అల్లుడి కాళ్లు కడుగుతూ గుండెపోటుతో కుప్పకూలిన మామ

వాన రాకడ.. ప్రాణం పోకడ ముందుగా తెలియదంటారు.ఇదంతా గతం. వర్షం ఏ సమయంలో ఏ ప్రాంతంలో కురుస్తుందో కచ్చితంగా చెప్పే సాంకేతిక పరిజ్ణానం అందుబాటులోకి వచ్చింది. అలాగే వైద్య విజ్ణానం కూడా చాలా అభివృద్ధి చెందింది. చిన్న చిన్న పరీక్షలతో రాబోయే ఆరోగ్య సమస్యలను ముందుగానే గుర్తించే విజ్ణానం కూడా అందుబాటులోకి వచ్చిందని గొప్పలు చెప్పుకుంటున్నాం. అయినా ప్రాణాలను కాపాడుకోలేని నిస్సహాయ స్థితిలోనే నేటికీ మానవుడు ఉన్నాడు. హాయినా నవ్వుతూ ఆనందంగా తిరుగుతున్న వ్యక్తి అంతలోనే గుండెపోటుతో కుప్ప కూలిపోతున్నాడు. వయస్సుతో సంబంధం లేకుండానే గుండె పోటుకు గురి అవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా పచ్చటి పెళ్లి పందిట్లో వధువు తండ్రి గుండెపోటుతో కుప్పకూలిన సంఘటన విషాదాన్ని నింపింది. కుమార్తె వివాహంలో వరుడి కాళ్లు కడుగుతూ ఓ తండ్రి గుండెపోటుతో కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు. ఎక్కడ, ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. నెటిజన్ల గుండెలను పించేస్తోంది. మాటలు రాని విషాదమంటూ వారు కామెంట్లు పెడుతున్నారు.

హస్తిన చేరిన ఏపీ బీజేపీ పంచాయతీ.. సోము వీర్రాజుపై మురళీధరన్ కు ఫిర్యాదు

ఏపీ బీజేపీ పంచాయితీ ఢిల్లీకి చేరింది.   రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును ఆ పదవి నుంచి తొలగించకపోతే, బీజేపీలో ఎవరూ ఉండే పరిస్థితి లేదంటూ ఓ  30 మంది ఏపీ బీజేపీ సీనియర్‌ నేతలు, బీజేపీ రాష్ట్ర ఇన్ చార్జ్, కేంద్రమంత్రి మురళీధరన్‌కు   ఢిల్లీ వెళ్లి మరీ ఫిర్యాదు చేశారు.   రాష్ట్రంలో పార్టీ పరిస్థితి గురించి వారంతా ఆయనకు వివరించారు. ఇటీవల సోము వీర్రాజు, మరికొందరు నాయకులపై వచ్చిన బలవంతపు దళితుల భూ కొనుగోలు ఆరోపణలను  మురళీధరన్‌ దృష్టికి తీసుకు వెళ్లారు. విశ్వసనీయ సమాచారం మేరకు దాదాపు 30 మంది రాష్ట్ర, జిల్లా స్థాయి నేతలు బుధవారం సాయంత్రం  కేంద్రమంత్రి మురళీధరన్‌తో భేటీ అవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీలో మొదటి నుంచి పనిచేస్తున్న సీనియర్లను పక్కకుపెట్టి, తన సొంత మనుషులతో వ్యవహారం నడిపిస్తున్నారని వారు మురళీధరన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపై గ్రూపులు కడుతున్నారన్న ముద్ర వేస్తున్నారని వివరించారు. ఎలాంటి వనరులూ అందుబాటులో లేకపోయినా, తాము రెండేళ్లపాటు సొంత ఖర్చులతో జిల్లాల్లో పార్టీని విస్తరిస్తే, అవమానకరరీతిలో తొలగించారని ఫిర్యాదు చేశారు. దళితుల భూమిని దౌర్జన్యంగా స్వాధీనం చేసుకునే అంశంలో, పార్టీ ప్రతిష్ఠ తీవ్రంగా దెబ్బతిన్నదని వారు ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. సోము వీర్రాజు  అవినీతి కారణంగా  పార్టీ నష్టపోతోందని, ఆయనను కొనసాగిస్తే, బీజేపీలో తొలి నుంచీ పనిచేస్తున్న వారంతా, పార్టీ నుంచి వెళ్లిపోయే ప్రమాదం ఉందని మురళీధరన్ దృష్టికి తీసుకు వెళ్లారు. ఈ మేరకు ఒక  వినతిపత్రం కూడా ఆయనకు అందజేశారు. వారి ఫిర్యాదును సావధానంగా విన్న మురళీధరన్‌.. సోము వీర్రాజు, మరికొందరు నేతలు కలసి దళితుల భూమిని ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలపై, విచారణ జరిపిస్తానని హామీ ఇచ్చారు.  

విపక్షాల ఐక్యత ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు.. మోడీ బలం అదేనా?

కేంద్రంలో పాలక బీజేపీని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు సంఘటితం  అయి తీరాలన్నది.. బేజేపీయేతర శక్తులన్నీ అంగీకరిస్తాయి. అయితే అందుకోసం వేసే లేదా వేస్తున్న అడుగులే.. బావిలో కప్పల చందంగా ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి.  ప్రస్తుతం దేశంలో ఇటువంటి చర్చే విస్తృతంగా సాగుతోంది. ముఖ్యంగా బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌ కారణంగా ఈ చర్చ బలంగా తెరమీదకు వచ్చింది. సాదారణంగా ఇలాంటి చర్చలలో మేధావులలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవడం సహజం. ఇప్పుడూ అదే జరుగుతోంది. అయితే విశేషమేమిటంటే.. ఆ భిన్నాభిప్రాయాలలో కూడా విపక్షాల ఐక్యతపై సందేహాల విషయంలో అనుమానాల విషయంలో ఏకాభిప్రాయమే వ్యక్తంఅవుతోంది.  ఈ  నేపథ్యంలోనే వచ్చే ఏడాది  సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీని నిలువరించడమే లక్ష్యంగా  కాంగ్రెస్ పార్టీ సర్వశక్తులూ ఒడ్డడానికి సన్నాహాలు చేస్తున్నది. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వమే అని ధీమా వ్యక్తం చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఈ మేరకు ఇప్పటికే ప్రకటించారు. కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వమేనంటూ ఆయన చేసిన ప్రకటన పొలిటికల్ సర్కిల్స్ లో ప్రకంపనలు సృష్టించింది.  మల్లికార్జున్ ఖర్గే ప్రకటన నేపథ్యంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తో కలిసి నడిచే పార్టీలు ఏవన్న చర్చ ప్రారంభమైంది.  ఈ తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ఆ పార్టీ  తెలంగాణ   వ్యవహారాల మాజీ ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్  పొత్తుల అంశంపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రొగ్రెసివ్ ఇండియా కోసం కాంగ్రెస్ లీడర్ షిప్ లో ఇప్పటికే టీమ్ సిద్ధం అయిందని గురువారం (ఫిబ్రవరి 23) ఒక ట్వీట్ చేశారు.  ఆ ట్వీట్ మేరకు  కాంగ్రెస్ కూటమిలో 14 పార్టీలు ఉన్నాయి. అవి డీఎంకే, ఆర్జేడీ, ఎన్సీపీ, జేడీయూ, ఎస్ఎస్‌యూ, జేఎంఎం, యూఎంఎల్, ఎండీఎంకే, ఆర్ఎస్పీ, వీసీకే, పీడీపీ, ఎన్ సీ, కేసీ, ఎంఎన్ఎం . పరస్పరం గౌరవించుకుంటూ బీజేపీని గద్దె దించేందుకు ఐక్యంగా ముందడుగు వేస్తామని మాణికం ఠాకూర్ ఆ ట్వీట్ లో పేర్కొన్నారు. ఇంకా కలిసి వచ్చే పార్టీలను సైతం స్వాగతిస్తామని పేర్కొన్నారు.  అయితే మాణికం ఠాగూర్ తాను ప్రకటించిన కూటమి పార్టీల జాబితాలో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ ను పేర్కొనకపోవడంపై నెటిజన్లు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. కీలకమైన, జాతీయ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించే సత్తా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ను విస్మరించడంలోనే కాంగ్రెస్ కు విపక్షాల ఐక్యత, మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా ఐక్య పోరాటాలపై ఉన్న చిత్తశుద్ధి అవగతమౌతోందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. అంతే కాకుండా ఆ జాబితాలో వామపక్షాలు కూడా కనిపించకపోవడంపై కూడా కాంగ్రెస్ చెబుతున్న ఐక్యతపై అనుమాన మేఘాలు కమ్ముకుంటున్నాయి. సహజంగానే బీఆర్ఎస్ కూడా ఆ జాబితాలో లేదు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని జాతీయ పార్టీ బీఆర్ఎస్ కూడా బీజేపీయేతర కూటమి అంటూ తన వంతు ప్రయత్నాలు తాను చేస్తున్న సంగతి తెలిసిందే.  

