ఇప్పుడు వైఎస్ భాస్కరరెడ్డి.. హైకోర్టులో పిటిషన్

వైఎస్ వివేకా హత్య కేసు దర్యాప్తులో వేగాన్ని నిరోధించే ప్రయత్నాలలో భాగంగా తెలంగాణ హై కోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ సారి పిటిషన్ దాఖలు చేసినది కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కరరెడ్డి. వివేకా హత్య కేసులో ఏ4 దస్తగిరిని సీబీఐ అప్రూవర్ గా ప్రకటించడాన్ని సవాల్ చేస్తూ వైఎస్ భాస్కరరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దస్తగిరి స్టేట్మెంట్ ఆధారంగా మమ్మల్ని నేరంలోకి నెట్టడం సమంజసం కాదని ఆయనా పిటిషన్ లో పేర్కొన్నారు. సీబీఐ చెప్పినట్లుగా దస్తగిరి వాంగ్మూలమిస్తున్నాడని పేర్కొన్నారు. వివేకా హత్య కేసులో దస్తగిరి కీలక పాత్ర పోషించాడనీ, అటువంటి దస్తగిరికి  బెయిల్ ఇవ్వటం సరికాదని వైఎస్ భాస్కరరెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. వివేక హత్య కేసులో కీలకంగా ఉన్న ఆయుధాన్ని కొనుగోలు చేసింది దస్తగిరేననీ, అటువంటి దస్తగిరికి బెయిల్ విషయంలో సీబీఐ సహకరించిందని ఆరోపించారు.  దస్తగిరికి ఇచ్చిన బెయిల్‎ను రద్దు చేయాలని కూడా భాస్కరరెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. 

టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ.. మలుపుల మీద మలుపులు!

టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజీ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. టౌన్‌ ప్లానింగ్ ఎగ్జామ్‌ పేపర్‌ మొదలు గ్రూప్‌ 1 వరకు పలు పరీక్షా పత్రాలు లీక్‌ అయినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పలు పరీక్షలను రద్దు చేస్తూ టీఎస్‌పీఎస్సీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు  ఇప్పటికే   9 మందిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.  విచారణలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. గ్రూప్ 1 పేపర్‌ను రాజశేఖర్ చాలా మందికి విక్రయించినట్లు ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. గ్రూప్ 1 రాసిన వారిలో విదేశాల నుంచి ఇద్దరు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీళ్లను కూడా విచారించేందుకు సిట్‌ రెడీ అవుతోంది. గత ఏడాది అక్టోబర్ నుంచే పేపర్ల లీక్ మొదలైనట్లు అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  కరీంనగర్‌కు చెందిన ఆరుగురికి రాజశేఖర్‌ గ్రూప్ 1 పేపర్‌ ముందుగానే రాజశేఖర్ ద్వారా అందినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు.  ఇలా అందుకున్న వారిలో నలుగురు ఎన్‌ఆర్‌ఐలతో పాటు మరో ఇద్దరు స్థానికులు గ్రూప్‌1 పరీక్షలు రాసిసనట్లు అధికారులు గుర్తించారు. పరీక్షలు రాయడానికి నలుగురు ఎన్‌ఆర్‌ఐలు విదేశాల నుంచి వచ్చారు. పేపర్‌ అమ్మడం ద్వారా వచ్చిన డబ్బులను రాజశేఖర్‌ స్నేహితులు, బంధువుల ఖాతాలో జమ చేసినట్లు గుర్తించిన సీట్ ఆ విషయంపై దర్యాప్తు సాగిస్తోంది.  అదలా ఉంటే..  టీఎస్‌పీఎస్‌సీ అక్టోబర్‌ తర్వాత 7 పరీక్షలు నిర్వహించింది. దీంతో ఈ 7 పరీక్షల్లో టాప్ మార్క్స్ సాధించిన 500 మందిని విచారించేందుకు సైతం సిట్ సమాయత్తమౌతోంది.  

పులివెందుల.. జగన్ కు ఇక దూరమేనా?

వైసీపీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి  వైయస్ జగన్ కు ఇంత కాలం పెట్టని కోటగా ఉన్న పులివెందుల ఇక దూరమైనట్లేనా? తన సొంత నియోజకవర్గంలో జగన్ పట్టు కోల్పోతున్నారా? ఇంత కాలం బ్రహ్మరథం పట్టిన నియోజకవర్గ ప్రజలు ఇక ఆయనను దూరం పెట్టనున్నారా?   సొంత నియోజకవర్గం పులివెందుల్లోనే జగన్ తన పట్టు, ప్రతిష్ట కోల్పోతున్నారా అంటే తాజా పరిణామాలను గమనిస్తే ఔననే అనాల్సి వస్తోందని పరిశీలకులు చెబుతున్నారు.  మార్చి 15వ తేదీన.. పులివెందుల్లో చోటు చేసుకున్న పరిణామాలను ఇందుకు ఉదాహరణగా చూపుతున్నారు.   నాలుగేళ్ల కిందట.. సరిగ్గా చెప్పాలంటే మార్చి 15, 2019న జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి పులివెందులలోని తన సొంత నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు.  ఆ దారుణ హత్య జరిగిన మార్చి 15, 2023 నాటికి నాలుగేళ్లు పూర్తయ్యింది.  ఈ  సందర్భంగా వైఎస్ వివేకా   కుమార్తె డాక్టర్ సునీత పులివెందుల్లోని తండ్రి సమాధిని సందర్శించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తన తండ్రి హత్య వెనుక ఉన్న పాత్రధారులు, సూత్రధారులెవరన్న దానిపై పలు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత పులివెందులలో ఏర్పాటు చేసిన వివేకా వర్థంతి కార్యక్రమంలో ఆమెతో పాటు వైఎస్ ఫ్యామిలీకి చెందిన  కొద్ది మంది  హాజరయ్యారు. అదలా ఉంటే.. వైయస్ వివేకా వర్థంతి సందర్భంగా పులివెందుల్లోని     వివేకా అభిమానులు భారీ ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీల్లో వైఎస్ కుటుంబ సభ్యులు  దివంగత ముఖ్యమంత్రి,  డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన భార్య  విజయమ్మ, వారి కుమార్తె షర్మిల,  వివేకా కుమార్తె  సునీతతోపాటు వైయస్ రాజశేఖర్ రెడ్డి తల్లిదండ్రులు వైయస్ రాజారెడ్డి దంపతుల ఫొటోలు మాత్రమే ఉన్నాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఫొటో కు ఆ ఫ్లెక్సీలలో స్థానం లేకుండా పోయింది. అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్ ఫొటో కూడా ఆ ఫ్లెక్సీలలో కనిపించలేదు.   వివేకా హత్య కేసులో   కడప ఎంపీ అవినాష్ రెడ్డి,  ఆయన తండ్రి  భాస్కరరెడ్డిలపై అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. వైఎస్ వివేకా హత్య కేసు విచారణ తెలంగాణ రాష్ట్రానికి మారిన తరువాత సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. దర్యాప్తులో వెల్లడౌతున్న అంశాల ఆధారంలో కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డిలపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఈ కేసులో సక్ష్యాలను మాయం చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అండ.. దండ మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  ఆ క్రమంలోనే  సునీత... తన తండ్రి హత్య లో పాత్రధారులు, సూత్రధారుల బండారం బయటకు రావాల్సిందే అంటూ ఒంటరి పోరాటం చేస్తున్నారని కూడా చర్చ జరుగుతోంది.     ఆ క్రమంలో తండ్రి హత్య కేసు.. సీబీఐ చేపట్టడంతోపాటు ఈ కేసు విచారణ మరో రాష్ట్రానికి బదిలీ చేయడం కోసం  సునీత చేసిన ప్రయత్నాలన్నీ తెలుగు సమాజం కళ్లారా చూసింది. అయితే ఇంటి ఆడపడుచు ఇంతగా పోరాటం చేస్తున్నా..  సోదరడు ప్లస్ ముఖ్యమంత్రి  జగన్ కానీ.. ఆయన ప్రభుత్వం కానీ వీసమెత్తు సహాయ సహకారాలు ఆమెకు అందించ లేదు.   అదీకాక.. ఈ హత్య కేసులో వివేకా కారు మాజీ డ్రైవర్ దస్తగిరి అప్రూవర్‌గా మారి చెప్పిన సంగతులన్నీ.. విని తెలుగు సమాజం తీవ్ర దిగ్బ్రాంతికి గురైంది. అలాంటి పరిస్థితుల్లో ఈ హత్య కేసులో దోషులు ఎవరో అధికారికంగా ప్రకటించకపోయినా.. సీబీఐ అధికారులకు దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలం మనసా వాచా కర్మణ నిజమని నమ్ముతూ..   వివేకా అభిమానులు ఇలా ఫ్లెక్సీల ఏర్పాటు చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అదీ కాక పులివెందుల మొత్తం వివేకా కుమార్తె డాక్టర్ సునీతకు సానుభూతి వ్యక్తం చేస్తూ ఆమెకు అండగా నిలుస్తున్నారని కూడా అంటున్నారు. ఫ్లెక్సీలలో ఫొటోలే లేకపోవడమే కాకుండా, ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా అధికార వైసీపీ ఇక్కడ బాగా వెనుకబడటం కూడా ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

హాజరయ్యారు.. ఇక అరెస్టేనా?

