వడ దెబ్బ భాదిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా

  ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలలో ఎన్నడూ కనీవినీ ఎరుగని విధంగా ఎండలు మండిపోతున్నాయి. గత 65 సం.లలో ఇంత తీవ్రమయిన ఎండలు చూడటం ఇదే మొదటిసారని వృద్ధులు చెపుతున్నారు. రెండు రాష్ట్రాలలో నిత్యం అనేక మంది వృద్దులు, పిల్లలు, ఎండల్లో పనిచేసే శ్రమజీవులు వడదెబ్బ బారినపడి మృతి చెందుతున్నారు. దీనిపై స్పందించిన ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పంచాయతీలు, మున్సిపాలిటీల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఉపాధి కూలీల పని వేళల్లో మార్పులు సూచించారు. ఉదయం పదివరకు మళ్ళీ  ఎండ తీవ్రత తగ్గిన తరువాత సాయంత్రం వేళల్లో పనిచేయాలని సూచించారు. వడదెబ్బ తగలకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో, వడదెబ్బ తగిలిన తరువాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రభుత్వం టీవీలు, పత్రికల్లో విస్తృతంగా ప్రచారం చేస్తోందని, కనుక ప్రజలు కూడా ఆ ప్రకారం తగు జాగ్రత్తలు పాటించాలని హితవు చెప్పారు. వడదెబ్బ కారణంగా మృతి చెందిన కుటుంబాలకు రూ. లక్ష చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తామని ప్రకటించారు.

జూన్ 6న రాజధానికి భూమిపూజ

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం జూన్ 6న రాజధానికి కేవలం భూమిపూజ మాత్రమే చేస్తుందని, శంఖుస్థాపన కాదని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు మీడియాకు తెలిపారు. దసరా పండుగ సమయంలో రాజధానికి శంఖుస్థాపన చేసి వెంటనే నిర్మాణపనులు ఆరంభించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సహా కేంద్రమంత్రులను అనేకమంది ప్రముఖులను ఆహ్వానించి, ప్రధాని చేతుల మీదుగా శంఖుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ఈనెలాఖరులోగా సింగపూర్ సంస్థ నుండి రాజధాని మాష్టర్ ప్లాన్ చేతికి అందుతుందని తెలిపారు. రాజధాని ప్రాంతానికి ఈశాన్యంలో ఉన్న తుళ్ళూరు మండలంలో మందడం-తాళ్లాయపాలెం మధ్య భూమిపూజ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

తమిళనాడు ప్రజలపై జయ వరాల జల్లు

  తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత బాధ్యతలు చేప్పట్టగానే రాష్ట్ర ప్రజలపై వరాల జల్లు కురిపించారు. ఆమె మొదటిరోజే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్న అమ్మ క్యాంటీన్లకు అధనంగా మరో 200 కొత్తగా ఏర్పాటు, నిరుపేద ప్రజలకు మంచి నీళ్ళు సౌకర్యం, అదేవిధంగా కుటుంబ భారం మోస్తున్న నిరుపేద మహిళల కోసం రూ.100 కోట్లతో ప్రత్యేక శిక్షణా సంస్థలు ఏర్పాటు, రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల మరమత్తుల కోసం రూ.1,800 కోట్లు మంజూరు చేస్తూ ఆమె ఫైళ్ళపై సంతకాలు చేసారు. ఆమె అధికారంలో లేనప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన ఓ.పన్నీర్ సెల్వం వాయిదా వేసిన అనేక కార్యక్రమాలను కూడా ఆమె త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. వాటిలో ఎనిమిది నెలల క్రితమే సిద్దమయిన మెట్రో రైల్, ప్రభుత్వం కొనుగోలు చేసిన బస్సులను ఆమె త్వరలోనే ఆరంభించవచ్చును. అదేవిధంగా గత ఎనిమిది నెలలుగా వాయిదా వేసుకొస్తున్న చెన్నైలో నిర్వహించ వలసిన అంతర్జాతీయ పెట్టుబడిదారుల సమావేశాన్ని కూడా త్వరలోనే నిర్వహించవచ్చును.

