రౌండప్ 2022 ఈ ఏడాది ఏం జరిగింది?

కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. పాత సంవత్సరానికి వీడ్కోలు పలికే సమయం వచ్చేసింది. 2022 మోస్ట్ హ్యాపెనింగ్ ఇయర్ గా చెప్పుకోవచ్చు.  కొద్ది  రోజుల్లో 2022 వెళ్ళిపోతుంది. 2023 సంవత్సరం వచ్చేస్తుంది. క్యాలెండరు మారి పోతుంది. స్వాగత తోరణాలు, వీడ్కోలు వేడుకలు షరా మాములే ... కాలచక్రం కదులుతూనే ఉంటుంది... కానీ, వెళ్ళిపోతున్న 2022 సంవత్సరం, ఏమి సాధించింది, ఏమి మిగిల్చింది, ఏది పట్టుకు పోయింది, ఏమి బోధించింది, ఒక సారి వెనక్కి తిరిగి చూసుకుంటే .. సంవత్సర కాలంలో చెరగని ముద్ర వేసిన చేదు తీపి జ్ఞాపకాలను ఒక సారి సింహవలోకనం చేసుకుంటే..
జనవరి 1

 

2022 సంవత్సరం వస్తూనే విషాదాన్ని మోసు కొచ్చింది. కొత్త సంవత్సరం తొలి పొద్దు విషాద వార్తతో  కళ్ళు తెరిచింది. ప్రతి సంవత్సరంలానే,ఈ సంవత్సరం కూడా, జనవరి ఫస్ట్’న జమ్మూలోని వైష్ణవదేవి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కొత్త సంవత్సరంలో తమను చల్లగా చూడమని, వైష్ణవదేవీ మాతను ప్రార్ధించేందుకు భక్తిపారవశ్యంలో పరుగులు తీశారు. తొక్కిసలాట జరిగింది.12 మంది ప్రాణాలు వదిలారు, 20 మంది వరకు గాయాల పాలయ్యారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఇతర ముఖ్య నేతలువిచారం వ్యక్తపరిచారు.చనిపోయిన వారి కుటుంబాలకు నష్ట పరిహారం ప్రకటించారు. స్థానిక ప్రభుత్వ యంత్రాంగం క్షతగగాత్రులకు సహాయం అందించింది.  
జనవరి 4

 


ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, మణిపూర్ లో పర్యటించారు. ఐదు జాతీయ రహదారులు, 200 పడకల సెమి – పెర్మనెంట్  ఆసుపత్రితో పాటుగా నాలుగు వేల 815 కోట్ల  విలువైన 22  అభివృద్ధి పధకాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మణిపూర్ అభివృద్ధి ప్రణాళికతో  ఈశాన్య భారతం, భారతదేశ అభివృద్ధి వాహనానికి చోదక శక్తిగా పనిచేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్త  పరిచారు. 
జనవరి 5


 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటన, భద్రతా లోపం కారణంగా రద్దయింది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రధాని పర్యటనలో భద్రతా లోపం చోటు చేసుకోవడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన పై జనవరి 7న, కేంద్ర ప్రభుత్వం, పంజాబ్ ప్రభుత్వం వేర్వేరుగా విచారణకు ఆదేశించాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కలిసి, పంజాబ్ పరిణామాలను వివరించారు. కాగా  ప్రధాన మంత్రి పంజాబ్  పర్యటనలో చోటు చేసుకున్న భద్రతాలోపం పై చర్చించేందుకు సుప్రీం కోర్టు జనవరి 12న ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది. 

జనవరి 15

సైనిక దినోత్సవం... భారతదేశ చరిత్రలో ఈ రోజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. భారత్‌లో బ్రిటిష్ చివరి సైన్యాధికారి ఫ్రాన్సిస్ బుచర్ నుంచి భారత్‌కు చెందిన లెఫ్టినెంట్ జనరల్ కమాండర్ ఎం. కరియప్ప 1949లో ఇదే రోజున సైన్యాధికారిగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటినుంచి భారత్ జనవరి 15ని 'ఆర్మీ డే'గా జరుపుకుంటోంది. సైనికుల త్యాగాలు, దేశ రక్షణలో సైనికుల పాత్రను భవిష్యత్ తరాలకు తెలియజేసేలా ప్రతీ ఏటా 'ఆర్మీ డే' వేడుకలను నిర్వహిస్తున్నారు.
కాగా, ప్రతి సంవత్సరంలానే ఈ సవత్సరం కూడా, దేశ వ్యాప్తంగా ఆర్మీ డే వేడుకలు ఘనంగా  నిర్వహించారు. భారత సైనికులకు ప్రధాని నరేంద్ర మోదీ 'ఆర్మీ డే' శుభాకాంక్షలు తెలియజేశారు. 'ఆర్మీ డే సందర్భంగా మన ధీర సైనికులకు, వారి కుటుంబాలకు శుభాకాంక్షలు. ధైర్య సాహసాలకు, సైనిక శిక్షణ సామర్ధ్యానికి భారత సైన్యం పెట్టింది పేరు. దేశ భద్రత కోసం భారత సైన్యం అందిస్తున్న అమూల్యమైన సేవలను వర్ణించేందుకు మాటలు సరిపోవు.' అంటూ నరేంద్ర మోదీ   ట్వీట్‌ చేశారు.
జనవరి 20


 బ్రహ్మ కుమారీల అధ్య్వర్యంలో, సంవత్సరకాలంపాటు జరిగే అజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలను ప్రధానమంత్రి నరేద్ర మోడీ ప్రారంభిచారు. 
జనవరి 23 
నేతాజీ సుభాష చంద్రబోస్ జయంతి.  దేశ రాజధాని ఢిల్లీలో గేట్ వే అఫ్ ఇండియా వద్ద, గణతంత్ర దినోత్సవ వేడుకల ప్రారంభ చిహ్నంగా సుభాష్ చంద్ర బోస్, విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మంత్రి నరేంద్ర మోడీ, భారత్ స్వాతంత్ర్య శతాబ్ది ఉత్సవాల నాటికి, నవ భారత నిర్మాణం జరిగి తీరుతుందని విశ్వాసం వ్యక్త పరిచారు. 
జనవరి 30
మహాత్మాగాంధీ వర్ధంతి. అమర వీరుల దినోత్సవం. ఈ సందర్భంగా  రాజ్ ఘాట్ లోని గాంధీ సమాధి వద్ద రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్, ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ పలువురు ప్రముఖులు జాతి పితకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ, మహాత్ముడి ఆలోచనలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు అందరూ ప్రయత్నించాలని అన్నారు. అలాగే, అమరవీరుల దినోత్సవం సందర్భంగా వారి సేవలు, ధీరత్వాన్ని ప్రతి ఒక్కరు గుర్తుచేసుకోవాలని అన్నారు.
జనవరి 31 
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి.. రాష్ట్రపతి రామ్ నాథ్ కొవింద్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు.

