అంబటి.. అహంకారమా? అవివేకమా?

వైసీపీలో నోరున్న నాయకులలో ఒకరిగా మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంబటి రాంబాబు గుర్తింపు పొందారు. అందులో సందేహం లేదు. అయితే ఇటీవలి కాలంలో ఆయన మాటల వల్ల పార్టీకి మేలు కంటే  కీడే ఎక్కువ జరుగుతోందన్న భావన వైసీపీ నాయకులు, శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. అసలాయన మాటలు చూస్తుంటే అహంకారం తలకెక్కిందా? లేక అజ్ణానమా అంటూ రాజకీయ పరిశీలకులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఆయన 2029 ఎన్నికలలో వైసీపీదే అధికారం అంటూ చేసిన వ్యాఖ్యలు ఆ అనుమానాలను మరింత బలపరుస్తున్నాయి. వాస్తవానికి 2024 ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణాలేమిటన్న విషయంపై పార్టీలో ఇప్పటి వరకూ ఆత్మ విమర్శ జరగలేదు. 2019 ఎన్నికలలో 151 స్థానాలతో ఘన విజయం సాధించిన వైసీపీ 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు పరిమితం కావడానికి కారణాలేమిటన్నది వైసీపీ అగ్రనేతలకు ఇంకా అర్థమైనట్లు కనిపించదు. ప్రజలివ్వని ప్రతిపక్ష హోదా కోసం మంకుపట్టు పట్టి అసెంబ్లీకి గైర్హాజర్ కావడం చూస్తుంటే ఆ పార్టీ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నట్లు కనిపించదు.  వాస్తవానికి ప్రతిపక్ష నేతగా సుదీర్ఘ పాదయాత్ర ద్వారా నిత్యం జనంలో తిరిగినందుకే జగన్ 2019 ఎన్నికలలో అధికారంలోకి రాగలిగారు. సరే పాదయాత్ర సందర్భంగా నవరత్నాలు సహా అడుగుకో హామీ గుప్పించి జనాన్ని మాయ చేశారు అదీ ఓ కారణమేననుకోండి, వాటికి తోడు వైఎస్ వివేకాహత్య, కోడికత్తి దాడి సంఘటనలను తనకు అనుకూలంగా జగన్ సానుభూతిగా మలచుకోవడం మరో ప్రధాన కారణం. అయితే ఒక సారి అధికారంలోకి వచ్చిన తరువాత ఆయన జనానికి ముఖం చాటేశారు. ఎప్పుడైనా బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు వచ్చినా రోడ్డుకిరువైపులా పరదాలు కట్టుకుని జనాన్ని చూడటం తనకు ఇష్టం లేదన్నట్లుగా వ్యవహరించారు.  ఇక పోతే ఐదేళ్ల జగన్ హయాంలో అభివృద్ధి పడకేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు రాలేదు. మౌలిక సదుపాయాల కల్పన జరగలేదు. ఉద్యోగ ఉపాధి అవకాశాల మాటే వినిపించలేదు. ఆ ఐదేళ్ల కాలంలో జరిగిందంతా.. దోపిడీ, దుర్మార్గం, అణచివేత, కక్షసాధింపు మాత్రమే.   ఆ ఐదేళ్ల జగన్ పాలన మొత్తం ప్రత్యర్థి పార్టీల నేతలపై కక్ష సాధింపులతోనే గడిచిపోయింది. అందుకే ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ప్రబలింది. దాని ఫలితమే 2024 ఎన్నికల ఫలితాలు. ఆ విషయాన్ని అంగీకరించడం పక్కన పెడితే కనీసం అర్ధం చేసుకోవడానికి కూడా జగన్, ఆయన పార్టీ నేతలూ సుముఖంగా లేరు.  ఈ నేపథ్యంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు పార్టీ శ్రేణుల్లోనే తీవ్ర వ్యతిరేకతకు కారణమయ్యాయి. నెటిజనులైతే ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు. ఇంతకీ అంబటి ఏమన్నారంటే.. 2024 ఫలితాలను అర్ధం చేసుకోవడంలో తెలుగుదేశం కూటమి పార్టీలు విఫలమయ్యాయట. చంద్రబాబు మోసపూరిత వాగ్దానాల కారణంగానే కూటమి ఆ ఎన్నికలలో అధికారంలోకి వచ్చిందట.. ఇప్పుడు ఈ ఏడాదిన్న కాలంలో జనానికి తత్వం బోధపడి.. జగన్  పాలన మళ్లీ రావాలని కోరుకుంటున్నారట. అంబటి భాష్యం విన్న వైసీపీయులే ఆశ్చర్యపోతున్నారు. చంద్రబాబు, ఆయన కేబినెట్ సహచరులు నిత్యం జనంలో ఉంటున్నారు. సంక్షేమంతో పాటు, అభివృద్ధీ జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అటువంటప్పుడు జనం జగన్ పాలనను ఎందుకు కోరుకుంటారు? అని వైసీపీ శ్రేణులే అంటున్నాయి.   అదలా ఉంచితే రాజకీయ విశ్లేషకులు మాత్రం  అంబటి వంటి నాయకులు ప్రజల తీర్పును అవహేళన చేసే విధంగా ఇలాగే తమ వాచాలతను ప్రదర్శిస్తూ పొతే.. వైసీపీ పరిస్థితి మరింత దిగజారడం ఖాయమంటున్నారు. స్వోత్కర్ష, పరనింద మాని వాస్తవాన్ని అంగీకరించి, తమ పాలనలో జరిగిన తప్పు లను అంగీకరించి జనంలోకి రాకుండా ఇదే విధానం కొనసాగిస్తే వైసీపీ సంక్షోభం నుంచి సంక్షోభంలోకి కూరుకుపోవడం తధ్యమని విశ్లేషిస్తున్నారు. 

