ప్రత్యక్ష రాజకీయాల్లోకి నారా బ్రహ్మణి నో

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి కోడలు, మంత్రి నారా లోకేష్ సతీమణి నారా బ్రహ్మణి తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. గత జగన్ ప్రభుత్వ హయాంలో అప్పటి విపక్ష నేత చంద్రబాబును స్కిల్ కేసు పేరుతో అక్రమంగా అరెస్టు చేసిన సమయంలో నారా బ్రహ్మణి తొలి సారిగా ప్రజల మధ్యకు వచ్చి అరెస్టునకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. ఆ సందర్భంగా ఆమె ప్రసంగాలు ప్రజలను విపరీతంగా ఆకట్టుకున్నాయి. స్వచ్ఛమైన ఉచ్ఛారణతో తెలుగులో ఆమె చేసిన ప్రసంగం, రాజకీయాలపై ఆమెకు ఉన్న అవగాహనను ప్రస్ఫుటం చేసింది. దీంతో అప్పట్లో తెలుగుదేశం కు నారా బ్రహ్మణి బ్రహ్మాస్త్రం అంటూ తెలుగుదేశం శ్రేణులు పేర్కొన్నాయి. విశ్లేషకులు సైతం ఆమె రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అయితే తాజాగా బ్రహ్మణి స్వయంగా తనకు ప్రత్యక్ష రాజకీయాలలోకి వచ్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు. తన ప్రథమ ప్రాధాన్యత హెరిటేజ్ ఫుడ్స్ మాత్రమేనని చెప్పారు.   బిజినెస్ టుడే  ఈ నెల 12న ముంబైలో నిర్వహించిన 'మోస్ట్ పవర్‌ఫుల్ విమెన్ -2025 కార్యక్రమంలో బ్రాహ్మణి  పాల్గొని ప్రసంగించారు. హెరిటేజ్ ఫుడ్స్ ద్వారా  సమాజంపై గొప్ప ప్రభావం చూపించే అవకాశం తనకు లభించిందన్న ఈ సందర్భంగా ఆమె చెప్పారు. కాగా కార్యక్రమ నిర్వాహకులు ఒక వేళ చంద్రబాబు మిమ్మల్ని రాజకీయాలలోకి రావాల్సిందిగా కోరితే ఏం చేస్తారు అన్న ప్రశ్నకు.. నారా బ్రహ్మణి రాజకీయాలు తనకు  ఆసక్తికరమైన రంగం కాదని స్పష్టం చేశారు. పాడి పరిశ్రమ రంగంలో  లక్షల మంది మహిళా రైతులు, కోట్లాది మంది వినియోగదారులపై ప్రభావం చూపగలిగే అవకాశం తనకు లభించిందని, అటువంటి అవకాశాన్ని తాను వదులుకోదలచుకోలేదని బ్రాహ్మణి అన్నారు. 

శ్రీ చరణి రెడ్డికి ప్రభుత్వోద్యోగం, ఇంటి స్థలం.. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ సర్కార్

తెలుగు తేజం, టీమ్ ఇండియా మహిళా క్రికెట్ జట్టు ప్లేయర్ శ్రీచరణి రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ హోదా కలిగిన ఉద్యోగాన్ని కల్పిస్తూ సోమవారం (డిసెంబర్ 15) ఉత్తర్వులు జారీ చేసింది. మహిళల వన్డే వరల్డ్ కప్ క్రికెట్ టోర్నీలో టీమ్ ఇండియా విజేతగా నిలవడంలో  శ్రీచరణి రెడ్డి కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కడప జిల్లాకు చెందిన 21 ఏళ్ల శ్రీచరణి, లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ స్పిన్నర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తున్నారు. ఈ ఏడాది శ్రీలంకలో జరిగిన వన్డే సిరీస్‌తో ఆమె అంతర్జాతీయ అరంగేట్రం చేశారు. ఇటీవల జరిగిన ఐసీసీ మహిళల ప్రపంచ కప్‌లో అద్భుతమైన ప్రదర్శన కనబరిచి, జట్టు విజయంలో ముఖ్య భూమిక పోషించింది. ఆ తరువాత ఆమె అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాలోకేష్ ను కలిశారు. ఆ సందర్భంగా ఆమెను సన్మానించిన రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడే ఆమెకు గ్రూప్ వన్ స్థాయి ఉద్యోగం, కడపలో వెయ్యి గజాల ఇంటి స్థలం ఇస్తామని ప్రకటించింది. ఇప్పుడు ఆ ప్రకటన మేరకు ఉద్యోగం కల్పించి, అలాగే కడపలో వెయ్యి గజాల ఇంటి స్థలాన్నీ కేటాయిస్తూ ఉత్తర్వ్యులు జారీ చేసింది.

సోనియా, రాహుల్ కు ఢిల్లీ కోర్టులో ఊరట

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో కాంగ్రెస్‌ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలకు   ఊరట లభించింది. ఈ కేసులో వారిరువురితో పాటు మరో ఐదుగురిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడి) దాఖలు చేసిన చార్జిషీట్‌ను పరిగణనలోకి తీసుకునేందుకు ఢిల్లీ కోర్టు మంగళవారం (డిసెంబర్ 16) నిరాకరించింది. అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌ (ఏజేఎల్) కాంగ్రెస్‌ పార్టీ రూ.90 కోట్ల రుణం అందించి దాని ఆస్తుల్ని ఆధీనంలోకి తీసుకోగా.. రాహుల్‌, సోనియాకు మెజార్టీ వాటా ఉన్న యంగ్‌ ఇండియా రూ.50 లక్షలు మాత్రమే కాంగ్రెస్‌ పార్టీకి చెల్లించి ఏజేఎల్‌ను సొంతం చేసుకొన్నట్లు ఈడీ చెబుతోంది.   కాగా ఎఫ్ ఐఈర్ లేకుండా మనీలాండరింగ్‌ నిరోధక చట్టం కింద ఇడి దాఖలు చేసిన ఫిర్యాదును  సమర్థించలేమని ఢిల్లీ రోస్‌ అవెన్యూ కోర్టు పేర్కొంది. అంతే కాకుండా ఇదే కేసులో   ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందని పేర్కొన్న కోర్టు, ఇప్పుడు ఈడి చార్జిషీటుపై ముందస్తుగా స్పందించలేమని పేర్కొంది. నేషనల్‌ హెరాల్డ్‌ మాతృసంస్థ అయిన అసోసియేటెడ్‌ జర్నల్స్‌ లిమిటెడ్‌(ఏజేఎల్)ను మోసపూరితంగా స్వాధీనం చేసుకోవడానికి కుట్రపన్నారని ఆరోపిస్తూ సోనియా, రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ విదేశీ విభాగం చీఫ్‌ శామ్‌ పిట్రోడా సహా ఐదుగురిపై ఆర్థిక నేరాల విభాగం  గత నెలలో నివేదికను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈడి అందించిన సమాచారం ఆధారంగా ఇఒడబ్ల్యు ఈ నివేదికను సమర్పించింది.

