భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకుల అరెస్టు

హైదరాబాద్ వినాయక నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి నాయకులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు తెలంగాణ తల్లి ఫ్లైఓవర్ వద్ద ఆందోళన చేపట్టారు. గణేష్ నిమజ్జనాలకు ఇప్పటివరకు పోలీసులు ట్యాంక్ బండ్ పై ఎటువంటి ఏర్పాట్లు చేయ లేదని, క్రెయిన్లు కూడా చేయలేదని ఉత్సవ కమిటీ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి ఏర్పాట్లు చేయకపోవడంతో ప్రజలు, భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా అయితే  గణేశుడి నిమజ్జనం చేయడం కష్టమేనంటున్నారు.   గత 45 ఏళ్ల నుండి ట్యాంకు బండ్ పై గణేష్  నిమజ్జనాలు చేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు లేనిది ఇప్పుడు కొత్త పద్ధతులు పాటించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు.  వెంటనే గణేష్ నిమజ్జనాలకు యుద్ధ ప్రాతి పదికన చర్యలు తీసుకోకుంటే..  మండపాల నుండి వినాయకులను కదిలించేది లేదని సమితి సభ్యులు హెచ్చరించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి తరపున భక్తులతో కలిసి ఆందోళనకు దిగుతామని ఉత్సవ సమితి నాయకులు హెచ్చరించారు. తెలుగు తల్లి ఫ్లైఓవర్ వద్దకు  పెద్ద ఎత్తున చేరుకొని ఆందోళనదిగిన భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించడంతో ఒకింత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దీంతో ట్యాంక్ బండ్ పై ఆందోళనకు దిగిన భాగ్యనగర్ ఉత్సవ సమితి నాయకులను పోలీసులు అదుపులోనికి తీసుకుని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు.  

లాస్ ఏంజెల్స్ లో సైన్యం మోహరింపును తప్పుపట్టిన అమెరికా కోర్టు

అమెరికాలో ట్రంప్ ప్రభుత్వానికి ఫెడరల్ కోర్టులో  చుక్కెదురైంది.  దేశంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం సైన్యాన్ని మోహరించడం చట్టవిరుద్ధమని పేర్కొంది. కాంగ్రెస్ దేశంలో చట్టాల అమలుకు సైనిక బలగాలను ఉపయోగించడంపై ఉన్న నిషేధ చట్టాన్ని ట్రంప్ సర్కార్ ఉల్లంఘించిందని చీవాట్లు పెట్టింది.   ఫెడరల్ ఇమ్మిగ్రేషన్ దాడులకు వ్యతిరేకంగా ఈ ఏడాది జూన్‌లో లాస్ ఏంజెలెస్‌లో జరిగిన నిరసనలను అణచివేయడానికి ట్రంప్ ప్రభుత్వం నేషనల్ గార్డ్ దళాలను, మెరైన్లను మోహరించింది. అయితే, ఇది 'పోసీ కమిటాటస్ యాక్ట్'ను ఉల్లంఘించడమేనని  కోర్టు తీర్పు వెలువరించింది. లాస్ ఏంజిల్స్ లో జరిగినవి నిరసనలు మాత్రమేననీ, తిరుగుబాటు ఎంత మాత్రమూ కాదనీ పేర్కొన్న కోర్టు, ఆ నిరసనలను అదుపు చేయాల్సింది పోలీసులు మాత్రమేననీ స్పష్టం చేసిన కోర్టు.. ఇప్పటికీ అక్కడ నేషనల్ గార్డ్స్ సిబ్బంది మోహరించి ఉండడాన్ని తప్పుపట్టింది. ఈతీర్పు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.  కాలిఫోర్నియా గవర్నర్ అయితే ప్రజాస్వామ్యం, రాజ్యాంగాన్ని కోర్టు పరిరక్షించిందని వ్యాక్యానించారు.    ఈ తీర్పును వైట్‌హౌస్  వ్యతిరేకించింది.   దీనిని ఫెడరల్ అప్పీల్ కోర్టులో సవాల్ చేసింది.  

ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అవకతవకలపై ఈడీ నజర్

ఆంధ్రప్రదేశ్ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లో అవకతవకలు జరిగినట్లుగా బంజర హిల్స్ పోలీస్ స్టేషన్లో నమోదైన రెండు ఎఫ్ ఐ ఆర్ లను ఆధారంగా   ఈడి దర్యాప్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలోనే ఈడి అధికారులు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ఆదిభట్ల గ్రామంలో ఏపీ మహేష్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ అప్పటి ఎండి అండ్ సీఈఓ అయిన ఉమేష్ చంద్ర ఆసవా కుమారుడు రోహిత్ అసవా పేరు మీద ఉన్న 1.1 కోట్ల విలువైన రెండు స్థిరాస్తులను   తాత్కాలికంగా జప్తు చేసింది.  అప్పటి చైర్మన్ రమేష్ కుమార్ బంగ్, అప్పటి ఎండి అండ్  సీఈవో ఉమేష్ చంద్ అసవా ,  సీనియర్ వైస్ చైర్మన్ పురుషోత్తమ దాస్ మంధాన మరియు ఇతరు లు కలిసి అధికారిక పదవులను దుర్వినియోగం చేసినట్లుగా ఆరోపణలున్నాయి. లేని ఆస్తులపై రుణాలు పంపిణీ చేయడం ద్వారా ఆ పంపిణీ  చేసిన మొత్తం రుణ   రెండు శాతం నుండి నాలుగు శాతం వరకు కమిషన్ వసూలు చేసినట్లుగా ఈడి దర్యాప్తులో వెల్లడైంది. ఆ విధంగా వసూలు చేసిన డబ్బులతో కుటుంబ సభ్యుల పేర్లతో అనేక స్థిరాస్తులను సంపాదించినట్లుగా ఈడి గుర్తించింది. ఆ విధంగా  ఉమేష్ చంద్ర తన కొడుకు పేరుతో రెండు స్థిరాస్తులను కొనుగోలు చేసినట్లుగా దర్యాప్తులో వెల్లడైంది.  ఈ నేపథ్యంలోని ఈడీ అధికారులు ఉమేష్ చంద్ర కుమారుడి పేరుతో పేరుతో ఉన్న 1.1 కోట్ల విలువ చేసే ఆస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. 

