అయోధ్యలో మాంసాహార ఫుడ్ డెలివరీపై నిషేధం

అయోధ్యలో ఆన్ లైన్ లో మాంసాహార ఫుడ్ డెలివరిపై అధికారులు నిషేధం విధించారు. అయోధ్య రామ మందిరానికి 15 కిలోమీటర్ల పరిధిలో  మాసాహార ఫుడ్ డెలివరీని పూర్తిగా నిషేధించామనీ, ఆ నిషేధం వెంటనే అమలులోకి వస్తుందనీ  అధికారులు తెలిపారు.

 పవిత్ర పుణ్యక్షేత్రం పంచకోశి పరిక్రమ పరిధిలోని ప్రాంతాల్లోకి ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలు మాంసాహారాన్ని సరఫరా చేస్తున్నాయన్న ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అయోధ్య లోని కొన్ని హోటళ్లు, హోమ్‌స్టేలు అతిథులకు మాంసాహారంతో పాటు మద్యం కూడా అందిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందనీ, ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని వాటి యాజమాన్యాలకు హెచ్చరికలు జారీ చేశామని అధికారులు తెలిపారు.

అయితే నిషేధం ఉన్నప్పటికీ ఆన్‌లైన్ బుకింగ్ ల  ద్వారా పర్యాటకులకు నాన్-వెజ్ ఫుడ్ అందుతోందన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆన్‌లైన్ నాన్-వెజ్ ఫుడ్ డెలివరీపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. హోటళ్లు, హోమ్‌స్టేలు కూడా ఈ నిబంధనలు పాటించాలని  నిరంతర పర్యవేక్షణ ఉంటుందని అధికారులు హెచ్చరించారు.
 

బీహార్‌లో ట్ర‌క్కు ఢీకొని బాలుడు మృతి…మానవత్వం మరిచిన జనం

  బీహార్ రాష్ట్రంలోని సీతామర్హి జిల్లాలో మానవత్వాన్ని మరిచిపోయేలా చేసిన దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఒకవైపు రోడ్డు ప్రమాదంలో 13 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోతే… మరోవైపు అదే ప్రమాదానికి కారణమైన ట్రక్కు నుంచి కింద పడిన చేపల కోసం స్థానికులు ఎగబడ్డారు. రక్తపుమడుగులో పడి ఉన్న బాలుడి మృతదేహాన్ని పట్టించుకోకుండా చేపలను సంచుల్లో నింపుకుని ఎత్తుకెళ్లడం చూసి అందరూ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటన పుప్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఝాజిహాట్ గ్రామ సమీపంలో జరిగింది. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్న రితేష్ కుమార్ ఉదయం సైకిల్‌పై కోచింగ్ క్లాస్‌కు వెళ్తుండగా వేగంగా వచ్చిన ఓ ట్రక్కు అతడిని ఢీకొట్టింది. ఢీకొన్న తీవ్రతకు బాలుడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రక్కు అదుపు తప్పి పక్కకు ఒరిగింది. అందులో ఉన్న చేపలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. అదే సమయంలో ఘటనాస్థలానికి చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులు మృతదేహం పక్కన గుండెలవిసేలా రోదిస్తుంటే… మరోవైపు కొందరు స్థానికులు మాత్రం ఆ దృశ్యాన్ని పట్టించుకోకుండా చేపలను తీసుకెళ్లడంలో మునిగిపోయారు. ఈ అమానవీయ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. “మానవత్వం ఎక్కడ పోయింది?” అంటూ నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాలుడి మృతికి కారణమైన ట్రక్కు డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   https://publish.twitter.com/?url=https://twitter.com/SomuAnand_/status/2012079958672458099#

