బీజేపీకి కన్నా రాజీనామా.. 26న తెలుగుదేశంలో చేరిక

భారతీయ జనతా పార్టీ, ఏపీ శాఖ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి రాజీనామా చేశారు. ఆయన ఈ నెల 26న తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. అయితే ఆయన నిర్ణయం పెద్దగా ఆశ్చర్యం కలిగించక మానదు. ఎందుకంటే.. ఇప్పుడు ఆయన రాజీనామా వార్త విన్న వారంతా.. కన్నా ఇప్పటి వరకూ బీజేపీలోనే ఉన్నారా? అని ఆశ్చర్య పోతున్నారు.  ఎందుకంటే కన్నా చాలా కాలంగా బీజేపీతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే ఏపీ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి ఆయన వైదొలగిన నాటి నుంచీ  పార్టీ వ్యవహారాలకు   దూరంగా అంటీ ముట్టనట్లుగానే ఉంటున్నారు.  నిజానికి ఒక్క కన్నా అనే కాదు  రాష్ట్ర విభజన తర్వాత కట్టకట్టుకుని కాషాయం గూటికి  చేరిన కాంగ్రెస్ మాజీ నేతలు చాలా మంది 2019 తర్వాత సైడైపోయారు.   కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి కటీఫ్ చెప్పేసి తెలుగుదేశం, లేదా జనసేన లో చేరుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఆయన రాజీనామా చేసి తెలుగుదేశం గూటికి చేరనున్నడంతో ఆ ప్రచారానికి తెరపడింది. వాస్తవానికి గత కొంత కాలంగా కన్నా రాష్ట్ర బీజేపీ  తీరుపై  చేస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు ఆయన దారి ఎటు అన్నది చెప్పకనే చెప్పేశాయి.  వచ్చే ఎన్నికలలో ఆయన తెలుగుదేశం, జనసేన కూటమికి చేరువౌతారని ఇప్పటికే నిర్ధారణ అయిపోయింది కూడా.  ఇటీవల ఢిల్లీలో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావే శాలకు కన్నా హాజరు కాలేదు. అలాగే గత నెల  24న భీమవరంలో   జరిగిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకూ  డుమ్మా కొట్టారు.  ఆ రోజు బీజేపీ నేతలంతా భీమవరంలో ఉంటే కన్నా మాత్రం వ్యక్తిగత  పనులు అంటూ  హైద్రాబాద్ లో ఉన్నారు.  అప్పుడే రాజకీయ విశ్లేషకులు   కన్నా కమలాన్ని వీడిన ట్లేనని తేల్చేశారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చేతులు కలిపిన నేపధ్యంలో కన్నా అయితే టీడీపీలో కాదంటే జనసేనలో చేరడం ఖాయమని కూడా విశ్లేషించారు. వాస్తవానికి బీజేపీకి కన్నా గుడ్ బై చెప్పేందుకు గ్రౌండ్ గత  ఏడాది డిసెంబర్ లోనే గ్రౌండ్ ప్రిపేర్ అయ్యింది.   జనసేన రాజకీయ వ్యవహారాల  కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్  కన్నా లక్ష్మీనారాయణ ఇంటికి వెళ్లి ఆయనతో భేటీ అయ్యారు.  అ పాత మిత్రులం  కదా  అందు  ఓ సారి  కలిసి కబుర్లు చెప్పు కున్నాం. ఈ భేటికి రాజకీయ ప్రాధన్యత లేదని  అటు నాదెండ్ల, ఇటు కన్నా కూడా అప్పట్లో చెప్పినా వారి మాటలను ఎవరూ విశ్వసించలేదు.   అప్పట్లోనే జనసేనలో  కన్నా లక్ష్మీనారాయణ  చేరిక అంటూ ప్రచారం జరిగింది. ఇంతకీ బీజేపీలో కన్నా ఉక్కపోతకు కారణం ఎవరంటే మాత్రం కచ్చితంగా సోము వీర్రాజే అని ఎవరైనా ఇట్టే చెప్పేస్తారు.  కన్నా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా  ఉన్న సమయంలో  నియమించిన ఆరు  జిల్లాల అధ్యక్షులను సోము వీర్రాజు  తొలగించారు. దీంతో  అంతవరకూ కొంత సైలెంట్ గా ఉన్న కన్నా ఒక్కసారిగా భగ్గుమన్నారు. రాష్ట్రంలో బీజేపీ బలోపేతం కాకపోవడంతో పాటు  జనసేనతో    సంబంధాలు బలహీనం అవ్వడానికి కూడా   సోము వీర్రాజ  వైఖరే కారణమని  కన్నా కుండ బద్దలు కొట్టారు. సోము వీర్రాజు వైఖరిని కన్నా లక్ష్మీనారాయణ  బహిరంగంగానే  తప్పుబట్టారు.  కన్నా లక్ష్మీనారాయణ విమర్శలపై సోము వీర్రాజు స్పందించలేదు. రాష్ట్రంలో  ఏం జరుగుతుందో  పార్టీ అధిష్టానానికి తెలుసునని వీర్రాజు అప్పట్లోనే వ్యాఖ్యలు చేశారు. ఈ నేపధ్యంలో కన్నా బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు డుమ్మా కొట్టినప్పుడే బీజేపీలో ఆయన కౌంట్ డౌన్  స్టార్ట్ అయిందని, ఆ తరువాత  రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన గైర్హాజరు కావడంతో   ఆయన పార్టీ మారడం ఖాయమని అప్పట్లోనే నిర్ధారణ అయ్యింది.  అయితే కన్నా ఏ పార్టీలో, ఎప్పడు చేరుతున్నారు అన్నదే తేలాల్సి ఉందని పరిశీలకుల పేర్కొన్నారు.  ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవల ఢిల్లీ నుంచి బీజేపీ సీనియర్ నాయకుడు ఒకరు   కన్నాకు ఫోన్ చేసి బుజ్జగించే ప్రయత్నాలు చేసినా అవేమీ ఫలించలేదని తెలుస్తోంది.  అయితే, ఇ బుజ్జగింపులకు ముందే  కన్నా ఒక నిర్ణయానికి వచ్చేశారనీ, త్వరలోనే   నిర్ణయాన్ని ప్రకటిస్తారని అప్పటి నుంచీ వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇప్పుడు ఆ ప్రచారమే నిజమైంది. కన్నా బీజేపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రకటించారు. సత్తెన పల్లిలో ఈ నెల 26న కన్నా తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.  ప్రస్తుతం బీజేపీలోనే ఉన్నా లేనట్టుగానే ఉంటున్న  మరి కొందరు మాజీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు కూడా కన్నా బాటలోనే నడిచే అవకాశాలు ఉన్నాయనీ రాజకీయ పరిశీలకులు అంటున్నారు. 

వైసీపీ ప్రభుత్వ పెద్దల మైండ్ దొబ్బింది.. రఘురామకృష్ణం రాజు

నరం లేని నాలుక ఏమైనా మాట్లాడుతుంది.. ఆ మాటలతో మాట్లాడిన వారికేం సంబంధం లేదు అన్నట్లుగా ఉంది రాజధాని విషయంలో అధికార వైసీపీ నేతలు, మంత్రులు, సలహాదారులు మాట్లాడుతున్న మాటలు. ఏ నిముషానికి ఎవరేం మాట్లాడతారో తెలియక ఆ పార్టీ శ్రేణుల్లో అయోమయం నెలకొంది. ఎవరు చెప్పింది నమ్మాలో తెలియక తలలు బద్దలు కొట్టుకుంటున్న పరిస్థితి. పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్న వ్యక్తులే పరస్పర విరుద్ధంగా మాట్లాడుతుంటే.. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి జగన్ నోరు మెదకపోవడం చూస్తుంటే.. ఈ గందరగోళ వ్యాఖ్యల వెనుక ఏదో వ్యూహం ఉందన్న అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. జగన్ సర్కార్ తీరు రాజధాని విషయంలో అయోమయం సృష్టించి పబ్బం గడుపుకోవడమే ఆ వ్యూహం అన్న అనుమానాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మూడు రాజధానులు అన్నది  మిస్ కమ్యూనికేషన్ అని, విశాఖపట్నం మాత్రమే ఏపీ రాజధాని అని రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెబితే.. అందుకు పూర్తి భిన్నంగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అధికార వికేంద్రీకరణ లక్ష్యంగా జగన్ మూడు రాజధానుల కు కట్టుబడి ఉన్నారని చెబుతూ.. అయితే రాజధాని అన్న పేరు లేకపోవచ్చు కానీ విశాఖతో పాటు అమరావతి, కర్నూలు కూడా రాజధానులేనని, అమరావతి శాసన రాజధాని, కర్నూలు న్యాయరాజధాని అని చెప్పి, వాటినీ అభివృద్ధి చేస్తామనీ సన్నాయినొక్కులు నొక్కుతున్నారు.     బుగ్గన ఏ సందర్భంలో విశాఖ ఒక్కటే రాజధాని అని  చెప్పాలో తెలియదని..  వైజాగ్ లో సచివాలయం, అమరావతి లో  అసెంబ్లీ, కర్నూలులో హై కోర్ట్ కర్నూలు  ఇదే మా విధానం అని మీడియాకు చెప్పారు.  అయితే సుప్రీం కోర్టులో మాత్రం ప్రభుత్వం న్యాయరాజధాని అనేదే లేదని విస్పష్టంగా చెప్పేసింది. విశాఖలో జరిగే గ్లోబల్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా బుగ్గన, అంతకు ముందు ఢిల్లీలో సీఎం జగన్ విశాఖపట్నం మాత్రమే ఏపీ రాజధాని అని విస్పష్టంగా చెప్పారు. రోజుల వ్యవధిలో పార్టలోని ముగ్గురు కీలక నేతల నోటి వెంట రాజధాని విషయంలో వచ్చిన ఈ భిన్న ప్రకటనలు దేనికి సంకేతం?   పార్లమెంట్ చట్టం ద్వారా ఏర్పాటు చేసిన రాజధానిని,  తిరిగి పార్లమెంటు చట్టం ద్వారానే మార్చడానికి వీలవుతుంది కానీ, బుగ్గన, సజ్జల, ధర్మాన ప్రసాదరావు లు చెప్పిన విధంగా కాదని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. ఏపీ ప్రభుత్వం, మంత్రులు, ముఖ్యమంత్రులు అందరూ కూడా స్థిరత్వంలో అస్దిరత్వం అన్న వింత విధానాన్ని అనుసరిస్తున్నారని ఎద్దేవా చేశారు రఘురామకృష్ణం రాజు. రచ్చబండలో భాగంగా బుధవారం (ఫిబ్రవరి 15)  మీడియతో మాట్లాడిన రఘురామరాజు  రాజధాని విషయంలో మంత్రుల మాటలు చూసి ప్రజలు మాత్రం ప్రభుత్వ పెద్దల మైండ్ దొబ్బిందని అంటున్నారని ఆయన అన్నారు.  రాజధాని కేసు సుప్రీంకోర్టులో పెండింగ్ లో ఉందని, ఈనెల 23వ తేదీ నుంచి వాదనలు ప్రారంభం కానున్నాయని గుర్తు చేశారు. సుప్రీం కోర్టులో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తన అఫిడవిట్ దాఖాలు ద్వారా, అమరావతే రాజధాని అని స్పష్టం చేసిందన్నారు.   రాష్ట్ర మంత్రులు మాట్లాడుతున్న మాటలను చూసి, అమరావతి రైతులు నవ్వుకోవాలి తప్పితే, ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఓటమి భయంతో ప్రభుత్వ పెద్దలు సంధి ప్రేలాపనలు చేస్తున్నారని విమర్శించారు.  

బీహార్ సీఎం నితీష్ యూటర్న్.. ప్రశ్నార్థకంగా విపక్షాల ఐక్యత?

