పోలింగ్ సీన్: రెండు గంటల్లో 14 శాతం ఓటింగ్

  తెలంగాణ ఎన్నికలలో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొంటున్న సూచనలు కనిపిస్తున్నాయి. బుధవారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ ప్రారంభమైన తొలి రెండు గంటల్లోనే.. అంటే ఉదయం 9 గంటల వరకు తెలంగాణ వ్యాప్తంగా 14 శాతం ఓటింగ్ జరిగింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 17 శాతం ఓటింగ్ కూడా జరిగింది. హైదరాబాద్‌లో మాత్రం 11 శాతం పోలింగ్ జరిగింది. పోలింగ్ శాతం మరింత పుంజుకునే అవకాశం వుంది. ఈ విషయాన్ని రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. పోలింగ్ అన్ని ఏరియాలలో ప్రశాంతంగా జరుగుతోందని, ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని భన్వర్ లాల్ తెలిపారు.

కేంద్రమంత్రి చిరంజీవికి ఓటర్ల షాక్

  మాజీ మెగాస్టార్, కేంద్ర మంత్రి చిరంజీవికి జూబిలీహిల్స్ ఓటర్లు షాక్ ఇచ్చారు. కుటుంబంతో కలసి జూబిలీహిల్స్ లోని పోలింగ్ బూత్‌కి వెళ్ళిన చిరంజీవి మొదట కుటుంబంతో కలసి క్యూలోనే నిలబడ్డారు. అయితే కొంతమంది ‘స్వామిభక్తులు’ చిరంజీవిని డైరెక్ట్ గా వచ్చి ఓటు వేయమని ఆహ్వానించారు. దాంతో చిరంజీవి కుటుంబం క్యూలోంచి బయటకి వచ్చి డైరెక్ట్ గా పోలింగ్ బూత్‌లోకి వెళ్ళబోయింది. అయితే అక్కడ క్యూలో వున్న ఓటర్లు చిరంజీవి అలా డైరెక్ట్ గా వెళ్ళిపోవడాన్ని అడ్డుకున్నారు. మీరూ మాలాంటి ఓటరేనని, మీరు కేంద్రమంత్రి అయినంత మాత్రాన మీకు ప్రత్యేకత లేదని, ఓటు వేసే దగ్గర ప్రొటోకాల్ వుండదని స్పష్టం చేశారు. దాంతో చిరంజీవి నాలుక్కరుచుకుని ఓటర్లకు సారీ చెప్పి, మళ్ళీ కుటుంబంతో కలసి క్యూలో నిల్చుని వెళ్ళి ఓటు వేశారు.

గవర్నర్ అంటే నరసింహన్‌లా వుండాలి: ఓటు హక్కు వినియోగం!

  రాష్ట్ర గవర్నర్ నరసింహన్ అసలు గవర్నర్ అంటే ఎలా వుండాలో ఉదాహరణగా నిలిచారు. రాష్ట్రానికి ప్రథమ పౌరుడైన ఆయన ఓటు వేయడానికి అందరికంటే ముందున్నారు. రాజ్‌భవన్ ఏరియాలోని ఎం.ఎస్. మక్తాలోని పోలింగ్ కేంద్రనికి గవర్నర్ ఉదయాన్నే తన భార్యతో కలసి వెళ్ళారు. ఓటు వేసిన అనంతరం ఆయన తన భార్యతో కలసి ఓటు వేసినట్టుగా చూపుడువేళ్ళని మీడియాకి చూపించారు. గవర్నర్ ఓటు వేస్తుండగా మీడియా కెమెరాలు చిత్రీకరించడానికి ప్రయత్నించాయి. అయితే ఆయన దాన్ని వారించారు. ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఓటు హక్కు అనేది ప్రజాస్వామ్యం మనకు ఇచ్చిన గొప్ప అవకాశం అని, దీనిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని నరసింహన్ చెప్పారు.

కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నానికి కారణాలివే!