యాంకర్ అనసూయ ఫిర్యాదు... 42 మందిపై కేసు

  ప్రముఖ యాంకర్, సినీ నటి ఎంతో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియా వేదికగా చేసుకొని తనను వేధింపులకు గురి చేస్తున్నారంటూ సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై సోషల్ మీడియాలో అసభ్యకరంగా ట్రోలింగ్ చేస్తున్నారంటూ అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మొత్తం 42 మందిపై కేసు నమోదు చేశారు. కొందరు వ్యక్తులు, కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఖాతాదారులపై క్రిమినల్ డిఫమేషన్, సెక్సువల్ హెరాస్‌మెంట్, ఏఐ ఫోర్జరీ వంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గతేడాది డిసెంబర్ 23 నుంచి తనపై ఆన్‌లైన్ వేధింపులు తీవ్రంగా పెరిగాయని అనసూయ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. సోషల్ మీడియా వేదికగా  తనను లక్ష్యంగా చేసుకుని అశ్లీల వ్యాఖ్యలు చేయడం, లైంగిక దూషణలకు పాల్ప డటం, బెదిరింపులు పంపడం వంటి చర్యలు జరుగుతు న్నాయని ఆమె ఆరోపిం చారు. కొందరు కావాలనే క్యాంపెయిన్ తరహాలో తనపై దాడి చేస్తున్నారని అనసూయ తన ఫిర్యాదులో వెల్లడించారు.ఓ ఇంటర్వ్యూ లో తన అభిప్రాయం వ్యక్తం చేసిన తర్వాతే తనపై ఈవిధంగా ట్రోలింగ్ మొద లైందని అనసూయ తెలి పారు.  తాను చేసిన వ్యాఖ్య లను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని, వ్యక్తిగత ప్రతిష్ఠను దెబ్బతీసేలా పోస్టులు, వీడియోలు షేర్ చేస్తున్నారని అనసూయ తన  ఫిర్యాదులో పేర్కొ న్నారు. కొందరు ఏఐ సాంకే తికతను ఉపయోగించి మార్ఫింగ్, ఫోర్జరీ కంటెంట్ సృష్టించారని కూడా ఆమె ఆరోపించారు.బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజిని వీరితోపాటు మరికొందరిపై అనసూయ ఫిర్యాదు చేసింది.  అంతేకా కుండా నిందితుల పేర్లతో పాటు సంబంధిత సోషల్ మీడియా ఖాతాల లింకులను కూడా అనసూయ తన ఫిర్యాదుతో జత చేసి పోలీసులకు సమర్పించారు. దీంతో సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అనసూయ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు బొజ్జ సంధ్యారెడ్డి, ప్రియాచౌదరి గోగినేని, పావని, శేఖర్ బాషా, రజిని తో సహా మొత్తం 42 మందిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సోషల్ మీడియాలో మహిళలపై జరుగుతున్న ఆన్‌లైన్ వేధింపులపై కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. బాధితుల ఫిర్యాదుల మేరకు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, అవస రమైతే నిందితులను అదుపులోకి తీసుకుం టామని తెలిపారు. ప్రస్తుతం నిందితుల సోషల్ మీడియా ఖాతాల వివరాలు, పోస్టులు, వీడియోలను సేకరించి సాంకేతిక ఆధారాలతో విచారణ కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

