గుర్రాల కళ్లకు అద్దాలు, కాళ్లకు కవచాలు.. శక్తిమాన్ లా కాకుండా

  బీజేపీ ఎమ్మెల్యే గణేశ్‌జోషీ శక్తిమాన్ అనే గుర్రంపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాని కాలు విరిగిపోగా వైద్యులు దానికి ప్లాస్టిక్ కాలును అమర్చిన సంగతి కూడా విదితమే. అయితే ఇప్పుడు యూపీ ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అదేంటంటే.. ఇకమీదట ఏ గుర్రానికి ఇలాంటి హాని కలుగకుండా ఉండేందుకు.. రక్షణ కవచాలు. గుర్రాల కళ్లకు అద్దాలు, కాళ్లకు కవచాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు డీజీపీ జావీద్ అహ్మద్ వెల్లడించారు. ఐతే ఈ కవచాలు అన్నిగుర్రాలకి వర్తించవట. శిక్షణ, క్రీడల్లో పాల్గొనే గుర్రాలకు ఈ కవచాలు ఉండవని స్పష్టంచేశారు.

విజయ్ మాల్యాకు ఛాన్స్ ఇవ్వండి.. మీడియా హడావుడి ఎక్కువైంది

  బ్యాంకులకు తొమ్మిది వేల కోట్లు ఎగనామం పెట్టిన విజయ్ మాల్యాపై చాలా మంది చాలానే ఆరోపణలు చేశారు. అయితే అందరూ ఆరోపణలు చేస్తూన్న నేపథ్యంలో బయోటెక్నాలజీ సంస్థ బయోకాన్ సీఎండీ కిరణ్ మజుందార్ షా మాత్రం విజయ్ మాల్యాకు తన మద్దతును ప్రకటించారు. విజయ్ మాల్యా వ్యవహారంపై స్పందించిన ఆమె.. విజయ్ మాల్యాపై మీడియాయే విచారణ జరపటం వల్ల ప్రయోజనం లేదని.. రుణ డిఫాల్ట్ సమస్యను బ్యాంకులతో సెటిల్ చేసుకునేందుకు సిద్ధంగా ఉన్నానంటూ మాల్యా స్వయంగా చెప్పినందున, ఆయనకు సముచిత అవకాశం ఇవ్వాలని పేర్కొన్నారు. మీడియా హడావుడి వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు.. ఈరోజుల్లో మీడియానే ప్రతిఒక్కరినీ విచారణ చేస్తుంది.. దీనివల్ల అసలు ప్రక్రియ కుంటుపడుతోంది’ అని ఆమె అభిప్రాయపడ్డారు. మాల్యా కచ్చితంగా భారత్ తిరిగి వస్తారని మజుందార్ షా ధీమా వ్యక్తం చేశారు.

భారీగా పెరగనున్న తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతభత్యాలు

  తెలంగాణ ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు జీతభత్యాలు భారీగానే పెంచనున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేల,  ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల జీతాల పెంపునకు శాసనసభ్యుల సౌకర్యాల కమిటీ సిఫారసు చేయగా దీనిపై చర్చించిన అనంతరం.. సభ్యుల జీత భత్యాలను రూ.1.25 లక్షల నుంచి రూ.3.5 లక్షలకు పెంచే విధంగా కమిటీ సిఫారసు చేసింది. ఇంకా అనేక అంశాలపై నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.   * ప్రస్తుతం సభ్యులకు ఇస్తున్న వెహికల్ లోన్‌ను రూ. 15 లక్షల నుంచి రూ.40 లక్షలకు పెంచుట.. * మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పింఛను రూ.50 వేల నుంచి రూ.65 వేలకు పెంచుట.. * ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మరణిస్తే, వారి మరణాంతరం వారి భార్యలకు కూడా ఇదే సౌకర్యాలను కల్పించుట.. * రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ఇళ్ల స్థలాలు కేటాయింపు