రెండేళ్ల బాలికపై హత్యాచారం.. నిందితుడికి క్షమాభిక్ష తిరస్కరించిన రాష్ట్రపతి

రెండేళ్ల బాలికను అపహరించి, ఆపై హత్యాచారానికి పాల్పడిన ఘటనలో నిందితుడి క్షమాభిక్ష పిటిషన్‌ను రాష్ట్రపతి దౌపది ముర్ము తిరిస్కరించారు. ఆమె దేశాధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తిరస్కరణకు గురైన వాటిలో ఇది మూడో క్షమాభిక్ష పిటిషన్‌గా నిలిచింది. మహారాష్ట్ర జల్నా నగరంలోని ఇందిరానగర్ ప్రాంతంలో.. 2012లో అశోక్ ఘుమారేఅనే వ్యక్తి రెండేళ్ల చిన్నారిని చాక్లెట్ ఇస్తానని ప్రలోభపెట్టి కిడ్నాప్‌ చేశాడు. తర్వాత ఆమెపై అత్యాచారానికి పాల్పడి, చివరకు ఆ పసికందును హతమార్చాడు. ఈ కేసుపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు.. నిందితుడైన అశోక్‌కు మరణ శిక్ష విధిస్తూ 2015 సెప్టెంబర్ 15 తీర్పునిచ్చింది. దీనిని 2016 జనవరిలో బాంబే హైకోర్టుసమర్థించింది. ఆ తర్వాత.. సుప్రీంలో ఈ కేసు విచారణకు రాగా 2019 అక్టోబర్ 03న అతడిమరణ శిక్షను ధృవీకరిస్తూ.. నిందితుడు తన లైంగిక వాంఛ తీర్చుకోవడం కోసం సామాజిక, చట్టపరమైన నిబంధలను ఉల్లంఘించాడని పేర్కొంది. ఈ విషయమై అశోక్ ఘుమారే.. క్షమాభిక్ష కోరుతూ రాష్ట్రపతికి పిటిషన్ పెట్టుకున్నారు.  అయితే ఆ పిటిషన్‌ను దేశ ప్రథమ పౌరురాలు ద్రౌపది ముర్ము తిరస్కరించారని అధికారులు తెలిపారు. దీంతో నిందితునికి మరణశిక్ష ఖాయమైనట్టైంది.

మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి హామీ చట్టం రద్దు!?

గత రెండు  దశాబ్దాలుగా అమల్లో ఉన్న మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం  స్థానంలో  కేంద్రం  కొత్త చట్టాన్ని తీసుకురానుంది.  ఈ చట్టంలో మహాత్మాగాంధీ పేరును తొలగించి వికసిత భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్ (గ్రామీణ్)  బిల్లు, 2025 ను లోక్ సభలో ప్రవేశ పెట్టనుంది.  వికసిత భారత్ 2047 లక్ష్యాలకు అనుగుణంగా గ్రామీణ ఉపాధి, అభివృద్ధి కార్యక్రమాలను తీర్చిదిద్దడమే ఈ కొత్త చట్టం ముఖ్య ఉద్దేశమని కేంద్రం చెబుతోంది.  ఉపాధి హామీ చట్టం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మెరుగుపడినప్పటికీ, దాని అమలులో పలు లోపాలు ఉన్నాయనీ, ముఖ్యంగా నిధుల దుర్వినియోగం, డిజిటల్ హాజరును పక్కదారి పట్టించడం, చేపట్టిన పనులకు, పెట్టిన ఖర్చుకు పొంతన లేకపోవడం వంటి  లోపాల కారణంగా ఉపాధి హామీ చట్టాన్ని రద్దు చేసి మరింత పారదర్శకంగా,  కొత్త చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఏర్పడిందని కేంద్రం చెబుతోంది.   ప్రస్తుత ఉపాధి హామీ పథకం కింద ప్రతి గ్రామీణ కుటుంబానికి ఏడాదికి 100 రోజుల పని దినాలు కల్పిస్తుండగా, కొత్త బిల్లులో దీనిని 125 రోజులకు పెంచారు.   అలాగే ప్రస్తుతం అమల్లో ఉన్న ఉపాధి హామీ చట్టం ( ప్రకారం, నైపుణ్యం లేని కార్మికుల వేతనాల ఖర్చును పూర్తిగా కేంద్ర ప్రభుత్వమే భరిస్తోంది. పనులకు అవసరమైన సామగ్రి ఖర్చులో 75 శాతం, నైపుణ్యం కలిగిన, పాక్షిక నైపుణ్యం ఉన్న కార్మికుల వేతనాల్లో 75శాతం కూడా కేంద్రమే భరిస్తున్నది. అయితే ఇప్పుడు ప్రతిపాదించిన కొత్త బిల్లులో  ఈ విషయంలోనూ మార్పులు తీసుకురానుంది.   సాధారణ రాష్ట్రాల్లో కూలీల వేతనాల చెల్లింపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా 60:40 నిష్పత్తి ప్రత్యేక కేటగిరీ ప్రాంతాలకు ఇది 90:10గా ఉంటుంది. నిరుద్యోగ భృతి  రాష్ట్రాలే చెల్లించాల్సి ఉంటుంది  మొత్తంగా కేంద్రం   గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం, ఉత్పాదక ఆస్తులను సృష్టించడం, వలసలను తగ్గించడం వంటి లక్ష్యాలతో  కొత్త చట్టాన్ని తీసుకురానున్నట్లు చెబుతోంది.  

మెక్సికోలో కుప్పకూలిన విమానం.. పది మంది దుర్మరణం

మెక్సికోలో  జరిగిన విమాన ప్రమాదంలో పది మంది దుర్మరణం పాలయ్యారు. ఓ చిన్న విమానం మెక్సికో ఎయిర్ పోర్టుకు సమీపంలో కుప్పకూలింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న పది మందీ దుర్మరణం పాలయ్యారు. విమానం కూలిపోగానే మంటలు చెలరేగి, ఆ ప్రాంతమంతా దట్టమైన పోగకమ్ముకుంది.  విమానం క్రాష్ కు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.  మెక్సికోకి 50కిలోమీటర్ల దూరంలోని టోలుకా ఎయిర్‌పోర్టు సమీపంలోని శాన్ మాటియో అటెంకో అనే ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఒక చిన్న ప్రైవేట్ విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు ప్రయత్నిస్తూ ఓ భవనాన్ని ఢీకొని కూలిపోయింది. మెక్సికో పసిఫిక్ తీరంలోని అకాపుల్కో నుంచి బయలుదేరిన ఈ మినీ ప్రైవేటు జెట్ లో ప్రమాద సమయంలో ఇద్దరు సిబ్బంది, 8 మంది ప్రయాణికులు సహా మొత్తం 10 మంది ఉన్నట్లు అధికారులు తెలిపారు.   ప్రమాదం ఘటన జరిగిన ప్రాంతాన్ని మూసివేసి అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.   ఈ విమాన ప్రమాదానికి దారితీసిన కచ్చితమైన కారణంపై అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. 

