పేపర్ లీక్ కు, మాల్ ప్రాక్టీస్ కు తేడా లెలీదా?

టెన్త్ పరీక్షా పత్రం లీకేజీ కేసులో అరెస్టయిన బండి సంజయ్ శుక్రవారం (ఏప్రిల్ 7) బెయిలుపై విడుదలయ్యారు. ఆయనకు కోర్టు గురువారం (ఏప్రిల్6) బెయిలు మంజూరు చేసిన సంగతి తెలిసిందే.  జైలు నుంచి బయటకు వచ్చిన తరువాత ఆయన మీడియాతో మాట్లాడుతూ బీఆర్ఎస్ సర్కార్ పై మండిపడ్డారు. అలాగే తన అరెస్టు విషయంలో మీడియాకు అవాస్తవాలు చెప్పారంటూ సీపీ రంగనాథ్ పై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.   సీపీకీ ప్రశ్నపత్రం లీక్ కు, మాల్ ప్రాక్టీస్ కు కూడా తేడా తెలియదని దుయ్యబట్టారు. ఇక తన మీడియా సమావేశంలో బండి సంజయ్  ప్రధానంగా మూడు డిమాండ్లను సర్కార్ ముందు ఉంచారు.  కేటీఆర్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలని,  టీఎస్పీఎస్సీ పేపర్ల  లీక్ కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ,  ఆ పేపర్ల లీకేజీ వ్యవహారం వల్ల నష్టపోయిన  యువతకు ఒక్కొక్కరికి రూ.లక్ష భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఇక బండి సంజయ్ తన అరెస్టుపై వరంగల్ సీపీ చెప్పిన విషయాలన్నీ వాస్తవమేనని   పోలీసు టోపీపై ఉండే మూడు సింహాలపై ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. పేపర్ల లీక్ తో తనకు సంబంధం లేదని తాను ప్రమాణం చేయడానికి సిద్ధమేనన్నారు. అయినా టెన్త్ హిందీ పేపర్ ఎవరైనా లీక్ చేస్తారా అని ప్రశ్రించారు.  తెలుగు పేపర్ ను ఎవరు లీక్ చేశారో చెప్పాలన్నారు.  అలాగే కేసీఆర్ కుటుంబంపై కూడా విమర్శలు గుప్పించారు. అసలు కేసీఆర్ కుటుంబమే లిక్కర్, లీకర్ల కుటుంబమని దుయ్యబట్టారు.  ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ లో ఎవరో ఫార్వార్డ్ చేస్తే తనకేం సంబంధం అన్నారు. టెన్త్ పేపర్ లీక్‌పై కూడా సిట్టింగ్ జడ్జితో విచారణ చేసే దమ్ముందా అని ప్రభుత్వానికి బండి సవాల్ విసిరారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో కేటీఆర్ ను బర్తరఫ్ చేసే దాకా ఊరుకునేది లేదన్నారు. వరంగల్ గడ్డపై భారీ ర్యాలీ, సభ నిర్వహిస్తామన్నారు. సింగరేణిలో 51శాతం వాటా ప్రభుత్వానిదని, ప్రైవేటీకరణ చేసే హక్కు కేంద్రానికి ఎక్కడిదన్నారు. 

హైదరాబాద్ కు మోడీ.. కేసీఆర్ మళ్లీ మొహం చాటేస్తారా?

ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ( ఏప్రిల్ 8) తెలంగాణ పర్యటనకు రానున్నారు.  సికిందరాబాద్ రైల్వే స్టేషన్ లో సికిందరాబాద్, తిరుపతి వందేభారత్ రైలును ప్రారంభించనున్నారు.  తరువాత మధ్యాహ్నం 12.15 గంటలకు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ కు చేరుకోనున్నారు. ఇది ప్రధాని అధికారిక పర్యటన కావడంతో  తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం పంపారు. అలాగే పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే సభలో మధ్యాహ్నం 12.30 నుంచి 12.37  వరకు ఏడు నిముషాల సమయాన్ని కేసీఆర్ ప్రసంగానికి కేటాయించారు.  అనంతరం అరగంట సేపు మోడీ ప్రసంగిస్తారు. కార్యక్రమం షెడ్యూలు బానే ఉంది. అసలీ కార్యక్మానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరౌతారా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.  ఎందుకంటే గతంలో ప్రధాని మోదీ హైదరాబాద్ వచ్చినప్పుడు కేసీఆర్ స్వాగతం చెప్పలేదు. అలా ఒక సారి కాదు రెండు మూడు సార్లు జరిగింది.  గతంలో సరిగ్గా ప్రధాని రాష్ట్ర పర్యటన సమయంలో కేసీఆర్ పనిగట్టుకుని మరీ దేశ వ్యాప్త పర్యటన పెట్టుకున్నారు. అప్పట్లో ఆయన మోడీ రాష్ట్ర పర్యటన పూర్తికాగానే.. కేసీఆర్ తన దేశ వ్యాప్త పర్యటన షెడ్యూల్ ను కుదించుకుని మరీ స్వరాష్ట్రానికి తిరిగి వచ్చేశారు.   ప్రొటో కాల్ ప్రకారం ప్రధాని అధికారిక పర్యటలో రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరుకావాల్సి ఉంటుంది.  కేసీఆర్ గత మోడీ రాష్ట్ర పర్యటన సందర్భంగా ప్రొటోకాల్ ను పట్టించుకోలేదు.  హైదరాబాద్ లో ఇండియన్  స్కూల్ ఆఫ్ బిజినెస్ లో జరిగే ఒక కార్యక్రమంలో అప్పట్లో మోడీ పాల్లొన్నారు.  ప్రొటో కాల్ ప్రకారం కేసీఆర్ కూడా ఆ కార్యక్రమానికి హాజరు కావాలి.  అయినా కేసీఆర్ డుమ్మా కొట్టారు.  హైదరాబాద్ లో సమతా మూర్తి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ప్రధాని మోడీ వచ్చినప్పుడూ కేసీఆర్ ఆ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. అదే విధంగా మోడీ  ఇక్రిశాట్ లో పాల్గొన్న కార్యక్రమానికీ కేసీఆర్  డుమ్మా కొట్టారు. మొత్తం మీద కేంద్రం, తెరాస మధ్య సంబంధాలు దెబ్బతిన్నప్పటి నుంచీ కేసీఆర్ మోడీకి ఎదురు పడటానికి ఇసుమంతైనా సుముఖత చూపడం లేదు.   మొత్తం మీద ఉద్దేశ పూర్వకంగానే కేసీఆర్ మోడీకి ఎదురుపడకుండా అవాయిడ్ చేస్తున్నారని పరిశీలకులు విశ్లేషించారు.  ఇక ఇప్పడు శనివారం (ఏప్రిల్8) కూడా కేసీఆర్ మోడీకి ఎదురు పడే అవకాశాలు ఇసుమంతైనా లేవనే అంటున్నారు. మోడీ పర్యటన షెడ్యూల్ లో కేసీఆర్ హాజరౌతున్నట్లుగా ఉన్నప్పటికీ, ఆయనకు ఆహ్వానం పంపినప్పటికీ కేసీఆర్ డుమ్మా కొట్టే అవకాశాలే మెండుగా ఉన్నాయని చెబుతున్నారు. టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ కేసులో బండి సంజయ్ అరెస్టుతో బీఆర్ఎస్, బీజేపీల మద్య మరోసారి పెచ్చరిల్లిన ఉద్రిక్తతలు, అలాగే బెయిలుపై బండి విడుదలైన సందర్భంగా ఆయన కేటీఆర్, కవితల అరెస్టు తధ్యం అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ మోడీ సభలో ప్రసంగించే అవకాశాలు దాదాపు మృగ్యమని అంటున్నారు. అలా కాకుండా ఒక వేళ ప్రొటో కాల్ ను పాటించి కేసీఆర్ మోడీ పర్యటనలో కనిపిస్తే మాత్రం కచ్చితంగా ఆది రాజకీయంగా సంచలనమే ఔతుందని పరిశీలకులు చెబుతున్నారు.   అయితే ఏ విధంగా చూసినా అలాంటి సంచలనాలకు అవకాశం లేదన్న అభిప్రాయమే సర్వత్రా వ్యక్తమౌతోంది. అయితే కేసీఆర్ మోడీ సభకు హాజరైనా కాకపోయినా మాత్రం విమర్శలను ఎదుర్కొన వలసి వస్తుందని అంటున్నారు.  కేసీఆర్ హాజరు కాకపోతే.. ప్రొటో కాల్  ఉల్లంఘించారని బీజేపీ విమర్శిస్తుంది.   హాజరైతే..  బీజేపీతో కుమ్మక్కైపోయారు, బీఆర్ఎస్ బీజేపీ బీ టీమ్ అంటూ తాము మొదటి నుంచీ చెబుతూనే ఉన్నామని కాంగ్రెస్ విమర్శలు గుప్పిస్తుంది. అంతే కాకుండా కేసీఆర్ మోడీ పర్యటనలో పాల్గొంటే.. జాతీయ స్థాయిలో పలుచన అయ్యే అవకాశాలూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఏం చేస్తారన్న ఉత్కంఠ మాత్రం రాజకీయ సర్కిల్స్ లో నెలకొని ఉంది.  

హ్యాట్సాఫ్ మేడం కానిస్టేబుల్!