  వరంగల్ జిల్లా వర్ధన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీలో వున్న కొండేటి శ్రీధర్ మంగళవారం మధ్యాహ్నం పురుగుల మందు తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేయడం రాజకీయ వర్గాలలో సంచలనం సృష్టించింది. తన నియోజకవర్గం పరిధిలోని పెద్ద పెండ్యాల్ గ్రామంలో వున్న మామిడి తోటలో శ్రీధర్ పురుగుల మందు తాగాడు. అపస్మారక స్థితిలో వున్న శ్రీధర్ని ఆస్పత్రికి తరలించారు. శ్రీధర్ ఆరోగ్య పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే వున్నట్టు తెలుస్తోంది. ఎలక్షన్ల ముందు రోజు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం చేయడం మీద పోలీసులు, రాజకీయ వర్గాలు దృష్టి సారించాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే శ్రీధర్ ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా ప్రాథమిక సమాచారం అందుతోంది. వర్ధన్నపేటలో రాజకీయంగా హోరాహోరీ పోరు జరుగుతోంది. ఏ పార్టీకి ఆ పార్టీ డబ్బు కుమ్మరిస్తోంది. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన శ్రీధర్ తన శక్తికి మించి ఇప్పటికే ఖర్చు పెట్టేశాడు. పార్టీ నుంచి ఫండ్ వస్తుందని అనుకుంటే అక్కడి నుంచి పైసా కూడా రాలలేదు. మరోవైపు ఆర్థికంగా బలంగా వున్న తన ప్రత్యర్థులు డబ్బులు వెదజల్లుతూ వుండటంతో ఈ ఎన్నికలలో తాను ఓడిపోవడం ఖాయమన్న అభిప్రాయానికి శ్రీధర్ వచ్చాడు. దాంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యా ప్రయత్నం చేశాడని తెలుస్తోంది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న శ్రీధర్‌ను టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతోపాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పరామర్శించారు.

బుధవారం లోక్‌సభ పోలింగ్‌లో మహామహులు...

      బుధవారం నాడు జరిగే ఏడో విడత పోలింగ్‌లో దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాలు, యు.టి.లలోని 89 లోక్‌సభ స్థానాలలో ఓటింగ్ జరుగుతుంది. ఉత్తర్ ప్రదేశ్, బీహార్, జమ్ము అండ్ కాశ్మీర్, పంజాబ్, గుజరాత్, డామన్ అండ్ డ్యు, దాద్రా అండ్ నగర్ హవేలీ, పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్‌లలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ విడత ఎన్నికల బరిలో భారతీయ జనతాపార్టీ నుంచి ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ (వదోదర), అగ్ర నాయకులు ఎల్.కె.అద్వానీ (గాంధీ నగర్), మురళీ మనోహర్ జోషి (కాన్పూర్), అరుణ్ జైట్లీ (అమృత్‌సర్), ఉమా భారతి (ఝాన్సీ), వినోద్ ఖన్నా (గురుదాస్ పూర్) రంగంలో వున్నారు. కాంగ్రెస్ నుంచి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ (రాయబరేలి), కెప్టెన్ అమరీందర్ సింగ్ (అమృత్‌సర్), రీటా బహుగుణ (లక్నో), అంబికా సోని (ఆనంద్ పూర్ సాహిబ్) రంగంలో వున్నారు. వీరితోపాలు నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత, కేంద్ర మంత్రి ఫరూఖ్ అబ్దుల్లా (శ్రీనగర్), జేడీయు అధ్యక్షుడు శరద్ యాదవ్ (మాధేపురా) రంగంలో వున్నారు.