ఓయూ లో నకిలీ ఐఏఎస్ ల హల్ చల్!

చదువుల తల్లి కొలువుతీరిన ఉస్మానియా యూనివర్సిటీలో ఆకతాయిల ఆగడాలు నానాటికి పెరిగిపోతున్నాయి.  ఉస్మానియా యూనివర్సిటీ నుంచి సాధారణ జనాలకు అనుమతి ఉండడంతో అక్కడికి ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇష్టారీతిగా వ్యవహరిస్తున్న తీరు రోజురోజుకూ పెచ్చరిల్లుతోంది.  యూనివర్సిటీ లో విద్యార్థులు వెళ్లలేని ప్రాంతాలలోకి కూడా వెళ్లి హల్ చల్ చేస్తున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి.  తాజాగా ఠాగూర్ ఆడిటోరియం సమీపంలో ఒక ఇన్నోవా కారు ఆపి అక్కడ ఓ నలుగురు మూత్ర విసర్జన చేయడాన్ని ఒక విద్యార్థి అడ్డుకున్నాడు.  ఈ ప్రాంతంలో విద్యా ర్థులు తిరుగుతూ ఉంటారని, ఇక్కడ మూత్రవిసర్జన చేయడం కరెక్ట్ కాదని వారించాడు. దీంతో ఆ నలుగురూ విద్యార్థిపై దాడి చేశారు.. తాము ఐఏఎస్ అధికారు లమని, నేషనల్ హైవే అథారిటీ కోసం పని చేస్తు న్నామని, నేషనల్ హైవే సర్వే కోసం వచ్చామని, ఈ నేపథ్యంలోనే ఇక్కడికి వస్తే తమని అడ్డుకుంటావా అంటూ విద్యార్థిపై చేయి చేసుకున్నారు..  విద్యార్థిని పరుగులు పెట్టించి మరీ కొట్టారు.. .అయితే విద్యార్థిని కొడు తుంటే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ అక్కడికి రావడంతో వాళ్ళందరూ పరారయ్యే ప్రయత్నం చేశారు.. తోటి విద్యార్థు లంతా కలిసి ఆ నలుగురిని పట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులకు అప్పగించారు.  తాము ఐఏఎస్ అధికారులమని పోలీసుల ముందు బుకాయించే ప్రయత్నం చేశారు . దీంతో పోలీస్ అధికారులు తమదైన శైలిలో వాళ్ళని ప్రశ్నించ డంతో అసలు విషయం బట్టబయలైంది. ఐఏఎస్ అధికారుల పేర్లు చెప్పుకొని , వీళ్ళు దందా లు చేస్తున్నారని, అంతేకాకుండా వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసుల విచార ణలో బయటపడింది.ఈ నేపథ్యం లో నేషనల్ హైవే అథారిటీ పేరు చెప్పి వసూళ్లకు పాల్పడుతున్న నలుగురిపై ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు  కేసు నమోదు చేశారు. అలాగే యూనివర్సిటీలో అసభ్యకర రీతిలో ప్రవర్తించడం,   విద్యార్థిపై దాడి కేసులు కూడా  రిమాండ్ కు తరలించారు.