రాష్ట్ర అభివృద్ధి కోసమే ప్రధాని మోదీని కలుస్తున్నా : సీఎం రేవంత్

  ఆదిలాబాద్‌ జిల్లా భోరాజ్‌ మండలం హతిఘాట్‌లో చనాకా-కొరాటా పంప్‌హౌస్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. అనంతరం ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. నిర్మల్ “ప్రజా పాలన- ప్రగతి బాట” బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా అంటే నాకు ప్రత్యేక అభిమాని పేర్కొన్నారు.  జల్ జంగల్ జమీన్ అని నినదించిన పోరాటాల గడ్డ ఇది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జరగాల్సినంత అభివృద్ధి జరగలేదని సీఎం రేవంత్ అన్నారు. అందుకే పాలమూరు జిల్లాతో సమానంగా ఆదిలాబాద్ జిల్లాకు నిధులు ఇస్తానని చెప్పాని సీఎం వెల్లడించారు.  జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తయితే జిల్లా అభివృద్ధి పథంలో సాగేదని అందుకే ప్రజా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ప్రాజెక్టుల పూర్తి కోసం కృషి చేస్తున్నామన్నారు. బాసర ట్రిపుల్ ఐటీలో కొత్త యూనివర్సిటీని ఏర్పాటు చేస్తామని తెలిపారు. చనాక- కొరటాకు సీ. రామచంద్రా రెడ్డి పేరు, సదర్మట్ బ్యారేజీకి నర్సారెడ్డి పేరు పెట్టాలని నిర్ణయించామని రేవంత్ తెలిపారు. ప్రజలకు సేవలందించిన ఆ ఇద్దరి పేర్లు రెండు ప్రాజెక్టులకు పెట్టాలని అధికారులకు సూచన చేస్తున్నాని తెలిపారు.  తుమ్మడి హెట్టి వద్ద ప్రాణహిత - చేవెళ్ల ప్రాజెక్టుపై సమగ్ర నివేదిక సిద్ధం చేస్తున్నామని, అక్కడే ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ముఖ్యమంత్రి తెలిపారు. ఆదిలాబాద్‌లో ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. అలాగే ఆదిలాబాద్‌కు విమానాశ్రయం తీసుకొచ్చే పూర్తి బాధ్యత తనదేనని ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుకు శిలాఫలకం వేయిస్తామని ధీమా వ్యక్తం చేశారు.  వరంగల్‌కు ఎయిర్‌పోర్ట్ మంజూరు చేసినట్లే ఆదిలాబాద్‌కూ ఇస్తామని కేంద్రం చెప్పిందని ముఖ్యమంత్రి గుర్తు చేశారు. అడిగితేనే అభివృద్ధి వస్తుందని, గత పాలకులు అడగకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని విమర్శించారు. వారి పాలన వల్ల అప్పులు మిగిలాయని, నాడు ఇచ్చిన బియ్యం ఎవరు తిన్నారో తెలియదని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యం ప్రజలు తింటున్నారని అన్నారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలకు మంచి చేసేవారిని, అభివృద్ధి చేసే వారినే గెలిపించుకోండని రేవంత్ స్పష్టం చేశారు