ఫిబ్రవరి 

జనవరి నెల చివరి రోజు జనవరి 31న పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి..ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, 2022-23వార్షిక బడ్జెట్ నుపార్లమెంట్ కు సమర్పించారు. 
ఫిబ్రవరి 5న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హైదరాబాద్  లో పర్యటించారు.ఇక్రిసాట్ 50వ స్థాపక దినోత్సవం స్మారక పోస్టల్ స్టాంప్’ ను అవిష్కరించారు. 


అదే రోజున హైదరాబాద్ శివార్లలో 12 వందల కోట్ల రూపాయల వ్యయంతో, 45 ఎక‌రాల విస్తీర్ణంలో నిర్మించిన స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించారు. స‌మ‌తామూర్తి స్ఫూర్తి కేంద్రంలో 108 అడుగుల సమతాముర్హ్తి, రామానుజుల వారి రెండవ అతిపెద్ద పంచలోహ విగ్రహాన్ని జాతికి అంకితం చేశారు. ప్రధానమంత్రి పాల్గొన్న ఈ రెండు కార్యక్రమాలలో తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు పాల్గొనలేదు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ప్రధానికి స్వాగతం పలికారు.  
ఫిబ్రవరి 6:  

ప్రముఖ గాయనీ, భారత రత్న లతా మంగేష్కర్ కన్ను మూశారు. కొవిడ్ నుంచి కోలుకున్న లతాజీ, శ్వాసకోశ సంబంధిత సమస్యలకు ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో చికిత్స పొందతూ, 6 వతేదీ ఉదయం 8 గంటల ఒక  నిముషానికి తుది శ్వాస విడిచారు. రాజకీయ, సినీ రంగ ప్రముఖులు అనేక మంది ఆమెకు  నివాళులు అర్పించారు. ప్రధాని లతా మంగేష్కర్ మృతి సంగీత ప్రపంచానికి తీరని లోటుగా పలువురు  పేర్కొన్నారు. లతా మంగేష్కర్ మృతి నేపథ్యంలో కేంద్రం రెండు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించింది. పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి, రాష్ట్రపతి చేసిన ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై, రాజ్య సభలో జరగిన సుదీర్ఘ చర్చకు ప్రధాని నరేంద్ర మోడీ ఫిబ్రవరి 8 సమాధాన మిచ్చారు.  వారసత్వ రాజకీయాలు, వారసత్వ రాజకీయ పార్టీలు దేశానికి పెద్ద ముప్పని ప్రధాని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అర్బన్ నక్సల్స్ గుప్పిట్లో బందీ అయిందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ ఆలోచనలు, సిద్ధాంతాలను అర్బన్ నక్సల్స్ నియంత్రిస్తున్నారని ఆరోపించేరు. ధన్యవాదాల తీర్మానాన్ని రాజ్యసభ మూజువాణీ ఓటుతో ఆమోదించింది.

మార్చి

తెలుగు మాసాల్లో మాసానాం మార్గశీర్షోహం – అన్ని మాసాల్లోకి మార్గశిర మాసం శ్రేష్టమైనది అన్నట్లుగా 2022 సంవత్సరంలో మార్చి మాసానికి,  ప్రత్యేక ప్రాధాన్యత వుంది. అంతకు ముందు నెలరోజులకు పైగా జరిగిన ఐదు రాష్త్రాల ఆసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అందుకే 2022 మార్చి నెలలో ఎన్నికల ఫలితాలే మీడియా ఫోకస్ గా నిలిచాయి. 

ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7వ  తేదీవరకు ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ రాష్టాల శాసన సభ ఎన్నికల పోలింగ్ జరిగింది. ఉత్తర ప్రదేశ్,లో అత్యధికంగా ఎనిమిది విడతల్లో పోలింగ జరిగితే, మిగిలిన నాలుగు రాష్ట్రాల్లో ఒకటి  రెండు విడతల్లో పోలింగ్ జరిగింది. 
మార్చి 10  ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరిగింది. కాగా ఎన్నికలు జరిగిన ఐదు రాష్ట్రాలలో, ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్ రాష్ట్రాలలో బీజేపీ విజయం సాధించి అధికారాన్ని నిలబెట్టుకుంది. పంజాబ్’ లో కాంగ్రెస్’ ను ఓడించి ఆమ్ ఆద్మీ పార్టీ ... ఆప్ అధికారంలోకి వచ్చింది. కాగా, అసెంబ్లీ ఎన్నికలలో  ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని,కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు.ఈ ఓటమి నుంఛి గుణపాఠం నేర్చుకుని ముందుకు సాగుతామని అన్నారు.  

యోగీ ఆదిత్య నాథ్. మార్చి 25 న వరసగా రెండవ సారి ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ... ప్రమాణ స్వీకారం చేశారు.అలాగే, పుష్కర్ సింగ్ ధామి మార్చి 23న ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా రెండవ సారి ప్రమాణ స్వీకారం చేశారు. దామి అసెంబ్లీ ఎన్నికల్లో ఖతిమా నియోజక వర్గంలో ఓటమి చవిచూశారు. అయినా, బీజేపీ ఆయనకు మరో అవకాశం ఇచ్చింది. మార్చి 16 పంజాబ్ ముఖ్యమంత్రిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఆప్ ఖాతాలో మరో రాష్ట్రం చేరింది. మార్చి 28 న గోవా ముఖ్యమంత్రిగా ప్రమోద్ సావంత్ ప్రమాణ స్వీకారం చేశారు.

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల నేపధ్యంగా మార్చి 13...న జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, సీబ్ల్యుసి సమావేశం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నాయకత్వం పట్ల పూర్ణ విశ్వాసాన్ని పునరుద్ఘాటించింది.  పార్టీని బలోపేతం చేసేందుకు సోనియా గాంధీ దిద్దుబాటు చర్యలుతీసుకుంటారని సీడ్ల్యుసి విశ్వాసం వ్యక్త పరిచింది. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టాలని సీడ్ల్యుసి సభ్యులు మరోమారు విజ్ఞప్తి చేశారు. 
మార్చి నెల చివరి రోజు, అంటే మార్చి 31 న రాజ్యసభ  పదవీ కాలం  ముగిసిన 72 మంది సభ్యులకు వేడ్కోలు పలికింది. అలాగే, పెద్దల సభలో ఇటీవల కాలంలో తొలి సారిగా బీజేపీ సంఖ్యాబలం వంద మార్కు దాటింది.