త్వరలో ఏపీలో లాజిస్టిక్స్ యూనివర్సిటీ ఏర్పాటు : సీఎం చంద్రబాబు

  ఏపీను తూర్పు తీరానికి ప్రధాన మారిటైమ్ లాజిస్టిక్స్ గేట్ వేగా తీర్చిదిద్దడమే లక్ష్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి ఓడరేవును జాతీయ, అంతర్జాతీయ వాణిజ్యానికి కేంద్రంగా మార్చేందుకు వీలుగా జల, వాయు, రోడ్డు, రైలు మార్గాలను అనుసంధానిస్తూ ఒక సమగ్రమైన కనెక్టివిటీ మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర భవిష్యత్తును మార్చే ఈ కీలక ప్రణాళికతో ఏపీని దేశంలోనే అగ్రగామి లాజిస్టిక్స్ హబ్ గా నిలబెడతామని ధీమా వ్యక్తం చేశారు.   వైజాగ్‌లో జీఎఫ్ఎస్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఈస్ట్ కోస్ట్ మారిటైమ్ లాజిస్టిక్స్ సమ్మిట్’కు ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ఉన్న సహజ అనుకూలతలను పూర్తిగా సద్వినియోగం చేసుకుంటామని తెలిపారు. "మన రాష్ట్రానికి కేవలం మన అవసరాల కోసమే కాకుండా, ఉత్తరాది రాష్ట్రాలతో పాటు పొరుగున ఉన్న తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్ గఢ్, కర్ణాటక వంటి భూపరివేష్టిత రాష్ట్రాల కార్గో రవాణాకు కూడా కీలక కేంద్రంగా మారే అపారమైన అవకాశం ఉంది. వారి సరుకును ఏపీ పోర్టుల ద్వారానే ప్రపంచానికి చేరవేసేలా ఒక పటిష్టమైన కార్యాచరణను అమలు చేస్తున్నాం" అని వివరించారు. ఈ సదస్సుకు ముందు ముఖ్యమంత్రి, దేశవ్యాప్తంగా వివిధ పోర్టులు, కార్గో కంపెనీలకు చెందిన 62 మంది సీఈఓలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాల కల్పన, టెర్మినళ్ల ఆధునీకరణ, షిప్ బిల్డింగ్ వంటి అంశాలపై వారితో విస్తృతంగా చర్చించారు. భారీ నౌకలు సులభంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా 18 మీటర్ల లోతైన ఓడరేవులు తూర్పు తీరంలో ఏపీలో మాత్రమే ఉన్నాయని, ఇది మనకు సానుకూల అంశం అని పేర్కొన్నారు. పోర్టు ఆధారిత అభివృద్ధికి శ్రీకారం కేవలం రవాణాతోనే ఆగిపోకుండా, పోర్టుల చుట్టూ ఒక పారిశ్రామిక, ఆర్థిక పర్యావరణ వ్యవస్థను నిర్మించనున్నట్లు సీఎం తెలిపారు. "రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ, మూలపేట వంటి పోర్టుల వద్ద పరిశ్రమల ఏర్పాటు, ఆధునిక టౌన్ షిప్ ల నిర్మాణం కోసం దాదాపు 10 వేల ఎకరాల భూమిని సిద్ధం చేస్తున్నాం. ఈ రంగంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించేందుకు త్వరలోనే లాజిస్టిక్స్ యూనివర్సిటీ, సివిల్ ఏవియేషన్ యూనివర్సిటీలను కూడా ఏర్పాటు చేస్తాం," అని ప్రకటించారు. లాజిస్టిక్స్ కార్యకలాపాలను సమన్వయం చేసేందుకు ప్రత్యేకంగా ‘ఏపీ లాజిస్టిక్స్ కార్పొరేషన్’ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.

గోవిందరాజస్వామివారి ఆల‌యంలో పవిత్రోత్సవాలు

  తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో సెప్టెంబ‌రు 03 నుండి 05వ తేదీ వరకు జ‌రుగ‌నున్న పవిత్రోత్సవాలకు మంగళవారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్ప‌ణ చేప‌ట్టారు.ఈ సంద‌ర్భంగా ఉద‌యం ఆచార్య రుత్విక్‌వరణంలో భాగంగా ఋత్వికుల‌కు విధులు కేటాయించి వ‌స్త్రస‌మ‌ర్ప‌ణ చేశారు. సాయంత్రం ఆల‌య విమాన ప్రాకారం చుట్టూ సేనాధిపతివారిని ఊరేగింపు నిర్వ‌హించారు. ఆ త‌రువాత యాగ‌శాల‌లో అంకురార్పణ కార్య‌క్ర‌మాలు చేప‌ట్టారు. ప‌విత్రోత్స‌వాల్లో భాగంగా సెప్టెంబరు 03న పవిత్రప్రతిష్ట‌ చేపడుతారు. ఉదయం 09 - 11 గం.ల వరకు యాగశాలలో అకల్మష ప్రాయశ్చిత్తం, పంచగవ్య ప్రాసన మరియు స్నపన తిరుమంజమునకు ఏర్పాట్లు చేపడుతారు. ఉదయం 11 గం.ల నుండి 12.30 గం.ల వరకు కల్యాణ మండపమునందు స్నపన తిరుమంజనం, సేవాకాలము, శాత్తుమొర ఆస్థానం చేపడుతారు. సాయంత్రం ఉత్సవ మూర్తులు తిరువీధి ఉత్సవం, రాత్రి 7.30 - 9.00 గం.ల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.    సెప్టెంబరు 04వ తేదీ స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం, జాప్యం, మూలవర్లకు, ఉత్సవర్లకు, ఉపసన్నిధి నందు పవిత్ర సమర్పణ, విమాన ప్రాకారం, ధ్వజస్తంభం మరియు మాడ వీధులు, శ్రీ మఠం ఆంజనేయ స్వామి వారి ఆలయం వరకు తిరువీధి ఉత్సవం చేపడుతారు. సాయంత్రం 5.30 - 6.30 గం.ల మధ్య ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం నిర్వహిస్తారు.సెప్టెంబర్ 05వ తేదీ ఉదయం స్నపన తిరుమంజనం, శాత్తుమొర, ఆస్థానం, సాయంత్రం ఉత్సవ మూర్తులకు తిరువీధి ఉత్సవం, యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతి, ప్రబంధ శాత్తుమొర , వేద శాత్తుమొర చేపడుతారు.  రాత్రి ఉత్సవ మూర్తులు కుంభం విమాన ప్రదక్షిణంగా సన్నిధిగా వేంచేపు చేస్తారు.పవిత్రోత్సవాలలో పాల్గొనే భక్తులు రూ. 500/- చెల్లించి ఆర్జిత సేవలో పాల్గొనవచ్చు. ఒక టికెట్టుపై ఇద్దరికి ప్రవేశం ఉంటుంది, ఒక పవిత్ర ప్రసాదం ఇవ్వబడుతుంది.  పెద్ద జీయర్, చిన్న జీయర్, ఆలయ డిప్యూటీ ఈవో  వి.ఆర్. శాంతి, ఏఈఓ  ఏబీ నారాయణ చౌదరి,  సూపరింటెండెంట్ లు చిరంజీవి, ఆలయ ఇన్ స్పెక్టర్ రాధాకృష్ణ ఇతర అధికారులు, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.  