ఢిల్లీమద్యం కుంభకోణంలో అనుమానితురాలిగా ఆరోపణలు ఎదుర్కుంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్ర శేఖర రావు కుమార్తె, కల్వకుట్ల కవిత   సోమవారం ( మార్చి 20) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల ముందు విచారణకు హాజరయ్యారు. నిజానికి    మార్చి 16నే ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉన్నా, ఆమె డుమ్మా కొట్టారు. ఈ నేపథ్యంలోనే సోమవారం (మార్చి 20)  ఆమె హాజరు అవుతారా, లేదా ? అనే అనుమానాలు ఆఖరి నిముషం వరకూ కొనసాగాయి. అయితే ఈ అనుమానాలకు ముగింపు పలుకుతూ కవిత ఈడీ కార్యాలయానికి వెళ్లారు.  ఇంతకు ముందు మార్చి 11న ఆమెను ప్రశ్నించిన అధికారులు... మార్చి 16న మరోసారి ప్రశ్నించేందుకు సిద్ధమయ్యారు. ఐతే.. ఆమె ఈడీ కార్యాలయానికి తాను రాకుండా, తన బదులు లాయర్‌ను పంపారు.  దాంతో.. ఈడీ అధికారులు ఆమెకు మరోసారి నోటీస్ పంపారు.  మార్చి 20న వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. దీంతో..   ఆదివారం (మార్చి 19) సాయంత్రం, కవిత ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. సోమవారం (మార్చి 20)  వ్యక్తిగతంగా హాజరయ్యారు. ఆదివారం (మార్చి 19)  ప్రత్యేక విమానంలో బేగంపేట్ నుంచి ఢిల్లీ వెళ్లిన కవితతో పాటు ఆమె భర్త అనిల్, సోదరుడు, మంత్రి కేటీఆర్ , రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్, వద్దిరాజు రవిచంద్ర తదితరులు కూడా వెళ్లారు. ప్రస్తుతం వారంతా ఢిల్లీ తుగ్లక్ రోడ్డులోని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నివాసంలో ఉన్నారు. కవితకు తాను బినామీని అని హైదరాబాద్ వ్యాపారి రామచంద్ర పిళ్లై చెప్పడంతో...  ఆ స్టేట్‌మెంట్ ఆధారంగా ఈడీ అధికారులు కవితను ప్రశ్నిస్తున్నారు.  ఈ విచారణ తర్వాత ఈడీ అధికారులు ఆమెను మరోసారి విచారణకు రమ్మంటారా లేక ఆమె విచారణను ఈరోజుతో  ముగిస్తారా లేక ఆమెను అరెస్టు చేస్తారా, అన్న ప్రశ్నలకు మరి కొద్ది సేపటిలో సమాధానం దొరుకుతుంది. అయితే కవితను వెంటనే అరెస్ట్ చేసే అవకాసం ఉండక పోవచ్చని, విచారణన్ సమయంలో ఆమె సహకరించారా లేదా అన్న దాన్ని బట్టి ఈడీ నిర్ణయం ఉంటుందని న్యాయ నిపుణులు అంటున్నారు. కవిత విచారణకు సహకరిస్తారనే విశ్వాసం కలిగితే ఈడీ అధికారులు, ఇదే విధంగా మరి కొన్ని సార్లు ఆమెను విచారించిన తర్వాతనే అరెస్ట్ పై నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.

ఆ నలుగురు.. ఏం చేస్తారు?

ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉంటే.. ఆ రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో ఆ పార్టీదే హవా. అటు గ్రామ పంచాయతీ ఎన్నికల నుంచి ఇటు పార్లమెంట్ ఎన్నికల వరకూ అధికార పార్టీ జెండ రెపరెపలాడాల్సిందే. అందుకు ఏ పార్టీ మినహాయింపు కాదు. అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం విపక్ష తెలుగుదేశం పార్టీని వరించింది. దీంతో విజయం కోసం ఎన్ని జిమ్మిక్కులు చేసినా..  సైకిల్ జోరు ముందు నిలవలేకపోవడం. అధికార ఫ్యాన్ పార్టీలోని అధినేత నుంచి అగ్రనేతల వరకు ఎవరికీ ఏ మాత్రం మింగుడు పడటం లేదు.     ఇప్పటికే పార్టీ అధినేత, ముఖ్యమంత్రి   జగన్ రెడ్డి  వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వై నాట్ 175 అంటూ ఆయన అధ్యక్షతన జరుగుతోన్న వివిధ సమీక్ష సమావేశాల్లో పార్టీ శ్రేణులకు స్పష్టం చెబుతూ వస్తున్నారు. తాజాగా మార్చి 14న జరిగిన కేబినెట్‌ భేటీలో సైతం ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని స్థానాలూ.. మన పార్టీ ఖాతాలో గంపగుత్తగా పడిపోవాలని..  అలా కానీ పక్షంలో మంత్రివర్గంలో మార్పులు.. చేర్పులు.. తథ్యం అంటూ విస్పష్టంగా చెప్పారు.    అలాంటి వేళ.. ఇలా జరగడం ఏమిటనే ఓ సందేహం వైసీపీ శ్రేణులను తొలిచేస్తోంది. వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక, అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే పరిస్థితి ఎదురైతే.. పార్టీ పరిస్థితే కాదు..  తమ పరిస్థితి ఏమిటని వైసీపీ నేతలు మధనపడుతున్నారు  మరోవైపు గత ఎన్నికల్లో  తెలుగుదేశం నుంచి గెలిచి..  ఆ తర్వాత వైసీపీలోకి  జంప్  చేసిన లుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, మద్దాలి గిరిధర్, వాసుపల్లి గణేష్ కుమార్, కరణం బలరాంల.. పరిస్థితి ఏమిటనే ఓ చర్చ జగన్ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతోంది.   ఎందుకంటే.. 2014 ఎన్నికల్లో జగన్ పార్టీ నుంచి గెలిచి తెలుగుదేశంలో చేరిన పలువురు మ్మెల్యేలను... నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు..  తన కేబినెట్‌లోకి తీసుకొని.. కీలక మంత్రిత్వ శాఖలు కట్టబెట్టారు.  ఈ నేపథ్యంలో 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ టికెట్ పై గెలిచిన నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీలో చేరితే  జగన్ తమకు  గోల్డెన్ ఆఫర్ ఇస్తారని భావించారనీ,  అయితే వారొకటి తలిస్తే.. జగన్ మరోకటి తలచి తమను పదవులకు దూరంగా పెట్టారనీ అంటున్నారు.   అయితే ఈ నలుగురు.... వచ్చే ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ తరుఫున పోటీ చేస్తారా? ఆ క్రమంలో వీరికి సీఎం జగన్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారా? అంటే సందేహమేనని.. పోనీ వీరు తిరిగి సొంత గూటికి అంటే...  తెలుగుదేశం గూటికి చేరుతారా? ఒక వేళ చేరాలనుకున్నా ఆ పార్టీ అధినేత రానిస్తారా అన్న అనుమానాలు సైతం వ్యక్తమౌతున్నాయి.  ఎందుకంటే.. ఇప్పటికీ వీరు అసెంబ్లీలో టీడీపీ సభ్యులుగానే చెలామణి అవుతున్నారు.  మరోవైపు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా పంచుమర్తి అనురాధను టీడీపీ అధినేత చంద్రబాబు ఎన్నికల బరిలో దింపారు. ఈ ఎన్నిక మార్చి 23న జరగనుంది. ఈ నేపథ్యంలో ఆమెకు ఓటు వేయాలని ఇప్పటికే టీడీపీ ఎమ్మెల్యేలు 23 మందికీ ఆ పార్టీ వీప్ జారీ చేసింది. ఆ 23 మందిలో  ఈ నలుగురు ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. మరి వీరు పంచుమర్తి అనురాధకు అనుకూలంగా   ఓటు వేసి... తాము సైకిల్ పార్టీతోనే ఉన్నామని చెప్పకనే చెబుతారా?  లేకుంటే సీఎం జగన్‌కి రుణ పడి ఉన్నామంటూ.. ఈ ఎమ్మెల్సీ ఎన్నిక వేళ.. పోలింగ్‌కు గైర్హాజరవుతారా? అనేది వేచి చూడాలని చర్చ సైతం నడుస్తోంది.  ఇప్పటికే జగన్ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందనీ... అది పట్టభద్ర  ఎమ్మెల్సీ ఎన్నికలలో తేటతెల్లమైందనీ,  అలాంటి వేళ.. ఈ నలుగురు ఆచి తూచి అడుగులు వేస్తారనీ భావిస్తున్నారు.  

పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలలో ఓటమిని అంగీకరిస్తున్నామన్న బాలినేని

కొంచం ఆలస్యంగానైనా వైసీపీకి వాస్తవం బోధపడినట్లు కనిపిస్తోంది. ఇప్పటి వరకూ ప్రభుత్వ సలహాదారు సజ్జల సహా మాట్లాడిన వారంతా పట్టభద్రులు మా ఓటర్లు కాదు, సమాజంలో వారు చిన్న సెక్షన్ మాత్రమే అంటూ వచ్చారు. కానీ తొలి సారిగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే, అన్నిటికీ మించి ముఖ్యమంత్రి జగన్ కు బంధువు అయిన బాలినేని శ్రీనివాసరెడ్డి పట్టభద్రుల్లో, ఉపాధ్యాయుల్లో మా ప్రభుత్వం పట్ల అసంతృప్తి ఉందని ఈ ఎన్నికలు నిరూపించాయని అంగీకరించారు.   అయితే అంత మాత్రాన తెలుగుదేశం సంబరాలు చేసేసుకోవలసిన అవసరం ఏముందని ప్రశ్నించారు. పట్టభద్రుల ఎన్నికల్లో ఓటమిపై సమీక్షించుకుని ముందుకు వెళతామని ఆయన అన్నారు.  పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమిని అంగీకరిస్తున్నామని,  ఉద్యోగులు, ఉపాధ్యాయులు అసంతృప్తిగా ఉన్నట్టు ఈ ఎన్నికల్లో అర్థమయిందని వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఓటర్లలో వీరు కేవలం రెండు శాతం మాత్రమేననీ, అయినా ఓ మూడు  ఎమ్మెల్సీ సీట్లకే రాష్ట్రంలో అధికారం చేపట్టేసినట్లు  టీడీపీ నేతలు సంబరపడిపోవడం హాస్యాస్పదంగా ఉందని బాలినేని ఎద్దేవా చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

ఏపీ అసెంబ్లీలో డిష్యూం డిష్యూం

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వైసీపీ, టీడీపీ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. బాహాబాహీకి దిగారు. జీవో నంబర్ 1 రద్దు చేయాలన్న డిమాండ్ తో తెలుగుదేశం సభ్యులు  స్పీకర్ పోడియంను చుట్టుముట్టారు. దీంతో ఆయన  తన స్థానం నుంచి లేని లోనికి వెళ్లిపోయారు. ఆ సందర్భంగా తెలుగుదేశం, వైసీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం ఘర్షణకు దారి తీసింది. తెలుగుదేశం ఎమ్మెల్యే డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి, వైసీపీ ఎమ్మెల్యే సుధాకర్ లు ఒకరితో ఒకరు తలపడ్డారు. దీంతో సభలో తీవ్ర గందరగోళ పరిస్థితి ఏర్పడటంతో తిరిగి వచ్చిన స్పీకర్ సభను వాయిదా వేశారు. అయినా  తెలుగుదేశం సభ్యులు అసెంబ్లీ వెల్‌లో కూర్చొని నిరసన చేపట్టారు. 

కాంగ్రెస్ గెలుస్తుంది.. నేనే సిఎం.. రేవంత్ ధీమా ఏంటి?

ఆలు లేదు చూలులు లేదు కొడుకు పేరు సోమ లింగం, అన్నట్లు తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో  రేపటి ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రి ఎవరు అనే చర్చ అప్పుడే మొదలైంది. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ముందుగా ముఖ్యమంత్రిని ప్రకటించే సంస్కృతి లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత, ఎఐసీసీ పరిశీలకుల సమక్షంలో సీఎల్పీ  సమావేశం నిర్వహించడం, ముఖ్యమంత్రి ఎంపిక  బాధ్యతను పార్టీ అధిష్టానికి వదిలేస్తూ తీర్మానం చేయడం అక్కడి నుంచి వచ్చిన పరిశీలకులు సీల్డ్ కవర్ విప్పి ముఖ్యమంత్రి పేరు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది. అయితే  ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీలో  చాలా మార్పులే వచ్చినట్లు కనిపిస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి ఎంపిక ప్రక్రియలోనూ ఏదైనా మార్పు వచ్చిందా? వస్తోందా? అన్నది చూడవలసి వుంది.  అయితే, అధిష్టానం నిర్ణయం ఎదైనప్పటికీ పీసీసీ అధ్యక్షడు రేవంత్ రెడ్డి మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్లు  అయన ముఖ్యమంత్రి అయిపోయినట్లు ఉహించుకుంటున్నారు. నిజంగానే ఆయన కాంగ్రెస్ పార్టీ గెలుపు పై భరోసాతో ఉన్నారో లేదో కానీ  కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మాత్రం ముఖ్యమంత్రి కుర్చీ తనదేనని గట్టిగా నమ్ముతున్నారు. ‘నేనే ముఖ్యమంత్రి’ అని స్వయంగా ప్రకటించుకుంటున్నారని కూడా అంటున్నారు. నిజమే తెలుగు దేశం పార్టీలో ఉన్న రోజుల నుంచీ కూడా రేవంత్ రెడ్డ లో ముఖ్యమంత్రి కావాలనే కోరిక బలంగా ఉందనేది బహిరంగ రహస్యం. టీడీపీలో ఉన్న  రోజుల్లోనే రేవంత్ రెడ్డి, విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ  ముఖ్యమంత్రి కుర్చీ ఇస్తే  తెరాసలో చేరేందుకు కూడా సిద్ధమని  ప్రకటించారు.ఇప్పడు మళ్ళీ అదే తీరున విలేకరులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ తన మసులోని మాటను మరోమారు బయట పెట్టుకున్నారు. రాజకీయ అరంగేట్రం నుంచి తాను అనుకున్నది అనుకున్నట్లు జరుగుతోందని, ఇప్పడు కూడా అదే (తాను ముఖ్యమంత్రి కావడం) జరుగుతుందని చెప్పారు. ముఖ్యమంత్రి కుర్చీ కోసమే కాంగ్రెస్ పార్టీలో చేరానని  పీసీసీ అధ్యక్ష పదవి సంపాదించానని చెప్పు కొచ్చారు. అయితే  ఇప్పుడు రేవంత్ రెడ్డి ‘పిచ్చాపాటి’చర్చకు తెర  తీయడం వెనక రేవంత్ రెడ్డి వ్యూహం భరోసా ఏమిటనే చర్చ పార్టీ నేతల మధ్య మొదలైందని అంటున్నారు.  రేవంత్ రెడ్డి పాదయాత్రకు వస్తున్న అద్భుత స్పందన చూసి రేవంత్ లో ధైర్యం వస్తోందని అందుకే  ఆయన తన మనసులోని కోరికను బయట పెట్టడం ద్వారా సీనియర్ల స్పష్టమైన సంకేతాలు ఇచ్చారని కూడా కాంగ్రెస్ పార్టీలో చర్చమొదలైంది. నిజానికి రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షడు అయిన తర్వాత  పార్టీలో, పార్టీ శ్రేణుల్లో, ప్రజల్లో ఒక ఊపు వచ్చింది.  బీఆర్ఎస్ కు పోటీగా జనసమీకరణ చేయడంలో రేవంత్ వర్గం సక్సెస్ అయ్యింది. ఇప్పడు పాద యాత్రలోనూ అదే  జోరు కనిపిస్తోంది.  అధిష్టానం అనుమతితోనే నిర్మల్ లో మహేశ్వర్ రెడ్డి ఆదిలాబాద్ నుంచి భట్టి విక్రమార్క పాద యాత్రలు  చేపట్టినా  జనం నుంచి పెద్దగా స్పందన లేదు. దీంతో రేవంత్ రెడ్డిలో ధీమా పెరిగిందదనీ అందుకే  ఇంతవరకు మనసులో దాచుకున్న కోరికను  బయట పెట్టారని అంటున్నారు. నిజానికి, కాంగ్రెస్ సీనియర్లు పార్టీని వదిలి పోవాలనే కోరిక రేవంత్ రెడ్డి  ఆయన వర్గంలో మొదటి నుంచి వుందని కోమటి రెడ్డి వెంకట రెడ్డిని రేవంత్ వర్గానికి చెందిన అద్దంకి దయాకర్  బహిరంగ వేదిక నుంచి  ఉంటే పార్టీలో ఉండు లేదంటే అనే స్థాయిలో విరుచుకు పడ్డారని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు ఇంకా అనేక సందర్భాలలో రేవంత్ రెడ్డి ఆయన వర్గం సీనియర్లను పొమ్మన కుండా పొగ బెట్టి సాగనంపే ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. అందుకే తనకు తానే సీఎంగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారని అంటున్నారు.   అందుకే మళ్లీ కొడంగల్ నుంచి పోటీచేయడానికి రేవంత్ రెడ్డి ఏర్పాట్లు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్ రెడ్డిని మళ్లీ పార్టీలో చేర్చుకున్నారు. రెండు సార్లు అక్కడి నుంచి గెలిచినా గత ఎన్నికల్లో ఓడిపోయారు. ఏ పార్టీకీ ఆంధ్ర తెలంగాణలో మూడు సార్లు అధికారం ప్రజలు ఇవ్వలేదని.. ఈ సారి కాంగ్రెస్ గెలుస్తుందని.. తానే సీఎం అవుతానని రేవంత్ రెడ్డి నమ్మకంగా ఉన్నారు. మరి రేవంత్ ఆశలు నెరవేరుతాయో లేదో చూడాల్సి ఉంది.