తిరుపతిలో ఏపీ ఫస్ట్ రీసెర్చ్ సెంటర్.. చంద్రబాబు

యువతరం భవిష్యత్  బంగారంగా ఉండాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతున్నది.  ఆ దిశగా అన్ని విధాలుగా యువత భవిష్యత్ ను తీర్చిదిద్దేలా అవసరమైన చర్యలు తీసుకునేలా విధానాల రూపకల్పన జరగాలని చంద్రబాబు ఆధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  భవిష్యత్తులో ఏయే రంగాల్లో యువతకు మంది ఉద్యోగ, ఉపాధి అవకాశాలుంటాయో గుర్తించడంతో పాటు,  .ఆయా రంగాల్లో యువతలో నైపుణ్యాన్ని పెంచడంపై ఇప్పటి నుంచే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. తన క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం (జనవరి 16) ఏరో స్పేస్, డిఫెన్స్, ఐటీ, డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారులతో సీఎం సమావేశమయ్యారు. ఈ భేటీలో డ్రోన్ కార్పొరేషన్ ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.  రాష్ట్రంలో తిరుపతి కేంద్రంగా అతిపెద్ద పరిశోధనా కేంద్రం ఏర్పాటు ప్రతిపాదనలకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ (AP FIRST) పేరుతో తిరుపతిలో రీసెర్చ్ కేంద్రం ఏర్పాటుకు సీఎం ఆమోదముద్ర వేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందన్నారు. వివిధ రంగాల్లో కంపెనీలు కూడా పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయనీ,  ఎయిరో స్పేస్, డిఫెన్స్, స్పేస్ టెక్నాలజీ, ఏఐ, సైబర్ సెక్యూర్టీ, సెమీ కండక్టర్ల డివైసెస్, సెన్సార్లు, క్వాంటం టెక్నాలజీ, హెల్త్ కేర్, బయో టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, రూరల్ ఏరియా టెక్నాలజీ వంటి రంగాలు భవిష్యత్తులో కీలకం కానున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇందుకు అనుగుణంగా పాలసీలు రూపొందిస్తోంది. ఆయా రంగాల్లో పెట్టుబడులు పెట్టే కంపెనీలను ప్రొత్సహిస్తోంది. దేశంలో తొలిసారిగా గ్రీన్ ఎనర్జీ రంగంలో గ్రీన్ అమోనియా ప్లాంట్ కాకినాడలో ఏర్పాటు చేయబోతున్నామని చంద్రబాబు వివరించారు. ఈ తరహాలో కొత్త ఆవిష్కరణలకు...వివిధ స్టార్టప్ కంపెనీలకు రాష్ట్రం వేదికగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలా వచ్చే కంపెనీలకు... పరిశ్రమలకు నైపుణ్యమున్న యవతను అందించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందనీ, ఆ దిశగా చర్యలు, విధానాల రూపకల్పనలు జరగాలని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.  ఇందుకురాష్ట్ర ప్రభుత్వం తరఫున తిరుపతిలో  ఓ అతి పెద్ద అధ్యయన కేంద్రాన్ని తిరుపతిలో ఏపీఫస్ట్ పేరిట ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.  తిరుపతిలోని ఐఐటీ-ఐఐఎస్‌ఈఆర్ రెండు ప్రముఖ జాతీయ విద్యా సంస్థల కాంబినేషన్లో ఏపీఫస్ట్ ఏర్పాటు కాబోతోందన్న ఆయన దీనిని  అత్యంత ప్రతిష్టాత్మకంగా తీర్చిది ద్దాలన్నారు.  ఏపీ ఫస్ట్ వ్యవస్థను సమర్థవంతంగా నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వంతోనూ సంప్రదిం పులు జరపాలని చంద్రబాబు సూచించారు.     నిరంతరం ఏపీని అభివృద్ధి చేయడంతోపాటు...యువతకు చక్కటి ఉపాధి కల్పించడంపైనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించిందనీ,  సంక్షేమానికి-అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఏ స్థాయిలో కృషి చేస్తోందో,  యువతకు మెరుగైన అవకాశాలు అందించే విషయంలోనూ అదే స్థాయిలో ప్రణాళికలు సిద్దం చేస్తోందన్నారు. దీంట్లో భాగంగానే ఏపీ ఫస్ట్   ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. యూనివర్శిటీలు, వివిధ రంగాల్లో ప్రముఖ స్థానంలో ఉన్న కంపెనీలతో ఏపీ ఫస్ట్ సమన్వయం చేసుకుని,  ఇప్పటికే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ యూనివర్శిటీల్లో విద్యార్థులు చేస్తున్న కొత్త కొత్త ఆవిష్కరణలను అంది పుచ్చుకోవాలన్నారు.  అలాగే యువతలో వివిధ రంగాల్లో నైపుణ్యం పెంచేందుకు పరిశ్రమలు, కంపెనీలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఉండాలన్నారు. అదే విధంగా   అందుబాటులోకి వస్తోన్న టెక్నాలజీలు ఏంటీ...? ఏయే రంగాల్లో అభివృద్ధి జరుగుతోందనే విషయాలను గుర్తించి.. వాటిని కరిక్యులమ్‌లో చేర్చేలా విద్యా సంస్థలతో సంప్రదింపులు జరపాలన్నారు. ఈ మేరకు ఆయా విద్యా సంస్థలకు కరిక్యులమ్ ప్రిపేర్ చేసేలా ఏపీ ఫస్ట్ పని చేయాలని చంద్రబాబు తెలిపారు. ఐటీని ప్రమోట్ చేయడం వల్ల ఇప్పుడు తెలుగువాళ్లు ఐటీలో మేటిగా ఉన్నారు. అలాగే ఫార్మా రంగంలో భవిష్యత్ ఉంటుందని గుర్తించడం వల్లే తెలుగు రాష్ట్రాలు ఫార్మాలో అగ్రభాగాన ఉన్నాయి. ఇదే తరహాలో భవిష్యత్ రంగాలను నేటి యువత అందిపుచ్చుకోవాలనీ, అందుకు తగిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందనీ చెప్పారు.  వచ్చే మూడేళ్లల్లో కీలక పురోగతి కనబరిచేలా ఏపీ ఫస్ట్ పని చేయాలి.” అని ముఖ్యమంత్రి సూచించారు.  అలాగే.. డ్రోన్ కార్పొరేషన్‌ను మరింత బలోపేతం చేయాలనీ, ప్రకృతి వైపరీత్యాల సందర్భాల్లో డ్రోన్లను వినియోగించి బాధితులకు సేవలు అందించాం. ఇప్పుడు అంతకు మించిన స్థాయిలో డ్రోన్లను వినియోగించుకుని ప్రజలకు సేవలు అందించాలన్నారు. వ్యవసాయం, మెడికల్ ఎమర్జెన్సీ వంటి వాటిల్లో డ్రోన్ల వినియోగం పెరగాల్సిన అవసరం ఉందనిచెప్పారు. ఇటువంటి ఫ్యూచర్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడానికి ఇప్పటి నుంచే సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు.  ఈ  సమావేశంలో ఏరో స్పేస్ డిఫెన్స్ సలహదారు సతీష్ రెడ్డి, ఐటీ-డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ సలహదారు అమిత్ దుగర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ కెఎన్ సత్యనారాయణ, ప్రొఫెసర్ సెంథిల్ కుమార్, డీఎంటీఐ డైరెక్టర్ కల్నల్ పీఎస్ రెడ్డి సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