సుప్రీంలో విచారణకు రాని అమరాతి కేసు.. దిక్కు తోచని స్థితిలో జగన్ సర్కార్

అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరో సారి వెనక్కు వెళ్లింది. హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా ప్రయత్నిస్తోంది. హై కోర్టు తీర్పు వెలువరించిన ఆరు నెలల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న జగన్ సర్కార్ ఆ తరువాత హడావుడిగా సుప్రీం ను ఆశ్రయించి, తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని అభ్యర్థించింది. వైసీపీ ఎంపీ, లాయర్ నిరంజన్ రెడ్డి ఈ విషయంలో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన గతంలో అమరావతి కేసును అత్యవసరంగా విచారించాలంటూ బెంచ్ ముందు ప్రస్తావించారు. 23వ తేదీన తొలి కేసుగా విచారిస్తామని జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్నలతో కూడిన ధర్మాసనం తెలిపింది.  అయితే ఈ రోజు విచారణకు వచ్చే కేసులు జాబితాలో అమరావతి కేసు లేదు. ఇందుకు  సీజేఐ ఈ నెల 14న జారీ చేసిన సర్క్యులరే కారణమని చెబుతున్నారు.   ఒక సారి నోటీసు అయిన కేసులను బుధ, గురువారాల్లో విచారణ చేయవద్దని ఆ సర్క్యలర్ సారాంశం.  అందుకే అమరావతి కేసు గురువారం విచారణకు రాలేదని చెబుతున్నారు.  హైకోర్టు తీర్పు ఇచ్చిన ఆరు నెలల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేసి అత్యవసరంగా స్టే కోసం ప్రభుత్వం అదే పనిగా ప్రయత్నిస్తోంది. అయితే ఆ ప్రయత్నాలు ఫలించడం లేదు. అందుకు ఇటీవల నిరంజన్ రెడ్డి వ్యవహారం కూడా ఒక కారణమన్న ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లోనూ, లీగల్ సర్కిళ్లలోనూ జోరుగా సాగుతోంది. జగన్ కు సంబంధించిన కేసుల బెంచ్ హంటింగ్‌ కు ఆయన పాల్పడుతున్నారన్నదే ఆ చర్చ, ఈ నేపథ్యంలోనే . అమరావతి కేసులో గురువారం (ఫిబ్రవరి 23) విచారణకు రాకపోవడం, ఎప్పుడు వస్తుందన్నదానిపై స్పష్టత లేకపోవడం ప్రాధాన్యత సంతరించుకుంది.   మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా.  ఈ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి విషయాన్ని తేల్చేయాలన్న ఆత్రంతో ఉన్న జగన్ సర్కార్ సుప్రీంలో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఇబ్బందుల్లో పడేసింది. మరో వైపు సాధ్యమైనంత త్వరగా అమరావతిని ఖాళీ చేసి విశాఖకు మకాం మార్చేయాలన్న తొందర ప్రదర్శిస్తున్న జగన్ కు ఈ కేసు విచారణ జాప్యం అవుతుండటం ఒక విధంగా ఆయనను అసహనానికి గురి చేస్తున్నది. అమరావతి కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు సంగతి తరువాత కనీసం హైకోర్టు తీర్పుపై స్టే అయినా దక్కితే చాలని జగన్ సర్కార్ ప్రయత్నిస్తోంది. విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్ వెస్టర్ల సదస్సు నాటికి విశాఖ రాజధానిగా పాలన సాగిస్తామన్న కచ్చితమైన ప్రకటన చేయాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కు సుప్రీం కోర్టులో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఆశనిపాతంగానే పరిశీలకులు చెబుతున్నారు. 

కేసీఆర్ పాలనలో వీధుల్లో కుక్కులు.. వీధి రౌడీల్లా బీఆర్ఎస్ నేతలు.. బండి

తెలంగాణ ముఖ్యమంత్రిపైనా, తెలంగాణ ప్రభుత్వంపైనా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపణలు, విమర్శల దాడిని తీవ్రతరం చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్, బీజేపీ నాయకుడు మురళీకృష్ణ గౌడ్ ఇంటిపై, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించిన బండి సంజయ్ రాష్ట్రంలో వీధికుక్కల బెడద ఎలాగో బీఆర్ఎస్ గూండాల భయం కూడా అలాగే ఉందన్నారు. దాడికి గురైన మురళీ గౌడ్ కుటుంబ సభ్యులను బుధవారం (ఫిబ్రవరి 23)న పరామర్శించారు. ఆ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ గూండాల తీరును గమనిస్తుంటే.. వారు డ్రగ్స్ మంత్తులో దాడులకు పాల్పడుతున్నారా అన్న అనుమానం కలుగుతోందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. అధికార పార్టీ తప్పిదాలు, వైపల్యాలను విమర్శిస్తే.. ప్రతి విమర్శలుమాని భౌతిక దాడులకు పాల్పడుతోందని కేసీఆర్ సర్కార్ అని విమర్శించారు. మురళీకృష్ణ గౌడ్ నివాసంపై దాడులకు పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయాలని బండి డిమాండ్ చేశారు. మురళీకృష్ణ గౌడ్ నివాసంపై దాడిని నిరోధించడంలో విఫలమైన, దాడులకు పాల్పడుతున్న వారిని ప్రోత్సహిస్తున్న పోలీసు అధికారులను సస్పెండ్ చేయాలన్నారు. ప్రత్యర్థులను, తన విధానాలను వ్యతిరేకించే వారినీ భౌతికంగా నిర్మూలించడం అన్న తీరులో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందని బండి తీవ్ర ఆరోపణలు గుప్పించారు. వీధికుక్కలు రోడ్లపై పిల్లలపై దాడులు చేస్తుంటే.. బీఆర్ఎస్ గూండాలు వీధిరౌడీల్లా మారి ప్రత్యర్థులపై దాడులకు పాల్పడుతున్నారని బండి ఆరోపించారు

వంశీ టార్గెట్ పట్టాభి.. ఎందుకంటే?

ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గన్నవరంలో  టీడీపీ కార్యాలయంపై అధికార వైసీపీ కార్యకర్తలు  ముక్కుమ్మడి దాడి చేయడం.. అక్కడ ఉన్న వాహనాలను సైతం నిప్పుంటించడం.. ఆ క్రమంలో  తెలుగుదేశంఅధికార ప్రతినిధి  పట్టాభిని అక్కడి నుంచి  పోలీసులు  రహస్యంగా తరలించడం..  మరోవైపు బాధితులమైన తమపైన పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారంటూ.. విపక్ష తెలుగుదేశం ఆరోపించడం.. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక  వల్లభనేని వంశీ మార్క్ స్కెచ్ ఉందనే ఓ చర్చ  పోలిటికల్ సర్కిల్‌లో జోరుగా సాగుతోంది.  రానున్న ఎన్నికల్లో గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీకి పార్టీ టికెట్ ఇచ్చేందుకు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ స్పష్టమైన హామీ ఇచ్చారని...  దీంతో ఆ టికెట్ కోసం పోటీ పడుతున్న  దుట్టా రామచంద్రరావు వర్గానికి, ఇటు యార్లగడ్డ వెంకట్రావ్ వర్గానికి చెక్ చెప్పినట్లు అయిందని... ఈ నేపథ్యంలో తమకు ఎదురే లేదంటూ వంశీ వర్గం   సంబరాలే చేసుకుందని అంటున్నారు... అయితే తన సొంత పార్టీలో అసమ్మతి సెగ మాత్రం నివ్వురు గప్పిన నిప్పులాగా అలాగే ఎన్నికలు అయిన తర్వాత కూడా ఉంటుందని ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి బాగా అర్థమైందనే ఓ చర్చ సైతం సదరు పోలిటికల్ సర్కిల్‌లో నడుస్తోంది.     మరోవైపు ప్రత్యర్థి టీడీపీ తరపున గన్నవరం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పట్టాబిని నిలపాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబు భావిస్తున్నారని తెలుస్తోంది. ఆ క్రమంలో సదరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ బాధ్యతలు పట్టాభికి అప్పగించేందుకు చంద్రబాబు సన్నాహాలు సైతం ప్రారంభించినట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా ఉన్న బచ్చుల అర్జునుడు తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండడంతో.. చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకోవడం అనివార్యమైందని అంటున్నారు.   అయితే ఓ వైపు సొంత పార్టీలో అసమ్మతి, మరోవైపు ప్రత్యర్థి పార్టీలో బలమైన నేత.. ఇంకోవైపు గన్నవరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీకి పక్కగా కంచుకోటగా ఉండడం... క్లియర్ కట్‌గా చెప్పాలంటే..  2019 ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్ వేవ్‌లో సైతం.. గన్నవరం నియోజకవర్గంలో పసుపు జెండా రెపరెపలాడిందంటే.. స్థానికంగా సైకిల్ పార్టీకి హార్ట్ కోర్ ఫ్యాన్స్  ఉండటమేననీ.... అందుకే ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ గెలుపు నల్లేరు మీద నడకే అయిందని..  అ లాంటి నియోజకవర్గం నుంచి వచ్చే ఎన్నికల్లో పట్టాభి పోటీ చేస్తే.. తన గెలుపు సాధ్యం కాదన్న ఆందోళనతోనే  తెలుగుదేశం కార్యకర్తలు, నేతలలో భయభ్రాంతులు సృష్టించి వారిని అడ్డుకోవాలన్న ఉద్దేశంతోనే కార్యాలయంపైకి తన వర్గాన్ని వంశీ ఉసిగొల్పి దాడులు చేయించారనే చర్చ అయితే పోలిటికల్ సర్కిల్‌లో సర్క్యూట్ అవుతోంది.   అదీకాక.. పట్టాభి ప్రెస్ మీట్ పెట్టారంటేనే...  అధికార పార్టీలోని అగ్రనేతలకు చెమటలు పడతాయనీ, పట్టాభి విమర్శలు అంత సహేతుకంగా, ధాటిగా ఉంటాయన్న భావన వైసీపీ శ్రేణుల్లోనే ఏర్పడింది. అంత దూకుడుగా ఉన్న మరో  నాయకుడు ప్రస్తుత టీడీపీలో మరొకరు లేరనే ఓ టాక్ తెలుగుదేశంలోనే కాదు, విపక్ష వైసీపీలో కూడా ఉంది. గతంలో   పట్టాబి ప్రెస్ మీట్ పెట్టి జగన్ పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ.. ఆయనపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేయడమే కాదు.. ఆయన ఇంటిపై  వైసీపీ కార్యకర్తలు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే.    ఇంకోవైపు.. వల్లభనేని వంశీ.. తెలుగుదేశం టికెట్‌పై గెలిచి.. ఆ తర్వాత జగన్ పార్టీలో చేరారు.  ఆ క్రమంలో ఆయన టీడీపీ అధినేత చంద్రబాబుతోపాటు ఆయన కుటుంబంపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. వంశీ ఈ తరహా వ్యాఖ్యలపై అన్నీ వర్గాల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. ఆ తర్వాత ఓ మీడియాలో లైవ్‌లో చర్చకు వచ్చి.. చంద్రబాబు ప్యామిలీకి వంశీ క్షమాపణలుచెప్పనప్పటికీ అప్పటికే వంశీకి వ్యక్తిగతంగా జరగాల్సిన డ్యామేజ్  జరిగిపోయింది.  అలాగే ఉమ్మడి కృష్ణాజిల్లాలోని గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సైతం చంద్రబాబుపై తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వచ్చే ఎన్నికల్లో అటు గన్నవరం నుంచి బరిలోకి దిగే వల్లభనేని వంశీపై, ఇటు గుడివాడ నుంచి బరిలో దిగనున్న కొడాలి నానిలపై టీడీపీ నుంచి బలమైన అభ్యర్థులను దింపాలని చంద్రబాబు కృత నిశ్చయం ఉన్నారు. ఆ దిశగా పార్టీ అధినేత చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న వంశీ వర్గం.. తమదైన శైలిలో దాడులు చేసి.. ప్రతి పక్ష పార్టీలను భయభ్రాంతులకు గురి చేసే దిశగా చర్యలు చేపట్టింది. అందులోభాగమే.. గన్నవరంలోని టీడీపీ కార్యాలయంపై ఈ తరహా దాడులని పోలిటికల్ సర్కిల్‌లో ఓ చర్చ అయితే సాగుతోంది. 