అమరావతిలో "ఆవకాయ్" ఉత్సవాలు : మంత్రి కందుల

  అమరావతిలో జనవరి 8 నుంచి 10 వరకు ఆవకాయ్ ఉత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ ప్రకటించారు. ఈ వేడుకల్లో తెలుగు సినిమా సాహిత్యం, కవిత్వం, సంగీతం, నృత్యం వంటి కార్యక్రమాలు జరగనున్నాయి. పున్నమి ఘాట్, ద్వీపంలో ఈ ఉత్సవ ఏర్పాట్లు చేయునున్నట్టు తెలిపారు. అంతేకాకుండా వచ్చే ఉగాది నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను నిర్వహించాలని ఆలోచిస్తున్నట్టు మంత్రి తెలిపారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఏపీలో షూటింగ్‌ చేసుకునే సినిమాలకు మరింత ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు.  అలాగే ఉగాది నాటికి నంది అవార్డులు, నంది నాటకోత్సవాలు నిర్వహించాలని ప్రభుత్వం ఆలోచిస్తోందని, దీనికి సీఎం చంద్రబాబు కూడా సానుకూలంగా ఉన్నారని మంత్రి కందుల దుర్గేష్‌ తెలిపారు. టాలీవుడ్ ఎదుర్కొంటున్న సమస్యలపై త్వరలో  ప్రభుత్వం కీలక సమావేశం నిర్వహించనుందని  మూవీ టికెట్‌ రేట్లు, ఏపీలో షూటింగ్‌ చేసే సినిమాలు, హై బడ్జెట్‌ చిత్రాల టికెట్‌ ధరలపై చర్చించనున్నారు. అధికారుల సమావేశం అనంతరం సినీ ప్రముఖులతో ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామని, దానికి సంబంధించిన తేదీలను త్వరలో వెల్లడిస్తామని మంత్రి తెలిపారు.  

లోకేష్ విషెస్ కు జగన్ నో రిప్లై.. కారణమేంటో తెలుసా?

తెలుగు రాష్ట్రాలలో ప్రత్యర్థులకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపే సత్సాంప్రదాయానికి శ్రీకారం చుట్టినది నారా చంద్రబాబునాయుడే అని చెప్పవచ్చు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబునాయుడు.. ఈ సంప్రదాయానికి తెరలేపారు. అప్పటి నుంచీ అది కొనసాగుతూ వస్తోంది. ఆ క్రమంలోనే నారా చంద్రబాబు జగన్ కు ఆయన విపక్ష నేతగా ఉన్నప్పుడూ, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడూ , ఇప్పుడు పార్టీ అధినేతగా, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడూ కూడా ఏటా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ వస్తున్నారు. దీంతో జగన్ కు కూడా అనివార్యంగా ఈ సంప్రదాయాన్ని పాటించక తప్పని పరిస్థితి ఏర్పడింది.  ఆ క్రమంలోనే ఆదివారం తన 53వ పుట్టిన రోజు జరుపుకున్న జగన్ కు చంద్రబాబు, నారా లోకేష్, వైఎస్ షర్మిల తదితరులు సామాజిక మాధ్యమం ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు ప్రతిగా జగన్ కూడా ఒక్క మంత్రి లోకేష్ కు తప్ప మిగిలిన వారందరికీ ధన్యవాదాలు చెబుతూ రిప్లై ఇచ్చారు. దీనిపై జగన్ ను నెటిజనులు ట్రోల్ చేయడంతో వైసీపీయులు జగన్ లోకేష్ కు రిప్లై ఇవ్వకపోవడంపై వివరణ ఇచ్చారు. లోకేష్ జగన్ కు  జన్మదిన శుభాకాంక్షలు తెలుసుతూ ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అంటూ గారు అనే మర్యాద వాచకం లేకుండా ట్వీట్ చేశారనీ, అందుకే జగన్ ఆయనకు ధన్యవాదాలు చెప్పలేదని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.  దీనిపై తెలుగుదేశం వర్గీయులు లోకేష్ జగన్ ను గారూ అనకపోవడానికి కారణం ఉందంటూ రిటార్డ్ ఇచ్చారు. గత ఏప్రిల్ లో ఏపీ సీఎం చంద్రబాబు జన్మదినం సందర్భంగా జగన్ ఆయనను విష్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అని మాత్రమే పేర్కొన్నారని గుర్తు చేశారు. తన తండ్రి సమకాలీనుడైన వ్యక్తికి గౌరవం ఇవ్వాలని తెలియని జగన్ ఇప్పుడు తనకు గౌరవం ఇవ్వలేదని లోకేష్ ను ఎలా అనగలరని పేర్కొన్నారు.  అందుకే టిట్ ఫర్ టాట్ లా లోకేష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని మాత్రమే సంబోధిస్తూ జన్మదిన శుభాకంక్షలు చెప్పారంటున్నారు. 

ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ ఉడత ఊపులు!

రాష్ట్ర ఆవిర్భావం తరువాత పదేళ్ల పాటు అధికారంలో కొనసాగి అహంకారంతో కన్నూమిన్నూగానక వ్యవహరించిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి ఇప్పుడు దయనీయంగా మారిందా? గతంలో మాట్లాడితే తోలు తీస్తామంటూ హెచ్చరికలు జారీ చేసిన ఆ పార్టీ నేతలకు ఇప్పుడు కండలు కరిగి తోలు మాత్రమే మిగిలిందా? అంటే.. తాజాగా మంత్రి జూపల్లి కృష్ణారావు చేసిన వ్యాఖ్యలు ఔననే అంటున్నాయి.  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో బీఆర్ఎస్ నాయకుల పరిస్థితి దయనీయంగా మారిందన్న ఆయన గత పదేళ్ల అధికార గర్వంతో విర్రవీగిన నేతల కండలు  ఇప్పుడు కరిగిపోయాయని ఎద్దేవా చేశారు.  క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ పార్టీ పట్టు కోల్పోయిందనీ, దీంతో ఏం చేయాలో పాలుపోక ఆ పార్టీ నేతలు అయోమయంలో పడ్డారనీ,  అందుకే రేవంత్ ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. గాంధీ భవన్ లో సోమవారం మీడియాతో మాట్లాడిన మంత్రి జూపల్లి కృష్ణారావు.. కేసీఆర్ చేసిన  తోలు తీస్తా  వ్యాఖ్యలపై  తీవ్రంగా స్పందించారు. బీఆర్ఎస్ కేడర్‌లో మిగిలి ఉన్న కొద్దిపాటి తోలు ను రక్షించుకునేందుకే కేసీఆర్ ఇలాంటి పదాలు వాడుతున్నారని ఎద్దేవా చేశారు. జనం బీఆర్ఎస్ పాలనను తిరస్కరించారని, ఇప్పుడు  ఉనికిని కాపాడుకోవడానికి కేసీఆర్ బయటకు రాక తప్పని పరిస్థితి ఏర్పడిందని విశ్లేషించారు. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికే ఇప్పుడు ఉడత ఊపుల మాదిరి విమర్శలు గుప్పిస్తున్నారని విమర్శించారు.  రాష్ట్రంలో జరిగిన పంచాయతీ ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ పతనానికి నిలువెత్తు నిదర్శనంగా జూపల్లి అభివర్ణించారు.  బీఆర్ఎస్, బీజేపీ లు లోపాయికారీ ఒప్పందంతో కలిసి పోటీ చేసినా కూడా  మూడింట్ ఒక వంతు సీట్లు కూడా గెలుచుకోలేకపోయాయన్న జూపల్లి, గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పట్టారన్నారు. ప్రతిపక్షాలు ఎన్ని కుట్రలు చేసినా ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారనడాని కి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు.  పార్టీ ఉనికే ప్రశ్నార్ధకం కావడం వల్లే కేసీఆర్ ఇప్పుడు జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారన్నారు. ఒకప్పుడు ఫామ్ హౌస్‌కే పరిమితమైన నాయకులు, ఇప్పుడు రోడ్ల మీదకు వస్తున్నారంటే అర్ధమ దేనన్నారు.  ఉనికి కాపాడుకోవడానికే కేసీఆర్ రాజకీయ డ్రామాలకు తెరలేపారని జూపల్లి విమర్శించారు.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో ప్రాజెక్ట్ లను నిర్లక్ష్యం చేసింది కేసీఆరేనన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కూడా ప్రాజెక్టులను పూర్తి చేయలేని దద్దమ్మ సర్కార్ కేసీఆర్ ది అంటూ విమర్శలు గుప్పించారు.

ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి నోటీసులు

  ఐపీఎస్ అధికారి అమ్మిరెడ్డికి ఏపీ శాసనమండలి ప్రివిలేజ్ నోటీసులు జారీ చేసింది. రాష్ట్ర విద్యా, ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌కు కించపరిచే విధంగా ట్వీట్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నోటీసులు పంపినట్లు మండలి వర్గాలు స్పష్టం చేశాయి. ఈ నేపధ్యంలో మంగళవారం మధ్యాహ్నం 2:30 గంటలకు సమావేశం కానున్న హక్కుల కమీటి ముందు హాజరు కావాలని ఆదేశించింది.  అమ్మిరెడ్డి ఇచ్చే సమాధానం ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది. గతంలో అమ్మిరెడ్డి గుంటూరు అర్బన్ ఎస్పీగా విధులు నిర్వర్తించిన సమయంలో ఈ వివాదాస్పద ట్వీట్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీనిపై అందిన ఫిర్యాదును పరిశీలించిన శాసనమండలి, ఈ అంశాన్ని హక్కుల కమిటీకి (ప్రివిలేజెస్ కమిటీ) నివేదించింది.

జగన్ బర్త్ డే.. సంబరాల పేరిట పశుబలులు!

ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండకూడదో.. అలా ఉంటారు జగన్. ఒక రాజకీయ నాయకుడు ఎలా మాట్లాడకూడదో అలా మాట్లాడతారు జగన్. ఒక రాజకీయపార్టీకి ఉండాల్సిన లక్షణాలేవీ, ఆయన నేతృత్వంలోని వైసీపీకి లేవు అంటారు పరిశీలకులు. ఔను మరి యధా రాజా తథా ప్రజా అన్నట్లుగా నాయకుడిని బట్టే ఆయన పార్టీ, ఆ పార్టీ నేతలూ, శ్రేణులూ అలా కాకుండా మరెలా ఉంటాయం టున్నారు రాజకీయ పండితులు. జగన్ అధికారంలో ఉన్న ఐదేళ్లూ అభివృద్ధి ఆనవాలు అన్నదే రాష్ట్రంలో కనిపించలేదు. కక్షసాధింపు, వ్యతిరేకించిన వారిపై కేసులు, అరెస్టులే పాలనగా ఆయన అధికారంల ఉన్న ఐదేళ్లూ కొనసాగింది. రాజకీయ ప్రత్యర్థులే కాదు.. ప్రభుత్వ విధానాలు సరిగా లేవన్న సామాన్యులపై కూడా జగన్ పాలనలో దాడులు జరిగాయి. ఇక అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలూ సరే సరి.  సరే జనం విషయం గుర్తించి 2019లో తాము  కట్టబెట్టిన అధికారాన్ని 2024 ఎన్నికలలో లాగేసుకుని అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ అంటూ చంద్రబాబుకు అప్పగించారు.  అది పక్కన పెడితే అధికారం కోల్పోయిన తరువాత కూడా జగన్ తీరు, ఆయన పార్టీ తీరు ఇసుమంతైనా మారలేదు. తాజాగా ఆదివారం జగన్ 53వ పుట్టిన రోజు సందర్భంగా వైసీపీయులు నానా హంగామా సృష్టించారు. జనం ఈసడించుకునేలా పశుబలులు ఇచ్చి రక్తం చిందించారు.  ఇక జగన్ కు జనాభిమానం తగ్గలేదని చాటేందుకు కొందరు పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలూ వేయించారు. జగన్ తాడేపల్లి నుంచి బెంగళూరు వెళ్లడానికి ఫ్లయిట్ ఎక్కగానే  ఆయన పేరున్న గౌన్లు వేసుకున్న చిన్నారులు ఆయనకు బర్త్ డే విషెస్ చెప్పారు. కేక్ కట్ చేశారు. అసలు ఆ విమాన ప్రయాణీకులలో జగన్ ఉంటారని వైసీపీయులకు వినా మరొకరికి తెలిసే చాన్సే లేదుగా. అందుకే చిన్నారులతో చేసిన ఆర్భాటమంతా పెయిడ్ ఆర్టిస్టుల పనేనని ఇటే తెలిసిపోతోందంటున్నారు పరిశీలకులు. సరే ఫ్లైట్ సీన్లు అలా ఉంటే..  ఇక రాష్ట్రంలో పలు ప్రాంతాలలో జగన్ పై అభిమానమంటూ వైసీపీ యులు చేసిన విన్యాసాలు జుగుప్సాకరంగా ఉన్నాయి. రప్ప రప్ప గంగమ్మ జాతర అంటూ ఫ్లెక్సీలు, బ్యానర్లు హోర్డింగులే కాకుండా  మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకాలు చేశారు. ఆ దృశ్యాలను సామాజిక మాధ్యమంలో పోస్టు చేశారు.   అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో , మండల కేంద్రమైన విడపనకల్లు, శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో జగన్ జన్మదినం సందర్భంగా  వైసీపీ నాయకులు, కార్యకర్తలు మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్‌ ఫ్లెక్సీలకి అభిషేకాలు చేశారు. ఇక  ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు   2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అధికారంలో లేకుండానే ఇంత అరాచకంగా వ్యవహరిస్తున్న వైసీపీయులు.. పొరపాటున వచ్చే ఎన్నికలలో విజయం సాధించి అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఏం చేస్తారు? ఆ హింసాకాండను, అరాచకత్వాన్నీ తట్టుకోగలమా అన్న భయాందోళనలు ఇప్పటి నుంచే జనంలో వ్యక్తమౌతున్నాయి. 

