కడప గడపలోనూ వైసీపీకి ఎదురీతేనా?
ఉమ్మడి కడప జిల్లాలో అధికార వైసీపీకి ఎదురుగాలి వీస్తోందనే చెప్పాలి. 2019 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. అంతటి విజయానికి ప్రధాన కారణం ఎన్నికల సమయంలో మాజీ మంత్రి, జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య. చంద్రబాబు, స్థానిక టీడీపీ నేతలు వివేకాను హత్యచేశారని ప్రజలను నమ్మించడంలో జగన్ మోహన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. దాంతో కడప గడపగడపలోనూ జగన్ పట్ల సానుభూతి వెల్లువెత్తింది. దీంతో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాలలోనూ జనం వైసీపీని గెలిపించారు. అంతేకాక , రాష్ట్రంలోనూ వైసీపీ అధికారంలోకి రావడానికి వివేకా హత్య కారణంగా వచ్చిన సానుభూతి దోహదపడింది. అయితే, ఉమ్మడి కడప జిల్లాలో ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. వైఎస్ వివేకా హత్యకేసులో ప్రధాన ముద్దాయి కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి అని సీబీఐ దర్యాప్తు దాదాపు తేల్చేసింది. వివేకా హత్య కేసు వ్యవహారంలో అవినాష్ రెడ్డిని జగన్ తన అధికారాన్ని ఉపయోగించి కాపాడుతున్నారని.. స్వయానా జగన్ సోదరి షర్మిల, వివేకా కుమార్తె సునీతాలు ఆరోపణలు చేయడమే కాకుండా, ఈ సారి ఎన్నికలలో జగన్ కు ఓటు వేయద్దని పిలుపు కూడా ఇచ్చారు. జగన్ మోహన్ రెడ్డి పార్టీకి ప్రజలెవరూ ఓటు వేయొద్దని షర్మిల, సునీతారెడ్డిలు వివేకా ఐదో వర్ధంతి సందర్భంగా కడపలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పిలుపునిచ్చారు.
అంతే కాకుండా వారు జగన్ పై ప్రత్యక్ష రాజకీయ పోరుకు రెడీ అయిపోయారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జగన్ కు ప్రత్యర్థిగా వివేకా కుమార్తె సునీతారెడ్డి లేదా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అలాగే కడప లోక్ సభ స్ధానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వైఎస్ షర్మిల బరిలోకి దిగనున్నట్లు చెబుతున్నారు. ఇదే జరిగితే పులివెందులలో జగన్ కు, కడప లోక్ సభ స్థానంలో అవినాశ్ కు ఇబ్బందులు తప్పవని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మరోవైపు వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతోందనీ, ముఖ్యంగా ఉమ్మడి కడప జిల్లాలో అభివృద్ధి ఆనవాలే లేకుండా పోయిందనీ జనం ఆగ్రహంగా ఉన్నారు. దీనికి తోడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిగా కలిసి పోటీ చేస్తుండటంతో ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో కూటమి అభ్యర్థులకు సానుకూల వాతావరణం కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబ ఫైట్ కారణంగా వైసీపీ ఓట్లు భారీగా చీలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో నియోజకవర్గాల వారీగా పరిస్థితి చూస్తే..
