నిర్వాహణా లోపంతో ఏపీ గ్లోబల్ సమ్మిట్ అభాసుపాలు

జగన్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠత్మకంగా విశాఖలో  నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్ నిర్వహణ లోపం కారణంగా అభాసుపాలైంది. గత రెండు రోజులుగా గ్లోబల్ సమ్మిట్ లో రుచికరమైన భోజనం, అద్భుతమైన మెనూ అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రచారం చేసుకుంది. తీరా మొదటి రోజే కనీసం సగం మంది  కూడా భోజనాలు  చేయకుండానే మెనూ ఖాళీ అయిపోయింది. దీంతో డిలిగేట్స్ నిర్వాహకులతో గొడవ పడ్డారు. అలాగే సమ్మిట్ కిట్ల పంపిణీ కూడా గందరగోళంగా తయారైంది. అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. కిట్ల పంపిణీ కోసం ఏర్పాటు చేసిన స్టాల్ ధ్వంసమైపోయింది. అసలు గ్లోబల్ సమ్మిట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్న వారిలో ఎవరు ఇన్వెస్టర్లు, ఎవరు కాదు అన్న విషయమే తెలియని పరిస్థితి నెలకొంది.  దాదాపు 15 నుంచి 16 వేల మందికి వరకూ గ్లోబల్ సమ్మిట్ కోసం రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. అయితే వారిలో అత్యధికులుఇన్వెస్టర్లు కాదని అంటున్నారు. సరదాగా చూడటానికో ఉచిత రిజిస్ట్రేషనే కదా చేయించుకుని వెళితే ఏం పోయింది అనుకుని వచ్చిన వారే అధికం. ఇక ప్రభుత్వం కూడా సమ్మిట్ కు పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు వచ్చారని చాటుకునేందుకు ఎవరు వస్తే వారిని అనుమతించేసింది.  ఆ విషయం పక్కన పెడితే.. భోజన విరామం సమయంలో ముందుగా విదేశీ ఇన్వెస్టర్లను అనుమతించి, ఆ తరువాతే మిగిలిన వారికి అని ప్రకటించడంతో సమ్మిట్ కు వచ్చిన వారు చాలా సేపు భోజనాల కోసం ఎదురు చూడాల్సి వచ్చింది. తీరా విదేశీ ఇన్వెస్టర్ల తరువాత మిగిలిన వారిని అనుమతించేసరికి అక్కడా తొక్కిసలాట చోటు చేసుకుంది. సగం మందికి సర్వ్ చేసే సరికే భోజనాలు అయిపోయాయి. దీంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. ఘర్షణ జరిగే పరిస్థితి ఏర్పడింది. సమ్మిట్ కు వచ్చిన వారు నిర్వాహకులతో గొడవ పడ్డారు. ఆగ్రహంతో బయటకు వెళ్లిపోవడం కూడా కనిపించింది. అదే పరిస్థితి సమ్మిట్ కిట్ల పంపిణీ వద్ద కూడా చోటు చేసుకుంది. టెంట్ లో ఏర్పాటు చేసిన కిట్ల పంపిణీ కౌంటర్ ధ్వంసమైపోయింది. మొత్తం మీద ఏపీ గ్లోబల్ సమ్మిట్ తొలి రోజు పెట్టుబడులు ఏ మేరకు వచ్చాయన్నది పక్కన పెడితే.. భోజనాల దగ్గర, కిట్ల పంపిణీ వద్ద జరిగిన తొక్కిసలాట, తోపులాటతో అభాసుపాలైందని సదస్సుకు వచ్చిన వారే చెబుతున్నారు. 

మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నాన్ బెయిలబుల్ వారంట్

రాష్ట్రపరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ కు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది. గతంలో రైల్ రోకో లో పాల్గొన్న సందర్భంగా ఆయనపై నమోదైన ఒక కేసుకు సంబంధించి ఈ వారెంట్ జారీ అయ్యింది.   2018లో రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ డిమాండ్ తో చేపట్టిన రైల్ రోకో కార్యక్రమంలో అప్పటికి విపక్షంలో ఉన్న గుడివాడ అమర్నాథ్ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ఆయన అక్రమంగా రైల్వే స్టేషన్ లోకి ప్రవేశించి విశాఖ, పలాస ప్యాసంజర్ రైలును నిలిపివేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ సందర్బంగా ఆయనపై కేసు నమోదైంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఆయన గత నెల 27న కోర్టులో హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. దీంతో రైల్వే న్యాయస్థానం గుడివాడ అమర్నాథ్ పై నాన్ బెయిలబుల్ అరెస్టు వారెంట్ జారీ చేసింది.  రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‎నాథ్ కు విశాఖ  రైల్వే న్యాయస్థానం నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది.  రైల్వే స్టేషన్‎లోకి అనధికారికంగా ప్రవేశించారని ఐదేళ్ల కిందట ఆయనపై నమోదైన కేసులో కోర్టు ఈ వారంట్ జారీ చేసింది.  2018లో ప్రత్యేక హోదా, రైల్వే జోన్ డిమాండ్ చేస్తూ స్టేషన్‎లోకి ప్రవేశించి విశాఖ-పలాస ప్యాసింజర్ రైలును నిలిపేసి రైల్‌రోకో నిర్వహించారు. దీంతో గుడివాడ అమర్ తో పాటు పలువురు వైసీపీ నేతలపై కేసు నమోదైంది. ఈ కేసులో గత నెల 27న న్యాయ స్థానంలో హాజరు  కావాల్సి ఉండగా హాజరు కాకపోవడంతో  నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.

బచ్చుల అర్జునుడు పాడె మోసిన చంద్రబాబు

తెలుగుదేశం సీనియర్ నాయకుడు, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడి అంత్యక్రియలు పూర్తయ్యాయి. తీవ్ర గుండెపోటుకు గురై నెల రోజులుగావిజయవాడ డాక్టర్ రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బచ్చుల అర్జునుడు గురువారం ( మార్చి 2) సాయంత్రం కన్నుమూసిన సంగతి విదితమే. ఆయన మృతితో తెలుగుదేశం శ్రేణుల్లో తీవ్ర విషాదం నెలకొంది. మంచి నాయకుడిని కోల్పోయామన్న బాధ తెలుగుదేశం వర్గాల్లో వ్యక్తమౌతోంది. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెంనాయుడు, పలువురు సీనియర్ నాయకులు ఆయన మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. కాగా ఆయనను కడసారి చూసేందుకు పెద్ద సంఖ్యలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ఆయన అంత్యక్రియలకు పార్టీ అధినేత చంద్రబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన బచ్చుల అర్జునుడు అంతిమ యాత్రలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన అర్జునుడి పాడె మోశారు. కాగా బచ్చుల అర్జునుడి అంత్యక్రియలు  అధికార లాంఛనాలతో నిర్వహించారు.

అస్వస్థతతో ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ

కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆమె డిల్లీలోని గంగారం ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గురువారం ( మార్చి 2) నుంచి సోనియాగాంధీ జ్వరంలో బాధపడుతుండటంతో ఆమెను ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ప్రస్తతం ఆమెకు ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమెకు చికిత్స అందిస్తున్న వైద్యులు తెలిపారు. ఇలా ఉండగా ఇటీవలి కాలంలో ఆమె తరచూ అస్వస్థతకు గురి కావడం పార్టీ శ్రేణులలో ఆందోళకు కారణమౌతోంది. కొద్ది కాలం కిందట ఆమె శ్వాస కోశ సంబంధిత ఇబ్బందితో ఇదే ఆస్పత్రిలో చికిత్స పొందిన సంగతి విదితమే. అలాగే గతంలో కూడా ఆమె ఇదే ఆసుపత్రిలో ఉదర సంబంధ ఇబ్బందులతో చికిత్స చేయించుకున్నారు.  

రాజ్ భవన్, ప్రగతి భవన్ సయోధ్య మూన్నాళ్ల ముచ్చటేనా?