సార్వత్రిక ఎన్నికల వేడి పెరుగుతున్న కొద్దీ విపక్షాల ఐక్యతారాగం శృతి తప్పుతోంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని గద్దెదించడమే లక్ష్యంగా బీజేపీయేతర పార్టీల ఐక్యత ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతోంది. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లోని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలలో మునిగిపోయి.. కేంద్రానికి వ్యతిరేకంగా తమతమ తమ అస్త్ర శస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. అదే సమయంలో కేంద్రంలోని మోడీ సర్కార్ కు వ్యతిరేకంగా జట్టుకట్టేందుకు ప్రయత్నాలు కూడా షురూ చేశాయి. అయితే బీజేపీయేతర పార్టీలలో సైద్ధాంతిక విభేదాలను పక్కన పెడితే.. ఆయా పార్టీలలో పరస్పర విశ్వాసం, నమ్మకం కొరవడిన పరిస్థితి కనిపిస్తోంది. విపక్షాల ఐక్యతకు కెటలిస్టుగా ఉంటారనుకున్న బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్  ఇప్పుడు  యూటర్న్ తీసుకున్నారన్న వార్తలు.. విపక్షాల ఐక్యతకు పెద్ద అవరోధంగా మారాయి. నితీష్ కుమార్  అమిత్ షా ల మధ్య ఫోన్ సంభాణన కు సంబంధించి వార్తలు రాజకీయ ప్రకంపనలు సృష్ఠిస్తున్నాయి.  ఎన్డీయే కూటమి నుంచి గత ఏడాది బయటకు వచ్చి.. బీజేపీకి వ్యతిరేకంగా గళం ఎత్తిన నితీష్ అంతలోనే ప్లేట్ ఫిరాయించారన్న ప్రచారం జోరుగా సాగుతోంది.  నితీష్ కుమార్ తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో కలిసి బీజేపీ వ్యతిరేక శక్తులన్నిటినీ ఏకం చేసేందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నారన్న ప్రచారం జరుగుతున్న తరుణంలో బీహార్ సీఎం కమలం గూటికి చేరేందుకు అడుగులు వేస్తున్నారన్న ప్రచారం విపక్షాల ఐక్యతకు ఆదిలోనే హంసపాదుగా మారింది. కేంద్రం ఇటీవల 12 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమిచిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే బీహార్ కూ కొత్త గవర్నర్ ను నియమించింది. బీహార్ కొత్త గవర్నర్ గా విశ్వనాథ్ రాజేంద్ర అర్లేకర్ నియమితులయ్యారు. ఇంత వరకూ బానే ఉంది. బీహార్ కు కొత్త గవర్నర్ నియామకం విషయం చెప్పేందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వయంగా సీఎం నితీష్ కుమార్ కు ఫోన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా నితీష్ కుమారే మీడియాకు చెప్పారు. ఇక్కడే నితీష్, బీజేపీల కుమ్మక్కు అనుమానాలు వెల్లువెత్తాయి. బీజేపీయేతర ప్రభుత్వం ఉన్న రాష్ట్రానికి కొత్త గవర్నర్ నియామకం విషయం కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎందుకు ఫోన్ చేసి మరీ బీహార్ సీఎంకు చెప్పారన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. పైగా నితీష్ కుమార్ బీజేపీకి ఆషామాషీగా గుడ్ బై చెప్పలేదు. తన నేతృత్వంలో బీహార్ లో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వాన్ని కూలదోసి, తాను స్వయంగా ఎన్డీయే కూటమి నుంచి బయటకు వచ్చి బీజేపీకి బద్ధ శత్రువైన ఆర్జేడీ, కాంగ్రెస్ లతో మహాఘట్ బంధన్ పేర సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ కు అమిత్ షా ఫోన్ చేసి మరీ కొత్త గవర్నర్ నియామకం విషయం చెప్పడం వెనుక ఉన్న రహస్యం ఏమిటని రాజకీయ వర్గాలలో చర్చ జోరందుకుంది. బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పార్టీల ఐక్యత కోసం నితీష్ కుమార్ స్వయంగా జాతీయ స్థాయిలో పలువురు నేతలను కలిశారు. అవి ఎంత వరకూ సఫలమయ్యాయన్న విషయాన్ని పక్కన పెడితే.. జాతీయ స్థాయిలో విపక్షాల ఐక్యతకు గండి కొట్టేందుకు బీజేపీ నితీష్ కుమార్ ను మళ్లీ కమలం గూటికి అంటే ఎన్డీయేలోకి తీసుకువచ్చేందుకు పావులు కదుపుతోందా అన్న అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. నితీష్ కుమార్ విషయంలో విపక్షాలలో అనుమానాలు వ్యక్తం అయ్యేలా చేస్తున్నాయి. ఎందుకంటే నితీష్ కుమార్ పరిస్థితులను బట్టి దోస్తానీ, కటీఫ్ లు చెప్పడంలో ఆరితేరిన దిట్ట అన్నది అందరికీ తెలిసిన విషయమే. ఈ నేపథ్యంలోనే  నితీష్ కుమార్‌కు అమిత్ షా కాల్ పట్ల బీజేపీయేతర పార్టీల నేతలలో శంక మొదలైంది. అయితే జేడీయూ అధికార ప్రతినిథి మాత్రం నితీష్ మళ్లీ ఎన్డీయే గూటికి అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. నితీష్ కుమార్, జేడీయూ సంకీర్ణ ధర్మానికి కట్టుబడి ఉన్నాయన్నారు. బీజేపీ ముక్త భారత్ కోసం నితీష్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని వివరించారు. 

డామిట్ .. బీఆర్ఎస్ కథ అడ్డం తిరిగింది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్  రాజకీయ వ్యూహరచనలో ఆరి తేరిన దిట్ట. ఎత్తుకు పైఎత్తులువేసి ప్రత్యర్ధులను చిత్తు చేయడంలో ఆయనకు ఆయనే సాటి...  అయితే, ఇదంతా  నిన్నటి వైభోగం. ఈ రోజు ఆయన ఏమిటో, ఏమి చేస్తున్నారో ఆయనకే అర్థమవుతున్నట్లు లేదు. ఆయన ముందులా స్థిరంగా స్థిమితంగా ఏ విషయం పైనా దృష్టి కేంద్రీకరించలేక పోతున్నారు. ఒకడుగు అటు ఒకడుగు ఇటు వేసి చివరకు ఎటు కాకుండా తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీలో క్యాడర్  లో గందరగోళం ఏర్పడుతోంది. ఇది ఎవరో పరాయి వాళ్ళో  ప్రతిపక్షాలో చేస్తున్న ఆరోపణ కాదు. ముఖ్యమంతి కేసీఆర్  ఇన్నర్ సర్కిల్ లోని కీలక నేతలే  ఆఫ్కోర్స్ ఆఫ్ ద రికార్డ్ అనుకోండి.. ఇలాటి వ్యాఖ్యలు చేస్తున్నారు.  ఇటీవల ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆయన ఒకటికి రెండు సార్లు తన డొల్ల తనాన్ని బయట పెట్టుకున్నారని పార్టీ నేతలే పేర్కొంటున్నారు. ముఖ్యంగా, బీఆర్ఎస్ (టీఆర్ఎస్) బహిష్కృత నేత, మాజీ మంత్రి, ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్  విషయంలో ఆయన తీసుకున్న యూ టర్న్, పార్టీ ఇమేజ్ ని బాగా డ్యామేజి చేసిందని అంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి కేసేఆర్  ఈటల పేరు తీసుకున్నప్పుడు, సభలో ఉన్న పార్టీ ఎమ్మెల్యేలకు  ఆయన ‘అంతరంగం’ అర్థం కాలేదు. ఆయన ఏదో సైటైరిక్ గా ఈటలపై వ్యంగ బాణాలు విసురుతున్నారని భావించారు. అందుకే ఎమ్మెల్యేలు ఒకరి వెంట ఒకరు ఫక్కున నవ్వారని  అయితే ముఖ్యమంత్రి ఒకటికి పదిసార్లు ఈటలను పొగడ్తలతో ముంచెత్తిన తర్వాత గానీ, అసలు విషయం అర్థం కాలేదని అంటున్నారు. అర్థమైన తర్వాత  ఈటలతో ముఖ్యమంత్రి కేసీఆర్ సయోధ్య కోరుకుంటున్నారనే విషయం అర్థమై, విస్తు పోయామని అంటున్నారు. అలాగే  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో హైలైట్ గా నిలిచిన ఈటల ఎపిసోడ్   విషయంలో, పార్టీ నాయకులు మీడియా ముందు చిలక పలుకులు పలుకులు పలుకుతున్నా వ్యక్తిగత చర్చల్లో మాత్రం ఈటల ఎపిసోడ్  కేసేఆర్  ఇమేజ్ ని, పార్టీ ఇమేజ్ ని  గట్టిగా  దెబ్బతీసిందని  పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఈటల విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయం పర్యవసానంగానే ఈరోజు అధికారం చేజారే పరిస్థితి వచ్చిందని  కొంచెం చాలా ఆలస్యంగా ముఖ్యమంత్రి గుర్తించారని అంటున్నారు.    మరోవంక ఈటల రాజేందర్  ను టీఆర్ఎస్ (బీఆర్ఎస్) నుంచి బహిష్కరించడం, ఆ తర్వాత కేంద్రంతో కయ్యానికి కాలు దువ్వడం కేసీఆర్ చేసిన రెండు చారిత్రక తప్పిదాలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. నిజానికి  ఈటలను మెడ పట్టి బయటకు గెంటిన తర్వాతనే భారాస కష్టాలు మొదలయ్యాయి. కేసేఆర్ అడుగులు తడబడడం వ్యూహాలు దెబ్బతినడం మొదలైందని, ఇక అక్కడి నుంచి తప్పు వెంట తప్పు దొర్లుతూ వస్తోందని అంటున్నారు. ఈ అన్నిటి పర్యవసానంగానే, ఈ రోజు ఒక్క కేసేఆర్ మాత్రమే కాదు, కేటీఆర్, హరీష్ రావు కూడా శాసన సభలో ఈటలను పొగిడి ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేయవలసి వచ్చిందని పార్టీ సీనియర్ నాయకులు అంటున్నారు.  అదలా ఉంటే జాతీయ రాజకీయాల విషయంలోను కేసీఆర్ చరిత్రక తప్పిదమన దగ్గ తప్పిదం  చేశారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ప్రస్థానం ఒకడుగు ముందుకు నాలుగు అడుగులు వెనక్కి అన్నట్లు సాగుతోంది. నిజానికి, కాంగ్రెస్ ను కాదని, జాతీయ రాజకీయాల్లో బీజేపీ వ్యతిరేక వేదిక ఏర్పాటు అయ్యే పని కాదు, అందుకే కేసీఆర్ ఎన్నిగడపలు తొక్కినా శరద్ పవార్ మొదలు తేజస్వీ యాదవ్ వరకు ఎందరితో  మంతనాలు జరిపినా   ప్రయోజనం లేకుండా పోయింది. చివరకు జాతీయ రాజకీయాల్లో మనుగడ కోసం పార్టీ పేరు మార్చుకున్నా అదీ ఆశించిన ఫలితం ఇవ్వలేదు. దేశం మొత్తంలో ఎక్కడా కూడా తీసేసిన తసిల్దార్లు తప్ప సత్తా ఉన్నా నాయకుడు ఎవరూ బీఆర్ఎస్ చెంతకు రాలేదు. అందుకే, పార్టీ పేరు మార్పు వలన ఒక విధంగా రెంటికీ చెడిన రేవడిలా ఉభయ భ్రష్టత్వం నెత్తికి ఎత్తుకున్నట్లు అయిందని అంటున్నారు. అందుకే కామోసు, బీఆర్ఎస్ గా మారిన టీఆర్ఎస్ ప్రస్థానం, రాజకీయాల్లో ఆత్మహత్యలే కానీ, హత్యలుండవు, అనే నానుడిని మరో మారు రుజువు చేస్తున్నట్లుగా ఉందని అంటున్నారు.

మోదీ సర్కార్ ముద్దుబిడ్డ జగన్!?