సినీ నేపధ్య గాయనిగా ​ సంస్కృతి

ప్రఖ్యాత తెలుగు గజల్ గాయకుడు డా. గజల్ శ్రీనివాస్ కుమార్తె  సంస్కృతి సినీ నేపధ్య గాయనిగా పరిచయం కాబోతోంది.  లలితా  శ్రీ చిత్రాలయమ్స్ నిర్మిస్తున్న "  అనుష్ఠానం" చిత్రానికి రసరాజు వ్రాసిన టైటిల్ సాంగ్ ని సంస్కృతి గానం చేయగా పి వి ర్ స్టూడియో లో రికార్డు చేసినట్టు చిత్ర దర్శకుడు మరియు సంగీత దర్శకుడు  అయిన కృష్ణ వాసా తెలిపారు . సంస్కృతి 2005 నుండి తెలుగు లో గజల్ గానం చేస్తూ అమెరికా, కెనడా , సింగపూర్ , మలేషియా , గల్ఫ్ లాంటి దేశాలలో తన గజల్ ప్రదర్శన లతో  ఎంతో పేరుతెచ్చుకున్నదని, తన తెలుగు గజల్ఆల్బమ్స్ బహుళ ప్రచారం పొందాయని    2013 లో నిర్వహించిన అంతర్జాతీయ బాలల చలనచిత్ర ఉత్సవాలలో " ఉత్తమ బాల మేధావి " అవార్డును  స్వీకరించినదని తెలిపారు.

అమితాబ్‌ జాతీయగీతం పాడినందుకు అయిన ఖర్చెంత

మొన్న భారత్‌, పాకిస్తాన్‌ల మధ్య టి-20 మ్యాచ్‌ ఆరంభానికి ముందు అమితాబ్ బచ్చన్ జాతీయగీతం పాడిన విషయం తెలిసిందే! తనదైన శైలిలో అమితాబ్ పాడిన ఈ గీతానికి దేశవ్యాప్తంగా గొప్ప స్పందన లభించింది. అమితాబ్ నోటి చలవో ఏమోగానీ, భారత్‌ ఆ ఆటలో గెలిచింది కూడా! కానీ మ్యాచ్‌కి వచ్చేందుకు అమితాబ్‌ 4 కోట్ల రూపాయలను వసూలు చేశాడన్న విషయం మరికొద్ది సేపట్లోనే సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేసింది. జాతీయ గీతం పాడేందుకు కూడా డబ్బులు వసూలు చేస్తాడా అంటూ ఫేస్‌బుక్ సమాజం తెగ బాధపడిపోయింది. ఈ విషయమై బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ దిమ్మ తిరిగిపోయే వివరణ ఇచ్చారు. అమితాబ్ కోల్‌కతాకు వచ్చినందుకు ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. అమితాబ్ కోల్‌కతాకు ప్రత్యేక విమానంలో వచ్చి, హోటల్‌లో బస చేసి, టికెట్లను ఖరీదు చేసి.... ఇలా ఈ టి-20 మ్యాచ్‌ కోసం అమితాబ్ అక్షరాలా 30 లక్షల రూపాయలు ఖర్చుచేశాడట. కానీ సౌరవ్‌ ఎంతగా బతిమాలినా ఒక్క రూపాయి కూడా తీసుకోలేదట. ప్రస్తుతానికి ఫేస్‌బుక్‌లో నాలుగు కోట్ల రూపాయల పుకారు పోయి ఈ 30 లక్షల రూపాయల వార్త రాజ్యమేలుతోంది. ఎంతైనా బిగ్‌బీ బిగ్‌బీనే అంటూ ఫేస్‌బుక్‌ సమాజం తెగ మెచ్చుకుంటోంది.