తెలంగాణలో ప్రభుత్వం, గవర్నర్ మధ్య సయోధ్య మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కోర్టు సూచనలతో అనివార్యంగా రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య కుదిరిన సయోధ్య కొనసాగుతుందా అంటూ అప్పట్లోనే తెలుగువన్ ఇది మూన్నాళ్ల ముచ్చటగానే మిగిలిపోతుందని విస్పష్టంగా చెప్పింది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ గవర్నర్ వద్ద పెండింగ్ లో ఉన్న బిల్లులకు వెంటనే ఆమోదం తెలపాలని ఆదేశించాలని కోరుతూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. అంటే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా కనిపంచిన సుహృద్భావం అక్కడితోనే మాయమైపోయిందని తేటతెల్లమైంది. అయితే ఒక్కటి మాత్రం నిజం అసలు గవర్నర్  శాసన సభకు వచ్చి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడం, నిజంగా... నిజమా, అనే అనుమానం అప్పట్లో అందరిలో కలిగింది.  నిజం  తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ ను ముఖ్యమంత్రి కేసీఆర్  సాదరంగా ఆహ్వానించి అసెంబ్లీలోకి తోడ్కొని వెళ్లడం కూడా అప్పట్లో సంభ్రమాశ్చర్యాలను కలిగింది. అదే విధంగా  ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని గవర్నర్    అక్షరం పొల్లు పోకుండా ఉన్నది ఉన్నట్లు చదవడం కూడా విభేదాలన్నీ గతించిన గతమేనా అన్న భావన కూడా కలిగించింది. ఎందుకంటే అప్పటికి రెండున్నర సంవత్సరాలకు పైగా ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య జరుగుతన్న ప్రచ్ఛన్న పోరు, రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలకు ముందు చోటు చేసుకున్నపరిణామాలు, రాజ్యాంగ సంక్షోభం తప్పదా అనిపించేలా తలెత్తిన పరిస్థితులు గమనిస్తే..  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్బంగా గవర్నర్ తమిళిసై ప్రసంగిస్తారని కానీ, ఆమెను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానిస్తారని కానీ ఎవరూ కనీసం ఊహించలేదు.  నిజానికి   తెలంగాణ  హై కోర్టు జోక్యం చేసుకోవడం వలన కానీ  లేదంటే  నిజంగానే రాజ్యాంగ సంక్షోభం ఏర్పడేదే అన్న అభిప్రాయం ఇప్పటికీ పరిశీలకులలో వ్యక్తమౌతోంది.  అయితే హైకోర్టు జోక్యంతో అనివార్యంగానైనా ముఖ్యమంత్రి కేసీఆర్,  గవర్నర్ తమిళి సై  చాలా చక్కగా వారి వారి పాత్రలను వారు పోషించారు. ‘సయోధ్య’ చిత్రాన్ని రక్తి కట్టించారు.   అఫ్కోర్స్ అప్పట్లో ముఖ్యమంత్రి బాడీ లాంగ్వేజ్ లో కొద్దిపాటి అవమాన ఛాయలు, గవర్నర్ అడుగుల్లో కొద్దిపాటి విజయ దరహాసం కనిపించాయనుకోండి అది వేరే విషయం.  అయినా  రెండు వ్యవస్థల మధ్య సయోధ్య అవసరాన్ని ఇద్దరూ ఎంతో కొంత గ్రహించినట్లే అప్పట్లో కనిపించారు.  అయితే, ఈ సయోధ్య ఇంత వరకేనా   ముందు ముందు కూడా కొనసాగుతుందా? అంటే, రాజకీయ విశ్లేషకులు అనుమానమే అంటున్నారు. కానీ  ఇక ముందు గతంలోలాగా తెగే వరకూ లాగే పరిస్థితి అయితే రాకపోవచ్చనీ, ఇరు వర్గాల నుంచి ఎంతో కొంత విజ్ఞత, వివేచనా, సంయమనం ఆశించ వచ్చననే అభిప్రాయం అప్పట్లో వ్యక్తమైంది. కానీ ఆ అభిప్రాయం పూర్తిగా తప్పని తదననంతర పరిణామాలు రుజువు చేశాయి. పెండింగ్ లో ఉన్న ఐదారు బిల్లుల విషయంలో గవర్నర్ ఎలాంటి  నిర్ణయం ఇప్పటి వరకూ అయితే తీసుకోలేదు. వాటికి ఆమోదముద్ర వేయలేదు.  ప్రధానంగా  మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలలో అవిశ్వాసం తీర్మానం గడువును ప్రస్తుతమున్న మూడేళ్ళ నుంచి నాలుగేళ్ళకు పొడిగిస్తూ  గత అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదించిన సవరణ బిల్లు విషయంలోనూ గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. అలాగని తిప్పి పంపనూ లేదు. పరిశీలనలో ఉంది (అండర్ కన్సిడరేషన్) అని మాత్రమే చెబుతూ ఉన్నారు.   ఈ నేపథ్యంలోనే కేసీఆర్ సర్కార్ ఇక లాభం లేదన్న నిర్ణయానికి వచ్చేసి ఏకంగా బిల్లులపై గవర్నర్ సంతకాలు చేసేలా ఆదేశించాలని కోర్టును ఆశ్రయించింది.  ఆమోదం కోసం ప్రభుత్వం పంపించిన 10 బిల్లులను  గవర్నర్ పెండింగ్ లో పెట్టారని.. ఆమోదించకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ.. తెలంగాణ ప్రభుత్వమే సుప్రీంకోర్టులో రిట్ పిటీషన్ దాఖలు చేయటం సంచలనం సృష్టించింది.   ఆరు నెలలుగా 10 బిల్లులను ఆమోదించకుండా తొక్కిపెడుతున్నారని,  గవర్నర్ పరిధి ఏమిటి?  ఎందుకు బిల్లులు ఆమోదించటం లేదనే విషయాన్ని సుప్రీం కోర్టులోనే తేల్చుకోవాలని  నిర్ణయించుకున్న బీఆర్ఎస్ సర్కార్  బిల్లులను  గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. దీంతో రాష్ట్రంలో ప్రగతి భవన్, రాజ్ భవన్ మధ్య విభేదాలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గతంలో కనిపించిన సయోధ్య అంతా పైపై మెరుగేనని తేటతెల్లమైపోయింది. 

విడదల రజనీ కోసం..!

చిలకలూరిపేటకు చెందిన వైసీపీ నేత మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ పదవి దక్కింది కానీ.. మంత్రి పదవి చాన్స్ అయితే లేదని పార్టీ వర్గాల్లోనే అంటున్నారు. ఈ పరిస్థితే ఆయన అనుచరులలో తీవ్ర అసంతృప్తికి కారణమౌతోంది.  జగన్ అధికారంలోకి వచ్చి దాదాపు నాలుగేళ్ల తర్వాత తమ నాయకుడికి  ఎమ్మెల్సీ మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. అలాంటి వేళ కేబినెట్ కూర్పు అంటే.. తేనెతుట్టెను కదిలించినట్లే అవుతోందని.. ఆ క్రమంలో ఆ ఆలోచన చేయకుండా ఉండడమే మేలనే ఓ భావనలో ముఖ్యమంత్రి జగన్ ఉన్నట్లు ఓ ప్రచారం అయితే ఆ పార్టీలో జరుగుతోందని వారు పేర్కొంటున్నారు. దీంతో తమ నేత మర్రి రాజశేఖర్‌కు మంత్రి అయ్యే యోగం లేదని వారు పెట్టుకొన్న ఆశలను సైతం వదులుకొంటున్నట్లు తెలుస్తోంది.   2019 ఎన్నికల ప్రచారంలో చిలకలూరిపేట ఎమ్మెల్యేగా విడదల రజినీని గెలిపిస్తే.. మర్రి రాజశేఖర్‌ను ఎమ్మెల్సీగా ఎన్నిక చేసి.. . తన కేబినెట్‌లో మంత్రిగా తీసుకొంటానని.. సదరు నియోజకవర్గ ప్రజలకు  జగన్.. మాట ఇచ్చారని.. అలా ఆ ఎన్నికల్లో రజినీ అయితే గెలిచింది.. ఆమె మంత్రి పదవి సైతం చేపట్టిందని.. అలాగే ఈ నాలుగేళ్లలో  పలుమార్లు ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చినా.. ముఖ్యమంత్రి  జగన్ మాత్రం.. పలువురికి ఎమ్మెల్సీ పదవులు కేటాయించి... శాసనమండలికి పంపారని మర్రి రాజశేఖర్ అనుచర వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోంది.    మరోవైపు ఈ నాలుగేళ్లలో తమ నాయకుడు మర్రి రాజశేఖర్‌కు ఎమ్మెల్సీ ఇవ్వకుంటే.. ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి కానీ.. మరేదైనా పదవి కానీ కట్టబెడతారని ఆయన అనుచరగణం కళ్లలో ఒత్తులు వేసుకొని మరీ ఎదురు చూసిందని..  కానీ అవేమీ లేకుండా.. ఊరించి.. ఊరించి..  ఎన్నికలు  ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ఇలా ఎమ్మెల్సీ పదవి కేటాయించడం పట్ల.. ఆయన కేడర్ ఒకింత నిరాశ నిస్పృహాకు గురైనట్లు ఓ ప్రచారం అయితే జరుగుతోంది. ఇంకోవైపు.. కొద్ది మాసాల ముందే.. కృష్ణా జిల్లా పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ పదవిని మర్రి రాజశేఖర్‌కు జగన్ కట్టబెట్టారని వారు పేర్కొంటున్నారు.  అదీకాక.. వచ్చే ఎన్నికల తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఆ దేవుడికే ఎరుక.. ఆ తర్వాత ప్రభుత్వం మారితే.. తమ నేత పరిస్థితి ఏమిటని ఆయన వర్గం ఆందోళనతో ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకోవైపు.. మర్రి రాజశేఖర్ సామాజిక వర్గం కారణంగానే ఆయనకు ఇప్పటి వరకు ఎమ్మెల్సీ పదవి దక్కలేదనే ఓ ప్రచారం సైతం చిలకలూరిపేట నియోజకవర్గంలో జోరందుకొందని తెలుస్తోంది.   ఇక వచ్చే ఎన్నికల్లో మళ్లీ చిలకలూరిపేట నుంచి  వైసీపీ అభ్యర్థిగా విడదల రజినీ బరిలోకి దిగనున్నారని.. ఆమె అభ్యర్థిత్వానికి అసమ్మతి సెగ తలగకుండా... ఆమె గెలుపు నల్లేరు మీద నడకలా సాగడం కోసమే.. మర్రి రాజశేఖర్‌కు ఈ ఎమ్మెల్సీ పదవి ఇచ్చి సంతృప్తి పరిచారనే ప్రచారం సైతం ఆయన వర్గంలో చాలా బలంగా సాగుతోంది.   వచ్చే ఎన్నికల ప్రచారం వేళ.. ముఖ్యమంత్రి, ఫ్యాన్ పార్టీ అధినేత వైయస్ జగన్.. మళ్లీ ఈ నియోజకవర్గానికి వచ్చి.. మర్రి రాజశేఖర్‌ను ఇప్పటికే ఎమ్మెల్సీ చేశామని.. మళ్లీ అదికారంలోకి వస్తే.. ఆయనకు మంత్రి పదవి కేటాయిస్తానని.. అది కూడా కీలక శాఖ కట్టబెడతానంటూ హామీ ఇచ్చే అవకాశం ఉందని మర్రి రాజశేఖర్ వర్గం అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. ఓ వేళ వచ్చే ఎన్నికల్లో మళ్లీ వైయస్ జగన్ పార్టీ విజయం సాధించినా.... గతంలో లాగే తమ నేత మర్రి రాజశేఖర్‌ను మరిచిపోతే.. పరిస్థితి ఏమిటని ఆయన వర్గం సూటిగా ప్రశ్నిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో తమ నేత రాజశేఖర్ సూచనలకు అనుగుణంగా నచుకొంటామని ఆయన వర్గం స్పష్టం చేస్తోంది. మరి మర్రి రాజశేఖర్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారనేది  వేచి చూడాల్సిందే.     మరోవైపు గతంలో మాజీ మఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ కె.రోశయ్య సంతాప సభను నియోజకవర్గంలో నిర్వహించిన సమయంలో మర్రి రాజశేఖర్ బావమరిది మాట్లాడుతూ.. ఈ ప్రభుత్వంలో మర్రి రాజశేఖర్‌కు గుర్తింపు లేకుండా పోయిందని ఆరోపించారు. మరో పార్టీలో మర్రి రాజశేఖర్ ఉంటే.. ఆయన పరిస్థితి మరోలా  ఉండేదంటూ కీలక వ్యాఖ్యలు చేశారని ఆయన వర్గం ఈ సందర్భంగా గుర్తు చేస్తోండడం గమనార్హం.