బద్వేలు నియోజకవర్గం
బద్వేల్ నియోజకవర్గం మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీకి కంచుకోట. కానీ, ఆ నియోజకవర్గంలో గత నాలుగు దఫాలుగా తెలుగుదేశం ఆశించిన స్థాయిలో ఫలితాన్ని రాబట్టలేక పోతున్నది. ఈ నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ఆకస్మిక మరణంతో 2021 జరిగిన ఉప ఎన్నికల్లో డాక్టర్ దాసరి సుధ వైసీపీ నుంచి పోటీచేసి గెలుపొందారు. ఇక ఇప్పుడు అంటే 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా మరోసారి దాసరి సుధకే వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. కూటమి నుంచి ఈ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉంది. ఇప్పటి వరకు అభ్యర్థిని ప్రకటించలేదు. అయితే, ఈ దఫా ఎన్నికల్లో కూటమి అభ్యర్థికి విజయావకాశాలు ఉన్నాయి. వైసీపీలో నెలకొన్న వర్గ విబేధాలు, వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి పాత్రపై ప్రజలలో ఆగ్రహం, జగన్ ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకత అన్నీ కలిసివచ్చి కూటమి అభ్యర్థి విజయానికి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని అంటున్నారు. వైసీపీ హయాంలో నియోజకవర్గ అభివృద్ధి పూజ్యం కావడంతో జగన్ సర్కార్ పై జనాగ్రహం తీవ్రంగా వ్యక్తం అవుతోంది.
రైల్వే కోడూర్ నియోజకవర్గం
రైల్వే కోడూర్ నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో కొరముట్ల శ్రీనివాసులు వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. మరోసారి ఆయనే ఇక్కడ నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నారు. ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు. పొత్తులో భాగంగా ఈ స్థానం జనసేనకు కేటాయించినట్లు ప్రచారం జరుగుతోంది. గత ఐదేళ్లగా జగన్ పాలన పట్ల ప్రజలలో పేరుకుపోయిన ఆగ్రహం, వివేకా హత్య కారణంగా వెల్లువెత్తుతున్న యాంటీ సెంటిమెంట్, కూటమి బలం కలిసి ఈ నియోజకవర్గంలో వైసీపీ విజయానికి ప్రతిబంధకాలుగా మారే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
మైదుకూరు నియోజకవర్గం
మైదుకూరు నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలుగుదేశం అభ్యర్థి పుట్టా సుధాకర్ యాదవ్ పై విజయం సాధించారు. ఈ సారి కూడా ఈ ఇద్దరే ప్రత్యర్థులుగా పోటీలో ఉన్నారు. రెండు సార్లు ఓటమి తరువాత కూడా పుట్టా సుధాకర్ యాదవ్ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజాసమస్యలపై గళమెత్తుతూ, ప్రజల తలలో నాలుకగా వ్యవహరించారు. దీంతో ఈ సారి ఓటర్ల సానుభూతి పుట్టాకే అనుకూలంగా ఉందని అంటున్నారు. వరుసగా రెండు సార్లు గెలిపించినా నియోజకవర్గ అభివృద్ది విషయంలో రఘురామిరెడ్డి తీవ్ర నిర్లక్ష్యం గా వ్యవహరించార్న ఆగ్రహం ప్రజలలో వ్యక్తం అవుతోంది. జగన్ పాలనలో నియోజకవర్గం అన్ని రంగాలలో, అన్నివిధాలుగా వెనుకబడిపోయిందని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ప్రజాగ్రహానికి తోడు నియోజకవర్గ వైసీపీలో చాపకింద నీరుగా విస్తరిస్తున్న వర్గ విభేదాలు కూడా ఈ సారి రఘురామరెడ్డి విజయానికి ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉందని అంటున్నారు. దవీనికి తోడు తెలుగుదేశం పార్టీకి జనసే, బీజేపీ మద్దతుగా నిలవడం కూడా మైదుకూరులో తెలుగుదేశం జెండా ఎగరడం ఖాయమని అంటున్నారు.
కమలాపురం నియోజకవర్గం
కమలాపురం నియోజకవర్గంలో 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పి. రవీంద్రనాథ్ రెడ్డి తెలుగుదేశం అభ్యర్థి పుత్తా నరసింహ రెడ్డిపై విజయం సాధించారు. 2024 ఎన్నికల్లోనూ వైసీపీ అధిష్టానం మళ్లీ రవీంద్రనాథ్ రెడ్డినే ఇక్కడ నుంచి పోటీకి దింపుతోంది. అయితే ఇప్పుడు రవీంద్రనాథ్ రెడ్డిపై నియోజకవర్గ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రవీంద్రనాథ్ రెడ్డి హయాంలో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదని ప్రజలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. ఈసారి కమలాపురం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా నరసింహా రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి బరిలోకి దిగుతున్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా యువతలో చైతన్య రెడ్డికి మంచి ఫాలోయింగ్ ఉంది. దీనికితోడు జనసేన, బీజేపీ ఓటు బ్యాంకుకూడా తోడు కావడంతో చైతన్య రెడ్డి గెలుపు జెండా ఎగురవేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అంటున్నారు.
