జీహెచ్ఎంసీ ఎన్నికలు.. వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

జీహెచ్ఎంసీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. జంట నగరాల్లో దాదాపు 7వేలకు పైగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. అంతేకాదు పోలింగ్ కేంద్రాల్లో జరిగే పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు అత్యాధునికమైన ఇంటిగ్రేటేడ్ ఈ-సర్వేలేన్స్ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని, బందోబస్తును పోలీసు ఉన్నతాధికారులు కమెండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 811 సమస్యాత్మక, 286 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.

ఓటు వేసేందుకు వెళ్తున్నారా!

- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. - 5 గంటలలోపల క్యూలో ఉన్నవారు ఎంత ఆలస్యమైనా ఓటు వేసి వెళ్లవచ్చు. - ఇవాళ కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి ఓటరు స్లిప్‌ను పొందవచ్చు(ghmc.gov.in) - ఓటు వేసే చోట సెల్‌ఫోన్లను అనుమతించరు. - పోలింగ్‌ కేంద్రం లోపల ఫొటోలు తీయడం నిషిద్దం. - అంధులు తమ ఓటు వేసేందుకు వేరొకరిని వెంటపెట్టుకుని రావచ్చు. - ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఉంటుంది. - వికలాంగులు నేరుగా వీల్‌చైరుతో పోలింగ్‌ కేంద్రం లోపలికి వెళ్లవచ్చు. - ఇప్పటికే వేరెవరన్నా మీ ఓటు వేసేసి ఉంటే అక్కడి ఉన్న అధికారికి ఫిర్యాదు చేయండి.

ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే…

  ఓటు ఉంటే చాలు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఫర్వాలేదు అంటున్నారు ఎన్నికల అధికారులు. తాము సూచించిన గుర్తింపు కార్డులలో ఏది ఉన్నా కూడా పోలింగ్‌కు అనుమతిస్తామని అంటున్నారు. ఓటరు తన గుర్తింపుని నిరూపించుకునేందుకు ఎలక్షన్‌ అధికారులు 21 రకాల పత్రాలను అనుమతించారు. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, బ్యాంకు లేదా పోస్టాపీసు జారీ చేసిన పాస్‌పుస్తకం, ప్రభుత్వ సంస్థలు లేదా పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు పత్రం, రేషన్‌ కార్డులు, ఆహార భద్రత కార్డులు, కులధృవీకరణ ప్రతాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఏటీఎం కార్డు… ఈ జాబితాలో ముఖ్యమైనవి. వీటిలో ఏది చూపించినా కూడా నేడు జరుగుతున్న జి.హెచ్‌.ఎం.సి ఎన్నికలలో పాలుపంచుకోవచ్చు.

గ్రేటర్ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్దం..

రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో 25624 మంది, సైబరాబాద్ పరిధిలో 16 వేల సిబ్బందితో కలిపి మొత్తం 41624 మందిని నియమించామని పేర్కొన్నారు. 4860 ఆర్మీ రిజర్వు ఫోర్స్‌తోపాటు 3 వేల ఎన్నెసెస్, 1400 మంది ఎన్సీసీ వాలంటీర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించినట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. తమకు కేటాయించిన వరుసల్లో వెళ్లి మహిళా, పురుష ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 3200 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేసి దానిని కమిషనర్ కార్యాలయంలోని కమాండ్, కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్‌. కృష్ణ‌య్య‌కు ఆ విష‌యం తెలియ‌దా!