సుగాలి ప్రీతి మృతి కేసు సీబీఐకి అప్పగింత

  ఏపీలో  సంచలనం సృష్టించిన  పదోతరగతి విద్యార్థి సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  2017 ఆగస్టు 18న కర్నూలులోని పాఠశాల వసతి గృహంలో సీలింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ ఆమె మృతదేహం కనిపించింది. గత వైసీపీ హయాంలో ఈ కేసు సీబీఐకి ఇచ్చినా దర్యాప్తు ముందుకు సాగలేదు. ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని కూటమి నేతల హామీ ఇచ్చారు.  ఈనేపథ్యంలో ఈ కేసును మరోసారి సీబీఐకి అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు నెలల్లో 11 సార్లు హైకోర్టుకు వచ్చినప్పుడు.. ప్రతిసారి పార్టీ ఆఫీస్‌కు వెళ్లి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అపాయింట్‌మెంట్ అడిగాము.. కానీ ఆయన ఇవ్వలేదని సుగాలి ప్రీతి తల్లి వాపోయింది. కొన్ని రోజులుగా ఈ కేసును సీబీఐకు అప్పగించాలని ప్రీతి తల్లి పార్వతి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.

కొప్పర్తికి మరిన్ని పరిశ్రమలు తెస్తాం : మంత్రి లోకేష్

  కొప్పర్తికి మరిన్ని పరిశ్రమలు తీసుకువచ్చి పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తామని, ఇక్కడ లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా మరిన్ని ప్రఖ్యాతిగాంచిన పరిశ్రమలు తీసుకొస్తామని రాష్ట్ర విద్యా ,ఐటి శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళవారం మధ్యాహ్నం వైఎస్ఆర్ కడప జిల్లా, సికె దిన్నె మండల పరిధిలోని కొప్పర్తి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (ఇఎంసి), లో రూ,231.50 కోట్లతో నూతనంగా ఏర్పాటైన "ఎగ్జిక్యూటివ్ సెంటర్ భవనం"ను,ఎంయస్  టెక్నోడోమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ హబ్ (ఎం ఐ హెచ్) లోని ఎం/యస్  టెక్సానా వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలను నారా లోకేష్ ప్రారంభించారు.  కార్యక్రమంలో ముందుగా టెక్నో రూమ్ మానిటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యూనిట్లో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. ఈ సందర్భంగా లిక్విడ్ క్రిస్టల్ మాడ్యూల్  యూనిట్ ను, డార్క్ రూమ్, ఈఎస్డి ప్రొటెక్టెడ్ యూనిట్ లను మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. కంపెనీలో ఉత్పత్తి సామర్థ్యం కంపెనీ ప్రొడక్షన్ వివరాలను అక్కడ యాజమాన్యంతో అడిగి తెలుసుకున్నారు. రూ,55.21 కోట్ల ఏర్పాటైన టెక్నో డోమ్ కంపెనీలో ఉత్పత్తి నిర్వహణ పనితీరు అక్కడి ఉత్పత్తుల నాణ్యతను పరిశీలించి మంత్రి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం రూ,50 కోట్లతో "టెక్సానా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్" కంపెనీ ఉత్పత్తి యూనిట్ ను మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు.  ఈ సందర్బంగా టెక్సానా యూనిట్లోని అన్ని విభాగాలను కంపెనీ ప్రతినిధులతో కలిసి కలియ తిరిగారు. అనంతరం వస్త్ర తయారీ యూనిట్లో మహిళా ఉద్యోగులను పలకరించారు. టైలరింగ్ సంబంధించి పని ఎలా ఉంది, ఉద్యోగం సంతృప్తి గా ఉందా.. అంటూ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.  ఈ సందర్భంగా టెక్సానా ఇండియా ప్రయివేటు లిమిటెడ్" కంపెనీలో.. మహిళా సిబ్బందితో మంత్రి నారా లోకేష్ "గెట్ టు గెదర్" కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎక్కడైతే మహిళలు గౌరవింపబడుతారో అపుడే సమాజం కూడా గౌరవంగా ఎదుగుతుందన్నారు.  మహిళలు ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులేస్తేనే ఆ కుటుంబంతో పాటు ఆ సమాజం మొత్తం అభివృద్ధి పథంలోకి వెళుతుందన్నారు. మహిళల అభ్యున్నతితోనే సమాజం అభివృద్ధి చెందుతున్న నిజాన్ని నమ్మిన ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్నారు. గెలుపొందిన సంవత్సరం లోపే హామీలిచ్చిన మేరకు సూపర్-6 పథకాలను సూపర్ సక్సెస్ గా నెరవేర్చగలిగామన్నారు. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా అణచి వేసేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మహోన్నతమైన ప్రణాళికతో పరిపాలన సాగుస్తున్నారన్నారు.  *కొప్ఫర్తికి ప్రపంచ ఖ్యాతిగాంచిన పరిశ్రమలు  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఏపీ ఏఏసి ద్వారా కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కును భవిష్యత్తులో మరింత అభివృద్ధి పథంలోకి తీసుకెళతమన్నారు. అలాగే లక్షల మందికి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలను కల్పించేందుకు మరిన్ని ప్రఖ్యాతి గాంచిన కంపెనీలను తీసుకొస్తామని, ఆ దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు. అనంతరం మహిళా సిబ్బందితో మంత్రి సూపర్ సెల్ఫీ తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి మరియు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత, రాష్ట్ర పరిశ్రమలు వాణిజ్య శాఖామంత్రి మంత్రి టిజి భరత్, జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, ఏపీఐఐసి ఎండి అభిషిక్త్ కిషోర్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి, జిల్లా ఎస్పి ఈజీ అశోక్ కుమార్, జెసి అదితి సింగ్, టెక్నో డోమ్ కంపెనీ సిఎండి సాకేత్ గౌరవ్, ప్లాంట్ హెడ్, విక్టర్ ప్రేమ్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ ఫ్రాంక్లిన్ జోష్, పాల్గొన్నారు. వారితో పాటు కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, కడప ఆర్డీవో జాన్ ఎర్విన్, ఏపీఐఐసి జెడ్ఎం శ్రీనివాస మూర్తి, డీఐసి జీఎం చంద్ బాషా,  సంబంధిత శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు.