ఏప్రిల్

ఏప్రిల్ నెలలో దేశ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తీసుకున్నాయి .. పంజాబ్,  హర్యాణ రాష్ట్రాల మధ్య ఉమ్మడి రాజధాని చండిఘడ్ మాదంటే మాదనే వివాదం మరో మారు తెర మీదకు వచ్చింది. పంజాబ్ లో తొలిసారిగా అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ ( ఆప్) ఏప్రిల్ 1 న శాసన సభ ప్రత్యేక సమావేశంలో  చండిఘడ్’ను తక్షణమే పంజాబ్’కు బదిలీ చేయాలని  తీర్మానం చేసింది. కేంద్రానికి పంపింది. అయితే, ఏప్రిల్ 5న హర్యాణ ప్రభుత్వం, పంజాబ్ తీర్మానానికి వ్యతిరేకంగా తీర్మానం చేసి కేద్రనికి పంపింది. బంతి కేంద్రం కోర్టుకు చేరింది.

ఏప్రిల్ ఫస్ట్ ఫూల్స్  డే .. అదే రోజున బీజేపీ మరో రికార్డు సృష్టించింది. పెద్దల సభ రాజ్యసభలో  పార్టీ బలం వంద (100) మార్క్ దాటింది. 1990 తర్వాత పెద్దల సభలో ఏ పార్టీ  కూడా 100 మార్కును చేరుకోలేదు. 32 ఏళ్లలో మొదటి సారిగా బీజీపీ 100 మార్కును చేరుకొని రికార్డు సృష్టించింది.
ఏప్రిల్ 2 న భారత్ – నేపాల్ రైల్ లింక్ ప్రారంభమైంది, భారత దేశంలో పర్యటిస్తున్న నేపాల్ ప్రధాని, దియుబా, భారత ప్రధాని నరేంద్ర మోడీ సంయుక్తంగా ఈ రైలు లింక్’ను ప్రారంభించారు. 

తమిళనాడు ముఖ్యమత్రి ఎంకే స్టాలిన్’ మిత్ర పక్షం కాంగ్రెస్ పార్టీకి సూచనలు చేశారు. ప్రతిపక్షాల పెద్దన్న పాత్ర, పోషించే క్రమంలో కాంగ్రెస్ పార్టీ దేశంలోని, ప్రధాన రాజకీయ పార్టీలతో స్నేహ సంబంధాలను మెరుగు పరచు కోవాలని కోరారు. అలాగే, బీజేపీ ఓడించేందుకు, కాంగ్రెస్, వామపక్ష పార్టీలు కలిసి పనిచేయాలని స్టాలిన్ సలహా ఇచ్చారు. దేశంలో ఉన్న ఏ ఒక్క పార్టీ కూడా బీజేపీని ఇప్పట్లో గద్దె దింపలేవని అన్నారు తమిళనాడులో బీజేపీ బలపడుతున్న నేపధ్యంలో స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి. 

ఏప్రిల్ 8 ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ముంబై నివాసంపై మెరుపు దాడి  జరిగింది. అయితే, ఈ దాడికి ఎవరు బాధ్యులు, ఎందుకు చేశారు అనేది స్పష్టం కాలేదు. 

ఏప్రిల్ 11  తెలంగాణ ముఖ్యమత్రి కేసేఆర్, కేంద్ర ప్రభుత్వ ధాన్యం కొనుగోలు విధానానికి వ్యతిరేకంగా గళమెత్తారు. ఢిల్లీ తెలంగాణ భవన్’ లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలతో ఇతర పార్టీ నేతలతో కల్సి ధర్నా నిర్వహించిన కేసేఆర్, కేంద్రానికి 24 గడువు విదించారు. ఈ లోగ కేంద్ర ప్రభుత్వం తమ డిమాండ్లకు  సానుకూలంగా స్పందించాలని, లేని పక్షాన దేశ వ్యాప్త ఆందోళన చేపడతామని హెచ్చరించారు.  కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా భర్త,రాబర్ట్ వాద్రా, ప్రజలు కోరుకుంటే పాలిటిక్స్’లోకి వస్తానని  సంచన ప్రకటన చేశారు. అలాగే, 2024 ఎన్నికలలో పోటీ చేసేందుకు కూడా సిద్ధమని వాద్రా ప్రకటించారు.  ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంత్రి వర్గాన్ని పునర్వ్యవ్యవస్థీకరించారు. 25 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు.  

ఏప్రిల్ 12 పాకిస్థాన్ నూతన ప్రధాన మంత్రిగా షెహబాజ్ షరీఫ్ ప్రమాణ స్వీకారం చేశారు. 

ఏప్రిల్ 14  ఢిల్లీ తీన్’ మూర్తి ఎస్టేట్ ప్రాంగణంలో నిర్మించిన  ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం చేశారు.స్వతంత్ర భారత తొలి ప్రధాని జవహర్’లాల్ నెహ్రు మొదలు దేశాన్ని పాలించిన ప్రదానమంత్రుల జీవిత చిత్రాలను, దేశానికీ వారు చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచి పోయే విధంగా ‘ప్రధాన మంత్రి సంగ్రహలయ’ను నిర్మించారు. 

ఏప్రిల్ 15 అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న కర్ణాటక మంత్రి ఈశ్వరప్ప రాజీనామా చేశారు.

ఏప్రిల్ 24  ప్రధానమంత్రి రాష్ట్ర పర్యటనకు ముందు జమ్మూ కశ్మీర్ లో  పేలుళ్లు సంభవించాయి. అయితే ఎలాంటి హనీ జరగ లేదు.  ఏప్రిల్ 26.. కాంగ్రెస్ పార్టీలో తాను చేరతానంటూ వస్తున్న వార్తలకు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తెర దించారు. కాంగ్రెస్’లో చేరడం లేదని ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీని పునర్జీవింప చేసేందుకు, ప్రశాంత్ కిశోర్ రూపొంచిన బ్లూ ప్రింట్’ పై చర్చించిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ఆయన్ని పార్టీలోకి ఆహ్వానించింది. అయితే ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అభ్యర్ధనను తిరస్కరించారు.

మే నెల వివరాలు రేపు 

కేసీఆర్ హాజరు సంతకం అనే లాంఛనం కోసమేనా?

తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిల మధ్య రాజకీయ స్నేహం గురించి కొత్తగా ఏమీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇరువురూ ఒకరి ప్రయోజనాల పరిరక్షణ కోసం మరొకరు అన్నట్లుగా నిలబడ్డారన్న సంగతి తెలిసిందే. అధికారం కోల్పోయిన తరువాత ఇద్దరి వ్యవహార తీరు దాదాపు ఒకేలా ఉంటోంది. క్రియాశీల రాజకీయాలకు దూరంగా, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. పార్ట్ టైమ్ పొలిటీషియన్లుగానే వ్యవహరిస్తూ వచ్చారు. ఇరువురూ కూడా పరాజయం తరువాత అసెంబ్లీకి డుమ్మా కొడుతూనే వచ్చారు. అలా అసెంబ్లీకి గైర్హాజర్ కావడానికి ఎవరి కారణాలు వారు చెప్పుకున్నా ఫలితం మాత్రం సభకు ఆబ్సెంట్ కావడమే.  ఈ నేపథ్యంలో  తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం రోజున సభకు హాజరయ్యారు. ఇందుకు నేపథ్యం ఏమిటని చూస్తే.. గత కొన్ని రోజులుగా  సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ ల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇక నుంచి మరో లెక్క అంటూ కేసీఆర్ చాటడంతో ఆయన అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న ప్రచారం జోరుగా సాగింది. ఆ ప్రచారానికి అనుగుణంగానే ఆయన సోమవారం (డిసెంబర్ 29) అసెంబ్లీకి హాజరయ్యారు. అయితే ఆయన సవాల్ చేసినట్లుగా అసెంబ్లీలో ఆయన గళమెత్తలేదు. సభలో ఐదారు నిముషాల పాటు.. అదీ సంతాప తీర్మానాల ఆమోదం వరకూ మాత్రమే సభలో ఉన్నారు. ఆ తరువాత బయటకు వెళ్లిపోయారు. సభలో బీఆర్ఎస్ కూడా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, సభా కార్యక్రమాలను అడ్డుకోవడం లాంటి చర్యలకు పాల్పడలేదు.  ప్రశ్నోత్తరాల సమయం సజావుగా సాగింది.  దీంతో కేసీఆర్ అసెంబ్లీకి హాజరయ్యింది కేవలం అనర్హత వేటు పడకుండా ఉండేందుకు సభలో అటెండెన్స్ వేయించుకోవడానికేనన్న చర్చ మొదలైంది. సభకు హాజరై ఒక సంతకం చేసేసి మౌనంగా ఆయన సభ నుంచి నిష్క్రమించేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇక్కడే వారు కేసీఆర్ వ్యవహారాన్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుతో పోలుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో జగన్ కూడా ఒకే ఒక సారి అసెంబ్లీకి హాజరై రిజిస్టర్ లో సంతకం చేసి, ఆ తరువాత అసెంబ్లీ సమావేశాలకు ముఖం చాటేస్తున్నారు. అసలు అసెంబ్లీ అవసరమేమిటి? ప్రజా సమస్యలపై ప్రెస్ మీట్లలో మాట్లాడితే సరిపోదా అన్న తీరులో ఆయన వ్యవహార శైలి ఉంది. ఇక ఇప్పుడు కేసీఆర్ కూడా సరిగ్గా అలానే వ్యవహరించనున్నారా అన్న అనుమానాలు అత్యధికుల్లో వ్యక్తం అవుతున్నాయి.   మొత్తం మీద శాసన సభ సభ్యత్వాన్ని కాపాడుకోవడానికి హాజరు వేయించుకునే లాంఛనాన్ని కేసీఆర్ పూర్తి చేసి.. తాను తన రాజకీయ మిత్రుడు, వైసీపీ అధినేత జగన్ నే ఫాలో అవుతున్నానని చాటినట్లైందని అంటున్నారు.  

అసెంబ్లీలో సుహృద్భావ వాతావరణం.. కేటీఆర్ తీరు పంటి కింద రాయి తీరు!

చట్ట సభలు అంటే ఒకప్పుడు ప్రజాస్వామ్య దేవాలయాలుగా భాసిల్లేవి. అసెంబ్లీ, లోక్ సభలో జరిగే చర్చలు బాధ్యతాయుతంగా, అర్ధవంతంగా సాగేవి. సభలో సభ్యుల మధ్య అంశాలవారీగానే విభేదాలు తలెత్తేవి తప్ప.. ఎన్నడూ వ్యక్తిగత స్థాయికి దిగజారేవి కాదు. అయితే రాను రాను ఆ పరిస్థితి మారిపోయింది. సభ వేదికగా వ్యక్తిగత విమర్శలు, దూషణలు అన్నవి సర్వసాధారణమన్నట్లుగా మారిపోయాయి. సభలో ప్రజా సమస్యలపై చర్చ అన్నదే మృగ్యమైపోయిన పరిస్థితి ఏర్పడింది.  తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ హయాంలో అంటే పదేళ్ల పాటు తెలంగాణ అసెంబ్లీ ప్రభుత్వ సమావేశం అన్నట్లుగా మారిపోయింది. విపక్ష సభ్యులకు మైక్ అన్నది అందని ద్రాక్షగా మారిపోయిన పరిస్థితి. అయితే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన తరువాత సభా నిర్వహణలో స్పష్టమైన  మార్పు కానవచ్చింది.  సభాసంప్రదాయాలకు, విలువలకు రేవంత్ సర్కార్ పెద్ద పీట వేసింది. అర్ధవంతమైన చర్చలు జరిగేందుకు అనుకూలమైన వాతావరణం ఏర్పడింది.  ఆ వాతావరణం తాజాగా సోమవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలలోనూ ప్రస్ఫుటంగా కనిపించింది. నిప్పుల తూటాలలాంటి విమర్శలతో ఇటీవల ఒకరిపై ఒకరు విరుచుకుపడిన రేవంత్, కేసీఆర్ లు సభలో పరస్పరం పలకరించుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. సీఎం రేవంత్ ఆప్యాయంగా, కలుపుగోరు తనంగా మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఇటీవలి కాలంలో తెలంగాణ అసెంబ్లీలో ఎన్నడూ కనబడని అరుదైన దృశ్యంగా ఇది చాలా కాలం యాదుండి పోతుందనడంలో సందేహం లేదు. ఈ సుహృద్భావ పూరిత వాతావరణం ఏర్పడటానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా చొరవ తీసుకున్నారు. అసెంబ్లీలోకి అడుగుపెడుతూనే రేవంత్ రెడ్డి ముందుగా ప్రతిపక్ష నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్థానం వద్దకు వెళ్లారు. ఆయనను మర్యాదగా పలకరించి, ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు. ఆ తరువాత ఆప్యాయంగా షేక్ హ్యాండిచ్చి మరీ తన స్థానానికి వెళ్లారు. పలువురు మంత్రులు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అనుసరించి కేసీఆర్ ను పలుకరించి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఇది అసెంబ్లీలో సభా మర్యాదలు ఎలా ఉండాలన్నదానికి అద్దంపట్టింది. అ యితే ఇంత జరిగినా పంటి కింద రాయిలా బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కల్వకుంట్ల తారకరామారావు వ్యవహరించారన్న కామెంట్లు వినిపిస్తున్నాయి. రేవంత్ రెడ్డి స్వయంగా విపక్షాల వద్దకు వచ్చిన సమయంలో  కేసీఆర్ సహా అక్కడ అందరూ గౌరవ సూచకంగా లేచి నిలబడినా కేటీఆర్, కౌషిక్ రెడ్డిలు మాత్రం  తన స్థానం నుంచి లేవకుండా మౌనంగా కూర్చుండిపోవడం సభలో వాతావరణం సమూలంగా మారలేదనడానికి తార్కానంగా నిలిచింది. రేవంత్ చూపిన స్ఫూర్తికి విఘాతంగా కేటీఆర్ తీరు ఉందన్న విమర్శలూ వెల్లువెత్తుతున్నాయి.  

జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయిన పనులేంటో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీ పరాజయానికి ప్రధాన కారణం తన హయాంలో జరిగిన మేలు ప్రజలకు చెప్పుకోవడంలో విఫలం కావడమేనని తరచూ చెబుతుంటారు. తన ఓటమికి కారణం ఆ చెప్పుకోలేకపోవడమేనని నమ్ముతుంటారు.  ఇంతకీ ఆయన హయాంలో చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటి?  అంత చేసీ ఎందుకు చెప్పుకోలేకపోయారు అన్న విషయంపై సామాజిక మాధ్యమంలో ఓ స్థాయిలో డిబేట్ జరుగుతోంది. వాస్తవానికి ఆయన అరకొరగా అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలకు అంతకు వందింతల ప్రచారం చేసుకున్నారు.   జ‌గ‌న్ చేసిన సంక్షేమ ప‌థ‌కాల ప్ర‌చారానికి ప్రత్యేకంగా ఒక నెట్ వర్కే  ఉండేది.  ఏపీడీసీ వంటి  సంస్థ‌లు కూడా ఆ నెట్ వర్కక లో ఉండేది. ఏపీసీసీని జగన్ ఆంధ్రప్రదేశ్  డిజిట‌ల్ కార్పొరేష‌న్ (ఏపీడీసీ)గా పేరు మార్చి దానికి భారీ ఎత్తున బడ్జెట్ కేటాయించారు.   ఒక నిమిషానికి రెండున్న‌ర వేలు ఇవ్వాల్సింది కాస్తా  ప‌ది ప‌న్నెండు వేలుగా ఇచ్చి.. మ‌రీ వీడియోల రూప‌క‌ల్ప‌న చేశారు. ఇదిలా ఉంటే సంక్షేమ ప‌థ‌కాల బ‌ట‌న్ నొక్కుడు కార్య‌క్ర‌మాల‌కు సిద్దం  సభ‌ల‌క‌న్నా మించిన స‌భ‌లు ఏర్పాటు చేసి... వాటి ద్వారా జ‌నాన్ని పోగేసి సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను కూడా ఏర్పాటు చేశారు. వీటి ద్వారా కూడా జగన్ హయాంలో ప్రభుత్వ సంక్షేమాన్ని గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా ప్రచారం నిర్వహించారు.   ఇందుకు ఒక ఎమ్మెల్సీ తన సిబ్బందితో ఈ కార్య‌క్ర‌మాల‌ను ప‌ర్య‌వేక్షించ‌గా.. వాటిని నాటి మంత్రి పెద్ది రెడ్డి సూప‌ర్వైజ్ చేసేవారు. ఇందుకు రూ.కోట్లు ఖర్చు చేసేవారు. ఇక్కడ చెప్పుకోవల సిందేమిటంటే..  ఓట్ల కోసం చేసిన ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు తోపాటు.. చేసింది చెప్పుకోడానికి అద‌న‌పు ఖ‌ర్చు కూడా భారీ ఎత్తున‌ జ‌రిగేది. ఇంతా చేసి తాను చేసింది చెప్పుకోలేక పోయానంటూ జగన్ ఆవేదన చెందడమేంటని నెటిజనులు తెగ శోధించారు. వారి శోధనలో జగన్ చేసి కూడా చెప్పుకోలేకపోయినవి ఏమిటంటే..  ఎలుక‌లు ప‌ట్ట‌డానికి  కేటాయించిన రూ. 1. 6 కోట్లు, తాడేప‌ల్లి ప్యాలెస్ చుట్టూ కంచె కోసం ఖర్చు చేసిన రూ. 12. 5 కోట్లు, ఎగ్ ప‌ఫ్ ల కోసం రూ. 3. 6 కోట్లు, పాస్ పుస్త‌కాల‌పై తన ఫోటోల కోసం రూ. 13 కోట్లు,  వైయ‌స్ విగ్ర‌హాల ఖ‌ర్చు రూ. 18 కోట్లు, స్కూళ్లు, ఇతర ప్రభుత్వ భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడానికి ఖర్చు చేసిన రూ.150 కోట్లు.  తన పర్యటనల కోసం విమానాలు, హెలికాప్టర్ల కోసం ఖర్చు చేసిన  రూ. 222 కోట్లు. వీటి గురించే జగన్ చెప్పుకోలేకపోయారని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. అంతేనా  రుషికొండ ప్యాలెస్ కి రూ. 600 కోట్లు, బియ్యం సంచులు మోయ‌డానికి  రూ. 700 కోట్లు, స‌రిహ‌ద్దు రాళ్ల‌పై ఫోటోల‌కు ఇంకో రూ. 700 కోట్లు కూడా జగన్ ప్రభుత్వ ధనాన్ని వెచ్చించారు. ఆ ఖర్చుల గురించి కూడా జగన్ జనాలకు చెప్పుకోలేకపోయారట. ఆ కారణంగానే వైసీపీ ఘోరంగా ఓడిపోయిందన్నది జగన్ భావన అని నెటిజనులు తేల్చారు. అవి చెప్పుకోలేకపోవడం వల్లనే కనీసం 11 స్థానాలైనా వచ్చాయనీ, వాటి గురించి కూడా ఘనంగా చెప్పుకుని ఉంటే, అవి కూడా వచ్చేవి కావని సామాజిక మాధ్యమంలో జగన్ పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. 

