ఉద్యోగులకు డీఏ బకాయిల తొలి విడత చెల్లింపు

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ ఖజానా ఖాళీ అయ్యింది. అప్పులు, చెల్లింపుల బకాయిలు వినా చిల్లి గవ్వ కూడా లేని పరిస్థితిలో.. గత ఏడాది జరిగిన  ఎన్నికలలో విజయం సాధించి తెలుగుదేశం కూటమి అధికార పగ్గాలు చేపట్టింది. అప్పటి నుంచీ ఒక్కొక్కటిగా అన్నిటినీ సరిదిద్దుకుంటూ.. రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ అడుగులు వేస్తున్నది. అభివృద్ధి, సంక్షేమాలకు సమ ప్రాధాన్యత ఇస్తూ.. ప్రజాభిమానాన్ని చూరగొంటున్నది. గత ప్రభుత్వం చెల్లింపులకు ఎగనామం పెట్టి ఉద్యోగులకు డిఏలు పెద్ద ఎత్తున బకాయి పడింది. ఇప్పుడు ఆ బకాయిల చెల్లింపులపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. తొలి విడతగా సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలన విడతల వారీగా చెల్లించేందుకు రెడీ అయ్యింది. ఇందులో భాగంగా సీపీఎస్ ఉద్యోగులకు తొలి విడత డిఏ బకాయిలను విడుదల చేసింది. అనూహ్యంగా తమ ఖాతాల్లో సొమ్ములు జమ అవ్వడంతో  ఉద్యోగులు ఆశ్చర్యపోయారు. దీనిపై ఏపీ సచివాలయ సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తొలి విడదలోసెక్రటేరియట్ సీపీఎస్‌ ఉద్యోగులకు డిఏ బకాయిలను ప్రభుత్వం జమ చేసింది. త్వరలోనే  మిగిలిన సిపిఎస్ ఉద్యోగులందరికీ  బకాయిలు నగదుగా చెల్లించేందకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ బకాయిలను మొత్తం ఆరు విడతలలో చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం తొలి విడతలో జమ అయిన బకాయిలు ఒక్కో ఉద్యోగికీ 40 నుంచి 70 వేల వరకూ వచ్చాయి.   జగన్ రెడ్డి హయాంలో ఉద్యోగులకు రివర్స్ పీఆర్సీ ఇచ్చి  డీఏలు ఎగ్గొట్టడంతో బకాయిలు పెద్దఎత్తున పేరుకుపోయిన సంగతి విదితమే. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులు డిమాండ్ చేయకపోయినా వారికి న్యాయంగా అందాల్సిన బకాయిలను అందించే ఏర్పాట్లు చేస్తుండటం పట్ల ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.    

సృష్టి కేసు.. ముగ్గురు వైద్యుల సస్పెండ్

  తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సృష్టి సంతాన సాఫల్య కేంద్రంలో ముగ్గురు వైద్యలపై  ఏపీ ప్రభుత్వం  చర్యలు తీసుకుంది. ఆంధ్ర వైద్య కళాశాల అనస్తీషియా విభాగాధిపతి డాక్టర్‌ రవి, గైనకాలజీ విభాగంలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఉషాదేవి, శ్రీకాకుళం వైద్య కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ విద్యుల్లతపై సస్పెన్షన్‌ వేటు వేసింది. హెల్త్ మినిస్టర్ సత్యకుమార్‌ ఆదేశాలతో ముగ్గురిని సస్పెండ్‌ చేస్తూ సంబంధిత శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ముగ్గురిపై హైదరాబాద్‌లో కేసులు నమోదు కావడంతో కూటమి ప్రభుత్వం చర్యలకు దిగింది.  సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ కేసు ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రత పిల్లలు లేని దంపతులనే లక్ష్యంగా చేసుకుని లక్షల్లో వసూళ్లకు పాల్పడింది. అబార్షన్‌ కోసం ఆస్పత్రికి వచ్చే గర్భిణీలకు డబ్బులు ఆశ చూపి ప్రసవం తర్వాత వారి పిల్లల్ని కోనుగోలు చేసి సరోగసి ద్వారా పుట్టిన బిడ్డగా నమ్మించి పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేసినట్లు నమ్రత కన్ఫెషన్ రిపోర్ట్​లో పోలీసులు పేర్కొన్నా సంగతి తెలిసిందే

మనస్తాపంతో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్యాయత్నం

  తనపై నిందలు వేస్తూ పై అధికారులకు ఫిర్యాదు చేయడంతో మనస్థాపం చెందిన జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డ ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం తహసీల్దార్ కార్యాలయంలో చోటుచేసుకుంది. జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న లకావత్ కల్పన  నల్లబెల్లి తహసీల్దార్ కార్యాలయంలో గత పది సంవత్సరాలుగా జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న కల్పనను. అదే మండలం బిల్ నాయక్ తండాకు చెందిన చరణ్ సింగ్ అనే వ్యక్తి మనసికంగా వేధిస్తూ అధికారులకు తనపై  తప్పుడు నిందలు వేస్తూ ఫిర్యాదు చేశాడని, తనను లైంగికంగా వేధిస్తున్నాడని మనస్థాపం చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నారని సూసైడ్ నోట్‌లో పేర్కొంది.  తన చావుకు చరణ్ సింగ్ తో పాటు మాజీ ఎంపీటీసీ మోహన్   అధికారులు కూడా కారణమంటూ తెలిపింది . కల్పన పురుగుల మందు తాగిన విషయం గమనించిన అటెండర్ కేకలు వేయడంతో సహో ఉద్యోగులు వచ్చి అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను హుటాహుటిన నర్సంపేటలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించి చికిత్స అందిస్తున్నారు.