బీబీసీపై 90 వేల కోట్టకు ట్రంప్ పరువునష్టం దావా..

ప్రఖ్యాత మీడియా సంస్థ  బ్రిటిష్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (బీబీసీ) పై   అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పరువునష్టం దావా వేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఉపయోగించి.. తాను చెప్పని మాటలను మాట్లాడినట్లుగా బీబీసీ తప్పుడు కథనాన్ని ప్రసారం చేసిందని ఆరోపించిన ట్రంప్ ఆ సంస్థపై పరువునష్టం దావా వేశారు. బీబీసీ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని, ఇది జర్నలిజం విలువలకు  విఘాతమనిపేర్కొన్న ట్రంప్ బీబీసీపై 90 వేల కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేశారు.  తాను ఎన్నడూ అనని  ఎ  మాటలను ఏఐ వినియోగించి.. తన నోట పలికినట్లు వినిపించి, చూపించారని తీవ్ర ఆరోపణలు చేశారు.  జనవరి 6, 2021 నాటి క్యాపిటల్ భవనంపై దాడి ఘటనకు సంబంధించి దేశభక్తి గురించి తాను మాట్లాడిన మంచి మాటలను వదిలేసి, తాను అనని వ్యాఖ్యలను ప్రసారం చేశారని మండిపడ్డారు. బీబీసీ ఫేక్ న్యూస్ ప్రసారం చేసిందన్న ట్రంప్.. ఈ దావా వేశారు. 

అనుచిత పోస్టుల కేసు... జగన్ సమీప బంధువు అరెస్ట్

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమీప బంధువు  అర్జున్ రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. సోషల్ మీడియాలో అప్పటి విపక్ష నేతలు, వారి కుటుంబ సభ్యులపై ఇష్టారీతిగా అసభ్య పోస్టులు పెట్టిన కేసులో ఈ అరెస్టు జరిగింది.  జగన్ అధికారంలో ఉన్న సమయంలో  తమకు ఎదురే లేదన్నట్లు చెలరేగిపోయిన వైసీపీ నేతలు, అప్పటి తన కర్మఫలాన్ని ఇప్పుడు అనుభవించక తప్పడం లేదు. జగన్ గద్దె దిగి   రెండేళ్లు అవుతున్నా నాడు జగన్ అధికారం అండ చూసుకుని చెలరేగి అనుచిత వ్యాఖ్యలతో రెచ్చిపోయినందుకు ఫలితం అనుభవించక తప్పడం లేదు.  జగన్ హయంలో ఇష్టారీతిగా వ్యవహరించి, సోషల్ మీడియాలో అసభ్య పోస్టులతో చెలరేగిపోయిన వైసీపీ నేతలు పలువురు తెలుగుదేశం కూటమి అధికారంలోకి రాగానే విదేశాలకు పరారైపోయారు. అయితే పోలీసులు వారికి లుక్ ఔట్ నోటీసులు జారీ చేసి మరీ అరెస్టులు చేస్తున్నారు.   అధికారం శాశ్వతం, ఏపీలో ఇక తమకు ఎదురేలేదన్నట్లు అక్రమాలు, దౌర్జన్యాలతో చెలరేగిపోయి,  జగన్ మెప్పు కోసం  సోషల్ మీడియాలో విపక్షాల ముఖ్యనేతలు, వారి కుటుంబసభ్యులపై అనుచిత వ్యాఖ్యలతో పోస్టులు పెడుతూ   రాక్షస ఆనందం పొందిన వైసీపీయులు ఇప్పుడు  కేసులు ఎదుర్కొంటున్నారు.  ఎక్కడెక్కడికో పరారైన వైసీపీ నేతలను పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేసి మరీ అదుపులోనికి తీసుకుంటున్నారు.   తాజాగా వైసీపీ అధ్యక్షుడు జగన్ సమీప బంధువు అర్జున్‌రెడ్డిని శంషాబాద్ ఎయిర్‌పోర్టులో గుడివాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ సోషల్ మీడియా విభాగంలో అప్పటి ఆ వింగ్ ఇన్చార్జ్ సజ్జల భార్గవ్‌రెడ్డితో కలిసి అర్జున్‌రెడ్డి యాక్టివ్‌గా పని చేశాడు. ప్రస్తుత సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, వారి కుటుంబ సభ్యుల చిత్రాలను అసభ్యంగా మార్ఫింగ్ చేసి వైసీపీ సోషల్ మీడియా ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారంటూ అర్జున్‌రెడ్డిపై గతేడాది నవంబరులో గుడివాడలో కేసు నమోదైంది. అప్పట్లో అతన్ని అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా విదేశాలకు పారిపోయాడు. తర్వాత పోలీసులు లుక్ అవుట్ సర్క్యులర్ జారీ చేశారు. తాజాగా అతను విదేశాల నుంచి తిరిగి రావడంతో శంషాబాద్ విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు అర్జున్‌రెడ్డిని అడ్డుకుని గుడివాడ పోలీసులకు సమాచారమిచ్చారు. ఏపీ నుంచి వెళ్లిన పోలీసు బృందాలు అదుపులోనికి తీసుకుని సీఆర్‌పీసీ సెక్షన్ 41ఏ నోటీసులు అందజేశారు. అయితే అర్జున్‌రెడ్డి అప్పటికే తన లాయర్లను ఎయిర్‌పోర్టుకి రప్పించుకున్నారు. అతనిపై ఉమ్మడి కడప జిల్లా సహా పలు జిల్లాల్లో కేసులున్నాయి.  వైఎస్ జగన్‌కు బాబాయ్ వరుసయ్యే వైఎస్ ప్రకాశ్‌రెడ్డి మనుమడే అర్జున్‌రెడ్డి. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో రెండో నిందితుడైన సునీల్ యాదవ్ సోదరుడు కిరణ్‌యాదవ్, అర్జున్‌రెడ్డిల మధ్య వివేక హత్య జరిగిన రోజు రాత్రి ఫోన్ సంభాషణలు జరిగినట్లు అభియోగాలున్నాయి. దీనిపై దర్యాప్తు చేసి, అనుబంధ చార్జ్‌షీట్ వేయాలని హైదరాబాద్ నాంపల్లి సీబీఐ కోర్టు ఇటీవల సీబీఐని ఆదేశించిన సంగతి తెలిసిందే.  మరోవైపు బద్వేలుకు చెందిన వైసీపీ నేత బత్తల శ్రీనివాసులరెడ్డిని  కడప చిన్నచౌకు పోలీసులు హైదారాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికలకు ముందు అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం అయిన నారా చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్‌, మంత్రి నారా లోకేశ్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులపై బత్తల శ్రీనివాసులరెడ్డి సోషల్‌ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టాడు. దీనిపై కడపకు చెందిన టీడీపీ నేతలు గత ఏడాది నవంబరులో చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీనివాసులురెడ్డిపై చిన్నచౌకుతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల కేసులు నమోదయ్యాయి. కాగా.. కూటమి అధికారంలోకి రాగానే బత్తల శ్రీనివాసులరెడ్డి గల్ఫ్‌ వెళ్లిపోయాడు. దీంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో  గల్ఫ్‌ నుంచి ఆయన హైదారబాద్‌కు రాగానే ఎయిర్‌పోర్టు అధికారులు అదుపులోకి తీసుకుని కడప పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే చిన్నచౌకు పోలీసులు హైదారబాద్‌కు వెళ్లి ఆయనను అదుపులోకి తీసుకుని కడపకు తీసుకువచ్చారు. మొత్తానికి అరెస్టుల భయంతో అసలే బిక్కుబిక్కు మంటున్న వైసీపీ శ్రేణులకు ఈ తాజా అరెస్టులు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