మద్యం సిండికేట్ డొంక మళ్ళీ కదిలింది

  ఒకప్పుడు మాజీ సీయం కిరణ్ కుమార్ రెడ్డి తనకు పక్కలో బల్లెంలా ఉన్న పీసీసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణను లొంగదీసేందుకు, ఆయన విజయనగరం జిల్లాలో నడిపిస్తున్న లిక్కర్ సిండికేట్ పై ఏసీబీ విచారణకు ఆదేశించేరు. అయితే అది కక్ష సాధింపు చర్యగా కనబడకూదదనే ఆలోచనతో రాష్ట్రంలో కొన్ని ఇతర జిల్లాలలో జరుగుతున్న మద్యం సిండికేట్ వ్యాపారాలపై దర్యాప్తుకు ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో ఏసీబీ అధికారులు ఒక్కసారిగా పలు జిల్లాలలో నిర్వహించిన దాడులలో అనేకమంది అధికార, ప్రతిపక్ష పార్టీల యం.యల్యేలు. ప్రభుత్వాధికారులు, బ్రోకర్లు, చివరికి కొందరు పత్రికా విలేఖరులు కూడా పట్టుబడ్డారు. అయితే ఇదంతా బొత్స సత్యనారాయణను టార్గెట్ చేసి మొదలుపెట్టినందున, ఏసీబీ అధికారులు విజయనగరంలో చాలా లోతుగా దర్యాప్తు చేసి, ఈ సిండికేట్ మూలాల వరకు చొచ్చుకు పోయారు. అప్పుడు బొత్స హడావుడిగా డిల్లీ వెళ్లి చక్రం తిప్పితే గానీ, ఈ దర్యాప్తుకు బ్రేకులు పడలేదు. అంతటితో దర్యాప్తు ఆగిపోయింది. ఏసీబీ అధికారులు ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొంటూ ఎంతో శ్రమించి తయారుచేసిన నివేదికలో రాజకీయ నాయకుల పేర్లన్నీ కనబడకుండా వాటంతటవే మాయమయిపోయాయి. ఆ తరువాత కిరణ్ కూడా చల్లబడిపోవడంతో ఏసీబీ అధికారులు మిగిలిన నివేదికను కూడా అటకెక్కించేసారు. ఆ తరువాత ఉద్యమాలు, రాష్ట్ర విభజన వ్యవహారం, తెలంగాణా ప్రకటన, సమైక్యాంధ్ర ఉద్యమాలతో ఆ కధ కంచికి వెళ్లిపోయింది. కానీ మళ్ళీ ఇన్ని రోజుల తరువాత ఏసిబీ అధికారులు ఆ నివేదికను అటక మీద నుండి దింపి దుమ్ము దులిపి, ఈ మద్యం సిండికేట్ లో నిందితులుగా పేర్కొనబడ్డ 34 మంది ఎక్సైజ్ అధికారులపై చర్యలు విచారణకు అనుమతించాలంటూ గవర్నర్ నరసింహన్ కోరారు. ఆయన అందుకు వెంటనే అనుమతి ఇస్తూ ఇంతకాలం ఎందుకు చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. దీనినే ఎంకి పెళ్లి సుబ్బి చావుకి వచ్చిందని అంటారేమో! దర్యాప్తుకి ఆదేశించిన కిరణ్ పదవిలో లేరు పార్టీలోను లేరు. బొత్స కూడా ఇప్పుడు మాజీ అయిపోయారు. నివేదికలో పేర్లు ఎక్కిన అధికారులు మాత్రం ఇంకా ఉద్యోగాలలోనే ఉన్నారు గనుక అడ్డంగా బుక్ అయిపోయారు.