గంట కొట్టిన బాలయ్య... తొలి దక్షిణాది నటుడిగా రికార్డు

    నందమూరి నటసింహం బాలకృష్ణ మరో అరుదైన ఘనత సాధించారు.  ముంబయిలోని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ) బెల్‌ను మోగించిన తొలి దక్షిణాది నటుడిగా నిలిచారు. అధికారుల ఆహ్వానం మేరకు ఎన్‌ఎస్‌ఈని తాజాగా బాలకృష్ణ సందర్శించారు. ఆ సమయంలో వారి విజ్ఞప్తి మేరకు అక్కడ ఏర్పాటు చేసిన గంటను కూడా మోగించారు. అందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.  నందమూరి ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే నటసింహం వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నారు. ఇప్పుడు మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నారు. దీంతో జై బాలయ్య అంటూ సోషల్​ మీడియాలో ఫ్యాన్స్​ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుస రికార్డులు అందుకోవడంతో బాలయ్య అభిమానులు సందడి చేస్తున్నారు. ఈ అరుదైన అవకాశం లభించడంపై స్పందించిన బాలకృష్ణ, తన సంతోషాన్ని పంచుకున్నారు. "ముంబై స్టాక్ ఎక్స్చేంజ్‌లో చిరస్మరణీయ, మరపురాని ఘట్టమని పేర్కొన్నారు. బసవతారకం ఇండో-అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి ప్రతినిధులతో ముంబై పర్యటనలో భాగంగా నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్‌ను ఆయన సందర్శించారు. ఆ సందర్భంలో నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అధికారులు చూపిన ఆత్మీయత, ఇచ్చిన గౌరవం నా హృదయాన్ని తాకింది.  ప్రత్యేక ఆహ్వానం ఇచ్చి స్టాక్ ఎక్స్చేంజ్ బెల్ మోగించే అవకాశాన్ని ఇచ్చారని ఆయన పేర్కొన్నారు. దక్షిణ భారతీయ నటుడిగా, హీరోగా ఈ వేదికపై బెల్ మోగించిన మొదటి వ్యక్తిగా నిలవడం నాకు గర్వకారణం మాత్రమే కాదు… ఇది నా తెలుగు ప్రజల ప్రేమ, ఆదరణ, ఆశీర్వాదాల ప్రతిఫలమని భావిస్తున్నాను తెలిపారు. ఈ క్షణం నాకు మరపురానిది. ఇది వ్యక్తిగత ఘనత కాదని.. మనందరి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని నమ్ముతున్నాను." అంటూ బాలకృష్ణ తన ఆనందాన్ని పంచుకున్నారు.

