శశిథరూర్ కి లై డిటెక్టర్ పరీక్ష..!

సునంధ పుష్కర్ హత్యలో పలు కీలక పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈమె విషంతో చనిపోయింది అని ఎయిమ్స్  వైద్యులు వెల్లడించారు. దీంతో కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ చిక్కులో పడ్డారు. మరోవైపు ఈయనకు లై డిటెక్టర్ పరీక్ష నిర్వహించే అవకాశమున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఢిల్లీ పోలీసులు థరూర్ను విచారించడంతో పాటు ఆయనకు సత్యశోధన పరీక్షలు నిర్వహించనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ కేసుకు సంబంధించిన కీలక వ్యక్తులను పోలీసులు మరోసారి విచారించారు. శశి థరూర్ డ్రైవర్ బజరంగి, సహాయకుడు నరైన్ సింగ్, థరూర్ కుటుంబ స్నేహితుడు సంజయ్ దేవన్, సునందను పరీక్షించిన వైద్యుడిని పోలీసులు ప్రశ్నించారు.

"కాపు ఐక్య గర్జన" కాక.. చంద్రబాబు ఫైర్

ముద్రగడ పద్మనాభం చేపట్టిన కాపు ఐక్య గర్జన ఉద్యమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పద్మనాభం ఆందోళనకారులకు రైలు, రాస్తారోకోలు పిలుపు నివ్వడంతో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలోనే రత్నాచల్ అనే రైలును కూడా ఆందోళన కారులు తగలబెట్టారు. అంతేకాదు పలు పోలీసులు వాహనాలు కూడా దగ్గమయ్యాయి. ఈ ఘటనలో పలువురు పోలీసులకు కూడా గాయాలయ్యాయి. మరోవైపు ఈ రోజు కూడా పద్మనాభం  3 గంటలకు ముద్రగడ పద్మనాభం కీలక సమావేశం నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రంలోగా కాపులను బీసీల్లో చేరుస్తూ జీవో జారీ చేయాలని లేకపోతే ఆమరణ దీక్షకు దిగుతానని కూడా ఆయన ప్రకటించారు. ఇదిలా ఉండగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనలు ముందుగా జరుగతాయని ఊహించడంలో నిఘా వర్గాలు వైఫల్యం చెందాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిఘా వర్గాలతో పాటు పోలీసులు, మీడియా సైతం కుట్ర జరుగుతోందని అంచనా వేయలేకపోయాయని బాబు అభిప్రాయపడ్డారు. సామాజిక శ్రేయస్సు కోసం తాము ఆలోచిస్తుంటే, కేవలం ఆరేడు వాహనాల్లో వచ్చిన వారు హింసకు పాల్పడ్డారని ఆరోపించారు. వీళ్లపై పోలీసు చర్యలే ఏకైక మార్గమని అధికారులతో వ్యాఖ్యానించిన చంద్రబాబు, కఠిన చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. దీనిలో భాగంగానే ఆధారాల కోసం వీడియో ఫుటేజ్ లను కూడా పరీక్షించనున్నారు.

కేసీఆర్ పై లోకేశ్ ఫైర్.. మీ సొత్తా? మా సొత్తా?

నిన్నటితో గ్రేటర్ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆఖరి రోజు కావడంతో పార్టీలన్నీ చాలా పోటాపోటీగా ప్రచారం చేస్తూ.. ర్యాలీలు నిర్వహించాయి. దీనిలో భాగంగానే నారా లోకేశ్  హైటెక్‌ సిటీ నుంచి ఎన్టీఆర్‌ఘాట్‌ వరకు బైక్‌ ర్యాలీ నిర్వహించి బుల్లెట్ నడిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌కు గ్రేటర్‌ ఎన్నికల భయం పట్టుకుందని, అందుకే ఏపీ సీఎం చంద్రబాబుపై చిత్రమైన విమర్శలు చేస్తున్నారన్నారు. అంతేకాదు కేసీఆర్ చంద్రబాబు సతీమణి ఓటు కూడా టీఆర్ఎస్ కే అని వ్యాఖ్యానించిన నేపథ్యంలో లోకేశ్ ఆ వ్యాఖ్యలపై స్పందించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, మరో రాష్ట్ర ముఖ్యమంత్రి సతీమణి గురించి ఇలాంటి అబద్ధం చెప్పడం దారుణం అని ఒక ముఖ్యమంత్రి అంతటి వ్యక్తి ఇంత అబద్దం ఆడటం దౌర్భాగ్యం అని మండిపడ్డారు. అంతేకాదు.. ఏపీని చంద్రబాబుకు, తెలంగాణను తనకు ప్రజలు ఇచ్చారన్న కేసీఆర్‌ వ్యాఖ్యలపై ‘‘ప్రాంతాలేమయినా మీ సొత్తా? మా సొత్తా? అది ప్రజలు ఇచ్చిన తీర్పు'' అని వ్యాఖ్యానించారు.