గుడివాడలో గందరగోళం.. కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధం

మాజీ మంత్రి కొడాలి నాని అరెస్టుకు రంగం సిద్ధమైందా? ఔననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ఇంతకీ కొడాలి నానిని పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తున్నారు. క్యాసినో కేసులోనా? లేదా అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులోనా? అంటే అవేమీ కాదు.. వైసీపీ విపక్షంలో ఉండగా ఆయన ఆధ్వర్యంలో జరిగిన ఒక ర్యాలీ సందర్భంగా నమోదైన కేసులో కొడాలి నానిని అరెస్టు చేయక తప్పని అనివార్య పరిస్థితిని పోలీసులు ఎదుర్కొంటున్నారు. 2016లో ప్రత్యేక హోదా డిమాండ్ తో కొడాలి నాని ఆధ్వర్యంలో బెజవాడ తుమ్మలపల్లి కాళాక్షేత్రం నుంచి వన్ వే దారిలో ర్యాలీ నిర్వహించారు. దీంతో అప్పడు ట్రాఫిక్ కు భారీగా అంతరాయం కలిగింది. పోలీసు ఆంక్షలు అమలులో ఉన్నప్పటికీ పట్టించుకోకుండా ర్యాలీ నిర్వహించారంటూ అప్పట్లో కొడాలి నానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే ఈ కేసు విచారణకు కొడాలి నాని హాజరు కాకపోవడంతో ఆయనపై అరెస్టు వారెంట్ జారీ అయ్యింది. జారీ అయ్యి కూడా చాలా కాలం అయ్యింది. అది ఎప్పటి నుంచో పెండింగ్ లో ఉంది కూడా. ఆ విషయంలోనే కోర్టు విజయవాడ గవర్నరు పేట సీఐను నానిని అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచాల్సిందిగా ఆదేశించింది. దీంతో కొడాలి నానిని పోలీసులు అరెస్టు చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. అయినా ఇదే పెద్ద ఖంగారు పడాల్సిన విషయం కాదు.. ఆయనను అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిస్తే.. వెంటనే బెయిలు వచ్చేస్తుంది.  అరెస్టు వారంట్ పెండింగ్ లో ఉన్నా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే కోర్టు అరెస్టుకు ఆదేశించాల్సి వచ్చింది. అలా కాకుండా వారెంట్ జారీ అయిన వెంటనే అరెస్టు చేసి ఉంటే స్టేషన్ బెయిలు పైనే ఆయన బయటకు వెళ్లిపోయి ఉండేవారు.  అయితే మీడియాలో, సోషల్ మీడియాలో మాత్రం కొడాలి నాని అరెస్టు అనివార్యం అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

విపక్షాల ఐక్యత ఎండమావేనా?.. తృణమూల్ ఒంటరి పోరు ప్రకటన సంకేతం అదేనా?

వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ఐక్యత అన్నది ఎండమావేనా అంటే.. జాతీయ స్థాయిలో పార్టీల ఐక్యత విషయంలో జరుగుతున్న పరిణామాలును గమనిస్తే ఔననే అనాల్సి ఉంటుంది. విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగుల వెనక్కు అన్నట్లుగా సాగుతున్నాయి. ఎన్నికలకు ముందే కూటమిగా ఏర్పడటమా? ఎన్నికల అనంతర పొత్తులకు మొగ్గు చూపడమా అన్న అంశంలో ఏ పార్టీ దారి ఆ పార్టీదే అన్నట్లుగా ఉంది. సరే అది పక్కన పెడితే.. 2024 సార్వత్రిక ఎన్నికలలో తమ పార్టీ పొత్తులు లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగుతుందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ లోని   సర్దిఘి నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఇక్కడ తృణమూల్ అభ్యర్థి పరాజయం పాలయ్యారు. అయితే ఈ  కాంగ్రెస్, వామపక్షాలు, బీజేపీ అన్నీకుమ్మక్కై తృణమూల్ అభ్యర్థిని ఓడించారన్నది మమత ఆరోపణ. ఆ మూడు పార్టీలూ మతం కార్డు ఉపయోగించాయన్నారు. ఏక్కడైనా ఎప్పుడైనా సరే బీజేపీతో అవగాహన ఉన్న పార్టీలతో కలిసి తృణమూల్ పని చేయదనీ, అందుకే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో తృణమూల్ ఒంటరిగానే బరిలోకి దిగుతుందని మమతా బెనర్జీ కుండ బద్దలు కొట్టేశారు.  దీంతో విపక్షాల ఐక్యతకు ఆదిలోనే హంసపాదు పడిందని చెప్పవచ్చు. ప్రతిపక్షాల ఐక్యత, థర్డ్ ఫ్రంట్ అంటూ  పలు ప్రాంతీయ పార్టీలు రాజకీయ సందడి చేస్తుంటే  మమతా మాత్రం తనదారి వేరని కుండబద్ధలు కొట్టారు. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల్లో దారుణైన ఓటమిపాలైన దీదీ, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ ఎన్నికల మరుసటి రోజే ఈ కీలక ప్రకటన చేయటం విశేషం. ఈసారి ఎన్నికల్లో తమ పొత్త కేవలం ప్రజలతోనే ఉంటుందని ఏ ఇతర పార్టీతో ఉండదని దీదీ చెప్పారు. 2024 ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని ఓడించాలి, మోడీని గద్దె దించాలి. కురువృద్ద కాంగ్రెస్ పార్టీ  అధినాయకురాలు సోనియా గాంధీ మొదలు, నిన్న మొన్ననే జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వరకూ   బీజేపీ ప్రత్యర్ధి పార్టీల నాయకులు అందరిదీ అదే మాట. అయితే  అందుకోసం అందరూ ఒక్కతాటిపైకి వచ్చే విషయంలోనే ఎవరిలోనూ ఏకాభిప్రాయం కుదరడం లేదు. బీజేపీని గద్దె దించాలన్న లక్ష్యంతోనే   కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ‘భారత్ జోడో’ యాత్ర చేశారు. ఆ లక్ష్యంతోనే వామపక్షాలు ఎవరితో అంటే వారితో చేతులు కలిపేందుకు  ఎవర్ రెడీ అంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. శరద్ పవార్, మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రివాల్ ఇలా  ఎవరి శక్తి మేరకు  వారు  ప్రయత్నిస్తున్నారు. ఎవరికి వారుగా వ్యూహరచనలు చేసుకుంటున్నారు.  మరోవంక ఇప్పటి వరకూ బీజీపే వ్యతిరేక పార్టీల నేతలందరినీ   రింగ్ మాస్టర్లా ఆడిస్తూ వచ్చిన  ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ఇక బయటి వారికి వ్యూహాల విక్రయ వ్యాపారం ఆపేసి బీజేపీని గద్దె దించడమే లక్ష్యంగా రాజకీయ రంగ ప్రవేశం చేసి తన దారిన తాను బీహార్ లో పాదయాత్ర చేసుకుంటున్నారు. సరే 2024 సార్వత్రిక ఎన్నికలు ఇంకా ఏడాదిన్నర పైగా సమయం ఉంది. ఈ లోగా తొమ్మిది రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగుతాయి.. వాటి ఫలితాలను బట్టి విపక్ష ఐక్యతకు సారథ్యం ఎవరన్నది లేల్చుకోవచ్చు అనుకుంటే.. ఈశాన్య రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి. ఆ ఫలితాలు విపక్షాల ఐక్యతా యత్నాలకు ఆదిలోనే గండి కొట్టాయి.  ఇంకా ఈ ఏడాది మరో ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. ఈశాన్య రాష్ట్రాల ఫలితాలతో కాంగ్రెస్ సారథ్య రేసులో వెనుకబడిపోయందనే  పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఈ పరిస్థితుల్లో వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి విపక్షాలు ఏకతాటి మీదకు రావడం అంటే ఏదో అద్భుతం జరగాల్సిందేనని అంటున్నారు. 

ఆడలేక మద్దెలు ఓడు అంటే ఎలా సోము వీర్రాజు గారూ!

ఆడలేక మద్దెలు ఓడు అన్నట్లుగా తయారైంది సోము వీర్రాజు పరిస్థితి. ఏపీలో అసలే అంతంత మాత్రంగా ఉన్న బీజేపీని పూర్తిగా కనుమరుగు చేయడమే లక్ష్యమా అన్నట్లుగా వ్యవహరిస్తున్న ఆయన తీరు పట్ల సహజంగానే పార్టీలో అసంతృప్తి, అసమ్మతి పెచ్చరిల్లాయి. ఆయన ఒంటెత్తు పోకడలను భరించ లేక ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరిపోయారు. అదే దారిలో మరింత మంది ఉన్నారన్న వార్తలూ విస్తృతంగా వినవస్తున్నాయి. అలా పార్టీకి గుడ్ బై చెప్పే వారిలో రాష్ట్ర విభజన తరువాత వచ్చి చేరిన వారే కాకుండా మొదటి నుంచీ పార్టీని అంటిపెట్టుకుని ఉండి పని చేసిన వారూ ఉన్నారంటున్నారు. అంతే కాకుండా బీజేపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రం నుంచి ఒక ప్రతినిథి వర్గం హస్తినకు వెళ్లి మరీ సోము వీర్రాజుపై అధిష్ఠానానికి ఫిర్యాదు చేసింది. దీనిని సీరియస్ గా తీసుకున్న బీజేపీ హైకమాండ్ వెంటనే పార్టీ రాష్ట్ర వ్యవహారల ఇన్ చార్జ్, కేంద్ర మంత్రి మురళీధరన్ ను రాష్ట్రానికి పంపింది. ఆయన నేరుగా రాజమహేంద్ర వరం వచ్చి పార్టీ నేతలతో బేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా సోము వీర్రాజుపై ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అన్నిటినీ సావధానంగా విన్న ఆయన అధిష్ఠానానికి నివేదిస్తానని చెప్పారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో ట్విస్ట్ ఏమిటంటే మురళీదరన్ కు సోము వీర్రాజు ముఖం చాటేయడం. అయితే సోము వీర్రాజు పార్టీ అధిష్ఠానానికి రాష్ట్ర పార్టీ పరిస్థితిపై ఓ లేఖ రాశారు. అందులో ఆయన పేర్కన్న అంశాలను గమనిస్తే సోము వీర్రాజు ఆడలేక మద్దెలు ఓడు అంటున్నట్లుగా ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆ లేఖలో సోము వీర్రాజు రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగం భోట్లు అన్నట్లుగా తయారు కావడానికి కారణం తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీ అధినేత చంద్రబాబు అని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో లేదు.. అధికారంలో ఉన్న పార్టీతో సోము వీర్రాజు అంటకాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర పార్టీ బలహీనం కావడానికి విపక్ష నేత కారణం అంటూ సోము వీర్రాజు అధిష్ఠానానికి లేఖ రూపంలో చెప్పడాన్ని సొంత పార్టీ శ్రేణులే ఆక్షేపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రంలో అంటే తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అక్కడి అధికార పార్టీ బీఆర్ఎస్ తో ఢీ అంటున్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతున్నారు. నిర్బంధాలను ఎదుర్కొంటున్నారు. అయినా అక్కడ బీజేపీ బలపడుతోంది. ఇక్కడు సోము వీర్రాజు అందుకు పూర్తి బిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తెలుగుదేశం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు వల్లే రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతోందంటూ సోము వీర్రాజు అధిష్ఠానానికి లేఖ రాయడాన్ని బీజేపీ శ్రేణులే ఎద్దేవా చేస్తున్నాయి. విపక్షంలో ఉన్న ఈ నాలుగేళ్ల కాలంలోనూ తెలుగుదేశం ఎన్నడూ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడింది లేదు. కేంద్రం రాష్ట్రానికి ఇవ్వాల్సినవేవీ ఇవ్వకయినా అందుకు మోడీనీ, కేంద్ర ప్రభుత్వాన్ని తప్పుపట్టకుండా.. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీపైనే విమర్శలు గుప్పిస్తోంది. రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీ అడగకపోయినా మద్దతు ఇచ్చింది.  కేంద్రం పార్లమెంటులో ప్రవేశ పెట్టిన ప్రతి బిల్లుకూ మద్దతు ఇచ్చింది. అటేవంటి టీడీపీ ఏపీలో బీజేపీ  ఎదగకపోవడానికి కారణం ఎలా అవుతుందని బీజేపీ శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వ అవినీతిపై చార్జిషీట్ దాఖలు చేయాలని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ఆదేశించినా సోము వీర్రాజు నేతృత్వంలోని పార్టీ రాష్ట్ర శాఖ ఇప్పటికీ ఆ పని చేయలేదు.  ఇలా లోపాలన్నీ తన వైపు పెట్టుకుని సోము వీర్రాజు తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలను అడ్డుకుంటోందనడం ఆడలేక మద్దెలు ఓడు అనడం కాకుండా మరేమిటని బీజేపీ రాష్ట్ర శ్రేణులే ప్రశ్నిస్తున్నాయి.