దళారీ వ్యవస్థపై దండెత్తిన చీని రైతులు

  కడప జిల్లా  పులివెందులలో చీని రైతులు, వ్యాపారస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇక్కడి  వ్యాపారస్థులు సిండికేట్ గా మారి ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు కనీసం గిట్టుబాటు ధర కూడా కల్పీంచకుడా తమ పంట దిగుబడిని కొనుగోలు చేస్తున్నారని చీనీ రైతులు ఆందోళనకు వ్యక్తం చేశారు. దళారులు, స్థానిక వ్యాపారుల కారణంగా   తీవ్రంగా నష్టపోతున్నామని, తమకు ఆత్మహత్యలే శరణ్యమని పులివెందులలోని మార్కెట్ యార్డ్ పై సోమవారం చీనీ రైతులు దండెత్తారు. చీని మార్కెట్ లో వ్యాపారస్తులతో వాగ్వివాదానికి దిగడంతో ఉద్రిక్తత చోటు చేసుకొంది.  తమ భార్యల తాలిబొట్లు, పొలాలు బ్యాంకుల్లో తాకట్టు పెట్టు కుంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.  చీని పంటకు గిట్టుబాటు ధరలు లేక పోవడంతో సంవత్సరాలుగా పెంచుకుంటున్న చీని చెట్లను నరికి వేసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయని రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.  *దళారీ వ్యవస్థ తో నష్టపోతున్నాం     కమలాపురం, తొండూరు, పులివెందుల మండలాలకు చెందిన రైతులు సురేంద్రనాథ్ రెడ్డి, కొండారెడ్డి, సోమ లింగారెడ్డి తదితర రైతులు మాట్లాడుతూ   దళారీ వ్యవస్థ లో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని నియోజకవర్గంలోని చీని రైతులం ఆందోళనకు దిగాల్సి వచ్చిందన్నారు. సోమవారం పులివెందుల మార్కెట్ యార్డులో చీని వేలం పాటలో వ్యాపారులు అందరూ ఒక్కటి అయ్యి  రైతుకు గిట్టుబాటు ధర కాకుండా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.  టన్ను చీని రూ. 8 వేలు నుండి రూ.10 వేలు అడుగుతున్నారన్నారు. వెంటనే ప్రజాపతినిధులు, అధికారులు జోక్యం చేసుకొని రైతుకు టన్ను రూ.30 వేలు నుండి రూ.40 వేలు  గిట్టుబాటు ధర కల్పించాలని రైతులు నిరసన తెలిపారు. వ్యాపారుల తీరు మారకపోతే వేలం పాటను అడ్డుకుంటామని రైతులు హెచ్చరించారు. తమకు కనీస గిట్టుబాటు ధర లేకపోతే మార్కెట్ యార్డుకు ఈనెల 11న తాళాలు వేసి బంద్ నిర్వహిస్తామని   రైతులు హెచ్చరించారు.  రైతులు కూడ మార్కెట్ యార్డ్ కు చీని పంట తీసుకు రావద్దని తోటి రైతులకు విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మార్కెట్లో వ్యాపారస్తులందరూ సిండికేట్ అయ్యి రైతులను నిండా ముంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే చాలామంది రైతులు గిట్టుబాటు ధర లేక చెట్లను నరికివేస్తున్నారని దీనివల్ల రైతుకు తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. ఇలాగే ఈ వ్యవస్థ మారకపోతే రైతులు అప్పులు తీర్చలేక పురుగుల మందు తాగి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుంది అన్నారు.  *ఇతర ప్రాంత  వ్యాపారులను రానివ్వకుండా  గతంలో ఇతర ప్రాంతాల నుంచి వ్యాపారులు తోటల వద్దకే  వచ్చి కొనుగోలు చేసే వారన్నారు.. ప్రస్తుతం పులివెందుల చీనీ మార్కెట్ యార్డులో వ్యాపారులంతా ఏకమై రైతులను మోసం చేస్తున్నారని తెలిపారు. సూట్ పద్దతిని  రద్దు చేసేందుకే మార్కెట్ యార్డ్లో చీని రైతులకు మరియు వ్యాపారస్తుల మధ్య సయోధ్య  కుదిర్చి  చీని మార్కెట్ యార్డ్ ను ఏర్పాటు చేశారన్నారు.  ప్రస్తుతం  పులివెందుల చీని మార్కెట్ యార్డ్ లో దళారులంతా ఏకమై ఒకటి, రెండు చీని కుప్పలకు మాత్రం అధిక ధర వెచ్చిస్తూ కొనుగోలు చేస్తున్నారన్నారు. మిగతా వాటికి మాత్రం నామకే వాస్తు ధరలను నిర్ణయించి రైతులను నిండా ముంచేస్తున్నారన్నారు. *రైతులతో చర్చించిన బిటెక్ రవి. రైతుల ఆందోళన తెలుసుకున్న పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ బిటెక్ రవి, పులివెందుల మార్కెట్ యార్డ్ చైర్మెన్ అమర్నాథ్ తోకలసి మార్కెట్ యార్డ్ కు చేరుకున్నారు. అనంతరం అక్కడి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.  వ్యాపారస్థులతో కూడ సమస్య ఎక్కడ నెలకొన్నది అనే విషయమై వారితో చర్చించారు. బిటెక్ రవి మాట్లాడుతూ చీని రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. రైతులు ఆందోళన, అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు.  

రాష్ట్రంలో యూరియా కొరత ఉండొద్దు : సీఎం చంద్రబాబు

  ఏపీలో రబీ సీజన్‌కు సంబంధించి యూరియా పంపీణీపై ప్రణాళికలు రచించాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. యూరియా సరఫరా, ఉల్లి కొనుగోళ్లు, తురకపాలెం గ్రామంలో ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి సమీక్షించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 80,503 మెట్రిక్ టన్నుల ఎరువుల నిల్వ ఉన్నయని అధికారులు సీఎంకు వివరించారు.  మరో 10 రోజుల్లో 23,592 వేల మెట్రిక్ టన్నుల యూరియా రాష్ట్రానికి వస్తుందని అధికారులు పేర్కొన్నారు.  నిత్యావసర వస్తువుగా ఉన్న యూరియాను బ్లాక్ మార్కెటింగ్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని  సీఎం ఆదేశించారు. కర్నూలు మార్కెట్ లో ఉల్లి కొనుగోళ్లు, మద్దతు ధరపైనా ముఖ్యమంత్రి సమీక్షించారు. ఉల్లి ధర క్వింటాలుకు రూ.1200 తగ్గకుండా చూడాలన్నారు. రైతులు ఎవరైనా క్వింటాకు రూ.1200 కంటే తక్కువ ధరకు అమ్ముకుంటే...ఆ మేరకు ప్రభుత్వం చెల్లిస్తుందని  ముఖ్యమంత్రి తెలిపారు. అరకు కాఫీకి సోకిన కాయతొలుచు తెగులు పైనా సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు . కాఫీ తోటలకు సోకిన తెగులును ఇతర ప్రాంతాలకు సోకకుండా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఇప్పటి వరకు 80 ఎకరాలకు మాత్రమే తెగులు సోకిందని....అందులో 60 ఎకరాలు తొలగించామని  అధికారులు సీఎం చంద్రకు వివరించారు. తురకపాలెం గ్రామ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్షించాలని ఆరోగ్యశాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సీఎస్ కే.విజయానంద్, వ్యవసాయశాఖ, వైద్యారోగ్యం, ఐటీ శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు.   