ఢిల్లీ మద్యం కుంభకోణం.. కవిత ఉక్కిరి బిక్కిరి

ఢిల్లీ మద్యం కుంభకోణంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐలు ఏకకాలంలో దూకుడు పెంచాయి. రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత ఉన్న ఈ కుంభకోణం కేసులో ఏ క్షణంలో ఎలాంటి పరిణామం సంభవిస్తుందా అన్న ఉత్కంఠ సామాన్యులలోనే కాదు.. రాజకీయ వర్గాలలో సైతం నెలకొంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు విచారణకు రావాల్సిందిగా సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 26న సీబీఐ ఢిల్లీ డెప్యూటీ సీఎం సీబీఐ విచారణకు హాజరు కానున్నారు. మరో వైపు ఇదే కేసులో తెలంగాణ సీఎం కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కవితను ఇప్పటికే సీబీఐ ఒకసారి విచారించింది. ఇంకో వైపు ఆమె వ్యక్తిగత ఆడిటర్ బుచ్చిబాబును ఈడీ విచారించనుంది. ఇందు కోసం ఈడీ కోర్టు అనుమతి కూడా పొందింది. ఈ నెల 8న బుచ్చిబాబును సీబీఐ అరెస్టు చేసి మూడు రోజులు కస్టడీలోకి తీసుకుని విచారించిన సంగతి తెలిసిందే. ఆ విచారణలో సీబీఐ కవిత, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, శరత్చంద్రరెడ్డిల ఆధ్వర్యంలో నడుస్తున్న సౌత్ గ్రూప్ కు సంబంధించి బుచ్చిబాబును ప్రశ్నలతో సీబీఐ ఉక్కిరిబిక్కిరి చేసింది. ఇప్పుడు ఇదే కేసులో బుచ్చిబాబును ఈడీ విచారణ చేయనుంది.  ఈడీ, సీబీఐలు రెండూ తమ దర్యాప్తులో ప్రధానంగా కాన్ సన్ ట్రేట్ చేస్తున్న సౌత్ గ్రూప్ లో కల్వకుంట్ల కవిత పాత్ర కీలకం అని ఇప్పటికే ఈడీ తన చార్జిషీట్ లో పేర్కొన్న సంగతి విదితమే.   ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆమెకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయనే అంశంపై  ఆమె మాజీ ఆడిటర్‌  బుచ్చిబాబును ఈడీ ప్రశ్నించే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు.  అంతే కాకుండా ఇదే కుంభకోణంలో కీలకంగా వ్యవహరించిన రాబిన్ డిస్టలరీస్ కు కూడా బుచ్చిబాగు గతంలో ఆడిటర్ గా పని చేశారు.  ఇదే డిస్టిల్లరీస్ డైరెక్టర్ అరుణ్ రామచంద్రన్ పిళ్లయ్ ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీ గురించి కవితతో చర్చించినట్టు ఈడీ   చార్జిషీట్‌లో పేర్కొన్న సంగతి విదితమే.  ఈడీ ఇప్పటికే తన చార్జిషీట్ లో కవితకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉందంటూ పలు అంశాలను ప్రస్తావించింది.   హైదరాబాద్‌లోని కవిత నివాసంలో ఢిల్లీ ఎక్సయిజ్ పాలసీపై 2021 మేలో హైదరాబాద్ లోని కవిత నివాసంలో జరిగిన ఆ సమావేశంలో  బుచ్చిబాబు కూడా పాల్గొన్నట్లు ఈడీ ఆరోపించింది.  మద్యం కుంభకోణంలో కీలకమైన పాత్ర సౌత్ గ్రూపుదేనని అనుమానిస్తున్న ఈడీ.. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు రాఘవను అరెస్టు చేసిన సంగతి విదితమే.  

ఎన్నికల వేళ నామినేటెడ్ పోస్టుల పందేరం.. అసమ్మతి తెనెతుట్టె కదపడమేనా?

నామినేటెడ్ పోస్టుల భర్తీపై సీఎం కేసీఆర్ దృష్టిపెట్టారు. ఖాళీగా ఉన్న కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లను నియమించేందుకు కసరత్తు ప్రారంభించారు. ఇందు కోసం ఇప్పటికే అన్ని  శాఖల నుంచి ఇందుకు సంబంధించిన జాబితాను తెప్పించుకున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. పార్టీలో ఇంత వరకూ ఎలాంటి పదవీ దక్కని వారెంతమంది, ఒక్క సారి పదవి దక్కిన వారెవరు.. రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అర్హతలుండీ పార్టీ టికెట్ దక్కే చాన్స్ లేని వారెవరు వంటి వవరాలన్నిటినీ క్రోడీకరించుకుని కేసీఆర్ నామినేటెడ్ పోస్టుల పందేరానికి రెడీ అవుతున్నట్లు చెబుతున్నారు. ఇంతవరకు ఏ పదవి రాని లీడర్లు ఎవరెవరున్నారు?  ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై మంత్రులతో కేసీఆర్ చర్చించినట్లు కూడా చెబుతున్నారు.  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్  ముగియగానే నామినేటెడ్ పోస్టుల పందేరం ఉంటుందన్న చర్చ జరుగుతోంది. అయితే ఇప్పటి పరిస్థితుల్లో నామినేటెడ్ పోస్టుల భర్తీకి కేసీఆర్ నిర్ణయించుకోవడమంటే అసమ్మతి తేనెతుట్టెను కదిపినట్లే అవుతుందన్న ఆందోళన పార్టీ నేతల్లో వ్యక్త మౌతోంది. చాలా ఏళ్లుగా వందలాది మంది బీఆర్ఎస్ నేతలు నామినేటెడ్ పోస్టుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలో ఎన్నికల సంవత్సరంలో నామినేటెడ్ పోస్టుల భర్తీ పార్టీలో అసమ్మతి పెరిగేందుకు దోహదపడే అవకాశాలే మెండుగా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటి వరకూ కేసీఆర్ సీరియస్ గా నామినేటెడ్ పోస్టుల భర్తీపై దృష్టి పెట్టలేదు. అడపాదడపా ఒక్కో కార్పొరేషన్ కు చైర్మన్ లనో డైరక్టర్లనో ప్రకటిస్తూ వచ్చారు. ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ కూడా నామినేటెడ్ పోస్టల భర్తీ చేపట్టకపోతే కేడర్ కు, నేతలకు తప్పుడు సంకేతాలు వెళతాయన్న వాదన ఉన్నప్పటికీ.. ఎన్నికల వేళ పదవుల పందేరానికి శ్రీకారం చుడితే.. దక్కిన వారిలో అసమ్మతి భగ్గుమనడం ఖాయమన్న ఆందోళన కూడా వ్యక్తమౌతోంది.  ఎది ఏమైనా ఎన్నికల సమాయత్తం కోసం పార్టీ కార్యక్రమాలు చేపట్టకుండా స్తంబ్దంగా ఉన్న కేసీఆర్ నామినేటెడ్ పోస్టల భర్తీతో ఎన్నికలకు సిద్ధం కావడంపై పార్టీ శ్రేణుల్లో సందేహాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ముందు ఎన్నికలకు పార్టీని సన్నద్ధం చేసేందుకు పార్టీ నేతలనూ, శ్రేణులను జనంలోకి పంపే కార్యక్రమాలకు శ్రీకారం చుడితే మేలు జరుగుతుందని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. 

సోమేష్ కుమార్ కు బీఆర్ఎస్ లో కీలక బాధ్యతలు?.. కేసీఆర్ వ్యూహమేంటి?

తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ కు తెలంగాణ ప్రభుత్వంలో కాదు, బీఆర్ఎస్ లో కీలక పదవి దక్కే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఆయనను బీఆర్ఎస్ తరఫున ఎన్నికల బరిలో నిలబెట్టే దిశగా కేసీఆర్ వ్యూహరచన చేస్తున్నారని అంటున్నారు. సోమేష్ కుమార్ స్వరాష్ట్రం బీహార్ లో ఆయనకు బీఆర్ఎస్ బాధ్యతలు అప్పగించి.. ఆ రాష్ట్రం నుంచి లోక్ సభ ఎన్నికలలో పోటీకి నిలపాలన్న యోచన చేస్తున్నట్లు బీఆర్ఎస్ వర్గాలే చెబుతున్నాయి.   తొలుత ఆయన ఏపీలో రిపోర్టు చేసి.. ఆ తరువాత వాలంటరీ రిటైర్మెంట్ తీసుకోవడం వరకూ అన్నీ కేసీఆర్ చెప్పిన విధంగానే.. ఆయన కనుసన్నలలోనే జరిగాయని అంటున్నారు. ముందుగా ఆయనను రెరా (రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారటీ) చైర్మన్ గా నియమిస్తారన్న ప్రచారం జరిగింది. ఎందుకంటే.. కోర్టుతీర్పు కారణంగా ఆయన తెలంగాణలో రిలీవ్ అయ్యి.. ఏపీలో రిపోర్టు చేసే సమయానికి ఆయన రెరా బాధ్యతలు చూస్తున్నారు. ఆయన వెళ్లినప్పటి నుంచీ కూడా ఆ పోస్టు ఖాళీగానే ఉంది. ఈ నేపథ్యంలోనే ఆ ప్రచారం జరిగింది. ఆయనను ప్రభుత్వ సలహాదారుగా నియమించే అవకాశం ఉందన్న ప్రచారమూ విస్తృతంగా సాగింది. అయితే ఆయన మేనేజ్ మెంట్ స్కిల్స్, ఎడ్మినిస్ట్రేటివ్ ఎక్స్ పీరియన్స్ ను పార్టీ కి ఉపయోగించుకోవాలని కేసీఆర్ ఫిక్సయ్యారని అంటున్నారు. బీఆర్ఎస్ విస్తరణ విషయంలో కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి.  జాతీయ స్థాయిలో మద్దతు కోసం కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలూ పెద్దగా ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ సేవలను పార్టీకి ఉపయోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని పార్టీ శ్రేణులు అంటున్నాయి. ముఖ్యంగా బీహార్ ముఖ్యమంత్రి సొంతగా బీజేపీయేతర శక్తుల ఐక్యతకు తన వంతుగా చేస్తున్న ప్రయత్నాలలో భాగంగా కేసీఆర్ ను దూరం పెట్టడంతో... బీహార్ లో తనకు మద్దతుగా కార్యక్రమాలు చేపట్టడానికీ, పార్టీ కార్యకలాపాల వేగం పెంచడానికీ, ఆ రాష్ట్రంలో ఇప్పటికే నితీష్ కు వ్యతిరేకంగా ఒంటరిగా తన పని తాను చేసుకుపోతున్న ప్రశాంత్ కిషోర్ తో కలిసి బీఆర్ఎస్ బలోపేతం కోసం పని చేయడానికి సోమేష్ సేవలు వినియోగించుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నారని అంటున్నారు. సివిల్ సర్వెంట్లు తమ సర్వీసుల నుంచి అర్ధంతరంగా  రాజీనామా చేసి రాజకీయాలలోకి రావడం కొత్తేమీ కాదు. అందులో ఎంత వరకూ సక్సెస్ అయ్యారు అన్నది పక్కన పెడితే.. సివిల్ సర్వెంట్ల రాజకీయ ప్రవేశానికి ఆరంభంలో మాత్రం అన్ని వర్గాల నుంచీ ఆమోదం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ ను రాజకీయాలలోకి తీసుకురావడానికి కేసీఆర్ ఆసక్తి చూపడం మాత్రం తెలంగాణ సీఎస్ గా ఆయన పని చేసిన తీరు నచ్చడమే నని అంటారు. మరీ ముఖ్యంగా కేసీఆర్ మానస పుత్రికగా అంతా చెప్పే ధరణి రూపకల్పన వెనుక ఉన్నదంతా సోమేష్ కుమారేనని పార్టీ శ్రేణులే కాదు, పరిశీలకులు కూడా పలు సందర్భాలలో చెప్పారు. అంతే కాదు పలు సందర్బాలలో సీఎం కేసీఆర్ సోమేష్ కుమార్ పై బహిరంగ వేదికలపై సైతం ప్రశంసలు కురిపించారు. ఈ నేపథ్యంలోనే సోమేష్ కుమార్ కు కేసీఆర్ ఏ నామినేటెడ్ పదవో, సలహాదారు పోస్టో కాకుండా బీఆర్ఎస్ పార్టీలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశమే మెండుగా ఉందని పార్టీ శ్రేణులు అంటున్నాయి. 