టెన్త్ పరీక్షా కేందంలోకి మొబైల్ ఫోన్ తో వెళుతున్న రాచకొండ సీపీని ఓ  మహిళా కానిస్టేబుల్ ఆపేసిన ఘటన   తోటి పోలీసు అధికారులనే కాదు, సామాన్య ప్రజలను సైతం దిగ్భ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఎల్‌బీనగర్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌ కల్పన రాచకొండ కమీషనర్ ఆఫ్ పోలీస్  డీఎస్  చౌహాన్ కు ఎస్ఎస్ సీ పరీక్షా కేంద్రంలో అడుగు పెట్టకుండా నిలిపివేశారు. అందుకు కారణం ఆయన వద్ద మొబైల్ ఫోన్‌ ఉండటమే.  దీంతో సీపీయే కాకుండా అక్కడ ఉన్న పోలీసు అధికారులూ షాక్ అయ్యారు.   భద్రతా ఏర్పాట్లను పరిశీలించేందుకు చౌహాన్ టెన్త్  పరీక్షా కేంద్రాలను సందర్శిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.  మహిళ   కానిస్టేబుల్  చర్యను ఇతర పోలీసు అధికారులు దిగ్భ్రాంతితో చూస్తుండగా,  చౌహాన్ ఆమెను చూసి చిరునవ్వుతో మొబైల్ ఫోన్ ఇచ్చి, పరీక్ష కేంద్రంలోకి వెళ్లారు. అనంతరం చౌహాన్ ఆ మహిళా కానిస్టేబుల్‌ను అభినందించి, రూ. 500  నగదు బహుమతిని అందజేశారు.   పోలీసు సిబ్బంది అప్రమత్తంగా ఉండి నిజాయితీగా విధులు నిర్వహించాలని రాచకొండ సీపీ కోరారు. పరీక్షా కేంద్రంలోకి వచ్చే వ్యక్తులందరినీ క్షుణ్ణంగా తనిఖీ చేయాలని, సెంటర్‌లోకి మొబైల్ ఫోన్‌లను అనుమతించవద్దని ఆయన పోలీసులను కోరారు. ప్రతి పోలీస్  ఇలానే తమ విధులను భయం, పక్షపాతం లేకుండా  క్రమశిక్షణతో నిర్వహిస్తే ఎంత బాగుండును అని జనం అంటున్నారు. ఏకంగా సీపీనే ఆపేసి మొబైల్ ఫోన్ తీసుకున్న తరువాత టెన్త్ పరీక్షా కేంద్రంలోనికి అనుమతించిన మహిళా కానిస్టేబుల్ కల్పనకు నెటిజన్లు అభినందనలు తెలుపుతున్నారు. 

కర్నాటకలో బీఆర్ఎస్ పోటీ చేస్తుంది.. కానీ

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా నిండా నెలరోజులు కుడా సమయం లేదు.  మే 10 పోలింగ్, మే 13 కౌంటింగ్ పూర్తవుతాయి. నిజానికి కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను కేవలం ఆ రాష్ట్రానికే పరిమితమైన ఎన్నికలుగా చూసేందుకు లేదు. ఒక విధంగా 2024 సార్వత్రిక ఎన్నికల చిత్రానికి కర్ణాటక ఎన్నికలు ‘ట్రైలర్’ అనవచ్చునని పరిశీలకులు అంటున్నారు.  ఈ ఎన్నికలను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రెండూ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. చావో రేవో అన్న రీతిలో తలపడేందుకు సిద్ధమయ్యాయి. నిజానికి ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి ముందు రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ మధ్య ముక్కోణపు పోటీ ఉంటుందని భావించినా, ఎన్నికల షెడ్యూలు విడుదలైన తర్వాత సమీకరణలు చకచకా మారిపోయాయి. బీజేపీ, కాంగ్రెస్ ఢీ అంటే ఢీ అంటున్న నేపథ్యంలో తృతీయ శక్తిగా చక్రం తిప్పే జేడీఎస్ కూడా చప్పబడినట్లు వార్తలొస్తున్నాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే పూర్తి భరోసాతో ముందుకు సాగుతోంది. నిజానికి కాంగ్రెస్ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అందరికంటే ముందు సగానికి పైగా నియోజక వర్గాలకు అభ్యర్ధులను ప్రకటించింది. కొద్ది రోజుల క్రితం 124 మంది అభ్యర్ధులతో తొలి జాబితా విడుదల చేసిన కాంగ్రెస్ పార్టీ..  తాజాగా మరో 42 మందితో రెండో జాబితా ప్రకటించింది. దీంతో మొత్తం 224 స్తలకు గానూ, 166 స్థానాలకు అభ్యర్ధులను ప్రకటించింది.   అయితే మాజీ ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి రేసులో  నేను ఉన్నాను..నేను ఉన్నాను ..అని ఒకటికి రెండుసార్లు  బహిరంగంగా ప్రకటించుకున్న, సిద్ద్రరామయ్యకు ఆయన కోరుకున్నా కోలార్  నియోజక వర్గం టికెట్ దక్కలేదు.   కాంగ్రెస్ పార్టీ తొలి జాబితాలోనే మాజీ సీఎం సిద్ధరామయ్యతో పాటు పీసీసీ అధ్యక్షుడు, మరో ముఖ్యమంత్రి పోటీదారు డీకే శివకుమార్ పోటీ చేసే నియోజకవర్గాల్ని ఖరారు చేసింది. ఈ క్రమంలో సిద్ధరామయ్యకు వరుణ సీటు కేటాయించింది. అయితే వరుణ కంటే కూడా కోలార్ లో ఈసారి పోటీ చేయాలని సిద్ధూ భావించారు. కానీ చివరి నిమిషంలో ఆయనకు షాక్ తప్పలేదు. ప్రస్తుతానికి అయితే ఆయన కూల్ గా ఉన్నా, ఆఖరి క్షణంలో ఏమి చేస్తారనేది చెప్పలేమని, పార్టీ కేటాయించిన వరుణ నియోజక వర్గంతో పాటు తాను కోరుకున్న కోలార్  నియోజక వర్గంలో  పోటీ చేసందుకు అంగీకరించక పోతే, సిద్దూ  పోటీ నుంచి పూర్తిగా తప్పుకుంటారని ఆయన అనుచరులు అంటున్నారు. అలాగే  సిద్దరామయ్య ను ముఖ్యమంత్రి రేసు నుంచి తప్పించేందుకే ఆయన్ని ఓడిపోయే నియోజక వర్గం నుంచి బరిలో దించుతున్నారా అనే అనుమానాలనూ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సిద్దూ అసంతృప్తి వ్యక్త పరిచినా, అలక పూని ఎన్నికలకు దూరంగా ఉన్నా  కాంగ్రెస్ పార్టీకి కష్టమే అంటున్నారు. అలాగే  కర్ణాటక నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానానికి శ్రీకారం చుట్టాలని భావించిన బీఆర్ఎస్ కూడా ఇంకా ఎటూ తేల్చుకోలేదని తెలుస్తోంది. పార్టీ పేరున పోటీ చేసి ఓడి పొతే, ఆ ప్రభావం ఇటు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై, అటు లోక్ సభ ఎన్నికలపై కూడా ఉంటుందని  బీఆర్ఎస్ అధినేత కేసీఆర్  వెనకా ముందు అవుతున్నారని అంటున్నారు. అందుకే ఆయన ఫోకస్ మహారాష్ట్ర వైపు తిప్పారని, అక్కడ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు గ్రౌండ్ సిద్ధం చేసుకుంటున్నారని అంటున్నారు.  అయితే  తెలంగాణ భవన్ లో మరో మాట కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ ఎంపిక చేసిన నియోజక వర్గాల్లో బలమైన స్వతంత్ర అభ్యర్ధులను నిలబెట్టే ఆలోచనలో ఉన్నట్లు పార్టీ నేతల ‘లీకు’ ల ద్వారా తెలుస్తోంది. ఇందుకోసం బీఆర్ఎస్... నేతలు కొందరు  రాష్ట్ర సరిహద్దు నియోజక వర్గాలలో పర్యటించి అభ్యర్ధులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్, బీజేపీ, జేడీఎస్ పార్టీలలోని టికెట్ రాని అసంతృప్తులను చేరే దీసి, గెలిచిన తర్వాత బీఆర్ఎస్ లో చేరే షరతుపై ఆర్థిక సహయం అందించే అలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే, కేసీఆర్ అంతిమంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చెప్పలేమని, బీఆర్ఎస్ నేతలు చెపుతున్నాయి.

బాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి?!

గత ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా ఒకటి.  జిల్లాలోని 10 అసెంబ్లీ స్థానాలకు పది స్థానాల్లోనూ వైసీపీ విజయకేతనం ఎగురవేసింది. దీంతో నెల్లూరు పెద్దారెడ్లంతా జగన్ పార్టీ వైపే ఉన్నారని చెప్పకనే చెప్పినట్లు అయింది.  అయితే ఇటీవల చోటు చేసుకున్న వరుస పరిణామాల నేపథ్యంలో..  ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల అనంతరం అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిలపై జగన్ పార్టీ సస్పెన్ష్ వేటు వేసింది. దీంతో ఆ జిల్లా రాజకీయ ముఖ చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షడు చంద్రబాబు నాయుడు..  జోనల్ సమావేశంలో భాగంగా.. శుక్రవారం ( ఏప్రిల్ 7) నెల్లూరు నగరానికి విచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష టీడీపీ నేతల దృష్టి ఏమో కానీ... అధికార  వైసీపీ అగ్రనేతల ఫోకస్ అంతా నెల్లూరుమీదే కేంద్రీకృతమై ఉంది. ఈ జోనల్ సమావేశానికి 5 లోక్‌సభ నియోజకవర్గాల్లోని ఎంపీలు,  మాజీ ఎంపీలు, అలాగే 34 నుంచి 35 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ ముఖ్యనేతలు హాజరువుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వీరందరికీ చంద్రబాబు దిశానిర్దేశం చేయనున్నారు.  అలాగే గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధికీ, ప్రస్తుత జగన్ ప్రభుత్వంలో జరిగిన అభివద్దికి బేరీజు వేయడం, అదే విధంగా పలు అంశాలను  ఈ సందర్బంగా ప్రజలకు సోదాహణంగా వివరించే విధంగా పార్టీ నేతలకు చంద్రబాబు దిశా నిర్దేశం చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.  ఇదే సమయంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి  సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి   చంద్రబాబు సమక్షంలో తెలుగుదేశం తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు ఇప్పటికే ఈ జోనల్ సమావేశాలు...  ఏప్రిల్ 5న ఉత్తరాంద్రలోని విశాఖపట్నంలో.. ఏప్రిల్ 6న రాయలసీమలోని కడపలో చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన విషయం విదితమే.  అదీకాక ఇటీవల జరిగిన గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...  అలాగే ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో  కలిపి  నలుగురు టీడీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించారు. ఈ నేపథ్యంలో  తెలుగుదేశం శ్రేణుల్లో నయా జోష్ కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. దీంతో వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం విజయం  కోసం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు  వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో జోనల్ స్థాయిలో చంద్రబాబు అధ్యక్షతన సమావేశాలు ఏర్పాటు చేశారు. 