విశాఖ అభివృద్ధికి రూ.553 కోట్లతో నూతన ప్రాజెక్టు

  విశాఖ నగరాభివృద్ధి కోసం అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి విశాఖపట్నం మహానగర పాలక సంస్థ రుణం తీసుకునేందుకు సంబంధించి ఐఎఫ్‌సీ-జీవీఎంసీ అధికారులు మధ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఒప్పందం జరిగింది. అనంతరం జీవీఎంసీ అధికారులు ముఖ్యమంత్రితో సమావేశమై త్వరలో చేపట్టే అభివృద్ధి ప్రాజెక్టు వివరాలను వెల్లడించారు. ఈ ఒప్పందంతో భారతదేశంలో మొదటిసారిగా అంతర్జాతీయ ఆర్థిక సంస్థ నుంచి ప్రత్యక్ష రుణం పొందిన మున్సిపల్ కార్పొరేషన్‌గా జీవీఎంసీ నిలిచిందని అధికారులు తెలిపారు.  విశాఖపట్నంలోని మధురవాడ జోన్–2లో ఆధునిక మురుగునీటి వ్యవస్థను ప్రాజెక్టులో భాగంగా అభివృద్ధి చేయనున్నారు. దీనికి మొత్తం రూ.553 కోట్లు వ్యయం అయ్యే ఈ ప్రాజెక్టులో రూ.498 కోట్లు ఐఎఫ్‌సీ రుణంగా ఇవ్వనుంది. మిగిలిన మొత్తంలో అమృత్ 2.0 నుంచి రూ.45.64 కోట్లు, జీవిఎంసీ సొంత నిధులు రూ. 9.36 కోట్లు వినియోగించనుంది. జీవీఎంసీ తన సొంత ఆదాయ వనరుల ద్వారా ఈ రుణాన్ని తిరిగి ఐఎఫ్‌సీకి చెల్లించనుంది. 15 సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఈ రుణానికి వడ్డీ రేటు 8.15 శాతం (ఫ్లోటింగ్)గా నిర్ణయించారు.  త్వరలో మొదలయ్యే మధురవాడ మురుగునీటి ప్రాజెక్టుతో 100 శాతం అండర్‌గ్రౌండ్ మురుగునీటి నెట్‌వర్క్, ఆధునిక పంపింగ్ - లిఫ్టింగ్ స్టేషన్లు, అత్యాధునిక శుద్ధి కేంద్రం – నీటి పునర్వినియోగం, రీసైక్లింగ్‌ చేయనున్నారు. 30 ఏళ్ల జనాభా వృద్ధి అవసరాలను దృష్టిలో పెట్టుకొని దీనిని డిజైన్ చేశారు. నీటి శుద్ధి వల్ల వ్యాధులు తగ్గడంతో పాటు, భూగర్భజలాలు కలుషితం కావు, పర్యావరణానికి మేలు చేస్తుంది. వరద నీటి నిర్వహణ సాధ్యమవుతుంది. ఈ ప్రాజెక్టు పరిధిలో నివసిస్తున్న రెండున్నర కోట్ల మందికి ఉపయోగకారిగా ఉంటుంది. ఈ ఒప్పందం ద్వారా భారతదేశంలో నగరాల ఆర్థిక స్వయంప్రతిపత్తికి కొత్త దారి చూపినట్టయ్యింది.

మూసీ పునరుజ్జీవ పనులను సీఎం రేవంత్‌ శ్రీకారం

  మూసీ పునరుజ్జీవ పనులను సీఎం రేవంత్‌రెడ్డి ప్రారంభించారు. ఉస్మాన్‌సాగర్‌ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్‌ 2, 3 ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీటిని  తరలించే ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేయాలని  నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీని ద్వారా ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ చెరువులను మంచినీటితో నింపనున్నారు. రూ.7,360 కోట్లతో హ్యామ్‌ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. రెండేళ్లలో గోదావరి ఫేజ్‌ 2, 3 పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.   ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో పాదయాత్ర చేసినప్పుడు మూసీ నదిని ప్రక్షాళన చేయాలని ప్రజలు చెప్పారని అన్నారు. సమస్యలు సృష్టించినా సమన్వయంతో ముందుకెళ్తున్నామన్నారు. తాగునీరు అందించేందుకు ఈ పథకం ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఎవరు అడ్డం వచ్చినా ఈ పథకం పూర్తి చేస్తామని సీఎం తెలిపారు. నల్గొండ ప్రజల కోసమే మూసీ ప్రక్షాళన చేస్తున్నాం. ఈ పథకం ద్వారా హైదరాబాద్‌ తాగునీటి సమస్య పరిష్కారమే కాకుండా, నల్గొండ ఫ్లోరైడ్‌ సమస్య తీరుతుంది. బీఆర్‌ఎస్ వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగింది.  మూసీ నది ప్రక్షాళన ఎందుకు జరగకూడదో చెప్పాలి. త్వరలో మహారాష్ట్రకు వెళ్లి అక్కడి ముఖ్యమంత్రిని కలుస్తా అని సీఎం రేవంత్‌ అన్నారు.