వివేకా హత్య కేసు.. గుట్టు రట్టైపోతోందా?.. సీబీఐ అఫిడవిట్ లో సంచలన విషయాలు!

సీబీఐ అధికారులు వివేకా హత్య కేసును దాదాపు ఛేదించేసింది. ఆ దర్యాప్తు సంస్థ తెలంగాణ హై కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో హత్యకు ముందు.. తరువాత ఏం జరిగిందన్న విషయాలను పూసగుచ్చినట్లు వివరించింది. ఈ కేసులో ఏ2గా ఉన్న సునీల్ యాదవ్ బెయిలు పిటిషన్ పై సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో హత్య జరిగిన తీరు, హత్య వెనుక ఎవరు ఉన్నారు. హత్య అనంతరం సాక్ష్యాల తారుమారులో అవినాష్ రెడ్డి పాత్ర..ఆయన తండ్రి భాస్కరరెడ్డి ప్రమేయం ఇలా పలు అంశాలను వెల్లడించింది. దీంతో ఇంత కాలంగా వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులపై ఉన్న అనుమానాలన్నీ వాస్తవమేనని సీబీఐ పేర్కొన్నట్లయ్యింది.    వైఎస్ హత్య పకడ్బందీ ప్రణాళిక ప్రకారం జరిగిందనీ, వివేకా గుండెపోటుతో మరణించారని నమ్మించేందుకు జరిగిన ప్రయత్నం కూడా ఆ ప్రణాళికలో భాగమేనన్న అనుమానాలు ముందునుంచీ ఉన్నాయి. సీబీఐ తాజా అఫిడవిట్ లో ఇలా చేసిందెవరన్న క్లారిటీ వచ్చేసింది.   హత్య జరిగిన సమయంలో జరిగిన ఫోన్ కాల్స్ గుట్టు బయటపడే సమయం దగ్గరకొచ్చేసిందని తాజా పరిణామాలను బట్టి అర్దమౌతోంది.  ప్రస్తుతం సునీల్ యాదవ్ కోణంలోనే సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసినప్పటికీ.. ఆ అఫిడవిట్ లో కూడా హత్యలో అవినాష్ రెడ్డి పాత్ర, ప్రమేయం గురించి ప్రస్తావించింది. ఈ నెల 28న న అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించనున్న సంగతి విదితమే. ఆ విచారణకు ముందే సునీల్ యాదవ్ బెయిల్ పిటిషన్ పై దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో సాక్ష్యాలను మాయం చేసేందుకు అవినాష్ రెడ్డి ప్రయత్నించారని పేర్కొనడమంటే.. అవినాష్ రెడ్డి అరెస్టుకు సీబీఐ సిద్ధం అవుతోందనే అర్ధమని న్యాయ నిపుణులు అంటున్నారు. అదే జరిగితే వివేకా హత్య కేసులో మరిన్ని సంచలన విషయాలు వెల్లడి అయ్యే అవకాశాలున్నాయని కూడా చెబుతున్నారు.  అవినాష్ ను ఈ నెల 28న విచారించిన తరువాత వివేకా హత్య జరిగిన తరువాత అవినాష్ రెడ్డి నుంచి తాడెపల్లి ప్యాలెస్ కు వెళ్లిన ఫోన్ కాల్ వివరాలను కూడా సీబీఐ బయట పెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు.  అదే జరిగితే కింగ్ పిన్‌లు బయటకు రావడం ఖాయమని  అంటున్నారు.  

ఏపీ బీజేపీలో తిరుగుబావుటా!

ఏపీ బీజేపీలో తిరుగుబాటు జరుగుతోందా? క్రమశిక్షణకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పుకునే ఆ పార్టీ ఏపీలో ముక్క చెక్కలవ్వడానికి సిద్ధంగా ఉందా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు. ఏపీలో రాజకీయంగా బలోపేతం అన్న సాకుతో పార్టీ అధిష్ఠానం అమలు చేసిన వ్యూహాలు, ఎత్తుగడలు పూర్తిగా వికటించాయని అంటున్నారు. రాష్ట్రంలో కులాల చీలకతో సులభంగా బలోపేతం అవ్వవచ్చన్న అంచనాతో జగన్ సర్కార్ తో అంటకాగిన ఫలితమే.. ఏపీ బీజేపీలో ముసలానికి కారణమైందని విశ్లేషిస్తున్నారు.  ఏపీ బీజేపీ పట్ల ఆ పార్టీ అధినాయకత్వం వ్యవహరించిన తీరే రాష్ట్ర నాయకత్వానికీ, క్యాడర్ కూ మధ్య అగాధానికి కారణమైందంటున్నారు.  ఏపీ బీజేపీలో సంక్షోభానికీ, అసంతృప్తికీ ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజును అడ్డగోలుగా సమర్ధించిన జాతీయ నాయకత్వ తీరే కారణమని పార్టీ శ్రేణులే విమర్శిస్తున్నాయి. కేంద్ర నాయకత్వం తీరు కారణంగానే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ కార్యవర్గ సభ్యుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి రాజీనామా చేశారంటున్నారు. అక్కడితో రాజీనామాల పర్వం అగే పరిస్థితి కనిపించడం లేదని కూడా అంటున్నారు. కన్నా బాటలోనే  మరికొందరు కూడా ఉన్నారని చెబుతున్నారు. కన్నా పార్టీ కార్యకర్తలతో సమావేశమయి, భవిష్యత్తు కార్యాచరణ ప్రకటించడానికి ముందే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రంగంలోకి దిగి బుజ్జగించినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పుడు రాష్ట్ర పార్టీలో తిరుగుబాటు జెండా ఎగురవేయడానికి సిద్ధమై విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి రెడీ అయిన నేతలను పార్టీ జాతీయ స్థాయి నాయకుడు  శివప్రకాష్‌జీ వారించారు. ఈ నెల 26న తాను విజయవాడకు వచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పడంతో బీజేపీలో రాజీనామాల పర్వానికి పడిన తెర తాత్కాలికమేనని పార్టీ శ్రేణులే అంటున్నారు.  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా సోము వీర్రాజును కొనసాగిస్తే, తాము పార్టీకి రాజీనామా చేస్తామంటూ దాదాపు 200 మంది రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలు   విజయవాడ కేంద్రంగా ఓ సమావేశం నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. ఆ సమాచారం తెలిసి పార్టీ అధినాయకత్వం వారించింది.  శివప్రకాష్‌జీ ఈనెల 26న విజయవాడ వచ్చి మరీ సమస్యలను పరిష్కరిస్తామన్న హామీలో తిరుగుబాటు జెండా ఎగురవేయడాన్ని వాయిదా వేశారు. గతంలో కూడా రెండు సార్లు  పార్టీలో అసమ్మతి నేతలు సమావేశం ఏర్పాటుకు ప్రయత్నించిన సందర్భాలలో కూడా కేంద్ర నాయకత్వం జోక్యం చేసుకుని వారించింది.  ఇప్పుడు ఇది మూడోసారి.  ఈసారి శివప్రకాష్‌జీ సమక్షంలో   తాడో పేడో తేల్చుకోవాలన్న పట్టుదలతో రాష్ట్ర బీజేపీ  అసమ్మతి నేతలు  ఉన్నారు.   బుజ్జగించి సమస్య పరిష్కారాన్ని వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తే మాత్రం ఈ సారి వెనక్కు తగ్గేదే లే అంటున్నారు. ఏపీలో పార్టీని ఏం చేద్దామనుకుంటున్నారు? వైసీపీ విషయంలో పార్టీ అధిష్ఠానం వైఖరి ఏమిటి? సోము వీర్రాజును ఏపీ పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి ఎందుకు తప్పించరు? అని శివప్రకాష్ జీని నిలదీయాలని నిర్ణయించుకున్నట్లు అసమ్మతి నేతలు చెబుతున్నారు.   కన్నా లక్ష్మీనారాయణ వ్యవహారంలో పార్టీ హైకమాండ్ వ్యవహరించిన తీరు ఏపీలో బీజేపీలో తొలి నుంచీ పని చేస్తున్న వారిలో కూడా అసంతృప్తి వ్యక్తం అవుతోందని చెబుతున్నారు.   బీజేపీ వ్యవస్థాపక కాలం నుంచి పనిచేస్తున్న వారిలో సైతం ఏపీ బీజేపీలో కొనసాగితే రాజకీయ భవిష్యత్ భూ స్థాపితం అయిపోతుందన్న భావనే వ్యక్తమౌతోందని అసమ్మతి నేతలు చెబుతున్నారు.  ప్రధానంగా జనసేన, తెలుగుదేశం పార్టీల పొత్తుకు మద్దతు విషయంలో పార్టీ అనుసరిస్తున్న వైఖరి పట్ల వారు అసమ్మతి తెలియజేస్తున్నారు.   35 మంది రాష్ట్ర-జిల్లా స్థాయి నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా ఇప్పటికే సంతకాల సేకరణ చేసినట్లు పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  సోము వీర్రాజును అధ్యక్షుడిగా కొనసాగించాలని భావిస్తే, తాము ఆయనతో పనిచేయడం కష్టమని ఇప్పటికే పార్టీ అధినాయకత్వానికి స్పష్టం చేశారంటున్నారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ పట్ల పార్టీ అధినాయకత్వం  వైఖరి ఏమిటన్నది స్పష్టం చేయాలని కూడా వారు డిమాండ్ చేస్తున్నారు.   