ఉమ్మడి వ్యూహం.. ఉత్తుత్తి కేసులు!

టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం ఢిల్లీ దాకా వెళ్ళింది. ఈ కేసులో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్టయిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం లోక్ సభ సెక్రటేరియట్ బులిటెన్ రిలీజ్ చేసింది. 151 సీఆర్పీసీ  కింద ముందస్తు కస్టడీలోకి తీసుకున్నామని బొమ్మల రామారం  పోలీసులు తెలిపినట్లు బులిటెన్ లో తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకే బండి సంజయ్  ని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్ లో సంజయ్ ని అరెస్ట్ చేసి తర్వాత రాజకొండ పరిధిలోని బొమ్మల రామారం స్టేషన్ కు తరలించినట్లు బులిటెన్ లో వెల్లడించారు. అనంతరం కస్టడీ నుంచి విడిచిపెట్టినట్లు లోక్ సభ ప్రివిలేజ్ కమిటీకి కరీంనగర్ పోలీసులు తెలిపారు.  అదలా ఉంటే 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో అరెస్ట్‌ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్పై   తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు.... ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవచ్చని తెలిపింది. అయితే  విచారణ సందర్భంగా హై కోర్ట్,  టెన్త్ క్వశ్చన్‌ పేపర్ పబ్లిక్ డొమైన్‌లోకి వచ్చాక అది లీకేజ్ ఎలా అవుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు బండి సంజయ్ చేసిన తప్పేంటని అడిగింది. పేపర్‌ బయటకు వచ్చాక వాట్సాప్‌లో ఫార్వార్డ్ మాత్రమే చేశారని.. కానీ పేపర్‌ లీకేజీలో బండి సంజయ్ పాత్ర లేదు కదా అని ప్రశ్నించింది. పేపర్ బయటకు వచ్చాక ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని ఎలా అయినా వాడుకోవచ్చని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం నెత్తిన మినీ మొట్టికాయలు వేసింది.  ఇప్పటికే కింది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశామని బండి సంజయ్ తరపు న్యాయవాది రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. దానిపై ఏప్రిల్ 06వ తేదీనే తీర్పు వచ్చేలా ఆదేశాలని ఇవ్వాలని కోరారు. మార్చి8వ తేదీన ప్రధాని మోదీ పర్యటన ఉండటంతో ..  సంజయ్‌పై కింది కోర్టు ఇచ్చిన రిమాండ్ రిజెక్ట్ చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కింది కోర్టులో బెయిల్‌ రాకుంటే హైకోర్టులో హౌజ్ మోషన్ పిటిషన్ వేసుకోవాలని సూచించింది. రిమాండ్ క్వాష్ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. అయితే, ఈకేసుకు సంబంధించి అంతిమ తీర్పు ఎలా ఉంటుందనేది పక్కన పెడితే,  ఈ కేసు రాజకీయంగా మరింత సంచలనంగా మారే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి.  రాష్ట్ర శాసన సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఢిల్లీ మద్యం కుంభకోణం కుసు, సుఖేష్ చంద్రశేఖర్ కేసు,  టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును అస్త్రాలుగా చేసుకుని బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టేందుకు ఢిల్లీ నుంచి బీజేపీ పావులు కదుపుతుంటే, అందుకు ప్రతిగా  బీజేపీకి  దీటుగా సమాధానం చెప్పడానికి బిఆర్ఎస్ రెడీ అయింది.   రాష్ట్రంలో బిజెపి నాయకులను ఉక్కిరిబిక్కిరి చేయాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్ తన వ్యూహంలో భాగంగా బిజెపి స్లీపర్ సెల్స్ పై నిఘా పెట్టడమే కాకుండా, వారి వ్యూహాలను ఎప్పటికప్పుడు ముందే గుర్తించి ప్రజా క్షేత్రంలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు సిద్దమైంది. అయితే న్యాయస్థానాలు చేసే వ్యాఖ్యలు, ఇచ్చే తీర్పులు ఎలా ఉన్నా  అంతిమంగా ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు  అనేదే కీలకమని అంటున్నారు.  నిజానికి ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్ నాయకులు అభిప్రాయ పడుతున్నట్లుగా బీజేపీ, బీఆర్ఎస్  ఉమ్మడి వ్యూహంలో బాగంగా సాగుతున్న రాజకీయ క్రీడ అయిన కావచ్చు అనే అనుమానాలు లేక పోలేదు.

సుకేష్ చంద్రశేఖర్ లేఖలో అరుణ్ పిళ్లై పేరు!

మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ జైలు నుంచి గురువారం (ఏప్రిల్ 6) మరో లేఖ విడుదల చేశారు. రెండు పేజీలతో కూడిన ఈ లేఖలో కేజ్రీవాల్‌తో పాటు బీఆర్ఎస్ నేతల పేర్లను ప్రస్తావించారు. గత వారం ఏపీకి 15 కోట్ల రూపాయలు ఇచ్చానని షార్ట్ నేమ్ పేర్కొన్న సుఖేశ్, ఇప్పుడు   దానికి కొనసాగింపుగా   ఏపీ అంటే అరుణ్ పిళ్లై అని అతడికే తాను డబ్బులు ఇచ్చానని పేర్కొన్నాడు. కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ సూచనలతోనే బీఆర్ఎస్ ఆ కార్యాలయంలో పిళ్లైకి రూ.15 కోట్లు ఇచ్చానని ఆ లేఖలో పేర్కొన్నాడు.   బీఆర్ఆర్ఎస్ కార్యాలయంలో  ఎమ్మెల్సీ స్టిక్కర్ ఉన్న 6060 బ్లాక్ కలర్, రేంజ్ రోవర్ స్పోర్ట్స్ మోడల్ కారులో ఈ డబ్బును ఇచ్చానని స్పష్టం చేశారు. తాను లేఖలో పేర్కొన్న అంశాలన్నింటికీ ఆధారాలు ఉన్నాయని అవసరం అయితే నార్కో టెస్ట్ కు సైతం సిద్ధమే అని పేర్కొన్నాడు. ఈ తాజా లేఖ రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కేజ్రీవాల్ కు సౌత్ గ్రూప్ కు మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నాయనే విషయాన్ని సుకేష్ చంద్రశేఖర్ లేఖ బలపరుస్తోందని అంటున్నారు. మొత్తం మీద ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు డొంక కదులుతోందన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది.

టెన్త్ ప్రశ్న పత్రం లీక్ లో మరో ‘నలుపు’ విద్యార్ధి పై వేటు!