సోనియా, రాహుల్‌కు హైకోర్టు నోటీసులు

  నేషనల్ హెరాల్డ్ కేసులో  కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మనీలాండరింగ్ కేసుకు అనుమతి ఇవ్వాలంటూ ఈడీ దాఖలు చేసుకున్న అప్పీల్‌ఫై సమాధానం ఇవ్వాలని సోనియా, రాహుల్ గాంధీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణన జనవరికి వాయిదా వేసింది. కాగా నేషనల్ హెరాల్డ్  మనీలాండరింగ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో పాటు ఇతరులపై ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీట్ ను ఇటీవల రౌస్ అవెన్యూ కోర్టు కొట్టివేసింది.  ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా పీఎంఎల్‌ఏ కింద చర్యలు తీసుకోవడం సాధ్యం కాదని కోర్టు అభిప్రాయపడింది. అదేవిధంగా కేసులో వేసిన ఛార్జ్‌షీటు కూడా చట్టపరంగా నిలవదని డిసెంబర్ 16న న్యాయమూర్తి ఆ పిటిషన్‌ను డిస్మిస్ చేశారు. ఈ క్రమంలోనే ఇవాళ ట్రయల్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈడీ అధికారులు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. 

మేడ్చల్ లో విద్యార్థి మిస్సింగ్.. బతికున్నాడా లేదా అంటూ తల్లిదండ్రుల ఆందోళన

మేడ్చల్ లోని ఓ రెసిడెన్షియల్ స్కూల్ లో విద్యార్థి మిస్సింగ్ ఘటన కలకలం రేపుతోంది.  ఆ స్కూల్ లో తొమ్మిదో తరగతి చదువుతున్న కార్తీక్ అనే 14 ఏళ్ల విద్యార్థి గత కొన్ని రోజులుగా కనిపించడం లేదు. పోలీసులకు ఫిర్యాదు చేసినా అతడి ఆచూకీ గత ఎనిమిది రోజులుగా లభించకపోవడంతో ఆ విద్యార్థి తల్లి దండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.   ఈ నేప థ్యంలో కుటుంబ సభ్యులు స్కూల్ పరిసర ప్రాంతాల్లో విస్తృతంగా గాలించినప్పటికీ బాలుడి ఆచూకీ లభించలేదు.  తమ కుమారుడి మిస్సింగ్‌కు స్కూల్ యాజమాన్యమే కారణమని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. స్కూల్ ఆవరణలో చలి మంట వేసుకున్న కారణంగా వార్డెన్ తమ కుమారుడిని చితకబాదాడని, ఆ దాడి కారణంగానే కార్తీక్ భయంతో స్కూల్ నుంచి వెళ్లిపోయి ఉంటాడనీ వారంటున్నారు. ఈ ఘటనపై స్కూల్ యాజ మాన్యం సరిగా స్పందించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తున్నారు. అసలింతకీ తమ కుమారుడు బతికి ఉన్నాడా? లేదా అన్న అనుమానాన్ని కూడా వారు వ్యక్తం చేస్తున్నారు.   ఇలా ఉండగా.. కార్తీక్ ఆచూకీ కోసం మేడ్చల్ పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టారు. స్కూల్ పరిసరాలు, బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ దర్యాప్తు చేస్తున్నారు. 

ఇండోనేషియాలో ఘోర రోడ్డు ప్రమాదం- 15 మంది దుర్మరణం

ఇక్కడా అక్కడా అన్న తేడా లేకుండా ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రమాదాలు బెంబేలెత్తిస్తు న్నాయి.  రోడ్డు, రైలు విమాన అన్న తేడా లేకుండా ఈ ప్రమాదాలు పెద్ద సంఖ్యలో ప్రయాణీకుల ఉసురు తీస్తున్నాయి. సాంకేతిక సమస్య, మానవ తప్పిదం కారణమేమైతేనేం ప్రయాణం అంటే భయపడే పరిస్థితి ఏర్పడింది. తాజాగా ఇండోనేసియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 15 మంది మృత్యువాత పడ్డారు. మరో 19 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమౌతోంది.  ఇండోనేషియాలోని సెంట్రల్ జావా ప్రాంతంలో ని సెమరాంగ్ నగరం  టోల్ గేట్ వద్ద ప్రయాణికులతో వెళ్తున్న బస్సు ఘోర ప్రమాదానికి గురైంది.  సోమవారం (డిసెంబర్ 22) తెల్లవారుజామున  ఈ ప్రమాదం జరిగింది. బస్సు అతి వేగమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయ్యింది.    క్రాప్యాక్ టోల్ ఎగ్జిట్ కూడలి వద్దకు రాగానే బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోయి డివైడర్‌ని బలంగా ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద తీవ్రతకు బస్సు అద్దాలు పగిలి, డోర్లు మూసుకుపోయాయి. దీంతో బస్సులోకి వెళ్లి క్షతగాత్రులను బయటకు తీసుకురావడం సమస్యగా మారింది. స్థానికుల సహకారంలో ఎలాగో బస్సు డోర్లను తెరిచి లోపలకు వెళ్లిన పోలీసులు ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. 

అండర్ -19 ఆసియా కప్ ఫైనల్.. పాక్ చేతిలో భారత్ చిత్తు

అండర్ 19 ఆసియాకప్ టోర్నీలో ఓటమి అనేదే లేకుండా ఫైనల్ కు చేరిన టీమ్ ఇండియా జట్టు ఫైనల్ లో చతికిల పడింది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ చేతిలో ఘోర ఓటమిని మూటగట్టుకుంది.  ఆదివారం (డిసెంబర్ 22)  ఏకపక్షంగా జరిగిన అండర్ -19 ఆసియా కప్ ఫైనల్ లో భారత జట్టు ఏకంగా 191 పరుగుల తేడాతో చిరకాల ప్రత్యర్థి, దాయాది జట్టు అయిన పాకిస్థాన్ చేతిలో  ఓడిపోయింది.   అండర్‌-19 ఆసియా కప్‌ టైటిల్‌ ఫైట్‌లో టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్ చేపట్టిన  పాకిస్థాన్ నిర్ణీత  50 ఓవర్లలో 8 వికెట్ల నష్టపోయి   347 పరుగుల భారీ స్కోరు చేసింది. పాకిస్థాన్ ఓపెనర్‌ సమీర్‌ మిన్హాస్‌  113 బంతుల్లో 172 పరుగులు చేశాడు.  అలాగే పాక్ బ్యాటర్ అహ్మద్‌ హుస్సేన్‌  56  పరుగులు సాధించాడు. భారత బౌలర్లలో  దీపేష్‌ దేవేంద్రన్‌ మూడు వికెట్లు పడగొట్టగా.. హనిల్‌, ఖిలన్‌ చెరో రెండు వికెట్లు తీసుకున్నారు.  భారీ చేదన కోసం బ్యాటింక్ చేపట్టిన భారత్ 26. 2 ఓవర్లలో 156 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయాన్ని చవి చూసింది.  భారత బ్యాటర్లలో 36 పరుగులు చేసిన దీపేష్ టాప్ స్కోరర్.  కెప్టెన్‌ ఆయుష్‌ మాత్రే (2), వైభవ్‌ సూర్యవంశీ (26) ఇలా మిగిలిన బ్యాటర్లంతా విఫలమయ్యారు.   పాక్‌ పేసర్ల షార్ట్‌ పిచ్‌ బంతులకు  భారత యువ బ్యాటర్ల వద్ద సమాధానమే లేకుండా పోయింది.  పాకిస్థాన్ బౌలర్లలో అలీ రెజా నాలుగు వికెట్ల సాధించి రాణంచాడు.  సుభాన్‌, ఎహ్‌సాన్‌, సయ్యమ్‌ తలో రెండు వికెట్లు తీసుకున్నారు. పాక్‌ ఆటగాళ్లతో  నో హ్యాండ్‌ షేక్‌  విధానాన్ని ఈ మ్యాచ్ లో కూడా ఇండియన్ క్రికెటర్లు పాటించారు.   కాగా ఈ మ్యాచ్ లో పాక్ బౌలర్ అలీ రెజా అద్భుతంగా బౌలింగ్ చేసి రాణించినప్పటికీ, అతడి ప్రవర్తన మాత్రం అతిగా ఉంది. ధాటిగా ఆడే క్రమంలో ఔటై పెవిలియన్ కు వెడుతున్న వైభవ్ సూర్యవంశీని రెచ్చగొట్టేలా అలి రోజా సంబరాలు చేసుకున్నాడు. ఈ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ కూడా తన నోటికి పని చెప్పాడు. అలాగే అంతకు ముందు  భారత జట్టు కెప్టెన్  ఆయుష్‌ అవునప్పుడు కూడా  అలీ రెజా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించాడు. దీంతో డగౌట్‌కు వెళ్తున్న ఆయుష్‌ ఆగ్రహంతో వెనక్కి వచ్చి నోటికి పని చెప్పాడు.  ఆసియా క్రికెట్‌ మండలి  ఏసీసీ  చీఫ్‌, పాకిస్థాన్‌ మంత్రి అయిన మొహిసిన్‌ నఖ్వీ విజేతలకు పతకాలు, ట్రోఫీ ప్రదానం చేశారు. అయితే, భారత్‌కు చెందిన ప్రతినిధులు ఎవరూ ఈ కార్యక్రమంలో కనిపించలేదు. రన్నరప్‌ చెక్‌ను అఫ్ఘానిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు చైర్మన్‌ మిర్వాసి అష్రఫ్‌ చేతుల మీదుగా భారత కెప్టెన్‌ ఆయుష్‌ అందుకొన్నాడు. కాగా, పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో.. నఖ్వీ నుంచి భారత సీనియర్‌ జట్టు ఆసియా కప్‌ను అందుకొనేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే.

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల భారీ ఆయుధ డంప్.. గుర్తించి ధ్వంసం చేసిన భద్రతా దళాలు

ఛత్తీస్‌గఢ్ ని మావోయిస్టుల భారీ ఆయుధ డంప్ ను పోలీసులు ధ్వంసం చేశారు. రాష్ట్రంలో మావోయిస్టు ప్రభావం అధికంగా ఉన్న సుక్మా జిల్లాలో వారికి చెందిన భారీ ఆయుధాల కర్మాగారాన్ని గుర్తించిన పోలీసులు, భద్రతా బలగాలు దానికి ధ్వంసం చేశారు. సుక్మీ జిల్లా మీనా గట్టా అటవీ ప్రాంతంలో మావోయిస్టులు రహస్యంగా నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ కేంద్రాన్ని గురించి అందిన సమాచారం మేరకు సీఆర్పీఎఫ్, పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో ఈ ఆయుధ డంప్ బయటపడింది. ఈ ఆయుధ డంప్ ను మావోయిస్టులు భద్రత దళాలపై దాడికి ఉపయోగిస్తారని భద్రతా దళాలు తెలిపాయి. ఈ డంప్ ధ్వంసంతో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఆటంకం తప్పదని తెలిపారు.   ఈ ఆయుధ డంప్ లో  ఆయుధాల తయారీ సామగ్రి, సింగిల్ షాట్ రైఫిల్స్, డిటోనేటర్లు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు భద్రతా బలగాలు తెలిపాయి.  భద్రతా దళా లను లక్ష్యంగా చేసుకుని ఐఈడీలు, బాంబులు తయారు చేసేందుకు అవసరమైన మందుగుండు సామాగ్రిని మావోయిస్టులు అక్కడ నిల్వ ఉంచారన్నారు. ఆ ప్రాంతంలో ఇంకా నక్సల్స్ దాక్కుని ఉండే అవకాశం ఉందన్న అనుమానంతో ఆ ప్రాంతంలో అడవులను అణువణువూ క్షుణ్ణంగా గాలిస్తున్నట్లు తెలిపిన భద్రతా బలగాలు  నిర్దిష్టగడువులోగా మావోయిస్టు రహిత దేశంగా భారత్ ఉండాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు వివరించారు. 

బాహుబలి రాకెట్ ప్రయోగం సక్సెస్ కావాలి.. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ  ఇస్రో మరో చారిత్రక ప్రయోగానికి రెడీ అయిపోయింది. ఎల్వీఎం 3 బాహుబలి రాకెట్ ద్వారా బ్లూబర్డ్ బ్లాక్ 2 ఉపగ్రహాన్ని ఈ నెల 24 ప్రయోగించనుంది. ఇది  సెల్యులార్ కవరేజ్ లేని ప్రాంతాలకు సేవలు అందించడమే లక్ష్యంగా చేపట్టిన భారీ మిషన్.  4జీ, 5జీ సిగ్నల్‌ను నేరుగా సాధారణ స్మార్ట్‌ఫోన్‌లకు అందించడానికి ఉద్దేశించిన ప్రయోం.  ఈ నెల 24  ఉదయం 8:54 నిమిషాలకు ఎల్వీఎం 3  శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుండి అంతరిక్షానికి దూసుకెళ్లనుంది. ఎల్వీఎం 3 సిరీస్ లో ఇది తొమ్మిదది. ఈ ఏడాది ఇస్రో  చేపట్టిన అయిదో ప్రయోగం ఇది. అమెరికాకు చెందిన ఏఎస్‌టీ స్పేస్‌మొబైల్ అభివృద్ధి చేసిన బ్లూబర్డ్ బ్లాక్ 2, ఉపగ్రహ టెలికమ్యూనికేషన్స్‌లో ఓ వ్యూహాత్మక ప్రయోగంగా భావిస్తున్నారు.   బ్లూబర్డ్ బ్లాక్ శాటిలైట్ బరువు 6,100 కిలోలు. ఈ బాహుబలి రాకెట్ ఎత్తు 43.5 మీటర్లు. 640 టన్నుల బరువు. ఈ ప్రయోగం విజయవంతమైతే   కమ్యూనికేషన్ల ముఖచిత్రం మారిపోతుందంటున్నారు. ఇలా ఉండగా ఈ  బాహుబలి రాకెట్ ప్రయోగం విజయవంతం కావాలని కోరుతూ ఇస్రో ఛైర్మన్ వి. నారాయణన్  తిరుమల శ్రీవారి ఆలయంలో బ్లూబర్డ్  2 ఉపగ్రహానికి పూజలు చేశారు. 

జగన్ జన్మదినం సందర్భంగా పశుబలి

అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా వైసీపీయులు చేసేది అరాచకమే అన్నది మరో సారి రుజువైంది.  రప్పా.. రప్పా.. గంగమ్మ జాతర అంటూ రచ్చ చేస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు వైసీపీ అధినేత జగన్ జన్మదినం సందర్భంగానూ హంగామా చేశారు. మూగజీవాలను బలి ఇచ్చి వాటి రక్తంతో జగన్ ఫ్లెక్సీలకు అభిషేకం చేసి తమ అరాచకానికి హద్దులు అంటూ లేవని మరోసారి నిరూపించుకున్నారు.  వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా వైసీపీ కార్యకర్తలు అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రం మండలం బొమ్మగానిపల్లిలో  ఆదివారం (డిసెంబర్ 21) వీరంగం సృష్టించారు. సర్పంచ్‌ ఆదినారాయణరెడ్డి  ఆధ్వర్యంలో  ఐదు గొర్రెలను  నరికి, వాటి రక్తంతో జగన్‌ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు.  మండల కేంద్రమైన విడపనకల్లు లోనూ అదే తంతు కొనసాగింది. అలాగే శ్రీసత్యసాయి జిల్లా కనగానపల్లి మండలం భానుకోట గ్రామంలో వైసీపీ మద్దతు సర్పంచ్‌ బాలరాజు, నాయకులు కలసి మూగజీవాల తలలు నరికి, ఆ రక్తంతో జగన్‌ ఫ్లెక్సీకి అభిషేకం చేశారు.   మరోవైపు జగన్‌ పుట్టినరోజు సందర్భంగా ప్రకాశం జిల్లా పందువ నాగులారం పంచాయతీ పరిధిలోని గుమ్మలకర్ర జంక్షన్‌లో వైసీపీ అభిమాని ఒకరు   2029లో రప్పరప్ప.. 88 మ్యాజిక్‌ ఫిగర్‌ దాటినప్పటి నుంచి గంగమ్మ జాతరే అంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. గుమ్మలకర్ర గ్రామానికి చెందిన మన్నెపల్లి దినేష్‌ ఈ వివాదాస్పద ఫ్లెక్సీని ఏర్పాటు చేశారంటూ తెలుగుదేశం  శ్రేణులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆ ఫ్లెక్సీని తొలగించి దినేష్‌ను అదుపులోకి తీసుకున్నారు. 

కూలిపోతున్న మస్క్ ఉపగ్రహం

ఎలాన్ మస్క్ కు చెందిన  స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్ ఉపగ్రహం కక్ష్య నుంచి అదుపుతప్పి భూమి వైపు దూసుకొస్తోంది. సాంకేతిక లోపం  కారణంగా ఇది భూమి వాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుందని స్పెస్ ఎక్స్ ధృవీకరించింది. అయితే ఈ శాటిలైట్ భూమిపై కూలి పోవడం వల్ల స్పేస్ ఎక్స్ కు కానీ, భూమికి కానీ ఎటువంటి ప్రమాదం, ముప్పు వాటిల్లదని క్లారిటీ ఇచ్చింది. టెస్లా అధినేత  ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ స్టార్‌లింక్‌ ప్రాజెక్టులోని ఉప్రగ్రహాల్లో ఒకటి డిసెంబరు 17న సాంకేతిక లోపం కారణంగా అదుపు తప్పి కూలిపోవడం ప్రారంభించింది. వారం రోజుల్లోగా ఇది భూవాతావరణంలోకి ప్రవేశించి కూలిపోతుంది.  ఈ కూలిపోతున్న  స్టార్ లింక్ శాటిలైట్ శకలాలను వరల్డ్ వ్యూ-3 అనే ఉపగ్రహం 241 కిలోమీటర్ల దూరం నుంచి ఫొటోలు తీసింది. అవి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. 

రోహిత్, కోహ్లీ సరసన స్మృతి మంధాన

భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన టి20లలో నాలుగు వేల పరుగులు చేసిన తొలి భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. శ్రీలంకతో ఆదివారం (డిసెంబర్ 21) జరిగిన టి20 మ్యాచ్ లో పాతిక పరుగులు చేసిన స్మృతి మంధాన ఈ రికార్డు సృష్టించింది. మొత్తంగా టి20 ఫార్మట్ లో నాలుగువేల పరుగుల క్లబ్ లో చేరిన రెండో మహిళా క్రికెటర్ గా నిలిచింది.  న్యూజిలాండ్ ప్లేయ‌ర్ సుజీ బేట్స్ 4,716 ప‌రుగుల‌తో తొలి స్థానంలో ఉంది.   స్మృతి మంధానా  154 మ్యాచుల్లో 4007 ర‌న్స్ చేసింది. ఇందులో ఒక సెంచ‌రీతో పాటు 31 అర్ధ సెంచ‌రీలు ఉన్నాయి.  మొత్తం మీద టీ20 క్రికెట్‌లో పురుషులు, మహిళలను పరిగణనలోనికి తీసుకుంటే ఇంత వరకూ స్మృతి మంధానాతో కలిసి  ఐదుగురు మాత్రమే ఈ ఫార్మట్లో నాలుగువేల పరుగుల మైలు రాయిని దాటారు. ఇండియా నుంచి అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు మాత్రమే ఈ ఘనత సాధించారు. ఇప్పుడు వారి సరసన స్మృతి మంధానా చేరింది.  ఈ ముగ్గురూ కాకుండా బేట్స్, పాకిస్థాన్‌కు చెందిన బాబర్ ఆజం మాత్రమే ఈ ఫార్మట్ లో నాలుగువేలు అంతకు మించి పరుగులు చేశారు. ఇలా ఉండగా ఈ జాబితాలో అందరి కంటే పిన్న వియస్కురాలు స్మృతి మంధానా మాత్రమే కావడం గమనార్హం.  

కేసీఆర్ నేల విడిచి సాము.. బాబు బూచి అంటే జనం నమ్ముతారా?

బీఆర్ ఎస్ అధినేత‌, మాజీ సీఎం కేసీఆర్ మరోసారి నేల విడిచి సాము చేశారు.  కేసీఆర్ సుదీర్ఘ కాలం తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన పార్టీ ఓటమికి కారణాలు, ఇటీవలి కాలంలో పార్టీలో సంక్షోభ పరిస్థితులపై మాటమాత్రమేనా ప్రస్తావించకుండా.. ఏక‌కాలంలో అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రంలోని కాంగ్రెస్ స‌ర్కారుని, పనిలో పనిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై విమర్శలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలోని మోడీ సర్కార్ తెలంగాణకు శనిలా దాపురించిందని శాపనార్ధాలు పెట్టారు.   రాష్ట్రానికి అన్యాయం జ‌రుగుతుంటే.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ దద్దమలా చూస్తూ కూర్చుందంటూ దుయ్యబట్టారు. అలాగే చంద్రబాబునా యుడు ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఉన్నప్పుడు పేరుకు పాలమూరును దత్తత తీసుకుని, అభివృద్ధి పేరిట శంకుస్థాపన ఫలకాలకే పరిమితమయ్యారనీ, ఆయన హయాంలో శంకుస్థాపన ఫలకాలకు అయిన ఖర్చుతో ఏకంగా ఓ ప్రాజెక్టే కట్టవచ్చంటూ విమర్శలు గుప్పించారు. సాగునీటి ప్రాజెక్టులలో తెలంగాణ అన్యాయంపై ఆయన మాట్లాడినా, ఆయన అసలు లక్ష్యం మాత్రం చంద్రబాబును రెచ్చగొట్టి చంద్రబాబు  లేదా, తెలుగుదేశం పార్టీ నుంచి ప్రతి విమర్శలు రావాలనీ, అలా వస్తే మొత్తం పరిస్థితిని తెలంగాణ వర్సెస్ ఏపీగా మార్చి ఏకకాలంలో తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీనీ, కేంద్రంలో మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వాన్నీ ఇరుకున పెట్టాలన్నట్లుగా కనిపిస్తోందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  అంతర్గత సంక్షోభంలో కూరుకుపోయి, రాష్ట్రంలో పార్టీ ఉనికి మాత్రంగా మిగిలిన ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ సెంటిమెంట్ ను ఆసరా చేసుకుని రాష్ట్రంలో బలోపేతం కావాలన్న ఉద్దేశం వినా కేసీఆర్ మాటలలో రాష్ట్రానికి జలాల విషయంలో అన్యాయం జరుగుతోందన్న ఆవేదన కానీ, ఆందోళన కానీ కనిపించలేదని అంటున్నారు. ఒక వేళ అటువంటిదేమైనా ఉంటే.. తన కుమార్తె కవిత కాళేశ్వరం ప్రాజెక్టును దండగమారి ప్రాజెక్టు అనడంపై స్పందించి కనీసం ఆమె వ్యాఖ్యలను ఖండించి ఉండేవారని చెబుతున్నారు.  పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాప్యంపై కాంగ్రెస్ ను దుమ్మెత్తి పోసిన ఆయన.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న రేవంత్ ప్రభుత్వానికి ఇంత కాలం సమయం ఇచ్చామనీ, ఇక నుంచి మాత్రం ఊరుకునేది లేదనీ హెచ్చరించారు. త్వరలో బహిరంగ సభలు ఏర్పాటు చేసి మరీ రేవంత్ సర్కార్  వైఫల్యాలను ఎండగడతామని హెచ్చరించారు.  కేసీఆర్ మీడియా సమావేశం పెట్టి కాంగ్రెస్, బీజేపీలపై విమర్శలు గుప్పించినా, ఆయన మాటలు విన్న ఎవరికైనా తెలంగాణలో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీయా అన్న అనుమానం రాకమానదు. ఎందుకంటే కేసీఆర్ ప్రెస్ మీట్ మొత్తం చంద్రబాబు జపంగా మారిపోయింది. కనీసం ఓ 50 సార్లు ఆయన చంద్రబాబు పేరు ప్రస్తావించారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయానికి కాంగ్రెస్, బీజేపీలు కాదు చంద్రబాబే కారణమని తేల్చేశారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ కు చంద్రబాబు గురువు అన్నారు. బాబును కాదనీ రేవంత్ ఏం చేయరన్నారు. అలాగే కేంద్రంలో మోడీ సర్కార్ మనుగడకు కీలకంగా ఉన్న చంద్రబాబు అభీష్ఠం మేరకే కేంద్ర ప్రభుత్వం నడుచుకుంటోందంటూ ఆరోపణలు గుప్పించారు.  కేసీఆర్ వైఖరి చూస్తుంటే.. తెలంగాణలో బీఆర్ఎస్ రాజకీయంగా బలపడాలన్నా, కనీసం ఉనికిని చాటుకోవాలన్నా చంద్రబాబు ను లాగకుండా సాధ్యం కాదని ఆయన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) 2018 ఎన్నికలలో విజయం సాధించి రెండో సారి అధికారంలోకి రావడానికి కేసీఆర్ రగిల్చిన సెంటి ‘మంటే’ కారణమనడంలో సందేహం లేదు. అయితే రెండో సారి అధికారంలోకి వచ్చిన తరువాత కేసీఆర్ జాతీయ రాజకీయాలలో చక్రం తిప్పాలన్న లక్ష్యంతో స్వయంగా తానే సెంటిమెంట్ ను నీరుగార్చేశారు. పార్టీ పేరులో తెలంగాణను తీసేశారు. అందుకే నీట తగాదాలు, సాగర్ వివాదం అంటూ 2023 ఎన్నికల ముందు ఎంత ప్రయత్నించినా జనం తిరస్కరించారు. కేసీఆర్ రాజకీయ అవసరాల కోసం సెంటిమెంట్ పని చేయదన్న విషయాన్ని సందేహాలకు అతీతంగా తెలంగాణం 2023 ఎన్నికలలో తీర్పు ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ సెంటిమెంటు అంటూ పొరుగు రాష్ట్రం ముఖ్యమంత్రిని బూచిగా చూపాలని కేసీఆర్ చేస్తున్న ప్రయత్నం నేల విడిచి సామేనని అంటున్నారు పరిశీలకులు.  

జగన్ కు షర్మిల బర్త్ డే విషెస్.. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ జగన్ రెస్సాన్స్

ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం (డిసెంబర్ 21) తన 53వ పుట్టిన రోజు జరుపుకున్నారు. ఆ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు సహా పలువురు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే విశేషమేంటంటే.. ఇటీవలే ఆయన సోదరి వైఎస్ షర్మిల కూడా తన జన్మదినాన్ని జరుపుకున్నారు. ఆ సందర్భంగా కూడా ఏపీ సీఎం చంద్రబాబాబు, మంత్రి లోకేష్ సహా రాజకీయాలకు అతీతంగా పలువురు నేతలు, ప్రముఖులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే షర్మిల సొంత అన్న జగన్ మాత్రం చెల్లెలికి శుభాకాంక్షలు తెలియజేయలేదు. ఈ అన్నా చెళ్లెళ్ల మధ్య చాలా కాలంగా విభేదాలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆస్తుల పంచాయతీ నుంచి, పొలిటికల్ గా దారులు వేరవ్వడం వరకూ ఇరువురి మధ్యా అగాధం పూడ్చలేనంతగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే.    షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తరువాత నుంచీ వీరి మధ్య విభేదాలు మరింత పెచ్చరిల్లాయి.  2024 ఎన్నికలకు ముందు, తరువాత కూడా షర్మిల జగన్ పై విమర్శల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్యా జన్మదిన శుభాకాంక్షలు చెప్పుకోవడం, రాఖీలు కట్టడం వంటివి అన్నీ నిలిచిపోయియి.  అయితే తాజాగా ఆదివారం జగన్ పుట్టిన రోజు సందర్భంగా షర్మిల అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అయితే ఆ తెలపడంలోనూ చిన్న ట్విస్ట్ ఇచ్చారు. చెల్లెలిగా కాకుండా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలిగా షర్మిల వైసీపీ అధ్యక్షుడు జగన్ గారికి అని సంబోధిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అందుకు జగన్ కూడా స్పందించారు. ధ్యాంక్యూ షర్మిలమ్మా అంటూ రిప్లై ఇచ్చారు. జగన్ కు షర్మిల పుట్టిన రోజు శుభాకాంక్షల ట్వీట్, అలాగే అందుకు జగన్ రెస్పాన్స్ రెండూ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. 

గిల్‌ను తప్పిస్తున్నట్లు ముందే చెప్పారా?

  టీ20 ప్రపంచ కప్ 2026కి సంబంధించి భారత జట్టును శనివారం ప్రకటించారు. ఇందులో స్టార్ బ్యాటర్ శుభ్‌మన్ గిల్‌కు చోటు దక్కలేదు. ప్రస్తుత టీమిండియా టెస్ట్, వన్డే ఫార్మాట్‌ల కెప్టెన్, టీ20 వైస్ కెప్టెన్.. గిల్‌ను స్టాండ్ బైగా కూడా సెలక్టర్లు ఎంపిక చేయకపోవడం క్రికెట్ పండితులు కూడా ఊహించలేదు. గిల్ కూడా న్యూజిలాండ్ సిరీస్, ప్రపంచ కప్‌లో ఆడేందకు సన్నాహాలు సిద్ధం చేసుకుంటున్న వేళ బీసీసీఐ ఈ నిర్ణయాన్ని వెల్లడించింది.  అయితే తనపై వేటు పడుతుందని గిల్‌కు ముందే తెలుసు అన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కుడి పాదానికి గాయం అవ్వడంతో సౌతాఫ్రికాతో జరిగిన చివరి రెండు టీ20లకు గిల్ జట్టులో లేడు. శనివారం అహ్మదాబాద్‌ను వీడి చండీగఢ్‌కు బయల్దేరిన సమయంలో సెలక్షన్ కమిటీ భేటీ జరిగింది. జట్టును ప్రకటించడానికి కొద్దిసేపటికి ముందే బీసీసీఐ నుంచి గిల్‌కి ఫోన్ వచ్చింది. తనను జట్టులోంచి తప్పించిన విషయాన్ని చెప్పారు.  ఈ విషయాన్ని క్రిక్ బజ్ తన కథనంలో పేర్కొంది. అయితే గిల్‌కు ఎవరు ఈ విషయం గురించి చెప్పారనే అంశం మాత్రం బయటకు రాలేదు. గిల్‌ తొలుత గాయంతోనే దక్షిణాఫ్రికాతో టీ20 ఆడేందుకు సిద్ధపడ్డాడు. కానీ మైదానంలోకి దిగితే అది మరింత తీవ్రమై కీలక టోర్నమెంట్లకు దూరం కావాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరించడంతో వెనక్కి తగ్గాడు. ఆ తర్వాతే బీసీసీఐ కూడా అతడికి గాయమైన విషయాన్ని ధ్రువీకరించింది. లఖ్‌నవూలో డిసెంబర్‌ 16న నెట్‌ప్రాక్టీస్‌ సమయంలో గిల్ గాయపడ్డాడు. దీంతో జట్టులో ఆడేందుకు సంజుకు అవకాశం లభించింది.