బటన్లు నొక్కితే సీఎం అయిపోరు.. రఘురామకృష్ణం రాజు

ఒకరి కడుపు కొట్టి మరొకరి ఖాతాలోకి సొమ్ములు జమచేయడానికి బటన్లు నొక్కుతున్న జగన్ ను జనం సమర్ధించరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఎగ్గొట్టి ఇ సోమ్మును జనాలకు ఇవ్వడాన్ని జగన్ ఏ విధంగా సమర్ధించుకుంటారని ప్రశ్నించారు. గురువారం రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన బటన్లు నొక్కి మరో సారి సీఎం అయిపోదామనుకుంటున్న జగన్ ఆశలు ఫలించవని ఆయన అన్నారు.   ముందు లక్ష కోట్ల రూపాయలు చెల్లించి సెటిల్ చేసిన తరువాత చూసుకుందాం అప్పటి వరకూ అమరావతే రాజధాని అని చెబితే జగన్ ఏం చేస్తారని ప్రశ్నించారు. పార్లమెంటులో చట్టం ద్వారా ఏర్పాటైన రాజధానిని కాదనిరైతులకు లక్ష కోట్ల రూపాయలిచ్చి సెటిల్ చేయండి ఆ తర్వాత చూసుకుందామని అప్పటివరకు అమరావతియే రాజధాని అని సుప్రీం కోర్టు చెబితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏమి చేస్తారని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘురామకృష్ణంరాజు ప్రశ్నించారు. పార్లమెంట్ చట్టం చేసిన రాజధానిని కాదని, జగన్ చేయగలిగిందేమీ లేదని రఘురామకృష్ణం రాజు అన్నారు.   రాజధాని అంశంపై ప్రభుత్వం పదేపదే సుప్రీం కోర్టును ఆశ్రయించడం ఉన్మాదమేనని విమర్శించారు.    అమరావతి విషయంలో ముందస్తు తేదీని ప్రకటించమని న్యాయమూర్తులను కోరడం హాస్యాస్పదమని రఘురామకృష్ణం రాజు అన్నారు.  వైసీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు విజయసాయి గొంగళిపురుగు సీతాకోకచిలుకలా మారినట్లు పూర్తిగా మారిపోయినట్లు కనిపిస్తున్నారని ఆయన అన్నారు. ఉన్నత విద్యావంతుడైన విజయసాయి గతంలో చేసిన ట్వీట్లు చాలా అసహ్యంగా ఉండేవనీ, అయితే ఇటీవలి కాలంలో ఆయన తీరు మారిందని, ఆయన ట్వీట్లు సంస్కారవంతంగా ఉంటున్నాయనీ చెప్పారు. రాజ్యసభ ప్యానల్ కు ఎన్నికై.. ఆ తరువాత తొలగింపునకు గురై మళ్లీ ఎంపికైన తరువాత విజయసాయి వ్యవహార శైలిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని రఘురామకృష్ణం రాజు అభిప్రాయపడ్డారు.   సీఎం జగన్మోహన్ రెడ్డి తెనాలి సభలో బటన్  నొక్కి రైతుల ఖాతాలో డబ్బులు చేసినట్టుగా నాటకమాడినప్పటికీ విజయ సాయి రెడ్డి ఆహా..ఓహో అనకుండా, వాస్తవంగా రైతుల ఖాతాలలో బటన్ నొక్కి  రైతుల ఖాతాలు డబ్బులు జమ చేసిన ప్రధానమంత్రిని అభినందిస్తూ ట్వీట్ చేయడమే ఆయనలో మార్పునకు తార్కానమని అన్నారు.  

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు.. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు

ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగిరినట్లు అన్నట్లుగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖలో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు నిర్వహించడం. ఏపీ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ శుక్రవారం (మార్చి 3) నుంచి రెండు రోజుల పాటు విశాఖ వేదికగా జరగనుంది. దీని కోసం జగన్ సర్కార్ ప్రచారార్భాటాలతో ఊదరగొట్టేస్తోంది. నిజానికి ఈ సమ్మిట్ తో ఏం ఒరుగుతుందన్న ప్రశ్న పరిశ్రమల వర్గాలలోనే కాదు.. సామాన్య జనంలో కూడా వినిపిస్తోంది. ఎందుకంటే.. గత నాలుగేళ్లుగా ఏపీ పారిశ్రామిక రంగం కుదేలైపోయింది. కొత్త పరిశ్రమలు రావడం అటుంచి ఉన్న పరిశ్రములు ఏపీని దాటి వెళ్లిపోతున్నాయి.  ఈ పరిస్థితుల్లో లక్షల కోట్ల రూపాయల ఇన్వెస్ట్ మెంట్లు వచ్చి పడతాయని చెబుతూ ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ ముసుగులో కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని సర్కార్ ఖర్చు పెట్టేస్తున్నది. దేశ, విదేశాల నుంచి పెట్టుబడిదారులు వస్తున్నారని ఊదరగొడుతూ సదస్సుపై  హైప్ పెంచేందుకు విశ్వప్రయత్నాలూ చేస్తున్నది. అయితే రాష్ట్రంలో వాస్తవంగా పారిశ్రామిక వేత్తలు రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మే స్థితిలో లేరు.  పాలకపక్ష నేతలు పారిశ్రామికవేత్తలను నానా రకాలుగా వేధిస్తున్నారు. వారి వేధింపుల కారణంగానే కొత్త పరిశ్రమలేవీ ఈ నాలుగేళ్లలో రాష్ట్రానికి రాలేదు. మరో వైపు ఉన్న పరిశ్రమలే పక్కరాష్ట్రాలకు తరలిపోతున్నాయి. ఒ క విధంగా చెప్పాలంటే జగన్ సర్కార్ అంటే పారిశ్రామిక వేత్తలు భయంతో పారిపోతున్నారు.  తెలుగుదేశం హయాంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. అప్పట్లో ఏపీకి పెట్టుబడులు వెల్లువెత్తాయి. పారిశ్రామిక రంగానికి ప్రోత్సాహం అందించడంలో గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రానికి వచ్చిన   గుర్తింపును ఈ ప్రభుత్వం పూర్తిగా పోగొట్టేసింది. అమర్నాథ్ రెడ్డి చెప్పిన కోడి గుడ్డు కథలా  రాష్ట్ర పారిశ్రామిక విధానం తయారైంది.     గతేడాది పరిశ్రమలకు ఇవ్వవలసిన రాయితీలు ఇప్పటికీ చెల్లించిన దాఖరాలు లేవు.  2020లో రాష్ట్రంలో కొత్తగా 1200 కంపెనీలు రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ లో నమోదుకాగా.. అందులో సగం కంపెనీలు స్వచ్ఛందంగా తమ రిజిస్ట్రేషన్ ను రద్దుచేసుకున్నాయి. గత ఏడాది దావోస్ లో జరిగిన అంతర్జాతీయ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ఏపీ నుంచి ప్రాతినిథ్యమే లేదు. ఎందుకంటే అక్కడ చలి అధికం అని ఘనత వహించిన ఏపీ పరిశ్రమల శాఖ మంత్రి చెప్పారు. అంతకు ముందు ఏడాది దావోస్ కు భారీ ప్రతినిథి బృందంతో వెళ్లిన సీఎం జగన్  రూ.1.25 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఘనంగా ప్రకటించారు. అయితే దావోస్ లో జగన్ కుదుర్చుకున్న ఎంవోయూలన్నీ.. భారత పారిశ్రామిక వేత్తలతోనే.. ఇంతోటి దానికి దావోస్ వరకూ వెళ్లడమెందుకన్న విమర్శలు అప్పట్లోనే వెల్లువెత్తాయి. ఇంతా చేసి దావోస్ లో జగన్ కుదుర్చుకున్న ఎంవోయిలతో ఇప్పటికీ ఒక్కటి కూడా గ్రౌండ్ అయిన దాఖలాలు లేవు.  వాస్తవ పరిస్థితి ఇలా ఉండగా జగన్ ప్రభుత్వం ఇంత ఆర్భాటంగా ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్ అంటూ జనాలను పెట్టుబడులు వస్తాయన్న భ్రమల్లో ముంచాలని ప్రయత్నిస్తున్నది. 

తెలుగుదేశం ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

తెలుగుదేశం   సీనియర్ నేత, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూశారు.  కొన్ని రోజుల కిందట హార్ట్ అటాక్‌కు గురైన ఆయనను కుటుంబ సభ్యులు   విజయవాడలోని రమేశ్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఐసీయూలో ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆయనకు స్టంట్ వేశారు. అప్పటి నుంచి ఆస్పత్రిలోనే చికిత్స పొందుతున్న ఆయన గురువారం(మార్చి 2) సాయంత్రం కన్నుమూశారు.   కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన బచ్చుల అర్జునుడు గతంలో మచిలీపట్నం మున్సిపాలిటీ చైర్మన్‌గా పని చేశారు. 2014లో ఆయ‌న‌ కృష్ణా జిల్లా తెలుగుదేశం అధ్యక్షుడిగా నియమితుడయ్యారు. టీడీపీ కేంద్ర కమిటీ క్షమశిక్షణా కమిటీ చైర్మన్‌గానూ వ్యవహరించారు.  2017లో శాసనసభ్యుల కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నిక‌య్యారు. అనంతరం గన్నవరం ఇన్‌చార్జిగా నియమితులయ్యారు. అయితే అనారోగ్యం బారినపడటంతో ఆయనను తప్పించి కొనకళ్ల నారాయణను ఇన్‌చార్జిగా నియమించిన సంగతి తెలిసిందే. అర్జునుడు మరణంతో టీడీపీలో విషాదచ్ఛాయాలు అలుముకున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుండెపోటుకు గురై నెలరోజులుగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన కోలుకుంటారని భావించామని కానీ ఇలా జరగడం తీవ్ర విషాదాన్ని నింపిందన్నారు. అర్జునుడు మృతి పార్టీకి తీరని లోటు అని చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అలాగే యువగళం పాదయాత్రలో ఉన్న నారా లోకేష్ కూడా బచ్చుల అర్జునుడు మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.  నిజాయతీపరుడు, అజాతశత్రువు అయిన అర్జునుడు పార్టీ బలోపేతానికి ఎనలేని కృషి చేశారని,   ఆయన కన్నుమూయడం పార్టీకి తీరని లోటని ట్వీట్ చేశారు. 