మావోయిస్టులు రంగంలోకి దిగారు జర భద్రం

      బుధవారం నాడు తెలంగాణలో పోలింగ్ నిర్వహణకు ఒకపక్క సన్నాహాలు చేస్తుంటే, మరోపక్క మావోయిస్టులు విధ్వంసాలు సృష్టించడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని నిఘా వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇప్పటికే ఆదిలాబాద్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో మావోయిస్టు యాక్షన్ టీంలు కార్యకలాపాలు ప్రారంభించాయని నిఘా వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ మూడు జిల్లాల పోలీసులను డీజీపీ కార్యాలయం అప్రమత్తం చేసింది. సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు కూబింగ్ కొనసాగిస్తున్నారు. గ్రేహౌండ్స్ బలగాల కూంబింగ్‌తో పాటు, మావోయిస్టుల ఆపరేషన్స్‌లో అనుభవజ్ఞులైన సీనియర్ అధికారులను పోలీసు అధికారులు రంగంలోకి దించారు. పోలింగ్ కేంద్రాలను, నాయకులను టార్గెట్ చేసి మావోయిస్టులు దాడులకు దిగే అవకాశం ఉందని పోలీసులు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు.

వల్లభనేని వంశీపై జగన్ పార్టీ నేతల దాడి

      జగన్ పార్టీ నాయకులకు తెలుగుదేశం నాయకుల మీద దాడులు చేయడం తప్ప మరో పని ఉన్నట్టు లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో జగన్ పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద దాడులు చేసినట్టు కేసులు నమోదయ్యాయి. ఈ ఎన్నికలలో వైకాపా అడ్రస్ గల్లంతు కాబోతోందన్న ఆందోళనతో వైకాపా నాయకులు ఈ రకమైన దాడులకు పాల్పడుతున్నారన్న అభిప్రాయాలను రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. లేటెస్ట్ గా జగన్ పార్టీ నాయకులు గన్నవరం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి వల్లభనేని వంశీ మీద దాడి చేశారు. వంశీ ప్రయాణిస్తున్న కారు మీద వైకాపా కార్యకర్తలు దాడి చేసి కారు అద్దాలు పగలగొట్టడంతోపాటు కారును కూడా పూర్తిగా పాడు చేసినట్టు తెలుస్తోంది. ఈ విషయమై వల్లభనేని వంశీ పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు సమాచారం.

పోలింగ్ ముందు కాంగ్రెస్ విభజన హడావిడి

      ప్రపంచంలోని అన్ని రాజకీయ పార్టీలకి వుండే అతి తెలివితేటలన్నీ ఒక్క కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నట్టున్నాయి. తెలంగాణలో రేపు పోలింగ్ జరగబోతోంది. సోమవారం నాడే ప్రచార కార్యక్రమం ముగిసింది. అయితే కాంగ్రెస్ పార్టీ పోలింగ్ ముందు రోజు కూడా తెలంగాణలోని ఓటర్లని ప్రభావితం చేసే కుళ్ళు ఐడియాని ఆచరణలో పెట్టింది. రాష్ట్ర విభజనకు సంబంధించిన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పలువురు అధికారులు పాల్గొని రాష్ట్ర విభజన ఎలా చేయాలా అనే విషయం మీద తీవ్రంగా చర్చించారు. ఈ మీటింగ్ ఎన్నికల ముందు రోజే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏమొచ్చిందంట? అలాగే కేంద్ర మంత్రి జైరాం రమేష్ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన వివరాలను మీడియాకు వివరించారు. మే 9న సమావేశమై విభజన ప్రక్రియని సమీక్షిస్తారట. అలాగే విభజనపై ఏర్పడిన 21 కమిటీల నివేదికలను మే 8న వెబ్ సైట్‌లో వుంచుతారట. హోం శాఖ నేతృత్వంలో మరో కమిటీని కూడా ఏర్పాటు చేస్తారట. ఈ శుభవార్తలన్నీ  చెప్పదలచుకుంటే ఎన్నికలు పూర్తయిన తర్వాత చెప్పొచ్చు కదా.. పోలింగ్ ముందురోజే చెప్పడం ఎందుకో! కాంగ్రెస్ పార్టీ తెలివితేటలన్నీ ఇలాగే వుంటాయి.

మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. ఇంకా ఆరు సభల్లో..