మేడిపల్లిలో పండగ దొంగల బీభత్సం...12 ఇళ్లలో చోరీ

  వీళ్ళు అలాంటి ఇలాంటి వాళ్ళు కాదురా బాబోయ్ దర్జాగా కార్లో వస్తారు... మెల్లిగా ఎటువంటి అలజడి లేకుండా పని మొత్తం ముగించుకొని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇప్పుడు వీళ్ళ కోసం పోలీసులు వేట కొనసాగించారు. సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు చాలామంది తమ స్వగ్రామా లకు వెళుతూ ఉంటారు. అయితే ఇటువంటి సమయంలోనే పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకో వాలంటూ పలు సూచనలు చేశారు. కానీ చాలామంది అవేమీ పట్టించుకోకుండా హడావుడిగా సంతోషంతో స్వగ్రామాలకు వెళుతూ ఉంటారు. కానీ ఇదే అవకాశం గా భావించే దొంగలు రెచ్చిపోతూ దొంగతనాలకు పాల్పడుతూ ఉంటారు.  మేడిపల్లి పరిధిలోని చెంగిచెర్ల కాలనీలో దొంగలు చేసిన బీభత్సం అంతా ఇంతా కాదండోయ్...  అర్ధరాత్రి సమయంలో ఒక్కరు కాలనీలోకి వచ్చి ఆగింది. కార్లో నుండి చాలామంది యువకులు బయటకు వచ్చారు. చేతిలో కత్తులు పట్టుకుని కాలనీలో సంచరిస్తూ వరుసగా 12 ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ దొంగలు ముందుగానే రెక్కీ నిర్వహించి... అనంతరం అర్ధరాత్రి సమయంలో కారులో దర్జాగా వచ్చి చోరీలు చేసి, అనంతరం వేగంగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతారు.  సంక్రాంతి పండగ కారణంగా చాలా కుటుంబాలు వారి తల్లిదండ్రుల ఇళ్లకు వెళ్లిపోయారు. అలాంటి ఇళ్లను టార్గెట్ గా చేసుకున్న దొంగలు తాళాలు పగులగొట్టి ఇళ్లలోకి చొరబడ్డారు. బంగారు ఆభరణాలు, నగదు, విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. కొందరు ఇళ్లలో అల్మారాలు, డ్రాయర్లు చెల్లాచెదురుగా పడివుం డటం చూసి ఉదయం చోరీ జరిగిన విషయం బయట పడింది. దొంగతనం జరిగిన విషయం తెలిసిన వెంటనే బాధితులు మేడిపల్లి పోలీ సులకు ఫిర్యాదు చేశారు. అయితే కారులో వచ్చి దొంగతనానికి పాల్పడిన దృశ్యాలు అక్కడ ఉన్న సీసీ కెమెరాల్లో  రికార్డ్ అయ్యాయి సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీమ్‌ను రప్పించారు.  ఫింగర్ ప్రింట్లు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు ప్రారంభించారు. కాలనీలో ఉన్న సీసీటీవీ కెమెరాల దృశ్యాలను పరిశీలిస్తూ దొంగల కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ లో మొహానికి మాస్క్ , మరియు చేతిలో కత్తులు పట్టుకుని తిరుగుతున్న దొంగలను చూసిన స్థానికులు  భయాం దోళనకు గురవుతున్నారు. పండగ రోజుల్లో గస్తీ పెంచాలని, రాత్రి వేళ పోలీస్ పెట్రోలింగ్‌ను బలోపేతం చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీ సులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దొంగలను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

