‘పోసాని ఆత్మహత్య’... నో ఛాన్స్!
రాజకీయ నాయకులు అప్పుడప్పుడు ‘తల నరుక్కుంటా’, ‘ఆత్మహత్య చేసుకుంటా’ అని స్టేట్మెంట్స్ ఇస్తూ వుంటారు. సినిమా రంగం నుంచి వచ్చినప్పటికీ వైసీపీ రాజకీయాలు బాగానే ఒంటపట్టించుకున్న పోసాని కృష్ణమురళి కూడా ఇప్పుడు ఆత్మహత్య పాట పాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో రైతులు ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’ అంటేనే భయపడిపోతున్నారు. ఇప్పటికే తమ భూముల పాస్బుక్ల మీద ప్రత్యక్షమైన జగన్, దేశంలో ఎక్కడా లేని కొత్త చట్టాన్ని తీసుకొచ్చాడు. ఈ చట్టం ద్వారా తమ భూములు తమకు కాకుండా పోతాయన్న భయం అందరిలోనూ వుంది. కబ్జాదారులకు, మోసగాళ్ళకు, బడాబాబులకు కలిసొచ్చే విధంగా వున్న ఈ చట్టం రైతుల గుండెల్లో రైళ్ళు పరిగెత్తిస్తోంది. 13న జరిగే పోలింగ్లో జగన్కి వ్యతిరేకంగా ఓటు వేసి తమ భూములను కాపాడుకునే ఆలోచనలో రైతులు వున్నారు. కర్ణుడి చావుకి అనేక కారణాలున్నట్టు, జగన్ ఓడిపోవడానికి ఈ ‘లాండ్ టైటిలింగ్ యాక్ట్’ కూడా ఒక కారణం కానుందన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు.
‘లాండ్ టైటిలింగ్ చట్టం’ విషయంలో జగన్ పార్టీకి డ్యామేజీ జరిగిపోయింది. ఆ డ్యామేజీని రిపేర్ చేయడానికి వైసీపీ నాయకులు తంటాలు పడుతున్నారు. అయినప్పటికీ వర్కవుట్ కావడం లేదు. ఇప్పుడు వైసీపీలో పొలిటికల్ కమెడియన్ పాత్రకి న్యాయం చేస్తున్న పోసాని కృష్ణమురళి రంగంలోకి దిగారు. లాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రభుత్వం పేదల భూములు లాక్కుంటే తాను విజయవాడలో ఆత్మహత్య చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చారు. ఆత్మహత్య చేసుకుంటానని అన్నారుగానీ, ఉరి వేసుకుంటారా, నీళ్ళలో దూకుతారా, లేక విషం తాగుతారా అనే క్లారిటీ మాత్రం ఇవ్వలేదు.
గతలో ‘తల నరుక్కుంటా’, ‘ఆత్మహత్య చేసుకుంటా’, ‘పబ్లిగ్గా ఉరి వేసుకుంటా’ లాంటి స్టేట్మెంట్లు ఇచ్చిన నాయకులెవరూ ఆత్మహత్య చేసుకున్న దాఖలాలు లేవు కాబట్టి, పోసాని కూడా మాటమీద నిలబడి చచ్చిపోడు కాబట్టి భయాలేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. పైగా పోసానికి ఆత్మహత్య చేసుకునే అవకాశం కూడా రాదులెండి. ఎందుకంటే, వచ్చేది కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొట్టమొదట చేసే పని లాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం. అందువల్ల ఆ చట్టం రద్దయిన తర్వాత రైతులందరూ హ్యాపీగా వుంటారు. వాళ్ళ ఆనందం చూస్తూ పోసాని బతికే వుండొచ్చు. వైసీపీ ఎలాగూ అధికారంలోకి రాదు కాబట్టి, తాను ఆత్మహత్య చేసుకుంటా అని స్టేట్మెంట్ ఇచ్చినా ఇబ్బందేం వుండదని కూడా పోసాని ఆలోచించి వుండవచ్చు.
ఖర్మకాలి జగన్ ప్రభుత్వం వస్తే, ఆ దుర్మార్గపు చట్టాన్ని అమలు చేస్తే, అది చూసి పోసాని ఆత్మహత్య చేసుకుంటే రైతులకు ఏం ఒరుగుతుంది? పోసాని ఆత్మహత్య చూసి జగన్ కరిగిపోయి ఆ చట్టాన్ని అమలు చేయడం ఆపేస్తాడా? పోనీ జగన్ చేసే పనులను అడ్డుకుని, జగన్ని కంట్రోల్ చేసే సీన్ పోసానికి వుందా? అయినా పోసాని ఇప్పుడు ఆత్మహత్య చేసుకుంటానని స్టేట్మెంట్ ఇచ్చారుగానీ, నిజంగా ఆయనకు రైతుల మీద ఆ రేంజ్లో ప్రేమ వుంటే ఏనాడో ఆత్మహత్య చేసుకుని వుండాలి మరి. రాజధాని కోసం స్వచ్ఛందంగా భూములను ఇచ్చిన అమరావతి రైతులు ఎంతో బాధపడుతున్నారు. ఆ బాధ చూసి, అదే ప్రాంతానికి చెందిన పోసాని ఆత్మహత్య చేసుకుని వుండాలి కదా? తాతలు, తండ్రులు ఇచ్చిన భూముల హక్కుపత్రాల పాస్బుక్ మీద జగన్ ఫొటో ముద్రించినప్పుడు ఆ అన్యాయాన్ని చూసినప్పుడే పోసాని ఆత్మహత్య చేసుకుని వుండాలి కదా? ఆ సందర్భాలన్నిట్లోనూ రైతులకు మద్దతుగా రాని పోసాని ఇప్పుడు రైతుల కోసం ఆత్మహత్య చేసుకుంటానని ప్రకటించడం కంటే పెద్ద కామెడీ మరొకటి లేదు. ఎప్పుడూ రైతుల సైడ్ నిలవని ఈ పెద్దమనిషి ఇప్పుడు సూసైడ్ లాంటి పెద్దపెద్ద మాటలు మాట్లాడ్డం వింతల్లోకెల్లా వింత.
ఇంకో పాయింట్ ఏంటంటే, పోసాని కృష్ణమురళి తండ్రి గతంలో పేకాట ఆడి, అప్పుల పాలైపోయి, పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోసానికి కూడా అలా వంశ పారంపర్యంగా సూడైడ్ టెండెన్సీ వచ్చిందేమో, ఎందుకైనా మంచిది... పోసాని మానసిక వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకుని, పదికాలాలపాటు చల్లగా వుండాలని సూచన.