తెలంగాణలో పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ  వ్యవహారం పూర్తిగా రాజకీయ రంగు పులుముకుంది. బీఆర్ఎస్, బీజేపీల మధ్య రాజకీయ యుద్దానికి ఈ లీకేజీ మరో అస్త్రంగా మారింది. అయితే  ఇప్పటికే 30 లక్షల మంది నిరుద్యోగ యువత భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మార్చిన, టీఎస్పీఎస్సీ లీకుల బాగోతానికి  తోడు ఇప్పడు ఈ పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ పరీక్ష ఇంకెంత మంది చిన్నారుల భవిష్యత్ ను ప్రశ్నార్ధకం చేస్తుందో అనే ఆందోళన తల్లి తండ్రులలో వ్యక్త మవుతోంది. ముఖ్యంగా  హిందీ పేపర్ లీకేజికి నువ్వే  కారణమంటూ అభం శుభం తెలియని ఓ విద్యార్ధిని ఏకంగా ఐదేళ్ళ పాటు డిబార్ చేసిన అధికారుల నిర్ణయం ఇటు విద్యార్ధులు, అటు తల్లి తండ్రులను కూడా తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.  ఇక విషయంలోకి వస్తే అసల్యంగా వెలుగులోకి వచ్చిన సమాచారం మేరకు, హనుమకొండ జిల్లాలోని కమలాపూర్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో పరీక్ష రాస్తున్న ఒక విద్యార్ధిని  లీకేజీకి కారణం అని ఆరోపిస్తూ ఎగ్జామ్ హాల్ నుంచి బయటికి పంపించేశారు. ఎగ్జామ్ రాస్తుండగా అధికారులు వచ్చి, డీబార్ అయ్యావని చెప్పి హాల్ టికెట్ తీసుకున్నారని విద్యార్థి ఆవేదన వ్యక్తం చేశాడు.  తాను పరీక్ష రాస్తుండగా వేరే సర్ తో పిలిపించి, తన హాల్ టికెట్ తీసుకుని బయటికెళ్లమని డీఈవో సర్ చెప్పారని విద్యార్థి తెలిపాడు. అప్పుడే తనను డీఈవో సర్ సంతకం చేయమన్నారని, అక్కడ అందరూ ఉండడంతో భయపడి సంతకం చేశానని చెప్పాడు. ఎందుకు సైన్ చేయించుకుంటున్నారని అడిగితే.. నీ వల్లే పేపర్ లీకైందని, వైరల్ అయిందని చెప్పినట్టు విద్యార్థి తెలియజేశాడు. తనను ఐదు సంవత్సరాలు డిబార్ చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఏప్రిల్ 4న హిందీ ఎగ్జామ్ జరుగుతుండగా ఓ వ్యక్తి తనను పిలిచి, తన పేపర్ ఇవ్వమని బెదిరించాడని, అయినా తాను ఇవ్వలేదన్నాడు. ఆ వ్యక్తి కాసేపయ్యాక సడెనా గా వచ్చి కిటికీలోనుంచి చేయి పెట్టి తన పేపర్ గుంజుకుని, ఫొటోలు తీసుకున్నాడని తెలిపాడు. ఆ తర్వాత ఏమైందో కూడా తనకు తెలియని చెప్పాడు. అసలు ఆ వ్యక్తి ఎవరో  కూడా తనకు తెలియదని చెప్పాడు. ఈ రోజు జరిగిన ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయలేదని, ఆ విద్యార్థి వాపోయాడు.  జీవితంలో చేయని తప్పుకు శిక్షను అనుభవిస్తున్నానని, ఈ రోజు జరిగిన ఎగ్జామ్ మినహాయిస్తే.. సప్లిమెంటరీలోనైనా ఎగ్జామ్ రాస్తానని, తనపై విధించిన డిబార్ తీసేయాలని కోరాడు. తన హాల్ టికెట్ తనకు ఇవ్వాలని, మిగతా ఎగ్జామ్స్ రాసేందుకు పర్మిషన్ ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు.  మరో వంక విద్యార్థి తల్లి ఇప్పటి వరకూ తన కొడుకుపై ఎలాంటి రిమార్కు రాలేదని చెప్పారు. ఒకబ్బాయి వచ్చి తన కొడుకును చంపుతా, పొడుస్తానంటూ బెదిరించాడని ఆమె తెలిపారు. ఎవరికైనా చెబితే చంపుతానన్నాడని చెప్పారు. తమ క్కూడా ముందుగా చెప్పలేదని, ఈ రోజు ఇంగ్లీష్ ఎగ్జామ్ రాయనివ్వలేదని, ఎవరో చేసిన పనికి తన కొడుకును బలిపశువును చేయొద్దని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాము తప్పు చేసే మనుషులం కాదన్న ఆమె.. తన కొడుకు బంగారు భవిష్యత్తును ఆగం చేయకండంటూ వేడుకున్నారు. తెలియక భయపడి సంతకం పెట్టాడని, హాల్ టికెట్ ఇచ్చి రేపట్నుంచి ఎగ్జామ్ కు అనుమతించండి అని ఆమె కోరారు.  నిజానికి, పదవ తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో అటు విద్యా శాఖ అధికారులు, ఇటు విచారణ చేస్తున్న పోలీసు యంత్రాంగం వ్యవహారం చూస్తే గుడ్డెద్దు చేలో పడినట్లు ఉందని పరీక్ష నిర్వహణలో అనుభవం ఉన్న రిటైర్డ్ అధికారులు, ఉపాధ్యాయులు అంటున్నారు. ఈ వ్యవహారంలో సంబంధిత అధికారాలు ఎవరికీ కొంచెం కూడా క్లారిటీ లేనట్లే ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హిందీ పేపర్ లీక్ కాలేదని స్వయంగా విద్యాశాఖ మంత్రి ప్రకటించిన తర్వాత, అర్థరాత్రి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ను అరెస్ట్  చేయడంతో కథ మారిపోయింది. అంటే  పేపర్ లీక్ గురించి తెర వెనక ఏమి జరుగుతుందో మంత్రి గారికి కూడా తెలియదా? తెలియకుండానే ఆమె  హిందీ పేపర్ లీక్ కాలేదని ప్రకటించారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అదెలా ఉన్నా, ఎవరో ఆగంతకుడు పరీక్ష కేంద్రలోకి సెల్ ఫోన్ తో వచ్చి విద్యార్ధి నుంచి ప్రశ్న పత్రం బలవంతంగా తీసుకుని, ఫోన్ లో ఫోటోలు తీసుకున్నాడంటే, అందుకు బాధ్యత విదార్ధిది అవుతుందా? ఒక వేళ ఆ విద్యార్ధి,ఆ అగంతకునికి ముందే బేరం కుదుర్చుకుని సహకరించాడని అనుకున్నా, ఆగంతకుడు పరీక్ష కేంద్రంలోకి ఎలా వచ్చారు? అందుకు ఎవరు సహకరించారు? ఎవరు బాధ్యత వహించాలి,అనే ప్రశ్న  కు ఎవరు సమాధానం చెపుతారు?

ఒడిశా, ఏపీ సరిహద్దు వివాదం బీజేపీ రాజకీయమేనా?

ఒడిశా, ఆంధ్రప్రదేశ్ మధ్య సరికొద్ద సరిహద్దు వివాదం మొలకెత్తింది. అయితే ఈ వివాదానికి కేంద్రం రాజకీయమే కారణమన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్ చేసిన ఒక ప్రకటన ఈ వివాదానికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల మధ్య  కోరాపుట్‌ జిల్లాలో ఉన్న కోటియా అనే ప్రాంతంనుంచి  ఏపీ పోలీసులు వైదొలగాలంటూ చేసిన ప్రకటన ఈ సరికొత్త సరిమద్దు వివాదానికి కారణమైంది.   కోటియా   ప్రాంతంలోని 21 గ్రామాల నుంచి ఏపీ పోలీసులు వెనక్కు వెళ్లాలని ప్రధాన్ ఒడిశా అవతరణ దినోత్సవం వేదికగా ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటనే సరికొత్త వివాదానికి కారణమైంది.  వాస్తవానికి సరిహద్దు వివాదం సుప్రీం కోర్టులో ఉండగా  సరిగ్గా ఒడిశా అవతరణ దినోత్సవం నాడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ వివాదాస్పద ప్రకటన చేశారు. ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సహజంగానే  ప్రదాన్ ప్రకటనను బీజేపీ ఒడిశా శాఖ సమర్ధించింది. అదే సమయంలో ప్రధాన్ వ్యాఖ్యలను అధికార బీజు జనతాదళ్ ఖండించింది.  దీంతో బిజూ జనతాదళ్‌, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది.  బిజూ జనతా దళ్‌ నాయకురాలు, రాష్ట్ర రెవెన్యూ  మంత్రి ప్రమీలా మల్లిక్‌ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలంటూ ఎన్‌.డి.ఏ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.  ఇది సుప్రీం కోర్టు విచారణలో ఉండగా కేంద్ర మంత్రి దీని గురించి వ్యాఖ్యానించవచ్చా, ఈ విధంగా వ్యాఖ్యానించడం కోర్టు ధిక్కరణ కిందకు రాదా అన్న చర్చ మొదలైంది. రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటూ కొద్ది కాలం కిందట కేంద్ర మంత్రి ధర్మేంద్ర పధాన్ స్వయంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ లేఖ రాశారు. ఇంతలోనే ఈ విషయంలో ఆయన వివాదాస్పద ప్రకటన చేయడం రాజకీయ లబ్ధి కోసమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో   బీజేడీని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ఆయనీ వ్యాఖ్యలు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.   కోరాపుట్‌ జిల్లా గత ఇరవై ఏళ్లుగా బీజేడీ ఓటు బ్యాంకుగా, పటిష్ఠమైన కంచుకోటగా ఉంది. ఇప్పుడు ఈ జిల్లాపై   బీజేపీ కన్ను వేసింది. దేశవ్యాప్తంగా ఆదివాసీ లేక గిరిజన ప్రాంతాలను చేజిక్కించుకోవడంలో భాగంగా కేంద్రంలోని పాలక బీజేపీ ప్రభుత్వం ఒడిశాలో కూడా ఆదివాసీల అభివృద్ధికి, సంక్షేమానికి అనేక పథకాలను, కార్యక్రమాలను చేపట్టినప్పటికీ,  ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పోటీగా స్వయంగా కొన్ని పథకాలను ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తోంది. దీంతో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వాన్ని   ఇరకాటంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన్‌ సరిహద్దు ఉరుములేని పిడుగులా సరిహద్దు వివాదానికి తెరతీశారని అంటున్నారు.  