వైసీపీ కాదు.. వై ఛీ పీ.. ఇది జనం మాట.. చంద్రబాబు

పట్టభద్రులు ఇచ్చిన తీర్పు వచ్చే ఎన్నికలలో జగన్ ఎదుర్కొనబోయే పరాజయానికి నాంది. జనం వైసీపీని తిరస్కరించారు. ఆ పార్టీ వైసీపీ కాదు, వై ఛీపీ అని జనం అంటున్నారు. అహంకారంతోఅహంకారంతో విర్రవీగుతున్న జగన్ రెడ్డికి పట్టభద్రులు గుణపాఠం చెప్పారు. రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేసి, అరాచకత్వమే పాలన అనుకుంటున్న జగన్ రెడ్డి ప్రభుత్వానికి పట్టభద్రులు కొర్రు కాల్చి వాత పెట్టారు. ఇంతటి అరాచకత్వాన్ని తాను జీవితంలో చూడలేదని తెలుగుదేవం అధినేత నారా చంద్రబాబునాయుడు అన్నారు.   పశ్చిమ రాయలసీమ నియోజకవర్గ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి  భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం సాధించారు. ఇది అధికార వైసీపీకి కచ్చితంగా జీర్ణించుకోవడానికి సాధ్యం కాని విషయమే. అయినా తప్పదు వాస్తవాన్ని అంగీకరించాలి. అలా అంగీకరించేసినట్లైతే అది వైసీపీ పార్టీ ఎందుకు ఔతుంది. అందుకే తెలుగుదేశం అభ్యర్థి విజయాన్ని ప్రకటించిన రిటర్నింగ్ అధికారి కమ్ కలెక్టర్ డిక్లరేషన్ పత్రం మాత్రం ఇవ్వలేదు. అలా ఇవ్వవద్దంటూ స్వయంగా సీఎం ఫోన్ చేసి ఆమెను ఆదేశించారని చెబుతున్నారు. ఏది ఏమైనా శనివారం రాత్రి తెలుగుదేశం అభ్యర్థి విజయాన్ని ప్రకటించిన తరువాత డిక్లరేషన్ పత్రం ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అక్షింతలు వేసి మరీ ఆదేశించిన తరువాతే ఆదివారం మధ్యాహ్నం ఇచ్చారు. ఈ లోగా కావలసినంత హై డ్రామా నడిచింది.  డిక్లరేషన్ పత్రం ఎందుకు ఇవ్వరంటూ తెలుగుదేశం శ్రేణులు ఆందోళణకు దిగాయి. దీంతో అర్ధరాత్రి వారిని విజయం సాధించిన భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పోలీసులు అరెస్టు చేశారు. బలవంతంగా తరలించారు. తెలుగుదేశం అధినేత ఈమెయిల్ ద్వారా ఈ విషయాన్ని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విజయం సాధించిన అభ్యర్థికి అధికారిక పత్రం ఇచ్చి తీరాలి. ఈ విషయం ఘనత వహించిన వైసీపీ అధినాయకత్వానికి తెలియకపోయినా రిటర్నింగ్ అధికారికి తప్పనిసరిగా తెలిసి ఉంటుంది. కాదు కాదు తెలిసి తీరాలి. అయినా ఆమె నిస్సహాయంగా ఉండిపోయారు. తాను విధి ప్రకారం చేయాల్సిన క్రతువును చేయకుండా మిన్నకుండిపోయారు. ఇంతా చేసి అధికార వైసీపీ ఏమైనా బావుకుందా అంటే ఏమీ లేదు. కేంద్ర ఎన్నికల సంఘం రిటర్నింగ్ అధికారికి అక్షింతలు వేసి మరీ ఆదేశాలు జారీ చేసిన తరువాత రిటర్నింగ్ అధికారి బతిమలాడుకుని మరీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి డిక్లరేషన్ పత్రం ఇవ్వాల్సి వచ్చింది. ఈ మొత్తం తతంగంలో నష్టపోయినదెవరయ్యా అంటూ మళ్లీ వైసీపీయే. జగన్ ప్రభుత్వమే.  ప్రభుత్వం  ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని… ప్రజా తీర్పును కూడా లెక్క చేయకుండా అహంకారం తలకెక్కి వ్యవహరిస్తోందన్న ముద్రను మరింత బలంగా పడేలా చేసుకుంది.   జగన్ సర్కార్  అధికారంతో ఏమైనా చేయవచ్చన్న   దురహంకారంతో వ్యవహరిస్తున్న విషయం మరోసారి రాష్ట్ర ప్రజలకు కళ్లకు కట్టింది. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలో విజయం తెలుగుదేశం పార్టీకి నిజంగా ఒక నైతిక బలాన్ని ఇచ్చింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రెడ్డి ఇలాకా పులివెందులలో సైతం తెలుగుదేశం అభ్యర్థి ఘనమైన మెజారిటీ సాధించారు. అలాగే వైసీపీకి కంచుకోటగా ముద్రపడిన పులివెందులలో ఆ పార్టీకి జనం పెట్టిన వాత కీలెరిగిపెట్టిన చందంగా ఉంది. ఇక పట్టభద్రుల ఎమ్మెల్సీ మూడు స్థానాలలోనూ తెలుగుదేశం అభ్యర్థులు విజయం సాధించడం ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం వెల్లి విరుస్తోంది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదివారం (మార్చి 19)న ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రసంగంలో ఈ సంగతి ప్రస్ఫుటంగా ప్రతిఫలించింది.  ముఖ్యంగా పశ్చిమ రాయలసీమలో భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి విజయం వైసీపీపై ప్రజలలో వ్యక్తమౌతున్న ఆగ్రహానికి అద్దంపట్టినట్లుగా ఉంది. అందుకే చంద్రబాబు ఈ విజయాన్ని ప్రజా విజయంగా అభివర్ణించారు. జగన్ రెడ్డి సర్కార్ పై ప్రజల తిరుగుబాటుగా ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయాన్ని పేర్కొన్నారు.  చైతన్యం, బాధ్యతతో వచ్చి ప్రజలు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓట్లు వేశారని తెలిపారు. ఉగాది పంచాంగాన్ని ప్రజలు రెండ్రోజులు ముందే చెప్పారని చంద్రబాబు అన్నారు.నాలుగేళ్ల జగన్ రెడ్డి పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను నిర్వీర్యం చేశారనీ, విధ్వంస పాలన చేశారని చంద్రబాబు విమర్శించారు.  ఒక్క చాన్స్ అంటూ గద్దెనెక్కిన జగన్ రెడ్డికి జనం మరో చాన్స్ ఇవ్వరనీ, వచ్చే ఎన్నికలలో జగన్ పార్టీ గెలిచే పరిస్థితి లేదనీ చెప్పారు.  జగన్ బాధ్యతలేని వ్యక్తి అని, మోసాలు చేయడంలో దిట్ట అని పేర్కొన్నారు. తాత్కాలికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ, టీడీపీది జనబలం అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.   

పది మంది మంత్రులకు పదవీ గండం?

 ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చింది  అంటే ఇదే నేమో.. ఆంధ్ర ప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలలో పట్టభద్రులు అధికార వైసీపీకి కొర్రుకాల్చి వాత పెట్టారు. గట్టిగా మొట్టి కాయలు వేశారు. మీటలు నొక్కి , వై నాట్  175? అని మురిసి పోతున్న అహంకారానికి కళ్లెం వేశారు. మూడు పట్టభద్రుల నియోజక వర్గాలకు ఎన్నికలు జరిగితే, మూడింటికి మూడు నియోజక వర్గాల్లోనూ అధికార పార్టీ   అభ్యర్ధులను పట్టభద్రులు చిత్తు చిత్తుగా ఓడించారు. ఒక్క ఛాన్స్  ముఖ్యమంత్రికి చుక్కలు చూపించారు.  అధికార పార్టీ   అభ్యర్ధులు ఓడిపోతే ఓడి పోయారు, ఏ స్వతంత్ర అభ్యర్దులో,అధికార పార్టీ రహస్య మిత్రపక్షం, బీజేపీ అభ్యర్దులో గెలిచారా అంటే అదీ లేదు. నిజానికి, జగన్ రెడ్డితో అంటకాగుతున్న బీజేపీ మరింత గట్టిగా వాతలు పెట్టారు. ఏపీలో బీజేపీకి ఉనికి లేదని మరో మారు రుజువు చేశారు. ప్రధాన ప్రతిపక్షం తెలుగు దేశం పార్టీ బలపరిచిన అభ్యర్ధులు విజయ కేతనం ఎగరేశారు. చివరకు ముఖ్యమంత్రి సొంత గడ్డ పులివెందుల అసెంబ్లీ నియోజక వర్గంలోనూ పట్టభద్రులు .. జగన్ రెడ్డికి బై ..బై  చెప్పేశారు. సహజంగానే, ఈ ఓటమి అధికార పార్టీలో గుబులు రేపుతోంది. ప్రతికూల ఫలితాలు కాక పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా మంత్రుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి.  నిజానికి, ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమిని ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ముందుగానే పసిగట్టారో ఏమో కానీ, మంత్రులను మాత్రం ముందుగానే హెచ్చరించారు. ముఖ్యంగా, ఉత్తరాంధ్ర పట్టభద్రుల నియోజక వర్గంలో ఓటమి ఎదురైతే, మంత్రులపై వేటు తప్పదని, ముఖ్యమంత్రి ముందుగానే హెచ్చరించారు. అయితే ఇప్పడు ఒక ఒక్క ఉత్తరాంద్రలోనే కాదు, పశ్చిమ రాయలసీమలో, వైసీపీకి తిరుగులేదనుకున్న ఒంగోలు,నెల్లూరు,చిత్తూరు జిల్లాలోనూ  ప్రతికూల  ఫలితాలే వచ్చాయి. దీంతో ముఖ్యమంత్రి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, ఎవరిపై వేటు వేస్తారో అని, ఓటమి ఎదురైన తొమ్మిది జిల్లాల మంత్రులు భయంతో వణికి పోతున్నారు.  నిజానికి  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గురించి తెలిసిన వారు, ఈ ఓటమిని  జగన్ రెడ్డి జీర్ణించు కోలేరని, అదే సమయంలో ఓటమికి తనదే బాధ్యతని ఒప్పుకునే నాయకత్వ లక్షణాలు, వ్యక్తిగత హుందాతనం ఆయనలో లేవని, అందుకే ఆయన మంత్రులను బలిపశువులను చేయడం ఖాయమని అంటున్నారు. ఉత్తరాంధ్రకు చెందిన సీదిరి అప్పలరాజు, బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, గుడివాడ అమర్నాథ్‌లతో పాటుగా మొత్తం పది మంది వరకు   మంత్రుల పదవులకు గండం పొంచి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. ముఖ్యంగా మీటలు నొక్కితే ఓట్లు రాలతాయనే భ్రమల్లో ఉన్న ముఖ్యమంత్రి, గతంలోనూ తాను చేయవలసిన పని (మీటలు నొక్కడం) తాను చేస్తున్నాని, అయినా  నియోజక వర్గాల్లో ప్రతికూల పరిస్థితులు కొనసాగితే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ ఇచ్చేదిలేదని హెచ్చరించిన విషయాన్ని పార్టీ నాయకులు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు. అందుకే  ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఎన్నికలు జరిగిన తొమ్మిది జిల్లాల్లోని మంత్రులందరికి ఉద్వాసన పలికినా  పలుకుతారని అంటున్నారు. ఆలాగే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్ విషయంలో పునరాలోచించే అవకశం లేక పోలేదని  అంటున్నారు.   అదలా ఉంటే ఇంచు మించుగా వందకు పైగా అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో ఓటరు నాడిని పట్టి ఇచ్చిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, వై నాట్ 175..? ప్రశ్నకు సరైన సంధానం ఇచ్చాయని అంటున్నారు.

సుప్రీంలో కవిత పిటిషన్ పై ఈడీ కేవియెట్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ దర్యాప్తును సవాల్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. కవిత పిటిషన్ ఈ నెల 24వ తేదీన సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. అయితే కవిత పిటిషన్‌కు సంబంధించి కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సుప్రీంకోర్టులో శనివారం (మార్చి 18) కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌పై తమ వాదనలు కూడా వినాలని ఈడీ పిటిషన్‌లో కోరింది. అంతేకాకుండా కవిత కేసు విషయంలో ఎలాంటి ముందస్తు ఆదేశాలు ఇవ్వొద్దని.. తమ వాదన కూడా విన్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఈడీ ఆ పిటిషన్‌లో  కోరింది. ఇక  ఈడీ తాజాగా కేవియట్ పిటిషన్‌తో దాఖలు చేయడంతో సుప్రీంకోర్టు కవిత వాదనతో పాటు ఈడీ వాదనలు కూడా విననుంది. ఆ తర్వాతే కవిత పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది.  దేశ వ్యాప్తంగా సంచలన సృష్టిస్తోన్న ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న కవిత.. ఈ నెల 11వ తేదీన ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు. 16‌వ తేదీన మరోసారి విచారణకు రావాలని ఈడీ పిలిచింది. అయతే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆమె 16వ తేదీన విచారణకు హాజరు కాలేదు. దీంతో ఈ నెల 20వ తేదీన మరోసారి విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది.

బీజేపీలో చేరితే అవినీతి పరులు పునీతులైపోతారా అమిత్ షా జీ?

సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోంది. ఈమాట,ఈ ఆరోపణ ప్రతి రోజూ వినిపిస్తూనే ఉంది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మొదలు కల్వకుంట్ల కవిత వరకూ, మమతా బెనర్జీ మొదలు అరవింద్ కేజ్రివాల్, కేసీఆర్,కేటీఆర్ వరకూ,శరద్ పవార్ మొదలు ఉద్ధవ్ థాకరే వరకూ, చిన్నా పెద్ద అవినీతి అక్రమాస్తుల కేసుల్లో విచారణ ఎదుర్కుంటున్న రాజకీయ నాయకులు, ఆ నాయకుల సమర్ధకులు ప్రతి రోజూ ఇలాంటి ఆరోపణలు చేస్తూనే ఉంటారు. అయితే, అది కొంతవరకు నిజమే అయినా సంపూర్ణ సత్యం అయితే కాదు. అధికారం ఉన్నదే దుర్వినియోగం చేసేందుకు, దుర్వినియోగం కాని, అధికారం అసలు  అధికారమే కాదు, అనే వాళ్ళు, అనుకునే వారు లేక పోలేదు.  అయితే ఇటీవల కాలంలో  కాంగ్రెస్ మొదలు బీఆర్ఎస్ వరకు ప్రతిపక్ష పార్టీలన్నీ,కోరస్ గా ఒకటే మాట అటున్నాయి.  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలపై కక్షకట్టి కేసులు పెట్టి వేధిస్తోందని ఆరోపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో సీబీఐ, ఈడీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందంటూ ప్రతిపక్షాలు చేస్తోన్న విమర్శలకు హోంశాఖ మంత్రి అమిత్ షా గట్టి సమాధానం ఇచ్చారు. సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తోన్న కేసుల్లో రెండు మినహా మిగతావన్నీ యూపీఏ హయాంలో నమోదైనవేనని ఆయన తేల్చిచెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు పాదర్శకంగా పనిచేస్తున్నాయని, అయినా, ఆ దర్యాప్తుల్లో తప్పుందనిపిస్తే కోర్టుకెళ్లొచ్చని అమిత్ షా తెలిపారు.  అలాగే ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు, నాయకులపై వస్తున్న ఆరోపణల విషయంలో విచారణ ఎందుకు జరపడం లేదని ఓ పక్క ఆరోపిస్తూనే, మరో వంక తమ పై జరుగుతున్న విచారణ మాత్రం కక్ష సాధింపు చర్యగా ఆరోపిస్తున్నారని అన్నారు. ఇందుకు సంబంధించి, 2017 ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ కు చెందిన ఓ ముఖ్య నాయకురాలు, అవినీతి పాల్పడితే ఎందుకు విచారించట్లేదని మమ్మల్ని ప్రశ్నించారు. ఇప్పుడు దర్యాప్తు సంస్థలు ఆ పని చేస్తుంటే మేం కుట్ర చేస్తున్నామని ఆరోపిస్తున్నారు. ఈ దర్యాప్తు సంస్థలు కోర్టులకు అతీతమేమీ కాదు. నోటీసులు, ఎఫ్‌ఐఆర్‌లు, ఛార్జ్‌షీట్లపై వారు న్యాయస్థానాల్లో సవాల్‌ చేయొచ్చు. కానీ, వారు కోర్టులను ఆశ్రయించకుండా, వీధుల్లో ఆందోళనలు చేస్తున్నారని అన్నారు. కోర్టులకు వెళ్లకుండా వారిని ఎవరు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. నిజానికి  బీజేపీలో కంటే  కాంగ్రెస్ పార్టీలోనే మంచి లాయర్లున్నారు. అయినా ఓ వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు దర్యాప్తు చేపట్టకూడదా? ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న కేసుల్లో రెండు మినహా మిగతావన్నీ కాంగ్రెస్ సారథ్యంలోని  యూపీఏ ప్రభుత్వ  హయాం నమోదైన కేసులే   అని అమిత్ షా పేర్కొన్నారు.  పదేళ్ల యూపీఏ పాలనలో రూ.12లక్షల కోట్ల విలువైన కుంభకోణాలు చోటుచేసుకున్నాయని అమిత్ షా ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ అవినీతి ఆరోపణలకు సంబంధించి  రాజకీయ దుమారం చెలరేగడంతో, ప్రజల దృష్టిని మరల్చేందుకు,యూపీఏ ప్రభుత్వమే సీబీఐతో కేసులు నమోదు చేసిందని గుర్తుచేశారు.అందులో ఏమైనా మనీలాండరింగ్‌ ఆరోపణలు వస్తే.. ఈడీ తప్పకుండా దర్యాప్తు చేస్తుందని తెలిపారు. దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్కరూ చట్టాలను పాటించాల్సిందే. మరో మార్గం లేదని అమిత్ షా తేల్చి చెప్పారు.  అలాగే, పార్లమెంట్ ను కుదిపేస్తున్న అదానీ’ వ్యవహారంపై  కూడా అమిత్ షా స్పందించారు.  ఆ ఆరోపణలపై దర్యాప్తు చేపట్టేందుకు సుప్రీంకోర్టు ఇద్దరు విశ్రాంత న్యాయమూర్తులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ వ్యవహారంపై ఎవరి దగ్గరైనా సాక్ష్యాలుంటే ఆ కమిటీకి సమర్పించొచ్చు. తప్పు జరిగిందని తేలితే ఎవర్నీ వదిలిపెట్టబోం. న్యాయపరమైన ప్రక్రియపై అందరూ విశ్వాసం ఉంచాలి. అయితే, నిరాధారమైన ఆరోపణలు చేయకూడదు. అటు సెబీ కూడా దీనిపై దర్యాప్తు చేస్తోంది  అని అమిత్ షా వివరించారు. అయితే, విపక్షాల విషయాన్నిపక్కన పెడితే అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న రాజకీయ నాయకులు  బీజేపీలో చేరగానే ఎలా పునీతులు అవుతున్నారు?  సామాన్య ప్రజలు అడుగుతున్న అసలు ప్రశ్న, ఈ ప్రశ్నకు బదులేది? అమిత్ షా ..జీ ..