ముద్రగడ కాపు ఐక్య గర్జన ఉద్యమం..

తూర్పుగోదావరి జిల్లా తునిలో మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జన సభ నిర్వహించారు. కాపులను ఎప్పటినుండో బీసీ వర్గంలోకి చేర్చాలని పద్మనాభం ఎప్పటినుండో డిమాండ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన రోజు ఐక్య గర్జన సభ నిర్వహించి రైల్ రోకో, రాస్తా రోకోలకు పిలుపునిచ్చారు. తమ డిమాండ్ తీర్చే వరకూ నిరసన చేపడతామని.. సమీపంలోని రైలుపట్టాలపై బైఠాయించారు..అనంతరం పక్కన ఉన్న జాతీయ రహదారిపైకి చేరుకుని ఆందోళన చేపట్టారు. కాపులను బలహీన వర్గాల జాబితాలో చేర్చి రిజర్వేషన్లు కల్పించాలని, ఎన్నికలకు ముందు సీఎం చంద్రబాబు కాపులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మరోవైపు కార్యకర్తలు రైల్వే ట్రాక్, రోడ్లను దిగ్బంధించడంతో రైళ్లు, వాహనాలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి.

అమీర్ వల్ల వెంకయ్య బాధపడ్డారంట..

బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ అసహనంపై వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. అమీర్ చేసిన వ్యాఖ్యలకు గాను అతనిపై చాలా విమర్శలే వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే తను చేసిన వ్యాఖ్యల ప్రభావం ఎలా ఉంటుందో అనుభవించారు. అయితే ఇప్పుడు కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు కూడా అమీర్ ఖాన్ వ్యాఖ్యలపై స్పందించారు. అమీర్ మాటలు తనను చాలా బాధించాయని చెప్పారు. మహారాష్ట్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఛాత్ర సంసద్ కార్యక్రమంలో ట్విట్టర్ లో వచ్చిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అందులో భాగంగా అమీర్ వ్యాఖ్యలపైనా ఓ ప్రశ్న రాగా అమీర్ తనకు మంచి స్నేహితుడని... కానీ ఆయన ఆ రోజు అన్న మాటలతో తాను బాధపడ్డానని చెప్పుకొచ్చారు. అంతేకాదు ఆయన అమీర్ వ్యాఖ్యలను పట్టుకుని రాద్ధాంతం చేయబోయిన ప్రతిపక్షాలపై కూడా విమర్శలు చేశారు.

టీడీపీ ర్యాలీలో ఉద్రిక్తం..

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో పార్టీలన్నీ పోటాపోటీగా ప్రచారం చేస్తూ చాలా బిబీగా ఉన్నాయి. అందునా ఈరోజు ప్రచారానికి ఆఖరికి రోజు కావడంతో అన్ని పార్టీలు పోటాపోటీగా ర్యాలీలను నిర్వహిస్తున్నాయి. అయితే టీడీపీ నేత రేవంత్ రెడ్డి మల్కాజ్ గిరిలో ర్యాలీ నిర్వహించారు. అయితే ఈ ర్యాలీకి పోలీసుల నుండి ముందస్తు అనుమతి లేదని.. ర్యాలీని నిర్వహించడానికి కుదరదని..  పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ఈ సందర్భంగా టీఆర్ఎస్, టీడీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ నెలకొంది. మరోవైపు టీడీపీ నేతలు ఈ ఘటన పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికార పార్టీ ఆదేశాల మేరకే పోలీసులు తమ ప్రచారాన్ని అడ్డుకుంటున్నారని టీడీపీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. మరోవైపు గ్రేటర్ ఎన్నికల ప్రచారం నేటితో ముగియనుంది. సాయంత్రం అయిదు గంటల లోపు అభ్యర్థులు ప్రచారం ముగించాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్థన్ రెడ్డి అన్నారు. ఎస్సెమ్మెస్‌లు, బల్క్ ఎస్సెమ్మెస్‌లు, టీవీల్లో ప్రచారాలు నిలిపివేయాలన్నారు. ఫిబ్రవరి 2న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ నిర్వహణ జరగనున్నట్లు తెలిపారు.

యనమల స్కెచ్.. కోడెల అవుట్..

