పాతబస్తీలో రూ. 400 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

  పాత బస్తీలో గ‌జం ఖాళీ జాగా లేకుండా ల‌క్ష‌లాది నివాసాలున్న చోట‌.. ఏకంగా 7 ఎక‌రాల‌ను ఓ ప్ర‌బుద్ధుడు క‌బ్జా చేస్తే.. ఆ భూమిని హైడ్రా శుక్ర‌వారం కాపాడింది. పోలీసు స్టేష‌న్లో కేసుల‌కు వెర‌వ‌కుండా.. కోర్టు ఫైన్లు కూడా ప‌ట్టించుకోకుండా.. చుట్టూ ఇనుప రేకుల‌తో లోప‌ల ఏం జ‌రుగుతుందో తెలియ‌కుండా ప్ర‌హ‌రీ నిర్మించి.. ఆక్ర‌మ‌ణ‌లో ఉన్నవారిని హైడ్రా ఖాళీ చేయించింది. రెవెన్యూ అధికారుల స‌మ‌క్షంలో.. పోలీసు బందోబ‌స్తు మ‌ధ్య ఇనుప రేకుల ప్ర‌హ‌రీని తొల‌గించి.. అక్క‌డ హైడ్రా ఫెన్సింగ్  ఏర్పాటు చేసింది.   ప్ర‌భుత్వ భూమిగా వివరాలు పేర్కొంటూ హైడ్రా బోర్డులు పెట్టింది.  దీంతో అక్క‌డి స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. జ‌నాభా ఎక్కువ‌గా ఉన్న పాత‌బ‌స్తీలో గ‌జం జాగా దొర‌క‌ని ప్రాంతంలో ఏకంగా 7 ఎక‌రాల ప్ర‌భుత్వ భూమి ఉండ‌డం ప‌ట్ల స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. హైడ్రా శుక్ర‌వారం కాపాడిన 7 ఎక‌రాల భూమి విలువ దాదాపు రూ. 400 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని అధికారులు అంచ‌నా వేశారు. క‌బ్జాదారులు మాయం చేసిన చెరువుతో పాటు.. నాలాల‌ను పున‌రుద్ధ‌రిస్తే బ‌మృక్‌నుద్దౌలా మాదిరి ఆహ్లాద‌క‌ర వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతుంద‌ని చెబుతున్నారు.  కేసులున్నా వెర‌వ‌ని క‌బ్జాదారులు. హైదరాబాద్ జిల్లా బండ్లగూడ మండలం కందికల్ విలేజ్‌లోని మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతం, రైల్వే ట్రాక్ సమీపంలో టౌన్ సర్వే నంబర్ 28, బ్లాక్:ఎఫ్, వార్డు నంబర్ 274లో మొత్తం 9.11 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇప్పటికే 2 ఎకరాలు కబ్జా అయి.. నివాసాలు వచ్చేశాయి. ఆ నివాసాల జోలికి వెళ్లకుండా కబ్జాలో ఉన్న 7 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది.  సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్స్ ప్రకారం అక్క‌డ చెరువు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది.  కాని ఆ చెరువు ఆన‌వాళ్లు ఎక్క‌డా లేకుండా మ‌ట్టితో క‌బ్జాదారులు క‌ప్పేశారు. ఈ  భూమిని కబ్జా చేసి తనదంటూ ఆర్. వెంకటేష్ కుటుంబ సభ్యులు మరియు ఇతరులు పోరాడుతున్నారు. వీరి పై భవానిపురం పోలీసు స్టేష‌న్‌లో రెవెన్యూ అధికారులు కేసులు కూడా పెట్టారు.  ఇప్పుడు ఆయ‌న వార‌సులు ఒక ప‌క్క‌న ఈ భూమి త‌మ‌దంటూ చెబుతుండ‌గా.. వారి వ‌ద్ద నుంచి ప‌ట్టాభి రామి రెడ్డి కొన్నానంటూ మ‌రోవైపు క‌బ్జాలో భాగ‌స్వామ్యం అయ్యాడు.  ఈ మేర‌కు కోర్టులో కేసు కూడా వేశాడు.  అయితే ప్ర‌భుత్వ భూమిని ఏ ప్రాతిప‌దిక‌న త‌న‌దిగా చెప్పుకుంటార‌ని.. కోర్టు స‌మ‌యం వృథా చేసినందుకు కోటి రూపాయ‌లు ఫైన్ కూడా వేసింది.  అయినా క‌బ్జాదారులు ఖాళీ చేయ‌కుండా  కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు.   స్థానికుల హ‌ర్షం.. మొహమ్మద్‌నగర్ – లాలితాబాగ్ ప్రాంతంలో, రైల్వే ట్రాక్ సమీపంలో ప్రభుత్వ భూమితో పాటు నాలా, కుంట ను క‌బ్జా దారుల చెర‌ నుంచి విముక్తి క‌ల్పించిన హైడ్రాకు స్థానికులు ధ‌న్య‌వాదాలు తెలిపారు.  హైడ్రాకు ఫిర్యాదు చేయ‌గానే.. స్థానికంగా విచారించి.. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డాన్ని కుమ్మరి వాడి పీస్ వెల్ఫేర్ సొసైటీ ప్ర‌తినిధులు ఆనందం వ్య‌క్తం చేశారు.  రెండు కమ్యూనిటీల మధ్య ఉన్న సున్నితమైన ప్రాంతంలో క‌బ్జాల‌కు పాల్ప‌డిన వారు ప్లాట్లుగా మార్చి అమ్మేందుకు ప్ర‌య‌త్నించ‌డం వివాదంగా మారింది. వీరి వెనుక బ‌డాబాబుబులున్నారంటూ ఫిర్యాదు దారులు పేర్కొన్నారు. ఈ అక్రమ ఆక్రమణలపై గతంలోనే బండ్లగూడ తహసీల్దార్, పోలీసు శాఖలకు పలుమార్లు ఫిర్యాదు చేశారు. కోర్టులు కూడా ప్రభుత్వ భూమి అని స్పష్టంగా తీర్పులు ఇచ్చినప్పటికీ కబ్జాదారులు ఖాళీ చేయ‌కుండా ప్లాట్లు చేసి అమ్ముకోవాల‌ని ప్ర‌య‌త్నించ‌డం ఆందోళన కలిగించే అంశమని పేర్కొన్నారు. అటువైపు ఎవ‌రూ వెళ్ల‌డానికి వీలు లేకుండా చేశారంటూ వాపోయారు. హైడ్రా కమిషనర్ ఏ.వి. రంగనాథ్ ఐపీఎస్‌కి అభినంద‌న‌లు తెలిపారు. ఆక్రమణదారులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని.. అక్క‌డ నాలాతో పాటు.. చెరువును పున‌రుద్ధ‌రిస్తే పాత‌బ‌స్తీలో చాలా ప్రాంతాల‌కు వ‌ర‌ద ముప్పు త‌ప్పుతుంద‌ని స్థానికులు పేర్కొన్నారు.  

41 మంది మావోయిస్టులు సరెండర్

  మావోయిస్టులుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి  ఎదుట  41 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ముగ్గురు రాష్ట్ర నాయకులతో పాటు ఛత్తీస్ గఢ్ కు చెందిన మావోయిస్టులు సరెండర్ అయినారు. లొంగిపోయిన వారిలో హిడ్మా బెటాలియన్ కమాండర్స్ ఉన్నారు. సరెండర్ అయిన మావోయిస్టుల నుంచి 24 ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  లొంగిపోయిన వారిలో కామారెడ్డికి చెందిన రాష్ట్ర కమిటీ కార్యదర్శి ఎర్రగొల్ల రవి ఎలియాస్‌ సంతోష్‌, మంచిర్యాలకు చెందిన కనికారపు ప్రభంజన్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఆరుగురు డివిజన్‌ కమిటీ సభ్యులు, ఇద్దరు సెంట్రల్‌ విజన్‌ కమాండర్లు ఉన్నారు. మిగతా మావోయిస్టులంతా ఛత్తీస్‌గఢ్‌కు చెందినవారిగా డీజీపీ శివధర్‌రెడ్డి పేర్కొన్నారు. 

వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి.. కేటీఆర్ కు ముళ్ల కిరీటమేనా?

క‌మ్యూనిస్టుల‌కు  ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి అనే ప‌ద‌వి ఎంత  ప‌వ‌ర్ ఫుల్లో.. బీఆర్ఎస్ వంటి పార్టీల‌కు వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ ప‌ద‌వి అంటే అంత వేల్యుబుల్.  అయితే బీఆర్ఎస్ లో సమస్య ఏమిటంటే.. పార్టీ అధినేత కేసీఆర్ త‌ర్వాత అంత‌టి వాడిగా.. ఆయన పొలిటిక్ వారసుడిగా కేటీఆర్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టారు. అయితే ఆయన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత జరిగిన ఏ ఎన్నికలోనూ పార్టీ విజయాన్ని నమోదు చేసింది లేదు. నల్లేరు మీద బండినడక అనదగ్గ ఎన్నికలలో కూడా బీఆర్ఎస్ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇదే విషయాన్ని ఎత్తి చూపుతూ కేటీఆర్ నాయకత్వంపై విమర్శలు గుప్పించారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి.  వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఉన్నంత కాలం బీఆర్ఎస్ పరాజయాలను ఎదుర్కొంటూనే ఉంటుందన్నారు.  వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ఎంపికైన నాటి  నుంచి ఇప్ప‌టి  వ‌ర‌కూ   గ్రేట‌ర్, కార్పొరేషన్, ఆ తరువాత 2023 అసెంబ్లీ ఎన్నికలు, 2024 సార్వత్రిక ఎన్నికలు, ఇవి రెండూ పూర్తయిన తరువాత  రెండు ఉప ఎన్నికలు, తాజాగా పంచాయతీ ఎన్నికలు జరిగాయి. అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఈ అన్ని ఎన్నికలలోనూ ఆయన ప్రచార బాధ్యతను భుజాన వేసుకుని పని చేశారు. అయితే వేటిలోనూ పార్టీని విజయం దిశగా నడిపించలేకపోయారు.  దుబ్బాక నుంచి మొద‌లు పెడితే నిన్న మొన్న‌టి  జూబ్లీహిల్స్ బై పోల్ వ‌ర‌కూ ప్ర‌తి ఎన్నికలోనూ పార్టీని పరాజయమే వరించింది.  ఇటీవ‌లి స్థానిక ఎన్నిక‌ల‌లోనూ కేటీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ ఓటమినే మూటగట్టుకుంది.   రేవంత్  విమర్శలను పక్కన పెడితే..  కేటీఆర్ కి కానీ,  బీఆర్ఎస్ కి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి అచ్చిరాలేదన్న ప్రచారం బీఆర్ఎస్ శ్రేణుల్లోనే జోరుగా సాగుతోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం తరువాత తొమ్మిదేళ్ల పాటు బీఆర్ఎస్ అధికారంలో ఉండగా కేటీఆర్ సమర్ధ నాయకుడిగా గుర్తింపు పొందడం వెనుక తండ్రి ఇమేజ్ ఉంది. సీఎం కుమారుడిగా, మంత్రిగా ఆయన మాటే వేదంగా అప్పట్లో ప్రభుత్వ, పార్టీ వ్యవహారాలు సాగాయి. అయితే ఆ ఘనత అంతా కేసీఆర్ దేనని అంటారు విమర్శకులు. ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తరువాత.. ముందుండి పార్టీని నడిపించడంలో కేటీఆర్ వైఫల్యాలు ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో సొంత పార్టీలోనే కేటీఆర్ నాయకత్వంపై సందేహాలు, అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయనడం ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.  ఎన్నికలలో వరుస పరాజయాలతో వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఆయన కొనసాగింపుపైనా బీఆర్ఎస్ లో అభ్యంతరాలు వ్యక్తం అవుతున్న పరిస్థితి.  అయినా బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలలో కూడా కార్యనిర్వాహక అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న వారు ఉన్నారు. కానీ వారి విషయంలో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిపై ఈ స్థాయి చర్చ జరగడం లేదు. ఒక్క కేటీఆర్ విషయంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన సామర్థ్యం, అర్హతపై రాజకీయ ప్రత్యర్థలు నుంచే కాదు, బీఆర్ఎస్ శ్రేణులు, నేతల నుంచి కూడా ప్రశ్నలు ఎదురౌతున్నాయి. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..  కేటీఆర్  పార్టీకి వ‌ర్కింగ్ ప్రెసిడెంట్  గా  ఉన్నన్ని రోజులూ బీఆర్ఎస్ గెలుపు అన్న మాటను మరచిపోవడం మంచిదన్న సూచన చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతే కాదు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ కీలక నేత హరీష్ రావే సోషల్ మీడియాలో పదె్ద ఎత్తున క్యాంపెయిన్ చేస్తున్నారని వ్యాఖ్యానించారు.  చూడాలి మరి వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ ముందు ముందు ఎలా నెట్టుకుని, నెగ్గుకుని వస్తారో?

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో సీఎం చంద్రబాబు భేటీ

  ఢిల్లీలో  సీఎం చంద్రబాబు  పర్యటన కొనసాగుతుంది.  కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతరామన్‌తో ముఖ్యమంత్రి సమావేశం అయ్యారు. పూర్వోదయం ద్వారా ఏపీని గ్రోత్ ఇంజన్‌గా మర్చేందుకు, రాయలసీమను హర్టీకల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని కేంద్రమంత్రిని చంద్రబాబు కోరారు. పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్టుకు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు రానున్న మూడేళ్లలో రూ.41 వేల కోట్ల ఆర్థిక సహాయం అవసరమని, దీని కోసం వచ్చే బడ్జెట్‌లో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని చంద్రబాబు కోరారు.  అలాగే కరవు పీడిత ప్రాంతాలైన రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాల సాగు, తాగునీటి అవసరాలు తీర్చేందుకు గోదావరి వరద జలాలను తరలించే పోలవరం-నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ఆర్థిక చేయూత అందించాలని విజ్ఞప్తి చేశారు. సాస్కీ పథకం కింద పెండింగ్‌లో ఉన్న యూనిటీ మాల్, గండికోట పర్యాటక ప్రాజెక్టులతో పాటు, కొత్త మౌలిక సదుపాయాల కల్పన కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.10,054 కోట్లు మంజూరు చేయాలని వినతి పత్రం సమర్పించారు.  కేంద్ర పోర్టులు, షిప్పింగ్, జలరవాణా మంత్రి సర్బానంద సోనోవాల్‌తో రా చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. దుగరాజపట్నం షిప్‌బిల్డింగ్ క్లస్టర్, ఫిషింగ్ హార్బర్లకు కేంద్ర సాయంపై చర్చించారు. దేశంలో నౌకాశ్రయాలు, నౌకా నిర్మాణ రంగ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాలకు కృతజ్ఞతలు తెలిపారు. మత్స్యకారుల జీవనోపాధి మెరుగుదల కోసం ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని ప్రతిష్ఠాత్మకంగా చేపట్టామని, ఫేజ్–1లో చేపట్టిన నాలుగు ఫిషింగ్ హార్బర్లకు అదనపు నిధులు కేటాయించాలని కోరారు. ప్రకాశం జిల్లా ఓడరేవు ఫిషింగ్ హార్బర్ నిర్మాణానికి సాగరమాల పథకం కింద రూ.150 కోట్లు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు  

సీఎం లోకేష్.. ముహూర్తం ఫిక్సైందా?

లోకేష్ ని 2027 ఉగాది నాటిక‌ల్లా  ముఖ్య‌మంత్రిని చేసే దిశ‌గా  కొన్ని  పావులు క‌దులుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. లోకేష్ ఢిల్లీ వెళ్లి మోడీ క‌లిసిన‌పుడు జ‌రిగే  ప్ర‌ధాన  చ‌ర్చ ఇదేనంటారు చాలా మంది. ఇటు ఢిల్లీ, అటు నాగ్ పూర్ వ‌ర్గాల స‌మాచారాన్ని బ‌ట్టి చూస్తే ఇదే జ‌ర‌గ‌వ‌చ్చ‌న్న అభిప్రాయం పరిశీలకుల్లో సైతం వ్యక్తం అవుతోంది.  ఏపీలో ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంలో  నంబర్ 1, 2,  3 అంటూ హైరాక్కీని బట్టి చూస్తే లోకేష్ మూడో స్థానంలో ఉన్నారు. జనసేనాని, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తరువాత రెండో స్థానంలో ఉన్నారని చెప్పాల్సి ఉంటుంది.  అయితే ఈ హైరాక్కీని దాటి   త్వ‌ర‌లో  లోకేష్ కి ముఖ్య‌మంత్రి ప‌ద‌విని అప్ప‌గించేందుకు గ్రౌండ్ వర్క్ జరుగుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్తం అవుతున్నాయి. లోకేష్ కు సీఎం పదవి విషయంలో కేంద్రంలోని ఎన్డీయే కూటమి అగ్రనాయకత్వం సుముఖంగా ఉందంటున్నారు. ఈ విషయంలో పవన్ కల్యాణ్ నుంచి కూడా ఎటువంటి అభ్యంతరం వ్యక్తం కావడం లేదంటున్నారు పరిశీలకులు. సీఎం పదవి కోసం పవన్ తొందరపడటం లేదనీ, ఆయన తన పాతికేళ్ల పొలిటికల్ కేరీర్ లు ప్లాన్ చేసుకుని ముందుకు సాగుతున్నారని చెబుతున్నారు.   అన్నిటికీ మించి లోకేష్ కు సీఎం పట్టాభిషేకం చేయడానికి నంబర్స్ కూడా బలంగా ఉన్నాయి. రాష్ట్ర అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీకి మ్యాజిక్ ఫిగర్ కు మించిన సంఖ్యా బలం ఉంది. ఇక కూటమి ఐక్యత విషయానికి వస్తే.. పవన్ కు కూటమి అవసరమా? కూటమికి పవన్ అవసరమా? అన్న ప్రశ్నే తలెత్తే పరిస్థితి లేదు. పవన్ కల్యాణ్ కూటమి పటిష్ఠత గురించే ఎక్కువ మాట్లాడుతున్నారు. అలాగే రాష్ట్ర ప్రగతిలో లోకేష్ క్రెడిట్ ను గుర్తించడానికే మొగ్గు చూపుతున్నారు.  ఈ నేపథ్యంలోనే   సీఎం చైర్ కు లోకేష్ లైన్ క్లియ‌ర్ అయ్యిందనే అంటున్నారు పరిశీలకులు. 

ఓట్ చోరీ.. రాహుల్ ని గట్టెక్కించలేదెందుకు?

ఒక‌ప్పుడు ఇందిరాగాంధీ, ఆ తరువాత  రాజీవ్ గాంధీ.. భార‌త రాజ‌కీయాల్లో సంచ‌ల‌న విజ‌యాలు సాధించారు. వారికి చట్టసభల్లో సంఖ్యాబలానికి ఒక పరిమితి అంటూ ఉండేది కాదు.  ఇప్పుడైతే వ‌రుస‌గా మూడోసారి బీజేపీ నాయకత్వంలో ఎన్డీయే వరుసగా మూడో సారి అధికారంలోకి వచ్చినా, మూడో సారి బీజేపీకి స్వయంగా వచ్చిన స్థానాలు   240 కాగా.. ఎన్డీయే  భాగ‌స్వామ్య ప‌క్షాల‌తో ఎలాగోలా  గ‌ట్టెక్కి అధికార పీఠం చేప‌ట్ట‌గ‌లిగింది. అదే ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల హయాంలో అయితే అప్ప‌ట్లో  లోక్ సభలో కాంగ్రెస్ సంఖ్యా బలం  400కు మించి ఉన్న సందర్భాలు ఉన్నాయి. కానీ అప్పుడెవ‌రూ కాంగెస్ ని ఓట్ చోరీ అంటూ ఎగ‌తాళి  చేయ‌లేదు. ఎవ‌రి  క‌ష్టం  వారు ప‌డుతూ.. ప్ర‌జ‌ల్ని మెప్పించే ప‌ని మాత్ర‌మే చేస్తూ వ‌చ్చేవార‌మ‌ని తాజాగా మాజీ ప్ర‌ధాని దేవెగౌడ‌ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ ఓట్ చోరీ అంటూ చేస్తున్న ఆర్భాటాన్నీ, హంగామానూ బిల్డప్ ప్రక్రియగా కొట్టి పారేశారు.  ఏదో ఒక నేరేటివ్ బిల్డ‌ప్ చేయ‌డంలో భాగంగా రాహుల్ గాంధీ ఈ త‌ర‌హా ప్ర‌చారాన్ని  తెర‌పైకి తెచ్చారంటున్నారు. రాహుల్ అందిపుచ్చుకున్న ఓట్ చోరీ..  వ్యూహ‌క‌ర్త‌లిచ్చిన స‌ల‌హా  లేదా సూచ‌న  కావ‌చ్చు. అదీ కాదంటే కాంగ్రెస్ అగ్రనాయకత్వమే స్వయంగా ఈ నినాదాన్ని ఎత్తుకుని ఉండవచ్చు. అయితే ఓటు చోరీ నినాదం ప్రజల్లోకి లోతుగా వెళ్లినట్లనిపించినా.. అది కాంగ్రెస్ కు ఎలాంటి ప్రయోజనం చేకూర్చింది లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   ఓట్ చోరీ స్లోగ‌న్ తో బీహార్ ఎన్నిక‌ల‌కు వెళ్తే అది బూమ‌రాంగ్ అయ్యింది. రాహుల్ లాంటి ప్ర‌చార‌క్ ఉన్నంత వ‌ర‌కూ బీజేపీ  అధికారంలోకి వ‌స్తూనే ఉంటుంద‌న్న టాక్  అధికార కూటమిలో జోరుగా స్ప్రెడ్ అవుతోంది.  రాహుల్ విషయంలో చెప్పుకోవలసిందంటూ ఏదైనా ఉంటే ఆయన చేపట్టిన భారత్ జోడో యాత్ర.  ఆ యాత్ర ద్వారా.. రాహుల్  ఇటు కాంగ్రెస్ ని అటు ఇండి కూట‌మిని  ఈ మాత్ర‌మైనా  నిలబెట్టగలిగారు.   అలాగ‌ని రాజ‌కీయ ప‌రంగా అధికార ప‌క్షాన్ని ఇరుకున పెట్టేలాంటి చ‌ర్య‌లేవీ చేప‌ట్ట‌క పోవ‌డం వ‌ల్ల  కాంగ్రెస్ లో పెద్దగా జోష్ కనిపించడం లేదు.  కార్య‌క‌ర్త‌లను ఏదో ఒక కార్యక్రమంతో బిజీగా ఉంచాలి.  అందులో భాగంగానే రాహుల్ గాంధీ.. ఈ నినాదం భుజానికి  ఎత్తుకున్నారు. త‌ర‌చూ త‌న వాద‌న‌ల రూపంలో  ఏదో ఒక అంశాన్ని, సమస్యను తెరమీదకు తీసుకువస్తుంటారు. తినగతినగ వేమ తియ్యగుండు అన్నట్లుగా.. నిరంతరం జనంలోకి ఏదో ఒక అంశాన్ని తీసుకువెడుతుంటే.. ఏదో ఒక లీడ్ దొరికి అధికారం ‘చేతి’కి రాకుండా ఉంటుందా అన్నది ఆయన ఆలోచనో, వ్యూహమో అయి ఉంటుందంటున్నారు పరిశీలకులు.   ఇవాళ్రేపు రాజ‌కీయంగా ఒక నెగిటివిటీని నూరిపోస్తే త‌ప్ప రాణించ‌లేని గ‌డ్డు కాలం న‌డుస్తోంది. అందుకే రాహుల్ ఈ దేశం నుంచి ఆర్ఎస్ఎస్, మోడీ, అమిత్ షాల‌ను పార‌దోలాల్సిన  అవ‌స‌రం క‌నిపిస్తోంద‌నీ,  వారి ప్ర‌భావం నుంచి దేశాన్ని కాపాడాలని అంటున్నారు కానీ అది ఎలా సాధ్యం అన్న విషయంలో మాత్రం రాహుల్ లో కానీ, కాంగ్రెస్ లో కానీ క్లారిటీ కానరావడం లేదంటారు పరిశీలకులు. ఓట్ చోరీ నినాదం విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ రాహుల్ పై చేసిన వ్యాఖ్యలు కూడా అలానే ఉండటం యాధృచ్ఛికమేనా?  

ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ విజేతకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ!