లేడీ డాన్ అరుణపై న్యాయవాది సంచలన వ్యాఖ్యలు

  రాష్ట్ర వ్యాప్తంగా ప్రకంపలు సృష్టించిన లేడీ డాన్ అరుణ కేసుకు సంబంధించి హైకోర్టు లాయర్ రాజారాం సంచలన వ్యాఖ్యలు చేశారు...నెల్లూరులోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పోలీసు అధికారికి ఆయన వినతిపత్రం అందజేశారు. అరుణ ఎస్సీ అని చెప్పుకొని అనేకమందిని బెదిరించి డబ్బులు వసూలు చేసేదని..అసాంఘిక కార్యకలాపాలకు అపార్ట్మెంట్ ని అడ్డాగ చేస్తుందని లాయర్ తెలిపారు.. అదే అపార్ట్మెంట్లో మూడో ఫ్లోర్లో తను నివాసం ఉంటున్నట్లు చెప్పుకొచ్చారు.. అరుణ ఆగడాలు మితిమీరి పోయాయని.. అనేక మంది బాధితులు ఇంకా రాలేక భయపడుతూనే ఉన్నారని తెలిపారు.. ఇటువంటి కిలాడి లేడి డాన్ అరుణను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు..  

టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్

తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేసింది. ఈయన స్థానంలో అనిల్ కుమార్ సింఘాల్ ను నియమించింది.  రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను బదలీ చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీటీడీ ఈవోగా ప్రస్తుతం ఉన్న శ్యామలరావును జీఏడీ ముఖ్య కార్యదర్శిగా నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ సోమవారం (సెప్టెంబర్ 8) ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా సీహెచ్ శ్రీధర్, రోడ్లు భవనాలు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కృష్ణబాబు, ఏపీ రెవెన్యూ, ఎక్సైజ్‌ ముఖ్య కార్యదర్శిగా ముఖేశ్‌కుమార్‌ మీనా, అటవీ, పర్యావరణశాఖ కార్యదర్శిగా కాంతిలాల్‌ దండేను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పరిశ్రమలు, కార్మిక శాఖ కమిషనర్‌గా శేషగిరిబాబు, కుటుంబ సంక్షేమశాఖ కార్యదర్శిగా సౌరభ్‌ గౌర్‌, గవర్నర్‌ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరామ్‌, ఏపీ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌గా ప్రవీణ్‌ కుమార్‌‌ నియమితులయ్యారు.  రెవెన్యూ (ఎండోమెంట్‌) కార్యదర్శిగా హరి జవహర్‌లాల్‌ను నియమించింది.  

గ‌ణేష్ ల‌డ్డూ.. నిజంగానే అంత ల‌క్కీనా?

1994లో  450 రూపాయలతో కొల‌ను మోహ‌న్ రెడ్డి బాలాపూర్ ల‌డ్డూను వేలం  పాట‌లో ద‌క్కించ‌డంతో మొద‌లైన గణపతి లడ్డూ వేలం. క్రేజ్ ఏటికేడు విపరీతంగా పెరిగిపోతోంది. వేలం పాటలో గణపతి లడ్డూ ధర పెరుగుతూనే వస్తోంది.  ఈ ఏడాది ద‌శ‌ర‌థ్ గౌడ్ అనే వ్య‌క్తి  వేలం పాటలో 35 ల‌క్ష‌ల రూపాయ‌ల‌కు బాలాపూర్ ల‌డ్డూని సొంతం చేసుకున్నారు. ఇదే రికార్డ్ ధ‌ర‌ అనుకుంటే మై హోం భూజా ల‌డ్డూ ఏకంగా  అరకోటి పైన.. అంటూ 51 ల‌క్ష‌ల రూపాయల ధ‌ర ప‌లికి బాలాపూర్ ను మించింది. అదే అనుకుంటే.. రిచ్ మండ్ విల్లాస్ వారి గణేష్ మండపంలో గణేష్ లడ్డూ వేలంలో ఏకంగా 2 కోట్ల 32 లక్షల రాపాయల ధర పలికి అన్ని రికార్డులనూ తుడిచి పెట్టేసి లడ్డూకా రాజా అనిపించుకుంది.  బేసిగ్గా ఇలాంటి ల‌డ్డూల‌ను కైవ‌సం చేసుకోవ‌డం ద్వారా  బాగా క‌ల‌సి వ‌స్తుంద‌ని, వచ్చిందని అంటారు   ల‌డ్డూ విన్న‌ర్స్.  అంతే కాదు కొంద‌రైతే ఈ ల‌డ్డూ పొడిని త‌మ పొలాల్లో చ‌ల్ల‌డం వ‌ల్ల పంటదిగుబడి ఎక్కువగా వచ్చిందని, వస్తుందని విశ్వసిస్తారు.   మైహోం భూజా ల‌డ్డూ వేలం పాడిన గ‌ణేష్ అనే వ్య‌క్తి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారి. ఆయ‌న ఈ వేలం ద‌క్కించుకోవ‌డం ఇది రెండో సారి. ఆయ‌నేమంటారంటే ల‌డ్డూను వేలంలో దక్కించుకున్న తరువాత తనకు వ్యాపారంలొ బాగా క‌లిసి వ‌చ్చిందని, అందుకే రెండో సారి కూడా వేలంలో గణేష్ లడ్డూని దక్కించుకున్నానని చెప్పారు.   రిచ్ మండ్ ల‌డ్డూ వేలం ద్వారా వ‌చ్చిన సొమ్ము పేద పిల్ల‌ల చ‌దువుల కోసం వాడుతామ‌ని అంటారు ఈ గణేష్ మండ‌ప నిర్వాహ‌కులు. ఇవి పెద్ద ఎత్తున ధ‌ర ప‌లికిన ల‌డ్డూలు కాబ‌ట్టి వీటి పేరు వెలుగులోకి వ‌చ్చింది. రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఇలాంటి ల‌డ్డూ వేలం వార్త‌లు చాలానే ఉన్నాయ్. అంతెందుకూ.. విదేశాల్లో తెలుగు సంఘాల వారు ఏర్పాటు చేసే గణేష్ మండపాలలో కూడా ల‌డ్డూ వేలం   జ‌రుగుతూ ఉంటుంది. ల‌డ్డూ వేలంలో  ఇటు భ‌క్తి అటు సెంటిమెంటు క‌ల‌గ‌ల‌సి క‌నిపిస్తుంది. అంతే కాదు దీని ద్వారా ఇటు పేరుకు పేరు అటు అదృష్టానికి అదృష్టంగా భావిస్తుంటారు.. ఈ వేలం పాట‌ల్లో పాల్గొనేవారు.