అయిన వారికి ఆకుల్లో, కాని వారికి కంచాల్లో .. ఇది చాలా పాత సామెత. అయితే, రాజ్యాంగ వ్యవస్థలు కూడా అలాగే వ్యవహరిస్తాయా? కేంద్ర ప్రభుత్వానికి అణిగి మణిగి, ప్రధాని మోదీ ఇతర కేంద్ర పెద్దల అడుగులకు మడుగులొత్తే ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల విషయంలో ఒకలా ఇతర రాష్ట్రాల విషయంలో మరోలా రాజ్యాంగ వ్యవస్థలు వ్యవహరిస్తాయా? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్. తెలంగాణ నూతన సచివాలయ భవనం ప్రారంభోత్సవానికి  ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్  అడ్డుపెట్టి కేంద్ర కేంద్ర ఎన్నికల సంఘం మొకాలడ్డింది. కానీ, పొరుగు రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్ లోనూ మండలి ఎన్నికల షెడ్యూలు విడుదలైనా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  కడప ఉక్కు ఫ్యాక్టరీ  శంకుస్థాపనకు(అది కూడా నాలుగో సారి) మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఇది  రాష్ట్రాల మధ్య వివక్ష కాదా, అని తలసాని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించారు.   అవును  సచివాలయం ప్రారంభోత్సవానికి అడ్డుపడిన కేంద్ర ఎన్నికల సంఘం తీరుపై  మంత్రి తలసాని తమ సహజ ధోరణిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్ కడపలో ఉక్కు కర్మాగారానికి బుధవారం (ఫిబ్రవరి 15) శంకు స్థాపన చేశారు.  అందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. కానీ, తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవానికి మాత్రం ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వలేదని మంత్రి ఆరోపించారు. నిజానికి, కడప  జిల్లాలో కూడా ఎన్నికల కోడ్ అమలులో ఉందని.. అలాంటప్పుడు అక్కడ శంకుస్థాపన కార్యక్రమానికి అనుమతి ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వనికి అనుమతి ఇవ్వడాన్ని తాము తప్పు పట్టడం లేదని, రాజ్యాంగ వ్యవస్థలు ఎలా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నాయో తెలిపేందుకు ఇదొక ఉదహరణ మాత్రమే తలసాని చిన్నపాటి వివరణ కూడా ఇచ్చారు.  తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కొత్త సచివాలయ ప్రారంభోత్సవాన్ని ఈ నెల 17 చేపట్టాలని భావించింది. ఇందుకోసం పెద్ద ఎత్తున ఏర్పాట్లు కూడా చేసుకుంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో వచ్చింది. రాష్ట్రంలో టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు, హైదరాబాద్ లో లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. మహబూబ్ నగర్ , రంగారెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ స్థానానికి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలకు సంబంధించిన షెడ్యూల్‌ను ఈసీ ప్రకటించింది. అదే విధంగా హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కూడా షెడ్యూల్ ప్రకటించింది. గురువారం (ఫిబ్రవరి 16) నోటిఫికేషన్ వెలువడనుంది. మార్చి 13న ఎన్నికలు జరుగన్నాయి. మార్చి 16న ఫలితాలు వెలువడనున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో నూతన సచివాలయ ప్రారంభోత్స తేదీని ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.  నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి ఈసీని అనుమతి కోరింది. కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో ఈ నెల 17న జరగాల్సిన నూతన సచివాలయ ప్రారంభోత్సవాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. త్వరలోనే కొత్త తేదీని ప్రకటిస్తామని వెల్లడించింది. అయితే తాజాగా ఎన్నికల కోడ్ అమలులో ఉండగా కూడా ఏపీ సీఎం జగన్ కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం.. అందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇవ్వడం వంటి అంశాలను ప్రస్తావిస్తున్న బీఆర్ఎస్.. ఎన్నికల సంఘం ఒక్కొక్కరి విషయంలో ఒక్కోలా వ్యవహరిస్తోందని అసంతృప్తి వ్యక్తం చేసింది. నిజమే, ఈ ఒక్క విషయంలోనే కాదు, అడ్డగోలు అప్పులకు అనుమతి ఇచ్చే విషయంలో అయితే నేమీ, కోర్టు కేసుల  విషయంలో వెసులుబాటు కల్పించే విషయంలో అయితే నేమీ, ప్రధాని ఇతర కేంద్ర మంత్రుల అపాయింట్ మెంట్ విషయంలో అయితే నేమి, ఇతరత్రా వ్యవహారాల విషయంలో అయితే నేమీ, కేంద్ర ప్రభుత్వం, ఏపీ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని, ఇతర బీజేపీయేతర ముఖ్యమంత్రుల కంటే కొంచెం ఎక్కువగా చూస్తోందనేది నిజం. అయితే అందుకు కారణం కూడా లేక పోలేదు. కేసేఆర్ లేదా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ , పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ లాగా  జగన్ రెడ్డి కేంద్రం కట్టు దాటడం లేదు.  అసలు కేంద్రాన్ని పల్లెత్తు మాటైనా అనని ‘మంచి’ ముఖ్యమంత్రిగా ముద్ర వేసుకున్నారు. పాదాభివందనాలు, సాష్టాంగ సంస్కారాల, వంగి వంగి దండాలు పెట్టే విషయంలో ఆయన ఏ మాత్రం భేషజాలు పోరు.  సో...  కేంద్ర ప్రభుత్వం జగన్ రెడ్డి, ఏపీ ప్రభుత్వం పట్ల ప్రత్యేక ప్రేమ చూపుతోంది అనుకోవచ్చు. అయితే, ఎన్నికల సంఘం వంటి రాజ్యంగ వ్యవస్థలు కూడా ఇలా జీ హుజూర్. అనవచ్చునా...?

అత్మవంచన పరనింద!

నిజమే కావచ్చు...  ప్రజల జ్ఞాపక శక్తి తక్కువే కావచ్చును, కానీ, నడుస్తున్న చరిత్రను, పడుతున్న కష్టాలను కూడా ప్రజలు మరిచి పోతారు, నాకే జై కొడతారని ఎవరైనా అనుకుంటే, అలాంటివారు అయితే మంద బుద్దులో, మరొకటో అవుతారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రెంటిలో ఏ కోవలోకి వస్తారో ఏమో కానీ, ‘నువ్వే మా నమ్మకం’ అని ఆయనకు ఆయనే ప్రచారం చేసుకోవడం, ఇంటింకీ వెళ్లి స్టిక్కర్లు అంటించడం చూస్తుంటే, ఆయన కళ్ళకు గంతలు కట్టుకున్నారా? ఇంకేమైనా కారణంగా ఆయన తన ముందు జరుగుతున్న నిర్వాకాన్ని  చూడలేకపోతున్నారా? అంటే సమాధానం చెప్పడం కష్టమే కానీ, జగన్ రెడ్డి భ్రమల్లో బతుకుతున్నారని మాత్రం నిస్సందేహంగా చెప్ప వచ్చునని రాజకీయ పండితులు పేర్కొంటున్నారు.   నిజానికి రాష్ట్రంలో ప్రభుత్వ వ్యతిరేకత ఇప్పటికే  పతాక స్థాయికి చేరింది. గడప గడపకు.. ప్రచారంలోనే ప్రజాగ్రహం కట్టలు తెంచుకుంది. అయితే, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన చేతికి మట్టి అంటకుండా గడప గడప వ్యతిరేకతను ఎమ్మెల్యేల ఖాతాలో చేర్చి వారిని బలిపశువులను చేసేందుకు... గడపగడప నివేదికలను సిద్ధం చేసుకున్నారు. నిజమే  ఎమ్మెల్యేల పట్ల  స్థానికంగా వ్యతిరేక ఉన్నమాట నిజం. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం దిగమింగే దౌర్భాగులు ఎమ్మెల్యేలు అయినా, మంత్రులు అయినా మరొకరు అయినా సహజంగానే అలాంటి వారిని ప్రజలు అసహ్యించుకుంటారు. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా వరకు ఇసుక మాఫియా, మరో మాఫియాలో మునిగి తెలుతున్నవారే అనే ఆరోపణలు వస్తున్నపుడు.. ఎమ్మెల్యేల పై స్థానికంగా వ్యతిరేకత భగ్గుమంటుంది. అందులో సందేహం లేదు. ఆ కోణంలో చూసినప్పడు, ముఖ్యమంత్రి పాయింటవుట్  చేసిన 40 మందో 50 మందో ఎమ్మెల్యేల పై మాత్రమే కాదు, అధికార పార్టీ పార్టి ఎమ్మెల్యే ఎదో ఒక అవినీతి కుంభకోణంలో ఇరుకుని ప్రజాగ్రహాన్ని ఎదుర్కుంటున్న వారే అయితే కావచ్చు కానీ, వాస్తవంలో ఎమ్మెల్యేల పట్ల ఎంత వ్యతిరేకత వుందో అంతకు రెట్టింపు స్థాయిలో ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై ప్రజాగ్రహం పెల్లుబుకుతోందని అనేక సర్వేలు చెపుతున్నాయి. నిజానికి, ఎమ్మెల్యేలు అవినీతి అక్రమాలు నేరుగా ముఖ్యమంత్రి ఖాతాలో పడుతున్నాయి. వాస్తవం ఇలా ఉంటే, ముఖ్యమంత్రి మరోమారు భజన బృందాలను సిద్దం చేసి, నువ్వే మా నమ్మకమని బలవంగా అనిపించేందుకు, స్టిక్కర్ల దండును సిద్దం చేస్తున్నారు. వాలంటీర్లు, గృహ సారథులు, సచివాలయ కన్వీనర్లు అంతా కట్ట కట్టుకుని ఇళ్లు, వాకిళ్ళ మీద స్టిక్కర్లు అంటించే  ఆత్మానంద కార్యక్రమానికి శ్రీకారం  చుడుతున్నారు. నిజమే  అధికారంలో ఉన్న పార్టీ నాయకులు వచ్చి ఇంటికి స్టిక్కర్ అంటిస్తామంటే సహజంగా ప్రజలు  ఇష్టం ఉన్నా లేకున్నా కాదనరు. కావాలంటే, ఇంటికి, ఫోన్ కే కాదు ముఖాలకు అంటిస్తామన్నా  సమాన్య ప్రజలు వద్దనే సాహసం చేయరు. అలాగని, రేపటి ఎన్నికల్లో స్టిక్కర్లు ఓట్లుగా మారతాయని అనుకుంటే మాత్రం అది పొరపాటే అవుతుంది. జగన్ రెడ్డికి ఈ ‘చక్కటి’ సలహా ఎవరు ఇచ్చారో కానీ  ఇది ఆత్మవంచన, పరనిందకు పరాకాష్టగా విశ్లేషకులు పేర్కొంటున్నారు. నిజానికి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి లో ఈ రెండు లక్షణాలు కొంచం చాలా ఎక్కువనే అంటారు. ఇప్పడు, ఆ స్టిక్కర్ స్కీంతో అది పరాకాష్టకు చేరుకుందని, అంటున్నారు.

బీఆర్ఎస్ కు వామపక్షాలు దూరం.. కారణమదేనా?

బీఆర్ఎస్ కు మిత్రులు దూరమౌతున్నారా? ఇతర రాష్ట్రాలలో విస్తరణ పేరుతో రాజకీయంగా ఫేడ్ అవుట్ అయిన నాయకులను  చేర్చుకుని తన భుజాలను తానే చరుచుకుంటున్న కేసీఆర్.. తెలంగాణలో మాత్రం ఉన్న మిత్రులను దూరం చేసుకుంటోంది. గత ఎనిమిదేళ్లుగా అరమరికలు లేకుండా మిత్రపక్షంగా (ఈ విషయాన్ని కేసీఆర్ స్వయంగా ప్రకటించారు) ఉన్న ఎంఐఎం కారణాలేమైతేనేం ఇటీవలి కాలంలో దూరం జరుగుతూ వస్తోంది. ఇక బీజేపీ వ్యతిరేకతే ప్రాతిపదికగా.. బేషరతుగా కేసీఆర్ బీఆర్ఎస్ కు మద్దతు ప్రకటిస్తూ ముందుకు వచ్చిన వామపక్షాలు ఇప్పుడు బీఆర్ఎస్ కు దూరం జరుగుతున్నట్లుగా స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో బీఆర్ఎస్ (అప్పటికి టీఆర్ఎస్) కు బేషరతు మద్దతు ప్రకటించిన వామపక్షాలు ఆ పార్టీ అభ్యర్థి విజయానికి తమ వంతు సహకారం అందించాయి. అప్పుడే కాదు.. ఆ తరువాత ప్రతి సందర్భంలోనూ.. వామపక్షాలు బీఆర్ఎస్ కు మద్దతుగా నిలిచాయి. అందుకు వారు చెప్పిన మాట మతతత్వ శక్తులు బలోపేతం కాకుండా అడ్డుకోవడమేనని చెబుతూ వచ్చారు. అంత వరకూ బానే ఉంది.. కానీ హఠాత్తుగా వామపక్షాలు ప్లేటు ఫిరాయించినట్లు కనిపిస్తోంది. ఈ ఏడాది తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగననున్న నేపథ్యంలో సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో పోటీ చేయాలన్న వ్యూహంతో వామపక్షాలు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్ తో దోస్తీ ఉన్నప్పటికీ ఆయన వామపక్షాలకు తగినన్ని సీట్లు కేటాయిస్తారన్న నమ్మకం ఆ పార్టీలకు లేకపోవడంతో వామపక్షాలు వ్యూహం మార్చాయి. బీఆర్ఎస్ తో పొత్తు పక్కన పెట్టి వామపక్షాలు ఉమ్మడిగా సాధ్యమైనన్ని ఎక్కువ స్థానాలలో అభ్యర్థులను నిలబెట్టాలన్న వ్యూహంతో ఉన్నాయని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. అలాగే.. బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్ కు దగ్గరవ్వడం వల్ల జాతీయ స్థాయిలో సెక్యులర్ శక్తుల బలోపేతానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని కూడా ఆ పార్టీలు భావిస్తున్నట్లు చెబుతున్నాయి. అధికారికంగా ఈ సంగతిని వామపక్షాల అధిష్ఠానాలు ప్రకటించకపోయినప్పటికీ.. తెలంగాణలో సంభవిస్తున్న పరిణామాలను పరిగణనలోనికి తీసుకుంటే.. వామపక్షాల వ్యూహం బీఆర్ఎస్ విషయంలో మారిందనే పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అందుకు ఉదాహరణగా ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ హాత్ సే హాత్ జోడో యాత్రకు సీపీఐ సంఘీభావం ప్రకటించడాన్ని చూపుతున్నారు. వామపక్షాలకు ఎటూ సొంతంగా అధికారంలోకి వచ్చే బలం తెలంగాణలో లేదు. అయినా ఆ పార్టీ  బీజేపీ వ్యతిరేకత విషయంలో  ముందు వరుసలో ఉంటుంది. ఇక బీఆర్ఎస్ అధినేత కూడా గతంలో ఎలా ఉన్నా.. ఇటీవలి కాలంలో ఆయన మాట, శ్వాస కూడా బీజేపీ వ్యతిరేకతే అన్నట్లుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలోనే వామపక్షాలు కేసీఆర్ కు బేషరతుగా దగ్గరయ్యాయి. గతంలో వామపక్షాలను చులకన చేస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలూ, విమర్శలను సైతం పట్టించుకోకుండా మునుగోడు ఉప ఎన్నికలో కేసీఆర్ కు మద్దతుగా నిలిచాయి. ఆ తరువాత బీఆర్ఎస్ ఆవిర్భావ సభలోనూ సందడి చేశాయి. మరి హఠాత్తుగా ఏమైందో ఏమో కానీ.. సొంతంగా పోటీపై ఉభయ కమ్యూనిస్టు పార్టీలూ ఫోకస్ పెట్టాయి. అదే సమయంలో కాంగ్రెస్ కు చేరువ అవుతున్న సంకేతాలు ఇచ్చాయి. ఇందుకు కారణం.. ఇటీవల పలు సందర్భాలలో బీఆర్ఎస్ నాయకులు వామపక్షాలతో పొత్తుపై చేసిన వ్యాఖ్యలు కూడా కారణమని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్రంలో ఏ మాత్రం పట్టు బలం లేని వామపక్షాలకు బీఆర్ఎస్ అసెంబ్లీ స్థానాలను కేటాయించే అవకాశం లేదనీ, కేసీఆర్ కూడా పోత్తు ఉన్నప్పటకీ వామపక్షాలతో సీట్ల సర్దుబాటు విషయంలో పెద్దగా సానుకూలత చూపే అవకాశం లేదనీ బీఆర్ఎస్ నేతలు చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే వామపక్షాలు తమ దారి తాము చూసుకుంటున్నాయని అంటున్నారు.  ఇదిలా ఉంటే నల్గొండ  ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నికల అనంతరం బీఆర్ఎస్ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకోక తప్పదని వ్యాఖ్యానించడాన్ని కూడా పరిశీలకులు ఈ సందర్భంగా ఎత్తి చూపుతున్నారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు వాస్తవానికి దగ్గరగా ఉన్నాయని కూడా వారు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారంపై కన్నేసిన బీజేపీ.. అధికారం దక్కించుకున్నా దక్కించుకోలేకపోయినా.. రాష్ట్రంలో చెప్పుకోదగ్గంతగా బలపడిందన్నది మాత్రం నిర్వివాదాంశం. అలాగే.. టీపీసీసీ చీఫ్ గా రేవంత్ పగ్గాలు చేపట్టడం, రాహుల్ భారత్ జోడో యాత్ర తరువాత కాంగ్రెస్ లో ఆత్మ విశ్వాసం పెరిగింది. దేశ వ్యాప్తంగా ఆ పార్టీ శ్రేణుల్లో విజయంపై ఆశలు చిగురించాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా కాంగ్రెస్ గణనీయంగా బలపడింది. దీంతో రాష్ట్రంలో హంగ్ ఎర్పడు అవకాశాలున్నాయంటూ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే.. వామపక్షాలు కూడా బీఆర్ఎస్ కు దూరం జరిగి కాంగ్రెస్ కు చేరువ కావడానికి మొగ్గు చూపుతున్నారని అంటున్నారు. ఎలాగూ బీఆర్ఎస్ తో పోలిస్తే కాంగ్రెస్ కు సెక్యులర్ పార్టీగా జాతీయ స్థాయిలో ఓ గుర్తింపు ఉంది. ఒక స్టేచర్ ఉంది. ఈ నేపథ్యంలోనే.. వామపక్షాలు కూడా ఎన్నికల తరువాత ఎటూ.. బీఆర్ఎస్ కాంగ్రెస్ కు దగ్గరవ్వక తప్పని పరిస్థితి ఉన్నందున ముందే కాంగ్రెస్ కు దగ్గరైతే గౌరవంగా ఉంటుందని వామపక్షాలు భావిస్తున్నాయని పరిశీలకులు అంటున్నారు. 

ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల వెండి నాణెం!

నందమూరి తారక రామా రావు...  తెలుగు ప్రజలకే కాదు.. దేశ వ్యాప్తంగా రాజకీయాలతో కొద్ది పాటి పరిచయం ఉన్న ప్రతి ఒక్కరికీ ఈ పేరు సుపరిచితం. సినీ, రాజకీయ రంగాలలో మేరునగధీరుడు అన్న పదానికి నూటికి నూరుపాళ్లు సార్థకత చేకూర్చిన మహోన్నతుడు.   ఒక సినిమా హీరోగా ఆయన తాను ‘జీవించిన’ పౌరాణిక పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేసిన  మహా నటుడు ఎన్టీఆర్.   రాముడు. కృష్ణుడు, వేంకటేశ్వరస్వామి.. ఇలా  ప్రతి పౌరాణిక పాత్రకు, సజీవ రూపంగా నిలిచిన మహా నటుడు ఎన్టీఆర్.  దైవానికి ప్రతి రూపంగా ప్రజల గుండెల్లో నిలిచి పోయిన మహోన్నత మూర్తి ఎన్టీఅర్.  రాముడు ఎలా ఉంటాడాంటే,  ఆ నాటి  నుంచి ఈనాటి వరకు ఏ తరం వారిని  అడిగినా  ఎన్టీఆర్ లా ఉంటాడు అంటారు. కృష్ణుడు, వేంకటేశ్వరుడు ఎలా ఉంటారంటే మళ్ళీ అది వేరే చెప్పాలా.. ఎన్టీఆర్  లాగానే ఉంటారు.  తెలుగు చలన చిత్ర పరిశ్రమే కాదు, భారతీయ సినిమాకు ఆయన చిరునామా ...  అలాగే రాజకీయాలలోనూ చిరస్మరణీయుడు. మచ్చలేని మహారాజు. అందుకే ఆయన కన్నుమూసి రెండున్నర దశాబ్దాలు దాటినా.. జనం గుండెళ్లో   సజీవంగా ఉన్నారు. అటు సినిమా రంగంలో ఇంకెవరికీ అందనంత  ఎత్తుకు ఎదిగిన ఎన్టీఅర్, రాజకీయ రంగంలో ఇంకెవరికీ  సాధ్యం కాని విధంగా చరిత్ర  సృష్టించారు. ఆంధ్రుల ఆత్మ గౌరవం నినాదంతో 1982 మార్చి 29 వ తేదీ తెలుగు దేశం జెండాను ఎగరేశారు. నేను తెలుగు వాడిని, నాది తెలుగు దేశం పార్టీ, నా పార్టీ తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం  అని ప్రకటించి, పార్టీ స్థాపించి తొమ్మిది నెలలు తిరక్కుండానే, ఎంతో ఘన చరిత్ర ఉన్న, అంతవరకు రాష్ట్రంలో ఓటమి అన్నదే ఎరగని కాంగ్రెస్ పార్టీని ఓడించి అధికారంలోకి వచ్చారు.  ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో తొలి కాంగ్రెస్సేతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తొలి కాంగ్రేస్సేతర ప్రభుత్వాన్ని అప్రజాస్వామికంగా కూల్చిన ప్రధాని ఇందిరాగాంధీ (కాంగ్రెస్) ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్టీఅర్ ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం సాగించారు. సిద్ధాంత పరంగా ఉత్తర దక్షిణ దృవాల వంటి బీజేపీ, కమ్యూనిస్టులను ప్రజాస్వామ్య స్పూర్తి ధారలో  ఏకం చేశారు. అందుకే ఎన్టీఆర్ సారధ్యంలో విజయం సాధించిన  ప్రజాస్వామ్య పునరుద్ధరణ పోరాటం భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక  మైలు రాయిలా చిరస్థాయిగా  నిలిచి పోయింది. ఎన్టీఆర్ అనే మూడక్షరాలను మకుటం లేని మహారాజుగా చరిత్ర పుటల్లో నిలబెట్టింది.  అలాంటి ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ కేంద్రం ఓ తీపి కబురు అందించింది. ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణేన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.  ఎన్టీఆర్ బొమ్మతో వంద రూపాయల నాణెం విడుదలకు  ఆర్బీఐ గవర్నర్ సుముఖత వ్యక్తం చేసినట్లు గత ఏడాది  జూన్‌లోనే కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపిన సంగతి విదితమే.  ఇప్పుడు ఎన్టీఆర్ బొమ్మతో వందరూపాయల నాణెం త్వరలో విడుదల కానుంది. 

రాజ్యాంగ బద్ధ పదవుల్లో రాజకీయ నియామకాలా?

దేశంలో గవర్నర్లను నియామకం అయితే సంచలనమైనా అవుతోంది.. లేకపోతే వివాదాస్ప దమైనాఅవుతోంది. రాజకీయమే ఇందుకు కారణమనడంలో సందేహంలేదు.ఏ రాష్ట్రానికైనా కొత్తగా గవర్నర్‌ నియామకం జరిగిన వెంటనే గవర్నర్ల వ్యవస్థ అవసరంపై చర్చ అనివార్యంగా తెరపైకి వస్తోంది. కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం రాష్ట్రాలలో తమ ప్రయోజనాల పరిరక్షణ కోసం గవర్నర్ వ్యవస్థను ఉపయోగించుకుంటోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తెలంగాణ విషయమే తీసుకుంటే.. తమిళిసై రాజ్ భవన్ ను బీజేపీ కార్యాలయంగా మార్చేశారని బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తమిళనాడులో అయితే ఏకంగా అసెంబ్లీ సాక్షిగానే గవర్నర్ వైఖరిని అక్కడి స్టాలిన్ ప్రభుత్వం తప్పుపడితే.. గవర్నర్ ప్రభుత్వ వైఖరికి నిరసనగా అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. ఈ నేపథ్యంలోనే గత ఆదివారం కేంద్ర ప్రభుత్వం 13 రాష్ట్రాలలో  గవర్నర్లను నియామకం మార్పు చేసినప్పుడు మరో సారి దేశ వ్యాప్తంగా గవర్నర్ వ్యవస్థపై చర్చకు తెరలేచింది.  గవర్నర్ల నియామకంలో ప్రథమ ప్రాథాన్యత  రాజకీయ ప్రయోజనాలకే ఇవ్వడం వల్లనే ఇలా జరుగుతోంది. ఇది కేంద్రంలో బీజేపీ కొలువుతీరిన తరువాత ప్రారంభం కాలేదు... ఇక్కడితో అగుతుందన్న నమ్మకమూ లేదు.  రాజకీయ ప్రాధాన్యత ఆధారంగానే గవర్నర్లను నియమించడం అన్నది  గతంలోనే అంటే ఇందిరా గాంధీ హయాం నుంచే ఆరంభమైంది.  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ ఉన్న సమయంలో గవర్నర్ గా ఉన్న రామ్ లాల్ వ్యవహరించిన తీరు ఎంత వివాదాస్పదం అయ్యిందో తెలియంది కాదు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ గా కుముద్ బెన్ జోషి ఉన్న సమయంలో కూడా వివాదాలకు కేంద్ర బిందువుగా రాజ్ భవన్ ఉండేదని రాజకీయ పండితులు ఇప్పటికీ చెబుతుంటారు.  అప్పట్లో ఇలా ఒకటి రెండు ఉదాహరణలే ఉండేవి. అప్పట్లో కూడా గవర్నర్ల వ్యవస్థ అవసరమా అన్న చర్చ పెద్ద స్థాయిలోనే జరిగింది. గవర్నర్ వ్యవస్థ అనవసరం అన్న చర్చకు అప్పట్లో ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చాలా బలంగా తెరమీదకు తీసుకువచ్చారు. ఇక ఇటీవలి కాలంలో అయితే  చాలా వరకూ  గవర్నర్లు పూర్తిగా రాజకీయ పాత్రల పోషణకే పరిమితమైపోయారన్న విమర్శ గట్టిగా వినిపిస్తోంది.  జార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌, కేరళ, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలలో గవర్లర్లు వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు.  అందుకే రాజకీయ పునరావాసంగా గవర్నర్లను నియమిస్తున్నారన్న ఆరోపణలు సైతం ఉన్నాయి. కేంద్రం లో ఉన్న ప్రభుత్వాలు తమ పార్టీకి చెందిన సీనియర్లకు, పదవుల అవకాశం లభించని వారికీ రాజకీయ పునరావాసం కింద గవర్నర్ పదవులలో నియమిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ ఇప్పుడు రాజకీయాలతో సంబంధం లేని కీలక పదవులలో పని చేసి రిటైర్ అయిన వారిని గవర్నర్లుగా నియమించడానికి ప్రాధాన్యత ఇస్తున్నది. అయితే ఆ నియామకాలు కూడా వివాదాస్పదంగానే మారడం గమనార్హం. ఉదాహరణకు ఏపీ గవర్నర్ గా కేంద్రం ఇటీవల నియమించిన సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి   జస్టిస్ అబ్దుల్ నజీర్ నియామకం విషయంలో వస్తున్న ఆరోపణలు, జరుగుతున్న చర్చనే చెప్పుకోవచ్చు.  రాజకీయ రంగం నుంచి వచ్చిన వారి కంటే న్యాయ వ్యవస్థ, సైనిక వ్యవస్థల నుంచి వచ్చిన వారు   రాజ్యాంగానికే కట్టుబడి ఉండే అవకాశం ఉందన్న అభిప్రాయం ఉంది. అయితే కేంద్రం ఇటీవలి నియామకాలను గమనిస్తే..  విధి నిర్వహణలో తమకు అనుకూలంగా వ్యవహరించిన వారిని పదవులతో కేంద్రం సత్కరిస్తోందా అన్న అనుమానాలకు తావిచ్చేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు.  మొత్తం మీద గవర్నర్ల వ్యవస్థపై విమర్శలు వెల్లువెత్తడానికీ, ఆ నియామకాలు వివాదాస్పదంగా మారడానికీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వాల వైఖరే కారణమనడంలో సందేహం లేదు. 