యువగళంతో గొంతు కలిపిన జనం.. నిర్బంధాల నడుమ విజయయాత్రలా లోకేష్ పాదయాత్ర!

తెలుగుదేశంజాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత   లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభించి నెల రోజులు దాటింది. అగుగడుగునా జన నీరాజనంతో ఆయన  యాత్ర సాగుతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు పాదయాత్రలు చేశారు. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర చేశారు. ఆ ముగ్గురూ కూడా రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్రలతో లభించిన ప్రజాదరణ కారణంగానే ముగ్గురూ కూడా ముఖ్యమంత్రులు అయ్యారు. అయితే ఇప్పుడు నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర కూడా తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావడమే. కానీ గతంలో జరిగిన మూడు పాదయాత్రలతో పోలిస్తే నారా లోకేష్ చేస్తున్న పాదయాత్ర చాలా ప్రత్యేక మైనది. గతంలో వైఎస్ కానీ, చంద్రబాబు కానీ, జగన్ కానీ పాదయాత్రలు చేసిన సమయంలో ఆంక్షలు లేవు, అవరోధాలు లేవు, అడ్డంకులు లేవు. ప్రభుత్వాలు ఆ పాదయాత్రల సమయంలో పూర్తి భద్రత కల్పించాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలూ జరగకుండా ఏర్పాట్లు చేశాయి. అవసరమైన అన్ని అనుమతులూ ఇవ్వడమే కాకుండా.. పాదయాత్రలో పాల్గొన్న వారికి ఎటువంటి ఇబ్బందులూ కలుగకుండా ప్రభుత్వాలు ఏర్పాట్లు చేశాయి. కానీ లోకేష్ పాదయాత్ర కు అలాంటి వెసులుబాటులేవీ లేవు. ఆయన అడుగుతీసి అడుగువేయాలంటే యుద్ధమే చేయాల్సి వస్తోంది. అడుగడుగునా ఆంక్షలే. మాట్లాడుతుంటే పోలీసులు మైకు లాగేసుకుంటున్నారు. నిలుచున్న స్టూలును కూడా తీసేస్తున్నారు. వెంట వచ్చే వాహనాలు లేవు. ప్రచార రథాలను సీజ్ చేసేశారు. ఆయన పాదయాత్రకు రాకుండా జనాలను అడ్డుకుంటున్నారు. కేసులు పెడుతున్నారు. ఇవి చాలవన్నట్లు అధికార పార్టీయే పాదయాత్రకు అడుగడుగునా అవరోధాలు కల్పిస్తోంది. జనాదరణ లేదు అని ప్రచారం చేయడానికి నానా అగచాట్లూ పడుతోంది. అధికార వైసీపీ సోషల్ మీడియా టీమ్ పాదయాత్ర విఫలం అన్న ప్రచారం చేయడానికి చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. చివరాఖరికి ఆయన పాదయాత్ర కంటే ముందు ఆయన రూట్ లో ఖాళీ రహదారులను డ్రోన్ ల ద్వారా చిత్రీకరించి జనం లేని యాత్ర అని బిల్డప్ ఇచ్చుకోవడానికి విఫల ప్రయత్నం చేసింది. గతంలో ఏ ప్రభుత్వమూ ఇలా చేసిన దాఖలాలు లేవు. కానీ వైసీపీ మాత్రం ఖాళీ రహదారుల ఫోటోల కోసం పోలీసులపై ఒత్తిడి తీసుకు వస్తోంది. అలా ఖాళీ రహదారల పొటోలు పంపకుంటే సస్పెన్షన్ వేటు తప్పదంటూ హెచ్చరిస్తోంది.  ప్రభుత్వ సలహాదారు సజ్జల కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో 50 మందితో కూడిన బృందం లోకేష్ పాదయాత్రకు జనం కరవయ్యారు అని ఎస్టాబ్లిష్ చేయడమే లక్ష్యంగా పని చేస్తోందని అంటున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సజ్జల భార్గవ్ రెడ్డి ఆధ్వర్యంలోని ఈ బృందమే తమకు అందిన ఫొటోల ఆధారంగా లోకేష్ పాదయాత్ర విఫలం అంటూ సామాజిక మాధ్యమంలో ట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నది. వీటన్నిటికీ తోడు అధికార పార్టీ శ్రేణుల దాడుల భయం. దాడులను నిరోధించడానికి పోలీసులు పటిష్ట ఏర్పాట్లు చేస్తారన్న నమ్మకం లేదు. ఈ పరిస్థితుల్లో సాగుతున్నది కనుకనే లోకేష్ పాదయాత్ర   గత పాదయాత్రలతో పోలిస్తే ఎంతో ప్రత్యేకమైనది. అలాగే ఎంతో సాహసోపేతమైనదని చెప్పవచ్చు. ఇక లోకేష్ తన పాదయాత్రలో జనంతో మమేకమౌతున్న తీరు పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.  తనదైన శైలిలో ఆయన ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. విపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్ పాదయాత్ర చేశారు. ఆ సందర్భంగా ఆయన ఎడాపెడా హామీలిచ్చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని నెరవేర్చడం గురించి మరచిపోయారు. విపక్షాలు నిలదీసిన సందర్భంగా ఆయన కేబినెట్ సహచరులు ఆ హామీలు జగన్ ఇవ్వలేదని బుకాయించడమే కాకుండా మా మేనిఫెస్టో చూసి మాట్లాడండి అంటూ ఎదురుదాడికి దిగారు. ఇ ప్పుడు లోకేష్ తన పాదయాత్రలో భాగంగా గతంలో జగన్ ఇచ్చిన మీలను గుర్తు చేసి ప్రజల నుంచే అవి అమలయ్యాయో లేవో తెలుసుకుంటున్నారు. అంతే కాకుండా తాను ఇచ్చిన హామీలను ప్రతి వంద కిలోమీటర్ల వద్దా శిలాఫలపై చెక్కించి ఆవిష్కరిస్తున్నారు. ఇప్పటి వరకూ ఆయన నాలుగు వందల కిలోమీటర్ల పైన సాగిన పాదయాత్రలో నాలుగు శిలాఫలకాలను ఆవిష్కరించారు. తాను ఇచ్చిన హామీలన్నీ శిలాఫలకాలపై ఉన్నాయనీ, వాటిని అధికారంలోకి వచ్చాకా విస్మరిస్తే నిలదీసి ప్రశ్నించాలని ప్రజలకు చెబుతున్నారు. ఇక ఎక్కడిక్కడ సమస్యలపై ఆయన స్పందిస్తున్న తీరు ప్రజలలో ఆయన ఇమేజ్ ను పెంచుతోందని పరిశీలకులు అంటున్నారు.  

టీపీసీసీ చీఫ్ కు కాంగ్రెస్ లో ఉక్కపోత.. తెలుగుదేశం గూటికి చేరే యోచన?