రాహుల్ గాంధీ పై బహిష్కరణ వేటు?

పార్లమెంట్ బడ్జెట్ రెండో విడత సమావేశాలు  మొదలైన మొదటి క్షణం నుంచి వారాంతం వరకు ఒకే విధంగా నడిచాయి. సహజంగా  ప్రతిపక్ష పార్టీలు సభను స్తంభింప చేస్తాయి. అయితే ఈసారి  అధికార పార్టీ, అధికార కూటమి సభను సాగనీయలేదు. బడ్జెట్ సమావేశాలు మొదలైన మొదటి రోజు  కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ నాథ్ సింగ్  విదేశీ పర్యటనలో ఉన్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విదేశీ గడ్డపై నుంచి  దేశాన్నిఅవమానించే వ్యాఖ్యలు చేశారని  ఆరోపించారు. దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందంటూ లండన్ లో దేశాన్ని పార్లమెంటును అవమానపరిచే విధంగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు, ఆయన పార్లమెంట్ కు, దెశ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని   డిమాండ్ చేశారు. కేంద్ర మంత్రి చేసిన డిమాండ్ చినికి చినికి గాలి వానగా మారింది. ఒకటి రెండు రోజులు కాదు, ఏకంగా వారం రోజుల పాటు, పార్లమెంట్ ఉభయ సభలను పైసా పనైనా చేయకుండా స్తంభింప చేసింది.  బీజేపీ  సభ్యులు సోమవారం మొదలు శుక్రవారం వరకు వారం రోజులు సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు.  అఫ్కోర్స్  ప్రతిపక్ష పార్టీల సభ్యులు ఎప్పటిలానే  ఇప్పడు కూడా తమ వంతు కర్తవ్య్యాన్ని చక్కగా పోషించారు. సభా కార్యక్రమాలను అడ్డుకున్నారు. అదానీ గ్రూప్ వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ)ని ఏర్పాటు చేయాలని, కాంగ్రెస్ ఇతర ప్రతిపక్షాల సభ్యులు ఉభయసభల్లో ఆందోళన చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ  నినాదాలతో హోరెత్తించారు. అటు అధికార పక్షం,ఇటు ప్రతిపక్షాల సభ్యులు అరుపులు, నినాదాలతో వారాంతం (శుక్రవారం) వరకు కూడా ఎలాంటి కార్యకలాపాలు జరగకుండానే ఉభయ సభలు, వచ్చే సోమవారం, (మార్చి 20)కి వాయిదా పడ్డాయి.  అదలా ఉంటే, సోమవారం (మార్చి 20) పార్లమెంట్ సమావేశాలు తిరిగి ప్రారంభమైన తర్వాత, ఈ వివాదం మరో మలుపు తిరిగే అవకాశం ఉందని, జాతీయ మీడియాలో విస్తృతంగా ప్రచారం అవుతోంది.   లండన్‌లో భారత ప్రజాస్వామ్యం గురించి రాహుల్ గాంధీ చేసిన వాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని కోరుతున్న అధికార పక్షం  అందుకు ఆయన అంగీకరించని పక్షంలో ఆయన్ను లోక్ సభ నుంచి బహిష్కరించాలనే ప్రతిపాదన సభ ముందుంచే అవకాశం ఉందని అంటున్నారు. అందుకు రిహార్సల్స్ గానే గత ఐదు రోజులుగా  అధికార బీజేపీ నాయకులు, మంత్రులు  రాహుల్ వ్యాఖ్యాలను తూర్పార పడుతున్నారని అంటున్నారు.  విదేశీ గడ్డపై భారత్‌ను అవమానించారని.. ఇందుకు ఆయన క్షమాపణ చెప్పాలని.. అప్పటిదాకా ఆయన్ను సభలో మాట్లాడనిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. మరో దేశానికి వెళ్లి దేశంలో ప్రజాస్వామ్యం బాగాలేదని చెప్పడానికి రాహుల్‌కు ఎంత ధైర్యం? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన తన తప్పిదాన్ని చక్కదిద్దుకుంటేనే మాట్లాడేందుకు వీలు కలుగుతుందని బిజెపి తెలిపింది. కాగా, అదానీ అంశం నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి బీజేపీ రాహుల్ ను సభ నుండి బహిష్కరించే ప్రయత్నం చేస్తున్నదని  కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆరోపించారు. అంతే కాదు, రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పే ప్రశ్నే లేదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే స్పష్టం చేశారు.  అయితే ఇతర ప్రతిపక్ష పార్టీలు మాత్రం రాహుల్ వ్యవహారాన్ని మరో కోణంలో చూస్తున్నాయి.  కాంగ్రెస్, బీజేపీ  కలిసి ఆడుతున్న లైవ్ డ్రామా గా చూస్తున్నాయి. రాహుల్ గాంధీని  ప్రధాని నరేంద్ర మోడీకి ప్రధాన ప్రత్యర్ధిగా ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి ప్రధాని అభ్యర్ధిగా చూపేందుకు కాంగ్రస్ పార్టీ ప్రయత్నిస్తుంటే, బీజేపీ, రాహుల్ గాంధీ బలహీనతలను సొమ్ము చేసుకునేందుకు  పరోక్షంగా రాహుల్ గాంధీని హీరోను చేసేందుకే, ఆయన్ని సభ నుంచి బహిష్కరించే ఆలోచన చేస్తోందని అంటున్నారు. అంటే  కాంగ్రెస్, బీజేపీలు పార్లమెంట్  వేదికగా రాహుల్ బహిష్కరణ డ్రామాను తెరమీదకు తెస్తున్నాయని అంటున్నారు.  భరత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ పొలిటికల్ స్టేచర్, రాజకీయ స్థాయి పెరిగిందని కాంగ్రెస్ భావిస్తోంది. అదే క్రమంలో రాహుల్ గాంధీని ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్ధిగా చూపించే ప్రయత్న చేస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు. అలాగే,ప్రతిపక్ష్లాల మధ్య చిచ్చు పెట్టి, ఐక్యతను దెబ్బ తీసేందుకు, బీజేపీ రాహుల్ గాంధీని పావుగా వినియోగించుకున్నా వినియోగించుకుంటుంది అని కూడా అంటున్నారు,