టీడీపీ సీనియర్ నేతలు య‌న‌మ‌ల రామకృష్ణకి.. స్పీకర్ కోడెల శివప్రసాద్ కి మధ్య భేదాభిప్రాయాలు వచ్చిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ సమావేశాలు ఎక్కడ జరపాలి అన్న విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. అయితే ఈ విషయంలో మాత్రం యనమల మాటే నెగ్గినట్టు కనిపిస్తోంది. రాష్ట్ర విడిపోయిన తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇక్కడే ఉండి పాలన సాగిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడే అసెంబ్లీ సమావేశాలు జరిగితే బావుంటుందని.. దానికి గుంటూరు జిల్లాలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తే బాగుంటుందని సభాపతి కోడెల శివప్రసాదరావు భావించారు. అంతేకాదు దానికి అందరిని ఒప్పించి.. అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లకు గుంటూరు జిల్లాలోని హాయ్‌ల్యాండ్‌కు అధికారుల బృందాన్ని కూడా పంపించారు. అయితే యనమల మాత్రం హైద‌రాబాద్‌లోనే అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని ప‌ట్టుబ‌ట్టారు. అంతేకాదు మ‌రో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు పలువురు మంత్రులతో సమావేశాలు హైదరాబాద్‌లోనే నిర్వహిస్తే మంచిదని, గతంలో ప్రైవేటు సంస్థల్లో ఏ రాష్ర్ట అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేదని, ఖర్చు కూడా ఎక్కువవుతుందని చెప్పడంతో చంద్రబాబు కూడా వాటికి అంగీకరించి హైదరాబాద్లోనే అసంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రకటించారు. దీంతో ఈ నిర్ణయంతో కోడెల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది.

కేసీఆర్ కి చంద్రబాబు సతీమణి స్ట్రాంగ్ రిప్లై..

తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబు సతీమణిపై ఓ సంచలన వ్యాఖ్య చేసిన సంగతి తెలిసిందే. గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన టీడీపీ అధినేత‌ నారా చంద్ర‌బాబు స‌తీమ‌ణి.. భువ‌నేశ్వ‌రి.. టీఆర్ఎస్‌కే ఓటేస్తామ‌ని చెప్పార‌ు. దీంతో అందరూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆశ్చర్యపోయారు. అయితే ఈ వ్యాఖ్యలపై భువ‌నేశ్వ‌రి మాత్రం కేసీఆర్ కు గట్టి సమాధనమే ఇచ్చారు. తన కుమారుడు ట్విట్టర్లో ఆమె కేసీఆర్ కు గట్టి షాకే ఇచ్చారు. ‘రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఓ బహిరంగ సభలో నేను టీఆర్‌ఎస్‌ పార్టీకి ఓటు వేస్తానని చెప్పడం నాకు దిగ్ర్భాంతి కలిగించింది. ఓటర్లను అయోమయానికి గురి చేయడానికి ఆయన నన్ను ఎంచుకోవడం దురదృష్టకరం… బాధాకరం. నేను స్పష్టంగా చెబుతున్నా. నా ఓటు ఎప్పటికీ టీడీపీకే’ అని ఆమె పేర్కొన్నారు. దీంతో భువ‌నేశ్వ‌రి స్ర్టాంగ్ రిప్లేతో కేసీఆర్‌కు షాక్ ఇచ్చిన‌ట్ల‌య్యింది.

తొడగొట్టేసిన చంద్రబాబు..

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అప్పుడప్పుడు ప్రజలను ఆకర్షించే పనులు చేస్తుంటారు. మొన్ననే ఓ కార్యక్రమంలో చిందేసిన చంద్రబాబు తాజాగా తొడగొట్టి అందరూ ఆశ్చర్యపోయేలా చేశారు. విశాఖలో  షురూ అయిన ప్రో కబడ్డీ లీగ్ మూడో సీజన్ పోటీల్ని ప్రారంభించిన సందర్భంగా చంద్రబాబు ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన తొడ కొట్టేశారు. అంతేకాదు ఆయన తన గతాన్ని కూడా గుర్తుచేసుకన్నారు. తాను చిన్నతనంలో మట్టిలో కబడ్డీ ఆడేవాడినని.. ఇప్పుడు మ్యాట్ మీద ఆడుతున్నానని అన్నారు. మొత్తానికి తెలుగు సినిమాల్లో కామన్ అయిన తొడగట్టడం.. ఇప్పుడు చంద్రబాబు కొట్టేశారు.