      నరేంద్రమోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ తెలంగాణ ప్రాంతంలో ఒక్క సభలో కలసి పాల్గొంటేనే ఇతర రాజకీయ పక్షాలు గుండెలు గుభేల్‌మన్నాయి. ఈ త్రిమూర్తుల కాంబినేషన్‌కి ప్రజల నుంచి లభిస్తున్న ప్రతిస్పందన చూసి తెలంగాణ కాంగ్రెస్ గుండె గుభేల్‌మంటే, టీఆర్ఎస్ లబోదిబో అని నెత్తీనోరూ బాదుకుంది. ఇకముందు ఇలా లబలబలాడే స్కీము సీమాంధ్ర కాంగ్రెస్‌ది, వైకాపాది కాబోతోందని బీజేపీ నాయకులు అంటున్నారు. ఈ ముగ్గురూ కలసి సీమాంధ్రలో ఒకటి కాదు రెండు కాదు మూడు కూడా కాదు.. మొత్తం ఆరు బహిరంగ సభల్లో ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని భారతీయ జనతాపార్టీ అధికార ప్రతినిధి ప్రకాష్ జవదేకర్ ప్రకటించారు. ఇప్పటికే సీమాంధ్రలో కాంగ్రెస్, వైకాపాల పరిస్థితి అయోమయం జగన్నాథంలా వుంది. ఇప్పుడు బీజేపీ, టీడీపీ కూటమి ఈ స్థాయిలో ప్రచారం చేసిందంటే ఏం కొంప మునుగుతుందో అని సదరు కాంగ్రెస్, వైకాపా నాయకులు తల్లడిల్లుతున్నారు.

అంకెల్లో తెలంగాణ పోలింగ్

      ఏప్రిల్ 30వ తేదీన తెలంగాణలోని మొదటి విడత పోలింగ్ జరగబోతోంది. పది జిల్లాలోని 17 పార్లమెంటు, 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. ఈ ఎన్నికలకు 4 లక్షల మంది ఎన్నికల సిబ్బందిని నియమించారు. 162 కంపెనీల కేంద్ర బలగాలను మోహరించారు. రాష్ట్రానికి చెందిన 1,40,000 మంది పోలీసులతో భద్రతా చర్యలు చేపట్టారు.   మొత్తం 30,518 పోలింగ్ స్టేషన్లకు గాను 12 వేల పోలింగ్ స్టేషన్లలను సమస్యాత్మక పోలింగ్ స్టేషన్లుగా గుర్తించారు. ఈ ఎన్నికలలో 2 కోట్ల 81 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. వీరిలో 1 కోటి 37 లక్షల మంది మహిళా ఓటర్లు. తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలకు 265 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు. 119 అసెంబ్లీ స్థానాలకు 1669 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు.  ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలలో కొన్ని చోట్ల ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు, మరికొన్ని ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది.  ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 126 కోట్ల రూపాయలు, 74 కిలోల బంగారి, 708 కిలోల వెండి, 4,50,000 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల భద్రతకి సంబంధించి ఫిర్యాదు చేయదలచుకుంటే 1950 టోల్ ఫ్రీ నంబర్‌కి ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చు.  

