మత్తు పదార్థాల గుర్తింపులో జాగిలాల పనితీరు అద్భుతం : హోం మంత్రి అనిత
posted on Sep 2, 2025 @ 4:43PM
మత్తు పదార్ధాల గుర్తింపులో శిక్షణ పొందిన జాగిలాల పనితీరు అద్భుతంగా ఉందని హోంమంత్రి అనిత అన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా మారుస్తున్నామని అన్నారు. యువత మత్తుపదార్థాలకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని చెప్పుకొచ్చారు. ఇవాళ గుంటూరు జిల్లాలోని ఆరో బెటాలియన్ ప్రాంగణంలో 22వ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ జరిగింది. ఈ కార్యక్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, పలువురు ఐపీఎస్ అధికారులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 31వ పోలీసు జాగిలాల ప్రదర్శన, విన్యాసాలు ఆకట్టుకున్నాయి.
శిక్షణలో ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి అందజేశారు. ప్రథమ స్థానం నెల్లూరు జిల్లాకు చెందిన సుబ్రహ్మణ్యం దక్కించుకున్నారు. రెండో స్థానంలో పల్నాడు అశోక్, గుంటూరు జిల్లాకు చెందిన వేణుబాబు సాధించారు. తృతీయ స్థానంలో రాజమండ్రికి చెందిన శివకుమార్ దక్కించుకున్నారు. జాగిలాల ప్రదర్శన, వాటి క్రమ శిక్షణ చూస్తే ఆశ్చర్యం కలిగిందని పేర్కొన్నారు. మూగ జీవాలతో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ జాగిలాల వల్ల ఎన్నో కేసులు ఛేదించిన సందర్భాలు ఉన్నాయని గుర్తుచేశారు.
ఎక్కడ నేరం జరిగినా... డాగ్ స్క్వాడ్ రాలేదా అని ప్రజలే అడుగుతారని అన్నారు. ప్రతి జాగిలానికి రెండు అంశాల్లో శిక్షణ ఇవ్వడం ఇదే తొలిసారని చెప్పుకొచ్చారు.మందుగుండు, డ్రగ్స్, గంజాయి, ఎర్రచందనం ఏదైనా ఎక్కడ దాచినా గుర్తించేలా జాగిలాలకు ప్రత్యేక శిక్షణ ఇచ్చారని తెలిపారు హోంమంత్రి అనిత. నేటికీ అప్పా అనేది మనం కేటాయించుకోలేక పోయామని హోంమంత్రి అనిత వెల్లడించారు. వంద ఎకరాల్లో అప్పా నిర్మాణం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు.
కొత్తగా వచ్చే పోలీసు సిబ్బందికి సాంకేతిక పరిజ్ఞానం పైన కూడా శిక్షణ ఇస్తున్నారని వివరించారు. నేర పరిశోధనలో, ప్రజల శ్రేయస్సులో కూడా పోలీసు జాగిలాలది కీలకపాత్రని ఉద్ఘాటించారు. గతంలో రేపల్లెలో అత్యాచారం జరిగిన కేసులో ఎలాంటి ఆధారం దొరకలేదని చెప్పుకొచ్చారు. డాగ్ స్క్వాడ్ వచ్చి ఆనవాళ్లు గుర్తించాక 36 గంటల్లో నిందితులను పట్టుకున్నారని గుర్తుచేశారు. పోలీసు జాగిలాల శిక్షణతోపాటు, వాటి సంరక్షణపైనా ప్రత్యేక దృష్టి పెట్టాలని హోంమంత్రి అనిత సూచించారు.