తెలుగుదేశం గెలుపు గెలుపు కాదు.. మా ఓటమి ఓటమి కాదు.. సజ్జల నోట కొత్త భాష్యం

ఎన్నికలలో గెలుపు గెలుపే, ఓటమి ఓటమే. అది వైసేపీ అయినా మరోపార్టీ అయినా, గెలుపు ఓటములకు అనేక కారాణాలు ఉంటాయి. అయినా గెలుపు గెలుపే ఓటమి ఓటమే. అయితే గెలుపును ఎంజాయ్ చేసినంతగా ఓటమిని జీర్ణం చేసుకోవడం, సహజంగా అందరికీ సాధ్యం కాదు. అందులోనూ  వై నాట్ 175 అంటూ, రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో 175కు 175 స్థానాల్లో  గెలుపు తమదే అన్న పగటి కలలు కంటున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, ఆయన, ఏదన్నా, అంతేగా .. అంతేగా అంటూ తలలూపే సలహాదారులకు, ఎమ్మెల్సీ ఎన్నికలో ఎదురైనా చేదు అనుభవం మింగుడు పడడం కష్టమే. అదీ గాక, పిచ్చోడి చేతిలో రాయి ఎవరి నెత్తిన పడుతుందో అనే భయం వల్ల కూడా కావచ్చు, సర్వ శాఖల మంత్రిగా ప్రసిద్దుడైన ప్రభుత్వ సలహాదారు  సజ్జల రామకృష్ణా రెడ్డి  పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలో టీడీపీ సృష్టించిన ప్రభంజనాన్ని తక్కువ చేసి చూపేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. పట్టభద్రుల స్థానాల్లో వైసేపీ ఘోర పరాజయాన్ని హుందాగా స్వీకరించేందు బదులుగా  సజజ్ల కుంటి సాకులు వెతుక్కోవడం ఏమిటని, వైసేపీ నేతలే అంటున్నారు. నవ్వుకుంటున్నారు. అవును. చదవేస్తే ఉన్నమతి పోయింది అన్నట్లు, టీడీపీ గెలుపు  గెలుపు కాదు, వైసేపీ ఓటమి ఓటమి కాదు అనే కొత్త భాష్యాన్ని సజ్జల తెర మీదకు  తెచ్చారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లన్నీ టీడీపీవి కావని, ప్రభుత్వ సజ్జల చెప్పుకొచ్చారు. పీడీఎఫ్ ఇతర వామపక్షాలకు చెందిన ఓట్లే టీడీపీ వైపు మళ్లాయన్నారు. ఎన్నికలు జరిగిన స్థానాలు అన్నింటినీ కలిపి చూడాలని సూచించారు. ఏ రకంగానూ ఈ ఎన్నికలు ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిఫలించవన్నారు. టీడీపీ  సంబరాలు చేసుకోవడంతోనే అంతా అయిపోలేదని, ఈ ఫలితాలను తాము హెచ్చరికగా భావించడం లేదని సజ్జల స్పష్టం చేశారు. ఈ ఓటర్లు మొత్తం సమాజాన్ని ప్రతిబింబించే పరిస్థితి లేదని తెలిపారు. ఒక వర్గం ఓటర్లను రాష్ట్రం మొత్తానికి ఎలా అపాదిస్తారని ప్రశ్నించారు. అంతే కాదు, ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల పరిధిలో పట్టభద్రుల ఓటర్లు లేరని తెలిపారు. అంటే  వైసీపే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోంది, పేద ప్రజలను ఆదుకునేందుకో  పేదరిక నిర్మూలనకో కాదని  కేవలం ఓటు బ్యాంకును పెంచుకునేందుకే అనే నిజాన్ని సజ్జల అంగీకరించారు. నిజానికి సంక్షేమ పథకాల లబ్దిదారులంతా కట్టు బానిసల్లా మళ్ళీ  తమకే ఓటు వేస్తారనే భ్రమల్లోంచే, 175/175 భరోసా పుట్టుకొచ్చింది. కానీ, పట్టభద్రులైనా, పేద ప్రజలైనా  కేవలం సంక్షేమం మాత్రమే కోరుకోరు. అయినా సజ్జల రామకృష్ణా రెడ్డి ఈ ఫలితాలను తాము హెచ్చరిక భావించడం లేదని, ప్రభుత్వ వ్యతిరేకతగా గుర్తించడం లేదని అంటున్నారు. అంటే నిజాన్ని అగీకరించేందుకు వైసీపే నాయకత్వం సిద్దంగా లేదని, అదే ఆ పార్టీకి ఆత్మహత్యా సదృశ్యం అవుతుందని రాజకీయ పరిశీలకు విశ్లేషిస్తున్నారు.

అరెస్టా.. కాదా? సీబీఐ ఏం చేస్తుంది? అవినాష్ వ్యవహారంలో సర్వత్రా ఉత్కంఠ

వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి విషయంలో హైకోర్టు తెలంగాణ హైకోర్టు సీబీఐ దర్యాప్తులో జోక్యం చేసుకోబోమని తేల్చేసింది  దీంతో ఇక అవినాష్ రెడ్డి అరెస్టే తరువాయి అన్న భావనే సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే అదే రోజు సీఎం ఢిల్లీ వెళ్లి, పీఎంను కలిశారు.  దీంతో  సీబీఐ దూకుడు తగ్గిస్తుందా?  కొనసాగిస్తుందా అన్న మీమాంశ వ్యక్తమౌతోంది. సీఎం జగన్ ప్రధానిని కలిసిన తరువాత సీబీఐ నెమ్మదిస్తే అది ఆ దర్యాప్తు సంస్థ విశ్వసనీయతను దెబ్బతీస్తుంది.   కడప వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయాలన్న, సీబీఐ ప్రయత్నాలకు కొద్దిరోజులు బ్రేక్‌ వేసిన తెలంగాణ హైకోర్టు, ఆ తరువాత  గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేసింది. అవినాష్‌రెడ్డి అరెస్టులో జోక్యం చేసుకోలేం. ఈ విషయంలో సీబీఐదే తుది నిర్ణయమంటూ చేప్పేసిన తరువాత  ఇప్పుడు సీబీఐ వెనుకాడితే అది సీబీఐ ప్రతిష్టకు మచ్చ తీసుకురావడం ఖాయమన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే.. కోర్టు అవినాష్ అరెస్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ తీర్పు వెలువరించిన రోజే.. బడ్జెట్ సమావేశాలను కూడా పక్కన పెట్టేసి హడావుడిగా హస్తిన కేగి ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాతో జగన్ భేటీ అయిన నేపథ్యంలో ఆయన పర్యటనపై పలు ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి.  అవినాష్‌రెడ్డి, అరెస్టును అడ్డుకునేందుకే జగన్‌ ఢిల్లీ వెళ్లారని విపక్షాలు ఆరోపించాయి. అలాగే అవినాష్ తోనే వదిలేయండి ఇంకా ముందుకు వద్దు అని వేడుకోవడానికే జగన్ హస్తిన వెళ్లారన్న వాదనా వినిపించింది. అయినా అవినాష్, ఆయన తండ్రి భాస్కరరెడ్డి ఇబ్బందులలో పడిన ప్రతి సారీ జగన్ హస్తిన పర్యటన పెట్టుకోవడం వెనుక కారణమేమిటని విపక్ష తెలుగుదేశం ప్రశ్నిస్తోంది.  సీబీఐపై ఒత్తిడి తీసుకువచ్చేందుకే జగన్‌, ఢిల్లీకి వెళ్లారన్నది విపక్షాల ఆరోపణ. దీనితో  అందరి చూపు ఇప్పుడు  సీబీఐ తదుపరి చర్య ఏమిటా అన్న దానిపైనే పడింది. నిన్నటి వరకూ అవినాష్‌ అరెస్టు కోసం  పట్టుదల ప్రదర్శించిన   సీబీఐ.. ఇప్పుడు మోడీ-జగన్‌ భేటీ తర్వాత అదే వైఖరి కొనసాగిస్తుందా? అంటూ విపక్షాలు సందేహం వ్యక్తం చేస్తున్నాయి.  సీబీఐ అరెస్టు విషయంలో వెనక్కు తగ్గి, అవినాష్ రెడ్డి సుప్రీం కోర్టును ఆశ్రయించేందుకు అవకాశం సమయం ఇస్తే.. జగన్ హస్తిన వెళ్లి చేసిన ప్రయత్నాలు ఫలించాయని భావించాల్సి ఉంటుంది. అలా కాకుండా అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్టు చేస్తే జగన్ వెళ్లింది అవినాష్ రెడ్డి అరెస్టును అడ్డుకోవడానికి కాదు, రాష్ట్ర అంశాలను చర్చించేందుకేనని జనం భావించేందుకు ఆస్కారం అభిస్తుంది.   

బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి: విష్ణుకుమార్ రాజు

ఆంధ్రప్రదేశ్ లో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సరళి చూసిన తరువాతైనా బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆత్మపరిశీలన చేసుకోవాలని ఆ పార్టీ నాయకుడు  విష్ణుకుమార్ రాజు అన్నారు. ఏపీలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ ఏ మాత్రం ప్రభావం చూపలేకపోవడానికి పార్టీ రాష్ట్ర నాయకత్వం తీరే కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. చెల్లని ఓట్ల తో పోటీ పడే పరిస్థితి రావడానికి కారణం రాష్ట్రంలో బీజేపీ అధికార వైసీపీతో కలిసి పని చేస్తోందని ప్రజలు భావించడమే కారణమని విష్ణుకుమార్ రాజు అన్నారు.  రాష్ట్ర బీజేపీ వైసీపీతో అంటకాగుతోందన్న ముద్రను తొలగించుకోకపోతే ముందు ముందు మరింత దారుణమైన ఫలితాలను ఎదుర్కొన వలసి వస్తుందని పేర్కొన్నారు.  పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజలు ఆదరించకపోవడాన్ని గమనించాలని, ఒత్తిళ్లు, ప్రలోభాలు ఏవీ పనిచేయకపోవడం ప్రజల్లో వస్తున్న మార్పుకు సంకేతమని అన్నారు.  ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తేనే మేలు జరుగుతుందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాలంటే ఈ కలయిక తప్పనిసరి అని విష్ణుకుమార్ రాజు అభిప్రాయపడ్డారు.