అడవులను రక్షించేందుకు చంబల్‌ దొంగల సమావేశం

చంబల్‌ పేరు వినగానే, ఒకప్పుడు ఈ దేశాన్ని గడగడ వణికించిన గజదొంగలు గుర్తుకువస్తారు. వారిలో చాలామంది ఇప్పుడు జనజీవన స్రవంతిలో కలిసిపోయినప్పటికీ, వారు సాగించిన దారుణాలు మాత్రం ఇంకా ఉత్తరాది మదిలో ఉన్నాయి. వారంతా నిన్న జైపూర్‌లో సమావేశమయ్యారు. ఎందుకో తెలుసా! అడవులను రక్షించేందుకు. అవును. అంతర్జాతీయ అటవీ దినోత్సవం సందర్భంగా వారంతా నిన్న జైపూర్‌లో ఒక చోటకి చేరుకున్నారు. రోజురోజుకీ అడవులని నరికివేస్తున్నారనీ, తాము చంబల్ అడవుల్లో తిరిగేటప్పుడు ఒక్క ఆకు కూడా తమకి తెలియకుండా తెంపేవారు కాదనీ చెప్పుకొచ్చారు. అంతేకాదు! ప్రభుత్వం కనుక అనుమతిస్తే తామంతా కలిసి అడవులని భద్రంగా చూసుకుంటామనీ హామీ ఇచ్చారు. ఇప్పటి సమాజంలో ఉన్న పరిస్థితుల గురించి కూడా ఈ మాజీ బందిట్లు బాధని వ్యక్త చేశారు. జనంలో అవినీతి మరీ పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ఆరెస్సెస్‌ కార్యకర్త నిర్వహించిన ఈ కార్యక్రమానికి అతిథిగా జైపూర్‌ పార్లమెంటు సభ్యులు రామచరణ్‌ బోహ్రా కూడా హాజరయ్యారు. మాజీ బందిపోట్ల భావోద్వేగాలను తాను గౌరవిస్తాననీ, వారు కోరుకున్నట్లుగానే అటవీ సంరక్షణలో వారి సాయాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తాననీ చెప్పుకొచ్చారు. దొంగోడి చేతికి తాళం అంటే ఇదేనేమో!

దేవాన్ష్ పుట్టినరోజు..చంద్రబాబు 20 లక్షల విరాళం

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి మనవడు టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మిణిల కొడుకు దేవాన్ష్ పుట్టినరోజు సందర్బంగా చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.20 లక్షల విరాళం ఇచ్చారు. అంతేకాదు నారా లోకేశ్ దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా తన ట్విట్టర్లో.. దేవాన్ష్‌కు ఏడాది పూర్తయిందని, నిన్ను చూస్తుంటే టైం అలా గడిచిపోతోందని, హ్యాపీ బర్త్ డే అంటూ ట్వీట్ చేశాడు.   కాగా రాజకీయాలతో బిజీగా ఉంటున్న చంద్రబాబు గత ఏడాది చివర్లో మాట్లాడుతూ... నవ్యాంధ్ర ఏపీగా రోజుకు పద్దెనిమిది గంటలు పని చేస్తున్నానని, కనీసం మనవడితో ఆడుకోలేకపోతున్నానని చెప్పారు. మనవడితో ఆడుకోవాలని మనసు తహతహలాడుతోందన్నారు. అయినా వీలు చిక్కడం లేదన్నారు. ప్రజా జీవితంలో కొన్ని త్యాగాలు తప్పవని చెప్పారు.

కుక్కపిల్ల హత్య... ఆచూకీ చెబితే లక్షరూపాయలు

మార్చి 14, దిల్లీలోని గ్రీన్‌పార్క్‌ మెట్రో స్టేషన్‌- అక్కడ ఒక కుక్కపిల్ల నిర్జీవంగా పడి ఉంది. మరికొన్ని కుక్కపిల్లల మీద బలమైన కత్తిపోట్లు ఉన్నాయి. వీటి మీద ఎవరో పదునైన ఆయుధంతో దాడి చేసినట్లు, గాయాలు చూస్తేనే తెలిసిపోతోంది. రైల్వే స్టేషనులోని సీసీటీవీ ఫుటేజిని గమనించాక, ఇది నిజమేనని తేలిపోయింది. 30ల వయసులో ఉన్న ఓ ఆగంతకుడు, కత్తితో కుక్కపిల్లల మీద దాడి చేయడం అందులో స్పష్టంగా కనిపించింది. దాంతో వెంటనే అతని చిత్రాన్ని గీయించి పంచిపెట్టారు. అతని గురించి ఎలాంటి సమాచారాన్ని అందించినా లక్ష రూపాయల బహుమతిని అందించనున్నట్లు ‘ఫౌనా పోలీస్‌’ అనే స్వచ్ఛంద సంస్థ కూడా ముందుకు వచ్చింది. ఇక స్థానిక పోలీసులు కూడా కేసుని నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గ్రీన్‌ పార్క మెట్లో స్టేషన్‌ వద్ద కొద్దిరోజుల క్రితం కూడా ఇలాంటి సంఘటన జరిగిందని చెబుతున్నారు. అంటే కుక్కల మీద దాడి చేసే సీరియల్‌ కిల్లర్లు కూడా బయల్దేరారన్నమాట!