అదానీ మహా పతనం వెనుక కుట్ర?

అదానీ వ్యాపార సామ్రాజ్యం వేగంగా పతనం కావడం వెనుక మోడీ వ్యతిరేక శక్తుల కుట్ర ఉందా? ఈ కుట్రకు మరో వ్యాపార దిగ్గజం విప్రో ప్రేమ్ జీ ఆర్ధిక అండదండలున్నాయా? అన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆర్ ఎస్ ఎస్ మౌత్ పీస్ ఆర్గనైజర్ కథనం ఈ  అనుమానాలను వ్యాప్తి చేస్తోంది. వాస్తవానికి ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ స్థానం వేగంగా పతనమౌతున్నది. హిండెన్‌బర్గ్ నివేదిక వెలువడడానికి ముందు వరకూ ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్న అదానీ.. ఆ తరువాత నెల రోజులు కూడా గడవక ముందే 26వ స్థానానికి పడిపోయారు. అదానీ గ్రూప్ షేర్ల విలువ సగానికి పైగా పడిపోయింది. ఆ పతనం ఇంకా కొనసాగుతోంది.   అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ గత నెల 25న  అదానీ గ్రూప్‌పై నివేదిక వెలువరించిన సంగతి విదితమే.  ఆ నివేదికలో అదానీపై ఎక్కౌంటింగ్ ఫ్రాడ్, కృత్రిమంగా షేర్ విలువలు పెంచడం, అవినీతి, మనీ లాండరింగ్ ఆరోపణలు చేసింది. ఆ నివేదిక బహిర్గతమయ్యే నాటికి  ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ 3 వ స్థానంలో ఉన్నారు. సంపదనలో ముకేష్ అంబానీని ఎప్పుడో దాటేశారు. అయితే ఆ నివేదిక వెలువడిన తరువాత అదానీ షేర్ల పతనం మొదలైంది.  ఇప్పుడు అదానీ కంపెనీ సంపద విలువ   47.4  బిలియన్ డాలర్లుగా ఉంది. అంటే కేవలం 28 రోజుల వ్యవధిలో ఏకంగా 11 లక్షల కోట్ల సంపద ఆవిరైంది. అ అదానీ గ్రూప్ స్టాక్స్ మార్కెట్ విలువ 57 శాతం పడిపోయింది.  జనవరి 25వ తేదీన అదానీ గ్రూప్‌లోని 10 లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ 19.2 లక్షల కోట్లుగా ఉంది. బుధవారం (ఫిబ్రవరి 22) నాటికి అది 8.2 లక్షల కోట్లకు తగ్గిపోయింది.   అదానీ ట్రాన్స్‌మిషన్, అదానీ గ్రీన్, అదానీ టోటల్ గ్యాస్ కంపెనీ షేర్లు బుధవారం 5 శాతం నష్టాన్ని చవిచూశాయి.   తన కంపెనీల విలువను కాపాడుకోవడానికి, సంపద ఆవిరైపోకుండా ఉండేందుకు అదానీ చేపట్టిన, చేపడుతున్న దిద్దుబాటు చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. కమ్ బ్యాక్ ప్లాన్‌లో భాగంగా ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్స్ బకాయి 1500 కోట్లను చెల్లించామని.. మార్చ్‌లో మరో 1000 కోట్లు చెల్లిస్తామని అదానీ పోర్ట్స్ ప్రకటించినా.. వచ్చే ఆర్ధిక సంవత్సరంలో చెల్లించాల్సిన 5000 కోట్ల రుణాన్ని సైతం ముందుగానే చెల్లించామని..మార్చ్ నెలలో గ్రూప్ 500 మిలియన్ డాలర్ల బ్రిడ్జి లోన్ కూడా చెల్లించేస్తామని కంపెనీ పేర్కొన్నా మదుపర్లు విశ్వాసం చూపడం లేదు. రుణాల పునాదులపై వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన అదానీ గ్రూపులు వేగంగా పతనం దిశగా పయనిస్తున్నాయి.     కార్పొరేట్ దిగ్గజం అదానీ మహా పతనం వెనక మరో కార్పొరేట్ దిగ్గజం విప్రో అధినేత  అజీమ్ ప్రేమ్ జీ,   హస్తం  ఉందనే ప్రచారం ఒకటి జోరుగా సాగుతోంది. నిజానికి, అదానీ వ్యవహారం బయటకు వచ్చినప్పటి నుంచి, అసలేం జరిగింది  అనే విషయంలో, ఆరోపణలు, ప్రత్యరోపణలతో పాటుగా అనేక ఊహగానాలు, వ్యూహాగానాలు వినిపిస్తున్నాయి.     అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న, షార్ట్ సెల్లర్  స్టాక్ బ్రోకర్ సంస్థ  హిండెన్‌బర్గ్‌ రిసెర్చ్  నివేదిక ఆధారంగా జరుగతున్న చర్చ రోజుకో మలుపు తిరుగుతోంది.  పార్లమెంట్ వేదికగా అధికార ప్రతిపక్ష పార్టీలు ఆదానీకి మద్దతుగా, వ్యతిరేకంగా మోహరించడంతో కార్పొరేట్, రాజకీయ నెక్సస్ పై చర్చ మరోసారి తెరమీదకు వచ్చింది.   ఆ  చర్చ సంగతి పక్కన పెడితే   2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించి, ప్రధాని నరేంద్ర మోడీని గద్దె దించేందుకు అంతర్జాతీయ స్థాయిలో జరుగుతున్న కుట్రలో భాగంగా అదానీని టార్గెట్ చేశారనే వాదన కూడా తెరపైకి వచ్చింది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం అదానీ వ్యవహారంలో అంటీ ముట్టనట్లు ఉన్నట్లు ఉంటూనే, లోగుట్టును వెలికి తీసేందుకు గట్టిగా నడుం బిగించినట్లు తెలుస్తోంది.  అందులో భాగంగానే అదానీ వ్యవహారంలో కుట్ర కోణాన్ని లోతుగా అధ్యయనం చేస్తున్న భారత దర్యాప్తు సంస్థలు విప్రో   యజమాని, పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇందుకు   ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్‌లో వచ్చిన కథనమే తార్కానం అంటున్నారు. హిండెన్‌బర్గ్ వెనుక ఒక కమ్యూనిస్ట్ నాయకుడి సతీమణి, జర్నలిస్ట్, నేషనల్ ఫౌండేషన్ ఫర్ ఇండియా పేరున నడిచే ఒక స్వస్చంద సంస్థ, వామపక్ష భావజాలాన్ని ప్రచారం చేసే ఒక వెబ్‌సైట్ ఉన్నాయనీ, వీటన్నింటికీ అజీమ్ ప్రేమ్‌జీ నడిపే స్వచ్చంద సంస్థ ఐపీఎస్ఎంఎఫ్ నిధులు సమకూరుస్తుందని ఆర్గనైజర్‌ కథనం  పేర్కొంది.  ఆర్గనైజర్‌ కథనం ప్రకారం, ఆస్ట్రేలియాలో పర్యావరణ పరిరక్ష ముస్గులో పనిచేస్తున్న బాబ్ బ్రౌన్ ఫౌండేషన్ (బీబీఎఫ్) అనే స్వచ్చంద సంస్థ, అదానీవాచ్ డాట్ ఓఆర్ జి (Adaniwatch.org) అనే వెబ్‌సైట్‌ను నడుపుతోంది. అదానీ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయడానికి ఉద్దేశించిన ఈ వెబ్‌సైట్‌కు అజీమ్ ప్రేమ్‌జీ నిర్వహించే సోరోస్, ఫోర్డ్ ఫౌండేషన్, రాక్‌ఫెల్లర్, ఒమిడ్యార్, బిల్ గేట్స్‌లు కూడా ఆర్థిక సహాయం చేస్తున్నారు.  హిండెన్‌బర్గ్  కేవలం బంటు. అసలు సూత్రధారి అజీమ్ ప్రేమ్‌జీ, అతని కోసం పనిచేస్తున్న వామపక్ష భావజాల సంస్థలు, వ్యక్తులు  అని ఆర్గనైజర్‌ కథనం పేర్కొంది. అలాగే, ది వైర్ ఎడిటర్ సీమా చిస్తీ ( సిపిఎం నేత సీతారాం ఏచూరి భార్య) కూడా అదానీ వ్యతిరేక కుట్రలో భాగస్వామిగా ఉన్నారని, ఆస్ట్రేలియాలో అదానీ కాల్ ప్రాజెక్ట్స్ కు వ్యతిరేకంగా 2017లోనే  ది వైర్ కథనాలు రాసిందని ఆర్గనైజర్‌ పేర్కొంది. అదానీ ఒక సాకు మాత్రమే, అజీమ్ ప్రేమ్‌జీ లక్ష్యం మోడీ. అందుకే ఆల్ట్‌న్యూస్, ది వైర్, ది కారవాన్, ది న్యూస్ మినిట్ వంటి మోదీ వ్యతిరేక వెబ్‌సైట్‌లన్నింటికీ ప్రేమ్ జీ  భారీ మొత్తంలో డబ్బు ఇస్తున్నారని, ఆర్గనైజర్‌ ఆరోపించింది. అయితే, ఎంత కాదన్నా నిప్పు లేనిదే పోగారాదు. అలాగే, ఎవరు ఎన్ని  ఆరోపణలు చేసినా, ఎవరు ఎంతగా ఎదురు దడి చేసినా, నిజం నిలకడ మీద తెలుస్తుంది. అయితే ఈ లోగా పుణ్య కాలం కాస్తా గడిచి పోతుంది. ఏమి జరిగిన ఎన్నికల వరకే, ఎన్నికల తర్వాత అంతా గప్ చిప్.. అందుకే  నిజం ఎంతో నిగ్గు తేల్చేందుకు ప్రతిపక్షాలు కోరుతున్నా జేపీసీ కాకున్నా, సుప్రీం కోర్టు పర్యవేక్షణలో ఉన్నత స్థాయి విచారణ జరగవ వలసిన అవసరం అయితే ఉందని అంటున్నారు.