కేసీఆర్ కు రేవంత్ షేక్ హ్యాండ్

నిప్పూ ఉప్పులా పరస్పర విమర్శలు గుప్పించుకునే కేసీఆర్, రేవంత్ రెడ్డిలు ఆసెంబ్లీలో ఆప్యాయంగా పలకరించుకున్న సన్నివేశం అందరినీ అలరించింది. సర్వత్రా ఆసక్తి కలిగించింది. తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుదీర్ఘ విరామం తరువాత విపక్ష నేత హోదాలో కేసీఆర్ ఈ సమావేశాలకు హాజరయ్యారు. సభ ప్రారంభానికి ముందే ఆయన సభలో తనకు కేటాయించిన సీటులో కూర్చున్నారు. ఆ తరువాత అసెంబ్లీలోకి ప్రవేశించిన రేవంత్ రెడ్డి నేరుగా కేసీఆర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనను ఆప్యాయంగా పలుకరించారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ క్షేమ సమాచారాలు అడిగారు. ఆ తరువాత కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ సంఘటన అధికార ప్రతిపక్ష సభ్యులను విస్మయానికి గురి చేసింది. సభా మర్యాదలంటే అలా ఉండాలన్న చర్చ అధికార ప్రతిపక్షాలలో జరిగింది.   అదలా ఉంటే.. రేవంత్ కేసీఆర్ కు షేక్ హ్యాండ్ ఇచ్చిన తరువాత మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క తదితరులు కూడా కేసీఆర్ ను పలుకరించి ఆయనతో కరచాలనం చేశారు.  ఇక ఇటీవల జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో విజయం సాధించిన నవీన్ యాదవ్ కూడా కేసీఆర్ కు నమస్కరించి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.  ‎

ఏపీ కేబినెట్ భేటీ.. చర్చించే కీలక అంశాలేంటంటే?

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి అధ్యక్షతన సోమవారం (డిసెంబర్ 29) ప్రారంభమైంది. వెలగపూడిలోని సచివాలయంలో జరుగుతున్న ఈ కేబినెట్  భేటీలో రాష్ట్ర అభివృద్ధి,  పాలనాపరమైన కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.  ఈ కేబినెట్ భేటీలో ప్రధానంగా   కొత్త జిల్లాల ఏర్పాటుకు ఆమోదం లభించే అవకాశాలున్నాయి. అలాగే  కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై కూడా చర్చ జరిపి నిర్ణయం తీసుకునే చాన్స్ ఉంది.  అమరావతిని గ్లోబల్ క్వాంటమ్ హబ్‌గా మార్చే లక్ష్యంతో.. రూ.103.96 కోట్ల వ్యయంతో రెండెకరాల విస్తీర్ణంలో అత్యాధునిక రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కేబినెట్ చర్చించి ఆమోదముద్ర వేయనుంది.  అదే విధంగా రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల నిర్మాణం, నిర్వహణలో పీపీపీ విధానాన్ని ప్రవేశపెట్టడంపై సీఎం మంత్రులకు దిశానిర్దేశం చేయనున్నారు.  ఇకపోతే..  రాజధాని అమరావతి అభివృద్ధి పనుల వేగవంతంపై కేబినెట్ చర్చించనుంది. రాష్ట్రంలో  సంక్షేమ పథకాల అమలు తీరుపై కూడా సమీక్ష జరిగే అవకాశం ఉంది.   ఇంకా వర్షాకాలంలో రాజధాని పరిసర ప్రాంతాలను వరద ముంపు నుంచి కాపాడేలా ఫ్లడ్ పంపింగ్ స్టేషన్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే  అఖిల భారత సేవా అధికారుల నివాస భవనాలకు అదనపు మౌలిక సదుపాయాలు కల్పించేందుకు  109 కోట్ల రూపాయల కేటాయింపునకు కూడా కేబినెట్ ఆమోదముద్ర వేయనుంది.   అమరావతి పరిధిలోని శాఖమూరు లో 23 ఎకరాలలో కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో భవనాల  నిర్మాణానికీ, అలాగే తాళ్లూరులో  6 ఎకరాలో  హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్ల నిర్మాణానికి కూడా కేబినెట్ పచ్చ జెండా ఊపే అవకాశం ఉంది. ఎల్పీఎస్ జోన్-8 పరిధిలో లేఅవుట్ల అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన కోసం  నిధుల కేటాయింపుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉంది. ఇక రాజధాని పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులకూ కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.  