పార్టీ సీనియర్ నేతలకే షాకిచ్చిన జగన్..

ఈ మధ్య తమ పార్టీలో ఉన్న నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లి షాకిస్తున్న నేపథ్యంలో జగన్ తీసుకున్న ఒక నిర్ణయం ఇ్పపుడు పార్టీలోని సీనియర్ నేతలకు షాకిచ్చింది. అదేంటంటే ఏపీ పీఏసీ చైర్మన్ గా ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ను ఎన్నుకోవడం. భూమా నాగిరెడ్డి గత కొద్దిరోజుల క్రిందటే టీడీపీలో చేరడంతో ఆపదవి ఖాళీగా ఉంది. దీంతో ఆపదవికి వైసీపీ యువ నేత, కర్నూలు జిల్లా డోన్ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ ను జగన్ ఎంపిక చేశారు. ఈరోజు జగన్ నివాసం లోటస్ పాండ్లో వైసీఎల్పీ భేడీ జరిగిన నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. జగన్ తీసుకున్న ఈ నిర్ణయంతో పార్టీలోని సీనియర్ నేతలు జ్యోతుల నెహ్రూ, పెద్దిరెడ్డి రాంచంద్రారెడ్డి, అమరనాథరెడ్డిలు ఒక్కసారిగా షాక్ తిన్నారు.   కాగా బుగ్గన రాజేంద్రనాథ్ డోన్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి గెలుపొంది మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. అలాంటి రాజేంద్రనాథ్ కు ఈ పదవి కట్టబెట్టడంతో పార్టీలో పలువురు విస్మయానికి గురయ్యారు. మరోవైపు ఈపదవి కోసం జ్యోతుల నెహ్రూతో పాటు చిత్తూరు జిల్లా పుంగనూరు ఎమ్మెల్యేగా ఉన్న పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి పెద్దరెడ్డి రాంచంద్రారెడ్డి, అదే జిల్లా పలమనేరు ఎమ్మెల్యే ఎన్.అమరనాథరెడ్డిలు తమవంతు యత్నాలు చేశారు. అయితే వారందిరికీ షాకిస్తూ జగన్... ఫస్ట్ టైం సభలో అడుగుపెట్టిన బుగ్గన రాజేంద్రనాథ్ ను పీఏసీ చైర్మన్ పదవికి ఎంపిక చేశారు. మొత్తానికి పార్టీ ఉన్న సీనియర్ నేతలందరూ తనకు హ్యాండ్ ఇస్తున్నారని చెప్పి జగన్ ఈ రకంగా ప్లాన్ చేసినట్టున్నారు.

హృతిక్, కంగనాల లవ్ అప్పుడే స్టార్ట్ అయిందట..

  ప్రస్తుతం బాలీవుడ్ హాట్ టాపిక్ ఏదంటే హృతిక్ రోషన్, కంగనా రనౌత్ వ్యవహారమే అని చెప్పొచ్చు. వీరిద్దరి గురించి రోజుకో ఆసక్తికర విషయం బయటకు వస్తుంది. హృతిక్, కంగనా బ్రేకప్ తరువాత వీరిద్దరి మధ్య గొడవ కాస్త గట్టిగానే జరుగుతుంది. ఈ మధ్యనే కంగానా తన పేరు ఎక్కడపడితే అక్కడ ప్రస్థావిస్తుందని.. తనకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలంటూ హృతిక్ ఆమెకు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. దీనికి కంగనా కూడా లీగల్ నోటీసులతో హృతిక్‌కు దీటుగా బదులిచ్చింది.  అయితే ఇప్పుడు హృతిక్ క్లోజ్ ఫ్రెండ్ వీరిద్దరి ప్రేమాయణం గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటపెట్టినట్టు తెలుస్తోంది.   2009లో 'కైట్' సినిమా సెట్స్‌పై ఉండ‌గా వీరిరువురి మ‌ధ్య ల‌వ్ స్టార్ట్ అయింద‌ట. దీంతో అప్పటి వరకూ ఓ మెక్సిక‌న్ న‌టితో డేటింగ్‌లో ఉన్న హృతిక్ ఆమెను వదిలేసి మరీ కంగనాకు కనెక్ట్ అయ్యాడంట. అంతేకాదు హృతిక్ తన భార్యకు విడాకులు ఇవ్వడానికి కంగనాతో ల‌వ్ ఎఫైరే కార‌ణ‌మ‌ని అతను తెలిపారు. ఇంతలో 'బ్యాంగ్ బ్యాంగ్' సినిమా షూటింగ్‌లో కత్రినా కైఫ్ తో హృతిక్ స్నేహం చేస్తున్న కారణంలో కంగనా రనౌత్ తో బ్రేక‌ప్ అవడానికి దారి తీసింద‌ని అతని మిత్రుడు తెలిపాడు. మరి రోజుకో ట్విస్ట్ ఇస్తున్న వీరిద్దరి వివాదం.. మరెన్ని ట్విస్టులు ఇస్తుందో చూడాలి.