మల్కాజ్‌గిరి ఎంపీ, టీపీసీసీ చీఫ్   రేవంత్ రెడ్డి..  కాంగ్రెస్ పార్టీకి బై బై గుడ్ బై చెప్పేసి..  సొంత గూటికి అంటే..  తెలుగుదేశం పార్టీలోకి  దూకేస్తారా.. తెలంగాణలో సైకిల్‌ స్పీడ్ పెంచేస్తారా అంటే పొలిటికల్ సర్కిల్స్ నుంచి ఔననే సమాధానమే వస్తోంది.  వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ..  కాంగ్రెస్ పార్టీలో పొత్తు పెట్టుకొని బరిలోకి దిగుతోందంటూ ఇటీవల పెద్ద ఎత్తున చర్చ ప్రారంభమైంది. ఎన్నికలకు ముందు కాకపోయినా... ఎన్నికల తరువాత (ఒక వేళ రాష్ట్రంలో హంగ్ ఏర్పడితే.. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే రాష్ట్రంలో త్రిముఖ పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. త్రిముఖ పోటీలో ఏ పార్టీకీ అధికారాన్ని హస్తగతం చేసుకునే మెజారిటీ వచ్చే అవకాశాలు లేవనీ వినిపిస్తోంది.) అయినా   బీఆర్ఎస్, కాంగ్రెస్ లు చేయి చేయి కలుపుకుని అధికారాన్ని అందుకుంటారన్న చర్చ విస్తృతంగా సాగుతోంది. అదీకాక నిన్నటి దాకా ప్రాంతీయ పార్టీగా టీఆర్ఎస్ గా ఉన్న పార్టీ ఒక్క సారిగా బీఆర్ఎస్ గా మారిపోయి జాతీయ పార్టీ అయిపోయింది. దీంతో బీఆర్ఎస్ లక్ష్యం తెలంగాణ కాదు.. ఢిల్లీ అన్న సంకేతాలు ప్రజలలోకి బలంగా వెళ్లాయి. అందుకే రాష్ట్ర స్థాయిలోనే కాదు, జాతీయ స్థాయిలోనూ ఆ పార్టీ పొత్తులకు చేయి సాచే అవకాశాలే మెండుగా ఉన్నాయి. ఇప్పటికిప్పుడు స్పష్టత లేకపోయినా ముందు ముందు బీఆర్ఎస్, కాంగ్రెస్ లు జట్టు కట్టే అవకాశాలే పుష్కలంగా కనిపిస్తున్నాయని పొలిటికల్ సర్కిల్స్ లో గట్టిగా వినిపిసతోంది. అలాంటి తరుణంలో కేసీఆర్ ఫ్యామిలీతో కాంగ్రెస్ షేక్ హ్యాండ్ చేసినా.. రేవంత్ ఎంత టీపీసీసీ చీఫ్ అయినా కాంగ్రెస్ నిర్ణయాన్ని ఔదాలుస్తారా అన్న డౌట్లు అయితే పరిశీలకులలో వ్యక్తం అవుతున్నాయి. కేవలం డౌట్లే కాదు.. కచ్చితంగా రేవంత్ బీఆర్ఎస్ తో లేదా కేసీఆర్ తో చేతులు కలిపే పార్టీలో ఇమడ లేరనీ, బయటకు వచ్చేస్తారనీ కూడా   పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సపోజ్ ఫర్ సపోజ్ అదే జరిగితే.. రేవంత్ కు ఉన్న ఆప్షన్ ఏమిటి? అని కూడా చర్చ జరుగుతోంది. ఆ చర్చలో రేవంత్ తెలుగుదేశం గూటికి చేరడం వినా మరో ఆప్షన్ ఆయనకు లేదని కూడా అంటున్నారు.  ఇప్పటికే టీఆర్ఎస్ ప్రభుత్వాన్నే కాదు.. కేసీఆర్  ప్యామిలీని కూడా  టార్గెట్‌గా చేసుకొని విమర్శలు గుప్పించే  ఒకే ఒక్కడు రేవంత్ రెడ్డి అనే టాక్ తెలంగాణ సమాజంలోకి చాలా బలంగా వెళ్లింది. అలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ పార్టీతో హస్తం పార్టీ చెయ్యి కలిపితే.. రేవంత్ రెడ్డి..  కాంగ్రెస్ ను వీడి బయటకు రావడం ఖాయమనే వాదన బలంగా వినిపిస్తోంది.   మరోవైపు తెలంగాణలో రేవంత రెడ్డి చేపట్టిన హాత్ సే హాత్ జోడో యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోంది. అయితే రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ హై కమాండ్ టీపీసీసీ పగ్గాలు  అప్పగించడంపై పార్టీలోని సీనియర్లు  ఇటు రేవంత్ పైనా అటు పార్టీ హై కమాండ్ పైనా గుర్రుగా ఉన్నారు. వారంతా తిరుగుబాటుకు సిద్ధం కావడంతో అధిష్ఠానం గత్యంతరం లేని పరిస్థితుల్లో తెలంగాణ వ్యవహారాల ఇన్‌చార్జ్‌గా ఉన్న మాణిక్ ఠాగూర్ కు ఆ బాధ్యతలు కట్టబెట్టింది.  మహారాష్ట్రకు చెందిన మాణిక్ రావు ఠాక్రేకు ఆ బాధ్యతలు కట్టబెట్టింది. దీంతో కాంగ్రెస్ లో అసమ్మతి జ్వాల చల్లారినట్టు కనిపించినా పరిశీలకులు మాత్రం రాజుకుంటోందనే అంటున్నారు. అధిష్ఠానం మొత్తం పార్టీ సీనియర్లందరినీ నియంత్రించి పూర్తి అధికారాలు రేవంత్ కు కట్టబెట్టే పరిస్థితులైతే లేవని పరిశీలకులు సైతం అంటున్నారు. రేవంత్ పాదయాత్రకు అధిష్ఠానం నుంచి అనుమతి రావడంలో జరిగిన తీవ్ర జాప్యాన్నే అందుకు నిదర్శనగా చూపుతున్నారు.  ఈ పరిస్థితుల కారణంగానే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉక్కపోతకు గురౌతున్నారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు.  సరిగ్గా అదే సమయంలో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తోంది. టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన తరువాత తెలంగాణలో తెలుగుదేశంకు అవకాశాలు పుష్కలంగా మెరుగుపడ్డాయి. దానికి తోడు కాసాని జ్ణానేశ్వర్   తెలుగుదేశం తెలంగాణ పగ్గాలను చేపట్టిన తరువాత పార్టీ క్యాడర్ లో జోష్ పెరిగింది. ఆ పార్టీ ఖమ్మంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ ఎవ్వరూ ఊహించనంతగా సక్సెస్ అయ్యింది. దీంతో అప్పటి వరకూ స్తబ్దుగా ఉన్న కేడర్ కూడా ఒక్క సారిగా చైతన్యవంతమైంది. మరిన్ని సభలు నిర్వహించాలన్న డిమాండ్ శ్రేణుల నుంచే పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఖమ్మం సభలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, తాజాగా ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో నిర్వహించిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ణానేశ్వర్ గతంలో పార్టీలో పని చేసి వివిధ కారణాలతో ఇతర పార్టీలకు వెళ్లిన వారి కోసం తెలుగుదేశం తలుపులు తెరిచే ఉన్నాయని ప్రకటించారు. హోమ్ కమింగ్ కు వెల్ కం చెప్పారు. కాసాని జ్ణానేశ్వర్ అయితే ప్రత్యేకంగా రేవంత్ పేరు పెట్టి మరీ ఆయనకు తెలుగుదేశం స్వాగతం పలుకుతోందని చెప్పారు. ఈ నేపథ్యంలోనే.. భవిష్యత్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొత్తు కుదిరే అవకాశం ఉందని లేశమాత్రంగా భావించినా రేవంత్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పి తెలుగుదేశం గూటికి చేరడం ఖాయమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

కొలీజియం తరహాలో ఈసీల ఎంపిక.. సుప్రీం

కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ల నియామకంపై సుప్రీం కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లను ఏ ప్రాతిపదికన, ఎవరు నియమిస్తారంటూ దాఖలైన ఒక పిల్ ను విచారించిన ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది. సుప్రీం కోర్టు న్యాయమూర్తల నియామకం ఏ విధంగా అయితే కొలీజియం ద్వారా జరుగుతుందో.. అదే విధంగా ఒక ఉన్నత స్థాయి ప్యానల్ ద్వారా ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్, కమిషనర్ల నియామకం జరగాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రధాని, ప్రతిపక్ష నేత, ప్రధాన న్యాయమూర్తి తో కూడిన ప్యానెల్ ఎన్నికల కమిషనర్లను నియమించాలంటూ ఆదేశించింది. ఈ మేరకు  జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలో ఐదుగురు సభ్యులున్న కాన్స్టిట్యూషన్ బెంచ్ తీర్పు వెలువరించింది. సుప్రీంకోర్టు జడ్జిల నియామకం కొలీజయం ద్వారా సాగినట్టే ఈసీ సభ్యులు, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకం కూడా ఓ పద్ధతి ప్రకారం సాగాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) విచారించిన సుప్రీం రాజ్యాంగ ధర్మాసనం గత ఏడాది రిజర్వ్ చేసిన తీర్పు  బుధవారం వెలువరించింది.  తమకు అనుకూలురైన వ్యక్తులను ఈసీలు, సీఈసీలుగా నియమిస్తున్నారన్న ఆరోపణలు ఎప్పటినుంచో ఉన్నాయి. తాజా తీర్పుతో కేంద్రానికి ఈ విషయంలో సుప్రీం మార్గదర్శకత్వం చేసింది. రాజ్యాంగ నిపుణులు ఈ తీర్పును స్వాగతిస్తున్నారు.   కాగా ఇప్పటివరకు ఎన్నికల సంఘం  నియామకాలన్నీ   కేంద్ర ప్రభుత్వమే  చేస్తూ వచ్చింది. ఐఏఎస్ ఆఫీసర్ అరుణ్ గోయల్ ను కొత్త ఎన్నికల కమిషనర్ గా మోడీ సర్కారు నియామకం చేసిన తీరు విమర్శలకు తావిచ్చింది. గోయల్ నియామకం వివాదాస్పదమైంది. మొత్తంగా గోయల్ ను ఎన్నికల కమిషనర్ గా నియమిక ప్రక్రియ మొత్తం ఒక్క రోజులో పూర్తైపోయింది.  దీనినే సుప్రీం కోర్టు తప్పుపట్టింది. అదే సమయంలో గోయల్ అభ్యర్థిత్వాన్ని కాదనీ, తాము తప్పుపడుతున్నది అందుకు అనుసరించిన ప్రక్రియనేనని సుప్రీం అప్పట్లోనే పేర్కొంది. గత ఏడాది నవంబర్ 18న ఐఏఎస్ గా రాజీనామా చేసిన గోయెల్ ను ఆ మరుసటి రోజే కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ గా కేంద్రం నియమించిన సంగతి తెలిసిందే.  ఆ తరువాత ఒక్క రోజు వ్యవధిలోనే అంటే నవంబర్ 21నే ఆయన ఎన్నికల సంఘం కమిషనర్ గా పదవీ బాధ్యతలు చేపట్టారు.   ఇదే వివాదానికి కారణమైంది. దీనిపైనే సుప్రీం కోర్టు కేంద్రాన్ని తప్పుపట్టింది. 

అమరావతి కేసు తక్షణ విచారణకు సుప్రీం నో.. మరో సారి జగన్ సర్కార్ కు ఎదురు దెబ్బ!

జగన్ ప్రభుత్వానికి సర్కార్ లో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. అమరావతి కేసుల విచారణ త్వరగా పూర్తి చేయాలని కోరుతూ ఏపీ సర్కార్ చేసిన విజ్ణప్తిని సుప్రీం కోర్టు నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. గతంలో చెప్పిన విధంగా ఈ నెల 28నే అమరావతి పిటిషన్ల విచారణ చేపడతామని స్పష్టం చేసింది.  దీంతో సర్కార్ దిక్కు తోచని స్థితిలో పడినట్లైంది. అమరావతి రాజధానిపై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జగన్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ ను సాధ్యమైనంత త్వరగా చేపట్టాలని జగన్ సర్కార్ పదేపదే సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరుతూ వస్తున్నది. తాజాగా గురువారం (మార్చి 2) మరో సారి జగన్ సర్కార్ ఈ విషయాన్ని న్యాయస్థానం ముందుకు తీసుకురాగా కోర్టు నిరాకరించింది. గతంలో చెప్పని విధంగా ఈ నెల 28నే ఈ కేసు విచారణ చేపడతామని విస్పష్టంగా తేల్చి చెప్పింది.  హైకోర్టు తీర్పుపై స్టే తెచ్చుకోవాలని జగన్ సర్కార్ డిస్పరేట్ గా చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.  హై కోర్టు తీర్పు వెలువరించిన ఆరు నెలల పాటు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకున్న జగన్ సర్కార్ ఆ తరువాత హడావుడిగా సుప్రీం ను ఆశ్రయించి, తమ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని పదే పదే అభ్యర్థనలు చేస్తున్నది.   మరో వంక గత ఏపీ ప్రభుత్వం అమరావతిని చట్ట బద్ధంగా ఏర్పాటు చేసినట్లుగా కేంద్రం కూడా ఇప్పటికే  స్పష్టం చేసింది. ఈ మేరకు సుప్రీం కు నివేదించింది కూడా.  ఈ  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలోనే అమరావతి విషయాన్ని తేల్చేయాలన్న ఆత్రంతో ఉన్న జగన్ సర్కార్ కు  సుప్రీంలో అమరావతి కేసు ఈ నెల 28 వరకూ విచారణకు వచ్చే అవకాశం లేకపోవడం ఒకింత ఇబ్బందికరంగా పరిణమించింది.  మరో వైపు సాధ్యమైనంత త్వరగా అమరావతిని ఖాళీ చేసి విశాఖకు మకాం మార్చేయాలన్న తొందర ప్రదర్శిస్తున్న జగన్ కు ఈ కేసు విచారణ జాప్యం అవుతుండటం   అసహనానికి గురి చేస్తున్నట్లు కనిపిస్తున్నది.  అమరావతి కేసు విషయంలో సుప్రీం కోర్టు తీర్పు సంగతి తరువాత కనీసం హైకోర్టు తీర్పుపై స్టే అయినా దక్కితే చాలన్నట్లుగా జగన్ సర్కార్ తొందరపాటు ఉన్నది.  విశాఖలో ఏపీ గ్లోబల్ ఇన్ వెస్టర్ల సదస్సు నాటికి విశాఖ రాజధానిగా పాలన సాగిస్తామన్న కచ్చితమైన ప్రకటన చేయాలని ఉవ్విళ్లూరుతున్న జగన్ కు సుప్రీం కోర్టులో అమరావతి కేసు విచారణకు రాకపోవడం ఆశనిపాతంగానే మారిందని పరిశీలకులు అంటున్నారు. శుక్రవారం (మార్చి 3) నుంచి రెండు రోజుల పాటు విశాఖ వేదికగా గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. అందుకే జగన్ సర్కార్ గురువారం కూడా సుప్రీంలో ఈ కేసు విచారణ కోసం ఒక ప్రయత్నం చేసింది. అది కూడా విఫలం అయ్యింది. దీంతో గ్లోబల్ ఇన్వెస్టర్ల సదస్సులో విశాఖ రాజధాని అన్న ప్రకటన చేసే అవకాశం జగన్ సర్కార్ కు ఇక లేనట్లే. కాగా జగన్ సర్కార్ వినతిని తోసిపుచ్చుతూ జస్టిస్ కేఎం జోసెఫ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం ఈ కేసులో రాజ్యాంగపరమైన అంశాలు ఇమిడి ఉన్నాయనీ, విచారణ చేపట్టి అన్నివిషయాలూ తేలుస్తామని వ్యాఖ్యానించారు.  

