రేవంత్ మంత్రివర్గ విస్తరణ.. ఓ అంతులేని కథ !

ఏప్రిల్ 3 తేదీ వచ్చింది. వెళ్ళింది. కానీ  ఆ రోజున  జరుగుతుందని అనుకున్న తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ జరగలేదు. ఎందుకన్నది ఎవరికీ తెలియదు. కానీ పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్  ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ అసలు మూడున ముహుర్తమని మీకు ఎవరు చెప్పారు  అంటూ మీడియానే ఎదురు ప్రశ్నించారు. ఉగాదికి మంత్రివర్గ విస్తరణ చేస్తామని తాము ఎక్కడా చెప్పలేదని అన్నారు. అంతే కాదు.. మంత్రివర్గ విస్తరణ ఏఐసీసీ పరిధిలో ఉన్న అంశం  సో ..అప్పడే కాదు, ఇప్పడు కూడా ఎప్పుడు ఉంటుందో చెప్పలేమన్న సత్యాన్ని చక్కగా తేల్చి చెప్పారు.  సో ... ఢిల్లీ ఎప్పుడు దయతలిస్తే అప్పుడే మంత్రవర్గ విస్తరణ ఉంటుంది. అంతవరకు  ఎవరు ఎన్ని ముహూర్తాలు పెట్టినా  అవి మురిగి పోతాయనే రీతిలో పీసీసీ చీఫ్ చక్కటి క్లారిటీ ఇచ్చారు.  అయితే  అదే సమయంలో మహేష్ కుమార్ గౌడ్  బీసీలకు మరో రెండు మంత్రిపదవులు ఇవ్వాలని సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కోరామని  అందుకు ఆ ఇద్దరు, ఓకే చెప్పారని చెప్పుకొచ్చారు. అంటే  ఇప్పడు మంత్రివర్గం విస్తరణ కథ మళ్ళీ మొదటికి వచ్చినట్లేనని పార్టీ నేతలు  పీసీసీ చీఫ్ చెప్పిన మాటలకు  భాష్యం చెపుతున్నారు. అవును  మళ్ళీ చర్చలు, సంప్రదింపులు, సమీకరణలు, లెక్కలు, కుడికలు, తీసివేతలు ఇలా చాలా తతంగం ఉంటుందనీ,  సో.. మంత్రి వర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదనే విషయం స్పష్టమైందని అంటున్నారు.   నిజానికి  మంత్రివర్గ విస్తరణ ఇప్పట్లో ఉండదని, ’తెలుగు వన్’ ఎప్పుడో చెప్పింది. ఇప్పడు అదే జరిగింది.ఇప్పటికే ఒకటి మూడు ముహూర్తాలు  మురిగి పోయాయి. ముందు మార్చి 29న అన్నారు. ఆ వెంటనే లేదు లేదు ఉగాది పండగ రోజు ( మార్చి 30) సాయంత్రం పక్కా అన్నారు. ఆ తర్వాత ఏప్రిల్ 3 ముహూర్తం ఫిక్స్  అన్నారు. ఉగాది పండగ రోజున ముఖ్యమంత్రి, గవర్నర్ ను కలిశారు. అది కూడా అందుకే అంటూ ప్రచారం జరిగింది. అయితే అదీ.. ఇదీ.. ఏదీ ముడి పడలేదు. ఇక ఇప్పడు, బంతి పూర్తిగా ఢిల్లీ పెద్దల కోర్టులో ఉందనే విషయంలో టోటల్ క్లారిటీ వచ్చింది. అఫ్కోర్స్  ఇప్పుడనే కాదు.. ఎప్పుడూ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ విస్తరణ  ఢిల్లీ పెద్దల ఇష్టం ప్రకామే జరుగుతుంది. నిజానికి  బీజేపీలో కూడా అంతే. అందుకే జాతీయ పార్టీలలో అదొక ఆచారంగా మారిన అపచారం అని పెద్దలు అంటారు. అయితే,ఇప్పడు తెలంగాణ విషయంలో జరుగుతున్నది అదేనా అంటే.. అదే అయినా  ఇంకా ఏదో ఉందనే అనుమానాలు కూడా గాంధీ భవన్  లో వినిపిస్తున్నాయని అంటున్నారు. అదలా ఉంటే ఇప్పడు కాంగ్రెస్ వర్గాల్లో మరో చర్చ మొదలైంది. మార్చి 24న  ముఖ్యమంత్రి రేవంత్ రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి  భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్  మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్  మీనాక్షి నటరాజన్ లనుఉన్నపళంగా ఢిల్లీకి రమ్మని ఎందుకు పిలిచినట్లు?  నిజంగా మంత్రివర్గ విస్తరణపై చర్చించేందుకే అయితే  అంత హడావిడి చేసి, ఇప్పడు ఇలా  కూల్ కూల్’గా సైలెంట్’ అయిపోవడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి అనే ప్రశ్నలు పార్టీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అధిష్టానం ఇంకెందుకో పిలిస్తే.. ఆ రహస్యం బయటకు చెప్పలేక చెప్పిన ‘విస్తరణకు పచ్చ జెండా’ కథ  బయటకు వచ్చిందా? అందుకే ఇప్పడు ఒక్క అబద్ధాన్ని కప్పిపుచ్చుకునేందుకు వంద అబద్దాలు ఆడవలసి వస్తోందా ? అందుకే  మంత్రి వర్గ విస్తరణ కథ ఇలా మలుపుల మీద మలుపులు తిరుగుతూ, డిమ్కీలు కొడుతూ ఒక ప్రహసనంగా మారిందా?  అన్న అనుమానాలు కూడా వ్యక్త మవుతున్నాయి.   అయితే  ఎవరిలో ఎన్ని అనుమానాలు ఉన్నా?  ఆసలు తెర వెనక ఏమి జరుగుతుందో ఎవరికీ తెలియక పోయినా, ఆశావహులు ఢిల్లీ వెళుతూనే ఉన్నారు. ఇప్పుడు కాకపోతే.. మరో పది రోజులకో, పక్షం రోజులకో  ఎప్పుడో అప్పుడు మంత్రివర్గ విస్తరణ ఉంటుందన్నఆశతో  ఢిల్లీ వెళుతూనే ఉన్నారు. పెద్దలను కలుస్తూనే ఉన్నారు. ‘ఒక్క ఛాన్స్’ కోసం బరువైన దరఖాస్తులు  సమర్పించుకుంటూనే ఉన్నారు. ఆ వార్తలు వస్తూనే ఉన్నాయి. అదొకటి అలా ఉంటే  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొందర పాటు నిర్ణయాలతో ప్రభుత్వ ప్రతిష్ట, పార్టీ ప్రతిష్ట రోజు రోజుకు దిగజారి పోతోందని ఢిల్లీ పెద్దలకు విన్నవించుకుంటున్న  పార్టీ సీనియర్ నాయకులు మరో మారు, ‘మార్పు’ ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. నిజానికి, ఇదేమీ ఇప్పడు కొత్తగా మొదలైన ప్రయత్నం కాదు. అయితే  హెచ్‌సీయూ భూబాగోతం వంటి  తాజా పరిణామాల నేపధ్యంలో  ఇందిరాగాంధీ, రాహుల్ గాంధీ పేర్లు కూడా బద్నాం అవుతున్న నేపధ్యంలో సీనియర్ నాయకులూ అటుగా ఫోకస్ పెట్టి  ప్రయత్నాల స్పీడ్ పెంచినట్లు తెలుస్తోంది.  అదెలా ఉన్నా మంత్రి వర్గ విస్తరణకు  సంబంధించి నంతవరకు  ఢిల్లీ గుప్పిట్లో దాగున్న నిజం ఏమిటో తెలిసే వరకు  ఇదొక  అంతులేని కథలా సాగుతూనే ఉంటుందని, అనుభవజ్ఞులైన పెద్దలు అంటున్నారు.