తుని సంఘ‌ట‌న మీద బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణ‌య్య చాలా చిరాకుప‌డిపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కాపుల‌ను బి.సిలలో చేర్చితే మిగ‌తా బి.సి.ల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని, అందుక‌ని వారి డిమాండ్‌కి త‌ల ఒగ్గ‌ద్ద‌నీ ఆయ‌న చంద్ర‌బాబు నాయుడుని హెచ్చ‌రిస్తున్నారు కృష్ణ‌య్య‌. మ‌రి తెలుగుదేశం, కాపుల‌ను బి.సిల‌లోకి చేర్చేందుకు కృషి చేస్తామ‌ని త‌న మ్యానిఫెస్టోలో చెప్పింది క‌దా! అదే మ్యానిఫెస్టోతో అంద‌రూ ఎన్నిక‌ల‌కి దిగారు క‌దా! ఆ రోజున కిమ్మ‌న‌కుండా ఉన్న కృష్ణ‌య్య‌గారు ఈ రోజున ఎందుకు కోప‌గించుకుంటున్నారంటూ తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. కృష్ణయ్య‌గారు తెదెపా త‌ర‌ఫు నుంచి ఎల్‌.బి.న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ప్ర‌స్తుత తెలంగాణ శాస‌న‌స‌భ్యులుగా ఉన్నారు. ఆయ‌న మొద‌టి నుంచీ కాపుల‌ని బి.సి.ల‌లోకి చేర్చేకూడ‌దంటూ త‌న నిర‌స‌న గ‌ళాన్ని వినిపిస్తూనే ఉండేవారు. కాక‌పోతే ఎన్నిక‌ల స‌మ‌యంలో కాస్త శాంతించి ఉంటారంతే.

"తుని" వెనుక సంఘ విద్రోహులు.. పవన్

ముద్రగడ చేపట్టిన కాపు ఐక్య గర్జనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ తుని ఘటన దురదృష్టకరమని.. ఇది తనను ఎంతో బాధించిందని అన్నారు. లక్షలమంది ఒకచోట గుమిగూడుతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో.. తగినంత బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేయలేదో తనకు అర్ధం కావడంలేదని అన్నారు. రాజకీయ పార్టీలు బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. నిన్నటి హింసాత్మక ఘటనల వెనుక ఖచ్చితంగ సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉంది. ఈ సమస్య ఎప్పటినుండో ఉంది.. ఒక్కరోజులో తీరేది కాదు.. తెలంగాణ, ఉత్తరాంధ్రలో కాపులు బీసీలుగా ఉన్నారు.. రాయలసీమ కోస్తాంద్రాలో మాత్రమే కాపులు ఓసీలుగా ఉన్నారని అన్నారు.. 

అప్ఘనిస్థాన్లో బాంబు పేలుడు.. ఈజిప్టులో కూడా..

ఈ ఒక్కరోజే పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో పార్లమెంటు భవనం సమీపంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈజిప్టులో రెండు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈజిప్టులోని రఫా ప్రాంతంలో భద్రతా సిబ్బంది పోలీసు వాహనంలో వెళుతుండగా బాంబు పేలుడు సంభవించింది. ఈఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో ప్రాంతం ఉత్తర సినాయ్‌ లో కూడా బాంబు పేలుడు సంభవించింది. షేక్‌ జువాయిడ్‌ పట్టణంలో సైనికాధికారులపై దుండగులు బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో  ఇద్దరు సైనికాధికారులు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యాయి.

చంద్రబాబుది క్రిమినల్ బుర్ర.. జగన్

ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జన పై వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్సల బాణాలు వదిలారు. ఘటనపై చంద్రబాబు మాట్లాడిన తీరు తప్పని.. చంద్రబాబు తప్పుచేసి ఇతరలపై నెట్టడానికి చూస్తున్నారని అన్నారు. అంతేకాదు చంద్రబాబు చేసేవన్నీ క్రిమినల్ పనులే అని.. చంద్రబాబుది క్రిమినల్ బుర్ర కాదా? అని మండిపడ్డారు. 1988లో విజయవాడ కాపునాటు మహాసభ జరిగితే ఆనాటి సభను తట్టుకోలేక సభను అడ్డుకున్నారు.. ఇప్పుడు ఈ సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. కాపుల మీటింగ్ సక్సెస్ అయితే తట్టుకోలేకపోతున్నావ్.. మీటింగ్ ఆపేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నావ్ అని ధ్వజమెత్తారు. గతంలో ఎస్సీ కులాల మధ్య చిచ్చుపెట్టావు.. ఇప్పుడు కాపులకు, బీసీలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు అని విమర్శించారు.