వచ్చే ఏడాది జరగనున్న   ఫుట్‌బాల్ వరల్డ్ కప్ విజేత జట్టుకు బంపర్ ఆఫర్ తగలనుంది. ఫిఫా ప్రపంచ కప్  టోర్నీ ఛాంపియన్‌కు రూ.451 కోట్ల ప్రైజ్‌మనీ దక్కనుంది.  2022 వరల్డ్ కప్ గెలిచిన అర్జెంటీనా రూ.379కోట్లు లభించాయి. గత సారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫా 48.9శాతం పెంచింది.  అంటే 2026 ఫుట్‌బాల్ ప్రపంచ కప్ విజేత జట్టుకు కళ్లు చెదిరే ప్రైజ్‌మనీ దక్కనుంది. విజేత జట్టుకు రికార్డు స్థాయిలో రూ.451 కోట్లు ప్రైజ్ మనీగా దక్కుతుంది. 2022 ప్రపంచ కప్ గెలిచిన అర్జెంటీనాకు రూ.379 కోట్లు లభించాయి. గత సారితో పోలిస్తే ఈ సారి నగదు బహుమతిని ఫిఫాభారీగా పెంచింది. 2022 కప్‌ టోర్నీ  మొత్తం ప్రైజ్‌మనీ రూ.3971 కోట్లు కాగా.. ఇప్పుడు దానిని భారీగా రూ.5911 కోట్లకు పెంచారు. గ్రూప్ దశలో 48 జట్లు పోటీపడనున్నాయి. జట్టుకు రూ.81 కోట్ల చొప్పున దక్కనున్నాయి. ఈ టోర్నీ సన్నద్ధత కోసం ప్రతి జట్టుకు రూ.13.53కోట్లు లభిస్తాయి. రౌండ్ ఆఫ్ 32 దశకు చేరే జట్లకు రూ.99.27 కోట్ల చొప్పున.. ప్రిక్వార్టర్స్‌లో ప్రవేశించే టీమ్‌లకు రూ.135 కోట్ల చొప్పున లభిస్తాయి. క్వార్టర్స్ చేరే జట్లకు రూ.171 కోట్ల చొప్పున దక్కుతాయి. నాలుగో స్థానంలో నిలిచే జట్టు రూ.243 కోట్లు, మూడో స్థానాన్ని సాధించే టీమ్ రూ.261 కోట్లు సంపాదిస్తాయి.  రన్నరప్‌కు రూ.297 కోట్లు లభిస్తాయి. ప్రపంచ కప్ విజేతతో పోలిస్తే క్లబ్ ప్రపంచ కప్‌లో గెలిచే జట్టుకే ఎక్కువ నగదు బహుమతి దక్కనుంది. 2025 క్లబ్ ప్రపంచ కప్ నెగ్గిన చెల్సీకి రూ.1128 కోట్లు లభించాయి. జాతీయ జట్లతో పోలిస్తే క్లబ్ జట్ల నిర్వహణకు ఎక్కువ ఖర్చులు అవుతుండటంతో ఫిఫా అందుకు తగ్గట్టే ప్రైజ్‌మనీ అందిస్తోంది.

ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్.. రిపేర్లు మొదలుపెట్టిన పాక్

జమ్మూ కశ్మీర్‌  పహల్గామ్ లో ఈ ఏడాది ఏప్రిల్ 22న జరిగిన  ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఆపరేషన్‌లో భాగంగా పాక్, పీఓకేలోక చొచ్చుకెళ్లి ఉగ్ర స్థావరాలపై విరుచుకుపడింది. ఆ సందర్భంగా భారత్ దాడుల్లో మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక భవనం ధ్వంసమైందనీ,  ప్రస్తుతం పునర్నిర్మాణ పనులు జరుగుతున్నాయని శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. పాక్ డ్రోన్ కార్యకలాపాలకు కేంద్రమైన ఈ భవనంపై జరిగిన దాడి తీవ్ర నష్టాన్ని కలిగించింది. ఆపరేషన్ సిందూర్ కారణంగా పాకిస్థాన్ లో దెబ్బతిన్న ఇతర ఎయిర్‌బేస్‌లలోనూ మరమ్మతులు జరుగుతున్నా యి.    26 మంది అమాయకులను బలిగొన్న పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం మే 7న ఆపరేషన్ సిందూర్ చేపట్టి పాకిస్థాన్‌, పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద స్థావరాలపై విరుచుకుపడింది. దీంతో ఇరు దేశాల మధ్య సైనిక ఘర్షణకు దారితీసింది. ఈ క్రమంలో పాక్ వైమానిక, సైనిక స్థావరాలపై భారత వైమానిక దళం బాంబులు వర్షం కురిపించింది. పాకిస్థాన్‌కు చెందిన మురిద్ ఎయిర్‌బేస్‌లోని కీలక కమాండ్ అండ్ కంట్రోల్ భవనంపై కూడా దాడిచేసింది. ఆ దాడిలో ధ్వంసమైన భవనానికి పాక్ పునర్నిర్మాణ పనులు చేపట్టినట్టు తాజాగా హై-రిజల్యూషన్ శాటిలైట్ ఫోటోలు బయటపెట్టాయి. భారత్ దాడిలో భవనం పైకప్పు కూలిపోయి, నిర్మాణానికి తీవ్ర నష్టం వాటిల్లిందని భావిస్తున్నారు. డిసెంబర్ 16 నాటి వంటోర్  ఫోటోలు పాకిస్థాన్ డ్రోన్‌లను ఆపరేట్ చేసే ఒక పెద్ద కాంప్లెక్స్ పక్కనే ఉన్న భవనాన్ని ఎర్రటి టార్పాలిన్‌తో కప్పి ఉంచడాన్ని చూపిస్తున్నాయి. ఈ టార్పాలిన్‌ను రిపేర్లు లేదా జరిగిన నష్టాన్ని శాటిలైట్ నిఘా కంటబడకుండా ఉండేందుకు సైన్యాలు సాధారణంగా ఉపయోగిస్తాయి. జూన్ నెలలో తీసిన ఫోటోల్లో భవనంపై చిన్న ఆకుపచ్చ టార్పాలిన్ కనిపించింది. ఇప్పుడు మొత్తం భవనం పెద్ద టార్పాలిన్ కింద మరమ్మతు లేదా పునర్నిర్మాణంలో ఉంది. దీనిపై దాడికి రూఫ్-పెనెట్రేటింగ్ వార్‌హెడ్‌లు కలిగిన క్షిపణులను ఉపయోగించి ఉండొచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఈ క్షిపణులు భవనం పైకప్పును చీల్చుకుని లోపల పేలి, ఎక్కువ నష్టాన్ని కలిగిస్తాయి. పంజాబ్‌లోని చక్వాల్ జిల్లాలో ఉన్న మురిద్ ఎయిర్‌బేస్ పాకిస్థాన్ వైమానిక దళానికి  ముఖ్యమైన స్థావరం. ఇక్కడ నుంచే షాహ్‌పర్ సిరీస్, బుర్రాక్, బేరక్టార్ టిబి2/ అకిన్సీ, వింగ్ లూంగ్ II వంటి డ్రోన్‌లను  ఆపరేట్ చేస్తారు. మే 10న పాకిస్థాన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ మేజర్ జనరల్ కషిఫ్ అబ్దుల్లా కాల్పుల విరమణ కోసం భారత్ డీజీఎంఓకి కాల్ చేయడానికి కొన్ని గంటల ముందు ఆ దేశ ఎయిర్‌బేస్‌లపై భారత వైమానిక దళం దాడులను తీవ్రతరం చేసింది. దీనికి ముందు 26కు పైగా ప్రదేశాలలో పాక్ డ్రోన్‌ దాడులకు తెగబడటంతో ప్రతిగా భారత వాయు సేన ఈ దాడులు చేసింది. ఈ సమయంలో ఐఏఎఫ్ ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ నోడ్స్, ఎయిర్‌బేస్‌లు, ఎస్-400 క్షిపణి రక్షణ వ్యవస్థపై పాక్ దాడులు చేసింది. ఉధంపూర్, పఠాన్‌కోట్, అదంపుర్, భుజ్‌లలోని ఐఏఎఫ్ స్థావరాలకు, సిబ్బందికి స్వల్ప నష్టం జరిగింది. మే 10న మురిద్‌పై భారత్ రెండో దాడి చేయగా.. అక్కడ భూగర్భ సదుపాయానికి 30 మీటర్ల దూరంలో మూడు మీటర్ల వెడల్పుతో పెద్ద గొయ్యి ఏర్పడినట్టు శాటిలైట్ ఫోటోలు వెల్లడించాయి. నిపుణుల అంచనా ప్రకారం.. ఈ భూగర్భ స్థావరం ప్రత్యేక పరికరాల నిల్వకు లేదా భారీ బాంబు దాడులను తట్టుకోగలిగేందుకు ఉద్దేశించినదట. దాడులకు గురైన తన ఎయిర్‌బేస్‌లలో పునర్నిర్మాణ పనులు దాయాది దేశం ప్రారంభించింది. సర్దార్‌లోని ముషఫ్ ఎయిర్‌బేస్, దక్షిణ పంజాబ్‌లోని రహీమ్ యార్ ఖాన్‌లోని దెబ్బతిన్న రన్‌వేలను మరమ్మతు చేసుకుంది. జాకబ్‌బాద్, భోలారి, సుక్కూర్‌లలోని హ్యాంగర్‌లు ధ్వంసమయ్యాయి. జాకబ్‌బాద్‌లో పలుఎ ఫ్-16 ఫైటర్ విమానాలు ధ్వంసమైనట్టు నివేదికలు వచ్చాయి. భోలారిలోని హ్యాంగర్‌పై దాడిలో ఒక ఎయిర్‌బోర్న్ ఎర్లీ వార్నింగ్ అండ్ కంట్రోల్ ఎయిర్‌క్రాఫ్ట్ ధ్వంసమైంది. సుక్కూర్‌లో హ్యాంగర్‌ను నేలమట్టం చేసింది. ఇస్లామాబాద్ సమీపంలోని నూర్ ఖాన్ ఎయిర్‌బేస్‌పై భారత వైమానిక దళం జరిపిన  దాడులలో ధ్వంసమైన కాంప్లెక్స్ స్థానంలో కొత్త నిర్మాణాలు చేపట్టింది.