రోజాకి దిమ్మతిరిగే షాక్.. అలవెన్సులను నిలిపివేయాలని నిర్ణయం

  ఇప్పటికే వైసీపీ ఎమ్మెల్యే రోజాను అసెంబ్లీకి అనుమతించవద్దని ప్రివిలేజ్ కమిటీ నివేదికలో పేర్కొన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు రోజాకు మరోషాక్ తగిలింది. ఇకపై రోజాకు ఎమ్మెల్యే హోదాలో అందుతున్న అలవెన్సులను కూడా నిలిపివేయాలని ప్రివిలేజ్ కమిటీ నివేదికను అందజేసింది. హైకోర్టు రోజా సస్సెన్షన్ ను కొట్టివేసిన నేపథ్యంలో దానిని తప్పు పడుతూ రోజా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను టీడీపీ ఎమ్మెల్యే అనిత రోజాపై ప్రివిలేజ్ కమిటీలో ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ జరిపిన కమిటీ.. అనితపై రోజా చేసిన వ్యాఖ్యలు సభా నియమాలకు విఘాతమేనని తేల్చి చెప్పిన కమిటీ, రోజాపై సస్పెన్షన్ కరెక్టేనంటూ చెప్పింది. అక్కడితో ఆగకుండా..  రోజాకు అందుతున్న అలవెన్సులను నిలిపివేసి కఠినంగా వ్యవహరించాల్సిందేనని కమిటీ సిఫారసు చేసింది.

ఆర్థికాభివృద్ధి కోసమే వడ్డీరేట్లు తగ్గించాం- అరుణ్‌ జైట్లీ

ప్రభుత్వం పీపీఎఫ్‌, కిసాన్ వికాస పత్ర వంటి పొదుపు పథకాలన్నింటి మీదా గత వారం వడ్డీ రేట్లను తగ్గించిన విషయం తెలిసిందే! మనుపు పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) మీద 8.7 శాతం వడ్డీ లభిస్తుండగా దాన్ని ఏకంగా 8.1 శాతానికి తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక 8.7% ఉన్న కిసాన్‌ వికాస పత్రాల మీద వడ్డీ ఇప్పడు 7.8%గా మిగిలింది. పోస్టాఫీసుకి సంబంధించిన పొదుపు పథకాలన్నింటి మీదా వడ్డీలు ఇలాగే తగ్గుముఖం పట్టాయి. ఈ నిర్ణయం వల్ల మధ్యతరగతి మనుషుల ఆశల మీద ప్రభుత్వం నీరు చల్లిందంటూ విపక్షాలు మండిపడ్డాయి. ‘కష్టపడి జీవించే మధ్యతరగతి జీవుల మీద ప్రభుత్వం దారుణానికి ఒడిగట్టిందంటూ’ రాహుల్‌ గాంధి తీవ్రంగా విరుచుకుపడ్డారు. కానీ ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వెనకేసుకు వచ్చారు. మార్కెట్‌కు అనుగుణంగానే వడ్డీరేట్లలో మార్పులు చేస్తూంటామని ఆయన చెప్పుకొచ్చారు. మార్కెట్లో రుణాల వడ్డీ తక్కువగా ఉంటే, పొదుపు రేట్లు అంతకంటే ఎక్కువగా ఎలా ఉంటాయని ప్రశ్నించారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉన్నాగానీ ఒక స్థిరమైన ఫార్ములా ప్రకారమే ఈ వడ్డీ రేట్లను నిర్ణయిస్తూ ఉంటామని వివరించారు.