సోము వీర్రాజుపై భూ కబ్జా ఆరోపణలు!

ఏపీ రాజకీయాలలో కీలక పాత్ర పోషించాలని భావిస్తున్న బీజేపీకి అడుగడుగునా అడ్డంకులూ, అవాంతరాలే ఎదురౌతున్నాయి. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు వ్యవహార శైలిపై పార్టీలోనే తీవ్ర అసంతృప్తి వ్యక్తమౌతోంది. సోము వీర్రాజు వైఖరిని నిరసన వ్యక్తం చేస్తూ ఏపీ బీజేపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ పార్టీకి దూరంగా ఉంటున్నారు. నేడో, రేపో ఆయన బీజేపీకి రాజీనామా చేస్తారని కూడా ఆయన సన్నిహితులు అంటున్నారు. మరో వైపు సోము వీర్రాజు పార్టీ జిల్లా అధ్యక్షులను మారుస్తూ తీసుకున్న నిర్ణయం కూడా వివాదాస్పదంగా మారింది. ఇవన్నీ అలా ఉంచితే.. ఏపీ బీజేపీలో సోము వీర్రాజు వర్గం రాష్ట్రంలో అధికార వైసీపీతో అంటకాగుతోందన్న విమర్శలు పార్టీ శ్రేణుల్లోనే వ్యక్త మౌతున్నాయి. రాష్ట్రంలో బీజేపీకి మిత్రపక్షమైన జనసేనతో అంటీముట్టనట్టుగా వ్యవహరిస్తూ.. జగన్ కు వీర్రాజు సన్నిహితంగా మెలుగుతూ అధికార పార్టీకి ప్రయోజనం కలిగేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పలు సందర్భాలలో జనసేనాని పవన్ కల్యాణ్ కూడా సోము వీర్రాజు తీరు పట్ల అసహనం వ్యక్తం చేశారు. అలాగే తనకు రాష్ట్ర నాయకత్వంతో పని లేదనీ, ఏదైనా బీజేపీ అగ్రనాయకత్వంతోనే తేల్చుకుంటాననీ పవన్ ఒక సందర్బంలో స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. రాజకీయంగా సోము వీర్రాజుకు పార్టీలోనూ, మిత్రపక్షం నుంచే కాకుండా బయట నంచి కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తమ భూములను సోము వీర్రాజు కబ్జా చేశారంటూ దళిత సంఘాలు ఆరోపణలు చేస్తున్నాయి. తాజాగా బుధవారం ( ఫిబ్రవరి 15) ఏపీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దళితులు ఆందోళనకు దిగారు. సోము వీర్రాజు దళితుల భూములను కబ్జా చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.   విజయవాడలో జరుగుతున్న పుస్తక మహోత్సవం కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన కేంద్ర మంత్రి, బీజేపీ నేత కిషన్ రెడ్డికి సోముకు వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారి ప్రయత్నాన్ని అడ్డుకోవడంతో కిషన్ రెడ్డి కారును అడ్డుకుని సోముకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  వారి ఆందోళనను పోలీసులు అడ్డుకోవడంతో విజయవాడలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విషయమేమిటంటే.. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, ఆ పార్టీ నాయకుడు లక్ష్మీపతి రాజా, వల్లభనేని సుధాకర్ లు  మంగళగిరి ఎన్ఆర్ఐ కాలేజీకి సమీపంలో  దళితులకు చెందిన ఆరు ఎకరాల భూమిని   తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని సమతా సైనిక్ దళ్ (ఎస్ఎస్ డి)ఆరోపిస్తోంది.   వరప్రసాద్‌ అనే దళితుడి భూమిని కబ్జా చేసేందుకు సోము వీర్రాజు ప్రయత్నిస్తున్నారని  ఆరోపించింది.  సోము వీర్రాజు కు వ్యతిరేకంగా ఈ నెల 18న ఏపీ బీజేపీ కార్యాలయ ముట్టడికి దళిత సంఘాలు పిలుపు ఇచ్చాయి. ఇప్పటికే రాష్ట్ర బీజేపీలో నెలకొన్న గ్రూపు తగాదాల నేపథ్యంలో సోము వీర్రాజుకు వ్యతిరేకంగా దళితుల నిరసనలు, ఆందోళనలూ రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్నాయి.  

మారుత్ యుద్ధ విమానంపై హనుమంతుడి బొమ్మ తొలగింపు

యుద్ధవిమానం పైనున్న హనుమంతుడి చిత్రాన్ని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్) మంగళవారం (ఫిబ్రవరి 14) తొలగించింది. విమానం తోక భాగంలో ఏరో ఇండియా-2023లో ప్రదర్శించిన హెచ్ఎల్ఎఫ్‌టీ-42 యుద్ధ విమానం మోడల్ తోక భాగంలో హనుమాన్ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిగా  స్వదేశీ పరిజ్ఞానంతో రూపుదిద్దుకున్న ‘మారుత్’ యుద్ధవిమానం స్థానంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ‘హెచ్ఎల్ఎఫ్‌టీ-42’ విమానాన్ని రూపొందించింది. ఈ విమానం తాలూకు మోడల్‌ను బెంగళూరులో  జరుగుతున్న ఏరో ఇండియా షోలో ప్రదర్శించింది. మారుత్ అంటే సంస్కృతంలో వాయువు అని అర్థం. పవనసుతుడు హనుమంతుడు కాబట్టి.. హెచ్ఎల్ఎఫ్‌టీ-42పై హనుమంతుడి చిత్రాన్ని ఏర్పాటు చేసింది హిందుస్థాన్ ఏరోనాటిక్స్ సంస్థ. అయితే ఆ చిత్రాన్ని ప్రదర్శన ప్రారంభమైన రెండో రోజే ఎందుకు తొలగించారన్నదానిపై మాత్రం ఎటువంటి సమాచారం లేదు.  

కాపు ఓటు చీలిక కోసం కమలదళం కుట్రలు?

బీజేపీకి తెలుసు. అవును ఆంధ్ర ప్రదేశ్ లో ఇప్పుడు కాదు, ఎప్పటికీ  అధికారం అందని ద్రాక్షగానే మిగిలి పోతుందని బీజేపీ  నాయకత్వానికి తెలుసు. అధికారం సంగతి సరే, ఒంటరిగా పోటీ చేసి ఒకటి రెండు సీట్లు గెలుచుకోవడం కూడా కమల దళానికి సమీప భవిష్యత్ లోనే కాదు, సుదీర్ఘ భవిష్యత్ లో కూడా అయ్యే పని కాదు. అంత వరకు ఎందుకు, ప్రస్తుత పరిస్థితుల్లో రాష్టంలో ఒక శాతానికి మించి ఓట్లు తెచ్చుకోవడం కూడా అంత ఈజీ వ్యవహారం కాదని, మోడీ షా తో సహా బీజేపీ పెద్దలు అందరికీ తెలుసు.  అయితే బీజేపీ రాష్ట్ర నాయకత్వం, ముఖ్యంగా వైసీపీ అనుకూల వర్గం మాత్రం లేస్తే మనిషిని కాదన్నరీతిలో ఎగిరెగిరి పడుతోంది.తెలుగు దేశం, జనసేన పొత్తును చెడగొట్టేందుకు,తద్వారా కాపు ఓటును చీల్చి, వైసీపీకి మేలు చేసేందుకు  బీజేపీలోని ఒక వర్గం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. తెలుగు దేశం, జనసేన పార్టీలు చేతులు కలిపితే, కాపు ఓటు గుంపగుత్తగా టీడీపీ, జేనసేన కూటమికి పడతాయని రాజకీయ విశ్లేషకులే కాదు  రాజకీయాలతో సంబంధం లేని వారికీ కూడా తెలుసు. గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడిగా పోటీచేయడంవల్ల వైసీపీ 50 నుంచి 55 నియోజకవర్గాల్లో స్వల్ప ఆధిక్యతతో విజయం సాధించింది. అంతే కాదు, 2019 ఎన్నికల్లో ప్రభుత్వ అనుకూల ఓటు చీలిపోవడం వల్లనే వైసీపీ అధికారంలోకి వచ్చింది. అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా చూస్తానని జనసేన అధ్యక్షుడు  పవన్ కల్యాణ్ ప్రకటించారు. అప్పటి నుంచి జనసేనకు వైసీపీకి మధ్య పోరు హోరాహోరీగా నడుస్తోంది. భారతీయ జనతా పార్టీ నేతలు తమకు జనసేనతో పొత్తు ఉందని చెబుతున్నారు. మరోవంక, టీడీపీతో పొత్తు వద్దంటున్నారు. అఫ్కోర్స్ ఇంతవరకు పొత్తులకు సంబంధించి బీజేపీ సహా ఏ పార్టీ కూడా అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ  టీడీపీ, జనసేన పొత్తు దాదాపు ఖరారు అయినట్లే అని ఉభయ పార్టీలతో పాటు రాజకీయ విశ్లేషకులు నిర్ణయానికి వచ్చారు. అయితే, ఇక్కడ విశేషం ఏమంటే, వైసీపీ అనుకూల బీజీపీ వర్గం కాపు ఓటును చీల్చేందుకు ఓ వంక టీడీపీ, జనసేన మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తూ.. మరో వంక ప్రస్తుత రాజకీయ, కుల సమీకరణలో కీలకంగా మారిన కాపు ఓటును మూడు ముక్కలు చేసేందుకు పావులు కదుపుతోందని అంటున్నారు. ఇందులో భాగంగానే, బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు కాపు కార్డు ఎత్తుకున్నారని అంటున్నారు. కొద్ది రోజుల క్రితం ఓబీసీ కోటాలో కాపులకు ఐదు శాతం రిజర్వేషన్ అంశానికి సంబంధించి రాజ్యసభలో ప్రస్తావించిన జీవిఎల్  ఇప్పుడు తాజాగా గన్నవరం విమానశ్రయానికి రంగా పేరు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. నిజానికి, కాపుల కోటా విషయంలో కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంతో కాపులు జీవీఎల్ కు సన్మానం కూడా చేశారు. ఇక ఇప్పడు గన్నవరం విమానశ్రయానికి రంగా పేరు పెట్డడం అన్నది  కేంద్ర ప్రభుత్వం తలచు కుంటే  పెద్ద విషయం కాదు. నిముషాల్లో పని. అయితే  రాష్ట్రంలో 22 శాతానికి పైగా ఉన్న కాపు ఓటును ముక్కలు చేసి  పరోక్షంగా వైసీపీ మేలు చేసందుకు రాష్ట్ర నాయకులు చేస్తున్న కుట్రకు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ కేంద్ర నాయకత్వం ఆమోదం  ఉందా? లేదా? అన్నది తేలవలసి వుందని  అంటున్నారు.  నిజానికి బీజేపీ జాతీయ నాయకత్వం కూడా ఎప్పటికైనా రాష్ట్రంలో పట్టు సాధించాలంటే కాపులను తమ వైపుకు తిప్పుకోవడం ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వచ్చాయి. అందుకే ప్రధానమంత్రి భీమవరం పర్యటనకు చిరంజీవిని ఆహ్వానించడం, పవన్ కల్యాణ్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా తమవైపే ఉండేలా ఒత్తిడి తెస్తుండటంతో పాటు కాపు వర్గానికి చెందిన సోము వీర్రాజునే మరోసారి అధ్యక్ష పదవిలో కొనసాగిస్తోందని అంటున్నారు. తెలుగుదేశం-జనసేన పొత్తు పెట్టుకుంటే వైసీపీ నష్టపోతుందని, సాధ్యమైన మేరకు కాపుల ఓట్లలో చీలిక తీసుకురావడంద్వారా ఈ పొత్తుకు గండి కొట్టాలని అధికార పార్టీ యోచిస్తోంది. బీజేపీ చేస్తున్న రాజకీయం కూడా వైసీపీకి అనుకూలంగా ఉంటోందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. చివరకు, ఏమి జరుగుతుందో ఏమో కానీ, కాపు ఓటు చుట్టూ రాష్ట్ర రాజకీయం నడుస్తోందని, అంటున్నారు.

బటన్ నొక్కుడుకు ఇక ఫుల్ స్టాపే!?