రాజంపేట నియోజకవర్గం
రాజంపేట నియోజకవర్గంలో 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మేడా వెంకట మల్లికార్జునరెడ్డి విజయం సాధించాడు. ఈసారి ఆయన్ను తప్పించి కడప జడ్పీ చైర్మన్ ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డికి వైసీపీ అధిష్టానం ఇక్కడ నుంచి పోటీకి దింపింది. దీంతో మేడా వర్గం తీవ్ర అసంతృప్తితో ఉంది. దీనికితోడు నియోజకవర్గ వైసీపీలో వర్గ విబేధాలు తార స్థాయికి చేరాయి. ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థి ఎవరన్నది ఇంకా నిర్ధారణ కాలేదు. అయితే ఇక్కడ నుంచి కూటమి అభ్యర్థిగా ఎవరు బరిలో నిలిచినా గట్టి పోటీ ఇస్తారనీ, జగన్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత కూటమి అభ్యర్థికి సానుకూల అంశంగా ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
జమ్మలమడుగు నియోజకవర్గం
ఈ నియోజకవర్గం నుంచి 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి మూలే సుధీర్ రెడ్డి విజయం సాధించాడు. వైసీపీ అధిష్టానం సుధీర్రెడ్డికే మరోసారి అవకాశం కల్పించింది. జగన్ సర్కార్ పై యాంటి ఇంకంబెన్సీకీ తోడు అభివృద్ధి జరగకపోవడంతపో నియోజకవర్గంలో వైపీసీ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఐదేళ్లుగా రాష్ట్రంలో, నియోజకవర్గంలో వైసీపీ అధికారంలో ఉన్నా అభివృద్ధిలో వెనుకబ డిపోవడం పట్ల నియోజకవర్గం ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిఎవరన్నది నిర్థారణ కాకపోయినప్పటికీ పొత్తులో భాగంగా ఈ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి బరిలోకి దిగే అవకాశం ఉందంటున్నారు. కూటమి పార్టీల మధ్య ఓట్ ట్రాన్స్ ఫర్ సవ్యంగా సాగితే వైసీపీకి ఇక్కడ గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశాలే మెండుగా ఉన్నాయి.
పులివెందుల నియోజకవర్గం
పులివెందుల నియోజకవర్గం వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నియోజకవర్గం. గత రెండు దఫాలులో వైఎస్ జగన్ ఈ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఇక పులివెందుల అంటేనే వైఎస్ అడ్డా. ఒక్క పులివెందుల అని ఏమిటి మొత్తం ఉమ్మడి కడప జిల్లాయే వైఎస్ కుటుంబం అడ్డాగా చెబుతారు. అయితే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వైఎస్ కుటుంబంలో విభేదాలు, సొంత చెల్లెలే జగన్ కు వ్యతిరేకంగా గళమెత్తడం వంటి అంశాల కారణంగా ఇక్కడ జగన్ కు గతంలోలా విజయం నల్లేరు మీద బండి నడక అయితే కాదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గతంలోలా భారీ మెజారిటీకి అసలు అవకాశమే లేదని చెబుతున్నారు. అన్నిటికీ మించి ఈ సారి ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా బీటెక్ రవి పోటీ చేస్తున్నారు. వివేకానంద రెడ్డి హత్య వ్యవహారంతో జగన్మోహన్ రెడ్డిపై నియోజకవర్గ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు షర్మిల, వివేకా కుమార్తె సునీతారెడ్డిలు జగన్ కు వ్యతిరేకంగా ఉన్నారు. ఇద్దరు కూడా జగన్ కు జగన్ పార్టీకీ ఓటు వేయవద్దని పిలుపునిచ్చారు. అంతే కాకుండా పులివెందుల నుంచి వివేకా కుమార్తె సునీతారెడ్డి పోటీచేసే అవకాశాలు ఉన్నాయి. సునీతారెడ్డి లేదా వివేకా సతీమణి సౌభాగ్యమ్మ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నది అదే జరిగితే జగన్మోహన్ రెడ్డికి పులివెందులలో గట్టి ఎదురుదెబ్బ తగలడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ నేతలు, శ్రేణులు ఐక్యంగా కలిసికట్టుగా పనిచేస్తే జగన్ మోహన్ రెడ్డికి ఎదురీత తప్పదని అంటున్నారు.