కమలం గూటికి ఏకే ఆంటోనీ కుమారుడు

కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ రక్షణ మంత్రి ఏకే ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ కమలం తీర్థం పుచ్చుకున్నారు. ఏకే ఆంటోనీ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేత, గాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడు, సన్నిహితుడైన నాయకుడు. అటువంటి నాయకుడి కుమారుడు బీజేపీ గూటికి చేరడం ఒక విధంగా కాంగ్రెస్ ను ఊహించని ఎదురుదెబ్బ అనడంలో సందేహం లేదు. ఆంటోనీ కుమారుడు అనిల్ ఆంటోనీ  కేరళ బీజేపీ  అధ్యక్షుడు కే సురేంద్రన్ తో కలిసి ఢిల్లీలోని బీజేపీ కేంద్ర కార్యాలయానికి చేరుకుని అక్కడ గులాబీ కండువా కప్పుకున్నారు. నిన్న మొన్నటి వరకూ కేరళ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ డిజిటల్ మీడియా సెల్ కన్వీనర్ గా క్రియాశీలంగా వ్యవహరించిన అనిల్ ఆంటోనీ కొద్ది రోజుల కిందట కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు.   ప్రధాని మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ విషయంపై ఆయన కాంగ్రెస్ అధిష్ఠానంతో విబేధించారు. ఆ కారణంతోనే ఆయన కాంగ్రెస్ పార్టీని వీడారు.  మోడీపై బీబీసీ డాక్యుమెంటరీ విషయంలో కాంగ్రెస్ తీరును తప్పుపట్టిన ఆయన వివరణను వినడానికి కూడా కాంగ్రెస్ అధిష్ఠానం ఇష్టపడకపోవడంతో ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు. ఆ సందర్భంగా ఆయన కాంగ్రెస్ లో కోటరీ గాళ్లదే రాజ్యం అయిపోయిందని ఘాటు విమర్శలు కూడా చేశారు. ఆయన కాంగ్రెస్ ను వీడటం ఒకెత్తయితే.. బీజేపీ గూటికి చేరడం మాత్రం కాంగ్రెస్ జీర్ణించుకోలేని అంశమేనని పరిశీలకులు అంటున్నారు. అంటోనీ కుమారుడు కమలం గూటికి చేరడం కాంగ్రెస్ ప్రతిష్టను మసకబారుస్తుందనడంలో సందేహం లేదని అంటున్నారు. అలాగే తాజాగా కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్ కూడా తాను కాంగ్రెస్ లో ఉన్న సమయంలో కాంగ్రెస్ నాయకత్వం కంటే మోడీ అండ్ కో తనను ఎక్కువగా గౌరవించారని చేసిన వ్యాఖ్యలు కూడా దుమారం లేపుతున్నాయి. కాంగ్రెస్ లో పాతతరం నాయకులకు, సీనియర్లకు తగిన గౌరవం దక్కడం లేదంటూ వస్తున్న విమర్శలకు ఆంటోనీ కుమారుడు పార్టీ మారడం, ఆజాద్ వ్యాఖ్యలూ బలం చేకూరుస్తున్నాయని చెబుతున్నారు. 

దేశంలో మళ్ళీ కరోనా కలకలం

దేశంలో మరో మారు కరోనా మహమ్మారి కలకలం రేపుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల సంఖ్య పెరగడంతో పాటుగా, మరణాల సంఖ్య కూడా పెరుగుతోంది. కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడల చేసిన తాజా గణాంకాలే ఈ విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఒకే రోజులో ఇంచు మించుగా 50 శాతానికి పైగా హెచ్చు కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా గణాంకాలను బట్టి తెలుస్తోంది. ఈ నేపధ్యంలోనే కేంద్ర ప్రభుత్వం  రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలకు కరోనా కట్టడి చర్యలకు సంబందించి స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది.    కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదలచేసిన  తాజా గణాంకాల ప్రకారం    బుధవారం(ఏప్రిల్ 5) ఒకే రోజు దేశవ్యాప్తంగా 5 వేల కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో దేశంలో మొత్తం యాక్టివ్ కేసులు పాతిక వేలు దాటాయి.  24 గంటల్లోనే 5 వేల 335 కేసులు నమోదు కావటంపై కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తం అయ్యింది. 24 గంటల్లోనే కరోనాతో 15 మంది చనిపోయినట్లు ప్రకటించింది కేంద్రం. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది. కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయని.. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. దేశంలో రోజువారీ పాజిటివ్ రేటు 3.32 శాతానికి పెరగటం   ఆందోళన కలిగిస్తున్నదని   పేర్కొంది  కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ.  పాజిటివ్ రేటు వారాంతానికి తీసుకుంటే మాత్రం అది 2.79 శాతంగా ఉంది.  2023, ఏప్రిల్ ఒకటో తేదీన 2 వేల 994 కేసులు నమోదు కాగా.. ఏప్రిల్ 6వ తేదీ నాటికి అవి 5 వేలు దాటాయి. రోజువారీగా కొత్త కేసులు 500 పెరుగుతున్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దేశంలో ప్రస్తుతం కరోనా రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 2.79 శాతంగా నమోదైంది. ఇక దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతోంది.  దేశంలో ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్‌‌ను అందించారు.  మహారాష్ట్రలో ఒకే రోజులో కోవిడ్ కేసులు 186 శాతం పెరిగాయి.  గత 24 గంటల్లో 711 తాజా ఇన్ఫెక్షన్లు నమోదయ్యాయి. ప్రస్తుతం మహారాష్ట్రలో యాక్టివ్ కేసుల సంఖ్య 3,792కి చేరుకుంది. మహారాష్ట్రతో పాటుగా తెలంగాణ సహా మొత్తం ఆరు రాష్త్రాలలో కేరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని కేంద్ర ప్రభుత్వం నెల రోజుల క్రితమే రాష్ట్ర ప్రభుతాలను హెచ్చరించింది. అందుకు కొనసాగింపుగా తెలంగాణ సహా ఆరు రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. నిజానికి గత కొన్ని నెలలుగా భారత్ లో కొరోనా  కేసుల సంఖ్య చాలా తగ్గింది. కానీ గత నెలరోజులకు పైగా కొన్ని రాష్ట్రాల్లో మళ్లీ కొరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల నమోదవుతున్నట్లు కేంద్ర వైద్యారోగ్య శాఖ గుర్తించింది. దాంతో, ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచిస్తూ ఆయా రాష్ట్రాలకు లేఖ రాసింది సహా చాలా వరకు రాష్ట్రాలు కేంద్ర మార్గదర్శకాలను పట్టిచుకున్న దాఖలాలు కనిపించడం లేదు.

కాంగ్రెస్ ను వీడను బాబోయ్ అంటున్నా ఎవరూ నమ్మరేం.. కోమటిరెడ్డి

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గుడ్ బై చెబుతున్నారనే వార్తలు కలకలం రేపాయి. కోమటిరెడ్డి రాజీనామాను అధికారికంగా ప్రకటించేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరిగింది. కొద్ది రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న  వెంకట్ రెడ్డికి పార్టీ నుంచి సరైన సహకారం లేకపోవడంతో పార్టీని విడిచి పెట్టేందుకు సిద్దమయ్యారని ప్రచారం జరిగింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడుతారని ప్రచారం జరగడం ఇదే తొలిసారి కాదు. గతంలో మునుగోడు ఎన్నికల సమయంలో కూడా ఇదే తరహా ప్రచారం జరిగింది.  పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నియామకాన్ని తీవ్రంగా వ్యతిరేకించిన కోమటిరెడ్డి, పార్టీ నిర్ణయానికి వ్యతిరేకంగా బహిరంగంగానే విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో నాయకుల్ని చేర్చుకునే విషయంలో కూడా రేవంత్ రెడ్డితో కోమటిరెడ్డి విభేదించారు. చెరుకు సుధాకర్ ని చేర్చుకున్న సమయంలో  అలిగి.. బీజేపీ అగ్రనేత అమిత్ షా తో   సమావేశమై కలకలం రేపారు. గతంలో పీసీసీ అధ్యక్ష, ఏఐసీసీ పదవులు ఆశించిన వెంకట్ రెడ్డి,  ఆ తర్వాత కాలంలో కాంగ్రెస్ అగ్ర నాయకులు సర్ది చెప్పడంతో సర్దుకుపోయారు. ఆ తర్వాత కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వడం లేదనే అక్రోశం కోమటిరెడ్డిలో ఉంది. తనకు ఎలాంటి పదవులు రాకపోవడంతో వెంకట్ రెడ్డి మనస్తాపానికి గురయ్యారని అనుచరులు చెబుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు ఎప్పటికప్పుడు సర్ధిచెప్పే ప్రయత్నం చేస్తూ వస్తున్నారు. ఎంపీ వెంకటరెడ్డి సోదరుడు రాజగోపాల్ పార్టీ వీడినప్పటి నుంచి కాంగ్రెస్ నేతలతో దూరం పెరిగింది. కాంగ్రెస్ అధిష్టానం ఊరడించడంతో వెంకటరెడ్డి తన నిర్ణయాన్ని వాయిదా వేస్తూ వస్తున్నారని అనుచరులు చెబుతున్నారు. పార్టీ మార్పు వార్తలు దుమారం రేపడంతో ఎంపీ కోమటిరెడ్డి మీడియా ముఖంగా వాటిని ఖండించారు. ఉద్దేశ్య పూర్వకంగానే కొందరు తనను డ్యామేజ్ చేస్తున్నారని ఆరోపించారు. తనది కాంగ్రెస్ రక్తమని, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. తనకు పార్టీ మారే ఉద్దేశం లేదు మొర్రో అని మొత్తుకుంటున్నా ఎవరూ ఎందుకు నమ్మడం లేదని ఆకోషం వ్యక్తం చేశారు.  రాజీనామా చేయాలన్న  నిర్ణయం తీసుకో లేదని చెప్పారు. రాహుల్ గాంధీ అనర్హతను నిరసిస్తూ గాంధీభవన్ లో చేసిన దీక్షలో పాల్గొన్నాననీ,  భువనగిరి నియోజకవర్గంలో అనేక కార్యక్రమాలు పాల్గొంటున్నానని వివరణ ఇచ్చారు. తన ముందు ఎలాంటి ఆప్షన్స్ లేవని తనది కాంగ్రెస్ రక్తమని చెప్పుకొచ్చారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంతలా చెబుతున్నా.. ఆయన పార్టీ మారతారన్న వదంతులు ఆగకుండా రావడానికి ఆయన వ్యవహార శైలే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. చిన్న చిన్న సమస్యలపై ప్రధాని మోడీతోనూ, హోంమంత్రి అమిత్ షాతోనూ భేటీ కావడంపై కోమటిరెడ్డి గతంలో ఇచ్చిన వివరణలు నమ్మశక్యంగా లేవు. పార్టీ క్రమశిక్షణ సంఘం ఇచ్చిన నోటీసులను చెత్తబుట్టలో పారేశానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, ముందు ముందు కాంగ్రెస్, బీఆర్ఎస్ లు కలుస్తాయంటూ చేసిన కామెంట్స్ ఇవన్నీ కూడా ఆయన కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పనున్నారన్న వార్తలకు బలం చేకూర్చేవిగా ఉండటమే.. ఆయన తనది కాంగ్రెస్ రక్తం అని చెబుతున్నా.. ఎవరూ నమ్మకపోవడానికి కారణమని పరిశీలకులు అంటున్నారు. 