మొన్న నన్ను.. నిన్న నా భార్య.. కేసీఆర్ పై చంద్రబాబు ఫైర్

చాలా రోజుల నుండి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోని తెలుగు రాష్ట్రాల సీఎంలు.. ఇప్పుడు గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో మాత్రం కాస్త దూకుడిని ప్రదర్శిస్తున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కేసీఆర్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితం..చంద్రబాబుకు హైదరాబాదులో ఏం పని అని కెసిఆర్ ప్రశ్నించారు.. అంతేకాదు నిన్న జరిగిన ప్రచారంలో కూడా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కూడా టిఆర్ఎస్ పార్టీకే ఓటు వేస్తుందని వ్యాఖ్యానించారు. దీంతో చంద్రబాబు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. గ్రేటర్ పార్టీ నాయకులతో  చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ.. తనకు హైదరాబాదులో ఏం పని అని కెసిఆర్ ప్రశ్నించారని, ఇప్పుడేమే తన భార్య భువనేశ్వరి తెరాసకు ఓటు వేస్తానని చెప్పారని కెసిఆర్ చెప్పారని, అన్నీ అబద్దాలు ఆడుతున్నారన్నారని.. కెసిఆర్ అలా మాట్లాడితే ఆయనకే నష్టమని అన్నారు. అంతేకాదు  హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ చాలా బలంగా ఉందని, దానిని తట్టుకోలేకే కేసీఆర్ అలా మాట్లాడుతున్నాడని.. ఎన్నికలు అయేంత వరకూ అప్రమత్తంగా ఉండాలని.. ముఖ్యంగా ఎన్నికల రోజు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారట. మరి ఇన్ని రోజులు సన్నిహితంగా ఉన్న సీఎంల మధ్య గ్రేటర్ వార్ మళ్లీ వార్ తీసుకొస్తుందా చూడాలి.

నేను ఎందుకొచ్చానంటే.. రాహుల్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో రోహిత్ జన్మదినం సందర్బంగా విద్యార్ధులు అర్ధరాత్రి నుండే నిరసన మొదలు పెట్టారు. అంతేకాదు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నిన్న నే హెచ్ సీయూ చేసుకొని విద్యార్ధులకు మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 'భవిష్యత్తుపై ఎన్నో ఆశలు, ఆశయాలు పెట్టుకున్న ఓ జీవితం అర్థాంతరంగా ముగిసింది. రోహిత్ స్నేహితులు, ఫ్యామిలీ అభ్యర్థన మేరకు న్యాయం పోరాటం చేసేందుకు ఇక్కడకు వచ్చాను. పక్షపాతం, అన్యాయం నుంచి స్వేచ్ఛ కోరుకుంటున్న ప్రతి భారతీయ విద్యార్థి ఆశయం కోసం కట్టుబడి ఉన్నాం' అని ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ప్రముఖ రచయిత్రి నాయని కృష్ణకుమారి కన్నుమూత

తెలుగు సాహిత్యానికి నేడు మరో కోలుకోలేని దెబ్బ తగిలింది. జీవితాన్ని ఆసాంతం రచనలకే అంకితం చేసిన ప్రముఖ రచయిత్రి నాయని కృష్ణకుమారి (86) నేడు కన్నుమూశారు. ప్రముఖ కవి నాయని సుబ్బారావు కుమార్తె అయిన కృష్ణకుమారి చిన్ననాటి నుంచే రచనా వ్యాసంగం పట్ల ఆసక్తి కనబరిచేవారు. 18 ఏళ్ల అతి పిన్న వయసులోనే ‘ఆంధ్రుల కథ’ పేరిట ఆంధ్రుల చరిత్రను రాశారు. అప్పట్లో ఆ పుస్తకాన్ని పాఠ్యపుస్తకంగా నిర్దేశించింది ప్రభుత్వం. తెలుగులో ఉన్నత విద్యను పూర్తిచేసుకున్న తరువాత హైదరాబాదులో స్థిరపడ్డారు కృష్ణకుమారి. అంచెలంచెలుగా తెలుగు పథంలో ఎదుగుతూ తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతిగా పదవీ విరమణ చేశారు. కథలు, కవితలు, వ్యాసాలు, సాహితీ విమర్శలు… ఇలా కృష్ణకుమారిగారు అన్ని సాహితీ ప్రక్రియలలోనూ రాణించారు. జానపద సాహిత్యం మీద సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించి పి.హెచ్‌.డి. పట్టాను సైతం సాధించారు. తెలుగు సాహిత్యానికి ఎనలేని కృషి చేసిన కృష్ణకుమారి మరణం పట్ల  ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంతాపం ప్రకటించారు.