మహిళలకు రేవంతన్న కానుక రెండు చీరలు.. ఎప్పుడంటే?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలకు కానుక అందించనున్నారు. స్వయం సేవక సంఘాల మహిళలకు ఈ కానుక అందించనున్నారు. బతుకమ్మ పండుగకు ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా 'అక్కా-చెల్లెళ్లకు మీ రేవంతన్న కానుక' పేరిట చేనేత చీరల పంపిణీకి ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.   ఈ నెల 21వ తేదీ నుంచి రాష్ట్రంలో బతుకమ్మ పండుగ సంబరాలు మొదలు కానున్న నేపథ్యంలో.. కాంగ్రెస్​ ప్రభుత్వం  స్వయం సహాయక సంఘాల్లోని సభ్యులకు రెండేసి చీరల చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. మెప్మా ద్వారా నగరపాలక, పురపాలక సంఘాల పరిధిలోని సభ్యుల వివరాలు, డీఆర్డీవో ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రాంతాల్లోని సభ్యుల వివరాలు సేకరించాలని ప్రభుత్వం ఇప్పటికే  ఆదేశాలు జారీ చేసింది.  ఈ నెల 15 నాటికి ఈ చీరలు ఆయా జిల్లాల కేంద్రాలకు చేరనున్నాయి.   

నన్నే మోసం చేసింది!.. భార్య రేణుకపై ఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసులు రెడ్డి ఆరోపణ

  కట్టుకున్న భార్యే తనను మోసం చేసిందనీ, అంతే కాకుండా తనపై హత్యాయత్నానికి ఒడికట్టందనీ ఒక ఐఎఫ్ఎస్ అధికారి వాపోతున్నారు. వివరాల్లోకి వెడితే.. ఐఎఫ్ఎస్ అధికారి శ్రీనివాసులరెడ్డి నెల్లూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తన భార్య రేణుకపై ఆరోపణలు గుప్పించారు. మరొకరితో సన్నిహితంగా ఉండటమే కాకుండా, డబ్బుపై ఆశతో తనను అడ్డు తొలగించుకోవాలన్న ఉద్దేశంతో తనపై హత్యాయత్నం చేసిందని ఆరోపించారు.  తన భార్య రేణకతో  వివాదం, ఆమె తనను హత్య చేసేందుకు పన్నిన పన్నాగం, మరొకరితో సన్నిహితంగా ఉన్న వైనాన్ని శ్రీనివాసులు రెడ్డి  వివరించారు. పాక్షిక అంధుడినని చెప్పిన ఆయన తాను రేణుకను వివాహం చేసుకున్నాననీ, తమకు ఇద్దరు పిల్లలనీ తెలిపారు. వృత్తిరీత్యా  తాను సుదూర ప్రాంతాల్లో ఉండాల్సి వచ్చేదన్నారు. ఈ క్రమంలో తన భార్య రేణుక మరోకరితో సన్నిహితంగా ఉన్నట్లు తెలిసిందని చెప్పారు. అందుకు సంబంధించి ఫోన్ రికార్డులు, ఫోన్ పే లు చేసిన ఆధారాలు, అదేవిధంగా మరొకరితో సన్నితంగా ఉన్నట్లు ప్రత్యక్షంగా చూసినవారు తనకు చెప్పడంతో  చాలా ఆవేదన చెందానని చెప్పిన శ్రీనివాసులు రెడ్డి..  ఈ విషయంలో ఏర్పడిన వివాదానికి సంబంధించి కోర్టులో కేసు నడుస్తోందన్నారు.  ఈ క్రమంలో రేణుక  మీడియా సమావేశం ఏర్పాటు చేసి తనపై మీడియాకు లేనిపోనివన్నీ చెప్పారని, అది మంచి పద్ధతి కాదని అన్నారు.  కోర్టులో కేస్ నడుస్తుండగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆమె మాటలను ఖండిస్తూ వాస్తవాలను తెలియజేసేందుకే తాను ఇప్పుడు మాట్లాడుతున్నానన్న శ్రీనివాసులు రెడ్డి తన స్వఅర్జితమైన నివాసంలోనే ఉంటూ తన భార్య తనపై హత్యాయత్నానికి ప్రయత్నించిందంటూ సాక్షాదారాలతో మీడియాకు చెప్పారు. గౌరవప్రదమైన వృత్తిలో ఉంటున్న తనను అవమానపరిచే విధంగా మాట్లాడిన రేణుకపై చర్యలు తీసుకోవాలంటూ కోరారు. ఇదిలా ఉంటే శ్రీనివాసులు రెడ్డి పెట్టిన ప్రెస్ మీట్ ఆధ్యాంతం అతన్ని మాట్లాడనీయకుండా రేణుక అడ్డుకోవడం ఇబ్బందికరంగా మారింది.