కేజ్రీవాల్ కు వివాదాలంటే ఇష్టం.. కిరణ్ రిజిజు

ఢిల్లీ ప్రభుత్వానికి లెఫ్టినెంట్ గవర్నర్ నియామకం విషయంలో ఎన్నో వివాదాలు తలెత్తిన విషయం తెలిసిందే. వివాదాల మధ్యే కేంద్రం నజీబ్ జంగ్ ను లెఫ్టినెంట్ గవర్నర్ గా నియమించింది. ఈ నేపథ్యంలో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ ను అడ్డం పెట్టుకొని బీజేపీ తమపై పెత్తనం చెలాయించాలని చూస్తోందని ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. కేజ్రీవాల్ కు వివాదాలతోనే కాలం సరిపోతుందని, ఎన్టీయే ప్రభుత్వానికి పరిపాలన ముఖ్యమని కానీ కేజ్రీవాల్ కు వివాదాలంటే మక్కువ ఎక్కువని విమర్శించారు.

అవినీతిని సహించేది లేదు.. చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఏడాది పాలన సందర్భంగా సచివాలయంలో కలెక్టర్ లతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎట్టి పరిస్థితుల్లో అవినీతిని సహించేది లేదని, అధికారులు నీతిగా పనిచేయాలని ఆదేశించారు. కలెక్టర్లను పనిలో వేగం పెంచాలని సూచించారు. రుణమాఫీ ప్రక్రియను సమర్ధవంతంగా పర్యవేక్షించాలని, రైతు సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని అన్నారు. ఉద్యోగులకు బదిలీ అనేది ఒక వేధింపు కాకూడదని, మాట విననప్పుడు మాత్రమే అది చివరి అస్త్రం కావాలని అన్నారు. అంతేకాకుండా ఎండ తీవ్రతకు వడదెబ్బ తగలకుండా గ్రామాల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని, అవసరమైనవారికి మజ్జిగ కూడా అందించాలని సూచించారు.

మావోయిస్ట్ అయితే అరెస్ట్ చేస్తారా.. కేరళ కోర్టు

కేరళ కోర్టు శుక్రవారం వెలువరించిన తీర్పుతో పోలీసులు ఒక్కసారిగా షాకయ్యారు. అంతలా వాళ్లు షాకయ్యే తీర్పు ఏమిచ్చిందో చూద్దాం. శ్యామ్ బాలకృష్ణ అనే వ్యక్తిని కేరళ పోలీసులు నక్సల్ పేరుతో అరెస్ట్ చేశారు. బాలకృష్ణను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్ దాఖలైంది. శనివారం ఈ పిటిషన్ పై జస్టిస్ మొహమ్మద్ ముస్తాఖ్ విచారణ జరిపారు. నేరం చేశాడని ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం మావోయిస్ట్ అనే ఒకే ఒక్క కారణంతో బాలకృష్ణను అరెస్ట్ చేశారని నమ్ముతున్నానని అన్నారు. అయినా మావోయిస్ట్ అయినంత మాత్రానా అరెస్ట్ చేస్తారా? ఎక్కడైనా భౌతిక దాడులకు పాల్పడ్డారా, ఆస్తులు ధ్వంసం చేశారా లేక హింసాత్మక చర్యలకు దిగారా అని ప్రశ్నించారు. మావోయిస్ట్ అని పేరున్నంత మాత్రన అరెస్ట్ చేయడం సబబు కాదని తీర్పు నిచ్చారు. బాలకృష్ణను అరెస్ట్ చేసి అతని వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించారని, అతనికి నష్ట పరిహారం కింద రూ. 2 లక్షల రూపాయలు ఇవ్వాలని ఆదేశించారు. ఈ తీర్పుతో కేరళ పోలీసులు నిర్ఘాంతపోయారు.

ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులిస్తాం.. జైట్లీ

ఏడాది మోదీ పాలనపై ఏర్పాటుచేసిన రెండో మీడియా సమావేశంలో కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గురించి మాట్లాడుతూ... కొన్ని సాంకేతిక కారణాల వల్లే ఏపీకీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని, కానీ ఏపీకీ ప్రత్యేక హోదా కంటే ఎక్కువ నిధులు ఇస్తామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు ఇచ్చిన హామీలన్నింటిని నెరవేరుస్తామని అన్నారు. రాష్ట్ర విభజనతో హైదరాబాద్ ను కోల్పోవడం వల్ల ఏపీ కోల్పోయిన నిధులన్నింటిని సమకూరుస్తామని, ఒక్క రూపాయి కూడా తక్కువ కాకుండా చూస్తామని హామీ ఇచ్చారు. దేశంలో అవినీతి పాలన పోయి పారదర్శక పాలన వచ్చిందని అరుణ్ జైట్లీ అన్నారు.

