ఓటు వేయడానికి వ్యయప్రయాసలు లెక్క చేయకుండా వస్తున్నారు.. కూటమి విజయం పక్కా!
అరాచక పాలనను అంతం చేయడానికి సమయం వచ్చింది.. కత్తులతో, పోలీస్ లాఠీలతో ప్రశ్నించిన వారిపై కక్షపూరితంగా వ్యవహరించిన నియంతను గద్దె దింపేందుకు సమయం ఆసన్నమైంది.. సొంత తల్లినీ, చెల్లెలను ఇబ్బందులు పాలుచేస్తున్న సీఎంకు బుద్ధిచెప్పే అవకాశం వచ్చింది. సుదీర్ఘకాలం సీఎంగా పని చేసిన పార్టీ అధినేతను తప్పుడు కేసులతో జైల్లో పెట్టిన దుర్మార్గపు సీఎంకు గుణపాఠం చెప్పేందుకు బెల్ మోగింది.. పదండి పదండి పల్లెకు పోదాం.. ఓటు ద్వారా నియంత సీఎంకు గుణపాఠం చెబుదాం అంటూ.. ఏపీ ఓటర్లు పల్లెబాట పట్టారు. ఐదేళ్లుగా సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రజావ్యతిరేక పాలనతో విసిగిపోయిన ఏపీ ప్రజలు ఓటు ద్వారా తమ రాష్ట్రానికి సరైన నాయకత్వాన్ని ఎన్నుకునేందుకు సన్నద్ధమయ్యారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా హైదరాబాద్, బెంగళూరు రాష్ట్రాలతోపాటు ఇతర రాష్ట్రాలు, దేశాల్లో నివాసం ఉంటున్న ఏపీ ఓటర్లు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు ఇసుకేస్తే రాలనంత స్థాయిలో జనంతో కిక్కిరిసిపోతున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ జాతీయ రహదారిపై రెండు రోజులుగా వాహనాల రద్దీ విపరీతంగా పెరిగింది. సాధారణంగా సంక్రాంతి పండుగ సమయంలో ఇలాంటి పరిస్థితిని చూస్తుంటాం. కానీ, ఈసారి సంక్రాంతి పండుగకు మించిన స్థాయిలో అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ద్వారా రాష్ట్ర భవిష్యత్ ను నిర్ణయించేందుకు ఏపీ ఓటర్లు స్వగ్రామాలకు తరలుతున్నారు. వెళ్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో పరిస్థితిని చూస్తే ఏపీ ఓటర్లు ఇంతమంది బయట రాష్ట్రాలు, దేశాల్లో జీవనం సాగిస్తున్నారా అని ఆశ్చర్యం కలగక మానదు.
దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు విడతల వారిగా జరుగుతున్నాయి. నాలుగో విడతలో భాగంగా సోమవారం ఏపీలో అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు, 25 లోక్ సభ స్థానాలకు సోమవారం పోలింగ్ జరగనుంది. ఏపీలో మొత్తం 4కోట్ల 8లక్షల 7వేల 256 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 2కోట్ల 74వేల 322 మంది, మహిళా ఓటర్లు 2కోట్ల 7లక్షల 29వేల 452 మంది ఉన్నారు. 3,482 మంది థర్డ్ జెండర్ ఓటర్లు ఉన్నారు. ఈసారి ఏపీలోని పార్టీలతో పాటు ఓటర్లు సైతం ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఎలాగైనా సరే ఓటు హక్కు వినియోగించుకుని రాష్ట్రంలో సుపరిపాలనకు మార్గం సుగమం చేయాలని భావిస్తున్నారు. సాధారణంగా అధికార పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉంటేనే ఈ స్థాయిలో ప్రజలు ఓటు వేయడం కోసం తహతహలాడుతారు. ఇప్పుడు ఏపీలో వైసీపీ సర్కార్ పై ఏ స్థాయిలో ఆగ్రహం ఉందో ఓటు కోసం తరలి వస్తున్న జన సంద్రమే నిదర్శనం. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాటినుంచి ఏపీ అన్నిరంగాల్లో వెనుకబడిపోయింది. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొద్దిరోజుల్లోనే ప్రజాభవన్ ను కూల్చేశారు, అన్నా క్యాంటీన్లు తొలగించేశారు. మూడు రాజధానుల పేరుతో అమరావతి రాజధానిని నిర్వీర్యం చేశారు. అక్కడి నుంచి జగన్ రాక్షసత్వం బయటకు వచ్చింది. పేద, మధ్య తరగతి ప్రజల అభివృద్ధిని పూర్తిగా పక్కకుపెట్టిన జగన్.. ఇసుక, మట్టి, మద్యం మాఫియా ద్వారా వేల కోట్లతో జేబులు నింపుకున్నారు. జగన్ అరాచక పాలనను ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీల నేతలను, సామాన్య ప్రజలను పోలీసుల సహాయంతో అక్రమ అరెస్టులు చేయించడం, దాడులు చేయించడం, జైల్లో పెట్టించడం చేసిన జగన్.. ప్రజలను భయపెట్టి పాలించారు. జగన్ తరహాలోనే వైసీపీ నేతలు, కార్యకర్తలు సైతం రెచ్చిపోవటంతో ఐదేళ్ల వైసీపీ పాలనలో అన్నివర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ బిక్కుబిక్కుమంటూ ఏపీలో జీవనం సాగించాల్సిన పరిస్థితులు తలెత్తాయి.
వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో ఉద్యోగ అవకాశాలు లేకపోగా.. పనిచేసేందుకు కనీసం పనికూడా దొరకని పరిస్థితి ఏర్పడింది. దీంతో పెద్ద సంఖ్యలో ఏపీలోని యువత, మధ్య వయస్కులు సొంత గ్రామాలను, రాష్ట్రాన్ని వదిలి పక్కరాష్ట్రాలకు వెళ్లి ఉపాధి పొందుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లి చిన్నచిన్న పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటినుంచి హైదరాబాద్, బెంగళూరు రాష్ట్రాలకు వెళ్లిన ఏపీ ప్రజల సంఖ్య భారీగా పెరిగింది. వీరంతా జగన్ అరాకచక పాలనకు ఇబ్బందులు ఎదుర్కొని రాష్ట్రం వదిలి వెళ్లిన వారే. ప్రస్తుతం వీరంతా ఓటు ద్వారా జగన్ మోహన్ రెడ్డికి బుద్దిచెప్పేందుకు సిద్ధమయ్యారు. సొంత ఖర్చులు పెట్టుకొని మరీ ఓటు వేసేందుకు సొంత గ్రామాలకు చేరుకుంటున్నారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు గత రెండు రోజులుగా కిక్కిరిపోతున్నాయి. జాతీయ రహదారులపై వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లిన ఏపీ ప్రజలుసైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు స్వరాష్ట్రానికి తరలివచ్చారు. ప్రత్యేక విమానాల ద్వారా సొంత ఖర్చులతో ఓటుకోసం తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ కనిపించలేదు. కేవలం జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనే ఇందుకు కారణం. అవగాహన, అనుభవం లేని పాలనతో రాష్ట్రానికి కనీసం రాజధానికూడా లేకుండా చేయడంతో వైసీపీ ప్రభుత్వంపై ఏపీ ప్రజలు మండిపడుతున్నారు.
ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఐటీలో ఉద్యోగాలు చేస్తున్న ఏపీ యువత గతంలో ఓటు అంటే పెద్దగా ఆసక్తి చూపేవారు కాదు. దీంతో గతంలో ఏపీలో ఓటింగ్ శాతం ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. గత ఎన్నికల్లోనూ 78.8శాతం మాత్రమే ఓటింగ్ నమోదైంది. కానీ, ఈసారి కచ్చితంగా ఓటువేసి తీరాలని విదేశాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు ఏపీ ఓటర్లు చేరుకున్నారు. దీనికి ప్రధాన కారణం ఉంది. 14ఏళ్లు సీఎంగా పనిచేసిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును వైసీపీ ప్రభుత్వం అక్రమంగా జైల్లో పెట్టింది. చంద్రబాబు అక్రమాలకు పాల్పడినట్లు ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ జగన్ మోహన్ రెడ్డి కేవలం కక్షపూరితంగా చంద్రబాబును జైలుకు పంపించారు. దీంతో మెజార్టీ ఐటీ ఉద్యోగులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ సమయంలో విదేశాల్లో, దేశంలోని హైదరాబాద్, బెంగళూరుతో పాటు ఇతర రాష్ట్రాల్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి జగన్ ప్రభుత్వంపై నిరసనగా గళమెత్తారు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ, మాదాపూర్ ప్రాంతాల్లో ఐటీ ఉద్యోగులు రోడ్లపైకి వచ్చి పెద్దఎత్తున నిరసన తెలిపారు. తద్వారా చంద్రబాబుపై తమ అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం ఓటు ద్వారా జగన్ ప్రభుత్వానికి చరమగీతంపాడి.. అభివృద్ధికి కేరాఫ్ గా ఉండే చంద్రబాబును అధికారంలోకి తెచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. తద్వారా విదేశాలు, దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ఐటీ ఉద్యోగులు తమ స్వగ్రామాలకు చేరుకున్నారు.