రికార్డు స్థాయిలో ఏపీకి ఎరువుల కేటాయింపు

   గతంలో ఎన్నడూ లేనంతగా రాష్ట్రానికి ఎరువుల కేటాయింపు జరుగుతోంది. ప్రస్తుత కేటాయింపులకు అదనంగా 53 వేల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ యూరియా నౌకల ద్వారా కాకినాడ, గంగవరం, కృష్ణపట్నం పోర్టులకు చేరుకుంది. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల విషయంలో గత ఏడాది కంటే ఈ ఏడాది గణనీయంగా విక్రయాలు పెరిగాయని వ్యవసాయ శాఖ తెలిపింది. రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని కేంద్రానికి ఎప్పటికప్పుడు వివరిస్తూ ఉండడంతో రాష్ట్రానికి ఎక్కువ కేటాయింపులు జరుపుతూ కేంద్రం నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు.  కేంద్రం ఇచ్చిన ఎరువులు, యూరియా నిల్వలను మార్క్‌ఫెడ్ సమన్వయంతో రైతులకు సమయానికి అందేలా ప్రభుత్వం కృషి చేస్తోందని స్పష్టం చేశారు.  కాకినాడ పోర్టుకు 17,154 మెట్రిక్ టన్నులు, కృష్ణపట్నం పోర్టుకు 9,200 మెట్రిక్ టన్నులు, గంగవరం పోర్టుకు 26,547 మెట్రిక్ టన్నుల యూరియా చేరుకుంది.  ఈ సరఫరాతో పాటు గత 10 రోజుల్లో రాష్ట్రానికి 22 వేల మెట్రిక్ టన్నుల యూరియా చేరగా..వచ్చే  10 రోజుల్లో అదనంగా 30 వేల మెట్రిక్ టన్నులు రానున్నట్టు వ్యవసాయ శాఖ తెలియచేసింది.   దీనికి తోడు దేశీయంగా వివిధ కంపెనీల నుంచి సరఫరా అయ్యే ఎరువులు కూడా అందుబాటులో ఉన్నాయని... రైతులకు ఎరువుల సమస్య తలెత్తే అవకాశం లేదని వ్యవసాయ శాఖ అధికారులు వెల్లడించారు. ఖరీఫ్ సీజన్ కు ఇప్పటి వరకూ 5.65 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రైతులకు సరఫరా అయినట్టు వ్యవసాయశాఖ తెలియచేసింది. అటు వచ్చే రబీ సీజన్ కు కూడా మరో 9 లక్షల మెట్రిక్ టన్నుల్ని సిద్ధం చేస్తున్నట్టు వెల్లడించింది.  మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరాలో 78% వృద్ధి ఖరీఫ్ సీజన్ కు సంబంధించి గత ఏడాదితో పోలిస్తే మార్క్ ఫెడ్ ద్వారా ఎరువుల సరఫరా  గణనీయంగా పెరిగిందని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు తెలిపారు. యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు  అన్నీ కలిపి గతేడాది కంటే 1.20 లక్షల మెట్రిక్ టన్నుల మేర అదనంగా మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా చేశామని అధికారులు తెలిపారు. గతేడాది 1.53 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు సరఫరా చేస్తే... ఈ ఏడాది ప్రస్తుత  సీజన్లో 2,72,000 మెట్రిక్ టన్నుల మేర మార్క్ ఫెడ్ ద్వారా సరఫరా జరిగిందని వెల్లడించారు.  గతంతో పోలిస్తే ఇది 78 శాతం మేర అధికమని వ్యవసాయశాఖ ఉన్నతాధికారులు  స్పష్టం చేస్తున్నారు. ఇక గత ఏడాదిలో 1,11,000 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేస్తే ..ఈ ఏడాది 2.02 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా జరిగిందని వివరించారు. గతాని కంటే అధికంగా 91 వేల మెట్రిక్ టన్నులను సరఫరా చేశామని వివరించారు. ఇక డీఏపీ సరఫరా కూడా గతానికి మించి 85 శాతం జరిగిందని వెల్లడించారు. గత ఏడాది 23,700 మెట్రిక్ టన్నులు మాత్రమే సరఫరా చేయగా... ఈ ఏడాది 51,700 మెట్రిక్ టన్నుల మేర సరఫరా జరిగిందని స్పష్టం చేశారు.  ఈసారి 28 వేల మెట్రిక్ టన్నులు ఎక్కువగా సరఫరా చేశామని వ్యవసాయ శాఖ అధికారులు వివరించారు. ఈ స్థాయిలో జరిగిన భారీ కేటాయింపులతో ప్రస్తుత సీజన్ తో పాటు వచ్చే రబీ సీజన్‌లోనూ రైతులకు ఎరువుల కొరత ఉండదని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. యూరియా, ఎరువుల కేటాయింపుల విషయంలో కేంద్రంతో, రైతులకు సరఫరా చేసే అంశంలో మార్క్‌ఫెడ్ తో సమన్వయం చేసుకుంటున్నామని అధికారులు చెప్పారు. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామని వివరించారు.