రిజర్వేషన్ల కోసం.. నిన్న జాట్లు.. నేడు రాజ్ పుట్లు

  రిజర్వేషన్ల కోసం రోజుకో ప్రాంతంలో రోజుకో ఉద్యమం మొదలవుతుంది. మొన్నటి వరకూ తమకు రిజర్వేషన్లు కావాలని జాట్లు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లో రాజ్ పుట్లు కూడా ఉద్యమానికి తెరతీయనున్నాయి. తమకు కూడా ఓబీసీ రిజర్వేషన్లు కల్పించాలని గళమెత్తుతున్నారు. దేశంలోనే పెద్ద రాష్ట్రం ఉత్తరప్రదేశ్ లోని పశ్చిమ ప్రాంతానికి చెందిన బిజ్నూర్, ముజఫర్ నగర్ ల కేంద్రంగా ‘రవా రాజ్ పుట్ సేవా సమితి’ ఓబీసీ రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కేందుకు కార్యాచరణను సిద్ధం చేసుకుంటోంది. రాష్ట్ర జనాభాలో 7 శాతం ఉన్న రాజ్ పుట్లు ఆర్థికంగానే కాక సామాజికంగానూ అభివృద్దికి ఆమడదూరంలో ఉన్నారని సమితి ప్రతినిధి దేవేంద్ర కుమార్ చెప్పారు. సీఎం అఖిలేశ్ యాదవ్ తో తమ ప్రతినిధి బృందం త్వరలో సమావేశం కానుందని, ఆ తర్వాత ఉద్యమ కార్యాచరణను ప్రకటిస్తామని కుమార్ చెప్పారు. మరి వీరి ఉద్యమం ఎన్ని పరిణామాలకు దారితీస్తుందో..

మోదీ అసలు రంగు బయటపడింది... రాహుల్

ఉత్తరాఖండ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు చెందిన తొమ్మది మంది ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష బీజేపీలో చేరిపోవడంతో రాహుల్‌ గాంధి కారాలుమిరియాలు నూరుతున్నారు. సదరు తొమ్మది మంది ఎమ్మెల్యేలూ పార్టీ మారడం వల్ల, ఇప్పుడు అక్కడ బీజేపీనే అతిపెద్ద పార్టీగా అవతరించనుంది. త్వరలోనే ఆ పార్టీ అక్కడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం కూడా లేకపోలేదు. మొదట అరుణాచల్‌ ప్రదేశ్‌లోని అధికారం ఇలాగే కాంగ్రెస్‌ చేజారిపోగా, ఇప్పుడు ఉత్తరాఖండ్‌లోనూ అదే చరిత్ర పునరావృతం కావడంతో రాహుల్ గాంధి తీవ్ర విమర్శలకు దిగుతున్నారు. తన ఆగ్రహాన్ని వెళ్లగక్కేందుకు ఆయన ట్విట్టర్‌ బాట పట్టారు. ‘డబ్బు, అధికారంతో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని బీజేపీ అన్యాయంగా పడగొడుతోందని’ ఆయన విరుచుకుపడ్డారు. ‘అరుణాచల్‌ ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పరిణామాలు, మోదీజీ అసలు రంగుని బయటపెడుతున్నాయ’ని విమర్శించారు. కానీ బీజేపీ వాదన మాత్రం వేరేగా ఉంది. రాష్ట్రాలలో ఉండే కాంగ్రెస్ నేతల వెతలను సోనియా, రాహుల్‌గాంధిలు పట్టించుకోరనీ... అందుకే విసిగివేసారిన రాష్ట్రనేతలు తమ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఈ గట్టు దాటే గుట్టు మాత్రం పెరుమాళ్లకెరుక!

గోదావరి నీళ్లతో కాళ్లు కడుగుతామన్న రైతులు.. వద్దన్న కేసీఆర్..