జగన్ విశ్వాసం, జగన్ ను నమ్ముకున్న వాళ్ల విశ్వాసం ఒక్కటే.. బటన్ నొక్కుడు కొనసాగినంత కాలం అధికారానికి ఢోకా లేదు. ప్రజలు ఎంతగా వ్యతిరేకించినా, ఆందోళనలతో రాష్ట్రం ఉడుకెత్తిపోయినా, ఏం ఫరక్ పడదు.. బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాలలో సొమ్ము పడుతున్నంత కాలం ఓట్లెక్కడికీ పోవు. గడపగడపకూ కార్యక్రమంలో ఎమ్మెల్యేలకు పరాభవాలు ఎదురైనా.. స్వయంగా ముఖ్యమంత్రి సభల నుంచే జనం పారిపోయినా.. మంత్రుల సభలకు ప్రజలు మొహం చాటేసినా భయ పడాల్సిన పని లేదు. విపక్షాల సభలకు జనం పోటెత్తి జయజయధ్వనాలు ఆందోళన వద్దు.. ఓట్లూ మనవే, అధికారమూ మనదే.. ఇంత కాలం వైసీపీలో కనిపించిన ధీమా ఇదే. ఔను జగన్ బటన్ లు నొక్కడమే వైసీపీలో ఓటమి భయం లేకుండా ధీమా కనిపించడానికి కారణం. అయితే ఇప్పుడా ధీమా లేకుండా పోయింది. ఇక జగన్ బటన్ నొక్కుదామన్నా నొక్కలేని పరిస్థితి వచ్చేసింది. ఖజానాలో సొమ్ములు నిండుకున్నాయి. అప్పులు పట్టే మార్గాలన్నీ మూసుకుపోయాయి. ఇకపై రోజు గడవడమే ప్రభుత్వానికి గగనం అన్న పరిస్థితి వచ్చేసింది. ఉద్యోగుల జీతాలకే దిక్కు దివాణం లేని ఆర్థిక అధోగతికి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చేరుకుంది. ఇంత కాలం గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో జనం ఛీత్కారాలు చేస్తున్నా ఎమ్మెల్యేలు భరించి ఏదో విధంగా ఆ కార్యక్రమాన్ని మమ అనిపించేందుకు ప్రయత్నమేనా చేసే వారు. ఎందుకంటే జగన్ బటన్ నొక్కుతున్నారు కనుక ఈ ఛీత్కారాలు ఓట్లపై పెద్దగా ప్రభావం చూపవని ఏమూలో ఒకింత ఆశ ఉండేది వారిలో. ఇప్పుడా ఆశా అడుగంటి పోయింది.  ఆర్థిక క్రమశిక్షణా రాహిత్యం కారణంగా నిధులు నిండుకుని, అప్పులుపుట్టని పరిస్థితి ఏర్పడి జగన్ బటన్ నొక్కుడు కార్యక్రమం ఇంచుమించుగా ఆగిపోయింది.   అందుకే జగన్ లో కూడా ధీమా కనిపించడం లేదు. గతంలో మీరు జనంలో తిరగండి.. నేను బటన్లు నొక్కి జనాల ఖాతాలలో సొమ్ము జమ చేస్తా.. విజయానికి ఢోకా ఉండదు.. మామూలు విజయం కాదు.. 175కు 175 అసెంబ్లీ స్థానాలలోనూ మనమే గెలుస్తాం అని ధీమాగా చెప్పే వారు. కానీ ఆయనకు ఇప్పుడా ఆస్కారం లేకుండా పోయింది.  ఆయనే స్వయంగా విడుదల చేసిన క్యాలండర్ ప్రకారం బటన్ నొక్కడానికి అవకాశం లేని పరిస్థితిని ఇప్పుడాయన ఎదుర్కొంటున్నారు. అందుకే ఎప్పటికప్పుడు ఆ కార్యక్రమాన్ని వాయిదాలు వేసుకుంటూ పోతున్నారు.   ఉదాహరణకు ఆసరా పథకాన్నే తీసుకుంటే.. రమారమి కోటి మంది డ్వాక్రా మహిళలకు రుణమాఫీ  ఇప్పుడు అతీగతీ లేకుండా పోయింది.  ఈ పథకం కింద నాలుగేళ్లపాటు రూ. 12500 బటన్ నొక్కుడు ద్వారా అందజేస్తామని సీఎం జగన్ చెప్పారు. సంక్షేమ క్యాలెండ్‌లో ఆసరా పథకం కింద డ్వాక్రా మహిళల ఖాతాలలో జనవరిలో సొమ్ములు జమ కావాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి నెల సగం గడిచిపోయినా ఇంకా జగన్ బటన్ నొక్కి ఆసరా పథకం లబ్థిదారులకు సొమ్ములు జమ చేయలేదు.  అంతకంటే ముందు డిసెంబర్‌లో ఈబీసీ నేస్తం, లా నేస్తం పథకాలకు బటన్లు నొక్కాలి. వాటి సంగతి అతీగతీ లేదు. ఇక ఇప్పుడు ఇక ఫిబ్రవరి నెలలో  విద్యా దీవెన పథకానికి  బటన్ నొక్కాలి. దానిపైనా జగన్ సర్కార్ కిమ్మనడం లేదు.   పథకాల సంగతి పక్కన పెడితే  జీతాలు, పెన్షన్లకే జగన్ సర్కార్ లాటరీ కొట్టాల్సిన పరిస్థితి.   అదనపు రుణాల కోసం ఢిల్లీలో చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్న సూచనలు కనిపించడం లేదు. దీంతో మార్చి నెల వస్తేం ఏం చేయాలన్న విషయంలో ప్రభుత్వం అయోమయం నెలకొంది.  ఈ నేపథ్యంలోనే పార్టీ నాయకుల్లోనూ, శ్రేణుల్లోనూ కూడా జగన్ పై విశ్వాసం సన్నగిల్లింది, భవిష్యత్ పై భరోసా కరవైంది. అందుకే పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా అసమ్మతి స్వరాలు పెరుగుతున్నాయి. తీవ్రమౌతున్నాయి అని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.

కోమటి రెడ్డి పై వేటు ?

బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీతో చేతులు కలపడం మినహా మరో మార్గం లేదని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి చేసిన సంచలన వ్యాఖ్యలకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల్ ఇన్‌ఛార్జి మాణిక్‌ రావు ఠాక్రే తెర దించారు. రాష్ట్రంలో 3 రోజుల పర్యటన నిమిత్తం వచ్చిన ఆయన, శంషాబాద్‌ విమానాశ్రయంలో కాలు పెడుతూనే, బీఆర్ఎస్ తో పొత్తు ఉండదని స్పష్టం చేశారు. నిజానికి, విమానాశ్రయంలోనే, ఆయన ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు నదీమ్‌ జావీద్‌, బోసురాజు, వేణుగోపాల్‌ తదితరులతో సమావేశమయ్యారు.  ఈ సందర్భంగా  కోమటి రెడ్డి   వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకీ 60కి మించి సీట్లు రావు.ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో కేసీఆర్‌ కలవక తప్పదు అంటూ పొత్తులపై తాను చేసిన వ్యాఖ్యలపై ఠాక్రేకు వివరణ ఇచ్చుకున్నట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో సర్వేలు చూసి హంగ్‌ వస్తుందని చెప్పానని కోమటిరెడ్డి వివరణ ఇచ్చినట్లు సమాచారం.  ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన ఠాక్రే  కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఏం మాట్లాడారో నేను చూడలేదు. వీడియోలు చూశాక మాట్లాడతా. ఆయన వ్యాఖ్యలను పరిశీలిస్తున్నాం. వరంగల్‌లో రాహుల్‌ చెప్పిన విషయాలకు పార్టీ కట్టుబడి ఉంది అని చెప్పారు. మరోవంక కోమటి రెడ్డికి  ‘బయటి’ దారి చూపించేందుకు తగిన అవకాశం కోసం ఎదురు చూస్తున్న, పీసీసీ చీఫ్ రేవత్ రెడ్డి వర్గం ఏ మాత్రం ఆలస్యం చేయకుండా  కత్తులు దూశారు.  కోమటి రెడ్డి వెంకట రెడ్డిని పార్టీ నుంచి .. అని బహిరంగ వేదిక నుంచి తీవ్ర  పదజాలంతో దూషించిన అద్దంకి దయాకర్‌, మరికొందరు నాయకులతో పాటుగా రేవంత్ రెడ్డి వ్యతిరేక వర్గానికి చెందిన సీనియర్ నాయకులు కూడా కోమటిరెడ్డిని తప్పు పడుతున్నారు. ఆయనకు వ్యతిరేకంగానే వ్యాఖ్యలు విమర్శలు చేస్తున్నారు. బీఆర్ఎస్ తో కలవాల్సిన పరిస్థితి రాదని.. కోమటిరెడ్డివి వ్యక్తిగత వ్యాఖ్యలన్న వాదన వినిపిస్తున్నారు.  శ్రీధర్ బాబు, జగ్గారెడ్డి నేరుగానే తమ అభిప్రాయం చెప్పారు. ఇతర నేతలు గుంభనంగా ఉంటున్నారు.  ఈ నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొద్ది నెలల క్రితం వరంగల్ లో నిర్వహించిన సభలో కాంగ్రెస్ అగ్రనేత  రాహుల్ గాంధీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తుందని స్పష్టమైన ప్రకటన చేశారు. ఇప్పడు కోమటి రెడ్డి అందుకు  విరుద్ధంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒకటే అంటూ బీజేపే చేస్తున్న ప్రచారానికి వంతపాడే వంతపాడే విధంగా  చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ అధిష్టానం సీరియస్ తీసుకుందని అంటున్నారు. నిజానికి మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలకు వివరణ కోరుతూ కాంగ్రెస్ క్రమ శిక్షణా సంఘం ఆయనకు షో కాజ్ నోటీసు ఇచ్చింది. పార్టీ కమిటీల్లో ఎక్కడా ఆయనకు స్థానం కలిపించలేదు. ఇక ఆయనపై సస్పెన్షన్ వేటు వేయడం మినహా మరో మార్గం లేదని అంటున్నారు. అయితే, అదే జరిగితే  రోగి కోరింది ... వైద్యుడు ఇచ్చింది ఒకటే ... అన్నట్లుగా అవుతుందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ కావాలనే కోమటి రెడ్డి పార్టీ క్రమ శిక్షణ తప్పి వ్యాఖ్యలు చేస్తున్నారన్న అనుమానాలు కాంగ్రెస్ వర్గాల్లో ఉన్నాయి. అందుకే, పార్టీ అధిష్టానం తటపటాయిస్తోందని అంటున్నారు.

తూచ్.. మూడు రాజధానులు కాదు.. విశాఖ ఒక్కటే!

జగన్ హయాంలో ఆంధ్రప్రదేశ్ పరిస్థితి దారీ తెన్నూ లేకుండా పోయినట్లు తయారైంది. ఆర్థికంగా, అభివృద్ధి పరంగా, పారిశ్రామికంగా అధోగతికి చేరింది. ఉద్యోగుల వేతనాలకే లాటరీ కొట్టాల్సిన పరిస్థితిలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉంది.  దీంతో ఈ పూట గడిస్తే చాలు అన్నట్లుగా జగన్ ప్రభుత్వం దినదిన గండంగా రోజులు గడుపుతోంది. అందుకే ఒక విధానం అంటూ లేకుండా.. గంటకో మాట.. పూటకో విధానం అన్నట్లుగా   జగన్ సర్కార్ వ్యవహరిస్తోంది. రంగులు మార్చడంలో ఊసరవెల్లి ఎలాగో మాటలు మార్చడంలో జగన్ సర్కార్ అలా అన్నట్లుగా తయారైంది పరిస్దితి.   ఊసరవెల్లే సిగ్గుపడే విధంగా ఏపీ సర్కార్ తీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందు రాష్ట్రంలో ప్రధాన విపక్షంగా ఉన్న వైసీపీ ఏపీ రాజధానిగా అమరావతికి సంపూర్ణ మద్దతు ప్రకటించింది. అసెంబ్లీ సాక్షిగా అప్పటి విపక్ష నేత జగన్ అమరావతే రాజధాని అని విస్పష్టంగా ప్రకటించారు. తీరా గెలిచి అధికారం చేపట్టిన తరువాత మాట మార్చి మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరతీశారు. ఇప్పుడు నాలుగేళ్ల పాటు మూడు రాజధానులంటూ చేసిన జపానికి ఫుల్ స్టాప్ పెట్టేసి.. ఏపీకి రాజథాని ఒక్కటే అనీ, అయితే అది అమరావతి కాదు, విశాఖ అంటూ ప్లేట్ ఫిరాయించారు. కర్నూలు న్యాయ రాజథాని, అమరావతి శాసన రాజధాని, విశాఖ పాలనా రాజధాని అంటూ తమ ప్రభుత్వం ఇంత కాలం చెబుతూ వచ్చిన దంతా సమాచార లోపమంటూ విత్త మంత్రి బుగ్గన గారు ముక్తాయించేశారు. పాలనా వికేంద్రీకరణా లేదు ఏం లేదు అని ప్రకటించేశారు. అసలు రాజధాని అంశం కోర్టులో ఉండగా.. ఈప్రకటనలు కోర్టు ధిక్కరణ కిందకు వస్తాయన్న విషయాన్నే సీఎం, మంత్రులు పట్టించుకోవడం లేదు. విశాఖలో వచ్చే నెల 3, 4 తేదీలలో ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సదస్సు జరగనుంది. ఇందుకు సన్నాహకంగా ఇటీవల ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వయంగా ముఖ్యమంత్రి జగన్ ఏపీ రాజధాని విశాఖేననీ, త్వరలోనే అక్కడ నుంచి తాను పాలన ప్రారంభిస్తాననీ ప్రకటించారు. ఇప్పుడు తాజాగా బెంగళూరులో మంగళవారం ( ఫిబ్రబరి 14)న ఏపీ గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్  విశాఖే ఏపీ రాజధాని అని చెప్పేశారు. అంతే కాకుండా కర్నూలులో ఏర్పాటు చేసేది హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ మాత్రమేననీ, అదేమీ న్యాయ రాజధాని కాదని కుండబద్దలు కొట్టేశారు. రాజకీయ ప్రయోజనాలు, లబ్ధే పరమావధిగా ఎప్పటికప్పుడు మాటలు మారుస్తూ పబ్బం గడుపుకోవడానికే జగన్ సర్కార్ పరిమితమైందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికీ ఏపీకి రాజధాని అమరావతే. లీగల్ గా విశాఖను రాజధాని చేయడానికి ఎలాంటి అవకాశం లేదు. ఎందుకంటే సుప్రీం కోర్టులో ఉన్న కేసు తీర్పు ప్రభుత్వానికి అనుకూలంగా వస్తే తప్ప ప్రభుత్వం చేయగలిగింది ఏమీ లేదు.  కోర్టు తీర్పు వెలువడలేదు. అయినా ప్రభుత్వం ఇలా ప్రకటనలు చేయడం ఇన్వెస్టర్లను మోసం చేయడమే తప్ప మరొకటి కాదని పరిశీలకులు అంటున్నారు.  