విపక్షాల ప్రధాని అభ్యర్థిగా స్టాలిన్?

విపక్షాల ప్రధాని అభ్యర్థిగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్? ఈ వార్త ఒక్క సారిగా రాజకీయాలలో పెను సంచలనం సృష్టించింది. ఔను తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఎందుకు విపక్షాల ఉమ్మడి ప్రధాని ఎందుకు కాకూడదు అని జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్బుల్లా చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. బీజేపీయేతర పార్టీలన్నీ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఏకతాటిపైకి వచ్చి కేంద్రంలో మోడీ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్న ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించాయి. వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించడం ఎలా ఉన్న వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి.  అయితే విపక్షాల ఐక్యతా యత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. అదే సమయంలో వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం విపక్షాలు ఇప్పటి నుంచే చేయి చేయి కలిపి పని చేయాల్సిన అవసరం ఉందని, కాలయాపన ఇసుమంతైనా కూడదని బీహార్ సీఎం నితీష్ కూమార్ వంటి నేతలు అంటున్నారు. అంతే కాకుండా.. విపక్ష కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించాలనీ చెబుతున్నారు. కేంద్రంలో బీజేపీని దీటుగా ఎదుర్కొనాలంటే.. కాంగ్రెస్ నాయకత్వంలో జట్టుకట్టడం వినా మరో మార్గం లేదనీ నితీష్ ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ లు మాత్రం వేరేగా ఆలోచిస్తున్నారు. వారిరువురూ కూడా తమ, తమ నాయకత్వంలోనే విపక్షాల ఐక్యత ఉండాలని భావిస్తున్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్, తృణమూల్ కాంగ్రెస్ లు రెండూ కూడా ఎవరి దారి వారిది అన్నట్లుగానే వ్యవహరిస్తున్నారు. దీంతో బీజేపీయేతర పార్టీల ఐక్యత సవ్య దిశలో వెళ్లడం లేదన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. సరిగ్గా ఈ తరుణంలోనే..  ఛత్తీస్ గఢ్ రాజధాని నయా రాయ్ పూర్ వేదికగా జరిగిన కాంగ్రెస్ 85వ ప్లీనరీ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ చేసిన తీర్మానం ఐక్యతా యత్నాలను మరో అడుగు వెనక్కు తీసుకువెళ్లిందనే చెప్పాలి. కేంద్రంలో బీజేపీని గద్దె దించాలంటే.. విపక్షాలు ఏకం కావాలన్న అభిప్రాయంతో ఏ బీజేపీయేతర పార్టీకీ మరో అభిప్రాయం లేదు.. అయితే ఆ ఐక్య కూటమికి నేతృత్వం వహించేది ఎవరన్న విషయంలోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఆ భిన్నాభిప్రాయాలకు కారణం కూడా ప్రధాని పదవేనన్న విశ్లేషణల నేపథ్యంలో కాంగ్రెస్ తన విధానం ఏమిటన్నది క్లారిటీ ఇచ్చేసింది. వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టం చేసిన కాంగ్రెస్ ఆ ప్రభుత్వానికి సారధ్యం వహించేది కాంగ్రెస్ మాత్రమేనని కుండ బద్దలు కొట్టేసింది. అంటే వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ఐక్య కూటమి అధికారం చేపడితో ప్రధాని రాహుల్ గాంధీయేనన్నది ఆ పార్టీ శశభిషలకు ఆస్కారం లేకుండా స్పష్టం చేసింది.  అయితే అంతలోనే స్టాలిన్ ను ప్రధాని అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ యూపీఏ భాగస్వామ్య పక్షమైన నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత చేసిన ప్రతిపాదన విపక్షాల ఐక్యతా యత్నాలకు గండి కొడుతుందా అన్న విషయం రానున్న రోజులలో తేలుతుంది. ఇప్పటికిప్పుడైతే స్టాలిన్ ప్రధాని అన్న ప్రతిపాదనపై రాజకీయంగా చర్చ అయితే జరుగుతోంది కానీ.. ఔను, కాదు అన్న కంక్లూజన్ కు అయితే ఏ పార్టీ రాలేదు. అదే సమయంలో సహజంగానే ఈ ప్రతిపాదనపై బీఆర్ఎస్ కానీ తృణమూల్ కానీ స్పందించ లేదు. ఎందు కంటే ఆ రెండు పార్టీలూ వేటికవిగా తమతమ ప్రయత్నాలు చేసుకుంటున్నాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ స్పందన ఏమిటన్నది అందరిలోనూ ఆసక్తిగా మారింది. విపక్ష కూటమి తన సారథ్యంలోనే జరగాలని ఇప్పటికే ప్రకటించేసిన కాంగ్రెస్ తాజాగా ఈశాన్య రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలలో కనీసంగానైనా ప్రభావం చూపని నేపథ్యంలో ఇంకా ప్రధాని పదవి కోసం పాకులాడుతుందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ ఏడాదే మరో ఆరు రాష్ట్రాల అసెంబ్లీలకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ వేచి చూసే ధోరణి అవలంబిస్తుందా అన్న చర్చ కూడా సాగుతోంది. ఒక్క కాంగ్రెస్ అనే కాదు.. విపక్ష కూటమి ప్రయత్నాలు సాగిస్తున్న పార్టీలన్నీ కూడా ఉమ్మడి ప్రధాని అభ్యర్థి విషయంలో ఒక అభిప్రాయం ప్రకటించడానికి ముందు ఈ ఏడాది జరిగే తొమ్మది రాష్ట్రాల ఎన్నికల ఫలితాల వరకూ వేచి చూస్తాయన్న అభిప్రాయమే వెల్లడి అవుతోంది. స్వయంగా స్టాలినే కాంగ్రెస్ సారథ్యంలోనే విపక్ష కూటమి.. మూడో ఫ్రంట్ చర్చే వేస్ట్ అని చెప్పిన నేపథ్యంలో ఫరూఖ్ అబ్దుల్లా ప్రతిపాదనకు ఆయన ఎలా రియాక్ట్ అవుతారన్నది చూడాలి. పైగా ఫరూక్ అబ్దుల్లా ఈ ప్రతిపాదన స్టాలిన్ జన్మదిన వేడుకలలో స్టాలిన్ సమక్షంలోనే చేశారు. 

వైసీపీకి దూరంగా విజయసాయి.. ఎవరు ఎవరిని వదిలేశారు?