అవినీతి కేసులో శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున రణతుంగ

అద్భుత క్రికెటర్ గా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అవినీతి కేసులో అడ్డంగా బుక్కైయ్యాడు. 1996లో శ్రీలంక వరల్డ్ కప్ విజయంలో రణతుంగది కీలక పాత్ర. వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు  కెప్టెన్  అయిన రణతుంగ  క్రికెట్ నుంచి రిటైర్ అయిన తరువాత రాజకీయాలలోకి ప్రవేశించారు.  రణతుంగ పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో పెద్ద ఎత్తున నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఈ ఆరోపణలపైనే ఆయనపై కేసు నమోదైంది. అరెస్టుకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న రణతుంగ స్వదేశానికి తిరిగి రాగానే అరెస్టయ్యే అవకాశాలు ఉన్నాయి.   కేసు వివరాల్లోకి వెడితే 2017లో రణతుంగ పెట్రోలియం మంత్రిగా ఉండగా, ఆయన సోదరుడు ధమ్మిక రణతుంగ ప్రభుత్వ రంగ సంస్థ అయిన సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ ఛైర్మన్‌గా పని చేశారు. ఆ సమయంలో దీర్ఘకాలిక చమురు కొనుగోలు ఒప్పందాల నిబంధనలను ఉల్లంఘించి అధిక ధరకు స్పాట్ పద్ధతిలో  కొనుగోళ్లు జరిపారనీ, దీనితో  ప్రభుత్వానికి దాదాపు  23.5 కోట్ల రూపాయలు నష్టం వాటిల్లిందని దర్యాప్తు సంస్థ తేల్చింది.ఈ కేసులో ఇప్పటికే రణతుంగ సోదరుడు ధమ్మికను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన బెయిలుపై ఉన్నారు.   

ఉసురు తీసిన పొగమంచు

ఒకదాని వెనుక ఒకటిగా వాహనాలు ఢీ కొనినలుగురు మృతి పొగమంచు కమ్మేయడంతో విజిబులిటీ తగ్గిపోయి ఢిల్లీ-ఆగ్రారోడ్డుపై ఘోర ప్రమాదం సంభవించింది. దారి కనిపించక పదుల సంఖ్యలో వాహనాలు  ఒకదానికి ఒకటి ఢీకొన్నాయి.   దుర్ఘటనలో నలుగురు సంఘటనా స్థలంలోనే కన్నుమూశారు. మరో పాతిక మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.   మథుర జిల్లా పరిధిలోని ఆగ్రా-నోయిడా మార్గంలో మంగళవారం (డిసెంబర్ 16) తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కమ్మేయడంతో ముందు వెళ్తున్న వాహనాలు కనిపించక ఒకదాని వెనుక ఒకటి వేగంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాద తీవ్రతకు వాహనాలు మంటల్లో చిక్కుకున్నాయి  అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చి, గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. గాయపడిన వారిలో పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెబుతున్నారు. ఈ ప్రమాదం కారణంగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

తెలుగు వారికి కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు ఆయన : సీఎం చంద్రబాబు

  తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ఇకపై అధికారికంగా 'డే ఆఫ్ శాక్రిఫైస్' (త్యాగాల దినం)గా  నిర్వహిస్తామని సీఎం చంద్రబాబు  ప్రకటించారు. ఆయన త్యాగానికి గుర్తుగా రాజధాని అమరావతిలో ‘స్టాట్యూ ఆఫ్ శాక్రిఫైస్’ నిర్మిస్తామని వెల్లడించారు.  సోమవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన పొట్టిశ్రీరాములు ఆత్మార్పణ దినం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పొట్టిశ్రీరాములు కుటుంబ సభ్యులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, “బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్ర్యం కోసం, ఆ తరువాత తెలుగు వారి ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు పొట్టిశ్రీరాములు అని ముఖ్యమంత్రి అన్నారు.  పాలకుల వివక్షకు గురైన తెలుగు జాతికి ప్రత్యేక రాష్ట్రం సాధించేందుకు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించారు. ఆయన త్యాగ ఫలితంగానే 1953 అక్టోబర్‌ 1న కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రం, 1956 నవంబర్‌ 1న ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాయి. కొందరు ఈ తేదీలపై అనవసర రాజకీయాలు చేస్తున్నందునే, ఆయన ఆత్మార్పణ చేసిన రోజునే త్యాగాలకు గుర్తుగా నిర్వహించాలని నిర్ణయించాం” అని స్పష్టం చేశారు. పొట్టిశ్రీరాములు ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదని, యావత్ తెలుగు ప్రజల ఆస్తి, గుండె చప్పుడు అని ఆయన కొనియాడారు.  

ఐపీఎస్‌ సంజయ్‌కు బెయిల్‌ మంజూరు

  ఏపీ మాజీ సీఐడీ చీఫ్‌ సంజయ్‌కి బెయిల్‌ ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ప్రభుత్వ నిధుల దుర్వినియోగం కేసులో విజయవాడ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న ఆయనకు ఊరట లభించింది. ఈ కేసులో సంజయ్ జైలులో ఉన్నారు. తనకు బెయిల్ ఇవ్వాలని పలుమార్లు కోర్టును ఆశ్రయించారు. అయితే ఆ సమయాల్లో ఆయన ఎదురుదెబ్బ తగిలింది. తాజాగా మాత్రం ఆయనకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా గత వైసీపీ ప్రభుత్వంలో ఏపీ సీఐడీ చీఫ్‌గా ఐపీఎస్ సంజయ్ పని చేశారు. ఆ సమయంలో ఆయన అధికార దుర్వినియోగానికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో కూటమి ప్రభుత్వం అధికారం సంజయ్‌పై కేసు నమోదు చేసి జైలుకు పంపించింది.