సీమాంధ్రులలో హైదరాబాద్ యు.టి. ఆశలు

      రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రులను దారుణంగా మోసం చేసింది. తరతరాలు కోలుకోలేని విధంగా అన్యాయం చేసింది. కనీసం హైదరాబాద్‌ని కేంద్రపాలిత ప్రాంతంగా ప్రకటించకుండా హైదరాబాద్ మొత్తం మీద తెలంగాణకే అన్ని హక్కులూ ధారాదత్తం చేస్తూ సీమాంధ్రులను హైదరాబాద్‌లో అనాథలుగా చేసింది. కాంగ్రెస్ పార్టీ చేసిన దుర్మార్గపు విభజనకు ప్రతీకారం తీర్చుకోవడానికి, తెలుగుదేశం, బీజేపీ కూటమికి పట్టం కట్టడానికి అక్కడి ప్రజలు సిద్ధంగా వున్నారు.   రేపటితో తెలంగాణలో ఎన్నికలు ముగుస్తున్నాయి. ఎన్నికల కోసమే ఇప్పటి వరకూ కేంద్రపాలిత ప్రాంతంగా హైదరాబాద్ అనే అంశాలన్ని ఇప్పటి వరకూ బయటకి చెప్పని బీజేపీ నాయకత్వం తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే ఈ అంశాన్ని బహిరంగంగా ప్రకటించే అవకాశం వుందని తెలుస్తోంది. మే 1న సీమాంధ్రలో మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొనే సభలో హైదరాబాద్ కేంద్ర పాలిత ప్రాంతం అనే అంశాన్ని మోడీ ప్రకటించే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఈ అనుమానాన్నే టీఆర్ఎస్ నాయకుడు కేసీఆర్‌కీ వచ్చింది. తెలంగాణలో పోలింగ్ ముగిసిన వెంటనే హైదరాబాద్ యూటీ చేస్తామనే ప్రకటన బీజేపీ నుంచి వస్తుందని ఆయన ఓ బహిరంగ సభలో చెప్పారు. కాంగ్రెస్ పార్టీ చేతిలో దారుణంగా గాయపడిన సీమాంధ్రకు ఆ గాయాలు తగ్గాలంటే హైదరాబాద్ యుటి ప్రకటన చేయాల్సిన బాధ్యత బీజేపీ మీద వుంది.  

మోడీ దయ్యం లాంటోడు: మమతా బెనర్జీ మండిపాటు

      బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ దయ్యం లాంటోడని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిణి మమతా బెనర్జీ మండిపడ్డారు. గుజరాత్ అల్లర్ల సూత్రధారి నరేంద్రమోడీ దేశానికి ప్రధానమంత్రి అయితే దేశానికి చీకటి రోజులు ప్రారంభమవుతాయని ఆమె ఆగ్రహంగా చెప్పారు. ‘‘గుజరాత్‌లో అల్లర్లకు కారణమైన మోడీ ఇప్పుడు తన దృష్టిని పశ్చిమ బెంగాల్ మీద కేంద్రీకరించాడు. ఇక్కడ కూడా గుజరాత్ తరహా అల్లర్లు జరగాలని మోడీ పథక రచన చేస్తున్నాడు’’ అని మమత మోడీ మీద విరుచుకుపడ్డారు. పశ్చిమ బెంగాల్ అభివృద్ధి గురించి మోడీ ప్రస్తావించడాన్ని మమత ఖండిస్తూ, గుజరాత్ అల్లర్ల కారకుడి నుంచి పాఠాలు నేర్చుకోవలసిన అవసరం బెంగాలీ ప్రజలకు లేదని ఆమె అన్నారు.

అసెంబ్లీ రద్దుకు రాష్ట్రపతి ఆమోదం

      ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని రద్దు చేయాలని కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. దీంతో కొత్తగా మరోమారు రాష్ట్రపతి పాలన విధించడంతో పార్లమెంటు ఆమోదానికి మరో రెండు నెలలు అవకాశం లభించినట్లయింది. అయితే ఇది ఇప్పటికే అమలులో ఉన్న రాష్ట్రపతి పాలనకు కొనసాగింపు మాత్రమే. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం... ఏదైనా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించిన రెండు నెలల్లోపు పార్లమెంటు ఆమోదం పొందాలి. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి ఈ గడువు ఏప్రిల్ 30వ తేదీతో ముగుస్తోంది. కానీ, ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో పార్లమెంటును సమావేశ పరిచే పరిస్థితి లేదు. రాష్ట్రంలోనూ కొత్తగా ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. దీంతో అసలు శాసనసభను రద్దు చేయడమే అన్ని సమస్యలకు పరిష్కారమని కేంద్రం నిర్ణయించుకుంది.