ప్రధానిని కల్సిన రేవంత్, భట్టి
posted on Dec 26, 2023 @ 4:07PM
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క.. మంగళవారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలిసారి ప్రధాని సమావేశమయ్యారు. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై వారు చర్చించినట్లుగా తెలుస్తోంది. కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన పెండింగ్ నిధులు సహా వివిధ అంశాలపై సీఎం, డిప్యూటీ సీఎం... ప్రధానికి ఓ నివేదిక ఇచ్చారని తెలుస్తోంది. తెలంగాణలో ఆర్థిక శాఖను ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి చూస్తున్నారు. ప్రధానితో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రుల భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈరోజు మధ్యాహ్నం మోదీని కలిసి రాష్ట్రానికి సంబంధించిన వినతులను అందజేశారు.దేశంలో ఏ రాష్ట్రానికి సంబంధించిన సీఎం అయినా బాధ్యతలు చేపట్టాక ప్రధానిని కలవడం సంప్రదాయం. ఇందులో భాగంగా ఈరోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కలు దేశ ప్రధాని నరేంద్రమోదీని కలిసారు. ఈ సందర్భంగా రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం గత పదేళ్ళల్లో అమలు కావాల్సిన హామీలు, ఐటీఐఆర్ ప్రాజెక్టుకు సంబంధించి ఇరువురు నేతలు ప్రధానితో చర్చించారు.దానికి సంబంధించిన వినతి పత్రాలను అందజేశారు. దీంతో పాటూ రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన నిధులు గురించి కూడా అడిగారు. ప్రధాని మోదీతో భేటీ తరువాత రేవంత్ రెడ్డి, భట్టిలు కాంగ్రెస్ అగ్రనేతలతో కూడా భేటీ అయ్యారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పదవులతో పాటూ లోక్ సభలో అనుసరించాల్సిన వ్యూహాలు లాంటి అంశాల మీద చర్చించారని సమాచారం.