  తెలంగాణ సీఎం కేసీఆర్ తాను ఏదైనా పని చేస్తానని చెబితే అది ఖచ్చితంగా చేసి తీరతారు. ప్రజల సమస్యలను తెలుసుకొని వాటికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటూ అందరి మన్నలను పొందుతున్నారు. ఈ నేపథ్యంలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. తెలంగాణలో నీటి సమస్యలకు గాను.. సాగు నీటి పథకాలకుగాను..  సీఎం కేసీఆర్ ఇటీవలే ముంబై వెళ్లి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో కీలక ఒప్పందంపై సంతకాలు చేశారు. త్వరలోనే పలు కొత్త ప్రాజెక్టుల నిర్మాణం ప్రారంభం కానున్నాయి. దీనిలో భాగంగా.. కరీంనగర్ జిల్లాకు చెందిన కొంతమంది రైతులు గోదావరి జలాలను కలశాల్లో తీసుకుని ర్యాలీగా హైదరాబాదుకు వచ్చి.. అక్కడి నుండి నేరుగా సీఎం కార్యాలయానికి చేరుకున్నారు. అప్పటికే వారి రాకను తెలుసుకున్న కేసీఆర్ వారిని సాదరంగా ఆహ్వానించారు. ఈ క్రమంలోనే ఇంతటి గొప్ప పనిచేసిన మీ కాళ్లను గోదావరి జలాలతో కడుగుతామంటూ రైతులు కేసీఆర్ వద్దకు వచ్చారు. అయితే, కేసీఆర్ వారిని వారించి గోదావరి జలాలున్న కలశాలను అక్కడి బల్లపై పెట్టించారు.

టీడీపీ నేతలు మృతి.. చంద్రబాబు, లోకేశ్ దిగ్భ్రాంతి

చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు టీడీపీ నేతలు మృతి చెందారు. వివరాల ప్రకారం.. ఈ రోజు తెల్లవారుజామున చిత్తూరు నగర శివారు యాదమరి మండలం ముత్తిరేవుల క్రాస్ వద్ద చెన్నై-బెంగళూరు హైవేపై లారీ-బోలేరు ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో కుప్పంలోని శాంతిపురం మండల టీడీపీ అధ్యక్షుడు వెంకటమునిరెడ్డి, పార్టీ నేతలు బాలకృష్ణ, సురేశ్ లు మృతి చెందగా.. సర్పంచ్ గోపాల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మరోవైపు ఈప్రమాదం గురించి తెలుసుకున్న చంద్రబాబు, లోకేశ్ లు షాక్ కు గురయ్యారు. వెంటనే పార్టీ చిత్తూరు జిల్లా నేతలకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్న వారిద్దరూ చనిపోయిన పార్టీ నేతల కుటుంబాలకు తమ ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.

ఇండియాతో ఓడిపోయినందుకు ఆఫ్రిదిపై వేటు

  టీం ఇండియా చేతిలో ఓడిపోయిన పాకిస్థాన్ మరీ చెత్తగా ఏమీ ఆడలేదు. కానీ ఆ ఓటమి హీట్ మాత్రం కెప్టెన్ కు గట్టిగా తగలబోతోంది. వరల్డ్ కప్ లో పాకిస్థాన్ ఆటతో సంబంధం లేకుండా, ఆఫ్రిదిని కెప్టెన్ గా, వకార్ ను కోచ్ గా తప్పించాలని డిసైడైపోయిందట పాకిస్థాన్ బోర్డు. దీనిక సంబంధించిన కథనాలు ఆ దేశ మీడియాలో వెలువడుతున్నాయి. వరల్డ్ కప్ గెలిచినా కూడా, ఈ నిర్ణయంలో మార్పు లేదట. కానీ నిజానికి, ఆఫ్రిదిని తప్పించడం వెనుక, పాక్ కంటే భారత ప్రేక్షకులే తమపై ఎక్కువ ప్రేమను చూపిస్తారని ఆఫ్రిది ఇచ్చిన స్టేట్ మెంటే కారణమని తెలుస్తోంది. ఆ స్టేట్ మెంట్ పై పాక్ ప్రజలే కాక, బోర్డు కూడా గుర్రుగానే ఉంది. ఆ స్టేట్ మెంట్స్ ఆఫ్రిది కెరీర్ నే ముగిసిపోయేలా చేసినట్టున్నాయి. ఈ వరల్డ్ కప్ తర్వాత ఆఫ్రిది మళ్లీ పాక్ కు ఆడటం అనుమానమే..