జ‌గ‌న్ ‘పీపీపీ’.. డుం డుం డుం!

మెడిక‌ల్ కాలేజీల పీపీపీ విధానాల‌ పై ప్ర‌జావ్య‌తిరేక‌త ఎంత ఉందో తెలియ చేస్తూ కోటి సంత‌కాల సేక‌ర‌ణ చేసింది వైసీపీ. పార్టీ అధినేత, మాజీ సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని మొత్తం 175 నియోజ‌క‌వ‌ర్గాల  నుంచి మెడికల్ కాలేజీల ప్రభుత్వ, ప్రైవేటు   భాగస్వామ్యం విధానానికి వ్యతిరేకంగా కోటీ  4 ల‌క్ష‌ల   ఈ సంత‌కాల సేక‌ర‌ణ చేసి గ‌వ‌ర్న‌ర్ కి స‌మ‌ర్పించారు జగన్.  ఈ సందర్భంగా ర్యాలీలు కూడా నిర్వహించారు. జగన్ స్వయంగా 40 మంది బృందంతో కాలినడకన వెళ్లి మరీ ఆ సంతకాల పత్రాలను గవర్నర్ కు అందజేశారు. అసలింతకీ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఒక్క చంద్రబాబు కాదు, కేంద్ర ప్రభుత్వం సహా అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ అనుసరిస్తున్నాయి. ఈ పీపీపీ విధానం వల్ల ఎటువంటి నష్టం లేదని కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్ ఢంకా బజాయించి మరీ చెబుతున్నారు.  ఎవరెంతగా చెప్పినా జగన్ మాత్రం తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లన్నట్లు వ్యవహరిస్తున్నారు.  ఇంత‌కీ జ‌గ‌న్ అండ్ కో  పీపీపీ విధానంపై చేస్తున్న విమర్శలు ఏమిటంటే..   పీపీపీ విధానంలో మెడిక‌ల్ కాలేజీ అభివృద్దికి ముందుకు వచ్చే ప్రైవేటు వ్యక్తులు కేవలం లాభాపేక్షతోనే వస్తారు. కోట్లు కొల్లగొడతారు. దీని వల్ల పేదలకు వైద్య విద్య మ‌రింత ఖ‌రీద‌వుతుంది. ఇది వారి పాలిట ఆశ‌నిపాతంగా మారుతుంది. ఇదీ జగన్ అండ్ కో అంటే జగన్, వైసీపీయులు చేస్తున్న వాదన. ఇక కోటి సంతకాలను గవర్నర్ కు సమర్పించే సందర్భంగా  జగన్ హాట్ కామెంట్లు కూడా చేశారు. అందులో యోగాంధ్ర కార్యక్రమం గురించి ప్రస్తావించారు. యోగాంధ్ర కోసం 330 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన ప్రభుత్వం పేదల మెడికల్ విద్య కోసం వెయ్యి కోట్లు ఖర్చు చేయలేదా అని ప్రశ్నించారు.  ఇక్కడే ఆయన ఆర్థిక అజ్ణానం బయటపడుతోంది. వాస్తవానికి ప్రభుత్వం స్వయంగా ఖర్చు చేయడం లేదు.. ప్రైవేటు వ్యక్తులను ఆ వ్యయంలో భాగస్వాములను చేస్తున్నది. అదే పంధాలో సంక్షేమ పథకాలనూ అమలు చేస్తున్నది. జగన్ హయాంలో అభివృద్ధిని పూర్తిగా అటకెక్కించేసి బటన్ నొక్కుడు అంటూ ఖజానా మొత్తం సంక్షేమం అంటే ధారపోసి జగన్ బావుకున్నదేంటి? రాష్ట్రానికి ఒరిగిందేమిటి? అంటే జగన్ కు ఘోర పరాజయం, రాష్ట్రానికి తలకు మించిన అప్పులు మాత్రమే.  ప్రభుత్వానికి తలకు మించిన భారం కాకుండా  ప్రైవేటు వ్య‌క్తుల‌ను కూడా ఇన్వాల్వ్ చేయ‌డం మంచిదే కదా అంటున్నారు ఆర్థిక నిపుణులు. జ‌గ‌న్  హయాంలో ఆయన రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి, ఇంకా అన్ని నిబంధనలనూ తుంగలోకి తొక్కి అప్పులు తెచ్చి మరీ సంక్షేమం అంటూ చేసిన పందేరం.. ఓట్ల వేటే తప్ప మరేదీ కాదంటున్నారు.  ఇటీవల వలంటీర్ల విషయంలో తనకు జ్ణానోదయం అయ్యిందని ఇటీవల జగన్ ప్రకటించారు. మరి అప్పులు చేసి రష్ట్ర ప్రగతిని శూన్యం చేసి అమలు చేసిన సంక్షేమం దారి తప్పిందన్న విషయంలో ఆయనకు ఇంకా జ్ణానోదయం కలిగినట్లు లేదంటున్నారు విశ్లేషకులు.   ప్ర‌తిదీ ప్ర‌భుత్వం నుంచే ఖ‌ర్చు చేయ‌డం వ‌ల్ల అది  పెట్టుబ‌డి అనిపించుకోదు.   ప్ర‌భుత్వ‌మే  అన్నీ ఉచితంగా చేయ‌డం వ‌ల్ల ఎన్ని నిధులూ సరిపోవు. అప్పులే శరణ్యం అవుతుంది. అందుకే ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యం అంటున్నది చంద్రబాబు సర్కార్.  ఈ విషయం అర్ధం చేసుకోకుండా,  జగన్ ఇలాగే వ్యవహరిస్తే..  2029 కాదు.. 2034నాటికి కూడా  వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని రాజకీయ విశ్లేషకులే కాదు... వైసీపీయులు కూడా  అంటున్నారు.  ఎవరో అనడం ఎందుకు జగన్ తాను స్వయంగా చేయించుకున్న సర్వేలు కూడా అవే చెబుతున్నాయి కదా!  మరి జగన్  ఈ తీరు వైసీపీని ఏ తీరానికి చేరుస్తుందో వేచి చూడాల్సిందే. 

పాక్‌కు అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ షాక్!

ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన పాకిస్థాన్‌కు అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ మరోసారి షాకిచ్చింది. దేశంలో విపరీతంగా పెరుగుతున్న జనాభాను అరికట్టేందుకు గర్భనిరోధక సాధనాలపై పన్ను మినహాయింపు ఇవ్వాలన్న పాక్ ప్రభుత్వ అభ్యర్థనను ఐఎంఎఫ్ నిర్మొహమాటంగా తిరస్కరించింది. పన్ను వసూళ్లలో ఎలాంటి రాజీ పడకూడదనే ఉద్దేశంతో, కండోమ్‌లపై విధిస్తున్న 18 శాతం జీఎస్‌టీని తొలగించేందుకు ద్రవ్య నిధి ససేమిరా అంది. ప్రస్తుతం పాకిస్థాన్ ఐఎంఎఫ్ నుంచి పొందుతున్న బెయిలవుట్ ప్యాకేజీలో భాగంగా కఠినమైన నిబంధనలను అమలు చేస్తోంది. ఈ క్రమంలో గర్భనిరోధక సాధనాలపై పన్ను తగ్గిస్తే రాబడి లక్ష్యాలు దెబ్బతింటాయని ఐఎంఎఫ్ అభిప్రాయపడింది. ఒకవేళ రాయితీలు ఇవ్వాలనుకుంటే వచ్చే బడ్జెట్ వరకు వేచి చూడాలని స్పష్టం చేసింది. ఇలాంటి మినహాయింపులు ఇస్తే పన్నుల అమలు యంత్రాంగం బలహీన పడుతుందనీ, పైగా ఈ వస్తువుల అక్రమ రవాణా పెరిగే ప్రమాదం ఉందని ఐఎంఎఫ్ హెచ్చరించింది. కేవలం కండోమ్‌లే కాకుండా మహిళలకు అవసరమైన శానిటరీ ప్యాడ్‌లు, శిశువుల డైపర్లపై కూడా పన్ను రాయితీలు ఇవ్వడానికి ఐఎంఎఫ్ నో అంది. పాక్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ పంపిన ఈ ప్రతిపాదనల వల్ల దాదాపు 400 నుంచి 600 మిలియన్ పాకిస్థాన్ రూపాయల ఆదాయం తగ్గుతుందని అంచనా వేసి, ఆ ప్రతిపాదనలను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా జనాభా పెరుగుతున్న దేశాల్లో పాకిస్థాన్ ఒకటి. ప్రస్తుతం అక్కడ ఏటా దాదాపు 60 లక్షల మంది జనాభా అదనంగా చేరుతున్నారు. జనాభా వృద్ధి రేటు 2.55 శాతంగా ఉంది. ఈ పెరుగుదల వల్ల ప్రభుత్వ సేవలు, సామాన్యుల ఆదాయాలపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఇలాంటి సమయంలో గర్భనిరోధక సాధనాలను చౌకగా అందించాలని ప్రభుత్వం భావించింది. అయితే ఐఎంఎఫ్ నిబంధనల వల్ల విధించిన 18 శాతం జీఎస్‌టీ కారణంగా, ఇవి సామాన్యులకు అందనంత భారంగా మారాయి.   విదేశీ అప్పుల కోసం నిత్యావసరాలను కూడా పాక్ ప్రభుత్వం  లగ్జరీ వస్తువులుగా పరిగణించాల్సి రావ డం అక్కడి దయనీయ స్థితికి అద్దం పడుతోంది. రుణం కోసం ఐఎంఎఫ్ షరతులను నెరవేర్చడానికి పాకిస్థాన్ నానా పాట్లూ పడుతోంది. పన్ను వసూళ్లతో పాటు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణను కూడా వేగవంతం చేసింది. ఇందులో భాగంగానే పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ ను అమ్మకానికి పెట్టిన సంగతి తెలిసిందే.  ఇప్పటి వరకు ఐఎంఎఫ్ నుంచి దాదాపు 3.3 బిలియన్ డాలర్ల నిధులను పాక్ పొందింది. ఈ అప్పుల నుంచి బయటపడలేక.. చివరకు దేశ జనాభా నియంత్రణ అంశాన్ని కూడా ఆర్థిక లెక్కలకే  వదిలేయాల్సిన దుస్థితిలో పాకిస్థాన్ ఉంది. 

గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజనింగ్.. విద్యార్థిని మృతి

గురుకులంలో  ఫుడ్ పాయిజినింగ్ కారణంగా తీవ్ర అస్వస్థతకు గురై  ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఓ విద్యార్థిని మరణించింది.  ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా పోచంపాడ్‌లోని   సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో చోటుచేసుకున్నది. ఆదిలాబాద్‌కు చెందిన లింగం కుమార్తె 14 ఏళ్ల సాయి లిఖిత ఈ గురుకుల పాఠశాలలో  ఎనిమిదో తరగతి చదువుతున్నది. ఈ నెల 5న కలుషిత ఆహారం కారణంగా తీవ్ర అస్వస్థతకు గురైంది. ఆమెను  మెరుగైన వైద్యం కోసం నిర్మల్‌ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. అక్కడి వైద్యులు కూడా ఫుడ్ పాయిజినింగ్ అయ్యిందని ధృవీకరించారు. చికిత్స అందిస్తున్న సమయంలో ఆమెకు జాండిస్ అటాక్ కావడంతో పరిస్థితి విషమించింది. దీంతో ఆమెను మరింత మెరుగైన వైద్యం కోసం  హైదరాబాద్‌  నిలోఫర్‌ దవాఖానలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ లిఖిత బుధవారం (డిసెంబర్ 17) కన్నుమూసింది. విద్యార్థిని మృతి విషయం తెలుసుకున్న సబ్‌ కలెక్టర్‌ అభిజ్ఞాన్‌ మాల్వియా గురువారం (డిసెంబర్ 18) పాఠశాలను సందర్శించారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సబ్‌కలెక్టర్‌ అన్నారు. 

టోల్ గేట్లకు చెల్లు చీటీ!

ఇక టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ లు ఉండవు. దేశ వ్యాప్తంగా అన్ని టోల్ గేట్లనూ ఎత్తివేయాలని కేంద్రం నిర్ణయించింది. అయితే టోల్ వసూళ్లు మాత్రం ఆగవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విధానం వచ్చే ఏడాది చివరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.   ఇక నుంచి ఏఐ,  శాటిలైట్  ఆధారిత సిస్టమ్ ద్వారా టోల్ వసూళ్లు జరిగేలా చర్యలకు కేంద్రం ఉపక్రమించింది. ఈ విషయాన్ని  కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ స్వయంగా వెల్లడించారు. ఈ నూతన టోల్ విధానం  పూర్తిగా ఉపగ్రహ, ఏఐ సాంకేతికతలపై ఆధారపడి ఉంటుందన్నారు. దీని వల్ల వాహనదారులు  టోల్ గేట్ల వద్ద ఆగాల్సిన అవసరం ఉండదని పేర్కొన్నారు. దీని వల్ల వాహనదారులకు  ఇంధనం ఆదా అవడమే కాకుండా,  ప్రభుత్వానికి అదనంగా ఆరువేల కోట్ల రూపాయల ఆదాయం సమకూరుతుందని గడ్కరీ పేర్కొన్నారు.   ఈ విధానంలో టోల్ గేట్లకు బదులుగా గాంట్రీ గేట్స్ నిర్మిస్తారు.  వీటిపై   హై రిజల్యూషన్ కెమెరాలు, సెన్సార్లను అమర్చడం ద్వారా,  వాహనాలు గరిష్ట వేగంతో వెళ్లినప్పటికీ.. ఆ వాహనం  నంబర్ ప్లేట్ ను గుర్తించి, విశ్లేషించేందుకు అవకాశం ఉంటుంది.  దీంతో టోల్ ఛార్జీలు పూర్తిగా ఆటోమేటిక్‌గా వసూలు అవుతాయని గడ్కరీ తెలిపారు.

ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిత్ అక్రమ్ విఫలయత్నం!

ఆస్ట్రేలియా  బీచ్ కాల్పుల నిందితుడు ఆస్ట్రేలియా-భారత్ మధ్య తరచూ రాకపోకలు ఆస్ట్రేలియా సిడ్నీ  బీచ్ ప్రాంతంలో పోలీసు కాల్పుల్లో హతమైన ఐసిస్ అనుబంధ ఉగ్రవాది సాజిత్ అక్రమ్  గతంలో ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం విశ్వప్రయత్నం చేసి విఫలమయ్యాడని ఆ దేశ నిఘా వర్గాలు వెల్లడించాయి.  ఆస్ట్రేలియా పౌరసత్వం కోసం సాజిత్ అక్రమ్ దరఖాస్తు చేసుకున్న ప్రతి సారీ అతడి దరఖాస్తు తిరస్కరణకు గురైందని తెలిపాయి.   హైదరాబాద్‌లోని జోచిచాక్ అల్ హసన్ కాలనీలో నివసిస్తున్న సాజిత్ కుటుంబ సభ్యులను ప్రశ్నించిన అనంతరం ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. గత 27 ఏళ్లుగా సాజిత్ హైదరాబాద్, ఆస్ట్రేలియా మధ్య  రాకపోకలు సాగించినట్లు అధికారులు గుర్తించారు. ఈ ప్రయాణాల వెనుక ఉన్న కారణాలపై లోతైన దర్యాప్తు కొనసాగుతోంది. నాంపల్లిలోని అన్వర్ ఉల్ ఉలూమ్ కాలేజీలో  బీఏ పూర్తి చేసిన సాజిత్ అక్రమ్, 1998 నవంబర్ 8న స్టూడెంట్ వీసాపై ఆస్ట్రేలియాకు వెళ్లాడు. 2000లో అక్కడే బియాన్ వెనెస్సా గోసాను వివాహం చేసుకున్నాడు. ఆమె అప్పటికే ఆస్ట్రేలియా పర్మినెంట్ రెసిడెంట్ కావడంతో, 2001లో సాజిత్ తన వీసాను పార్ట్‌నర్ వీసాగా మార్చుకున్నాడు. తదనంతరం 2008లో రెసిడెంట్ రిటర్న్ వీసాను పొందిన సాజిత్, పీఆర్ హోదాను కొనసాగించాడు. పీఆర్ కలిగిన వారికి ఐదేళ్లపాటు ఆస్ట్రేలియాకు స్వేచ్ఛగా వచ్చి వెళ్లే అవకాశం ఉండటంతో, అతడు ఈ వీసా ద్వారా దేశంలో తన ఉనికిని కొనసాగించినట్లు తెలుస్తోంది. ఆస్ట్రేలియాలో ఓటు హక్కు, పాస్‌పోర్టు, విదేశాల్లో రాయబార కార్యాలయాల రక్షణ పొందాలంటే పౌరసత్వం అవసరం. ఈ నేపథ్యంలో సాజిత్ అక్రమ్ అనేకసార్లు ఆస్ట్రేలియా పౌరసత్వానికి దరఖాస్తు చేసినట్లు కుటుంబీకులు వెల్లడించారు. అయితే ప్రతి దరఖాస్తు తిరస్కరణకు గురైందని, తిరస్కరణ కారణాలను సాజిత్ ఎప్పుడూ తమతో పంచుకోలేదని అతడి కుటుంబ సభ్యులు  తెలిపారు. సాజిత్ కుమారుడు నవీద్ అక్రమ్ 2001 ఆగస్టు 12న ఆస్ట్రేలియాలో జన్మించడం తో అతడికి ఆ దేశ పౌరసత్వం, పాస్‌పోర్టు లభించాయి.  2003లో తొలిసారిగా భార్యతో కలిసి హైదరాబాద్ వచ్చిన సాజిత్, కుటుంబీకుల సమక్షంలో సంప్రదాయ నిఖా చేసుకున్నాడు. 2004లో తన కుమారుడిని బంధువులకు చూపించేందుకు మరోసారి నగరానికి తీసుకువచ్చాడు. 2006లో తండ్రి మృతి అనంతరం కుటుంబీకులను కలుసుకుని వెళ్లిన సాజిత్, 2018లో వారసత్వంగా తనకు వచ్చిన శాలిబండ లోని ఇంటిని విక్రయించేం దుకు హైదరాబాద్‌కు వచ్చాడు. ఆ ఆస్తి విక్రయం తో వచ్చిన డబ్బుతో ఆస్ట్రే లియాలోని బోసరగ్ ప్రాంతం లో ఇల్లు కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. గత ఏడాది ఫిబ్రవరిలో తన వాటాను కూడా భార్య పేరు కు బదిలీ చేసినట్లు సమా చారం. 2012 ఫిబ్రవరిలో సాజిత్ అక్రమ్ చివరిసారిగా హైదరాబాద్‌కు వచ్చి కుటుం బీకులను కలుసుకుని వెళ్లాడు. అదే సమయంలో పదేళ్ల కాలపరిమితికి సంబం ధించిన పాస్‌పోర్టు రిన్యూ వల్ కూడా చేయించుకున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. సిడ్నీ కాల్పుల ఘటన నేపథ్యంలో సాజిత్ అక్రమ్ గత జీవితం, అంతర్జాతీయ ప్రయాణాలు, ఆర్థిక లావాదేవీలు, సంబం ధాలపై భారతీయ, ఆస్ట్రే లియా భద్రతా సంస్థలు సమన్వయంతో సమగ్ర దర్యాప్తు కొనసాగిస్తున్నాయి.

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు.. సజ్జనార్ నేతృత్వంలో కొత్త సిట్

తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్​ట్యాపింగ్ కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఫోన్ ట్యాపింగ్‌  కేసు మరింత లోతైన, సమగ్రమైన దర్యాప్తునకు హైదరాబాద్ సీపీ సజ్జనార్ నేతృత్వంలో మరో సిట్ ను ఏర్పాటు చేస్తూ డీజీపీ శివధర్ రెడ్డి గురువారం (డిసెంబర్ 18) ఉత్వర్వులు జారీ చేశారు.  ఈ సిట్‌ లో  రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్ ఝా, సిద్ధిపేట సీపీ విజయ్ కుమార్, మహేశ్వరం డీసీపీ నారాయణ రెడ్డి, గ్రేహౌండ్స్ కమాండెంట్ రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ అదనపు డీసీపీ కేఎస్ రావు, జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరి,   డీఎస్పీలు శ్రీధర్. నాగేందర్ సభ్యులుగా నియమించారు.   ఈ కేసుకు సంబంధించి త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి  ఛార్జిషీట్ దాఖలు చేయాలని డీజీపీ శివధర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఇక ఇటీవల ట్యాపింగ్ కేసులో భాగంగా సిట్​ఎదుట లొంగిపోయిన మాజీ ఐపీఎస్​అధికారి ప్రభాకర్ రావును ప్రత్యేక దర్యాప్తు బృందం విచారించింది. ఆయనను పలు అంశాలపై అధికారులు ప్రశ్నించారు. విచారణలో భాగంగా క్లౌడ్ పాస్ వర్డ్ లను ఎంటర్ చేసి ప్రభాకర్ రావు ఇచ్చారు. అందులోని కీలక ఆధారాలతో విచారిస్తున్నారు.  రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో నిజానిజాలను వెలికితీయడమే లక్ష్యంగా సజ్జనార్ నేతృత్వంలోని సిట్ కు విస్తృత అధికారాలు కల్పించినట్లు తెలుస్తోంది 

అట్టుడుకుతున్న బంగ్లాదేశ్.. భారత్ హైకమిషన్ కార్యాలయంపై దాడి

బంగ్లాదేశ్‌లో అల్లరి మూకలు రెచ్చిపోయాయి.   బంగ్లాదేశ్ అతివాద నాయకుడు, ఇంక్విలాబ్ మంచ్ కన్వీనర్ షరీఫ్ ఒస్మాన్ హాదీ మరణంతో ఈ పరిస్థితులు తలెత్తాయి. ఈ నెల 12న ఢాకాలోని బిజోయ్‌నగర్ ప్రాంతంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న హాదీపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన ఆయనను మొదట ఢాకాలోని ఆసుపత్రికి తరలించారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఈ నెల  15న ఎయిర్ అంబులెన్స్ ద్వారా సింగపూర్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హాదీ బుధవారం (డిసెంబర్ 18) రాత్రి మరణించాడు. దీంతో ఆందోళన కారులు రోడ్లపైకి వచ్చి హింసాకాండకు తెగబడ్డారు. చిట్టగాంగ్ లోని భారత హైకమిషన్ కార్యాలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అలాగే దేశ వ్యాప్తంగా పలు నగరాలలో ఆందోళనకారులు రెచ్చిపోవడంతో ఉద్రిక్త పరిస్థితుుల నెలకొన్నాయి.  రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలూ   దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్నాయి. భారత హైకమిషనర్ కార్యాలయంతో పాటు మీడియా సంస్థలపై కూడా ఆందోళనకారులు దాడులకు తెగబడ్డారు.  అతిపెద్ద బెంగాలీ వార్తాపత్రిక 'ప్రథమ్ ఆలో  డైలీ స్టార్' కార్యాలయాలకు నిప్పు పెట్టారు.    అలాగే  అవామీ లీగ్ కార్యాలయానికి కూడా ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వేలాది మంది షాబాద్ కూడలి వద్దకు చేరుకుని, రోడ్లను దిగ్బంధించారు. హాదీకి రక్షణ కల్పిం చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు.   

ఎన్టీఆర్ రాజు పాడె మోసిన నందమూరి రామకృష్ణ, మోహనకృష్ణ

దివంగత ముఖ్యమంత్రి  నందమూరి తారకరామారావు వీరాభిమాని, ఆయన పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్న  ఎన్టీఆర్ రాజు  బుధవారం (డిసెంబర్ 17) తిరుపతిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన అంత్యక్రియలు గురువారం (డిసెంబర్ 18) తిరుపతిలో జరిగాయి.   రాజకీయ రంగంలో ఎన్టీఆర్ కు అఖిల భారత కార్యదర్శిగా ఎన్టీఆర్ రాజు పని చేశారు. ఎన్టీఆర్ కు, తెలుగుదేశం పార్టీకీ నిస్వార్థంగా సేవలందించారు.  ఉన్నత పదవులు ఇస్తానని స్వయంగా ఎన్టీఆర్ ఆఫర్ ఇచ్చినా, మీ అభిమానిగా ఉండటమే తనకు చాలని సున్నితంగా తిరస్కరించారు ఎన్టీఆర్ రాజు. ఎమ్మెల్యేగా అవకాశం వచ్చినా వద్దని తిరస్కరించి, ఆజన్మాంతం ఎన్టీఆర్ అభిమానిగానే ఉంటానని చెప్పిన ఉన్నత వ్యక్తి ఎన్టీఆర్ రాజు. పదవులు కాదు.. ఆదర్శాలను వీడకపోవడం, అభిమానించే వ్యక్తికి అండగా నిలవడమే ముఖ్యమని చాటిన ఎన్టీఆర్ రాజు జీవితం అందరికీ స్ఫూర్తిగా నిలస్తుంది. అటువంటి ఎన్టీఆర్ రాజు అంత్యక్రియలకు   నందమూరి రామకృష్ణ, నందమూరి మోహనకృష్ణ  హాజర య్యారు. నందమూరి కుటుంబం తరఫున ఎన్టీఆర్ రాజు పార్ధివ దేహానికి నివాళులర్పించారు. ఆయన అంత్యక్రియలలో పాల్గొని పాడె మోశారు. ఎన్టీఆర్ రాజు మృతి తెలుగుదేశం పార్టీకీ, నందమూరి కుటుం బానికీ తీరని లోటని వారన్నారు.  నందమూరి వీరాభిమానిగా ఎన్టీఆర్ రాజు ఎనలేని సేవలందిం చారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుటున్నట్టు పేర్కొన్నారు. 

పెరిగిన చలి తీవ్రత...స్కూల్స్ టైమింగ్స్ మార్పు

  తెలంగాణలో చలి తీవ్రత అధికంగా పెరిగింది. అన్ని జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి ఉదయం వరకు బయటకు రావాలంటే ప్రజలు వణికిపోతున్నారు. మరోవైపు ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత పెరగటంతో జిల్లా కలెక్టర్ స్కూల్స్ టైమింగ్స్ మార్చుతూ ఆదేశాలు జారీ చేశారు. విద్యార్ధులు ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకోని ఈ నిర్ణయం తీసుకున్నారు.  ఇప్పటి వరకు ఉదయం 9 గంటలకు నుంచి సాయంత్రం 4 :15 గంటల వరకు ఉన్న బడి సమయాలను ప్రస్తుతం 09:40 గంటల నుంచి సాయంత్రం 04 :30 గంటలకు మార్చారు. అటు ఇతర జిల్లాల్లోనూ స్కూల్ టైమింగ్ మార్చాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. గత మూడు రోజుల నుంచి సాధారణం కంటే 4 డిగ్రీలకు తక్కువగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్ర అధికారులు తెలిపారు.ఈ నేపథ్యంలో ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వరంగల్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి తదితర జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసారు అధికారులు. ఆయా జిల్లాల ప్రజలు అత్యవసరం అయితే తప్ప రాత్రిపూట కనీస జాగ్రత్తలు లేకుండా బయటికి రావొద్దని సూచించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, శ్వాస సంబంధ వ్యాధులతో బాధ పడేవారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు

భూవివాదాల్లో నేతల జోక్యం సంహించం : డిప్యూటీ సీఎం పవన్

  భూ వివాదాల్లో రాజకీయ నాయకుల జోక్యాన్ని ఎంత మాత్రమూ సహించొద్దని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలకు డిప్యూటీ సీఎం పవన్, సీఎం చంద్రబాబు ఆదేశించారు. విశాఖ, ఉత్తరాంధ్ర జిల్లాల్లోని పారిశ్రామిక ప్రాంతాల్లో కొన్ని భూ వివాదాల్లో రాజకీయ నాయకుల ప్రమేయంపై ఫిర్యాదులు వచ్చాయిని ముఖ్యమంత్రి తెలిపారు. విశాఖ జోన్ లో ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. రాజకీయ నాయకుల ప్రమేయం వల్ల అధికారులు కూడా ఏమీ మాట్లాడలేకపోతున్నారని సీఎం పేర్కొన్నారు.  విశాఖ, విజయనగరం, అనకాపల్లి తదితర జిల్లాల్లో రాజకీయ నాయకుల జోక్యంపై ఫిర్యాదులు రాకూడదని, ఎవరి మీద ఫిర్యాదు వచ్చినా వదిలిపెట్టవద్దని ముఖ్యమంత్రి కలెక్టర్లును కోరారు. సౌండ్ పొల్యూషన్ గురించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  ప్రస్తావించారు. మతం పేరుతో విపరీతమైన సౌండ్ పెట్టి కార్యక్రమాలు, వేడుకలు, ప్రార్థనలు చేయడం తప్పుని పేర్కొన్నారు. ఎక్కడైనా కేవలం చట్టం మరియు సుప్రీంకోర్టు ఆదేశం మాత్రమే అమలులో ఉంటాయి డిప్యూటీ సీఎం తెలిపారు.  నిర్దేశించిన డెసిబుల్స్ లోనే సౌండ్ ఉండాలి. ఇందుకు సంబంధించి ఉన్న సుప్రీం కోర్టు ఉత్తర్వులను అమలు చేయాలని కలెక్టర్లు, ఎస్పీలకు పవన్ తెలిపారు. భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత తీసుకువచ్చేందుకు అన్ని రిజిస్ట్రేషన్, ఆస్తి పత్రాలను డిజిటలైజేషన్ చేస్తున్నామని సీఎం వివరించారు. 20-30 ఏళ్లుగా ఇళ్లలో నివసిస్తున్న వారికి పొజిషన్ సర్టిఫికెట్లు జారీ చేసే ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. చివరగా, జిల్లాల వారీగా రెవెన్యూ రాబడులపై దృష్టి సారించాలని, పన్ను ఎగవేతలు, మానిప్యులేషన్ జరగకుండా చూడాలని కలెక్టర్లకు సూచించారు. రాష్ట్రం ఒక్కరోజు కూడా ఆదాయం కోల్పోవడానికి వీల్లేదని సీఎం స్పష్టం చేశారు.   

తెలంగాణ గ్రూపు-3 ఫలితాలు విడుదల

  తెలంగాణ గ్రూపు-3 ఫలితాలను టీజీపీఎస్‌సీ విడుదల చేసింది.  మొత్తం 1370 మంది ఎంపికైనట్లు టీజీపీఎస్‌సీ వెల్లడించింది. అభ్యర్థుల జాబితాను టీజీపీఎస్‌సీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ఇటీవల సర్టిఫికెట్ వెరిఫికెషన్ జరిగిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవలే ఫలితాలు విడుదల చేసింది. జనరల్‌ ర్యాంకుల జాబితాను కమిషన్‌ ప్రకటించింది. గత ఏడాది నవంబర్‌ 17, 18 తేదీల్లో నిర్వహించిన గ్రూప్‌-3 పోస్టులకు 5.36 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 50.24 శాతం మంది మాత్రమే పరీక్షలకు హాజరయ్యారు.  పురుషుల్లో టాప్‌ ర్యాంకర్‌కు 339.24 మార్కులు, మహిళా టాప్‌ ర్యాంకర్‌కు 325.15 మార్కులొచ్చాయి.  2022 లో 1388 పోస్టుల భర్తీకి గ్రూప్ 3 నోటిఫికేషన్ వెలువడింది. గత ఏడాది నవంబర్ 17,18 తేదీల్లో పరీక్షలు జరిగాయి. కోర్టు కేసులు, గ్రూప్-1,2 వివాదాల కారణంగా గ్రూప్-3 ఫలితాలు ఆలస్యంగా విడుదల చేశారు.