కోమటిరెడ్డి వ్యాఖ్యల్లో కొత్తేముంది ?

కాంగ్రెస్ ఎంపీ కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో ఏమో కానీ  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చెప్పిన జోస్యం నిజమై నిజంగానే హంగ్  వస్తే, ఆయన చెప్పినట్లుగానే బీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తాయి. అందులో అనుమానం లేదు. నిజానికి, రాష్ట్రంలోనే కాదు  దేశంలోనూ బీఆర్ఎస్  సహా  బీజేపీని ఓడించి, మోడీని గద్దెదించాలని శ్రమిస్తున్న బీజేపీ/మోదీ వ్యతిరేక శక్తులకు కాంగ్రెస్ తో చేతులు కలపడం మినహా మరో మార్గం లేదు. అదే విషయాన్ని కోమటిరెడ్డి చెప్పారు.  కోమటి రెడ్డి వ్యాఖ్యలను ఇటు కాంగ్రెస్, అటు బీఆర్ఎస్ నాయకులు విమర్శిస్తే విమర్శించ వచ్చు  కానీ, రాష్ట్రపతి ఎన్నికల్లో ఏం జరిగిందనే విషయాన్ని గుర్తుచేసుకుంటే  అప్పుడు ఢిల్లీలో జరిగిందే రేపు హైదరాబాద్  లో జరుగుతుందని ఎవరైనా భావిస్తే, అందులో తప్పు ఇసుమంతైనా లేదు.   రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమితో కలిసి వెళ్ళేది లేదని కేసీఆర్ కుండ బద్దలు కొట్టారు. కానీ  చివరకు కాంగ్రెస్ సారథ్యంలోని ప్రతిపక్ష పార్టీల ఉమ్మడి అభ్యర్ధి యశ్వంత్ సిన్హా  కు బీఆర్ఎస్ ( అప్పుడు టీఆర్ఎస్) మద్దతు ఇచ్చింది. మద్దతు ఇవ్వడమే కాదు  కీసీఆర్ ఆయన్ని నెత్తికెత్తుకుని ప్రచారం కూడా చేశారు. యశ్వంత్ సిన్హా ను హైదరాబాద్ కు ఆహ్వానించి  ఎప్పుడూ లేని విధంగా  రాష్ట్రపతి అభ్యర్ధిని  వీధుల్లో ఉరేగించారు. బైక్ ర్యాలీతో స్వాగతం  పలికారు. అంతే కాదు యశ్వంత్ సిన్హా నామినేషన్ కార్యక్రమంలో బీఆరేస్ తరపున మంత్రి కేటీఆర్, మరి కొందరు మంత్రులు  పార్టీ ఎంపీలు స్వయంగా పాల్గొన్నారు. కేటీఆర్  కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో కలిసి కూర్చున్నారు.  ఇద్దరు ముఖ్య నాయకులూ మాట్లాడుకున్నారు. రాష్ట్రపతి ఎన్నికల్లోనే కాదు, ఉప రాష్ట్ర పతి ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ కాంగ్రెస్  అభ్యర్ధి మార్గరెట్ ఆల్వా కు మద్దతు ఇచ్చారు. నిజమే  రాష్ట్రపతి ఎన్నికల్లో అయినా  ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో అయినా  కేసీఆర్ ముందు మరో మార్గం లేదు. సో ... ఆయన తీసుకున్న నిరయాన్ని ప్రశ్నించ లేం. కానీ, రేపు తెలంగాణలో హంగ్ వస్తే లేదా కేంద్రంలో 2014కు ముందున్న పరిస్థితి వస్తే  కేసీఆర్ అనివార్యంగా కాంగ్రెస్  తో చేతులు కలపక తప్పదు. కోమటి రెడ్డి చెప్పింది కూడా అదే ...  అందులో తప్పు పట్టవసింది ఏమీ లేదు.  నిజానికి గతంలో (2018)లో కర్ణాటకలో హంగ్ వచ్చినప్పుడు జేడీఎస్  (ప్రస్తుత బీఆర్ఎస్ మిత్ర పక్షం) లౌకికవాద పరిరక్షణ కోసం కాంగ్రెస్ తో చేతులు కలిపింది. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అధికారానికి ఐదారు సీట్లు దూరంగా ఆగిపోయిన బీజేపీని కాదని, కాంగ్రస్ తో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ కు సంపూర్ణ మద్దతు ఇస్తున్న కుమార స్వామి ముఖ్యమంత్రి అయ్యారు. నిజానికి  గతంలోకి  వెళ్లి చూస్తే  ఇలా బీజేపీకి వ్యతిరేకంగా లౌకికవాద పార్టీలు ఎన్నికల తర్వాత చేతులు కలిపిన సందర్భాలు కోకొల్లలుగా ఉన్నాయి.  సరే .. ఆ విషయాన్ని అలా ఉంచి మళ్ళీ  కోమటి రెడ్డి విషయానికి వస్తే  ఆయన ఏ ఉద్దేశంతో ఈ వ్యాఖ్యలు చేశారు అన్నది పక్కన పెట్టి ఆలోచిస్తే ముఖ్యంగా సమయ  సందర్భాలను బట్టి చూస్తే, కోమటిరెడ్డి వ్యుహత్మకంగానే బాంబు పేల్చారని అనుమానించ వలసి వస్తోందని పరిశీలకులు అంటున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసేఆర్  మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ను మెచ్చుకోవడం, పరోక్షంగానే అయినా కాంగ్రెస్ విధానాలను సమర్ధించడం అంతకు ముందు మంత్రి కేటీఆర్..  ఒక్క రేవంత్ రెడ్డి మినహా మిగిలిన కాంగ్రెస్ నాయకులు అందరూ బంగారు కొండలని కితాబు నీయడం, ఎంఐఎం నాయకుడు అక్బరుద్దీన్ ఒవైసీతో కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీ వంటి పరిణామాల నేపద్యంలో కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించు కున్నాయి.కోమటిరెడ్డి  ఢిల్లీలో ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మరీ,  వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు   రావు. ఆ పరిస్థితిలో కాంగ్రెస్‌తో కలవడం ఒక్కటే బీఆర్‌ఎస్‌కు ఉన్న ఏకైక మార్గం. అందుకే వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా ఫలితాల తర్వాత మాత్రం కచ్చితంగా పొత్తులతో హంగ్ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పడం వెనక ఏదో వ్యూహం ఉండకపోదనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

తెలంగాణలో కొత్త పొత్తు.. కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

తెలంగాణలో రానున్న రోజులలో రాజకీయ ముఖ చిత్రం పూర్తిగా మారిపోవడం ఖాయమని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. హస్తినలో విలేకరులతో మాట్లాడిన ఆయన ఈ ఏడాది  తెలంగాణ అసెంబ్లీకి జరగనున్న ఎన్నికలలో  ఏ పార్టీకీ పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదని ఆయన కుండ బద్దలు కొట్టేశారు. తెలంగాణలో బీజేపీ సంగతి పక్కన పెడితే సెక్యులర్ పార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్ లు రాష్ట్రంలో సొంతంగా మెజారిటీ స్థానాలను సాధించే అవకాశాలు ఇసుమంతైనా కనిపించడం లేదని చెప్పారు.కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ సొంతంగా 60 స్థానాలు సాధించే పరిస్థితులు లేవన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో హంగ్ అనివార్యమని ఆయన జోస్యం చెప్పారు. దీంతో అనివార్యంగా బీఆర్ఎస్ అధినేత కాంగ్రెస్ తో కలవక తప్పని పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఎన్నికల ముందు ఎటువంటి పొత్తులూ ఉండే అవకాశం  లేదనీ, అయితే ఎన్నికల తరువాత మాత్రం కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలవక తప్పదని కోమటిరెడ్డి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ గాడిన పడుతోందనీ, అయినా కూడా సొంతంగా 60 స్థానాలు సాధించే అవకాశాలు కనిపించడం లేదని కోమటి రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక వైపు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పాదయాత్ర పేరుతో జనంలోకి వెళుతున్నారు. ఆయన పాదయాత్రకు విశేష జనస్పందన కనిపిస్తోంది. అదే సమయంలో ఇంత కాలం రేవంత్ పై నిప్పులు చెరుగుతూ వస్తున్న సీనియర్లు ఇప్పుడిప్పుడే సమస్యలను, విభేదాలను పక్కన పెట్టి రేవంత్ తో అడుగులు కదుపుతున్నారు.  పీసీసీ మాజీ అధ్యక్షుడు వి.హనుమంతరావు (వీహెచ్) రేవంత్ తో కలిసి భద్రాచలం నియోజకవర్గంలో మంగళవారం (ఫిబ్రవరి 14)పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే బుధవారం (ఫిబ్రవరి 15) పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఆయన రేవంత్ తో అడుగులు కదపనున్నారు. ఇలా విభేదాలు మరచి రాష్ట్ర కాంగ్రెస్ లోని అన్ని వర్గాలూ ఐక్యమౌతున్నతరుణంలో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ అధికారానికి అవసరమైన 60 స్థానాలను సాధించలేదని కోమటి  రెడ్డి వెంకటరెడ్డి  ప్రకటించడం పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఇష్టారీతిగా వ్యాఖ్యలు చేస్తున్న ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని పార్టీ శ్రేణులు డిమాండ్ చేస్తున్నాయి.

వివేకా హత్య కేసులో ‘బుక్’ అయిపోయారుగా?!