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో ఎన్‌ఐఏ ఛార్జిషీట్ దాఖలు

  పహల్గామ్ ఉగ్రదాడి కేసులో పాకిస్థాన్‌కు చెందిన లష్కర్-ఈ-తోయిబా ది రెసిస్టెన్స్ ఫ్రంట్  ఉగ్రసంస్థతో పాటు మరో ఆరుగురు నిందితులపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) సోమవారం ఛార్జిషీట్ దాఖలు చేసింది. పాక్ కుట్ర, నిందితుల పాత్రలు, ఆధారాలతో కూడిన ఈ ఛార్జిషీట్‌లో నిషేధిత ఉగ్రసంస్థను ఒక చట్టబద్ధ సంస్థగా గుర్తించి, పహల్గామ్ దాడిని ప్రణాళికాబద్ధంగా రూపొందిం చడం, సహకరిం చడం, అమలు చేయడంలో వారి పాత్ర ఉందని ఎన్‌ఐఏ పేర్కొంది.  పాక్ మద్దతు తో జరిగిన ఈ ఉగ్రదాడిలో మత ఆధారిత లక్ష్య హత్యలు చోటు చేసుకోగా, 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పో యారు.1,597 పేజీలతో కూడిన ఈ ఛార్జిషీట్‌ను జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానంలో దాఖలు చేశారు. ఇందులో పాకిస్థాన్ హ్యాండ్లర్ ఉగ్రవాది సజీద్ జట్ పేరును కూడా నిందితుడిగా చేర్చారు. అలాగే, 2025 జూలైలో శ్రీనగర్‌లోని డాచిగాం ప్రాంతంలో ‘ఆపరేషన్ మహాదేవ్’లో భారత భద్రతా బలగాలు మట్టుబెట్టిన ముగ్గురు పాకిస్థానీ ఉగ్రవాదుల పేర్లను కూడా ఛార్జిషీట్‌లో పొందుపరి చారు.  వారు ఫైసల్ జట్ సులేమాన్ షా, హబీబ్ తాహిర్ జిబ్రాన్, హమ్జా అఫ్గానీగా గుర్తించారు. తో పాటు పై నలుగురు ఉగ్రవాదులపై భారతీయ న్యాయ సంహిత, ఆయుధాల చట్టం–1959, అక్రమ కార్య కలాపాల నివారణ చట్టం 1967 కింద అభియోగాలు నమోదు చేశారు. అంతేకాకుండా, భారత్‌పై యుద్ధం ప్రకటించిన నేరం కింద కూడా శిక్షార్హ సెక్షన్లను ఎన్‌ఐఏ ప్రయోగించింది. గత దాదాపు ఎనిమిది నెలల పాటు సాగిన శాస్త్రీయ, సుదీర్ఘ దర్యాప్తులో కేసులోని ఉగ్ర కుట్ర పాకిస్థాన్ నుంచే రూపుదిద్దుకున్నదని ఎన్‌ఐఏ తేల్చింది.  భారత్‌పై నిరంతరం ఉగ్రవాదానికి పాకిస్థాన్ మద్దతిస్తున్నట్లు ఆధారాలతో వెల్లడించింది.ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఆరోపణలపై 2025 జూన్ 22న అరెస్టయిన పర్వైజ్ అహ్మద్, బషీర్ అహ్మద్ జొథాత్ద్‌లపై కూడా ఛార్జిషీట్ దాఖలైంది. విచారణలో వారు దాడిలో పాల్గొన్న ముగ్గురు ఆయుధధారుల వివరాలు వెల్లడించడంతో పాటు, వారు నిషేధిత  ఉగ్రసంస్థకు చెందిన పాకిస్థాన్ పౌరులేనని నిర్ధా రించారు. ఈ కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని ఎన్‌ఐఏ స్పష్టం చేసింది.

కన్హా శాంతివనాన్ని సందర్శించిన సీఎం చంద్రబాబు

  సీఎం చంద్రబాబు  హైదరాబాద్ నగర శివార్లలోని ఆధ్యాత్మిక కేంద్రమైన కన్హా శాంతివనం ఆశ్రమాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా కన్హా ధ్యానమందిరం అధ్యక్షులు దాజీతో కలిసి దాదాపు నాలుగు గంటల పాటు ఆశ్రమాన్ని సందర్శించారు. కన్హాశాంతి వనంలో ఆధ్యాత్మిక, పర్యావరణ, విద్య, ఆరోగ్యపరమైన సదుపాయాలను గురించి సీఎంకు దాజీ వివరించారు.  ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన మందిరం, వెల్‌నెస్ సెంటర్, యోగా సదుపాయాలు, హార్ట్‌ఫుల్నెస్ ఇంటర్నేషనల్ స్కూల్, పుల్లెల గోపీచంద్ అంతర్జాతీయ శిక్షణ అకాడమీని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పరిశీలించారు. అదే విధంగా చెట్ల సంరక్షణ కేంద్రం, వర్షపు నీటి సంరక్షణ, వ్యవసాయ క్షేత్రాలను కూడా  చంద్రబాబు సందర్శించారు. ధ్యాన మందిరం సందర్శన అనంతరం దాని రూపకల్పన, సామర్థ్యం, ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గురించి సీఎం తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దాజీ నివాసానికి వెళ్లిన చంద్రబాబు దేశ విదేశాల్లో ఆశ్రమం ద్వారా అందుతోన్న సేవలు, నిర్వహిస్తున్న కార్యకలాపాలను గురించి తెలుసుకున్నారు.