ఎస్‌బీఐకి తాళాలు!

ఖాతాదారులు ఏకంగా బ్యాంకుకే తాళాలు వేసిన సంఘటన ఇది. ఈ సంఘటన వరంగల్ జిల్లా రాయపర్తిలో జరిగింది. కొందరు ఖాతాదారులు రాయపర్తిలోని ఎస్బీఐకు తాళం వేసి బ్యాంకు కార్యకలాపాలను అడ్డుకున్నారు. ఈ బ్యాంకులో గత ఏడాది నవంబర్ 19న చోరీ జరిగింది. ఆ చోరీలో బ్యాంకులో 497 మంది ఖాతాదారులకు చెందిన 16 కేజీలకు పైగా బంగారాన్ని దుండగులు చోరీ చేశారు. అప్పటి నుంచీ తమ బంగారం తిరిగి ఇవ్వాలంటూ బాధితులు ఎంతగా మొరపెట్టుకున్నా బ్యాంకు అధికారులు పట్టించుకోకుండా వాయిదాల మీద వాయిదాలు వేస్తూ వస్తున్నారు. ఈ విషయంపై గతంలో పలుమార్లు బ్యాంకు కస్టమర్లు, బాధితులు బ్యాంకు ఎదుట ఆందోళన చేశారు. ఈ నేపథ్యంలోనే బ్యాంకు అధికారులు ఇటీవల శనివారం (ఏప్రిల్ 4) చెల్లింపులు చేపడతామని  హామీ ఇచ్చారు. దీంతో శనివారం (ఏప్రిల్ 4) ఉదయం బాధితులు బ్యాంకు వద్దకు వెళ్లారు. అయితే బ్యాంకు అధికారులు మరో వాయిదా వేస్తూ, సోమవారం రావాల్సిందిగా చెప్పారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన బాధితులు బ్యాంకుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. పోలీసులు, అధికారులు ఎంతగా చెప్పినా వినకుండా బ్యాంకు ఎదుటే ధర్నాకు దిగారు. తమ బంగారం తిరిగి ఇచ్చేంత వరకూ కదిలేది లేదంటూ బైఠాయించారు. 

చంద్రబాబుతోనే పోటీ అంటున్న లోకేష్

తండ్రితోనే తన పోటీ అంటున్నారు మంత్రి నారా లోకేష్. తన పోటీ ముఖ్యమంత్రి చంద్రబాబుతోనే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారాయన. మన ఇల్లు - మన లోకేష్ కార్యక్రమంలో భాగంగా నీరుకొండ గ్రామానికి చెందిన 99 మందికి రత్నాల చెరువుకు చెందిన 199 మందికి శాశ్వత ఇంటి పట్టాలను మంత్రి లోకేష్ పంపిణీ చేవారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... ప్రతీ విషయంలో చంద్రబాబుతో పోటీపడేందుకు ప్రయత్నిస్తానన్నారు. కుప్పం మెజార్టీ  కంటే ఒక్క ఓటైనా ఎక్కువ వస్తుందని చంద్రబాబుతో చేసిన ఛాలెంజ్ నిలబెట్టుకున్నానని చెప్పుకొచ్చారు.  మంగళగిరి ప్రజలకు ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని స్పష్టం చేశారు. మంగళగిరి ప్రజలను గుండెల్లో పెట్టుకుని పనిచేస్తానన్నారు. మంగళగిరిలో రానున్న రోజుల్లో కరెంట్ తీగలు కనిపించవనీ, భూగర్భ విద్యుత్‌తో పాటు, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ గ్యాస్ వ్యవస్థను తీసుకొస్తామన్నారు. స్వచ్ఛ భారత్‌లో మంగళగిరిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. తనకు ఎంత ఎక్కువ మెజార్టీ ఇస్తే అంత బలమొస్తుందని ఆనాడే చెప్పానని,  తాను ఎక్కడికి వెళ్లినా మంగళగిరి తన గుండెల్లో ఉంటుందని వెల్లడించారు. కుప్పంతో పాటు మంగళగిరిని కూడా తెలుగుదేశం కంచుకోటగా మారుస్తా అని చంద్రబాబుకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఓడిన చోటే గెలిచి చూపాలని మంగళగిరిపై ప్రత్యేక దృష్టి సారించి 26 సంక్షేమ కార్యక్రమాలు ప్రతిపక్షంలో ఉండగా అమలు చేశానని గుర్తుచేశారు.

 అఘోరీ చెర నుంచి బయటపడ్డ మంగళగిరి అమ్మాయి శ్రీవర్షిణి

వివాదాస్పద లేడీ అఘోరీ  చెర నుంచి మంగళగిరి అమ్మాయి శ్రీ వర్షిణి ని గుజరాత్ పోలీసులు విడిపించారు. గత నెలలో మంగళగిరిలో శ్రీ వర్షిణీ తల్లిదండ్రుల ఇంట్లో బస చేసిన  అఘోరీ మాయమాటలు చెప్పి  శ్రీ వర్షిణిని లోబరుచు కుంది. గత నెల రోజులుగా శ్రీవర్షిణి అఘోరీతో కలిసి ఉంటుంది. తమ కూతురుకి మాయమాటలు చెప్పి ఎత్తుకెళ్లిందని శ్రీవర్షిణి తల్లిదండ్రులు మంగళగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్దు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. తొలుత శ్రీవర్షిణి మేజర్ అని బుకాయించిన అఘోరీ  శుక్రవారం గుజరాత్ పోలీసులకు చుక్కలు చూపే ప్రయత్నం చేసింది. గుజరాత్ పోలీసులు తమ స్టైల్ లో మర్యాదలు చేయడంతో అఘోరీ లొంగిపోయింది. శ్రీవర్షిణి కుటుంబ సభ్యులు గుజరాత్ కు వెళ్లి ఆమెను విడిపించారు. 

నాగబాబు పర్యటనలో పిఠాపురం వర్మ అనుకూల నినాదాలు

ఎమ్మెల్సీగా  నాగబాబు తన తొలి అధికారిక పర్యటన పిఠాపురం నియోజకవర్గం నుంచే మొదలు పెట్టారు. జనసేన ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ఆయన మొట్టమొదటి సారిగా అధికారికంగా పిఠాపురం నియోజకకవర్గంలో శుక్రవారం (ఏప్రిల్ 4) పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నియోజకవర్గ పరిధిలోని గోల్లప్రోలులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, అన్న క్యాంటీన్ లను ప్రారంభించారు. ఇంత వరకూ బాగానే ఉంది. కానీ ఈ సందర్భంగా నియోజకవర్గంలో తెలుగుదశం, జనసేన ల మధ్య ఉన్న విభేదాలు ప్రస్ఫుటంగా బయటపడ్డాయి. నాగబాబు సమక్షంలో ఇరు పార్టీల కార్యకర్తలు పోటీపోటీగా నినాదాలు చేశారు. జనసేన శ్రేణులు జై జనసేన అంటూ నినాదాలు చేయగా తెలుగుదేశం వర్గీయుల నుంచి పెద్ద పెట్టున జై వర్మ అంటూ పిఠాపురం వర్మకు అనుకూలంగా నినాదాలు చేశారు. ఇటీవల జనసేన ఆవిర్భాత సభలో నాగబాబు వర్మకు సంబంధించి ఒకింత వ్యంగ్యంగా చేసిన వ్యాఖ్యలు తెలుగుదేశం శ్రేణులకు ఆగ్రహం కలిగించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నాగబాబు పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో పిఠాపురం వర్మ ఫొటో లేకపోవడంతో తెలుగుదేశం శ్రేణులు పిఠాపురం వర్మకు అనుకూలంగా  నాగబాబు సమక్షంలో నినాదాలు చేశారు. పైగా నాగబాబు నియోజకవర్గ పరిధిలో చేసిన ప్రారంభోత్సవాలకు వర్మకు ఆహ్వానం లేదని కూడా అంటున్నారు. మొత్తం మీద పిఠాపురంలో నాగబాబు తొలి సారిగా జరిపిన పర్యటన నియోజకవర్గంలో జనసేన, తెలుగుదేశం మధ్య విభేదాలను బయటపెట్టిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