అన్నీ తెలిసీ మౌనమేల మోడీజీ!

ఏపీని పంజాబ్ తో పోలుస్తూ పరిస్థితులు అధ్వానంగా తయారయ్యాయని ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలు, ఏపీలోని అస్తవ్యస్థ పరిస్థితులకు అద్దం పట్టడమే కాకుండా కేంద్రంలోని ఆయన సర్కార్ నిష్క్రియాపరత్వాన్ని కూడా ఎత్తి చూపేలా ఉన్నాయని పరిశీలకులు అంటున్నారు. ఔను మరి అప్పులు, అరాచకలతో ఏపీ నానాటికీ దిగజారిపోతోందని మోడీ అన్నారని తెలుగుదేశం ఎంపీ కనకమేడల చెప్పారు. ఏపీలో పరిస్థితులపై   వివరిస్తున్న సందర్భంగా మోడీ కల్పించుకుని తన వద్ద సమాచారం ఉందని అన్నారని కనకమేడల మీడియా సమావేశంలో చెప్పారు. ఆ విషయంలో మోడీ జోక్యాన్ని కోరామని ఆయన అన్నారు. ఏపీ అప్పులు, అస్తవ్యస్థ పరిస్థితులు, గంజాయి ఆంధ్రప్రదేశ్ గా మారిన తీరు గురించిన సమాచారం మోడీ వద్ద ఉన్నప్పుడు చర్యలు తీసుకోవడానికి ఆయన ఎందుకు వెనుకాడుతున్నారని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అన్నీ తెలిసినా పట్టనట్ల వ్యవహరించడంలో మోడీ స్థితప్రజ్ణత సాధించారు. సీబీఐ, ఐటీ, ఈడీ వంటి సంస్థల పని తీరు భేషుగ్గా ఉందని మెచ్చుకుంటూనే, ఎటువంటి ఒత్తిడులూ లేకుండా స్వేచ్ఛగా పని చేయాలని సలహా ఇస్తూనే.. విపక్షాలు వినా అధికార బీజేపీ నేతలపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు ఎందుకు చేయడం లేదని కేంద్ర దర్యాప్తు సంస్థలను ఆయన ప్రశ్నించిన పాపాన పోలేదు.  అలాగే ఏపీ ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయ్ వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తునకు అడుగడుగునా అడ్డు తగులుతున్న వారిని ఎందుకు ఉపేక్షిస్తున్నారని ప్రశ్నించలేదు.  ఇప్పుడు ఆయన ఏపీలో పరిస్థితులు అధ్వానంగా ఉన్నాయనీ, పంజాబ్ ను తలపిస్తున్నాయనీ చేసిన కామెంట్లు ఆయన స్వయంగా మీడియా ముందు చెప్పినవి కావు. ఏపీలో విపక్షానికి చెందిన ఎంపీ ఒకరు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేసిన సందర్భంగా చెప్పిన మాటలు. మోడీ ఆ మాటలు నిజంగా అని ఉండకపోయినా.. మీతో కనుక అన్నాను, ఈ మాటలు మీడియా ముందు వెల్లడించవద్దని ఆ ఎంపీకి సూచించినా ఆయన వాటిని బయటపెట్టే అవకాశం లేదు. అంటే మోడీ తాను ఏ విషయాన్నీ పట్టించుకోరు.. అన్నీ తెలిసినా చర్యలు తీసుకోరు. ఏదైనా విషయం తన దృష్టికి తీసుకురావడానికి ఎవరైనా ప్రయత్నిస్తే మాత్రం ఆ సమాచారం అంతా తన వద్ద ఉందని చెప్పి వారి నోరు మూయిస్తారు.  రాజకీయ లబ్ధి ఉందని భావిస్తే తప్ప ఆయన క్రియాశీలంగా వ్యవహరించరు. ఇప్పటి వరకూ మోడీ తీరుపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శలివి. తాజాగా ఏపీ విషయంలో ఆయన చేసిన కామెంట్స్ చూస్తే విపక్షాల విమర్శలు అక్షర సత్యాలని అనిపించక మానవు.    ప్రధానమంత్రి మోదీ పంజాబ్‌తో ఏపీని పోల్చారు. పంజాబ్‌లో   డ్రగ్స్, రౌడీ గ్యాంగులు చెలరేగిపోతున్నాయి. శాంతి భద్రతల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. ఖలిస్తాన్ ఉద్యమం మళ్లీ పెచ్చరిల్లుతోంది. మొత్తంగా ఆ రాష్ట్రంలో పరిస్థితులు దేశాన్నే దెబ్బతీసేవిగా ఉన్నాయి. అటువంటి పంజాబ్ తో ఏపీలో మోడీ పోల్చారంటే ఏపీలో పరిస్థితులు కూడా దేశ ప్రయోజనాలకు భంగం వాటిల్లేవిగా ఉన్నాయనే అర్ధం. పరిస్థితులు అంత తీవ్రంగా ఉన్నా మోడీ ఎందుకు పట్టించుకోవడం లేదు.. పట్టించుకోకపోవడం, పట్టించుకోవడం పక్కన పెడితే.. ఏపీలో అధ్వాన పరిస్థితులకు కారణమైన రాష్ట్ర ప్రభుత్వానికి ఎందుకు రెండు చేతులా సహకారం అందిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఆ రాస్ట్రం చేస్తున్న అప్పులకు ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. అంటే ఆయన నుంచి సమాధానం రాకపోవచ్చుకు కానీ రాజకీయ పరిశీలకుల నుంచి, సామాన్య మానవుడి వరకూ అందరికీ కారణం ఏమిటన్నది తెలుసు. అది రాజకీయ ప్రయోజనం.  ఏపీలో వైసీపీ మూకలు బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పై  దాడి చేశాయి.  పక్కా ప్రణాళికతో ఆ దాడి జరిగింది. ఆ దాడిని అడ్డుకోకుండా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. అయినా కూడా దాడి జరిగిన వారిపైనే కేసులు నమోదు చేశారు.  అయినా మోడీ మౌనంగా ఉండిపోయారు. ఇదంతా చూస్తుంటే.. ఆయనకు సమస్యల పరిష్కారం కంటే.. తప్పులను చక్కదిద్దడం కంటే, అవినీతిని, అక్రమాలను అరికట్టడం కంటే రాజకీయ ప్రయోజనమే ముఖ్యమన్న విపక్షాల విమర్శలు వాస్తవమేనని అనిపించక మానదు. 

ప్రతి ఆరుగురిలో ఒకరికి వంధత్వ సమస్య.. డబ్ల్యుహెచ్ఓ

ప్రపంచంలో ప్రతి ఆరుగురిలో ఒకరు వంధ్యత్వ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ ఓ) వెల్లడించింది. మొత్తం జనాభాలో 17.15 శాతం మందిలో ఈ సమస్య ఉందని, దీనిని అధిగమించడానికి   సంతాన సాఫల్య చికిత్సలు అందరికీ అందుబాటులో ఉండేలా చూడాలని ప్రపంచ దేశాలకు సూచించింది. వంధ్యత్వ సమస్యలో ప్రాంతాల బేధం పెద్దగా లేదని డబ్ల్యుహెచ్ ఓ పేర్కొంది.  సంపన్న,అభివృద్ధి చెందుతున్న, పేద దేశాలన్నిటికీ  ఇదో పెద్ద సవాలుగా మారిందని సంస్థ విడుదల చేసిన తాజా నివేదికలో పేర్కొంది.  సంపన్న దేశాల్లో 17.8 శాతం, అభివృద్ధి చెందుతున్న, పేదదేశాల్లో 16.5 శాతం మందిలో వంధ్యత్వ సమస్య ఉందని సదరు నివేదిక వివరించింది. సంతానలేమి సమస్య అనేది ప్రతి ప్రాంతంలోనూ ఒకేలా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ  చెబుతోంది. ఇంత మంది ఎదుర్కొంటున్న ఈ సమస్యను అధిగమించడానికి సంతాన సాఫల్య సౌకర్యాలను విస్తరించాలని, అవి అందుబాటు ధరల్లో ఉండాలని, తక్కువ వ్యయం, భద్రతతో కూడిన విధానాలను తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది. వరుసగా 12 నెలలు, అంతకంటే ఎక్కువ కాలం శృంగారంలో పాల్గొన్న దంపతులకు పిల్లలు కలగకపోతే దానిని వంధ్యత్వ సమస్యగా గుర్తిస్తారు. వంధ్యత్వ నివారణ, నిర్ధారణ, ఐవీఎఫ్ తదితర చికిత్సా విధానాలకు అతి తక్కువ నిధుల కేటాయింపు, పరిమితంగా చికిత్స అందుబాటులో ఉండటం ఇబ్బందిగా మారిందని  పేర్కొంది. ఐవీఎఫ్ కోసం భారీగా ఖర్చు చేస్తున్న కోట్ల మంది ప్రజలు పేదరికంలోకి జారిపోతున్నారని తెలిపింది. అత్యుత్తమ పాలసీలు, ప్రభుత్వ నిధుల కేటాయింపు ద్వారా ఈ సమస్య కారణంగా  ప్రజలు పేదరికంలోకి జారకుండా కాపాడవచ్చని సూచించారు.  ప్రపంచ జనాభా  విపరీతంగా  పెరుగిపోతందన్న ఆందోళన ఓ వైపు..  సంతాన లేమి పై ఆందోళన మరో వైపు ఒకే సమయంలో ఈ పరస్పర విరుద్ధ సమస్యలు మానవాళిని  ఆందోళనలోకి నెట్టడం గమనార్హం.

