కులాంతర వివాహానికి 50 వేల జరిమానా

చాలామంది కులాంతర వివాహాలు చేసుకుంటారు. కానీ వారికి ఎటువంటి జరిమానా ఉండదు. కులాంతర వివాహానికి జరిమానా కట్టడం ఏంటని అనుకుంటున్నారా? ఇలాంటి విచిత్రమైన ఘటన బీహార్ లో జరిగింది. బీహార్ లోని గోగ్రా గ్రామానికి చెందిన చోటు కుమార్ యాదవ్ అనే యువకుడు తన పక్క గ్రామం రోహియాకు చెందిన సోని దేవిని కులాంతర వివాహం చేసుకున్నాడు. అయితే వీరి కులాంతర వివాహానికి ఆ గ్రామ పెద్దలు ఆగ్రహించి వారికి 50 వేల రూపాయలు జరిమానా విధించారు. దీంతో చోటు దంపతులు భయపడి ఊరినుండి పారిపోయారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే చోటు దంపతులు ప్రాణ భయంతోనే పారిపోయారని, వారి తల్లిదండ్రులు కూడా ఇంట్లోనుండి బయటకు రావట్లేదని ఊరి పంచాయితీ పెద్ద మహేందర్ రవిదాస్ తెలిపారు.

తండ్రిని కొట్టి అమ్మాయిపై అఘాయిత్యం

ఒంటరిగా ఉండే అమ్మాయిల మీద అఘాయిత్యాలు జరిగే రోజులు పోయాయి. ఇప్పుడు తోడుగా ఉన్నా వాళ్లని కొట్టి మరీ అమ్మాయిల మీద అత్యాచారాలు చేసే రోజులొచ్చాయి. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా బంట్వారం మండలం బారువాడలో ఇలాంటి ఘటనే జరిగింది. తొమ్మిదో తరగతి చదువుతున్న ఓ 13 ఏళ్ల బాలిక, తన తండ్రి ఇద్దరూ కలిసి ఆటోలో కలిసి వెళుతూ మంచినీటి కోసం ఆగారు. అయితే తండ్రి మంచినీటి కోసం క్రిందకు దిగగా ఐదుగురు దుండగులు వచ్చి ఆమెను బలవంతంగా ఆటోలో ఎత్తికెళ్లారు. వారిని అడ్డుకునేందుకు వచ్చిన ఆ బాలిక తండ్రిని బండరాయితో కొట్టి ఆమెను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ ఐదుగురు నిందితులు కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మన్మోహన్ కు రాసిన లేఖ మోడీకి చేరింది

ఓ యువకుడు 15 నెలల క్రితం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు రాసిన లేఖ ప్రస్తుత ప్రధాని అయిన మోడీకి అందింది. ఈ విచిత్రమైన ఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లో బులంద్ షహర్ ప్రాంతానికి చెందిన మంజిత్ అనే యువకుడు తన చెల్లెళ్ల పెళ్లిళ్లు చేయలేకపోతున్నానని, ఉద్యోగం ఇప్పించాలంటూ కోరుతూ అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఓ లేఖ రాశాడు. కానీ అప్పట్లో ప్రభుత్వాలు మారడం, మోడీ ప్రధాని కావడం, ఆలేఖను మోడీ చూడటం జరిగాయి. దీంతో ఆ యువకుడికి రూ.50 వేలు ఆర్ధిక సహాయం అందించారు. కానీ తన ఇద్దరు చెల్లెళ్ల పెళ్లి చేయడానికి కనీసం 7 లక్షల రూపాయలు ఖర్చవుతుందని, మోడీ అందించిన 50 వేలు ఏ మూలకీ రావని యువకుడి కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు

అంతా మోడీ ఫలితమే.. అరుణ్ జైట్లీ

ఎన్డీఏ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసిన సందర్భంగా ఢిల్లీలో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంవత్సర పాలనలో ఎన్డీఏ ప్రభుత్వం సాధించిన లక్ష్యాలను వివరించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల వరుసలో భారత్ చేరిపోయిందని, ఇతంతా మోడీ శ్రమ ఫలితమేనని ఆయన వ్యాఖ్యానించారు. దేశాన్ని ఇంకా అభివృద్ధి చేసేందుకు మోడీ ఏడాదిలో 18 దేశాలు పర్యటించారని తెలిపారు. ఇంకా... ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇచ్చే పరిహారాన్ని పెంచామని, ఆర్ధిక లోటును తగ్గించడంలో విజయం సాధించామని అరుణ్ జైట్లీ వివరించారు.

తుది నిర్ణయం లెఫ్టినెంట్ గవర్నర్దే

గత కొన్ని రోజులుగా ఢిల్లీ ప్రభుత్వం లెఫ్టినెంట్ గవర్నర్ నియామకంలో చాలా వివాదాలే జరుగుతున్నాయి. ఈ వివాదంలో ఆఖరికి కేంద్ర ప్రభుత్వమే రంగంలోకి దిగివచ్చింది. ఢిల్లీ ప్రభుత్వానికి తాత్కాలికంగా శకుంతలా గామ్లిన్‌ను లెఫ్టినెంట్ గవర్నర్ గా ఉన్నా.. ఢిల్లీ లెప్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ కు అధికారాలు స్పష్టం చేస్తూ కేంద్రం గెజిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఢిల్లీ ప్రభుత్వ పరిపాలనపై తుది నిర్ణయం తీసుకునేది లెఫ్టినెంట్ గవర్నర్ దేనని, కొన్నిటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నా... తుది నిర్ణయం మాత్రం లెఫ్టినెంట్ గవర్నర్ దేనని స్పష్టం చేశారు. దీంతో లెఫ్టినెంట్ గవర్నర్ ను అడ్డుపెట్టుకొని బీజేపీ ఆప్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టడానికి చూస్తుందని ఆప్ విమర్శిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్, నజీబ్ లు లేఖాస్త్రాలు సంధించున్నారు. ప్రభుత్వాన్ని మీ చేతుల్లోకి తీసుకోవద్దని లెఫ్టినెంట్ గవర్నర్ కు కేజ్రీవాల్ లేఖ రాయగా... తమ అధికారాలు గురించి కేజ్రీవాల్ చెప్పాల్సిన అవసరం లేదని ప్రతిస్పందించారు. ఈ ఆధిపత్య పోరు కాస్తా ముదిరి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దాకా వెళ్లింది.

15 రోజుల తర్వాత భూములు తీసుకుంటాం.. నారాయణ

ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని నిర్మాణం కోసం భూసేకరణపై ప్రభుత్వం జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో కొంతమంది ప్రభుత్వం జారీ చేసిన జీవో పై హైకోర్టును ఆశ్రయించగా దానిపై స్టే విధించినట్టు వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ విషయం పై ఆంధ్రప్రదేశ్ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ స్పందించి భూసేకరణపై హైకోర్టు స్టే ఇవ్వలేదని దీనిని కొంతమంది వక్రీకరిస్తున్నారని అన్నారు. భూసేకరణపై విచారణ జరిగిందని మరో 15 రోజుల తర్వాత భూసేకరణ చట్టం ద్వారా భూములు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. మే నెలఖారులోగా 20 వేల ఎకరాల భూమిని తీసకుంటామని, జూన్ లో మరో 20 నుండి 25 వేల ఎకరాల భూమిని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ కొన్న భూములకు రూ. 65 వేల కోట్లు వరకూ పరిహారం చెల్లించామని మంత్రి నారాయణ తెలిపారు.

చిత్రపరిశ్రమ కొందరి చేతుల్లోనే ఉంది

తెలంగాణ జేఏసీ ప్రతినిధులు ఆ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిశారు. తెలంగాణలో చిత్ర పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై జేఏసీ ప్రతినిధులు.. శ్రీనివాస్ యాదవ్ తో ముచ్చటించారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ తెలంగాణలో ఉన్న చిత్రపరిశ్రమ కొందరి వ్యక్తుల చేతుల్లో నడవడం సబబుకాదన్నారు. కేవలం పెద్ద సినిమాలు, పెద్ద నిర్మాతలు మాత్రమే వృద్ధి చెందితే సరిపోదు, చిన్న సినిమాలు, చిన్న నిర్మాతలు కూడా వృద్ధి చెందాలని అన్నారు. ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పన్ను విధానం అశాస్త్రీయంగా ఉందని, ఈ విధానాన్ని సవరించాల్సిన అనసరం ఉందని మంత్రిగారిని కోరినట్టు కోదండరాం తెలిపారు.

సెల్వం రాజీనామా, జయలలిత శాసనసభా పక్షనేతగా ఎన్నిక

  ఈరోజు ఉదయం తమిళనాడు ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం గవర్నర్ రోశయ్యను కలిసి ఆయనకి తన రాజీనామా పత్రం సమర్పించారు. దానిని ఆయన వెంటనే ఆమోదించారు. ఆ తరువాత చెన్నైలో జరిగిన అన్నాడీ.యం.కె. పార్టీ శాసనసభ సభ్యుల సమావేశంలో పన్నీర్ సెల్వం స్వయంగా జయలలితను తమ పార్టీ శాసనసభా పక్షనేతగా ప్రతిపాదించగా దానిని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి యన్.ఆర్. విశ్వనాథం బలపరిచారు. మిగిలిన సభ్యులు అందరూ కూడా ఆ ప్రతిపాదనకు మద్దతు తెలపడంతో జయలలిత శాసనసభా పక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయినట్లు ప్రకటించారు. రేపు ఉదయం 11గంటలకు మద్రాస్ యూనివర్సిటీలో ఆమె తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారనే వార్త తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నేతలు, కార్యకర్తలు సంబరాలు చేసుకొంటున్నారు. చెన్నై అంతటా వీధివీధినా ఆమె ఫోటోలున్న పోస్టర్లు, బ్యానర్లు, కటవుట్లు కనబడుతున్నాయి.

తాళ్లాయపాలెంలో రాజధానికి శంఖుస్థాపన?

  వచ్చే నెల ఆరవ తేదీన ఆంద్రప్రదేశ్ రాజధాని అమరావతికి శంఖుస్థాపన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అయితే ఆ కార్యక్రమం ఎక్కడ నిర్వహించాలనే విషయం కూడా ఇప్పుడు దాదాపు ఖరారు అయింది. దీని కోసం క్షేత్రస్థాయి పరిశీలన చేసిన అధికారులు, వాస్తు పండితులు రాజధాని ప్రాంతానికి ఈశాన్యంలో శ్రీశైవ క్షేత్రమనే పుణ్యస్థలి, ఆ పక్కనే కృష్ణా తీరం కూడా ఉన్నందున తుళ్లూరు మండలంలో తాళ్లాయపాలెం గ్రామంలో రాజధాని నిర్మాణానికి శంకుస్థాపన చేయడం అన్నివిధాల మంచిదని ప్రభుత్వానికి సూచించారు. రాజధాని నిర్మాణం కోసం ఆ ప్రాంతంలోనే అనేకమంది రైతులు తమ భూములు ప్రభుత్వానికి ఇచ్చేరు గనుక తాళ్లాయపాలెంలోనే శంఖుస్థాపన చేసినట్లయితే ఎటువంటి అవాంతరాలు లేకుండా కార్యక్రమం పూర్తి అవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈరోజు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో దీనిపై తుది నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది. అధికారుల చేసిన ఈ ప్రతిపాదనకు మంత్రివర్గ ఆమోదముద్ర పడగానే తాళ్లాయపాలెంలో శంఖుస్థాపనకు అవసరమయిన ఏర్పాట్లు చేయడం మొదలుపెడతారు.

ఆర్టీసీ విభజనకు మరో చిన్న ఆటంకం

  ఇంతవరకు ఉమ్మడిగా సాగుతున్న ఏపీయస్ ఆర్టీసీని ఈనెల 28నుండి ఇరు రాష్ట్రాలు వేర్వేరుగా నిర్వహించుకోవాలని అంగీకరించాయి. అందుకోసం హైదరాబాద్ లో గల బస్ భవన్ లోనే వేర్వేరుగా కార్యాలయాలు ఏర్పాటు, అధికారుల కేటాయింపు కూడా పూర్తయింది. ఇక ఈనెల 25న ఏపీయస్ ఆర్టీసీ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి దానికి ఆమోదముద్ర వేయడం లాంచన ప్రాయమేనని అందరూ భావిస్తున్న తరుణంలో సాంకేతిక కారణం వలన ఆ సమావేశం రద్దు చేయబడింది. పాలక మండలిలో రెండు రాష్ట్రాలకు జనాభా ప్రాతిపదికన తగినంత ప్రాతినిధ్యం కలిగి ఉండాలనే విభజన చట్టంలో ఉన్న షరతు వలన సమావేశం కంటే ముందు రెండు రాష్ట్రాల సభ్యులతో కూడిన పాలకమండలి ఏర్పాటు చేయవలసిన అవసరం ఏర్పడింది. అందుకు సంబంధించి మార్గదర్శకాలను కూడిన ఉత్తర్వులను కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖ జారీ చేయవలసి ఉంటుంది. కనుక పాలకమండలిని ఏర్పాటుచేసే వరకు సామవేశాన్ని రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులకు లేఖలు వ్రాయడంతో ఈనెల 25న జరగవలసిన సమావేశం రద్దు అయింది. ఆర్టీసీకి పాలకమండలిని ఏర్పాటుచేసి, సమావేశం నిర్వహించి ఆర్టీసీ విభజనకు ఆమోదం తెలిపే వరకు యాధావిదిగా ఆర్టీసీ ఉమ్మడిగానే కొనసాగుతుంది.

మనిషిని మిగిన మొసలి

  స్నానం చేయడానికి కాలువలో దిగిన ఒక వ్యక్తిని అందులో ఉన్న మొసలి మింగేసింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోని ఛత్తాపూర్‌లో వున్న టైగర్ రిజర్వ్‌లో జరిగింది. దుర్జన్ యాదవ్ అనే వ్యక్తి ప్రతిరోజూ ఒక కాలువలో స్నానానికి వెళ్తూ వుంటాడు. అయితే గురువారం నాడు యాదవ్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో అతని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు, ఫారెస్టు అధికారులు కాలువ వద్దకు వెళ్ళి గాలింపు జరిపారు. అక్కడ లభించిన గుర్తుల ఆధారంగా దుర్జన్ యాదవ్‌ని మొసలి మింగేసిందని నిర్ధారించారు. అయితే సదరు కాలువలో మొసళ్ళు ఎక్కువగా వుంటాయని చెబుతారు. ఆ విషయం తెలిసినా ఆ కాలువలో స్నానం చేయడానికి వెళ్ళడం దుర్జన్ యాదవ్‌ ప్రాణాలు పోగొట్టుకోవడానికి కారణమైందని పోలీసులు చెబుతున్నారు. మృతదేహం కోసం వెతకాలని యాదవ్ బంధువులు వేడుకుంటున్నారు. అయితే మొసళ్ళ భయంతో ఎవరూ కాలువలోకి దిగడానికి సాహసించడం లేదు.

జగన్ తలపెట్టింది ‘అసుర దీక్ష’

  వైసీపీ అధినేత జగన్ మళ్ళీ దీక్షల బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని ఏర్పాటవుతున్న అమరావతి ప్రాంతంలో వున్న మంగళగిరి హైవే పక్కన జూన్ 3, 4 తేదీల్లో ‘సమర దీక్ష’ పేరుతో ఆయన దీక్ష చేయబోతున్నారు. ఈ దీక్ష ద్వారా ప్రభుత్వాన్ని మరింత చికాకు పెట్టాలన్నది జగన్ ఆలోచన. అయితే ఈ దీక్షను ఆంధ్రప్రదేశ్ మంత్రి రావెల కిషోర్ బాబు ‘అసుర దీక్ష’గా పేర్కొన్నారు. అధికారంలోకి వచ్చి మళ్ళీ రాష్ట్రాన్ని భారీగా దోచుకోవాలని ప్లాన్ చేస్తున్న జగన్ త్వరలో మళ్ళీ జైలుకు వెళ్ళడం ఖాయం అని కిషోర్ బాబు విమర్శించారు. జగన్ ఇలాంటి దీక్షలు ఎన్ని చేసినా ప్రయోజనం వుండదని ఆయన అన్నారు.

దొంగని పట్టిచ్చిన గేదె

  గేదె పాలు ఇవ్వడం మాత్రమే కాదు.. పారిపోతున్న దొంగలను కూడా పట్టిస్తుంది. నమ్మలేకపోతున్నారా? నిజంగానే ఓ గేదె దొంగని పట్టించింది. ఈ ఘటన పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలంలో జరిగింది. ఈ మండలంలోని మన్నెంవారిపల్లె గ్రామానికి చెందిన ఓ ఇంట్లోకి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నలుగురు గుర్తు తెలియని ప్రవేశించారు. ఇంట్లో వున్న వారిని బెదిరించి వారి దగ్గర వున్న నగలు, నగదును దోచుకున్నారు. ఇంతలో ఆ ఇంట్లోవారు కేకలు వేయడంతో దొంగలు పరుగు అందుకున్నారు. అయితే ఆ ఇంటి ఆవరణలో కట్టేసి వున్న ఒక గేదె ఆ దొంగల్లో ఒకడిని కసిదీరా పొడిచింది. దాంతో అతను అక్కడే స్పృహతప్పి పడిపోయాడు. మిగతావారు పారిపోయారు. పోలీసులు ఆ దొంగను అదుపులోకి తీసుకున్నారు. అతను కోలుకున్న తర్వాత అతని ద్వారా మిగతా దొంగల ఆచూకీ తెలుసుకుంటామని చెబుతున్నారు.

అమెరికాలో ఇండియన్ కాల్చివేత

  అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం సెయింట్ అగస్టీన్‌లో ఓ నిత్యావసర వస్తువుల దుకాణంలో క్లర్క్‌గా పనిచేస్తున్న ఒక భారతీయ యువకుడు దుండగుల దాడిలో ప్రాణాలు వదిలాడు. ఆ యువకుడు పనిచేసే దుఖాణంలోకి ఇద్దరు టీనేజ్ యువకులు ముఖాలకు గుడ్డలు కట్టుకుని ప్రవేశించారు. దోపిడీ చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో ఆ యువకులు అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మానవ్ దేశీ అనే భారతీయ యువకుడి మీద దాడి చేశారు. ఈ దాడిలో ఆ భారతీయ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. గతంలో ఉత్తర కరోలినా ప్రాంతంలో నివసించిన మానవ్ దేశీ రెండు నెలల క్రితమే ఫ్లోరిడాకు వచ్చాడు. త్వరలో మానవ్ వివాహం జరగనున్నట్టు తెలిసింది. ఇంతలోనే ఈ దారుణం జరిగిపోయింది. దాడికి పాల్పడిన యువకులను పోలీసులు అరెస్టు చేశారు.