హిజ్రాలు బలవంతపు వసూళ్లకు పాల్పడితే కఠిన చర్యలు : సీపీ సజ్జనర్

  ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ బలవంతపు వసూళ్లకు పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనర్ ట్రాన్స్‌జెండర్ల ను హెచ్చరించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి, ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ సమాజంలో గౌరవప్రదంగా జీవించాలని సిపి వారికి సూచించారు. హైదరాబాద్ అమీర్‌పేటలోని సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్ ఆడిటోరియంలో హైదరాబాద్ సిటీ పోలీసులు ట్రాన్స్‌జెండర్లతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగర సీపీ సజ్జనర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఐడీ, మహిళా భద్రతా విభాగ అదనపు డీజీపీ చారు సిన్హా, ఐపీఎస్ పాల్గొని ట్రాన్స్‌ జెండర్లతో నేరుగా మాట్లాడారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనర్ మాట్లాడుతూ... ట్రాన్స్‌జెండర్ల మధ్య తరచూ చోటుచేసుకునే గ్రూప్ తగాదాలు, ఆధిపత్య పోరు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తూ ప్రాణనష్టానికి దారితీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల ట్రాన్స్‌జెండర్లపై ప్రజల నుంచి ఎక్కువగా ఫిర్యాదులు పెరిగాయని తెలిపారు.ముఖ్యంగా “శుభకార్యాల పేరుతో ఇళ్లపైకి వెళ్లి యజమా నులను వేధించడం సరికాదు. ఇలాంటి బలవంతపు వసూళ్లను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా కటకటాల వెనక్కి పంపిస్తాం. మీపై నమోదయ్యే కేసులు మీ భవిష్యత్తును నాశనం చేస్తాయి. అమాయక ప్రజలను ఇబ్బంది పెడితే జైలు శిక్షలు తప్పవు,” అంటూ సిపి సజ్జనార్ హెచ్చరించారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని సీపీ గుర్తు చేశారు. వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని త్వరలోనే సమగ్ర పాలసీ తీసుకురానున్నట్లు తెలిపారు. పోలీస్ శాఖ ఎల్లప్పుడూ ట్రాన్స్‌జెండర్లకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో అదనపు డీజీపీ  సిన్హా మాట్లాడుతూ.... ట్రాన్స్‌జెండర్ల సమస్యల పరిష్కారానికే మహిళా భద్రతా విభాగంలో ‘ప్రైడ్ ప్లేస్’ అనే ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎలాంటి సమస్యలు ఉన్నా, ఎవరి నుంచి వేధింపులు ఎదురైనా నిర్భయంగా ఈ వింగ్‌ను సంప్రదించవచ్చని ఆమె పేర్కొన్నారు.  చట్టవ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండి సమాజంలో హుందాగా జీవించాలని సూచించారు.హైదరాబాద్ జిల్లా ట్రాన్స్‌జెండర్ సంక్షేమ అదనపు డైరెక్టర్ రాజేందర్ మాట్లాడుతూ తెలంగాణలో దాదాపు 50 వేల మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు పొందాలంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేసే గుర్తింపు కార్డులు తప్పని సరిగా పొందాలని సూచించారు. ట్రాన్స్‌జెండర్లకు కార్పొరేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో జాయింట్ సీపీ లా అండ్ ఆర్డర్ తఫ్సీర్ ఇకబాల్, ఐపీఎస్, నార్త్ జోన్ డీసీపీ రష్మి పెరుమాళ్, ఐపీఎస్, వెస్ట్ జోన్ డీసీపీ చింతమనేని శ్రీనివాస్, మహిళా భద్రతా విభాగ డీసీపీ లావణ్య నాయక్ జాదవ్, సైబరాబాద్ డీసీపీ సృజన, తదితర ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు మరియు అధికారులు పాల్గొన్నారు.

హెల్మెట్ ధారణపై ప్రజలు స్వీయ బాధ్యత కలిగి ఉండాలి : కలెక్టర్

  హెల్మెట్ ధరించిన కారణంగా రోడ్డు ప్రమాదాల నుండి వాహనదారులు తమ ప్రాణాలను రక్షించుకునే అవకాశం ఉంటుందని, ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని జిల్లా కలెక్టర్ డా.ఎస్.వెంకటేశ్వర్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి పట్టణంలోని జిల్లా పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్ నుండి సుమారు 700 మందితో ఏర్పాటు చేసిన నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీని జిల్లా ఎస్పి ఎల్. సుబ్బారాయుడితో కలసి జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.       ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల కారణంగా సుమారు 500 మంది ద్విచక్ర వాహనదారులు మరణిస్తున్నారని, వీరిలో చాలా వరకు హెల్మెట్ లేకపోవడంతో తలకు బలమైన గాయాలై మరణించారన్నారు. హెల్మెట్ ధరించి ఉన్నట్లయితే వీరు ప్రాణాలతో ఉండే అవకాశం ఉండేదన్నారు. జిల్లా పోలీస్ శాఖ ద్వారా నో హెల్మెట్ - నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించామన్నారు. ఇందులో భాగంగా నేటి నుండి జిల్లా వ్యాప్తంగా పెట్రోల్ బంక్ లో హెల్మెట్ లేనిదే ద్విచక్ర వాహనాలకు ఇవ్వడం ఉండదని తెలిపారు.  రోడ్డు భద్రత పై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామన్నారు. వాహనాలు నడిపే సమయంలో ద్విచక్ర వాహనదారులు భాద్యతగా హెల్మెట్ ధరించాలని, వారు భాధ్యత విస్మరించినట్లైతే వారి ప్రాణాలు కాపాడుకోవడంలో భాగంగా ప్రభుత్వం నిర్భంద చర్యలు చేపట్టవలసి ఉంటుందన్నారు. తిరుపతి పట్టణం అభివృద్ధి శరవేగంగా జరుగుతున్నదని, ఇటువంటి పట్టణాలలో చేపట్టే కార్యక్రమాలు భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు రూపొందించుటకు స్ఫూర్తిగా నిలుస్తుందన్నారు.           జిల్లా ఎస్ పి మాట్లాడుతూ హెల్మెట్ లేని కారణంగా రోడ్డు ప్రమాదాలలో ద్విచక్ర వాహనదారులు ఎక్కువ శాతం మరణిస్తున్నారని, హెల్మెట్ ధరించి తమ ప్రాణాలను కాపాడుకుని తమ కుటుంబాలతో సురక్షితంగా ఉండాలన్నదే ప్రభుత్వ ఉద్దేశ్యం అన్నారు. హెల్మెట్ ధరించని వారికి జరిమానా విధించడం తమ ధ్యేయం కాదని, ప్రజల భద్రత తమ భాధ్యత అని అన్నారు.  హెల్మెట్ ధరించడం పై అవగాహన కల్పించడంలో భాగంగా నో హెల్మెట్ నో పెట్రోల్ ర్యాలీ నిర్వహించడం జరుగిందన్నారు. ద్విచక్ర వాహనాదారులు చిన్న ఆక్సిడెంట్ ల కూడా తలకు బలమైన గాయాల కారణంగా మరణిస్తున్నారన్నారు. ద్విచక్ర వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో తప్పక హెల్మెట్ ధరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ ర్యాలీలో ఏ ఎస్ పి లు రవి మనోహరాచారి, డి శ్రీనివాసరావు,నాగభూషణం, డీఎస్పీలు, సిఐలు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం : కవిత