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ఇంకా చాలా సమయం ఉన్నా...  రాజకీయాలు మాత్రం రోహిణీకార్తె ఎండలను మించి సెగలు కక్కుతున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ   నెల్లూరు పెద్దారెడ్ల  అసమ్మతి జ్వాలతోపాటు... ఉమ్మడి కృష్ణాజిల్లా గన్నవరం, మైలవరం నియోజకవర్గాల్లోని నేతల అంతర్గత వర్గ పోరుతో  ఉక్కిరిబిక్కిరి అవుతోంది.  మరోవైపు వైసీపీ అధినేత, ముఖ్యమంత్రి  జగన్ సొంత చిన్నాన్న వైయస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఇటివల చోటు చేసుకొంటున్న వరుస పరిణామాలు ఆ పార్టీ అగ్రనేతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించడం..  ఈ సందర్భంగా వివేకా హత్య జరిగిన రోజు.. ఆయన ఎవరెవరికి ఫోన్ చేసారంటూ.. కాల్ డేటాపై ఆరా తీయడం..  అందులో భాగంగా  నాటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి,  జగన్ సతీమణి భారతి పీఏ నవీన్ ఫోన్లకు పలుమార్లు ఫోన్ చేసినట్లు   అవినాష్ రెడ్డి క్లారిటీతో వెల్లడించడం.... ఆ క్రమంలో అటు జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డికి,    భారతి పీఏ నవీన్‌కి విచారణకు హాజరుకావాలంటూ సీబీఐ నోటీసులు జారీ చేయడం... వారిద్దరు ఈ విచారణకు హాజరుకావడం ..   ఒకదాని వెంట ఒకటి చక చకా జరిగిపోయాయి. కాగా  వివేకా హత్య కేసుపై తెలుగుదేశం పార్టీ...  జగనాసుర రక్త చరిత్ర బహిరంగం.. పేరిట తాజాగా ఓ పుస్తకాన్ని   విడుదల చేసింది.     మాజీ మంత్రి   వివేకానందరెడ్డి హత్యకు సీఎం జగన్ ప్యాలెస్‌లోనే పథక రచన జరిగిందని ఆ పుస్తకంలో ఆరోపించింది. సీబీఐ విచారణలో వేళ్లన్నీ సీఎం  జగన్, ఆయన భార్య   భారతి వైపే చూపిస్తున్నందున ముఖ్యమంత్రి తన పదవికి జగన్ రాజీనామా చేయాలని టీడీపీ డిమాండ్ చేసింది.  వివేకా హత్య జరిగిన తర్వాత చోటు చేసుకున్న వరుస పరిణామాలను ఈ పుస్తకంలో క్రానలాజికల్ గా పొందుపరిచారు.  అలాగే జగన్ రెడ్డి దంపతులతో భారతి రెడ్డి పీఏ నవీన్ దిగిన ఫోటోతోపాటు ముఖ్యమంత్రి వై  జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి ఫోటోను సైతం ఈ పుస్తకంలో ప్రచురించారు. ఇక  వివేకాను గంటకుపైగా చిత్రహింసలు పెట్టి.. అతి క్రూరంగా గొడ్డలితో నరికి చంపిన తీరుతో పాటు వివేకా కుమార్తె, అల్లుడు సునీత, ఎన్ రాజశేఖరరెడ్డి ఇచ్చిన వాంగ్మూలాన్ని సైతంఈ పుస్తకంలో పొందుపరిచారు.  అలాగే ఒకటి నుంచి 31 పాయింట్లగా ఈ హత్య కేసులో పలు కీలక వివరాలను వివరించారు.  ఈ కేసులో అత్యంత కీలకంగా వ్యవహరించిన పలువురు వ్యక్తులు ఆనుమానాస్పదస్థితిలో మరణించడం...  అలాగే వైయస్ వివేకా హత్య జరిగిన తర్వాత.. నాటి ప్రతిపక్ష నేత సొంత మీడియా  వివేకానందరెడ్డిది గుండెపోటు అంటూ ప్రసారం చేసిన టీవీ  క్లిప్లింగ్స్‌ తాలుకా స్క్రీన్ షాట్లు సైతం ఈ పుస్తకంలో పొందు పరిచారు. అలాగే  వైయస్ వివేకానందరెడ్డి హత్యను నాటి ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు అంట కడుతూ... నాడు విపక్ష నేతగా జగన్ చేసిన వ్యాఖ్యలు...  అలాగే పులివెందుల పోలీసుల ప్రెస్ నోట్.. కుటుంబ సభ్యుల వాంగ్మూలం..  హత్యలు చేయడం, ఎదుటి వారికి అంటగట్టడం జగన్ రెడ్డి నైజమంటూ నాడు జగన్ సొంత మీడియాలో ప్రచురించిన వార్తను కూడా ఈ పుస్తకంలో పొందుపరిచారు. అలాగే హత్యను డ్రైవర్ ప్రసాద్‌పై నెట్టే కుట్ర చేసిన నరహంతకులు.. అదేవిధంగా అవినాష్ రెడ్డి, భాస్కరరెడ్డి ఆధ్వర్యంలో హత్య ఆనవాళ్లు చెరిపివేశారు..  సుప్రీంకోర్టులో సీబీఐ కౌంటర్ పిటిషన్... వివేకా హత్య కేసులో 40 కోట్ల రూపాయిల సుపారీపై సీబీఐ చార్జీ షీట్..  సీబీఐ కౌంటర్ అఫిడవిట్... కడప సీటు కోసమే వివేకా హత్య అంటూ  వైయస్ షర్మిల ఒప్పుకోలు.. సిట్ చీఫ్‌గా అడిషనల్ డీజీ స్థాయిలో ఉన్న వ్యక్తిని ప్రభుత్వం మారాక ఎస్పీ స్థాయికి మార్పు చేయడాన్ని తన హైకోర్టు అఫిడవిట్‌లో ప్రశ్నించిన  సునీత రెడ్డి.. హత్య సాక్ష్యాధారాలు చేరిపివేతపై సునీత అఫిడవిట్... డాక్టర్  సునీతరెడ్డిని జగన్ రెడ్డి ఎందుకు బ్లాక్ మెయిల్ చేశాడు..  వేళ్లన్నీ జగన్ రెడ్డి, భారతీరెడ్డి కుటుంబం వైపే... తదితర అంశాలను 24 పేజీలు ఈ పుస్తకంలో  పొందుపరిచారు. ఈ పుస్తకం.. పీడీఎఫ్ రూపంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.  ఇంకోవైపు నాటి ప్రతిపక్ష నాయకుడు, వైసీపీ అధినేత జగన్ అండ్ కో.. తన రాజకీయ పరమపద సోపనాపటంలో అధికారం అనే అందలం ఎక్కడం కోసం.. సొంత చిన్నాన్నకు స్కెచ్ వేశారని.. ఆ పాప పంకిలాన్ని నారాసుర రక్తచరిత్ర   అంటూ నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అంటించడం.. తద్వారా  జగన్.. నూటికి నూరు శాతం విజయవంతం అయ్యారనడానికి గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీకి వచ్చిన బంపర్ మెజార్టీనే ఓ ఉదాహరణ అని నెటిజన్లు.. సోషల్ మీడియోలో కామెంట్స్ చేస్తున్నారు.

గడప గడపకు దారిలోనే ఇంటింటికి స్టిక్కర్!

ఆంధ్ర ప్రదేశ్ లో ఎన్నికల రాజకీయం వేడెక్కుతోంది. నిజానికి అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా చాలనే సమయం వుంది. అయినా  అధికార పార్టీలో హడావిడి చూస్తుంటే  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాడి తన్నేసేందుకు సిద్ధమైపోయారనే అభిప్రాయం బలపడుతోంది. అవును అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు తర్వాత ఎప్పుడైనా ముఖ్యమంత్రి అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్ళడం తధ్యమని విపక్షాలే కాదు అధికార పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు కూడా చెవులు కొరుక్కుంటున్నారు. అలాగే  తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఎప్పటి నుంచో ముందస్తు తథ్యమనే మాట చెపుతూనే ఉన్నారు. ‘యువ గళం’ పాద యాత్రతో సర్కార్ కు చలి పుట్టిస్తున్న యువ తార  నారా లోకేష్  కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి చేతులు ఎత్తేయడం ఖాయమని అంటున్నారు.  రాజకీయ వ్యాఖ్యలు విమర్శలు ఎలా ఉన్నా  దినదినాభివృద్దిగా దిగజారుతున్నరాష్ట్ర ఆర్థిక పరిస్థితితో పోటీ పడి అంతకంట్ వేగంగా దిగజారుతున్న ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇమేజ్  గ్రాఫ్  ను పరిశీలిస్తే ముందస్తుకు వెళ్ళడం వినా మరో మార్గం ఏదీ కనిపించడం లేదని పరిశీలకులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి  అధికారంలోకి వచ్చింది మొదలు మీటలు నొక్కటం ఒక్కటే పనిగా పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలు అమలు చేస్తే చాలు, ఇక అధికారం శాశ్వతం అనే భ్రమల్లో అదొక్కటే పనిగా మీటలు నొక్కుతూ  ఖజానా ఖాళీ చేశారు. ఖజానా ఖాళీ ఆయినా మీటలు నొక్కడం ఆపలేదు  పుట్టిన కాడికి అప్పులు చేశారు. ఇక ఇప్పడు అప్పులు పుట్టని పరిస్థితి వచ్చింది. ప్రస్తుత పరిస్థితినే తీసుకుంటే, ఏ  నెలకా నెల  అప్పులు చేసుకుంటాం ..అనుమతివ్వండి  అంటూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటోంది. ఎంతైనా జగన్ రెడ్డి ప్రధాని మోదీకి దత్త పుత్రుడు  కంటే కొంచెం ఎక్కువే కాబట్టి  కేంద్రం జనవరిలో రూ.4557 కోట్ల రుణాలకు అనుమతి ఇచ్చింది. ఆ తర్వాత వారానికే ... అధికారులు ఢిల్లీ వెళ్లారు. మళ్ళీ అప్పుకు అనుమతి ప్లీజ్  అంటూ చేతులు చాచారు. అది కూడా ఒకసారి కాదు  గత నెల రోజుల్లోనో నాలుగైదు సార్లు అధికారులు,  మధ్యలో ఒకటి రెండు సార్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి ఢిల్లీ వెళ్లి దేహీ అన్నట్లు వార్తలొచ్చాయి. మరో వంక తెచ్చిన అప్పులో కనీసం 60 శాతం పెట్టుబడి వ్యయం (అభివృద్ధి కోసంచేసే ఖర్చు) కోసం వాడాలని కేంద్రం స్పష్టం చేసింది. కానీ... జగన్  ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం ( 2022-23) తొలి పదినెలల్లో చేసిన అప్పుల్లో 12 శాతం మాత్రమే పెట్టుబడి వ్యయం కింద ఖర్చు చేసింది.  మిగిలినదంతా  ఇష్టారీతిగా వాడేసింది. దీంతో ఇక కొత్త అప్పుకు అనుమతి ఇచ్చేది లేదని కేంద్ర ప్రభుత్వం ఖరాఖండిగా చెప్పేసింది. అయినా రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్‌  ఢిల్లీలోని తిష్ట వేసి కూడా కేంద్ర అధికారులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నాలు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. మార్చి వరకు బండి లాగించేందుకు కనీసం మరో రూ.10,000 కోట్ల కొత్త రుణానికి అనుమతివ్వాలంటూ ఆర్థిక శాఖ అధికారులు కేంద్ర అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అయినప్పటికీ కేంద్రం ఇంతవరకూ రాష్ట్రానికి అప్పులకు అనుమతివ్వలేదు. తాము ఆశిస్తున్నట్లుగా పదివేల కోట్లు కాకున్నా... కనీసం 5 వేల కోట్ల కొత్త అప్పులకు అనుమతి లభిస్తుందని రాష్ట్ర అధికారులు ఆశగా ఎదురు చూస్తున్నారు. లేని పక్షంలో ఫిబ్రవరి నెల గడవడం అసాధ్యమని పేర్కొంటున్నారు. మరోవైపు... కార్పొరేషన్లను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. గత  ఏడాది ఏప్రిల్‌ నుంచి జనవరి వరకు జగన్‌ ప్రభుత్వం రూ.81,857 కోట్లు అప్పు చేసింది. వీటికి పెండింగ్‌లో ఉన్న రూ.45,000 కోట్ల బిల్లులు అదనం. కాగ్‌ నివేదిక ప్రకారం డిసెంబరు వరకు అంటే 9 నెలల్లో ప్రభుత్వం రూ.55,500 కోట్ల అప్పు చేసింది. కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వం చేస్తున్న అప్పులను కాగ్‌ తన నివేదికలో పేర్కొన్న అప్పుల్లో కలపలేదు. అందుకే వాస్తవం కంటే అప్పులు తక్కువగా ఉన్నాయి. ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం ప్రకారం తెస్తున్న అప్పులు మొత్తాన్ని పెట్టుబడి వ్యయం కింద మాత్రమే ప్రభుత్వాలు వాడాలి.  కానీ, రాష్ట్రాల విజ్ఞప్తి మేరకు తెస్తున్న అప్పుల్లో 60 శాతం అప్పులను పెట్టుబడి వ్యయం కింద వాడాలని గత ఏడాది కేంద్రం అన్ని రాష్ట్రాలకు లేఖ రాసింది. కానీ  కాగ్‌ నివేదిక ప్రకారం డిసెంబరు వరకు జగన్‌ సర్కారు రూ.55,500 కోట్ల అప్పు తెచ్చి పెట్టుబడి వ్యయం కింద రూ.6,800 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మిగతా డబ్బులన్నీ అంతకుముందు తెచ్చిన అప్పులు, వడ్డీలు కట్టడానికి వాడింది. మరో వంక ఒకటో తేదీన ఇవ్వాల్సిన జీతాలు, పెన్షన్లను ప్రభు త్వం ఇంకా పూర్తిగా చెల్లించలేదు.  12వ తేదీ నాటికి అతి కష్టమ్మీద జీతాలు ఇచ్చాం అనిపించినా...  పెన్షన్లు ఇంకా పూర్తి స్థాయిలో పడలేదు.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి, బడ్జెట్ వరకు ఎదో విధంగా పంటి బిగువున బండి లాగించి, అ వెంటనే అసెంబ్లీ రద్దు చేసి,  ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఆలోచన చేస్తున్నారని, అందుకే, ఇప్పడు హడావిడి చేస్తున్నాని అంటున్నారు. అందులో భాగంగానే, ఇంటింటికీ  ‘మా నమ్మకం నువ్వే జగన్’ స్టిక్కర్ల ప్రచారం మొదలు పెడుతున్నారు. అయితే, గడప గడపకు ..లానే ఇంటింటికి కూడా .. బూమ్ రాంగ్  అవడం ఖాయమని విశ్లేషకులు అంటున్నారు.