్లైనా ఎందుకు వేయలేదని నిలదీస్తున్నారు. అయినా చీకటి పడగానే బస్సులోకి వెళ్లిపోయే జగన్ దాడి జరిగిన రోజు మాత్రమే చీకటి పడినా, కరెంటు లేకపోయినా ఎందుకు బస్సుపైనే ఉండిపోయారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పరిశీలకులు సైతం దాడి జరిగిన తీరును  చూస్తుంటే ఇది స్వయంగా జగన్ కోసం జగన్ చేత జగనే చేయించుకున్నారనిపిస్తోందని విశ్లేషణలు చేస్తున్నారు. మొత్తం మీద ఈ సారి గులకరాయి  హత్యాయత్నం ఆరోపణల డ్రామా బూమరాంగ్ అయ్యిందన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తం అవుతోంది. ఈ దాడి జగన్ పై సానుభూతి కలగడానికి బదులు ఏవగింపు కలగడానికి దోహదపడేలా కనిపిస్తోందని విశ్లేషణలు చేస్తున్నారు.   చిలకలూరి పేట కూటమి సభ సందర్భంగా ప్రధాని పాల్గొన్న సభలో సైతం బట్టబయలైన భద్రతాలోపాలు, ఆ తరువాత పింఛన్ల పంపిణీ విషయంలో జగన్ పార్టీ ప్రదర్శించిన అత్యుత్సాహం, వాలంటీర్లను పింఛన్ల పంపిణీకి దూరంగా ఉంచాలన్న ఎన్నికల సంఘం నిర్ణయానికి తెలుగుదేశం ఒత్తిడే కారణం అంటూ చేసిన ప్రచారం అన్నిటినీ కలిపి చూస్తున్న జనం.. గెలవడం కోసం జగన్ ఎంతకైనా తెగించేస్తారన్న అభిప్రాయానికి వచ్చేశారు. అందుకే జగన్ పై గులకరాయి హత్యాయత్నానికి వ్యతిరేకంగా వైసీపీ పిలుపు మేరకు రాష్ట్రంలో జరిగిన ఆందోళనల్లో జనం భాగస్వామ్యం ఇసుమంతైనా కనిపించలేదు. జగన్ పార్టీ ఆస్థాన ఉపన్యాసకులు తమదైన భాషలో ప్రతిపక్ష పార్టీలు, నేతలపై చేసిన విమర్శలు వినా మరెవ్వరూ నోరెత్తలేదు.   అదే సమయంలో గతంలో  చంద్రబాబుపై రాళ్ల దాడి సందర్భంగా  గుడివాడ నాని అదే కొడాలి నాని, ఆర్కే రోజా, జోగిరమేష్, అంబటి రాంబాబు వంటి  ప్రత్యేక భాషలో ఆరితేరిన వైసీపీ నేతలు ఆ దాడి సింపతీ కోసం చంద్రబాబు చేయించుకున్న దాడిగా అభివర్ణిస్తూ చేసిన ప్రసంగాల క్లిప్పింగులను నెటిజన్లు సోషల్ మీడియాలో ఇప్పుడు తెగ వైరల్ చేస్తూ వైసీపీ డ్రామాపై తెగ సెటైర్లు గుప్పిస్తున్నారు.  అలాగే బందరు నాని అదే పేర్ని నాని కడపు మండితే ఇలాంటి దాడులే జరుగుతాయి. ప్రజలను మోసం చేస్తే వారు రాళ్లు విసరక ఏం చేస్తారు అని గతంలో బాబుపై దాడి సందర్భంగా చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు నెటిజన్లు గుర్తు చేస్తూ జగన్ పై నిజంగా దాడి జరిగి ఉంటే అది ప్రజాగ్రహమే కదా అని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా జగన్ పై దాడి జరిగిందని జనం ఇసుమంతైనా నమ్మడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.    తెలుగుదేశం నేతలు కోడికత్తి 2.0 వెర్షన్ అంటూ సెటైర్లు గుప్పిస్తున్నారు. ప్రజలను ఒక సారి మోసం చేయగలరు కానీ ప్రతిసారీ కాదని అంటున్నారు.   చిలకలూరి పేటలో  ప్రధాని పాల్గొన్న  కూటమి సభలో  తీవ్ర భద్రతా వైఫల్యాలపైనే కేంద్ర హోం శాఖ సీరియస్ గా ఉంది.  రాష్ట్రంలో డిజిపితో సహా 22 మంది పోలీస్ ఉన్నతాధికారులపై ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి కేంద్ర ఎన్నికల కమీషన్‌కు ఫిర్యాదు  చేశారు. దానిపై కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే దృష్టిపెట్టింది. ఇప్పుడు సీఎం జగన్ పై గులకరాయి దాడి జరిగింది. దీంతో కేంద్ర ఎన్నికల కమిషన్‌   రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వివరణ కోరింది. గులకరాయి దాడి ఘటనతొ  వైసీపీ తనంత తానే రోకటిలో తలపెట్టి వేటు కోసం ఎదురు చూసే పరిస్థితిలో పడిందని పరిశీలకులు అం టున్నారు. సానుభూతి ఓట్ల మాట అటుంచి ఎన్నికల సంఘం చర్యలకు రెడీ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ పై దాడి జరిగిందని అటు జనమూ నమ్మడం లేదు...ఇటు ఎన్నికల సంఘమూ చర్యలకు సమాయత్తమౌతుండటంతో జగన్ పార్టీకి రెండిందాలా నష్టమేజరిగిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.