ప్రొద్దుటూరు నియోజకవర్గం
ప్రొద్దుటూరు నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజయం సాధించారు. మరోసారి రాచమల్లు శివప్రసాద్ రెడ్డికే వైసీపీ అధిష్టానం టికెట్ కేటాయించింది. కూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్థి వరదరాజుల రెడ్డి పోటీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నట్లే ఇక్కడ కూడా జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. దానికితోడు నియోజకవర్గ వైసీపీలో వర్గ విబేధాలు తార స్థాయికి చేరాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల మధ్య ఓట్ల బదలీ సజావుగా సాగితే తెలుగుదేశం విజయం నల్లేరుమీద బండినడకే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.
కడప నియోజకవర్గం
డప నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి అంజాద్ భాషా విజయం సాధించాడు. జగన్ కేబినెట్ లో ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్నారు. మరోసారి వైసీపీ అధిష్టానం అంజాద్ బాషాకే కడప టికెట్ కేటాయించింది. కూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్థి మాధవి రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యులు, కడప పార్లమెంట్ తెలుగుదేశం అధ్యక్షుడు శ్రీనివాస రెడ్డి సతీమణి మాధవిరెడ్డి. నియోజకవర్గంలో శ్రీనివాస రెడ్డి, మాధవిరెడ్డిలు విస్తృతంగా పర్యటిస్తున్నారు. మాధవిరెడ్డి గత కొన్ని నెలలుగా నియోజకవర్గంలో ప్రజల సమస్యల పరిష్కారంలో కీలక భూమిక పోషిస్తూ.. వైసీపీ అరాచక పాలనను ప్రజల్లో ఎండగడుతున్నారు. నియోజకవర్గంలో ప్రజల మద్దతును కూడగట్టడంలో మాధవిరెడ్డి ఇప్పటికే విజయంసాధించారు. దీనికితోడు జనసేన, బీజేపీ శ్రేణులను కలుపుకొని పోతున్నారు. కడపలో కూటమి నుంచి అధికార వైసీపీ గట్టి పోటీ ఎదుర్కోనడం తథ్యమని అంటున్నారు.
రాయచోటి నియోజకవర్గం
రాయచోటి నియోజకవర్గం నుంచి 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి గడికోట శ్రీకాంత్ రెడ్డి విజయం సాధించారు. వైసీపీ అధిష్టానం మరోసారి గడికోట శ్రీకాంత్ రెడ్డికి టికెట్ కేటాయించింది. ఈ నియోజకవర్గంలో కూటమి నుంచి తెలుగుదేశం అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పోటీ చేస్తున్నారు. జగన్ పాలనపై ప్రజా వ్యతిరేకత, నియోజకవర్గ వైసీపీలో అంతర్గత విభేదాలు శ్రీకాంత్ రెడ్డికి ప్రతిబంధకాలుగా మారే అవకాశం ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాయచోటిలో ఈ సారి హోరాహోరీ తధ్యమని అంటున్నారు.