అందుకే విరమించాను.. ముద్రగడ

  ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఐక్య గర్జన ఉద్యమంపై రాజకీయ వేడి పెరుగుతోంది. ఇప్పటికే అక్కడ పలు ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకుంటున్నాయి. ఈ సందర్బంగా ముద్రగడ మాట్లాడుతూ కాపు గర్జన సదస్సుపై చంద్రబాబే ఎదురుదాడి చేశారని.. కాపులతోనే ఉద్యమాన్ని నీరుగార్చాలని చూశారని అన్నారు. లక్ష్యాన్ని దెబ్బతీయడానికి అసాంఘిక శక్తులను దింపారు.. టీడీపీ నేతలే విద్వంసానికి దిగారు.. చంద్రబాబు ఆదేశాల మేరకే నిన్న ఘటనలు జరిగాయి అని ఆరోపించారు..అందుకే వెంటనే రాస్తా రోకో విరమించాను అని తెలిపారు. కాపు జాతికి చేతనైన సాయం చేయడానికే ఈ ఉద్యమం చేపట్టాను..మహాత్మా గాంధీ బాటలోనే రిజర్వేషన్ల కోసం తాము శాంతియుత ఉద్యమం తలపెట్టామని అన్నారు. కొన్ని మీడియాలు వంకర రాతలు రాశారు అని మండిపడ్డారు. అంతేకాదు నాలుగైదు రోజుల్లో నేను నాభార్య నిరాహార దీక్షకు పూనుకుంటున్నాం.. తమను అరెస్టు చేసినా పర్వాలేదు.. బెయిల్ కోసం కూడా దరఖాస్తు చేసుకోము.. జైల్లో ఉండే దీక్ష కొనసాగిస్తామని తెలిపారు. తమ దీక్షకు మద్దతుగా ఎవరూ కిర్లంపూడి రావొద్దని, ఎవరికి వాళ్లు తమ ఇళ్లలోనే నిరాహార దీక్ష చేయాలని కోరారు. నేను చనిపోయిన తరువాత అయినా సరే రిజర్వేషన్లు ఇచ్చి తీరాలి అని అన్నారు.

భ‌గ‌త్ సింగ్ మీద పాకిస్తాన్‌లో కేసు!

పాకిస్తాన్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ తెలియ‌దు. మొన్న‌టికి మొన్న భార‌త‌దేశ జెండా ఎగుర‌వేశార‌ని విర‌ట్ కోహ్లీ అభిమానికి జైలు శిక్ష విధించారు. ఇప్పుడేమో భ‌గ‌త్ సింగ్‌ని నిర్దోషిగా గుర్తించ‌మంటూ లాహోర్ హైకోర్టులో ఒక కేసు న‌డుస్తోంది. భ‌గ‌త్‌సింగ్‌ని సాండ‌ర్స్ అనే బ్రిటిష్ అధికారి హ‌త్య‌కేసులో 85 ఏళ్ల క్రితం లాహోర్‌లో ఉరితీశారు. అయితే నిజానికి భ‌గ‌త్‌సింగ్ ఆ హ‌త్య చేయ‌లేదనీ అత‌డిని నిర్దోషిగా గుర్తించ‌మ‌నీ ఖురేషీ అనే న్యాయ‌వాది లాహోర్ హైకోర్టులో కేసు వేశారు. దానికి రుజువుగా ఆనాటి ఎఫ్‌.ఐ.ఆర్ కాపీల‌ను కూడా బ‌య‌ట‌కు తీయించారు ఖురేషీ. ఆనాటి ఎఫ్ఐ.ఆర్‌లో భ‌గ‌త్‌సింగ్ పేరుని ఎక్క‌డా ప్ర‌స్తావించ‌లేదు. భ‌గ‌త్ సింగ్ గొప్ప దేశ‌భ‌క్తుడేకానీ హంత‌కుడు కాదంటారు ఖురేషీ. భ‌గ‌త్‌సింగ్‌ని ఇప్పుడు న్యాయ‌స్థానం నిర్దోషిగా గుర్తిస్తే ఆయ‌న‌ప‌ట్ల పాకిస్తాన్ ప్ర‌జ‌ల్లో మ‌రింత గౌర‌వం పెరుగ‌తుంద‌నీ, ఏమైనా అవార్డులూ గట్రా ఇవ్వాల‌నుకుంటే కూడా నిర్భ‌యంగా ప్ర‌క‌టించ‌వచ్చ‌నీ ఖురేషీ ఆశ‌. మ‌రి కోర్టు ఆయ‌న వాద‌న‌తో ఎంత‌వ‌ర‌కు ఏకీభ‌విస్తుందో చూడాలి మ‌రి!  