ప్రస్తుతానికి కాంగ్రెస్ లో ఆల్ ఈజ్ వెల్!

కాంగ్రెస్ రాజకీయాలు ఎప్పుడు, ఏ మలుపు తిరుగుతాయో ఉహించడం చాలా కష్టం. ముఖ్యంగా  తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకులు మధ్య చాలా కాలంగా, ‘బ్లో హాట్ ..బ్లో కోల్డ్’ తరహాలో శత్రుమిత్ర  సంవాదం నడుస్తోంది. రేవంత్ రెడ్డి ప్రాధాన్యతను తగ్గించేందుకు సీనియర్ నాయకులంతా ఏకమయ్యారు. ఆయన పై కత్తులు దుశారు. ఒక విధంగా వార్ డిక్లేర్ చేశారు. ముఖ్యంగా మునుగోడు ఓటమి తర్వాత, కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు మరింతగా మరింతగా ముదిరి బజారున పడ్డాయి. ఢిల్లీకి ఫిర్యాదులు వెళ్ళాయి. రేవంత్ రెడ్డితో పాటుగా ఆయనకు మద్దతుగా నిలిచిన అప్పటి రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జ్ మాణిక్యం ఠాక్కూర్  పైనా సీనియర్లు బహిరంగంగానే భగ్గుమన్నారు. జీ 23 లాగా, ఓ పది మందికి పైగా నేతలు అసమ్మతి గ్రూప్ గా ఏర్పడ్డారు. పరిస్థితి చేయి దాటడంతో అధిష్టానం అలర్ట్ అయింది. పార్టీ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ దూతగా వచ్చారు. ఆయన నివేదిక ఆధారంగా, అధిష్టానం ఠాక్కూర్ ను సాగనంపింది. ఆయన స్థానంలో మహారాష్ట్రకు చెందిన సీనియర్ నాయకుడు మాణిక్ రావ్ ఠాక్రేను తెలంగాణ రాష్ట వ్యవహారాల నూతన ఇంఛార్జ్ గా నియమించింది.   పార్టీ రాష్ట్ర వ్యవ హారాల ఇన్‌చార్జ్‌ బాధ్యతలు మాణిక్‌రావు ఠాక్రేకు అప్ప గించాక.. సీనియర్‌ నేతలు గాడిలో పడినట్లుగా కనిపిస్తోంది. సీనియర్లు, జూనియర్లు అనే తేడా లేకుండా ఠాక్రే పార్టీ నేతలు అందరితో  సమావేశమయ్యారు. చర్చలు జరిపారు. అందరి అభిప్రాయలు తీసుకున్నారు. సమస్యలుంటే పార్టీ అంతర్గత సమావేశాల్లోనే చర్చించి పరిష్కరించుకోవాలని, లేదంటే పార్టీ పరంగా క్రమ శిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. దీంతో పార్టీ నాయకుల్లో కూడా కొంత మేర మార్పు వచ్చినట్లే కనిపిస్తోంది. తెలంగాణ ఇచ్చిన పార్టీ అని చెప్పుకుంటున్నప్పటికి ఇప్పటికే రెండు పర్యాయాలు అధికారానికి దూరమైనామనే భావనతో కాంగ్రెస్‌ నేతలు ప్రజలకు ఐక్యంగా ఉన్నా మనే సంకేతాలు ఇవ్వాలని లేదంటే .. పార్టీకి వచ్చే ఎన్నికల్లో తీరని నష్టం జరుగుతుందనే అంచనాకు వచ్చారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదలా ఉంటే, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు సాగించిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాలతో పాటుగా తెలంగాణలోనూ మొదలైన హాత్‌ సే హాత్‌ జోడో యాత్ర, మరోమారు కాంగ్రెస్ పార్టీలో జోష్ పెంచింది. అయితే ఆనవాయితీ ప్రకారంగా, పాదయాత్ర ఎవరు చేయాలనే విషయంగా కొంత వివాదం నడిచినా, ఠాక్రే సీనియర్లందరికీ నియోజక వర్గాలు పంచి సయోధ్య కుదిర్చారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఈ నెల 6 నుంచి పాదయాత్ర  మొదలు పెట్టారు. అలాగే, ఇతర సీనియర్ నాయకులు కూడా ఎవరికి వారుగా తమ, తమ నియోజక వర్గాల్లో పాదయాత్రలు ప్రారంభించారు.  అందులో భాగంగా రేవంత్‌రెడ్డి ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ములుగు నుంచి పాదయాత్రకు శ్రీకారకం చుట్టి..రెండు నెలల పాటు జనంలో ఉండే విధంగా ప్లాన్‌ చేసుకుని ముందుకు సాగుతున్నారు. రేవంత్‌రెడ్డి పాదయాత్రకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు, మాజీ మంత్రి జానారెడ్డితో పాటు ఇతర సీనియర్లు కూడా హాజరై సంఘీభావం చెప్పారు. సీనియర్ నేతల్లో మార్పు రావడంతో పాటు పార్టీ కేడర్‌లో కూడా నూతన జోష్‌ వచ్చిందన్నఅభిప్రాయం వినిపిస్తోంది. అయితే, సీనియర్ నాయకుల ప్రస్తుతానికి సర్దుకున్నట్లు కనిపిస్తున్నా, ఎప్పుడు ఎవరు ఎలాంటి బాంబు పేలుస్తారో అనే భయం మాత్రం కార్యకర్తలను వెంటాడుతోంది. ఇటీవల ఉన్నట్టుండి పార్టీ సీనియర్ నాయకుడు, ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాదని జోస్యం చెప్పారు. అంతేకాదు, ‘హంగ్’ వస్తే అనివార్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్  పార్టీలు కలిసిపోతాయని సంచలన ప్రకటన చేశారు. దుమారం సృష్టించారు. అయితే, ఆ తర్వాత ఆయన సర్దుకున్నారనుకోండి, అది వేరే విషయం. సో .. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఏమి జరుగుతుందో... ఎవరూ ఉహించలేరు. అయితే ప్రస్తుతానికి అయితే  ఆల్ ఈజ్ వెల్ అన్న అభిప్రాయమే వ్యక్త మవుతోంది.

ఢిల్లీలో బీజేపీకి బిగ్ షాక్! ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా షెల్లీ ఒబెరాయ్ విజయం

ఎన్నికలలో గెలుపు ఓటములు సహజం. ఈ గెలుపు గెలుపు ఓటములనే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్య సౌందర్యం అనీ అభివర్ణిస్తారు. అయితే, రాజకీయ పార్టీలు, నాయకులు గెలుపును ఆస్వాదించినంతగా, ఓటమిని అంగీకరించలేరు. అధికారం కోసం అడ్డదారులు తొక్కేందుకు ఏ మాత్రం వెనకాడరు. అందునా, ఇక దేశంలో తమకు తిరుగే లేదన్న భావనలో ఉన్న బీజేపీ అయితే, ఓటమిని హుందాగా స్వీకరించడం అనేది ఎప్పుడో  మరిచి పోయింది. అందుకే,  ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన అనేక ప్రభుత్వాలను అప్రజాస్వామికంగా కూల్చి వేస్తోందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ప్రజలల్లోనూ అదే అభిప్రాయం రోజు రోజుకూ బల పడుతోంది. ఇప్పటికే గోవా మొదలు, కర్ణాటక, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర సహా ఏడెనిమిది రాష్ట్రాలలో ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థల అండతో కూల్చి వేసిందనే ఆరోపణలున్నాయి.   కాగా, ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లోనూ బీజేపీ అదే ప్రయత్నం చేసింది. అయితే, ప్రజల తీర్పును కాదని గద్దెనెక్కేందుకు కమల దళం చేసిన ప్రయత్నాలు సుప్రీం కోర్టు తీర్పుతో విఫల మయ్యాయి. ఆమ్ ఆద్మీ పార్టీ  అభ్యర్ధి  షెల్లీ ఒబెరాయ్   ఢిల్లీ మేయర్ గా ఎన్నికయ్యారు. బీజీపీ నాయకత్వానికి వ్రతమూ చెడింది. ఫలితమూ దక్కలేదు.  దేశ రాజధాని ఢిల్లీలో ఆ పార్టీ ప్రతిష్ట మరింతగా మసకబారింది.    నిజానికి గత ఏడాది చివర్లో జరిగిన ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు ఆప్ కు అనుకూలంగా విస్పష్ట తీర్పునిచ్చారు. కార్పోరేషన్ లోని 274 సీట్లకు జరిగిన ఎన్నికల్లో ఆప్  కు 135 సీట్లు రాగా.. బీజేపీ 113కు పరిమితమైంది. అయితే లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా సాయంతో పది మంది నామినేటెడ్ సభ్యుల్ని నియమించుకున్న బీజేపీ, తన బలాన్ని  పెంచుకుంది. అలాగే కార్పోరేషన్లో కోఆప్షన్ సభ్యులుగా ఉన్న ఢిల్లీ ఎంపీలు, ఎమ్మెల్యేల సాయంతో ఆప్ ను వెనక్కి నెట్టి మేయర్ స్దానం కైవసం చేసుకునేందుకు కాషాయ నేతలు తీవ్రంగా ప్రయత్నించారు.  దీంతో మేయర్ ఎన్నిక మూడుసార్లు వాయిదా పడింది. నామినేట్ సభ్యులను ఓటింగ్‌‌కు లెఫ్టినెంట్ గవర్నర్ ‌అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ,  ఆప్ నిరసనలకు దిగడం, ఆప్-బీజేపీ మధ్య ఘర్షణ వాతావారణం తలెత్తడంతో ఈ పరిస్థితి తలెత్తింది. చివరిగా మేయర్ ఎన్నికలకు ఫిబ్రవరి 16వ తేదీని  లెఫ్టినెంట్ గవర్నర్ ప్రకటించారు. అయితే సుప్రీంకోర్టు ఆదేశంతో ఆ తేదీ కూడా వాయిదా పడింది. నామినేటెడ్ సభ్యులకు ఓటింగ్ హక్కును కల్పించాలన్న లెఫ్టినెంట్ గవర్నర్  నిర్ణయాన్ని ఆప్ సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఈ నేపథ్యంలో నామినేట్ సభ్యులకు ఓటు హక్కు నిరాకరిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా  తీర్పుతో ఎంసీడీ (ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్) మేయర్ ఎన్నికకు మార్గం సుగమమైంది.  చివరకు ఢిల్లీ  మేయర్‌ గా ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి డాక్టర్ షెల్లీ ఒబెరాయ్ గెలుపొందారు. షెల్లీ ఒబెరాయ్ తన సమీప బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. మొత్తం 266 ఓట్లు పోల్ కాగా, షెల్లీ ఒబెరాయ్‌కు 150, రేఖా గుప్తాకు 116 ఓట్లు వచ్చాయి.