సంక్రాంతి కోళ్ల పందేలు...ఎన్ని వేల‌ కోట్లంటే!?

  ఈ సంక్రాంతి సీజ‌న్లో కేవ‌లం  రెండు రోజుల‌కే ఎన్ని వేల కోట్ల మేర కోళ్ల పందేలు జ‌రిగాయో చూస్తే ఏకంగా 2 వేల కోట్ల రూపాయ‌ల మేర కోళ్ల పందేల్లో చేతులు మారాయ‌ని తెలుస్తోంది. కొన్ని కొన్ని అంచ‌నాల ప్ర‌కారం ఈ  మొత్తం ఇంకా ఎక్కువ‌గానే ఉంటుంది త‌ప్ప త‌గ్గే  ప్ర‌స‌క్తే లేదంటున్నారు. గ‌త సంక్రాంతి సంబ‌రాల్లో ఒక్క క‌నుమ‌రోజే వెయ్యి కోట్ల మేర చేతులు మారాయి. మూడో రోజు మ‌రింత పెద్ద మొత్తంలో పందెంరాయుళ్లు కోళ్ల పందేలు ఆడుతార‌ని చెబుతారు. కార‌ణం ఇదే ఆఖ‌రు రోజు కావ‌డంతో.. మ‌రింతగా చెల‌రేగిపోయి పందెంరాయుళ్లు పందేలు కాస్తార‌ని అంటారు. బేసిగ్గా కోళ్ల పందేలపై దేశ వ్యాప్తంగా నిషేధ‌ముంది. కానీ ఆ నిషేధం ఎక్క‌డా అమ‌ల‌వుతున్న‌ట్టే క‌నిపించ‌డం లేదు. త‌మిళ‌నాడులో జ‌ల్లిక‌ట్టు ఎలాగో ఇక్క‌డ కూడా కోళ్ల పందేలు అలాగ‌. అయితే త‌మిళ‌నాడులో వీటి విష‌యంలో పందేల నిర్వ‌హ‌ణ ఉండ‌దు. కేవ‌లం వీరుల‌కు బ‌హుమానాలు ఇస్తారు. అంతే. అదే ఏపీలో అలాక్కాదు కోళ్ల పై పందేలు కాయ‌డం ఎప్ప‌టి  నుంచో వ‌స్తోన్న అల‌వాటు.  భీమ‌వ‌రం ఆ ప‌రిస‌ర  ప్రాంతాల్లోని గోదావ‌రి జిల్లాల‌కు ప‌రిమిత‌మైన కోళ్ల పందేలు ఇప్పుడు ఉభ‌య గుంటూరు, కృష్ణా జిల్లాల వ‌ర‌కూ పాకిపోయాయి. ఉమ్మ‌డి కృష్ణాజిల్లాలో అయితే సినిమా హాళ్ల‌ను త‌ల‌పించేలా సీటింగ్ గేల‌రీలు ఏర్పాటు చేయ‌డం చూసి ఆశ్చ‌ర్య పోయారు పోలీసులు. అప్ప‌టికీ వారి ఏర్పాట్ల‌ను ధ్వంసం చేసి ఆపై అక్క‌డ‌క్క‌డ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.. వాటిని కూడా లెక్క చేయ‌కుండా బ‌రుల నిర్వాహ‌కులు బ‌రి తెగించిన‌ట్టు క‌నిపిస్తోంది.  పోలీస్టేష‌న్ కి ప‌ది ల‌క్ష‌లు ఇచ్చేలా తాము మాట్లాడామ‌ని.. వాళ్ల కేసులు వాళ్ల‌వే మ‌న పందేలు మ‌న‌వే అంటూ నిర్వాహ‌కులు.. రెచ్చిపోయి వీరు మాట్లాడిన వీడియోలు వైర‌ల్ అయ్యాయి కూడా. దీన్నిబ‌ట్టీ చూస్తే.. గుంటూరు కృష్ణా జిల్లా వ్యాప్తంగా  కూడా కోళ్ల పందేలు ఏ స్థాయిలో జ‌రిగాయో ఊహించుకోవ‌చ్చు.ఒక వ్య‌క్తి కోటిన్న‌ర గెలిచిన‌ట్టు స‌మాచారం అంద‌గా.. తాడేప‌ల్లిగూడెంలో ద‌గ్గ‌ర్లో జ‌రిగిన ఒక పందెంలో 6 కోట్ల మేర పందెం కాచిన‌ట్టు వార్త‌లు వెలువ‌డ్డాయి. ఇలా చెప్పుకుంటూ  పోతే ఈ పందేల కోళ్ల క‌ట్ట‌ల‌ క‌థ‌లు కోకొల్ల‌లు.  