సినిమాలకు తమిళ హీరో విజయ్ గుడ్ బై.. రాజకీయాలకే పూర్తి సమయం

రాజకీయ నాయకుడిగా మారిన తమిళ స్టార్ హీరో విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పారు. ఆయన తమిళ వెట్రి కళగం అనే రాజకీయ పార్టీని ఏర్పాటు చేసి రానున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి అధికారం చేపట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన పార్టీ సభలో తొక్కిసలాట జరిగి 40 మందికి పైగా మరణించిన సంఘటనతో ఆయన తొలి అడుగులు ఒకింత తడబడ్డాయి.  దాని నుంచి తేరుకుని ముందుకు సాగడానికి ఒకింత సమయం తీసుకున్న విజయ్ ఇప్పుడ పూర్తిగా రాజకీయాలకే సమయం కేటాయించడానికి తీసుకున్న నిర్ణయంలో భాగంగానే  సినిమాల‌కు గుడ్ బై చెప్పారు విజ‌య్.  ఒక్కోసినిమాకు వంద కోట్ల రూపాయ‌ల వరకూ పారితోష‌కం తీసుకునే విజయ్ ఆ ఆదాయాన్ని వదులుకుని ప్రజా సేవకే అంకితం కావాలని డిసైడ్ అయ్యారనడానికి ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పడమే నిదర్శనం. వచ్చే ఏడాది త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ ఎన్నికలకు విజయ్ సర్వసన్నద్ధం అవుతున్నారు.  ఏ పార్టీలతోనూ పొత్తు లేకుండా ఒంటరిగానే ఎన్నికల సమరంలోకి అడుగుపెట్టనున్నట్లు  ఆయన ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.  ఈ నేపథ్యంలోనే రాజకీయవర్గాలలో విజయ్  టీవీకే పార్టీకి ఉన్న విజయావకాశాలపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే సీఓటర్ సంస్థ నిర్వహించిన సర్వేలో టీవీకే విజయం కంటే ఎన్డీయే కూటమికి భారీ నష్టం కలిగించే అవకాశాలు మెండుగా ఉన్నాయని తేలింది.  టీవీకే పోటీ వల్ల బీజేపీ, అన్నాడీఎంకే  కూటమి ఓట్లు భారీగా చీలుతాయని పేర్కొంది. అంటే విజయ్ పార్టీ పోటీ వల్ల లాభపడేది అధికార డీఎంకే అన్నది సీఓటర్ సర్వే సారాశంం.   ఇక సైద్ధాంతికంగా బీజేపీతో, రాజ‌కీయంగా డీఎంకేతోనే త‌మ  పోటీ అని విజయ్ ప్రకటించిన నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలపై ఇప్పటి నుంచే సర్వత్రా ఆసక్తి వ్యక్తం అవుతోంది. విజయ్ స్వయంగా మధురై ఈస్ట్ నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు.  విజయ్ ది చెన్నై. అయితే ఆయ‌న మ‌ధురైని త‌న సొంత  నియోజ‌క‌వ‌ర్గం చేసుకోవాల‌ని భావిస్తున్నారు. స్టార్ హీరో కావడంతో విజయ్ కు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. సామాన్య జనంలోనూ మంచి పాపులారిటీ ఉంది. దీంతో మధురైలో ఆయన స్థానికేతరుడు అన్న సమస్య తలెత్తే అవకాశం ఉండదన్నది పరిశీలకులు అంచనా.    ఇక పోతే విజ‌య్ పార్టీకి సంబంధించినంత వరకూ ఆ పార్టీలో విజయ్ వినా పెద్దగా  ఫెమిలియ‌ర్ ఫేస్ మరొకటి లేదు. ఒక వేళ విజ‌య్ పార్టీలోకి రావడానికి డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ, కాంగ్రెస్ వంటి  పార్టీలు ఆసక్తి చూపుతున్నా.. వారికి రెడ్ కార్పెట్ పరిచి పార్టీలోని ఆహ్వానించడానికి విజయ్ పెద్దగా సుముఖత చూపడం లేదు.  ఆయ‌న వారిని ఏమంత‌గా  తీసుకోవ‌డం లేదు.  ఏపీ నుంచి న‌గ‌రి మాజీ ఎమ్మెల్యే రోజా సైతం త‌న భ‌ర్త ఇన్ ఫ్లూయెన్స్ వాడి విజ‌య్ ఏర్పాటు చేసిన టీవీకేలో చేరాల‌ని ప్రయత్నించినా, ఆమెకు అక్కడ నుంచి పెద్దగా సానుకూలత వ్యక్తం కాలేదని అంటున్నారు. దీంతో పార్టీలో పెద్దగా పాపులర్ అండ్ ఫేమస్ నేతలు లేకపోవడం విజయ్ టీవీకే పార్టీకి ఒకింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉందని అంటున్నారు.   ఒక తమిళ రాజకీయాలలో ప్రస్తుత పరిస్థితిని ఒక సారి గమనిస్తే.. రాష్ట్రంలో  బీజేపీకి ఉన్న పట్టు అంతంత మాత్రమే. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే పొత్తులో భాగంగా ఒకటి రెండు స్థానాలు దక్కితే అదే చాలనుకునే పరిస్థితిలో  బీజేపీ ఉంది.  దీంతో ప్రధాన పోటీ  డీఎంకే- టీవీకే మ‌ధ్యే ఉంటుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా.    ఇక విజ‌య్ టీవీకే పార్టీ నుంచి అత్యధికంగా ఆయన అభిమాన సంఘాల నాయకులకే టికెట్ లు లభించే అవకాశం కనిపిస్తోంది. అంటే టీవీకే తరఫున పోటీ చేసే అభ్యర్థులలో అత్యథికులు ఆ పార్టీ నేత విజయ్ తో కలిసి రాజకీయాలకు కొత్తవారే అవుతారు. ఇది పార్టీ విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు పరిశీలకులు. మొత్తం మీద  డీఎంకే,  టీవీకే మ‌ధ్య  ముఖాముఖీ అన్నట్లుగా జరగనున్న   త‌మిళ‌నాడు అసెంబ్లీ ఎన్నికలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొని ఉందనడంలో సందేహం లేదు.  

అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్.. హీట్ మామూలుగా ఉండదుగా?

తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు పర్యాయాలు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పని చేసిన కేసీఆర్.. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం తరువాత ప్రతిపక్ష నాయకుడి పాత్రకు పరిమి తమయ్యారు. అయితే ఆ పాత్రలో ఆయన ఎంత మాత్రం క్రియాశీలంగా లేరు. ఓటమి తరువాత ఆయన పూర్తిగా ఇన్ యాక్టివ్ అయిపోయారు. పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమితమయ్యారు. ప్రతిపక్ష నేతగా ఆయన అసెంబ్లీకి కూడా హాజరు కాకుండా రాజకీయ సన్యాసం పుచ్చుకున్నారా అన్నట్లుగా ఆయన వ్యవహరిస్తూ వస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన  ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాలను వేళ్ల పై లెక్కించవచ్చు. ఇక అసెంబ్లీకి అయితే.. కేవలం శాసనసభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి మాత్రమే హాజర్యారని చెప్పవచ్చు.   అయితే పంచాయతీ ఎన్నికలలో బీఆర్ఎస్ పరాజయం తరువాత, ఆయన అనివార్యంగా రాజకీయాలలో క్రీయాశీలం కావలసిన పరిస్థితి ఏర్పడింది. పార్టీ ఉనికిని కాపాడుకోవడానికీ, పార్టీని బలోపేతం చేయడానికి కేసీఆర్ స్వయంగా నడుంబిగించకుంటే లాభం లేదన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో కూడా బలోపేతం అవుతోంది. దీంతో తన పొలిటికల్ అజ్ణాత వాసానికి ఫుల్ స్టాప్ పెట్టి జనంలోకి రావడానికి సిద్ధమైపోయారు. తాజాగా ఇటీవల ఆయన పార్టీ నేతలు, కార్యకర్తలతో జరిపిన సమావేశంలో ఇక నుంచీ తాను పొలిటికల్ గా క్రియాశీలమౌతాననీ,  అదే సమయంలో అసెంబ్లీలో పార్టీ తరఫున బలమైన గొంతు వినిపించాల్సిన అవసరాన్ని గట్టిగా చెప్పారు. ఈ మాటలే ఆయన ఈ సారి అసెంబ్లీ శీతాకాల సమావేశాలకు హాజరు అవుతారని తేటతెల్లం చేసింది. అయినా ఎక్కడో ఏదో అనుమానం.  గతంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సమయంలో కూడా ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనీ, అధికార పక్షాన్ని తన ప్రశ్నల పరంపరతో ఉక్కిరిబిక్కిర చేస్తారనీ బీఆర్ఎస్ వర్గాలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు.  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, తప్పిదాలను సభ సాక్షిగా ఎండగడతారనీ బీఆర్ఎస్ శ్రేణులు గట్టిగా నమ్మాయి. అయితే  అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాలేదు. గొంతు విప్పలేదు. ఫామ్ హౌస్ గడప దాటలేదు. మరి ఇప్పుడైనా అసెంబ్లీకి వస్తారా? అన్న అనుమానాలు పరిశీలకుల నుంచే కాదు, పార్టీ శ్రేణులనుంచి కూడా వ్యక్తం అయ్యాయి. అయితే ఆ అనుమానాలన్నిటినీ పటాపంచలు చేస్తూ కేసీఆర్ ఈ సారి అసెంబ్లీ హాజరౌతున్నారు. సోమవారం (డిసెంబర్ 29) ఆయన అసెంబ్లీలో అడుగుపెట్టారు.  ఇక ఇప్పుడు ఆయన అసెంబ్లీలో గొంతు విప్పి రేవంత్ సర్కార్ ను ఇరుకున పెడతారా? స్పీకర్ ఆయనకు కోరినంత సమయం మైక్ ఇస్తారా? లేకుంటే? అసెంబ్లీలో రేవంత్ వర్సెస్ కేసీఆర్  తలపడితే పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరు పై చేయి సాధిస్తారు అన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తం అవుతున్నది. మొత్తం మీద కేసీఆర్ హాజరుతో ఈ శీతాకాల సమావేశాలు రోహిణీ కార్తెను మించిన హీట్ తో సాగుతాయనడంలో ఎలాంటి సందేహాలు లేవంటున్నారు. 

కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామ్ తో చంద్రబాబు భేటీ.. ఎక్కడంటే?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కేంద్ర విత్త మంత్రి నిర్మలా సీతారామన్ తో భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తన పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళ్లేందుకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న సందర్భంగా సీఎం చంద్రబాబు ఆమెతో భేటీ అయ్యారు. ఇరువురి మధ్యా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి పలు అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇటీవలే చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో నిర్మలా సీతారామన్ తో భేటీ  అయిన సంగతి తెలిసిందే. కేంద్ర బడ్జెట్ ముందు స్వల్ప వ్యవధిలో చంద్రబాబు కేంద్ర విత్త మంత్రితో భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది.   రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, కేంద్రం నుంచి   సహకారం, బడ్జెట్ లో ప్రాధాన్యత వంటి అంశాలను చంద్రబాబు ఆమెతో ప్రస్తావించినట్లు సమాచారం. ఈ భేటీ అనంతరం చంద్రబాబు కృష్ణా జిల్లా  పెద్దఅవుటపల్లిలోని మాజీ ఎంపీ కంభంపాటి రామ్మోహన్ రావు నివాసానికి వెళ్లారు ఆయనను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. కంభంపాటి తల్లి వెంకటనరసమ్మ ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు కంభంపాటి రామ్మోహనరావు ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించారు.   వెంకటనరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

దేశం శాస్త్ర సాంకేతికంగా అభివృద్ధికి కారణం ఇందిరా, రాజీవ్‌లే : టీపీసీసీ చీఫ్

  శాస్త్ర సాంకేతికంగా దేశం అభివృద్ధి చెందడానికి కారణం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీలేనని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గాంధీభవన్‌లో కాంగ్రెస్ వ్యవస్థాపక దినోత్సవం సందర్బంగా గాంధీ, పటేల్ చిత్రపటాలకు పూలమాల సమర్పించి టీపీసీసీ చీఫ్ నివాళులు అర్పించారు. ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి దేశాన్ని ప్రగతి పథంలో నడిపింది పీవీ నరసింహారావు అని గుర్తు చేశారు. పేద ప్రజలకు ఉపయోగపడేలా కాంగ్రెస్ ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని తీసుకొస్తే మోదీ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోందని మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు.  మరోవైపు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సీఎం రేవంత్‌రెడ్డి పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ స్వాతంత్ర్య సంగ్రామ మహారథి జాతి నిర్మాణ సారథి. ప్రజాస్వామ్య ఆకాంక్షల వారధి. పేదల ఆకలి తీర్చిన పెన్నిధి. 140 కోట్ల భారతీయుల ప్రతినిధి. 141 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం.  కార్యకర్తల చెమట చుక్కలే సిరా చుక్కలై రాసిన చరిత్ర కాంగ్రెస్. కార్యకర్తలకు, నాయకులకు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అని రేవంత్‌రెడ్డి ఎక్స్ వేదికగా తెలిపారు.

ఉపాధి హామీ పేరు మార్పుపై రేపు కాంగ్రెస్ నిరసనలు

  జాతీయ ఉపాధి హామీ పథకంలో మహాత్మాగాంధీ పేరును తొలగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రను గ్రామీణ ప్రజలకు తెలియజేయాలని ఏఐసీసీ పిలుపునిచ్చిందని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. ఆ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రేపు (28న) గ్రామ గ్రామాన గాంధీ చిత్రపటాలతో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే జిల్లా కేంద్రాలలో కాంగ్రెస్ శ్రేణులు మహాత్మాగాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసన కార్యక్రమాలు చేపట్టాయని ఆయన తెలిపారు. ఎన్నో ఉద్యమాలు, పోరాటాల ఫలితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన జాతీయ ఉపాధి హామీ పథకాన్ని నీరుగార్చేందుకు బీజేపీ ప్రభుత్వం కుట్ర చేస్తోందని మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహాత్మా ఉపాధి హామీ పథక అమలు బాధ్యతల నుంచి కేంద్ర ప్రభుత్వం పక్కకు తప్పుకోవాలని చూస్తోందని, పేదలు, గ్రామీణ కూలీలకు భరోసాగా ఉన్న ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలనే ఉద్దేశంతోనే గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. దీనికి నిరసనగా జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 28న రాష్ట్ర వ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద, గాంధీ చిత్రపటాలను పట్టుకొని నిరసనలు తెలియజేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయానికి, పనికి ఇచ్చే గౌరవాన్ని ప్రజలకు వివరంగా తెలియజేయాలని సూచించారు.రేపు జరగబోయే నిరసన కార్యక్రమాలను పెద్దఎత్తున విజయవంతం చేయడానికి ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకుడు కృషి చేయాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.