మరో చీతా పారిపోయింది..!

నమీబియా నుంచి తీసుకొచ్చిన ఆఫ్రికన్ జాతి చీతాలు నిర్దేశిత ప్రాంతం దాటి బయటకు వెళ్తున్నాయి. ఇటీవలే తప్పించుకుపోయిన ఒబాన్ ను అటవీ అధికారులు అనేక ప్రయత్నాల అనంతరం సురక్షితంగా పార్కుకు తీసుకువచ్చారు.   ఇటీవల ఒక చీతా మరణించింది. ఇప్పుడు మరో చీతా పారిపోయింది. ఆశా అనే చీతా కూనో నేషనల్ పార్కులోని రిజర్వ్ ఫారెస్ట్ దాటి వీరుర్ ప్రాంతంలోని బఫర్ జోన్లోని వెళ్లిపోయింది. అది నదుల వెంట సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఆశాకు.. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్వయంగా ఆ పేరు పెట్టారు. ఈ చీతాల వల్ల మనుషులకు ఎలాంటి ప్రమాదం లేదని అటవీ అధికాలు చెబుతున్నారు. చీతాలు జనావాస ప్రాంతాల్లో సంచరించవని తెలిపారు. అయితే, ఈ చీతా బఫర్ జోన్ పరిధిలోని గ్రామాల్లో సంచరిస్తూ.. ప్రజలను భయాందోళలకు గురిచేస్తున్నాయి. ప్రతిష్టాత్మకంగా ప్రధాని మోడీ చేతులమీద ప్రారంభించిన చీతాల పెంపక కార్యక్రమం.. అవి ఒక్కొక్కటిగా పారిపోతుండటంతో.. జూ అధికారులు ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకుంటున్నారు...

నెల నెల నివేదికలు ఇవ్వండి.. జగన్ సర్కార్ కు గవర్నర్ ఆదేశం

జగన్ సర్కార్ పై కేంద్రం నిఘా ఆరంభమైందా? ఇంత కాలం అన్ని విధాలుగా జగన్ సర్కార్ కు చేదోడు వాదోడుగా ఉన్న మోడీ సర్కార్ ఇకపై అలా ఉండదా? అంటే పరిశీలకులు ఔననే అంటున్నారు.  ఏపీ ప్రభుత్వం ఇక నుంచి తనకు నెలవారీ నివేదికలు పంపాలని   గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆదేశాలు జారీ చేశారు.  గవర్నర్ ఇలా ఆదేశించడాన్ని కొందరు తప్పుపడుతుంటే.. మరి కొందరు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం గవర్నర్ కు నెలవారీ నివేదికలు పంపడం సాధారణ ప్రక్రియలో భాగమేనంటున్నారు. ఆ సాధారణ ప్రక్రియను జగన్ సర్కార్ అమలు చేయడం లేదు కనుకనే గవర్నర్ ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని చెబుతున్నారు.  అయితే వైసీపీ అనుకూలురు మాత్రం ఇది   కేంద్ర ప్రభుత్వ నిఘాగా అభివర్ణిస్తున్నారు.  విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు  గత నెల 29న గవర్నర్ కార్యాలయం నుంచి పాలనాపరమైన అంశాలపై ప్రతినెలా నివేదిక పంపాలంటూ సాధారణ పరిపాలన శాఖకు లేఖ అందింది.  రాష్ట్ర ప్రభుత్వ పాలన, ఆర్థిక అంశాలపై విపక్ష పార్టీలు తరుచూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కీలక శాఖల పనితీరుపై నెలవారి నివేదికలు పంపాలంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కార్యాలయం ఆదేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది.   జగన్ ప్రభుత్వంపై వస్తున్న  ఆరోపణల నేపధ్యంలో...రాష్ట్ర ప్రభుత్వ పాలనపై గవర్నర్  అబ్దుల్ నజీర్ దృష్టిసారించారు.  రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలు,   ఆర్థిక పరిస్థితిపై ప్రతిపక్ష టీడీపీ, బీజేపీ, జనసేన సహా అన్ని పార్టీలు వేలెత్తి చూపుతున్నాయి. రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందంటూ ఆయా పార్టీలు ప్రభుత్వంపై విమర్శులు సంధిస్తున్నారు. కొందరు ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ క్రమంలో రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. మరో ఏడాదిలో ఎన్నికలు జరగ నున్న నేపథ్యంలో గవర్నర్ కార్యాలయం స్పందించడం కీలక పరిణామంగా చెబుతున్నారు. గత తెదేపా ప్రభుత్వంలో కూడా ఎన్నిలకు ముందు ఇదే తరహాలో గవర్నర్ కార్యాలయం నుంచి ఆదేశాలు వెళ్లిన విషయాన్ని పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. టీడీపీ, బీజేపీ కలిసి 2014లో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. ఎన్నికలకు ఏడాది ముందు రెండు పార్టీల మధ్య సఖ్యత చెడింది. అటు కేంద్రం నుంచి టీడీపీ, ఇటు రాష్ట్రం నుంచి బీజేపీ ప్రభుత్వంలో భాగస్వామ్యం నుంచి తప్పుకున్నాయి. ఈ క్రమంలోనే అప్పటి గవర్నర్ ప్రభుత్వ పాలనాంశాలపై నెలవారీ నివేదిక ఇవ్వాలంటూ ఆదేశించారు.   వివిధ రాజ కీయ పార్టీల నుంచి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పథకాలు దుర్వినియోగం కాకుండా కట్టడి చేయడంలో భాగంగానే గవర్నర్ నుంచి ఈ ఆదేశాలు వచ్చాయని భావిస్తున్నారు.  

గాంధీ పాఠం డిలీట్.. ఎన్సీఈఆర్టీ లీల!

 పన్నెండవ తరగతి పొలిటికల్ సైన్స్ పాఠ్య పుస్తకం నుంచి మహాత్మా గాంధీకి సంబంధించిన అంశాలను ఎన్సీఈఆర్టీ తొలగించింది.  ఎన్సీఈఆర్టీ వివాదస్పద నిర్ణయంపై విపక్షాలు, విద్యావేత్తలు భగ్గుమంటున్నాయి.  చరిత్రను తమకు అనుగుణంగా మార్చుకునేందు కేంద్రంలోని బీజేపీ చేసే ప్రయత్నంలో భాగమే ఈ నిర్ణయమని విమర్శలు గుప్పిస్తున్నాయి. కొత్తగా రూపొందించిన 12వ తరగతి పాఠ్య పుస్తకాల నుంచి గతంలో ఉన్న కొన్ని పాఠ్యాంశాలను ఎన్సీఈఆర్టీ ( నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ) తొలగించింది. ముఖ్యంగా రాజనీతి శాస్త్రం సబ్జెక్టులో నుంచి మహాత్మాగాంధీకి సంబంధించిన కీలక అంశాలను తొలగించింది. హిందూ, ముస్లిం ఐక్యత కోసం గాంధీజీ  పరితపించడం, ఆ కారణంగా హిందూ అతివాదులు మహాత్మాగాంధీని ద్వేషించడం, గాంధీ హత్య అనంతరం ఆరెస్సెస్ పై నిషేధం విధించడం.. మొదలైన అంశాలను  ఎన్సీఈఆర్టీ తొలగించింది. 12వ తరగతి రాజనీతి శాస్త్రం పాఠ్య పుస్తకంలోని  స్వాతంత్య్రం తరువాత భారతదేశంలో రాజకీయాలు అనే చాప్టర్ నుంచి ఈ అంశాలను తొలగించింది.  మహాత్మా గాంధీ త్యాగం   అనే సబ్ టాపిక్ ను పూర్తిగా డిలీట్ చేసింది. హిందూ ముస్లింల ఐక్యత కోసం గాంధీజీ కృషి చేయడం.. హిందూ అతివాదులకు నచ్చలేదు. వారు గాంధీజీ ముస్లింలకు, పాకిస్తాన్ కు అనుకూలంగా ఉన్నట్లు భావించారు. పాకిస్తాన్ ను ముస్లిం దేశంగా ప్రకటించినట్లుగా భారతదేశాన్ని కూడా హిందూ దేశంగా ప్రకటించాలని వారు ఆశించారు. అందుకు గాంధీజీ అడ్డుగా ఉన్నట్లు భావించారు. అందుకే ఆయనను హతమార్చడానికి పలుమార్లు ప్రయత్నించారని మహాత్మా గాంధీ త్యాగం అనే చాప్టర్ లోని ఒక పేరాగ్రాఫ్ లో ఉంది. ఆ పేరాగ్రాఫ్ ను పూర్తిగా తొలగించారు. గాంధీజీ హత్య అనంతరం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ను నిషేధించిన ప్రస్తావనను కూడా సిలబస్ నుంచి తొలగించారు.  మత విద్వేషాన్ని ప్రచారం చేస్తున్న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థలపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. వాటిపై నిషేధం విధించింది. దాంతో, కొంతవరకు మత రాజకీయాల ప్రభావం తగ్గిందని ఉన్న పేరాను కూడా ఎన్సీఈఆర్టీ తొలగించింది. 12వ తరగతి చరిత్ర పుస్తకంలోని థీమ్స్ ఇన్ ఇండియన్ హిస్టరీ 3 లో గాంధీజీ హత్యకు సంబంధించిన ఒక పేరాగ్రాఫ్ లో కూడా మార్పులు చేసింది. గాంధీజీని 1948 జనవరి 30న హత్య చేసింది నాథూరాం గాడ్సే అని కొత్తగా ముద్రించిన పాఠ్య పుస్తకంలో ఒకే వ్యాక్యంలో తేల్చేశారు. గతంలో చెలామణిలో ఉన్న పాఠ్య పుస్తకాల్లో  జనవరి 30 ప్రార్థనల అనంతరం గాంధీజీని  పుణె కు చెందిన బ్రాహ్మణుడైన నాథూరాం గాడ్సే  తుపాకీతో కాల్పులు జరిపి హత్య చేశాడు. నాథూరాం గాడ్సే  ఒక హిందూ అతివాద పత్రికకు ఎడిటర్. గాంధీజీని ముస్లింల మద్దతుదారుగా ఇతడు గతంలో ప్రకటించాడని ఉంది. గత సంవత్సరం ఎన్సీఈఆర్టీ చేపట్టిన 30 శాతం సిలబస్ రేషనలైజేషన్ కు అదనంగా, ఇప్పుడు ఈ తొలగింపులను చేపట్టడం గమనార్హం. ఈ తొలగింపుల అనంతరం ముద్రించిన పాఠ్య పుస్తకాలు 2023 - 24 విద్యా సంవత్సరంలో విద్యార్థులకు అందుబాటులోకి రానున్నాయి. పాఠ్యపుస్తకాలలో విషయాన్ని మార్చి ఎట్టకేలకు బీజేపీ తన అసలు రంగును, ఉద్దేశ్యాన్ని చూపిందని పలువురు ప్రతిపక్ష నేతలతో సహా అనేక మంది విద్యావేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కొడాలి నాని అడ్డాలో చంద్రబాబు!