   తెలంగాణ బిజెపిలో అంతర్యుద్దం... కిషన్ రెడ్డి పై రాజాసింగ్ ఫైర్ 

తెలంగాణ బిజెపిలో విభేధాలు ముదిరిపోతున్నాయి. హైద్రాబాద్ కు చెందిన ఏకైక బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్  కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు  కిషన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరామనవమి సందర్బంగా రాజాసింగ్ శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. ఈ యాత్రకు పోటీగా  బిజెపికి చెందిన గౌతంరావు ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఈ సమాచారం అందుకున్న రాజాసింగ్ పార్టీ  రాష్ట్ర అధిష్టానంపై విమర్శలు చేశారు.  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు రాజాసింగ్ పై ఉన్న సస్పెన్షన్ ఎత్తివేశారు. మహమ్మద్ ప్రవక్త మీద వ్యాఖ్యలు చేసి సస్పెండ్ కు గురయ్యారు.  గౌతంరావుకు  స్థానిక సంస్థల ఎంఎల్ సి ఎన్నికల్లో బిజెపి అభ్యర్థిగా  టికెట్  ఇవ్వనున్నట్లు ప్రకటించడంతో రాజాసింగ్ పార్టీ  రాష్ట్ర అధిష్టానంపై ఎక్కుపెట్టారు.  మేకప్ మెన్ లు, టేబుల్ తుడిచే వాళ్లకు టికెట్లు ఇస్తున్నట్లు  ఆరోపించారు. గత పార్ల మెంటు ఎన్నికల్లో హైద్రాబాద్ బిజెపి అభ్యర్థిగా మాధవిలత ప్రకటించగానే  రాజాసింగ్ తన అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి మగాళ్లే దొరకలేదా అని కామెంట్ చేశారు.   తాజాగా హైద్రాబాద్ స్థానిక సంస్థల బిజెపి అభ్యర్థిగా గౌతంరావు పేరు ప్రకటించారు. అంబర్ పేట నియోజకవర్గంలో గౌతంరావు, కిషన్ రెడ్డి ప్లెక్సీలు ఉండటంతో రాజాసింగ్ కు మింగుడు పడలేదు. శ్రీరామనవమి శోభాయాత్రకు పోటీగా గౌతంరావు మరో శోభాయాత్ర నిర్వహించడం వివాదానికి దారి తీసింది.  నేను నిర్వహిస్తున్న శోభాయాత్రను అడ్డుకోవడం మీ అయ్యతరం కూడా కాదని వ్యాఖ్యానించారు. 

వక్ఫ్ బిల్లుకు ఆమోదం.. దేశ రాజకీయాల్లో మలుపు ?

అనుకున్నదే జరిగింది. వక్ఫ్‌ సవరణ బిల్లు-2024ను, 24 గంటల తేడాతో  పార్లమెంట్ ఉభయ   సభలు ఆమోదించాయి. అర్థరాత్రి ఆమోదం పొందిన బిల్లుల జాబితాలో, వక్ఫ్‌ సవరణ బిల్లు-2024- (యూనిఫైడ్‌ వక్ఫ్‌ మేనేజ్‌మెంట్‌ ఎంపవర్‌మెంట్‌, ఎఫిషియన్సీ అండ్‌ డెవల్‌పమెంట్‌- యూఎంఈఈడీ-ఉమీద్‌) బిల్లు కూడా చేరింది. అవును. సుదీర్ఘ చర్చ అనంతరం బుధవారం (ఏప్రిల్ 2) అర్ధరాత్రి దాటాక లోక్‌సభ ఆమోదించిన వక్ఫ్ సవరణ బిల్లుకు, గురువారం (ఏప్రిల్3) అర్థరాత్రి దాటిన తర్వాత రాజ్యసభ ఆమోదం తెలిపింది. ఇక రాష్ట్రపతి ఆమోదం మాత్రమే మిగిలుంది. ఆ ఒక్క గడప దాటేస్తే.. బిల్లు చట్టమవుతుంది. ఆ తర్వాత  ఏమవుతుంది? ముఖ్యంగా దేశ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి. దేశ రాజకీయాలు ఏ మలుపు తిరుగుతాయి అనేది ఇప్పడు దేశం ముందున్న పెద్ద ప్రశ్నగా రాజకీయ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది.  ఇక విషయంలోకి వస్తే.. పార్లమెంట్ ఉభయ సభల్లో ఒక బిల్లు పై ఇంత సుదీర్ఘ చర్చ జరగడం ఇటీవలి కాలంలో ఇదే ప్రప్రథమం కావచ్చు. బిల్లుకు అనుకూలంగా అధికార ఎన్డీఎ కూటమి, వ్యతిరేకంగా విపక్ష, ఇండియా కూటమి గట్టిగా నిలబడ్డాయి. పటిష్ట వాదనలు వినిపించాయి. ఉభయ సభల్లోనూ అధికార, ప్రతిపక్ష పార్టీల ముఖ్యనాయకులు అందరూ, చర్చలో పాల్గొన్నారు. ఎవరి అభిప్రాయాలు వారు బలంగా వినిపించారు. అయితే ఇంత సుదీర్ఘంగా జరిగిన చర్చలో లోక్ సభలో సభా నాయకుడు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పెదవి విప్పలేదు. ప్రధానమంత్రి  మోదీ అయితే అసలు సభలోనే అడుగు పెట్ట లేదు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ  చర్చ ప్రారంభంలో కొంత సేపు సభలో ఉన్నారు. మధ్యలో వెళ్ళిపోయి  మళ్ళీ ఓటింగ్ సమయానికి వచ్చారు. అంతే కాదు  సభలో ఉన్న సమయంలోనూ రాహుల్ గాంధీ ముభావంగానే ఉన్నారు. ఎదుకనో ఏమో కానీ  ప్రధాన చర్చలో పాల్గొనలేదు. లోక్ సభలో   గొగొయ్ ప్రధాన ప్రసంగం చేశారు. చివరకు, అర్థరాత్రి దాటిన తర్వాత ఓటింగ్ సమయానికి వచ్చిన సమయంలోనూ అయన నైట్ డ్రెస్  లో మొక్కుబడిగా సభకు వచ్చారనీ. ఇది ఆయన నిరాసక్తతకు మరో నిదర్శనంగా కొందరు పేర్కొన్నారు. అలాగే  ఇటు చర్చ జరుగుతుంటే.. ఆయన అటు తిరిగి ఫోన్  చూసుకోవడం గురించి కూడా కొందరు ప్రస్తావించారు. చివరకు మీడియా బ్రీఫ్ లోనూ రాహుల్ గాంధీ కనిపించక పోవడం పట్ల కాంగ్రెస్ శ్రేణులు కూడా ఆశ్చర్యం వ్యక్త పరుస్తున్నాయి.  అయితే  ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ నిరాసక్తంగా ఉన్నా.. విపక్ష ఇండియా కూటమి ఐక్యంగా వుంది. ఏక తాటిపై నడిచింది. ఉభయ  సభల్లోనూ ఒక్క ఓటు బీర పోకుండా కాపాడుకుంది. ఆవిధంగా, బిల్లు పాస్  అయినా.. ఒక విధంగా విపక్ష ఇండియా కూటమి,  విజయం  సాధించింది. కూటమి మనుగడ పట్ల వ్యక్తమవుతున్న అనుమానాలను పటాపంచలు చేస్తూ, కూటమి ఎంపీలు, ముక్త కంఠంతో హమ్ ఏక్’ హై అని  నినదించారు.  నిరూపించారు.  నిజం, నిజంగా, ఇదొక అనూహ్య పరిణామం. లోక్ సభ ఎన్నికల తర్వాత జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బయట పడిన విభేదాల నేపధ్యంలో ఇండియా కూటమి ఉన్నట్లా లేనట్లా అన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్న సమయంలో ఇండియా కూటమి ఏక తాటిపైకి రావడం సామాన్య విషయం కాదు. నిజానికి ఇటీవల కాలంలో ఇండియా కూటమిలో విభేదాలు తార స్థాయికి చేరిన విషయం కాదన లేనిది. చివరకు కొందరు కూటమి భాగస్వామ్య పక్షాల నాయకులు కూడా  లోక్ సభ ఎన్నికలతోనే ఇండియా కూటమి  కథ ముగిసిందనే అభిప్రాయం వ్యక్త పరిచారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జయరాం రమేష్, నేషనల్ కాన్ఫరెన్స్ నేత, జమ్మూ- కశ్మీర్ ముఖ్యమంత్రి, ఒమర్ అబ్దుల్లా ,సిపిఎం నేత ప్రకాష్ కరత్, ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్  ఇండియా కూటమి  మనుగడ పై అనుమనాలు వ్యక్త పరిచారు.  తృణమూల్ కాంగ్రెస్ అధినాయకురాలు, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ సహా, కొందరు ముఖ్య నాయకులు, కాంగ్రెస్ పార్టీ కూటమి నాయకత్వం నుంచి తప్పుకోవాలని డిమాండ్ లాంటి సూచన చేశారు. అంతే కాదు  కొందరు  కూటమి నాయకులు,మీడియా విశ్లేషకులు, ఇండియా కూటమికి  శ్రద్ధాంజలి  ఘటించారు. అలా మనుగడ కోల్పోయిందని కొందరు,  అసలు  పోనే పోయిందని,ఇంకొందరు అనుకున్న ఇండియా కూటమికి వక్ఫ్ సవరణ బిల్లు సంజీవనిలా ప్రాణం పోసిందని పరిశీలకులు భావిస్తున్నారు. అయితే  ఈ ఐక్యత ఇలాగే, నిలుస్తుందా? నిలబడుతుందా? పార్లమెంట్  లోపలి సఖ్యత  వెలుపలా కొనసాగుతుందా? ముఖ్యంగా ఎన్నికల రణ క్షేత్రంలో ఎన్డీఎని ఎదురొడ్డి ఐక్యంగా నిలబడుతుందా? అంటే, మాత్రం అనుమానమే అంటున్నారు. అయినా, ప్రస్తుతానికి  అది అనవసర చర్చగానూ పరిశీలకులు భావిస్తున్నారు. అదొకటి అయితే.. బిల్లుపై చర్చ సందర్భంగా వ్యక్తమైన అభిప్రాయలు, వినవచ్చిన వాస్తవాలు ఆశ్చర్యం గొలిపే విధంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  నమ్మసక్యం కాకుండా ఉన్నాయని అంటున్నారు. ముఖ్యంగా, పార్లమెంట్ భవనంతో సహా, ఢిల్లీ లోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల సముదాయం (సీజీవో)  సైతం ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ క్లెయిమ్ చేసిందని, స్వయంగా మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు రికార్డుల అదారంగా చెప్పిన విషయం,ఆశ్చర్య పరిచే విధంగా ఉందని అంటున్నారు. అంతే కాదు.. వక్ఫ్ పేరిట జరుగతున్న దురాక్రమణలు, దుర్వినియోగం గురించి సభ్యులు చేసిన ఆరోపణ లలోని నిజానిజాలు బయట పడాలంటే,అందుకుమరి కొంత సమయం పడుతుందిని అంటు న్నారు.అందుకే, చట్ట రూపం దాలుస్తున్న  వక్ఫ్ సవరణ బిల్లు దేశ రాజకీయాలలో  ఒక మలు పుకు దారి తీసినా ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.

తెలంగాణ రాజకీయాలు.. ఓవర్ టూ ఢిల్లీ !

తెలంగాణ రాజకీయాలు ఇప్పడు ఢిల్లీ చేరుకున్నాయా?  జంతర్ - మంతర్ నుంచి పార్లమెంట్ వరకు తెలంగాణ రాజకీయాలకు వేదికగా మారుతున్నాయా? అంటే  మంగళవారం (ఏప్రిల్ 1)  దేశ రాజధాని ఢిల్లీ వేదికగా చోటు చేసుకున్న విభిన్న పరిణామాలు అవుననే సమాధానం ఇస్తున్నాయి. అవును రాష్ట్రంలో రాజకీయ వేడిని పుట్టిస్తున్న బీసీ రిజర్వేషన్, హెచ్‌సీయూ భూమల విక్రయం, ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు, మంత్రివర్గ విస్తరణకి సంబందించిన అనేక కీలక అంశాలు బుధవారం ( ఏప్రిల్ 2)  ఢిల్లీలో సందడి చేశాయి.  ఓ వంక లోక్ సభలో అత్యంత కీలకమైన, అంతకు మించి అత్యంత వివాదస్పదమైన వక్ఫ్ సవరణ బిల్లు పై వాడివేడి చర్చ జరుగతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  జంతర్ మంతర్ నుంచి ‘మోదీ దిగిరావాలని’ డిమాండ్ చేశారు. లేదంటే దేశ వ్యాప్తంగా ఆందోళనలు చేస్తాం, దేశాన్ని జాగృతం చేస్తాం, బీజేపీని బూడిద చేస్తాం అంటూ గర్జించారు. హెచ్చరించారు. అయితే  రేవంత్ రెడ్డి గర్జించింది వక్ఫ్ సవరణ బిల్లు విషయంగా కాదు.  విద్య, ఉద్యోగాలతోపాటు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లులను 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరుతూ బుధవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద నిర్వహించిన  బీసీ పోరుగర్జన సభలో రేవంత్‌ రెడ్డి ఈ గర్జన చేశారు. రేవంత్ రెడ్డి గర్జనకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి కిషన్ రెడ్డి, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాజ్యసభ రాజ్యసభ సభ్యుడు, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు  లక్ష్మణ్  అంతే గట్టిగా కౌంటర్ ఇచ్చారు.  మీ మంత్రి వర్గంలో 46 శాతం బీసీలు ఉన్నారా?  అంటూ  కిషన్ రెడ్డి ప్రశ్నించారు. అంతే  కాదు  బీసీలకు 42 రిజర్వేషన్ కల్పిస్తామని బిల్లు చేసి మరీ అసెంబ్లీకి ఇచ్చిన హామీ నుంచి తప్పించుకునేందుకే ముఖ్యమత్రి రేవంత్ రెడ్డి బీసీ సంఘాల ముసుగులో ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాకు దిగారని కిషన్ రెడ్డి  కౌంటర్ ఆరోపణ చేశారు. రేవంత్ రెడ్డి గర్జన, కిషన్ రెడ్డి కౌంటర్ స్పందన.. ఇతర పరస్పర ఆరోపణల పర్యవసానాలు, ఫలితాలు ఎలా ఉంటాయి అనేది పక్కన పెడితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జంతర్ మంతర్  వద్ద గర్జన చేస్తున్న సమయంలోనే లేదంటే కొంచెం అటూ ఇటుగా రాజ్యసభలో  హెచ్‌సీయూ భూమల అమ్మకం వ్యవహారం రాజ్యసభలో ప్రకంపనలు సృష్టించింది. బీఆర్ఎస్ పక్ష నేత కేఆర్ సురేష్ రెడ్డి  రాష్ట్రంలో  రోజు రోజుకు రాజకీయ వేడిని పెంచుతున్న హెచ్‌సీయూ భూమల విక్రయం  అంశాన్ని సభలో ప్రస్తావించారు. రాజ్యసభ జీరో అవర్లో ఈ అంశాన్ని ప్రస్తావించిన సురేష్ రెడ్డి, అరుదైన పశుపక్షాదులకు ఆవాసంగా ఉన్న కంచ గచ్చిబౌలి  లోని 400 ఎకరాల భూమి విక్రయానికి వ్యతిరేకంగా విద్యార్ధులు చేస్తున్న ఆందోళనలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రభుత్వం  అమానుషంగా, అత్యంత క్రూరంగా అణచి వేస్తోందని ఆరోపించారు. అలాగే  బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న భూముల విక్రయ నిర్ణయం వలన విద్యార్ధుల భవిష్యత్ దెబ్బతినడమే కాకుండా, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తుందని అన్నారు. అంతకు ముందు బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేల బృందం కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను కలిసి వినతి పత్రం సమర్పించింది.  మరో వంక  ఇదే అంశంపై ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ వద్ద బీజేపీ ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ తో పాటుగా గోడం నగేష్‌, రఘునందన్‌రావు, డీకే అరుణ, కొండా,బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్‌ హెచ్‌సీయూ భూములను అమ్మితే సహించేంది లేదని, తెలంగాణ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హెచ్‌సీయూ భూమల వేలాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు.  అలాగే కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి,బండి సంజయ్ నాయకత్వంలో బీజేపీ ఎంపీలు కేంద్ర అటవీ,పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ను కలిసి, యూనివర్సిటీ భూములు విక్రయిస్తే పర్యావరణ పరంగా ఎదురయ్యే అనర్ధాలను వివరించారు. అటవీ, వన్య ప్రాణి సంరక్షణ చట్టం కింద చర్యలు తీసుకోవాలని కేంద్ర మంత్రిని కోరారు.ఈ మేరకు వినతి పత్రం సమర్పించారు. బీజేపే ఎంపీల విజ్ఞప్తి మేరకు  కేంద్ర అటవీ సంరక్షణ శాఖ, వివాదాస్పద కంచ గచ్చిబౌలి భులకు సమబందించిన సమగ్ర నివేదికని తక్షణం పంపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. ఇలా రాష్ట్ర రాజకీయాలు బుధవారం (ఏప్రిల్ 2) ఢిల్లీలో వేడిని పుట్టించాయి.  నిజానికి ఇవన్నీ ఒకెత్తు అయితే.. తెలంగాణ రాజకీయం ఢిల్లీలో వీరంగం వేస్తున్న సమయంలోనే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెత్తిన దేశ సర్వోన్నత న్యాయస్థానం అక్షింతలు వేసింది. పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకున్న సుప్రీం కోర్టు, మళ్ళీ మరోమారు అలాంటి వ్యాఖ్యలు చేయవద్దని గట్టిగా హెచ్చరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పై స్పీకర్ నాలుగేళ్లు చర్యలు తీసుకోకున్నా సుప్రీం కోర్టు చేతులు కట్టుకుని కుర్చోవాలా  అని ఘాటుగా వ్యాఖ్యానించింది.  గత ప్రభుత్వ హయాంలో పార్టీ ఫిరాయించిన వారి విషయంలో ఏమి జరిగిందో, ఇప్పుడూ అదే జరుగుతుంది, అనర్హత వేటు పడదు, ఉప ఎన్నికలు రావు అంటూ  ముఖ్యమంత్రి రెంత్ రెడ్డి, రాష్ట శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో, చేసిన వ్యాఖ్యలను సుప్రీం  కోర్టు తప్పు పట్టింది. నిండు సభలో ముఖ్యమంత్రి ఆ వ్యాఖ్యలు చేసింది నిజమే అయితే..  రాజ్యాంగంలోని 10వ షెడ్యూలును అపహాస్యం చేయడం కిందికే వస్తుందని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. బీఆర్‌ఎస్‌ నుంచి అధికార అధికార కాంగ్రెస్ లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ దాఖలైన మూడు వేర్వేరు పిటిషన్లపై బుధవారం సుప్రీం ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా  బీఆర్‌ఎస్‌ నేత పాడి కౌశిక్‌రెడ్డి తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ అడ్వొకేట్‌ ఆర్యామ సుందరం.. మార్చి 26న అసెంబ్లీలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఫిరాయింపుల  వ్యవహారం కూడా ఢిల్లీ ఖాతాలో  చేరింది.  ఇలా ఒక దానివెంట ఒకటి,  రాష్ట్ర రాజకీయాలు,  యాధృచ్ఛికమే అయినా ప్రస్తుతానికి ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నాయి. అయితే  ఢిల్లీ సీన్ ఢిల్లీలో సాగుతుంటే రాష్ట్రంలోనూ రాజకీయ ఉష్ణోగ్రతలు ఎండలతో పోటీ పడి పరుగులు తీస్తున్నాయి. 

బంగ్లాదేశ్ ప్రధాని యూనస్ తో ప్రధాని మోడీ భేటీ

 బంగ్లాదేశ్ చైనా, పాక్ లకు మద్దత్తు నిస్తున్న నేపథ్యంలో  భారత ప్రధాని మోడీ   బ్యాంకాక్ లో బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రధాని యూనస్ తో సమావేశం కావడం ఆసక్తికరంగా మారింది. యూనస్ బంగ్లాదేశ్ ప్రధానిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగిన  ఈ భేటీకి ప్రాధాన్యత చోటు చేసుకుంది.  బ్యాంకాక్ లో బిమ్ స్టెక్ సుమ్మిట్ సందర్బంగా మోదీకి ఆహ్వానం అందింది. ఇదే సుమ్మిట్ కు బంగ్లా ప్రధాని యూనస్ హాజరయ్యారు. చైనా, పాకిస్తాన్ లకు అనుకూలంగా యూనస్ వ్యాఖ్యానాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ లోని ఈశాన్య రాష్ట్రాలకు సముద్రతీర ప్రాంతం లేదని, తమ దేశంలో బంగాళాఖాతం తీర ప్రాంతం ఉండటంతో వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపర్చుకోవచ్చని ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో ఇరు దేశాల మధ్య గ్యాప్ ఏర్పడింది. యూనస్ ప్రకటనపై అస్సాం సిఎం హిమంత బిశ్వ శర్మ మండిపడ్డారు. ఈశాన్య రాష్ట్రాలు చికెన్ నెక్ కారిడార్ ద్వారా కనెక్ట్ అయ్యాయన్నారు. యూనస్ ప్రకటనను అంత తేలికగా తీసుకోకూడదన్నారు. 

కసిరెడ్డి సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందే.. స్పష్టం చేసిన ఏపీ హైకోర్టు

ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం వ్యవహారంలో కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు షాక్ ఇచ్చింది. మద్యం కుంభకోణం కేసులో సీఐడీ తనకు నోటీసులు జారీ చేయడాన్ని సవాల్ చేస్తూ, తనపై కేసులను కొట్టివేయాలంటూ ఆయన దాఖలు చేసిన రిట్ పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు ఆయన సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందేనని స్పష్టం చేసింది.  జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో భారీ మద్యం కుంభకోణం జరిగిందని సాక్షాత్తూ వైసీపీలో నంబర్ 2గా ఓ వెలుగు వెలిగిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డే అన్నారు. అంతే కాదు ఆ కుంభకోణంలో కర్త, కర్మ, క్రియ అంతా కసిరెడ్డి రాజశేఖరరెడ్డే అని కుండబద్దలు కొట్టారు. వైసీపీ నుంచి రాజీనామా చేసి, రాజకీయ సన్యాసం తీసుకున్న తరువాత కాకినాడ పోర్టు భూముల వ్యవహారంలో విచారణకు హాజరైన సందర్భంగా విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు. ఇప్పుడు ఆయన మాటలు అక్షర సత్యాలేననడానికి తాజాగా ఆయన సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందే నంటూ హైకోర్టు విస్పష్టంగా చెప్పడాన్ని ఉదాహరణగా చూపుతున్నారు పరిశీలకులు.   ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్‌ రెడ్డి  తనకు విచారణకు హాజరు కావాల్సింది పేర్కొంటూ సీఐడీ  ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ కసిరెడ్డి రాజశేఖరరెడ్డి ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఆయన పిటిషన్ ను విచారించిన హైకోర్టు కసిరెడ్డి సీఐడీ విచారణకు హాజరు కావాల్సిందేనని విస్పష్టంగా పేర్కొంది.   కసిరెడ్డి రాజశేఖరరెడ్డి క్వాష్ పిటిషన్ పై శుక్రవారంపిటిషన్‌పై విచారణ చేపటిన హైకోర్టు ధర్మాసనం  సీఐడీ   నోటీసులపై తాము ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది.  తదుపరి నోటీసు జారీ చేసి విచారణకు పిలిచే ముందు పటిషనర్‌కు కొంచం సమయం ఇవ్వాలని సీఐడీ అధికారులను కోర్టు ఆదేశించింది. 

ఏపీలో ఇక నుంచి వాట్సాప్ ద్వారానే టెన్త్, ఇంటర్ ఫలితాలు

దేశంలోనే తొలి సారిగా వాట్సాప్ గవర్నెన్స్ ను ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాని ద్వారా అందించే సేవలను పెంచుతూ మరింత ప్రతిభామంతంగా తీర్చిదిద్దుతున్నది. ఈ ఏడాది జనవరి 30న ఏపీలో మన మిత్ర పేరుతో వాట్సాప్ గవర్నెన్స్ ను రాష్ట్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిన సంగతి విదితమే. తొలి దశలో ఈ వాట్సాప్ గర్నెన్స్ ద్వారా 161 సేవలను అందుబాటులోకి తీసుకు వచ్చిన ప్రభుత్వం ఆ తవర్వాత వాటిని 200కు పెంచింది. జనం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా వాట్సాప్ గవర్నెన్స్ దోహదపడుతోంది. వాట్సాప్ గవర్నెన్స్ కు ప్రజల నుంచి బ్రహ్మాండమైన స్పందన లభిస్తున్నది. ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడిక ఈ ఏడాది నుంచి టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలను కూడా విద్యార్థులకు వాట్సాప్ ద్వారా అందజేయడానికి సర్వం సిద్ధం చేసింది. ఈ ఏడాది నుంచి టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలను వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా నేరుగా విద్యార్థుల మెబైల్ నంబర్లకే అందజేయనుంది. ఈ విషయాన్ని ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ స్వయంగా వెల్లడించారు.  గతంలో హాల్ టికెట్లను ఎలా అయితే మొబైల్ నంబర్లకు పంపించారో అలాగే ఈ సారి విద్యార్థులకు టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలను కూడా పంపిస్తారు. ఇందు కోసం ఏపీ విద్యార్థులు 9552300009 నంబర్ కు వాట్సాప్ మెసేజ్ పంపితే చాలు. వారి పరీక్షా ఫలితాలు వారి మొబైల్ కు వచ్చేస్తాయి.  

ఎయిడ్స్ నియంత్రణలో ఎపి మెరుగు 

ఎయిడ్స్ నియంత్రణలో గతేడాది 17 వ స్థానంలో ఉన్న ఎపి ఈ యేడు ఏడో స్థానానికి ఎగబాకింది.  జాతీయ ఎయిడ్స్ నియంత్రణా సంస్థ ( న్యాకో)  వివిధ రాష్ట్రాల సూచిక విడుదల చేసింది. ఎయిడ్స్ నియంత్రణలో ఎపి కనబరిచిన కృషిని న్యాకో కొనియాడింది. 2004 నుంచి ఎపిలో 2,25,000 మంది ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నట్టు న్యాకో గుర్తించింది. ఈ వ్యాధి నిర్మూలనకు రూ 127 కోట్లు ఖర్చు చేసింది. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందడానికి గల కారణాలను ప్రచారం చేయడంలో ఎపి మెరుగైన కృషి చేసింది.  సెక్స్ వర్కర్లను గుర్తించడంతో బాటు వారికి అవగాహన కల్పించడం వల్ల వ్యాధి వ్యాప్తి చెందలేదు. 100 హైరిస్క్ గ్రామాలను గుర్తించి  96 శాతం మందికి స్క్రీనింగ్ చేసి చికిత్స చేపట్టినట్టు న్యాకో పేర్కొంది. అధికారులు చేసిన కృషికి వైద్య ఆరోగ్యమంత్రి సత్యకుమార్ అభినందించారు. 

బావిలో విషవాయువులు.. మధ్య ప్రదేశ్ లో ఎనిమిది మంది మృతి

పూడిక తీయడానికి బావిలోకి దిగి అందులోని విషవాయువుల కారణంగా ఎనిమిది మంది మరణించిన సంఘటన మధ్య ప్రదేశ్ లో జరిగింది. మధ్యప్రదేశ్ లోని కొండావత్ గ్రామంలోని పురాతన బావిలో బురద పేరుకుపోవడంతో దానిని శుభ్రం చేయాలని జిల్లాయంత్రాంగం భావించింది. ఈ బావి దాదాపు 150 సంవత్సరాల పురాతనమైనది. అది ఇప్పుడు వాడుకలో లేదు. అయితే గంగౌర్ పండుగ నేపథ్యంలో విగ్రహ నిమజ్జనానికి ఆ బావిని వినియోగించాలని భావించిన గ్రామస్తులు ఆ బావిని శుభ్రపరచాలని నిర్ణయించారు. ఆ నిర్ణయం మేరకు గురువారం బావి శుభ్రం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ముందుగా ఓ ఐదుగురు బావిలోకి దిగారు. అందులోని విషవాయువులు పీల్చి స్ఫృహ కోల్పోయారు. వారిని రక్షించేందుకు మరో ముగ్గురు బావిలోకి దిగారు. వారు కూడా విషవాయువుల కారణంగా స్ఫృహ కోల్పోయి బావిలోని బురదలో కూరుకుపోయారు. ఈ ఘటనలో మొత్తం ఎనిమిది మందీ మరణించారు.   సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకుని దాదాపు నాలుగు గంటల పాటు శ్రమించి బావిలో నుంచి మృతదేహాలను బయటకు తీశారు. మృతుల కుటుంబాలకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం  నాలుగు లక్షల రూపాయల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. బావి పూడిక తీత కార్యక్రమంలో ఎనిమిది మంది మరణించిన సంఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. అలాగే ఆ పురాతన బావిని వెంటనే మూసివేయాలని ఆదేశించారు. 

మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు తిరస్కరణ.. వైసీపీ పునాదులు కదులుతున్నట్లేనా?

కర్మ అనేది గోడకు కొట్టిన బంతి లాంటిది. ఎంత గట్టిగా కొడితే తిరిగి అంతే గట్టిగా మన వైపు వస్తుంది. బంతి దెబ్బ నుండి తప్పించుకోవచ్చునేమో కానీ కర్మ దెబ్బ నుండి మాత్రం ఎవరూ తప్పించుకోలేరు. వైసీపీ హయాంలో ఇష్టారీతిగా వ్యవహరించిన ఆ పార్టీ నతలు కర్మఫలం అనుభవించడానికి రెడీ కావలసిన పరిస్థితి ఏర్పడింది.  ఐదేళ్ల జగన్ పాలనలో వైసీపీ నేతలు ఇష్టారీతిగా వ్యవహరించారు. అధికార మదంతో అక్రమర్జనకు పాల్పడ్డారు. ఆ పార్టీ అధినేత జ‌గ‌న్ ద‌గ్గ‌ర నుంచి కింది స్థాయి కార్య‌క‌ర్త‌ల వ‌ర‌కు   ఏం చేసినా చెల్లుబాటు అవుతుంద‌న్న ధీమ‌తో హ‌ద్దులు మీరి ప్ర‌వ‌ర్తించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌ను ఇబ్బందుల‌కు గురిచేశారు. సామాన్య ప్ర‌జ‌ల‌ను వదలకుండా వేధింపులకు పాల్పడ్డారు. అప్పటి విపక్ష నేతలపైనా, వారి కుటుంబ సభ్యులపైనా అనుచిత వ్యాఖ్యలతో రెచ్చి పోయారు. అక్రమ కేసులు బనాయించి జైళ్లకు సైతం పంపించారు. ఆ పాపాలన్నిటికీ ఇప్పుడు ఫలితం అనుభవించాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. జగన్ ఐదేళ్ల  అరాచకపాలనకు విసిగిపోయిన ఆంధ్రప్రదేశ్ ప్రజలను గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఓటు ద్వారా గట్టి గుణపాఠం చెప్పారు. కనీసం విపక్ష హోదాకు కూడా వైసీపీకి అర్హత లేదంటూ వారిని రాష్ట్రంలో కేవలం 11 నియోజకవర్గాలకే పరిమితం చేశారు. తెలుగుదేశం కూటమికి ఘన విజయాన్ని కట్టబెట్టి అధికారం అప్పగించారు. దీంతో అధికారంలో ఉండగా హద్దులు మీరి ప్రవర్తించిన, అక్రమార్జనకు తెగబడిన నేతలపై ఇప్పుడు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడానికి కూటమి సర్కార్ సమాయత్తమైంది.  వైసీపీ హ‌యాంలో అవినీతి అక్ర‌మాల‌ను వెలికితీసి వారిపైనా, అలాగే అధికార మదంతో నోరుపారేసుకున్న నేత‌ల‌పైనా కేసులు నమోదు చేసి చ‌ట్ట‌ప్ర‌కారం చ‌ర్య‌లు తీసుకునే కార్యక్రమం చేపట్టింది.   కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత వైసీపీ హ‌యాంలో అవినీతికి పాల్ప‌డిన పార్టీ నేత‌ల‌పై కేసులు న‌మోదు అవుతున్నాయి. అలాగే అధికారం అండతో కనీస విలువలకు తిలోదకాలిచ్చి బూతులతో రెచ్చిపోయిన నేతలపైనా కేసులు నమోదౌతున్నాయి.  వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి సహా పలువురు వైసీపీ నేతలపై కేసులు నమోదయ్యాయి. వీరిలో పోసాని కృష్ణ మురళి బెయిలుపై బయటకు రాగా, వంశీ ఇంకా జైల్లోనే ఉన్నారు. అలాగే పలువురు వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా కటకటాలు లెక్కిస్తుండగా, మరి కొందరు కోర్టుల ద్వారా ముందస్తు బెయిలు పొంది విచారణలకు హాజరౌతున్నారు. ఇంకొందరు అజ్ణాతంలో ఉన్నారు. మరి కొందరు బెయిలు కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు.  తాజాగా ఏపీ మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటూ ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డికి చుక్కెదురైంది.   జగన్ హయాంలో రాష్ట్రంలో మద్యం తయారీ, విక్రయాలలో భారీ ఎత్తున అవకతవకలు, అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంపై దర్యాప్తును ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. దీంతో అరెస్టు భయంతో మిథున్ రెడ్డి ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఆయన బెయిలు పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఆయన పిటిషన్ ను కొట్టివేసింది.  మిథున్ రెడ్డి బెయిలు పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  మిథున్ రెడ్డి ముందస్తు బెయిలును ఏపీ హైకోర్టు కొట్టివేయడం ఒక్క మిథున్ రెడ్డికి మాత్రమే కాకుండా మొత్తం వైసీపీకే పెద్ద ఝలక్ గా పరిశీలకులు భావిస్తున్నారు.  ఈ కేసులో తీగలాగితే డొంక కదిలినట్లు వైసీపీ పునాదులు కదిలే అవకాశాలున్నాయని అంటున్నారు.  

 మరోసారి వివాదంలో నిత్యానంద స్వామి... బొలివియా దేశంలో భూ దందా 

వివాదాస్పద ఆధ్యాత్మిక గురువు నిత్యానంద స్వామి తాజాగా  మరో వివాదంలో చిక్కుక్కున్నారు.  నిత్యానంద స్వామి చనిపోయినట్టు ఆయన మేనల్లుడు  ప్రకటన  చేసిన సంగతి తెలిసిందే. ఆస్తుల విషయంలో  మేనమామతో వచ్చిన విభేధాల వల్ల మేనల్లుడు ఈ ప్రకటన చేసినట్టు తెలుస్తోంది. సినీ నటి రంజితతో  నిత్యానంద స్వామి కి  అఫైర్ ఉందని వార్తలు గుప్పుమనడంతో  అప్పట్లో  దేశ వ్యాప్తంగా సంచలనమైంది. తమిళనాడు అరుణాచలంకు చెందిన నిత్యానంద స్వామి అమెరికాలోని ప్రత్యేక ఐలాండ్ లో కైలాస దేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఆ దేశానికి తానే ప్రధాని అని చెప్పుకున్నారు. తన వారసురాలిగా సినీ నటి రంజిత అని ప్రచారం జరిగింది. ఆస్తుల విషయంలో నిత్యానందస్వామి మేనల్లుడికి రంజిత మధ్య విభేధాలున్నాయి. ఈ కారణంగా ఈ నెల ఏప్రిల్ ఒకటో తేదీన నిత్యానందస్వామి చనిపోయినట్టు మేనల్లుడు ప్రకటించారు.  మేనల్లుడు చేసిన ప్రకటనను నిత్యానంద స్వామి శిష్యులు ఖండిస్తూ ఓ వీడియో మీడియాకు విడుదల చేశారు.  ఈ వివాదం వారం రోజులు గడవకముందే బొలివియా దేశంలో నిత్యానందస్వామి భూ దందా చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. నిత్యానందస్వామి అనుచరులు బొలివియా దేశంలోని గిరిజనులు ఆవాసముండే భూములపై కన్నేశారు. గిరిజన ప్రజల అమాకత్వం, పేదరికం ఆసరాగా చేసుకుని నిత్యానంద స్వామి శిష్యులు భారీ స్కెచ్ వేశారు.  వందల ఎకరాల భూములను కొట్టేయాలని చూశారు. స్థానిక గిరిజన తెగలతో వందేళ్ల లీజు అగ్రిమెంట్లు చేసుకున్నారు. వెంటనే బొలివియా ప్రభుత్వం అప్రమ్తమైంది. ఈ లీజు ఒప్పందాలను రద్దు చేసింది. కైలాస దేశంలో ఉన్న 20 మందిని అరెస్ట్ చేశారు. అమెరికాలో ఐల్యాండ్ లో  కైలాస ఏర్పాటు చేసుకున్న నిత్యానంద స్వామి బొలివియాలో కూడా కైలాస దేశం ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. 

తెలుగు రాష్ట్రాలలో నేడూ వర్షాలు

తెలుగు రాష్ట్రాలలో శుక్రవారం (ఏఫ్రిల్ 4)   భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు తెలంగాణలో  వరంగల్, వికారాబాద్, రంగారెడ్డి, ములుగు, యాదాద్రి, సిద్దిపేట, నల్గొండ, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్ లోని   అల్లూరి, కాకినాడ, తూర్పుగోదావరి, అనంతపురం, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయి.  కాగా గురువారం (ఏప్రిల్ 3) తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. ఈ అకాల వానల కారణంగా అన్నదాతలకు భారీ నష్టం వాటిల్లింది. పిడుగుపాటుకు ముగ్గురు మరణించారు.  గురువారం (ఏప్రిల్ 3)తెలంగాణలోని పలు జిల్లాలు వడగళ్ల వాన, పిడుగుపాటుతో కూడిన అకాల వర్షం అతలాకుతలం అయ్యాయి. ఈ వర్షాల కారణంగా ప్రాణనష్టంతో పాటు పంట నష్టం కూడా సంభవించింది.  పిడుగుపాటు కారణంగా రాష్ట్రంలో ముగ్గురు మరణించారు.  నాగర్ కర్నూల్ జిల్లాలోని పదర్ మండలంలో, పొలంలో పనిచేస్తున్న ఇద్దరు మహిళలు  నిజామాబాద్‌లో ఒకరు పిడుగుపాటు కారణంగా మరణించారు. అలాగే  జోగుళాంబ గద్వాల్ జిల్లాలోని గట్టు మాచర్ల గ్రామంలో, వడగళ్ల వానకు రెండు పశువులు చనిపోయాయి. పలు జిల్లాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంటలు దెబ్బతిన్నాయి. మామిడికి కూడా తీవ్ర నష్టం వాటిల్లింది.  ఇటిక్యాల మండలంలోని రావుల చెరువు గ్రామంలో 55 ఎకరాల్లో మామిడి పంట  దెబ్బతింది. ఉండవెల్లి మండలంలో భారీ వర్షాల కారణంగా మిరప, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి.   

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం

ఏపీ సచివాలయంలో అగ్నిప్రమాదం జరిగింది. సచివాలయం రెండో బ్లాక్ లోని బ్యాటరీ రూమ్ లో శుక్రవారం (ఏప్రిల్ 4) తెల్లవారు జామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ అగ్ని ప్రమాదంలో బ్యాటరీలు పూర్తిగా కాలి బూడదయ్యాయి. ప్రమాద సమయంలో ఎమర్జెన్సీ ఫైర్ అలారం మోగకపోవడంతో మంటల వ్యాప్తిని ఎవరూ గుర్తించలేకపోయారని తెలుస్తోంది.  ప్రమాదానికి కారణమేంటన్నది తెలయాల్సి ఉంది.  ఏపీ సచివాలయంలోని రెండో బ్లాక్‌లో శుక్రవారం ఉద‌యం అగ్నిప్రమాదం జ‌రిగింది. రెండో బ్లాక్‌లో బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగినట్లుగా స‌మాచారం. స‌మాచారం అందుకున్న అగ్నిమాప‌క‌ సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. అగ్ని ప్రమాదం జరిగిన రెండో బ్లాక్ లోనే ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, హోంమంత్రి వంగలపూడి అనిత, ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, అలాగే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, టూరిజం శాఖ మంత్రి కందుల రమేష్, ఇంకా మునిసిప్  మంత్రి నారాయణ, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తదితరుల కార్యాలయాలు ఉన్నాయి. ప్రమాద ఘటనపై వెంటనే స్పందించిన హోంమంత్రి వంగలపూడి అనిత ప్రమాద కారణాలపై ఆరా తీశారు. సమగ్ర దర్యాప్తు జరిపి నివేదిక అందజేయాల్సిందిగా ఆదేశించారు. సచివాలయ భద్రతా సిబ్బంది అగ్నిప్రమాద ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు.  

బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ కన్నుమూత

ప్రతిష్ఠాత్మ దాదాసాహెబ్ ఫాల్కె పురస్కార గ్రహీత, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాలీవుడ్ అగ్రదర్శకుడు, నటుడు మనోజ్ కుమార్ శుక్రవారం తెల్లవారు జామున కన్ను మూశారు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న మనోజ్ కుమార్ ముంబైలోని దీరూబాయ్ అంబానీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం కన్నుమూశారు.   మనోజ్ కుమార్ సినీ పరిశ్రమలోకి నటుడిగా అడుగుపెట్టారు. 1957లో ఫ్యాషన్ అనే సినిమా ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన మనోజ్ కుమార్ అసలు పేరు హరికృష్ణ గోస్వామి. ఇక ఆయన 1995లో  మైదాన్ ఈ జంగ్ అనే చిత్రంలో నటించారు. అదే ఆయన చివరి సినిమా. నటన కంటే దర్శకత్వానికే ప్రాధాన్యత ఇచ్చిన మనోజ్ కుమార్ పలు బ్లాక్ బస్టర్ చిత్రాలను రూపొందించారు. ఎక్కువగా దేశ భక్తి ఇతివృత్తంతోనే ఆయన ఎక్ువ సినిమాలు చేశారు. సినీ పరిశ్రమకు మనోజ్ కుమార్ సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం 2015లో ఆయకు దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం ప్రదానం చేసింది. అంతకు ముందే ఆయన 2011 పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. నాలుగు దశాబ్దాలకు పైగా ఆయన సినీ పరిశ్రమకు సేవలందించారు. అమితాబ్ బచ్చన్ హీరోగా ఆయన తీసిన రోటీ కపడా ఔర్ మకాన్ చిత్రం 1974లో విడుదలై సంచలనం సృష్టించింది. దిగ్గజ దర్శకుడు మనోజ్ కుమార్ మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోడీ తన ప్రగాభ సంతాపం వ్యక్తం చేశారు. ఇండియన్ సినీమాలో ఆయన ఒక ఐకాన్ అంటూ మోడీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.