జాతీయ రాజకీయాలకు కేసీఆర్ ఇంట్రవెల్?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు ఇంకా ఏంతో దూరంలో లేవు... మే  వరకు గడువున్నా, రేపో మాపో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చినా రావచ్చునని అంటున్నారు. మరో వంక, బీజేపీ, కాంగ్రెస్, జనతా దళ్( ఎస్) పార్టీలు ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్నాయి. ఇప్పటికే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఇతర ముఖ్యనాయకులు అందరూ రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు.  అలాగే  కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు, పార్టీ సుప్రీం లీడర్ రాహుల్ గాంధీ మరో రెండు రోజుల్లో అంటే సోమవారం ( మార్చి 20) బెల్గాంలో జరిగే యువజన్ సమ్మేళనంలో పాల్గొంటారు.   అదే రోజున కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధుల తోలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే  హంగ్  అంచనాలతో జేడీ(ఎస్) నేత  మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి పార్టీకి మైసూర్  ప్రాంతంలో పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.  అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచే భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) జాతీయ ప్రస్థానం మొదలవుతుందని, ప్రకటించిన కేసీఆర్  ఎందుకో ఆ రాష్ట్రం వైపు కన్నెత్తి చూడటంలేదు.కర్నాటక అసెంబ్లీ ఎన్నికలో బీఆర్ఎస్ పోటీ దిశగా ఆ పార్టీలో ఎక్కడా చలనం కనిపించడం లేదు.  ఇప్పుడు  బీఆర్ఎస్ ముఖ్యులంతా  ఢిల్లీ మద్యం కుంభకోణంలో  అనుమానితురాలుగా విచారణ ఎదుర్కుంటున్న పార్టీ ఎమ్మెల్సీ, ముఖ్యమంత్రి కేసీఆర్  కుమార్తె  కల్వకుంట్ల కవితను కాపాడుకోవడం ఎలా? టీఎస్పీఎస్సీ   పరిక్ష పత్రాల లీకేజీ కుంభకోణం నుంచి బయట పడడం ఎలా?  అనే విషయాలపైనే దృష్టిని కేద్రీకరించారని జరుగుతున్న పరిణామాలను బట్టి అందరికీ అర్థమౌతోంది.   మరోవంక  బీఆర్ఎస్ తొలి  అడుగు నుంచి కేసీఆర్ తో కలిసి నడిచిన, జేడీ (ఎస్) అధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి ఎందుకో ఏమో కానీ మెల్ల మెల్లగా కేసీఆర్ కు దూరమవుతున్నారు. నిజానికి, అప్పట్లో, బీఆర్ఎస్,  జేడీ(ఎస్) మధ్య పొత్తు ఖరారైందనే వార్తలు కూడా వచ్చాయి. హైదరాబాద్ తెలంగాణగా ప్రసిద్ధి చెందిన కర్ణాటక సరిహాద్దు ప్రాంతంలో ముఖ్యంగా తెలుగువారున్న చోట్ల బీఆర్ఎస్ పోటీ చేస్తుందని మిగతా చోట్ల జేడీఎస్‌కు బీఆర్ఎస్ మద్దతు ఇస్తుందని చెప్పుకున్నారు. అయితే  ఇప్పడు కుమారస్వామి, కేసీఆర్ మధ్య దూరంపెరిగిన నేపధ్యంలో  కుమరస్వామి హైదరాబాద్ వైపు కన్నెత్తి చూడడం లేదు. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు విషయాన్ని పూర్తిగా  మరిచి పోయారు. ఇప్పటికే ఆయన తమ పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్ధుల తొలి జాబితాను ప్రకటించారు. మరో వంక  బీఆర్ఎస్ నాయకత్వం కూడా కర్ణాటకలో పోటీ చేసే ఆలోచనను  పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. అంతే కాకుండా  ముందు తెలంగాణ గండం గట్టెక్కితే, ఆ తర్వాత జాతీయ రాజకీయాల గురించి అలోచించ వచ్చనే నిర్ణయానికి బీఆర్ఎస్ వచ్చినట్లు తెలుస్తోంది.  అదలా ఉంటే, అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్ననేపథ్యంలో జాతీయ రాజకీయాలకు తాత్కాలిక విరామం ఇచ్చి ప ముందు రాష్ట్రంలో తిరిగి అధికారంలోకి వచ్చేదెలా, అనే విషయంపైనే దృష్టిని కేంద్రీకరించాలని పార్టీ ‘పెద్దలు’ కూడా సూచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే, ఏదైనా అంతిమ నిర్ణయం తీసుకోవలసింది మాత్రం ముఖ్యమంత్రి కేసీఅర్, మంత్రి కేటీఆర్.  ఆ ఇద్దరి నిర్ణయం పైనే బీఆర్ఎస్ భవిష్యత్ ఆధారపడి ఉంటుందని అంటున్నారు.

జగన్ పులివెందుల కోటకు బీటలు!

వైసీపీకి పులివెందుల పెట్టని కోట. అక్కడ వైఎస్ కుటుంబం ఏం చెబితే అది.. అన్నట్లుగా సాగుతుంది. అలాంటి పులివెందులలో అనూహ్యంగా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తెలుగుదేశం భారీ ఆధిక్యత సాధించింది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి 4323 ఓట్లు వస్తే.. వైసీపీకి 2120 ఓట్లు వచ్చాయి. పులివెందులలో జగన్ కోటకు బీటలు వారాయని ఈ అంకలే నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నాయి. కంచుకోట లాంటి పులివెందులలో జగన్ పట్టు సడలడానికి ఆయన స్వయంకృతాపరాధమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ బతికి ఉన్నంత కాలం  ఆయన, వైఎస్ వివేకానందరెడ్డి వేరు వేరని నియోజకవర్గంలో ఎవరూ కనీసం ఊహలో కూడా అనుకుని ఉండరు. అయితే వైఎస్ మరణాననంతరం జరిగిన పరిణామాలలో జగన్ వైఎస్ వివేకాను దూరం పెడుతున్నారా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు జగన్ వైసీపీ స్థాపించి కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన తరువాత కూడా వైఎస్ వివేకా కాంగ్రెస్ లోనే కొనసాగారు. అంతే కాదు సొంత వదినపై పోటీ కూడా చేశారు. సరే అన్నీ సర్దుకున్నాయి వైఎస్ వివేకా జగన్ పార్టీలో చేరిపోయారు. కానీ గత ఎన్నికల ముందు అంటే 2019 ఎన్నికల ముందు వైఎస్ వివేకా దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు గురైన తొలి నాళ్లలో ఈ హత్య విషయంలో జగన్ ఫ్యామిలీపై ఎవరికీ ఎటువంటి అనుమానాలూ రాలేదు. కానీ ఇప్పుడు సీబీఐ దర్యాప్తు తరువాత ఒక్కటొక్కటిగా వెలుగులోకి వస్తున్న వాస్తవాల నేపథ్యంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాత్రపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అలాగే అవినాష్ రెడ్డిని కాపాడేందుకు జగన్ చేస్తున్న ప్రయత్రాలు కూడా సందేహాలను ఇనుమడింప చేస్తున్నాయి. అన్నిటికీ మించి తన తండ్రి హత్య కేసులో పాత్ర ధారులు, సూత్ర ధారులు ఎవరో తెలియాల్సిందే అంటూ న్యాయపోరాటం చేస్తున్న వివేకా కుమార్తె  డాక్టర్ సునీతకు అడుగడుగునా ఎదురౌతున్న అడ్డంకులు, ఆమెపైనా, ఆమె భర్తపైనా అవినాష్ తాజాగా చేసిన ఆరోపణల నేపథ్యంలో పులివెందులలో సహజంగానే జగన్ సోదరికి అండగా నిలవక పోవడానికి కారణమేమిటన్న చర్చ మొదలైంది. అలాగే   వైఎస్ కుటుంబంలో ఏర్పడిన పరిణామాలతో జగన్, అవినాష్ రెడ్డిల తీరుపైనా పులివెందుల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. అందుకు తార్కానమే ఇటీవల వైఎస్ వివేకా వర్ధంతి కార్యక్రమంలో వెలసిన ఫ్లెక్సీలు పోస్టర్లలో వైఎస్ కుటుంబానికి చెందిన అందరి ఫొటోలు ఉన్నాయి కానీ సీఎం జగన్, ఎంపీ అవినాష్ ల చిత్రాలకు వాటిలో చోటు లేకుండా పోయింది. ఇటీవలి కాలంలో జగన్ పై పులివెందులలో వ్యక్తమౌతున్న వ్యతిరేకత వల్లే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కంటే తెలుగుదేశం అభ్యర్థికే ఎక్కవ ఓట్లు పోలయ్యాయని అంటున్నారు. ఇందుకు జగన్ పై వ్యతిరేకతే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే ట్రెండ్ అసెంబ్లీ ఎన్నికలలో కూడా కొనసాగే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయనీ చెబుతున్నారు.