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు..  వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఆ క్రమంలో ఓ వైపు  జోనల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా ఉత్తరాంధ్ర జోనల్  సమావేశాలు.. విశాఖపట్నం వేదికగా జరుగుతున్నాయి. ఎన్నికల వేళ.. పార్టీ శ్రేణులకు ఆయన కీలక దిశా నిర్దేశం చేస్తున్నారు.  అలాగే ఏప్రిల్ 11న చంద్రబాబు.. రాజధాని అమరావతిలో పర్యటించనున్నారు. అనంతరం అంటే 12వ తేదీన ఆయన ఉమ్మడి కృష్ణా జిల్లాల్లో పర్యటించనున్నారు. ఆ క్రమంలో 13వ తేదీన గుడివాడలో జరిగే భారీ బహిరంగ సభలో చంద్రబాబు పాల్గొనున్నారు. అనంతరం ఎన్టీఆర్ జన్మ స్థలం నిమ్మకురు చేరుకుని.. ఆ రాత్రి ఆయన అక్కడే బస చేయనున్నారు. అ మరునాడు అంటే 14న మచిలీపట్నంలో జోనల్ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలో కీలక నేతలతో ఆయన భేటీ కానున్నారు.   అయితే కొడాలి నాని ఇలాకా అంటే.. గుడివాడలో చంద్రబాబు అధ్యక్షతన జరగనున్న భారీ బహిరంగ సభపైనే అందరూ దృష్టి సారించారు. తెలుగుదేశం పార్టీ ద్వారా కొడాలి నాని..  రాజకీయ అరంగేట్రం చేసి... ఆ తర్వాత జగన్ పార్టీలోకి జంప్ కొట్టి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్‌ల లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కొడాలి నాని ఆరోపణలు  శృతిమించాయి.  దీంతో అతడి వ్యాఖ్యలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  అలాంటి వేళ.. గుడివాడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు  చంద్రబాబు ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. అదీకాక.. 2019 ఎన్నికల తర్వాత గుడివాడలో చంద్రబాబు పాల్గొంటున్న తొలి సభ ఇదే కావడంతో.. ఈ సభపై అందరి ఫోకస్ పడింది. మరోవైపు గతంలో గుడివాడలో మినీ మహానాడు జరుగుతుందని అంతా భావించినా.. ఎందుకో అది కార్యరూపం దాల్చలేదు.  ఇక ఇప్పుడు చంద్రబాబు గుడివాడలో భారీ బహిరంగ సభలో పాల్గొనడమే కాకుండా   ఇదే సభ వేదికపై నుంచి గుడివాడ అసెంబ్లీ అభ్యర్థిని చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉందన్న చర్చ తెలుగుదేశంలో జోరుగా సాగుతోంది. దీంతో ఈ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం టికెట్ ఆశావహులు   రావి వెంకటేశ్వరరావు,  వెనిగండ్ల రాము వర్గీయులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే  తెలుగుదేశం చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి, బాదుడే బాదుడు కార్యక్రమాలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. నారా లోకేశ్ పాదయాత్ర యువగళం పేరుతో దూసుకుపోతోంది. నారా లోకేశ్.. తన పాదయాత్రలో వివిధ అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థుల పేర్లను సైతం  ప్రకటిస్తు ముందుకు సాగుతోన్నారు.  అలాగే ఉత్తరాంధ్ర, తూర్పు, పశ్చిమ రాయలసీమలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం  తెలుగుదేశం అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు. అదే విధంగా ఎమ్మెల్యే కోటా  ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బరిలో దింపిన   అభ్యర్థి పంచుమర్తి అనురాధ   సునాయాసంగా గెలుపొందారు.  దీంతో జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత.. ఇటు సైకిల్ పార్టీపై ప్రజల్లో ఆదరణ ఉందని పక్కాగా స్పష్టమైంది. ఇటువంటి పరిస్థితుల్లో మరికొద్దిగా కష్టపడితే.. కొడాలి నాని కంచుకోటను బద్దలు కొట్టడం ఖాయమన్న భావన తెలుగుదేశంలో బలంగా వ్యక్తమౌతోంది.

రికార్డింగ్ డ్యాన్స్ లో ఎమ్మెల్సీ చిందులు!

మనిసన్నాక కూసింత కళాపోషణ ఉండాలి.. లేకుంటే మడిసికీ గొడ్డుకూ తేడా ఏటుంటాది.. ముత్యాల ముగ్గు సినిమాలో కాంట్రాక్టర్ రావుగోపాలరావు చెప్పిన డైలాగొకటి భలేగా పేలింది.  ఆ మాటలను అధికార వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోని పలువురు ప్రజా ప్రతినిధులు కరెస్టుగా అంది పుచ్చుకున్నారని నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా వైసీపీ ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్.. రికార్డింగ్ డ్యాన్స్‌లో అమ్మాయిలతో వేసిన చిందుల వీడియో ఒకటి  సోషల్ మీడియాలో   తెగ ట్రెండ్ అవుతోంది.  దీనిపై నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు నడి రోడ్డుపై వేసిన డ్యాన్స్‌లు.. మరో మంత్రి ఆర్కే రోజా.. పలు సందర్బాల్లో వివిధ వేదికలపై వేసిన చిందులు.. జనం మరిచి పోకముందే.. అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ ‌బొమ్మి ఇజ్రాయిల్... ఇలా రికార్డింగ్ డ్యాన్స్ లో అమ్మాయిలతో కలిసి చిందులు  వేయడం పట్ల   తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అధికార పార్టీ ఎమ్మెల్సీ అనంతబాబు.. హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసిన సంఘటనతో అధికార పార్టీ పరువు నడి బజార్లో పోయింది. అలాంటి వేళ.. అదే ఉమ్మడి జిల్లాలోని మరో ఎమ్మెల్సీ.. ఇలా అమ్మాయిలతో రికార్డింగ్ డ్యాన్సులు చేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.  శాసన మండలి అంటే... రాష్ట్రాల్లోని పెద్దల సభ అని.. అలాంటి సభకు ఎమ్మెల్సీలు.. ప్రాతినిధ్యం వహించి.. సమాజంలోని వివిధ వర్గాల సమస్యలను ఈ సభ వేదికగా గళం విప్పి.. ప్రశ్నలు సంధిస్తారని వారు పేర్కొంటున్నారు. అంతటి ప్రాశస్త్యం ఉన్న శాసనమండలికి ఇలాంటి వాళ్లనా?.. అదీ ఎమ్మెల్యే కోటాలోనా?.. వైసీపీ పంపిందని నెటిజన్లు ముక్కున వేలేసుకొంటున్నారు.  అయినా అటు ఎమ్మెల్యేలు కానీ.. ఇటు ఎమ్మెల్సీలు కానీ హుందాగా ఉండాలి.. హుందాగా వ్యవహరించాలని.. అంతే కానీ..ఎక్కడి పడితే అక్కడ.. ఇలా స్థాయిని మరిచి డ్యాన్సులు వేయడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే వైసీపీఅధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ తొలి కేబినెట్‌లోని మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, అనిల్‌కుమార్ యాదవ్, కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాసరావు.. అలాగే జగన్ మలి కేబినెట్‌లో మంత్రులు అంబటి రాంబాబు, ఆర్కే రోజా, జోగి రమేష్ తదితరులు ప్రెస్ మీట్ పెట్టి వాడే భాష సంగతి అందరికీ తెలిసిందేనని నెటిజన్లు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు.