ఆర్టీసీ ఛార్జీలు పెంచుతాం.. తెలంగాణ మంత్రి

  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆర్టీసీఉద్యోగులకు 44 శాతం ఫిట్‌మెంట్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వం ఆర్టీసీ ఛార్జీలు పెంచడానికి సిద్ధమవుతోంది. త్వరలో ఆర్టీసీ ఛార్జీలు పెంచబోతున్నామని తెలంగాణ రాష్ట్ర రవాణ శాఖ మంత్రి మహేందర్రెడ్డి వెల్లడించారు. తప్పనిసరి పరిస్థితుల కారణంగానే ఆర్టీసీ ఛార్జీలు పెంచబోతున్నామని చెప్పారు. ఆర్టీసీలో ఆస్తుల పంపిణీ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని, తెలంగాణలో ఉన్న ఆర్టీసీ ఆస్తులు ఈ ప్రాంతానివే అని మహేందర్రెడ్డి చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులకు ఎంట్రీ ట్యాక్స్ చెల్లించాల్సిందేని ఆయన స్పష్టం చేశారు. మే 28 నుంచి ఆర్టీసీ రెండుగా విడిపోతున్న విషయం తెలిసిందే.  

గోదావరిలో పడిన భద్రాచలం బస్సు

  ప్రయాణికులతో వున్న బస్సు భద్రాచలం వద్ద వంతెన మీదనుంచి గోదావరిలో పడిపోయింది.ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా పలువురు ప్రయాణికులు గాయపడ్డాడరు. సారపాక నుంచి భద్రాచలం వెళ్తున్న బస్సు వంతెన ఎక్కే సమయంలో ఎడమవైపు వేగంగాదూసుకెళ్ళి తలకిందులుగా నదిలో పడిపోయినట్టు తెలుస్తోంది. అయితే నదిలో నీళ్ళలో కాకుండా నీళ్ళు లేని ప్రాంతంలోనే బస్సు పడింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మరణించింది.30 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా వున్నట్టు తెలుస్తోంది. బస్సు పల్టీలు కొడుతూ కింద పడిపోవడంతో గాయపడినవారి సంఖ్య బాగా పెరిగింది. గాయపడిన వారిని భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో మరణించిన మహిళను నల్గొండ జిల్లా కోదాడ పట్టణానికి  చెందిన బి.శ్రీవాణి (30)గా గుర్తించారు.

ఏపీ ఎంసెట్ టాపర్లు వీరే...

  ఏపీ ఎంసెట్ ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో టాపర్ల వివరాలు ఇలా వున్నాయి. టాప్ 10 వివరాలు.... ఇంజనీరింగ్ టాప్ 10   1వ ర్యాంకు - కొండపల్లి అనిరుధ్ రెడ్డి (157 మార్కులు), 2వ ర్యాంకు - దొంతుల అక్షిత్ రెడ్డి (156 మార్కులు) 3వ ర్యాంకు - కోసూరు జోషి (156 మార్కులు) 4వ ర్యాంకు - కొడుముల ఆహ్వాన్ రెడ్డి (155 మార్కులు) 5వ ర్యాంకు - ఎం.సందీప్ కుమార్ (155 మార్కులు) 6వ ర్యాంకు - మోపర్తి సాయి సందీప్ (154 మార్కులు) 7వ ర్యాంకు - గార్లపాటి శ్రీకర్ (153 మార్కులు) 8వ ర్యాంకు - మద్దాలి యశ్వంత్ కుమార్ (153 మార్కులు) 9వ ర్యాంకు - ఒర్సు కాళేశ్వర్ రావు (153 మార్కులు) 10వ ర్యాంకు - బి.వెంకట్ నాయుడు (153) మార్కులు) మెడిసిన్ టాప్ 10   1 వ ర్యాంకు - కాడ శ్రీ విదుల్ (హైదరాబాద్ - 151 మార్కులు) 2వ ర్యాంకు - రాళ్ళబండి సాయి భరద్వాజ (హైదరాబాద్ - 150 మార్కులు) 3వ ర్యాంకు - శ్రీరామ దామిని (రంగారెడ్డి జిల్లా - 150 మార్కులు) 4వ ర్యాంకు గుండ జయ హరీష్ (వినుకొండ - 150 మార్కులు) 5వ ర్యాంకు - గజ్జల సాయి ధీరజ్ రెడ్డి (గుంటూరు - 150 మార్కులు) 6వ ర్యాంకు - అంశ్ గుప్తా (హైదరాబాద్ - 150 మార్కులు) 7వ ర్యాంకు - కోయి జగదీష్ (తెనాలి - 150 మార్కులు) 8వ ర్యాంకు -సుమయ్యా ఫాతిమా (హైదరాబాద్ - 149 మార్కులు) 9వ ర్యాంకు - శీలం చరిష్మా - (మిర్యాలగూడ - 149 మార్కులు) 10వ ర్యాంకు - మైలవరపు నాగ అనుదీప్ (విశాఖపట్నం - 149 మార్కులు)

ఎంసెట్‌లో అర్హుల శాతాలివే...

  ఇంజనీరింగ్ - 77.4 శాతం అర్హులు ఇంజనీరింగ్ విభాగంలో 77.4 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ఈ విభాగంలో కె.అనిరుధ్ రెడ్డి 157 మార్కులతో ప్రథమ స్థానంలో నిలిచినట్టు మంత్రి తెలిపారు. ఇంజనీరింగ్ విభాగంలో వి.అచ్యుత్ రెడ్డికి రెండో స్థానం, ఆహ్వానరెడ్డికి మూడో స్థానం లభించిందని తెలిపారు.   మెడిసిన్‌ - 89.89 శాతంఅర్హులు ఎంసెట్ మెడిసిన్ విభాగంలో 89.89 శాతం మంది అర్హత సాధించినట్టు ఏపీ మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. కె.శ్రీవిద్యుల్ (హైదరాబాద్)కి ప్రథమ ర్యాంక, సాయి భరద్వాజ్ రాళ్ళబండికి రెండో ర్యాంకు, శ్రీరామ దామినికి మూడో ర్యాంకు లభించాయి. జూన్ 12 నుంచి ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ నిర్వహించనున్నారు. మూడు నాలుగు రోజుల్లో మెడిసిన్ కౌన్సిలింగ్ తేదీలు ప్రకటిస్తామని మంత్రులు తెలిపారు.

విమానంలోంచి దూకేసిన పైలట్

  ఓ విమానం పైలట్ విమానం గాల్లో వుండగానే దాంట్లోంచి కిందకి దూకేశాడు. ఆ తర్వాత ఆ విమానం కూడా కూలిపోయింది. వెనెజులా దేశానికి చెందిన ఓ అక్రమ మత్తుపదార్థాల రవాణా విమానం టన్నుకు పైగా కొకైన్తో కొలంబియాకి బయల్దేరింది. అయితే ఆ విమానాన్ని గుర్తించిన కొలంబియా ఎయిర్ ఫోర్స్ దానిని కూల్చివేసేందుకు ప్రయత్నించింది. ఈ ప్రమాదాన్ని గ్రహించిన పైలట్ విమానంలోంచి కిందకి దూకేశాడు. దూకేశాడు. ఆ తర్వాత ఆ విమానం కొలంబియా తీరంలో కూలిపోయింది. పోనీ విమానంలోంచి దూకేసిన పైలట్ బతికాడా అంటే అదీ లేదు. అతను కూడా చనిపోయాడు. అతడి మృతదేహాన్ని కొలంబియా తీరప్రాంత గస్తీ దళం స్వాధీనం చేసుకొంది.

అయ్యో పాపం... జూపూడి...

  ఎమ్మెల్సీ అయ్యే ఛాన్స్‌ని టీడీపీ ద్వారా పొందిన దళిత నాయకుడు జూపూడి ప్రభాకరరావుకు అదృష్టం ముఖం చాటేసింది. ఆయనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటు లేకపోవడంతో ఎమ్మెల్సీ కావడానికి సాంకేతికంగా సమస్య ఏర్పడింది. దాంతో ఆయన స్థానంలో మాజీ స్పీకర్ కె.ప్రతిభా భారతికి ఆ అవకాశం దక్కనున్నట్టు తెలుస్తోంది. చివరి క్షణాల్లో జరిగిన ఈ పరిణామం అందరూ జూపూడి మీద జాలిపడేలా చేసింది. ఆంధ్రప్రదేశ్ శాసనమండలికి ఎమ్మెల్యేల కోటాలో నాలుగు ఎమ్మెల్సీ స్థానాలకు జూన్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ప్రకాశం జిల్లాకు చెందిన జూపూడి ప్రభాకరరావుకు హైదరాబాద్‌లోని కూకట్ పల్లి అసెంబ్లీ స్థానంలో ఓటు హక్కు వుంది. అలా ఆయనకు ఎమ్మెల్సీ మిస్సయింది. అయితే ప్రతిభా భారతి పేరు విషయంలో కూడా కొన్ని అనుమానాలు వున్నాయి. తెలుగుదేశంలోని సీనియర్లు కుతూహలమ్మ, వర్ల రామయ్య, జేఆర్ పుష్పరాజ్, మసాల పద్మజ, బల్లి దుర్గా ప్రసాద్.... వీరందరూ ఈ స్థానాన్ని ఆశిస్తున్నారు. చివరి క్షణం వరకు అభ్యర్థి ఎవరో తెలిసే అవకాశాలు కనిపించడం లేదు.

తెదేపా యం.యల్సీ. అభ్యర్ధుల పేర్లు ఖరారు

  తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నిన్న జరిగిన పార్టీ పోలిట్ బ్యూరో సమావేశంలో ఆంద్రప్రదేశ్ లో ఆరు యం.యల్సీ. స్థానాలకు పోటీ పడుతున్న సుమారు 200 మంది అభ్యర్ధుల పేర్లను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాత, వారిలో పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మరియు టి.డి.జనార్ధన్ లకు గవర్నర్ కోటాలో, గౌనివారి శ్రీనివాసులు, అనురాధ, యం.ఎ. షరీఫ్, జూపూడి ప్రభాకర్ లకు యం.యల్యే. కోటాలో సీట్లు కేటాయించారు. ఈరోజు నామినేషన్లు దాఖలు చేయడానికి ఆఖరు రోజు కావడంతో వారందరూ ఈరోజే నామినేషన్లు వేస్తారు. యం.యల్యే. కోటాలో వైకాపాకి దక్కిన ఒక్క సీటును గోవింద రెడ్డికి కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ఒక్క సీటు గెలవలేకపోవడంతో దానికి ఈ ఎన్నికలలో అభ్యర్ధిని నిలబెట్టే అవకాశం లేదు. బీజేపీ తరపున సోము వీర్రాజు యం.యల్యే. కోటాలో యం.యల్సీ. సీటుకి నామినేషన్ వేస్తున్నారు.

భోరున ఏడ్చిన కరుణానిధి

  ఉక్కులాంటి మనసున్న మనిషిగా పేరున్న తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత కరుణానిధి భోరున విలపించారు. తొంభై సంవత్సరాల వయసు దాటిన ఆయనను అంతలా ఏడిపించిన అంశమేమిటో తెలుసా.... 99 సంవత్సరాల వయసున్న ఆయన అక్కయ్య షణ్ముగ సుందరత్తమ్మాళ్ మరణించడం. ఆమె బుధవారం నాడు మరణించారు. తన సోదరి మరణించారన్న వార్త వినగానే కరుణానిధి కన్నీటి పర్యంతం అయ్యారు. సుందరత్తమ్మాళ్ మరెవరోకాదు... కేంద్ర మాజీమంత్రి, దివంగత మురసోలి మారన్ తల్లి. తనకు ఎంతో ఇష్టమైన అక్క కొడుకు కాబట్టే తన మేనల్లుడు మురసోలి మారన్‌ అంటే కరుణానిధి ఎంతో ఇష్టపడేవారు. మురసోలి మారన్ సంతానం దయానిధి మారన్ కేంద్ర మాజీ మంత్రిగా, కళానిధి మారన్ సన్ గ్రూప్ అధినేతగా ప్రఖ్యాతిలోకి వచ్చిన విషయం తెలిసిందే. సుందరత్తమ్మాళ్ మరణించిన తర్వాత ఆమె భౌతిక కాయాన్ని దర్శించడానికి వచ్చిన కరుణానిధి విగతజీవిగా వున్న అక్కను చూడగానే భోరున విలపించారు. 99 సంవత్సరాల వయసున్న అక్క మరణిస్తే, 92 సంవత్సరాల వయసున్న కరుణానిధి విలపించడం... చూసేవారికి కొంత వింతగా అనిపిస్తున్నప్పటికీ, వారిమధ్య ఉన్న అనుబంధానికి కూడా ఇది నిదర్శనంగా నిలుస్తుంది.

మరికొద్ది సేపటిలో ఏపీ ఎంసెట్ ఫలితాలు విడుదల

  కొన్ని రోజుల క్రితం నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ పరీక్షల ఫలితాలు ఈరోజు ప్రకటించబోతున్నారు. ఈరోజు ఉదయం 11.30 గంటలకు మంత్రి గంటా శ్రీనివాసరావు కాకినాడ జే.యాన్.టి.యు.లో ఇంజనీరింగ్, మెడికల్ మరియు అగ్రికల్చర్ పరీక్షా ఫలితాలను (ర్యాంకులు) ప్రకటిస్తారు. పరీక్షలు వ్రాసిన విద్యార్ధులందరికీ పరీక్షా ఫలితాలను వారి మొబైల్ ఫోన్లకు మెసేజ్ ల ద్వారా తెలియజేయబడుతుంది.   పరీక్షా ఫలితాలు ప్రకటించిన తరువాత మంత్రి గంటా శ్రీనివాస రావు, ఎంసెట్ కౌన్సిలింగ్ తేదీలపై చర్చించేందుకు ఉన్నత విద్యామండలి చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమీషనర్ ఉదయలక్ష్మి ఇతర అధికారులతో సమావేశమవుతారు. కనుక ఈరోజే ఎంసెట్ కౌన్సిలింగ్ ఎప్పుడు నిర్వహించబోయేది కూడా ప్రకటించవచ్చును. జూన్ 12లేదా 15వ తేదీల నుండి కౌన్సిలింగ్ ప్రారంభం అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం.

నాగం స్వీయానుభవంతో చెపుతున్న మాటలవి

  ‘ఎవరితోనయినా పెట్టుకోవచ్చు కానీ ఉస్మానియా విద్యార్ధులతో పెట్టుకొంటే యమా డేంజర్...వాళ్ళతో పెట్టుకొంటే ఎవరయినా దగ్ధం అయిపోతారు...జాగ్రత్త’ అని బీజేపీ నేత నాగం జానార్ధన రెడ్డి తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి సలహా ఇవ్వడం చూసి, ఉస్మానియా విద్యార్ధులతో సహా అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు. ఎందుకంటే తెలంగాణా ఉద్యమాలు ఉదృతంగా సాగుతున్న సమయంలో ఆయన ఉస్మానియా విద్యార్ధులు నిర్వహించుకొంటున్న ఒక సమావేశానికి హాజరయినప్పుడు, వారు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి దేహశుద్ధి చేసారు. పలకరించడానికి వెళ్లిన ఆయన చావు తప్పి కన్ను లొట్టపోయినట్లు ఎలాగో వారి బారి నుండి తప్పించుకొని బయటపడ్డారు. బహుశః తన స్వీయ అనుభవంతోనే ఆయన కేసీఆర్ కు ఆ విధంగా సలహా ఇస్తున్నారేమో?నని అందరూ ముసిముసి నవ్వులు నవ్వుకొంటున్నారు.   కానీ ఆయన చెప్పిన మాటలలో వాస్తవం కూడా లేకపోలేదు. ఉస్మానియా విద్యార్ధులను కేసీఆర్ బచ్చాగాళ్ళని తీసిపారేయడాన్ని ఆయన తప్పుపట్టారు. తెలంగాణా ఉద్యమంలో ఉస్మానియా విద్యార్ధుల పాత్రను విస్మరించడానికి లేదు. ఉద్యమాల కోసం వారు తమ చదువులను, ఆ కారణంగా తమ బంగారు భవిష్యత్తును కూడా వదులుకొన్నారు. ఇక బలిదానాలు చేసుకొన్న విద్యార్ధులు, యువత గురించి ఎంత చెప్పుకొన్నా తక్కువే అవుతుంది. వారందరూ కేవలం తెలంగాణా రాష్ట్ర సాధన కోసం పోరాడారు తప్ప రాజకీయ నాయకులలాగ ఎన్నడూ తమ త్యాగాలకు ఎటువంటి ప్రతిఫలమూ ఆశించలేదు. తెలంగాణా రాష్ట్రం ఏర్పడిన తరువాత వారికి ఎటువంటి గుర్తింపు కానీ గౌరవం గానీ లభించలేదు. కానీ ఇప్పుడు సాక్షాత్ కేసీఆరే వారిని బచ్చాగాళ్ళని ఈసడించుకొంటున్నారు. ఆ బచ్చాగాళ్ళ త్యాగాల వలననే ఆయన ముఖ్యమంత్రి అవ్వగలిగారు. ఆయన కుటుంబ సభ్యులు అందరికీ మంత్రి పదవులు, యంపీ పదవులు దక్కాయని జనార్ధన రెడ్డి చెప్పిన మాటలు నూటికి నూరు పాళ్ళు నిజమని అందరికీ తెలుసు. అటువంటప్పుడు వారిని గౌరవించకపోయినా కనీసం ఈవిధంగా ఈసడించుకోకుంటే చాలు.   పేద ప్రజలకు ఇళ్ళు నిర్మించవద్దని ఉస్మానియా విద్యార్ధులు కోరడం లేదు. విశ్వవిద్యాలయానికి చెందిన భూములలో నిర్మించవద్దని మాత్రమే వారు కోరుతున్నారు. అందుకోసం వారి గురించి కేసీఆర్ ఈవిధంగా చులకనగా మాట్లాడటం చాలా పొరపాటని జనార్ధన రెడ్డి చెపుతున్నారు అంతే. అయినా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతీ విషయాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని పంతాలకి, పట్టుదలకి పోయినట్లయితే, దాని వలన ఎదురు దెబ్బలు, ప్రజలలో వ్యతిరేకత ఏర్పడుతుంది తప్ప వ్యక్తిగతంగా ఆయనకీ, తెరాసకి, ప్రభుత్వానికి కూడా మేలు జరుగదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పొరపాటున తాళి కట్టబోయిన సుబ్రహ్మణ్యస్వామి

బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి ఓ విచిత్రమైన పని చేసి అందరూ షాక్ అయ్యేలా చేశారు. సుబ్రమణ్యస్వామి తమిళనాడులోని తిరునల్వెలిలో ఓ పెళ్లికి హాజరయ్యారు. అయితే తాళిబొట్టును తన చేతుల మీదుగా వరుడికి అందించవలసిందిగా పెద్దలు కోరడంతో సుబ్రమణ్యస్వామి అందుకు అంగీకరించారు. ఈ నేపథ్యంలో పరధాన్యంలో ఉన్న ఆయన తాళిబొట్టును వరుడికి అందిచకుండా ఏకంగా పెళ్లి కూతురి మెడలో కట్టబోయాడు. దీంతో పెళ్లి పందిరిలో ఉన్న అందరూ ఒక్కసారిగా షాక్ అయి అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్ధం కాక కొన్ని క్షణాలు అలాగే ఉండిపోయారు. ఇంతలో అక్కడ ఓ పెద్దావిడ తేరుకొని మంగళసూత్రం కట్టకుండా ఆయనను ఆపింది. సుబ్రమ్మణ్యస్వామి మాత్రం తను చేసిన పనికి కాస్త సిగ్గుపడి నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

వైభవంగా ‘తెలుగువన్’ 15వ వార్షికోత్సవం

తెలుగువారు ఒక్కటిగా వుండాలని, తెలుగువారు నంబర్‌వన్ స్థానంలో వుండాలని ఆకాంక్షిస్తూ ఆవిర్భవించి, విజయపథంలో దూసుకువెళ్తున్న సంపూర్ణ వెబ్ పోర్టల్  ‘తెలుగువన్.కామ్’ 15వ వార్షికోత్సవం మంగళవారం సాయంత్రం హైదరాబాద్‌లోని తాజ్ బంజారా హోటల్లో వైభవంగా జరిగింది. ఈ వార్షికోత్సవం సందర్భంగా ప్రముఖ దర్శకుడు, సినిమా కళకోసం, సంగీత సాహిత్యాల కోసం విశేష కృషి చేసిన ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్‌కు ‘తెలుగువన్’ కుటుంబం ఆత్మీయ సత్కారం చేసింది. అలాగే వైద్యులుగా తమ అమృతహస్తాలతో ఎంతోమంది జీవితాలలో వెలుగులు నింపుతున్న ప్రముఖ డాక్టర్లు డాక్టర్ జి.సూర్యనారాయణరాజు, డాక్టర్ శ్రీభూషణ్ రాజు, డాక్టర్ నాగేశ్వరరావులను కూడా ఈ వేదిక మీద సత్కరించుకునే అవకాశం ‘తెలుగువన్’ కుటుంబానికి కలిగింది. ప్రముఖ రచయితలు, నటులు, దర్శకులు అయిన తనికెళ్ళ భరణి, జనార్దన మహర్షి ఈ కార్యక్రమంలో ముఖ్య, ఆత్మీయ అతిథులుగా పాల్గొని ఈ కార్యక్రమానికి ఒక నిండుతనాన్ని తెచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో తెలుగువన్ అధినేత కంఠంనేని రవిశంకర్, తెలుగువన్ క్రియేటివ్ హెడ్, ప్రముఖ కార్టూనిస్టు మల్లిక్ పాల్గొని అతిథులకు ‘తెలుగువన్’ తరఫున స్వాగత సత్కారాలను అందించారు. కార్యక్రమ ప్రారంభంలో విశ్వదృక్ ఫౌండేషన్‌కి చెందిన అంధ కళాకారులు పాడిన పాటలు, చేసిన నృత్యం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరి హృదయాన్నీ స్పృశించాయి. ఈ సందర్భంలోనే తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ పుట్టినరోజు వేడుకలు కూడా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగువన్ మేనేజింగ్ డైరెక్టర్ కంఠంనేని రవిశంకర్ మాట్లాడుతూ, ‘‘పదిహేనేళ్ళ క్రితం నాకు వచ్చిన చిన్న ఆలోచన ‘తెలుగువన్’ రూపొంలో ఇప్పుడున్న ఉన్నత స్థాయికి చేరుకుంది. ఈ పదిహేనేళ్ళ ప్రస్థానంలో వచ్చిన ఎన్నో ఆటుపోట్లను ఎదురొడ్డి నిలిచి ‘తెలుగువన్’ని విజేతగా నిలిపాం. ఇందులో నాకు సహకారం అందించిన తెలుగువన్ కుటుంబానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రపంచంలోని తెలుగువారు ఒక్కటిగా వుండాలి, నంబర్ వన్ స్థానంలో వుండాలనే ఉద్దేశంతోనే మా పోర్టల్ పేరును ‘తెలుగువన్’ అనిపెట్టాం. ‘తెలుగువన్’కు ప్రపంచ వ్యాప్తంగా అద్భుత ఆదరణ లభిస్తోంది. అలాగే తెలుగువన్ రేడియో ‘టోరి’ నెలకు ఏడు మిలియన్ ట్యూనింగ్స్‌తో ప్రపంచంలోనే 24 గంటలు లైవ్ ప్రోగ్రామ్స్ ఇచ్చే ఏకైన వెబ్ రేడియోగా అవతరించింది. డిజిటల్ మీడియా అద్భుత పురోగతి వైపు దూసుకు వెళ్తోన్న ప్రస్తుత తరుణంలో తెలుగువన్ కూడా అన్ని అవకాశాలను అంది పుచ్చుకుని, మరింత అభివృద్ధి సాధించబోతోంది. భారతదేశంలో షార్ట్ ఫిలిమ్స్ అనే కాన్సెప్ట్‌ని ప్రారంభించింది తెలుగువన్ యూట్యూబ్ ఛానల్. తెలుగువన్ అందించిన 600 మంది దర్శకులు వేలాది షార్ట్ ఫిలిమ్స్ రూపొందించారు. కొంతమంది వెండితెర దర్శకులుగా ఎదిగారు.   మా ‘తెలుగువన్’ విజయాలు సాధించడంతోపాటు సామాజిక బాధ్యతలను  కూడా గుర్తుంచుకుని, పాటిస్తోంది.తెలుగువన్ ఫౌండేషన్ ద్వారా ఎంతోమంది పేదలకు వైద్య సహాయం అందిస్తోంది. పదిహేను వసంతాలు పూర్తి చేసుకున్న ఈ శుభ సందర్భంలో కె.విశ్వనాథ్ గారి లాంటి మహానుభావుడికి, జి.సూర్యనారాయణ రాజు, శ్రీభూషణ్ రాజు, నాగేశ్వరరావు గారి లాంటి గొప్ప డాక్టర్లను సత్కరించుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాను’’ అన్నారు. ముఖ్య అతిథి తనికెళ్ళ భరణి మాట్లాడుతూ, ‘‘తెలుగువన్‌తో నాకెంతో అనుబంధం వుంది. నాకు అమెరికాకి చెందిన ఒక గొప్ప అభిమాని ‘టోరి’ రేడియో ద్వారా లభించాడు. సాహిత్య, సాంస్కృతిక సేవతోపాటు తెలుగువన్ చేస్తున్న సమాజ సేవ కూడా అభినందనీయం. ఈ వేదిక మీద విశ్వనాథ్ గారి లాంటి గొప్ప దర్శకుడిని సత్కరించుకోవడం సంతోషాన్ని కలిగిస్తోంది. విశ్వనాథ్ గారికి సమకాలికులం కావడం, ఆయన సినిమాలు చూడటం మనకు దేవుడిచ్చిన వరం. ఎన్నో ఆణిముత్యాల్లాంటి సినిమాలను తెలుగువారికి అందించిన విశ్వనాథ్ గారికి తెలుగుజాతి మొత్తం రుణపడి వుంటుంది. ఆయన మన జాతి సాంస్కృతిక రాయబారి. ఆయన్ని సత్కరించే అవకాశం లభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. సాక్షాత్తూ భగవత్ స్వరూపులైన వైద్యులకు ఈ వేదిక మీద సత్కారం జరగడం మరో మంచి విషయం. తెలుగువన్ తన నంబర్‌వన్ స్థానాన్ని కొనసాగించాలని ఈ శుభసందర్భంలో కోరుకుంటున్నాను’’ అన్నారు. ఆత్మీయ అతిథి జనార్దన మహర్షి తన హృదయ స్పందనను తెలియజేస్తూ, ‘‘విశ్వనాథ్ గారికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు లేరు... భక్తులు మాత్రమే వున్నారు. ఆ భక్తులలో నేను మొదటివాణ్ణి. ఆయనకు సత్కారం జరగడం నాకు సంతోషాన్ని కలిగిస్తోంది. ఈ వేదిక మీద నా గురువు తనికెళ్ళ భరణి, నా దైవం విశ్వనాథ్ గారు వుండటం, ఆ వేదిక మీద నేను కూడా వుండటం నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. 15 వసంతాలు పూర్తి చేసుకున్న ‘తెలుగువన్’కి అభినందనలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మీయ సత్కారం అందుకున్న ‘కళాతపస్వి’ కె.విశ్వనాథ్ తన హృదయాన్ని ఆవిష్కరిస్తూ, ‘‘నేను సినిమాలు రూపొందించడం ఆపేసి పదేళ్ళు అవుతోంది. ఇప్పుడు ‘తెలుగువన్’ నన్ను సత్కరించడానికి కారణం నేను ఎప్పుడో తీసిన మంచి సినిమాల గుడ్‌విల్ అని భావిస్తున్నాను. సంగీతం, సాహిత్యం, నృత్యం  ప్రధానాంశాలుగా నేను సినిమాలు రూపొందిస్తున్న సమయంలో ఎప్పుడూ వాడినే పట్టుకుని వేలాడుతూ వుంటావేంటయ్యా అని వ్యంగ్యంగా మాట్లాడినవాళ్ళు కూడా వున్నారు. అయినప్పటికీ నేను నా పని చేసుకుంటూ వెళ్ళాను. నా పని నేను త్రికరణశుద్ధిగా చేయడమే భగవంతుడి సేవ అని నేను నమ్ముతాను. తెలుగువన్ 15వ వార్షికోత్సవం సందర్భంగా ఆ సంస్థకు,  ఆ సంస్థ అధినేత కంఠంనేని రవిశంకర్‌కు నా ఆశీస్సులు. ఈ కార్యక్రమం ప్రారంభంలో పాటలు పాడి, నృత్యం చేసిన అంధ కళాకారుల ప్రతిభ నన్ను ముగ్ధుడిని చేసింది. వారిలో నేను భగవంతుణ్ణి చూశాను. నన్ను సత్కరించిన ‘తెలుగువన్‌’ కుటుంబానికి నా ధన్యవాదాలు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో గౌరవ సత్కారం అందుకున్న వైద్యులు డాక్టర్ జి.సూర్యనారాయణ రాజు, డాక్టర్ శ్రీభూషణ్ రాజు, డాక్టర్ నాగేశ్వరరావు తమకు జరిగిన సత్కారం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. పేదలకు వైద్యాన్ని అందించడం కోసం తెలుగువన్ ఫౌండేషన్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా వారు ప్రశంసించారు. కె.విశ్వనాథ్, తనికెళ్ళ భరణి లాంటి మహానుభావుల చేతుల మీదుగా సత్కారాన్ని అందుకోవడం తమకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు.  తెలుగువన్‌కి 15వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలుగువన్’ క్రియేటివ్ హెడ్, డైరెక్టర్, ప్రముఖ కార్టూనిస్టు మల్లిక్ వందన సమర్పణతో ‘తెలుగువన్ 15వ వార్షికోత్సవం’ సంపూర్ణమైంది.

హీల్స్ వేసుకోలేదని అనుమతించలేదు

ఫ్రాన్స్ లో కేన్స్ చలనచిత్రోత్సవం అత్యంత అట్టహాసంగా జరుగుతుందని తెలిసిందే. ఈ రెడ్ కార్పెట్ పై ఎంతోమంది సుందరీమణులు పాల్గొని హొయలొలికిస్తుంటారు. అయితే ఈ కేన్స్ చిత్రోత్సవానికి హీల్స్ వేసుకోలేదని ఓ సినిమా నిర్మాతకు అనుమతి లభించలేదు. వింతగా ఉంది కదా అదెంటో చూద్దాం... వాలేరియా రిక్టర్ అనే హాలివుడ్ నిర్మాత కూడా కేన్స్ చిత్రోత్సవంలో పాల్గొనడానికి వెళ్లింది. అయితే ఆమెది ఒక కాలు కృతిమకాలు కావడంతో హీల్స్ కాకుండా ఫ్లాట్ చెప్పులు వేసుకుంది. దీంతో ఆమెను రెడ్ కార్పెట్ పై నడవడానికి అక్కడివాళ్ళు ఒప్పుకోలేదు. ఆ కారణంగా ఆమె అక్కడినుండి వెనుదిరగాల్సి వచ్చింది. ఇప్పుడు రెడ్ కార్పెటుపై ప్రతి ఒక్క మహిళా కచ్చితంగా ఎత్తు చెప్పులు వేసుకోవాలన్న అంశం చర్చనీయాంశంగా మారింది.

వాళ్లను బచ్చాగాళ్లనడం సరికాదు... నాగం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ సీనియర్ నేత నాగం జానార్ధన రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి దక్కిందంటే అది ఉస్మానియా యూనివర్శిటీ విద్యార్ధుల పోరాటాల ఫలితమేనని ఎద్దేవా చేశారు. అలాంటి విద్యార్ధులను కేసీఆర్ బచ్చాగాళ్లనడం సబబు కాదని, ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్ధులతో పెట్టుకుంటే కేసీఆర్ దగ్దమవుతాడని నాగం హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో ఓయూ విద్యార్ధులు చేసిన త్యాగాలను ఎప్పటికీ మరిచిపోలేమని, ఓయూ అంటేనే పోరాటాల గడ్డ అని అన్నారు. 1969 నుంచి ప్రత్యేక రాష్ట్ర కోసం ఎంతో పోరాడి తెలంగాణ పురిటి గడ్డగా మారిందని గుర్తుచేశారు.

ధైర్యం ఉంటే కేసీఆర్ చర్చకు రా.. ఓయూ

ఉస్మానియా యూనివర్సిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు దారితీసింది. విశ్వవిద్యాలయం భూములు ఖచ్చితంగా తీసుకుంటామని చెప్పిన కేసీఆర్ పై అటు విపక్షాలు, ఇటు ఓయూ విద్యార్ధులు విమర్శలు కురిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓయూలో ధర్నా చేపట్టి కేసీఆర్ దిష్టి బోమ్మను కూడా తగలబెట్టారు. ఈ సందర్బంగా విద్యార్ధులు మాట్లాడుతూ పేదలపై కేసీఆర్ గారికి అంత ప్రేముంటే మైం హోం రామేశ్వర్రావుకు కట్టబెట్టిన 30 ఎకరాల భూమిలో ఇళ్లు కట్టించాలి అంతేకాని ఓయూ భూముల జోలికి వస్తే బావుండదని హెచ్చరించారు. విద్యార్ధులు నిరుద్యోగంతో బాధపడుతుంటే అవి మాత్రం పట్టించుకోకుండా పేదల పేరుతో భూములు విక్రయించడానికి కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు దమ్ము, దైర్యం ఉంటే కేసీఆర్ చర్చకు రావాలని ఓ సవాల్ కూడా విసిరారు.

గుత్తా లేఖపై జైరామ్ రమేష్ స్పందన

  రాష్ట్ర విభజనలో కీలకపాత్ర పోషించిన మాజీ కేంద్రమంత్రి జైరామ్ రమేష్ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని మొదటి నుండి పోరాడుతున్న వారిలో ఒకరు. నల్గొండ కాంగ్రెస్ యంపీ ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ ప్రధాని మోడీకి లేఖ వ్రాయడాన్ని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని మొదట కాంగ్రెస్ పార్టీయే ప్రజలకు హామీ ఇచ్చిందని, దాని కోసం రాష్ట్రంలో, పార్లమెంటులో కాంగ్రెస్ నేతలు పోరాటం చేస్తుంటే, ప్రత్యేక హోదా ఇవ్వవద్దంటూ ప్రధానికి లేఖ వ్రాయడం చాలా పొరపాటని ఆయన అభిప్రాయపడ్డారు. కానీ గుత్తా లేఖ వ్రాయడం వ్యక్తిగతమని దానితో కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని సర్ది చెప్పుకొన్నారు. గుత్తా సంగతి కాంగ్రెస్ అధిష్టానం చూసుకొంటుందని రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే వరకు తమ పోరాటం ఆగదని ఆయన అన్నారు.   ఇంతవరకు ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ పార్టీ మోడీ ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీస్తోంది. కానీ కాంగ్రెస్ పార్టీకి చెందిన యంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి స్వహస్తాలతో ప్రధానమంత్రికి వ్రాసిన లేఖ వలన ఇప్పుడు కాంగ్రెస్ ఆత్మరక్షణలో పడిపోయింది. ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నామని చెప్పుకొంటున్న కాంగ్రెస్ పార్టీ ఉద్దేశ్య పూర్వకంగానే ఆయన చేత ఈ లేఖ వ్రాయించి రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాకుండా అడ్డంకులు సృష్టిస్తోందని బీజేపీ ఇప్పుడు ఎదురు దాడి చేయవచ్చును . ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలోనే ఈ అంశం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పుడు, ఆ పార్టీ తమను ఏవిధంగా ప్రశ్నిస్తోందని బీజేపీ ఎదురు ప్రశ్న వేయవచ్చును. లేదా కాంగ్రెస్ పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతునప్పుడు ప్రత్యేక హోదా కోసం ఆ పార్టీ ఎందుకు పోరాడుతోంది? ఒకవేళ మోడీ ప్రభుత్వం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వబోతే అప్పుడు కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇదేవిధంగా అడ్డు తగులుతారా? అని బీజేపీ ఎదురు ప్రశ్నిస్తే కాంగ్రెస్ వద్ద సరయిన సమాధానం ఉండదు.