ఒక్క పెగ్గు మద్యం కోసం సొంత అన్ననే చంపేశాడు!

ఒక్క పెగ్గు.. ఒక్కటంటే ఒక్క పెగ్గు కోసం విచక్షణ మరిచి సొంత అన్ననే మేడమీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతమింది. మద్యపానానికి బానిసైన వారికి   తల్లీ, తండ్రీ, అన్నా, తమ్ముడూ, భార్యా, పిల్లలూ, స్నేహితులు.. ఇలా అన్ని సంబంధాలూ విచ్ఛిన్నమౌతాయి. కుటుంబం బంధాలలో చిచ్చు రేగుతుంది.  మద్యం వ్యసనానికి బానిసైన  వ్యక్తి విచక్షణ కోల్పోతాడు. చుక్క మద్యం కోసం ఉచ్ఛనీచాలనూ విస్మరిస్తారు. ఎంతకైనా తెగిస్తాడు. సరిగ్గా అలాంటి ఉదంతమే హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. ఒక్క పెగ్గు కోసం సొంత అన్ననే మేడ మీద నుంచి తోసేసి చంపేసిన తమ్ముడి ఉదంతం సంక్రాంతి పండుగ నాడు హైదరాబాద్ నాచారంలో చోటు చేసుకుంది.   నాచారంలో నివాసం ఉంటున్న ఇద్దరు అన్నదమ్ములు  సంక్రాంతి పండుగ సందర్భం గా గురువారం (జనవరి 15)ఆనందోత్సాహాలతో పతంగులు ఎగరవేసి సంబరం జరుపుకున్నారు. ఆ తరువాత రాత్రి ఒక ఇంటి భవనం మూడో అంతస్తులో  మద్యం సేవించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మద్యం తాగుతుండగా, ఒక్క పెగ్గు విషయంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. అది కాస్తా వారి మధ్య వాగ్వాదానికీ, ఘర్షణకూ దారి తీసింది.  అన్న తమ్ముడిని ఒక్క పెగ్గు మద్యం ఇవ్వాలంటూ అడగడంతో వివాదం మరింత ముదిరింది.  ఆగ్రహంతో ఊగిపోయిన తమ్ముడు అన్నను ఒక్కసారిగా  మేడపై నుంచి తోసివేశాడు.   మూడు అంతస్తుల భవనం పై తోసివేయడంతో కిందపడిన అన్న తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  నిందితుడైన తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. మద్యం మద్యం మత్తే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.  సంక్రాంతి పండుగ రోజున చోటుచేసుకున్న ఈ విషాద ఘటనతో ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్న వివాదం ప్రాణాంతకంగా మారడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

110 ఏళ్లకు పెళ్లి .. ఏడాదికే బిడ్డ...142 ఏళ్లలో మృతి

  ఆరోగ్య రహస్యంతో అక్షరాలా 142 ఏళ్లు జీవించిన సౌదీ అరేబియా కురువృద్ధుడు షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి ఇకలేరు. 110 పదేళ్లకు మూడో పెళ్లి చేసుకుని, ఆపై ఏడాదికే తండ్రిగా మారి ప్రపంచాన్ని విస్మయానికి గురిచేసిన ఆయన జీవితం ఒక అద్భుతంగా నిలిచింది. క్రమశిక్షణతో కూడిన ఆహారం, దైవచింతనతో 40 సార్లు హజ్ యాత్ర చేసిన ఈయన.. 134 మంది వారసులను వదిలి వెళ్లారు.  దాదాపు ఒకటిన్నర శతాబ్దం పాటు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడిపిన సౌదీ ఓల్డెస్ట్ మ్యాన్ షేక్ నాసర్ బిన్ రద్దన్ అల్ వదాయి తాజాగా ప్రాణాలు కోల్పోయారు. సౌదీఅరేబియా దేశం ఏర్పడక ముందే ఆయన జన్నించారు. 110 ఏళ్ల వయసులో ఎవరూ ఊహించని విధంగా మూడో పెళ్లి చేసుకుని.. ఆ తర్వాత ఏడాదికే ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. అంతేకాకుండా 40 సార్లు హజ్ యాత్ర చేసి ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్య పరిచాడు.   35 - 40 ఏళ్ల దాటితేనే పిల్లల్ని కనడానికి అనేక మంది స్త్రీ, పురుషులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటుంటే.. షేక్ నాసర్ మాత్రం వందేళ్లు పైబడినా పిల్లల్ని కనడం చూసి అంతా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా శారీరక దృఢత్వం, మానసిక చురుకుదనం, సంతాన సామర్థ్యం కలిగి ఉండటం చూసి వైద్య నిపుణులు, పరిశోధకులు సైతం విస్మయానికి గురయ్యారు. ఆయన దీర్ఘాయువు వెనుక ఉన్న రహస్యాలపై ఇప్పటికీ అనేక పరిశోధనలు జరుగుతున్నాయి.  

ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

  ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు బెయిల్ పిటిషన్‌ను సుప్రీంకోర్టు మార్చి 10కి వాయిదా వేసింది. ఇంటరిమ్ ప్రొటెక్షన్ కొనసాగుతుందని, ప్రస్తుతానికి ఆయనపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఇక అదనపు విచారణ అవసరం లేదని పేర్కొంది. ఇంకెంతకాలం విచారణ కొనసాగిస్తారని సిట్‌ను ప్రశ్నించింది. ప్రభాకర్‌రావు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.  ఈ సందర్భంగా ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్ ఇవ్వొద్దని ప్రభుత్వం తరఫున లాయర్ సిద్ధార్థ్ లూథ్రా వాదించారు. దీనిపై స్పందించిన జస్టిస్ నాగరత్న“ముందస్తు బెయిల్ ఇచ్చినంత మాత్రాన ఆయన్ని పిలవకుండా ఉండలేము కదా? మీ ఉద్దేశం పూర్తయిందా లేదా? ప్రభాకర్‌రావును మళ్లీ జైల్లో పెట్టాలనుకుంటున్నారా?” అని ప్రశ్నించారు.ఈ కేసు దర్యాప్తులో న్యాయపరమైన అంశాలు ముడిపడి ఉన్నాయని పేర్కొన్న ధర్మాసనం, ప్రభుత్వ వాదనలను పరిగణనలోకి తీసుకొని తదుపరి విచారణను మార్చి 10వ తేదీకి వాయిదా వేసింది.