విజయసాయి రెడ్డి.. వైసీపీతో ఈ పేరును విడదీసి చూడటం సాధ్యం కాదన్న బావన ఇటీవలి వరకూ అందరిలోనూ ఉండేది. అంతగా విజయసాయి వైసీపీతో మమేకమై ఉండేవారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ ఆవిర్భావం నుంచి జగన్ కు కుడి, ఎడమ, ముందు, వెనుక కూడా విజయసాయే అన్నట్లుగా ఆయన హవా కొనసాగింది. కొనసాగుతుందనే అంతా భావిస్తూ వచ్చారు. జగన్ అక్రమాస్తుల కేసులో కూడా ఏ2గా జగన్ కు తోడుగానే ఉన్నారు విజయసాయి. అయితే ఇటీవలి కాలంలో ఆ పరిస్థితిలో సమూల మార్పు వచ్చిందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అనుమానాలనేమిటి? అలాగే కనిపిస్తోంది కూడా. పార్టీ కార్యక్రమాలలో విజయసాయి నీడ కూడా కనిపించడం లేదు. ఢిల్లీలో వైసీపీ ఎంపీలందరిదీ ఒక దారీ, విజయసాయి రెడ్డి ఒక్కడిదీ ఒక దారి అన్నట్లుగా ఆయన ఒంటరి అయిపోయారు. కేంద్ర మంత్రిని కలిసినా, ఏపీ కొత్త గవర్నర్ ను ప్రమాణ స్వీకారం ముందు కలిసినా విజయసాయి ఒక్కరే వెళుతున్నారు.  ఇక అన్నిటికీ మించి ఏపీ సర్కార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న ఏపీ గ్లోబల్ సమ్మిట్ పేరుతో నిర్వహించనున్న ఇన్వెస్ట్ మెంట్ సదస్సు విషయంలో కూడా విజయసాయి ప్రమేయం ఇసుమంతైనా కనిపించడం లేదు. ఆయన గడ్కరీతో ఒంటరిగా భేటీ అయ్యారు. భేటీకి కారణమడిగితే విశాఖ అభివృద్ధిపై మాట్లాడేందుకు అని అన్నారు. అయితే అదే విశాఖలో ఏపీ సర్కార్ నిర్వహించతలపెట్టిన ఇన్వెస్ట్ మెంట్ సదస్సు ఏర్పాట్ల విషయంలో విజయసాయి ప్రమేయం ఇసుమంతైనా లేదు. విజయసాయి కేవలం ఎంపీ మాత్రమే కాదు.. పార్టీ ఆవిర్భావం నుంచీ ఆయన వైసీపీకి ప్రజా సంబంధాల విషయంలో ఏకైక ప్రతినిథి కూడా. ఇక ఇటీవలి కాలం వరకూ ఆయన ఉత్తరాంధ్రకు ఇన్ చార్జ్ కూడా.  అంతేనా.. దేశ వ్యాప్తంగా ఇన్వెస్టర్లతో ఆయనకు బోలెడు సంబంధాలు ఉన్నాయి. అయినా సరే వివిధ రాష్ట్రాలలో విశాఖ సదస్సు ప్రమోషన్ల కోసం నిర్వహించిన  రోడ్ షోలలో ఆయన ఎక్కడా కనిపించలేదు. పారిశ్రామిక వేత్తల ఆహ్వానం కోసం ఏర్పాటైన బృందంలోనూ విజయసాయికి ప్రాతినిథ్యం లేదు.  ఇంత కాలం పార్టీ ఎంపీలలో వెలివేతకు గురైన వ్యక్తి రఘురామకృష్ణం రాజు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు ఆయనకు తోడుగా విజయసాయి కూడా చేరారా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో వ్యక్త మౌతున్నాయి. ఇటీవల తారకరత్న మరణం, ఆ తరువాత అంత్యక్రియల సందర్భంగా విజయసాయి బాలకృష్ణతో కలిసి అన్ని ఏర్పాట్లలోనూ పాల్గొనడం వల్లే విజయసాయిని దూరం పెడుతున్నారా అన్న చర్చ కూడా జోరుగా సాగుతోంది. అంతే కాకుండా జగన్ మెచ్చేలా ఇటీవలి కాలంలో ఆయన విపక్షంపై విమర్శలతో విరుచుకుపడటం లేదు. అది కూడా ఆయన పార్టీ వ్యవహారాలలో అంటీముట్టనట్టు ఉంటున్నారనడానికి తార్కాణంగా చెబుతున్నారు. అన్నిటికీ మించి తెనాలిలో జగన్ రైతు భరోసా కింద  మీట నొక్కి రైతుల ఖాతాలలో నిధులు జమ చేసే సమయంలో ఆయన పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఆర్థిక సహాయం అందజేసిన సందర్భాన్ని పురస్కరించుకుని విజయసాయి ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ చేసిన ట్వీట్ ఇటు పార్టీలోనే కాదు.. అన్ని వర్గాలనూ ఆశ్చర్యంలో ముంచెత్తింది. పీఎం ఒక రోజు ముందే రైతుల ఖాతాలలోకి విడుదల చేసిన నిధులకు జగన్ ఉత్తుత్తి మీట నొక్కుతున్నారన్న భావన కలిగించే విధంగా ఆయన ట్వీట్ ఉంది.  ఆ ట్వీట్ కు ముందు వరకూ వైసీపీ అధినేత జగన్ విజయసాయిని దూరం పెడుతున్నారని అంతా భావించారు. అయితే ఆ ట్వీట్ తరువాత ఎవరు ఎవరిని దూరం పెడుతున్నారు? విజయసాయి పార్టీకి కావాలనే దూరం జరిగారా? అన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే కేవలం చిన్న చిన్న వ్యవహారాలు కాదనీ, జగన్, విజయసాయిల మధ్య దూరం పెరగడానికి వెనుక ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుందన్న అనుమానాలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నాయి. అవి రాజకీయ కారణాల కంటే పెద్దవి అయి ఉంటాయన్న అనుమానాలు కూడా వ్యక్త మౌతున్నాయి. అమరావతి రాజధాని విషయంలో కేంద్రం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండే విధంగా పార్లమెంటు వేదికగా సమాధారం రావడానికి కారణం విజయసాయి ప్రశ్నే అన్న విషయాన్ని ఇప్పుడు పార్టీ శ్రేణులు గుర్తు చేసుకుంటున్నాయి.  మొత్తం మీద విజయసాయి జగన్ కు దూరం కావడం, లేదా విజయసాయినే జగన్ దూరం పెట్టడానికి కారణాలేమైనా.. ఈ పరిణామం ముందు ముందు వైసీపీనే కాకుండా.. జగన్ ను కూడా చిక్కుల్లోకి నెట్టే అవకాశం ఉందన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తమౌతోంది. ముఖ్యంగా అక్రమాస్తుల కేసులో ఏ1, ఏ2ల మధ్య అగాధంతో రానున్న రోజులలో ఏం జరుగుతుందా అన్న ఆసక్తి సర్వత్రా నెలకొని ఉంది. 

ఢిల్లీ మద్యం విధానం అమలులో లోపాలేంటి? కేజ్రీవాల్ ఎందుకు చెప్పరు?

అవినీతి వ్యతిరేక ఉద్యమ నేపథ్యంగా ఢిల్లీలో అధికారం చేపట్టిన ఆప్ ప్రభుత్వం ఇప్పుడు అదే అవినీతి ఆరోపణల ఊబిలో కూరుకుపోయింది. ఇప్పటికే ఆప్ కు చెందిన పలువురు అవినీతి ఆరోపణలపై అరెస్టయ్యారు. తాజాగా ఢిల్లీ మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టయ్యారు. అరెస్టయిన తరువాత ఆయన డిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఢిల్లీ మద్యం విధానం వివాదాస్పదం కావడంతో ఢిల్లీ ప్రభుత్వం దీనిని గత ఏడాది జూలైలోనే రద్దు చేసింది. అయితే ఈ విధానం అమలులో అవకతవకలు, అవినీతి చోటు చేసుకుం టున్నాయంటూ ఢిల్లీ లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ కేంద్రానికి ఫిర్యాదు చేయడం,  సీబీఐ విచారణకు కూడా అభ్యర్థించడంతో సీబీఐ దర్యాప్తు ఆరంభించింది. ఈ విధానం రూపకల్పన నుంచి అమలు వరకూ మనీలాండరింగ్ కూడా జరిగిందన్న అనుమానాలతో ఈడీ కూడా విచారణ ప్రారంభించింది. అసలు ఢిల్లీ నూతన మద్యం విధానం ఏమిటంటే.. మద్య విక్రయాలను పూర్తిగా ప్రైవేట్‌ వ్యక్తులకే అప్పగించడం. సరే అదలా ఉంటే.. మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసు అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రభుత్వాన్ని గత కొంత కాలంగా ఇబ్బందులు పెడుతున్న సంగతి విదితమే. సీబీఐ, ఈడీ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తుసంస్థలను విపక్షాలను వేధించడానికి కేంద్రం వినియోగిం చుకుంటోందన్న ఆరోపణలు గత కొంత కాలంగా వినిపిస్తున్న సంగతి తెలసిందే. ఇప్పుడు ఆప్ కూడా అదే ఆరోపణలు చేస్తోంది. ఆ ఆరోపణలలో వాస్తవాలు ఎంత వరకూ ఉన్నాయన్నది పక్కన పెడితే.. సీబీఐ, ఈడీ మాత్రం ఢిల్లీ నూతన మద్యం పాలసీ అమలులో జరిగిన అవకతవకలు.. వాటికి సంబంధించి తమకు అందిన ఫిర్యాదు ఆధారంగానే దర్యాప్తు చేపట్టామని సీబీఐ, ఈడీ అంటున్నాయి. ఇక మనీష్ సిసోడియాను అరెస్టు చేయడానికి కారణం ఆయన తమ విచారణకు సహకరించకుండా, సమాధానాలు దాటవేస్తుండటమే కారణమని సీబీఐ చెబుతోంది.   మరో వైపు బీజేపీ మనీష్ సిసోడియా అరెస్టు, మద్యం కుంభకోణం దర్యాప్తులో భాగమేననీ, అందులో తమ ప్రమేయం ఏముందని ప్రశ్నిస్తోంది. మొత్తంగా ఆప్ ఆరోపణలు, సీబీఐ వివరణ, బీజేపీ చట్టం తన  పని తాను చేసుకుపోతుందంటూ చెప్పడం వేటికవిగా చూస్తే అన్నీదేని పని అది చేసింది... అనే అనిపిస్తుంది. కానీ ఒక్క మద్యం కుంభకోణం అని కాదు కానీ.. గత కొన్నేళ్లుగా దర్యాప్తు సంస్థలు బీజేపీయేతర ప్రభుత్వాలు, నాయకులు లక్ష్యంగానే పని చేస్తున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఆరోపణలపై వివరణ ఇచ్చుకోవలసినది కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కారే అనడంలో సందేహమే లేదు. ఎందు కంటే.. ఇవే రకమైన ఆరోపణలను ఎదుర్కొంటున్న బీజేపీ నాయకులపై ఈడీకానీ, సీబీఐ కానీ దృష్టి సారించిన దాఖలాలు కనిపించడంలేదు.  ఆ కారణంగానే  విపక్షాల విమర్శలకు, ఆరోపణలకు బీజేపీ వివరణ ఇచ్చుకోవాలన్న డిమాండ్ కు మద్దతు పెరుగుతోంది. విపక్షాలే కాదు.. సామాన్య జనం సైతం ఏ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేపట్టినా.. ఏదో రాజకీయ కారణం ఉందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం కుంభకోణంలో మనీష్ సిసోడియా అరెస్టును కూడా రాజకీయంగానే చూస్తున్నారు. అయితే మద్యం కుంభకోణం వ్యవహారంలో ఆప్ సైతం కొన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చుకోవలసిన అవసరం ఉంది. అలా సమాధానం చెప్పకుండా... రాజకీయ కక్షతోనే దర్యాప్తు సంస్థల అరెస్టులు అని విమర్శలు గుప్పించినంత మాత్రాన ఢిల్లీ నూతన మద్యం విధానంపై వచ్చిన ఆరోపణలు, అనుమానాలు నివృత్తి అయిపోయినట్లు కాదు. ఢిల్లీ ప్రభుత్వం అమలులోకి తీసుకువచ్చిన నూతన మద్యం విధానాన్ని అమలులో లోపాలున్నాయంటూ గత ఏడాది జులైలో ఎందకు రద్దు చేసింది. ఆ  ఆ లోపాలేమిటో మాత్రం వెల్లడించలేదు. ఇప్పుడు ఈ మద్యం కుంభకోణంలో ఏకంగా ఉప ముఖ్యమంత్రే అరెస్టయిన నేపథ్యంలో అమలులో లోపాలేమిటన్నది ప్రజలకు వివరించాలి. అందుకే మద్యం కుంభకోణం విషయంలో సీబీఐ విశ్వసనీయత ఎలా ప్రశ్నార్థకంగా ఉందో.. మనీష్ సిసోడియా విశ్వసనీయత కూడా అలాగే ప్రశ్నార్థకంగా మారింది. అన్ని రకాలుగా మనీష్ సిసోడియాను సమర్ధిస్తూ వచ్చిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా మనీష్ సిసోడియా రాజీనామాను క్షణం ఆలస్యం చేయకుండా ఆమోదించడం, ఇదే కేసులో ఇప్పటికే అరెస్టై జైలులో ఉన్న మరో మంత్రి కూడా ఇప్పుడే, అంటే మనీష్ సిసోడియా అరెస్టై, తన ఉపముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన తరువాతే రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్తున్నాయి.