లండన్‌ రోడ్డు ప్రమాదంలో తెలుగు విద్యార్థి మృతి

  కొడుకు బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాది స్తాడని కలలు కన్నా ఓ తల్లిదండ్రులకు విధి విషాదం మిగిల్చింది. లండన్ లో చదువుకోవ డానికి వెళ్లిన తన కొడుకు తిరిగిరాని లోకానికి వెళ్లిపో యడాని తెలియ గానే ఆ తల్లిదం డ్రులు  దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఈ ఘటన మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.కరీంనగర్ జిల్లాలోని వేమూరు గ్రామానికి చెందిన రాపోలు రవీందర్ తన కుటుంబ సభ్యుల తో కలిసి హైదరాబాద్ నగరానికి వచ్చి...మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని అమృత కాలనీ లో ఉన్న శ్రీసాయి రెసిడెన్సీ లో నివా సం ఉంటూ... ప్రైవేటు ఉద్యోగం చేస్తూ జీవనం కొన సాగిస్తున్నారు.  రాపోలు రవీందర్ కుమారుడు రాపోలు రిషితేజ నిన్న మధ్యాహ్నం 3 గంటలకు లండన్ లో జరిగిన రోడ్డు ప్రమాదం లో మృతి చెందాడు. కేవలం నాలుగు నెలల క్రితం అనగా మే 9వ తేదీన రిషి తేజ్ ఎంబీఏ చదువుకో వడం కోసం లండన్ కి వెళ్ళాడు. ఈస్ట్ లండన్ లోని బీచ్ లో సన్ రైజ్ చూడడం కోసం 2 కార్లు లలో 9 మంది స్నేహితులతో కలిసి  వెళ్తుండగా... ఒక వాహనం అత్యంత వేగంగా వచ్చి వీరి కారును ఢీ కొట్టింది. ఇద్దరు అక్కడి కక్కడే మృతిచెంద గా పలువురికి  గాయాలయ్యాయి. డ్రైవర్ లు సేఫ్ గా ఉన్నారని తెలి పారు. రిషితేజ్ హైదరాబాద్ లో BBA పూర్తి చేసి దిల్ రాజు కు సంబంధించిన  మ్యగో ఛానెల్ లో కొద్దికాలం ఉద్యోగం చేశాడని....పై చదువుల కోసం ఈస్టర్న్ లండన్ యూనివర్సిటీ లో ఎంబీఏ చేయడం కోసం లండన్ వెళ్లాడని కుటుంబ సభ్యులు తెలిపారు.

పెండ్లిమర్రు ఆదర్శ డిగ్రీ కళాశాలను ప్రారంభించిన మంత్రి లోకేష్

  వైఎస్ఆర్  కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పెండ్లిమర్రులో రూ.12 కోట్ల రూసా నిధులతో నిర్మించిన ఆధునాతన ఆదర్శ డిగ్రీ కళాశాల భవనాలను రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ మంగళవారం ప్రారంభించారు. పిఎం ఉష పథకంలో భాగంగా నిర్మించిన అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ ను కూడా మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి లోకేష్ బిఎ ఎకనమిక్స్ ద్వితీయ సంవత్సరం తరగతి గదిని పరిశీలించారు.  ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ... భావిభారత పౌరులను తయారు చేయడంలో విద్యాశాఖ కీలకమైనది, కష్టమైనది అయినా భావిభారత పౌరులను తయారుచేసే విద్యాశాఖను కోరి తీసుకున్నా. విద్యాపరంగా నాణ్యత పెంచడానికి మంత్రిగా నేను ఏంచేయాలో చెప్పాల్సిందిగా సూచనలు అడిగారు. విద్యార్థులు స్పందిస్తూ ఫ్యాకల్టీ పెంచాలని కోరారు. మంత్రి లోకేష్ స్పందిస్తూ... ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటామని చెప్పారు. కళాశాల సమీపంలో బస్టాప్ ఏర్పాటు చేయాలని, కాంపౌండ్ వాల్ నిర్మించాలని విద్యార్థులు విజ్ఞప్తిచేశారు.  కళాశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఉచిత బస్సు సౌకర్యం తమకు చాలా ఉపయోగకరంగా ఉందని విద్యార్థినులు మంత్రికి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్ చార్జి మంత్రి సబిత, కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ అధితి సింగ్, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి, యోగి వేమన యూనివర్సిటీ వైస్ చాన్స్ లర్ అల్లం శ్రీనివాసరావు, విద్య, మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్మన్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.  