  సామాజిక తెలంగాణయే తన లక్ష్యమని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మరోసారి స్పష్టం చేశారు. 2029 ఎన్నికల్లో తాము పోటీలో ఉంటామని తేల్చిచెప్పారు. సోమవారం ఆస్క్ కవిత హ్యాష్ ట్యాగ్ పై ట్విట్టర్ (ఎక్స్) లో పలువురు నెటిజన్లు అడిగిన ప్రశ్నలకు ఆమె వివరంగా సమాధానాలు ఇచ్చారు. తెలంగాణ విషయంలో తన విజన్, జాగృతి భవిష్యత్ కార్యాచరణ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు సహా పలు ప్రశ్నలను నెటిజన్లు సంధించారు. వాటికి కవిత ఇచ్చిన సమాధానాలు. ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగం లో ఆస్క్ కవిత ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తాం  సామాజిక తెలంగాణ తన ధ్యేయమని కవిత తెలిపారు. యువత, మహిళలు వారికి నచ్చిన రంగాల్లో అవకాశాలు పొందాలని...అందుకు వారిని ప్రోత్సహించాల్సిన అవసరముందన్నారు. యువత, మహిళలకు రాజకీయ అవకాశాలు కల్పించేందుకు జాగృతి కృషి చేస్తుందన్నారు. కొత్త పార్టీకి సంబంధించి అడిగిన ప్రశ్నకు క్లారిటీ ఇచ్చారు. 2029 ఎన్నికల్లో పోటీ చేస్తామని స్పష్టం చేశారు.  ప్రజలు సూచించిన పేరునే పార్టీకి పెడుతామన్నారు. తెలంగాణ సాధికారిత సాధించాలంటే మెరుగైన, నాణ్యమైన ఉచిత విద్య, వైద్యం ప్రజలకు అందాలని అన్నారు. తెలంగాణ లో తల్లితండ్రులు పిల్లల చదువుకోసం ఒక్క రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా ఉండే పరిస్థితి రావాలన్నారు. ఉద్యోగాలు, స్కిల్, భద్రత మూడింటిలో దేనికి ప్రాధాన్యం ఇస్తారని ప్రశ్నించగా... యువతకు ఉద్యోగాలు కల్పించటమే తన ప్రథమ ప్రాధాన్యమని చెప్పారు.  ఉద్యోగాలతో పాటు వారికి భద్రత కూడా కల్పించాలన్నారు.  సామాజిక న్యాయం కోసం జాగృతి పోరాటం కొనసాగుతుందన్నారు. క్రమంగా జాగృతిని చాలా బలంగా తయారు చేస్తామని చెప్పారు. త్వరలోనే జాగృతి మెంబర్ షిప్ డ్రైవ్ కూడా ప్రారంభిస్తామన్నారు. అదే విధంగా మేము వేసిన కమిటీల్లో ఇప్పటికే అన్ని వర్గాలకు అవకాశం ఇచ్చామని చెప్పారు.  కాంగ్రెస్ పాలన పై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి రేవంత్ రెడ్డి పరిపాలన గురించి పలువురు నెటిజన్లు కవిత ను ప్రశ్నలు అడిగారు. రేవంత్ పాలన ఎలా ఉందన్న ప్రశ్నకు ఆమె సమాధానం ఇచ్చారు. ఇచ్చిన హామీలను నెరవేర్చటంలో కాంగ్రెస్ అట్టర్ ప్లాప్ అయ్యిందన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పారు. ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించకపోవటంతో లక్షలాది మంది విద్యార్థులు చదువులకు దూరం కావాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.  ప్రభుత్వం నిర్లక్ష్యం ఆడపిల్లల చదువుకు మరణశాసనంగా మారిందన్నారు. ఇక రైతుల ఆత్మహత్యలు చాలా బాధకరమని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక వరుసగా రైతుల ఆత్మహత్యలు కొనసాగటం బాధకరమన్నారు. ప్రభుత్వం చేతగాని, నిర్లక్ష్య వైఖరిని ఇది నిదర్శనమని చెప్పారు. ఇక ఫార్మా సిటీ కోసం తీసుకున్న భూముల్లో ఫ్యూచర్ సిటీ అంటూ హడావుడి చేయటంపై మండిపడ్డారు.  తర్వలోనే అక్కడి రైతులకు మద్దతుగా పోరాటం చేస్తామని చెప్పారు. కాంగ్రెస్ వచ్చాక సింగరేణి సంస్థను తీవ్ర నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎంఎస్ తో కలిసి సింగరేణి కోసం ప్రభుత్వం పై పోరాటం చేస్తామన్నారు. హైదరాబాద్ లో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోవటంపై కవిత ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వెస్ట్ సిటీ పై పెట్టిన శ్రద్ధ, ఈస్ట్ సిటీ ని సిటీ అభివృద్ది చేయటంలో పెట్టలేదన్నారు. చిరంజీవి అభిమానిని.. కవిత వ్యక్తిగత అభిరుచులకు సంబంధించి పలువురు నెటిజన్లు ప్రశ్నించారు. రామ్ చరణ్ గురించి ఒక్క మాటలో చెప్పాలని అడగగా...చాలా హంబుల్ గా ఉండే వ్యక్తి. మంచి డ్యాన్సర్ అన్నారు. ఐతే తాను చిరంజీవి అభిమానిని అని...చిరంజీవి తర్వాతే రామ్ చరణ్ అన్నారు.  చిన్నప్పుడు ఎర్రమంజిల్ లో గడిపిన క్షణాలు తనకు చాలా సంతోషానిచ్చాయని అన్నారు. ఐతే రాజకీయాలు కాకుండా ఏదైనా బిజినెస్ పై దృష్టి పెట్టాలంటూ ఓ నెటిజన్ సూచించగా... అందుకు కవిత కూల్ గా అన్సర్ చేశారు. సోషల్ మీడియాలో ఇలాంటి చాలా నెగిటివీ ఉంటుందని దాన్ని పట్టించుకోకుండా మంచిగా ఆలోచించాలని సూచించారు.  ట్విట్టర్ ట్రెండింగ్ లో టాప్ ఆస్క్ కవిత ఇంటరాక్షన్  గంటన్నర పాటు సాగింది. వందలాది మంది ట్విట్టర్ (ఎక్స్) లో ప్రశ్నలు అడిగారు .. కవిత వారికి సమాధానాలు ఇచ్చారు. సోమవారం  ట్విట్టర్ (ఎక్స్) పాలిటిక్స్ విభాగంలో ఈ ఇంటరాక్షన్ నంబర్ వన్ గా నిలిచింది.

పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల దందా.. ముగ్గురు యువకుల మృతి