విడదల రజని మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటేనా?

వైసీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి  జగన్.. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో సామాజిక న్యాయం అంటూ పక్కాగా క్యాస్ట్ ఈక్వేషన్స్‌తో తన మార్క్ రాజకీయాన్ని ప్రదర్శించారని ఆ పార్టీ శ్రేణుల్లో  జోరుగా హుషారుగా చర్చ సాగుతోంది. అదే సమయంలో జగన్ తన కేబినెట్‌ను మరోసారి  పున్వ్యవస్థీకరిస్తారనే చర్చ కూడా తెరమీదకు వచ్చింది.  ఈ సారి పునర్వ్యవస్థీకరణలో భాగంగా తన  కేబినెట్‌లో కొత్తగా ఎమ్మెల్సీలుగా ఎన్నిక అయ్యే వారికీ చోటు కల్పిస్తారని పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. అలా చోటు దక్కే వారిలో  చిలకలూరిపేటకు చెందిన మర్రి రాజశేఖర్‌ కచ్చితంగా ఉంటారని చిలకలూరి పేటలో పార్టీ శ్రేణులు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. మర్రి రాజశేఖర్ పార్టీ కోసం, జగన్ అధికారంలోకి రావడం కోసం ఎంత కష్టపడాలో అంతా కష్టపడ్డారని అంటున్నారు. ఈ విషయంలో   ఆయన వర్గీయులే కాదు, ఆయన ప్రత్యర్థి వర్గం అయిన మంత్రి విడదల రజినీ వర్గంలో కూడా అదే అభిప్రాయం వ్యక్తం అవుతోందని చెబుతున్నారు.  మరో వైపు జగన్ కేబినెట్‌లో మర్రి రాజశేఖర్ సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరూ లేరన్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో అంటే జగన్ తొలి కెబినెట్‌లో కొడాలి నాని మంత్రిగా ఉన్నారు. కానీ ఆ తర్వాత..  జగన్ తన కెబినెట్‌ పునర్వ్యవస్థీకరణలో భాగంగా  కొడాలి నానిని పక్కన పెట్టడంతో.. ఆ సామాజిక వర్గం వారికి కేబినెట్ లో స్థానం లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో జగన్ కెబినెట్‌లోకి మర్రి రాజశేఖర్‌ను తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.    అదీకాక.. 2019 ఎన్నికల ప్రచారంలో చిలకలూరిపేట నియోజకవర్గం నుంచి విడదల రజినీని ఎమ్మెల్యేగా గెలిపిస్తే..మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీగా శాసన మండలికి పంపి.. ఆయనను తన కేబినెట్‌లోకి తీసుకుంటానని విపక్ష నేతగా   జగన్ వివిధ సభా వేదికలపై నుంచి ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో విడదల రజినీ గెలవడం.. ఆ తర్వాత జగన్ కేబినెట్‌లో వైద్యారోగ్య శాఖ మంత్రిగా కీలక బాధ్యతలు చేపట్టడం కూడా జరిగిపోయింది. మరి ఒకే నియోజకవర్గానికి చెందిన ఈ ఇద్దరినీ కెబినెట్‌లోకి తీసుకుంటే...   తప్పుడు సంకేతాలు వెళ్లే అవకాశం ఉందనే ఓ చర్చ పార్టీలోనే నడుస్తోంది.  అలాగని విడదల రజినీని మంత్రి పదవి నుంచి తప్పించి.. మర్రి రాజశేఖర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారా? అంటే  పార్టీ శ్రేణుల నుంచి ఔనని కానీ కాదని కానీ బదులు రావడం లేదు. మర్రి రాజశేఖర్.. చాలా సాప్ట్‌గా ఉంటారని.. ప్రతిపక్ష పార్టీపైనే కాదు.. సొంత పార్టీలోని ప్రత్యర్థి వర్గంపై కూడా ఆయన ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. కానీ విమర్శలు కానీ చేసిన దాఖలాలు అయితే లేవని ఆయన వర్గమే క్లియర్ కట్‌గా స్పష్టం చేస్తోంది. అలాంటి వేళ.. మర్రి రాజశేఖర్‌కు కెబినెట్ బర్త్ గ్యారంటీనా అంటే అనుమానమే, ఎందుకంటే.. ముఖ్యమంత్రి   జగన్  తన కేబినెట్‌  మంత్రులుగా ప్రత్యర్థి పార్టీల నేతలపై  వాడి వేడిగా చేయాలని ఆశిస్తారనీ, అలా ఘాటు విమర్శలు చేయగలిగిన వారినే మంత్రివర్గంలోకి తీసుకుంటారని పార్టీ శ్రేణులే చెబుతున్నాయి.  ఆ క్రమంలోనే తొలి కేబినెట్‌లో కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వెల్లంపల్లి శ్రీనివాసరావు, కురసాల కన్నబాబులను తీసుకున్నారని.. పునర్వ్యవస్థీకరణలో   అంబటి రాంబాబు, జోగి రమేష్, ఆర్కే రోజా, విడుదల రజినీలకు చోటు కల్పించారని పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.  మరి అలాంటి వేళ.. కామ్ గోయింగ్ పర్సన్ అయిన..  మర్రి రాజశేఖర్‌ను కేబినెట్‌లోకి తీసుకుంటారా? అదీ   పైర్‌బ్రాండ్ విడదల రజినీని తప్పించి అంటే  సందేహమే అంటున్నారు. అదే సమయంలో పలు వేదికలపై మర్రి రాజశేఖర్ ను మంత్రిని చేస్తానని జగన్ స్వయంగా ప్రకటించి మాట తప్పుతారా అన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. ఒక వేళ మర్రి రాజవేఖర్ కు ఇచ్చిన మాట నిలుపుకోవాలని జగన్ భావిస్తే విడదల రజని మంత్రి పదవి మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోక తప్పదని పార్టీ శ్రేణులు అంటున్నాయి. 

పయ్యావులకు సెక్యూరిటీ ఇవ్వాల్సిందే.. హైకోర్టు స్పష్టీకరణ

తెలుగుదేశం నాయకులను ఇబ్బందులకు గురి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న జగన్ ప్రభుత్వానికి పయ్యావుల కేశవ్ సెక్యూరిటీ విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడినా సహించేది లే.. అన్నట్లుగా జగన్ సర్కార్ తీరు ఉందనడానికి  తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ప్రజాపద్దుల సంఘం చైర్మన్ పయ్యావుల కేశవ్ కు భద్రత తొలగింపు ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. పయ్యావుల కేశవ్ కు ఉన్న వన్ ప్లస్ వన్ భద్రతను జగన్ సర్కార్ గత ఏడాది జులై నెలలొ ఉపసంహరించింది. ఆయనకు కేటాయించిన గన్ మెన్ లను వెనక్కు పిలిపించింది.  ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకే పయ్యావుల సెక్యూరిటీని తొలగించిందని అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. వాస్తవంగా తనకు భద్రత పెంచాలని పయ్యావుల కేశవ్ ప్రభుత్వాన్ని కోరారు. అయితే ప్రభుత్వం మాత్రం పయ్యావుల కేశవ్ కు భద్రత పెంచకపోగా... ఉన్న సెక్యూరిటీని తొలగించింది.   నిబంధనల మేరకు ప్రతి మూడేళ్ల కోసారి ప్రజాప్రతినిథుల వ్యక్తిగత భద్రతా సిబ్బందిని బదలీ చేయడం సహజమని, అందులో భాగంగానే పయ్యావుల భద్రతా సిబ్బంది బదలీ జరిగిందనీ వివరించింది. త్వరలోనే ఆయనకు భద్రతా సిబ్బందిని నియమిస్తామని ప్రభుత్వం అప్పట్లో వివరణ ఇచ్చింది.  సరే పయ్యావులకు ఇప్పటి వరకూ భద్రత కల్పించలేదు. దీనిపై  పయ్యవుల కేశవ్ హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు హైకోర్టు  ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కు భద్రత కల్పించాల్సిందేనని హైకోర్టు విస్పష్ట ఆదేశాలు ఇచ్చింది.   ఐదు లేదా ఆరుగురు సెక్యూరిటీ సిబ్బంది పేర్లు ఇవ్వాలని పిటీషనర్ కు సూచించింది. వారిలో   ఇద్దరిని సెక్యూరిటీగా నియమించేంలా ఆదేశాలు ఇస్తామని కోర్టు పేర్కొంది.   గతంలో విచారణకు వచ్చిన సందర్బంగా కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించినా, ప్రభుత్వం ఇప్పటి వరకూ కౌంటర్ దాఖలు చేయకపోవడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. అయితే పిటీషనరే పేర్లు ఇవ్వాలని హైకోర్టు సూచించడం పట్ల   ప్రభుత్వ న్యాయవాది వ్యక్తం చేసిన అభ్యంతరాన్ని కోర్టు తోసిపుచ్చింది. పిటీషనర్ కు నమ్మకం ఉండాలి కదా అని వ్యాఖ్యానించిన హైకోర్టు తొలుత వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణ అనంతరం టూ ప్లస్ టూ సెక్యూరిటీ కల్పించడం పై తగిన ఆదేశాలు ఇస్తామని పేర్కొంది.