నటికి రూ.102 కోట్ల జరిమాన

  కన్నడ నటి రన్యారావుకు ఈడీ భారీ జరిమాన విధించింది. బంగారు అక్రమ రవాణా వ్యవహారంలో సంబంధం ఉన్న మనీలాండరింగ్ కేసులో ఆమె అరెస్టయిన సంగతి తెలిసిందే. తాజాగా ఈడీ ఆమెకు రూ.102 కోట్ల జరిమాన విధించింది. ఆమెతో సహా నలుగురు నిందితులకు మొత్తంగా రూ. 270 కోట్ల జరిమాన విధించారు. దుబాయ్ నుంచి గోల్డ్‌ను అక్రమంగా స్మగిలింగ్ చేస్తూ బెంగళూరు విమానశ్రయంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడింది. మార్చి నెలలో బెంగళూరు విమానాశ్రయంలో కన్నడ నటి రన్యా రావు నుంచి రూ.12.56 కోట్ల విలువ చేసే బంగారాన్ని డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆమె ఇంట్లో చేపట్టిన తనిఖీల్లో రూ.2.67 కోట్ల నగదు, రూ.2 కోట్లు విలువ చేసే బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని పేర్కొంది. మెుత్తంగా రూ.17.29 కోట్ల విలువ చేసే బంగారం, నగదు సీజ్ చేశామని వెల్లడించింది. మార్చి 3న రన్యా రావు దుబాయ్ నుంచి బెంగళూరు విమానాశ్రయానికి రాగా.. అనుమానం వచ్చి డీఆర్‌ఐ అధికారులు తనిఖీలు చేపట్టారు.  

దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించాలి

  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దివ్యాంగులందరికీ ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలని దివ్యాంగుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు ఇండ్ల ఓబులేసు  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కడప జిల్లా బద్వేల్  సిపిఐ కార్యాలయంలో దివ్యాంగ సభ్యుల సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన   మాట్లాడుతూ.. రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం కింద స్త్రీలకు ఉచిత ప్రయాణం కల్పించిన విధంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులకు  ఉచితంగా ప్రయాణం  సౌకర్యాన్ని కల్పించాలని ఆయన కూటమి ప్రభుత్వాన్ని కోరారు. ఏపీ వ్యాప్తంగా సుమారు 5 లక్షల మంది వరకు దివ్యాంగులు ఉంటే వారికి ఉచిత ప్రయాణం కల్పించడంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్నారు. వయోవృద్ధులు వికలాంగులు మరియు హిజ్రాల సంక్షేమ శాఖ తో సంబంధం ఉన్నటువంటి హిజ్రాలకు ఉచిత ప్రయాణం వర్తింపజేసినప్పుడు దివ్యంగు లకు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు.  స్రీ శక్తి పథకం కింద ఆర్టీసీకి నష్టాలను కట్టే ప్రభుత్వం.. దివ్యాంగులకు ఉచిత ప్రయాణం పెద్ద నష్టమేమి కాదన్నారు.. ఆర్టీసీలో దివ్యాంగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ప్రభుత్వం దీనిపైన ప్రకటన చేయకపోతే ఆర్టీసీ డిపోల ముందు దివ్యాంగుల ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వానికి హెచ్చరించారు. ఈ సమావేశంలో పట్టణ అధ్యక్షులు చింతకుంట రఫీ, కార్యదర్శి కడప చిన్న మౌలాలి, గౌరవ ఆహ్వానితులు గంగన్నపల్లి మురళి తదితరులు పాల్గొన్నారు.

మత్తు పదార్థాల గుర్తింపులో జాగిలాల పనితీరు అద్భుతం : హోం మంత్రి అనిత

  మత్తు పదార్ధాల గుర్తింపులో శిక్షణ పొందిన జాగిలాల పనితీరు అద్భుతంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని అన్నారు. యువత మత్తుపదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ గుంటూరు జిల్లాలోని ఆరో బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఐపీఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.  31వ పోలీసు జాగిలాల ప్రదర్శన, విన్యాసాలు ఆకట్టుకున్నాయి.  శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి అందజేశారు. ప్రథమ స్థానం నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. రెండో స్థానంలో పల్నాడు అశోక్, గుంటూరు జిల్లాకు చెందిన వేణుబాబు సాధించారు. తృతీయ స్థానంలో రాజమండ్రికి చెందిన శివకుమార్ దక్కించుకున్నారు. జాగిలాల ప్రదర్శన, వాటి క్రమ శిక్షణ చూస్తే ఆశ్చర్యం కలిగిందని పేర్కొన్నారు. మూగ జీవాలతో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ జాగిలాల వల్ల ఎన్నో కేసులు ఛేదించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.  ఎక్కడ నేరం జరిగినా... డాగ్ స్క్వాడ్ రాలేదా అని ప్రజలే అడుగుతారని అన్నారు. ప్రతి జాగిలానికి రెండు అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారని చెప్పుకొచ్చారు.మందుగుండు, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం ఏదైనా ఎక్కడ దాచినా గుర్తించేలా జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని తెలిపారు హోంమంత్రి అనిత. నేటికీ అప్పా అనేది మనం కేటాయించుకోలేక పోయామని హోంమంత్రి అనిత వెల్లడించారు. వంద ఎకరాల్లో అప్పా నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.  కొత్తగా వచ్చే పోలీసు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం పైన కూడా శిక్షణ ఇస్తున్నారని వివరించారు. నేర పరిశోధనలో, ప్రజల శ్రేయస్సులో కూడా పోలీసు జాగిలాలది కీలకపాత్రని ఉద్ఘాటించారు. గతంలో రేపల్లెలో అత్యాచారం జరిగిన కేసులో ఎలాంటి ఆధారం దొరకలేదని చెప్పుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ వచ్చి ఆనవాళ్లు గుర్తించాక 36 గంటల్లో నిందితులను పట్టుకున్నారని గుర్తుచేశారు. పోలీసు జాగిలాల శిక్షణతో‌పాటు, వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు.

దేశంలో తొలిసారిగా ప్రభుత్వ స్కూలులో స్మార్ట్ కిచెన్‌‌

  దేశంలోనే తొలిసారిగా కడప జిల్లా సికె దిన్నె ఎంపీపీ హైస్కూలులో అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్‌ను రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. సికె దిన్నె స్మార్ట్ కిచెన్ నుంచి 1787 మంది విద్యార్థులకు  భోజనం తయారీ, పంపిణీ చేశారు. కమలాపురం నియోజక వర్గంలో 2, జమ్మలమడుగు 2, కడపకు చెందిన ఒక స్మార్ట్ కిచెన్‌ను వర్చువల్ గా ప్రారంభించారు.  ఈ 5 స్మార్ట్ కిచెన్ల ద్వారా 136 పాఠశాలల్లోని 10,323 మందికి శుచికరమైన భోజనం తయారీ, ప్రత్యేక వాహనాల ద్వారా పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ డిసెంబర్ నాటికి జిల్లా వ్యాప్తంగా 11 మండలాల్లో 33 అడ్వాన్స్డ్ స్మార్ట్ కిచెన్ ప్రారంభిస్తామన్నారు. కడప జిల్లాలో 33 స్మార్ట్ కిచెన్ల ద్వారా 1,24,689 మంది విద్యార్థులకు రుచి, శుచితో కూడిన భోజనం అందిస్తామని మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు.అంతకుముందు నియోజకవర్గానికి విచ్చేసిన మంత్రి  నారా లోకేష్ కి తెలుగుదేశం పార్టీ నాయకులు,కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు.  

గిడుగు సేవలు నేటి తరానికి ఆదర్శం.. టీడీ జనార్ధన్

తెలుగు భాషాసాహిత్యాలకు గిడుగు రామ్మూర్తి పంతులు చేసిన సేవలు నేటి తరానికి ఆదర్శంకావాలని ఎన్టీ ఆర్ లిటరేచర్ గ్లోబల్ నెట్ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు,తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు టి.డి.జనార్ధన్ పేర్కొన్నారు. గిడుగు రామమూర్తి పంతులు జయంతివేడుకల్లో భాగంగా గిడుగుఫౌండేషన్, శంకరం వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గిడుగు జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. గిడుగువారి మార్గంలో నడిచి,  తెలుగు భాషాకోసం ఎన్టీఆర్ ఎంతో కృషిచేశారని గుర్తుచేశారు. భాష పేరుతో తెలుగు విశ్వవిద్యాలయం నెలకొల్పడమేగాక ఆయన ముఖ్య మంత్రిగా అమలు జేసిన సంక్షేమ పథకాలకు తెలుగు పేర్లు పెట్టారని అన్నారు. ప్రముఖ కవి ,గిడుగు ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ బిక్కి కృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో గిడుగు ఫౌండేషన్ అధ్యక్షుడు గిడుగు కాంతికృష్ణ, శంకరం వేదిక అధ్యక్షుడు యలవర్తి ధనలక్ష్మి,శతచిత్రనిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ,కవులు డా.జెల్ది విద్యాధర్, డా.వి.డి.రాజగోపాల్, డా.రాధాకృష్ఢ  అతిథులుగా పాల్గొన్నారు.

మైసూరుకు దీటుగా బెజబాడలో దసరా ఉత్సవాలు

బెజవాడలో ఈ ఏడాది దసరా ఉత్సవాల సంబరాలు అంబరాన్నంటనున్నాయి. అసలు దసరా ఉత్సవాలకు బెజవాడ పెట్టింది పేరు. కనకదుర్గమ్మ బెజవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువై ఉండటంతో ఇక్కడ ప్రతి ఏటా దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. అందులో సందేహం లేదు. సంప్రదాయబద్ధంగా అత్యంత భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయి. అయితే ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఈ సంప్రదాయపద్దతికి ఆధునికతను జోడించాలని నిర్ణయించింది. మైసూరు లో జరిగే దసరా ఉత్సవాలను తలదన్నేలా నిర్వహించాలని నిర్ణయించింది. విజయవాడ ఉత్సవ్ పేరుతో దసరానవరాత్రులలో నగర వ్యాప్తంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించింది.  పున్నమి ఘాట్‌లో దాండియా, లైవ్ బ్యాండ్‌లు  వాటర్ స్పోర్ట్స్‌ తో పాటు గొల్లపూడిలో  30 ఎకరాలలో బ్రహ్మాండమైన ఎక్స్‌పోను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది  పది రోజుల దసరా ఉత్సవాలలో కళాక్షేత్రంలో సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల కోసం రూపొందించిన ప్రత్యేక కార్యకలాపాలతో పాటు హెలి మరియు బెలూన్ రైడ్‌లను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది.   సంప్రదాయం, ఆధునికతల మేళవింపుతో దసరా ఉత్సవాలను నభూతో అన్నట్లుగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఇప్పటికే ఏర్పాట్లు చేస్తున్నది.  ఈ ఉత్సవాలు బెజవాడ వాసులకు ఓ కొత్త అనుభూతిని మిగిల్చేలా ఉంటాయని ప్రభుత్వం చెబుతోంది.