  పాతబస్తీలో మత్తు ఇంజక్షన్ల అక్రమ దందా తీవ్ర కలకలం సృష్టిస్తోంది.  చాలామంది యువకులు అనస్థీషియా డ్రగ్స్‌ను మత్తుగా వినియో గిస్తున్న ఘటనలు పెరుగు తుండటంతో పోలీసులు ఈ వ్యవహారంపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇప్పటికే అనస్థీషియా మత్తు ఇంజక్షన్లు తీసుకున్న ముగ్గురు యువకులు మృతి చెందినట్లు పోలీసులు అధికారికంగా వెల్లడించారు. మత్తు ఇంజక్షన్ల ఓవర్‌డోస్ కారణంగానే ఈ మరణాలు సంభవించాయని పోలీసులు స్పష్టం వ్యక్తం చేశారు. డబ్బుల కక్కుర్తితో కొందరు డాక్టర్లు అనస్థీషియా మత్తు ఇంజక్షన్లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో బయటపడింది. ఒక్కో ఇంజక్షన్‌ను వెయ్యి రూపాయల చొప్పున యువకులు కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. ఆటో డ్రైవర్లు, విద్యార్థులు ఎక్కువగా ఈ మత్తు ఇంజక్షన్లను కొనుగోలు చేసి వినియోగిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ అక్రమ దందా వ్యవహా రాన్ని పోలీసులు నిర్వహిం చిన ప్రత్యేక ఆపరేషన్‌లో వెలుగులోకి వచ్చింది. మత్తు ఇంజక్షన్లు తీసుకుంటూ పలువురు యువకులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. పోలీసులు, డ్రగ్ కంట్రోల్ అధికారులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్‌లో ఈ మత్తు మందుల నెట్‌వర్క్‌ను ఛేదించారు.ఈ కేసులో ఇప్పటికే అనస్థీషియా డ్రగ్స్ ఇంజక్షన్లు విక్రయిస్తున్న ఇద్దరు డాక్టర్లు, నలుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేశారు.  మత్తు ఇంజక్షన్ల సరఫరా వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు ఎవరు, ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయనే అంశాలపై దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. ముఖ్యంగా పాతబస్తీలో ఈ దందా జోరుగా సాగుతుందని... మత్తు ఇంజక్షన్ల దందాను పూర్తిగా అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. ఏది ఏమైనప్పటికి ఈ మత్తు ఇంజక్షన్ల అధిక మోతాదులో తీసుకోని ముగ్గురు యువకులు మృత్యువాత పడడంతో ఆ కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి...ఈ ఘటనపై సీరియస్ అయినా పోలీసులు డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి... నిందితు లను పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు.

చనిపోతున్నాననుకుని సిడ్నీ హీరో ఆఖరి సందేశం

  ఆస్ట్రేలియాలోని బాండీ బీచ్‌లో తండ్రీకొడుకులైన ఉగ్రవాదుల దాడిలో ఎంతో మంది ప్రాణాలను కాపాడిన సిరియా వలసదారు అహ్మద్‌ అల్‌ అహ్మద్‌ ఇప్పుడు రియల్ హీరోగా నిలిచారు. పండ్ల దుకాణం నడుపుకునే సాధారణ వ్యక్తి అయిన అహ్మద్‌.. తుపాకీ కాల్పుల మధ్య ఉగ్రవాదిని ధైర్యంగా అడ్డుకుని తుపాకీ లాక్కునే ప్రయత్నం చేశారు. ఈ పోరాటం మధ్యలో ఆయన తన బంధువుతో.. "నేను చనిపోతున్నా. నాకేదైనా జరిగితే ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో నేను నేలకొరిగానని నా కుటుంబానికి చెప్పు" అని పంపిన చివరి సందేశం యావత్ ప్రపంచాన్ని కదిలిస్తోంది.  ఈ సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం అహ్మద్‌ను ప్రశంసించారు. ఆస్ట్రేలియా సిడ్నీలోని బాండీ బీచ్‌లో ఆదివారం రోజు జరిగిన ఉగ్రదాడి గురించి అందరికీ తెలిసిందే. తండ్రీకొడుకులైన ఇద్దరు ఉగ్రవాదులు పర్యాటకులపై దాడికి పాల్పడగా.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. ముఖ్యంగా ఉగ్రవాదులను ఎంతో ధైర్యంగా ఎదుర్కొని రియల్ హీరోగా పేరు తెచ్చుకున్న అహ్మద్‌ అల్‌ అహ్మద్‌‌ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా ఉగ్రదాడి జరుగుతున్న సమయంలోనే అతడు.. ఈ పోరాటంలో నేను మరణిస్తాననిపిస్తోందని, ఈ విషయాన్ని తన కుటుంబానికి తెలియజేయాలని పక్కనే ఉన్న ఓ వ్యక్తి చెప్పారు. ఆయన చేసిన ఈ చివరి మాటలు అందరి హృదయాలను కదిలిస్తున్నాయి. సిరియా దేశానికి చెందిన అహ్మద్‌ అల్‌ అహ్మద్‌.. నిత్యం అంతర్యుద్ధాలతో నలిగిపోయే తన దేశాన్ని వీడి మెరుగైన భవిష్యత్తు కోసం దశాబ్దం క్రితం ఆస్ట్రేలియాకు వలస వచ్చారు. దక్షిణ సిడ్నీలోని సదర్లాండ్‌ షైర్‌లో భార్యాపిల్లలతో (ఇద్దరు చిన్న పిల్లలు) కొత్త జీవితాన్ని ప్రారంభించారు. స్థానికంగా ఒక పండ్ల దుకాణం నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్న అహ్మద్.. తన సాధారణ జీవితంలో ఊహించని హీరోగా మారారు. ముఖ్యంగా ఉగ్రదాడి జరిగిన ఆదివారం ఉదయంబోండి బీచ్‌లో తన బంధువు జోజీ అల్కాంజ్‌తో కలిసి అహ్మద్‌ కాఫీ షాప్‌లో ఉన్నారు. ఒక్కసారిగా కాల్పుల శబ్దాలు వినిపించగానే వారు భయపడిపోయారు. అయితే వెంటనే తేరుకున్న అహ్మద్‌.. ఉగ్రవాదులను చూసి వారిని ఎలాగైనా అడ్డుకోవాలని నిర్ణయించుకున్నారు. అక్కడ ఏం జరగబోతోందో తెలిసిన ఆయన.. తన బంధువు అల్కాంజ్‌తో ఇలా అన్నారు: "నేను చనిపోబోతున్నా. నా కుటుంబాన్ని చూసుకో. ఒకవేళ నాకేదైనా జరిగితే.. ఇతరుల ప్రాణాలను కాపాడే క్రమంలో నేను నేలకొరిగానని నా కుటుంబానికి చెప్పు" అని తన చివరి సందేశాన్ని ఇచ్చారు. ఈ హృదయ విదారక విషయాన్ని అల్కాంజ్ మీడియాకు వెల్లడించారు.ఈ ఘటన సమయంలో కాల్పులు జరుపుతున్న దుండగుల్లో ఒకడిని అహ్మద్‌ అడ్డుకున్నారు. వెనుక నుంచి వెళ్లి ధైర్యంగా ఆ దుండగుడి చేతిలోని తుపాకీని లాక్కున్నారు.  దీంతో ఆ ఉగ్రవాది అక్కడి నుంచి పారిపోయాడు. ఈ పోరాటానికి సంబంధించిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. ఉగ్రవాదిని అడ్డుకునే ప్రయత్నంలో అహ్మద్‌ గాయపడగా.. ప్రస్తుతం ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సాహసానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సైతం అహ్మద్‌ను ప్రశంసించారు. అహ్మద్‌ త్వరగా కోలుకోవాలని ఆయన ఆకాంక్షించారు. బోండి బీచ్‌ ఉత్సవంలో జరిగిన ఈ కాల్పుల దుర్ఘటనలో 16 మంది మరణించారు. కాల్పులు జరిపినవారు పాకిస్థాన్ నుంచి వచ్చిన తండ్రీకొడుకులని పోలీసులు వెల్లడించారు. దర్యాప్తు కొనసాగుతోంది.