భావనపాడు తీరంలో భారీ నౌక

శ్రీకాకుళం జిల్లా భావనపాడు తీరంలో భారీ నౌక డిజైర్  లంగరేసింది.  ఇక్కడి మూలపేట ప్రాంతంలో గత నెల రోజులుగా మూలపేట పోర్టు ఆధారిత సముద్ర తీర ప్రాంతాల్లో సాయిల్ టెస్టులు నిర్వహిస్తున్నసంగతి తెలిసిందే. అందు కోసం ఈ డిజైర్ నౌక గత  నెల రోజులుగా పనిచేస్తోంది. ఆ నౌకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో మరమ్మతుల కోసం నౌకను తీరానికి తీసుకువచ్చినట్లు చెబుతున్నారు. భారీ నౌకను వీక్షించేందుకు పెద్ద సంఖ్యలు ప్రజలు భావనపాడు తీరానికి చేరుకున్నారు.  ఈ నౌక వల్ల ఎటువంటి ప్రమాదం లేదనీ,  అయితే దీనివల్ల ఎలాంటి ఇబ్బందులు తలెత్తవనీ, ఇది భారత ప్రభుత్వాని చెందిన నౌకేననీ మెరైన్ సీఐ తెలిపారు. మరమ్మతులు పూర్తి కాగానే తీరం నుంచి వెళ్లిపోతుందని వివరించారు. 

సర్వేలపైనే భారం.. గెలుపు గుర్రాలకే టికెట్లు.. సిట్టింగులకు గ్యారంటీ లేదు!

ఈ ఏడాది చివరిలో జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అన్ని పార్టీలూ కసరత్తులు ప్రారంభించేశాయి. అధికార పార్టీని మినహాయిస్తే మిగిలిన ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ లు వరుస కార్యక్రమాలతో జనంలోకి వెళుతున్నారు. అధికార బీఆర్ఎస్ మాత్రం ప్రజలలోకి వెళ్లి వారి ఆదరణను చూరగొనడం కంటే.. సర్వేలపైనే భారం వేయడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నది. ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే పలు సర్వేలు చేయించారు. ఆ సర్వేల ఫలితాలను పక్కన పెడితే ఇప్పుడు ఆయన ఎవరికి పార్టీ టికెట్లు ఇస్తే విజయం సాధిస్తారు అన్న విషయంపై తాజాగా మరో సర్వే చేయిస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ జరుగుతోంది. గతంలో ఆయన సిట్టింగులకందరికీ టికెట్లు అని ప్రకటించిన సంగతి తెలిసందే. అయితే ఇప్పుడు మాత్రం సిట్టింగులకు టికెట్ గ్యారంటీ కాదు అన్న సంకేతాలను పంపిస్తున్నారు.  తాజాగా నిర్వహించనున్నసర్వేలో గెలుపు గుర్రాలెవరన్నది తేలుతుందని, ఆ సర్వే ప్రకారం గెలిచే వారికే వచ్చే ఎన్నికలలో సీట్లు ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.  గతంలో పలు సందర్భాలలో  సిట్టింగ్‌లందరికీ పార్టీ టికెట్లు ఇస్తానని ప్రకటించిన ఆయన ఇప్పుడు ఆ గ్యారంటీ లేదని చెప్పకనే చెబుతున్నారు. కేసీఆర్ గతంలో సిట్టింగులందరికీ టికెట్లు అని ప్రకటించిన సందర్భంలో టికెట్లు ఇస్తామని ప్రకటించిన సందర్భాలలో పార్టీలో ఒక్క సారిగా ఉవ్వెత్తున అసంతృప్తి జ్వాలలు ఎగసి పడ్డాయి.   ఎందుకంటే  ఆపరేషన్ ఆకర్ష్ పేరిట 2019 ఎన్నికలలో వేరే పార్టీల నుంచి గెలిచిన వారిని కూడా కేసీఆర్ పార్టీలో చేర్చుకున్నారు. దాంతో తొలి నుంచి నియోజకవర్గంలో పార్టీ కోసం పని చేసి.. ఎన్నికలలో పోటీ చేసి పరాజయం పాలైన వారు.. ఇప్పుడు గత ఎన్నికలలో తమ ప్రత్యర్థులకే పార్టీ టికెట్ ఇస్తామనీ, వారి విజయం కోసం పని చేయాలని అధినేత ఆదేశించడంతో పార్టీ శ్రేణుల్లోనే కాదు.. నాయకులలో కూడా అసమ్మతి జ్వాలలు భగ్గుమన్నాయి. ఈ కారణంగానే  సందర్భాల్లో హామీ ఇచ్చిన ఆయన.. తాజాగా క్షేత్రస్థాయి పరిస్థితిని తెప్పించుకుంటున్నారు. అదీ కాక మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు వంటి మంత్రులు సిట్టింగులలో అత్యథికులు టికెట్లు ఇచ్చినా గెలవలేరని బహిరంగంగానే ప్రకటించిన సంగతీ తెలిసిందే. ముఖ్యంగా  పాతిక మంది ఎమ్మెల్యేలపై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఉందని, వారిని మార్చాల్సిన అవసరం ఉందని ఎర్రబెల్లి మీడియా ముఖంగా చెప్పడం, అదీ కేసీఆర్ సిట్టింగులందరికీ టికెట్లు ఖాయమని ప్రకటించిన తరువాత చెప్పడం అప్పట్లో బీఆర్ఎస్ లో సంచలనం సృష్టించింది.   ముఖ్యమంత్రి కేసీఆర్ తో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు చాలా చక్కని, దగ్గరి సంబంధాలే ఉన్నాయి. అవును ఒక్కప్పుడు తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు, ఎర్రబెల్లి   ముఖ్యమంత్రి కేసీఆర్ ను చాలా తీవ్రంగా దూషించారు. దుర్భాష లాడారు. అయినా  ఎర్రబెల్లి తనను ఎంత లేసి మాటలన్నా  ఎంతగా దూషించినా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన్ని పిలిచి మరీ మంత్రి పదవి ఇచ్చారు. అంటే అది మామూలు బంధం కాదు. చాలా గట్టి బంధం అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అందుకే ఎర్రబెల్లి  దయాకరరావు చేత కేసీఆరే ఆ మాట అనిపించారా అన్న అనుమానాలు కూడా అప్పట్లో రాజకీయ వర్గాలలో వ్యక్తమయ్యాయి. సరే కారణాలేమైతేనేం సిట్టింగులందరికీ టికెట్లు అన్న విషయంలో కేసీఆర్ ఇప్పుడు పునరాలోచనలో పడ్డారనీ, అందుకే గెలుపు గుర్రాలకే టికెట్లు అన్న నిర్ణయానికి వచ్చారనీ అంటున్నారు. సిట్టింగులలో గెలిచే వారెవరు అన్న విషయంపైనే ఆయన రానున్న రెండు మూడు రోజుల్లో సర్వే చేయించనున్నారనీ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఆయా నియోజకవర్గాలలో  ఎమ్మెల్యేల పట్ల ప్రజల్లో ఉన్న అభిప్రాయం, ఈ సారి విజయావకాశాలు ఏ మేరకు ఉంటాయి, ఒక వేళ ప్రజలలో వ్యతిరేకత ఉంటే ప్రత్యామ్నాయంగా ఎవరు బెటర్ అన్న అంశాలపై ఈ సర్వే ఉంటుందని చెబుతున్నారు.   

కంటోన్మెంట్ లో రాజకీయ కాక.. అక్కడ నుంచి పోటీకి బీఆర్ఎస్ లో పోటాపోటీ!

కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయిన్న మృతి.. అధికారిక లాంఛనాలు లేకుండా ఆయన అంత్యక్రియల వివాదం సద్దుమణగక ముందే బీఆర్ఎస్లో రాజకీయ కాక మొదలైంది. సాయన్న మృతిలో కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమన్నచర్చ నేపథ్యంలో ఆ నియోజకవర్గం నుంచి పోటీకి పార్టీలో పోటీ పెరిగింది. ఇద్దరు మంత్రుల అనుచరులు ఆ నియోజకవర్గం నుంచి పోటీకి సై అంటున్నారు.  ఉప ఎన్నికకు కాకపోయినా.. ఈ ఏడాది చివరిలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలోనైనా కంటోన్మెంట్ సీటు దక్కించుకోవాలన్న వ్యూహంతో ప్రణాళికలు రచిస్తున్నారు. ఎతులు వేస్తున్నారు. కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక నిర్వహించాలా వద్దా అన్న విషయంపై నిర్ణయం తీసుకోవలసింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ విషయంలో అక్కడ నుంచి ఇప్పటి దాకా ఎలాంటి క్లారిటీ రాలేదు. ఒక వేళ ఉప ఎన్నిక నిర్వహించడమంటూ జరిగితే.. కర్నాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరిగే అవకాశాలే మెండుగా ఉన్నాయి.   ఆ అంచనాతోనే కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలోని ఇద్దరు కీలక మంత్రుల సన్నిహితులు ప్రయత్నాలు ప్రారంభించేశారు. మంత్రి హరీష్ రావుకు సన్నిహితుడైన ఎర్రోళ్ల  ఎర్రోళ్ల శ్రీనివాస్  అలాగే కేటీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే క్రిశాంక్  కంటోన్మెంట్ నియోజకవర్గ పార్టీ టికెట్ కోసం తమ వంతు ప్రయత్రాలు చేస్తున్నట్లు పార్టీ శ్రేణుల్లో జోరుగా చర్చ నడుస్తోంది. సందట్లో సడేమియా అన్నట్లుగా ఇదే నియోజకవర్గం నుంచి 2014 ఎన్నికలలో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అభ్యర్థిగా పోటీ చేసి అప్పట్లో తెలుగుదేశం అభ్యర్థిగా రంగంలో ఉన్న సాయన్న చేతిలో ఓడిపోయిన గడ్డం నగేష్ సైతం ఇప్పుడు తనకు బీఆర్ఎస్ తరఫున పోటీ చేసే అవకాశం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.  2014లో తనపై గెలిచిన సాయన్నకే 2018 ఎన్నికలలో కేసీఆర్ పార్టీ టికెట్ ఇవ్వడంతో.. అప్పుడు త్యాగం చేసిన తనకే పార్టీ టికెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. ఈ ముగ్గురే కాకుండా సాయన్న కుమార్తె లాస్య కూడా రేసులో ఉన్నారని చెబుతున్నారు. తన తండ్రి ప్రాతినిథ్యం వహించిన కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా రంగంలోకి దిగే అవకాశాన్ని తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నారు.