చర్లపల్లి డ్రగ్స్ కేసులో వెలుగులోకి కీలక విషయాలు

  చర్లపల్లి డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మహారాష్ట్ర తానే క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చే చర్లపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎండి కంపెనీపై రైడ్ చేసి 12 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుండి... కొన్ని కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ కేసులో కంపెనీ యజమాని శ్రీనివాస్ విజయ్ ఓలేటినీ పోలీసులు అరెస్టు చేసి అతని చరిత్ర పై ఆరాతీస్తున్నారు. ఎండి డ్రగ్స్ కంపెనీ యజమాని విజయ్ ఓలేటి గతంలో జీవికే బయో సైన్స్ లో 12 సంవత్స రాల పాటు కెమికల్ అనాలసిస్‌గా పనిచేశాడు. ఐదు సంవత్సరాల క్రితం జీవికే బయోసైన్స్ నుంచి బయటికి వచ్చిన విజయ్ ఓలేటి కెమికల్ తయారీ కంపెనీ తో పాటు సాఫ్ట్వేర్ కంపెనీ ఏర్పాటు చేశాడు. అయితే సింథటిక్ డ్రగ్స్ తయారు చేయడం లో విజయ్ ఓలేటి దిట్ట...మహారాష్ట్ర చెందిన తానాజీ తో కలిసి విజయ్ వాగ్దేవి ఫార్మా కంపెనీ ఏర్పాటు చేసి... చర్లపల్లి లో డ్రగ్స్ రా మెటీరియల్ తయారు చేసి నాచారంలో డ్రగ్స్ తయారు చేసేవాడు..తానాజీ తో కలిసి విజయ్ ఐదేళ్లుగా సింథటిక్ డ్రగ్స్ తయారు చేస్తు న్నాడు. అయితే విజయ్ అతి కొద్ది మంది సిబ్బంది తో మాత్రమే కంపెనీని నడపించడమే కాకుండా అది కూడా కేవలం రాత్రిపూట మాత్రమే నడిపేవారు.  ఆ విధంగా తయారు చేసిన సింథటిక్ డ్రగ్స్ ను పోలీసుల కంట పడకుండా వివిధ మార్గాల ద్వారా మన దేశం తో పాటు విదేశా లకు సరఫరా చేసేవాడు. విజయ్  ముందుగా అత్యంత ప్రమాదక రమైన మెఫీడిన్  డ్రగ్ తయారు చేశాడు. అనంతరం మెఫీడిన్  డ్రగ్ నుంచి ఎక్సెసి, మోలీ ,xtc, MDMA  మొదలగు నాలుగు రకాల డ్రగ్స్ లను తయారు చేసి ముంబై, గోవా, బెంగళూరులకు రహస్యం గా వివిధ వస్తువుల మాటున తరలించేవారు. అయితే ఈ విధంగా తయారు చేసిన డ్రగ్స్ ని దేశ విదేశా లకు సరఫరా చేసేందుకు విజయ్ ఒక గ్యాంగ్ ని కూడా ఏర్పాటు చేసుకున్నాడు.  అంతేకాకుండా డ్రగ్స్ కంపెనీ యజమాని విజయ్ కి ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా తో కూడా సంబంధాలు ఉన్నట్లుగా పోలీ సులు గుర్తించారు. ఈ విధంగా తయారు చేసిన డ్రగ్స్ ని విజయ్ మొదటగా హైదరా బాదులో అమ్మి అనంతరం విదేశాలకు సరఫరా చేసేవాడు. ప్రతిసారి ఐదు కేజీల చొప్పున మెపిడ్రిన్ అమ్మే వాడు. ఒక్కొక్క కేజీ 50 లక్షల రూపా యల చొప్పున అమ్మేవాడు. ఈ విధంగా నాచారం, చర్లపల్లిలో డ్రగ్స్ తయారుచేసి దర్జాగా విక్ర యాలు చేసేవాడు. ప్రతిసారి డ్రగ్స్ కు 50 లక్షల తీసుకున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పూర్తి ఆధారాలు సేకరించిన ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు హైదరాబాద్ నగరానికి వచ్చి నాచారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఎండి డ్రగ్స్ కంపెనీ పై సోదాలు చేసి... కంపెనీ యజమాని విజయ్ ఓలేటి, తానాజీ లతో పాటు మరో 10 మందిని అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు.  అయితే గతంలో డ్రగ్స్ తయారు చేస్తు న్నట్లుగా గుర్తించిన తెలంగాణ నార్కో టిక్ బృందం డ్రగ్స్ తయారీపై విజయ్ కి నోటీ సులు ఇవ్వడం జరిగింది. అయితే ఈ విష యంపై విజయ్ కోర్టు ను ఆశ్రయించారు. అయితే బంగ్లాదేశ్ కి చెందిన ఓ మహిళ పట్టుబ డడంతో హైదరా బాద్ చర్లపల్లి లో డ్రగ్స్ కంపెనీ వ్యవహారం కాస్త బట్టబయలు అయింది. చర్ల పల్లి వాగ్దేవి ల్యాబ్స్ లో రూ.11. 58 కోట్లు విలువైన మెఫిడ్రిన్ తయారీ చేస్తున్నారు. 35,500 లీటర్లు రసాయ నాలు, 950 కిలోల ముడి పదార్థాలు స్వాదీనం చేసుకున్నారు. వాగ్దేవి ల్యాబ్స్ యజమాని శ్రీనివాస్ విజయ్, సహాయకుడు తానాజీ పండరినాథ్ అరెస్ట్ చేసి...ఇద్దరిని నిందితులను ట్రాన్సిట్ వారెంట్ తో ముంబై కి తరలించారు.

తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

  చంద్రగ్రహణం నేపథ్యంలో తిరుమల శ్రీవారి ఆలయాన్ని టీటీడీ అధికారులు మూసివేశారు. ఆదివారం నాడు ఏకాంత సేవ ముగిసిన వెంటనే, ఆగమశాస్త్ర సంప్రదాయం ప్రకారం ఆలయానికి తాళాలు వేశారు. సన్నిధి గొల్ల బంగారు వాకిలికి తాళం వేయడంతో ఆలయ మూసివేత ప్రక్రియ పూర్తయింది. ఈ ప్రభావంతో సుమారు 12 గంటలకు పైగా శ్రీవారి దర్శనాలు పూర్తిగా నిలిచిపోనున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం  వెల్లడించిన వివరాల ప్రకారం, సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఆలయాన్ని తిరిగి తెరుస్తారు.  అనంతరం ఆలయంలో శుద్ధి, పుణ్యాహవచనం వంటి సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆ తర్వాత శ్రీవారికి నిర్వహించే నిత్య సేవలను ఏకాంతంగా పూర్తి చేసి, భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. సర్వదర్శనం కోసం వచ్చే భక్తులను సోమవారం వేకువజామున 2 గంటల నుంచి క్యూలైన్లలోకి అనుమతించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు.  శ్రీవారి ఆలయంతో పాటు తిరుమలలోని ఇతర ఉప ఆలయాలను కూడా మూసివేశారు. అంతేకాకుండా, భక్తులకు నిరంతరం సేవలు అందించే లడ్డూ ప్రసాదాల కౌంటర్లు, అన్నప్రసాద కేంద్రాలను కూడా గ్రహణం ముగిసే వరకు మూసివేస్తున్నట్లు ప్రకటించారు. చంద్ర గ్రహణం కారణంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ ముందుజాగ్రత్త చర్యలు చేపట్టింది. సుమారు 50 వేల పులిహోర ప్యాకెట్లు, బిస్కెట్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచింది. కాగా, ఆదివారం శ్రీవారిని 27,525 మంది భక్తులు దర్శించుకున్నట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. చంద్రగ్రహణం కారణంగా శ్రీశైలం మల్లన్న, ఒంటిమిట్ట కోదండరామస్వామి, భద్రాచలం సీతారామచంద్రస్వామి, సింహాచలం అప్పన్న, బెజవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ ఆలయం సహా తెలుగు రాష్ట్రాల్లోని దేవాలయాలన్ని  మూతపడ్డాయి.  

ఎట్టకేలకు 13న మణిపుర్‌కు ప్రధాని!

  ప్రధాని మోదీ మణిపూర్‌లో పర్యటించే అవకాశం ఉంది. ఈ నెల 13 లేదా 14న అక్కడ పర్యటిస్తారని తెలుస్తోంది.  ప్రధాని పర్యటనకు సంబంధించి మణిపూర్‌ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాతో బీజేపీ నేతలు చర్చిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. కాగా మణిపూర్ అల్లర్ల చెలరేగినప్పటి నుంచి ప్రధాని ఆ రాష్ట్రంలో పర్యటించలేదు. 2023 మే నెలలో మణిపూర్‌లో కుకీ, మైతీ తెగల మధ్య హింస చెలరేగిన సంగతి తెలిసిందే. మణిపూర్‌లో శాంతి పునరుద్ధరణకు రెండు ప్రముఖ కుకీ-జో గ్రూపులతో ప్రభుత్వం  ఒప్పందం చేసుకుంది.  మణిపూర్‌ ప్రాదేశిక సమగ్రతను కొనసాగించడం, దుర్బల ప్రాంతాల నుంచి శిబిరాలను తరలించడం, రాష్ట్రంలో శాంతి-స్థిరత్వం పునరుద్ధరణ కోసం కలిసి పనిచేయడానికి అంగీకరించిన నిబంధనలు, షరతులను ఒప్పందంలో పొందుపరిచారు. ఒప్పందంపై కేఎన్‌వో(కుకీ నేషనల్‌ ఆర్గనైజేషన్‌), యూపీఎ్‌ఫ(యునైటెడ్‌ పీపుల్స్‌ ఫ్రంట్‌) సంతకాలు చేశాయి. కేంద్ర హోంశాఖ, మణిపుర్‌ ప్రభుత్వం, కేఎన్‌వో, యూపీఎఫ్‌ ప్రతినిధులు  ఢిల్లీలో సమావేశమై ఈ మేరకు ఒప్పందం చేసుకున్నారు.