మళ్లీ బాంబు బెదిరింపు

అస్ట్రేలియా రాజధాని సిడ్నీలోని పాఠశాలలకు మరోసారి బెదిరింపు కాల్స్ రావడంతో పాఠశాలలను మూసేశారు. గంతలో కూడా క్రిస్మస్‌ సెలవుల తర్వాత ఇలాగే బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఇప్పుడు మరోసారి బెదిరింపు కాల్స్ రావడంతో అధికారులు పాఠశాలలను ఖాళీ చేయించి.. స్కూళ్ల నుంచి విద్యార్థులను పంపేసి.. 8 పోలీసు బృందాలు విస్తృతంగా తనిఖీలు జరుపుతున్నారు. ఈ సందర్బంగా పోలీసు అధికారులు మాట్లాడుతూ.. బెదిరింపు కాల్స్ పై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని.. ఇలాంటి బెదిరింపులకు పాల్పడడం చాలా తీవ్రమైన నేరమని, కాల్స్‌ చేసే వారినందరినీ కచ్చితంగా గుర్తించి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఐసిస్.. బాంబుల తయారీలో అగ్గిపుల్లల మందు..

ఎన్ఐఏ ఇటీవలే ఐఎస్ఐఎస్ లో చేరినట్లు అనుమానించి16 మందిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే వీరిని విచారించిన పోలీసులకు పలు ఆసక్తికర విషయాలు తెలిసాయి. అవేంటంటే.. ఉగ్రవాదులు గత ఏడు నెలలుగా అగ్గిపుల్లల్లోను, దీపావళి టపాసుల్లోను ఉపయోగించే రసాయనాలు సేకరించి.. వాటితో బాంబులు తయారుచేస్తున్నారట. అంతేకాదు వారి దగ్గర నుండి స్వాధీనం చేసుకున్న బాంబులలో ఈ రసాయనాలు ఉన్నట్టు గుర్తించారు. సాధారణంగా అగ్గిపుల్లల చివర ఉండే మందులో పొటాషియం క్లోరేట్‌ను వాడతారు.. దీపావళి సామగ్రి తయారీలో పొటాషియం నైట్రేట్‌ను వాడతారు. వీటి ద్వారా తయారు చేసిన బాంబులను పలు చోట్ల దాడులకు ఉపయోగించాలని చూస్తున్నారట. అంతకుముందు అమోనియం నైట్రేట్‌ను ఎక్కువగా ఉపయోగించేవాళ్లు. తర్వాతి కాలంలో దాని అమ్మకాలపై ప్రభుత్వం నియంత్రణలు విధించింది. దాంతో ఇప్పుడు ఈ పదార్థాలపై ఉగ్రవాదుల కన్నుపడింది.