'గే వరుడు కావలెను'... సూపర్ రెస్పాన్స్

రెండు రోజుల క్రితం వచ్చిన 'గే వరుడు కావలెను' అను ప్రకటన సోషల్ మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ ప్రకటనకు అనూహ్యమైన స్పందన వచ్చిందని, భారత్ తోపాటు ప్రపంచ వ్యాప్తంగా 73 మంది నుండి ప్రపోజల్స్ వచ్చాయని గే హరీష్ తల్లి పద్మ అయ్యర్ తెలిపారు. ఈ ప్రకటనకు వచ్చిన స్పందన చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, తన వయసు 58 సంవత్సరాలు తను ఈ లోకాన్ని విడిచి వెళ్లేలోపు తన కుమారుడిని ఒక ఇంటి వాడిని చేద్దామనే ఉద్దేశంతోనే ప్రకటన ఇచ్చానని పద్మ అయ్యర్ తెలిపారు. ఒక్క భారత్ లోనే కాకుండా అమెరికా, ఆస్ట్రేలియా, యూకే, సౌదీ అరేబియా నుండి మంచి స్పందన వచ్చిందని అన్నారు. అబుదాబి నుంచి ఓ వ్యక్తి తనను పెళ్లి చేసుకుంటే ఆయనకున్న రాజభవనంలాంటి ఇల్లు రాసిస్తానన్నారని హరీష్‌ చెప్పారు.

జయలలిత ప్రమాణ స్వీకారానికి ప్రముఖులు

  అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. జయలలితతో పాటు మరో 28 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ మంత్రుల సామూహిక ప్రమాణ స్వీకారం తమిళనాడు చరిత్రలోనే మొదటిసారి. మద్రాస్ యూనివర్శిటీ సెంటినరీ ఆడీటోరియంలో జరిగిన జయలలిత ప్రమాణ స్వీకారానికి సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా, హీరో శరత్ కుమార్, జయలలితకు అత్యంత సన్నిహితురాలైన శశికళ, కొడుకు సుధాకర్, కుటుంబసభ్యులు హాజరయ్యారు. అంతేకాక పార్టీ సీనియర్ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున జయలలిత ప్రమాణ స్వీకారానికి తరలి వచ్చారు.

చిన్నారిని చంపేసిన పులి

బీహార్లోని పశ్చిమ చంపారన్ జిల్లాలో ఓ దారుణమైన ఘటన జరిగింది. ఐదేళ్ల చిన్నారిపై ఓ పులి దాడి చేసి చంపేసింది. వివరాల ప్రకారం.. బెరిహండీ గ్రామ సమీపంలో వాల్మీకి నేషనల్ పార్క్ సమీపంలో చిన్నారి బబ్లూ ఆడుకుంటున్నాడు. ఇంతలో ఒక పులి ఆకస్మాత్తుగా వచ్చి బబ్లూపై పడి దాడి చేసి అతని శరీరాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి చంపేసింది. ఈ ఘటనతో గ్రామస్థలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే వాల్మికి నేషనల్ పార్క్ లో గత మూడేళ్లలో పులల సంఖ్య ఎక్కువైందని, పార్క్ పరిసర ప్రాంత ప్రజలు కాస్త జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. చనిపోయిన బబ్లూ కుటుంబానికి ప్రభుత్వ విధానం ప్రకారం రూ.2లక్షల రూపాయలు నష్ట పరిహారం అందిస్తామని అధికారులు తెలిపారు.

భానుడి భగభగ... ఐఎండీ రెడ్ అలర్ట్

గత రెండురోజుల నుండి తెలుగు రాష్ట్రాల్లో ఎండ తీవ్రత చాలా ఎక్కవైంది. ప్రజలు భయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో భారత వాతావరణశాఖ శనివారం రెడ్ అలర్ట్ ప్రకటించింది. రాగల రెండు, మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని, ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని భారత వాతావరణ శాఖ (ఐఎండీ)హెచ్చరించింది. ఎండ తీవ్రతకు తెలంగాణ రాష్ట్రంలో 223 మంది, ఆంధ్ర రాష్ట్రంలో 204 మంది మొత్తం రెండు రాష్ట్రాలల్లో కలిపి 427 మంది మరణించారు. హైదరాబాద్ లో 43.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా గత ఐదేళ్లలో ఇదే అత్యధికం అని అధికారులు తెలిపారు. కాగా వడదెబ్బ వల్ల చనిపోయిన కుటుంబాలకు ఆపద్భందు పథకం కింద రూ.50 వేల రూపాయలు ఆర్థిక సాయం అందిస్తామని అధికారులు తెలిపారు.

నలుగురు ఎమ్మెల్సీల పేర్లు ఖరారు

ఆంధ్రప్రదేశ్ టీడీపీ ప్రభుత్వం గవర్నర్ కోటాలో ఉన్న నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్ధులను ఖరారు చేసింది. ఆ నలుగురు కృష్ణాజిల్లాకు చెందిన టీడీ జనార్ధన్, నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసులు, నెల్లూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీద రవిచంద్రయాదవ్. అయితే మొదట విజయవాడ మాజీ మేయర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధకు స్థానం ఇవ్వాలనుకున్న అధిష్ఠానం చివరి నిమిషంలో అభిప్రాయం మార్చుకొని ఆ స్థానాన్ని బీద రవిచంద్రయాదవ్ కు ఇచ్చారు. గవర్నర్ కోటాలో ఎన్నికైన ఈ నలుగురు ఎమ్మెల్సీలు ఆరెళ్ల పాటు పదవిలో కొనసాగుతారు.

కేసీఆర్ కుట్రలు తిప్పి కొడతాం... ఓయూ

ఉస్మానియా యూనివర్శిటిలో విద్యార్ధుల ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఓయూలో ఉన్న భూమిలో పేదలకు ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఓయూ విద్యార్ధుల సంఘాలు దుమ్మెత్తి పోస్తున్నాయన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విద్యార్ధి సంఘాలు ఓయూలోని ఇంచి భూమిని కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ కు ఓయూ భూముల పట్ల ఉన్న బుద్ధి మారాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్ట్స్ కాలేజ్ సమీపంలోని సరస్వతి దేవాలయంలో ప్రత్యేకపూజలు కూడా చేశారు. ఓయూ లో భూములను విద్య కోసం ఉపయోగించాలే తప్ప ఇతర అవసరాలకు ఉపయాగిస్తే కేసీఆర్ ను ఆర్ట్స్ కాలేజీ కిందే బొంద పెడతామని విద్యార్ధిసంఘాలు హెచ్చరించాయి. ఓయూ భూముల పై కేసీఆర్ వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్రపతి, ప్రధానికి లేఖలు రాయనున్నారు. ఓయూ నిరుద్యోగ జేఏసీ చెైర్మన్ కల్యాణ్ మాట్లాడుతూ కేసీఆర్ ఓయూ భూములపై చేస్తున్న కుట్రలను తిప్పి కొడతామని వ్యాఖ్యానించారు.

రామ్‌ చరణ్‌ తేజ్ విమానం ల్యాండ్ అయింది

  ప్రముఖ తెలుగు సినిమా నటుడు రామ్‌ చరణ్‌ భాగస్వామిగా ఉన్న టర్బో మేఘా ఎయిర్‌వేస్‌-‘ట్రూజెట్‌’ అనే పేరుతో దేశంలో విమాన సేవలు అందించేందుకు సిద్దమవుతోంది. ఆ సంస్థకు చెందిన 72 సీట్ల విమానం నిన్న మలేషియాలోని సుబాంగ్‌ ఎయిర్‌పోర్టు నుంచి రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రాయానికి చేరుకుంది. ట్రూజెట్ విమాన సేవలు జూన్ నెలాఖరులోగా లేదా జూలై మొదటి వారం నుండి మొదలయ్యే అవకాశం ఉంది. ఈ సంస్థ మొదట కేవలం 8 ప్రధాన పట్టణాలకు విమాన సర్వీసులు నడుపుతుంది. తరువాత క్రమంగా ఆంధ్రా, తెలంగాణా రాష్ట్రాలతో సహా దేశంలో ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా తన సేవలను విస్తరింపజేయాలని భావిస్తోంది. హైదరాబాద్‌ ప్రధాన కేంద్రంగా విమాన సర్వీసులను నిర్వహించనున్న ఈ సంస్థకు వంకాయలపాటి ఉమేశ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు. దీనికి కేంద్ర పౌర విమానయాన శాఖ 2014 లోనే అవసరమయిన అన్ని అనుమతులు ఇచ్చింది. రెండు ఎటిఆర్‌ విమానాల కొనుగోలుకు కూడా అనుమతులు మంజూరు చేయగా వాటిలో మొదటిది నిన్న హైదరాబాద్ చేరుకొంది. త్వరలోనే రెండవ విమానం కూడా హైదరాబాద్ చేరుకోవచ్చునని సమాచారం.   దేశంలో అనేక ప్రైవేట్ విమాన సంస్థలున్నాయి. వాటిలో విజయవాడ కేంద్రంగా విమానయాన సర్వీసులను అందిస్తున్న ఎయిర్‌కోస్టా సంస్థ తెలుగువారికి చెందిన మొట్టమొదటి విమాన సంస్థ కాగా, ఇప్పుడు రామ్‌ చరణ్‌కు చెందిన ట్రూజెట్ సంస్థ రెండవది. మెగా ఫ్యామిలీ సభ్యులు అటు రాజకీయాలలో, ఇటు సినిమాలలో కూడా ఉన్నందున, అది ట్రూజెట్ సంస్థకు అదనపు ఆకర్షణ అవుతుంది కనుక ఆ సంస్థకు ప్రజల నుండి మంచి ఆదరణే లభించవచ్చును.

జయలలిత ప్రమాణ స్వీకారానికి బాంబు బెదిరింపు

అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ప్రమాణ స్వీకారం శనివారం జరగనుంది. ఆమె ప్రమాణ స్వీకారం తమిళనాడులోని చెపాక్ క్యాంపస్ లో జరగనుంది. ఈ నేపథ్యంలో ఆమె ప్రమాణ స్వీకార కార్యక్రమానికి బాంబు బెదిరింపు వచ్చినట్టు మద్రాసు రైల్వే పోలీసులు తెలిపారు. గురువారం అర్ధరాత్రి బాంబు పెట్టారనే బెదిరింపు కాల్ వచ్చిందని చెప్పారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఆ కాల్ ఎక్కడినుండి వచ్చిందని విచారణ చేపట్టగా అది ఒక మానసిక వికలాంగుడు చేసినట్టు తెలిసింది. అది ఉత్తుత్తి బెదిరింపు కాల్ అని తెలిశాక పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనతో జయలలిత ప్రమాణ స్వీకారానికి భారీ భద్రత ఏర్పట్లు చేశారు. గుర్తింపు కార్డు ఉన్నవాళ్లనే లోపనికి అనుమతిస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. జయలలిత తోపాటు మరో 28 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

బయటపడిన 50 కేజీల బాంబు

ఎప్పుడో రెండో ప్రపంచ యుద్ధం కాలంనాటి 50 కేజీల బాంబు ఇప్పుడు బ్రిటన్ లో బయటపడింది. ఇప్పటి వరకూ పేలకుండా ఉన్న ఈ బాంబును లండన్ లోని వెంబ్లె జాతీయ ఫుట్ బాల్ మైదానంలో కనుగొన్నారు. దీంతో పోలీసులు వెంటనే అప్రమత్తమై సమీపంలో నివసిస్తున్న వారందరిని ఖాళీ చేయించారు. 50 కేజీల బరువు ఉన్న ఈ బాంబు పేలితే 400 మీటర్ల వరకు ఏమీ మిగలదని లండన్ మెట్రోపాలిటన్ పోలీసులు హెచ్చరించారు. ఈ బాంబును 1940 కు ముందు లండన్ పై జర్మనీ విసిరిందని, ఎటువంటి ప్రమాదం జరగకుండా దీన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, దీనికి ప్రజలు కూడా సహకరించాలని పోలీసులు కోరారు. గతంలో కూడా లండన్ లోని బెర్మాండ్ సేలో 250 కేజీల బాంబును గుర్తించి సురక్షితంగా నిర్వీర్యం చేశారు.